ముఖ్యమంత్రిగా రోశయ్య

అనుకోని ముఖ్యమంత్రి

కొణిజేటి రోశయ్య

(1933- )

“ఇన్నయ్యా, ఎవరికి వాళ్లు తాము అందంగా ఉన్నామని అనుకోక పోతే బతకలేరయ్యా” అని 1954లో గుంటూరులో తన గదిలో గెడ్డం గీసుకుంటూ అద్దంలో చూస్తూ రోశయ్య అన్నమాటలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. ఆనాడు గుంటూరు హిందూ కాలేజీలో విద్యార్థి నాయకుడుగా రంగాగారి శిష్యుడుగా రాణించిన వ్యక్తి రోశయ్య. కాలేజీ విద్యార్థి యూనియన్.కి విద్యార్థి సమ్మేళన్ తరఫున (కృషీకార్ లోక్ పార్టీ విద్యార్థి విభాగం) పక్షాన అధ్యక్షుడుగా పోటీచేసి ఎన్నికలలో గెలిచాడు. మేమంతా ఆయనకు ప్రచారం చేసి పెట్టాం. నేను అప్పట్లో ఎ.సి.కాలేజీలో చదువుతుండేవాడిని. ఆయనకు కార్యదర్శిగా జాస్తి జగన్నాథం (రాడికల్ హ్యూమనిస్టు) గెలిచారు. ఆరోజులలో విద్యార్థి సమ్మేళనం కోసం చందాదారులను చేర్పించి ఆ డబ్బుతో ఉదయం కాఫీలు, టిఫిన్లు సేవిస్తుండేవారు. మధ్యలో నన్ను పిలిచేవారు. రోశయ్య చాలా చురుకుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఉపన్యాసాలు చేసేవారు. కవిసమ్మేళనాలు ఆర్గనైజ్ చేశారు. ఆయన తెనాలి దగ్గర వేమూరు నుండి వచ్చారు. ఆచార్య రంగా 1951లో కాంగ్రెసు నుండి చీలివచ్చి కృషికార్ లోక్ పార్టీ పెట్టినప్పుడు తెనాలిలో తొలి రాష్ట్ర మహాసభ జరిగింది. కార్యకర్తగా రోశయ్య తన రాజకీయ జీవితాన్ని అక్కడ ఆరంభించాడు. ఆయనతో తొలి పరిచయం అప్పడు జరిగింది. ఆ తరువాత స్నేహితులుగా మేము కలిసిమెలిసి ఉన్నాము.

రంగాగారు 1955లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఐక్య కాంగ్రెసు పక్షాన రాష్ట్రంలో ప్రచారం చేసినప్పుడు ఆయన శిష్యులుగా రోశయ్య, వీరాచారి, విజయరాజకుమార్, సుంకర సత్యనారాయణ మొదలైనవారు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి కమ్యూనిస్టులను ఓడించటానికి తోడ్పడ్డారు. ఆ తరువాత రంగాగారు కాంగ్రెసు నుండి దూరమై స్వతంత్ర పార్టీ అధ్యక్షులైనప్పుడు గౌతు లచ్చన్నతోపాటు రోశయ్య కూడా పార్టీలో ప్రముఖంగా ఉన్నారు. తొలిదశలో చెన్నారెడ్డి కూడా చేరి తరవాత దూరమయ్యారు. తెనాలి ఆరోజులలో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా రంగాగారి పక్షాన రోశయ్య స్వాగతం పలికి వారి ఉపన్యాసాలకు అనువాదం కూడా చేసేవారు. రాజగోపాలాచారి ఉపన్యాసానికి అలాగే చేశారు. ఆవిధంగా కార్యకర్తగా ప్రారంభించిన రోశయ్య నాయకుడుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో ప్రముఖులయ్యారు. ప్రతిపక్షస్థానంలో ఆయనకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన పక్షాన ఎన్నో సందర్భాలలో ఆయన కోరికపై మేము ప్రకటనలు ఇవ్వటం అవి ప్రముఖంగా పత్రికలలో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నాతోపాటు ఎస్.వి.పంతులు బాగా కృషిచేశారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా రోశయ్యకు తోడ్పడి శాసనమండలి సభ్యులు కావటానికి చేయూతనిచ్చారు.

1972 నుండి నేను న్యూ ఎం.ఎల్.ఎ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు రోశయ్య పక్క క్వార్టర్.లో ఉండేవారు. ఇంచుమించు రోజూ కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం. ఆయన 1978లో చెన్నారెడ్డితో చేతులు కలిపేవరకూ అలా సాగింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజులలో అతి తీవ్ర విమర్శలు చేసి చెన్నారెడ్డిని చెమట పట్టించిన వ్యక్తి రోశయ్యే. అప్పట్లో నన్నూ, ఎస్.వి.పంతులును కుడి భుజం ఎడం భుజం అనేవారు. అటువంటి దశలో ఒకరోజు చెన్నారెడ్డి పిలిచి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అప్పటివరకూ ప్రతిపక్షంలో రాణించిన రోశయ్య కాంగ్రెసులో స్థిరపడిపోయారు. ఎవరు పదవిలో ఉన్నా రోశయ్యను కాదనలేని స్థితి తెచ్చుకున్నాడు. ఆవిధంగానే కేంద్ర స్థాయివరకూ ఆయన సుపరిచితుడయ్యారు. హైదరాబాదులో అమీర్ పేటలో సొంత ఇల్లు ఏర్పరచుకొని ఉంటున్నప్పుడు కూడా మేము కలుస్తుండేవాళ్ళం. మా కుటుంబాన్ని గురించి పరామర్శ చేస్తుండేవారు.

వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా చనిపోవటంతో చక్కని మార్గాంతరంగా కేంద్ర కాంగ్రెసు నాయకత్వం రోశయ్యను ముఖ్య మంత్రి స్థానానికి తీసుకువచ్చింది. బహుశ ఆయన జీవితంలో అది పెద్ద మలుపు.

అప్పటివరకూ రోశయ్య అప్పుడప్పుడూ నాతో అంటుండేవారు “జీవితమంతా రాజకీయం తప్ప మరొక వ్యాపారం చెయ్యలేదు. తెలియదు కూడా. ఇప్పుడు ఈ దశలో ఇంకేమీ చేసే స్థితి కూడా లేదు. రాజకీయాలు కొనసాగించాల్సిందే” అది ఆయన ధోరణి.

వై. ఎస్. రాజశేఖర రెడ్డి

వై. ఎస్. రాజశేఖర రెడ్డి
(1949- 2009)

మెడిసిన్ చదివినా సూది పట్టని డాక్టర్ రాజశేఖర రెడ్డి 1978లో ఎమ్.ఎల్.ఎ అయినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుండి చాలా సన్నిహితులమయ్యాము. నేను అనేక సందర్భాలలో శాసన సభలో వేసే ప్రశ్నలు, కాల్ అటెన్షన్ నోటీసులు, షార్ట్ నోటీసు ప్రశ్నలు ఇస్తుండేవాడిని. అందులో ఆయనకు నచ్చినవి స్వీకరించి వాడేవారు. నేను ఆంధ్ర ప్రదేశ్ రాజకీయలపై తెలుగులోను ఇంగ్లీషులోనూ రాస్తూ ఉండగా ఆయనకు నా ఇంగ్లీషు మాత్రమే నచ్చేది.
మేమిరువురం కలిసి అనేకమంది మిత్రుల దగ్గరకు వెళ్ళడం, ముచ్చటించడం జరిగింది. ఒకటి రెండు సార్లు ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్ళి విందు ఆరగిస్తేనో, బ్రేక్ ఫాస్ట్ చేస్తేనో తరవాత తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి ఒక మాట అడిగేవాడు మనం ఆ స్నేహితుడికి ఏమైనా ఉపయోగ పడగలమా... అడుగు అనేవారు. అలాంటివారిలో డి. శేషగిరిరావు, ఆలపాటి రవీంద్రనాథ్ వంటివారున్నారు. కానీ వారు ఏ సహాయమూ అక్కరలేదని కేవలం మిత్రులుగానే కలుసుకుంటున్నామని అనేవారు. రాజశేఖర రెడ్డి మిత్రత్వ స్వభావం చెప్పటానికి ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఆయన ఎన్నో సందర్భాలలో మా ఇంటికి రావడం, మాతోపాటు భోజనమో, అల్పాహారమో చేయడం మాకుటుంబానికి ఆనందంగా వుండేది. ముఖ్యంగా భవనం వెంకట్రాం విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు ఎన్ని వచ్చాయో నేను చెప్పలేను. అలాగే మేము రాజశేఖర రెడ్డి ఇంట్లో (జూబిలీహిల్స్ కు వెళ్ళేదారిలో) అనేక పర్యాయాలు కూర్చుని ముచ్చటించుకుని భోజనాలు చేశాము. ముఖ్యంగా భవనం వెంకట్రాం, కె.వి.పి రామచంద్రరావు, నేను ఒక బాచ్ గా ఉండేవాళ్ళం. ముందుగా ఒకటిరెండు పెగ్గుల విస్కీ స్వీకరించి, తరవాత భోజనం చేసేవాళ్ళం. అప్పట్లో కె.వి.పి. డ్రింక్స్ తీసుకునేవారు కాదు. సిగరెట్లు బాగా తాగేవారు. రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి ఎంతో చక్కగా వంటలు చేసి, ఆప్యాయంగా వడ్డించేవారు. ఆమె చాలా సహృదయురాలు.
రాజశేఖర రెడ్డి ఇంట్లో నేను తొలుత ఆయన తండ్రి రాజారెడ్డిని కలుసుకున్నాను. ఆయన ఎన్నో విషయాలు, స్వానుభవాలు చెప్పారు. తాను బర్మా వెళ్లి వచ్చినట్లు, తరవాత క్రైస్తవుడుగా తనకుగల అనుభవాలు ఆసక్తిగా చెప్పేవారు. అప్పటి నుండి సూరి (సూర్యనారాయణ) అక్కడే ఉండేవాడు. ఒక కుటుంబంవలె మేమందరం అలా ఎన్నో ఏళ్ళు మెలిగాం. భవనం వెంకట్రాం ముఖ్యమంత్రి కాగానే నాకు పదవి ఏదైనా ఇవ్వమని, నాతో చెప్పకుండా రాజశేఖర రెడ్డి వత్తిడి చేశారు. ఆయన మాట మీద భవనం నన్ను పిలిచి ఏ పదవి కావాలో కోరుకోమన్నాడు. అది లేనందువలనే మనం మిత్రులుగా కొనసాగుతున్నామని నేను స్పష్టంగా మర్యాదగా చెప్పాను. మిత్రులకు ఎలాగైనా సహాయపడాలనే ధోరణి రాజశేఖర రెడ్డికి మొదటి నుండి ఉన్నది.
కాంగ్రెసు పార్టీలో తొలుత రెడ్డి కాంగ్రెసులో ఉన్న రాజశేఖర రెడ్డి ఆ తరువాత చెన్నారెడ్డికి వ్యతిరేకిగా, ఉత్తరోత్తరా విజయభాస్కర రెడ్డికి నిరసనకారుడుగా, జనార్దన రెడ్డిని ప్రతిఘటించిన వ్యక్తిగా వివిధ ఘట్టాలలో ఉన్నారు. కాంగ్రెసు పార్టీలో ఆయన కొన్నిసార్లు డిసిడెంట్ అనిపించుకున్నారు. ఎన్.టి.రామారావు తెలుగుదేశం పెట్టి ఎన్నికల ప్రచారం చేసి గెలిచి వచ్చిన తరవాత, ఆ ప్రభావపు ఉప్పెన ఎంత తీవ్రతరమైనదో రాజశేఖర రెడ్డి నాతో చెప్పారు. చివరకు తన జిల్లాలో పులివెందులలో సైతం ఒక సునామీ వలె ఆ వాతావరణం ఉన్నదని కష్టం మీద తట్టుకున్నామని చెప్పాడు. కేంద్రంలో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి రాను రాను అతి కీలక దశలో రాజకీయ ప్రాధాన్యతలోకి వచ్చారు. వ్యవసాయ రంగానికి ఆయనిచ్చిన ప్రాధాన్యత అమెరికా అధ్యక్షుడు బుష్ ను కూడా ఆకర్షించింది.
ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడుగా రాజశేఖర రెడ్డి ఉండగా నేను అమెరికా నుండి అభినందనల లేఖ పంపగా వెంటనే సంతోషంగా సమాధానం ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయిన తరవాత నేనాయనను తరచుగా కలుసుకోలేదు. ఎప్పుడైనా కొన్ని సంఘటనలలో నా ప్రస్థావన విలేఖరుల సమావేశంలో వచ్చినప్పుడు ‘’ఇన్నయ్య ఇండియాలో ఉన్నాడా?” అని అడిగేవాడు. నేను దూరంగా ఉంటూ రాజకీయాలు పట్టించుకోనందువలన అటువంటి స్థితి ఏర్పడింది. కానీ, రాజశేఖర రెడ్డి హఠాత్తుగా చనిపోవటం మాత్రం దారుణ సంఘటనగా భావించాను. అదే విషయాన్ని నేను హెలీకాప్టర్ ప్రమాదం నాడు టి.వి.5 ఛానల్ లో చెప్పాను కూడా. రాగద్వేషాలు రాజకీయాలలో మెండుగా కనబరిచిన రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో తిరుగులేని మార్పులు చేసి తనదైన ముద్ర వేశారు.

హైటెక్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

హైటెక్ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు
(1950- )
ఎన్టీ రామారావుకు అల్లుడు కాకముందు చంద్రబాబు నాయుడు నాకు పరిచయమయ్యాడు. 1977లో హైదరాబాదులో పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్సులో బండారు రత్న సభాపతి వద్ద కూర్చుని ఉన్నాము. సాయంత్రం నేను, ఎస్.వి. పంతులు, రత్నసభాపతి కబుర్లు చెప్పుకుంటూ మొదటి పెగ్గులో ఉండగా హఠాత్తుగా నారా చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం వచ్చారు. ఎక్కడో కోట్లాడుకుని, హడావుడిగా వచ్చినట్లు ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడుతో నాకు పరిచయం లేదు. తిరుపతి నుండి సరాసరి వచ్చామని, అక్కడ విద్యార్థుల మధ్య కోట్లాటలు జరిగాయని, ముఖ్యంగా కమ్మ, రెడ్డి కులాల మధ్య పోట్లాటలు విపరీతంగా ఉన్నాయని వారి మాటలను బట్టి మాకు తెలిసింది. వారు చెప్పిందంతా విని, రత్న సభాపతి ఫోన్ తీసుకుని నేదురుమల్లి జనార్ధన రెడ్డితో మాట్లాడాడు. ఈ కోట్లాటల వ్యవహారం మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని గట్టిగా చెప్పారు. అట్లా తొలిసారి చంద్రబాబు నాయుడ్ని చూడటం జరిగింది. మరుసటి సంవత్సరం ఎం.ఎల్.ఎ.గా ఎన్నికై చంద్రబాబు నాయుడు వచ్చి న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో ఉన్నారు. ఆయనతో పాటు లక్ష్మీనారాయణ ఉండేవారు. అప్పుడు నేను అక్కడ కొల్లూరి కోటేశ్వరరావు క్వార్టర్ లో ఉంటూండేవాడిని. రెగ్యులర్ గా మేము కలుసుకోవటం, నేను అసెంబ్లీకి సంబంధించిన ప్రశ్నలు, కాల్ అటెన్షన్ మొదలైనవి రాసిస్తుండేవాడిని. ఆ విధంగా మా పరిచయం బాగా పెరిగింది. తరువాత చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని దూరంగా పెట్టారు. వారిరువురూ చాలా స్నేహంగా కలిసి ఉండేవారు. వారితో పాటు కె.ఇ, కృష్ణమూర్తి, కరణం బలరాం ఉండేవారు. మేము చాలా తరచుగా కలుసుకునేవాళ్ళం. అచిర కాలంలోనే చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్.లో ఇల్లు తీసుకుని మారారు. ఆయనతో పాటు ఎన్నోసార్లు భోజనాలు చేస్తూ విషయాలు చెప్పుకునేవాళ్ళం. రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళం. అప్పట్లో పి. రాజగోపాల నాయుడు వస్తుండేవారు. ఆయన చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు గురువు. వారంతా ఆచార్య రంగా శిష్యులు. అలా జరుగుతుండగా చెన్నారెడ్డి మారిపోవటం, అంజయ్య ముఖ్యమంత్రి కావటంతో అటు రాజశేఖర రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత వహించారు. అదే సమయంలో ఎన్.టి. రామారావు కుమార్తెను చంద్రబాబు నాయుడు పెళ్ళి చేసుకునే విషయం వచ్చింది. స్ట్రేట్ మంత్రిగా చంద్రబాబు నాయుడు పశుసంవర్థక శాఖను, వైఎస్. రాజశేఖర రెడ్డి మెడికల్ సర్వీసెస్ ను నిర్వహించారు. ఆ తరువాత అంజయ్య తన జంబో జెట్ మంత్రి వర్గాన్ని కుదించగా అందులో చంద్రబాబుకు గ్రంథాలయాలు, రాజశేఖర రెడ్డికి గ్రామీణాభివృద్ధి ఇచ్చారు. ఎన్.టి. రామారావును రాజ్యసభకు తీసుకు రావాలనే ప్రతిపాదన కూడా అప్పుడే కొంత మేరకు సాగేది. తరువాత భవనం వెంకటరామ్ ముఖ్యమంత్రి కావటం. అందులో రాజశేఖర రెడ్డి ఎక్సైజ్ మంత్రిగా ప్రాధాన్యతలోకి రావటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడుకి మైనర్ ఇరిగేషన్ స్టేట్ మంత్రిగా ఇచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఎలాగైనా చంద్రబాబు నాయుడుకు క్యాబినెట్ ర్యాంకు ఇప్పించాలని ప్రయత్నం చేశారు. నన్ను కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు భవనానికి చెప్పమన్నారు. అయితే అలాంటి నిర్ణయాలు కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం చేస్తుంది కనుక ఒక పట్టాన చంద్రబాబుకు క్యాబినెట్ రాలేదు. నేను మాత్రం చాలా తరచుగా చంద్రబాబును ఆయన ఛాంబర్ లో కలసి సలహాలు చెబుతుండేవాడిని. ఆ తరువాత విజయభాస్కర రెడ్డి మంత్రి వర్గం రావటం, అందులో రాజశేఖర రెడ్డికి విద్యాశాఖ, చంద్రబాబుకు సాంకేతిక విద్య వచ్చాయి.
చంద్రబాబు నాయుడు మరోవైపున ఎన్.టి. రామారావు అల్లుడు కావటంతో రాజకీయాల్లో కొన్ని మార్పులు అనిపించాయి. కాంగ్రెస్ లోనే కొనసాగిన చంద్రబాబు 1982 ఎన్నికలలో పోటీ చేసి తెలుగుదేశం చేతిలో ఓడిపోయారు. ఒకటి రెండు ప్రకటనలలో తన మామ ఎన్.టి. రామారావుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. కానీ తెలుగుదేశం ప్రభంజనంతో అత్యధిక సంఖ్యా బలంతో గెలిచినప్పుడు ఎన్.టి. రామారావు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హైదరాబాద్.లో లాల్ బహదూర్ స్టేడియంకు వచ్చి హాజరయ్యారు. క్రమంగా కాంగ్రెస్ కు దూరమై, తెలుగుదేశంలో చేరి, ప్రాధాన్యత వహిస్తూ పోయారు. తొలుత పదవులు లేకపోయినా రాను రాను పార్టీలో రామారావు అల్లుడిగా ఆయనకు చాలా ప్రాముఖ్యత లభించింది. రాజకీయ అనుభవం వల్లన చంద్రబాబు ఆ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాడు.
నేను హైదరాబాద్ ఆదర్శ్నగర్ లో ఉంటుండగా చంద్రబాబు మా ఇంటికి అనేక పర్యాయాలు వచ్చారు. అలాగే నేనూ ఆయన ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ముఖ్యంగా భవనం వెంకటరాం ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు కూడా వచ్చేవారు. ప్రతిసారీ తిరుపతి లడ్డూ తెచ్చేవారు. కానీ మా ఇంట్లో ఆయన మాత్రం ఏమీ పుచ్చుకునే వారు కాదు.
చంద్రబాబు ఏదైనా విషయం చెబితే అసెంబ్లీ పరంగా గానీ, బయటగానీ బాగా గ్రహించేవారు. తనకు నచ్చితే అమలు పరచేవారు. ఆయనకు నేను సన్నిహితంగా ఉండటం గమనించి చాలా మంది రికమండేషన్స్ కు వచ్చేవారు. అది నాకు గిట్టదు కనుక చెప్పేవాణ్ని కాదు. ఆ కోపం చాలా మందికి ఉండేది. నంద్యాలలో రేణుకా చౌదరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల ఖర్చులకు డబ్బు ఇప్పించమని చంద్రబాబుకి చెప్పి త్వరగా పని జరిగేటట్లు చూడమని నన్ను కోరింది. అయితే ఆమె సంపన్నురాలనీ, ఆమెకు పార్టీ నిధి అక్కర లేదని చంద్రబాబు అంటుండేవారు. ఎన్.టి. రామారావుపై తిరుగుబాటు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను లాంఛనంగా కలిసినా అభినందనలు చెప్పలేకపోయాను. ఆ తర్వాత కలియటమే మానేశాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన న్యూయార్క్ వచ్చారు. నా కుమారుడు అప్పుడు వాల్ట్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేస్తున్నాడు. అక్కడకు వచ్చిన చంద్రబాబు నా కుమారుడిని కలిసి ఇండియాకు రమ్మని ఆహ్వానించారు కూడా. ఆయన ఉన్నాడని తెలిసినా నేను కలవలేకపోయాను. ఏమైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కలయిక తగ్గిపోవటమే కాక అరుదు అయింది.
ప్రజాస్వామ్యం కోసం ఎన్.టి.రామారావు పక్షాన తీవ్రంగా పోరాడి సంక్షోభాన్ని ఎదుర్కొన్న చంద్రబాబునాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. శాసన సభ్యులను కాపాడుకుని హైదరాబాదు నుండి ఢిల్లీకి, మైసూరుకు, బెంగుళూరుకు తరవాత హైదరాబాదుకు తెచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటంలో కీలక పాత్ర వహించారు. అలా చేస్తున్నప్పుడు నేను బెంగుళూరులో విద్యామంత్రి రఘుపతి ఇంటికి వెళ్ళి ఉదయం తేనీటి విందులో చంద్రబాబునాయుడును అభినందించాను. హైదరాబాదుకు బయల్దేరుతూ ఆ కాన్వాయిలో నన్ను కూడా రమ్మన్నాడు. వెంకయ్య నాయుడు, జయపాల్ రెడ్డి, పర్వతనేని ఉపేంద్ర మొదలైనవారు అప్పుడు ఉన్నారు. నేను బెంగుళూరు వెళ్ళి కాట్రగడ్డ ప్రసూన మొదలైన శాసన సభ్యులు కలిసి నాదెండ్ల భాస్కరరావు ఉచ్చులో పడవద్దని చెప్పాను. అదే చంద్రబాబునాయుడు కొన్నేళ్ళ తరవాత భాస్కరరావు అడుగుజాడలలో అప్రజాస్వామికంగా ఎమ్.ఎల్.ఎ.లను వైస్రాస్ హోటలులో అట్టిపెట్టి విద్రోహ చర్యకు పూనుకొనటం బాధాకరమనిపించింది. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన గెలిచి రావడం రాష్ట్రాన్ని అంతర్జాతీయ రంగంలో పరిచయం చేయటం అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ను తీసుకురావటం సాంకేతిక హైటెక్ రంగాన్ని బాగా పోషించటం అభినందనీయమైంది.

రాష్ట్ర కేంద్ర స్థాయికి ఎదిగినజనార్దన రెడ్డి

నేదురుమల్లి జనార్దన రెడ్డి

నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్.గా హైదరాబాదులో ఉండగా నేదురుమల్లి జనార్దన రెడ్డితో పరిచయం అయింది. అనేక సందర్భాలలో కలుసుకుంటూ మాట్లాడుకునేవారం. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేబినెట్ మంత్రిగా నేదురుమల్లి ప్రముఖపాత్ర వహించాడు. ఆయనతో రాజకీయాలే కాక సాధారణ విషయాలు కూడా చర్చిస్తుండేవాడిని.
నేను చాలా కాలం నెల్లూరు నుండి వచ్చే జమీన్ రైతు వారపత్రికకు రాజకీయ విలేఖరిగా రాస్తుండేవాడిని. నెల్లూరు శ్రీరామమూర్తిగారి కోరికపై ఆపని చేశాను. అలా జరుగుతుండగా ఆ పత్రికపై ప్రభావం ఉన్న జనార్దన రెడ్డి రాజకీయ విలేఖరి ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. శ్రీరామమూర్తిగారికి అది ఇబ్బందికరంగా పరిగణించింది. నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా ఉన్నాను గనుక నాపేరుతో జమీన్ రైతులో రాయడానికి వీలులేకపోయింది. అయితే జనార్దన రెడ్డికి నచ్చని విషయాలు వ్యాఖ్యలు వస్తున్నప్పుడు ఆయన ఎడిటర్.ని వత్తిడి చేస్తుండేవారు. శ్రీరామమూర్తి నా దగ్గరకు వచ్చి ఈ విషయాలు వెల్లడిస్తుండేవారు. నన్ను మానేయమనడానికి ఆయనకిష్టం లేదు. పాఠకుల నుండి రాజకీయ విలేఖరి వ్యాఖ్యలకు అనుకూలత ఉండటం వల్ల కొనసాగించమన్నారు. అలా కొన్నాళ్ళు జరిగింతర్వాత జనార్దన రెడ్డి వత్తిడి ఎక్కువై, శ్రీరామమూర్తి నా దగ్గరకు వచ్చి తన ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆ దశలో నా అంతట నేనే రాజకీయ విలేఖరిగా రాయటం మానేస్తానని చెప్పాను. కానీ ఆయన ఒప్పుకోక కొనసాగించమన్నారు. ఆ దశలో శ్రీరామమూర్తిగారు చనిపోయారు. డోలేంద్ర ఎడిటర్ గా వచ్చారు. కనుక విరమించటం నాకు సులువు అయింది.
జనార్దన రెడ్డి వ్యక్తిగతంగా నాకు మిత్రుడు. అనేక సందర్భాలలో మేము కలిసి కూర్చుని యథేచ్ఛగా మాట్లాడుకునేవారం. ఆయన మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. కొన్నిసార్లు తట్టుకోలేనంతగా మర్యాదలుండేవి. అసెంబ్లీ జరుగుతుండగా ఉదయం సమావేశాలు సాయంత్రానికి వాయిదా పడినప్పుడు మధ్యలో మేమిరువురం ఆయనింటికి వెళ్లి స్కాచ్ విస్కీ పుచ్చుకుని నెల్లూరు భోజనం చేసి సాయంత్రం సమావేశానికి వచ్చేవారం. జనార్దన రెడ్డి చాలామందిని అరే ఒరే అని పిలిచేవారు. కొన్నిసార్లు గర్వంగా ప్రవర్తించేవారు.
1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుండీ ఆ పదవిలోకి తానూ రావాలని జనార్దన రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సఫలం కాలేదు. భవనం వెంకట్రాం ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదవికి జనార్దన రెడ్డి గౌరవం ఇవ్వలేదు. అతని మంత్రివర్గంలో సభ్యుడై వుండికూడా లెక్కలేనట్లు ప్రవర్తించేవాడు. భవనం మెతక తనాన్ని బాగా వాడుకున్నాడు. ఆ తరువాత కొన్నేళ్ళపాటు రాజకీయరంగంలో తిప్పలు పడి చివరకు 1990లో ముఖ్యమంత్రిగా తన కోరికను తీర్చుకున్నాడు. రెండవసారి చెన్నారెడ్డి విఫలమయినప్పుడు కేంద్రం మరొక వ్యక్తి కోసం అన్వేషిస్తున్న దశలో జనార్దన రెడ్డి ఆ స్థానానికి రాగలిగాడు. అయితే అధికారంలో ఉండగా చకచక మెడికల్, డెంటల్ కళాశాలలు మంజూరు చేయటం, ఎడాపెడా పనులు జరపడం, రాజకీయ భ్రష్టత్వానికి దారితీసింది. హైకోర్టు కూడా ఆయన చర్యలను నిరసిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. బయట వ్యతిరేకత ఎంత ఉన్నా జనార్దన రెడ్డి కాంగ్రెసు పార్టీలో మాత్రం తన బలాన్ని కాపాడుకోగలిగాడు. 160 మంది శాసన సభ్యులు ఆయనకు మద్దత్తు పలికారు. సంవత్సరం తిరక్క ముందే మంత్రివర్గాన్ని పెంచి కొత్తవారిని తీసుకున్నాడు. కానీ కాంగ్రెసు పరిస్థితి దిగజారిపోతుండడం చూసి కేంద్రం ఆయనను తొలగించి విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఆవిధంగా ఒకఒకసారి వచ్చిన అవకాశాన్ని జనార్దన రెడ్డి జారవిడుచుకున్నాడు. కాంగ్రెసులో కూడా ఆయనకు వ్యతిరేకత పెరుగుతూ పోయింది.
వ్యక్తిగతంగా జనార్దన రెడ్డి నాతో ఎప్పుడూ బాగా వుండేవాడు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు, పెళ్ళిళ్లకు ఆహ్వానించేవాడు. టీచర్ గా జీవితంలో ప్రారంభించి రాష్ట్ర కేంద్ర స్థాయికి ఎదిగిన వ్యక్తి.

నాదెండ్ల భాస్కరరావు

కుట్రతో ముఖ్యమంత్రి
నాదెండ్ల భాస్కరరావు
(1935 జననం)

నాదెండ్ల భాస్కరరావు అడ్వకేటుగా ప్రాక్టీసు చేస్తూ రాజకీయాలలో ప్రవేశించారు. కాంగ్రెసు పార్టీ యూత్ విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు. నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్.గా ఉండగా హైదరాబాదులోని సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మా ఆఫీసుకు అనేక పర్యాయాలు వచ్చేవారు. కొన్ని సందర్భాలలో రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు. ఇంచుమించు రోజూ ఫోనులో అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. భాస్కరరావు చురుకైన, తెలివిగల రాజకీయవాది. విషయాలు త్వరగా గ్రహించాడు. ఎక్కడికైనా చొచ్చుకుపోయేవాడు. ఆవిధంగానే కాంగ్రెసు పార్టీలో ఆయన అన్ని స్థాయిల వారితో మెసిలారు.
రాజకీయాలలో ప్రవేశించిన తొలి రోజులలో ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి చేరువయ్యారు. ఆయన తొలి మంత్రివర్గంలో శాసన సభా వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. కానీ, తనకున్న సన్నిహితత్వం వలన ఇంకా పెద్ద శాఖను ఆశించారు. ప్రమాణ స్వీకారాలు జరిగిన తొలి రోజున గవర్నర్ శారదా ముఖర్జీ ఇచ్చిన విందుకు ఆయన అలిగి రాలేదు. తరవాత కొన్నాళ్ళకు చెన్నారెడ్డి మంచి శాఖను ఇచ్చినా భాస్కర రావు ఆట్టే కాలం నిలుపుకోలేక పోయారు. ఢిల్లీ వెళ్ళి తనపై ఫిర్యాదులు చెబుతున్నాడని చెన్నారెడ్డి ఆగ్రహించి మరొకసారి ఆయనకు అప్రధానమైన శాఖ ఇచ్చారు. ఇలాంటి రాజకీయ ఒడుదుడుకులు చెన్నారెడ్డి కాలంలో ప్రారంభమై అంజయ్య కాలంలో కొనసాగాయి. కనుక అంజయ్య కూడా భాస్కరరావును కుదించి ఒక దశలో ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించారు కూడా. ఆ తరువాత భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా వుండగా భాస్కరరావు ప్రయత్నించినా పదవి రాలేదు. అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీకై ప్రతిపక్షాలు కొన్ని ప్రయత్నించడం ఎన్.టి.రామారావు రంగప్రవేశం జరిగింది. భాస్కరరావు అప్పుడు ఎన్.టి.రామారావుకు చేరువై తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించాడు. తనను కో-పైలట్ గా చ్రితించుకున్నాడు. ఎన్.టి.రామారావు తొలి మంత్రివర్గంలో కీలక శాఖల్ని నిర్వహించారు. పార్టీలో ఆయనకు ఉపేంద్రకు అసలు పడేది కాదు. అలాగే మరికొందరితో కూడా భాస్కరరావుకు పొత్తు కుదిరేది కాదు. భాస్కరరావుకు రాగద్వేషాలూ ఎక్కవే. ఇందిరాగాంధీ తొందరపడవద్దని సలహా ఇచ్చినా తెలుగు దేశం పార్టీలోకి వచ్చేశాడు. కానీ, ఆయనకు పార్టీలో తృప్తి లేదు. జీవితమంతా కాంగ్రెసు సంస్కృతిలో అలవాటు పడిని భాస్కరరావు తెలుగుదేశంలో రామారావు నాయకత్వంలో ఇమడలేకపోయారు.
ఎన్.టి.రామారావు గుండె చికిత్సకు అమెరికా వెళ్ళినప్పుడు కాంగ్రెసు కుట్ర రాజకీయాలు పైకి తెచ్చి వివిధ పార్టీలతో గూడుపుఠాణీ జరిపి కేంద్ర కాంగ్రెసు వారి మద్దతుతో రాష్ట్రంలో రామ్.లాల్ గవర్నర్ సానుకూలతతో కృత్రిమంగా రామారావును అధికారం నుండి తప్పించారు. ప్రజలు ఎన్నుకున్న రామారావు ఆయన పార్టీ ప్రజాస్వామికంగా వస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భాస్కరరావు డొంక తిరుగుడు విధానాలతో రామారావును తొలగించి ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని నగరంలో కృత్రిమ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. తెలుగుదేశంలో ఉన్న బలహీనులకు అనేక ఆశలు చూపి కొందరిని ఆకర్షించగలిగారు. త్రిపురాన వెంకటరత్నం, నన్నపనేని రాజకుమారి మొదలైనవారు అలాగే మంత్రులయ్యారు. నిర్ణయాలు చకచక చేయటం అడిగిన వారికి అడిగినట్లు వరాలివ్వటం, కాలేజీలు సంస్థలు మంజూరు చేయటం నిమిషాల మీద జరిగిపోయింది. కానీ రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా రియాక్షన్ వస్తుందని తాము అభాసుపాలవుతామని భాస్కరరావు అంతగా వూహించి వుండడు. నెలరోజులు తిరక్క ముందే భాస్కరరావు కృత్రిమ ముఖ్యమంత్రిత్వం పోయింది. ఎన్.టి.రామారావు మళ్ళీ ప్రజాస్వామికంగానే కొనసాగారు.
ఆశ్చర్యమేమంటే భాస్కరరావును ఆదుకుంటామని అండగా నిలుస్తామని చెప్పిన కాంగ్రెసు ఆ తరువాత ఆయనను గాలికి వదిలేసింది. అవమానించిన అంజయ్యకైనా మళ్ళీ కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారు కానీ భాస్కరరావును మాత్రం రాజకీయంగా అంటరానివాడినిగానే అట్టిపెట్టారు. అది రామారావు దెబ్బ.
భాస్కరరావును నేను ఈ విద్రోహ చర్య అనంతరం కలియడం మాట్లాడటం మానుకున్నాను. అప్రజాస్వామిక విద్రోహ చర్యగా ఆయన ధోరణి నాకు బొత్తిగా నచ్చలేదు.

మూడుసార్లు ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు

కాంగ్రెస్ సంస్కృతి మార్చేసిన

ఎన్.టి. రామారావు
(1923-1996)
“నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ నినదించి, సైనిక దుస్తులు వేసుకుని, తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు ఢిల్లీవరకూ తీసుకెళ్ళాలని ఎన్నికల ప్రచారంలోకి దిగిన ఎన్.టి.రామారావు రాజకీయ చరిత్ర సృష్టించారు. 1981లో తెలుగుదేశం పార్టీ పెట్టిన రామారావు నవమాసాలు నిండకముందే పార్టీని అధికారంలోకి తెచ్చారు. వామపక్షాలతో సహా అందరూ ఆయనను సమర్థించటం ఒక విశేషం. జీవితమంతా సినిమారంగంలో ఉంటూ హఠాత్తుగా రాజకీయాలలో ప్రవేశించి అనూహ్య మార్పును తెచ్చిన రామారావు, ప్రజల నాడిని తెలుసుకున్నట్లు భావించవచ్చు.
ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చేనాటికి నాలుగుతరాల వారిని తన నటనా ప్రాచుర్యంతో ప్రభావితం చేశారు. పౌరాణిక పాత్రలు, సాంఘిక పాత్రలు, ఆయనను జనంలో బాగా జ్ఞాపకం పెట్టుకునేటట్లు చేశాయి. మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు ఒక మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఉదయమే ఆయనను దర్శించుకుని వచ్చేవారు. ఎన్నికల నాటికి అవన్నీ పనిచేశాయి.
1981 నాటికి ఇందిరాగాంధీ పేకముక్కలవలె ముఖ్యమంత్రులను రాష్ట్రంలో నలుగురిని మార్చేసింది. అది జనానికి ఏవగింపుగా, అవమానంగా భావించేటట్లు చేసింది. ప్రజాస్వామ్యం స్థానిక నిర్ణయాలు తెలుగువారి గౌరవం మంటగలిశాయనే మాట ఆనోటా ఆనోటా ప్రబలింది. అలాంటి వాతావరణాన్ని ఎన్.టి.రామారావు, రాజకీయానుభవం లేకపోయినా తనకనుకూలంగా మార్చుకున్నాడు. పార్టీ పెట్టడానికి కొందరిని సంప్రదించాడు. ఆనుపానులు చూచుకున్నాడు. మొత్తం మీద సాహసించి రంగప్రవేశం చేశాడు.
ఆ దశలో నేను ఎన్.టి.రామారావును హైదరాబాదులో అప్పుడప్పుడు కలుసుకునేవాడిని. రామకృష్ణా స్టూడియోస్.లో ఉదయం నుండే ఆయన సందర్శకులను కలసి మాట్లాడేవారు. అప్పట్లో నాతోపాటు మహిపాల్ రెడ్డి, భీమ్ రెడ్డి, తుమ్మల గోపాలరావు మొదలైనవారం ఆయనను కలిశాము. అలాకలుస్తున్నప్పుడు కొందరు పార్టీ అభ్యర్థులుగా తమ పేరు సిఫారసు చేయమని నన్ను కోరారు. ఆ పొరపాటు మాత్రం చేయలేదు. అందువలన రామారావుగారితో ఎప్పుడైనా కలియడానికి యథేచ్ఛగా మాట్లాడటానికి సందేహించాల్సిన పని ఉండేది కాదు.
ఎన్.టి.రామారావు ఎన్నికల ప్రభంజనం తెచ్చినప్పుడు నేను టంగుటూరి ప్రకాశాన్ని గురించి ఈనాడులో ఒక పెద్ద వ్యాసం రాశాను. అందులో ఆయన జీవిత చరిత్ర నుండి ఉదహరించి సైమన్ కమిషన్ మదరాసు వచ్చినప్పుడు ఒక వ్యక్తి చనిపోతే అతనిని చూడటానికి ప్రకాశంగారు వెళ్ళారని, ఒక పోలీసు అడ్డు పెడితే పక్కనున్నవారు ఆయనను గురించి చెప్పగా పోనిచ్చాడని రాశాను. అంతేగాని గుండీ విప్పి తుపాకి గుండుకి ఎరగా చూపాడనే వదంతి నిజం కాదని రాశాను. ఆమాటలు ప్రకాశంగారి, తెన్నేటి విశ్వనాథంగారి రచన నుండే తీసుకున్నాను. అయినా వీరాభిమానులు నా మీద ఆగ్రహించారు. ఈ వ్యాసం చదివి ఎన్.టి.రామారావు ప్రభావితుడయ్యాడు అని నేను చెప్పను కాని, అదే సందర్భంలో ప్రకాశంపై ఆయన కొన్ని విసుర్లు విసరడంతో కొందరు ఆగ్రహించారు.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా వివిధ సందర్భాలలో నేను విలేఖరిగాను ఇతరత్రా కలిశాను. ఎప్పుడైనా సరే నన్ను ఆదరంగానే చూచారు. హిందీ అకాడమీవారు ఆయన గురించి ఒక వ్యాస సంకలనం ప్రచురించదలిచారు. అందులో ఒకటి నన్ను రాయమని వేమూరి సత్యనారాయణ కోరారు. హిందీలోకి అనువాదం చేసుకుంటామని చెప్పారు. ఒక వెయ్యి రూపాయలు డబ్బు కూడా ఇచ్చాడు. తీరా రాసి ఇస్తే అది నిశిత పరిశీలనతో ఉన్నదని రామారావుగారికి నచ్చకపోవచ్చునని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదును ఎన్.టి.రామారావు అడిగినప్పుడు ఆ వ్యాసం బాగున్నదని ప్రచురించాలని ఆయన చెప్పారు. అందుకు రామారావు అంగీకరించడంతో వేమూరి వారు ముఖం చిన్నబుచ్చుకున్నారు.
మరొక సందర్భంలో రాజ్య సభ స్థానానికి పర్వతనేని ఉపేంద్ర, యలమంచిలి శివాజి మధ్య ఎవరు ఉండాలి అనేదానిమీద రామారావుగారి దగ్గర సిఫారసుల పర్వం నడిచింది. నేను శివాజీతోపాటు రామారావుగారి దగ్గరకు వెళ్ళటం చూసిన ఉపేంద్ర కొన్నాళ్ళు నామీద అలిగారు.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా కొన్ని సాహసోపేత నిర్ణయాలు, మహిళల హక్కులు, వెనుకబడిన వారికి రిజర్వేషన్లు గొప్ప మార్పును తెచ్చాయి. పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం కూడా సామాజిక విప్లవానికి నాంది పలికింది.
ఎన్.టి.రామారావు దగ్గర కొందరు చక్కని సలహాలిచ్చే పోలీసు అధికారులు (పర్వతనేని కోటేశ్వరరావు, అప్పారావు, రామ్మోహనరావు ఉండేవారు. అలాగే జయప్రకాష్ నారాయణ వంటి ఐ.ఎ.ఎస్. అధికారులు ఆయనకు హేతుబద్ధమైన సలహాలిచ్చేవారు. మూఢనమ్మకాలతో వక్రమార్గాలు పట్టించిన ఐ.ఎ.ఎస్. అధికారులు లేకపోలేదు. రామారావుగారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉన్నది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది. అందుకే అతి పెద్ద విగ్రహాన్ని చేయించి హైదరాబాదు చెరువు మధ్యలో ప్రతిష్ఠింప చేశారు. తెలుగువారి కీర్తిని చాటే ప్రముఖలు విగ్రహాలను టూరిస్టు ఆకర్షణగా నెలకొల్పారు.
ఒక సందర్భంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శివరామమూర్తి కొన్ని ప్రచురణలు రామారావుగారికి బహూకరించడానికి నన్ను తోడురమ్మన్నారు. అలా పొద్దున్నే వెళ్ళినప్పుడు, ఇచ్చి తిరుగు ముఖం పట్టగా, గాడ్ బ్లెస్ యూ అని ఆయన అందరినీ అన్నట్లే పలికారు. నేను వెంటనే ఏ గాడ్ ? అంటూ “మీరే దేవుడనుకొని కాళ్ళు మొక్కుతున్నారు కదా వేరే దేవుళ్ళు ఎందుకు?” అన్నాను. ఆయన దగ్గర అలా మాట్లాడేవారు బహుశ వుండరు. కాని ఆయన రియాక్ట్ అయి, “అరే, నీవంటయ్యా ఏదో మాట వరసకి అన్నాన్లే” అంటూ నవ్వారు.
సత్యసాయిబాబా పుట్టపర్తి ఆశ్రమంలో హత్యలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు విచారణకు ఉత్తరువులిచ్చి అవసరమైతే సాయిబాబాను అరెస్టు చెయ్యమన్నాడని తెలిసింది. నేను ఆయనను కలిసి అభినందించాను. చిరునవ్వు నవ్వాడు. కాని ముఖ్యమంత్రి ఉత్తరువులు అమలు జరగలేదు. ఆయన చుట్టూ ఉన్న సాయిబాబా భక్తులు ఆయనకు తెలియకుండానే అడ్డు పడ్డారని తరువాత ఆరా తీస్తే తెలిసింది. ముఖ్యమంత్రిగా రామారావు ఉన్నంతకాలం సాయిబాబా హైదరాబాదులో అడుగు పెట్టలేదు. ఒక సినిమాలో కూడా సాయిబాబా వంటి వ్యక్తిని ఆయన ఎగతాళిగా చిత్రించిన సందర్భం లేకపోలేదు. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావుగారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు. ఆయన అంగీకరించి నా సహాయం తీసుకుని ఫైల్సు చూచి నిర్ణయాలు తీసుకునేవారు. రామారావుగారికి ఆ విషయం చెబితే ఆయన సంతోషించారు. కానీ నార్ల నిర్ణయాలు కొన్ని కొందరికి కంటగింపుగా పరిణమించాయి. ముఖ్యంగా అకాడమీల విషయంలో అది గమనించదగింది.
ఎన్.టి.రామారావుకు కొన్ని బలహీనతలు ఉండేవి వాటిని ఆసరాగా పనులు చేయించుకున్నవారు లేకపోలేదు. ఆచార్య రంగాకు ప్రజలు నిధులు వసూలు చేసి రంగా భవన్ హైదరాబాదులో ఏర్పరచి ఒక ట్రస్టుగా దానిపక్షాన కార్యక్రమాలు జరిపించారు. ఆయన సేవలకు ప్రతిభకు చిహ్నంగా అది జరిగింది. అంతవరకూ బాగానే వుంది. రంగాగారికి సంతానం లేదు. కానీ ఆయన బంధువులు రంగా భవన్ పై కన్నువేసి ప్రజలిచ్చిన ఆస్తి కాజేయటానికి పబ్లిక్ ట్రస్టును ప్రైవేటు ట్రస్టుగా మార్పించారు. రంగా చేతనే అది అడిగించారు. అందులో వున్న అనౌచిత్యాన్ని పాటించకుండా ఎన్.టి.రామారావు అందుకు అంగీకరించారు. అలాంటి తప్పులు చేయకుండా వుంటే బాగుండేది.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా వుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పై నేను ఒక సెమినార్ నిర్వహించి ఉస్మానియా విశ్వవిద్యాలయ లైబ్రరీలో, ఐ.సి.ఎస్.ఎస్. ఆర్ ఆధ్వర్యాన చర్చ పెట్టాము. అందులో యూనివర్సిటీ నడుస్తున్న తీరు దాని స్థాపకుడు జి.రామిరెడ్డి వందిమాగధులను చుట్టూ చేర్చుకుని ప్రమాణాలు దిగజార్చిన పద్ధతి విమర్శించాను. ఆయన శిష్యులు సెమినార్ లోనే దీనికి నిరసన తెలుపగా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు విమర్శ సదుద్దేశంతో జరిగిందని తప్పొప్పులు చర్చకు పెట్టటం మంచిదేనని అన్నారు. కానీ రామిరెడ్డి ఆయన శిష్యులు ఒక పట్టాన విమర్శను గ్రహించలేకపోయారు. సమాధానం చెప్పలేకపోయారు. అప్పటికి రామిరెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు. అయినా ఆయన ఫోనులు చేసి నన్ను ఎదుర్కొనమని పురికొల్పారు. ఎలా ఎదుర్కోవాలో శిష్యులకు తెలియలేదు. అందువలన ఓపెన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, కొందరు ప్రొఫెసర్లు యూనివర్సిటీ గ్రాంట్ లో రోజూ అధికారంలో ఉన్నవారి చుట్టూ తిరిగి నాకు వ్యతిరేక ప్రచారం చేశారు. పత్రికల వారిదగ్గరకు వెళ్ళి నా వ్యాసాలు ప్రచురించవద్దన్నారు. అందుకు ఎడిటర్లు అంగీకరించలేదు. బుక్ లింక్స్ వంటి ప్రచురణ కర్తల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలు అమ్మవద్దన్నారు. కానీ, కె.బి.సత్యనారాయణ వంటివారు అందుకు నిరాకరించారు. సెమినార్ లో పాల్గొన్న ప్రొఫెసర్ విల్సన్ వంటివారిని క్షమాపణ చెప్పమని ఆయన ఇంటికి వెళ్ళి అడిగారు. ఆయన నిరాకరించాడు. చివరకు చంద్రబాబు నాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఇంద్రా రెడ్డి, జస్టిస్ జగన్మోహన రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావు దగ్గరకు వెళ్ళి నాపై ఫిర్యాదులు చెప్పి నన్ను బోయ్ కాట్ చెయ్యమన్నారు. వారు నవ్వుకొని పంపించేశారు. చివరి అస్త్రంగా ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు దగ్గరకు వెళ్ళి నాపై ఫిర్యాదులు చెప్పి చర్య తీసుకోమన్నారు. ఎన్.టి.రామారావు పెద్దగా నవ్వి, ఏం బ్రదర్, మాకేం సంబంధం ఈ విషయం, విమర్శలొస్తే మీకు చేతనయితే వారికి సమాధానం చెప్పుకోండి. అని పంపించేశారు. ఇదంతా నెలరోజుల ప్రహసనం. జర్నలిస్టులలో వి.హనుమంతరావు దగ్గరకు వెళ్ళి డేటా న్యూస్ ఫీచర్స్ నుండి నన్ను తొలగించమని కోరారు. ఆయన నిరాకరించాడు.
ఈ ప్రహసనం పూర్తయిన తరవాత ఓపెన్ యూనివర్సిటిలో ఒక ప్రొఫెసర్ వ్యాఖ్యానిస్తూ, మాకు నెలతప్పింది కాని ఫలితం మాత్రం దక్కలేదని, మేము ఎంత ఫూల్స్ అనేది రుజువైందని వాపోయాడు. ఈ ఘటనలో పాల్గొన్న వారెవరనుకున్నారు? ప్రొఫెసర్ హరగోపాల్, చేకూరి రామారావు, కె. మధుసూదన రెడ్డి, రిజిస్ట్రార్ నాగరాజు, ప్రొఫెసర్ శివలింగ ప్రసాద్, వైస్ ఛాన్సలర్ నవనీత రావు, సి.నారాయణ రెడ్డి మొదలైనవారు. ఔచిత్యం కోల్పోతే ఎలా ప్రవర్తిస్తారో ఎన్.టి.రామారావు చెప్పేవరకూ వారికి గ్రహింపు రాలేదు.

కోట్ల విజయభాస్కర రెడ్డి (1920-2001)

1968లో మొదటిసారి కర్నూలులో కోట్ల విజయభాస్కర రెడ్డిని కలిశాను. అప్పుడు తెలుగు స్వతంత్ర, ఆంధ్రభూమి సంపాదకుడు, రేడియో నాటికల రచయిత గోరాశాస్త్రి (గోవిందు రామశాస్త్రి)కి 50వ జన్మదినోత్సవం జరపటానికి సభ ఏర్పాటు చేసిన సందర్భం అది. కర్నూలు జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉన్న విజయభాస్కర రెడ్డి బాగా సహకరించి సభ జయప్రదం కావటానికి తోడ్పడ్డారు. ఆయన ఆనాడు చక్కటి ప్రసంగం చేశారు. అప్పటి పరిచయంతో ఆ తరువాత హైదరాబాద్.లో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. మిగిలిన రాజకీయ వాదులతో పోల్చితే విజయభాస్కర రెడ్డి పెద్ద మనిషి. హైదరాబాద్ లో పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో, గోపీ హోటల్.లో మిత్రులతో సరదాగా పేకాడుకోవటం ఆయన హాబీ. రాష్ట్ర రాజకీయాల నుండి కేంద్రానికి వెళ్ళిన విజయభాస్కర రెడ్డి చాలా కాలం స్థానిక విషయాలు పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని, 1982 ఎన్నికలలో విజయావకాశాలు క్షీణించాయని భయపడి విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకు వచ్చారు. అప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులని రాష్ట్రంలో మార్చేసిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేసింది. విజయభాస్కర రెడ్డి వలన పరువు దక్కుతుందని పదవిలోకి తీసుకు వచ్చారు. అయితే ఆనాటి రాజకీయ ప్రభంజనంలో రంగప్రవేశం చేసిన ఎన్.టి.రామారావు సుడిగాలి పర్యటనకు, ప్రజాదరణకు విజయభాస్కర రెడ్డి సరితూగలేకపోయారు. రామారావు ఇస్తున్న హామీలకు మారుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ. 1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు.


విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భవనం వెంకట్రాం, ఆవుల మదన్ మోహన్, నేను ఎదురుగా కూర్చున్నాం. రాష్ట్రంలో 11 మెడికల్ సీట్లు కర్ణాటకకు, అక్కడి స్థానాలు 11 ఆంధ్రకు ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో ఏర్పాటు చేశారు. దిగిపోబోయే ముందు భవనం వెంకటరాం ఆ ఫైలు సంతకం చేసి వెళ్ళారు. కానీ రానున్న ముఖ్యమంత్రి వాటిని ఆమోదించవలసి ఉంది. ఒక వైపు భవనం వెంకటరాం మరో వైపున మదన్ మోహన్ (నాటి ఆరోగ్య శాఖమంత్రి) నన్ను వెళ్ళి విజయభాస్కర రెడ్డితో ఆ ఫైలుపై సంతకం చేయమని చెప్పమన్నారు. ఆ మాట చెప్పటానికి వారికి మొఖం చెల్లక నన్ను కోరారు. నేను ఎదురుగా ఉన్న విజయభాస్కర రెడ్డి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెబితే ఆయన అప్పటికప్పుడే ఛీప్ సెక్రటరీకి చెప్పి ఫైలు తెప్పించి సంతకం చేయటం నన్ను ఆశ్చర్యపరచింది. కర్నూలులో ఏర్పడిన మా మిత్రత్వం ఆ విధంగా తోడ్పడింది.

నేను ఆ తరువాత విజయభాస్కర రెడ్డిని అంత తరచుగా కలవలేదు. ఎప్పుడైనా కలిస్తే ఆప్యాయంగా మాట్లాడేవారు. ముఖ్యమంత్రిగా నాలుగు నెలలకే దిగిపోయిన విజయభాస్కర రెడ్డి తరువాత ఢిల్లీ వెళ్ళిపోయి మరోసారి ముఖ్యమంత్రిగా పదేళ్ళ తర్వాత వచ్చారు. రెండవసారి కూడా ఆయన విఫలమయ్యారు. రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెస్.ను వోడించి ఎన్.టి. రామారావుకు అధికారం కట్టబెట్టిన పేరు విజయభాస్కర రెడ్డికే దక్కింది. రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నా మిత్రుడు అబ్బూరి వరద రాజేశ్వరరావుకు అధికార భాషా సంఘాధ్యక్ష పదవి ఇచ్చారు. వారిరువురికి ఢిల్లీలో పరిచయం ఉండేది. కానీ పదవి స్వీకరించక ముందే అబ్బూరి జబ్బుతో ఆసుపత్రిలో చనిపోయారు.

విజయభాస్కర రెడ్డి చివరి దశలో అపోలోలో చికిత్సకై చేరి చనిపోతున్న రోజులలో ఆయనను పట్టించుకున్నవారు లేరు. పదవులు లేకపోతే మనుషులకు ఉండే ఆదరణ అలాంటిదని కాంగ్రెస్ సంస్కృతి చెబుతున్నది.

రెడ్డి తొలగించుకున్న భవనం వెంకట్రామ్

భవనం వెంకట్రామ్
1932 - 2002

కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కల వలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్టానవర్గ చదరంగంలో భాగమే.
1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత కౌన్సిల్ సభ్యుడుగా చేశారు. ఆ దశలో డా.తంగిరాల సుభాష్ నాకు భవనం వెంకట్రామ్ ను పరిచయం చేశాడు. ఆయన సోషలిస్టు భావాలతో ఉన్న కాంగ్రెసు వాది. కలలు సంస్కృతి భాష సినిమాలు పట్ల బాగా ఆసక్తి ఉన్న రాజకీయవాది. రెడ్డి కులస్తుడైనా ఆలస్యంగా కమ్మ కులానికి చెందిన జయప్రదను పెళ్ళి చేసుకున్నాడు. ఇరువురూ గుంటూరు జిల్లాకు చెందినవారే. మెట్ట, మాగాణి అలవాట్ల కలయిక కూడా వారి జీవితంలో ఉన్నది. భవనం వెంకట్రామ్ చక్కగా మాట్లాడేవారు. ఎదుటివారిని ఒప్పించి అంగీకరింపచేయటంలో చాకచక్యులు. కానీ కాంగ్రెసు ముఠా రాజకీయాలలో ఇమడలేకపోయారు.
భవనం వెంకట్రామ్ విద్యామంత్రిగా ఉండగా కేంద్రంలో నెహ్రూ కుటుంబానికి సన్నిహితురాలైన శ్రీమతి షీలాకౌర్ ఢిల్లీలో విద్యామంత్రిగా ఉండేవారు. ఆమె రాష్ట్రానికి వచ్చినప్పుడు భవనం వెంకట్రామ్ పని తీరును ఆయన అభిరుచులను, సంస్కృతిని గమనించి అభినందించారు. ఉత్తరోత్తర అది చాలా పనిచేసింది. ఇందిరా గాంధీకి దగ్గరయిన షీలాకౌర్ రాష్ట్రంలో సంక్షోభం తొలగించటానికి అంజయ్య స్థానే ఎవరిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని ఆలోచిస్తున్న రోజులలో భవనం వెంకట్రామ్ పేరు సరైన సమయంలో సరైన వ్యక్తులకు చేరవేసింది షీలా కౌర్ మాత్రమే. మిగిలినవారెందరో తాము ఒక సమిధను సమర్పించామని అన్నప్పటికీ అసలు కీలకం అది.
భవనం వెంకట్రామ్ కు విద్యామంత్రిగా చక్కని అనుభవం వచ్చింది. ఆయన కొన్ని సదస్సులలో పాల్గొని ప్రసంగించటానికి నేను తోడ్పడ్డాను. ఉదాహరణకు సైంటిస్టులను ఉద్దేశించి హైదరాబాదు జూబిలీ హాలులో ప్రారంభోపన్యాసం విద్యామంత్రిగా చేయవలసి వస్తే నేను ఆయన ప్రసంగాన్ని రాసి ఇచ్చాను. సైంటిఫిక్ మెథడ్ ఎలా అమలు జరపాలి. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి రాజ్యాంగం రీత్యా దాని ఆవశ్యకతను అందులో రాశాను. ఎ.బి.షా రాసిన సైంటిఫిక్ మెథడ్.ను ఆధారంగా తయారు చేసిన ఆ ఉపన్యాసాన్ని భవనం వెంకట్రామ్ బాగా చదువుకొని సభలో మాట్లాడాడు. సైంటిస్టులు చాలామంది ఆయనను అభినందించారు. అనుకోని అభినందనకు భవనం పొంగిపోయాడు. తరువాత వచ్చి నాకు చాలా ధన్యవాదాలు చెప్పారు. అప్పటి నుండి మేము అతుక్కుపోయాము.
భవనం వెంకట్రామ్ తటపటాయింపు ఎక్కువగా చేసిన వ్యక్తి. ఒకపట్టాన నిర్ణయాలు తీసుకోగలిగేవాడు కాదు. దానికి కారణం ఆయనకు మద్దత్తుగా రాజకీయవాదులు లేకపోవడమే. కానీ అన్ని పార్టీల నుండి ఆయనను మెచ్చుకునేవారు ఉండటం గమనార్హం.
ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంలో ఢిల్లీ యాత్రలు జరుగుతుండగా భవనం వెంకట్రామ్ నన్ను తోడుగా తీసుకెళ్ళేవారు. ముఖ్యమంత్రి అయిన తరవాత కూడా ఆయన అధికారంలో ఉన్న కొద్దికాలం ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా అన్ని పర్యాయాలు నేనూ వెళ్ళాను. అది మంచి అనుభవం. ఇందిరాగాంధీతో సన్నిహితంగా కలియడానికి ఆమెకు ఆనాడు పి.ఏ.గా ఉన్న పోద్దార్ బాగా తోడ్పడ్డాడు. ఢిల్లీదంతా అర్థరాత్రి రాజకీయం. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీని చాలా పొద్దుపోయిన తరవాతనే కలిసేవాడు. అప్పుడే మంతనాలు చేసేవాడు. అది కాంగ్రెసు సంస్కృతిలో భాగమైపోయింది.
నేను ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్.కు సన్నిహితంగా ఉండటం వలన నా సిఫారసుల కోసం అనేకమంది తిరుగుతూండేవారు. నేను ఏవీ పట్టించుకోకపోవడం వల్ల, నా వల్ల పనులు జరగవని నిర్ధారించుకుని దూరంగా పోతుండేవారు. అదొక గమ్మత్తయిన రాజకీయ వాతావరణం.
నేను స్నేహితుడుగానే భవనం వెంకట్రామ్ కు మిగిలాను. అయితే రాజకీయాలపై వ్యాఖ్యానాలు చేసేటప్పుడు మాత్రం సన్నిహితత్వాన్ని పక్కకి పెట్టి విమర్శను వ్రాశాను. అది భవనంకు కష్టమనిపించేది. తరువాత మర్చిపోయేవాడు. మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి ఎన్నో కబుర్లు చెప్పేవాడు. హైదరాబాదు ఆదర్శ్ నగర్ లో నేను వుంటున్న ఒక అద్దె ఇంటికి భవనం వెంకట్రామ్ తరచు వచ్చేవాడు. అప్పుడు ఆయన కోసం వచ్చిన ప్రముఖులలో వై.యస్. రాజశేఖర రెడ్డి, నారాచంద్రబాబునాయుడు, పాలడుగు వెంకట్రావు మొదలైనవారుండేవారు. అది నిత్యకృత్యంగా ఉండేది. అయినప్పటికీ నేను మాత్రం రాజకీయాల జోలికి పోకుండా ఉండగలిగాను. భవనం పదవి నుండి దిగిపోయిన తరవాత కూడా మా సన్నిహితత్వం అలాగే కొనసాగింది.
భవనం ముఖ్యమంత్రిగా ఉండగా ఏమీ చేయలేకపోయాడనే చెప్పాలి. ఎన్. జనార్దన రెడ్డి వంటివారు ఆయన మంత్రివర్గంలో ఉంటూనే ఆయనను ఖాతరు చేసేవారు కాదు. నాదెండ్ల భాస్కరరావు ఆయన ద్వారా ఏదో ఒక పదవిలో ప్రవేశించాలని విఫల ప్రయత్నం చేశారు. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారానికి ఎన్.టి.రామారావు రావటం చాలామంది ఆశ్చర్యం వేసింది. వారిరువురూ గుంటూరు   ఎ.సి.కాలేజీలో  విద్యార్థి దశలో స్నేహితులు. అదీగాక సినీరంగంలో భవనానికి కూడా ఆసక్తి ఉండేది. పి.వి.నరసింహారావు అంటే భవనానికి ఇష్టం ఉండేది. ఏడు మాసాల ముఖ్యమంత్రిగా చరిత్రలో ఆయన నిలిచిపోయాడు.
1982లో ఎన్నికలు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఢిల్లీ నుండి సూట్.కేసులతో నిధులు తెచ్చిందని చెబితే నేను మొదట్లో నమ్మలేదు. తరువాత భవనం వెంకట్రామ్.ను పిలిచి కొంతడబ్బిచ్చి అనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థులకు పంచమన్నారు. ఆయన ఆవిషయం నాతో చెప్పకుండా, అనంతపురం వెళ్ళొద్దాం రమ్మని కారులో తోడు తీసుకెళ్లారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. ట్రావెల్స్ బంగళాలో బి.టి.ఎల్.ఎన్. చౌదరికి కాంగ్రెస్ నిధిని ఎన్నికల ఖర్చుల నిమిత్తం భవనం వెంకట్రామ్ ఇస్తున్నప్పుడు గమనించాను. ఆయన డబ్బు చాలదని సిఫారసు చేసి మరికొంత ఇప్పించమని అడిగాడు. ఆయన వెళ్ళిపోయిన తరవాత భవనాన్ని అడిగితే ఇందిరాగాంధీ నిధులు తెచ్చి పంచిన మాట నిజమేనని అందులో ఒక భాగమే తనకు అప్పగించారని చెప్పారు.
భవనం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబునాయుడుకు స్టేట్ మంత్రి హోదా వుండేది. ఆయనను కేబినెట్ హోదాకు పెంచాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి కోరిక. ఢిల్లీ వెడుతున్నప్పుడు నాకావిషయం చెప్పి నన్ను కూడా వీలైతే ఒక మాట చెప్పమన్నాడు. రాజశేఖర రెడ్డి మిత్రులకు అరమరికలు లేకుండా అలా సహాయం చేసిన ధోరణి కనబరిచాడు. కానీ నేను అందులో పాత్ర వహించలేదు.
అసలు విషయం ఏమంటే కేంద్రం ఆమోదం లేకుండా ఏ మార్పూ చేసే అవకాశం భవనానికి లేదు. తన నిస్సహాయతను భవనమే నాకు చెప్పాడు.
ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా ఉన్నందున నాకు కొన్ని మంచి అవకాశాలు లభించేవి. సుప్రసిద్ధ గాయని లతామంగేష్కర్ తన తండ్రిపేరిట ముషీరాబాదులో సంస్థ పెట్టటానికి స్థలం అడుగుదామని ఒకరోజు పొద్దున్నే భవనం ఇంటికి వచ్చింది. సమయానికి ఎవరూ లేరు. ఆమెతే మాట్లాడుతుండమని ఈలోగా తాను తయారయి వస్తానని భవనం చెప్పారు. ఆవిధంగా చాలా సేపు లతామంగేష్కర్.తో మాట్లాడి ఆమె అనుభవాలు తెలుసుకునే అవకాశం లభించింది. ఆశ్చర్యమేమంటే ముఖ్యమంత్రి ఇంట్లో అలాంటి సుప్రసిద్ధ గాయని వచ్చినప్పుడు అందరం కలిసి ఫోటో తీయుంచుకుందామంటే కనీసం కెమేరా లేదు. నేటి ముఖ్యమంత్రులకు, నాటి ముఖ్యమంత్రులకు ఎంతో తేడా అనిపించింది.
భవనం వెంకట్రామ్ విద్యామంత్రిగా ఉండగా యు.జి.సి. ఛైర్మన్ మాధురీదీక్షిత్ అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వచ్చింది. భవనం వెంకట్రామ్ నేను కలిసి వెళ్లాం. అయితే ఆమె సత్యసాయిబాబా భక్తురాలిగా పుట్టపర్తిలోని డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నది. అది అవమానకరమని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ వ్యక్తిగత భక్తి ముఖ్యం కాదని నేను వెంకట్రామ్ కు చెప్పాను. ఆయన అందుకు అంగీకరించి సాయిబాబా విద్యాసంస్థకి వెళ్ళలేదు.
బాబాలు, మాతలు భవనం వెంకట్రామ్ దగ్గరకు వచ్చినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి కడప నుండి శివస్వామి వచ్చి విబూది, పండు ఆయన చేతిలో పెట్టాడు. గాలిలోనుంచి అవి సృష్టించినట్లు చెప్పాడు. పక్కనే కూచున్న నేను భవనం వెంకట్రామ్ చెవిలో – ఒక గుమ్మడి కాయ ఇవ్వమనండి అని చెప్పాను. ఆయన అలాగే అడిగాడు. ఆ స్వామి తెల్లబోయి ఇవ్వలేనన్నాడు. చేతిలో పట్టే వస్తువులయితే హస్తలాఘవంతో కనికట్టు విద్యతో అవతలి వాళ్ళని భ్రమలో పడేస్తారు. ఆ స్వామి జూనియర్ కాలేజీ పర్మిషన్ కోసం వచ్చి ఇలాంటివి అడిగాడు. మొత్తం మీద వాళ్ళను భవనం దూరంగానే ఉంచేవాడు.
ఆయన హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పోస్టు భర్తీ చేయవలసి వచ్చింది. అనుకోకుండా నన్ను అడిగితే అప్పుడే హైకోర్టులో ఛీఫ్ జస్టిస్.గా రిటైర్ అయిన ఆవుల సాంబశివరావు పేరు చెప్పాను. భవనం వెంటనే అంగీకరించి నన్నే వెళ్ళి ఒప్పించమన్నారు. నేను ఆపని చేయగలిగాను.
భవనం హయాంలో జరిగిన ఒక మంచి కార్యక్రమం ఓపెన్ యూనివర్సిటీకి నాంది పలకటం. చదువుకోవటానికి అవకాశం లేక గ్రామాలలో ఉంటున్న వారికి విద్యా బుద్ధులు గరపటానికి పథకం ఉండాలని భవనం తలపెట్టాడు. ఆ ప్రయత్నంలోనే జి. రామిరెడ్డిని పిలిచి విషయాన్ని పరిశీలించమన్నాడు. ఆయన ఇంగ్లండు వెళ్ళి ఓపెన్ యూనివర్సిటీ పద్ధతిని చూసి వచ్చి రిపోర్టు ఇచ్చాడు. యూనివర్సిటీ నాగార్జున సాగర్ వద్ద పెట్టాలని భవనం తలపోశారు. చివరి దశలో వైస్ ఛాన్సలర్.గా జి.రామి రెడ్డికి పోటీగా జెన్ టిక్స్ శాఖాధిపతి ఓ.యస్ రెడ్డి ముందుకు వచ్చాడు. కానీ మేమంతా రామిరెడ్డినే బలపరిచాము. ఓ.యస్. రెడ్డి నాకు మిత్రుడే. ఆయనకు కష్టం వేసింది కూడా. కానీ భవనాన్ని ఒప్పించి చివరకు రామిరెడ్డి పేరుకే మొగ్గు కనబరిచాము.
భవనం వెంకట్రామ్ దిగిపోయిన తరవాత రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహించలేదు. కానీ చివరి వరకూ నాతో సన్నిహితంగానే ఉండేవాడు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన వద్దకు ఆట్టే ఎవరూ వచ్చేవారు కాదు. పదవి లేనప్పుడు కాంగ్రెస్ సంస్కృతి అంతే.

నేనూ రెడ్డినే అన్న ముఖ్యమంత్రి అంజయ్య

జంబోజెట్ ముఖ్యమంత్రి
(1919 – 1986)

అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ అది కూడా ఏకాభిప్రాయంతో లేదు. తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరవాత చెప్పారు. అంతకుముందు అంజయ్య అంటే వెనుకబడిన తరగతులకు ప్రతినిధి అని అందరూ భావించేవారు.
ఆల్విన్ కంపెనీలో ఆరణాల కూలీగా ఆరంభమైనట్లు చెప్పుకున్న అంజయ్య పేదవారికోసం, గుడిసెలలో బతుకుతున్నవారికోసం చాలా కాలం రాజకీయంగా కృషిచేశారు. ఆడంబరాలు లేకుండా సింపుల్.గా జీవితం గడుపుతూ చలాకీగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే రోశయ్యను 1969 ప్రాంతాలలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంగా కలిశాను. అప్పట్లో చెన్నారెడ్డి ప్రవేశించి ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పుడు అంజయ్య కూడా శ్రీమతి ఇందిరాగాంధీపై విసుర్లు విసురుతుండేవాడు. ప్రజాసమితి పక్షాన ఎన్నికలలో పోటీచేసి నెగ్గాడు కూడా. ప్రజాసమితి కాంగ్రెసులో లీనమైన మరునాటి నుండి అంజయ్య తిరుగులేని ఇందిరాగాంధీ భక్తుడైపోయాడు. మిగిలినవారు ఎటు మారినా ఆయన మాత్రం స్థిరంగా ఇందిరా మనిషిగానే నిలిచాడు.
మొట్టమొదట బ్రహ్మానందరెడ్డిని తొలగించి రాష్ట్రంలో మరొక వ్యక్తిని తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న రోజులలో, (1972) ముఖ్యమంత్రి కావాలని అంజయ్య ఆశించి ఇందిరాగాంధీని అడిగాడు కూడా. ఆ తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడం దేశంలో ప్రజాబలం కోల్పోవటం జరిగినా అంజయ్య మాత్రం ఆమె పక్షానే నిలిచాడు. తరచు ఢిల్లీ వెళ్లటం ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీని కలిసేవాడు. సంజయ్ గాంధీతో అత్యంత సన్నిహితుడయ్యాడు. అతను చనిపోయినప్పుడు అంజయ్య అప్.సెట్ అయ్యాడు. అవన్నీ నేను ప్రత్యక్షంగా గమనించాను. బరకత్ పురాలో ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెపుతున్నప్పుడు తోటి కాంగ్రెసు నాయకుల మీద, రాజకీయ విషయాల పైన అరమరికలు లేకుండా వ్యాఖ్యానాలు చేస్తుండేవాడు. మేము నవ్వుకునేవాళ్ళం. చెన్నారెడ్డిపై ఆయమ ముఖ్యమంత్రి అయినప్పటినుండీ ఫిర్యాదులు చెపుతూనే వుండేవాడు. అవికొన్ని ఢిల్లీలో కూడా చెప్పాడు. చెన్నారెడ్డి అపఖ్యాతిపాలై కాంగ్రెసు ప్రతిష్ఠను దిగజారుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కావాలనే ఆయన కోరికను మళ్ళీ అంజయ్య వెలిబుచ్చాడు. ఆయనకు పి.వి.నరసింహారావు మద్దతు పలికాడు, మరొకవైపుల సంజయ్ గాంధీ ఇష్టుడు కావటం వలన ఇందిరాగాంధీ అంజయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. తన చిరకాలవాంఛ తీరినందుకు అంజయ్య సంతోషించాడు.
ముఖ్యమంత్రిగా రాకముందే అంజయ్య కేంద్ర కాంగ్రెసు నాయకులతో సన్నిహితత్వం పెంచుకున్నాడు. బీహారు కాంగ్రెసు వ్యవహారాలు కూడా కొన్నాళ్ళు చూచాడు. హిందీ, ఉర్దూ మాట్లాడటం, కాళ్లు మొక్కటం కాంగ్రెసు సంస్కృతిలో అంజయ్యకు కలిసివచ్చాయి.
ముఖ్యమంత్రిగా ఆయన జంబో జెట్ మంత్రివర్గాన్ని 61మందితో ఏర్పరచాడు. రాజకీయవర్గలాలన్నీ విస్తుపోయాయి. అప్పుడు ఆయనను విలేఖరులుగా మేము అడిగితే ఏమంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు. ఆ విధంగా కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు. అయితే కేంద్రం దీనిపై వెంటనే స్పందించి మంత్రివర్గాన్ని కుదించమని చెప్పటంతో ఒక 20మందిని తొలగించి, వారికి వేరేపదవులు ఇస్తానన్నాడు. అంజయ్య తన మంత్రివర్గంలో నాదెండ్ల భాస్కరరావుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక స్థాయిలో అంజయ్యను లెక్కచెయ్యనట్లుగా ప్రవర్తించాడు. దానిపై అంజయ్య ఆగ్రహించి ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించాడు కూడా. భాస్కరరావు 17 పేజీల ఫిర్యాదు రాసి ఇందిరాగాంధీకి పంపించాడు. అయితే వాటిపై విచారణ జరిపిస్తామని తొందరపడి పార్టీకి రాజీనామా చేయటం మరో పార్టీ పెట్టే ప్రయత్నాలూ చేయవద్దని ఆమెను బాలరాజ్ చోప్రా ద్వారా కబురు పెట్టారు. అంజయ్యకు ఢిల్లీలో తగినంత సానుభూతి లేకపోలేదు. ఎవరెన్ని చెప్పినా ఢిల్లీ ఆయనను ఆదరిస్తూనే వచ్చింది.
అప్పట్లో నేను అంజయ్యను చాలా ఎక్కువగా తలుచుకునేవాడిని. ఆయన ప్రియశిష్యుడైన పి.జనార్దన రెడ్డికి పురావస్తు శాఖ ఇచ్చాడు. ఒకసారి నన్ను పిలిచి మనవాడికి కాస్త దాని సంగతి చెప్పు అన్నాడు. నేను జనార్దన రెడ్డిని వెంటబెట్టుకుని స్టేట్ ఆర్కెవ్స్ (తార్నాక, హైదరాబాదు)కు వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించమన్నాను. శాసన సభలో కూడా ప్రశ్నలకు కొన్ని సమాధానాలు ఆయనకు చెపుతుండేవాడిని. జనార్దన రెడ్డి చాలా వినయంగా స్వీకరించేవాడు.
వివిధ రాజకీయ ఉత్సవాలలో మేము పాల్గొంటున్నప్పుడు, ముఖ్యమంత్రి అంజయ్య యధాలాపంగా, ... మన డ్రైవర్లకు, ఆ ప్రెస్ వాళ్ళకు ముందుగా పెట్టుండ్రి... అని సదుద్దేశంతోనే అనేవాడు. అందువలన గోల తగ్గుతుందని ఆయన ఉద్దేశ్యం.
అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని ఆనాడు కవి దాశరథి వ్యాఖ్యానిస్తే పత్రికలు వ్యంగ్య చిత్రాలు వేసి ఎగతాళి చేశాయి. అంజయ్య జోక్స్ కొన్ని ఆయన చెప్పినవి కొన్ని ఆయన పేరిట ప్రచారంలోకి వచ్చినవి వాడుకలో ఉండేవి. సముద్రంలో తేల్ పడిందంట. మనకు ఇంక ఆయిలు కరువు లేదు అని అంజయ్య అంటే, అలాంటి తెలుగు ఉర్దూ కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు. కంటి ఆసుపత్రికి వెళ్ళి అక్కడ లేబర్ వార్డు లేదా అని అడిగినట్లు చెపుతారు. ఆయనకు లేబర్ అంటే ఉన్న ఇష్టాన్ని ఆవిధంగా చిత్రించారు. ఇలాంటివి ఎన్నో ఉండేవి.
అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికే ఉద్దేశ్యంతో అంజయ్య మందీ మార్బలాన్ని వెంటబెట్టుకుని బేగం పేట విమానాశ్రయానికి వెళ్ళారు. అది నచ్చని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అని కూడా గమనించక, బఫూన్ అని ఈసడిస్తూ మాట్లాడారు. పత్రికలలో అది పతాక శీర్షికలలో వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దానిపై స్పందించాయి. అంజయ్య రాజీనామా ఇద్దామనుకున్నాడు. ఆయన అనుచరులు పట్టుబట్టి ఆపారు. కానీ అతరవాత కొద్దికాలానికే అసంబ్లీ ఎన్నికలు రావటం అంజయ్యకి జరిగిన అవమానం తెలుగు వారికి జరిగినట్లుగా ప్రచారంలో విపరీతంగా పాకిపోవటం, కాంగ్రెసు పతనానికి ఒక ప్రధాన కారణం అయింది. అప్పుడే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.
ఇంత జరిగిన తరవాత అంత అవమానించిన రాజీవ్ గాంధీ అదే అంజయ్యను తన మంత్రివర్గంలోకి తీసుకోవటం కాంగ్రెస్ సంస్కృతికి దర్పణం.
అంజయ్య ఆట్టే కాలం జీవించలేదు. 1986లో చనిపోయాడు. అంజయ్య మిత్రత్వానికి మంచి వ్యక్తి. అది స్వానుభవం.

రెండు సార్లు ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి

తెలంగాణా ఊసెత్తని చెన్నారెడ్డి
(1919 – 1996)

దేవర్స్ బాబా కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా. చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో సెక్యులరిస్ట్ ఇంగ్లీషు మాస పత్రికలో ముఖచిత్రంగా వేశారు. అప్పట్లో దానికి ఎడిటర్ ప్రొ. ఎ.బి. షా. అది చెన్నారెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన ఆగ్రహంతో ఊగిపోయి, ‘పిలవండి.. ఆ ఇన్నయ్య ఎక్కడ ఉన్నాడో, సంగతేంటో తేల్చుకుందాం’ అన్నాడు. నాకు కబురు చేశారు. వెళ్ళాను. ఆ పత్రికను చూపి విసిరికొట్టి, నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అన్నాడు.

నేను ప్రశాంతంగా ఆయన షష్ఠి పూర్తి సంచిక తీసి, అందులో రంగుల చిత్రంగా పూర్తి పేజీలో వేసిన దేవర్స్ బాబా కాలు పెట్టి దీవించిన చిత్రం ఆయన ముందు పెట్టాను. అది చెన్నారెడ్డి ఆమోదంతో ఆయన అభిమాని పరమహం తయారు చేసిన సవనీర్. చెన్నారెడ్డి అవాక్కయిపోయాడు. ఆగ్రహంలో వివేచన మరచిపోవటం సహజం.

చెన్నారెడ్డికి నాకు సన్నిహిత పరిచయం 1958 నుండి మొదలైంది. ఆది నుండి అది లవ్ – హెట్ సంబంధంగానే కొనసాగింది. స్వతంత్ర పార్టీ ఆవిర్భవించిన తొలి రోజులలో విజయవాడలో ఆచార్య రంగా మొదలైన వారి సమక్షంలో జరిగిన సభలో చెన్నారెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఉండేబదులు, కృష్ణలో దూకి చావటం మేలని చప్పట్ల మధ్య ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన మాట్లాడిన సభలో నేను, ఎస్.వి. పంతులు మొదలైన వారంతా ఉన్నాము. అప్పుడే చెన్నారెడ్డితో నా తొలి పరిచయం. ఆ తరువాత ఆయన చనిపోయే వరకూ అన్ని పరిస్థితులలోనూ కలుస్తూనే ఉన్నాము.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రాసినప్పుడు కూడా చెన్నారెడ్డి పదవిలో ఉండగా అవినీతి విషయాలను ప్రస్తావించిన సంగతులు కొందరు ఆయన దృష్టికి తీసుకు వెళ్ళారు. నా పుస్తకాన్ని విసిరి గొట్టినట్లు అక్కడ ఉన్నవారు చెప్పారు. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి రాకముందు, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సారధిగా ఆయన వుర్రూత లూగించినప్పుడు ఎన్నిసార్లు కలిశానో చెప్పలేను. నా మీద ఎంత కోపమున్నా, మరొక పక్క ఆదరంగానే చూడేవాడు. తెలంగాణా ఉద్యమం తారా స్థాయిలో ఉండగా కొందరు ఆంధ్రా మిత్రులు ఆయన్ను కలవాలని కోరిక వెల్లబుచ్చారు. అడ్వకెట్ ఎన్.కె. ఆచార్య, మానవ వాది కొసరాజు సాంబశివరావు, జర్నలిస్ట్ ఎ.ఎల్. నరసింహారావు వారిలో ఉన్నారు. ఆ నాడు చెన్నారెడ్డి ఒక టెర్రర్. ఆంధ్రులు ఆయన్ని కలిసేవారు కారు. నేను వీరిని వెంట బెట్టుకుని లాలాపేటలో ఆయన గృహాలకు వెళ్ళినప్పుడు, ‘మీరంతా తెలంగాణా వారితో కలిసి ఉద్యమంలో పాల్గొంటే మీ జోలికి ఎవరూ రారు’ అని సలహా చెప్పారు. వెళ్ళినవారు మౌనంగా వచ్చేశారు. నేను తరువాత ఆయనతో, అయితే తెలంగాణా వారితో ఉద్యమంలో కలియకపోతే ఏమైనా చేయవచ్చు అని సందేశం ఇస్తున్నారా అని అడిగాను. ఆయన కాసేపు కూర్చోబేట్టి ఆచార్య రంగా, లచ్చన్న మొదలైన వారి విషయాలు అడిగారు. మా ఇరువురికీ అవి కామన్ టాపిక్స్.

ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నిసార్లు చెన్నారెడ్డితో తారసిల్లానో చెప్పలేను. ఒకసారి జర్నలిస్ట్ కాలనీకి వచ్చినప్పుడు, ఆయన ఉపన్యాసం చెబుతూ, కొత్త జర్నలిస్ట్ కాలనీలు ఏర్పాటు చేద్దామని ఉందనీ, అయితే జర్నలిస్టుల పేర్లు పెట్టాలంటే సుప్రసిద్ధ తెలుగు వారి పేర్లు కనిపించటం లేదని అన్నారు. ఎం. చలపతిరావు కాలనీకి ప్రారంభోత్సవం చేస్తూ అన్న మాటలవి. కొండా లక్ష్మారెడ్డి నన్ను ధన్యవాదాల ప్రసంగం చేయమన్నాడు. అప్పుడు నేను మాట్లాడుతూ కొత్త జర్నలిస్టుల కాలనీలు ఇస్తామని అన్నందుకు చెన్నారెడ్డి గారికి ధన్యవాదాలని అంటూ ఎన్ని కాలనీలు పెడితే అంత మంది సుప్రసిద్ధ తెలుగు జర్నలిస్టుల పేర్లు చెబుతామని, ఉదాహరణగా నార్ల వెంకటేశ్వరావు, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, సి.వై. చింతామణి, ఖాసా సుబ్బారావు, అలా పేర్లు వల్లించారు. జనం చప్పట్లు కొట్టారు. చెన్నారెడ్డికి మళ్ళీ కొపం వచ్చింది. కానీ ఏమీ అనలేదు.

అనేక ప్రెస్ మీటింగులలో ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసేవాణ్ని. కొన్ని సార్లు ఆయన సమాధానం చెప్పటానికి కుదరక నీవే దానికి జవాబు చెప్పు అనేవాడు. మరోసారి ఢిల్లీ నుంచి తిరిగి బేగం పేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు చెన్నారెడ్డిని తొలగించి వేరే వారిని పెట్టబోతున్నారని వార్త ప్రబలింది. విపరీతంగా ప్రెస్ వారు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ పత్రికల వారిని కలిసినప్పుడు వారంతా ఆయనకు పదవి పోయినట్లు, సానుభూతిగా ప్రశ్నలు వేస్తుండగా నేను, కంగ్రాచ్యూలేషన్స్ చెన్నారెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారుగా అన్నాను. ఆయన నవ్వుతూ ఏమో నీకే తెలియాలి అని దాటేసి వెళ్ళిపోయారు. ప్రెస్ వాళ్ళు ఆశ్చర్య పోయారు. అక్కడ ఉన్న ఉమా వెంకట్రమ రెడ్డి సంతోషంగా, ఆశ్చర్యంగా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీరు చెప్పేది నిజమేనా అని ఆత్రుతగా అడిగారు. ఆ తరువాత కొన్నాళ్ళకు గాను చెన్నారెడ్డిని తొలిగించి అంజయ్యను పెట్టలేదు.

చెన్నారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దానికి ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు గాంధీ భవన్ లో కలిసేవాడిని. ఆ తరువాత ముఖ్యమంత్రిగా మరి కొన్ని సార్లు కలుసుకొన్నాం.

చెన్నారెడ్డి రాగ ద్వేషాలు విపరీతంగా ఉన్న వ్యక్తి. ఆగ్రహావేశాలని దాచుకోకుండా వ్యక్తం చేసేవాడు. ఆయన్ను ప్రత్యేక ఇంట్రవ్యూలు చేసినప్పుడు జస్టిస్ట్ పింగళి జగన్ మోహన్ రెడ్డిని గురించి, కొందరు కాంగ్రెస్ నాయకుల గురించి చాలా ఘాటుగానే స్పందించేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి రోజులలో డాక్టర్ గా ప్రాక్టీసు పెట్టడం, పత్రిక నడపటం మొదలైన ఎన్నో విశేషాలు వివరంగా చెప్పేవాడు. ప్రత్యేక తెలంగాణాలో ఆయన పాత్ర వేరు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గవర్నర్ గా ఆయన దోరణి వేరు. రాజకీయాలలో అవినీతి అనే అంశం చెన్నారెడ్డి కాలంలో ఒక ప్రత్యేకమైన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తులాభారాలు, జరిపించిన తీరు జనాకర్షణ అయింది. చెన్నారెడ్డి నిర్భీతిగా వ్యవహరించేవారు. సభలలో తనకు ఇష్టమైనవారిని స్టేజిమీదకు పిలిచి కూచోబెట్టేవారు. అలాంటి అదృష్టం శ్రీమతి దుర్గా భక్తవత్సలం వంటివారికి దక్కింది. చెన్నారెడ్డి పదవిలో వుంటే క్షేమం అని వి.బి. రాజు అనేవాడు. శత్రువులను సైతం లోబరచుకున్న రాజకీయ చతురత ఆయనకున్నది. తనపై పోటీ చేసిన వందేమాతరం రామచంద్రరావును పిలిచి అధికార భాషాసంఘాధ్యక్షుణ్ణి చేసిన చెన్నారెడ్డి, అరమరికలు లేకుండా తన మామ పేరిట కె.వి.రంగారెడ్డి జిల్లా అని రూపొందించారు. మార్క్సిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజి బోర్డు ఛైర్మన్.గా ఒప్పించటం చెన్నారెడ్డికే తగింది.

దేశ ఆర్థిక భవిష్యత్తును మార్చిన పి. వి. నరసింహారావు

పి. వి. (1921-2004)
“ఈ పాములు, తేళ్ళ బాధ పడలేకుండా ఉన్నాము” అని జి.సి.కొండయ్య (ప్రముఖ జనతా నాయకుడు) ఆరోజులలో వ్యాఖ్యానించేవారు. మొదట్లో ఆమాటలకు అర్థం తెలిసేది కాదు. తరువాత పాములపర్తి వెంకట నరసింహారావు, తేళ్ళ లక్ష్మీకాంతమ్మ సన్నిహిత సహచర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడని గ్రహించాము. నవ్వుకున్నాము.
పి.వి. నరసింహారావు విద్యామంత్రిగా బ్రహ్మానందరెడ్డి కేబినెట్.లో నాకు పరిచయం అయింది. తెలుగు విద్యార్థి మాసపత్రిక (ఎడిటర్ కొల్లూరి కోటేశ్వరరావు, మచిలీపట్నం) ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలూ ఆయన చాలా చక్కగా చెప్పేవాడు. అలా మొదలై క్రమేణా సన్నిహితులమయ్యాము. 1968లో నాటి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడు (లోగడ తెలుగు స్వతంత్ర సంపాదకుడు) గోరాశాస్త్రికి కర్నూలులో 50వ జన్మదినం జరిపినప్పుడు ముఖ్య అతిథిగా పి.వి. నరసింహారావును తీసుకెళ్ళాము. నాడు కోట్ల విజయభాస్కర రెడ్డి జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉండేవాడు. వ్యవసాయ శాఖాధికారి మండవ శ్రీరామమూర్తి, తెలుగు భాషా సంఘాధికారి సి. ధర్మారావు, నేనూ పూనుకొని సన్మానం చేసి గోరా శాస్త్రికి కొంత ఆర్థిక సహాయం చేయగలిగాము. ఒక సంచిక కూడా వెలువరించాము. ఆ సభలో పి.వి. నరసింహారావు గొప్ప ఉపన్యాసం చేశారు. ఆయనతో చాలా సేపు నేను కాలక్షేపం చేసి అనేక విషయాలు అడిగాను.
హైదరాబాదులో ఆయన మంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు వివిధ సందర్భాలలో గోరాశాస్త్రి, తేళ్ళ లక్ష్మీకాంతమ్మలతో కలసి పి.వి. దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ అయింది. తేళ్ల లక్ష్మీకాంతమ్మ మా కుటుంబానికి సన్నిహిత స్నేహితురాలు. ఆమె చిరకాలంగా రాజకీయాలలో ఉంటూ పి.వి. దగ్గరైంది. చాలా చనువుగా కొన్ని పర్యాయాలు చులకనగా పి.వి. నుద్దేశించి మాట్లాడేది. అది చాటున కాదు. ఎదటే. నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తరోత్తరా పి.వి. ఇంగ్లీషులో ది ఇన్ సైడర్ అనే నవల రాసి లక్ష్మీకాంతమ్మను ఒక పాత్రగా చేసి అన్యాపదేశంగా ఎత్తిపొడిచారు. అది గ్రహించిన లక్ష్మీకాంతమ్మ బాహాటంగానే ఆయనను ఖండించింది.
నన్ను రాడికల్ హ్యూమనిస్టుగానే పి.వి. పరిగణిస్తూ పోయారు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా నేను స్నేహపూర్వకంగా కలుస్తూ ఉండేవాడిని. చనువుగా ప్రశ్నలడిగేవాడిని. కానీ ఆయన దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఉదాహరణకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించబోయేముందు కొన్నాళ్ళు పి.వి.ని దూరంగా పెట్టింది. అప్పుడు హైదరాబాదు ఆదర్శనగర్.లో పి.వి. ఉండేవారు. ఆమెపై వ్యంగ్య విమర్శనాత్మక రచన ఒకటి తలపెట్టారు. నేను కలసినప్పుడు ఒకటి రెండు పేరాలు వినిపించారు. అయితే అది ఇందిరాగాంధీని ఉద్దేశించిందా అని అడిగితే చెప్పలేదు. ఈలోగా ఇందిరా గాంధీ పిలుపు రావడం, ఢిల్లీ రాజకీయరంగంలో పి.వి. ప్రవేశించడం కీలకపాత్ర వహించడంతో ఆమెపై ఆగ్రహాన్ని దాచేశారు.
విశ్వనాథ సత్యనారాయణ సుప్రసిద్ధ నవల వేయిపడగలు హిందీలో సహస్రఫణి శీర్షికన పి.వి.నరసింహారావు అనువదించారు. నేను ఒకటి రెండుసార్లు ఈ విషయమై నిరసనను ఆయనకు సూచన ప్రాయంగా తెలియజేసాను. ఆయనేమీ అభ్యంతర పెట్టలేదు. అయితే హైదరాబాదు ఆకాశవాణిలో హిందీ విభాగంలో రామమూర్తి రేణూ పనిచేస్తుండేవారు. అదే విభాగంలో నా మిత్రుడు దండమూడి మహీధర్ ఉన్నందున నేను వెళ్ళి, రామమూర్తిగారిని కూడా పలకరిస్తుండేవాడిని. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే సహస్ర ఫణి ఆయన రాస్తున్నాడని. కొన్నాళ్ళ తరువాత అది పి.వి.నరసింహారావు పేరుతో ప్రచురితమైంది. ఇరువురిలో ఎవరు ఏమేరకు అనువదించారో వివరాలు తెలియవు. రామమూర్తిగారిని ఒకసారి ఆ విషయం ప్రస్తావించి మీరు అనువదిస్తున్న సహస్ర ఫణి పి.వి.గారి పేరుతో వచ్చిందేమిటి? అంటే ఆయన మౌనమే సమాధానంగా ఇచ్చారు.
శాసనసభలో, లోక్ సభలో పి.వి. చాలా బాగా రాణించిన రాజకీయవాది. ఆయన బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. పత్యేక తెలంగాణా ఉద్యమంలో సమైక్యవాదిగా నిలబడ్డారు. తరువాత ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవి చూచారు.
ఆయన కేంద్రానికి వెళ్ళిన తరువాత నేను కలుసుకోవటం తగ్గింది. హైదరాబాదు వచ్చినప్పుడు రాజభవన్.లో కొన్నిసార్లు కలిసి మాట్లాడాము.
పి.వి.ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి అమెరికా రాజధాని వాషింగ్టన్.కు వచ్చి అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు (దానిని హౌస్ అంటారు.) నేను ప్రెస్ లాబీలో ఉండి ఆయన ప్రసంగం విన్నాను. బాగా మాట్లాడారనిపించింది. ఆరోజులలో నేను వార్త దినపత్రిక విదేశీ ప్రతినిధిగా వాషింగ్టన్.లో ఉన్నాను. అటువంటి అక్రెడిషన్ రావడానికి మిత్రులు, వార్త ఎడిటర్ కె.రామచంద్రమూర్తిగారు తోడ్పడ్డారు. అక్కడనుండి తరచు వార్త వ్యాసాలు, ఇతర విశేషాలు పంపగా ప్రచురించేవారు. ఆశ్చర్యమేమంటే దేశప్రధానిగా పి.వి.మాట్లాడితే మర్నాడు అమెరికా దినపత్రికలలో ఒకమాట రాలేదు. నేను అశ్చర్యపోయాను. అంత క్రితం చిన్న దేశాలైన దక్షిణ కొరియా వంటి దేశాల ప్రధానులు మాట్లాడితే ప్రముఖంగా ప్రచురించడం చూశాను. ప్రెస్ క్లబ్.లో కొందరిని కదిలించి చూస్తే పి.వి.బాగా మాట్లాడటం ప్రధానం కాదు. అందులో కొత్త అంశం కానీ, అగ్రరాజ్యాన్ని ఆకర్షించే ప్రతిపాదనలు కానీ లేనందువలన అశ్రద్ధకు గురైంది అని చెప్పారు. అదే సందర్భంగా ఆయన ఒక మ్యూజియం సందర్శిస్తే అది ముఖ్యమైన వార్తగా వేశారు. అప్పుడు పి.వి.ని కలిశాను. ఆయన వెంట కొందరు జర్నలిస్టులు వచ్చారు. అలా వచ్చిన వారిలో కల్యాణీ శంకర్ ఉన్నది. ఆమె హైదరాబాదులో జర్నలిస్టుగా యు.ఎన్.ఐ.లో సీతారాం దగ్గర పనిచేసింది. తరచు ప్రెస్ కాన్ఫరెన్సుల తరువాత నా దగ్గరకు వచ్చి వివరాలు వివరణలు అడిగి రాసుకునేది. ఆతరువాత ఆమె ఢిల్లీలో జర్నలిస్టుగా ఉంటూ చాలా ప్రముఖ స్థానాలు ఆక్రమించింది. పి.వి.కి బాగా దగ్గరైంది. ఒక సందర్భంలో ఆమెను పక్కన కూర్చుండపెట్టుకుని తిరుపతిలో కల్యాణమహోత్సవంలో కూడా పాల్గొన్నారు.
పి.వి. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్.ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. ఆ ఖ్యాతి పి.వి.కి దక్కాలి. మరొకవైపు బబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది.
పి.వి. వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని వాడటం విశేషం. ఆయన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. కొన్నిటిలో ఇది నిజమే. అలా ఉన్నప్పుడు సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి. పి.వి.లో మరొక కోణం ఏమంటే కళలు, సాహిత్యం, రసజ్ఞత పట్ల అభిరుచి ఉండటం.
పి.వి.కి చాలామంది సన్నిహితులుగా ఉండేవారు. కొంతమందికి పరోక్షంగా మరికొంతమందికి ప్రత్యక్షంగా సహాయపడ్డారు. తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుకు పద్మభూషణ్ ఇప్పించినప్పుడు ఇబ్బందికర సన్నివేశం ఏర్పడింది. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పి.వి. పట్టుబట్టి ఒప్పించారు.
పి.వి. ని గ్రామాలలో దొర అనేవారు. ఆయన దేశ్ ముఖ్. ఎన్నో ఎకరాల ఆస్తి సాగులేకుండా వృధాగా పడుండేది. దేశంలో పరోక్షంగా బి.జె.పి. మతతత్వాన్ని వెనకేసుకొచ్చినట్లు బబ్రీమసీదు సంఘటనతో విమర్శకులు ఆరోపణలు చేయకపోలేదు. తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని ఆయనపై నంద్యాల పార్లమెంట్ సీటు ఎన్నికలలో ఎన్.టి.రామారావు పోటీ పెట్టక పోవడం గమనార్హం.

రాజకీయ జీవిగా కాసు బ్రహ్మానంద రెడ్డి

ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి (1909-1994)

ఆద్యంతాలూ రాజకీయవాదిగా జీవతం గడిపిన కాసుబ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తనదైన ముద్రవేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుదామని విఫల ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ లో సంజీవరెడ్డి మంత్రి వర్గంలో తొలిసారి అమాత్యులుగా జీవితాన్ని ఆరంభించారు. అప్పటి నుండి చివరి వరకూ రాష్ట్ర కేంద్ర పదవులు ఎన్నో చేపట్టి కొనసాగారు.

1950 ప్రాంతాలలో ఆయన ప్లీడరుగా గుంటూరులో ఉన్న రోజులలో కలుసుకున్నాను. నేను ఎ.సి. కాలేజీలో విద్యార్థిగా ఉన్న సందర్భంగా నా సోదరుడు విజయరాజకుమార్ పెళ్ళి ఆహ్వనం కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉంటున్న బ్రహ్మానందరెడ్డి కాఫీ ఇచ్చి సాదరంగా కార్డు స్వీకరించినా పెళ్లికి మాత్రం రాలేదు. అంతకు ముందు ఎ.సి. కాలేజీకి ఎదురుగా ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్బులో రోజూ బ్రహ్మానందరెడ్డి వచ్చి పేకాడటం చూసేవాడిని. అదే ప్రాంగణంలో మా అన్న ఒక పుస్తకాల షాపు పెట్టారు. నేను తీరిక వేళల్లో కూర్చుని అమ్ముతుండేవాడిని. ప్రక్కనే బ్రహ్మానందరెడ్డి, సలాం, ఇంకా కొందరు గుంటూరు ప్రముఖులు పేకాడుతుంటే మధ్యమధ్యలో నేను కాసేపు నిలబడి వారి మాటలు వింటూండేవాడిని. ఒకసారి గమ్మత్తయిన సంభాషణ చెవిన పడింది. మదరాసు శాసన సభలో కౌన్సిల్ సభ్యుడుగానూ గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడుగానూ ఉన్న ప్లీడరు సలాం మంచి హాస్య ప్రియుడు. సంభాషణా చతురుడు. ఆయనను ఉద్దేశించి, ఏం సలాం, మరీ పాతిక్కీ – పరక్కీ కక్కుర్తి పడుతున్నావటగా అని బ్రహ్మానంద రెడ్డి ఒక విసురు విసిరాడు. వెంటనే సలాం – ఏం చేస్తాం, వందా, రెండువందలూ అయితే నీతో పనేంటయ్యా, బ్రహ్మానందరెడ్డి ఉన్నాడుగా అంటున్నారు మరి అనేసరికి అందరూ గొల్లున నవ్వారు. అలా సాగుతుండేవి వారి సరసాలు.

బ్రహ్మానందరెడ్డి క్రమంగా జిల్లా నుండి రాష్ట్రానికి ఎదిగారు. మొదటి నుండి ముఠా రాజకీయాల్లో మునిగి తేలారు. తొలుత సంజీవరెడ్డి కుడి భుజంగా రాజకీయాలలో చక్రం తిప్పి కీలక స్థానంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయనకు ఎదురు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో అత్యంత ప్రముఖ నాయకుడుగా కాంగ్రెసు పార్టీని చీలదీసి రెడ్డి కాంగ్రెసు అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆర్థిక వ్యవహారాల నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు.

బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను వివిధ సందర్భాలలో కలిశాను. తెలుగు విద్యార్థి (కొల్లూరి కోటేశ్వర రావు సంపాదకుడు) మాసపత్రికకు ఇంటర్వ్యూ చేసి ప్రచురించాము. పాత హైదరాబాదులో మత కల్లోలాలు జరిగినప్పుడు (1968) వివిధ సంఘాలను పిలిచి జూబిలీ హాలులో సంప్రదింపులు జరిపారు. అప్పుడు మానవ వాద సంఘం తరఫున నన్ను పిలవగా నాకు తోచిన సూచనలు ఇచ్చాను.

1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని బాగా దెబ్బ కొట్టింది. ఆయన, ఆయన మంత్రులూ ఒకదశలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భాలలో తేళ్ళ లక్ష్మీకాంతమ్మ (లోక్ సభ సభ్యురాలు), నేను కలసి బ్రహ్మానంద రెడ్డి దగ్గరకు వెళ్ళి మాకు తోచిన విషయం చెపుతుండేవాళ్ళం. ఆయన బంగళా నిర్మానుష్యంగా ఉండేది. కొంత కాలం ఆయన కుంగి పోయినట్లు కనిపించేవాడు. అలాంటప్పుడు కలుస్తుంటే ఎంతో సహాయపడినట్లుగా భావించేవాడు. అదే సందర్భంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కారులు కొందరు హైదరాబాదులో గోడలపై బ్రహ్మానంద రెడ్డి భార్య రాఘవమ్మను ఉద్దేశించి చాలా అసహ్యకరమైన, అశ్లీల, శృంగార నినాదాలు రాశారు. మేము నిరసన తెలిపాము. తెలంగాణాలో ప్రముఖ స్త్రీ నాయకురాళ్లు జె. ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి, సరోజినీ పుల్లారెడ్డి మొదలైనవారు అటువంటి నినాదాలను ఖండించి వారే స్వయంగా చెరిపివేయడానికి పూనుకున్నారు. అటువంటి క్లిష్ట దశలో మేము కలుస్తుండడం బ్రహ్మానందరెడ్డికి ఊరటనిచ్చింది.

రాజకీయవాదిగా బ్రహ్మానందరెడ్డి చాలా ముఠా కక్షలతో సంకుచిత ధోరణిలో ప్రవర్తించాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికపై, దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుపై ప్రభుత్వపరంగా దాడి చేసి అదుపు పెట్టాలని చూశాడు. వారికి ప్రకటనలు ఆపి వేయాలనుకున్నాడు. ప్రెస్ బిల్లు పెట్టి చర్యకు ఉపక్రమించగా మేము హేతువాద సంఘం పక్షాన తీవ్ర ప్రతిఘటన చేశాము. మామిడి పూడి వెంకట రంగయ్యని పిలిచి సభ జరిపి ప్రెస్ బిల్లును వై.యం.ఐ.యస్. హాలు సుల్తాన్ బజారులో ఎండగట్టాము. దీనిపై అఖిల భారత స్థాయిలో పత్రికలు ప్రతిధ్వనించాయి. బ్రహ్మానంద రెడ్డి ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి తప్పుకున్నారు.

బ్రహ్మానంద రెడ్డి జీవిత చరిత్రను కపిల కాశీపతి బ్రహ్మానంద యాత్ర పేరిట పెద్ద గ్రంథంగా వెలువరించారు. అందులో చాలా వివరాలు, నిశిత పరిశీలనలు చేశారు. అయినప్పటికీ దానిని బ్రహ్మానంద రెడ్డి స్నేహపూర్వకంగానే స్వీకరించటం విశేషం. జూబిలీ హాలులో సభ పెట్టి అందరికీ కాపీలు ఉచితంగా ఇచ్చి, ప్రసంగాలు విన్నారు. నేతి చలపతి అధ్యక్షతన బ్రహ్మానందరెడ్డిపై ఒక విచారణ సంఘాన్ని కాంగ్రెసు కమిటీ నియమించింది. ఆయన జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉండగా అరాచక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉండగా అవి చాలా వరకూ వాస్తవాలని నేతి చలపతి కమిటీ నిర్ధారించిందట. ఆ విషయం నిజమేనా అని నేను బ్రహ్మానందరెడ్డిని అడిగితే టోపీ వెనక నుంచి ముందుకు తిప్పి నవ్వి సమాధానం దాటేసేవారు. అసెంబ్లీలోనూ బయట బ్రహ్మానంద రెడ్డి నుండి సమాధానం రాబట్టటం చాలా కష్టమయ్యేది. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో సహచరులకు, పార్టీ వారికీ అంతుపట్టేది కాదు. ఏదైనా అడిగితే గాంధీ టోపీని వెనక నుంచి ముందుకు తిప్పుకుని పెట్టుకునేవారు.!

రాజకీయాలలో తనకు బద్ద విరోధిగా ప్రారంభమైన జలగం వెంగళరావును మంత్రి వర్గంలోకి ఆహ్వానించి, హోం మంత్రి శాఖ నుంచి బ్రహ్మానంద రెడ్డి తన రాజకీయ చతురతను చూపారు. ఆ విధంగా ప్రత్యర్థులను ఆకర్షించటం, మరో పక్క దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ జీవితంలో మామూలే. సంజీవరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటూ, తరువాత తీవ్ర వ్యతిరేకిగా మారిపోయాడు. సంజీవ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉక్కు కర్మాగారాల శాఖ నిర్వహిస్తున్నప్పుడు ఆంధ్రులకు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పరచటం అవసరమైని ఆందోళన జరిగింది. అందుకు గాను తమనం పల్లి అమృతరావు అనే కాంగ్రెస్ వాదిని నిరాహార దీక్షకు పురిగొలిపి ఆందోళన పెంచటానికి బ్రహ్మానంద రెడ్డి హస్తం ఉందనేవారు. ఆ సందర్భంగా జరిగిన అలజడులలో విజయవాడలోని సంజీవ రెడ్డి విగ్రహాన్ని పగలుగొట్టారు. దీనికి బ్రహ్మానంద రెడ్డి పరోక్ష కారణం అంటారు. ఆయన మంత్రి వర్గంలో ఉంటూ వచ్చిన చెన్నారెడ్డి కేంద్రానికి వెళ్ళి కోర్టు తీర్పు ద్వారా పదవి పోగొట్టుకుని తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించి బ్రహ్మానంద రెడ్డి వ్యతిరేకిగా ఆందోళన చేశారు. అయితే ఒక పట్టాన బ్రహ్మానంద రెడ్డి లొంగలేదు. శాసన సభలో ఆయన మెజారిటీకి తిరుగులేకుండా ఉండేది. అయినప్పటికీ ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రయోజనం దృష్టా ఆయనను తొలగించి పీ.వీ. నరసింహారావును ముఖ్యమంత్రిగా తీసుకువచ్చారు.

మహరాష్ట్ర గవర్నరుగా, కేంద్రమంత్రిగా ఆయన చిరకాలం వివిధ పదవులు అనుభవించిన రాజకీయవాది. సంతానం లేదు. రాజకీయాలలో తన పాత్రను ఏమేరకు నిలబెట్టుకున్నాడనేది చరిత్ర చెపుతుంది. ఆయనకు పదవిలేప్పుడు కూడా నేను తరచు కలసి మాట్లాడుతుండేవాడిని.