గీతా రహస్యం---అధ్యాయం రెండు---Truth about Gita






తప్పుడు సంకేతాలు
భారతదేశ ప్రాచీన చరిత్రలో ఒకే ఒక తేదీ నిర్దుష్టంగా చెప్పవచ్చు. క్రీ.పూ. 327-326లో అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. మిగిలిన తేదీలు ఖచ్చితంగా చెప్పలేక పోటానికి మనకాలచక్రమే కారణం. ప్రభవ, విభవ అంటూ 60 సంవత్సరాల కొకసారి తిరిగి వచ్చే కాలాన్ని ఏర్పాటు చేసుకోటంలో నిర్దిష్టత పోయింది.
విక్రమయుగం, శాలివాహన లేదా శాకయుగాలు ఉన్నాయి. వాటికి కూడా ప్రారంభం ఎప్పుడో తెలియదు. క్రీ.పూ. 58-58 మధ్య విక్రమ యుగం మొదలయిం దంటారు. ఎవరీ విక్రముడు? ఏ చారిత్రక సంఘటన, గొప్ప చర్య ఆధారంగా ఈ యుగం ఆరంభమయింది, స్పష్టమైన సమాధానం లేదు. క్రీ.త. 5వ శతాబ్దంలో హూణులపై జయం సాధించిన విక్రమాదిత్యుడు కావటానికి వీలు లేదు. అంతకు ముందు 600 ఏళ్ళ క్రితమే ఈ యుగం ఆరంభమయింది. చివరి మౌర్య చక్రవర్తిని చంపి సుంగరాజ్యాన్ని స్థాపించిన పుష్యమిత్రుడూ కాదు. క్రీ.పూ. రెండవ శతాబ్దం అనంతరం గాని కుషాణ సామ్రాజ్యం స్థాపన కాలేదు. శాతవాహన సామ్రాజ్యానికి చెందిన గౌతమీపుత్ర శాతకర్ణి కాదు. క్రీ.త. 124-125 ప్రాంతాలలో అతడు శకులను అణచి వేశాడు. విక్రమాదిత్య అనేది బిరుదుగానూ పేర్కొనడం లేదు. విక్రమయుగం ఎలా ప్రారంభం అయిందీ చరిత్రకారులకే ఏకాభిప్రాయం లేదు. క్రీ.పూ. 60లో పంజాబ్-సింధు సామ్రాజ్యాలను స్థాపించిన అజస్ తన పేరే ఆ యుగానికి పెట్టుకున్నాడు. ప్రాకృతంలో యుగం అంటే ఆయం అనిపిలుస్తున్నారు. విక్రమ యుగం ఎక్కడా ప్రస్తావనలో లేదు.
విక్రమ యుగానికి చెందిన చిక్కును తొలగించటానికి చరిత్రకారులు కొందరు కృతయుగం అనీ, మాళవ యుగమనీ తొలుత ఉండేదంటున్నారు. విక్రమ యుగం పూర్తి అయిన సందర్భంగా ప్రచురించిన సంపుటిలో డి.డి. కోశాంబి యిలా రాశాడు. 1943లో విక్రమయుగం 2 వేల ఏళ్ళు గడిచిన సందర్భంగా, దీనికి సంబంధించిన చిక్కును విడదీయలేకపోయారు. పరస్పర విరుద్ధ వ్యాసాలు కేవలం నమ్మకాన్ని సూచించాయి. (An Introduction to the Study of Indian History, Bombay, 1975, Page : 293)
శాలివాహన లేదా శాకయుగం క్రీ.త. 78లో మొదలయింది. ఇందులోనూ విడదీయరాని చిక్కులున్నాయి. ప్రాచీన భారత తేదీలన్నీ అస్పష్టం అయినప్పుడు రామాయణ, మహాభారతాలలో, పురాణాలలో తేదీలు నిర్ధారించటం వృధా రామాయణ, మహాభారతాలు కూడా ఒక విధంగా పురాణాలే. వాటికి తేదీలు నిర్ణయించటం అవివేకమే.
కలకత్తా హైకోర్టులో జడ్జీగా పనిచేసిన బ్రిటీష్ ఐ.సి.యస్. ఆఫీసర్ ఎఫ్.ఇ. పర్గీటర్ ఈ తేదీల నిర్ధారణలో తిప్పలు పడ్డాడు. సంస్కృతం చదువుకొని మార్కండేయ పురాణాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. పురాణాలలో ప్రస్తావించిన రాజ్యాల జాబితా సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి పెద్ద పీఠిక రాశాడు. (F.E. Pargiter : The Purana Text of the Dynasties of the Kaliage : 1962, Varanasi) వీటినే తరువాత మరో పుస్తకంలో పేర్కొన్నారు. (Ancient Indian Historical Tradition) పురాణాల నుండి అతను సేకరించిన చరిత్ర అనేది ఊహ మాత్రమే. చరిత్రకు భిన్నంగా పురాణాలన్నీ గాధలతోనూ, కట్టుకధలతోనూ నిండాయి. విశ్వసృష్టి, ప్రళయం, మళ్ళీ పుట్టటం, మనువు, అతని భార్యలు, సంతతి యిత్యాదుల ప్రస్తావనలున్నాయి. వివిధ రాజుల కాలాలు పేర్కొన్నారు. మధ్యలో మానవుల అసమానతల గొప్పతనాన్నీ, కులాన్నీ సంస్థాగతం చేయడాన్ని యీ గ్రంథాలలో రాశారు. పురోహితులను రాజు కాపాడకపోతే ప్రపంచం నాశనమవుతుందన్నారు. పుట్టుకనుండి చనిపోయే వరకూ, ఆ తరువాత కూడా ఎలా ఉండాలో నియమాలు రాశారు. స్వర్గానికి ఎలా వెళ్ళాలి, అక్కడకు చేరిన తరువాత రంభ, ఊర్వశి, తిలోత్తమ, వరూధినులలో ఎలా అనుభవించాలి అనేవి చిత్రించారు.
అలాంటివాటి నుండి చరిత్రను ఏమేరకు రాబట్టవచ్చు. ఇంచుమించు ఏమీలేదు. పైగా మన నైతిక ప్రవర్తనపై ఆ రచనలు దెబ్బతీశాయి. అదంతా బాధ్యతా రహితమని భావించినా, ఇప్పటికే 2,500 సం.రాలు ఆలశ్యమయింది. మనకు వాల్మీకి, వ్యాసుడు ఎలాగో గ్రీకులకు హూమర్, హీసియాడ్ అలాగ, సోక్రటీస్ నోటితో వారిపై ప్లేటో ధ్వజమెత్తాడు. దేవుళ్ళూ, నాయకులూ తాగుబోతులైతే, జూదరులైతే అబద్ధాలాడితే, భట్రాజులైతే, శృంగారకేళిలో తేలిపోతే, ద్వేషం, అసూయలతో నిండిపోతే, అలాంటి వారిని ఆదర్శంగా చూపి జనం కూడా తమ బలహీనతల్ని కప్పి పుచ్చుకోరా, అని ప్లేటో అడిగాడు. హోమర్, హీసియాడ్లను చదివితే, ప్లేటో ఖండించిందంతా అభినందిస్తాం. ఫ్లేటో రిపబ్లిక్ మూడవ సంపుటిలో యిది చూడవచ్చు. (Translation by Benfaminjo-Wette, 1946) హోమర్, హీసియాడ్ లను ఖండించటంలో ప్లేటో కంటే జెనోఫేన్స్ మరొక అడుగు ముందుకు వేశాడు. నాటక రచయిత యూరిపిడస్ కూడా పుక్కిటి పురాణాలను ఖండించాడు. మన దేశంలో కవులూ, నాటక కర్తలూ, తాత్వికులూ, రామాయణ, మహాభారత పురాణాలపట్ల పరవశం చెందుతున్నారు. వీటి వెనుక ఒక పథకం ఉన్నది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం అనే శక్తులను అడ్డుకోవాలనీ, కులతత్వాన్ని కొనసాగించాలనీ ప్రయత్నిస్తున్నారు. సి. రాజగోపాలచారి, కె. ఎం. మున్షీ మొదలైన రాజకీయ వాదులు స్వతంత్ర భారతదేశంలో హిందూ పురాణాల కోపు వేసుకున్నారు.
నైతిక రంగంలో పురాణాలూ, ఇతిహాసాలు నికృష్టమైనవి. చరిత్రకోసం వాటిపై ఆధారపడకూడదు. ఎ.ఎల్. భాషం యీలా అంటాడు. మహాభారత నాయకులు సమకాలీన ముఠా ప్రభువులు కావచ్చు. కాని చరిత్రకారుడి కవి పనికిరావు. క్రీ.పూ. 10వ శతాబ్దంలో చరిత్రను మహాభారతం ఆధారంగా నిర్మించటానికి పూనుకోవటం వృధా (A.L. Bashgam : The Wonder That was India).
పురాణాలలో చరిత్రకారులకు ఎలాంటి చిక్కులు వస్తాయో శీతానాధ్ ప్రధాన్ గుర్తించాడు. పురాణాలలో ప్రాచీన ఆర్య చరిత్ర లభిస్తుందనుకొంటారు. కాని యిందులో చాలా విరుద్ధ విషయాలున్నాయి. అనేక చోట్ల పురాణాలు భిన్న రీతులుగా చూపుతున్నాయి. విరుద్ధ విషయాలున్నాయి. అనేక చోట్ల పురాణాలు భిన్న రీతులుగా చూపుతున్నాయి. ఒక సామ్రాజ్యాన్ని మరొక దానిలో కలిపేశారు. రాజుల జాబితా పెరిగిపోయింది. రాజ్యాల సంక్రమణ మారిపోయింది. సామ్రాజ్యాలకు కాలం పొడిగించేశారు. ఒకొకసారి ఒకే పేరు వలన అనేక చిక్కులు చోటు చేసుకున్నాయి. (Chronology of Ancient India) అయినప్పటికీ ఈ పురాణాల ఆధారంగానే ప్రాచీన భారత చరిత్ర తేదీలను ప్రధాన్ ప్రస్తావించాడు.
పర్గీటర్ కూడా చరిత్రకారుడుగా పురాణాల్లో అనేక చిక్కులను ఎదుర్కొన్నారు. 80 మంది జనమేజయులూ, 100 మంది నాగులూ, హైహయులూ, ధృతరాష్ర్టులూ, బ్రహ్మదత్తులూ, 200 పైగా భీములూ, భీష్ములూ, 1000కి పైగా శశబిందువులూ అతనికి ఎదురయ్యారు. ఈ జాబితా పూర్తి కాలేదు. వాటితో పర్గీటర్ వంటి వారు విసుగుచెంది పురాణాలు రాసిన బ్రాహ్మణులకు చరిత్రకు, కట్టుకధకు తేడా తెలియాదన్నాడు. చరిత్రకు పురాణాన్నీ, ఇతిహాసాలకు చారిత్రక ముసుగుల్నీ వేశారన్నాడు. బ్రాహ్మణ సాహిత్యంలో చారిత్రక దృక్పధం లేదన్నాడు.
పురాణాలు ప్రాచీన భారత చరిత్రకు తప్పుడు సంకేతాలు. వాటి ఆధారంగా కురుక్షేత్ర యుద్ధ తేదీలను నిర్ణియించ బూనారు.
V R Narla Telugu by Narisetti Innaiah

1 comment:

Post a Comment