ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గౌతు లచ్చన్న 1910-2006

బారువలో బాధ్యతారహిత – బాల్యదశ నుండి ముందుమాట గొప్పవాళ్ళమనుకున్న వాళ్ళు స్వీయగాథలు రాసుకుంటారు. అధికారంలో ఉన్న వారి జీవితాల్ని కథలుగా వ్రాయటం, వ్రాయించుకోవటం ఆనవాయితీగా చూస్తున్నాం. లచ్చన్న తనను గొప్పవాడుగా భావించుకోలేదేమో మరి, స్వీయగాథ వ్రాసుకోలేదు. అధికారంలో ఉన్న సంవత్సరంన్నర కాలంలో తన చరిత్ర వ్రాయమని ఎవరినీ అడగలేదు. అడగకపోయినా అధికారంలో వున్నవారి యాత్రలు వ్రాసి గిట్టుబాటు చేసుకుంటున్న రోజులలో రాజకీయాల్లో 40 ఏళ్ళుగా వుంటూ, కొన్ని సందర్భాలలో క్లిష్టపాత్ర వహించి, చరిత్ర మలుపులు తిప్పిన పాత్ర లచ్చన్నది. ఆ పాత్ర ఎలాంటిదో చెప్పటానికే యీ ప్రయత్నం చేస్తున్నాను. సందర్భంలో స్పష్టం చేయవలసిన విషయం ఒకటుంది. రచయితకు లచ్చన్న రాజకీయాలకు సంబంధం లేదు. రచయిత ఏ పార్టీకీ చెందినవాడు కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర సమగ్రంగా వ్రాయవలసి వున్నది. ఆపని ఉత్తరోత్తరా ఎవరు చేసినా, అందులో లచ్చన్న నిర్వహించిన విషయాలు యీ రచనలో కొంతవరకైనా లభించగలవనే ఆశ. రచయిత లచ్చన్న వంశ వాతావరణం గౌతు లచ్చన్న 1969 ఆగస్టు 16న, నేటి శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకా బారువా గ్రామంలో, చిట్టయ్య-రాజమ్మ దంపతులకు పుట్టాడు. వారిది కల్లుగీత వృత్తి. గౌడ అంటారు. ఉపకులరీత్యా తల్లిదండ్రులు అంతకుముందు యిరువంశాలు చదువుతో నిమిత్తం లేని జీవితాలు గడిపారు. తాత చిరుప్రాయములో చనిపోగా, నిరుపేద లచ్చన్న నాయనమ్మ నిస్సహాయురాలు కాగా కుటుంబపోషణార్థం, చిట్టయ్య కాయ కష్టం చేసి, పొట్టపోసుకునేవాడు. ప్రధానంగా పాలికాపు పనిచేస్తూ లచ్చన్నకు తాతవరుస అయిన ఆయన దగ్గరే చివరిసారిగా ఆ వృత్తి ముగించాడు. బారువ సముద్రతీర ప్రాంత గ్రామం, సమీపంలో కలకత్తా మద్రాసు రైలుమార్గం కూడా వున్నది. ఆనాటికి ఆ సౌకర్యాలు రెండూ ఆ వెనుకబడిన ప్రాంతానికి ఆశాకిరణాలే. అప్పటికి శ్రీకాకుళం జిల్లా ఏర్పడలేదు. ఒరిస్సా రాష్ట్రం రూపొందలేదు. బారువా గ్రామం గంజాం జిల్లాలో వుండేది. బారువా తీరప్రాంతంలో చిన్న కస్టమ్స్ కార్యాలయం కూడా వుండేది. ఆంధ్రులు విశేషంగా బర్మావలస వెళ్ళి భిన్న వృత్తులు యథాశక్తి అవలంభించి డబ్బు ఆర్జిస్తూ ఉండే రోజులవి. చిట్టయ్య కూడా వారిలో ఒకడిగా రంగూన్ వెళ్ళి, శ్రమించి డబ్బుకొంత మిగిలిస్తూ అంచెలవారీగా, లచ్చన్నకు అమ్మమ్మ – అంటే చిట్టయ్యకు అత్తకు పంపుతుండేవాడు. అలా వాయిదాల మీద వస్తున్న డబ్బు జాగ్రత్తపరచి, కొంత పొలం కొని, చిన్న యిల్లు కట్టించి, చిట్టయ్యకు తన కుమార్తె రాజమ్మనిచ్చి పెళ్ళిచేసింది ఆమె. రంగూన్ నుండి తిరిగి వచ్చిన చిట్టయ్య ఒక కొబ్బరితోట ఆసామీ అయ్యాడు. చిన్న గృహ యజమానిగా తన కులవృత్తి కల్లుగీత చేసుకుంటూ తానుతింటూ నలుగురికి పనికల్పించిన వాడయ్యాడు. కాని ఆయనకు వరుసగా ఆరుగురు సంతానం కలిగినా ఒక్కరూ దక్కకుండా పోయారు. ఆ పిమ్మట సత్యనారాయణ, లచ్చన్న మధ్యలో ఒక ఆడ సంతానం కలిగి నిలబడ్డారు. వరుసగా ఐదుగురు పోవటంతో దక్కిన వారిని అమిత ప్రేమతో పెంచారు. చిట్టయ్య తన సంతానానికి కులవృత్తి నేర్పదలచలేదు. మార్గం తప్పించి ఏమైనాసరే అక్షరాస్యుల్ని చెయ్యాలని ఇంకా వృద్ధి చెందింపచేయాలని దీక్షవహించాడు. అదొకమలుపు. బడిచదువు చిట్టయ్య కల్లుగీత వృత్తి చేయటమే గాక, నిరంతర నిషాలో వుండేవాడు. అది దురభ్యాసంగా మారిందని తెలిసినా, మానలేకపోయేవాడు. కాని సంతానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ యిది అంటకూడదని తాపత్రయ పడ్డాడు. అదే విశేషం. ఇంట్లో వుంటే వాసనకు అలవాటు పడతారని భయపడి ఊళ్లోనే ఒక ప్రాథమిక పాఠశాల అధ్యాపకుని ఇంట్లో “ప్రైవేట్” ట్యూషన్ ఏర్పాటు గావించాడు. అంటే లచ్చన్నకు స్వగృహం ఒక భోజన వసతిగానూ, మాస్టారిల్లు స్వంత యిల్లుగానూ మారింది. లచ్చన్న ఎప్పుడైనా ఇంట్లో కనిపిస్తే బూతులు తిట్టేవాడు తండ్రి. కొడుకు బాగుపడాలనే ఆత్రుత అలాంటిది. ఏడవ ఏట అంటే 1916లో అక్షరాభ్యాసం ఆరంభించిన లచ్చన్న బాల్యజీవితం స్వైర విహారంగా సాగింది. చదువులేనప్పుడు సముద్రతీర ప్రాంతాలలో బెస్తవారి మధ్య ముద్దుల బాలుడుగా మసిలాడు ఆనాటి స్మృతులే ఉత్తరోత్తరా ఆప్యాయతలుగా మారాయి ఆబెస్తవారికి. చిట్టయ్య రోజంతా నిషాలో ఉన్నా, కుమారుల విషయంలో ఏ మారక ఏదో ఒక సమయంలో మాస్టారింటికి ఫలమో పుష్పమో సమర్పించి, లచ్చన్న నా కుమారుడు కాదు. మీ బిడ్డడుగా భావించండి. మీ చేతుల్లో పెట్టాను, అని చెప్పి పోతుండేవాడు. తనకు లేని, రాని సదవకాశాల్ని కుమారులకు కలిగించి లోటు తీర్చాలని ఆ తండ్రి ఆశకు అర్థమున్నది. బాల్య వివాహం 1922లో లచ్చన్నకు 13 సంవత్సరాల ప్రాయంలో చిట్టయ్యకు జబ్బు చేసింది. బ్రతకననుకొని భయపడి కుమారుల వివాహాలు కళ్ళారా చూసి పోదామని ఆశించాడు. లచ్చన్న ఇంకా 8వ తరగతి గట్టెక్కలేదు. తండ్రి అవస్థ చూసి ఆయన కోర్కెలకు సమ్మతించి, సత్యనారాయణ, లచ్చన్నలిరువురూ బాల్యవివాహాలు చేసుకోక తప్పింది కాదు. కాని పెండ్లి జరిగిన రెండేండ్లకే లచ్చన్న తొలి భార్య మశూచితో మరణించింది. ఆ తర్వాత సత్యనారాయణ భార్యకు విడాకులిచ్చాడు. అయితే చిట్టయ్య కోలుకొని మామూలు మనిషయ్యాడు. మళ్ళీ వృత్తి కొనసాగించగలిగాడు. కుమారులు చదువు కొనసాగింది, 1924 నాటి సంగతి ఇదంతా. వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అతని వంశం, పరిసరాలు, సామాజిక స్థితిగతులు తెలిసి వుండటం ఎంతో అవసరం. కనుకనే ఇవన్నీ చెప్పటం. ఇప్పటివరకూ చూస్తే లచ్చన్న బాల్యదశలో వృత్తిరీత్యా వంశపరంగా, పరిసరాల దృష్ట్యా ఉన్నత కులాలవారికిగల సదవకాశాలేవీ లేవనేది స్పష్టం. అందులోనుండి ఆవిర్భవించాడు లచ్చన్న. ఇది తరువాత గాని అవగాహన కాదేమో. బారువలో ఒక హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాల వుండేది ఆనాడు. కాంగ్రెసు ఆశయాలకు ప్రభావితుడైన దేశభక్తుడు కోడుగంటి నరసింహమూర్తి అందులో ఉపాధ్యాయుడు. ఆయన “స్వరాజ్య” పత్రిక తెప్పించి చదువుతూ అప్పుడప్పుడూ రాత్రిళ్ళు పిల్లలకు అందులో విశేషాలు చెబుతుండేవాడు. వాటి ప్రభావం వెంటనే వున్నదని చెప్పజాలంగాని, అవి బీజాంకురాలుగా పనిచేశాయంటే అతిశయోక్తి కాదేమో. లచ్చన కూడా శ్రోతగా స్వాతంత్రపాఠాలు విన్నాడు. ఇంకా పరిణతి చెందని, చిలిపి మనసుగల వయసుగదా. 15 సంవత్సరాల వయసు లచ్చన్నది. బారువలో గల కస్టమ్స్ కార్యాలయంలో అన్వార్, రంగనాయకులు అనే జవాన్లిరువురు కొన్నాళ్ళపాటు తాలింఖానా నడిపి, పిల్లలకు కసరత్తు సాముగరిడీలు నేర్పారు. అందులో చాలా హుషారుగా పాల్గొన్న లచ్చన్నకు ఆరోగ్యంగా రాత్రింబవళ్ళు షష్టిపూర్తి అనంతరం కూడా పనిచేయటానికి ఉపకరించాయి. ఇవిగాక లచ్చన్న చెడుగుడు, బాడ్మింటన్ బాగా ఆడుకునేవాడు. మకురుతనం ఆటలమాట ఎలా వున్నా 8వ తరగతి చేరిన లచ్చన్నకు మకురుతనం కూడా జాస్తి. ఆ ప్రభావంతో ఒక సందర్భంలో హెడ్మాస్టరును కొట్టి ఇల్లుమాని ఎస్టేటుదార్ల స్నేహితుల ఇళ్ళలో భోజనం చేస్తూ, తోటల్లో స్వేచ్ఛావిహారం చేస్తూ కాలక్షేపంచేశాడు కొన్నాళ్ళు. జబ్బు నుండి కోలుకున్న తండ్రి పట్టుదలగా వెతికించి మందసా హైస్కూలులో చేర్పించాడు. దీనికి అన్న సత్యానారాయణ ప్రోత్సాహం తోడ్పడింది. కొర్ల హరికృష్ణ అజమాయిషీలో లచ్చన్నను అట్టిపెట్టారు. అయినా మాసిన చదువులు మరల చదవబుద్ధిగాక, మందసా అడవుల్లో తిరగటమేగాక, మందసా హైస్కూలులోనే పేకాట ప్రారంభించాడు. ఎలాగైతైనేమి మరుసటి సంవత్సరానికి 8వ తరగతి పాసయ్యాడు. అప్పటికే అన్న సత్యనారాయణ 8వ తరగతి ముగించి హైయ్యర్ గ్రేడ్ ట్రైనింగుకై శ్రీకాకుళంలో చేరగా లచ్చన్న కూడా 9వతరగతి (నాటి 4వ ఫారమ్ లో) చేరాడు. అన్న శిక్షణ పూర్తయిన రెండేళ్ళలో లచ్చన్న ఒకసారి 9 తప్పి రెండో ఏడు నెట్టేశాడు. కాని 10వ తరగతి తొలి సంవత్సరమే ఉత్తీర్ణుడయ్యాడు. శిక్షణ పూర్తి గావించిన సత్యనారాయణ ఉపాధ్యాయ వృత్తికై స్వగ్రామం చేరుకోగా ఎస్.ఎస్.ఎల్.సి. చదువుకై లచ్చన్న ఇచ్ఛాపురం వచ్చాడు. మళ్ళీ పాత కథే. హద్దూ అదుపూలేని లచ్చన్న విజృంభించి, ఒకనాడు హెడ్మాస్టరుకు ముసుగు వేసి పారిపోయాడు. ఫలితంగా సెలక్షన్ స్థాయిలోనే ఆగిపోయాడు. ఇక లాభంలేదని మళ్ళీ శ్రీకాకుళంలో చేర్పించి యీ పర్యాయం రావిగంటి జగన్నాథం పంతులుగారి అజమాయిషీలో అట్టిపెట్టారు. ఇంటి ఆర్థిక పరిస్థితి బొత్తిగా బాగుండని రోజులవి. కష్టించి దాచిన డబ్బు ఇంట్లో నుంచి లచ్చన్న కొట్టేసిన సందర్భం. కాని జగన్నాధంగారి వాత్సల్య అనురాగాలతో లచ్చన్న ఎస్.ఎస్.ఎల్.సి ఉత్తీర్ణుడయ్యాడు. అదే లచ్చన్న ఆఖరు డిగ్రీ. 1930కు చేరుకున్నాం మనం. లచ్చన్న 20 సంవత్సరాల ప్రాయానికి వచ్చాడు. కాంగ్రెసు సమావేశాలు 1920 నుండే బారువలో కాంగ్రెసు సంఘం పనిచేస్తుండేది. ఏ ఉద్యమం జరిగినా ఆ వేడి కొంత గ్రామానికి కూడా తాకేది. ఒకసారి దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను అరెస్టు చేసి రైల్లో తీసుకుపోతుంటే, అందరితోపాటు లచ్చన్న కూడా స్టేషనుకు వెళ్ళి దర్శనం చేసుకొచ్చాడు. బారువలో తిత్తి బలరామయ్య, వెంకట రెడ్డిగార్లు ఒకవైపున జమీందార్లకు అండగా వుంటూనే మరొక ప్రక్క కాంగ్రెసు సమావేశాలకు తోడ్పడుతూ, ద్విపాత్రాభినయం చేస్తుండేవారు. పల్లెటూరుగనుక, కాంగ్రెసు పేరుతో జరిగే ప్రతి సమావేశానికీ ఆడుకుంటూ పాడుకుంటూ లచ్చన్న కూడా వెళ్ళివస్తుండేవాడు. ఆకతాయిగా వెళ్ళినా వాటి ప్రభావం ఆ తర్వాత లీలగా ద్యోతకం కాకపోలేదు. ఉప్పు సత్యాగ్రహం చదువు ముగించి, శ్రీకాకుళం నుండి స్వగ్రామానికి తిరిగొచ్చేసరికి లచ్చన్నకు ఉప్పు సత్యాగ్రహం తారసిల్లింది. ఉప్పు చేయటం కూడా ఒక ఉద్యమమేనా అని వెక్కిరించాడు. లచ్చన్న జిల్లాలో అప్పుడు ప్రసిద్ధ న్యాయవాదిగా పేరుమోసిన సోమయాజులు బారువలో సత్యాగ్రహ శిబిరం స్థాపించాడు. లచ్చన్నతోపాటు ఆయన దండు కూడా బాడ్ మింటన్ ఆటకు పోతూ వస్తూ శిబిర కార్యకర్తల్ని హేళన చేస్తుండేవారు. కాని గాంధి దండి (సూరత్) వద్ద ఉప్పుచేయడానికై సబర్మతి (1930 ఏప్రిల్ 6న) చేరాడు. గుజరాత్ ఆశ్రమం నుండి 1930 మార్చి 11న పాదయాత్ర ప్రారంభించి, ఒక్కొక్కరోజు గడుస్తుంటే దేశం వేడెక్కింది బారువా కూడా అందులో భాగం పంచుకున్నది. ఆ వేడిలో ఒకనాడు బాడ్ మింటన్ నుండి తిరిగొస్తున్న లచ్చన్నను పట్టి వంటి మీద వస్త్రాలు ఊడబెరికి, తగలబెట్టారు శిబిర కార్యకర్తలు అంతే. లచ్చన్నలో కూడా ఏదో ఆవేశం పూని, కార్యరంగంలోకి దూకాడు. అది రాజకీయ పర్వంలో అడుగిడటానికి నాంది. సత్యాగ్రహం నుంచి టెర్రరిజానికి గాంధీజీ పిలుపు యిచ్చిన ఉప్పు సత్యాగ్రహం గంజాం జిల్లాలో ఉప్పెనకు దారితీసింది, నౌవడలో ఉప్పు కొఠారులపై దండయాత్ర బయలుదేరిన ఊరేగింపు చూసినవారికి, జిల్లా యావత్తు అక్కడే ఉన్నదా అనిపించింది. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా, అన్నకు మాత్రం తెలియజేసి చూసివద్దామని వెళ్ళిన లచ్చన్న ఆ జన సందోహాన్ని చూసిన ఉద్వేగంలో సత్యాగ్రహం చేసి అరెస్టు అయ్యాడు. ఆనాడు జిల్లా నాయకులుగా పేరుమోసిన వరహగిరి జోగయ్య పంతులు, న్యాపతి నారాయణమూర్తి, పుల్లెల శ్యాంసుందరరావు, ఉన్నవ రామలింగం ప్రజల్ని నడిపించారు. ఊరేగింపులో పాల్గొన్న ప్రజలకు ప్రశాంతంగా వుండవలసిందిగా, లక్ష్మి (వి.వి.గిరి సోదరి) వేదాంతం కమలాదేవి (కాకినాడ) గారలు చేసిన విజ్ఞప్తిని ఎవరూ లక్ష్యపెట్టలేదు. ఫలితంగా మూకుమ్మడి అరెస్టులు చేశారు. అందులో వి.వి.గిరి సోదరుడు కూడా ఉన్నాడు. అరెస్టయిన లచ్చన్న బృందాన్ని జైల్లో పెట్టకుండా వంశధార ఇసుక తిన్నెలపైకి లారీలలో తీసుకెళ్ళి వదిలేశారు. నాటి జిల్లా కలెక్టర్ ఆసిన్ ఉద్యమాన్ని దెబ్బతీయటానికి వేసిన ఎత్తుగడ అది. లచ్చన్న, మరికొందరు మళ్ళీ నడిచివచ్చి, సత్యాగ్రహం చేసి, అరెస్టు అయ్యారు. ఈమారు టెక్కలి సబ్ జైల్లో పెట్టారు. ఆ దళంలో 26 మంది ఉన్నారు. వారిని విచారించటంగాని, శిక్షవేయటంగాని జరగలేదు. కొద్ది రోజుల నుంచి క్షమాపణ చెబితే వదులుతామన్నారు. అలాంటి సదవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు నాటికీ నేటికీ ఉన్నారు. ఉంటారు. అందుకే ఉద్యమాలు నీళ్ళుకారిపోతుంటాయ్. మొత్తం 26గురిలో 8 మంది నిలబడ్డారు. ఆ 8 మంది 23 రోజుల పాటు జైల్లో వున్నారు. చెరువులో స్నానం స్వయంపాకం దినచర్య, లచ్చన్న సహనం పోగా ఆందోళన చేసినందున, ఎలాగైతేనేమి విచారణ జరిపి, ఒక మాసం శిక్ష విధించారు. బరహంపూరు జైల్లో పెట్టారు. అప్పుడు తొలిసారిగా గొట్టిపాటి బ్రహ్మయ్యను లచ్చన్న చూడటం తటస్థించింది. అంతకుపూర్వం గవర్నరుకు నల్లజండాలు చూపినందున బ్రహ్మయ్య జైల్లోపడ్డాడు. వీరంతా సి తరగతి ఖైదీలు. పరిస్థితులు దుర్భరంగా వుండేవి. మట్టి బొచ్చెల్లో సంకటి పోసేవారు. ఖైదీలపట్ల అధికారుల ధోరణికి నిరసనగా లచ్చన్న బృందం ఒకనాడు దిగంబరులై కూర్చున్నారు. కాంగ్రెసు పెద్దలు ఇంకా అంతటి స్థాయికి పోలేక, యువకులకు ఎలాగో సర్ది చెప్పి, ఆ ప్రయత్న విరమణ చేయించారు. ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులైనట్లు జైల్లో వుండగా తెలిసింది. రైల్వై సిగ్నల్ శిక్షణ ఈ విధంగా జైలు శిక్ష అనుభవించి వచ్చిన లచ్చన్నకు తరువాత ఏమి చెయ్యాలో తోచలేదు. అప్పటికే ఉప్పు సత్యాగ్రహం చప్పబడింది. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక వచ్చింది. (1931 మార్చి) బ్రతుకు తెరువు మార్గాంతరం చూసుకోవాలనుకొని రైల్వే సిగ్నలర్ శిక్షణ పొందితే ఏదైనా ఉద్యోగం వస్తుందని ఆశించాడు. రైల్వే సిగ్నలర్ గా ఉద్యోగం చేస్తున్న ఒక తెలిసిన వ్యక్తి చెంత అనధికారికంగా శిక్షణ పొందటం ఆరంభించాడు. ప్రతిరోజూ బారువ నుండి 3 మైళ్ళు సైకిల్ పై వెళ్ళి, శిక్షణ పొంది వస్తుండేవాడు. మూడుమాసాలపాటు ఈ శిక్షణ కార్యక్రమము జరిగింది. కల్లు దుకాణాల పికెటింగ్ ఉప్పు సత్యాగ్రహోద్యమంలో శిక్ష అనుభవించిన వారితో సహా కొందరు పర్లాకిమిడిలో ఒక సత్యాగ్రహ శిబిరం ప్రారంభించి జిల్లా అంతటా కల్లు దుకాణాల ముందు పికెటింగ్ జరపాలని, కల్లు త్రాగటం మాన్పించాలని తీర్మానించుకున్నారు. తదనుగుణంగా బారువలో దుర్లభసాన్, అప్పనపాఢి అనే వారిరువురు ఉత్సాహంగా ముందుకొచ్చి శిబిరం ప్రారంభించేసరికి, లచ్చన్నకు మళ్ళీ పని తగిలింది. సిగ్నల్ శిక్షణకు స్వస్తి పలికి రంగంలోకి దిగాడు. కాని వెంటనే ఆయన్నెదుర్కొన్న సమస్య గృహసమస్యే. కల్లు దుకాణం తన యింటనే ఉన్నది. తండ్రి కల్లు తాగుతాడు. ఇంట గెలిచి రచ్చగెలవాలి గదా! కనుక కల్లు దుకాణం తన యింట్లో మూసేసే వరకు యింటికి రానని భీష్మించటంతోపాటు, తండ్రి తాగటం కూడా మానాలని వరం కోరాడు. ఒకటి కుటుంబ జీవనాధార సమస్య. రెండవది వ్యక్తిపరమైన అలవాటుకు సంబంధించినది. తల్లిదగ్గర లచ్చన్న పట్టిన పట్టు పనిచేసింది. దుకాణం మూతపడింది. పదిమంది ఎదుట తండ్రి తాను తాగనని లచ్చన్న వద్ద ప్రమాణం చేశాడు. ఆవిధంగా ఇంట గెలిచిన లచ్చన్నకు వీధినబడే నైతికబలం చేకూరింది. అయితే తండ్రి అలవాటు మానుకోలేక, చాటుమాటుగా పుచ్చుకొని లచ్చన్నకు తెలియనివ్వద్దని చూచిన వారిన బ్రతిమాలుకునేవాడు. కల్లు అమ్మటం మాన్పించిన లచ్చన్న ప్రత్యామ్నాయంగా జీవనాధార విషయం ఆలోచించలేదు. ఇతర కల్లు దుకాణాల వద్ద పికెటింగ్ చేయటంలో ఆయన నిమగ్నుడయ్యాడు. బారువాలోనే గాక సోంపేట, ఇచ్ఛాపురం వరకు కోస్తా ప్రాంతంలో ప్రతి కల్లు దుకాణంవద్ద పికెటింగ్ చేశారు. కులంవారీగా సమావేశాలు జరిపి కులకట్టుబాటుగా త్రాగరాదనే తీర్మానం చేయించారు. త్రాగితే జరిమానా వేస్తామన్నారు. త్రాగినవారి కూపీ యిచ్చినవారికి పారితోషికాలు యిచ్చారు. స్త్రీలకయితే చీరెలు బహుమానంగా యిచ్చేవారు. ఉద్యమంగా సాగిన ఆ పికెటింగ్ కార్యక్రమంలో చాలా కల్లు దుకాణాలు మూయించారు. కాని మరో ప్రక్క లచ్చన్నపై ఆయన కులం వారికి అసంతృప్తి పెరిగింది. మార్గాంతరం చూపకుండా జీవనాధారం ఆపేశాడని కోపం తత్ఫలితంగా బారువాలో లచ్చన్న కుటుంబాన్ని వెలిగా చూడటంతోపాటు, లచ్చన్న సోదరిని ఆమె అత్తగారు పంపించేశారు. అంతటితో ఆగలేదు. ఉద్యమాల్లో పాల్గొంటున్న లచ్చన్నను ఆయన పినతండ్రి అణంగి దండయ్య ఒకరోజు త్రోవకాచి, కొట్టాడు. కాని గ్రామస్తులంతా దండయ్యను దండించి లచ్చన్న ప్రక్క నిలబడ్డారు. హరిజనోద్ధరణ లచ్చన్న హరిజనుడని, అంటరానివాడని విదేశ పండితులు అనుకోటానికి బహుశా, ఆయన హరిజనులతో అంతగా కలిసిమెలిసి పనిచేయటమేనేమో చూడండి HOWARD L.E. RDMAM వ్రాసిన The Swantantra Party, Indian Conservatism. 1967లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన యీ గ్రంథంలో ఆ పండితుడు లచ్చన్నను హరిజన నాయకుడని (పుట 120), అంటరానివాడని (పుట 199) వ్రాశాడు. ఇలాంటి విషయాలు వ్రాసేటప్పుడు జాగ్రత్త వహించటం పండితుల ప్రథమ కర్తవ్యం. బారువలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి ఎం.జి.వి.జి. సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు. నాటి వేదపండితులైన బంకుమల్లి మల్లయ్య శాస్త్రిని పిలిపించి, హరిజనులను అంటరానివారిగా చూడరాదనే విషయం చెప్పించటానికి సభ ఏర్పాటు చేశారు. లచ్చన్న కూడా రంగంలో దిగి, హరిజనవాడలో రాత్రి పాఠశాల ప్రారంభించాడు. ఆ పాఠశాల విద్యార్థిగా తొలుత చేరిన కొత్తపల్లి పున్నయ్య ఉత్తరోత్తరా లచ్చన్నకు చాలా సన్నిహితుడయ్యాడు. లచ్చన్న కేవలం పాఠశాలతో ఆగక గ్రామంలోని ఒక బావి అయినా హరిజనులు వాడుకోవటానికి అంగీకరించాలని పట్టుబట్టాడు. గ్రామ పెద్దల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఒక బావిలో హరిజనుల చేత నీళ్ళు తోడించాడు. పెద్దలలో అభిప్రాయాలు పొడసూపినయి. ఆగ్రహులైన పెద్దలు ముందు లచ్చన్న కుటుంబంపై కసి తీర్చుకున్నారు. చాకలి, మంగలి ఆయింటికి వెళ్ళకుండా కట్టుదిట్టం చేశారు. హరిజనులు తెచ్చుకునే కుండల్ని పగులగొట్టారు. చివరకు, వారు నీడుతోడుకునే బావిలో చచ్చిన పిల్లుల్ని, అశుద్ధాన్ని వేశారు. అప్పటికీ లచ్చన్న లొంగి రాకపోయేసరికి పెద్దలంతా ఒక సభ పెట్టి హరిజనులు బావిని వాడటానికి వీల్లేదని తీర్మానించారు. కాని హరిజనులపై వూరివారు చేయిచేసుకుంటే బుర్రలు ఎగిరిపోతాయని లచ్చన్న ఉద్రేకంగా హెచ్చరించాడు. తరువాత పరిస్థితులు విషమించక పూర్వమే, గ్రామంలో కలరా సోకింది. అప్పుడు లచ్చన్న బృందమే తెగించి, సేవలు చేశారు. అప్పుడు కులం, గోత్రం ఎవరూ పట్టించుకోలేదు. అంతటితో హరిజనులపై కోపము పట్టుదల సడలింది. తలతంపర జమీపై పోరాటాలు సేవాదళ్ శిబిరంలో శిక్షణ కాంగ్రెస్ పార్టీలో తొలుత దేశ వ్యాప్తంగా ఒక వలంటీర్ల దళం ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేసింది హర్డికర్. తదనుగుణంగా ఆంధ్రలోకూడా ఒక శిక్షణ శిబిరం కాకినాడలో జరిగింది. మైసూరు నుండి భట్టు, దయానందరావు అనే వారిరువురు వచ్చి యీ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. లచ్చన్న అందులో శిక్షణ పొందాడు. గంజాం జిల్లా కాంగ్రెస్ నిర్వహించిన మరొక శిబిరంలోనూ లచ్చన్న శిక్షణ పొందాడు. కాకినాడలో శిక్షణ శిబిరం జరుగుతున్న రోజులలో శాసనోల్లంఘనోద్యమం ప్రారంభమైంది. (1932 జనవరి నుండి) ప్రభుత్వం 144వ సెక్షన్ అమలు జరిపింది. ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరించిన లచ్చన్న పట్టుబడకుండా, యించుమించు మూడు వారాలపాటు జిల్లాలో తిరిగాడు. చివరకు పట్టుబడడంతో పాటు, లాఠీ దెబ్బలు చవిచూచి, ఆరుమాసాల శిక్ష అనుభవించటానికై రాజమండ్రి జైలుకు ‘సి’ తరగతి ఖైదీగా పంపించబడ్డాడు. టెర్రరిస్టు వాసనలు రాజమండ్రి జైలులో కొందరు టెర్రరిస్టులతో లచ్చన్నకు తొలిపరిచయమైంది. భగత్ సింగ్ కేసుకు సంబంధించిన ముద్దాయి సిన్హా ఒక్కడే కలిశాడు. అప్పటికే అన్నాప్రగడ కామేశ్వరరావు, కాకరాల కామేశ్వరరావు, చల్లా అప్పారావు, మద్దూరి అన్నపూర్ణయ్య ప్రభృతులు టెర్రరిస్టులుగా ప్రసిద్ధి చెందారు. అదీగాక బెంగాల్ టెర్రరిస్టులు కొందరు ఆంధ్ర మద్రాసు ప్రాంతాల జైళ్ళలో ఉండి, టెర్రరిస్ట్ భావాలు వ్యాపింపచేశారు. జైలునుండి విడుదల అయిన తరువాత, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలద్రోయటానికి కొన్ని పన్నాగాలు పన్నారు. రాజమండ్రి, కడలూరు, బళ్ళారి జైళ్ళలో జరిగిన యీ నిర్ణయాలు అమలుపరచటానికి లచ్చన్న కూడా అంగీకరించాడు. జైలు నుండి టెర్రరిస్ట్ మనస్తత్వంతో ఇంటికి వెళ్లిన లచ్చన్నకు, మిడ్నపూరులో కలెక్టర్.ను చంపి, పారిపోయి, తలదాచుకోటానికి వచ్చిన ఒక టెర్రరిస్ట్ తారసిల్లాడు. అతనికి ఐదురోజులపాటు స్వగృహములో ఆతిథ్యం యిచ్చి పంపాడు లచ్చన్న. కాని ఏ కారణం వలన అయితేనేమి జైలులో వేసుకున్న పథకం ప్రకారం యితర టెర్రరిస్టులు లచ్చన్నను సంప్రదించకుండానే రంగంలోకి దిగారు. కాకినాడలో బాంబు ప్రేలుడు జరిగింది. ఆనాడే మద్రాసు తదితర చోట్ల కూడా కొన్ని విఘ్న చర్యలు అమలుపరిచారు. తనకు తెలియపరచనందుకు ఆగ్రహావేశపరుడైన లచ్చన్న తల్లిదండ్రులు దాచుకున్న డబ్బు చెప్పకుండా తీసుకుని, తొలిసారి బెజవాడ చేరారు. మొగల్ రాజపురంలో పూర్ణచంద్రరావు యింట నారాయణరావు అనే టెర్రరిస్ట్ లచ్చన్నను నిరుత్సాహ పరచగా, లాభం లేదనుకొని, ముదునూరు వెళ్ళి అన్నె అంజయ్యను కలుసుకున్నాడు. ఆయన కూడా నిరుత్సాహంగానే మాట్లాడగా రైలెక్కి బారువ బదులు బర్హంపూర్ వెళ్ళాడు. జైలు స్నేహితుడైన యజ్ఞనారాయణ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు బర్హంపూరు రైల్వేస్టేషన్ మాస్టర్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ యిరువురూ ఆంధ్రులు, కలకత్తా ప్రయాణమయిన లచ్చన్నకు సౌహార్దంగా వీడ్కోలు చెప్పారు. కాని, డబ్బు చాలదనే భయంతో లచ్చన్న రైలు ప్రయాణంమాని కాలినడకన భద్రక్ చేరేసరికి, తీవ్రంగా జ్వరపడ్డాడు. రైల్వే టికెట్ కలెక్టర్ సాయంతో అలాగే ఖర్గపూర్ చేరుకున్నాడు. కానీ పట్టణంలో కర్ఫ్యూ అమలులో ఉన్నది. జైల్లో వ్రాసుకున్న టెర్రరిస్టు చిరునామాల ననుసరించి గృహాలు వెతుకుతుంటే ఎవరూ దొరకలేదు, ఉన్న ఒక్కతను లచ్చన్నను యింటికి పొమ్మన్నాడు. మిడ్నపూర్ వెళ్ళాడు. అక్కడా చుక్కఎదురైంది. టాటానగర్ చేరాడు. అప్పటికి డబ్బుతోపాటు ఉత్సాహం కూడా అయిపోయింది. ఇచ్ఛాపురంలోని ఒక బాల్యమిత్రుడు తటస్థపడగా, అతనింట్లో వుంటూ, ఊళ్లో టెర్రరిస్ట్లకై అన్వేషించాడు. వాళ్లెవరూ దొరకలేదుగాని, స్నేహితుడు అనుమానించసాగాడు. అప్పటికి లచ్చన్నకు సన్నిపాత జ్వరం వచ్చింది. ఆ మిత్రుడు లచ్చన్న విషయమై ఇంటికి ఉత్తరం వ్రాయగా, సోదరుడు సూర్యనారాయణ నూరు రూపాయలు పంపిస్తూ, ఎలాగైనా లచ్చన్నను యింటికి చేర్చమని, ఉత్తరం వ్రాశాడు. ఇది లచ్చన్నకు తెలియకుండా జరిగినా, ఇంటి ధ్యాసలో పడిన లచ్చన్న ధోరణి కనిపెట్టిన ఆ స్నేహితుడు బర్హంపూర్ వరకు తోడుగా వచ్చి, అక్కడ లచ్చన్న బంధువులు తటస్థపడగా వారికి అప్పగించాడు. ఆవిధంగా టెర్రరిస్టు ఉద్రేకం తాత్కాలికంగా లచ్చన్నను ఆవరించి, సడలిపోయింది. రంగా శిష్యరికం 1934లో నేటి శ్రీకాకుళం (నాడు ఉత్తర విశాఖ) జిల్లా అంతటా విపరీతమైన కరువు సంభవించింది. టెక్కలిలో పశువులు, మనుషులు యించుమించు ఒకేరీతిలో మరణించిన ఘట్టమది. అంతదారుణం జరుగుతున్నా రైతులు ప్రభుత్వానికి మహజర్లు పెట్టటానికి జంకారు. కారణం – నిన్నటివరకూ రాజభరణాలివ్వాలని పోరాడిన జమీందార్ల పాలన అక్కడ అమలులో వుండటమే. వారే ప్రభుత్వం సర్వస్వం. వారి మాటకు ఎదురు లేదు. లచ్చన్న ప్రాంతమంతా తలతంపర ముఠా అనబడే 21 గ్రామాలలో కూడిన ఎస్టేట్, ఆనాడు జమీందార్ల భూముల్ని కవులుకు తీసుకున్న రైతులు మందసాలో ఎకరాకు 30 బస్తాలు, బొబ్బిలిలో ఎకరాకు 40 బస్తాలు, బారువలో పంటలో సగం జమీందార్లకు యిచ్చుకోవాల్సిందే. ఒక ప్రక్కన పంటలు పోయి, ఆర్థికంగా చితికిపోతున్న రైతుల్ని గమనించక జమీందార్లు తమ కవుళ్ళు యివ్వనందుకు జప్తులు చేసిన రోజులవి. కాంగ్రెసు అధిష్టాన వర్గం అప్పటికి జమీందారీ వ్యతిరేక విధానం అవలంభించలేదు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు సైతం రైతు వ్యవస్థకు మద్దతునివ్వలేదు. అదీ స్థితి. అప్పుడు లచ్చన్న రంగంలో దిగి గ్రామాలు తిరిగి, రైతుల్ని ప్రోత్సహించి, మహజర్లు పెట్టమని పురికొల్పాడు. ఇక చూస్తూ వూరుకుంటే ప్రయోజనం లేదని, నౌపడలో ఒక శిబిరం ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి మహజర్లు పంపించే కార్యక్రమాన్ని చేపట్టాడు. అవసరమైతే తానే వేలిముద్రలు వేసి, ఆయా రైతుల పేరిట మద్రాసు ప్రభుత్వానికి మహజర్లు ఉప్పెన పంపించాడు. మలబారులో పర్యటిస్తున్న రంగాను రమ్మని తంతిద్వారా కోరాడు. రంగా వెంటనే వచ్చి కాలినడకనే మూడు రోజులలో 20 గ్రామాలు పర్యటించి, రైతుల్ని ప్రోత్సహిస్తూ ఉపన్యాసాలు చేశాడు. అంతగందరగోళం జరిగితే, మద్రాసు ప్రభుత్వం కదలి ఒక రెవిన్యూ సభ్యుణ్ణి పంపింది. ఆయన టెక్కలి మిషనరీ బంగళాలో మకాం పెట్టి, విచారణకు పూనుకున్నాడు. లచ్చన్న రైతుల్ని పోగుచేసి ఆ సభ్యుని వద్దకు ఒక ఆకలి యాత్ర నడిపించాడు. ఇదంతా చూచిన తర్వాత, ఆ సభ్యుని సిఫారసులపై ప్రభుత్వం కొన్ని సహాయ కార్యక్రమాలు తలపెట్టింది. అంతటితో ఆ సమస్య ఉపశమించింది. కాంగ్రెసు సోషలిస్టు పార్టీలో 1934లో గాంధీ నాయకత్వాన కాంగ్రెసు అంతగా పురోగమించని సందర్భంలో సోషలిస్టు పార్టీ పుట్టింది. జయప్రకాశ్ నారాయణ్ పాట్నాలో దీనికి బీజాంకురాలు నాటాడు. 1935 జనవరిలో జయప్రకాశ్ ఆంధ్రలో పర్యటించి, పార్టీని పటిష్టం చేయమని ప్రోత్సహించాడు. 1936 లక్నో కాంగ్రెస్ నాటికి బాగా సభ్యత్వం చేర్పించాలన్నాడు. ఆంధ్రలో కాంగ్రెసు సోషలిస్టు తొలి మహాసభ 1935 ఫిబ్రవరి 19న గుంటూరులో జరిగింది. తెన్నెటి విశ్వనాథం అధ్యక్షత వహించగా, మసాని ప్రారంభించారు. అప్పుడు ఏర్పడిన ఆంధ్ర కార్యవర్గంలో లచ్చన్న సభ్యుడయ్యాడు. అల్లూరి సత్యనారాయణరాజు, అన్నె అంజయ్య, పుచ్చలపల్లి సుందరయ్య అందులో సభ్యులు. తరువాత ఆంధ్ర మహాసభలు విశాఖలో జరిగిన సందర్భంగా, బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన ఒకరోజు సోషలిస్టు పార్టీ మహాసభ జరిగింది. కాంగ్రెసు నుండి విడిపోయే వరకు లచ్చన్న కార్యవర్గ సభ్యుడుగా కొనసాగాడు. ఒక ఏడాది శ్రీకాకుళం ప్రాంతీయ సోషలిస్టు సమావేశాలు జరిపినప్పుడు స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షతవహించారు. ఇందూలాల్ యాజ్ఞిక్ సభలకని వచ్చి, లచ్చన్నకు తన కొత్త బట్టలిచ్చి అక్కడక్కడా చింపించి, పాచికలు వేయించ మన్నాడట. అది కనువిప్పు కలిగించే విషయంగా లచ్చన్న భావించాడు. లక్నో కాంగ్రెసు సమావేశాలకు లచ్చన్న, సుందరయ్య, అల్లూరి సత్యనారాయణ రాజు కలసి ప్రయాణం చేశారు. సభల నుండి తిరిగి వస్తూ, ఢిల్లీలో ఆగి ప్రదేశాలు చూస్తూ కుతుబ్ మినార్ వద్ద ఒక పందెం వేసుకున్నారట. ఎక్కడా ఆగకుండా ఒకే పరుగున కుతూబ్ మీనార్ పైకి వెళ్ళాలి. ఆ పందెంలో సుందరయ్యే గెలుపు. లచ్చన్న, అట్లూరి మధ్యలో ఆగిపోయారు. అదొక మధుర స్మృతిగా లచ్చన్న పేర్కొంటుంటారు. 1936 నుండి కాంగ్రెసు నుండి రాజీనామా యిచ్చేటంతవరకూ లచ్చన్న ఎ.ఐ.సి.సి. సభ్యుడు. ఇంచుమించు అన్ని సమావేశాలకు (జైలు జీవితంలో తప్ప) హాజరయ్యాడు. లచ్చన్నను రంగానుండి విడదీసి, తమ పార్టీలో చేర్చుకోవాలని, కాంగ్రెసులో ఉంటున్న కమ్యూనిస్టులు ఆంతరంగిక సమావేశాల్లో చర్చించినట్లు అల్లూరి సత్యనారాయణరాజు లచ్చన్నకు ఉత్తరోత్తర వెల్లడించాడట. జైలునుండి తిరిగి వచ్చేసరికి లచ్చన్న కుటుంబపు ఆర్థిక పరిస్థితులు బాగా చితికిపోయాయి. వృత్తి మానేయటం ఇందుకు ప్రధాన కారణం. తండ్రి బాగా వృద్ధుడయ్యాడు. అన్న ఉపాధ్యాయుడు. సంపాదించేది చాలదు. అలాంటి పరిస్థితుల్లో బారువలో ఉన్న కొంప కాస్తా అమ్ముకుని, అద్దెఇంట్లో ఉండేవారు. కాని బారువలో లచ్చన్నకు ఇద్దరు వ్యక్తులు ఆర్థికంగా తోడ్పడుతుండేవారు. అల్లాడ లక్ష్మోజీ, భరతుసాపు. రెండో అతను కాఫీ హోటలు యజమాని, లచ్చన్నకే గాక అతని అనుచరులకు సైతం ఆ హోటల్లో సర్వవేళల్లో సదుపాయాలు, సౌకర్యాలు సరఫరాలు అందేవి. అలా గడుస్తుండేది లచ్చన్న జీవితం. 1935 వేసవిలో లచ్చన్న జీవితంలో శూన్యం ఆవరించింది. చేసేపని లేదు. ఉద్యమాల్లేవు. తిరిగి స్వగ్రామంలో హాయిగా పేకాటలో నిమగ్నుడయ్యాడు. అలాంటి సందర్భంలో ఒకనాడు పుల్లెల శ్యామసుందరరావు వచ్చి బలవంతాన లచ్చన్నను బయటకు లాగి, పురికొల్పి, దారిఖర్చులిచ్చి, రంగా నడుపుతున్న రాజకీయ పాఠశాలకు వెళ్ళమని రైలెక్కించాడు. లచ్చన్నకు జిల్లా స్థాయిలో నాయకుడు, మార్గదర్శిగా పుల్లెల శ్యామసుందరరావు చనిపోయే వరకు నిలబడ్డాడు. రంగాజీ రైతాంగ పాఠశాలలో 7-11-1933 శ్రీకాకుళం ప్రాంతములో పర్యటిస్తున్న సందర్భముగా తొలిసారి రంగాను దర్శించిన లచ్చన్న, కరువు సందర్భములో ఆయన ఉపన్యాసాలతో ఉత్తేజితుడై ఉండటం. వీటన్నిటివలన, రంగా రాజకీయ పాఠశాలకు అనగానే సంతోషముగా వెళ్ళాడు లచ్చన్న. ఆ విధంగా ఎస్.ఎస్.ఎల్.సి.తో ఆపేసిన చదువును మళ్ళీ రంగా పాఠశాలలో రాజకీయ విద్యార్థిగా కొనసాగించాడు. 1935 నుండే వరుసగా మూడేళ్లు నిడుబ్రోలు వేసవి పాఠశాలకు విద్యార్థిగా వెళ్ళి, సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్నాడు. అది ఒకవిధంగా లచ్చన్న రాజకీయ మనస్తత్వానికి ప్రాతిపదిక అనవచ్చు. రంగా 1934లోనే రాజకీయ పాఠశాలలు ప్రారంభించాడు. తొలి సంవత్సరం జిల్లాలో కరువు కారణంగా లచ్చన్న హాజరు కాలేదు. ఆంధ్రలో రాజకీయ పాఠశాల ప్రారంభించింది రంగా మాత్రమే. తరువాత అన్ని పార్టీలవారు, ముఖ్యంగా కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాల ప్రచారానికి పాఠశాలలు పెట్టారు. రంగా పాఠశాలలో శిక్షణ పొందినవారిలో కమ్యూనిస్టులతో సహా అన్ని రాజకీయ పక్షాలవారు వున్నారు. 1935లో లచ్చన్నతోపాటు మాకినేని బసవపున్నయ్య కూడా విద్యార్థిగా పాఠశాలలో వున్నాడు. రాజకీయ పాఠశాల పాఠ్యప్రణాళిక చూస్తే లచ్చన్న నేర్చుకున్న విషయాలేమిటో వేరే చెప్పనక్కరలేదు. ఆ అంశాలు ఇవి – 1. ఆదిమకాలం నుండి పెట్టుబడిదారీ, పారిశ్రామిక వ్యవస్థ పరిణామం, 2. ఫాసిజం 3. ఇతరచోట్ల ఫాసిస్టు అవకాశాలు, 4. పెట్టుబడిదారుల వ్యవస్థా నిర్మాణం, 5. వాణిజ్య సంస్థల ఆర్థిక వ్యవస్థ పరిశీలన, 6. పారిశ్రామికీకరణ 7. మన ఆర్థిక వ్యవస్థ విధానపు వ్యయం 8. దేశరక్షణ పారిశ్రామిక విధానం వలన బాగుపడేవారు. 9. పారిశ్రామిక జనావళి 10. కార్మికుల ప్రత్యక్షచర్యల చరిత్ర 11. మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ ఏర్పాటు 12. ఆచరణయుక్తమైన సంస్కరణలు 13. జాతీయీకరణ, వ్యక్తిపరమైన వ్యాపారాలు 14. వ్యవసాయం, 15. భూమిశిస్తు 16. జమీందారీ వ్యవస్థ రైతులు 17. జమీన్ రైతుల సంఘటితం 18. జమీందారీ విధానం రద్దు 19. రాజ్యాంగాలు 20. శాసనసభల విధానం, 21. ప్రాతినిధ్యపు సంస్థలు 22. మంత్రిమండలి 23. భారత రాజ్యాంగం 24. భారత రాజ్యాంగం-ప్రజలు 25. స్థానిక స్వపరిపాలన 26. బడ్జట్ రీతులు 27. ప్రభుత్వవ్యయాలు 28. భారత ప్రభుత్వ రుణం 29. ప్రభుత్వోద్యోగాలు 30. ప్రజారోగ్యము – పారిశుభ్రత 31. ప్రజల విద్య 32. విదేశ విధానం 33. సోషలిస్టు భావచరిత్ర 34. సహకారోద్యమం 35. కార్మికోద్యమం 36. కార్మిక శాఖలు 37. నిరుద్యోగం 38. కరువు నివారణ విధానం 39. పౌరహక్కులు 40. మతం 41. పత్రికలు ప్రచారం, 42. గ్రామ పునర్నిర్మాణం 43. వయోజన విద్య 44. గ్రంథాలయోద్యమం 45. గ్రామాలకు నీటిసరఫరా 46. ప్రజాపోరాటాలు 47. ప్రజల మనుగడకు అనుకూలంగా ప్రపంచాన్ని మార్చే తీరులు (ఇంకా వివరాలకు చూడండి) The modern Indian Pensant by N.G.Ranga, Kisan Publications, 23 stringer street, Madras. 1935 ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎనిమిది వారాలపాటు నిడుబ్రోలులో జరిగిన యీ పాఠశాల (చూడు పుట 98 పైన పేర్కొన్న గ్రంథం) లచ్చన్న పైన పేర్కొన్న విషయాలన్నీ నేర్చుకున్నాడు. బహుశ పై చదువులు చదివినా ఇన్ని విషయాలూ ఎక్కడా చెప్పేవారుకాదు. కనుకనే లచ్చన్నకు సిద్ధాంతపరమైన పునాదులు యేర్పడినవి. లచ్చన్న ఇప్పటికి తరచు అంటుంటాడు. తాను ఎస్.ఎస్.ఎల్.సి. గ్రాడ్యుయేట్ మాత్రమేనని. అంటే లాంఛన ప్రాయమైన పట్టాలు లేవు. రంగా రాజకీయ పాఠశాలకు హాజరైన లచ్చన్న అప్పటి నుండీ రంగాను గురువుగా భావించాడు. అదేగాక, రాజకీయ పాఠశాల విద్యార్థుల్ని రంగా దంపతులు ఎంతో ఆప్యాయంగా ఆదరించి, వారి కుటుంబ యోగక్షేమాలతో సహా పరామర్శించి ఆప్యాయంగా చూడటంవలన కూడా, లచ్చన్న మరీ సన్నిహితుడయ్యాడు. రంగాకు సంతానము లేనిలోటు కూడా ఒకవిధంగా యిలానిండేది. అంతకు పూర్వమే భారతీదేవికి ఒకసారి గర్భస్రావం గావటం, ఇక సంతానం కలగరని వైద్యులు చెప్పటంతో వ్యక్తిగతంగా విచారం, లోటు అనిపించినా, రాజకీయంగా దృష్టి నిమగ్నతకు తోడ్పడింది. బడారాజులకు వ్యతిరేకంగా కాంగ్రెసులో కృషి, అధికారం పాఠశాల నుండి తిరిగివచ్చి లచ్చన్న తన ప్రాంతములో అనేక చిన్న రాజకీయ పాఠశాలలు నిర్వహించి రంగా, న్యాపతి నారాయణమూర్తి, పుల్లెల శ్యామసుందర రావుగారల పర్యటన కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. కాని బొబ్బిలిలో బహిరంగ సభ జరపటానికి రాజా అభ్యంతర పెట్టి, రౌడీలను నియమించాడు. వారి దృష్టి మళ్ళించటానికై లచ్చన్న బృందం “రైతు భజనావళి”లోని గేయాలు పాడుతూ బొబ్బిలి వీధుల్లో తిరుగుతుంటే రౌడీలు వారి వెంటబడ్డారు. ఆ సమయంలో బొబ్బిలిలోని తాండ్రపాపారాయుడు మండపములో బహిరంగ సభ పెట్టి రంగా గంభీరోపన్యాసం చేశాడు. అప్పటి నుండి కోటగిరి సీతారామారావు ఉత్తేజితుడై బయటపడి రంగా అనుచరుడయ్యాడు. బొబ్బిలిలో రాజాకు వ్యతిరేకంగా బహిరంగ సభ జరపటం అదే మొదటిసారి. అంతకు క్రితమే ఒక పర్యాయం రంగాను చంపించాలని బొబ్బిలిలో రాజా ఆడవరం వద్ద ప్రయత్నించి, రంగా విడిది గృహాన్ని తగలపెట్టించాడు. కాని ముందే పసిగట్టిన లచ్చన్న ప్రభృతులు రంగాను మరొక చోటకు తరలించారు. ఇలా రంగా పరిథిలో ఆకర్షితుడైన లచ్చన్న, అన్నివిధాలా బాంధవ్యం పెంచుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం 1935లో తెచ్చిన చట్టానుసారం రాష్ట్ర శాసనసభలకు 1937 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. టెక్కలి నియోజవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా నాటి శ్రీకాకుళం జిల్లా నాయకుడు పుల్లెల శ్యామసుందరరావు పోటీ చేసాడు. లచ్చన్న నియోజకవర్గంలో విపరీతంగా తిరిగి కృషిచేశాడు. శ్యామసుందరరావుకు పోటీగా సర్ ఎ.పి.పాత్రో నిలబడ్డారు. అలాగే బొబ్బిలి రాజుపై కాంగ్రెస్ అభ్యర్థిగా వి.వి.గిరి పోటీచేశారు. లచ్చన్న ఆనాడు గిరి పక్షాన కూడా ప్రచారం సాగించాడు. (చూడండి – అఖిలాంధ్ర వీరసంస్మరణ కుసుమాంజలి. కొవ్వూరు 1953) ఆ ఎన్నికలలో శ్యామసుందర రావును అభ్యర్థి కాకుండా చేయాలని శ్రీకాకుళంలో ఎందరో ప్రయత్నించినా కళా వెంకటరావు తోడ్పాటు వలన పుల్లెలవారే నెగ్గారు. పాత్రోపై 9 వేల ఓట్లు అధికంగా వచ్చాయి. అయితే ఎన్నికల సందర్భంగా పాత్రోకు ఒక బహిరంగ లేఖ వ్రాసి, పంచాడు లచ్చన్న. అది ఆధారంగా పాత్రో ఎన్నికల అనంతరం పరువునష్టం దావా వేసి పుల్లెల ఎన్నికను రద్దు చేయించాలని ప్రయత్నించాడు. తొలిసారి లచ్చన్న సాక్షిగా బోనులో నిలబడి పుల్లెలను సమర్థించాడు. లచ్చన్న రైతు కాదు గనుక ఎస్టేటుదారుకూ, రైతులకూ మధ్య తగాదాలలో సాక్ష్యం చెప్పే అర్హత ఆయనకు లేదని విచారిస్తున్న సబ్ – కలెక్టరు అభ్యంతరం తెలిపాడు. అతనొక ఐ.సి.ఎస్. అధికారి. లచ్చన్న సమాధానం చెబుతూ దివాన్ గిరి లేని వ్యక్తి దివాన్ గా యీ కేసులో ఉండరాదని ఎదురు అభ్యంతరం తెచ్చాడు. అంతటితో లచ్చన్నను సాక్ష్యం చెప్పనిచ్చారు. అలాంటి రణపెంకి లచ్చన్నంటే. శాసనసభ ఎన్నికలు కాగానే మద్రాసులో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ప్రకాశం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి వదలి రెవిన్యూ మంత్రి అయ్యాడు. అతని స్థానంలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షుడు కాగా, కార్యదర్శిగా గొట్టిపాటి బ్రహ్మయ్య వచ్చాడు. ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడుగా పుల్లెల శ్యామసుందరరావు, కార్యదర్శిగా లచ్చన్న ఎన్నిక అయినప్పటికీ ఎన్నికైన సంఘాన్ని రద్దుచేసి, జిల్లా సంఘంపై విచారణ జరపాలంటూ, ఒక అడహాక్ సంఘాన్ని రాష్ట్ర కాంగ్రెసు నియమించింది. అడ్ హాక్ సంఘాలు నాటికీ నేటికీ కాంగ్రెసుకు ఆనవాయితీగా వస్తున్నవే. వారిక్ ప్రజాస్వామ్యంలోగల నమ్మకం అలాంటిది. రాష్ట్ర కాంగ్రెసు ప్రతినిధిగా గొట్టిపాటి బ్రహ్మయ్య వచ్చి, ఛార్జి ఇవ్వమన్నాడు. ఒక యినాందారింట్లో కాంగ్రెస్ కార్యాలయం ఉండేది. సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ప్రతినిధులు లారీలపై కిసాన్ ఎర్రజండాలతో వచ్చారు. ఎన్నికైన సంఘాన్ని రద్దు చేసినందుకు కార్యకర్తలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. సమావేశంలో జిల్లా సంఘంపై ఆరోపణలు ప్రస్తావనకు రావటం, వాదోపవాదాలు పెరగటం, లచ్చన్న అనుయాయుల్ని రౌడీలని గొట్టిపాటి బ్రహ్మయ్య అనటం, కార్యకర్తలు తలుపులు మూయటం, తిరిగి అప్పల నాయుడు చొక్కా చేతులు పైకి తీయటం ఒకదాని వెంట ఒకటి నాటకంలో సీనుల్లాగా జరిగాయి. లచ్చన్నకు అండగా, కుడి భుజంగా కిల్లి అప్పలనాయుడు అప్పుడే రాజకీయరంగంలో ప్రవేశించాడు. సమయం మించిపోతున్నదని గ్రహించిన పుల్లెల శ్యామసుందరరావు లచ్చన్నను బ్రతిమలాడి, సర్ది చెప్పి, గొట్టిపాటి బ్రహ్మయ్య చేత క్షమాపణ కోరించాడు. అంతేగాక ఎన్నికైన సంఘాన్ని గుర్తిస్తున్నట్లు కూడా ప్రకటించాడు బ్రహ్మయ్య. అప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. కిల్లి అప్పలనాయుడు చొక్కా సర్దుకున్నాడు. రాజకీయాల్లో లచ్చన్న పట్టుదల అలాంటిది. 1937 నుండి లచ్చన్న అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడుగా కాంగ్రెసు సమావేశాలకు వెళ్ళేవాడు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా 1938లో నెగ్గాడు. చారిత్రక రైతు యాత్ర శ్రీకాకుళం ప్రాంతంలోని రైతులు జమీందార్ల నిరంకుశ విధానాల వలన పడుతున్న కష్టాలు కాంగ్రెసు ప్రభుత్వం గమనించలేదు. కనుక వారి దృష్టికి యీ సమస్య తీసుకెళ్ళాలని జిల్లా నాయకులు నిశ్చయించారు. దీనికి రైతు యాత్ర నడపాలని తలపెట్టారు. జిల్లా కిసాన్ సంఘాధ్యక్షుడుగా పుల్లెల శ్యామసుందరరావు, రాష్ట్ర కిసాన్ సంఘాధ్యక్షుడుగా కె.ఎస్.ఎన్.మూర్తి, కార్యదర్శిగా సి.హెచ్.వి.రావు, రైతు రక్షణ సంఘ కార్యదర్శిగా లచ్చన్న రైతుల్ని సమీకరించారు. అదొక మహోన్నత ప్రయత్నం. ఇచ్ఛాపురంలో రైతు యాత్రను రంగా ప్రారంభించాడు. 1938 జూలై 13 నాడు కమ్యూనిస్టులుగా ఉన్న జొన్నలగడ్డ రామలింగయ్య, చుండి జగన్నాథ, చలసాని వాసుదేవరావులు ఆ యాత్రలో పాల్గొన్నారు. 45 రోజులపాటు కాలినడకన సాగిన యీ రైతు యాత్ర మద్రాసు చేరేలోగా 500 గ్రామాలు, నగరాలు చుట్టి, వెయ్యి మైళ్ళు నడిచి, త్రోవ పొడుగునా స్వాగతాలు అందుకున్నది. లచ్చన్న చివరి వరకూ ఉన్నాడు. చుండి జగన్నాథం తూర్పుగోదావరి జిల్లా వరకు వచ్చి మానేసాడు. విజయనగరం సమీపాన గల పూసపాటి రేగ అనే గ్రామంలో అంతా రాజుల మయం. వారు యీ యాత్రను ఆహ్వానించి ఆతిథ్యం యిచ్చారు. తరువాత జరిగిన సమావేశంలో జమీందార్లను విమర్శిస్తుంటే, రాజులుగా ఆ గ్రామస్తులు సహించలేక ఉద్రేకపడ్డారు. ఎవరిని విమర్శించినా సహిస్తాంగాని, విజయనగరం రాజాను మాట అంటే వూరుకోమన్నారు. అప్పుడు లచ్చన్న జోక్యం చేసుకుని, ఇది నా వ్యక్తిగత విమర్శ కాదని, నాటి విజయనగరం రాజా రైతుపట్ల సక్రమంగా ప్రవర్తించినా ఉత్తరోత్తరా వచ్చేవారు అలాగే ఉంటారనే హామీ ఏమిటని ప్రశ్నించాడు. అలా రైతులకు ఉపశమనం కలిగించాడు. త్రోవపొడవునా అమితోత్సాహంతో రైతు యాత్రను పురిగొల్పుతూ మందేశ్వరశర్మ అందించిన కిసాన్ సాహిత్యాన్ని పాడుకుంటూ, లచ్చన్న ప్రముఖపాత్ర వహించాడు. అప్పడప్పుడూ రంగావచ్చి రైతుల నుద్దేశించి ఉపన్యాసాలిచ్చి ప్రోత్సహించి వెళ్ళేవాడు. ట్రంక్ రోడ్డుపైనే గాక, సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా యాత్ర వెళ్ళివచ్చేది. ఈ విధంగా 27-8-1938న ఒక నివేదిక సమర్పించింది. ఆ మెమొరాండంలో 600 గ్రామాలపై రైతులిచ్చిన 110 పిటిషన్లు ప్రస్తావించారు. (చూడండి History of Kisan Movement by N.G. Ranga, Swami Sahajananda 1939 పుట.109. All India Kisan Publication 23, Stringer Street, Madras) ఆ మెమోరాండంలో 600 గ్రామాలపై రైతు లిచ్చిన 110 పిటిషన్లు ప్రస్తావించారు. తండ్రి మరణం 1938లో రెవిన్యూమంత్రి ప్రకాశం రైతుల కష్టాల్ని పరిశీలించటానికై ప్రభుత్వం నియమించిన వ్యవసాయ సంఘాధ్యక్షుడుగా శ్రీకాకుళం ప్రాంతం పర్యటించాడు. అప్పుడు రైతుల నుండి సాక్ష్యం యిప్పించటానికి లచ్చన్న జిల్లా అంతటా పర్యంటించాడు. అదే సమయంలో లచ్చన్న తండ్రి చిట్టయ్య చావు బ్రతుకుల మధ్య కుమారుని చూడాలని కలవరిస్తుంటే పుట్టెల శ్యామసుందరరావు వచ్చి, లచ్చన్నను కోపగించి, ఇంటికి తీసుకుని వెళ్లాడు. లచ్చన్న వివాహం నిమిత్తం రహస్యంగా దాచిన రెండువేల రూపాయల్ని, లచ్చన్న చేతుల్ని పుల్లెలవార్కి అప్పగించాడు. ఆరాత్రే చిట్టయ్య మరణించాడు. పంచాయతీ అధ్యక్షుడుగా 1938లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో లచ్చన్న బారువా పంచాయతీకి అధ్యక్షుడయ్యాడు. అతన్ని అనుచరుల్ని ఓడించాలని జమీందారీ వర్గం చేసిన ప్రయత్నం విఫలమైంది. వ్యవసాయ కార్మికులకు గృహవసతి కల్పించాలనే దృష్టితో బారువా పంచాయతీ అధ్యక్షుడుగా లచ్చన్న ఒక ఆదర్శకాలనీ కట్టించాడు. (చూడండి : Fight For Freedom by N.G.Ranga, page 211, S.Chand & Co., Delhi 1968) పంచాయతీ ధనం దుర్వినియోగ పరచినందుకు పదవి నుండి ఎందుకు తొలగించరాదో సంజాయిషీ చెప్పమని ప్రభుత్వం నోటీసు యిచ్చింది. లచ్చన్న చెప్పిన సంజాయిషీతో ఆ నోటీస్ ఉపసంహరించుకున్నాడు. 1938లోనూ 1939లోనూ అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షస్థానానికి సుభాష్ చంద్రబోసును బలపరచిన వారిలో లచ్చన్న ఒకడు. రంగాకూడా బోస్.కు అనుకూలంగా ఉండేవాడు. బోస్.ను బలపరచటం గాంధీకి వ్యతిరేకమని తెలిసినా లచ్చన్న తన ఓటు బోస్ కే వేశాడు. బోస్ తీవ్రవాదం ఆయనకు నచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడుగా బోస్ ఒకసారి విశాఖ నుండి మద్రాసు వరకు రైల్లో ప్రయాణం చేసినప్పుడు లచ్చన్న ఆయనతో కలసివెళ్ళి, బోస్ వలన ఉత్తేజితుడయ్యాడు. తెనాలి తాలూకా రైతు మహాసభ అధ్యక్షుడుగా లచ్చన్న తెనాలిలో ప్రసంగిస్తూ “ఇండియాకు సంపూర్ణ స్వరాజ్యం అంటే కార్మికుల రైతుల రాజ్యస్థాపన అన్నమాట” అని చాటాడు. 1938లో (చూడండి : ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి Freedom Struggle in Andhra, 4వ సంపుటి పుట 106 అచ్చులో ఉన్నది) 1938 ఏప్రిల్.లో సి.వి.కె.రావు ఆధ్వర్యాన కాకినాడలో జరిగిన పీచు కార్మికుల సమ్మెలో లచ్చన్న కూడా పాల్గొన్నాడు. (ఈ విషయం వాస్తవమని రచయితకు సి.వి.కె.రావు చెప్పారు.) మందసా - మహర్నాటకం దేశమంతటా కాంగ్రెసు మంత్రివర్గాలు ఏర్పడినప్పటికీ 1937 నుండి 39 వరకు వారి పాలనలో బ్రిటిష్ వారి ధోరణే కొనసాగటం కిసాన్ సభలకు కష్టమనిపించింది. ఆంధ్రలో రంగా నాయకత్వానగల కిసాన్ సభలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కాంగ్రెసువారూ ఉన్నారు. అందరూ కలసి ఉండటానికి ఎవరి కారణాలు వారివి, కాని కిసాన్ సభలను బలపరచటం, కాంగ్రెస్.కు ప్రత్యామ్నాయ సంస్థలుగా ప్రతిచోటా రూపొందించటం కాంగ్రెస్ నాయకులు సహించలేకపోయారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వేరే జండా, వేరే సంఘం ఎందుకని నెహ్రూ, పటేల్, గాంధీల ప్రశ్న. అదీగాక కిసాన్ సభలు హింసాధోరణిలో ఉన్నందున నిరసిస్తూ 1938 జనవరిలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ను ఆక్రమించటానికి తలపెట్టారని గాంధీ తన హరిజన పత్రికలో కిసాన్ సభ్యుల్ని విమర్శించాడు. (చూడండి – హరిజన్ 1938 ఏప్రిల్ 23) కిసాన్ సభల్లో కాంగ్రెస్ వాదులు జోక్యం చేసుకోగూడదంటూ 1938లో హరిపురా కాంగ్రెస్ తీర్మానించింది. కిసాన్ సభలు ప్రత్యేకంగా ఉంటూనే కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండాలని ఫైజ్ పూర్ కాంగ్రెసులో కమ్యూనిస్టులు, సోషలిస్టులు తీర్మానాలు పెట్టారు. కాంగ్రెసు వాదులు, రాడికల్స్ దీనిని వ్యతిరేకించారు. కాంగ్రెసు ధోరణి ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రలో రంగా, ఆయన అనుయాయులు కిసాన్ సభలలో ఉంటూ, ఉద్యమాల్ని సాగించారు. హరిపురా కాంగ్రెస్ కు రైతుల ఊరేగింపును తీసుకెళితే, పటేల్ వెక్కిరించాడు. అందులో లచ్చన్న కూడా ఉన్నాడు. పలాసా రైతు సభ అఖిల భారత కిసాన్ మహాసభ పలాసాలో జరపాలని నిశ్చయించి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. కార్యదర్శిగా లచ్చన్న ఉన్నారు. లచ్చన్న జిల్లా స్థాయివరకు కమ్యూనిస్టు వ్యతిరేకి – సిద్దాంత రీత్యానూ. అయితే రంగా వలన కిసాన్ సభలో కమ్యూనిస్టులతో కలసి పనిచేయక తప్పలేదు. కాని పలాసా సభ రంగాకు ఆయన అనుచరులకు కనువిప్పు అయింది. సభను ప్రారంభించమని రాహుల్ సాంకృత్యాయన్.ను ఆహ్వానించగా కారణాంతరాల వల్ల ఆయన రాలేదు. సమావేశాలను చెడగొట్టాలన్న జమీందార్ల ప్రయత్నం సఫలం కాలేదు. కాని సమావేశంలో రంగా వర్గానికి కమ్యూనిస్టులకు పోటీ జరిగింది. అన్నిటా రంగా వర్గమే నెగ్గింది. అప్పటి నుంచీ కమ్యూనిస్టులకు దూరం కావటం ఆరంభమైంది. కాని వెంటనే జరిగిన అరెస్టుల వలన కమ్యూనిస్టులకే సదవకాశం లభించి ఆంధ్రలో కిసాన్ సభ వారి వశమైంది. పలాసా సభ అనంతరం జరిగిన గొడవలే అసలు పేర్కొన దగినవి. మందసా సభలో ప్రేరేపితులైన రైతులు గిరిజనులు జమీందార్లపై తిరగబడ్డారు. మందసా వద్ద గిరిజనులు పుల్లలకై అడవికొట్టారు. అటవీ శాఖాధికారులు అటకాయించినా లెక్క చెయ్యలేదు. కొందరిని అరెస్టుచేసి తీసుకు పోతుంటే, ఈ వార్త గ్రామాల్లో పొక్కి మగవారిని చంపేస్తున్నారనే వదంతిగా మారింది ఆడవాళ్ళంతా తెగించి పోలీసులకు అడ్డుపడ్డారు. అందులో గున్నమ్మ అనే స్త్రీ పోలీసులను బాగా తిట్టింది. పరిస్థితి విషమించగా పోలీసు కాల్పులు జరిపారు. గున్నమ్మతో సహా 5గురు చనిపోయారు. శవాల్ని బంధువులకు అప్పగించకుండా పోలీసులు తీసుకెళ్లారు. ఇదంతా జరుగుతున్నప్పుడు లచ్చన్న శ్రీకాకుళంలో ఉన్నారు. ఈ సంఘటన విని పుల్లెల శ్యామసుందరరావు, లచ్చన్న మందసా వచ్చారు. అప్పటికే ఆనాటి కలెక్టర్ గా ఉంటున్న భారతీయుడు చక్రవర్తి రిజర్వ్ పోలీసును పిలిపించాడు. వారు ఊళ్ళమీదబడి కనిపించిన మగవారినందరినీ బాదటం ప్రారంభించారు. ఫలితంగా పురుషులంతా పగలు అడవుల్లో దాక్కొన్నారు. స్త్రీలు భీతావహులై బ్రతికారు. లచ్చన్న రంగంలోకి దిగి మందసా కాల్పులు బాధితుల రక్షణ సంఘం స్థాపించాడు. కారణం తెలియదు కాని, పోలీసులు లచ్చన్న జోలికిపోలేదు. పుల్లెల శ్యామసుందరరావును నిర్బంధించారు. లచ్చన్న మాత్రం 14 గ్రామాల్లో దళాల్ని ఏర్పరచి, రాత్రిళ్లు గస్తీలు తిరిగే ఏర్పాట్లు చేశాడు. ఒక్క నెలలో 300 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఒక్క కేసూ పెట్టలేదు. పరిస్థితి యిలాగే కొనసాగనిస్తే మరి చెయిజారిపోతుందని కాబోలు లచ్చన్న కొత్త పన్నాగం పన్నాడు. పుచ్చపాడు గ్రామంలో పారమ్మ అనే యువతిని పోలీసు చెరచారంటూ ఒక కట్టు కథను సాక్ష్యాధారాలతో జాగ్రత్తగా అల్లి, గవర్నరుకు, అధికారులకు, కాంగ్రెసు నాయకులకు తంతులు పంపాడు. “హిందు” దినపత్రిక వెంటనే ప్రత్యేక ప్రతినిధిని పంపించింది. వడ్డె విశ్వనాథం అనే వ్యక్తిచేత యిదంతా కట్టుకథ అని లచ్చన్న ప్రత్యర్థులు ప్రకటన చేయించారు. కళా వెంకటరావు ఆ ప్రాంతం వచ్చి పుచ్చపాడు సందర్శించగానే, రైతు సంఘం ప్రోత్సహించినదనీ లచ్చన్న రెచ్చగొట్టాడనీ, అంతకుమించి ఏమీలేదనీ ప్రకటించాడు. అన్ని కట్టుదిట్టాలు చేసి ఉంచిన లచ్చన్న వీటన్నిటీ ఖండిస్తూ, బహిరంగ విచారణ చేయమని సవాల్ చేశాడు. ఆ ప్రకారం ఒక సంఘాన్ని కాంగ్రెసు నియమించింది. పోలీసు కాల్పుల్ని ఖండిస్తూ ఆ సంఘం తీర్మానించింది. (చూడండి “ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర” ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య 4వ సంపుటి పుట 128 అచ్చులో) ఈ విచారణ జరిపింది అయ్యదేవర కాళేశ్వరరావు, మాగంటి బాపినీడుగారలు. విచారణలో లచ్చన్నకు అనుకూలంగా రైతులు సాక్ష్యం చెప్పారు. వారికి ఊర్లన్నీ తిప్పి చూపారు. అలాగే టంగుటూరు ప్రకాశం వచ్చి చూచి పోలీసు కాల్పుల్ని ఖండించాడు. కానీ అయ్యదేవర సంఘం పెయ్యనాకుడు తీర్పు చెప్పి, తామరాకుపై నీటిబొట్టువలె తప్పించుకున్నారు. ఏమైతేనేమి లచ్చన్న చేసిన యీ గొడవలో ప్రభుత్వం రిజర్వ్ పోలీసును ఉపసంహరించింది. రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సంతోషించారు. నెలరోజుల భీభత్స వాతావరణం సద్దు మణిగింది. అయితే పారమ్మ అనే స్త్రీ ఉండటం వాస్తవం. అంతకు మించి ఏమీ జరగలేదు. దీని ఫలితంగా లచ్చన్నపై ప్రభుత్వం ఆంక్ష పెట్టింది. బారువా దాటి ఎటూ కదలటానికి వీల్లేదన్నది. ఇంతలో పుల్లెల శ్యామసుందరరావు పోలీసు నిర్బంధంలో చనిపోయాడనే వార్త లచ్చన్నకు పిడుగు పడ్డట్టుగా చేరింది. తనపై గల ఆంక్ష మరచి తక్షణమే బయలుదేరి బస్సులో ఇచ్ఛాపురానికి వెడుతుంటే, సోంపేటలో తాసీల్దార్ పోలీస్ అధికారులు అడ్డుపడ్డారు. వారిరువురకూగల అవినాభావ సంబంధం, ఆప్యాయతలు వారికి తెలిసినా, ప్రభుత్వ కఠోర ఆంక్షలు పాటించక తప్పదన్నారు. చివరకు అధికారుల ఉద్యోగాల రక్షణ దృష్ట్యా ఆ ప్రయాణం విరమించమని బ్రతిమలాడారు. ప్రత్యేక అనుమతి యిచ్చేందుకు కలెక్టర్ నిరాకరించాడు. ఆ విధంగా లచ్చన్నకు ప్రియతమ నాయకుడు స్నేహితుడు, ఆప్తుడు పుల్లెలను ఆఖరిసారిగా చూడలేకపోయాడు. బారువాకు తిరోగమించాడు. బారువాకు వెళ్ళేసరికి లచ్చన్నకు మరొక వార్త అందింది. అతి త్వరలో లచ్చన్నను అరెస్ట్ చేయవలసిందిగా కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశాడని, ఏ క్షణానైనా అరెస్టు జరగవచ్చని, కలెక్టర్ కేంప్ క్లర్క్ వెల్లడించాడు. ఆ వార్త రాగానే లచ్చన్న తన ఆంతరంగికులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి సంప్రదించాడు. మందసా రైతులకోసం కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండమని వారంతా సలహా యిచ్చారు. ఇంకా మందసా రైతులపై ఆనేక కేసులు పెట్టినవి అలాగే ఉన్నవి. కనుక వారి రక్షణ నిమిత్తం వెంటనే సామాను సర్దుకుని సోంపేట మీదుగా బరంపురం వెళ్లాడు లచ్చన్న. ఆయన వెళ్లిన రాత్రికే పోలీసులు అరెస్టు వారెంట్ తో వచ్చి లచ్చన్న లాడ్జిని సోదాచేసి దొరకనందున లచ్చన్న ప్రయాణం చేసిన గుర్రపుబండి యజమానిని పట్టుకున్నారు. లచ్చన్నపై నిఘా పెట్టిన వ్యక్తిని సస్పెండ్ చేసారు. అండర్ గ్రౌండ్ లో లచ్చన్న హౌరా వెళ్ళి, మళ్ళీ నాగపూర్ మీదుగా కర్నూలు చేరుకున్నాడు. కందుల ఓబుల రెడ్డి సహాయంతో గాడిదమడుగు అనబడే నేటి గార్గేయపురంచేరి, చిన శివారెడ్డి మేనల్లుడు రంగా రెడ్డి యింట్లో ఒకమాసం రోజులపాటు ఉన్నాడు. ఆ పిమ్మట నంద్యాల చెంత భీమవరంలో కొన్నాళ్ళు మకాం, ఏనుగు తొండం ఎక్కడున్నా వూరుకోదన్నట్లు, నంద్యాల రామిరెడ్డితో కలసి రాజకీయ శిబిరం నిర్వహిస్తుంటే పోలీసులు నిఘావేసి రామిరెడ్డి యిల్లు సోదాచేశారు. అంతటితో గుర్రపు బండికి తెరలుగట్టి ఘోషా స్త్రీగా బయటివారిని భ్రమింపచేసే రీతిగా వెళ్ళి, ఓబుల రెడ్డి అత్తగారింట నాలుగైదు రోజులున్నాడు. పోలీస్ నిఘా ప్రారంభమైన తర్వాత ఒకచోట ఉండటం ఉన్నవారికీ – అండనిచ్చిన వారికి కష్టమేగదా, కనుక లచ్చన్న మళ్లీ బయలుదేరి కడపలో ఆదినారాయణ రెడ్డిగారింట మోడుపల్లిలో కె. రంగారెడ్డి వద్ద కొన్నాళ్ళు తలదాచుకున్నాడు. తరువాత దగ్గుబాడులో నివాసం పెట్టాడు. అది కేంద్రంగా చేసుకొని చుట్టుప్రక్క గ్రామాలు తిరిగి కొంత రాజకీయం నడిపారు. ఆ కృషిలో బాచిన సుబ్బారావు, పుల్లెల రత్తయ్య, కొసరాజు అమ్మయ్య, గోగినేని లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా వదలి చిత్తూరు చేరి టీసదనం గ్రామంలో రాజకీయ పాఠశాల నిర్వహించారు. అప్పటికి వ్యక్తి సత్యాగ్రహం చేయమని గాంధీ పిలుపు యిచ్చాడు. కాంగ్రెసు ఆమోదించింది. (1940 సెప్టెంబర్) లచ్చన్నకు యిది నచ్చలేదు. అలాగే దేశంలో వామపక్షాల వారు కూడా యిందులో పాల్గొనలేదు. కాని కొన్నాళ్ళైన తర్వాత చిత్తూరు జిల్లాలో వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని లచ్చన్న కూడా ప్రోత్సహించాడు. లచ్చన్న యిలా కాందిశీకుడుగా తిరుగుతున్నప్పటికీ జిల్లాతో సంబంధాలు తెంచుకోలేదు. ఎప్పటికప్పుడు పరిణామాలు తెలుసుకునే ఏర్పాట్లు గావించే వచ్చారు. అంతవరకూ లచ్చన్న ప్రచ్ఛన్నంగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాడని భ్రమించిన పోలీసులు ఆ ఆశను అడియాస చేసుకున్నారు. జిల్లాలో లేడని రూఢిగా పోలీస్ అనుకున్నప్పుడు లచ్చన్న మళ్ళీ శ్రీకాకుళంలో అడుగుపెట్టారు. వచ్చీ రావటంతోనే రైతులకు డిఫెన్సు ఏర్పాట్లు చేశాడు. మందసా కాల్పుల కేసులో చివరికి 21 మందికి ఒక సంవత్సరం పాటు శిక్ష పడటంతో, కేసు తేలికగా పోయింది. దీనికి చాలా వరకు కలెక్టర్ చక్రవర్తి యిచ్చిన సాక్ష్యమే కారణమని లచ్చన్న భావించారు. లచ్చన్నకు మాత్రం ప్రవాస జీవితం తప్పలేదు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా నినాదం రాగానే అదే అదనుగా భావించి లచ్చన్న విజృంభించాడు. అంతకుముందే జిల్లా అంతా పట్టుకోవటానికి పథకాలు వేశాడు. అడవుల్లో వుంటూ, తోటాలు, రైఫిళ్ళు, సిల్లకోలలు తయారు చేయాలని, ఒకేసారి జిల్లా అంతటా అన్ని కార్యాలయాలు ఆక్రమించి, రాకపోకలు స్తంభింప చేయాలని ఎత్తులు వేశాడు. దీనికిగాను కొబ్బరితోటల్లో అనేక సమావేశాలు జరిపాడు. ఇదంతా మండపల్లి గ్రామం చెంత జరిగిన వ్యవహారం దీనికితోడు క్విట్ ఇండియా పిలుపు రాగానే, లచ్చన్నకు కలిసి వచ్చినట్లయింది. బారువా దగ్గర ఒక గూడ్సుబండి పట్టాలు తప్పించారు. కళింగ పట్నంలో ఒక పోస్టాఫీసును దోపిడీ చేశారు. ఈ హడావుడిలో ఒకనాడు సోంపేట పొలిమేరల్లో కాలు బెణుకగా నడవలేని స్థితిలో సిందిర రామస్వామి గారింట్లో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ క్షేమకరం కాదని మదనాపురంలో రాజారావుగారింట 10 రోజులపాటు విశ్రాంతి గైకొన్నాడు. ఒకనాటి రాత్రి మందపల్లి గ్రామంలో పోతూవుంటే దూరాన వస్తున్న సెంట్రీని చూసి, పారిపోతూ, ఊరి వెలుపల అడ్డొచ్చిన పంటకాలువ దూకాడు. రహస్య జీవితం – కడలూరు జైలు అక్కడ వెంపలి దుంప కాలును 4 అంగుళాలు చీరేసింది. గత్యంతరం లేక సమీపంలో ఒక దేవాలయపు గర్భగుడిలో తలదాచుకొని, రాత్రికి రాత్రే బండిలో బార్లపూడి గ్రామానికి వెళ్ళి బార్లపూడి జగన్నాథంగారింట పడమటి చీకటిగదిలో 45 రోజులున్నాడు. ఆ జంట స్త్రీలు నిర్విరామంగా లచ్చన్నకు సేవలు చేశారు. కాలు తగ్గినట్లే ఉన్న కొంచెం నడిస్తే మళ్ళీ కలక బారటంతో, కొజ్జరియ గ్రామం వెళ్ళి ఒక నాటువైద్యుని చికిత్సలో ఉపశమనం పొందాడు. అక్కడు నుండి ఖర్గపూర్ వెళ్ళి రైల్వే హాస్పిటల్లో ఎక్స్.రే తీయించుకొని అంతా బాగున్నట్లు ఖాయపడిన అనంతరం కలకత్తా వెళ్ళారు. కలకత్తాలో అప్పుడే దత్తు ముజుందార్ నాయకత్వాన బోల్షివిక్ పార్టీ ప్రారంభమైంది. ఉత్తరోత్తరా అతను పశ్చిమ బెంగాల్ కు కార్మిక మంత్రిగా పనిచేశాడు కూడా. లచ్చన్న వారి రక్షణ పొందటమే గాక, వారి అధ్యయన శిబిరంలో పాల్గొని, ఒకపక్షం రోజులపాటు మార్క్సిజం చదివాడు. తరువాత ఒకనాడు కలకత్తాలో తిరుగుతూ ట్రాంలో ఎవరో, జేబు కొట్టేయగా, ఎలాగో తిప్పలు పడి స్వస్థలానికి తిరిగొచ్చాడు. లచ్చన్నకు శ్రీకాకుళం జిల్లాలో ఆనాడు కుడిభుజంగా మెలగిన వ్యక్తి కిల్లి అప్పలనాయుడు. అతనిది పురుషోత్తమ పురం. లచ్చన్న రావటంతోనే వేసవి పాఠశాల నడపాలని తలపెట్టి ప్రకటించాడు. కాని పోలీస్ లు ఒకనాడు హఠాత్తుగా దాడి చేయటంతో ఆ ప్రయత్నం విరమించుకోవలసి వచ్చింది. పారిపోయి ఏటి అవతల జీడితోటల్లో దాక్కొని, తలదాచుకున్నారు. అలాగే రహస్య జీవితం గడుపుతూ గొగ్గిలి, గుల్లలపాడు, మదనాపురం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసారు. వీటన్నిటికీ కిల్లి అప్పల నాయుడు ఎంతగానో తోడ్పడ్డాడు. పిమ్మట కళింగపట్నంలో కప్పగంతుల సుబ్బారావు తండ్రిగారింటిలో సిల్లపేట సిర్లా రాజుల రెడ్డి ఇంటిలో కొన్నాళ్ళు గడిపాడు. లచ్చన్నతోపాటు కిల్లి అప్పలనాయుడు కూడా వచ్చి ప్రచ్ఛన్న వేషంలో చేరాడు. రాజుల రెడ్డి క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టుగావటంతో లచ్చన్న మళ్ళీ రాష్ట్రం వదలి ఈసారి బెంగుళూరు చేరాడు. అక్కడ బసవన్న గుడియం అనే పేటలో ఒక సర్కిల్ ఇన్సెపెక్టర్ ఇంట్లోనే, తెలియకుండా అద్దెకుంటూ, సుబ్బారాయలు అనే స్నేహితునితో కలసి “రణభేరి” పేరిట 8 పుటల పత్రికను 3 మాసాలపాటు రహస్యంగా సైక్లోస్టైల్ చేసి, జిల్లాకు పంపించాడు. ఆవిధంగా జర్నలిజంతో కించిత్తు పరిచయమైంది. మళ్లీ జిల్లాకు తిరిగొచ్చి లుకలాపు లక్ష్మణదాసు ఊళ్ళో మీటింగులు పెట్టాడు. లచ్చన్నను మద్రాసు రమ్మని సంపత్కుమార్ పంపిన ఆహ్వానాన్ని జయంతి ధర్మతేజ తెచ్చియిచ్చాడు. అప్పటికి లచ్చన్న సర్వోదయ కార్యకర్త అయిన మల్లిపెద్ది కృష్ణదాసు సహాయంతో ఒక కేంద్రం నిర్వహిస్తున్నాడు. సంపత్కుమార్ ఆహ్వానం ప్రకారం లచ్చన్న, కిల్లి అప్పల నాయుడు మద్రాసు ప్రయాణమయ్యారు. విజయనగరం మీదుగా జామ అనే గ్రామం చేరేసరికి, లచ్చన్నను ఒక కమ్యూనిస్టు ఒక సర్వోదయ కార్యకర్త అనుచరులుగా అనుసరించి ఉన్నారు. వారికి తప్ప లచ్చన్న ప్రయాణం మరవరికీ తెలియదు కాని పోలీస్ కు తెలిసింది. ఎలా తెలిసింది అని ప్రశ్నించటం అవసరం. అనకాపల్లి చేరిన లచ్చన్న పగలంతా ధర్మతేజ సోదరి గృహంలో ఉన్నాడు. రాత్రికి మెయిల్ కు వెళ్ళాలని ప్రయత్నం. సొంతగా టికెట్ కొనుక్కుని బండెక్కే లచ్చన్న ఆవేళ అనుచరులు చెప్పినట్లు విని, ప్లాట్ ఫారం చివరి చెట్లు క్రింద కూర్చున్నాడు. టికెట్ కొనితెచ్చి యిచ్చిన అనుచరులు బండెక్కించి, వీడ్కోలు చెప్పారు. అనుచరులు వెళ్ళిపోయారుగాని, లచ్చన్న కిల్లి అప్పలనాయుడుతోపాటు మరో యిరువురు ప్రచ్ఛన్న వేషంలో ఎక్కటం లచ్చన్న పసిగట్టాడు. కిల్లి అప్పలనాయుడు నిశ్చింతగా నిద్రపోయాడు. మూడవ తరగతి ఇరుకుపెట్టెలో, ఒకటి రెండు పర్యాయాలు లచ్చన్న బండిదూకి పారిపోయే ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నాడు. రాజమండ్రిలో తెల్లారేసరికి బండి దిగి, ముందే చేసిన ఏర్పాట్ల ప్రకారం చౌదరి సత్యనారాయణ సోదరుని లాడ్జికి వెళ్ళారు. అది మంగళవారపు పేటలో ఉన్నది. లచ్చన్న కాలకృత్యాలు తీర్చుకునే లోపుగా రిజర్వ్ పోలీస్ లాడ్జిని చుట్టుముట్టింది. మీరెవరని వచ్చిన యిన్స్పెక్టర్ ప్రశ్నిస్తే, “మాది గోపాలపురం. మామిడి మొక్కలు కొనుగోలుపై వచ్చాము” అని లచ్చన్న తడుముకోకుండా చెప్పాడు. కాని వెంటఉన్న జూనియర్ సబ్ ఇన్స్పెక్టర్ లచ్చన్నతోపాటుగా చదువుకున్న వాడు గావటంతో వచ్చింది చిక్కు. “ఎందుకండీ లచ్చన్నగారూ అబద్దాలాడతారు” అన్నాడు. “అయితే తెలిస్తే అడగటం దేని”కని లచ్చన్న అనడం అరెస్టు జరిగిపోయాయి. నాడు రాజమండ్రిలో డి.వి.సుబ్బారావు సరి రౌడీలకు, దొంగలకు హడల్. యడవల్లి సూర్యనారాయణ అల్లుడతను. లాకప్.లో ఉండగనే చావమోదేవాడట. లచ్చన్నకు కూడా అదితప్పదన్నాడు. కాని అతను అలాంటిదేమీ చేయకపోవటం అందరినీ ఆశ్చర్యమనిపించింది. పోలీస్.లు కూడా రాత్రి ఘర్షణ పడ్డారు. తెల్లారేసరికి సబ్ జైలు నుండి లచ్చన్నను సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటికే రాజమండ్రి అంతటా లచ్చన్న అరెస్టయిన విషయం పొక్కటమే యిందుకు కారణం. మరునాడు లచ్చన్నను కోర్టులో హాజరుపరచాలేగాని, సాయంత్రం 5 గంటల వరకూ పోలీస్ అధికారులెవరూ రాలేదు. కోర్టులో నాలుగైదుమార్లు పిలిచి, మాజిస్ట్రేట్ కూడా విసుగెత్తి, చివరకు కోర్టు అయిన తర్వార చాంబర్.లోకి పిలిచాడు. అంతకుముందే అనుకున్న ప్రకారం లచ్చన్న కథ అల్లి, క్షత్రపురం వద్ద గోపాల పుర వాసులమనీ, తమలపాకుల బేరానికి వచ్చామని చెప్పాడు. వారిని వదిలేయమని మాజిస్ట్రేట్ చెప్పాడు. కాని కోర్టు గుమాస్తా ఎందుకైనా మంచిదని మరోసారి పోలీస్ స్టేషనుకు ఫోను చేసాడు. అప్పుడు డి.వి. సుబ్బారావు అందుకుని లచ్చన్న కథనానికి ఆశ్చర్యపడి, హుటాహుటిన వచ్చి అసలు విషయం వెల్లడించాడు. మాజిస్ట్రేట్ దిగ్భ్రమ చెంది, “కొంపదీశావు కదా లచ్చన్నా! నా ఉద్యోగం ఊడబీకేయించేవాడివే” అని శిక్ష వేశాడు. కిల్లి అప్పలనాయుడును డిటున్యూగా కడలూరుకు పంపారు. లచ్చన్నను “సి” తరగతి ఖైదీగా సంవత్సరం శిక్షవేసి, అల్లీపురం జైలుకు పంపారు. జైలులో కూడా విప్లవ కార్యక్రమాలు అల్లీపురం జైలులో పెద్ద పెద్ద హాలులు ఉండేవి. నాడు తలల లెక్క తప్ప ముఖాలు గుర్తుపట్టటంలేదు. ఒక్కొక్క హాలులో ఒక్కో ముఠాను అట్టిపెట్టారు. లచ్చన్న జైలులో వావివాల గోపాల కృష్ణయ్య, సి.వి.కె.రావు, ఎ.వి.నాగేశ్వరరావు, సూర్యప్రకాశరావు, పోలవరపు శ్రీహరిరావు, వెలగా రామకోటేశ్వరరావు (హిందీ పండిట్) ఇత్యాదులెందరో ఉండేవారు. బ్రాహ్మణ అబ్రాహ్మణ విచక్షణ ఖైదీలకు ఉండేది. ఎ.బి.నాగేశ్వరరావు ఖైదీలకు చక్కని సేవలు చేసేవాడు. కమ్యూనిస్టు, కమ్యూనిస్టేతర ద్వేషాలు తీవ్రంగా ఉన్న రోజులవి. కమ్యూనిస్టు వ్యతిరేకిగా లచ్చన్న జైలులో ప్రచారం చేశాడు. కొన్నాళ్ళకొక హాలు చొప్పున స్థానం మార్చి, తను ఉండవలసిన చోట మరొకరిని పెడుతూ ఆస్థానంలో ప్రవేశించి ప్రచారం చేసేవాడు. ఈ పరకాయ ప్రవేశం నిశాచరుడుగా చేశాడు. జైలు వార్డన్ల ద్వారా బయటి నుండి దివపత్రికలు తెప్పించి, చదివి నోట్సు వ్రాసుకుని, రాత్రిళ్ళు, ఖైదీలకు చెబుతుండేవాడు. లచ్చన్న, ఆ అధ్యయన విధానంలో కమ్యూనిస్టు వ్యతిరేకత తీవ్రస్థాయి చేరుకొనగా, కలహాలు రగిలి, తలలు పగిలేవరకూ పోయింది. విడుదలై బయటపడుతుతున్న కొందరు బళ్ళారి ఖైదీలతో లచ్చన్న రహస్యంగా మంతనాలు సాగించాడు. మరోవారం రోజులకు విడుదల కావలసిన లచ్చన్నను కన్ననూరు జైలుకు తరలిస్తారని పసిగట్టాడు. రైల్లో పోయేటప్పుడు, విడుదలైన ఖైదీల సహాయంతో బళ్ళారి వద్ద తప్పించుకోవాలని లచ్చన్న ఉద్దేశ్యం. విడుదల అయిన ఖైదీలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోనందున కన్ననూరు జైలు లచ్చన్నకు తప్పింది కాదు. అక్కడ డాక్టర్ పి. తిరుమలరావు, సూర్యప్రకాశరావు, ఒక తెలుగు కమ్యూనిస్టు కూడా ఉన్నారు. లచ్చన్నకు చక్కని వాతావరణమనిపించింది. తాత్కాలికంగా రాజకీయాలకు స్వస్తి చెప్పి కలహాలకు సమస్యలు లేనందున, ఆనవాలు కసరత్తులు చేస్తూ కాలక్షేపం చేశాడు. అక్కడ నుండి లచ్చన్నను తంజావూరు జైలుకు మార్చారు. కథ రక్తిగట్టింది. లచ్చన్న వెళ్ళేసరికి రంగం సిద్ధమై ఉన్నది. తంజావూరు జైల్లో రంగా, కల్లూరి చంద్రమౌళి, కాసు బ్రహ్మానందరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య, బాచిన సుబ్బారావు, గొల్లపూడి (స్వామి సీతారాం) కిల్లి అప్పలనాయుడు, నేతి చలపతి, దండు నారాయణ రాజు, మంతెన వెంకటరాజు, మొదలైన వారెందరో ఉన్నారు. ఖైదీల పక్షాన జైలు అధికార్లతో మాట్లాడటానికి కొన్నాళ్ళు దండు నారాయణరాజు, పిమ్మట బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. మేయర్ అని అతన్ని పిలిచేవారు, (చూడండి కపిల కాశీపతిగారి “బ్రహ్మానంద యాత్ర” 1970 మేలో హైదరాబాద్ నుండి ప్రచురణ పుట 156). లచ్చన్న ప్రవేశించేనాటికి తంజావూరు జైలులో ఆంధ్ర, తమిళ, కేరళ ఖైదీల మధ్య వైషమ్యాలు ఉన్నవి. ఇందులో మళ్ళీ శాఖాహార మాంసారుల మధ్య గొడవలు ఉండేవి. అదిగాక స్వామి సీతారాం అపక్వాహార ముఠా ఉండేది. వంటదగ్గరే అసలు రాజకీయం నడిచేది. రంగా ఉదయం, సాయంత్రం రాజకీయ శిబిరాల వంటివి పెట్టి, పాఠాలు చెబుతుండేవాడు. వంటకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా ఉన్నా అవి పైకి రానిచ్చేవాడు కాదు. అధికార రాజకీయాలకు దూరంగా ఉండాలని చెబుతుండేవాడు. అప్పటికి రెండు పర్యాయాలు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షపదవికి ప్రయత్నించి ఓటమి చెందటం, భారతీదేవిని గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షురాలుగా చేసే ప్రయత్నం ఫలించక పోవటం, జిల్లా బోర్డు సభ్యుడుగా తాను గెలవక పోవటంతో, రంగా నిరుత్సాహ పడడం సహజం. అందువలన సిద్ధాంతపరంగానే ఉండేవాడు. ఆయన అనుచరులకు యిది ఆట్టే గిట్టేది కాదు. అలాంటి సమయంలో లచ్చన్న రాగా బాచిన సుబ్బారావు మొదలైన రంగా అనుచరులు పంటకు సంబంధించిన ఫిర్యాదులు, రంగా నిర్లిప్తత ఆయనకు ఏకరువు పెట్టారు. మాంసాహార వంటకు పెత్తనం మంతెన వెంకటరాజు నిర్వహిస్తుండేవాడు. తల ఒక్కింటికి రోజుకు రూపాయి ముప్పావలా ఖైదీకి ఇచ్చేవారు. అందులో వంట యాజమాన్యం చేసేవారు. జైలు అధికారులు వాటాలు పంచుకునేవారు. ఖైదీలకు ఏమీ డబ్బు రూపేణా మిగిల్చి ఇచ్చేవారు కాదు. మంతెన వెంకట రాజు ఇలా మిగిల్చిన డబ్బు పెట్టి చాలా గ్రంథాలు కొనుక్కున్నాడని ఒక కాంగ్రెస్ పెద్దమనిషి చెప్పాడు. ఈ విషయం వ్రాస్తే మాత్రం తాను సాక్ష్యం చెప్పనన్నాడు. కాంగ్రెస్ నీతి అలాంటిది. పైగా వెంకటరాజు చేసినపని చెడ్డదే అయినా పుస్తకాలు కొనుక్కున్నాడు గనుక ఫరవాలేదని ఆయనతృప్తి, మంతెన వెంకటరాజు ఆధ్వర్యాన శాకపాకాలు కొందరిగదుల్లోకి ప్రత్యేకంగా టిఫిన్ కారియర్.లో వెళ్ళేవి. కల్లూరి అందరితోపాటు ఆయన పంక్తి భోజనం చేసే వాడుకాదు. ఇలాంటి సౌకర్యాలు చేసినందుకు మంతెన వెంకటరాజు వారికి మంచి వాడయ్యాడు. శ్రీకాకుళం జిల్లా వంతు వచ్చిననాడు లచ్చన్న పెత్తనం స్వీకరించాడు. వంటదగ్గరే కుర్చీ వేసుకు కూర్చున్నాడు. యథా ప్రకారం ఆనాడు వెంకట్రాజుగారి నుండి ఒక ఖైదీ వచ్చి 40 పాయింట్లు పాలు తెమ్మన్నారంటూ వచ్చాడు. లచ్చన్న నిరాకరించాడు. గొట్టిపాటి బ్రహ్మయ్య రాయబారం చేయబోయి, మంతెన వెంకటరాజును వెనకేసుకొచ్చి, తెచ్చిన అప్పు తీర్చాలిగదా అన్నాడు. ఎవరి హయాంలో అప్పు చేశారో వారే తీర్చమన్నాడు లచ్చన్న. కథ మలుపు తిరిగింది. భోజనాలు ఎవరికీ పంపేది లేదు. అందరూ పంక్తిలోకి రావాల్సిందే అన్నాడు లచ్చన్న. ఇదిమరీ దుర్భరమైంది కొందరికి. వారంతా మంతెన వెంకటరాజును సమర్థిస్తూ భోజనాలవద్ద చిన్న ఉపన్యాసం చేశారు. వారిలో చింతమనేని రామయ్య చావలి సూర్యనారాయణ కల్లూరి చంద్రమౌళి, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధానంగా పేర్కొనదగినవారు. ఇలాగైతే తానూ యాజమాన్యం చేయనని రాజీనామా ఇచ్చాడు మంతెన వెంకటరాజు. ఆయన దొంగ అనుకున్నారా అని ఒకరు ఆగ్రహించారు. లచ్చన్న మాత్రం చలించక, ఇన్నాళ్లూ సేవచేసి ఆరోగ్యం పాడుచేసుకున్న మంతెన వెంకటరాజు రాజీనామా ఆమోదించమన్నాడు. అందులోని వ్యంగ్యం గ్రహించిన ఒకరు శ్రీకాకుళం ముఠా రౌడీలని దూషించగా, కిల్లి అప్పల నాయుడు చొక్కా చేతులు మడిచాడు. అంతటితో అలిగి వారంతా తమ గదులకు పోయి విడిగా వంట ఆరంభించించారు. అప్పటినుండీ ఖైదీలందరూ పుష్కలంగా తినగా, ఒక్కొక్కరికీ రోజుకు ఆరణాలు మిగిలేవి. తంజావూరు జైల్లోనూ మిగిలిన చోట్లా చాలామంది కాంగ్రెస్ ఖైదీలు ఆశలు వదులుకున్న బాపతే, దేశానికి స్వాతంత్ర్యం రావటం కల్ల అని ఎలాగైనా బయటపడాలని కక్కుర్తిపడి, ఏదో మిషపెట్టి, పెరోల్.పై బయటపడ్డారు. లచ్చన్న మాత్రం ఆపని చేయక, చివరివరకూ ఉన్నారు. అందరికంటె ఆఖరున విడుదలయిన వారిలో లచ్చన్న ఒకడు. రాష్ట్ర కాంగ్రెసులో రంగా శకం అందరూ విడుదలైనప్పటికీ లచ్చన్నను తంజావూరు నుండి రాయవెల్లూరు జైలుకు తరలించి అక్కడ స్త్రీలవార్డులో ఉంచారు. అప్పటికీ కళా వెంకటరావు కూడా ఉన్నారు. లచ్చన్న జాతకం కూడా వ్రాశాడు జైల్లో. గాంధీ-వేవెల్ ఒడంబడిక జరిగిన అనంతరం లచ్చన్నను విడుదల చేశారు. ఆనవాయితీ ప్రకారం నిడుబ్రోలులో రంగా దర్శనం చేసుకొని శ్రీకాకుళం వెళ్ళేసరికి, తలవని తలంపుగా జిల్లా అంతటా లచ్చన్నకు సన్మానాలు జరిగాయి. ఆ సభల్లో ప్రజలు లచ్చన్నను “సర్దార్” అని నినాదాల ద్వారా పిలుచుకున్నారు. ఆ విధంగా ప్రజలిచ్చిన సర్దార్ పేరుతో కలిసిపోయింది. 1946 మార్చిలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసు పోటీ చేయదలచింది. రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రకాశం, కార్యదర్శి కళా, కాని ప్రకాశానికి చెప్పకుండా ఎన్నికల సంఘాన్ని నియమించాడు. తనను సంప్రదించక ఏ పనీ చేయరనే ధీమాతో ప్రకాశం ఉండేవాడు. ఏర్పడిన ఎన్నికల సంఘంలో ప్రకాశానికి, రంగాకు వారి అనుచరులకు చోటులేదు. ప్రకాశం ఆశ్చర్యపోయి, గంగ వెర్రులెత్తి, తనవారికి, రంగా అనుచరులకు తంతులు యిచ్చాడు. లచ్చన్నకు కూడా అలాగే ఒక తంతి చేరింది. తక్షణం మద్రాసు రమ్మని సారాంశం. లచ్చన్న మద్రాసులో ప్రకాశం యింటికి వెళ్ళేసరికి, తెన్నేటి విశ్వనాథం, క్రొవ్విడి లింగరాజు, కందుల ఓబులరెడ్డి, అన్నె అంజయ్య యిత్యాదులు ఉన్నారు. ఎంతసేపువున్నా ప్రకాశం విషయం విడమరిచి చెప్పలేదు. నియోగి లౌక్యంలో “ఆలోచించండి నేను చెప్పాలా” అని సన్నాయి నొక్కులు నొక్కేవాడు. మొత్తం మీద అందరూ ఒకందుకే చేరారు గనుక, ప్రకాశంగారి పక్షాన వకాల్తా పుచ్చుకున్నారు. రంగా అనుచరులు సరాసరి నిడుబ్రోలు వచ్చి, రంగాకు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. జైల్లో అధికార రాజకీయ కలహాల జోలికి పోగూడదనే పాఠాలు చెప్పిన గురువు, విన్న శిష్యులు విస్మరించారు. అధికార రాజకీయ చదరంగం అలాంటిది. ఏమైతేనేమి రంగా దీవెనలు పొంది, ఊళ్ళమీదబడి, కొత్త సంఘాన్ని ఎన్నుకోవాలనీ రిక్విజిషన్.కు మద్దత్తు పొందడానికి తలపెట్టారు. ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులచే సంతకాల సేకరణ పూర్తి కాగానే, రాజమండ్రిలో సమావేశం ఏర్పాటైంది. రేపు సమావేశం అనగా రాత్రి కళా వెంకటరావు దింపుడుగళ్ళం ఆశతో లచ్చన్న వద్దకు కప్పగంతుల సుబ్బారావును రహస్య రాయబారిగా పంపాడు. రాయవెల్లూరులో జాతకం వ్రాసిన దగ్గర ఉపోద్ఘాతం ప్రారంభించి, ఈ సమావేశంలో రంగా తటస్థంగా వుంటే, శ్రీకాకుళం జిల్లాలో లచ్చన్నను ఎదురులేని చక్రవర్తిని చేస్తానన్నాడు. రంగా వర్గంలో ఎవరికి కావాలంటే వారికి స్థానాలు యిస్తానన్నాడు. లచ్చన్న అంతా విని ససేమిరా అన్నాడు. కళా రాయబారానికి సాక్షిగా కిల్లి అప్పలనాయుడు కూడా లచ్చన్న చెంత ఉన్నాడు. కళావారి కుట్రలు – ప్రకాశంగారి లౌకికం రాజమండ్రి విక్రం హాలులో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశం చాలా ఉద్రిక్త వాతావరణంలో ఉన్నది. బయట వేలాది ప్రజలు ప్రకాశానికి అనుకూలంగా ఉన్నారు. ప్రకాశం ప్రవేశపెట్టిన సంఘాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. పాత ముఠాకు స్థానం కల్పిస్తూ ప్రకాశం లౌక్యం చూపాడు గాని, కేంద్ర నాయకత్వం ఆ సంఘాన్ని ఆమోదించలేదు. అది రాష్ట్ర కేంద్ర నాయకుల కలహాల ఫలితం కాని ప్రకాశం కొరకు అంత ప్రయాసపడిన రంగాకు ఆయన అనుచరులకు ఎన్నికల సంఘంలో స్థానం యివ్వలేదు. అది ప్రకాశం రాజనీతిజ్ఞత. రంగా వర్గానికి కనువిప్పు అయింది. కొంచె ఆలస్యంగా. కొండా వెంకటప్పయ్య యీ అన్యాయాన్ని చూస్తూ సహించలేక గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. (చూడు – దేశభక్త జీవిత చరిత్ర, రచన – వీరభద్రరావు పుట 170) అన్యాయం జరిగిందనుకున్న వారంతా, లచ్చన్నతో సహా, ఆ సమావేశంలో పాల్గొని తమ ఘోష వెలిబుచ్చారు. కొండా నాయకత్వాన కేంద్రానికి రాయబారం వెళ్ళింది. శ్రీకాకుళం ప్రాంతంలో టెక్కలి, సోంపేట, ఇచ్ఛాపురం కలసి ఒక్కటే నియోజకవర్గం ఆనాడు. ఆ స్థానం లచ్చన్నకు యివ్వాలని సుమారు వెయ్యిమంది ఎన్నికల సంఘానికి విజయ నగరంలో చెప్పారు. చూస్తామన్నారు సంఘంవారు. చూస్తామంటే యివ్వరనే అర్థం. నాటికీ నేటికీ కాంగ్రెసు వారికి అలాగే వస్తున్నది. కొండా వెంకటప్పయ్య రాయబారవర్గం పటేల్.ను కలిసినప్పుడు లచ్చన్న విషయాలు ప్రస్తావించి, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనలేదనగా, ఖూనీలు చేయించాడటగా అని పటేల్ అడిగాడట. కళా వెంకటరావు ఈ విధంగా ముందే పథకం వేశాడన్నమాట. మొత్తం మీద ఆ స్థానం లచ్చన్నకు రాలేదు. రొక్కం రామ్మూర్తి నాయుడుకు యిచ్చారు. స్వతంత్రంగా పోటీ చేయమని అనుచరులు లచ్చన్నను ప్రోత్సహించారు. పదవి పోగానే పార్టీని వ్యతిరేకించే మనస్తత్వం లచ్చన్నకు లేదు కనుక రామ్మూర్తి నాయుడుగారికి మద్దతుగా ప్రచారం చేసాడు. శాసనసభ స్థానాలలో కళా ముఠాచేసిన అన్యాయాన్ని సహించలేని రంగా వర్గం ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికలలో ఆ సంవత్సరం పోటీచేసి, అన్ని స్థానాలు గెలుచుకున్నది. చీరాలలో జరిగిన యీ ఎన్నికలలో ప్రకాశం పెద్దమనిషిగా – తన అవసరం తీరిందిగనుక – తాటస్థ్యం వహించాడు,. సంజీవరెడ్డిని ఓడించి రంగా అధ్యక్షుడయ్యాడు. ఓబుల రెడ్డి కార్యదర్శి, లచ్చన్న సహాయ కార్యదర్శి. రంగా అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీకి, మంత్రివర్గ ముఠాకు జరిగిన కలహాలు, ఆరోపణలు విమర్శలు వర్ణనాతీతం. అది వేరే చరిత్రగా వ్రాయాల్సిందే. అక్కడ లచ్చన్న పాత్రవరకే పరిమితంగావటం ఉచితం. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెసును విభజించి వివిధ శాఖలు ఏర్పరచి, నిర్మాణరంగాన్ని కొత్తమలుపులు త్రిప్పాడు రంగా. అందులో కార్మికశాఖ, సేవాదళం లచ్చన్న అజమాయిషీ క్రింద నడిచేవి. అప్పుడే తొలిసారిగా గాంధీరావును ఆంతరంగిక కార్యదర్శిగా నెలకు అరవై రూపాయల వేతనంపై లచ్చన్న నియమించాడు. గాంధీరావు రానురాను లచ్చన్న ఆంతరంగికుడుగా పెనవేసుకుపోయి, ఎంతో తోడ్పడినాడు. అలాంటి వ్యక్తి లభించటం లచ్చన్న భాగ్యం అనొచ్చు. సహాయ కార్యదర్శిగా ఉన్న లచ్చన్న అప్పుడే విడుదలయిన అజాద్ హింద్ పౌజు ఆంధ్ర దళానికి సన్మానం చేయాలని తలపెట్టాడు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణ గరపాలని కూడా పథకం వేశాడు. లచ్చన్న పథకాలకు చేయూతనిచ్చి, అండగా నిలబడ్డాడు. అజాద్ హింద్ పౌజు దళకార్యకర్త ఎల్. అప్పారావు. అనుకున్న ప్రకారం పౌజ్ దళానికి ఏలూరులో డి.ఎస్. రాజు అధ్యక్షతన సన్మానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు అయినాయి. పలాసలో కూడా ఒక శిబిరం నిర్వహించారు. గాంధీరెడ్డి హనుమంతరావు, ఎల్. అప్పారావు శిక్షణ గరిపారు. శిక్షణ పొందిన వారిగా ఒక స్నాతకోత్సవంలో ప్రకాశం డిగ్రీలు ప్రదానం చేశాడు. రాష్ట్రంలో శిక్షణ పొందిన వారందరూ కలసి 45 రోజులపాటు రాష్ట్రమంతటా పర్యటించి విన్యాసాలు జరిపారు. ఈ శిక్షణ వలన ఎంతో ఉపకారం జరిగింది. లచ్చన్న వీటన్నిటిలో నాయకత్వం వహించారు. 1947-48లో కమ్యూనిస్టుల హింసాకాండ ఆంధ్రలో ఉధృతమైనప్పుడు, లచ్చన్న నాయకత్వాన కాంగ్రెసు సేవాదళంవారు గ్రామాలలో గస్తీలు తిరిగి, నిస్సహాయులైన ప్రజలకు ఊతగా నిలబడ్డారు. చల్లపల్లిలో ఆత్మరక్షణ శిబిరం కూడా లచ్చన్న నాయకత్వాన నిర్వహించారు. రాత్రిళ్లు కృష్ణా, గుంటూరు జిల్లాలలో లచ్చన్న సేవాదళం వారితో కలిసి, టాపులేని జీపులో తిరిగేవాడు. ఒక సందర్భంలో ఎల్. అప్పారావు స్వీయరక్షణార్థమై కమ్యూనిస్టులపై కాల్పులు చేయగా, ఇరువురు చనిపోయారు. ఒక సంఘటన ఆధారంగా లచ్చన్న వర్గం అత్యాచారాలు చేస్తున్నారని కొడాలి ఆంజనేయులు ఫిర్యాదులు చేసి, గాంధీకి, కాంగ్రెస్ అగ్రనాయకులకు నివేదికలు పంపాడు. కాంగ్రెసులో ప్రత్యర్థులకంటే కమ్యూనిస్టులే సన్నిహితం అనే ధోరణి కాంగ్రెసువారిది. స్వాతంత్రం రాగానే కాంగ్రెసు వారికి దేశభక్తి తగ్గి, సాంతం జ్ఞప్తికి వచ్చి బాగుపడటం ఎలాగనే ఆలోచన రేకెత్తింది. రాజకీయ బాధితుల పేరిట సహాయపథకాలు తలపెట్టారు. దీనికి ఆంధ్రలో (ఉమ్మడి మద్రాసు) నాంది పలికింది. కళా వెంకటరావు పదెకరాల మాగాణిగాని, పదెకరాల మెట్టగాని రాజకీయ బాధితులకు యివ్వాలని ఈ కార్యక్రమాన్ని మంత్రివర్గం ప్రవేశపెట్టింది. అంతటితో జనం ఎగబడ్డారు. ఏ కొద్దిమందో యీ పథకాన్ని వ్యతిరేకించారు. కాని అధిక సంఖ్యాకులకు అది బాగా ఎర అయింది. భూములు వద్దని, డబ్బు యిస్తే బాగుంటుందని రంగా సూచించాడు. ఏమైతేనేమి మంత్రివర్గ ముఠాపథకమే సఫలమైంది. దరఖాస్తులు పెట్టుకోమన్నప్పటికీ లచ్చన్న పట్టించుకోలేదు. లచ్చన్న సోదరుడు సత్యనారాయణ మాత్రం దరఖాస్తు పెట్టాడు. లచ్చన్న కుటుంబానికి ఆప్తుడైన వలివేటి వేణుగోపాలరావు పాలకొండ సబ్ డివిజన్.లో సూపర్.వైజర్.గా పనిచేస్తుండేవాడు. పెట్టుకున్న దరఖాస్తులు అతని వద్దకు తనిఖీకై వచ్చేవి. అందులో లచ్చన్న దరఖాస్తు లేకపోవటంతో, ఆశ్చర్యపడి లచ్చన్నపేరుతో అతనే దరఖాస్తు నమోదు చేశాడు. ఇలా చేయటంలో లచ్చన్న సోదరుడి ఆమోదం కూడా ఉన్నది. ఫలితంగా పాలకొండ తాలూకాలో పదెకరాల భూమి లచ్చన్న పేరిట మంజూరు చేశారు. అది సాగుకు లాయకుగాని భూమి కావటం చేత సుమారు 8 వేల రూపాయలు వ్యయం చేసి మాగాణి చేయవలసివచ్చింది. ఇప్పటికీ ఇంకొక ఎకరం సాగులోకి రావాల్సి వుంది. లచ్చన్నకు యీ ఉదంతమంతా తరువాతగాని తెలియలేదు. నేడు ఆ అధికారి రిటైర్ అయ్యాడు. ఉద్యోగంలో 1965లో రిటైర్ అయిన లచ్చన్న సోదరుడు నౌగాంవద్ద కాపురం పెట్టి ఆ పొలాన్ని సాగుచేయించేవాడు. కార్మిక రంగంలో విజయదుందుభి ఆంధ్ర కాంగ్రెసు సంఘ సహాయ కార్యదర్శిగా లచ్చన్న చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో, ప్రవాసాంధ్రుల పరిస్థితి విచారించటం పేర్కొనదగినది. కాంగ్రెస్ సంఘం తరఫున ఒక విచారణ సంఘాన్ని నియమించి, తానే, అధ్యక్షుడుగా, ఖుర్దా బరంపురం, కటకం, ఖరగ్.పూర్, కలకత్తా, చక్రధర్ పూర్, జంషెడ్.పూర్.లు వెళ్ళి, అక్కడున్న ఆంధ్రలు స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎక్కడకు వెళ్లినా ఆంధ్రులు లచ్చన్నకు అపూర్వ స్వాగతం పలికారు. తాను చూచిన పరిస్థితులన్నిటినీ క్రోడికరించి ఒక నివేదికను, నాటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వానికి సమర్పించాడు లచ్చన్న. 1947లో దేశవ్యాప్తంగా కార్మికోద్యమాన్ని నిర్మాణయుతం గావించడానికి కాంగ్రెస్ పూనుకొని, భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్.ను స్థాపించింది లక్నోలో. అందులో ఉపాధ్యక్షులుగా ఖండుభాయ్ దేశాయ్, లచ్చన్న ఎన్నికయ్యారు. లచ్చన్న ఆంధ్ర సంఘాన్ని స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. రెండు పదవులనూ కాంగ్రెస్ నుండి పూర్తిగా వైదొలగేవరకూ లచ్చన్న నిర్వహించాడు. జాతీయ కాంగ్రెసు కార్యవర్గంలో ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్.కు ప్రాతినిధ్యం యివ్వాలని లచ్చన్న ఒక మెమోరాండం సమర్పించాడు. బాచిన సుబ్బారావు, ఎన్.వి.నాయుడు, లచ్చన్న కలసి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెసు నాయకులను కలసి కిసాన్ కాంగ్రెసుకు ప్రాతినిధ్యం విషయమై అందరికీ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరి ఆశగా గాంధీని కలియటానికై, ఇంటర్వూ కోరారు. నాడు గాంధీ బిర్లాభవన్ వెనుక ఒక గదిలో అతి సామాన్య జీవితం గడుపుతున్నాడు. మెమోరాండం ఆంగ్లంలో వ్రాసినందుకు, హిందీలో తయారు చెయ్యనందుకు, లచ్చన్నను వెక్కిరించిన గాంధీ అందలి విషయాలు శ్రద్ధగా విన్నాడు. రంగా ఎక్కడున్నాడని పరామర్శించి, ఒక నిముషం మౌనందాల్చి, తరువాత చెప్పాడు. “మీరు అడిగిన కోర్కెలు సబబైనవే కాని నా అనుమతితో జాతీయ ప్రభుత్వం నడుస్తుందనుకోటం భ్రమ. నేను ఎంతకాలం బతికుంటానో తెలియదు” అనటంతో లచ్చన్న ప్రభృతులు నిర్విణ్ణులయ్యారు. ఆ సాయంత్రం మెమోరాండంలో విషయాలు ప్రార్థన ప్రసంగంలో ప్రస్తావించగా మరునాడు పత్రికలలో పతాక శీర్షికలతో ప్రచురితమైంది. లచ్చన్న ఆశ్చర్యపోయాడు. అయితే లచ్చన్న పేరు ఆయన ప్రస్తావించలేదు. ఆంధ్ర కార్మికోద్యమం ఆంధ్ర కార్మికోద్యమంలో లచ్చన్న స్థానం విశిష్టమైనది. తొలుత లచ్చన్నను యీ రంగంలో దింపటానికి సింథియా నావిగేషన్.లో పనిచేస్తున్న ఎర్రబోలు కృష్ణారావు (ఎలక్ట్రికల్ ఇంజనీరు) ప్రభృతులు కారణమనొచ్చు. కార్మిక సంఘ నాయకత్వానికి లచ్చన్న కావాలని వారు పట్టుబట్టారు. తీరిక ఉండదేమోనని లచ్చన్న అనుమానించి, ఆమోదించలేదు. కాని కృష్ణారావు ప్రభృతులు పట్టుబట్టి పరోక్షంలో లచ్చన్నను తమ అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. పోటీలో ఓడిపోయిన కమ్యూనిస్టు పోటీసంఘం పెట్టుకున్నారు. ఒకసారి ఎన్నిక అయిన తరువాత సింథియా పరిస్థితి ఏమీ బాగులేనట్లు లచ్చన్న గ్రహించాడు. అక్కడ కార్మికులకు అంతవరకు స్కేళ్ళు, గ్రేడులు లేవు. కనుక కనీస కోర్కెల పత్రాన్ని తయారుచేసి, యాజమాన్యంతో రాయబారం సంప్రదింపులు జరిపాడు. అయినా వారు లొంగిరాక పోయేసరికి సమ్మె ప్రకటించాడు. సంఘటిత వ్యవస్థలలో లచ్చన్న అందెవేసిన చేయి. సమ్మె జయప్రదం గావటానికి అదుపుగా కార్మికోద్యోగులందరినీ వారి వారి ఇళ్ళకు పంపించేశాడు. కార్యకర్తలు మాత్రమే విశాఖలో మిగిలారు. సమ్మె 3 మాసాలపాటు జరిగిన అనంతరం, యాజమాన్యం లొంగి బొంబాయి కేంద్ర కార్యాలయానికి లచ్చన్నను ఆహ్వానించారు. యూనియన్ కార్యకర్తలందరినీ ఆహ్వానిస్తే తప్ప రానని లచ్చన్న భీష్మించాడు. నాడు సింధియా నావిగేషన్ యజమాని పాండ్య అందరినీ ఆహ్వానించి, యూనియన్ కోర్కెలు ఆమోదిస్తూ రాజీపడ్డాడు. అది 1948 జనవరి 30 ఉదయం జరిగింది. సాయంత్రానికి గాంధీ హత్యవార్త వచ్చి అందరినీ దిగ్భ్రమ చెందించింది. సింథియావారు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో లచ్చన్న ఢిల్లీ వెళ్ళి గాంధీ అంత్యక్రియలకు హాజరై తన శ్రద్ధాంజలి ఘటించాడు. కార్మిక రంగంలో లచ్చన్న దిగగానే ఆంధ్ర అంతటి నుండి ఆయనకు ఆహ్వానాలు అందాయి. ప్రతిచోట ఆయనకు అధ్యక్షస్థానమో, గౌరవాధ్యక్షస్థానమో పిలిచి, బ్రతిమలాడి యిచ్చారు. జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు శాఖలు అనేచోట్ల స్థాపించాడు. అనపర్తి, చీరాల, బిక్కవోలులో ఐ.ఎల్.టి.డి. కార్మికుల సమ్మెలు, గుంటూరులో జూట్ కార్మికుల సమ్మె, ఏలూరులో పట్టణ కార్మిక సంఘం ఏర్పాటు వైజాగ్ రవాణా కార్మికుల సంఘానికి అధ్యక్షత, చిట్టివలసలో లేబర్ యూనియన్ అధ్యక్షత, రాజమండ్రి మునిసిపల్ కార్మికుల, ధవళేశ్వరం పి.డబ్ల్యు.డి. కార్మికుల సమ్మెలు వీటన్నిటిలో లచ్చన్న కనీసం కొన్ని విజయాలైనా సాధించకుండా ఊరకుండలేదు. ఇలా కార్మిక రంగంలో విజయ దుందుభి మ్రోగించిన లచ్చన్న వ్యక్తిగత జీవితం విషయం బొత్తిగా విస్మరించారు. లచ్చన్న సోదరుడు సత్యనారాయణ, పి.బి.కె. మూర్తి ప్రయత్నాలు చేస్తుండేవారు గాంధీకి మెమోరాండం యివ్వడానికై ఢిల్లీ వెళ్ళిన లచ్చన్నను తాతానగర్ రావలసిందిగా పిట్టా బాలకృష్ణమూర్తి నుండి ఆహ్వానం వచ్చింది. అంతకు ముందే వారికీ లచ్చన్న సోదరులకూ మధ్య లచ్చన్న వివాహ విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినట్లు ఉత్తరోత్తరాగాని లచ్చన్నకు తెలియలేదు. బాలకృష్ణమూర్తి యశోదకు మేనమామ. దంత వైద్యుడు అమ్మాయి విషయం ప్రస్తావించి, పెళ్ళిచూపులకు ఏర్పాటు చేస్తానని కృష్ణమూర్తి లచ్చన్నతో అంటే లచ్చన్న ముందుగా కొన్ని షరతులు పెట్టాడు. అమ్మాయికి ఒక ఉత్తరం వ్రాస్తాను, సమాధానాన్నిబట్టి చూస్తానన్నాడు. ఆ ఉత్తరం సారాంశమేమంటే తన మాటకు ఎదురాడకూడదని, రాజకీయ జీవితానికి ప్రతిబంధకంగా ఉండరాదని వీటికి ఎప్పుడు భంగం వాటిల్లితే ఆనాడే దాంపత్య జీవితానికి స్వస్తి అనీ. అన్నిటికీ అంగీకరిస్తూ యశోద సమాధానం వ్రాయటంతో లచ్చన్న ఇరుకునబడి మరొక పీటముడి వేశాడు. రంగాను ఒప్పిస్తేగాని పెళ్ళి చేసుకోనన్నాడు. లచ్చన్న సోదరుడు, పి.బి.కె మూర్తి యిరువురు కూడబలుక్కుని, రంగా ఏమి చెప్పినా అంగీకరించాలని అనుకుని, నిడబ్రోలు వెళ్ళాడు. పెళ్ళి కుమారుడు పెట్టని అనేక ఆంక్షలు రంగా పెట్టాడు. లచ్చన్న గోత్రం తెలిసినవాడు గనుక చనువుతో ఆధిపత్యం చూపాడేమో మరి, బిడ్డలు కావాలనే కోర్కెలు పెట్టుకోవద్దనీ అమ్మాయి పోషణార్థం కొంత సొమ్ము అట్టిపెట్టాలని రంగా చెప్పాడు. సరేనన్నారు. పెళ్ళి నిశ్చయమైంది. యశోద బంధువులు ఆగ్రహించారు. ఆమె తాత సురంగిరాజు వద్ద దివాన్.గిరి చేశాడు. తండ్రి ఉపాధ్యాయుడుగా శ్రీకాకుళం మునిసిపల్ హైస్కూలులో పనిచేశారు. వారిది “దేవుల”కులం. అలాంటి అమ్మాయిని తక్కువ వాడికి (అదేకులంలో) యిస్తారా అని బంధువుల అభ్యంతరం వారెవరూ పెండ్లికి రాలేదు. కాని పెండ్లి కుంభమేళావలె జరిగింది. వి.వి.గిరిని రాజకీయాల్లోకి దింపిన కళ్ళికోట రాజాకళాశాల ప్రిన్సిపాల్ ఉన్నవ రామలింగం పంతులు, మరెందరో పెద్దలు వచ్చి దీవించారు. ముఖ్యంగా కార్యకర్తలు తమ కార్యంగా స్వీకరించి చందాలు వేసుకుని భారీ ఎత్తున భోజనాలు ఏర్పాటు చేసి, లచ్చన్న బీదరికాన్ని కప్పిపుచ్చారు. బారువాలోని జమీందారు సత్రంలో పెళ్ళి వైభవోపేతంగా జరిగింది. పెండ్లి కాగానే హనీమూన్.కు పోవలసిన లచ్చన్న కారణాంతరాలచే రంగూన్ వెళ్ళవలసి వచ్చింది. వివాహం అయిన రెండో రోజున రంగానుండి ఢిల్లీ తక్షణమే రావలసిందిగా తంతి వచ్చింది. విషయం తెలియక వెళ్లాడు. అక్కడ తెలిసింది రంగా ముఖంగా, బర్మాలో ఆంధ్రులు కమ్యూనిస్టుల ప్రభావంతో ఆందోళన చేస్తుండగా, అరెస్ట్ చేసి జైళ్ళలో కుక్కారు. రంగాతోపాటు 1935లో భారతకేంద్ర శాసనసభ సభ్యుడుగా ఉన్న డాక్టర్ థెయన్ మాంగ్ యీ విషయమై రంగాతో ప్రస్థావించి ఎవరినైనా సహాయార్థం పంపే ఏర్పాటుచేయమన్నాడు. ఆ వ్యక్తికి తగిన వ్యక్తి అని లచ్చన్నను వెళ్ళమన్నాడు రంగా, శిరసావహించి, కలకత్తా నుండి విమానంలో రంగూన్ చేరాడు లచ్చన్న. ఐదువారాలపాటు అక్కడ వుండి జైళ్ళలో మ్రగ్గుతున్న ఆంధ్రులను కలసి జైలు అధికారుల ప్రత్యేకానుమతితో, జైళ్ళలోనే ఉపన్యాసాలిచ్చాడు. అప్పటికే ఉద్రేకం తగ్గి యిళ్ళవద్ద భార్యాబిడ్డలు స్ఫురణకు రాగా, బయటపడే మార్గాన్ని అన్వేషిస్తున్న బర్మా ఆంధ్రులకు లచ్చన్న ఆపద్బాంధవుడయ్యాడు. ఐదు వారాల్లోనూ అనేకమందిని ఓడలెక్కించి యిళ్ళకు పంపాడు. ఆయన బర్మాలో ఉండగా అన్ సాంగ్ మంత్రివర్గం యావత్తూ ప్రేల్చివేయబడింది. వారి అంత్యక్రియల్లో భారత ప్రతినిధిగా లచ్చన్న పాల్గొన్నాడు. తరువాత బర్మా అంతా పర్యటించాలని లచ్చన్న ఉపక్రమిస్తుండగా, రాజేంద్రప్రసాద్ నుండి తక్షణమే రావలసిందిగా తంతి వచ్చింది. బర్మా పర్యటన విరమించి స్వదేశానికి బయలుదేరి వచ్చాడు. తొలిసారిగా శాసనసభా సభ్యత్వం కాంగ్రెసు నుండి సోషలిస్టులు చీలిపోయి, శాసనసభ నుండి తమ పక్షం వారందరినీ రాజీనామాలిచ్చి బయటకు రావలసిందిగా సోషలిస్టు పార్టీ ఆదేశం యిచ్చింది. తదనుగుణంగా విశాఖ కార్మిక నియోజవర్గపు సోషలిస్టు సభ్యుడు లక్ష్మణరావు తన శాసన సభ్యత్వానికి 1948లో రాజీనామా యిచ్చాడు. ఆ స్థానంలో లచ్చన్న తప్ప మరెవరు నిలబడినా కమ్యూనిస్టులను ఓడించలేరని కార్మిక నాయకులు కొందరు రంగావద్దకు రాయబారం వెళ్ళారు. జిల్లాలో కాంగ్రెసు నాయకులు వ్యతిరేకిస్తున్నా కార్మికుల కోర్కెలననుసరించి లచ్చన్నను నిర్ణయించి రావలసిందిగా బర్మాకు తంతి యిచ్చాడు రాజేంద్రప్రసాద్. అది విశాఖ, తూర్పుగోదావరి కార్మిక, ఓడరేవు కార్మిక నియోజకవర్గం కమ్యూనిస్టులు సాంబమూర్తిని పోటీ పెట్టారు. బి.ఎస్.మల్లికార్జునరావు కూడా పోటీ చేశారు. ఆయన కాంగ్రెసు సోషలిస్టు. లచ్చన్న ఎన్నికల ప్రచారం బాగా సాగింది. కార్మికులు కోపు వేసుకున్నారు. కొన్నిచోట్ల హింసాయుతమైన కొట్లాటలు, ఆందోళనలు జరిగాయి. అప్పటికే ముఖ్యమంత్రి పదవి వూడగొట్టుకున్న టంగుటూరి ప్రకాశం లచ్చన్నను సమర్థిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికులు అధ్యక్షుడుగా ఉన్న పెమ్మరాజు వెంకటరావు కారణాంతరాలచే బి.ఎస్.మల్లికార్జునరావును సమర్థించినా అక్కడ లచ్చన్నకే బలం చేకూరింది. లచ్చన్న దిగ్విజయం పొంది, వెంటనే ఆ జూన్.లోనే, శాసనసభ సమావేశంలో సభ్యుడుగా ప్రమాణస్వీకారం చేసి తన బాధ్యతల్ని నిర్వర్తించడం ప్రారంభించాడు. ఆయన శాసనసభలో చేసిన తొలి ప్రసంగాన్ని ప్రస్తావించి, మెచ్చుకున్నాడు ప్రకాశం. సింథియా నౌకా పరిశ్రమ సింథియా నౌకా పరిశ్రమ నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్నట్లుగా క్రుంగిపోతుంటే, అందులో పనిచేస్తున్న కార్మికుల జీవనభృతిపోయి, నిరుద్యోగులవుతారనే భయంతో లచ్చన్న ఒక పథకం రూపొందించి, సింథియాకు రుణాలు యివ్వవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు. 1945 జులైలొ ఢిల్లీ వెళ్లి నెహ్రూ పటేల్.ను కలసి నివేదికలు సమర్పించాడు. సింథియాకు రుణం మంజూరు చేయటంతోపాటు, ఎన్.దండేకర్ ప్రత్యేక ప్రభుత్వాధికారిగా విశాఖ వచ్చాడు. అప్పటి నుండే లచ్చన్నకు దండేకర్ తో పరిచయం. సింథియా నౌకా పరిశ్రమను జాతీయం చేయాలని తొలుత ప్రతిపాదన చేసింది దండేకర్. ఆయన హయాంలో లచ్చన్న ఆధ్వర్యాన పదిరోజులపాటు కార్మికుల సమ్మెసాగింది. అయితే వెంటనే పరిష్కారం కూడా కుదరటం వలన, కార్మికులకు యాజమాన్యానికి సామరస్యత నెలకొన్నది. సింథియా వారి తొలినౌకను నెహ్రూ జలప్రవేశం గావించినప్పుడు, కార్మిక నాయకుడుగా లచ్చన్న ప్రత్యేక శ్రద్ధ వహించి సేవాదళ్ కవాతులు విశాఖలో విన్యాసాలు ప్రదర్శింపచేశాడు. నెహ్రూ అదంతా చూచి లచ్చన్నను శ్లాఘించాడు. రెండవ ఓడ పటేల్ జలప్రవేశం చేయించాడు. అనారోగ్య కారణంగా విశాఖరాలేక ఢిల్లీ నుండే మీటనొక్కే ఏర్పాట్లు గావించాడు. ఢిల్లీలో ఆ సందర్భంగా జరిగిన ఉత్సవానికి కార్మిక నాయకుడుగా లచ్చన్నను, యశోదను సింథియావారు ఆహ్వానించి, ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళి గౌరవించారు. విమాన ప్రయాణంలో యశోదకు వాంతులు ఆరంభమై చివరకు ఢిల్లీలో ప్రాణాపాయం వరకూ వచ్చినప్పుడు, తలవని తలంపుగా వచ్చి చూచిన ఒక పంజాబి డాక్టర్ కాపాడింది. ఆ తొలికాన్పులో లచ్చన్నకు పుత్రుడు జనించాడు. సింథియావారి మూడవ నౌకను సింథియావారు లచ్చన్నచే జలప్రవేశం చేయించి, కార్మిక నాయకుడుగా గౌరవించారు. ఇది దండేకర్ హయాంలో 1949లో జరిగిన విశేషం. లచ్చన్న రాజకీయ కృషి 1948లో శాసన సభకు ఎన్నుకబడే వరకూ లచ్చన్న రాజకీయ కృషి ప్రధానంగా కిసాన్, కార్మిక రంగాలకు పరిమితమైంది. మద్రాసులో శాసనసభ సభ్యుల హాస్టలులో లచ్చన్న ఉంటుండగా తులాబందుల నాగేశ్వరరావు తరచు వచ్చి లచ్చన్నతో వెనుకబడిన వర్గాల విషయం చర్చించారు. గుంటూరులో జరుగనున్న వెనుకబడిన జాతుల మహాసభకు అధ్యక్షత వహించమని ఆహ్వానించాడు. ఆవిధంగా లచ్చన్నను వెనుకబడిన వర్గాల సమస్యపట్ల ఆసక్తుడినిగా చేసింది తులాబందుల నాగేశ్వరరావుగారే, గుంటూరులో హిందూ కళాశాల ఏకాదండయ్య పంతులు హాలులో ఆంధ్ర వెనుకబడిన వర్గాల తొలిమహాసభ లచ్చన్న అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంగా హిందూకళాశాల ప్రిన్సిపాల్ వల్లభజోస్యుల సుబ్బారావుతో లచ్చన్నకు పరిచయమైంది. ఆయన ఇలాంటి ఉద్యమాలకు ఎంతో ప్రోత్సాహం యిచ్చారు. ఆ మహాసభలో కలహాలు, వాగ్వివాదాలు, వర్గాలు ఎన్నో సంభవించిన అనంతరం, సంఘానికి అధ్యక్షుడిగా లచ్చన్ననే ఎన్నుకున్నాడు. కార్యభారం మీదబడిన తరువాత లచ్చన్నది ఊరుకునే స్వభావం కాదు. సమస్యని కూలంకషంగా ఆవగాహన చేసుకోవటం, పరిష్కారానికి కృషి చేయటం లచ్చన్న విశిష్టత. అలాగే వెనుకబడిన వారి సమస్యలు రాజ్యాంగ పరంగానూ, సమాజపరంగానూ, అవగాహన చేసుకోవటం ఆరంభించి, వాటి పరిష్కారానికై ఆందోళన గావించాడు. అంతవరకు ఆంధ్రలో కమ్యూనిస్టులు గీత కార్మిక సంఘాలు నడుపుతూ, వెనుకబడినవారిలో అధిక సంఖ్యాకులైన గీత పనివారిని చేతిలో పెట్టుకుంటూ వచ్చారు. ఎన్నాళ్ళున్నా ఏ సమస్యా పరిష్కారం కాని స్థితిలో పశ్చిమగోదావరి గాతకార్మిక ప్రముఖులు కొందరు లచ్చన్న వద్దకు వచ్చి, నాయకత్వం వహించమని కోరారు. భీమవరంలో గీత కార్మిక మహాసభకు లచ్చన్నను ఆహ్వానించారు. అంతవరకు పెంచిన సంస్థ చేజేతులా జారిపోవటం సహించలేని కమ్యూనిస్టులు సభలో అల్లరి చేశారు. లచ్చన్నపై ప్రశ్నలవర్షం కురిపించారు. లచ్చన్న విజృంభించి వాటన్నిటికీ సమాధానం చెప్పి, గీత కార్మికసంఘాన్ని ఆకట్టుకున్నాడు. కమ్యూనిస్టులు గీత కార్మిక సంఘం నడుపుతుంటే, లచ్చన్న గీత పారిశ్రామిక సంఘాన్ని స్థాపించాడు. కమ్యూనిస్టుల నుండి అనేకమంది చీలి లచ్చన్న పక్షం వహించారు. అంకెం వెంకటపతి సంఘాధ్యక్షుడుగా లచ్చన్న అండన నిలబడ్డాడు. రంగా కాంగ్రెసు అధ్యక్షుడుగా వుండగా 1950లో ఒకసారి అఖిలభారత కాంగ్రెసు కార్యదర్శి కళా వెంకటరావు బెజవాడ కాంగ్రెసు కార్యాలయానికి వచ్చి, రంగాను పరోక్షంలో చూస్తుంటే, గెట్ అవుట్ అన్నాడు లచ్చన్న. రంగాపై వ్యక్తిగతంగానే గాక సంస్థాపరంగా లచ్చన్నకుగల అభిమానం అలాంటిది కాని రంగా హయామంతా ఫిర్యాదులతో, కేంద్ర కాంగ్రెస్ జోక్యంతో నడిచింది. 1951లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికలలో రంగా వర్గాన్ని రానివ్వకుండా చేయాలనే తలంపుతో జిల్లాలన్నీ పర్యటించి, సభ్యత్వానికి కూడా ఎదురు పెట్టుబడి పెట్టారు. ఆంధ్ర కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో నన్నపనేని వెంకట సుబ్బయ్య వున్నంతవరకూ సాఫీగా సాగిన పాలన, కె.ఎల్.సిన్హా రాకతో గందరగోళమైంది. రంగాకు దూరమైన మనుషుల్ని చేరదీస్తున్నాడంటూ కార్యదర్శి ఓబులరెడ్డి ఉన్నవారిని దూరంచేశాడు. అప్పుడు గంజాం జిల్లాకు మూడు స్థానాలు ఆంధ్ర కాంగ్రెలో ప్రాతినిధ్యంగా ఉండేవి. ఎన్నికలలో ఆ స్థానాల్ని తమకు అనుకూలంగా త్రిప్పుకోవాలని, మంతెన వెంకటరాజు వెయ్యిరూపాయల నోట్లతోవచ్చి, జన్నల కృష్ణమూర్తికి ఇవ్వగా, అతను అందరూ చూస్తుండగా విసిరి మొహాన కొట్టి పంపించేశాడు. రంగా సంజీవరెడ్డి మధ్య జరిగిన ఆ ఎన్నికను ఎన్.కె.పాటిల్ నిర్వహించాడు. రంగాకు బాగా బలంగలిగిన గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు ఎన్నికలలో పాల్గొనకుండా కోర్టు ఇంజంక్షన్ తెచ్చారు. ఎన్నికలలో ఓడిపోయిన రంగా కాంగ్రెస్ నుండి వైదొలగాడు. ఆయనతోపాటు లచ్చన్న బయటపడ్డాడు. ప్రకాశం కూడా కాంగ్రెసుకు విడాకులిచ్చాడు. 1951 వరకూ లచ్చన్న కుటుంబం బారువాలోనే ఉండేది. ఎం.ఎల్.ఎ.గా లచ్చన్న తనకు వచ్చే నెలవారీ నూటయాభై రూపాయలు అన్నకు పంపిస్తుంటే, గడిచిపోతుండేది. రాజకీయ వ్యక్తిగత కారణాలు పురస్కరించుకుని 1951లో సోంపేటకు మకాం మార్చాడు. కాంగ్రెసు నుండి చీలిన రంగా ప్రకాశం యిరువురూ పాట్నా వెళ్ళి కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీలో చేరారు. కాని వారిరువురు పొసగక రంగా స్థాపించిన కృషికార్ లోక్.పార్టీకి లచ్చన్న సహాయ కార్యదర్శి అయ్యాడు. ఓబులరెడ్డి ప్రధాన కార్యదర్శి. 1952లో జరిగిన తొలిసాధారణ ఎన్నికలలో రంగాలో సహా కృషికార్ లోక్.పార్టీ వారంతా ఓడిపోతుంటే, లచ్చన్న మరికొందరు శ్రీకాకుళం జిల్లాలో, చిత్తూరులో కొందరు, తూర్పు గోదావరిలో నీరుకొండ రామారావు శాసనసభ్యులుగా గెలిచి పరువుకాపాడారు. “కొసలపార్టీ” అని ఆంధ్రప్రభ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు వెక్కిరించాడు కూడా. సోంపేట నియోజవర్గంలో పొట్నూరి సోంబాబు లచ్చన్నపై పోటీచేసి డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టాడు. డబ్బు కాంగ్రెసు అభ్యర్థివద్ద పుచ్చుకుని, లచ్చన్నను గెలిపించాడు. బహిరంగ సభల్లో కొందరు కార్యకర్తలు యీ విషయాన్ని వెల్లడించారు కూడా. కొద్ది మెజారిటీతో లచ్చన్న నెగ్గాడు. కర్నూలులో మంత్రివర్గం మంత్రి వర్గాన్ని పడగొట్టడం మద్రాసులో రాజాజీ మంత్రివర్గం ఏర్పడినప్పుడు ఉపముఖ్యమంత్రిగా రమ్మని రంగాను ఆహ్వానించాడు రాజాజీ. దానికి జవాబుగా లచ్చన్న, తిమ్మారెడ్డిగారలను మంత్రులుగా తీసుకోమన్నాడు రంగా, ఆ సలహాలను రాజాజీ పాటించక ”సరైన సమయంలో తప్పటడుగు వేస్తాడు రంగా” అని మద్రాసు ఉడ్.లాండ్స్.లో జరిగిన రంగా జన్మదిన సందర్భంగా రాజాజీ వ్యాఖ్యానించాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సంజీవరెడ్డి, రాష్ట్రం ఏర్పడబోతున్నదని గ్రహించి, రానున్న రాష్ట్ర నాయకత్వానికి ప్రాతిపదికలు వేయనారంభించారు. అందులో ప్రధానమైనది “రెడ్డి” ఎర. తిమ్మారెడ్డి ఆ ఎరలోబడి కె.ఎల్.పి.కి ఉద్వాసన చెప్పాడు. లచ్చన్నను కూడా తన పరిథిలోనికి లాక్కోవాలని సంజీవరెడ్డి భావించి, లచ్చన్నను ఒకసారి తనింటికి విందుకు పిలిచాడు. ఆదినారాయణరెడ్డి సమక్షంలో లచ్చన్నను తనతో చేతులు కలపమని, ఆంధ్ర నాయకత్వం ఇద్దరి చేతుల్లో ఎదురులేనిదిగా ఉంటుందనీ ప్రతిపాదించాడు. రంగాతో సంప్రదించమన్నాడు లచ్చన్న. సంజీవరెడ్డి సరేనన్నాడు కానీ ఆ పని ఎన్నడూ చేయలేదు. రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకున్న సంజీవరెడ్డి కాళహస్తిలో బలరామరెడ్డిచే రాజీనామా యిప్పించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశాడు. కె.ఎల్.పి. పక్షాన రంగా పోటీ పెట్టడం లచ్చన్నకు ఇష్టంలేదు. కాని వెలగపూడి రామకృష్ణ, నార్ల, ఎస్.వి.నాయుడు ఒత్తిడికి రంగాలొంగి పోటీపెట్టి ఓడిపోయాడు. రాష్ట్ర విభజన సంఘానికి అధ్యక్షుడుగా ఉంటున్న సి.ఎం.త్రివేది ముందే మద్రాసులో ఒక విందు సందర్భంగా లచ్చన్నను అడిగాడు. “కాళహస్తి ఉప ఎన్నికలలో సంజీవరెడ్డి పై మీ పార్టీ పోటీ పరుగుతుందటగా అనీ. లచ్చన్న మౌనం వహించి దాటేశాడు. కనక సంజీవరెడ్డి ఎలా ప్రచారం చేశాడు అర్థం చేసుకోవచ్చు. అంతవరకూ ప్రకాశాన్ని వ్యతిరేకిస్తూన్న సంజీవరెడ్డి నాయకత్వానికై అతనికి చేరువగావటం మొదలెట్టాడు. ఒంగోలు ఉపఎన్నికలలో ప్రకాశం గెలిచాడు. రంగం సిద్ధమైంది. కృషికార్ లోక్ పార్టీ గండిపడి తిమ్మారెడ్డితోపాటు నీలాద్రిరెడ్డి, కూనిసెట్టి వెంకటనారాయణ చీలి కాంగ్రెసులో చేరారు. ఆంధ్ర రాజధాని ఆంధ్ర రాజధాని రభస మద్రాసులోనే ప్రారంభమైంది. గుంటూరు, విజయవాడ మధ్య కావాలని కమ్యూనిస్టులు అన్నారు కనుక, అలావస్తే వారి ప్రాబల్యం పెరుగుతుందని వెలగ పూడి రామక్రిష్ణ అభిప్రాయపడితే, రంగాకూడా తందానా అంటూ ప్రత్యామ్నాయంగా తిరుపతి సూచించాడు. అక్కడ చంద్రగిరి కోట భవనాలు సిద్ధంగా ఉన్నాయన్నాడు. మద్రాసులో జరిగిన అఖిలపక్ష సమావేశం తనకు అధికారం యిచ్చినదంటూ ప్రకాశం సెయింట్ జార్జికోటలో కూర్చొని, కర్నూలు అన్నాడు. మద్రాసు శాసనసభలో ఆంధ్రాబిల్లుపై రాజధాని విషయమై మూడు పర్యాయాలు ఓటింగ్ జరిగింది. కృషికార్ లోక్ పార్టీ చీలి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఓటింగ్ స్వేచ్ఛ ఉండటం వలన భిన్న తీరులుగా ఓటు చేసింది. 1953 జులై 25న జరిగిన తొలి ఓటింగ్.లో లచ్చన్న తటస్థం వహించాడు. తరువాత 1955 ఏప్రిల్ నుండి విశాఖపట్టణానికయితే అభ్యంతరం లేదన్నాడు లచ్చన్న. తరువాత రొక్కం లక్ష్మీనరసింహం దొర ఒక సవరణ ప్రతిపాదిస్తూ అక్టోబరు 56 బదులు 1956 ఏప్రిల్ నుండి విశాఖలో రాజధాని అని ప్రతిపాదించారు. లచ్చన్న తటస్థ్యం వహించారు. మొత్తం మూడు పర్యాయాలు రాజధాని సవరణలపై జరిగిన ఓటింగులో రెండవ పర్యాయం 9 మంది కె.ఎల్.పి. వారు విజయవాడకు ఓటుచేశారు. రెండోసారి మూడోసారి కూడా విజయవాడకే ఓటుచేశాడు. నీరుకొండ రామారావు. కె.ఎల్.పితో సంబంధం లేకుండానే ప్రకాశం, ప్రజాపార్టీ, కాంగ్రెస్ వారు కలసి, నాయకత్వం గురించి సంప్రదింపులు సాగించి, ప్రకాశాన్ని ముఖ్యమంత్రిగా, సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా పంపకాలు చేసుకున్నారు. తగిన బలం లేకున్నా కె.ఎల్.పి.ని ఇంకా చీల్చవచ్చని ఆశించారు. అది వీలుకానప్పుడు లచ్చన్నను మంత్రివర్గంలో చేరమని ఎర్నెని సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ (ఏలూరు) ద్వారా, మద్రాసు వాహిని కార్యాలయంలో ఉంటున్న లచ్చన్నకు కబురు చేశారు. రంగాను ఒప్పించమన్నాడు లచ్చన్న. నార్లచేత సిఫారసు చేయించారు. “రంగాను” ఒప్పించే బాధ్యతనాది, చేరమన్నాడు ఫోనులో నార్ల. అయినాసరే లచ్చన్న రంగా అనుమతిపై పట్టుబట్టాడు. అప్పుడు లక్ష్మీనారాయణను కాపలా పెట్టి, సుబ్రహ్మణ్యం నిడుబ్రోలు వెళ్ళి రంగాను సంప్రదించాడు. రంగా ఫోనులో ప్రకాశంతో మాట్లాడి, ఓటు స్వేచ్ఛ ఉండే హామీపై లచ్చన్న మంత్రివర్గంలో చేరడానికి అంగీకరించడు. అదంతా కాగితంపై పెట్టాడు రంగా. అనుమతి లభించిన లచ్చన్న 1953 నవంబరు 7న కర్నూలులో వ్యవసాయ. కార్మికశాఖామంత్రిగా చేరాడు. మంత్రిగా లచ్చన్న కర్నూలులో ఉంటున్నప్పుడు అతనికి అత్యంత సన్నిహితుడుగా కె.ఎల్.పి. ప్రముఖుడు పావులూరి బసవపున్నయ్య ఎప్పుడూ లచ్చన్న బసలో ఉంటుండేవాడు. అతనినే మాకినేని బసపున్నయ్య అని భ్రమించి, ఎవరో సంజీవరెడ్డికి ఫిర్యాదు చేరవేయగా నిఘా పెట్టించాడు హోంమంత్రి. ఈ విషయం తెలిసి మంత్రివర్గ సమావేశంలో మండిపడగా, క్షమాపణ చెప్పుకొని నిఘా తీసివేయించాడు సంజీవరెడ్డి. కాని మంత్రిగా లచ్చన్న 54 రోజుల కంటే ఉండలేక పోయాడు. ఆంధ్రకు శాశ్వత రాజధాని సమస్య వచ్చింది. మంత్రిమండలి కర్నూలు అని నిర్ణయించింది. కె.ఎల్.పి. గుంటూరు - విజయవాడ అన్నది. కె.ఎల్.పి. సభ్యుడు పుండరీకాక్షాచారి తిరుపతి అంటూ సవరణ పెట్టాడు. లచ్చన్న అది సమర్థించగా రాజీనామా యివ్వమన్నాడు మంత్రివర్గంవారు. ఆ విధంగా రాజధాని సమస్యపై మంత్రివర్గంలో భేదించి రాజీనామా యిచ్చి బయటకొచ్చాడు లచ్చన్న 1954 జనవరిలో. ఆ యేడు వేసవిలో శాసనసభ సమావేశం విశాఖలో పెట్టారు. ప్రేక్షకులకు స్థలంలేక మైక్.లు బయటకు పెట్టారు. లచ్చన్న ఒక తీర్మానం ప్రతిపాదిస్తూ, గీత కార్మికులకు ప్రత్యమ్నాయ వృత్తి అయినా కల్పించాలని లేదా సొంఠి రామమూర్తి సంఘ సిఫారసుల ననుసరించి మద్య నిషేధాన్ని తొలగించాలని ఇందుకు ఒక యితమిత్థమైన తుది గడువు నిర్ణయించాలంటూ ఒక గంటసేపు ఉద్వేగంగా మాట్లాడారు. తరువాత సత్యాగ్రహానికి సిద్ధంకండి అంటూ గీత కార్మికులనుద్దేశించి, ఆంధ్ర అంతటా పిలుపు యిచ్చి, పర్యటించారు లచ్చన్న. సత్యాగ్రహాన్ని కమ్యూనిస్టు పార్టీతోపాటు, కృషికార్ లోక్ పార్టీ ప్రముఖులైన రంగా, ఓబులరెడ్డి, గొర్రెపాటి వెంకట సుబ్బయ్యలు వ్యతిరేకించారు. కార్యకర్తలంతా లచ్చన్నకు అనుకూలంగా నిలబడ్డారు. గీత కార్మికులు లచ్చన్నకు మద్దత్తు ఇచ్చారు. వాతావరణం ప్రతికూలం గావటం చూసి కమ్యూనిస్టులు నిర్ణయాన్ని మార్చుకున్నారు. 1954 మేలో అనేకమందిని ప్రోత్సహించి, సత్యాగ్రహం చేయించాడు లచ్చన్న. చివరకు గుంటూరులో లచ్చన్న భార్య యశోద కూడా జైలుకు వెళ్ళింది. ఈ విధంగా తగిన వాతావరణం సృష్టించిన లచ్చన్న కర్నూలులో మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం నెగ్గటానికి కృషి సాగించాడు. సత్యాగ్రహాన్ని వ్యతిరేకించిన ఓబులరెడ్డి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించటానికి లచ్చన్నతో బాగా సహకరించాడు. లచ్చన్న, ఓబులరెడ్డిగారిరువురూ అహోరాత్రులు కృషి చేశారు. అవిశ్వాస తీర్మానం ఎవరు ప్రతిపాదించాలనే చర్చల అనంతరం కమ్యూనిస్టు పార్టీ చివరకు లచ్చన్నకే ఆ అవకాశం యిచ్చింది. లచ్చన్న, ఓబుల రెడ్డి రాత్రిళ్ళు భోజనానంతరం బి.వి,సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి (డోన్) అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, బత్తిన వెంకట కృష్ణారెడ్డి, చిదానందం (కడప) గార్లను కలిశారు. అలా రాత్రిళ్ళు రావటం యిష్టపడని బి.వి.సుబ్బారెడ్డి ఒక్కవరం మాత్రం ప్రసాదించాడు. మద్దూరి సుబ్బారెడ్డి, వెంకట శెట్టిగార్లకు అడ్డు రానన్నాడు. అదే చాలనుకున్నారు లచ్చన్న. ఓబుల రెడ్డి, ఈ ప్రచార సమయంలో హఠాత్తుగా ప్రకాశంపై ఆగ్రహం వహించి దృతరాష్ట్రుడని తిట్టి లచ్చన్నతో చేరాడు. నడింపల్లి నరశింహారావు అవిశ్వాస తీర్మానం నెగ్గేటట్లుంటే ఓటిస్తానన్నాడు. ఎల్లుండి ఓటింగ్ అనగా నడింపల్లి సందేహం నివృత్తి చేసి, బి.వి సుబ్బారెడ్డి వద్దకు కూడా నడింపల్లిని తీసుకెళ్ళారు. రేపు ఓటింగ్ అనగా లచ్చన్న వద్దకు ప్రకాశం రాయబారం పంపాడు. “నన్ను తిట్టడం అయిపోయిందిగదా నీకు కావలసినట్లు జి.ఓ.యిస్తాను, అవిశ్వాస తీర్మానం ఉపసహరించుకోమని” బత్తిన రామకృష్ణారెడ్డి ద్వారా సందేశం చేరవేశాడు. పూర్తి స్వేచ్ఛతో లచ్చన్నకు మళ్ళీ మంత్రిపదవి యిస్తామన్నారు. కాని లచ్చన్ అంగీకరించలేదు. “మా విశ్వాస తీర్మానం నెగ్గదంటున్నారు గదా, మీకేమి భయం” అని వచ్చాడు. తీరా ఓటింగ్ జరిగితే ఒక్క ఓటుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అనుకూలంగా ఓటు ఇస్తానన్న చిదంబరం తటస్థమయ్యాడు. తీర్మానం వీగిపోతే లచ్చన్నను కొట్టాలని చాలామంది సిద్ధమై బయటఉన్నారు. కాని వారికి మించిన బలంతో గీత పారిశ్రామికులు ఉండటం వలన ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఆ రాత్రే ప్రకాశం మరలా లచ్చన్నకు కబురు చేశాడు. తెన్నేటి విశ్వనాథం ఒక ప్రకటన ముసాయిదా సిద్ధం చేసి ఉంచాడు. మళ్ళీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేద్దామనేది సారాంశం. ఈ మంత్రివర్గంలో ఉండనని వచ్చేశాడు లచ్చన్న. శాసనసభ రద్దు అయింది. గీత సత్యాగ్రహులందరినీ విడుదల చేశాడు. లచ్చన్న కీర్తి ఆంధ్ర అంతటా తారాస్థాయిని అందుకున్నది. జరగబోయే ఎన్నికలలో కమ్యూనిస్టులతో కలసి పోటీ చేయాలనే ప్రాతిపదికపై కాట్రగడ్డ రాజగోపాలరావు, విశ్వేశ్వరరావు కర్నూలులో లచ్చన్నతో మంతనాలు జరిపారు. కాని కుదరలేదు. ఇది అనధికారంగా జరగడం వలన అంతటితో సమసిపోతుంది. కర్నూలు నుండి లచ్చన్న తిరుపతి వెడుతూ త్రోవలో అనేక సన్మానాలు అందుకున్నాడు. దానితోపాటే నంద్యాలలో జరిగిన బహిరంగసభ గందరగోళంతో నిండిపోయింది. కొట్లాటలు జరిగాయి. రాయలసీమ అంతా పర్యటించాడు. దిగువ మాఘంలో సన్మానం చేసారు. తిరుపతిలో ఉండగా తల్లి చనిపోయిందని తెలిసి, సరాసరి ఇంటికి వెళ్లాడు. ఒక పక్షం రోజులపాటు రాజకీయలోకంతో సంబంధం లేకుండా గడిపాడు. లోపు చాలా గ్రంథం నడిచింది. ఆంధ్రను కమ్యూనిస్టుల బారినుండి కాపాడమంటూ ఢిల్లీలో నెహ్రూ నుండి రంగా వద్దకు నిత్యమూ రఘురామయ్య, లాల్ బహదూర్ శాస్త్రి, మల్లయ్య, బల్వంతరాయం మెహతాలు, ప్రదక్షణలు చేశారు. ప్రజాస్వామ్యం కోసం వెయ్యి లచ్చన్నలనైనా త్యాగం చేస్తామని ఓబుల రెడ్డి ప్రకటించాడు. కె.ఎల్.పి. కాంగ్రెస్.తో సహకరిస్తుందని ఢిల్లీ నుండి, ఎవరినీ సంప్రదించకుండా రంగా ప్రకటించాడు. పత్రికా విలేఖరులు లచ్చన్నను ప్రశ్నించగా, పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా ఆయన మౌనం వహించాడు. కాని లోలోన చాలా బాధపడ్డాడు. కృషికార్ లోక్ పార్టీకి నెహ్రూ దృతరాష్ట్ర కౌగిలి కాంగ్రెస్ కృషికార్ లోక్ పార్టీలు విలీనం కావడానికి ముందు చాలా గ్రంథం నడిచింది. కాంగ్రెస్.లో చేరటమనేది లోక్ పార్టీ కార్యకర్తలకు ఇష్టంలేదు. కాని రంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రకటన యిచ్చాడు. ఓబుల రెడ్డి ఒప్పుకున్నాడు. మిగిలింది లచ్చన్న ఒక్కడే గనుక కార్యకర్తలంతా ఆయనపై ఆశ పెట్టుకున్నారు. లచ్చన్నకు కూడా కాంగ్రెస్.లో చేరటం బొత్తిగా ఇష్టం లేదు. అప్పటికే విశాఖ శ్రీకాకుళం స్థానాలకు సంబంధించి సోషలిస్టు పార్టీతో సంప్రదించి, పొత్తు పెట్టుకున్నాడు లచ్చన్న. వి.వి.రమణ, పి.వి.జి.రాజు, లచ్చన్న కలసి యీ విషయమై ఒక ఒప్పందానికి వచ్చారు. విజయవాడలో అనేక కాంప్.లు పెట్టి కాంగ్రెస్ వారు నిర్విరామంగా చర్చలు సాగిస్తున్న సమయానికి లచ్చన్న చేరుకున్నాడు. ముందుగా రంగాను సంప్రదించనిదే ఏ నిర్ణయానికి రాకూడదనుకున్న లచ్చన్నకు, కమ్యూనిస్టుల బూచిని చూపారు. చల్లపల్లి రాజా, కొత్త రఘురామయ్య, జాగర్లమూడి చంద్రమౌళి యిందులో ఉన్నారు. కమ్యూనిస్టుల భయం లోక్.పార్టీకే పట్టిందా, కాంగ్రెస్.కు లేదా అని లచ్చన్న ప్రశ్నించాడు. లోక్.పార్టీ వారి సమావేశంలో లచ్చన్న కాంగ్రెస్.లో విలీనాన్ని వ్యతిరేకించాడు. కార్యకర్తల అభిప్రాయాన్ని ప్రతిబింబించాడు. రంగాతో భేదిస్తున్నందుకే బాధపడి కంటతడి పెట్టాడు. అవసరమైతే రాజకీయాలకు ఉద్వాసన చెబుతానన్నాడు. చల్లపల్లి రాజా వర్గం లచ్చన్న వెంటపడి బ్రతిమలాడారు. లోక్.పార్టీ మాత్రమే ఎందుకు త్యాగం చెయ్యాలో చెప్పండని లచ్చన్న ప్రశ్నిస్తే వారినుండి జవాబు లేదు. లోక్ పార్టీలో రంగా, ఓబులరెడ్డి పక్షాన ఐదారుగురుకంటే మించి లేరు. అందరూ లచ్చన్న వాదాన్ని సమర్థించారు. చివరకు ఎలాగైతేనేమి రంగా మనసు మార్చుకొని లచ్చన్న తీర్మానాన్ని బలపరిచాడు. ఓబులరెడ్డి బాధపడ్డాడు. లచ్చన్న తీర్మానం ఏమిటి? ప్రజాస్వామ్య సంరక్షణకై ప్రజాస్వామిక పక్షాలతో సహకరించడానికి, సిద్ధాంతాలకు భంగం లేకుండా, కృషికార్ లోక్ పార్టీ సిద్ధంగా ఉన్నదని, ఎన్నికల గుర్తు కూడా లోక్ పార్టీదే ఉండాలని కూడా తీర్మానించారు. రంగాకు కమ్యూనిస్టుల భయం రెండవసారి పట్టుకున్నది. తొలి పర్యాయం మద్రాసులో రాజగోపాలాచారి మంత్రివర్గ సందర్భంలో కాగా, 1955 నాటికి అదే స్థితి పునరావృతమయింది. లోక్ పార్టీని నాశనం చేయటానికి నెహ్రూ వేసిన పథకమనీ, కనుక రద్దు చేయవద్దనీ లచ్చన్న వాదన. లచ్చన్న దృష్టి అప్పట్లో రంగాను ఆకర్షించలేదు. ఉత్తరోత్తరా తాను చేసింది తప్పు అనీ, లచ్చన్న చెప్పిందే సరైనదనీ రంగా అంగీకరించాడు. (చూడండి, లచ్చన్న 59వ జన్మదిన సంచికలో రంగావ్యాసం) విజయవాడలో లోక్.పార్టీ సమావేశం జరుగుతుండగా, ఏలూరులో అదే సమయానికి కాంగ్రెసుపార్టీ సమావేశం జరిపి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరాదని తీర్మానించింది. బల్వతంరాయ్ మెహతా ఆ సమావేశంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. కనుక లోక్.పార్టీతో పొత్తు కుదరదని లచ్చన్న, కార్యకర్తలు భావించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్య లోక్.పార్టీ గుత్తపొత్తుకాదని లచ్చన్న వాదన. బల్వంతరాయ్ మెహతా హుటాహుటిన నిడుబ్రోలు వెళ్ళి రంగాను సంప్రదిస్తుండగా కాంగ్రెసులో కలియటానికి అడ్డుపడిన లచ్చన్నను ఆంధ్రప్రభ దుయ్యబట్టింది. ఏమైతేనేమి కాంగ్రెస్ వారు రాజీకి వచ్చి, విజయవాడ సిరీస్ రాజు యింట్లో సమావేశమై జిల్లాలవారీగా స్థానాలు నిర్ణయించారు. ఓబులరెడ్డి, గోపాలరెడ్డి ప్రభృతులు ఈ పంపకాలలో పాల్గొన్నారు. విశాఖ, శ్రీకాకుళం విషయం వచ్చేసరికి లచ్చన్న రావాలని లోక్ పార్టీ నాయకులన్నారు. ఓబులరెడ్డికి అప్పటికే లచ్చన్నపట్ల అయిష్టత ఏర్పడినా, తప్పనిసరై అతన్ని పిలిపించవలసి వచ్చింది. లచ్చన్నను పిలిపించి విశాఖ, శ్రీకాకుళం జిల్లాల జాబితా యిస్తే, ఆమోదిస్తానన్నారు కాంగ్రెసు నాయకులు. కాంగ్రెసు వారు జాబితా యిచ్చారా అని లచ్చన్న ఎదురు ప్రశ్న వేశాడు. అంతటితో సంజీవరెడ్డి, కళా వెంకటరావులు ఆగ్రహించగా సమావేశం స్తంభించింది. ప్రజాపార్టీ తరఫున తెన్నేటి విశ్వనాథం మధ్యవర్తిత్వం వహించి, స్థానాల విషయం తేల్చుకుందామన్నాడు. జాబితా ఆమోదం అనే ప్రస్తావన అంటూ ఉంటే ఉభయులపరంగా ఉండాలిగాని, ఒక లోక్.పార్టీ జాబితా సమర్పించటం అర్థరహితం అన్నాడు లచ్చన్న. శ్రీకాకుళం, విశాఖ వరకు లచ్చన్నకు వదిలేస్తున్నామన్నారు. కాని కాంగ్రెసుతో ఎలాగైనా తెగతెంపులు జరిగితే బాగుండునని అభిలషించిన లచ్చన్న కొత్త అడ్డంకి పెట్టాడు. సోషలిస్టు పార్టీతో పలాసాలో అంతకుముందే ఒప్పందం జరిగింది గనుక అది గౌరవించాలన్నాడు. ఆ ఒప్పందం పట్ల వెనక్కు పోజాలనని స్వేచ్ఛ కావాలని లచ్చన్న పట్టుబట్టాడు. అంతేగాక సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఎత్తుగడ గీత సత్యాగ్రహుల విషయంతో ఉండాలని మద్య నిషేధం తొలంగించటమో ప్రత్యామ్నాయం చూపటమో నిర్దిష్టంగా జరగాలని మరొక పేచీ పెట్టాడు లచ్చన్న. మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడింది. లోక్.పార్టీ వారు లచ్చన్నపై ఎంతో వత్తిడి చేసినా, ససేమిరా అన్నారు. తక్షణం గోపాలరెడ్డి గత్యంతరం లేక నెహ్రూకు ఫోనుచేయగా వెంటనే ఢిల్లీ రమ్మన్నాడాయన. ఢిల్లీలో కూడా యీ విషయాలే నెహ్రూ సమక్షంలో ఉంచుతానని నిర్మొహమాటంగా చెప్పి బయలుదేరాడు లచ్చన్న. పేచీ అంతా లచ్చన్నతోటేనని కాంగ్రెసు నాయకులు నెహ్రూకు చెప్పారు. లచ్చన్న వివరంగా అన్నీ పూసగుచ్చినట్లు జవహర్.లాల్.కు చెప్పాడు. ఆలస్యంగా సంప్రదింపులకొచ్చిన దోషం కాంగ్రెసుది గనుక సోషలిస్టు పార్టీతో ఒప్పందం తప్పలేదనీ, జాబితాల అంగీకారం అంటూఉంటే పరస్పరం ఉండాలేగానీ, ఏకపక్షంగా ఉండరాదని లచ్చన్న వాదించాడు. అంతటితో ఇక కాంగ్రెసుకు వీడ్కోలు చెప్పవచ్చని లచ్చన్న ఉవ్విళ్ళూరాడు. కాని నెహ్రూ తెలివిగా లచ్చన్నను సమర్థించి పొగడి, లచ్చన్న చెప్పినట్లే కానివ్వాలన్నాడు. లచ్చన్న ఆశ్చర్యపోయి, మనసులు విరిగిన అనంతరం కాంగ్రెసుతో కలసి ఆంధ్రలో పనిచేయటం కష్టమన్నాడు. నెహ్రూ అర్థం చేసుకుని, తనపై విశ్వాసం లేదా అన్నాడు. ఉండబట్టే వచ్చానని లచ్చన్న అనగానే, భవిష్యత్తులో కూడా ఏది ఉన్నా తన వద్దకు రావచ్చునని చెప్పాడు నెహ్రూ. అంతటితో కాదనలేక లచ్చన్న అంగీకారం తెలిపాడు. ఎన్నికల ప్రణాళిక తుది రూపానికి కూడా లాల్.బహదూర్.ను సంప్రదించమన్నాడు. నెహ్రూ లచ్చన్న కోరిక ప్రకారమే ఎన్నికల ప్రణాళిక తొలి వాక్యం గీత కార్మికుల ప్రస్తావనతో ఆరంభమైంది. ఎన్నికల ప్రచారంలో లచ్చన్నను డేబర్.తో ముడిపెట్టారు. మొత్తం మీద ఎన్నికలు ఉధృతం బాగా సాగి, కమ్యూనిస్టులు పూర్తిగా ఓడటం, ఐక్య కాంగ్రెసు విజయం సాధించటం యీ కలయిక వలననే అనేది నిర్వివాదాంశం. ఎన్నికలలో మితిమీరిన స్థానాలు వచ్చేసరికి కాంగ్రెసు వారు ఎన్నికల పూర్వపు స్థితి విస్మరించటం ఆరంభించారు. ఢిల్లీలో గోపాల రెడ్డి, రంగా చర్చలు జరిపి, లోక్.పార్టీకి మూడు స్థానాలు మంత్రివర్గంలో ఉండాలనుకున్నారు. కాని నాయకత్వం విషయమై పేచీరాగా, నీలం సంజీవరెడ్డి, బలం తేల్చుకోవటానికి రహస్య ఓటింగ్ పెట్టారు. శ్రీమన్నారాయణ అగర్వాల్ నిర్వహించిన ఎన్నికలలో గోపాలరెడ్డికి బలాధిక్యం ఉన్నదని ప్రకటించారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పవద్దని ముందుగనే హైకమాండు ఆదేశించింది. 15 ఓట్లు అధికంగా తెచ్చుకున్న సంజీవరెడ్డిని అన్యాయం చేశారంటూ అల్లూరి సత్యనారాయణ రాజు, మంతెన వెంకటరాజులు ప్రచారం చేసారు. లోక్ పార్టీ వారు తమ పార్టీ పక్షంగా లచ్చన్న, ఓబుల రెడ్డి, నీరుకొండ రాఘవుల పేర్లు ఇవ్వగా, మంత్రివర్గం ప్రకటించాడు. ఓబులరెడ్డి పేరు అదృశ్యమైంది. దానితో ఓబుల రెడ్డి తల్లక్రిందులయ్యాడు. అతనికి ఇవ్వనందుకు నిరసనగా లచ్చన్న ప్రమాణ స్వీకారానికి వెళ్లనన్నాడు. అయితే అప్పటినుండి ఓబులరెడ్డి మాత్రం రంగాను దూషించటం ప్రారంభించి, కమ్మయిజం ఆచరిస్తున్నట్లు ప్రచారం చేశాడు. అతను స్థానే మరో పేరు ఇస్తే, ఢిల్లీలో సంప్రదిస్తామని సంజీవరెడ్డి అడిగాడు. ప్రమాణం చెయ్యవలసిందని రంగా, దేబర్.లు లచ్చన్నకు ఫోన్ చేశారు. లాల్ బహదూర్, వల్లభపంత్.లు కూడా లోక్ పార్టీ విషయం పరిశీలిస్తామని హామీ యిచ్చారు. మొత్తం మీద అందరి ఒత్తిడితో లచ్చన్న మంత్రివర్గంలో చేరాడు. చేరినప్పటినుండి ఓబుల రెడ్డికై రాయబారాలు సాగిస్తూనే ఉన్నాడు. గోవింద వల్లభపంత్, చూద్దాం, అనే ధోరణి ప్రదర్శించాడు. ఓబులరెడ్డిని చేర్చుకోవటం గోపాలరెడ్డికి ఇష్టం లేదో సంజీవరెడ్డి, అభ్యంతరమే పైచేయి అయిందో తేలలేదు. వ్యవసాయ మంత్రిగా ఉన్న నీరుకొండ రామారావు మద్రాసులో ఉన్న వ్యవసాయ ఫైళ్ళను చూడటానికి వెళ్ళి, గుండెపోటుతో ఆస్ప్రత్రిలో చేరాడు. కోలుకుంటూ, మరునాడు ఉదయం యింటికి పంపిస్తారనగా, హఠాత్తుగా మరణించాడు. ఆ మరణం వల్ల అనేక అనుమానాలు ఉన్నయ్. ఆ సమయానికి తిరుపతి కొండపై ఉన్న లచ్చన్న ఈ వార్త అందుకొని రాజమండ్రి వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొని వచ్చాడు. వచ్చినప్పటి నుండీ ఓబులరెడ్డికై పోరాటాలు ఉధృతం చేసి చివరకు రాజీనామా పత్రాన్ని గోవిందవల్లభపంత్.కు అందివ్వగా, అప్పుడు దారికి వచ్చారు. ఓబుల రెడ్డిని చేర్చుకుంటూ ప్రకటన వచ్చింది. ఓబులరెడ్డికి లచ్చన్న పెద్ద విందు ఏర్పాటు చేసి, ఉపముఖ్యమంత్రి సంజీవరెడ్డిని స్వయంగా ఆహ్వానించి వచ్చాడు. ఆ విందు సందర్భంగా మాట్లాడుతూ, ఓబులరెడ్డి ఉంటే నే ఉండాలి. లేకపోతే సంజీవరెడ్డి ఉండాలి. ఇద్దరం యిమడటానికి వీల్లేదని, కట్టెవిరచినట్లు మాట్లాడాడు. ఫలితంగా సంజీవరెడ్డి ఉన్నాడు. సాంఘిక సంక్షేమ మంత్రిగా నిస్వార్థ సేవ గ్రామీణ ప్రాంతాల విద్యుదీకరణకు నిరంతర కృషి మొదటిసారిగా ఆంధ్రలో పిడబ్ల్యుడి శాఖను విద్యుచ్ఛక్తి శాఖను విభజించి, లచ్చన్నకు విద్యుత్ శాఖామంత్రి పదవి ఇచ్చాడు. దానితోపాటు కార్మిక సాంఘిక సంక్షేమం కూడా లభించింది. లచ్చన్న మంత్రి పదవిలో ఉండగా జరిగిన కొన్ని విశేషాలు పేర్కొందాము. హరిజన హాస్టళ్ళు అప్పటికే ప్రైవేటు హరిజన హాస్టళ్ళపై విపరీతమైన ఫిర్యాదులున్నవి. హరిజన విద్యార్థుల పేరుతో కొందరు హరిజన నాయకులే దోపిడీ చేస్తూ తింటుండేవారు. లచ్చన్న ఫిర్యాదులున్న హాస్టళ్ళు తనిఖీ చేశాడు. కొన్ని హఠాత్తుగా చూచాడు. తరువాత ఒక నూతన ప్రతిపాదన చేసాడు. హరిజన హాస్టళ్ళలో 16 శాతం వెనకబడిన కులాలవారు, వెనుకబడిన హాస్టళ్ళలో 10 శాతం హరిగిరిజన విద్యార్థులు ఉండాలని, తద్వారా సమైక్యత కూడా ఏర్పడుతుందని ప్రభుత్వ ఉత్తరువు ఇచ్చాడు. అంటరానితనం పోవాలని గోలచేసే వారంతా యీ జి.ఓ. పట్ల హాహాకారాలు చేసారు. రెండవది, విద్యార్థులకు చెందవలసిన డబ్బు హాస్టళ్ళ యజమానులకిచ్చేకంటే విద్యార్థుల తల్లిదండ్రులకివ్వాలని లచ్చన్న ప్రతిపాదించాడు. హాస్టళ్ళనే నమ్ముకుని వ్యాపారం సాగిస్తున్నవారికి అది పిడుగుపాటు అనిపించి, అభ్యంతరపెట్టారు. అందులో విచిత్రమేమంటే, కొందరు హరిజన నాయకులు రంగావద్దకు రాయబారం వెళ్ళి, లచ్చన్నపై ఇదొక ఫిర్యాదుగా చెప్పి, ఆ వుత్తరువు రద్దు చేయించమన్నారు. ఆ విధంగా సిఫారసు చేస్తూ రంగా ఏకపక్ష నిర్ణయంగా లచ్చన్నకు ఉత్తరాలు వ్రాసి, మనుషుల ద్వారా పంపాడు. అంతేగాని లచ్చన్నను సంప్రదించి, న్యాయాన్యాయాలు విచారించలేదు. రంగాగారికి ఎవరు ముందు వెళ్ళి చెబితే వారి వాదమే సరైనది. కాని లచ్చన్న మాత్రం తన ఉత్తరువును కొనసాగించాడేగాని, రంగా సిఫారసులు వినలేదు. అసలు విషయమంతా రంగాకు విడమరచి చెప్పాడు. హరిజనులకు జరుగుతున్న అన్యాయాలు వివరించాడు. లచ్చన్నకు వ్యతిరేకంగా ఆందోళన గావించిన హరిజన ప్రముఖులలో వేముల కూర్మయ్య పేర్కొనదగిన వ్యక్తి. హరిజనులకిచ్చే నిధులు లచ్చన్న తగ్గించేస్తున్నాడని కూడా ప్రచారం చేశారు. ఏమైనాసరే, హరిజనులకు న్యాయం చేకూరాలంటే, గ్రాంటులోని డబ్బు తల్లిదండ్రులకు యివ్వటమే మంచిదని లచ్చన్న భావించాడు. రాజమండ్రిలో హరిజన హాస్టళ్ళ యజమానుల సమావేశం ఏర్పాటు చేశారు. లచ్చన్న వాటికి సాంగోపాంగంగా వివరించాడు. తనకు సమర్పించిన మెమోరాండానికి సమాధానం చెప్పాడు. కానీ తినమరిగిన కొందరు, లచ్చన్నను లొంగదీయాలని విఫల ప్రయత్నం చేశారు. ఉన్న విధానం యథాతథంగా అట్టిపెట్టమని ముఖ్యమంత్రి గోపాలరెడ్డి వ్రాశారు. అంతటితో లచ్చన్న రెచ్చిపోయి సాంఘిక సంక్షేమ శాఖను ఎత్తివేయమంటూ, తనవద్దగల ఫైళ్ళన్నీ కట్టగట్టి పంపివేశాడు. గోపాలరెడ్డి దిగివచ్చి ఉత్తరువును ఆమోదించాడు. ప్రతితాలూకా కేంద్రంలో ఒక ప్రభుత్వ హాస్టల్ ఉండాలని కూడా లచ్చన్న ప్రతిపాదిస్తే, జిల్లా కేంద్రం వరకూ ఆమోదించారు. విద్యుత్ శాఖ ఇక విద్యుత్ శాఖ చూద్దామా ఆంధ్ర వేర్పాటు అయినప్పుడు, మద్రాసునుండి వస్తూ ఇంజనీర్ సోమయాజులు గిండీలోని విద్యుత్ కర్మాగారం గిడ్డంగి నుండి రాత్రికి రాత్రే చాలాభాగం సామాన్లు లారీలపై గుంతకల్లుకు చేరవేయించాడు. అయితే అతనిపై చాలా అభియోగాలున్నాయి. అన్నీ అవినీతికి చెందినవే. ఫైలు లచ్చన్న దగ్గరకు వచ్చింది. ఆ సమయానికే ఒకనాడు గవర్నర్ త్రివేది లచ్చన్న దగ్గరున్న ఫైలు తెప్పించాడు. తరువాత లచ్చన్నను పిలిపించి, ముఖ్యమంత్రి గోపాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఓ.పుల్లారెడ్డి సమక్షంలో సోమయాజులను గురించి లచ్చన్న అభిప్రాయం అడిగాడు. అప్పుడు సోమయాజులు ప్రక్కగదిలో ఉన్నట్లు లచ్చన్నకు తెలియదు. త్రివేది ప్రశ్నకు సమాధానంగా లచ్చన్న, రెండుమాసాలక్రితమే ఈ శాఖ చేపట్టాను, ఇంకా చూడలేదు అన్నాడు. అయితే మద్రాసులో ఉండగా బాగా పనిచేసిన వ్యక్తి అని చెప్పాడు. విభజన సంఘంలో లచ్చన్న ఉండగా, సోమయాజులు వచ్చి తనకు ప్రధాన ఇంజనీరుగా తీసుకోవలసిందిగా కోరాడు. కాని ఆయనపై గల అభియోగాలు తీవ్రమైనవి. కనుక ఏమిచెయ్యాలి అని త్రివేది ప్రశ్న. లచ్చన్న ఎంత సేపటికి చెప్పకపోయేసరికి త్రివేది డొంకతిరుగుడు మానేసి, అసలు విషయం ప్రస్తావించాడు. సోమయాజులు బాగా పనిచేసే వ్యక్తి గనుక, ఒక హెచ్చరిక చేసి, ఫైలు మూసేస్తే సరిపోతుందని, అందుకు లచ్చన్న ఆమోదం ఉంటే సరిపోతుందని అంతకు ముందే సంప్రదించుకున్నారు. ఆ విధంగానే కానివ్వండని లచ్చన్న అన్న తర్వాత, ప్రక్కగదిలో ఉన్న సోమయాజుల్ని పిలిపించి, హెచ్చరించి, బాగా పనిచేయమని గవర్నర్ చెప్పాడు. ఫైలు మూసేశారు. సోమయాజులు మాత్రం నిర్విరామంగా పనిచేశారు. విద్యుత్.కు సంబంధించిన దరఖాస్తు వస్తే, పార్టీ విచక్షణ లేకుండా లచ్చన్న ఆమోదించాడు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక మినహాయింపులు జరిపించాడు. మౌఖిక ఉత్తరువుల ద్వారా, ఇంజనీర్లతో కృషి చేయించాడు. పథకాలు కుప్పతెప్పలుగా ఆమోదించాడు. వాటినన్నిటినీ ఆమోదించాడు. కాని ఆర్థికశాఖ అడ్డుపడింది. డబ్బు లేదన్నది. వారికి తలవూపాడు ముఖ్యమంత్రి. కాని లచ్చన్న పట్టుదలబూని, ముందు పథకం ఆమోదించటానికి అభ్యంతరం ఏమిటన్నాడు. అందులో కిటుకు వెంటనే గ్రహించలేక ఆమోదించారు. తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం కూడా లచ్చన్న ఆమోదించిన పథకాలే అమలుచేస్తూ పనిచేయవలసి వచ్చింది. సాధ్యమైనంతవరకు సోమయాజులు కృషిచేసి లచ్చన్నకు సహకరించాడు. గ్రామీణ ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యత యిచ్చారు. విస్తృత పథకాలు అమలుజరిపారు. ఇంచుమించు 1200 గ్రామాలకు విద్యుత్ సరఫరా జరిగింది లచ్చన్న హయాంలో. లచ్చన్న మంత్రిగా ఉన్నంతవరకూ కార్మికులెవరూ సమ్మెచేయలేదు. సమ్మె నోటీసు రాగానే ఐ.ఎన్.టి.యు.సి. వారి విధానం ప్రకారం త్రైపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయించేశాడు లచ్చన్న. ఆ విధంగా ఐ.ఎల్.టి.యు.డి.లో సమ్మెలు రాకుండా చేయగలిగాడు. విజయవాడలో ఒక కార్మిక కాలనీ కట్టించాలని ప్రతిపాదించాడు. అందుకు నమూనా వేయించి, ఒక ఆదర్శ గృహాన్ని చీఫ్లేబరు ఇన్స్పెక్టరు డాక్టర్ చలపతిరావు సోదరునిచే నిర్మింపచేశాడు. అది కర్మూలులో లచ్చన్న భవన ప్రాంగణంలో ఉండేది. ఆయన మంత్రిగా ఉన్నంత కాలం కృషికార్ లోక్ పార్టీ కార్యకర్తలు అందులో మకాం చేస్తుండేవారు. రెవిన్యూ మంత్రి కల్లూరి చంద్రమౌళికీ, లచ్చన్నకూ చెంచు రామనాయుడు విషయమై తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చినవి. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు రాజకీయ బాధితుడుగా, కందుకూరు వద్ద ఏభై ఎకరాల సరివితోటకు పట్టా వ్రాయించుకున్నాడు. ఆ తోట కష్టించి పెంచామంటూ హరిజనులు లచ్చన్నకు విజ్ఞప్తి చేసుకోగా, ఫైలు తెప్పించాడు. అప్పటికే ఆమోదముద్ర వేశాడు చంద్రమౌళి. ఆర్.డి.ఓ. తహసిల్దార్ వ్రాసినదానికి వ్యతిరేకంగా చంద్రమౌళి ఈపని చేశాడు. అదిచూచి, మూడుపుటల నోట్ వ్రాశాడు లచ్చన్న. గోపాలరెడ్డి యింట్లో విడిది చేస్తున్న చెంచు రామానాయుడు కోదండరామిరెడ్డితో సహా లచ్చన్న వద్దకు రాయబారం వచ్చాడు. కాని యథావిధిగా ఆయనమాత్రం కిమ్మనడు. అంతా కోదండరామరెడ్డి వకాల్తాపుచ్చుకొని చెప్పాడు. లచ్చన్న వినలేదు. అంతటితో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేవరకూ ఫైలు ఆగింది. ఆంధ్రప్రదేశ్.లో కాంగ్రెస్ చర్యలకు ఆటంకం లేదు గనుక, ఆ భూమి చెంచు రామానాయుడుకు దత్తం చేశాడు. లచ్చన్న మంత్రిగా ఉన్నంతకాలం ఆయనకు అంతరంగికంగా పోరు తప్పలేదు. కృషికార్ లోక్.పార్టీలో చోటానాయకులు కొందరు కథలు గాథలు అల్లి, అవిమోసుకెళ్ళి రంగా దంపతులకు ఏకరువుబెడుతుండేవాడు. అంతవరకు బాగానే ఉన్నది. కాని రంగా వాటిని నమ్మి, లచ్చన్నపై కినుక వహించాడు. కనీసం నిజం తెలుసుకోటానికి ప్రయత్నించలేదు. నెలకు వచ్చే జీతం మిగలక, పార్టీ కార్యకర్తలందరికీ ఆతిథ్యం యిస్తున్నందుకు లచ్చన ఫిర్యాదుల పాలయ్యాడు. మంత్రిగా ఉండగా లచ్చన్న తాడిచెట్టు కింద పాలు త్రాగాడు. అది ఆసరాగా తీసుకొని చాలా ఫిర్యాదులు హైకమాండ్.కు చేరవేశారు. అందులో ప్రధానమైనది కృష్ణాజిల్లాలో పనికిరాని భూమి ఒక ఏభయ్ ఎకరాలు లచ్చన్న భార్యపేరిట వ్రాయటం. ఎన్.వి. నాయుడు యిత్యాదులంతా యీ భూమి ప్రతిపాదన చేసినప్పుడు లచ్చన్న నిరాకరించాడు. రంగాతో చెప్పించాడు. ఆయన ఆమోదంతో లచ్చన్న భార్య యశోద పేరిట వ్రాయించారు. ఇలా భూమి ఇవ్వటంతో దాతలకు ఎంత స్వార్థముందో చెప్పజాలం. కాని మంత్రిగా వుండి లచ్చన్న స్వీకరించటం దురుద్దేశాలు ఊహించటానికవకాశం ఏర్పడింది. సాగుకురాని ఆ భూమిని ఉత్తరోత్తరా అమ్మి, వచ్చిన కొద్ది మొత్తంతో ఒక ప్రెస్ కొన్నాడు లచ్చన్న. రెండవది డైమండ్ నెక్లెస్ ప్రచారం. లచ్చన్న పెండ్లిలో కిల్ల అప్పలనాయుడు ఆరు తులాల బంగారపు గొలుసు కానుకగా యిచ్చాడు. అందులో రంగూన్ డైమండ్స్ పొదిగి, ధరించేది యశోద. లచ్చన్న మంత్రిగాకపూర్వం ఎన్నో పర్యాయాలు ధరించినా ఎవరూ పట్టించుకోలేదు. కాని మంత్రి భార్యగా ఆమె కంఠంలోని రంగూన్ పూసల మెరుపు ప్రత్యర్థులకు డైమండ్స్.గా కనిపించాయి. ఈ ఫిర్యాదు కాంగ్రెస్ వారు హైకమాండ్.కు చేయగా, కె.ఎల్.సి. వారు తమ హైకమాండ్ అయిన రంగాకు విన్నవించుకున్నారు. ఆయన కూడా యిది మనసుకు పట్టించుకున్నాడు. కృషికార్ లోక్.పార్టీ వారెవరు వచ్చినా, లచ్చన్న తాను మంత్రినని మరచి, దరఖాస్తులు తీసుకుని యితర మంత్రల వద్దకు వారిని తీసుకెళ్ళేవాడు. ఏ మంత్రీ చెయ్యని యీ పద్ధతి వలన కొందరు మంత్రులు యిరకాటంలో పడేవారు. ముఖ్యంగా పి.డబ్ల్యుడి. సమస్యలపట్ల తరచు సంజీవరెడ్డి వద్దకు వెడుతుండేవాడు. విశేషమేమంటే రాజకీయ ప్రత్యర్థి అయినా సంజీవరెడ్డి లచ్చన్నపట్ల హుందాగా ప్రవర్తించటమే గాక పనులు చేస్తుండేవాడు. ముఠా రాజకీయాల కాంగ్రెసుకు విడాకులు స్వతంత్ర పార్టీకి నాందీ ప్రస్థావన కర్నూలులో రాజధాని వుండగా పేర్కొనదగిన విశేషాలు కొన్ని వున్నవి. అసెంబ్లీ స్పీకర్.గా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని నీలం సంజీవరెడ్డి తలపెట్టాడు. గోపాలరెడ్డికి సంజీవరెడ్డికి మధ్య కళావెంకటరావు ద్విపాత్రాభినయం గావిస్తూ నీలంవారివైపు మొగ్గుచూపారు. తన అభ్యర్థిత్వాన్ని సమర్థించమని లచ్చన్నను కోరాడు బ్రహ్మానందరెడ్డి. తన పార్టీని అడగాలన్నాడు. లచ్చన్న, ఎన్నికపూర్వం కల్లూరి చంద్రమౌళి ఇంట్లో ముఠా సమావేశం జరిపారు. బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని కళా ప్రతిపాదించగా చంద్రమౌళి సమర్థించాడు. గోపాలరెడ్డికి బలం లేదని ఋజువు చేయడానికే యీ ప్రయత్నమా అని లచ్చన్న ప్రశ్నించాడు. ఏమైనా సంజీవరెడ్డి, గోపాలరెడ్డి బలాబలాలు తేలితే మంచిదని, కనుక పోటీ భావ్యమని లచ్చన్న వాదించాడు. చివరకు అదే ఖాయమైంది. స్వతంత్రుడుగా గెలుపొంది కాంగ్రెసులో చేరిన శ్రీకాకుళం శాసనసభ్యుడు రొక్కం లక్ష్మీనరసింహం దొరను లచ్చన్న సూచించాడు. 20 ఓట్ల బలంతో ఆయన గెలిచాడు. అప్పటి నుండి బ్రహ్మానందరెడ్డి ఒక కన్నువేసి ఉంచాడు లచ్చన్నమీద. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి సమయం ఆసన్నమౌతుండగా ముఖ్యమంత్రిత్వానికి కుమ్ములాట ప్రారంభమైంది. సంజీవరెడ్డి తీవ్రకృషి చేసుకున్నాడు. బూర్గుల రామకృష్ణారావు విఫల ప్రయత్నం చేశాడు. బెజవాడ గోపాల రెడ్డి ఎలాగూ రంగంలో ఉన్నాడు. కాని నిర్మాణాత్మక కృషి జరపలేదు. అలాంటి సమయాల్లో రంగాకు ఏమైనా ఛాన్స్ తగులుతుందేమోనని లచ్చన్న ప్రయత్నించాడు. బలం ఉందని రుజువైతే సమర్థిస్తానన్నాడు కల్లూరి చంద్రమౌళి. కాని ఆశ అడియాశగా మారింది. ఈ సందర్భంగా రంగా కూడా కర్నూలు వచ్చాడు. పదవిపై మోజు ఉన్నదో లేదో తెలియదుగాని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనుచూపుమేరలో కనిపించలేదు. అంతటితో రంగా రంగనిష్క్రమణ చేయక తప్పలేదు. పోతే నీలం, బెజవాడలు మిగిలారు. సంజీవరెడ్డి పక్షాన మంతెన వెంకటరాజు, అల్లూరి సత్యనారాయణరాజు హైదరాబాదులో మకాం వేసి హెచ్చు మందిని ఆకట్టుకున్నారు. వి.బి.రాజు కూడా నీలం వారి “విశాల హృదయాన్ని” సమర్థించాడు. తుది ఘడియల్లో కె.వి.రంగారెడ్డి కూడా నీలం ప్రక్క నిలబడ్డాడు. సంజీవరెడ్డి ప్రచారకులు కర్నూలులో ఒక శిబిరం నిర్వహించి, ఆవసరమైనవారికి అన్ని సౌకర్యాలు అమర్చారు. బెజవాడ గోపాలరెడ్డిని సమర్థించాలనే నిర్ణయం చేతులు కాలిన తరవాత గాని కె.ఎల్.పి గైకొనలేదు. చెన్నారెడ్డి మాట యిచ్చిన ప్రకారం గోపాల రెడ్డిని సమర్థించాడు. సంజీవరెడ్డి నెగ్గాడు. గోపాలరెడ్డి తనను సమర్థించిన వారిని కాలదన్ని, సంజీవరెడ్డి మంత్రవర్గంలో “పెద్దన్న”గా చేరాడు. రాజకీయ రంగం కర్నూలునుండి హైదరాబాద్.కు మారింది. కొత్త రాజకీయాలు ప్రారంభమైనవి. ఈలోపు కృషికార్ లోక్.పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కృషికార్ లోక్.పార్టీ విలీనం ఐక్య కాంగ్రెస్ పేరుతో 1955 ఎన్నికలలో పోటీ జరిగినా, కృషికార్ లోక్.పార్టీ రద్దు కాలేదు. కాని రద్దుచేసి కాంగ్రెస్.లో లీనం కావాలని రంగా సంకల్పించాడు. ఆ ఉద్దేశంతో ఢిల్లీలో కార్యవర్గ సమావేశం ఏర్పరచాడు. లచ్చన్న కాంగ్రెస్.లో చేరటాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రాం యిచ్చి, ఆ సమావేశానికి వెళ్ళలేదు. కార్యకర్తలందరూ కలసి పోవటాన్ని వ్యతిరేకించాడు. అయినా కార్యవర్గంలో అధిక సంఖ్యాకుల నిర్ణయం పేరుతో రంగా తన అభిలాష నెరవేర్చుకున్నాడు. ఆవిధంగా కృషికార్ లోక్.పార్టీ రద్దుకాగా, అందరూ కాంగ్రెస్.లో లీనమయ్యారు. హైదరాబాద్.లో సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైనప్పటి నుండి, లోక్.పార్టీ ముఠాకు ప్రాతినిధ్యం లభించలేదు. 1955 ఎన్నికలలో కూచిపూడి నియోజకవర్గంలో కమ్యూనిస్టు అభ్యర్థి మాకినేని బసవపున్నయ్య స్థానంలో, అభ్యర్థిత్వం నిర్ణయించమని లచ్చన్నకు అధికారం యివ్వగా, బలవంతాన అనగాని భగవంతరావును నిలబెట్టాడు. నెగ్గాడు. సంజీవరెడ్డి లచ్చన్నకు తెలియకుండా అనగాని భగవంతరావును పిలిపించి మంత్రి పదవి యిచ్చాడు. భగవంతరావు లచ్చన్న యింటికి వచ్చి, విషయం చెప్పి, లచ్చన్న ఆమోదం పొంది ప్రమాణస్వీకారం చేశాడు. అంతటితో లోక్.పార్టీ ముఠాకు పార్టీ భగవంతరావుకూ అనుబంధం తీరింది. హైదరాబాద్ రాజకీయంలో తమకు ఒక స్థానం ఉండాలంటే నిర్మాణ కృషి జరగాలని లచ్చన్న ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులు తీర్మానించారు. అప్పటికే రంగాపేరిట ఒక భవనాన్ని కొని, తమ కార్యకలాపాలకు స్థావరంగా వినియోగించు కుంటున్నారు. అలాగే లచ్చన్న పేరిట ఒక భవనం కొనాలని నిశ్చయించి, చందాలు వసూలు చేశారు. పావులూరి బసవపున్నయ్య, చెంగ వెంకట్రావు నాయుడు ఈ యజ్ఞంలో ప్రధాన పాత్ర స్వీకరించారు. 22 వేలరూపాయలు వసూలు కాగా, 33 వేల రూపాయలకు ఒక భవనాన్ని ఖైరతాబాద్.లో కొని, యశోద పేరిట యిచ్చారు. మిగిలిన డబ్బుకు లింగయ్య చౌదరి హామీ యివ్వగా, లచ్చన్న గృహప్రవేశం చేశాడు. జాతకాల నమ్మకంగల లచ్చన్న ఆ యిల్లు కలసిరాలేదంటాడు. అది కొన్నప్పటినుండి ఆర్థికంగా బాధలు, రాజకీయంగా ఫిర్యాదు బాధలు సాగాయి. మంతెన వెంకటరాజు ఫిర్యాదులు అన్నీ హైకమాండ్.కు పంపగా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీమన్నారాయణ అగర్వాల్ సంజాయిషీ కోరుతూ లచ్చన్నకు తాఖీదు ఇచ్చాడు. ఈ గొడవ 1957 ఏప్రిల్.లో ఆరంభమై రెండేళ్ళపాటు జరిగింది. ఫిర్యాదులన్నిటికి లచ్చన్న సమాధానం చెప్పటమేగాక, బహిరంగ విచారణకు న్యాయ విచారణకు సిద్ధమై, జరిపించమన్నాడు. హైకమాండ్ లోక్.సభ ఉపసభాపతి సర్దార్ హుకుంసింగ్ ద్వారా విచారణ జరిపించింది. ఆ నివేదిక రహస్యంగా అట్టిపెట్టింది. అది తనకు అందచేయమని లచ్చన్న ఎంత అడిగినా వారు కారణాంతరాలచే యివ్వలేదు. నివేదికలో కొన్ని మాత్రం లచ్చన్నకు అనుకూలం కాదన్నారు. ఆ కొన్ని ఏమో చెప్పలేదు. 1958 ఏప్రిల్.లో రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్.కు వ్యతిరేకంగా సోషలిస్టుపార్టీ అభ్యర్థికి ఓటు చేసినట్లు లచ్చన్నపై మళ్ళీ ఫిర్యాదు చేశారు. అది కూడా లచ్చన్న త్రోసిపుచ్చి, సంజీవరెడ్డి వర్గం కాంగ్రెస్.కు వ్యతిరేకంగా ఓట్లు వేసిందని ఆరోపించాడు. నీలం సంజీవరెడ్డి వ్యతిరేక ముఠా వారంతా గోపాలరావు ఎగ్బొటే యింట్లో సమావేశమై మంతనాలు చేస్తుండేవారు. కలకత్తాలో జరిగిన ఎ.ఐ.సి.సి. సమావేశాలు కూడా లచ్చన్న వెళ్ళి చివరిసారిగా కాంగ్రెస్.తో రాజీకి విఫల ప్రయత్నం చేశాడు. 1959 ఫిబ్రవరిలో ఎట్టకేలకు కాంగ్రెస్ నుండి వైదొలగాలని నిశ్చయించుకున్నాడు లచ్చన్న. నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలైన శ్రీమతి ఇందిరాగాంధీకి యీ విషయం తెలియజేసి, కాంగ్రెస్.కు రాజీనామా యిచ్చాడు. డెమోక్రటిక్ ఫ్రంటు వరంగల్లులో ఒక సమావేశం ఏర్పరచి డెమోక్రటిక్ ఫ్రంటు స్థాపించారు. లచ్చన్న, చెన్నారెడ్డి అందులో ప్రముఖ పాత్ర వహించారు. తాను కాంగ్రెస్.లో ఉండగా తనను కాదని, రాజీనామా యిచ్చి బయటకుపోవటం రంగాకు సుతారామూ యిష్టం లేదు. డెమోక్రటిక్ ఫ్రంట్.లో ఓబులరెడ్డి, కాకాని వెంకట రత్నం ప్రభృతులు చేరారు. అప్పుడే సోషలిస్టు పార్టీలో ముసలం పుట్టగా, పి.వి.జి.రాజు చీలి వచ్చి, ఫ్రంట్.లో చేరాడు. సోషలిస్టు డెమోక్రటిక్ ఫ్రంట్.గా రూపొందించి, తెనాలిలో పెద్ద కన్వెన్షన్ పెట్టారు. నన్నపనేని వెంకటరావు తదితర సోషలిస్టులు అందులో చేరారు. ఈ ఫ్రంటు ధర్మపిండం అని వెక్కిరించాడు కళా, ఫ్రంటు ఆట్టేకాలం నిలువలేదు. కేంద్రంలో రంగా కాంగ్రెసు నుండి రాజీనామా యిచ్చాడు. రాజాజీ ఏర్పరచిన స్వతంత్ర పార్టీకి అధ్యక్షుడయ్యాడు. వెంటనే ఆంధ్రలో పార్టీ ఏర్పరచటానికై రంగా బయలుదేరాడు. స్వతంత్ర పార్టీ స్థాపనకు చాలా ప్రచారం లభించింది. కాంగ్రెసుకు అదొక పెనుభూతం వలె అగుపించింది. ఆంధ్రలో రంగా అనుచరులు పార్టీలో చేరటానికి ఉవ్విళ్ళూరగా, ఫ్రంట్.లోని లోక్ పార్టీ ముఠావారు ఫ్రంట్.నంతటినీ స్వతంత్ర పార్టీలో చేర్చాలని విఫలయత్నం చేశారు. అప్పటికే పి.వి.జి. రాజుకు మంత్రి పదవి చూపాడు. సంజీవరెడ్డి, సోషలిస్టు వర్గమంతా ఆవిధంగా కాంగ్రెస్.లోకి, లోక్.పార్టీవారు స్వతంత్రలోకి పోయారు. కాంగ్రెసు నుండి రాజీనామా యిచ్చినప్పటి నుండి లచ్చన్న విజృంభించి బాగా కార్యకలాపాలలో పాల్గొన్నాడు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో పర్యటించి తన రాజీనామాకు కారణాలను కార్యకర్తలకు వివరించాడు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులకు పత్రికల్లో బాగా ప్రచారం లభించింది కాని, ఆయన సమాధానాలకు, ఛాలెంజ్.కు మాత్రం అలాంటి ప్రచారం లేదు. కనుక వాడవాడలా తిరిగి లచ్చన్న వాస్తవం చెప్పుకోక తప్పలేదు. కార్యకర్తల్లో లచ్చన్న బలం తగ్గలేదు. అయితే లోక్.పార్టీ వ్యక్తులు కొందరు కసిగా సంతోషించారు. కిసాన్ సమ్మేళన్ వ్యవస్థ పేరిట లచ్చన్న తన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించాడు. లచ్చన్నతోపాటు చెన్నారెడ్డి, బొమ్మకంటి సత్యనారాయణ కూడా స్వతంత్ర పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర పార్టీ అధ్యక్షస్థానంలో నిర్ణయించవలసిన వ్యక్తి తేలలేదు. అధికారం రంగాకు ఇచ్చారు. విజయవాడలో రంగాకు కార్యకర్తలు ఏకగ్రీవంగా చెప్పారు లచ్చన్నను పెట్టమని. చెన్నారెడ్డి కూడా ఆ పదవి బలపరిచాడు. బెజవాడ రామచంద్రారెడ్డి ఆశించాడు. అంతా అయిన తరవాత తనకు నమ్మినబంటు ఉండాలని స్వతంత్ర పార్టీ త్వరలోనే అధికారం చేపట్టవచ్చుననే భ్రమలో రంగా పప్పులో కాలేసి, సరైనసమయానికి తప్పుడు నిర్ణయం గైకొన్నాడు. గొర్రెపాటి వెంకట సుబ్బయ్యను అధ్యక్షులుగా పేర్కొన్నాడు. ఎక్కడివారక్కడ నీరుగారిపోయారు. లచ్చన్నను కార్యదర్శిగా ఉండమంటే ఆయన నిరాకరించాడు. ఉపాధ్యక్షుడనే అలంకార పదవి యిచ్చారు. తేళ్ళ కృష్ణమ్మ అనే రిటైర్డ్ జిల్లా జడ్జికి కార్యదర్శి పదవి యిచ్చారు. ఆవిధంగా తొలిదశలోనే ఆంధ్రప్రదేశ్.లో స్వతంత్రపార్టీ హంసపాదు పెట్టింది. రంగా రాజకీయం అలాంటిది. అధ్యక్ష కార్యదర్శులు ఇరువురూ కమ్మకులస్థులే. అయినా రంగాకు కులతత్వం వుందని అనగూడదు. లచ్చన్నలో నమ్మకం సడలినట్టు రంగా స్పష్టంగా కనబరచిన అనంతరం, వెనుకబడిన వర్గాలు సమస్యపట్ల దృష్టిసారించాడు లచ్చన్న. స్వతంత్ర పార్టీ వ్యవహారాలు అంతగా పట్టించుకోలేదు. పార్టీ మాత్రం క్షణక్షణం క్షీణించింది. కేంద్ర పార్టీ యిచ్చే వెయ్యి రూపాయలతో కార్యాలయం నిర్వహిస్తుండేవారు. రాజకీయాలు అసమర్థంగా వుండటంవలన పరాకాష్ఠ నందుకొన్నది. రంగా మరొక సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. 1959లో రాజాజీ ఆంధ్రలో పర్యటించాడు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడలో ఆయన ఉపన్యాసాలు అనువదించటానికి సుంకర సత్యనారాయణ, విజయరాజకుమార్, ఉషశ్రీ, చివరకు రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అనకాపల్లిలో లచ్చన్న వచ్చి కలిశాడు. బహిరంగసభలో రాజాజీ ఉపన్యాసాన్ని అనువదించాడు. ఇక నుండి కార్యక్రమమంతటా లచ్చన్ననే అనువదించాలన్నాడు రాజీజీ. విశాఖపట్టణం, శ్రీకాకుళం, బొబ్బిలి విజయనగరంలో జరిగిన బహిరంగ సభలలో లచ్చన్న అనువదించి, ప్రజలచేత, రాజాజీ చేత వీపుతట్టించుకున్నాడు. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య అనంతరం బెజవాడ రామచంద్రారెడ్డిని అధ్యక్షునిగా నియమించారు. వ్యక్తిగతంగా ఆయన ప్రతిభలు ఎలా ఉన్నా పార్టీ నిర్మాణంలో విఫలుడయ్యాడు. లచ్చన్న లేని పార్టీ ఎందుకూ కొరగాని స్థితికి వచ్చింది. హైదరాబాద్.లో తాత్కాలికంగా స్వతంత్రలో చేరిన చెన్నారెడ్డి, బొమ్మకంటి రాజాజీ హైదరాబాద్ రాక అనంతరం మళ్ళీ కాంగ్రెస్.లో ప్రవేశించారు. అంతటితో తెలంగాణాలో స్వతంత్ర పార్టీకి పరపతి పోయింది. ఏతావాతా తేలిందేమంటే లచ్చన్నే శరణ్యమని. అయితే అది చాలా ఆలశ్యంగా గ్రహించారు. ఈలోపే కార్యకర్తలు కొందరు రంగ నిష్క్రమణ చేయటం, మరికొందరు నిరుత్సాహపడటం, మరికొందరు నైతికంగా దిగజారటం సంభవించింది. స్వతంత్ర పార్టీకి లచ్చన్న కాయకల్ప చికిత్సచేయాల్సి వచ్చింది. ప్రభుత్వ గుండెల్లో కుంపటి గౌతు 72 పరాజయం ప్రభుత్వానికే లోటు వెనుకబడిన కులాల సమస్యను చాలా అలస్యంగా 1948లో లచ్చన్న చేపట్టాడు. కాని త్వరితంగా అనేక సమస్యలలో చైతన్యతను ప్రదర్శింపచేశాడు. గీత పారిశ్రామికులలో కమ్యూనిస్టుల కోటల్ని బ్రద్దలుకొట్టాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి వెనుకబడిన వారి సమస్యలపట్ల మరింత శ్రద్ధ వహించాడు లచ్చన్న. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంఘానికి అధ్యక్షుడుగా పలుకుబడి పెంచుకుంటున్నాడనీ, అది ఎలాగైనా తగ్గించాలనీ కాంగ్రెసువారు నిర్ణయించుకున్నారు. అల్లూరి సత్యనారాయణరాజు అధ్యక్షుడుగా ప్రగడ కోటయ్య కార్యదర్శిగా ఒక పోటీ సంఘం నడిపారు. తెలంగాణాలో బొజ్జ నరసింహం, కొండా లక్ష్మణ్ గారలు ఈ ఉద్యమంలో ఉన్నారు. అయితే వెనుకబడిన సంఘాలు యిలా చీలి వుండటం మంచిది కాదనే భావన సర్వత్ర వినవచ్చింది. చీలదీయటానికి సూత్రధారి నీలం సంజీవరెడ్డి కలయిక ప్రయత్నాలు ప్రారంభం కాగా, సికింద్రాబాద్.లో అన్నం విశ్వనాథంగారి తోటలో శాసనసభ్యులు, ఇతరులు అందరూ సమావేశం అయ్యారు. ఒక సంఘాన్ని నియమించారు. రెండు రూపాల్లో నివేదిక సమర్పించాలని తదనుగుణంగా వ్యవహరించాలనీ తీర్మానించారు. వెనుకబడిన సంఘాలలో కాంగ్రెసు అనుబంధంగా ఉన్నదానికే గుర్తిస్తామన్నారు. మిగిలిన వాటి పరపతిని నీలంవారు ప్రశ్నించారు. సంజీవయ్య గాంధీ భవనంలో సమావేశపరచి విచారణ జరిపాడు. లచ్చన్న అధ్యక్షుడు కాకూడదని కొందరన్నారు. ఐక్యతకై తాను విరమించుకుంటానని లచ్చన్న లిఖిత పూర్వకంగా ప్రమాణం చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థిని సమర్థిస్తానన్నాడు. కొండాలక్ష్మణ్ గృహంలో సమావేశాలు జరిగాయి. టి.లక్ష్మయ్యను తొలి అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. కాని అతనికి విలువ రాలేదు. మళ్ళీ లచ్చన్న కావాలని ప్రచారం చేసిన వారంతా అదృశ్యమయ్యారు. అయినా కూడా నారాయణప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో లచ్చన్న ఎన్నికయ్యాడు. కాని సంజీవరెడ్డి వెంటనే డాక్టర్ లక్ష్మీ నరసయ్య చేత పోటీ సంఘం పెట్టించాడు. కె.వి. కేశవులు కార్యదర్శిగా, బొజ్జ నరసింహులు అధ్యక్షుడుగా సంఘం ఏర్పడింది. అధికార పక్షం అండవలన ఆ సంఘానికి గ్రాంటులు బాగా లభించాయిగాని, పని జరగలేదు. ప్రభావం పెరగలేదు. సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడిన వారికి కొంత సహాయం జరిగింది. వాస్తవమైన ప్రయత్నం కనిపించింది. లచ్చన్న కూడా రాజకీయపార్టీ భేదం లేకుండా సంజీవయ్యతో సన్నిహితంగా వుంటూ కలసి పనిచేశాడు. ఆ సన్నిహితత్వం వలన లచ్చన్నను కాంగ్రెస్.లో చేరినట్లేననుకున్నారు. అయితే చిత్తూరు ఉప ఎన్నికలలో రంగా పోటీ చేయటం, ఆయనకు లచ్చన్న ప్రచారం చేయటంలో అంతకు ముందువన్నీ వదంతులని నిర్ధారణ అయింది. స్వాతంత్ర్యానికి ముందునుండీ వెనుకబడిన కులాల జాబితా అమలులో ఉన్నది. సంజీవయ్య హయాంలో రాయలసీమ సెట్టి బలిజలు, ఆంధ్రకాపులు, తెలంగాణాలో తెలగాలు కూడా ఈ జాబితాలో చేర్చబడ్డారు. పళ్ళంరాజు కుమారునకు ఐ.ఎ.ఎస్. ప్రమోషన్ దృష్టిలో పెట్టుకొని ఈ పని చేశాడని విమర్శ వచ్చింది. హైకోర్టు జాబితాను రద్దు చేసింది. ఆ విధంగా 1963లో వెనుకబడిన కులాల జాబితాకు అధికార హోదా పోయింది. దానితో లచ్చన్న ఆందోళన ప్రారంభించాడు. 1964లో జాబితాను పునర్వ్యవస్థీకరించాడు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి హైకోర్టులో అదీ కొట్టేశారు. లచ్చన్న మళ్ళీ ఆందోళన గావించాడు. 1966 నవంబరులో వెనుకబడిన వర్గాల విషయ పరిశీలనకు ఒక కమీషన్.ను నియమించారు. వారి నివేదిక 1970లో రాగా తదనుగుణంగా ప్రభుత్వం ఒక ఉత్తరువు జారీచేస్తే 1971లో అదీ కోర్టులో చెల్లలేదు. ఈ విధంగా అడుగడుగునా వెనుకబడిన వారి ఉద్యమం దెబ్బతింటూ వచ్చింది. వెనుకబడిన వారికై ఒక ప్రత్యేక పత్రిక ఉండాలనే తలంపుతో 1950లో లచ్చన్న బహుజన పత్రికను ప్రారంభించాడు. పంజాబ్.రావు దేశ్.ముఖ్ దానిని విడుదల చేశారు. కాని లచ్చన్న బహుముఖంగా పనిచేయడం వలన పత్రికపై దృష్టి కేంద్రీకరించలేక పోయాడు. కనుక కొన్నాళ్ళు అతివృష్టిగా మరికొన్నాళ్ళు అనావృష్టిగా “బహుజన” బహుజనుల సంపాదకత్వాన నడుస్తున్నది. వెనుకబడిన వర్గాల, కులాలవారి ఆయుధంగా అదింకా వ్యాపించి, నిలద్రొక్కు కోవలసి ఉన్నది. లచ్చన్న ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడయినప్పటి నుండి మళ్ళా పార్టీలో చైతన్యం కలిగింది. పార్టీకి పుంసత్వం ప్రసాదించాడంటే తప్పు లేదు. అయితే లచ్చన్న అధ్యక్షుడు కాగానే ఆలిండియా పార్టీ వారు ప్రతి నెల అంతకు ముందు యిస్తుండే వెయ్యిరూపాయలు యివ్వటం మానేశారు. కారణం తెలియదు. బహుశ మసానికి లచ్చన్న నాయకత్వం పట్ల గల అయిష్టత కారణంగావచ్చు. కానీ అవేవీ ఖాతరు చెయ్యకుండా లచ్చన్న ప్రజల్లో తిరిగి విరాళాలు వసూలు చేసి, పార్టీని పోషించాడు. ఈ నిత్య నైవేద్యం వలన లచ్చన్న అనేక పర్యాయాలు విసుగెత్తి, 1987 ఎన్నికలకు పూర్వం తన అధ్యక్షత స్థానానికి రాజీనామా సమర్పించాడు. అప్పుడు కేంద్ర పార్టీ కళ్ళు తెరిచి, రాష్ట్రపార్టీకి నెలనెలా కొంత డబ్బు యివ్వటానికి, ఒక కార్యదర్శిని నిర్వహించటానికి అంగీకరించారు. అప్పుడే గాదిరెడ్డి హనుమంతరావును కేంద్ర పార్టీ భరించింది. లచ్చన్న నాయకత్వాన స్వతంత్ర పార్టీ భూమిశిస్తుల విషయమై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా న్యాయస్థానాల్లోనూ, ప్రజల్లోనూ పోరాడింది. హైదరాబాద్.కు రైతు యాత్ర నడిపి, సచివాలయం వద్ద పెద్ద వూరేగింపు, ప్రదర్శన జరిపారు. 1964లో కేంద్ర పార్టీ ఆందోళనను చాలా రోజులు ఆపింది. కాని ఆంధ్ర పరిస్థితులు వేరని లచ్చన్న పట్టుబట్టి సత్యాగ్రహాలు, ప్రదర్శనలు జరిపించాడు. ప్రతిపక్ష నాయకుడుగా లచ్చన్న శాసనసభలో అద్వితీయ పాత్ర నిర్వహించాడు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అవగాహన వేసుకోనిదే చేపట్టేవాడు కాదు. ఒకసారి చేపడితే, ఆ పట్టు వదిలేవాడుకాదు. లచ్చన్నను కాదని మంత్రులెవరూ సమాధానం దాటవేయడానికి వీల్లేదు. సభకు చెందిన నియమాలు నిబంధనలు కూలంకషంగా ఆకళింపు జేసుకోవడమైగాక, తన అనుభవం జోడించి, సభకు కొత్త సంప్రదాయాలు రూపొందించటంలో తోడ్పడ్డాడు. లచ్చన్న శాసనసభ విమర్శ చాలా ఘాటుగానూ, నిర్దుష్టంగానూ, సూటిగానూ గుండెల్లో కుంపటి పెట్టినట్లుగానూ ఉంటుంది. అయితే వ్యక్తిగత విమర్శలకు అనవసరంగా ఎన్నడూ దిగేవాడు కాదు. సాధారణంగా లచ్చన్నకు ఆగ్రహం వచ్చినప్పుడు, శాసనసభలో మాట్లాడటం వినవలసిందేగాని వర్ణించవీల్లేదు. వక్తృత్వం ఒకకళగా పెంపొందించటం వింటుంటే ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది. వీటన్నిటి దృష్ట్యా లచ్చన్న ఓడిపోవడం శాసనసభకు పెద్ద లోటు అని చెప్పవచ్చు. (బహుజన వారపత్రిక – 1972 నుండి) ముగింపు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో శ్రీ లచ్చన్న ప్రధాన పాత్ర వహించారు. ప్రజాపరిషత్తు పేరిట అఖిల పక్ష నాయకులుగా రాష్ట్రమంతటా పర్యటించారు. అరెస్టు అయ్యారు. ఆందోళనలో ముందున్నారు. శాసన మండలి సభ్యులుగా రాజీనామా యిచ్చి, ఆందోళనకారుల తీర్మానాన్ని గౌరవించారు. 1972-73 అంతా శ్రీ లచ్చన్న తన పాత్రను చాలా పట్టుదలతో నిర్వహించారు. స్వతంత్ర పార్టీ అధ్యక్షపదవిని వదులుకున్నారు. చరణ్ సింగ్ ఆధ్వర్యాన ప్రతిపక్షంతో ప్రముఖ పాత్రవహించిన శ్రీ లచ్చన్న, ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఎదిరించి జైలుకు వెళ్ళారు. అత్యవసర పరిస్థితి అనంతరం, జనతాపార్టీ నాయకులుగా విజృంభించారు. అసెంబ్లీలోను, బయట ప్రజాస్వామ్యం కోసం, వెనుకబడిన వారికోసం, కృషి చేశారు. జనతా చీలినప్పుడు, రాష్ట్ర జనతాపార్టీ నాయకులయ్యారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన కొత్తలో ఆ పార్టీతో సహకరించి, పనిచేశారు. రాను రాను కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు భిన్నంగా ఉంటూ, ప్రతిపక్ష ప్రజాస్వామికరంగంలో కొనసాగారు. Innaiah Narisetti