ముఖ్యమంత్రిగా రోశయ్య

అనుకోని ముఖ్యమంత్రి

కొణిజేటి రోశయ్య

(1933- )

“ఇన్నయ్యా, ఎవరికి వాళ్లు తాము అందంగా ఉన్నామని అనుకోక పోతే బతకలేరయ్యా” అని 1954లో గుంటూరులో తన గదిలో గెడ్డం గీసుకుంటూ అద్దంలో చూస్తూ రోశయ్య అన్నమాటలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. ఆనాడు గుంటూరు హిందూ కాలేజీలో విద్యార్థి నాయకుడుగా రంగాగారి శిష్యుడుగా రాణించిన వ్యక్తి రోశయ్య. కాలేజీ విద్యార్థి యూనియన్.కి విద్యార్థి సమ్మేళన్ తరఫున (కృషీకార్ లోక్ పార్టీ విద్యార్థి విభాగం) పక్షాన అధ్యక్షుడుగా పోటీచేసి ఎన్నికలలో గెలిచాడు. మేమంతా ఆయనకు ప్రచారం చేసి పెట్టాం. నేను అప్పట్లో ఎ.సి.కాలేజీలో చదువుతుండేవాడిని. ఆయనకు కార్యదర్శిగా జాస్తి జగన్నాథం (రాడికల్ హ్యూమనిస్టు) గెలిచారు. ఆరోజులలో విద్యార్థి సమ్మేళనం కోసం చందాదారులను చేర్పించి ఆ డబ్బుతో ఉదయం కాఫీలు, టిఫిన్లు సేవిస్తుండేవారు. మధ్యలో నన్ను పిలిచేవారు. రోశయ్య చాలా చురుకుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఉపన్యాసాలు చేసేవారు. కవిసమ్మేళనాలు ఆర్గనైజ్ చేశారు. ఆయన తెనాలి దగ్గర వేమూరు నుండి వచ్చారు. ఆచార్య రంగా 1951లో కాంగ్రెసు నుండి చీలివచ్చి కృషికార్ లోక్ పార్టీ పెట్టినప్పుడు తెనాలిలో తొలి రాష్ట్ర మహాసభ జరిగింది. కార్యకర్తగా రోశయ్య తన రాజకీయ జీవితాన్ని అక్కడ ఆరంభించాడు. ఆయనతో తొలి పరిచయం అప్పడు జరిగింది. ఆ తరువాత స్నేహితులుగా మేము కలిసిమెలిసి ఉన్నాము.

రంగాగారు 1955లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఐక్య కాంగ్రెసు పక్షాన రాష్ట్రంలో ప్రచారం చేసినప్పుడు ఆయన శిష్యులుగా రోశయ్య, వీరాచారి, విజయరాజకుమార్, సుంకర సత్యనారాయణ మొదలైనవారు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి కమ్యూనిస్టులను ఓడించటానికి తోడ్పడ్డారు. ఆ తరువాత రంగాగారు కాంగ్రెసు నుండి దూరమై స్వతంత్ర పార్టీ అధ్యక్షులైనప్పుడు గౌతు లచ్చన్నతోపాటు రోశయ్య కూడా పార్టీలో ప్రముఖంగా ఉన్నారు. తొలిదశలో చెన్నారెడ్డి కూడా చేరి తరవాత దూరమయ్యారు. తెనాలి ఆరోజులలో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా రంగాగారి పక్షాన రోశయ్య స్వాగతం పలికి వారి ఉపన్యాసాలకు అనువాదం కూడా చేసేవారు. రాజగోపాలాచారి ఉపన్యాసానికి అలాగే చేశారు. ఆవిధంగా కార్యకర్తగా ప్రారంభించిన రోశయ్య నాయకుడుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో ప్రముఖులయ్యారు. ప్రతిపక్షస్థానంలో ఆయనకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన పక్షాన ఎన్నో సందర్భాలలో ఆయన కోరికపై మేము ప్రకటనలు ఇవ్వటం అవి ప్రముఖంగా పత్రికలలో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నాతోపాటు ఎస్.వి.పంతులు బాగా కృషిచేశారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా రోశయ్యకు తోడ్పడి శాసనమండలి సభ్యులు కావటానికి చేయూతనిచ్చారు.

1972 నుండి నేను న్యూ ఎం.ఎల్.ఎ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు రోశయ్య పక్క క్వార్టర్.లో ఉండేవారు. ఇంచుమించు రోజూ కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం. ఆయన 1978లో చెన్నారెడ్డితో చేతులు కలిపేవరకూ అలా సాగింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజులలో అతి తీవ్ర విమర్శలు చేసి చెన్నారెడ్డిని చెమట పట్టించిన వ్యక్తి రోశయ్యే. అప్పట్లో నన్నూ, ఎస్.వి.పంతులును కుడి భుజం ఎడం భుజం అనేవారు. అటువంటి దశలో ఒకరోజు చెన్నారెడ్డి పిలిచి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అప్పటివరకూ ప్రతిపక్షంలో రాణించిన రోశయ్య కాంగ్రెసులో స్థిరపడిపోయారు. ఎవరు పదవిలో ఉన్నా రోశయ్యను కాదనలేని స్థితి తెచ్చుకున్నాడు. ఆవిధంగానే కేంద్ర స్థాయివరకూ ఆయన సుపరిచితుడయ్యారు. హైదరాబాదులో అమీర్ పేటలో సొంత ఇల్లు ఏర్పరచుకొని ఉంటున్నప్పుడు కూడా మేము కలుస్తుండేవాళ్ళం. మా కుటుంబాన్ని గురించి పరామర్శ చేస్తుండేవారు.

వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా చనిపోవటంతో చక్కని మార్గాంతరంగా కేంద్ర కాంగ్రెసు నాయకత్వం రోశయ్యను ముఖ్య మంత్రి స్థానానికి తీసుకువచ్చింది. బహుశ ఆయన జీవితంలో అది పెద్ద మలుపు.

అప్పటివరకూ రోశయ్య అప్పుడప్పుడూ నాతో అంటుండేవారు “జీవితమంతా రాజకీయం తప్ప మరొక వ్యాపారం చెయ్యలేదు. తెలియదు కూడా. ఇప్పుడు ఈ దశలో ఇంకేమీ చేసే స్థితి కూడా లేదు. రాజకీయాలు కొనసాగించాల్సిందే” అది ఆయన ధోరణి.

No comments:

Post a Comment