విజ్ఞాని కనుక్కొన్న నియమం అబద్ధమో, నిజమో నిర్ధారించవచ్చు.

5. “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”


విజ్ఞాని చేసేదే విజ్ఞానం అని నిర్వచనం చెప్పవచ్చు. బయట నుంచి చూసే వారు విజ్ఞాన స్వభావాన్ని గురించి అసంబద్ధంగా, సాధారణీకరించి చెప్పకుండా జాగ్రత్తపడడానికి ఇదొక ప్రయోజనాత్మక నిర్వచనం కావచ్చు. అయినప్పటికీ, విజ్ఞాని చేసేది కేవలం ఒక సర్వసాధారణ విషయం కాదు, అతడు పరిశోధనలు చేసి, ఫలితాలు రాసుకుంటాడు. సహజ, సాంఘిక సంఘటనలను గమనిస్తాడు. తన అధ్యయనంపై ధ్యానమగ్నుడై, సమస్యలను పరిష్కరిస్తాడు. ఎంతో కాలం తీవ్రంగా ఆలోచిస్తాడు. కొన్ని వారాలపాటు తన మనస్సులోనే సమస్య అలా అట్టి పెడతాడు. పరిష్కారం ఒక కొత్త ప్రతిపాదనగా మెదలుతున్నట్లు లేదా, మెరపులాగా కొత్త పద్ధతి తట్టడం కనుక్కొంటాడు. వివిధ దశలలో అతడు వీటిలో దేనికైనా చేయవచ్చు. ఒకే సమయంలో వీటిలో ఒకటికి మించి కూడా చేస్తుండవచ్చు.
విజ్ఞాని పనిచేసే తీరు ఇలా ఉంటే, పైన ఇచ్చిన క్రియాత్మక నిర్వచనం విజ్ఞానాన్ని అవగాహన చేసుకోడానికి మనలను అట్టే దూరం తీసుకుపోదు. విజ్ఞాని ఉద్దేశాన్ని మనం పరిగణనలోకి స్వీకరించక పోవడంలో నిర్వచన లోపం ఉంది. సహజ సంఘటనలు అవగాహన చేసుకోడానికి అవి ఎలా జరుగుతాయో తెలుసుకుంటే చాలు. కాని మానవకార్యకలాపాలు అవగాహన చేసుకోడానికి కనిపించే వాటి వెనుక ఏమున్నదో చూడాలి. అవి ఎందుకు స్వీకరించాడో కనుక్కోవాలి. విజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోడానికి విజ్ఞాని చేసేపని పరిశీలిస్తే చాలదు. విజ్ఞానం తన అభ్యాసంగానో, జీవిత లక్ష్యంగానో ఎందుకు చేపట్టాడో కనుక్కోవలసి ఉంది.

పిపాసగా విజ్ఞానం

విజ్ఞానం అంటే జ్ఞానాన్వేషణ. అంటే విజ్ఞానిలో ఉన్న జ్ఞానాభిలాష, కొన్ని విషయాల తీరు తెన్నుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని సంతృప్తి పరచడం, అటువంటి పిపాసకు తృప్తి లభించినప్పుడు, కనుక్కోవడంలోనూ, అవగాహనలో వచ్చే మహదానందం అన్నమాట. విజ్ఞాన కార్యకలాపాలకు కేవలం జ్ఞానాభిలాష ఒక్కటే ఉద్దేశ్యం కాదనేది వాస్తవమే. మానవుడి మనస్సు అనుకున్నంత అతి సాధారణమైంది గాదు, ఇతర ఉద్దేశాలను కాదనేటంతగా ఏక మార్గాన మనస్సు ఉండదు. ధనాభిలాష, అధికారం, ప్రతిష్ఠకై ప్రాకులాడటం, మానవజాతిని అభివృద్ధి చేడం. వీటిలో ఏదైనా విజ్ఞాని ఉద్దేశాలు గావచ్చు. ఇతర విషయాలన్నీ సమానంగా ఉండగా, ఎవరైనా విజ్ఞానాన్ని అభిలషిస్తే, పరిశ్రమ, రాజకీయాలు, విద్యకంటే ప్రాధాన్యం ఇస్తే, అతడి మేధస్సు అలా పయనించిందనే చెప్పాలి. కొత్త విషయాలు కనుక్కోవాలి అనే ప్రయత్నాలతో వైఫల్యాలు ఉన్నాయని తెలిసికూడా అతడీ దారి చేబడుతున్నాడని గుర్తుంచుకోవాలి. ఏదో తీవ్ర పరిస్థితి వస్తే తప్ప, ప్రకృతిని, మానవుడిని అవగాహన చేసుకోవాలనే పిపాసను అతడు అణచలేడు. మిగిలిన అవకాశాలెన్ని ఉన్నా కాదంటాడు. ఈ విషయంలో విజ్ఞాని ప్రాచీన కాలపు రుషి వంటివాడు. సత్యాన్వేషణకై రుషులు సంపదను కాలదన్నడం వంటిదన్న మాట. ఆధునిక సన్యాసిగా విజ్ఞానికి ఒక సమకాలీన తాత్వికుడు పేరు పెట్టాడు.

వైజ్ఞానికి సత్యస్వభావం

విజ్ఞానికీ రుషికీ ప్రేరణ పొందడంలో పోలిక ఉన్నప్పటికీ, సత్యాన్ని గురించిన వారి భావనలో చాలా తేడా ఉంది. రుషి దృష్టిలో సత్యం అంటే మార్మిక మైంది. అంతర్భుద్ధి, పారలౌకిక లక్షణాలు గలది. వైజ్ఞానిక సత్యం విమర్శనాత్మక నిర్మాణంతోనూ, ప్రాపంచికానుభవంతోనూ, మతంతో నిమిత్తం లేని స్వభావంతోనూ ఉంటుంది. వీటిని వివరించవలసి ఉంది.
ప్రతిపాదన, నిర్ణయాలు అనే పద్ధతిలో అంతర్వాణి (Inner Voice) ఇమడదు. జీవితంలో ఏకత్వం, కవి అంతస్సాక్షి, చిత్రకారుడి రూపకల్పనా దృష్టి, మార్మికుడి ఆనందసాగర భావన, పైకి భిన్నంగా కనిపించే వాస్తవాలను, ఐక్యపరచే నియమాలను కనుక్కొనే విజ్ఞాని దృష్టి ఇవన్నీ వాస్తవానికి చెందినవి. అంతర్భుద్ధి అవగాహన ఒక మెరుపులాగే వస్తుంది. రుషికీ దివ్యదృష్టి కలిగిందన్నమాట. ఈ అంతస్సాక్షి దోషపూరితం కానక్కరలేదు. నిజం, అబద్ధం అనేవి వీటికి అన్వయించవు. పైన ఉదహరించిన నాలుగింటిలో కవి, మార్మికుడి విషయంలో భావన ప్రధానమైతే, చిత్రకారుని విషయంలో సృష్టి ముఖ్యం. ఈ దృష్ట్యా వాటిని నిజం, అబద్ధం అనడం అర్థం లేదు. కొద్ది మార్పులతో ఈ విషయాన్నే కళలకు కూడా అన్వయించవచ్చు. అజంతా, ఎల్లోరా చిత్రాలు, శిల్పాలు కళాఖండాలుగా వచ్చు. ఎందుకూ కొరగానివి కావచ్చు. అంతేగాని అందులో నిజం, అబద్ధం ప్రసక్తి లేదు. అని ఉన్నాయి అంతే. కాని విజ్ఞాని కనుక్కొన్న నియమం విషయంలో అబద్ధమో, నిజమో నిర్ధారించవచ్చు. నియమం అనగానే కొన్ని సంబంధాలు వ్యక్తమౌతాయి. ఈ సంబంధాన్ని వాస్తవంతో సరిచూసినప్పుడు, విజ్ఞాని కనుక్కొన్నట్టలు చెబుతున్న సత్యం సరైందో కాదో చెప్పవచ్చు. 1916లో ఐన్ స్టీన్ తన సాధారణ సాపేక్షతా సూత్రాన్ని చెప్పినప్పుడు, విజ్ఞానవేత్తలు, దీన్ని ఆమోదించే ముందు 1919లో కీలకమైన పరీక్షకు పెట్టారు. అప్పుడు ప్రకృతిని గురించి ముఖ్యమైన సత్యంగా ఈ సూత్రాన్ని ఆమోదించారు.

వైజ్ఞానిక సత్యం వివేచనాత్మకం

సాపేక్షతా సిద్ధాంతం రూపొందించిన ఐన్ స్టీన్, హఠాత్తుగా అంతర దృష్టితో చెప్పాడా, సుదీర్ఘమైన ఆలోచన చేశాడా (ఇవి రెండూ పొసగనివి కావు) అగమ్య గోచరంలో అన్వేషించాడా అనే విషయాన్ని బట్టి అతడి సిద్ధాంతం ఆధారపడి లేదు.
ఒకానొక విశిష్టమైన వ్యక్తికి హఠాత్తుగా సాక్షాత్కరించడం, అనుభవం లేనివారికి పూర్తిగా అవగాహన కాదనటానికి వీలులేదు. ఈ సిద్ధాంతం కొన్ని ప్రతిపాదనలతో కూడింది. ఒకవిధమైన సంఘటనలను, వాటి సంబంధాలను ఈ ప్రతిపాదన నిర్ధారణగా చెపుతుంది. ప్రతిపాదనలో కొన్ని మౌలిక ప్రాతిపదికల తాత్విక ఫలితాలు రాబట్టటం జరిగింది. వీటి విలువ ప్రత్యక్ష ప్రాపంచిక అనుభవాన్ని బట్టి లేదా పరోక్షంగా ఊహించి నిర్ధారణ రూపంలో ఉంటుంది. దీనినే వివేచనాత్మక రూపం అంటారు.
వైజ్ఞానిక సత్యం వివేచనాత్మకం, కనక స్పష్టంగా ఆలోచించగలవారికి ఎవరైనా, వైజ్ఞానిక భాషను లోతుపాతులతో గ్రహించగల అభిరుచి ఉన్నవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంటే వైజ్ఞానిక సత్యం బహిరంగ సత్యం అన్నమాట. కళాకారుడి లేదా మార్మికుని సాక్షాత్కారం లాగేకాక, వైజ్ఞానిక సత్యంలో వ్యక్తి పరమైంది గాని, గోప్యమైంది కాని ఏమీ లేదు.
వైజ్ఞానిక సత్యం ప్రాపంచిక అనుభవపరమైంది, మత రహితం కూడా ఈ ప్రపంచంలో జరిగే వాటితో మాత్రమే విజ్ఞానానికి సంబంధం ఉంటుంది. మానవ పరిశీలనకు అందుబాటులో లేని ఊహాపూరిత ప్రపంచంతో సైన్సుకు నిమిత్తంలేదు. ఈ దృష్టితో చూస్తే వైజ్ఞానిక సత్యానికి సంబంధించిన విషయమంతా ప్రపంచానికి సంబంధించిందే. అంతమాత్రాన విజ్ఞానంలో ఊహకు (పరికల్పనకు) స్థానం లేదని అనుకోలేదు. ఆధునిక వైజ్ఞానిక సిద్ధాంతాలలో భావనలలో, ముఖ్యంగా ఆధునిక పదార్థ విజ్ఞానంలో మన సిద్ధాంతాలకంటే ఎక్కువ ఊహ అవసరమవుతున్నది. మన అవగాహన పెరగటం, మన వివేచన సునితంగా ఉండటం వల్ల మన ఊహ కూడా సంప్రదాయ బద్ధమైన సంకెళ్ళనుంచి విమోచన పొంది, గతంలో ఊహించినవారికి అందుబాటులో లేనంతగా విస్తరిస్తున్నది. కాని వైజ్ఞానిక సిద్ధాంతం కొన్ని సందర్భాలలో ఊహతోకూడినట్లు కన్పించినా, ఒక ప్రమాణాన్ని సంతృప్తి పరచవలసి ఉంటుంది. ఏదో ఒక క్లిష్ట అనుభవదశలో భౌతిక వాస్తవంతో సంబంధం పెట్టుకోకతప్పదు. అలాకానట్లయితే కట్టుకధకూ, విజ్ఞానానికీ విచక్షణ లేకుండా పోతుంది. ఈ విషయంలోనే వైజ్ఞానిక సత్యానికి, పారలౌకిక సత్యానికి తేడా ఉన్నది.

పారలౌకిక సత్యం పరీక్షకు నిలబడలేదు.

వైజ్ఞానిక సత్యంలో గల అనుభవానికి, మతరహిత విధానానికి సన్నిహిత సంబంధం ఉంది. చిట్ట చివరకు మానవుడికి మంచి జరుగుతుందనే భావన, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మంచి ఉంటుందనే భావన మతరహిత ప్రాధాన్యం తగ్గిపోతుంది. అంతే గాక సిద్ధాంతాన్ని వాస్తవం దృష్ట్యా పరీక్షించటం, ఆదర్శాన్ని ఆచరణ దృష్ట్యానూ, వాస్తవాన్ని ఆదర్శం దృష్ట్యానూ పరిశీలించనవసరం లేకుండా పోతుంది. జీవితానికి సంబంధించిన పారలౌకిక దృష్టిని బట్టి, జీవన్మరణ బంధనం నుంచి ఆత్మ విమోచన చేయటానికి లోకంలో జీవితం అనేది ఒక సోపానంగా భావించనందున పరోలక దృష్టితో పోల్చి చూసినప్పుడు సెక్యులర్ ఆదర్శాలు (స్వేచ్ఛ, సమానత్వం) సెక్యులర్ ధర్మాలు (అందరి మంచికై సహకారం, సహనం) ద్వితీయ ప్రాధాన్యం కలవిగానే భావించబడుతున్నాయి. పారలౌకిక సత్యాన్ని నిశిత పరిశీలనకు గురిచేయటానికి వీలులేదు కనక దీనికి నమ్మకమే ఆధారంగా ఉంటుంది. నచ్చ చెప్పటానికి బదులు ఒత్తిడి చేయటం వల్ల పారలౌకిక సత్యానికి ప్రమాణం రూపొందిస్తున్నారు. మానవతలో వివేచనతో కూడిన నీతిశాస్ర్తం ఉంటుంది. సెక్యూలరిజంలో చెప్పేదాన్ని బట్టి మానవుడు స్వేచ్ఛగా ఆత్మ గౌరవంతో ఈ ప్రపంచంలోనే సంపూర్ణ భౌతిక సాంస్కృతిక జీవితాన్ని అనుభవిస్తాడు. సత్యాన్ని గురించి ఇటువంటి వివేచనాత్మకమయిన భావనగల సెక్యులరిజం, మానవుడు తనను, తన పరిసరాలను అవగాహన చేసుకో గలడంటుంది. ఈ అవగాహనలను నిర్మాణాత్మకంగా ఉపయోగపెట్టు కోవడానికి వీలుగా తోటివారితో మానవుడు సహకరించగలడు. నీతి శాస్త్రానికి మతంతో సంబంధం లేని ఆదర్శానికి పొత్తు కుదరటం వల్ల దీన్ని సాధించుకునే మార్గాన్ని చూపటం వల్ల ప్రపంచంలో నీతికి స్థానాన్ని ఏర్పరుస్తుంది, అదే వైజ్ఞానిక సత్యం విశిష్టత.

వైజ్ఞానిక విజయభేరి

విజ్ఞానానికి మరొక దృక్పథం ఉంది. సాంకేతికాభివృద్ధి, జ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తూ మానవ విలువలను సాధించుకోవటానికి వీలుగా భౌతిక, సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంటే విజ్ఞానం ప్రకృతిని, అజ్ఞానాన్ని, పేదరికాన్ని, జబ్బులను వీటన్నిటి వల్ల వచ్చే దోషాలను జయిస్తున్నదన్న మాట. ఓపెన్ హైమర్ అభిప్రాయాన్ననుసరించి ఎనిమిదేళ్ళలో నేటి జ్ఞానం రెట్టింపు అవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఈ జ్ఞానాభివృద్ధికి 30 సంవత్సరాలు పట్టింది. అంతకు ముందు ఆధునిక విజ్ఞానయుగంలో ప్రవేశించటా నికి శతాబ్దాలు పట్టింది. జ్ఞానాభివృద్ధి ఇంత వేగంగా జరగటానికి సాంకేతిక శాస్త్రం ఎంతో తోడ్పడింది.
విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టటమే సాంకేతికశాస్త్రం. కాని అనేక సందర్భాలలో ఒకానొక పరికరం కొత్త జ్ఞానాన్ని ఆర్జించుకోవటానికి తోడ్పడుతుందో, అదనంగా శక్తిని సమకూర్చుకోవటానికి ఉపయోగపడుతుందో నిశ్చయంగా చెప్పటం కష్టం. రాడార్ లాగ, దీని పాత్ర కూడా రెండు విధాలుగా ఉంటుంది. విజ్ఞానానికి సాంకేతికానికి, సిద్ధాంతానికి అన్వయానికి గిరిగీసి తేడా చూపడం దుర్లభం. జ్ఞానమే శక్తి అనే విషయాన్ని ఆధునిక విజ్ఞానం, సాంకేతిక శాస్త్రాలకు అన్వయించి నప్పుడు చాలావరకు వాస్తవం అనిపిస్తుంది.
విజ్ఞానం తప్పనిసరిగా అన్వయించగలం అనటానికి వీలులేదు. ఉదాహరణకు విశ్వశాస్త్రజ్ఞానం సాంకేతికంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ ఇంకా స్పష్టం కాలేదు. అయినప్పటికి 20వ శతాబ్దిలో సునిశిత వైజ్ఞానికులు కొందరు ఆకాశం అంచులు కనుక్కోవటానికి, ప్రకృతి ఎలా ఆరంభం అయిందీ తెలుసుకోవటానికి, ప్రకృతిలోని భాగాలు ఒకదాని నుంచి మరొకటి అతి వేగంగా దూరమయి పోతున్నప్పటికీ మొత్తం మీద ప్రకృతి నిర్మాణం అలాగే కొనసాగటం ఎలా సాధ్యమనేది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

సమాజంపై సాంకేతిక విజ్ఞాన ప్రభావం

ఇంకొకందుకు కూడా విజ్ఞానానికీ, సాంకేతికానికీ తేడాను గమనించటం అవసరం. విజ్ఞానం జ్ఞానతృష్ణకు చెందింది. ప్రకృతికి సంబంధించిన జ్ఞానం, అందలి కార్యకారణ సంబంధాలు విజ్ఞాన విషయాలుగా ఉంటున్నాయి. సాంకేతిక శాస్త్రం శక్తి సాధనం. విజ్ఞానం విమోచన శక్తిగా మాత్రమే పనిచేస్తుంది. సాంకేతిక శాస్త్రం మానవుడి స్వేచ్ఛను అదుపులో పెట్టగలదు, విస్తరించగలదు. ముఖ్యంగా భారీ సాంకేతిక శాస్త్రంలో ఇది వాస్తవమే. ఉత్పత్తి పెరగటం, కాలాకాశ అవధులు పోవటం సాంకేతిక శాస్త్ర పరంగానే జరిగింది. కాని అధికార కేంద్రీకరణ, మానవుడు లోని పాశవికత్వం చోటుచేసుకోవడం ముఖ్యంగా నగర సమాజాలలో చూడవచ్చు. మానవజాతి నంతటిని రూపు మాపే అణ్వస్త్రాల ప్రమాదం ఆధునిక సాంకేతిక శాస్త్రంలో గర్భితంగా ఉంది. అధికార కేంద్రాలపై అదుపు ఉన్న వారు నైతికంగా, మేధస్సు సంబంధంగా పరిణమించకపోతే ఈ ప్రమాదం తప్పదు.
ఈ ప్రమాదానికి విజ్ఞానాన్ని తప్పుపట్టడం సరైందని కాదు. ఫలానా సాంకేతిక శాస్త్రం కావాలని విజ్ఞానం చెప్పదు. ఒకానొక సమాజం మరమగ్గాలను, లేదా నేత మిల్లులను ఉపయోగిస్తుందా అనేది ఆ సమాజంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రెండు విధాలైన సాంకేతిక పద్ధతులకు ఆధారంగా ఉన్న పదార్థశాస్త్రం ఒక్కటే. ఈ పదార్థ విజ్ఞాన సూత్రాలను అవగాహన చేసుకోవటం మానవ జాతి సాంస్కృతిక చరిత్రకు ఎంతో ఉపయోగకరం. కనక విజ్ఞానాన్ని ఎక్కువ ఉంచాలనేది సమస్య కాదు. మానవ లక్షణాలకు సాంకేతిక శాస్త్రాన్ని అనుకూలం గావించటమే సమస్య.
ఇందు నిమిత్తం సాంఘిక, విద్యా సంబంధమైన ధోరణి కావాలి. అధికారంలోని చైతన్యతను అధ్యయనం చేసి, అధికార కేంద్రీకరణ జరగకుండా మన సంస్థలను తీర్చి దిద్దుకోవాలి. అంటే అధికారం ఏ ఒక్క ముఠా గుత్తాధిపత్యం కింద లేకుండా చేయాలి. ఇందుకు వికేంద్రీకరణ ఒక్కటే చాలదు. గ్రామస్థాయిలో సహితం ఏ ఒక్క ముఠావారు కూడా వివిధ అధికారాలను చేజిక్కించుకొని మిగిలిన సమాజాన్ని అటాడించే పద్ధతులను పోగొట్టాలి.
ఈ లక్ష్య సాధనకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఉదాహరణకు మన సాంస్కృతిక సంపద అంతా పెత్తందారీ లక్షణాలలో ఉన్నది. కనక మనలో ఉత్తములు కూడా అధికారాన్ని ఆరాధిస్తూ మానవ విలువలను బలిచేయటం కద్దు. ఈ ధోరణి వల్ల దేశంలో మానవతా విలువలు పెంపొందకుండా ఆటంకం వాటిల్లుతుంది. ఈ విలువలను సాధ్యమైనంతవరకు విస్తరింపచేస్తే సాంకేతిక శాస్త్రం మానవుడికి హాని చేయజాలదు. అదీకాక సాంస్కృతిక పరిణామంలో అధికారం స్వభావం గురించి మనకు అంతగా తెలియదు. ఇది సామాజిక విజ్ఞానానికి సంబంధించిన సమస్య. విజ్ఞానం, సాంకేతికం ఎలాంటి సామాజిక సంబంధాలు తెచ్చి పెడుతుందనేది కూడా సామాజిక శాస్త్రజ్ఞులే పరిశీలించాలి.
ఈ చిక్కులను విడదీయడానికి, సామాజిక పునర్నిర్మాణానికి, వైజ్ఞానిక పంథా అవసరం. మన విద్యారంగంలో ప్రస్తుత పద్ధతుల స్థానే కొత్త విధానాలను ప్రవేశపెడితే తప్ప పెత్తందారీ సంప్రదాయ భారాన్ని పోగొట్టుకోజాలం. వివిధ విజ్ఞాన శాఖలు కనుక్కొన్న వాటిని సమన్వయించి చూస్తే గాని అధికారంలోని లోతుపాతులు అవగాహన కావు. అలాగే సామాజిక రంగంలో భిన్న శాఖలను కొత్త దృక్పథంతో పరిశీలించాలి. ఇందుకు వైజ్ఞానిక పద్ధతి అంటే ఏమిటో తెలుసుకోవాలి.

రచన తెలుగు సేత
ఎ. బి. షా నరిసెట్టి ఇన్నయ్య

మనిషి గుట్టు విప్పుతున్న మనోవిశ్లేషణ

4. “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”

మనిషి గుట్టు విప్పుతున్న మనోవిశ్లేషణ

ఆధునిక విజ్ఞానం వల్ల విశ్వాన్ని గురించీ అందులో మానవుడి స్థానాన్ని గురించీ మన భావాలు మారాయి. ఇంతేకాదు. విజ్ఞానం ఇంకా లోతుకు పోయి మానవుడి మనస్సు పనిచేసే తీరు కూడా ఎలా ఉంటుందో తెలియజెపుతున్నది. మనం చేసే పనులకు వెనక ప్రగాఢమైన ఉద్ధేశాలు, అచేతన ప్రేరణలు ఉంటాయని కనుక్కున్నారు. అయితే మనం మాత్రం వాటిని కావాలని స్వేచ్ఛగా ఎంచుకొన్నట్లే అనుకుంటాం. మన మానసిక జీవితంలో గర్భిత విషయాలను అవగాహన చేసుకోడానికి మనో విశ్లేషణ తోడ్పడింది. తద్వారా వాటిని వాంఛనీయ పద్ధతులలో పెట్టడం సాధ్యమయింది. మానవుడి మనస్సు పనిచేసే తీరును గురించి అంతర్యం తెలియడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రుషికి, పాపికి, చట్టబద్ధమయిన పౌరుడికి, చట్ట వ్యతిరేక నేరస్తుడికి తేడా చాలా స్వల్పం. అది కనుక్కోవడం కష్టం. ఈ తేడా సామాజికంగా, నైతికంగా ముఖ్యం కాదని భావించరాదు. కాని సహనం ఉండాలని మాత్రమే ఇందలి సారాంశం.
సామాజిక శాస్త్రాలు
వైజ్ఞానిక పద్ధతిని అన్వయించడం కేవలం ప్రకృతి శాస్త్రాలకు, మనోవిజ్ఞానానికే పరిమితం కాలేదు. మానవుడు ఆలోచనా జీవి మాత్రమే కాదు. సామాజిక జీవి కూడా. అతడు శక్తి సామర్ధ్యాలను సమాజంలోనే సాధించగలడు. సమాజంలో మానవుడిని గురించి అధ్యయనం చేసేదాన్ని సామాజికశాస్త్రం అంటున్నారు. కుటుంబం, మతం, రాజ్యం, ఆర్థిక రాజకీయ నిర్మాణం, సాంస్కృతిక జీవనం ఇత్యాది సంస్థలను ఈ శాస్త్రం పరిశీలిస్తుంది. ఇవి సాంఘిక వ్యవస్థకు చెందినవి. వాటి మధ్యగల సంబంధం, వ్యక్తులతో వీటికి గల సంబంధం ఇదే సామాజిక శాస్త్రంలో అధ్యయనం చేస్తారు. భౌతిక శాస్త్రంతో పోల్చిచూస్తే, సామాజిక శాస్ర్తం చాలా పిన్న వయసు లోనిదే. కాని వైజ్ఞానిక పద్ధతిని సామాజికశాస్ర్తం అంటున్నారు. కుటుంబం, మతం, రాజ్యం, ఆర్థిక రాజకీయ నిర్మాణం, సాంస్కృతిక జీవనం ఇత్యాది సంస్థలను ఈ శాస్త్రం పరిశీలిస్తుంది. ఇవి సాంఘిక వ్యవస్థకు చెందినవి. వాటి మధ్యగల సంబంధం, వ్యక్తులతో వీటికి గల సంబంధం ఇదే సామాజిక శాస్త్రంలో అధ్యయనం చేస్తారు. భౌతిక శాస్త్రంతో పోల్చిచూస్తే, సామాజిక శాస్త్రం చాలా పిన్నవయసులోనిదే. కాని వైజ్ఞానిక పద్ధతిని సామాజిక శాస్త్రానికి అన్వయించడంలో, సాంఘిక క్రమం పనిచేసే తీరు, లోతుపాతులు తెలిపాయి. ఏ ఒక్క సాంఘిక వ్యవస్థ కూడా శాశ్వతం కాదని తేలింది. లోగడ స్వయం పాలక సమాజాలుండేవి. రాజరికాలు, పౌరోహిత్య ఆధిపత్యాలు, తమకు దైవదత్తాధికారం ఉందంటూ ఇతరులపై పెత్తనం సాగించాయి. సమాజ వ్యవస్థలో కులమై ప్రధానంగా ఉన్న తీరు గమనించాం. అన్ని విధాలా అందరూ సమానమనే సమాజాలూ ఉన్నాయి. ఏమైనా సాంఘిక పరిణామంలో ఒకటి మాత్రం విశ్వసనీయంగా కనిపిస్తున్నది.
సామాజిక కార్యక్రమాలు వివిధ రూపాలలో విస్తరిస్తూ నాగరికతాభివృద్ధితో బాటు క్లిష్టంగా మారేకొద్దీ, కొద్దిమంది చేతుల్లో అధికారం కేంద్రీకృతమౌతున్నది. సంఘటిత సామాజికశక్తే ప్రభుత్వం. అది మనుషులకు దూరమౌతున్నది. ఏమైనా ఆధునిక సాంకేతిక శాస్త్రంలేనప్పుడు, ప్రభుత్వం. ఎంత శక్తిమంత మైనప్పటికీ, వ్యక్తి స్వేచ్ఛకు అంతముప్పు సంభవించలేదు. స్థానిక సంస్థలకు భంగం వాటిల్లలేదు. ప్రభుత్వం వీటి సంక్షేమానికి చేసింది కూడా అంతంత మాత్రమే. ఇప్పుడు సాంకేతిక జ్ఞానం వల్ల జనాన్ని అదుపులో పెట్టే సాధనాలు, పద్ధతులు ప్రభుత్వాలకు లభించాయి. అందువల్ల ముప్పు ఎక్కువైంది. మానవజాతి మనుగడకే ప్రమాదం అని ప్రస్తావించిన సాంకేతిక విషయానికి ఇది అదనంగా తోడైంది. కేవలం సంక్షేమ సాధనాలకే ప్రభుత్వం పరిమితమైనప్పటికీ, రాజ్యం పెనుభూతంగా ఉన్నంతవరకూ, వ్యక్తులను జనాభా లెక్కకే పరిగణించినంత వరకూ వ్యక్తికి ప్రమాదం ఉంది. వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం అనే వాటిని సాంకేతిక సమాజంలోని సమర్థత, జటిలత్వంతో పొందికగా, ఇమడ్చడమనేదే నేటి సమస్య, యుద్ధాన్ని లేకుండా నివారించడంతో ఇది ముడిపడి ఉంది. ఈ సమస్యను మానవుడు పరిష్కరించగలడనేది భవిష్యత్తు తేల్చాలి. మానవుడు పరిష్కరిస్తే మాత్రం, జీవితానికి అన్వయించినట్లే చెప్పవచ్చు. పాపాన్ని, ప్రమాదాన్ని చూసి ప్రవక్తలు విచారపడవచ్చు. కాని మార్గాంతరం వారు సూచించ లేదు.
మతం
సాంఘిక వ్యవస్థల భిన్న స్వరూపాలలాగే, మానవుడి సాంస్కృతిక జీవనంలో కూడా పరిణామస్వభావం ఉంది. నేడు మనం దైవంగా భావిస్తున్న విషయం కొన్ని సమాజాలలో అసలు లేనట్లు మానవశాస్త్రం చెబుతున్నది. జెసూట్స్ మిషనరీలు వెళ్ళేటంతవరకు జపాన్ లో దేవుడు అనే మాట లేదు. (చూడు ఆర్థర్ కోస్లర్ రాసిన ది లోటస్ అండ్ ది రోబో, పుట 232) వర్షం, గాలిని దైవాలుగా పూజించిన సమాజాలున్నాయి. నక్క, కాకి, బల్లి, జంతుజాలాన్ని, పాములను, దేహాన్ని వదలిన ఆత్మలు నివసిస్తున్నాయనే విశ్వాసంతో చెట్లను ఆరాధించారు. మానవత్వారోపణగల దేవుళ్ళను కొన్ని సంఘాలు పూజించాయి. ఒకే ఒక పరమాత్మను కొలిచే సమాజాలున్నాయి. అల్లా అందుకు ఉదాహరణ.
ఏకేశ్వరారాధనను ఇంచుమించు అభివృద్ధి చెందిన అన్ని మతాలు అవలంబిస్తున్నాయి. అందులో కూడా చాలా విధాలున్నాయి. పరిణామం కూడా ఉంది. యూదులకు జెందిన జెహోవా, మానవుడిలాగే ఈర్ష్య, పగ సాధింపు లక్షణాలు గలవాడు. సునిశితమైన హిందువుల బ్రహ్మ రాగద్వేషాతీతుడు, జైన, బౌద్ధాలు పరమాత్మును విశ్వసించవు. అటువంటి అవసరం కూడా ఉందని అంగీకరించవు. అయితే హిందూ మతంలాగే ఇవి కూడా కర్మ, పునర్జన్మలను అంగీకరిస్తాయి. యాత్రికులు, పరిశోధకులు పరిశీలించి సేకరించిన వివిధ మతదృక్పథాలు, కొంతవరకు మతమూర్ఖత్వాన్ని తగ్గించడానికి తోడ్పడ్డాయి. మతానికి సమాజ పాత్రను అవి చూపెట్టాయి. ప్రకృతిలోనూ, సమాజంలోనూ మానవుడి పాత్రను గమనించేటట్లు చేశాయి. విజ్ఞానం వచ్చే వరకు మానవుడికి ఇటువంటి అవగాహన లేదు. మతాలన్నీ, వాటి తత్వం ఎలాంటిదైనప్పటికీ, రెండు ప్రధాన విషయాలలో తోడ్పడ్డాయి. మానవుడు తన అనుభవాన్ని దేనిని బట్టి ఇముడ్చుకోవాలో, మతం చూపింది. జీవితంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, మంచి చెడ్డలు నిర్ణయించాలి, తోటి వారిని గురించి నిర్ధారించడం ఎలా అనే ప్రమాణాలను మతం సమకూర్చింది. ఇందులో మేథస్సుకు సంబంధించిన విషయం నేడు ప్రకృతి, సామాజిక శాస్ర్తాలు స్వీకరించాయి. విజ్ఞానం ఆధారంగా ఏర్పడిన నీతి శాస్ర్తం, మతరహిత ధోరణిని అవలంబించడం, లోకాతీత విషయాలతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా ఉండడానికి తోడ్పడటం జరిగింది.
నీతి శాస్ర్తం
ఎవరు ఏ మతాన్ని అనుసరించినప్పటికీ వ్యక్తుల మధ్య సంబంధాల గురించి నీతిశాస్త్రం చెబుతున్నది. సమాజంలో ఉన్న సభ్యులు నియమాలను పాటించాలని, లేదా శాంతి యుతంగా అభ్యంతర పెట్టాలని ఉద్దేశించారు. సత్యానికి విలువ ఇవ్వాలి. సత్యం పలకాలి. చట్టవ్యతిరేక ఆచరణలను అంగీకరించరాదు. సంకుచిత స్వార్థాలను వదలి ఉన్నతమైన నిస్వార్థ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తోటి వ్యక్తి సంతోషంగా ఉండడాన్ని గౌరవించాలి. పొరుగువాడు ఇటువంటీ పనిచేసేటప్పుడు ఇతరుల హక్కులను భంగం వాటిల్లరాదు. హిందువులు ముస్లింలు, క్రైస్తవులు, జొరాస్ర్టియన్లు ఇలా ఎవరైనా సరే-మతంతో నిమిత్తం లేకుండా సభ్యులు ప్రవర్తించాలని సమాజం భావిస్తున్నది. భిన్న సమూహాలకు, జాతులకు వేర్వేరు నైతిక నియమాలు లేవు. మానవజాతి మౌలికంగా భావించే నైతిక సాంఘిక వ్యవస్థకు చెందిన విలువలను కాలరాస్తున్నందుకు దక్షిణాఫ్రికాను, నవచైనాను మనం ఖండిస్తున్నా, దక్షిణాఫ్రికా పాలకులు క్రైస్తవ మతం పేరిట, చైనా నాస్తికత్వం పేరిట ఇలా చేసినప్పటికీ, అందువల్ల మన తీర్పులో మార్పు రాదు. ఈ విధంగా, విజ్ఞానం వల్ల నైతిక శాస్ర్తం మతేతరంగానూ, విశ్వసనీయంగానూ రూపొందడాన్ని గమనించవచ్చు.
మతేతర విధానం వల్ల నీతి శాస్త్రానికి గల చారిత్రక సాపేక్షికత బయటపడింది. 15 వందల సంవత్సరాల క్రితం, మనుస్మృతి మానవస్వేచ్ఛను నిరాకరించడం నీతిగానూ, స్త్రీలకు పవిత్రజ్ఞానం లేకుండా చేయడం సరైంది గానూ పరిగణించింది. పండిత రమాబాయి, అనీబిసెంట్, మదామ్ క్యూరీలను చూసిన తరవాత మత ధర్మాలు నీతి బాహ్యమని ఖండించకుండా ఉండలేము. బానిసత్వం, నియంతృత్వంలాగే ఇది కూడా అమానుషమే.
ఇంతకూ సారాంశం ఏమిటి?
ప్రకృతి అవరోధాల నుంచి, అజ్ఞానం నుంచి మానవుడిని విజ్ఞానం కాపాడిన తీరు గమనించారు. ప్రకృతిని రక్తసిక్తమైనదిగా కవి ఒకప్పుడు వర్ణించాడు. అప్పుడు అతడిచులు మృగాలు, అంటువ్యాధులు, వరదలు, కరువుకాటకాలు, బలం గలవాడిదే రాజ్యం అన్న నియమాలు- అన్నీ మృత్యు ప్రాయంగా కనిపించాయి. విజ్ఞానం, సాంకేతికం వల్ల అవగాహన పెరగడమేగాక, ప్రకృతిని అనుకూలం చేయడానికి వీలైంది. ఇదంతా చూస్తే, ప్రామిథస్ కూడా తన కల నిజమైందనుకుంటాడు. ప్రామిథస్ ఒక గ్రీకుదేవత. ఇతడు మానవులకు నిప్పు రహస్యాన్ని వెల్లడించాడు. జేమ్స్ వాట్ ఆవిరి శక్తి రహస్యాలను బయట పెట్టినట్లు, దేవుళ్ళకు రాజైన జ్యూస్ తన కుమారుడు ప్రామిథస్ ను ఈ పని చేసినందుకు శిక్షించాడు. ప్రకృతి సంఘటనలు, ఆకాశంలో పరిభ్రమించే గోళాలు, నక్షత్రాలు, రుతువుల మార్పులు, జీవం పుట్టుక మరణం, మానవుడి మనసు పనిచేసే తీరు వాటి అంతర్గత నియమాలననుసరించి జరుగుతున్నట్లు ఇప్పుడు మనకు తెలుసు. ఇవి నిర్ధారణ వాదాన్ని చూపుతున్నాయి. బయట నుంచి అలౌకిక శక్తి ఏదో అదుపులో పెడుతున్నదనే నమ్మకం పొసగడం లేదు. అంతర్గత నిర్థారణ వాదం ప్రకృతికి, మానవుడిలోని స్వేచ్ఛకు వ్యతిరేకం గాదు. పెద్ద యంత్రంలో ఒక మేకులాగ మానవుడు మారిపోవడం లేదు. విజ్ఞానం వల్ల మానవుడు నియమాలను అతిక్రమించక, వాటిని చాకచక్యంతో తప్పుకుంటున్నాడు. తన చర్యల ఫలితాలను అతడు ముందే చూడగలుగుతున్నాడు. అందువల్ల తగిన విధంగా పథకం వేసుకోగలుగుతున్నాడు. శూన్యం నుంచి వచ్చాం. శూన్యంలోకి పోయాం అనే అర్థ రహిత జీవిత విధానం అనుసరించనక్కరలేకుండా పోతున్నది. నియతివాదం మానవుడి స్వేచ్ఛను ఇంకా విస్తరించింది. ఇది విధివాదానికి వ్యతిరేకం. సర్వశక్తిమంతమైన దైవంలో నమ్మకం ఉంటే విధిలో నమ్మకం ఉన్నట్లే.
ప్రకృతి అనుగుణంగా అలవరచుకోడానికే గాక, దాని స్వభావాన్ని పరిశీలించడానికి కూడా విజ్ఞానం చేయూతనిస్తుంది. మానవుడు వంతెనలు జెట్ విమానాలు నిర్మిస్తాడు, కలలుగంటాడు, పథకాలు వేస్తాడు, కవితలల్లుతాడు. తత్వం రాస్తాడు, రైల్వే టైంటేబిల్ ఏర్పరుస్తాడు, ఆశ్లీలసాహిత్యం సృష్టిస్తాడు. బద్దకిస్తాడు, ఆనందిస్తాడు, భావాలకోసం తోటివాడిని చంపుతాడు, కావాలని తాను చనిపోతాడు కూడా. భూకంపాలలాగే మానవుడి చర్యలు అన్ని సమయాల్లో ముందుగా ఊహించలేము. కాని అతడు చేసింది వివేచనాత్మకంగా అవగాహన చేసుకోవచ్చు. జరగబోయే దానికి జరిగిన దానికి ముడి పెట్టవచ్చు. మానవుడి అంతరలోకాన్ని తెలుసుకోవడం అనేది విజ్ఞాన పద్ధతి ఫలితమే.


రచన తెలుగుసేత
ఎ. బి. షా నరిసెట్టి ఇన్నయ్య

వ్యక్తి అంతర్గత శక్తులకూ, వర్ణం, కులం, జాతికీ ఏ విధమైన సంబంధం లేదు

“శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?” -
3.
మానవజీవితంపై సాంకేతికశాస్త్ర ప్రభావం

విద్యవల్ల విముక్తి లభిస్తుందనేది విజ్ఞానపరంగా వాస్తవం. అజ్ఞానం, మూఢనమ్మకాలు, వాటి వల్ల కలిగిన రాగద్వేషాల నుంచి మానవుడిని విముక్తుడిని చేయడంలో విజ్ఞానం ఉపయోగపడింది. ఇటీవలి వరకు తనను తెలుసుకోవడానికి,  విశ్వాన్ని తెలుసుకోవడానికి ఈ నమ్మకాలు అడ్డుపడి, మానవుడిని హేతుబద్ధంగా నైతికంగా పరిపూర్ణదశకు రాకుండా చేశాయి.
ఈ విమోచన ఎలా ఉన్నదో చూడాలంటే, వందేళ్ళ కిందట ఈ దేశంలో ఇంచుమించు అందరూ, నేటికీ కొందరు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, జీవ నిర్జీవ వస్తువులు, సముద్రం, గాలి, మానవుడి గురించి ఏమనుకున్నారో చూస్తే సరిపోతుంది. ఈ నమ్మకాలు మన ఆదర్శాలను నిర్ధారణ గావించాయి. మతేతరంగానూ పారలౌకికంగానూ ఎలా ప్రభావితం చేశాయి, వ్యక్తిగతంగానూ, పరస్పర వ్యక్తుల మధ్య సంబంధాలలోనూ ఈ ప్రభావం ఎలా ఉన్నదీ తెలుసుకోవచ్చు. మానవుడిని గురించి, లోకాన్ని గురించి మన భావాలను, విజ్ఞానం దృష్ట్యా ఎలా పునరాలోచించుకోవాలో పరిశీలించాలి. ఆధునిక విజ్ఞానం సూచించిన ధోరణిలో మన దృష్టిని మార్చుకుంటే మానవుడిలోని సృజనాత్మక శక్తులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. అప్పుడు సాంకేతిక శాస్త్రాన్ని మానవుడి మంచితనం కోసం మలచవచ్చు. విధ్వంస లక్ష్యాలకోసం దుర్వినియోగ పరచకుండా ఆపవచ్చు.
ఖగోళ శాస్త్రం
పురాణాలలో లోకం అంతా స్వర్గనరకాలుగానూ, భూమిగానూ విభజించారు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండగా భూమి అడుగున పాతాళ లోకంలో, ఆదిశేషు వీటన్నిటినీ మోస్తుంది. ఆ సర్పంపై విష్టువు శయనించి ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ ప్రత్యేక దేవతలకు నివాసాలు. రాహువు, కేతువులు తరచు సూర్యచంద్రులను కబళిస్తుంటాయి. అప్పుడు గ్రహణాలేర్పడతాయి. కాంతి పుంజాలు వెదజల్లే ఈ నిస్సహాయ దేవతలను రాహు కేతువుల కబంధ హస్తాల నుంచి తప్పించటానికి పూజా పునస్కారాలతో ఎన్నో వస్తువులు సమర్పించుకోవలసి ఉంది. గ్రహణాలే కాక, వరదలూ, కరువు కాటకాలూ, భూకంపాలూ అన్నీ ఏదో ఒక దేవతకు అంటగట్టారు. వాటి ముందు మానవుడు నిస్సహాయుడు. ఆరాధనతో దేవతలను శాంతింపజేయటం, లేదా పూర్తిగా లొంగిపోవడం, కాదంటే, యోగాభ్యాసం, తపస్సు వల్ల కొన్ని శక్తులు సంపాదించటం మాత్రమే మానవుడు చేయగలిగింది. అంతేగాని దైవశక్తి పనిచేసే తీరును, వివేచనాత్మకంగా తెలుసుకొని వాటి బారి నుంచి తప్పించుకోవటం, లేదా మరొక మార్గాన్ని చూడటం అనేది జరగదన్న మాట. నియమబద్దమైన ప్రకృతి అనే భావన వస్తువులలోగాని, తీరు తెన్నులలో గాని చూడలేక పోయారు. సైన్సు వల్ల నియమబద్దత వచ్చింది.
నక్షత్రాలను, గ్రహాలను, దేవతా నివాసాలుగా నేడు అందరు మానవులు నమ్మటం లేదు. దుష్ట దేవతల ప్రయత్నం వల్ల శిష్టమైన వాటిని నాశనం చేయటానికి గ్రహణాలేర్పడుతున్నాయని అందరూ నమ్మటంలేదు. మనం ఇప్పుడు, గ్రహణాలను ఊహించవచ్చు. లోగడ మనలను ఆశ్చర్యపరిచే అనేక సంఘటనలను ఇప్పుడు, గంటలూ, నిమిషాలతో సహా అంచనా వేసి చెప్పవచ్చు. భూమి సూర్యుని చుట్టూ గంటకు 65 వేల మైళ్ళ వేగంతో తిరుగుతున్నదని తెలుసుకున్నారు. దీని కాధారంగా శేషనాగు లేదుగాని, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి నిలబడిందని గ్రహించాం. సూర్యోదయం, సూర్యాస్తమయం, సముద్రాల ఆటుపోట్లు, రుతువుల మార్పులు, ఏడాదికొకసారి పక్షులు, చేపలూ వలస పోవడం, నక్షత్రాల, మనుషుల, జీవజాలాల పుట్టుక, చావు కూడా దేవుడు, దేవతవల్ల గాక, అంతర్గతంగా ఉండే నియామాల వల్ల జరుగుతున్నాయి. మానవుడి వివేచనకు ఇవన్నీ అవగాహన అయ్యేవే. తన సాంస్కృతిక పరిణామ భిన్నదశలలో మానవుడు తనను పోలిన దేవుడిని సృష్టించుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలియటం వల్ల ఇంతకు ముందెన్నడూ లేనంతగా మానవుడి సృజనాత్మక శక్తి విమోచన పొందింది.
పరిణామం, పారంపర్యత, జన్యు శాస్త్రం
ప్రపంచంలో మానవుడి స్థానాన్ని గురించి విజ్ఞానం చెప్పిందాన్ని బట్టి ఇటు వంటి విప్లవమే వచ్చింది. ఆధునిక జీవశాస్త్రం ఆవిర్భవించక ముందు, జీవరాశి మూలాన్ని గురించి 1859లో డార్విన్ సిద్ధాంతం లేక పూర్వం, ప్రత్యేక సృష్టిలో మానవుడికి నమ్మకం ఉండేది. విశ్వమంతా 6 రోజులలో సృష్టి అయిందనీ అందులో 3, 5, 6 రోజులలో జీవ సృష్టి జరిగిందనీ, మానవుడు కూడా ఇందులోనే ఉన్నాడనీ బైబిల్ చెబుతున్నది. బ్రహ్మ, (లేదా) ప్రజాపతి సృష్టి అయిందనీ అందులో 3, 5, 6, రోజులలో జీవ సృష్టి జరిగిందనీ, మానవుడుకూడా ఇందులోనే ఉన్నాడనీ బైబిల్ చెబుతున్నది. బ్రహ్మ, (లేదా) ప్రజాపతి సృష్టి చేసినట్లు అంగుష్ఠ దేహ కథనుబట్టి, హిందూమతం నమ్ముతున్నది. చాలా పురాణాలు ప్రపంచానికి, జీవితానికి ఇలాంటి మూలమేదో ఉందని నమ్మారు. అంతే తప్ప ఒక జీవికీ, మరొక దానికీ పరిణామ సంబంధాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు. మానవుడి నుంచి సర్పానికీ, సర్పం నుంచి మానవుడికీ మార్పు జరుగుతుందని, సర్వ సాధారణంగా నమ్మారు. అలాగే ఇతర జీవుల విషయంలో కూడా జరిగింది. ఒక జీవి నుంచి మరొకటి పరిణమించటమనేది అనూహ్యంగా ఉండేది. ప్రతి జీవి విశిష్టమేనని భావించారు. కనక పాకే జంతువు నుంచి పక్షి రావడం గానీ, వానరం నుంచి మనిషి రావడం గానీ, అసలు ఆలోచనకే అందలేదు. దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని నమ్మడం వల్ల పునర్జన్మ వచ్చింది. జీవితానికి ఆత్మ ముఖ్యమనీ, పారంపర్యతను అదే తీసుకుపోతుందనీ నమ్మారు. ఇప్పటికీ చాలా మంది హిందువులు గుండెలో అంగుష్ఠదేహం ఉంటుందనీ, మరణించినప్పుడు అది బ్రహ్మ రంధ్రంగుండా బయటకు పోతుందనీ నమ్ముతారు. ఈ నమ్మకం వల్ల తల్లిదండ్రులు సంతానం యొక్క వంశానుగత లక్షణాలను అసందర్భం అన్నట్లు చూశారు. శాశ్వతమైన ఆత్మ, చావు పుట్టుకల వలయం నుంచి విమోచన పొందేవరకూ తన కర్మానుసారం మళ్ళీ పుడుతూనే ఉంటుంది. తల్లిదండ్రులు కేవలం నిమిత్తమాత్రులు. వ్యక్తి మంచి చెడ్డల వల్ల తల్లిదండ్రుల నిర్ధారణ జరుగుతుంది.
మానవుడి అంతర్గత శక్తుల గురించి, భూమిపై అతడి స్థితిగతులను గురించి ఇటువంటి దృక్పథం వల్ల కులవ్యవస్థకు తాత్విక మద్దతు సమకూడింది. సమాజంలో హెచ్చుతగ్గులు, దోపిడీ, ఇతర అన్యాయాలకు కూడా అండ ఏర్పడింది. మానవుడు పేదవాడైనా, ఆకలితో అలమటిస్తున్నా, శూద్రుడిని పైకులాల హిందువు అమానుషంగా చూస్తున్నా అందుకు కారణం అసమానత్వంతో కూడిన సాంఘిక నిర్మాణం అని గాక, దురదృష్టవంతుడి కర్మ అని చెప్పారు.
ఇదంతా ఊహమాత్రమేననీ, ఆధునిక జీవ, సాంఘిక శాస్త్రాలు కనుక్కొన్నాయి. వ్యక్తి అంతర్గత శక్తియుక్తులన్నీ, అతడి తల్లిదండ్రుల వల్ల, పరిసరాల వల్ల నిర్ధారితమైతాయని తెలుసుకున్నారు. తండ్రి రేతస్సు తల్లి గర్భంలో అండమూ కలిసి పిండం ఏర్పడి వ్యక్తి పుట్టి పెరుగుతాడు. అండంలోనూ, రేతస్సులో కూడా జీవసంబంధమైన పలుచని పొడవైన సూక్ష్మ పదార్ధాలు, వాటినంటి పెట్టుకొని చిన్న జీవాణువులు ఉంటాయి. ఈ జీవ అణువులే (జన్యువులు) వంశపారంపర్యతను కొనసాగిస్తాయి. ప్రతి జన్యువు కూడా వ్యక్తి పెరుగుదలకూ, లేదా పెరగకపోవడానికీ దోహదం చేస్తాయి. జుట్టు రంగు, ఎత్తు, లింగభేదమూ, తెలివితేటలూ, కళలూ ఆలోచనారంగంలో సృజన శక్తులూ, ఉబ్బసంవంటి వంశపారంపర్య రోగాలకు గురికావటం ఇత్యాదులన్నీ ఈ జన్యువుల వల్లనే జరుగుతోంది. భిన్న వ్యక్తులలో జన్యువుల కలయిక భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో ఒకానొక విధంగా జన్యువుల కలయిక కేవలం తల్లి-దండ్రులకు పుట్టిన అనేకమంది వ్యక్తులను పరిశీలిస్తే వారిలోని జీవాణువుల కలయికను ఇంచుమించు సరిగానే అంచనా వేయవచ్చు. ఆధునిక గణాంకశాస్త్రం వల్ల ఇది సాధ్యమవుతున్నది. ఈ విధంగా అభివృద్ధి చేసిన వంశ పారంపర్య నియమాలనే జన్యుశాస్త్రం అంటున్నారు. దీని ఆధారంగా మేలుజాతి పశువులూ, పంటల శాస్త్రం కూడా పెంపొందింది.
ఈ పై విషయాన్ని గమనిస్తే, సంప్రదాయ భావాల నుంచి మనం ఎంత దూరంగా జరిగాయో అర్థమవుతుంది. మానవ స్వభావం, జీవితాన్ని గురించిన మన భావాలలో కూడా ఇటువంటి మార్పే వచ్చింది. జీవులలోని భిన్న రూపాలు పరస్పర సంబంధం లేకుండా దేనికదే విశిష్టంగా ఉండదని ఆధునిక విజ్ఞానం చెబుతున్నది. ఉన్నత జీవరాసులు కింది స్థాయి నుంచి పరిణమించగా, ఇవి ఇంకా తక్కువ స్థాయి నుంచి వచ్చాయి. ఇదంతా సహజంగా జరిగిన ఎంపికే. దీనికి ఎంతో కాలం పట్టిందని సైన్సు మనకు చెబుతున్నది. మానవుడి పూర్వీకుడు వానరం వద్దనే ఆగలేదనీ, ఏకకణ జీవి అయిన అమీబా వరకూ సంబంధం ఉన్నదనీ తెలుసుకోవచ్చు. జీవితానికి తొలిదశ అటువంటి అతి సాధారణమైంది. ఇలా కనుక్కోవటం వల్ల నిరుత్సాహ పడిపోవడమనేది ఆయా వ్యక్తుల మానసిక రీతిని బట్టి ఉంటుంది. ఉన్నత వంశానికి ప్రాధాన్యం ఇస్తూ, తన పారంపర్యతను చూపుకునే వ్యక్తికి, అమీబా వద్ద మనం ప్రారంభమయ్యామంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. మనిషి ఆలోచనా, హృదయ లక్షణాలను బట్టి ఆధునికయుగంలో మానవుడిని అంచనా వేసుకోవాలి. అప్పుడు మూలాధారం నుంచి ఇంతగా పురోభివృద్ధి చెదినందుకు మానవుడు గర్వించవచ్చు.
మానవుడికే కాదు. జీవానికి మూలమేమిటో కూడా వివరించటానికి వీలవుతున్నది. మతాలన్నీ ఆత్మవంటి జీవశక్తిని నమ్మాయి. ఆధునిక జీవరసాయనిక శాస్త్రం గానీ, పరిశోధనాత్మక మనోవిజ్ఞానంగానీ అటువంటి భావాలకు చోటివ్వడం లేదు. జీవానికి మూలం, స్వభావం వివరించవలసి వచ్చినప్పుడు ప్రత్యేక పరిస్థితులలో జీవపదార్థానికి అనుబంధంగా జీవితం ఆవిర్భవించినట్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులను పరిశోధనాలయంలో మళ్ళీ సృష్టించడం కష్టమే గాక సాధ్యం కూడా కాకపోవచ్చు. జీవితం తొలుత ఏర్పడినప్పుడు పరిస్థితులకూ, నేడు భూమి మీద ఉన్న వాతావరణం, రసాయనిక సమ్మిశ్రితం, చాలా భిన్నంగా ఉన్నందున మళ్ళీ మనం ఆదిమస్థితికి పోయి ఆనాటి పరిస్థితులను సృష్టించలేము. ఆ పరిస్థితుల గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఇది సాధ్యపడక పోవచ్చు. ఇది తప్పించుకోవటానికి చేసే సాధనకాదు. విజ్ఞానంలో ఇటువంటి పరిస్థితులు అనేక సందర్భాలలో ఏర్పడ్డాయి. ఉదాహరణకు సముద్రాలూ, పర్వతాలూ ఏర్పడినప్పటి ప్రత్యేకమంచు పరిస్థితిని గానీ, భూమి ఏర్పడినప్పటి ప్రత్యేక పరిస్థితులనుగాని మనం సృష్టించలేము. అంతమాత్రం చేత ఈ సంఘటనలకు అలౌకికశక్తి ఉన్నదని అనలేము. విజ్ఞానంలో ప్రతి సిద్ధాంతాన్నీ ప్రత్యక్ష పరిశోధనకు పెట్టలేకపోవచ్చు. ముఖ్యంగా కొన్ని సంఘటనలు, పునశ్చరణ చేయడానికి వీలులేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అలాంటి సందర్భంలో ప్రత్యక్ష పరిశోధనకు వీలైన వైజ్ఞానిక సిద్ధాంతాలు పైన పేర్కొన్న దృక్పథాన్ని బలపరుస్తున్నందున మనం ఆమోదిస్తున్నాం. విజ్ఞానేతర వివరణలు ఈ పనిచేయ లేకపోయాయి. ఆ జీవస్థితి నుంచి జీవానికి, తరువాత ప్రాణికోటికీ ఇందులో పరాకాష్ఠగా మానవుడి పరిణామం నిరంతరంగా సాగినట్లు విజ్ఞానం చూపింది. విశ్వం ఎప్పుడు సృష్టి అయింది?” అనే ప్రశ్న సరిగా వేయలేదని కూడా విజ్ఞానం చెపుతున్నది. దీనికి సమాధానం మనం అనుసరించే కాలప్రమాణాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా ప్రత్యేక సృష్టి లేదా సృష్టికర్త అనే ప్రతిపాదన మాత్రం మనకు లభించిన సాక్ష్యాధారాలకు సరిపోవడం లేదు.
ఆధునిక విజ్ఞానం కనుక్కొన్న మరొక విషయం మన దేశానికి ప్రత్యేకంగా ఆసక్తికరమైనది. మనకు శతాబ్దాలుగా కులంతో కూడిన సమాజం ఉంది. నాలుగు వర్ణాలు దీనికి ఆధారం, హిందువులలో పుట్టినవారంతా ఏదో ఒక వర్ణానికి చెందినవారే. అగ్ర స్థానంలో బ్రాహ్మణుడూ, అట్టడుగున శూద్రుడూ ఉంటున్నారు. కర్మ సిద్ధాంతానుసారం గతంలోని కర్మల వల్ల ఒకానొక వర్ణంలో పుట్టడం నిర్ధారణ అవుతుంది. ప్రతి వర్ణానికి కచ్చితంగా నిర్ణయించిన హక్కులూ, బాధ్యతలూ ఉన్నాయి. కింది స్థాయికి పోయే కొద్దీ హక్కులకంటే బాధ్యతలు పెరుగుతాయి. అట్టడుగు వర్ణానికి హక్కులు దాదాపులేనట్లే. అమానుషమైన బాధ్యతలు మాత్రం ఉన్నాయి. దీనంతటికీ దైవ ప్రమాణం సిద్ధాంతరీత్యా ఉన్నది. భగవద్గీతలో కృష్ణుడు తానే గుణకర్మానుసారం నాలుగు వర్ణాలను సృష్టించానంటాడు. ఇటువంటి పద్ధతిలో వ్యక్తి చొరవకు ఆస్కారంలేదు, వ్యక్తి స్వేచ్ఛ, హుందాతనానికి గౌరవం లేదు.
నేడు మతేతర విషయాలలో తక్కువ వర్ణాల వారు ఉన్నత కులాల ఆధిక్యతను ఆమోదించటం లేదు. ప్రజాస్వామ్య సంస్థలు రావడంతో, వారు జయప్రదంగా తిరగబడ గలుగుతున్నారు. ఈ తిరుగుబాటు పూర్తి కావాలన్నా, నిర్మాణాత్మకం కావలన్నా ఉన్నత కులాల కంటే తాము తక్కువ వారమనే భావన పోగొట్టుకోనిదే సాధ్యపడదు. బౌద్ధమతంలోకి మారడం కొంతవరకే ఫలితాన్నిస్తున్నది. హిందూమతంలో ఉన్న కర్మ, కులానికి ఆధారమైన పునర్జన్మలను బౌద్ధమతం ఆమోదిస్తున్నది. కనక మార్గాంతరంగా విజ్ఞానం కనుక్కొన్న వాటికి అనుగుణమైన ప్రపంచ దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. దీనిని బట్టి ఏర్పడే నైతిక దృక్పథం కూడా వ్యక్తి విలువలను సాధించుకోడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయమై విజ్ఞానం ఏమి చెబుతుందో తెలియని వారు హిందూ దృక్పథాన్ని సమర్థించేవారి చేతులలో చిక్కుకున్నారు. ఉదాహరణకు కొందరిలో ప్రవహించే రక్తం పరిశుభ్రమైందనీ, అందుకే ఆ వర్ణాలవారు గొప్పవారనీ అంటున్నారు. విజ్ఞానం కూడా నాలుగు విధాలైన రక్తం ఉన్నట్లు పేర్కొనలేదా? అంటున్నారు. ఇది దోషపూరితమైన వాదం. మానవుల రక్తం నాలుగు విధాలుగా ఉన్నట్లు కనుక్కొన్నప్పటికీ వర్ణానికీ దీనికి ఎక్కడా పొంతనలేదు. ఆ మాట కొస్తే బ్రాహ్మణులూ శూద్రులు కూడా ఒక విధమైన రక్తానికీ చెందినవారైతే ఆ బ్రాహ్మణుడి తమ్ముడూ, శూద్రుని కుమారుడూ వేరే విధమైన రక్తానికి చెందిన వారు కావచ్చు. వ్యక్తి అంతర్గత శక్తులకూ, వర్ణం, కులం, జాతికీ ఏ విధమైన సంబంధం లేదు. వివిధ వ్యక్తుల మధ్య ఉన్న భిన్నత్వం వంశపారంపర్యంగా వచ్చింది. ఈ వంశ పారంపర్యత శారీరకమైందీ, పరిసరాలకు చెందిందీ. మానవుడు దీనిని అదుపులో పెట్టగలడు.
(తరువాయి 4వ భాగంలో)

 రచన   తెలుగుసేత
   ఎ. బి. షా                                           నరిసెట్టి ఇన్నయ్య