Prajakala interview by Saji Gopal in Dallas, TX

సన్యాసి సత్యం పలికితే!

జర్మనీ  నుండి ఇండియా వచ్చి సన్యాసిగా  వివిధ జీవితానుభవాలు పొందిన విశిష్ట బ్రహ్మచారి లెపాల్క్ ఫిషర్. పేరు మార్చి వూరుమార్చి ప్రపంచమే తన యిల్లుగా చివరకు అమెరికాలో అస్తమించాడు. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం వుంది. కేవలం ఉత్తర ప్రత్తుత్తరాలతో  పరిమితం గాక, పిలిపించి  ప్రసంగాలు చేయించాను. అవన్నీ రికార్డు చేసి భద్రపరిచాము. అగేహానంద భారతిని కలసిన  వారు ఆయన్ను మరువలేరు.
ఆయన రచన  దిగ్రేట్ ట్రెడిషన్ లిటిల్ ట్రెడిషన్స్ నేను తెలుగులో అనువదించగా తెలుగు అకాడమీ ప్రచురించింది. ఇండియాను దికైజాన్స్ ప్రచురణలు వారు ఆయన మోనో గ్రాఫ్లలను వెలువరించారు.
ఎం.ఎన్. రాయ్ తో ఒక్కసారి డెహ్రడూన్ లో కలసిన భారతి పూర్తిగా మారి పోయినట్లు పేర్కొన్నాడు. మానవ వాదిగా రూపొంది కల్చరల్ యాంత్రొపాలజూ బోధిస్తూ సిరక్యుస్ యూనివర్శిటీలో స్థిరపడ్డాడు.
1987లో భారతిని  హైదరాబాద్ కు పిలిపించి,  ఉస్మానియా ఓపెన్ యూనివర్శిటీలో  ఎం.ఎన్. రాయ్ శతజయంతి  సంస్మరణ ఉపన్యాసాలు యిప్పించాను.
ప్రస్తుతం తెనిగించిన ఆకర్ రోచే అనే  రచన 1967లో వెలువడినప్పుడు భారత ప్రభుత్వం నిషేధించింది. రామకృష్ణ, వివేకానందల గురించి  నిజం చెప్పినందుకు, ఆ ఆశ్రమ  వత్తిడి కారణంగా అలా  చేశారని తెలిసింది. కుష్వంత్ సింగ్ వంటి వారు నిషేదానికి నిరసన తెలిపారు. అయితే  భారతి అమెరికా నుండి  మరో అధ్యాయం చేర్చి, ఆకార్  రోబ్ వెలువరించారు. దాని అనువాదమే యిది.
నిశిత పరిశీలకులకు  యిది నచ్చుతుంది. వెర్రి ఆవేశంలో  గుడ్డి ఆరాధన చేసేవారికి యిది కనువిప్పు చేస్తుంది. అందుకే దీని అవసరం వుందని, అందిస్తున్నాం.
(1991లో భారతి  చనిపోయారు)
    • Innaiah Narisetti

సన్యాసి సత్యం పలికితే!








ఇంగ్లీషు మూలం :
స్వామి అగేహానంద భారతి









తెలుగు సేత :
నరిశెట్టి ఇన్నయ్య
ఏభై ఏళ్ళ ప్రాయంలో స్వీయచరిత్ర వ్రాసుకోవాలనుకునే చాలామంది పెద్దవాళ్ళన్నారు. నేను 37 సంవత్సరాలకే స్వీయచరిత్ర వ్రాశాను. ఇందుకు తగినంత సమాచార సేకరణ జరిగినందున పెద్దవారి సలహా పెడచెవిన పెట్టాను. శంకరాచార్య 33 ఏళ్ళకే చనిపోయాడు. అప్పటికే ఆయన కాలినడకన దేశం నలుమూలలా తిరిగి, నాలుగు పీఠాలు స్థాపించారు. 80 పుస్తకాలు వ్రాసి బౌద్ధాన్ని విస్మరించేటట్లుగా హిందూ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాడు. మధ్యయుగాల్లో మతజ్ఞానిగా శంకరాచార్య ఖ్యాతి స్థాపితమైంది. 8 సంవత్సరాలకే ఆయన (720 క్రీ.శ.) సన్యాసి అయ్యాడు.
నేను 80 రచనలు చేసి, మా గురువు కంటె ఎక్కువగా కాలినడకన ఒక్కసారే దేశం తిరిగాను. మఠాలు స్థాపించలేదు గాని, కొత్త పద్ధతులతో హిందూ సంప్రదాయం అట్టి పెట్టాలనుకున్నాను.
ప్రస్తుత  రచన ప్రత్యక్షంగానూ, నిర్మాణాత్మకంగానూ, పరోక్షంగానూ నా అనుభవాల ఆధారంగా జీవన విధానం వుండాలని చూపే తీరు వివరించాలనుకున్నాను. జీవన తత్వం కూడా పేర్కొనాలనుకున్నాను.
విశ్వంలో  పొందికను, ప్రేమను చూడాలని చాలా మంది అనుకొంటున్నారు. తాము జీవించిన సంప్రదాయం వారికి తృప్తినివ్వడం లేదు. చుట్టూ వున్న శక్తుల్ని గమనిస్తే, వారికి భయమేస్తుంది. పరిసరాలలో చూచే దానికంటె ఎక్కువ తెలుసుకోవాలని ఉంది. విసుగెత్తే జీవనం నుండి విముక్తిపొందాలనుకొంటున్నారు. ప్రాపంచిక అనుభవ వాదిగా, ప్రయత్నించి సాఫల్యం పాక్షికంగా సాధించినవాడిగా నేను చెప్పదలచాను.
మానవవాదాన్ని  కొత్త తరహాలో పెంపొందించదలచాను. ఇందులో మానవాళి ముఖ్యం. మానవులకు విలువ యివ్వాలి. మానవాళి అనే పదం గ్రంథాలలో వుంటుంది. కాని వాస్తవంగా మానవులు వున్నారు. తత్వంలో మానవాళి అంటారే గాని, మనుషుల్ని విస్మరిస్తారు. ప్లేటో ఇలాంటి తత్వవేత్త. ఆయన  ప్రభావం మధ్యకాలాల వారి పైనా, హెగెల్, మార్క్స్, హిట్లరు పైనా, ఆ తరువాత కూడా కనిపించింది. అమానుషత్వాన్ని గురించి కార్ల్ పాపర్ వంటివారు హెచ్చరించారు.
మానవవాదం  విశ్వవ్యాప్తంగా వుండాలి. మానవవాది మనుషుల్ని ప్రేమిస్తాడు. ఇతరులు తనను ప్రేమించాలనుకొంటాడు. ప్రజలకు సహాయం చేస్తూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో పరస్పరం విషయాలు తెలుసుకోవాలి.
మూకగా వుండేవారి  మధ్య నేను ఒంటరిగా వుండడానికి యిష్ట పడతాను. నా మానవ వాదం విశ్వవ్యాప్తమైనది. ఇందులో పరస్పర సంబంధం వుంటుంది. ఇలా ఒకరితో ఒకరు విషయాల్ని తెలియపరచు కోవడం నా మానవవాదంలో నిత్యమూ వుంటుంది. సన్యాసిగా మానవ వాదాన్ని అనుసరించిన నేను ఇలాంటి తృప్తికరమైన పద్ధతుల్ని అవలంబిస్తాను. పాశ్చాత్య లోకంలోని మానవవాద సంప్రదాయాల నుండి భారతదేశం నేర్చుకోవచ్చు. రస్సెల్, విట్టిగెన్ స్ట్రైన్, జి.ఇ.మూర్, టి.యస్ ఇలియట్ నుండి చాలా నేర్చుకోవచ్చు. పిడివాదంతో కూడిన మతం కంటె, మానవవాదం మంచిది. మానవవాద మార్మికవాదం ఇంకా శైశవ దశలోనే వుంది. మనకు మానవవాదం విశ్వజనీన జీవన విధానం కావాలి.
చాలామతాలు మానవవాదాన్ని కాదంటున్నాయి మానవుడికి ప్రథమ స్థానం యివ్వని విలువల్ని నేను అంగీకరించను. మానవవాదిగా, మార్మికుడుగా ఒకేసారి వుండడానికి యోగం, తాంత్రికం, వేదాంతం అవకాశాన్నిస్తున్నవి. విజ్ఞానాన్ని మార్మికవాదాన్ని సమాంతరంగా చూస్తున్నారు. హృదయం, మేధస్సు పరస్పరం చేతులు కలపాలంటారు. తత్వం ముగిసినచోట మతం ఆరంభమౌతుందంటారు. ప్రపంచ వ్యాప్తంగా యీ వాదనలున్నాయి. ప్రపంచ మతాలన్నీ ఒకే తీరులో ప్రవచించవు. హిందూ, బౌద్ధ మతాలు మౌలికంగా ఒకటికాదు. కాని చాలా మంది యిలాంటి వాదన చేస్తూ ఊబిలోకి దిగారు.
అధికార  భేదాన్ని అంగీకరించిన భారతీయ చిందనాపరులు భిన్న మార్గాల్ని అనుసరించడాన్ని ఒప్పకున్నారు. మానవవాదం ఒక ఆలోచనా ధోరణి. మార్మికవాదం భౌతికపరమైన ధ్యాన సంబంధమైన విషయం. మానవవాదం ఆలోచిస్తుంది. మార్మిక వాదం ధ్యానంలో నిమగ్నమౌతుంది.
మాడం బ్లావట్  స్కీ పేర్కొన్న రహస్య సిద్ధాంతాల ప్రవక్తలు టిబెట్ లో ఎక్కడా కనిపించరు. ఇది నేను స్వానుభవంతో గ్రహించాను. మూల గ్రంథాలలో కూడా యీ ప్రస్తావన లేదు. లోబ్ సాంగ్  రాంపా చెప్పింది కూడా ఇప్పుడు బట్టబయలై తప్పని తేలింది. ఆయన పేర్కొన్న మూడో కన్నులేదని అర్థమైంది. పాశ్చాత్యులు కష్టపడకుండా, ఆలోచించకుండా యిలాంటి ఆకర్షణీయ రచనల వెంటబడ్డారు..
సంస్కృతం  పాశ్చాత్యలోకంలో వ్యాప్తి చెందాలి. భారతీయ మూల గ్రంథాలు వారు తెలుసుకోవాలి. వేదాంతం, బౌద్ధ, జైనాలు కూడా బాగా వారు చదవాలి. ఇలా వ్యాప్తి చెందకపోవడానికి అడ్డంకి ఏమిటి? లోబ్ సాంగ్ రాంపా వంటి వారే పెద్ద అవరోధంగా నిలిచారు. కొంచెం శ్రమిస్తే సంస్కృతం, భారతీయ తత్వం తెలుసుకోవడం కష్టం కాదు. ఇండియా గురించి వెలువడుతున్న మౌలిక గ్రంథాలు పాశ్చాత్య లోకంలో కొద్దిగానే వున్నా, సంతృప్తికరంగానే అవి వెల్లడవుతున్నాయి. కాని, ఇండియాను గురించి చౌకబారు ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా వచ్చి పాడుచేస్తున్నాయి. ఇండియా మార్మికమనీ అభూతకల్పనలతో వెలువడుతున్న పుస్తకాలు పాశ్చాత్య లోకాన్ని వక్రమార్గాన్ని పట్టిస్తున్నాయి. ఈ పుస్తకంలో నిజం చెప్పి, అలాంటి వక్రీకరణలను దూరం చేయదలిచాను. ఇండియాను గురించి ప్రత్యేక విషయాలు ఆచార్యుడిగా చెప్పదలచాను. భారతీయులకు విదేశీయులకు ఉపకరించేరీతుల్లో విషయాలు చెప్పడం ఈ రచన లక్ష్యం. ఇది అందరినీ తృప్తిపరచ లేదు. మత అంధకారంలో పడి హేతువాద పద్ధతికి దూరంగా జరిగానని పాశ్చాత్య మానవవాదులు అనుకోవచ్చు. కాని నా దృష్టి అంతా మానవ వాదంపైనే. అది సన్యాసి జీవనానికి విరుద్ధం కాదు. ఆలోచనల అణచివేతకు దూరంగా పిడివాదాలకు భిన్నంగా మానవవాద సన్యసత్వం కావాలని నేను కోరుకున్నాను. భారతీయ సన్యసత్వంలో సహనం లేదు. జీవితానంతరం పునర్జన్మ. అవతారాలున్నాయని నమ్మడం ఆయా వ్యక్తుల అభిరుచికి సంబంధించిన విషయం. సంపూర్ణ మానవుడుగా మారడానికి ఎలాంటి ధ్యానం అవసరమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

జర్మనీలో బాల్యం
హిట్లర్ ది నాదీ పుట్టినరోజు ఒక్కటే. అయితే హిట్లర్ బారి నుండి నేను తప్పించుకోడానికి కారణం. మా తల్లిదండ్రులు చెక్ పౌరులట. అందువలన రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో నిర్భంద సైనిక శిక్షణకు జర్మనీలో అందరినీ చేర్చుకుంటున్నప్పుడు నన్ను వదిలేశారు. హిట్లర్ పుట్టిన నాడు (ఏప్రిల్ 20) జర్మనీలో ప్రతి పాఠశాలకు సెలవు ఇచ్చేవారు. 1939లో హిట్లర్ జన్మదినం నాడు నేను ఇండియా స్వాతంత్ర్యానికై పోరాడుతానని శపథం చేశాను. అప్పటికి నాకు 16 సంవత్సరాలు. నాకు ఇలాంటి కోరిక కలగడానికి, ఇండియాపై ప్రత్యేక ఆసక్తి వుండడానికి చాలా కారణాలున్నాయి.
ఇండియాను  గురించి పుస్తకాలలో కథలుగా చదువుకున్నాను. ఒంటరిగా నగలు ధరించి పూసలు కోట్లు వేసుకొనే మహారాజాలు, అద్భుత సంఘటనలు, ముసుగులతో స్ర్తీలు, ఇట్లాంటివెన్నో రహస్యంగా చదివాం. ఇదంతా పది సంవత్సరాలప్పుడు ప్రారంభమైంది. నా 11వ యేట, నా తల్లి గ్రంథాలలో రవీంద్రనాథ్ టాగూర్ నవల ఒకటి దొరికింది. అది నాకు సరిగా అర్థం కాలేదు.
నా 13వ యేట వియన్నాలో ఇండియన్ క్లబ్ లో చేరాను. అప్పటికే నాకు ఇండియా అంటే బాగా ఆసక్తి పెరిగింది. భారతీయ విద్యార్థులు అక్కడ చాలా మంది వైద్యం చదువుతుండే వారు. సంస్కృతం, హిందీ నేర్చుకొనే ప్రయత్నంలో నేను ఇండియాను గురించి కొన్ని విషయాలు చెపుతుంటే భారతీయ విద్యార్థులు ఆశ్చర్యపోయి నన్ను గౌరవంగా చూసేవారు.
సుప్రసిద్ధ  నృత్యకారుడు ఉదయశంకర్ ఒకసారి తనట్రూప్ తో వియన్నా వచ్చి  శివపార్వతి, రాధాకృష్ణ నృత్య ప్రదర్శనలు చేశారు. అవి నన్ను ముగ్ధుడిని చేశాయి. నేను ఇండియాకి రావడానికి కాషాయ వస్త్రాలు వేసుకోడానికి బీజం నాటింది, ఉదయశంకరేనని ఆయనతో ఒకసారి చెప్పాను. కాని, ఆయన నేను చెప్పినదానిని ఏమంత విశేషంగా భావించలేదు.

తెలుగు వ్యక్తి  – భారత్ దర్శనం
నేను చిన్న  తనంలోనే ఇంగ్లీషు నేర్చుకోవడం  ప్రారంభించాను. మధ్యలో వదిలేసినా, ఉదయశంకర్ సందర్శనం తరువాత మళ్ళీ ప్రారంభించాను. ఆయన నృత్య ప్రదర్శన సందర్భంగా వచ్చిన భారతీయు లలో ఒకతెలుగు వ్యక్తి నాకు పరిచయమయ్యారు. ఆయన పేరు బాలకృష్ణశర్మ. 19వ యేటనే ఇంగ్లండు వెళ్ళి కొన్ని సంవత్సరాలపాటు అక్కడ ఉండి చక్కని ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఆయన అభ్యుదయవాది శాస్ర్తీయంగా, సాంకేతికంగా ఇండియా పాశ్చాత్య ప్రపంచంతో పాటు పురోగమించాలని ఆయన ఉద్దేశ్యం.
నాకు అప్పుడు  13 సంవత్సరాలు. బాలకృష్ణ తటపటాయించి నన్ను ఇండియా క్లబ్బుకు తీసుకువెళ్ళారు. ఈ క్లబ్బును విఠల్ భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ 1933లో స్థాపించారు. ఇందులో డాక్టర్లు, విద్యార్థులు, సభ్యులుగా వుండేవారు. నేను క్లబ్బులో సభ్యుణ్ణి అయిన తర్వాత చాలా ఉత్సాహం చూపాను. అందరిలోకి నేను చిన్నవాడిని. వారి మధ్య నేను మసలుతూ ఇండియాను గురించి, భారతీయ సంస్కృతిని గురించి తెలుసుకున్నాను. క్లబ్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ, అక్కడికి వచ్చే భారతీయ వార్తా పత్రికలన్నీ చూసేవాడిని.
జర్మనీలో  వైద్యం చదువవలసిన భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా  జర్మన్ భాష నేర్చుకోవలసి వచ్చేది. దీనికోసం వేరే ట్యూషన్ కావాలంటే చాలా ఖర్చుయ్యేది. ఆ అవకాశం తీసుకొని భారతీయులకు నేను జర్మన్ భాష నేర్పేవాడిని. వారి వద్ద సంస్కృతం, హిందీ, ఉర్ధూ, బెంగాలీ నేర్చుకున్నాను. శాంతినికేతన్ విద్యార్థిని సుచిత్ర చౌదరి సంగీతం నేర్చుకోడానికి వచ్చినాకు బెంగాలీ నేర్చింది. ఆ విధంగా నేను బెంగాలీ నేర్చుకుని టాగూర్ సంప్రదాయాలను తెలుసుకున్నాను. డాక్టర్ కేసరవాణి నాకు సంస్కృతం నేర్పారు. 1937లో అక్టోబరు 2న మహాత్మాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా హోటల్ ఫ్రాన్స్ లో జరిగిన ఒక ఉత్సవంలో నేను భగవద్గీతలో కొంత భాగం చదివాను. అది నా 14వ యేట. మరునాడు వియన్నా పత్రికలు నన్ను పొగుడుతూ వ్రాశాయి.
వియన్నా విశ్వవిద్యాలయంలో సుప్రసిద్ధ ప్రొఫెసర్ ప్రావాల్ సర్  సంస్కృతం, ప్రాచీన భారతీయ విషయాలు చెప్పేవారు. ఆయన అనుమతితో క్లాసులో కూర్చొని అనేక విషయాలు నేర్చుకున్నాను.

నెహ్రూతో ఒకసారి
1938లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వియన్నా వచ్చారు. అప్పటికి గాంధీపేరు చాలా మందికి తెలుసుగాని, నెహ్రూ యింకా అంతగా ప్రచారంలోకి రాలేదు. ఇండియా క్లబ్ అధ్యక్షుడు నన్ను రమ్మని ఆహ్వానిస్తే హోటల్ ఫ్రాన్స్ లో 114వ గదిలో వుంటున్న నెహ్రూను చూడడానికి వెళ్ళాం. బహుశా నా గురించి అప్పటికే ఆయనకు చెప్పారేమో తెలియదు. నన్ను చూడగానే కుర్చీ చూపి కూర్చోమన్నారు. నా ఉర్దూ విని ఆశ్చర్యపోయారు. అప్పుడే వెలువడిన తన పుస్తకం చదివారా అనీ. అందులో అర్థం కానిదేమైనా వుంటే నిర్మోహమాటంగా అడగమన్నారు. ఇండియాలో మంచి పత్రికలేవని అడిగాను. దానికి సమాధానంగా ఆయన భారతీయ పత్రికలపై ఒక చిన్న వుపన్యాసమిచ్చారు.

భాయీ సచ్చిదానంద
1939 ఏప్రిల్ 20న భాయీ సచ్చిదానంద యూరప్ పర్యటిస్తూ వియన్నా వచ్చారు. ఉదయం 8 గంటలకు ఇండియన్ క్లబ్ కు వచ్చారు. నన్ను హిందువులలో చేర్చుకొమ్మని ఆయననడిగాను. వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారెవరైనా హిందువులు కావచ్చునని ఆయన ఉద్దేశ్యం. ఆవు పాలు, ఆవు మజ్జిగ, ఆవు వెన్న, గోమూత్రం, గోపంచకం అనేవి హిందువు స్వీకరించాలని, అయితే గోమాంస భక్షణ మాత్రం కూడదని భాయీ సచ్చిదానంద చెప్పారు. అక్కడే నాకు మొట్టమొదటిసారిగా రామచంద్ర అని నామకరణం చేశారు. భాయీ సచ్చిదానంద పెట్టిన పేరే చాలకాలం స్థిరపడింది. అంతటితో నేను హిందువుగా మారాను. ఈ బాల్యదశ విషయం ముగించే ముందు మరికొన్ని వివరాలు చెప్పి అంతటితో పూర్వాశ్రమానికి స్వస్తి పలుకుతాను. మా తండ్రి మొదటి ప్రపంచ యుద్ధంలోను, ఆ తరువాత యవనదశంలోనూ కెప్టెన్ గా పనిచేశారు. ఆయన పోలో ఆడేవారు. మా తల్లి బాగా చదువుకున్నది. తమ పూర్వీకులంతా రాజవంశానికి చెందినవారనేది. ఆమె నోరు మంచిది కాదు. ఆ బాధలన్నీ మా తండ్రే పడేవారు. మా నాన్నకు పుస్తకాలంటే అయిష్టం. ఆయన మా చిన్నతనంలో ఒకసారి నాకు విస్కీ యిచ్చారు. అదేదో షర్బత్తు అనుకొని గటగటా తాగేశాను. అంతటితో నాకు విస్కీపై విరక్తి పుట్టి దాని జోలికిపోలేదు. కోరికలు ఏవైనా వుంటే నిస్సందేహంగా తీర్చుకోవాలని మా తల్లి బోధించేది. ఇది లైంగిక విషయాలతో కూడినదని భావించి, స్ర్తీ జోలికి పోకూడదని నేను నిశ్చయించుకున్నాను. కాని, ఆ మాట మీద పూర్తిగా నిలబడలేదు. గ్రామర్ స్కూల్లో లాటిన్ చదువుకున్నాను. మతపరమైన విద్య  కూడ కఠినంగా నేర్పేవారు.
నా చిన్న  తనంలో ఆర్య సేవకురాండ్రు హిట్లర్ ప్రోత్సాహంతో తమ యూదు యజమానురాండ్రను వీధుల్లోకి లాక్కొచ్చి కాలిబాటను తుడిపించే  వారు. ఇలాంటి భయంకరమైన దృశ్యాలు సర్వసాధారణంగా వుండేవి. నాజీ విద్య వలన నాలో నియంతృత్వ వాదంపై వ్యతిరేకత ప్రబలింది. భాయీ సచ్చిదానంద వలన హిందువుగా మారిన నేరు కొత్త జీవితాన్ని ప్రారంభించాను.

నేతాజీతో పరిచయం
1942 చివరిలో ఒకరోజు హఠాత్తుగా నాకో టెలిగ్రాం వచ్చింది. వీలు వున్నంత త్వరలో ఓ మోజోటాను (7 సోఫిన్ స్ర్టాప్,. బెర్లిన్) కలుసుకోమని ఉన్నది. నాకు తలా, తోక అర్థం కాలేదు. ఆ పేరు ఎవరిదో నాకు తెలియదు. వియన్నా జనరల్ హాస్పిటల్లో ఇండియన్ డాక్టర్ రఘులాల్ నాకు ఫోన్ చేసి అలాంటి టెలిగ్రామే తనకు వచ్చిందని, వెంటనే వెళ్ళాలని చెప్పాడు. ఇద్దరం కలిసి టెలిగ్రామ్ లోని అడ్రసుకు వెళ్ళాం. అదొక గొప్ప యిల్లు. ఆత్రుతగా ఎదురుచూస్తుండగా చనిపోయాడని భావిస్తున్న సుభాష్ చంద్ర బోస్ తలుపు తీసుకొని వచ్చారు. ఆయన కలకత్తా నుండి ఎలా తప్పించుకు వచ్చారో తుది విజయం తర్వాత చెబుతానని మాతో తరచు అంటూండేవారు. కాని, ఆ క్షణం ఎప్పుడూ రాలేదు. 1943లో బోస్ మళ్లీ జర్మనీ నుండి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన విషయం అక్కడి భారతీయ సైన్యానికి తెలియదు.
నేను బోసుతో నా పరిచయాన్ని ప్రస్తావిస్తూ, భారత సైన్యంలో చేరడానికి దరఖాస్తు పెట్టాను.
1943 ఫిబ్రవరిలో నాకు పిలుపు వచ్చింది. కల్నల్ గా ఒకతను నన్ను చూచి నీవు సైనికుడిగా మారేటంతవరకూ ఉంటావన్నాడు. కాని ఆ ఏడు నవంబరులో భారతీయ సైన్యంలో చేరగలిగాను. అది నాకు గొప్ప అనుభవం నాకు యింకా 20 ఏళ్ళు నిండలేదు. అంతవరకు వియన్నా క్లబ్ లో భారతీయుల ద్వారా, పుస్తకాల ద్వారా మాత్రమే ఇండియా నాకు తెలుసు. కాని, సైన్యంలో భిన్న భాషలు మాట్లాడేవారు వుండటం వలన అనేక విషయాలు తెలుసుకోవడానికి భాషాపరంగా పెంపొందటానికి అవకాశం ఏర్పడింది. భారతీయులు మాట్లాడినట్టే నేను మాట్లాడేవాడిని. తమరిలో ఒకరిగా నన్ను స్వీకరించడానికి ఈ ఉచ్ఛారణ తోడ్పడింది. నన్ను భాయీ సాహెబ్ అని, రామచంద్ర అని పిలిచేవారు. జర్మన్ సైనికులు నాపట్ల విముఖతతో వుండేవారు. జర్మనీలో నన్ను కావాలని ఇండియన్ల మధ్య వుంచినట్లు, రోజూ జరుగుతున్న విషయాలు తెలుసుకోడానికి ఇలా చేసినట్లు కొందరు భావించారు. అయితే, నేను ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కాని, నాకు ఎదురైన చిక్కులన్నీ జర్మన్ సైనికాధికారుల తోనే.
భారతీయ  సైన్యంలో చేరిన తరువాత గ్రాండ్  ప్రికే అనే గ్రామం వద్ద 11వ దళంలో నన్ను చేర్చారు. జర్మనులకు ఇండియన్లకు వంటలు కూడా వేరు వేరుగా వుండేవి. మొదట్లో నేను జర్మనుల వంటలనే తినే వాణ్ణి. నా భారతీయ అనుకూలత చూసి, నన్ను ఇండియా మెస్ కి పంపివేశారు.  ఇందుకు దారితీసిన ప్రథాన సంఘటన ఒకటి వున్నది. డిసెంబరులో ఒకనాడు నా గదికి వెళ్లి యూనిఫాం తీసివేసి తెల్లని అంగీ వేసుకొని ధ్యానంలో కూర్చున్నాను. హఠాత్తుగా కొంతమంది జర్మన్ సైనికులు అరుస్తూ తలుపుకొట్టారు. తలుపు తీయగానే నా మీద ఐస్ నీళ్ళు చల్లారు. వారంతా బాగా తప్పత్రాగి వున్నారు. నా గదిలో వున్న భగవద్గీత, చిన్న పూజామందిరం, ఒకటి రెండు పవిత్ర గ్రంథాలు చిందర వందరగా పడేసి గదంతా నీళ్లు పోసారు. నాగదిలో వున్న రైఫిల్ ను మా కండర్ తీసుకున్నారు. ఇంతలో ఎవరో ఒకతను యిదంతా ఎగతాళికని చెవిలో వూదాడు. ఆ తరువాత నన్ను ప్రక్కగదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ యిద్దరు అందమైన ఫ్రెంచి అమ్మాయిలు వున్నారు. నన్ను త్రాగమని కమాండర్ అన్నాడు. నేను హిందూ మతం పుచ్చుకొన్నాను. తాగనన్నాను. కోటు తీసి వెయ్యమన్నాడు. తీసేసాను, బట్టలు పట్టుకొని ఆల్మెరా ఎక్కమన్నారు. అది ఇంచుమించు కప్పును తాకుతున్నది. అతి కష్టం మీద ఎక్కి పడుకున్నాను. అంతలో ఫ్రెంచి అమ్మాయి నాపై వెస్ ను విసిరేసింది. నా బట్టలు విప్పతీమని కంపెనీ కమాండర్ అమ్మాయిలతో చెప్పాడు. ఇక నేను సహించలేక పోయాను. క్రిందకు దిగివచ్చి మీ అధికారాలను మితిమీరుతున్నారు. ఏమైనా చేసుకోండి అన్నాను. నన్ను గదిలో పెట్టి బయట తలుపువేసి వెళ్ళిపోయారు. (లియోపాల్డ్ ఫిషర్ అయిన నేను రామచంద్రగా మారి జర్మనుల చేతిలో ఇలాంటి అనుభవాలు పొందాను) ఆ తర్వాత ప్లెటూ కమాండర్ వచ్చి అంతా మర్చిపో, ఏం జరగలేదనుకో అని చెప్పి వెళ్లాడు. ఆ తరువాత నిద్రపోదామంటే నా గదంతా పడకతో సహా తడిసి పోయింది. ఇంతలో కార్పోరల్ రతన్ సింగ్ వచ్చి జరిగినదంతా ఇండియన్లకు తెలుసునని, ఆ రాత్రికి తన పడకను వాడుకోమని చెప్పాడు. ఆ తరువాత నన్ను జర్మన్ మెస్ నుంచి తొలగించారు. హిందువులు, సిక్కులు వున్న దళంలో వేశారు. అక్కడ నుండి కూడా నన్ను మారుస్తారని జర్మన్లు అనుకుంటుండగా విన్న వంటవాడు చెప్పాడు. వెంటనే కల్నల్ క్రాప్ కు జరిగినదంతా తెలియజేసి సహాయపడమన్నాను. నన్ను లకనాప్ అనే చోటికి మార్చారు. జాగ్రత్తగా వుంటే ఏమీ జరుగదు. గొడవ చేస్తే నీ సంగతి చూస్తానని లెఫ్టినెంట్ నన్ను హెచ్చరించారు. నేను టెలిప్రింటర్ సెక్షన్ లో పనిచేశాను. చదువుకోవడానికి చాలా సమయం వుండేది. లకనాప్ లో భారతీయదళం మధ్య ఉంటూ హిందీ, ఉర్దూతో పాటు పంజాబీ, బెంగాలీ కూడా నేర్చుకున్నాను.
ఒకవారం  రోజుల పాటు వియన్నాలో గడిపాను. భారతీయ సైనిక దుస్తులతో తిరిగాను. పాత స్నేహితురాళ్ళను కలుసుకున్నాను. తరువాత లకనాప్ డ్యూటీలో చేరాను. భారతీయ సంగీతం కొంత పట్టుబడింది. నాకు తోడుగా లుథియానా నుంచి వచ్చిన కార్పోరల్ ప్రీతమ్ సింగ్ ఫోన్ డ్యూటీలో చేరాడు. ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చి మనదళం కోసం పుల్ వారీ పెడతామన్నాడు. ఎక్కడి నుంచో 8 మంది అమ్మాయిలను తీసుకు వచ్చారు. అందులో ఇద్దరు చాలా అందంగా వున్నారు. ఒకామె ఇటాలియన్, ఇందులో జర్మన్లకు ఇండియన్లకు వేరే వేరు ఏర్పాట్లున్నవి. ఇక్కడ జాతి విద్వేషాన్ని పాటించారు. 14 రోజుల పాటు చాలా సందడిగా హడావిడిగా జరిగిపోయింది. ఇటాలియన్ అమ్మాయి నీనాతో పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు జర్మన్లు, ఇటాలియన్ల కంటే భారతీయ సైనికులు చాలా ఆప్యాయంగా ప్రవర్తించారని చెప్పింది.
ఒకవైపున మిత్రరాజ్య సైన్యాలు వచ్చేస్తుంటే, ఫ్రాన్స్ ద్వారా ప్రయాణం మళ్ళుతున్నవది. అప్పుడు 4 వారాలపాటు మేము ఫ్రాన్ ద్వారా ప్రయాణం చేశాం. కొందరు భారతీయ సైనికులు చేసిన దుర్మార్గాల వల్ల మొత్తం సైన్యానికి చెడ్డపేరు వచ్చింది. ఇండియాపట్ల నా ఉత్సాహానికి తొలిదెబ్బ తగిలింది. వెనక్కు తిరిగి వస్తున్న సైనికులలో కొందరు ఇరవై సంవత్సరాల లోపు యువతులను చెరిచారు.

సైన్యంలో పూజలు, పరాభవాలు
యుద్ధంలో  జర్మనులు ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది. తిరిగి వస్తున్న భారతసైన్యంతో పాటు నేను ఫ్రాన్సులో చాలా అందమైన ప్రదేశాలు చూశాను. మాలో నూరు మంది మళ్ళీ బ్రిటిష్ సైన్యంలోకి వెళ్ళిపోయారు. మాలో ఉన్న సిక్కులు ఎక్కడికక్కడ గురుద్వారా స్థాపించి గురు గ్రంథ సాహెబ్ను పెట్టుకొని రోజూ ప్రార్థనలు చేసేవారు. నేనూ అందులో పాల్గొనేవాడిని. వారి ఆచార వ్యవహారాలు నాకు బాగా తెలిశాయి.
మళ్ళీ జర్మనీ గ్రామాలలో, లోయలలో పయనించాం. అప్పటి వరకు భారతీయ సైన్యంలో సిక్కులు మాత్రమే నిత్యం ప్రార్థనలు చేస్తుండేవారు. జర్మనీలో అతి శీతల ప్రదేశమైన స్వాబియన్ జ్యూరాలో మమ్మల్ని ఉంచారు. అక్కడ నేను హిందూ దేవాలయాన్ని స్థాపించాను. ప్రతి శనివారం పూజలు చేసి ప్రసాదం పంచిపెట్టేవాణ్ణి. పురాణాల నుండి, భగవద్గీత నుండి కొన్ని భాగాలు చదివి వినిపించేవాడిని. కార్పోరల్ హర్ దయాళ్ సింగ్ తులసీదాస్ రామాయణం చదివి వినిపించేవాడు. నేను అనుకోకుండా ఒక పూజారిగా మారాను. భారతీయ సైన్యంలో సంస్కృతం వచ్చినవారు ఎవరూ లేకపోవడమే అందుకు కారణం. ఇదంతా 1944 క్రిస్మస్ సందర్భంగా జరిగింది. తరువాత మా సైన్యం ఆఖరు ప్రమాణం సాగించింది. రణధీర్ సింగ్ సార్జెంటు మేయరుగా మాకు నాయకత్వం వహించాడు. 15 మైళ్లు నడచి డాన్యూబ్ బ్రిడ్జి దాటి రైలులో ప్రయాణం చేశాం. స్టేయిస్ లింజన్ అనే చోట దిగి మళ్ళీ రాత్రింబవళ్లు మార్చ్ చేశాం. అంతలో ఫ్రెంచివారి టాంకులు ఎదురుకాగా రణధీర్ సింగ్ ఒక తెల్లబట్టను చెట్టుకు కట్టి లొంగిపోయినట్లు ప్రకటించారు. మళ్ళీ మమ్మల్ని జర్మన్ గ్రామాలగుండా నడిపించి యుద్ద ఖైదీల శిబిరాలలో పెట్టారు. మూడు రోజులకొక పర్యాయం చిన్న రొట్టె ముక్కను, చిన్న చేపముక్కను ఇచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం బ్రిటీష్ ఆఫీసరు వచ్చి మమ్మల్ని ఉద్దేశించి ఇలా అన్నారు. మీరు మీ దేశానికి ద్రోహం చేశారు. నాజీలతో కలసి నవ్వుతూ ఆడుతూ, పాడుతూ మాతృదేశ పతాకాన్ని వదిలేశారు. ఇప్పుడేడవండి అన్నారు.
బ్రిటీష్  అధికారి అందరినీ ప్రశ్నిస్తూ  నా దగ్గరికి వచ్చాడు. అంతకు ముందే నేను భారతీయుడిని కాదని చెప్పవద్దని నాతోటి సైనికులకు చెప్పి ఉంచాను. నావంతు రాగానే హిందూస్థానీలో మాట్లాడాడు. ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు నేను కాశ్మీర్ బ్రాహ్మణుడిని. నా పేరు రామచంద్రశర్మ అని, జర్మనీలో చదివానని చెప్పాను. తెల్లగా కాశ్మీర్ బ్రాహ్మణుడివలె వుండటం వలన అనుమానానికి తావులేదు. తల్లిదంద్రుల పేర్లు కూడా అప్పటికప్పుడు కల్పించి భారతీయ పేర్లు చెప్పాను. ఇదంతా అబద్ధమో నిజమో తెలుసుకునే అవకాశం వారికి లేదు. ఒకవారం తరువాత మమ్మల్ని లారీలోకి యెక్కించి స్ర్టాస్ బరీ వద్ద రైలు ట్రక్కులలో టులాన్కు పంపారు. అయిదు రోజుల ప్రయాణానంతరం ఆకలిదప్పులతో అక్కడకు చేరుకున్నాం. త్రోవలో ఒకచోట రైలాగినప్పుడు వాగన్ ప్రక్కనే నీళ్ళు త్రాగటానికి దూకబోయి పడిపోయాను. నాతోపాటు చాలమంది అలానే స్పృహతప్పి పడిపోయారు. నేను తరువాత జాక్ బూటు విప్పి నీటితో నింపుకున్నాను. తరువాత టూలాన్ లో జనం మమ్మల్ని ఉద్దేశించి ఇక నుండి వీళ్ళంతా బ్రిటిష్ ఆర్డరులో ఉంటారు. క్రమశిక్షణతో మెలగండని హెచ్చరించాడు. మమ్మల్ని మార్ సెల్స్ కు తీసుకెళ్ళి జర్మను యూనిఫారాలు తీయించారు. అక్కడ క్యాంప్ మాస్టరుగా వుండవలసిందిగా నన్ను కోరారు. వంటగదికి తీసుకు వెళ్ళి చూపెట్టి నన్ను ప్రత్యేకంగా తినమన్నారు. ఇంకెవరినీ పిలవవద్దన్నారు. వెన్న, పాలు, అన్నం, పప్పు, మసాలాలు, మాంసం, కూరగాయలు ఉన్నాయి. తెగ తిని నిద్రపోయాను. ఒక గంట తరువాత మెలకువ వచ్చింది. చాలా కాలం తరువాత మళ్ళీ వేడి వేడి భోజనం పెట్టారు.
హఠాత్తుగా నన్ను, మరొకరిని జీపు ఎక్కించి తీసుకెళ్ళారు. ఇండియాకు విమానంలో తీసుకెళుతున్నామని చెప్పారు. శార్దూల్ సింగ్ జిల్ ను, నన్ను ఒక అమెరికా విమానంలో ఓర్గీ అనే పట్టణానికి తీసుకెళ్ళారు. ఇద్దరు గూఢాచార అధికారులు మమ్మల్ని అనుసరించారు. ఇక్కడ మమ్మల్ని ఒకచిన్న గదిలో పెట్టి ఆరువారాల పాటు రాచమర్యాదలు చేసి అనేకసార్లు ప్రశ్నించారు. ఇందులో ఒక ఇండియన్ కెప్టెన్ ఉన్నారు. వారెవరూ నన్ను అనుమానించలేదు. బోసును గురించి, భారతసైన్యం గురించి, జర్మనులు, ఫ్రెంచివారు ఎలా చూచేవారు అనే విషయాలను అడిగేవారు. తరువాత మమ్మల్ని మళ్ళీ జర్మన్ సరిహద్దుకు తీసుకొచ్చారు. కలోన్ లో మధ్యాహ్నం భోం చేసి బయలుదేరాం. మాతో పాటు ఒకసార్జెంటు, ఇరువురు సైనికులు వున్నారు. త్రోవలో ఒక చోట ఇద్దరమ్మాయిలు కారును ఆపారు. సిగిరెట్లు అడిగారు. లిఫ్ట్ అడిగారు. మాతో వున్న సైనికులు మెషిన్ ఫిస్టల్ను, రైఫిల్ను మాకిచ్చేయగా మూడో వ్యక్తి తన పిస్టల్ ను డ్రైవర్ సీట్లో పెట్టాడు. అమ్మాయిలకు ప్రకృతి దృశ్యాలను చూపిస్తామని వారు ముగ్గురు ఆ అమ్మాయిలతో వెళ్ళిపోయారు. ఈ లోగా ఎవరైనా వస్తే పిస్టల్ తో కాల్చమని చెప్పారు. మధ్యలో ఒకటి, రెండు కార్లు అటు వెళ్ళినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కాసేపటికి వెళ్ళిన వారందరూ తిరిగి రాగా అమ్మాయిలు మా వెనుక సీట్లో కూర్చున్నారు.
కొన్ని  మాసాలపాటు జైలుశిక్షను  అనుభవించిన తరువాత నన్ను  హెర్ ఫోర్డ్ బాల్యనేరస్తుల  జైలులో పెట్టారు. మూడుమాసాల పాటు నన్ను ఏకాకిగా ఉంచారు. నేను బరువు తగ్గి సన్నబడ్డాను. ఆహారం బాగుండేది కాదు. డాక్టరు నన్ను పరీక్షించి ప్రతీరోజు రొట్టె, వెన్న యివ్వమన్నారు. నన్ను ప్రత్యేక ఖైదీగా చూశారు. గోడమీద పడే నీడను బట్టి నాకు టైమ్ తెలిసేది. గదిలోనే రోజూ గంటన్నర సేపు పడుకోబోయే ముందు ధ్యానం చేసేవాడిని. జైలులో ఒక చిన్న లైబ్రరీ వుంది. ఇంతకాలం ఆ పాటి చదువుకునే అవకాశం లేదు. ఒకరోజు హఠాత్తుగా ఒక సైనిక వాహనంలో నన్ను చాలా దూరం తీసుకెళ్ళారు. సార్ లాండ్ అనే అందమైన ప్రదేశంలో నన్ను ఒక భవనంలోకి తీసుకెళ్ళి సోదా చేసి ప్రక్క గదిలోకి ప్రవేశపెట్టారు. ముగ్గురు అధికారులు కూర్చుని పెన్సిళ్ళతో ఏదో బొమ్మలు గీస్తూ నన్ను ప్రశ్నించారు. జర్మన్ లో నీ పేరేమిటని అడిగారు. రామచంద్రశర్మ అని చెప్పాను. నటించవద్దు. నీ పేరు ఫిషర్ అన్నారు. గత మూడు నెలలుగా నన్ను ఏకాంత వాసంలో ఉంచి ఇవన్నీ కనుక్కున్నారన్నమాట. వియన్నాలో నన్ను గురించి విచారించి, విషయాలన్నీ కనుగొన్నారు. నా సహచరుడెవరో అనుకోకుండా విషయం చెప్పివుంటాడు. గూఢచారులు తమ అసమర్థతను తిట్టుకొని, ఆరా తీశారు.
ఒకరోజు  నన్ను, శార్దూలసింగ్ ను లండన్ తీసుకు వెళ్ళి రెండు రోజుల తర్వాత పంపించారు. అనుకోకుండా మాకు లండన్ సందర్శనం జరిగింది.
ఆ తరువాత నన్ను హెమర్ కేంప్లో  నెలరోజుల పాటు నిర్భంధిం చారు. ఒకరోజు హఠాత్తుగా వదిలేశారు. ఆర్స్ బర్గ్ వరకూ వచ్చేసిన తరువాత మళ్ళీ నన్ను అరెస్టు చేశారు. రెండు వారాలు రాజకీయ ఖైదీగా అట్టిపెట్టి మూన్ స్టర్ కు పంపించారు. నేనేమంత ప్రమాదకారిని కాదని గ్రహించారు.
చివరకు  నన్ను వదిలేయగా 1947 జనవరి 27న వియన్నా చేరుకున్నాను. కుటుంబమంతా ఒకచోట సమావేశమైంది. ఇంట్లో చలి కాచుకోవడానికి తగినన్ని కటైలు కూడా లేవు. ఇంటిల్లి పాదీ ఎవరి బాధలు వారు ఏకరవు పెట్టారు.
యూనివర్శిటీకి వెళ్ళి తత్వశాస్త్రం, ఇండాలజీ అభ్యసించడానికి పేరు నమోదు చేసుకున్నాను. ఇండియన్ క్లబ్బులో పరిచితులైన వారిలో ఐదుగురికి ఉత్తరాలు రాశాను. ఇండియాలో మూడు మఠాలకు నన్ను పరిచయం చేసుకుంటూ ఉత్తరాలు రాశాను.
నేను మొదట్లో  1939లో మా మామవద్ద సంగీతం నేర్చుకున్నాను. తరువాత కుటుంబ కలహాల వలన వదిలేశాను. మళ్ళీ సంగీతంపై అభిలాష కలిగి మొదలు పెట్టాను. తాత్కాలికంగా ఇండియాపై ఆసక్తి సన్నగిల్లింది. ఆ తరువాత నేను ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను. మళ్ళీ హిందూతత్వంపై ఆసక్తి కలిగి వారిని వదిలేశాను.
1948 క్రిస్మస్కు ముందు నా వీసా దరఖాస్తును ఆమోదించినట్లు బెర్నీలోని భారతరాయబార కార్యాలయం తెలియజేసింది. క్రిస్మస్ నాడు బయలుదేరాను. ఒకటైప్ రైటర్, ఒక చిన్న కెమెరా, రెండు పుస్తకాలు, ఒక సూట్ కేసుతో  ప్రయాణం కట్టాను. రైలులో వెనిస్ కు వచ్చి జెనివాలో ఓడ ఎక్కాను. నేను యూర్ నుండి బయలుదేరేటప్పుడు దృఢ విశ్వాసంతో వున్నాను. ఒక వియన్నా వ్యక్తి సన్యాసిగా మారడం విశేషం.

కలలుగన్న భారత దర్శనం
అనుకున్న  క్షణం రానే వచ్చింది. ఎన్నాళ్ళ నుండో కలలు కన్న భారత భూభాగంపై అడుగు పెట్టాను. అది గాంధిజీని హత్య చేసిన రోజు. నెల రోజుల పాటు ఓడ ప్రయాణం చేసి 1949 జనవరి 30వ తేదీన బొంబాయికి చేరాను. కొన్ని వారాలకు ముందే నన్ను తన అతిథిగా వుండమని ఒక సంపన్న ముస్లిం ఆహ్వానించాడు. ఆయన ఇంట్లో అతిథ్యం స్వీకరిస్తే వియన్నాలో వున్నట్లు అనిపించింది. అంతే కాకుండా చాలా కాలం క్రితం మానేసిన మాంసాహారం మళ్ళీ అక్కడ స్వీకరించాను. కాని ఒక తేడా వున్నది. చక్కని ఉర్దూ నాకూ వచ్చు అనిపించాను.
మరునాడు హెద్దార్ రోడ్డులో తిరిగి ఖాకీదుస్తులు, గాంధీ టోపి కొన్నాను. హారస్ బి రోడ్డు, కొలబా మొదలైన ప్రాంతాలలో తిరుగుతూ నా మాతృదేశంలో వున్నట్లే భావించాను. నన్ను ఇండియాలో ఎలా చూస్తారో అనే భయం వుండేది. ఒకసారి న్యూ ఢిల్లీలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో నన్ను గురించి అనుకుంటున్న మాటలు విన్నాను. ఇతడు మనలాగానే మాట్లాడతాడు. అదే చాల ప్రమాదం మొత్తం మీద ఇండియాలో నాకు తటస్థపడిన వారిలో నూటికి తొంబై మంది స్నేహంగానే వున్నారు.
కాకుంటే నన్ను చూసిన వెంటనే ఆశ్చర్యపోయేవారు. కొన్ని పారిశ్రామిక నగరాలలో మాత్రం నాపై వ్యంగ్య వ్యాఖ్యానాలు వినవచ్చేవి. వారి భాష మాట్లాడటం, కాషాయ వస్త్రాలు ధరించడం ముఖ్యంగా యూనివర్శిటీలలో నాపట్ల అనుమానం కలగడానికి కారణమయ్యేది. నేను ఎప్పుడైనా సినిమాకు వెళితే నన్ను చూడగానే గౌరవంగా క్యూని పాటించకుండా టికెట్ కొనుక్కోనిచ్చేవారు. మూడు పర్యాయాలు యిలా జరిగింది. దీనికి కారణం నేను తెల్లవాడిని కావడమేనని అనుకున్నాను. కాని నోరువిప్పితే క్యూ నుంచి బయటకు నెట్టేసేవారు. అదే ఇంగ్లీషు ఫారెన్ యాసలో ఒకసారి పెద్దగా అరిస్తే అది ఎంతో బాగా పనిచేసింది. ఇండియాలో చాలా సినిమాలు పౌరాణిక ఇతి వృత్తాలతో కూడినవే. అందువల్ల సన్యాసి సినిమాకు పోకూడదనడం కేవలం రాగద్వేషాల వల్లనే.
బొంబాయిలో మూడు రోజులు గడిపాను. తరువాత శాంతా క్రజ్ కు సమీపంలో వున్న ఖార్కు స్థానిక ట్రైన్లో వెళ్ళాను. అక్కడే రామకృష్ణ ఆశ్రమం వుంది.

శ్రీరామకృష్ణ ఆశ్రమంలో
నేను యూరప్ లో వుండగానే రామకృష్ణ మిషన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. ఫలితంగా ఖార్ లోని రామకృష్ణ మిషన్ కు వెళ్ళగానే నాకోసం ఎదురు చూస్తున్న ఒక బెంగాలీ నాకు స్వాగతం పలికాడు. నన్ను లోపలికి తీసుకు వెళ్ళి కూర్చోబెట్టి మఠాధిపతి దర్శనం కోసం వేచి వుండాలన్నాడు. ఈ లోగా నాతో పిచ్చాపాటీ మాట్లాడాడు. ఎంతో కాలం నుంచి నేను వారిమధ్య వుంటున్న వాడిలాగా నాతో మాట్లాడాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. తరువాత మఠాధిపతిని కలిశాం. అతను బెంగాలీ... పొట్టిగా లావుగా, అతి సామాన్యంగా కనిపించాడు. 55 సంవత్సరాలు వుండవచ్చు. నావైపు చూసి మూడు రోజుల క్రితమే రావలసింది. ఎందుకు రాలేదన్నాడు. నేను దిగజారిపోయాను. ఓడ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం తీసుకుందని చెప్పాను. అతను తల ఊపాడు. మొదట ఇంగ్లీషులోను, తరువాత నెమ్మదిగా అంత బాగా రాని హిందీలోనూ మాట్లాడాడు. అక్కడ మూడు రోజులు మాత్రమే వుండాలని తరువాత కలకత్తా దగ్గర ఆశ్రమానికి పంపుతామని చెప్పాడు. సాయంకాలం జరిగే ఆరతి కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని మిగిలిన సమయంలో నా యిష్టం వచ్చినట్లు వుండవచ్చునని చెప్పి నన్ను పంపించేశాడు. ఇద్దరు ఆశ్రమవాసులు నాకు గది చూపెట్టారు. ఒక తెల్ల ధోవతి, తెల్ల చొక్కా యిచ్చారు. అవి బ్రహ్మచారి దుస్తులు. ఆ గదిలో మంచం మీద కూర్చొని చుట్టూ దోమతెర వేసుకుని కాసేపు ధ్యానం చేసుకున్నాను. సాయంకాలం గంటలు వినిపించగా హడావుడిగా పంచె కట్టుకుని దేవాలయం దగ్గరకి వెళ్ళాను. సుమారు 30 మంది జనం వున్నారు. ఒక సన్యాసి హార్మోనియం వాయిస్తుండగా మరొక బ్రహ్మచారి తబలా వాయిస్తున్నాడు. కొందరు సంపన్నులు ఊళ్ళో నుంచి వచ్చారు. అందులో గుజరాతీ వారు కూడా వున్నారు. సీనియర్ స్వామీజీ ప్రార్ధన చేయడం, ప్రసాదాలు పంచడం పూర్తి చేసిన తరువాత చివరకు రామకృష్ణ పరమహంస విగ్రహానికి ఆరతి ఇవ్వడంతో సాయంకాలం కార్యక్రమం ముగిసింది. ప్రార్థనలో అందరూ పాల్గొన్నారు.
మరునాడు సాయంత్రం నన్నూ, మరో ఇద్దరు బ్రహ్మచారులనూ ఒకజైన వ్యాపారుడి భార్య టీకి ఆహ్వానించింది. ఆమె పేరు సుశీల, చక్కని టీ, పకోడీలు, జిలేబీలు - ఇంకా అనేక తీపి పదార్థాలు వడ్డించింది. ఆశ్రమంలో ఒకే రకమైన ఆహారం తింటుంటాం. ఈ మార్పు బాగానే వుంది. మేము టీ త్రాగుతూ మాట్లాడుకుంటుండగా యిద్దరు అందమైన అమ్మాయిలు అక్కడికి వచ్చారు. ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు వుంటాయి. మరొక అమ్మాయి ఇంకా పిన్న వయస్కురాలు. వారు చేతులు కట్టుకుని నమ్రతతో నిలుచున్నారు. నా మాటలకు హాయిగా నవ్వారు. అందులో పెద్దమ్మాయి పేరు మాలిని. ఆమె త్వరలో ఒక జైన యువకుడిని పెళ్ళి చేసుకోబోతున్నట్లు సుశీల నాతో చెప్పింది. ఈ విధంగా మాటలు సాగుతుండగా యిద్దరు బ్రహ్మచారులలో ఒకరు ఓమ్ కేష్ జేవురు మొహంతో గుండు నిమురుకుంటూ ఆశ్రమానికి పరిగెత్తాడు. అతను అలా ఎందుకు వెళ్ళాడని సుశీల మమ్మల్ని అడిగింది. నేనూ ఏమీ చెప్పలేక పోయాను. ఆశ్రమానికి వెళ్ళి అలా హఠాత్తుగా యెందుకు వెళ్ళిపోయాడో కనుక్కుందామని గదిలో ప్రవేశించాను. రుద్రాక్షమాల క్రిందపడి వున్నది. అతడు కూర్చుని ఏడుస్తున్నాడు. నేను స్నేహపూర్వకంగా ఓదారుస్తూ కారణం అడిగాను. అతడు వెక్కివెక్కి ఏడుస్తూ ప్రేమలు, పెళ్ళిళ్ళు గొడవ నేను వినదల్చుకోలేదు. అదంతా ఎప్పుడో వదిలేశాను. ఆవిడ మళ్ళీ ఆ మాటలు మొదలు పెట్టింది. నాకు జుగుప్స కలిగింది అన్నాడు. నేను ఏమీ అనలేదు. కాని అతడు ఆశ్రమ జీవితానికి పనికిరాడని భావించాను. రెండేళ్ల తరువాత అతడు ఆశ్రమం వదిలేసి ఒక బెంగాలీ నర్సును పెళ్ళి చేసుకున్నాడు. చాలా మంది బ్రహ్మచారులకు, సన్యాసులకు అతనికి పట్టిన అదృష్టం పట్టదు. మానసిక సంయమనం లేనివారు చాలామంది ఆశ్రమాసులు చివరకు అక్కనే తేలతారు. కాషాయ వస్త్రాలను వదిలేస్తే, వారు అపఖ్యాతి పాలవుతారు.
వారాంతానికి మఠాధిపతి నన్ను కలకత్తా  వద్దనున్న రామకృష్ణ మిషన్  కు పంపారు.  బొంబాయి నుంచి మూడో తరగతి పెట్టెలో ప్రయాణం సాగించాను. ఆ అనుభవంతో తరువాత సాధ్యమైనంత వరకు మొదటి లేదా రెండవ తరగతిలో ప్రయాణం చేశాను.

అద్వైతాశ్రమంలో  నాలుగు నెలలు 
సాయంత్రానికి  మా రైలు హౌరా స్టేషన్ కు చేరింది. నేతాజీ సుభాష్ పెద్దన్నగారు శరత్ చంద్రబోస్ కుమారులిద్దరూ నా కోసం స్టేషన్ కొచ్చారు. కలకత్తాలోని ఉడ్ బర్న్ పార్క్ వద్దనున్న వారి ఇంట్లో ఆతిథ్యం. రామచంద్ర (లియోపాల్డ్ ఫిషర్)గా నేను ఒకరి ఇంట్లో అతిథిగా వుండటం అదే చివరిసారి. మరునాడు ఉదయం అద్వైతాశ్రమానికి వెళ్ళాను. స్వామి యోగేశ్వరానంద నాకు రెండేళ్ళ సీనియర్. ఆయన మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఎ చదివారు. సంస్కృతంలో, ఇంగ్లీషులో మత విజ్ఞానంలో నిపుణులు. ప్రపంచంతో సంబంధాలు తెంచుకోడానికి ఇంకా ఎన్నాళ్ళు కావాలని నన్ను అడిగాడు. మళ్ళీ బోసుగారింటికి వెళ్ళాను. శరత్ చంద్రబోస్ భార్య నా వీడ్కోలు విందుకు చాలా మందిని ఆహ్వానించింది. సనాతన హిందువులు, వృద్ధులు వచ్చారు. మూడు విధాలైన బియ్యపు వంటకాలు, నాలుగు విధాలైన చేపకూరలు, మూడు రకాల పప్పులు, అనేక మసాలా కూరలు మిఠాయిలు వడ్డించారు. ఆ రాత్రి బాగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా లేచాను. మధ్యాహ్నం వీడ్కోలులో పురుషుల కరచాలనం చేయగా, స్త్రీలు పాదాభివందనం చేశారు. యూరప సంస్కృతి నుంచి యెంతో దూరం వచ్చేశాను అనిపించింది.
రామకృష్ణ  మఠానికి వెళ్ళాను. స్వామీజీ అక్కడ ఇద్దరు బ్రహ్మచారులను, ముగ్గురు స్వాములను పరిచయం చేశారు. వారు నాకు నచ్చారు. సాయంత్రం చక్కని భోజనం చేశాను. తరువాత సత్సంగ సమావేశానికి రమ్మని స్వామీజీ చెప్పారు. రామకృష్ణ సూక్తులు చదివి వినిపించారు. అది బెంగాలీ అయినా నాకున్న సంస్కృతం, హిందీ పరిజ్ఞానం వలన కొంత అర్థం చేసుకున్నాను. వాటి ఇంగ్లీషు అనువాదాన్ని నాకిచ్చి పెద్దగా చదవమన్నారు. చదివాను. అప్పటికి ఇంకా విదేశీ దుస్తులతోనే వున్నాను. ఆ రాత్రికి ఇద్దరు బ్రహ్మచారులతో నేలమీద చాపపైన పడుకున్నాను.
ఆశ్రమంలో  పుస్తకాలు అమ్మకం పనిలో  ప్రతివారూ పాల్గొనవచ్చు. ఒకటి, రెండు సంవత్సరాలు అక్కడ పనిచేసిన తరువాత ఇతర కేంద్రాలకు పంపిస్తారు. ఒకచోట ఎవరినీ వుండనీయరు.
మూడు రోజుల్లో నేను ఆ క్రమశిక్షణకు అలవాటు పడ్డాను. రామకృష్ణ ప్రచురణ సంస్థ కలకత్తా నగరం మధ్యన ఉన్నది. ఇతర రామకృష్ణ మిషన్ కేంద్రాల నుండి రోజూ అక్కడకు వస్తూపోతూ వుంటారు. ప్రతిరోజూ సాయంత్రం రెండు గంటలపాటు నగరంలో కాలినడక చాలా విషయాలు తెలుసుకున్నాం. బ్రహ్మచారి సుధీర్ నా వెంట వచ్చేవాడు. సందులలో నేను తప్పిపోకుండా మురికి కూపాల పడి పాపం చేయకుండా నన్ను రక్షించేందుకు సుధీర్ను పంపించేవారు. అతను పొట్టిగా, సన్నగా వుండేవాడు. నేను నెమ్మదిగా నడిచేవాడిని. అతను గబగబా వెళ్ళేవాడు. కొన్నాళ్ళకు నాతో పాటు రావడం మానేశాడు. నాకు ఎలాంటి ప్రమాదమూ లేదని భావించాడేమో.
అద్వైత  ఆశ్రమంలో మొత్తం నాలుగు మాసాలున్నాను. మార్చి మాసంలోనే విపరీతంగా చమటపోసేది. అప్పటికి కొంతవరకు కొత్త దుస్తులు అలవాటుపడ్డా, ధోవతి కట్టుకోవడం బాగా అలవడలేదు. అదెప్పుడో జారిపోతుందని స్వామీజీ అంటుండేవారు. ఆయన అన్నట్లు ఒకసారి చౌరంఘీలో వెడుతుండగా ధోవతి ఊడిపోయి కాళ్ళమీద పడింది. పైన చొక్కా వుంది కనుక సరిపోయింది. వంగి ధోవతి అందుకొని నడుముకు చుట్టుకునేలోపు కొందరి దృష్టి నాపైన పడ్డది. వారు నవ్వుతూ నావైపు ఆసక్తిగా చూశారు. దగ్గరలో వున్న ఒక దర్జీ షాపులోకి వెళ్ళాను. ఒకవ్యక్తి నన్నుచూచి మహారాజ్ ఏం కావాలి అని అడిగాడు. కొంచెం చాటు ప్రదేశం కావాలన్నాను. ప్రపంచం అంతా మీదే. ఎక్కడి కావాలంటే అక్కడికి వెళ్ళండి అన్నాడు. గుట్టలుగా పడివున్న బట్టలచాటుకు వెళ్ళి ధోవతి కట్టుకున్నాను. అప్పటి నుండి ధోవతి విషయంలో చాలా జాగ్రత్తపడ్డాను.
నేను కలకత్తా  వచ్చినప్పుడే కొన్ని రోజుల  తరువాత హిమాలయాల్లోని ఆశ్రమానికి శిక్షణ నిమిత్తం పంపిస్తామని  చెప్పారు. కలకత్తాలో వున్నంత కాలం నగర జీవితం  అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడింది. హిమాలయాలకు వెడితే మళ్ళీ రావడం ఆలస్యం అవుతుంది గనుక ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను.
ఆశ్రమంలో  తరచు జరిగే కార్యక్రమాలలో  రకరకాల మిఠాయిలు పెట్టేవారు. తీపి పదార్థాలంటే నాకు ఇష్టముండేది కాదు కాని సన్యాసి స్వీట్లు బాగా తినాలట. నేను వద్దంటే నావైపు వింతగా చూసేవారు.
ఏప్రిల్ లో కలకత్తా దుర్భరంగా ఉంటుంది. అప్పుడు స్వామీజీలు కొందరు హిమాలయాలకు వెడతారు. నేను రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి మాధవానంద, అద్వైత ఆశ్రమ స్వామీజీ యోగేశ్వరానంద ప్రయాణానికి సిద్ధమైనాం. మమ్మల్ని సాగనంపడానికి ఆశ్రమవాసులు కొందరు హౌరా స్టేషన్ కు వచ్చారు. పూలమాలలతో ముంచెత్తారు. స్వామి మాధవానంద రిటైరయినవాడు, ఆయన శేషజీవితాన్ని భగవత్ ధ్యానంలో గడపదలచారు.
చంపావతికి బస్సులో మూడు గంటలు ఆలస్యంగా చేరిన మేము అక్కడ నుండి  నడక ప్రారంభించాము. నాకు ఎత్తు ప్రదేశాలెక్కడమంటే ఇష్టం లేదు. ఒక గంట నడిచిన తరువాత చికాకు కలిగింది. నా వెనుక వస్తున్న బ్రహ్మచారి, భండారిస్వామి సంభాషణ మరీ జుగుప్స కలిగించింది. వాళ్ళు కన్నడంలో మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీషులోకి పోయి, అక్కడక్కడా బెంగాలీ పదాలు వాడారు.
ఆశ్రమానికి  వెళ్ళే త్రోవలో లోహాఘట్  ఉన్నది. మేము మోహన్ లాల్ షా ఇంట్లో బస చేశాం. అతనిని షాజీ అని సంబోధించేవారు. అతను వివేకానందను చూచాడు. సేవించాడు. బ్రహ్మచారిగానే జీవితం గడిపాడు. అతని చూపును గ్రహించి సేవకులు పనులు చేసేవారు.
ఆశ్రమంలో  నాగది విశాలమైంది. శుభ్రమైంది. నాకు ఒక రగ్గు, రాసుకోడానికి బల్ల, ఒక స్టూలు, పుస్తకాలతో కూడిన ఒక అల్మారా సమకూర్చారు. రామకృష్ణ, వివేకానంద సూక్తులు, ఉపనిషత్తులు, భగవద్గీత, మఠం నియమాలతో కూడిన చిన్న పుస్తకం ఇచ్చారు. మరునాడు ఉదయం మధ్యహాలులో టీ నిమిత్తం అందరూ సమావేశమయ్యారు. స్వామీజీ నాకు ఆశ్రమం చూపెట్టారు. పుస్తకాలతో పాటు ఒక టీ టేబుల్, టైప్ రైటర్, పాత గ్రామఫోన్, డ్రై బాటరీ రెడియో ఉన్నవి. తరువాత డైనింగ్ హాలు, బయట వంటిల్లు, స్నానాల గదులు ఉన్నవి.
అద్వైత  ఆశ్రమంలో రామకృష్ణ మిషన్  ప్రచురణ కేంద్రం ఉన్నది. ఎడిటర్ కార్యాలయం ఉన్నది. ప్రబుద్ధ భారతి పత్రిక ఇక్కడ నుండే వెలువడుతుంది. ఒక పోస్టాఫీసు ఉంది. ఆస్పత్రి, విశ్రాంతి గృహం కూడా ఉన్నవి.
రాంసింగ్  అనే వ్యక్తి ఆశ్రమంలో ఆవుల సంరక్షణ చూచుకుంటాడు. పాలు పితికేటప్పుడు ఒక బ్రహ్మచారిని అతనిపై కాపలా పెట్టేవారు. అతడు పాలన్నీ పితకకుండా  వదిలేసేవాడు. స్వాములకు  పాలు సరిపోయేవి కావు. ఆశ్రమంలో కూరగాయల తోట ఉన్నది.
ఆశ్రమంలో  నా విధులేవో తెలియపరిచారు. ప్రధాన భవనంలో కొంత భాగం శుభ్ర  పర్చారు. లైబ్రరి పుస్తకాల్ని  క్రమంలో పెట్టి కేటలాగు  తయారు చేయటం, ఎడిటర్కు ప్రచురణ  కర్తకు తోడ్పడుతూ ఫ్రూఫ్లు చదవడం నా పనులు. నాలుగు నెలలు  ఆశ్రమంలో ఉండి అధ్యయనం చేస్తూ, ధ్యానం చేస్తూ గడపాలి. తరువాత కలకత్తా నుంచి బేలూరు మఠానికి  పంపించి బ్రహ్మచర్య ప్రథమ  దీక్ష ఇస్తారు. ఆ తరువాత మళ్ళీ ఇక్కడకు వచ్చి  నాలుగైదేళ్ళు ఉండిన అనంతరం బేలూరు మఠంలో పూర్తి సన్యాసత్వాన్ని ఇస్తారు.
స్వామి  యోగేశ్వరానంద ఆ సాయంకాలం నన్ను తన ఎదురుగా కూర్చోబెట్టి ఇలా అన్నారు. మీరు రోజూ రెండు  పర్యాయాలు ధ్యానం చేయాలి. అధ్యనం చేయాలి. ఠాకూర్ (రామకృష్ణ) పేర ఇచ్చిన పనిచేయాలి. ఏ  పనైనా సరిగా చేయకపోతే మందలింపు తప్పదు, ధ్యానం, అధ్యయనం, మీ స్వవిషయాలు. మోక్షానికి చదువు  అక్కరలేదు. రామకృష్ణ నిరక్షరుడు. ఋషికి చదువు అవసరం లేదు అని చెప్పారు.
ప్రధాన  స్వామీజీ చాలా వృద్ధులు. అంత  ఆరోగ్య వంతులూ కారు.
దీక్షకు ముందు నేను నేర్చిన ధ్యానం ఒక విధమైన సాదన అయింది. మంత్రం గురువు ఉపదేశించాలి.
అప్పట్లో  వివేకానంద సంపూర్ణ రచనలలో 8వ సంపుటి సిద్ధమవు తున్నది. ఇందులో అప్పటివరకు ప్రచురించని లేఖలు ప్రధానంగా ఉన్నవి.
లండన్లో రామకృష్ణ మఠాన్నినిర్వహిస్తూ స్వామి వివేకానంద వేదాంతంలో  కమ్యూనిజాన్ని, గతితార్కిక భౌతికవాదాన్ని చూశాడు. కాని, ఆయన భాష్యాన్ని రామకృష్ణ మిషన్ వారు అంగీకరించలేదు.
నేను ఆశ్రమంలో ప్రవేశించిన తరువాత 8 మాసాలు పాటు ఉదయమే భగవద్గీత చదివి  వినిపించేవారు.
గీత ద్వితీయాధ్యాయంలో ఇలా వున్నది. జన్మతః వచ్చిన చర్యలను తృణీకరించవద్దు అవి చెడ్డవైనా సరే పాటించు. ఇతరుల పనులు చేయడం కంటే ఇదే మంచిది అంటే పుట్టుకతో  నీవు కొన్ని పనులు చేయడానికి  అర్హుడవు. ఇతర పనులకు అనర్హుడవు  అని అర్థం. ఇది మతపరంగా  పచ్చి కులవాదం. ఈ భాగాన్ని స్వామి యోగేశ్వరానంద గబగబా  చదివేవారు. నేను అభ్యంతర  పెట్టాను.
ఆయన సమాధానం  చెపుతూ మత పవిత్రతను, ఆధ్యాత్మికతను  అర్థం చేసుకోలేని సమాజంలో  పుట్టి పెరిగిన నీకు ఇవి  అర్థం కావు అన్నాడు.
ఒకే ఆలోచనను  రాజకీయ నియంత చెప్పినప్పుడు  తృణీకరించి అదే మాటలను మత పెద్ద చెబితే అంగీకరించాలా? అని అడిగాను. నీకు తగినంత అంతర దృష్టి లేదు. సున్నిత మర్మాలను నీవు అర్థం చేసుకోలేవు. నీకా దృష్టి ఉంటే ఈ సందేహాలు రావు అన్నాడు.
ఆశ్రమంలో  భోజనం తొంభై శాతం శాఖాహారమే. బెంగాలీ సన్యాసులు చేపలు, గుడ్లు తింటారు. వాటిని శాఖాహారంగానే  పరిగణిస్తారు. సాయంత్రం 5-00 గంటలకు టీ ఇస్తారు. సాయంత్రం 7-00 గంటలకు ఒక గంటసేపు ధ్యానంలో నిమగ్నులవుతారు. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం ముగించి, అందరూ హాలులో చేరి రామకృష్ణ సూక్తులను, వివేకానంద ప్రసంగాలను, బ్రహ్మానంద సూచనలు చదువుతారు.
రామకృష్ణ  మిషన్లో ఎక్కువగా బెంగాలీలు, దక్షిణాదివారు వుండేవారు.
కలికృష్ణ  మహారాజ్ స్వామి విరాజానంద  రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు. ఆయన పండితుడు, భక్తుడు, దయామయుడు, ఆయన ఆరోగ్యం సరిగా లేదు. పొట్టిగా వుంటాడు. నిడువైన  గడ్డం. మొదటిరోజు నేను ఆయనను  చూడలేదు. ఆయన వద్దకు తీసుకువెళ్ళాడు.
దీక్ష ఇచ్చేముందు రాత్రి పగలూ కూడా ప్రార్థనలతో, ధ్యానంతో గడపాలి. దీక్షనాడు  ఉపవాసం వుండాలి. ఆరోగ్యం  సరిగా వుంటే గురువు కూడా అలాగే పాటించాలి. నాకు దీక్ష  ఇచ్చే సమయానికి ఆశ్రమ కార్యదర్శి వచ్చి మీకు హిందీలో దీక్ష  ఇస్తారని చెప్పాడు. విరాజానంద  మాతృభాష బెంగాలి. అతడి ఇంగ్లీషు చక్కగా వుంటుంది. అంతరు ముందు  చాలా మందికి ఇంగ్లీషులోనే దీక్ష ఇచ్చాడు. ముహూర్తానికి నన్ను స్వామీజీ గదిలోకి  పిలిచి నాచేతిలో ఫలాలతో కూడిన  పళ్ళెం ఉంచారు. దీక్ష అనంతరం నేను సమర్పించిన దక్షిణ అది. చిరకాలంగా ఎదురుచూస్తున్న సమయం అసన్నమైన నేనంతగా ఉప్పొంగిపోలేదు.
నన్ను గదిలోకి  పిలిచి మంత్ర బోధన చేశాడు. ఇది ఆకర్షణీయమైన చర్య. ఆ తరువాత ధ్యానంలో మంత్రం ఎలా జపించాలో, మనస్సును ఎలా  మలచుకోవాలో, ఆసనాలు ఎలా వేయాలో చెప్పారు. ఒకే వస్తువుపై  మనస్సును లగ్నం చేయడం, క్రమేణా  మిగిలిన వాటన్నింటినీ మనస్సు నుంచి తొలగించడం జరగాలి.

ఆశ్రమానికి ఉద్వాసన
బెంగాల్లో దుర్గాపూజా సందర్భంగా స్నేహితులకు, బంధువులకు ఉత్తరాలు రాడం సంప్రదాయం. అలా రెండేళ్ళు  రాశాను. ఈసారి కలకత్తాలో  ఉన్న స్వామి యోగేశ్వరానందకు సుదీర్ఘమైన ఉత్తరం రాశాను. ఆయన కలకత్తా వెళ్ళేటప్పుడు  నన్ను పిలిచి ఇలా చెప్పారు.
రామచంద్రా, ఠాకుర్ను (రామకృష్ణ) ప్రార్థించు. ఆయన నామం జపించు, ఠాకుర్ను స్మరించు అదే నీవు చేయగలిగిన  ఉత్తమ చర్య.
వీడ్కోలు  మాటలు నాలో మారుమ్రోగుతున్నాయి. రామకృష్ణ మఠాన్ని స్థాపించిన మూలపురుషుడిని గురించి  నా అభిప్రాయాలు వెల్లడిస్తూ  ఆయన మన మధ్య నివసించిన  గొప్ప వ్యక్తి అని, ఆధ్యాత్మిక అభ్యాసానికి గొప్ప అధ్యాపకుడని  అన్నాను.
రెండు వారాల  తరువాత నాకు ఒక కబురందించారు. దానిపై శ్రీరామచంద్ర లియోఫోల్ట్ ఫిషర్ అని వున్నది. అంటే నన్ను ఆశ్రమం నుంచి తొలగించినట్లుగా  భావించాను. లేకుంటే బ్రహ్మచారి రామచంద్ర అని రాసేవారు. యోగేశ్వరానంద లేఖలో నీవు క్రమశిక్షణకు కట్టుబడిలేవని కొన్నేళ్ళుగా గమనించాను. నీవు మిషన్ నియమాలను అధిగమించావు.
యోగేశ్వరానంద  ఉత్తరం వచ్చిన రెండు వారాలకు  నా సామాన్లు సద్దుకున్నాను. ఆశ్రమ కుర్రవాడు సామాన్ల  మూట పట్టుకున్నాడు. ఆశ్రమంలో స్వాములందరి నుంచి వీడ్కోలు సాష్టాంగ నమస్కారం ద్వారా చెప్పాను.
తనక్ పూర్ నుంచి లోహఘట్ వరకూ బస్సు  ఉన్నది. అందువలన కొన్ని మైళ్ళు మాత్రమే నడవాల్సి వచ్చింది. నా హిమాలయ జీవితానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పాను. రెండేళ్ళ క్రితం కంటే ఇప్పుడు నేను కోపాన్ని జయించాను. ఇంకా పరీక్షలకు  నిలవాల్సి వుంది. ఏమైనా  హిమాలయాలలో ధ్యానం నేర్పినవారు  భిన్నంగా వుంటారు.
రామకృష్ణ  మిషన్ ఒక ఆధునిక హిందూశాఖ. ఇందులో సన్యాసులు, బ్రహ్మచారులు ఉంటారు. మొత్తం 138 కేంద్రాలను స్థాపించారు. అందులో 86 ఇండియాలో ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికాలలో 20 కేంద్రాల వరకు ఉన్నవి. పారిస్ లో ఒకటి, లండన్లో మరొకటి స్థాఫించారు. లండన్ లో రెండవ కేంద్రం  ఉండేది కాని అక్కడ స్వామీజీ వేదాంతం. కమ్యూనిజం ఒకటేనని  హఠాత్తుగా కనుగొన్నాడు. ఆయనతో మిషన్ వారు అంగీకరించలేదు. అమెరికాలో ఒక డజను కేంద్రాలున్నవి.
గత శతాబ్దం  చివరలో బెంగాలీ పేద గ్రామీణ  పురోహితుని కొడుకు సన్యసత్వ మనస్తత్వం గల యువ బ్రాహ్మణుడు  ఉండేవాడు. కలకత్తాకు సమీపంలో  ఒక కొత్త దేవాలయానికి అతడు పురోహితుడు అయ్యాడు. ఆ దేవాలయంలో  దక్షిణేశ్వరుడు, బెంగాలీలు  భక్తి ప్రవత్తులు చూపే కాళీ విగ్రహాలున్నవి. విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉన్నది. ఇండియాలోని దేవాలయాలన్నిటిలో మూల విగ్రహంతో  పాటు ఇతర దైవాలను కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఈ యువకుని  పేరు గదాధర్ చటోపాధ్యాయ (రామకృష్ణుడు) కాళీని దర్శించాడు. ఆమెతో  మాట్లాడాడు. నృత్యం చేశాడు. ఆయన దృష్టిలో కాళి ఒక సజీవమూర్తి. ఆయన ఏకోపాసన గాక అన్ని  మత విధానాలు పాటించాడు. ఆయన ఏకోపాసన గాక అన్ని మత విధానాలు పాటించాడు. ధ్యానం చేస్తే పంచవంటి వృక్షం క్రింద సీత ప్రత్యక్షమై అతడిలో ప్రవేశించింది. శివుడిని చూశాడు. అతడిలో లీనమయ్యాడు. రాధాకృష్ణులను తిలకించి వారితో తాదాత్మ్యం చెందాడు. మహమ్మదు ప్రవక్త అతడికి ప్రత్యక్షమై అతనితో సంభాషించగా, అల్లాను దైవంగా గుర్తించాడు. క్రీస్తును ధ్యానించగా క్రీస్తు ప్రత్యక్షమై క్రైస్తవ సత్యాన్ని చూపాడు. తోతాపురి అనే సన్యాసి రామకృష్ణుడికి అద్వైత బ్రహ్మదీక్ష ఇచ్చాడు. మరొక బ్రాహ్మణయోగిని రామకృష్ణుడిని తాంత్రిక విద్యలో ప్రవేశపెట్టి స్ర్తీ పురుష సంగమ క్రతువులు నేర్పింది.
కలకత్తాలో ఈ యువపురోహితుడి ఖ్యాతి వ్యాపించింది. కొందరు నవ్వారు. కొందరు వెక్కిరించారు. కొందరు చూచి తలవూపి వచ్చేశారు. అప్పట్లో కలకత్తా బ్రిటీషు ఇండియాకు రాజధాని. పండితుడు, కవి, సంస్కర్త అయిన దేవేంద్రనాథ్ టాగూర్ ఇతడిని సందర్శించాడు. నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్  టాగూర్ తండ్రిగారాయన.
ఒకనాడు  విద్యార్థిగా ఉన్న నరేన్  ఇతడి వద్దకు వచ్చాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి  వచ్చిన నరేన్ సంశయవాదినని  అనుకునేవాడు. ఒక పవిత్ర వ్యక్తిని  చూసి ఆనందిద్దామని వచ్చాడు. ఒకాడు రామకృష్ణుడు తన పాదాలను  నరేన్ ఛాతిపై పెట్టాడు. నరేన్  క్రిందపడిపోయి మోహనిద్రావస్థలోకి  పోయాడు. తరువాత నరేన్ చదువుకు  స్వస్తి చెప్పి కుటుంబాన్నీ  వదిలేసి ప్రథమ శిష్యుడిగా రామకృష్ణుడి వద్ద నిర్విరామకృషి  చేస్తూ ఉండిపోయాడు. అతడే ఉత్తరోత్తరా  స్వామి వివేకానందంగా యూరోప్, అమెరికాలలో హిందూ మతానికి  ప్రథమ ప్రచారకుడయ్యాడు.
నేను యూరోప్ లో ఉండగా రామకృష్ణుని ఒక ఋషిగా, వివేకానందుని గురువుగా భావించాను. రామకృష్ణ మిషన్  పాఠశాలలను, కళాశాలలను స్థాపించి  ఆసుప్రతులను నిర్వహిస్తున్నారు. వరదలు, కరువు కాటకాలలో ఆదుకుంటారు. బాధ్యత గల పౌరులవలె చురుగ్గా పనిచేస్తారు. ఈ మఠాలలోని సన్యాసులు విద్యావంతులు ఇంగ్లీషు వచ్చినవారు. రామకృష్ణ మఠాలు పరిశ్రుభంగా ఉంటాయి. సమర్థవంతంగా క్రమశిక్షణతో నడుస్తాయి. కాషాయ వస్త్రాన్ని  అడ్డం పెట్టుకుని సుఖభోగాలను అనుభవించడానికి కామకేళిలో  మునిగితేలి ఉండటం భారతదేశంలో సన్యాసులు చాల మంది సిద్ధహస్తులైనప్పటికీ, రామకృష్ణ మిషన్ లో సన్యాసులు  మాత్రం అలాంటి పనులు చేయలేదు.
పాశ్చాత్య ప్రభావం వలన, ముఖ్యంగా క్రైస్తవ మత ప్రభావం వలన స్వామి వివేకానంద, భారతీయ సన్యసత్వానికి  ప్రశాంతంగా ఉండటం ప్రధాన లక్షణం అయినప్పటికి, వివేకానందుడు, ఆయన అనుచరులు చాలా చురుకుగా పనిచేశారు. భగవద్గీతలో కృష్ణుడు కార్యదీక్షకై అర్జునుడిని పురికొల్పిన ఉదంతాన్ని వీరు చూపుతారు.
వివేకానందుడు  తన గురువు రామకృష్ణుని సిద్ధాంతానికి  పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని వివేకానందుడు గాని, ఆయన శిష్యులు గాని ఒప్పుకోరు.
రామకృష్ణ  మిషన్ సన్యాసులు. వారి అనుచరులు పండితులు కాక పోయినా, బాగా చదువుకున్న వారే. అన్ని మతాలు  చివరికి బోధించేది ఒకటేనని. మానవ సేవే మాధవ సేవని వీరు నమ్ముతారు.
రామకృష్ణ  సిద్ధాంతంలో శుద్ధ పాండిత్యం  వల్ల ప్రయోజనం లేదు. దానికి తోడు పవిత్రత, ధ్యానసాధన  ఉండాలి. రామకృష్ణుడి దృష్టిలో పవిత్రంగా ధ్యానం చేయగలిగినవారు  బహు అరుదు. చాలామంది ధ్యానానికి అర్హులు కారు.
రామకృష్ణ  ఆశ్రమంలో బ్రహ్మచారులుంటారు. ఇందులో 80 సంవత్సరాల బ్రహ్మచారులు ఉన్నారు. బ్రహ్మచారి అంటే బ్రహ్మలో కదలడం అని అర్థం. వేదోక్తంగా నిర్వచనం చూస్తే బ్రహ్మపై మనస్సు లగ్నం చేసినవాడే  బ్రహ్మచారి కాడు. కృష్ణుడు 16 వేల భార్యలను ఏక సమయంలో అనుభవించేవాడట. అయినా ఆయన  బ్రహ్మచారి. నేడు అర్థం మారిపోయి లైంగిక సంపర్కం లేని వాడే బ్రహ్మచారి అని చెపుతున్నారు. క్రమేణా ఈ అర్థం వాడుకలో  రూఢి అయి నిలిచింది.
లోగడ సనాతన  మఠాలలో బ్రహ్మచారికి అర్ధాహారాన్నిచ్చి  సుఖశాంతులకి దూరంగా ఉంచేవారు. దీనికి భిన్నంగా రామకృష్ణ ఆశ్రమంలో వివేకానందుడి పద్ధతి ప్రకారం బ్రహ్మచారిని చాలా గౌరవంగా చూస్తారు. శుభ్రమైన దుస్తులు, మంచి ఆహారం, సుఖంగా నిద్రించడానికి అనువైన పరిస్థితిని  కలిగిస్తారు. తర్వాత ఒక్కొక్క సౌకర్యాన్ని ఉపసంహరిస్తారు. సన్యాసులు స్వచ్ఛందంగానే  ఈ సౌకర్యాలను వదులుకుంటూ పోతారు. ఈ విధంగా రామకృష్ణ మఠాలలో సన్యాసులు నియమ నిబంధనలతో  కఠోర జీవితాన్ని గడుపుతుండగా, బ్రహ్మచారులు చక్కని రుచికరమైన  ఆహారాన్ని స్వీకరిస్తూ, విలాస జీవితాన్ని గడుపుతారు.
సన్యాసులలో  చొక్కాలు వేసుకునేది రామకృష్ణ మిషన్లో మాత్రమే చూస్తాం. బేలూరు మఠంలో రామకృష్ణుడి  విగ్రహాన్ని పూజిస్తారు. ఇండియాలో ప్రతి పవిత్ర వ్యక్తిని  కనీసం కొందరైనా అవతారంగా భావిస్తారు. అలాగే పరమహంసను కూడా, బేలూరు మఠంలో పేద  హిందువులు, మధ్య తరగతి వారు చేరుతుంటారు. కాని ఈ రెండు  వర్గాలవారు ఎలాంటి సంబంధం ఉండదు. ఒక మ్యూజియంను సందర్శించినట్లే  పేదవారు దేవాలయాన్ని సందర్శిస్తారు.
రామకృష్ణ  మిషన్లో బ్రహ్మచారులకు  నేర్పే యోగవిద్య రెండువేల సంవత్సరాల క్రితం పతంజలి చెప్పినదే. ఈ మిషన్లో ధ్యానం చేస్తున్నారా లేదా, ఎవరు ఎంతసేపు  చేస్తున్నారు అనే విషయాలను పట్టించుకోరు. అద్వైత ఆశ్రమంలో ఎక్కువసేపు ధ్యానం చేసే వారిని గౌరవిస్తారు. రామకృష్ణ మిషన్  లో కర్మయోగాన్ని పాటిస్తూ, ఠాకుర్ పనిని (అంటే రామకృష్ణ సేన) చేస్తున్నామని తృప్తి పడతారు.

గీతకు అటూ ఇటూ
రామకృష్ణ  మఠాలలో ప్రాతఃకాల సమావేశాలలో భగవద్గీత నుండి కొన్ని భాగాలను  చదివి వినిపిస్తారు. గీతను  అనువదించి బహుళ ప్రచారం  తెచ్చి పెట్టారు. అందువలన  గీత వ్యాఖ్య చిలవలు పలవలైంది. అసలు గీత కలగాపులగం. పైగా పరస్పర విరుద్ధ విషయాలు  అనేకం వుండటం వలన దీనికి అంతటి ఖ్యాతి వచ్చింది. ఒకవైపు హింసావాదాన్ని, మరొకవైపు సన్యసత్వాన్ని  గీత బోదిస్తుంది. ఏకేశ్వరోపాసనను బోధిస్తూనే మరోవైపు అద్వైతాన్ని  ఉపదేశిస్తుంది. గీతలోని  ఈ ద్వంద్వ వైఖరిని వివరించడానికి  శంకరాచార్యుడు ప్రయత్నించాడు. కాని సఫలం కాలేదు. గీతాచార్యుడు ఈ విషయాన్ని వివరించడంలో  ముందు సాధారణంగా ప్రారంభించి  క్రమేణా ఉన్నత విషయాలు  ప్రస్తావించాడు. నీవు యుద్ధరంగంలో  చనిపోతే వీర స్వర్గాన్ని  అలంకరిస్తావు. బ్రతికితే  ప్రపంచాన్ని పరిపాలిస్తావు. కనుక పోరాడు అని గీతలో  వున్న మాటలను సామాన్యుడికి ఉద్దేశించినవైతే, అనుకూలమయినప్పుడల్లా  అవే పవిత్ర ప్రవచనాలుగా  ఎందుకు బోధిస్తారో అర్థం  కాదు. వాస్తవానికి భగవద్గీత ప్రమాణ గ్రంథం కాదు. హిందూ  పునరుజ్జీవనంలో ఇది ప్రాముఖ్యతను సంతరించుకున్నది. రాజకీయ వాదులు, ఋషులు, తత్వవేత్తలు, సెక్యులర్  బోధకులు గీతను అనువదిస్తూ భాష్యం చెబుతూ తమ ఇష్టం వచ్చిన రీతిలో అన్వయించుకుంటూ పోయారు. నేటి రాజకీయవాదులు గీతలోని  కర్మయోగాన్ని స్వీకరించి, మిగిలిన వాటిని త్రోసివేస్తారు. కొందరు యోగ విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇంకొందరు భక్తికి ప్రాధాన్యత ఇస్తారు. ఏమైనా భగవద్గీత సాహిత్య దృష్టిలో ఒక గొప్ప  గ్రంథం చక్కని శ్లోకాలలో  మహా భారతంలో ఒక భాగంగా గీతరచన సాగింది.

నా కాశీ ప్రయాణం 
రామకృష్ణ  మిషను నుండి బయటపడి పంజాబ్ మెయిల్లో 7 గంటలు ప్రయాణం  చేసి కాశీ చేరుకున్నాను.  నేను ఇప్పుడు స్వేచ్ఛాజీవిని. నాకు రామకృష్ణ మఠాలు తప్ప బయటి ప్రపంచంతో పరియచం లేదు.  కాశీలో అస్పిఘాట్ వద్ద ఒక ధర్మశాలలో నా మూట పెట్టి నదిలో స్నానం చేశాను. ఈలోగా విశ్వనాధుడికి పూజచేసి, ఆర్ఘ్యపాద్యాలు అర్పించడానికి కమండలం కొందామనుకుంటుండగా ఒక 50 సంవత్సరాల పొడవుపాటి వ్యక్తి వచ్చి మహారాజ్ మీ కమండలం ఇదిగో అని ఇచ్చాడు. చాలా అందంగా ఉంది. దాన్ని చూస్తూ ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెబుదామను కుంటుండగా అతడు వెళ్ళిపోయాడు. విశ్వనాథుడి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళాను.
నాకు ఇప్పుడు  సన్యసత్వానిచ్చే ఒక సన్యాసి  కావాలి. చౌపత్తి దేవాలయం  వద్ద దశవామిలో కాషాయ వస్ర్తాలతో సాధువులు కనిపించగా ప్రణాయం  చేసి వారిని సమీపించాను. సాదరంగా  నన్ను కూర్చోమన్నారు. నా కథ వినిపించాను. మౌనంగా విన్నారు. వారిలో ఒక వృద్ధుడు నెమ్మదిగా  ఇలా అన్నాడు. నీ కృషి శ్లాఘనీయమైనది. మా జీవితంలో ఇలాంటి సన్నివేశం  చూడలేదు. నెలలో ఐదు వందలు  సంపాదిస్తూ జర్మనీలో చక్కని కుటుంబంతో కారులో, షికారులో పయనిస్తూ వుండాల్సింది. అయినా  సాధు జీవితాన్ని కోరుకున్నావు. కాని సన్యాసిని కావడానికి  వీలులేదు. బ్రాహ్మణులు మాత్రమే  అందుకు అర్హులని నీకు తెలుసనుకుంటాను అన్నారు స్వామి సుమేధానంద. అయితే, శూద్రుడైన వివేకానందుడు సన్యాసి కాలేదా? అని అడిగాను.
నిజమే కాని సంస్కారాలున్న వ్యక్తికి  సన్యాసం సులభం. కాని నీవు విదేశాల నుండి వచ్చావు. దశవామిలో ఎవరూ నీకు సన్యాసం  ఇవ్వరు. ఇచ్చినా మేము నిన్ను సన్యాసిగా అంగీకరించం అన్నారు  సుమేధానంద. వారికి నమస్కరించి వెళ్ళిపోయాను.
తరువాత  రెండు రోజుల పాటు మూడు డజన్ల మఠాలలో వందకు పైగా సాధువులను కలుసుకున్నాను. పుట్టుక దోషం వలన నేను సన్యాసిని కావడానికి వీలులేదని, సనాతన బ్రాహ్మణులు చెప్పారు. నీకు ఎక్కడి నుండి వచ్చినా  సరే విష్ణువు దేవాది దేవుడని  వేదాల సారాంశాన్ని కబీరు  చెప్పాడని నీవు అతన్ని గురువుగా స్వీకరిస్తే, తమలో చేర్చుకుంటామని అన్నారు. ఇలాంటి వారితో నాకు మాయావటిలో రెండేళ్ళ అనుభవం వుంది. మరికొందరు నన్ను  వేచి వుండమని తమ పద్ధతులను  చూచి తట్టుకోగలవసుకుంటే  కాలక్రమేణా చేర్చుకుంటా  మన్నారు. అవన్నీ నాకిష్టం లేకపోయాయి. ఊరికే ఉండదలచ లేదు. హరిద్వార్, ఋషీకేష్ లో లాంఛన ప్రాయంగా కొంత డబ్బిస్తే సన్యాసిగా దీక్ష ఇస్తారని తెలిసింది. వేలాది మంది ఈ విధంగా సన్యాసం పుచ్చుకొని కాషాయ వస్ర్తాలు వేసుకున్నారు. మరి కొందరు స్వతంత్ర సాధువులు స్వయంగా కాషాయ వస్త్రాలు వేసుకొని ఏదో పేరు పెట్టుకొని స్థిరపడటమో లేక సంచారమో చేశారు. సన్యాసి కాక పూర్వం ఏమిటో సాధారణంగా అడగరు. సాధువులలో వందలాది మంది పండితులున్నారు. వేలాది మంది పామరులూ వున్నారు. సన్యాసులకు గుర్తింపు పత్రం ఏదీ లేదు.
ధర్మశాలలో నిద్రపోవాలని ప్రయత్నించాను. అంతలో హరిశ్చంద్ర ఘాట్ వద్ద కొందరు జనం గుమిగూడి ఒక స్వామీజీ ప్రసంగాన్ని వింటున్నారు. అతడు మాయను గురించి ఉపన్యసిస్తున్నాడు, నేనూ వెళ్ళాను. అది వెన్నెల  రాత్రి, అందరూ వెళ్ళిన  తరువాత ఆయన నన్ను చూచి అయితే ఈ జనంతో పాటు నువ్వూ చేరావన్న మాట అన్నారు. గత రెండు రోజులుగా నా అనుభవాలు చెప్పాను. ఆసక్తికరంగా విన్నాడు. నేను హరిద్వార్  వెళ్ళి సన్యాసం  పుచ్చుకుందామనుకుంటున్నాను  అన్నాను. ఆయన రుద్రాక్షమాల త్రిప్పుతూ మౌనంగా వుండమని  నాకు సంజ్ఞ చేసి, చాలా సేపు అలాగే ఉండిపోయారు. తరువాత ఆయన అన్నారు. ఒకవ్యక్తి  త్యజిస్తే, అతడు విముక్తి పొందాలి  అని ఉపనిషత్తులో ఉన్నది. ఇది బ్రాహ్మణులకే పరిమితం  కాదు. కనుక నీకు దీక్ష ఇస్తాను  అలాంటి వాక్యాలను మాయావటిలోని  సన్యాసులు కూడా తరచు ఉదహరిస్తుండే వారు. ఆశ్రమాలు సన్యాసానికి  రావాలని వీరు సనాతనులకు  సమాధానం చెప్పేవారు. ఏమైనా  నేను అమితానందం చెందాను  వినయంగా కృతజ్ఞతలు చెప్పాను. ముకుళిత హస్తాలతో కూర్చున్నాను. ఫాడ్యమినాడు నీకు సన్యాసం  ఇస్తాను. ఇంకొక వారం రోజులు నీవు వేచి వుండాలి. రేపు భిక్ష  ఇస్తాను. దక్షిణ తీసుకురా. నా పేరు విశ్వానంద భారతి. హనుమాన్ ఘాట్ దగ్గర మద్రాసు  స్వామీజీ అని అడిగితే చాలు అన్నారాయన.
ఒకడజను  అరటి పళ్ళు, కొబ్బరికాయ, కొన్ని బత్తాయిపండ్లు సేకరించాను. ధ్యానం చేసి విశ్వనాథ దేవాలయంలో  పూజచేసి మరునాడు ఉదయం ఉపవాసం వున్నాను. ఘాట్ వద్దకు రాగానే మద్రాసు సాధువు కొరకా అంటూ ఒకతను నా దగ్గరకు వచ్చాడు. అవునన్నాను. స్వామిని అతిథిగా  ఆహ్వానించిన కాశీ కుటుంబవాసి కుమారుడతను. వారు 300 ఏళ్ళనాడు పశ్చిమ భారతం నుండి వచ్చి  స్థిరపడ్డారు. స్వామి విశ్వానంద  దక్షిణాది నుండి వచ్చారు. ఆయన ఇంకొక వారానికి పెళ్ళి కానుండగా 18 ఏళ్ళపుడు సన్యాసం  స్వీకరించాడు, దశమి ఆశ్రమంలో అధ్యయనం చేసి 7 సంవత్సరాలు గంగోత్రిలో ధ్యానం చేశాడు. నాలుగు పూర్ణ కుంభాలలో ఆయన  స్నానం చేశాడు. అనేక పర్యాయాలు  భారతదేశం పర్యటించాడు. హిందీ, కన్నడం, తమిళం, సంస్కృతం అయనకు  కొట్టినపిండి. తమిళ, సంస్కృతంలో చక్కని సిద్ధాంత చర్చలు, భక్తిగీతాలు  వ్రాశాడు. ఇంగ్లీషు చదవగలరు. కాని మట్లాడలేదు. నేను హనుమాన్  ఘాట్లో ఆయన గదిలో ప్రవేశించి సాష్టాంగ ప్రమాణం చేశాను. ఆయన చదువుతున్న పత్రిక పక్కనబెట్టి, కళ్ళజోడు తీసి తన ప్రక్కన  కూర్చోమన్నాడు. దక్షిణ తెచ్చావా అని అడిగాడు. చీకటిపడే సమయాన దీక్ష ఇస్తాను. తరువాత విశ్రాంతి తీసుకో. రాత్రి 12 గంటలకు మణికర్ణికలో సన్యాసం స్వీకరించు.

సన్యాసం అంటే...
మధ్యాహ్నం ఒంటిగంట నుండి రాత్రి ఏడున్నర  వరకు సన్యాసిగా బాధ్యతలేమిటో ఎలా జీవించాలో ఆయన చెప్పారు. నేను మాయావటిలో ఉండగా లైంగిక విషయాలతో బాధపడ్డాను. నా ఆలోచనలు  పసిగట్టినట్లుగా ఆయన అన్నారు. నీవు యవ్వనంలో ఉండగా నీకు లైంగిక బాధలు ఉండకపోవచ్చు. 45-60 సంవత్సరాల మధ్య శరీరం తిరుగుబాటు చేస్తుంది. మనస్సు భయాందోళనకు గురౌతుంది. అప్పుడు లైంగికంగా అసలు కష్టాలు ప్రారంభమౌతాయి. ఇప్పుడు నీకు చేస్తున్నది త్యాగమే అయితే యిది అసాధ్యం కాదు. మధ్యలో ఎప్పుడైనా నీవు పతనమైనా మనస్సును వికలం చెందనీయకు. మళ్ళీ తపస్సు ప్రారంభించు. నా దృష్టిలో పతనం కాని సన్యాసంటూ లేడు. అలా పడుతూ లేస్తూ ఉండాలి తప్పదు. వీటి మధ్య గిరిగీసి చూడటం అజ్ఞానం. మనం సాధువులం... న్యాయవాదులం కాదు అని బోధించారు.
సన్యాసం స్వీకరించిన తరువాత కాశీలో ఉండి భిక్ష స్వీకరించవచ్చు లేదా ఇతర సాధువులవలె తీర్థయాత్రలు చేయవచ్చు అని చెప్పారు. నీవు గ్రామాలలో పర్యటించేటప్పుడు ఏ చెట్టుకిందో కూర్చొని ఆహారం స్వీకరించు, ఆ గ్రామస్తులకు దర్మం బోధించు. వారెన్నడూ  వినవి విషయాలు వినిపిస్తే అంతకంటే కావలసినదేముంది, మనం చేసేది గొప్పపని మనకు ప్రజలు ఆహారాన్ని ఇవ్వకపోతే  మనం వ్యక్తులుగా, వ్యవస్థగా  ఉండలేకపోవచ్చు. ఈ దేశంలో కాషాయవస్ర్తాలు అదృశ్యమయ్యే  రోజు రావచ్చు. అది చాలా మందికి ఆనందంగా ఉంటుంది. మనం వీటిని పట్టించుకోకూడదు. ఎవరి దారిన  వారుపోవాలి అని విశ్వానంద  భారతి చెప్పారు.
సన్యాసిగా యెలాంటి మర్యాదలు పాటించాల్సింది ఆయన చెపుతూంటే నేను రాసుకోబోయాను. కాని, ఆయన వారించారు. పరిస్థితిని  బట్టి అవన్నీ జ్ఞాపకానికి  వస్తాయని ప్రశాంతత అవసరమైనప్పటికీ, ఒక్కోసారి ఆగ్రహం చూపవలసి  వస్తుందని ఖచ్చితమైన నిబంధనలంటూ లేవని చెప్పారు. అప్పటికి సాయంకాలం ఆరయింది. స్వామి విశ్వానంద  మళ్ళీ చెప్పారు. అర్థరాత్రి నిన్ను పూర్తి సన్యాసిని  చేస్తాను. చాలామంది నిన్ను సన్యాసిగా గుర్తించకపోవచ్చు. సనాతనులు నిన్ను గుర్తించకపోవచ్చు. నీవు ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకుంటే నేడు గుర్తించని వారు రేపు గుర్తించవచ్చు. నీవు ఆది బ్రహ్మ అవతారమైనా నీకు గుర్తింపురాదు. ఇదంతా బాధాకరంగా  వున్నా నీవు పట్టించుకోరాదు. సంపద, సంతానం, సాంఘిక బహిష్కారం, సాంఘిక ఆమోదం ఇత్యాది అన్నిటిని వదలుకోవడమే సన్యాసి మార్గం. అవి పాటించనంతకాలం నీవు సన్యాసివే వెళ్ళి నిద్రపో, బ్రహ్మచారిగా ఇదే నీ ఆఖరి నిద్ర రేపటికి నీవు సన్యాసివౌతావు.
ఇంకో పావుగంటకు  అర్థరాత్రి అవుతుందనగా లేచాను. స్నానం చేసి, లంగోటి ధరించి, లోహఘాట్లో కొన్ని దుస్తులు ఒక సేవకుడికి ఇచ్చి నా వెంట రమ్మన్నాను. కాశీ సందు గొందులలో వేగంగా నడుచుకుంటూ పోతే మణికర్ణికఘాట్ కు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మణికుండలం  వద్ద ఒక క్షణం ఆగాను. గంగానది  ఒడ్డుకు 15 గజాల దూరాన ఉన్న ఆ బావిలో శివుడి కర్ణకుండలాలు పడిపోయాయట. ఇక్కడ చనిపోవడం పవిత్రమని హిందువులు భావిస్తారు. రాత్రింబగళ్ళు ఇక్కడ శవాలు  తగలబడుతూ ఉంటాయి.
అక్కడ చాలా మంది బ్రహ్మచారులు, సన్యాసులు  ఉన్నారు. ఆనాడు అరడజను మంది బ్రహ్మచారులు సన్యాసం స్వీకరించనున్నారు. హరిద్వార్ నుండి వచ్చిన స్వామి జగదీశ్వరానంద నలుగురికి  సన్యాసం ఇప్పించబోతున్నారు. నాతో ఈ విషయాలు చెప్పిన  సన్యాసిని ఉద్దేశించి విశ్వానందజీ  ఎవరికైనా సన్యాసం ఇస్తారని తెలుసా? అన్నాడు. ఒక మ్లేచ్చుడికి సన్యాసం ఇవ్వబోతున్నారట. అదెలా సాధ్యం? అయినా మద్రాసు సాధువు గొప్ప జ్ఞాని. ఆయనకు అన్నీ తెలుసు అన్నాడాయన. ఇంతలో ఒక పొడవాటి స్వామి వచ్చి నీకోసం ఆచార్య చూస్తున్నారు. త్వరగా రమ్మన్నాడు. ఆయన దుర్గ గుడి వద్ద విశ్రమించి ఉన్నారు. నన్ను చూసి ఇంకా అర్థగంట వ్యవధి ఉన్నది. ముందే వచ్చావు వెళ్ళి దేవుని పూజించు. ఇదే తగిన సమయం అన్నారు. మణికర్ణిలో నేను దేవుని పూజించి లేచే సరికి ప్రవేశద్వారం వద్ద నున్న విశ్వానందను చూసి పాదచారులు నమస్కరించి పక్కకు తప్పుకొన్నారు. బహుశా వారికి ముందే విషయం తెలుసనుకుంటాను. రానురాను శ్మశానంలో సన్యసత్వం స్వీకరించే పద్దతి తగ్గిపోతున్నది. సన్యసత్వాన్ని స్వీకరించడంలో కొందరు శ్మశానాన్ని కోరుకోగా, మరి కొందరు చక్కని గృహాన్ని లేదా దేవాలయాన్ని కోరుతుంటారు. మణికర్ణిక అందుబాటులో ఉండగా నేను మాత్రం సన్యసత్వం ఇక్కడే ఇస్తాను. నీకేది కావాలో కోరుకోమన్నారు. నేను శ్మశానాన్నే కోరుకున్నాను. నన్ను ఆశీనుణ్ణి చేసి స్వామి విశ్వానంద నా ఎదుట కూర్చుని వామహస్తంతో ఆచమనం చేశారు. సన్యాస దీక్ష సమయంలో అలా వేయాలట. 23 స్వాహాలు చదివి అందుకు ఉపకరించిన పరికరాలన్నీ విరాజి హోమంలో పడేశారు. చివరగా నా పిలకను కత్తిరించి దానిలో పడేశారు. తరువాత నన్ను మరో చితి వద్దకు తీసుకెళ్ళారు. అదింకా నిప్పంటించని చితి దాని మీద నన్ను పడుకోమన్నారు. నా దేహాన్ని ఏడు చోట్ల తాకి లాంచనప్రాయంగా చితినంటించారు. నేను సంకేతపూర్వకంగా దహనం కావించబడ్డాను. ఆ సందర్భంగా నేను లేచి చనిపోయిన వారినుద్దేశించి చదివే మంత్రాలు చదివాను. నా దేహం సజీవంగా ఉన్నప్పటికీ నేను చనిపోయాను. సన్యాసి నేను అంటే తన శరీరం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని కాదు. నేను అంటే బ్రహ్మతో తాదాత్మ్యం చెందటం. సామాన్యుడుకూడా బ్రహ్మే. ప్రాణులన్నీ బ్రహ్మే. కాని సన్యాసికి తాను బ్రహ్మని తెలుసు. నేను బ్రహ్మచారి దుస్తులను వదిలేసి గంగానదివైపు నడిచాను. బ్రహ్మచారులు స్నానానికి వచ్చేటప్పుడు ఇతరులు వైదొలుగుతారు. నేను గంగలో మునిగి వచ్చిన తరువాత స్వామి విశ్వానంద నాకు కాషాయ వస్ర్తాలు ఇచ్చారు. నేను వెంటనే ధరించాను. ఆగేహానంద భారతికి విజయోస్తు అని నన్ను దీవించి నా కొత్త నామధేయాన్ని నిర్ణయించారు. నాకిచ్చిన దండను గంగా నదిలోకి విసిరేసి పరమహంసలకు నియమాలుండవని అన్నాను.
తొలి భిక్ష  ఎవరినుండి స్వీకరిస్తావో  నిర్ణయించుకోమని విశ్వానంద  చెప్పారు. మేము ఘాట్ నుండి  వచ్చేవరకి అరిటాకులలో మంచి ఆహారాన్ని పెట్టుకొని ఒక డజను మంది స్ర్తీ పురుషులు ఎదురు చూస్తున్నారు. వారు నా పాదాలు స్పృశించి తమ ఆహారం  స్వీకరించమని కోరారు. సన్యాసి  ప్రథమ పర్యాయం ఎవరి ఆహారం  స్వీకరిస్తాడో వారికి చాలా గౌరవమనీ, ఈ విషయంలో నీవెవరికైనా  మాటిచ్చావా? అని విశ్వానంద అడిగారు. ఆయన ఇంగ్లీషులో అడిగిన దానికి నేను ఇంగ్లీషులోనే సమాధానం చెప్పాను, అయితే నీవు మాటిచ్చిన వారి ఆహారమే స్వీకరించమన్నారు. నన్ను ఆహ్వానించిన వ్యక్తి అనేక పదార్థాలు సిద్ధం చేసి నా పాదాల చెంత ఉంచాడు. నేను కూర్చుని భుజించాను. ఈ శవానికి అప్పటికే చాలా ఆకలిగానూ, దప్పికగానూ ఉన్నది. తరువాత శవం వలె నిద్రపోయాను. లేచేసరికి విశ్వానంద వక్క నములుతూ మాపక్కనే కూర్చున్నారు. ఆగేహానంద మహారాజ్, స్నానం చేసి రండి మాట్లాడుకుందాం అన్నారు. తిరిగి వచ్చేసరికి లడ్లు, జిలేబిలు, టీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడేం చేస్తావు ఆగేహానంద అని అడిగారు. ఏం చేయమంటారు? అని అడిగాను. విశ్వానంద చెపుతూ, ఏడు పవిత్ర స్థలాలకు తీర్థయాత్రలు చేయవచ్చు లేదా భారత దర్శనానికై పర్యటించవచ్చు. కాని ఒక వారం పాటు ఉండి ధ్యానం చేయి అన్నాడు. నేను దేశపర్యటన చేస్తానని చెప్పి ఆయన ఆజ్ఞాపించినట్లుగా తరువాత ఏడు రోజుల పాటు అన్నపూర్ణ గుడివద్ద కూర్చుని ధ్యానం చేస్తూ రాత్రిళ్లు మణికర్ణిక ఘాట్ లోని స్మశాన మైదానంలో ధ్యానం చేశాను. ఒకవారం తరువాత స్వామి విశ్వానంద భారతి దగ్గరికి వెళ్ళి ఏదారిన వెళ్లమంటారని అడిగాను. ఆయన భుజాలెగరవేసి ఇలా అన్నారు. నేను సన్యాసి నైనప్పుడు హరిద్వార్లో ఉన్నాను. మైసూర్ లోని శారదా పీఠం వరకూ నడిచివెళ్ళి నరసింహ భారతికి ప్రణామం చేశాను. ఆయన దర్శనార్థం 1500 మైళ్లు నడిచి వచ్చానంటే ఆయన ఆ విషయాన్ని గుర్తించినట్లే లేదు. కనుక నీ ఇష్టం, ఎక్కడికైనా పో అన్నారు.
శృంగేరీ పీఠాధిపతి వద్దకు వెళ్దామనుకున్నాను. విశ్వానంద చెపుతూ నీ తెల్ల  శరీరం దేనికైనా పనికివస్తుందేమో  కాని గుర్తింపుకు మాత్రం అది ఆటంకం. అందువలన గుర్తింపుకు  ప్రయత్నించవద్దు అన్నాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాను. స్వామీజీ ద్వారం చెంతనే నాపాదుకలను వదిలేసి బయలుదేరాను. మొదట్లో  కొంత శ్రమనిపించినా మూడు వారాలకు మడమలు బాగా గట్టిపడ్డాయి. గంగా మాతకు తర్పణాలర్పించి, విశ్వనాథుణ్ణి పూజించి, ప్రసాదం స్వీకరించి బయలుదేరాను.

సన్యాసి దేశాటనం 
కాశీని  చుట్టి, దక్షిణాదికి బయలుదేరాను. కాని నాకు మార్గం తెలియదు. నాగపూర్ శివార్లలో తిరుగుతూ హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించబోతున్నట్లు తెలుసుకున్నాను. తరువాత జాగ్రత్తపడి  కొన్ని గ్రామాల మీదుగా తిరుపతి  వైపుకు పయనించాను. పెద్ద  నగరాలలో ప్రముఖదైవ మందిరాలుంటే  తప్ప సాధువు నగరాలను తాకకూడదంటారు.  సాదువు తమ దర్శనార్ధం వచ్చిన గ్రామస్థులను వెళ్ళిపొమ్మనరాదు. నేను కునికిపాట్లు పడుతున్నప్పుడు కొందరు ముకుళిత హస్తాలతో ధ్యానం చేస్తున్నట్లు కూర్చుంటారు. గ్రామాలలో చెట్ల క్రింద, దేవాలయ ప్రాంగణాలలో నన్ను  చాలామంది వెక్కిరించారు. అయినప్పటికి  గ్రామాలలో 90 శాతం ప్రజలు సాధువులకు  అనుకూలంగానే ఉన్నారు. 5 శాతం మంది సంప్రదాయ కారణాలుగా  సాధువులను వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన వారు సెక్యులర్  కారణాలుగా వ్యతిరేకిస్తున్నారు. సాధువుల వద్దకు ముందుగా  స్ర్తీలు వస్తారు. వారు పిల్లలతో సహా పురుషులందరూ వెళ్లిపోయిందాకా  ఉండి తరువాత తమ సందేహాలకు  సాధువులకు వ్యక్తం చేస్తారు. అన్ని రకాల ప్రశ్నలు వస్తుంటాయి. కొన్ని పర్యాయాలు కలహాలను  కూడా తీర్చ మంటుంటారు. నేను అనేక పర్యాయాలు రోడ్డుపై కూర్చుని అనుభవాలను నన్ను  దర్శించుకోడానికి వచ్చినవారు చెప్పిన విషయాలను రాసు కున్నాను. వాటన్నిటినీ ప్రచురిద్దామనుకుని మళ్ళీ తమాయించు కున్నాను. వ్యక్తిగత విషయాలు నాతో చెప్పుకున్నప్పుడు వాటన్నిటినీ  బయటపెట్టడం మంచిదికాదని  భావించాను.

భారత స్త్రీల లైంగిక సమస్య
ఒక గ్రామంలో ఒక స్ర్తీ నాతో సందేహాలు తీర్చుకోడానికి ఇలా అడిగింది. నాకు ఏడుగురు  సంతానం. గత పదేళ్ళుగా నా భర్తతో కాపురం చేస్తున్నాను. మన కవులు  చెప్పే ఆనందం గాని, మనపాటలలో వినిపించే విషయాలుగాని  నాకు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. ఆమె చెప్పదల్చుకున్న దేమనగా భార్యగా పిల్లలను కన్నానే తప్ప లైంగికంగా నాకు తృప్తిలేదు అని మాత్రమే.
నేను తొమ్మిది మాసాలు కాలి నడకన దేశమంతా  తిరిగాను. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వింధ్య ప్రాంతాలు, హైదరాబాదు. కూర్గ్ లలో గ్రామీణ స్త్రీలు ఇంచుమించు తమ లైంగిక అసంతృప్తిని  మాటలలో నాకు వెల్లడించారు. ఢిల్లీ, కలకత్తా, పాట్నా, ట్రివేండ్రంలో  ఉన్న వంశాలకు చెందిన స్ర్తీలు ఇలానే చెప్పటం నాకు తెలుసు. భారతీయ పురుషులు గొప్ప ప్రేమికులనే  గొప్పలు చెప్పుకోవడం తప్ప భార్యల నుండి ఇలాంటి ఫిర్యాదులున్నాయని  వారికి తెలియదు. ఈ విషయాలను వారికి చెప్పేవారు లేరు. గ్రామాలలో  నేను పురుషులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఈ విషయాలను సూచన ప్రాయంగా చెప్పాను. వారి ముఖాలలో రాగద్వేషాలున్నవి. తరచు స్త్రీలతో సంపర్కం  ఉన్నప్పుడు స్త్రీలకు అసంతృప్తి  ఉంటుందని పురుషులు భావించరు. ఒకవేళ తెలిసినా పట్టించుకోరు. లైంగిక సంబంధం ఒకవిధి అని, అది పురుషుడికి అనందాన్నిస్తే  చాలని అనుకుంటారు.
గ్రామాలలో ఆహారం, దైనందిన చర్యలు, లైంగిక విషయాలు, మత పరంగా జరిగిపోతుంటాయి. మొత్తం మీద గ్రామాలలో హిందువులు  దయామయులు. ప్రేమపాత్రులు. నేను వారితో విభేదించినా, కఠినంగా  మాట్లాడేవారు కాదు. ఆగ్రహం కూడా సన్యాసులపట్ల వ్యక్తమయ్యేదికాదు. అతిథి గౌరవం గ్రామాలలో  గొప్పగా ఉండేది.

మానసికంగా దేవి దర్శనం
నేను 1500 మైళ్లు పర్యటించాను. నా ధ్యాన దృషిని మరల్చలేదు. నాకు ఈ విషయంలో  ఏకాగ్రత ఉన్నది. నాగపూర్  కు దక్షిణంగా 50 మైళ్ళ దూరంలో దారితప్పి గ్రామస్తులను మార్గం అడిగాను. తరువాత 11 మైళ్ళు నడిచి ఒకచోట రోడ్డుకు 50 గజాల దూరంలో ఒక గుడిని చూశాను. సాధువుకు త్రోవలో ఎక్కడ  దేవాలయం కనిపించినా తన భక్తి  ప్రవత్తులు వెల్లడించాలి. నేను చూసింది 14వ శతాబ్దం  నాటి గుడి. అందులో విఠల్ విగ్రహం  ఉన్నది. ద్వారప్రవేశంలో సాలగ్రామం  ఉన్నది. లోనికి ప్రవేశిస్తే  దేవి విగ్రహం కనిపించిది. పూలమాలాలంకృతమైన ఆ దేవి విగ్రహం చుట్టూ పూజాద్రవ్యాలతో, సువాసనలతో ఆకర్షణీయంగా  ఉన్నది.  చుట్టూ ఎవరూ కనిపించలేదు. విగ్రహం ముందు ప్రణామం  చేసి కొంచెం సేపు పూజించి  బయట ఒక స్థంభంపై ఉన్న పూలమాలను దేవి మెడలో వేసి నిశ్శబ్దంగా  కాసేపు కూర్చున్నాను. అప్పటికి మధ్యాహ్నం కావస్తున్నది. కుంకుమ తీసుకుని నొసటికి  అద్దుకుని మరోసారి ప్రణామం  చేసి బయలుదేరాను. రెండు మైల్ళు వెళ్ళేసరికి గుడిసెలలో బీడీలు తాగుతూ కొందరు రైతులు కనిపించారు. అలసిపోయిన నన్ను విశ్రాంతి తీసుకోమని మజ్జిగ ఇచ్చారు. దేవిగుడి గురించి అడిగి పూజ ఎవరు చేస్తారని ప్రశ్నించాను. వారంతా ఏమీ ఎరుగనట్టు ముఖం పెట్టారు. అందులో 50 సంవత్సరాల వయస్సుగల ఒక వ్యక్తి మహారాజ్ ఇక్కడకి 50 మైళ్ల చుట్టుపట్ల దేవి గుడి  ఏదీ లేదు. మేము విఠలుడిని పూజిస్తాం. కొందరు శివపూజ చేస్తారు. నేను కలవరపడి చూసిన విషయాన్ని చెప్పాను. అతడు మళ్ళీ ఇక్కడకు 6 మైళ్ల దూరంలో మార్తాండుడి గుడి వున్నది. కాని మాతాతల కాలం నుండి అక్కడ పూజా పునస్కారాలు లేవు. అక్కడ ఏవో శక్తులున్నాయని ఎవరూ వెళ్ళరు అన్నాడు. నేను ఆశ్చర్యంతోనూ, ఆగ్రహంతోనూ మరోసారి అక్కడకు వెళ్లానుకున్నాడు. నాతోపాటు రమ్మంటే ఎవరూ రాలేదు గాని, దయ్యాలంటే, భూతాలంటే భయంలేని కుర్రవాడనిచ్చి పంపించారు.
ఈ సంఘటనకు  కారణాలు ఉత్తరోత్రా ఆలోచించాను. కొన్ని వారాలుగా నేను దేవిని గురించి ఆలోచిస్తూ సౌందర్యలహరి  గానం చేస్తూ ఉన్నాను. నా మనస్సంతా దానిపై లగ్నమైనందున అది  ఏదోక విధంగా వ్యక్తం కావాలి. ఈ విధంగా జరిగిందని మానసిక వివరణ చెప్పుకోవచ్చు. దీనినే హిందువులు దర్శనం అంటారు. నా పర్యటనలో సన్యాసిగా మనోపరిశోధనా  రీతులలో జరిగిన ఒక సంఘటన  ఇది.

బళ్ళారిలో చాతుర్మాస్య  దీక్ష
నేను బళ్ళారిలో  చాతుర్మాస్య దీక్ష ప్రారంభించాను. ఒక స్మార్త బ్రాహ్మణుడు  నాకు ఆతిథ్యం ఇచ్చాడు. ప్రతిరోజూ  సాయంత్రం సమావేశాలు జరిగేవి. పొద్దుబోయే వరకూ సాగేవి. మధ్య తరగతి వారితో నాకు సన్నిహిత పరిచయం కలిగింది. కాలేజి విద్యార్థులు సంస్కృతీ పరులైన స్త్రీలు ఆ సమావేశంలో పాల్గొని చర్చను ఆసక్తికరం చేసేవారు. మూడు మాసాలు లోపే వర్షాలు తగ్గినందున చాతుర్మాస్యం అన్ని ముగించుకుని, మైసూరులోని శృంగేరి పీఠానికి వెళ్ళాను. దేవాలయం వద్ద కొలనులో  స్నానం చేసి శారద పూజ చేసి, జగద్గురువు శంకరాచార్య చంద్రశేఖర  భారతి దర్శనార్ధం వెళ్ళాను. అక్కడ ఒక స్వామి నన్ను  సాదరంగా అతిథి గృహంలో ఉంచారు. మరునాడు స్వామీజీ వద్దకు రమ్మన్నారు. అలాగే వెళ్ళాను. కాని శంకరాచార్యుల వారు నన్ను  చూడరని చెప్పారు. నేను కారణం  అడగలేదు. ఆయన తపోదీక్షలో ఉన్నందున తరచు ఎవరినీ కలవడం  లేదని చెప్పారు. ఆరోగ్య దృష్ట్యా ఆయన ఏదో ఉన్మాద స్థితిలో ఉన్నట్లు కొందరు చెప్పారు. తరువాత కొద్ది సంవత్సరాలకే  తుంగభద్రలో స్నానం చేసిన  అనంతరం ఆయన చనిపోయారు. కాని నన్ను చూడడానికి నిరాకరించడంలో విశ్వానంద ఊహించిన కారణమే కావచ్చు. నా గురించి ఆయనకు ముందే తెలియజేశాను. నేను సన్యాసిని అని ఆయన గుర్తించలేదు. ఒక సాధారణ వ్యక్తిగానూ చూడలేరు.
విచారంగా  శృంగేరీ వదిలి తొమ్మిది మాసాల పాదయాత్ర అనంతరం మొదటిసారిగా  బస్సెక్కాను. షిమోగా, హసన్ల  మీదుగా బేలూరు, హళబీల్లో, హోయనల  శిల్పాలను చూడడానికి వెళ్ళాను. అక్కడ కామశిల్పాలు విరివిగా, అందంగా ఉన్నవి. వీటిని హిందూ  పునర్వికాసకారులు అసహ్యించుకుంటారు. హిందూ సంప్రదాయంలో అంతర్భాగంగా  వీటిని నేను అభినందించాను. ఇవి అనేక సాంస్కృతిక సమస్యలకు పరిష్కారాలిస్తాయి.
బెంగుళూరులో రైల్వే స్టేషను నుండి పోతుండగా ఒక తమిళుడు వచ్చి నన్ను  అతిథిగా ఉండి, తన గృహాన్ని పావనం చేయమన్నాడు. ఆహారం  కేవలం శాకపాకాలతో  ఉన్నప్పటికి  చాలా రుచిగా ఉన్నాయి. వియన్నా  కాఫీ నాకు గుర్తుకు వచ్చింది. దక్షిణాదిలో కాఫీ చాలా బాగుంటుంది. హాలు మధ్యలో సోఫా మీద నేను ఆసీనుడిని కాగా ఇంటి యజమాని, స్నేహితులు, వారి భార్యలు  వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇంగ్లీషులో ఒక అర్థగంట  మాట్లాడిన తరువాత చర్చ హుందాగా, హాస్యపూరితంగా హైందవ సంస్కృతీ విలువలతో సాగింది. ఇది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. పాదయాత్రలో ఇలాంటివి తక్కువ నా రాకను ముందుగానే ప్రకటిస్తారు. గనుక కొన్ని ప్రశ్నలతో వచ్చేవారు. తరువాత ఎక్కడికి వెళతారని నన్ను అడిగారు. చెప్పాను. ఎలా వెళతారని అడిగాడు. ఏమో  తెలియదన్నాను. టికెట్ కొనే అవకాశాన్ని తనకు కల్పించమని అడిగాడు. మొదటి తరగతి టికెట్ కొని ఇచ్చారు. అది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మద్రాసు మీదుగా ఇటార్పి., కాశీ చేరుకున్నాను. చూడడానికి కావలసినన్ని  దృశ్యాలు, సావకాశంగా ఆలోచించడానికి  కావలసినంత కాలం లభించింది. ప్రపంచం దుఖఃమయం కనుక నేను సన్యాసిని కాలేను. ఆనందమయం  కనుకనే సన్యాసినయ్యాను.

సన్యాసి దినచర్య
సన్యాసి దేవాలయంలో, ధర్మశాలలో, బ్రాహ్మణ గృహంలో, చెట్టుకింద రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. సూర్యాస్తమయం కాకముందే నిద్రలేవాలి. నదిలోనో, చెరువులోనో లేక సమీపాన ఉన్న జలాశయంలో స్నానం చేయాలి. తరువాత వాటి తీరాన లేదా దేవాలయంలో  కూర్చుని ధ్యానం చేయాలి. గ్రామస్తులు  లేచి దినకృత్యాలు ప్రారంభించకముందే సాధువు తన మూట ముల్లె సర్దుకుని  బయలుదేరాలి. నా అనుభవం రోజుకు పది మైళ్ళకు మించి సాధువు ప్రయాణం చేయడు. ఉదయాన వాతావరణం చల్లగా హాయిగా వుంటుంది. యేకాంతంగా ప్రకృతి సౌందర్యం అనుభవిస్తూ నడవడానికి బాగుంటుంది. గ్రామాలలో ఉదయం 8 గంటల ప్రాంతంలో వంట పూర్తవుతుంది. అప్పటికి సాధువు బయలుదేరిన ప్రాంతం నుండి కొత్త గ్రామానికి చేరుకోవాలి. వండిన పదార్ధాలు సాధువు స్వీకరించకూడదు. భిక్ష స్వీకరించటంలో యేదైనా ఒక ఇంటిని నిర్ణయించుకోవచ్చు లేదా ఇచ్చేవారి నుండి ఒక్కొక్క రొట్టెను, ఒక ముద్ద అన్నం మాత్రమే స్వీకరించాలి. సన్యాసి గ్రామ శివార్లలోకి రాగానే బిగ్గరగా ఓం నమో నారాయణ అని ఉచ్ఛరించాలి. ఆ పిలుపు వింటారు. సర్వ సాధారణంగా స్త్రీలు లేదా పురుషులు తొంగి చూచి ఆహారం స్వీకరిస్తారా అని అడుగుతారు.
కాషాయవస్త్రం  ధరించేవారి ప్రవృత్తి ఎలాంటిదో తెలుసుకోకుండానే భక్తి  వల్లనో, భయం వల్లనో ఆహారం  ఇస్తారని ఒక విమర్శ ఉంది. సాధువులు తినడానికే వస్తారని భావిస్తారు. సన్యాసికి భిక్ష యివ్వకపోతే శపిస్తాడని గ్రామస్తులు  భయపడతారు. కాని అది నిజం కాదు. భయం కంటే భక్తితోనే భిక్ష  ఇస్తారు. పేదవారు సైతం తమ కుటుంబ సభ్యులకు తినడానికి  ఉందోలేదో గమనించకుండానే  సాధువుకు పెడతారు. సాధువు మాత్రమే  భారతదేశ గ్రామాలలో మానవత  గల వ్యక్తి విలువలను చాటి చెప్పగలడు.
గ్రామస్తులు ఏది వండుకుంటే అదే సాధువుకు పెడతారు. కాలాన్ని బట్టి  రుతువులను బట్టి ఇది  మారుతుంటుంది. ఉత్తరప్రదేశ్ నుండి మైసూర్ వరకు విభిన్న  వంటకాలను తిని ఆరగించుకోవాలంటే  సాధువులకు చాలా శక్తి కావాలి. ఉత్తరాదిలో సాధారణంగా సాధువుకు రొట్ట, పప్పు ఇస్తారు. దక్షిణాదిలో  అన్నం, పప్పు పెడతారు. మాంసాహారాన్ని  సాధువుకు పెట్టరు. దక్షిణాదిలో  ఉల్లిపాయలను కూడా మసాల దినుసుగా భావిస్తారు. ఉల్లిపాయలకు  బదులు సనాతనులు కొందరు ఇంగువ  వాడతారు. దీని వాసన దుర్భరం. సాధువు తనతో పాటు ఒక పళ్ళాన్నీ, నీటి పాత్రను తీసుకు వెళ్ళాలి. ఇత్తడితో గాని, కొబ్బరి చిప్పలతో గాని ఈ పాత్రలు తయారు  చేస్తారు. రొట్టెలను ఆహారాన్ని  బట్టలో భుజించే వరకు వేడిగా ఉండేటట్లు చూచుకుంటారు. సన్యాసి ఆహారం స్వీకరించి కృతజ్ఞతలు చెప్పడు. తమకు ఆహారం పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు సన్యాసికే  కృతజ్ఞతలు చెప్పడు. తమకు ఆహారం పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు సన్యాసికే  కృతజ్ఞతలు తెలుపుతారు ప్రజలు. ఒక రోజు ఆ గ్రామంలో వుండి  వేదాంత బోధ చేస్తానని సన్యాసి  సూచిస్తాడు. సన్యాసి గ్రామం వచ్చినట్లు అరగంటలో గ్రామమంతా  ప్రాకిపోతుంది.
సన్యాసి ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగానే భుజించాలి. తరువాత ఒక గంట  సేపు పవిత్ర గ్రంథ పఠనం చేయాలి. అప్పటికి గ్రామస్తులు చేరి ప్రణామం చేసి వింటూ కూర్చుంటారు. ఆ తరువాత సన్యాసి సంభాషణ ప్రారంభించి సందేహాలు అడగమంటాడు. మధ్యలో ఒక గంట విశ్రమించి తరువాత ప్రశ్నల సమావేశం  కొనసాగిస్తాడు. సాధువు విశ్రమించడానికి  రహస్య ప్రదేశం ఉండదు.
కేరళ, ఆంధ్ర, పంజాబు రాష్ర్టాలలో సన్యాసులకు ఆదరణ తక్కువ. బీహార్, రాజస్తాన్, అంత వ్యతిరేకత లేదు. కేరళలో ఆంధ్రలో సెక్యులర్ విద్య  ఎక్కువగా ఉండటం వలన ఈ  వ్యతిరేక ధోరణి ప్రబలింది. గ్రామాలలో మధ్యాహ్నం రెండు  నుండి నాలుగు వరకూ పొలాల  నుండి పురుషులు తిరిగి వస్తుంటారు. వారికంటే ముందుగానే స్త్రీలు, సాధువు దగ్గరికి చేరుకుంటారు. ఒకవైపు పురుషులు, మరొకవైపు స్త్రీలు కూర్చుని వింటారు. పిల్లలు మాత్రం ఇష్టంవచ్చినట్లు  తిరుగుతుంటారు.
సర్వ సాధారణంగా  గ్రామ పెద్ద లేదా బ్రాహ్మణుడు  ఏదో ఒక ప్రశ్న వేస్తాడు. ఈ  ప్రపంచంలో బ్రతుకుతూ మతవిధులను  నిర్వర్తించడం ఎట్లా? గృహస్తు భగవంతుడిని పూజించడంలో ఏ మార్గాన్ని అనుసరించాలి? పుట్టుక పునర్జన్మ బాధలు అనే బంధాల నుండి తప్పించుకొనే మార్గం యేమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. సమాధానాలు కూడా ఇంచుమించు ఒకే రీతిగ ఉంటాయి. దైవం మీద మనస్సును లగ్నం చేసి, ధ్యానం చేయండి. ఎవరికి తగినట్లుగా వారు చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థించుకోవచ్చు. ఎవరి విధులు వారు చేస్తూనే సమయం ఆసన్నమయ్యే వరకు యోగాభ్యాసాన్ని చేస్తూ, ఆథ్యాత్మిక జీవితానికి దారి తీయవచ్చు. ఇలాంటి సమాధానాలు చెప్పడంలో సాధువులు తమ ప్రతిభను, చమత్కారాన్ని ఉపయోగించి కథలుగా చెపుతుంటారు. అంతవరకు ఫరవాలేదు కాని, కొందరు వ్యక్తిగతమైన ప్రశ్నలు వేస్తారు. అప్పుడే చిక్కు యేర్పడుతుంది. గ్రామస్థులు సమస్యలను సాధువు ముందు పెట్టి పరిష్కరించమంటారు. తరువాత ప్రపంచ సమస్యలు కూడా అడుగుతారు. జర్మనులు వేదాలను తస్కరించి, అందులో పేర్కొన్న ఆయుధాలు తయారు చేసిన మాట నిజమేనా? లంక నుండి సీతను తీసుకు రావడానికి రాముడు ఉపయోగించిన పుష్పక విమానం రష్యాలో ఉన్నదా?.
తమ పిల్లలు  మాట వినడం లేదని, లేదా పిల్లలు  పుట్టడం లేదని ఇలాంటి సమస్యలెన్నో  పెడతారు. సాధువు దైవజ్ఞుడు  కనుక, భూమి తగాదాలతో సహా దేనినైనా పరిష్కరించగలడని అనుకుంటారు. కొందరు సాధువులు ఇలాంటి వాటిని పెడచెవిని పెడతారు.
సాధువుకు  కొద్దో, గొప్పో వైద్యం వచ్చి  ఉండాలి. కొందరు సాధువులు ఆయుర్వేధంలో  సిద్ధహస్తులు, అనుభవరీత్యా  ఈ సాధువులు చిన్న చిన్న  రోగాలను నయం చేస్తుంటారు.

ఢిల్లీలో ప్రపంచ సాధు సమావేశం
కాశీ నుండి  ఢిల్లీ వెళ్ళాను. బిర్లా దేవాలయం  ప్రాంగణంలో అందమైన అతిథి  గృహం ఉన్నది. అందులో పక్షం  రోజులకు మించి ఉండనివ్వరు. నేను ఒక నెల రోజుల పాటు ఉన్నాను. నీవు ఆధ్యాపకుడిగా యెందుకు పనిచేయవని కొందరు అడిగారు. ఒకరోజు బస్సెక్కి  న్యూఢిల్లీ విశ్వ విద్యాలయానికి  వెళ్ళాను. డీన్ డాక్టర్ రామ్ బిహారి దగ్గరకు వెళ్ళాను. పది నిమిషాలు మాట్లాడిన  తరువాత విషయాలన్నీ తేల్చాను. నా ఇష్టం వచ్చిన విషయాన్ని  బోధించమన్నారు. సన్యాసిగా  నాకు జీతం ఉండదు కాని, భోజనం  వసతులు ఉచితం.
1981 ఏప్రిల్లో  ఢిల్లీలో ప్రపంచ సాధు  సమావేశం జరిగింది. సాధువులను  దర్శించి, పూజించడానికి, వారి  పాదాలు స్పృశించడానికి  తండోపతండాలుగా భక్తులు  వచ్చారు. ఢిల్లీ ఇసుకవేస్తే  రాలనట్లు జనంతో నిండిపోయింది.
నర్సింగ బాబా అనే నాగా నాయకుడు  దిగంబరంగా వచ్చాడు. సన్యాసులలో నాగాలు వీరత్వం కలవారు. సాధువులను  రక్షించడం వీరి ధర్మం. ఈ  నాగా సాధువులు అద్వైతులు. వీరు తమ మఠాలలో నగ్నంగా వుంటారు. బయట తిరిగేటప్పుడు కౌపీనం ఒక్కటే ధరిస్తారు. దేహమంతా  బూడిద పూసుకుంటారు. త్రిశూలం ధరిస్తారు. నేను ప్రప్రథమంగా  నాగాను కలుసుకున్నాను. నాగా సాధువులు హిమాలయ మంచులోనూ, ఎడారుల్లోనూ ఒకే రకంగా  ఉండగలరు.
నర్సింగబాబా కొందరు నగ్న సాధువులతో సమావేశానికి  వచ్చారు.
ఆయనకు నన్ను  పరిచయం చేసినప్పుడు నమఃశివాయ అని ప్రణామం చేశాను.
సాధువులు  కలిసినప్పుడు ఎలా ప్రణామం  చేసుకుంటారో తెలియదా? అన్నారు.
ఓం నమో  నారాయణ అంటారు. కాని నారాయణ పదం ఒక శాఖకు చెందినదిగా మీకభ్యంతరం కాదా అన్నారు.
నర్సింగ బాబా సమాధానం ఇస్తూ, సాధువుల  ప్రయోగంలో నారాయణ వైష్ణవులకు చెందినది కాదని, కాబట్టి  నారాయణ పదప్రయోగంలో తప్పులేదని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను.
నర్సింగ బాబా యూనివర్సిటి లో సైకాలజీ  చదివారు.
సాధువుల సమావేశం చివరి రోజున  గాంధీ మైదానం నుండి చాందినీ  చౌక్, ఎర్రకోట, కాశ్మీర్ గేటు మీదుగా సాధువులంతా ఊరేగింపుగా నడిచారు. మధ్యాహ్నం 2 గంటలకు నేను ముందు నడుస్తుండగా 20,000 మంది సాధువుల ఊరేగింపు ప్రారంభమైంది. రెండు లక్షల  ప్రజలు వచ్చి చేరారు. ఇళ్ళకప్పు  లెక్కి చెట్ల మీద నుండి  మమ్మల్ని చూశారు. నాలుగు గంటల సేపు రెండు మైళ్ళ ఊరేగింపు సాగడానికి పట్టింది. త్రోవలో  చాలా చోట్ల సాధువుల పాదాలను  ప్రజలు స్పృశించారు. ఊరేగింపు పూర్తయ్యే సరికి చీకటి  పడింది. వేద మంత్రాలు పఠిస్తుండగా  ప్రసాదాలు పంచిపెట్టారు. లక్ష్యమంది ప్రజలకు ప్రసాదాల పంపిణి జరిగింది.

హరిద్వార్ లో
విద్యా  సంవత్సరం ముగిసింది. ఢిల్లీలో ఎండలు దుర్భరంగా ఉన్నాయి. రైలులో హరిద్వార్ కు బయలుదేరాం. అది కూడా చాలా వేడి ప్రదేశం. హిందువులకు కాశీ ఎలాగో పంజాబ్ వారికి హరిద్వార్ అలాగ. ఇక్కడ  గంగలో బ్రహ్మకుండం ఉన్నది. నిత్యం అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తుంటారు. వెయ్యికి పైగా ఆశ్రమాలున్న హరిద్వార్  అంతా సన్యాసుల ప్రభావంతో  ఉంటుంది. హరిద్వార్ వాసులు సన్యాసులకు అన్ని సౌకర్యాలు  ఏర్పాటు చేస్తారు. నేను రైలుదిగి గీతాభవనంలో నా సామాను పెట్టాను. ఒక ఫర్లాంగు దూరంలో భోలగిరి  మఠం ఉన్నది. భోలగిరి మఠంలోని  సన్యాసులు ఒక్కొక్క శాఖలో  నైపుణ్యం సంపాదిస్తారు. భిన్న  విషయాలను అధ్యయనం చేస్తారు. పాశ్చాత్య సమకాలీన తర్కంతో  సరితూగగల నవ్య న్యాయ సిద్ధాంతాలపై భాష్యం రాసిన ఒక పండితుని ఇక్కడ కలిశాను. భాస్కరుడి  లీలావతిపై విస్తృత భాష్యాన్ని రాసిన మరొక పండితుని కలిశాను. మరో పండితులిద్దరు భారతీయ సంగీతంపై 20 సంవత్సరాలుగా అధ్యనం చేస్తున్నారు. నేను భోలగిరి  మఠానికి వెళ్ళినప్పుడు  శంకరాచార్యుడికి హారతిగీతం  పాడుతున్నారు. నేను వారితో కలిశాను. సంస్కృత చందస్సు  గురించి కొందరు నాతో చర్చకు దిగారు. అంతేగాని నా పేరు, ఎక్కడ  నుంచి వచ్చానని అడగలేదు. ఇదీ ఆశ్రమాలలో మర్యాద. హరిద్వారాలో అన్ని వర్ణాల సాధువులున్నారు.
హార్కి  పహాడి దగ్గర ఒక బోర్డు మీద ఇంగ్లీషులో-హిందువులు కాని వారు ప్రవేశించరాదని ఉన్నది. ఇండియాలో బహిరంగ ప్రదేశాలలో ఇలా ఉండటం నేనెక్కడా చూడలేదు. నేనొక అమెరికా మిత్రుడిని వెంటబెట్టుకెళ్ళినప్పుడు కొందరు ఆశ్చర్యంగా చూసినా ఎవరు అభ్యంతరం పెట్టలేదు. కాశీవిశ్వనాథ ఆలయంలోనూ దక్షిణ భారతదేశంలోనూ అపవిత్రం చేస్తారనే దృష్ట్యా ఇలాంటి నిబంధనలు విధించారు. హార్ కిపహాడి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి బ్రహ్మకుండిలో మునిగి చుట్టూ వినిపించే శ్లోకాలను విని ఆనందిస్తూ ప్రతిరోజూ సాయంత్రం గడిపేవాడిని. అనేక మఠాలను, సంస్థలను సందర్శించాను.

ఎమ్.ఎన్. రాయ్ తో పరిచయం
ఒకరోజు  ప్రొద్దున్నే అమెరికా పండితుడొకడు  ఢిల్లీ నుండి గీతాభవనానికి వచ్చాడు. తనతో పాటు మస్సోరీ  రమ్మని అడిగాడు. నేను వెంటనే అంగీకరించాను. త్రోవలో డెహ్రాడూన్లో 14 మోహిని రోడ్లో ఉంటున్న  ఎమ్.ఎన్. రాయ్ దగ్గర ఒక అర్థగంట  సేపు ఆగాల్సి వుంటుందన్నాడు. ఎమ్.ఎన్. రాయ్ పుట్టుకతో సనాతన  బ్రాహ్మణుడు. ఒకప్పుడు కమ్యూనిస్టు  కొమిన్ ఫామ్ లో ఇండియా పక్షాన ఏకైక సభ్యుడు. చైనాలో పనిచేశాడు. రాయ్ సిద్ధాంతకర్త. ఆచరణవాది కాదు. ఇండియాకు తప్పించుకొని వచ్చిన రాయ్ ని పట్టుకొని, ఫిలిప్ స్పాట్ర్ తో పాటు విచారణ జరిపారు. రాయకు 12 సంవత్సరాలు శిక్షవేసి, తర్వాత ఆరేళ్ళకు తగ్గించారు. ఆ సమయంలో మనిషి  మారగలిగినంతగా మారాడు. కమ్యూనిస్టు  కాస్తా హ్యుమనిస్టు అయినాడు.
మోహిని  రోడ్ వరకు తీసుకు వెళ్ళి నన్ను  కారులోనే కూర్చుండమని 15 నిముషాలలో  రాయ్ తో మాట్లాడి వస్తానని అతడు ఇంట్లోకి వెళ్ళాడు. 10 నిముషాల  తరువాత కారులో వున్న నా దగ్గరికి రాయ్ వచ్చి ఆప్యాయంగా, స్వామీజీ కనీసం కాఫీ తాగి వెళ్లకూడదా? అన్నాడు. ఆనందించాను. అయిదు కప్పుల కాఫీతో అయిదు గంటల చర్చ జరిగింది. అమెరికాలో మానస అధ్యయన శాస్త్రజ్ఞుడు ఫిల్ సింగర్, ఎలెన్ రాయ్, ఎమ్ ఎన్ రాయ్ నేను చర్చల్లో మునిగిపోయాం. పొద్దుబోయింది. నేను ఆవ్యక్తంగా కోరుకుంటున్న పదార్థాలతో ఎలెన్ భోజనాలు వడ్డించింది. క్రీమ్ కాఫీ, బేకన్, ఛీజ్ అన్ని ఉన్నవి. మత్తు పానీయాలు సేవిస్తూ చాలా సేపు గడిపాము. జీవితంలో మొదటిసారి నేను మత్తు పానీయాలను ఆనందించిన రోజు అది.
రాయ్ భారత జాతీయవాదిగా జాతీయతను నిరసించాడు. హిందువుగా హిందూ మతంలోని  సాంఘిక బంధాలను తృణీకరించాడు. కమ్యూనిష్టులు అతడిని బ్లాక్ లిస్టు చేశారు. దశనామి శాఖ  స్థాపకుడు శంకరాచార్యుడితో  సహా భారతీయ మతతాత్వికుల  పట్ల రాయ్ కు ప్రేమాదరాలు  ఉన్నవి. శంకరాచార్యుడి పారమార్థిక దృష్టి మానవతా వాదులకు ముఖ్యం కాదు. వ్యక్తిని కాదనే  శంకర సిద్ధాంతం రాయ్ కు అంగీకారం కాదు. మానవతావాదికి వ్యక్తే  ముఖ్యం.
ఇండియాలో  శాఖాహారిగా వుండటం సులభం. సన్యాసం  స్వీకరించే శాకాహారం అమెరికా  ప్రోటీన్ ఆహారం కంటే చాలా బాగుంటుంది. ఆహారం లైంగికం  తదితర వ్యక్తిగత విషయాలకు నైతిక విలువలు అంటగట్టడం  మంచిది కాదు. ఎమ్.ఎన్. రాయ్ తో కలిసి బోజనం చేసిన తరువాత శాఖాహారానికి గొప్పలు కట్టిపెట్టడం తప్పదనుకున్నాను. నాపై రాయ్ ప్రభావం కొంతకారణం కావచ్చు.
మరునాడు పగలూ రాత్రీ రాయ్ తోనే గడిపాను. ముస్సోరీకి పోనే లేదు. నా అమెరికా  స్నేహితుడు ఢిల్లీ వెడుతూ నన్ను హరిద్వార్ లో దింపి  వెళ్ళాడు. నన్ను ఉత్తర  కాశీ వెళ్ళి రమ్మని జె.కొ. బిర్లా సూచించారు. యాత్రికులకు  అది తుది శిబిరం. త్రోవలో  ఉన్నది బిర్లా అక్కడ ఒక విశ్రాంతి  మందిరం నిర్మించాడు. మా సామాను అక్కడ పెట్టాము. ఉత్తర  కాశీలో వేదాంత పండితులు ఉన్నారు. శంకరాచార్య తత్వాన్ని విడమర్చి చెప్పిన ముఖ్యులలో ప్రముఖుడైన స్వామి విష్ణుదేవానంద కూడా ఉన్నారు. సాయం కాలం వాహ్యాళిలో తనతో పాటు రావడానికి ఆయన  నన్ను అనుమతించారు. వారితో పాటు మరికొందరు స్వాములు కూడా అనుసరిస్తుంటారు.
ఒకనాటి  రాత్రి మేము అలా పొతుండగా స్వామి ఇలా అడిగారు. మన గ్రహణ  గ్రంథాలు పేర్కొంటున్నట్లుగా ఇదంతా వాస్తవం కాదని  అప్పుడప్పుడు నీకనిపించదా? ప్రమాణ గ్రంథాలు పేర్కొన్నట్లుగా అనే పదాలు చేర్చటం నాకు ఆశ్చర్యం వేసింది. ప్రమాణ గ్రంథాలను, వాటిపై ఉత్తమ భాష్యాలను స్వీకరించాలి. అంతగా పాండిత్యం లేనివారి మీద వీటిని రుద్దకూడదు. పాశ్చాత్య ఆలోచనారీతుల ప్రభావం నాపై వున్నదని నీవనుకోవచ్చు. నాకు అవేవీ తెలియవు. మన సంప్రదాయంలోనూ మూల గ్రంథాలను నిశితంగా పరిశీలించిన వారున్నారు. అంత మాత్రాన ఆ గ్రంథాల పట్ల విశ్వాసం తగ్గలేదు. మన ఆదిగురువు ఈ కోవకు చెందినవాడు కాడు, శ్రీహర్షుని గ్రంథాలు చదువు, అప్పుడు బౌద్ధుల వద్దకు పోనక్కరలేదు వారి పునాదులను వారే తృణీకరించారు.
స్వామి  విష్ణుదేవానంద అద్వైత వేదాంతంలో  అత్యున్నత పాండిత్య ప్రకర్ష  సాధించిన ఉత్తరకాశీ గంగోత్రి పండిత వర్గానికి చెందిన వాడాయన. స్వామి వివేకానంద 8 సంపుటాలలో ప్రవచించిన వేదాంతానికి, ఉత్తర కాశీ రుషులు చెప్పే వేదాంతానికీ చాలా తేడా ఉన్నది. రామకృష్ణ మిషన్ వారు వేదాంతాన్ని  ప్రచారంలోకి తీసుకురావడానికి  చాలా బలపరిచారు.
నేను ఢిల్లీ వచ్చేసరికి యూనివర్శిటీలో  నాకు స్వస్తి పలికారు. కారణాలు  చెప్పలేదు. యువతీ యువకులను నేరుగా కూర్చోబెట్టకపోవడం  ఒక కారణం కాగా, సాధువుల  మహాసభలో పాల్గొనడం మరొక కారణమని తెలిసింది. కొన్నాళ్ళు ఢిల్లీలో ఏకాంతంగా ఒక వ్రాతప్రతిని అనువదిస్తూ ధ్యానం చేసుకుంటూ  గడిపాను. బిర్లా నిర్మించిన పిలాని సంస్థకు వెళ్ళి జబ్బుబడ్డాను. డాక్టర్ అవలేగోంకర్ నన్ను  కాపాడాడు. చాలా బలహీన స్థితిలో తిరిగి వచ్చాను. పండిత గోవింద మాలవ్య కలిశారు. ఆయన అక్కడ పార్లమెంటు సభ్యులు. కాశీ హిందూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కూడా కాశీకి వచ్చి బోధిస్తూ విద్యార్థులు అధ్యాత్మిక అవసరాలు చూస్తూ మీరెందుకు గడపకూడదు? అని అడిగారు.

కాశీ విద్యాలయంలో
1951 నవంబరు 17న కాశీ విశ్వవిద్యాలయంలో  నేను ఉద్యోగం ప్రారంభించే  నాటికి అక్కడ ఉండి చదువుకునే  విద్యార్థులు పది వేలమంది  ఉన్నారు. జియాలజి వంటి  కొన్ని శాఖలలో సహా విద్యను  అనుమతించడం లేదు. ఫిలాసఫీ  శాఖాధిపతి నన్ను పరిచయం  చేస్తూ స్వామి అగేహానంద  భారతి మన గౌరవ తత్వశాస్ర్తాచార్యుడిగా  ఉంటాడని చెప్పాడు. ఇంగ్లండ్లో  విశ్లేషణ తత్వం, ఫ్రాన్సులో  సత్తావాదం, జర్మనీలో నూతన  మార్మిక వాదం అనేక సమకాలిక  శాఖలను చెప్పాను. ఇంగ్లీషులో  ప్రసంగిస్తూ మధ్య మధ్య  హిందీలో చెప్పేవాడిని, ముందు  వరసలో కూర్చున్న వారంతా  రాగద్వేషాతీతంగా ముఖాలు  పెట్టారు. మొదటిరోజు ఉపన్యాసమైన  తరువాత ప్రశ్నలు అడగమంటే  ఎవరూ ముందుకు రాలేదు. కాస్సేపటికి  ఒక సన్నని వ్యక్తి లేచి  విశ్లేషణాత్మక మార్మిక  తత్వాన్ని వివరించమని, జర్మన్  మాట్లాడే దేశాలపై విశ్లేషణాత్మక  ఆలోచన ప్రభావం ఏమిటని  అడిగారు. విట్ గైస్ స్టెన్, వియన్నా సర్కిల్ వారిని  స్వస్థలంలో విడ్పించి  పంపించివేశారని చెప్పాను. నన్ను ప్రశ్న అడిగిన  వ్యక్తి ప్రొఫెసర్ జె.యల్.  మెహతా, అప్పటికాయన తప్ప, విట్ గైన్ స్టెన్,  న్యూరప్,  మాహ్ పేర్లు విన్నవారే  లేరు. ఆ తరువాత జె.యల్.  మెహతా నేను వారి పేర్లు  వినిపించినా వారు ఆసక్తి  చూపలేదు.
ఈ దేశంలోని యూనివర్శిటీలలో పాఠ్యపుస్తకాల  చుట్టూబోధన గిరిగీసి ఉంటుంది. తరచు వీటిని మార్చటం కూడా ఇష్టం ఉండదు. సైన్స్ లో కూడా ఇలాగే ఉందని విన్నాను. నేను ఫిలాసఫీ శాఖలో చేరేనాటికి, ఇండియాలో ఇతర చోట్ల ఉన్న పరిస్థితే ఉన్నది. కొందరు ప్రొఫెసర్లు సింబాలిక్  లాజిక్ పుస్తకాలు తెప్పించాము. తత్వశాఖ వారు వాటిజోలికి పోలేదు కాని, గణితశాఖ వారు మాత్రం వాటిపట్ల ఉత్సాహం  చూపారు. అద్వైత వేదాంతానికి  చేరువగా ఉన్న పాశ్చాత్య  ధోరణులను ఫిలాసఫీ ఆహ్వానించేది వివేకానంద రచనల ప్రభావం  వలన ఈ ధోరణి ప్రబలింది. కనుకనే ఇండియాలో ఫిలాసపీ  శాఖలలో బర్కిలీ, బొసాంకే  బ్రాడ్లే తత్వవేత్తలు బహుళ ప్రచారం పొందారు. రస్సెల్  ను అప్పటి కెవరూ చదవడం  లేదు, నేనూ, మెహతా కలిసి  సిలబస్ లో ఆధునిక తత్వవేత్తలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాం. ప్రొఫెసర్ యస్.కె.మెత్రా మా పథకాన్ని వ్యతిరేకించారు. ఇండియాలో సమకాలీనం అంటే రెండు  వేల ఏళ్ళ నాటిదన్నమాట. ఎలాగైతేనేమి  ఏ.జె. అయ్యర్, సుపాన్ స్టెబ్బింగ్ రచనలను పెట్టించగలిగాము. విశ్లేషణాత్మక తత్వాన్ని ప్రవేశపెట్టగలిగాం. సత్తా వాదాన్ని తత్వశాఖలలో ప్రవేశపెట్టలేదు. కేవలం ప్రాచీనమైన ఆలోచనపట్ల భక్తి భావంతో ఉండటం కంటె మానసిక అవరోధాలను తెంచుకోవాలని కొంతమంది విద్యార్థులు నచ్చచెప్పగలిగాను. శంకరా చార్యుడి కంటే రస్సెల్ తెలివైన తార్కికుడని, పంతజలికంటే సి.జి.యూంగ్కు మానవ మేధస్సును గురించి బాగా తెలుసని, ఒక పట్టాన హిందువులు ఒప్పుకోరు. ఏమైనా బోధన రచ్చలు ప్రతిరోజు అసలటనే తెచ్చాయి. మధ్య మధ్యలో సేవించే తేనీరు మాత్రమే హాయిని సమకూర్చేది. హిందూ మతంలోని విశిష్టతను, రామణీయకతను కొందరు విద్యార్థులకు నచ్చచెప్పగలిగాను. ఇదే మంత సులభమైన పనికాదు. హిందుమతం రామణీయకతను అనుమానాస్పదంగానే చూస్తుంది. ఈ విషంయలో నలుగురు విద్యార్థులకు, ఒక విద్యార్థికి నచ్చజెప్పటంలో సఫలీకృతు డనయ్యాను.
కాశీలో  సంస్కృత విద్యాపీఠంలో చదివే  విద్యార్థులు సనాతన శాస్ర్తాలను  అధ్యయనం చేస్తున్నప్పటికీ వారి దీక్ష అనన్య సామాన్యమైంది. వారితో పోలిస్తే ఇతర విశ్వ  విద్యాలయాల వారి దీక్ష తక్కువే, సనాతన విద్యార్థి దైవం దిన  చర్యలోనూ, వేషంలోనూ సనాతనంగా వుంటాడు చాలా కష్టపడి అధ్యయనం  చేస్తాడు, కంఠస్తం చేస్తాడు. కాని మామూలు విశ్వవిద్యాలయాలలో  బోధించే అర్హత అతనికి లభించదు. సంప్రదాయ విద్యను అభ్యసించిన వారిలో పండిత రామచంగ్దర  దీక్షితార్, తర్కతీర్థ లక్ష్మణ  శాస్త్రి జోషి మొదలైన వారున్నారు. నేను ఒకసారి రస్సెల్ తార్కిక  భావాలను గురించి ఇరువురు  పండితులకు చెప్పగా చాలా సూక్ష్మదృషి అని వారు ్భినందించారు. వివాహం, ఈతి గురించి రస్సెల్  భావాలు వారితో చెప్పినప్పుడు  మౌనం వహించారు. కాసేపటికి  ఇరువురిలో ఒకరు, ఇంగ్లీషు పండితులు చెప్పేది మనం అంగీకరించం. కాని రాముడు సీతకు చేసినది  కూడా ఇంగ్లీషువారు అంగీకరించక పోవచ్చు అన్నారు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజకీయం ఎక్కువ, పండిత్ మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన విశ్వ విద్యాలయంలో హైందవ  జాతీయ వాదాన్ని అర్థం చేసుకోవచ్చు. కలకత్తా, మద్రాసు నుండి  వచ్చిన యువకులు మతాన్ని  మత్తుమందుగా భావించి, హిందూ  మతాన్ని ఆమోదించేవారిని విమర్శిస్తుండేవారు, నేను ఒకసారి ఐక్యరాజ్య సమితి  దినోత్సవ సభలో మాట్లాడాను. మానవతావాద వ్యక్తిత్వాన్ని  వివరించాను. జాతి, ప్రజ, మానవాళి  అనేవి అవకాశం కొద్దీ వాడే మాటలే తప్ప అవి వ్యక్తికి  పనికొచ్చేవి కాదన్నాను  వ్యక్తి మాత్రమే వాస్తవమని, మిగిలినవి కేవలం పదజాలమని, వాటికోసం వ్యక్తిని ఆహుతి  చేయరాదని అన్నాను. వ్యక్తిని  పరిగణించే వాదం మాత్రమే  వ్యక్తివాదం అవుతుందని, అంతే తప్ప ఒక వర్గంలో భాగంగా, మానవాళి, జాతిప్రజ, దేవుని బిడ్డలు అనే వాటిలో వ్యక్తికి విలువలేదని చెప్పాను. హేతువాదం, విశ్వజనీన వాదం, వ్యక్తివాదం కలిపితే మానవతా వాదం అవుతాయన్నాను. ఉపన్యాసం అయిన తరువాత నా వెంట ఇరువురు యువకులు వచ్చి, చీకట్లో నన్ను ఆపి, కోపంగా ఇలా అన్నారు. మీరు ప్రజావ్యతిరేక, భారత వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతున్నారని, ప్రజల అవసరాలను ప్రక్క దారులు పట్టించి మూఢ నమ్మకాలను అట్టి పెడుతున్నానని, కాషాయ వస్త్రం ముసుగులో మేధస్సును మత్తులో పెడుతున్నానని, రష్యనులు, చైనీయుల పట్ల చిన్న చూపు చూస్తూ ఆ దేశాల ప్రజలు చూపే కాంతి పథాన్ని గ్రహించటం లేదని, బ్రిటీష్ వారిని పొగడుతువన్నావు అని అన్నారు. ఇదంతా పది నిముషాల సేపు సాగించి వారిని చెప్పనిచ్చి, నా స్వంతంగా కలిపించి ఏమి చెప్పనన్నాను. మీరు గొప్ప మేధావులు. ఆ సంగతి అందరికి తెలుసు అన్నారు. అదేమిటో బయటి పెట్టడండి అన్నాను. దాంతో వారిలో అన్నారు. నీవు అమెరికా ఏజంటువు కాషాయ వస్త్రంలో అమెరికా పద్ధతులను వ్యాపింపచేయాలను కుంటున్నావు. మిత్రదేశాలైన రష్యాను, చైనాను అవమానిస్తున్నావు. నీవు స్త్రీలోలుడవు. సామ్రాజ్యవాదివి, పెద్దవాడిగా నటించే పెట్టుబడిదారుడవు, మమ్మల్ని మళ్ళీ బానిసలు చేయాలను కుంటున్నావు. నీవు తాగుతావు, వ్యభిచరిస్తావు, నిన్ను చంపేస్తాము అన్నారు.
నన్ను ఏదో  ఒకరోజూ చంపితే చంపండి. ఇప్పుడు  మాత్రం యిక్కడి నుండి వెళ్ళకపోతే మీ సంగతి చూస్తాను అన్నాను. వాళ్ళిద్దరూ గుసగుసలాడుకున్నారు. బలమైనవాడు, బాగా తింటాడు, యోగాభ్యాసాలు, పహిల్వాన్ అనే మాటలు  వినిపించాయి. ఏదో బూతుమాట  అనుకుంటూ వెళ్ళిపోయారు. యూనివర్శిటీలో  ఈ సంఘటన చాలా ఉపన్యాసాలలో  చెప్పాను. మన యువకులు గుండాలుగా  తయారవుతున్నారని వ్యాఖ్యానించాను. అసలు కారణాలు వేరే వున్నవి.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు  వివాహితులే ఒకశాతం భార్యా విహీనులుంటారు. హిందూ ప్రమాణ గ్రంథాలలో స్త్రీకి గౌరవం  ఉన్నది. వేదాలలో ఆమెను  సహధర్మచారిణి అన్నారు. కాలానుగుణంగా ఆమె స్థానం తగ్గిపోయింది. హిందువులు సూత్రప్రాయంగా  అర్థాంగిని పొగుడుతారు. కాని ఒక ప్రత్యేక వ్యక్తిగా గురించి  కాదు. భార్యకు ప్రేమాదరాలు  చూపిన వ్యక్తిని చీదరించుకుంటారు. నేను పాదయాత్ర చేసినప్పుడు  ముగ్గురు పిల్లలున్న తల్లిని  సైతం ఆమె భర్త ప్రేమించడం చూశాను. ఇరువురూ సమానం  అన్నట్లు ప్రవర్తించారు. బీహార్ లోని సంతాలులలో దంపతులు  చేతులు కలుపుకుని తిరగటం గమనించాను.
హిందువులు, ముఖ్యంగా భార్యపట్ల గౌరవం  చూపినప్పుడు ఏ మాత్రం అలాంటి వ్యక్తిని ఆదరించటం లేదు. కాశీ యూనివర్శిటీ ఆవరణలో భార్య జబ్బుగా ఉంటే పరామర్శించడానికి వెళ్ళిన ఒక దక్షిణాది బ్రాహ్మణ తత్వా చార్యుడిని ఆయన తండ్రి తిట్టేశాడు. ఒక పంజాబి స్ర్తీని పెళ్ళయిన మూడేళ్ళకు కూడా పిల్లలను కననందుకు భర్త పుట్టింటికి  పంపేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయ  ఆవరణలో యువకులు స్వేచ్ఛగా  తిరుగుతూ పరస్పరం కౌగిలించుకుంటుంటారు. ఆ పంజాబు స్త్రీ ఒకసారి అలాంటి యువజంటను నాకు చూపి వారలా  ఎందుకు చేస్తారో తెలుసా అనడిగింది. చెప్పమన్నాను. నేను చాలా అందమైనదానిని, కాని వారు నా దగ్గరకు వచ్చి  నా అందాన్ని గురించి చెప్పలేదు. దీనికి బదులుగా పరపీడనత్వాన్ని చూపే రీతిలో వారు పరస్పరం  కౌగిలించుకుంటారు. మీ గురించి  నాతో ఏమైన అంటే చెప్పుతీసుకొని కొడతాను అన్నదామె.
ఒకనాడు  సంగీత లలిత కళాశాల ప్రిన్సిపాల్ పండిత్ ఓంకార్ నాథ్ వద్దకు వెళ్ళి గానసంగీత తరగతులలో కూర్చోవడానికి అనుమతి ఇవ్వమన్నాను. ఆయన ఒప్పుకోగా మూడేళ్ళు రూయా హాస్టల్ కప్పుపై విద్యార్థుల  మధ్య కూర్చున్నాను. అందులో నా విద్యార్థి ఒకరు ఉన్నాడు  అతడు కూర్చుని బల్లపై తలబెట్టి గురక పెట్టేవాడు. ఓంకార్ నాథ్ ను అన్ని విధాల అనుకరించే  వాడు. నన్ను కూడా అనుకరించేవాడు. భారతీయ సంగీతానికి అలవాటు పడటానికి నాకు చాలా కాలం పట్టింది. మొదటి నాలుగు మాసాలు నేను సంగీతం ప్రారంభించగానే అందరూ  నవ్వేవారు. ఆరు మాసాలలోగా  సంగీతంలో నిమగ్నుడినయ్యాను. పాశ్చాత్యుల దృష్టిలో భారతీయ సంగీతం సంగీతమే కాదని, అదొక విధమైన శబ్దమనే భావన ఉన్నది. పాశ్చాత్య సంగీతంలో మంచి చెడ్డలున్నట్లే ఇండియాలోనే ఉన్నవి.
నా సనాతన  సహచరులు నేను ఈ విధంగా అతిథులకు నగరంలో విశేషాలు చూపెట్టడం ఇష్టం లేక  ఆగ్రహించేవారు. నేను విదేశీ వ్యక్తిగా మళ్ళీ వెనక్కు  వెళ్ళదల్చుకోలేదు. నేను హిందువును, భారతీయుడిని కాదు, తాత్వికుడను, అయితే ఒక దేశానికి చెందిన తత్వవేత్తను కాదు, మానవతావాదిని పరిమితంగా సుఖాలు కోరేవాడిని, అలాంటప్పుడు నేనేదో ఒక ప్రాంతానికి  పరిమితం కాకుండా ఇతర  ప్రాంతాలవారిని కలిసినప్పుడు ప్రపంచం ఎలా ఉందో తెలుస్తుంటుంది. పక్కా బనారసీ బయ్యాగా మారటం  నాకిష్టం లేదు. నెత్తి మీద  జుట్టు లేకుండా కాషాయ వస్త్రంతో  నోటిలో పాన్ నములుతూ, బనారసీని అవుతున్నానేమోనని ఆలోచనా నాకు జుగుస్సను కలిగింది.


సత్సంగ మండలిలో
సత్సంగ  మండలి వారు నన్నూ, ఒక అమెరికన్ స్నేహితుడిని అంబాలాకు ఆహ్వానించారు. కంటోన్మెట్ ఉన్న ఒక సంపన్న నగరం అది. భాష సంస్కృతి అంతా పంజాబీయం. హిందీ మాట్లాడే ఉత్తర ప్రదేశ్ వారున్నారు. దేశవిభజన అనంతరం ఉత్తరాదిలోని పశ్చిమ ప్రాంత నగరాలన్నీ  సిక్కులమయం అయిపోయినాయి. పంజాబీలు డబ్బు సంపాదిస్తారు. ఖర్చు  పెడతారు. సుష్టుగా భోంచేస్తారు. పళ్ళరసం త్రాగుతారు. పంజాబీలోని ఆంబోతులు, ఆవులు చాలా పెద్దవి, పంజాబీ స్ర్తీలు చురుకుగా ఉంటారు. మంచి దుస్తులు వేసుకుని, విందంటే ఇష్టపడుతుంటారు. పంజాబీలకు ఆలోచన తక్కువ. సత్సంగ మండలిని ఒక సి.ఐ.డి. పోలీస్ స్థాపించాడు. విశాలమైన అతడి గృహాన్ని మందిరంగా మార్చివేశాడు. ప్రతిరోజూ ఉదయం జరిగే సమావేశాలకు జనం వస్తుంటారు. సంపన్న వర్తకులు ఎందరో చేరారు. సుప్రసిద్ధ సన్యాసులను, తదితరులను ఆహ్వానిస్తుంటారు.
స్టేషన్ లో మేళతాళాలతో స్వాగతం చెప్పారు. పూలదండలతో ముంచెత్తారు. పాదాలుతాకి అభివాదం చేశారు. టాపులేని గుర్రపు బగ్గీని  ఎక్కించారు. ఊరేగింపుగా వీధులఅలో తీసుకెళ్ళారు.
సమావేశం ఏడు గంటలకు, ఈ లోగా మమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు. స్థానిక పండితులు, సన్యాసులు, ఉపన్యాసాలు ఇచ్చారు. తరువాత మేము వేదిక మీదికి వెళ్ళాము. మా గౌరవార్థం బాలికలు పంజాబీ పాటలను ఆలపించారు. తరువాత నన్ను  పరిచయం చేశారు.
నేను మామూలు మాటలు చెపుదామనుకుని ఏకత్వాన్ని గురించి సాంకేతికంగా ఒక గంటసేపు ప్రసంగించాను. బ్రాహ్మణతత్వం  విలువ తగ్గించకుండా జనంలోకి  తీసుకెళ్లవచ్చని నా ఉద్దేశం.
వేదాంతంలోని తార్కిక లోపాలు నాకు తెలుసు. విశ్లేషణాత్మకంగా మత ప్రతిపాదనలను పరిశీలించడం కూడా అభినందనీయమే.

స్వామి హరిగిరితో
స్వామి  హరిగిరి పంజాబి హిందూ సాధువు. కాంగ్రెసు పార్టీ సభ్యుడు. పంజాబులోని హిమాలయ పర్వత  ప్రాంతంలో మఠాధిపతిగా ఉంటున్నాడు. స్వంతంగా తయారు చేసుకున్న  కాషాయ టోపీని పెట్టుకుంటాడు.
ఉన్న సంస్కృతికి దక్షిణాది ప్రతీక. దక్షిణాది  భాషలను నేను నేర్చుకోలేదు. ఉత్తరాది సంగీతాన్ని అధ్యయనం  చేసినప్పటికి, నాకు దక్షిణాది  సంగీతం ఇష్టం. దక్షిణాదిలో  కొందరు భక్తి కవులు సంప్రదాయ మార్మికవాదంలో ఇంద్రియ ప్రేరణతో కూడిన భాషను వాడారు. దక్షిణాది సంగీతం విన్నప్పుడు, నా చికాకులన్నీ ప్రక్కకు పెట్టేవాడిని.
త్రివేండ్రంలో తిరువాన్ పూర్ మహారాజాను  కలిశాను. దక్షిణ మలబార్లో పాల్ ఘాట్ వద్ద గాంధీ ఆశ్రమంలో కొన్ని వారాలపాటు గడిపాను.
కన్యాకుమారి వెళ్ళాను. నా వెంట అచ్చుతన్, అతని భార్య లక్ష్మి కుట్టియమ్మ వచ్చారు. కన్యాకుమారి విగ్రహం  చాల అందంగా కనిపిస్తుంది. విగ్రహానికి సమీపంలో రాత్రింబవళ్ళు  కూర్చుని క్రతువులన్నీ తిలకించాను. నంబూద్రి పురోహితుడొక్కడే  ఆ దేవత దగ్గరకు రావచ్చు. మిగిలిన సన్యాసులు, బ్రాహ్మణులు  బయటకూర్చుని చిన్నగేటు  ద్వారా విగ్రహాన్ని తిలకిస్తారు. పురోహితుడు పాలు, రోజూనీరు, నెయ్యి, మరి కొన్ని విలువేన  పదార్థాలతొ విగ్రహాన్ని  నిమురుతూ స్నానం చేయిస్తారు. దీని వెనుకనున్న మనస్తత్వాన్ని  అధ్యయనం చేయాలంటే ఫ్రాయిడ్ గాక, యాంగ్ పనికొస్తాడు. ప్రతి  సంవత్సరం ఒక వారం పాటు నేను ఇక్కడికి వచ్చి గడిపేవాడిని.

కాలడి ఆశ్రమంలో
కాలడి ఒక చిన్న గ్రామం. శంకరాచార్యుడు  అక్కడే పుట్టాడు. హిందూమతంలో అతను అత్యున్నత పండితుడు. కాలడికి వరుసగా రెండేళ్ళు  వచ్చాను. ఈసారి రామకృష్ణ మిషన్ కేంద్రంలో స్వామీ ఆగమానంద అతిథిగా ఉన్నాను. స్వామి ఆగమానంద తాత్విక  సంస్కృతంలో గట్టి పండితుడు. చక్కని ఇంగ్లీషు మాట్లాడుతాడు. ఆయనంటే చుట్టుపట్ల ఉన్న క్రైస్తవులకు భయం.
అతని దృష్టిలో రామకృష్ణ శంకరాచార్య ఒకే  సంప్రదాయంలో ద్రష్టలు. శంకరాచార్య చెప్పినదాన్ని రామకృష్ణుడు  అవతారంగా పరిపూర్తి చేశాడు. 1200 సంవత్సరాల ఎడంలో పుట్టినప్పటికి, శంకరాచార్య, రామకృష్ణ ఒకేరోజున పుట్టారు. వీరిద్దరి మధ్య మౌలికంగా తేడా లేదంటారు. ఆగమానంద  దృష్టిలోని మౌలిక బోధనలన్నీ  ఒకటే. శంకరాచార్యుడు కేవలం  నిరీశ్వరవాది. అత్యున్నత  గతితార్కి బోధకుడు. రామకృష్ణుడు  భక్తిని ప్రచారం చేశాడు. మేధస్సుకు వ్యతిరేకి. బహు  ప్రాచుర్యం సంపాదించినవాడు. ఇద్దరికీ చాలా తేడా వున్నది.
రామకృష్ణ  శంకరాచార్యుల జన్మదినోత్సవ సందర్భంగా నేను బ్రహ్మచారిగా రామకృష్ణ ఆశ్రమంలో చేరినప్పటి స్వాములను కలుసుకొని ఆనందించాను. నేను బొంబాయికి తొలుత వచ్చినప్పుడు నాకు ఆతిధ్యం ఇచ్చిన స్వామి శంభూనంద కాలడి గౌరవ అతిథిగా  వచ్చారు. అక్కడ తొలుత నేను ప్రసంగించాను. ఆగమానంద అడిగినట్లుగా శంకరాచార్య-రామకృష్ణను పోల్చాను. ఇరువురూ ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నులైనారని, శక్తివంతమైన వ్యక్తిగతం గలవారని, హందూ సంప్రదాయానికి విధేయులని అన్నాను.

మతం మార్పిడి వివాదం
దక్షిణాదిలో పర్యటిస్తుండగా మతం మార్చే క్రైస్తవుల సమస్య ఎదురయింది. సిరియన్ క్రైస్తవులు, పురాతన క్రైస్తవులతో సమస్యలేదు. కాని క్రైస్తవ ఫాదరీలు, పాశ్చాత్య  మిషనరీలు మతం మార్పిడిలో క్రైస్తవ గొప్పతనం ఉందని  అంటారు. ఇదే చికాకు కలిగిస్తుంది. హిందూ మతం ఇతరుల మతం  మార్చదు. అది ప్రపంచ మతం  కాదు. బౌద్ద, ముస్లిం, క్రైస్తవ మతాలకు మారినట్లు హిందువుగా  మారడానికి వీల్లేదు. హిందూ, కులాల్లో పుట్టినవారే హిందువులు. ఇతర జాతులకంటే తమ మతం  గొప్పని హిందువులు చెప్పారు.
నాగర్ కోయిల్ కు సమీపంలో ఒక పెద్ద చర్చి  ఉన్నది. వాడకాంగూలం అనే చోట  ప్రజలు ఫాదరీలతో పడక, మళీళ హిందూ మతంలోకి మారాలను  కున్నారు.  ఒకప్పుడైతే ఇది  అసాధ్యమేమో గాని, రాను రాను దక్షిణాదిలో ఇలాంటి మార్పులకు  అవకాశం ఏర్పడింది. మేము వాడకాంగూలం వెళ్ళేసరికి తమిళంలో భజనచేస్తూ, సుమారు 5 వేల మంది కనిపించారు. ఆర్ముగన్ నన్ను చొక్కా విప్పేయమని, నాకు గంధం పూసి, నొసటిపై త్రిపూండ్రం  పెట్టాడు. నా వంటి నిండా శివభక్తుడి నన్నట్లుగా విబూధి పూశాడు. ఇలాంటి వాటిని వివేకానందుడు పులిమచ్చలుగా వర్ణించాడు.
వేలాయిన్  నన్ను నాగర్ కోయిల్ కు తీసుకెళ్ళాడు. నాడా జాతివారు హిందువులుగా మారారని తరువాత తెలుసుకున్నాను. 5 వేల మందిలో హఠాత్తుగా మార్పు రావడానికి  నా ఉపన్యాసం కారణం కాదు. కాని నేను వాడకాంగూలం పోవడం వలన  స్థానిక హిందూ నాయకలుకు కొంత చేయూత లభించింది. హిందూ  ధర్మానికి గౌరవాన్ని ఇవ్వాలని వారు తలపెట్టారు. అలాంటి సమావేశాలకు నేను వెళ్ళటం ఆ ఒక్కసారే జరిగింది.

కుంభమేళా అనుభవాలు
13 ఏళ్ళకోసారి  అలహాబాదులో కుంభమేళా జరుగుతుంది. ఆరు రోజుల పాటు రాత్రింబగళ్ళు  పండితులు, సన్యాసులు చర్చల్లో  పాల్గొంటారు. గొప్ప ఊరేగింపు  జరుగుతుంది. కాశీ విశ్వవిద్యాలయంలో  నను ఆఖరి సంవత్సరం చదువు  చెబుతుండగా 1954లో కుంభమేళా  జరిగింది. జర్మన్ రాయబార  కార్యాలయం నుంచి వచ్చిన  స్నేహితులు నన్ను తీసుకెళ్ళారు. అక్కడ జనాలను చూసి నాకు భయం వేసింది. బొంబాయి నుంచి వచ్చిన దళసామి శాఖకు చెందిన ఒక సన్యాసి కుటీరంలో నాకు బస యేర్పాటు చేశారు. కన్యాకుమారిలో అంతకు ముందు ఆయనను కలుసుకొన్నాను. స్వామి బ్రహ్మానందజీతో పాటు మనం కారులో వెళదామన్నారాయన ఉదయం నాలుగున్నరకు ఊరేగింపు ప్రారంభమైంది. ముందుగా నాగారుషులు బయలుదేరారు. వారి వెనుక మేమున్నాము. తరువాత క్రమంగా ఉదాసీనులు, నిర్మలులు, వైష్ణవులు మొత్తం 20 వేల మందికి పైగా సన్యాసులు ఉన్నారు. లక్షా యాభై వేల మంది పట్టే తోట ఐదు లక్షల మంది జనం కూడారు. మేము కారులో ముందుగా వెళ్ళాము. పూరీ గోవర్థన మఠాధిపతి ప్రప్రథమంగా నదిలోకి దిగారు. తరువాత మేము ఆ తరువాత మిగిలినవారు తొక్కిసలాట మొదలైంది. కాసేపట్లో 300 మంది చనిపోగా 900 పైగా గాయపడ్డారు. అప్పటికే కారులో చుట్టూ తిరిగి వెళ్ళిపోయాం.
ఒకచోట ఉపన్యాసంలో, విముక్తికి సన్యాసత్వం ఒక్కటే మార్గం కాదని హిందూ ధర్మం  చెబుతున్నదని, ఇంద్రియాలను  చంపుకోవడం ఒక మార్గం కాగా, మాటిని సద్వినియోగం చేసిన  మోక్ష సాధనకు మళ్ళించడం  మరొక మార్గమని చెప్పాను.

శంకరాచార్య సందర్శనం
గోవర్థనపీఠ  జగద్గురువు శఁకరాచార్యులు  భారతి కృష్ణ తీర్థ నన్ను  చూడదల్చినట్లు యువ సాధువు వచ్చి చెప్పాడు. నేను పీఠాధిపతి  దగ్గరకు వెళ్ళేసరికి కొందరు పెద్దలు ఆసీసులై ఉన్నారు. వారు సాదరంగా నన్ను ఆహ్వానించి పాండిత్య విషయాన్ని ప్రస్తావించారు. అంతలో శంకరాచార్యులు ప్రవేశించగా  నేను సాష్టాంగ ప్రమాణం చేశాను. శంకరాచార్యులవారు ఆసీనులై  సంభాషణలో పాల్గొన్నారు. ముక్తికి జ్ఞానానికి సన్యాసత్వం అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మూడు గంటలసైపు చర్చసాగింది. సన్యాసిగా ఉండమంటే పైకి కనిపించే రూపం కాదని చెప్పాను.
నిజమే, నీవు చెప్పినదానికి అనుకూలంగా  ప్రమాణ గ్రంథాలలో పేర్కొన్న  సందర్భాలున్నవి. ఋషులు ఉన్మాదులుగానూ, సాధారణ వ్యక్తులుగానూ, మంత్రులుగానూ వ్యవహరించిన సందర్భాలు  లేకపోలేదని శంకరాచార్యులు  అన్నారు. అత్యున్నత దైవాన్ని నమ్మడం ముఖ్యం కాదా? అని అడిగారు శంకరాచార్యులు.
నాకు ప్రమాణ గ్రంథాలు అర్థమైనంతవరకు  దైవాన్ని తనలోనే చూసుకోవచ్చని లేదా నిరాకరించవచ్చని చెప్పాను. బహ్మ లేదా దైవరూపాలు అవతారాలు ఎన్నో విధాలుగా ఉంటాయని  పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.
దైవానికి  జైమిని ప్రాధాన్యత ఇవ్వలేదు. కపిలుడి సాంఖ్య దర్శనంలో నిరీశ్వర వాదం ఉన్నది. అయితే  అధికార భేద నియమం ఉంది అని శంకరాచార్యులు అన్నారు.
ప్రపంచాన్ని గురించి నీ భావాలు, ధోరణులు  యేమిటని శంకరాచార్యులు  అడిగారు.
ఈ విషయాలను గురించిన నా భావాలను అనేక వేదికలపైన చెబుతూనే ఉన్నాను.
ఒక వ్యక్తి  యోగిగా కాషాయ వస్ర్లాలో  ఉంటూనే మానవతావాదిగా అరమరికలు లేని రామణీయక జీవితాన్ని గడపవచ్చు. మన ఋషులు, సాధువులు, మానవతా వాదులు కాదు. మానవుడిని  ఏదో ఒక మూలశక్తికి కొలమానంగా  వాడుకోవడాన్ని మానవతా వాదం అంగీకరించదు. యోగి, మానవతా వాది సంఘర్షణకు దిగినవసరం  లేదు. యోగిగా ఉండటం వ్యక్తిగత  విషయం అతడి మార్మిక జీవితం సున్నితమైనది. ఇతరులకు చెప్పవలసింది కాదు. మానవతావాదిగా ఉండటం  కూడా సున్నితమైన విషయమే. ఒకానొక ధోరణిలో మానవతా వాది ఆలోచిస్తాడు. ఆలోచన, ఆచరణ ఒకటేనని ఎవరెంతగా నొక్కిచెప్పగా, ఇవి రెండూ  భిన్న స్థాయిలకు చెందినవి. ఒక వ్యక్తి అద్వైతిగా ఉంటూనే ఇంద్రియాలపట్ల జుగుప్స  పెంచుకోనక్కరలేదు. అద్వైత సాధువు ఆశ్రమ ధర్మాలను బట్టి  ఇంద్రియ సుఖాలను అదుపులో  పెట్టుకుంటాడు. అతడు ఇంద్రియాలోలుడు కాకపోయినా, ఇంద్రియాలను  గురించి, అందమైన వస్తువును  గురించి ఈసడించుకోడు. ఆశ్రమ  జీవితం మామూలు జీవితం కంటే ఎక్కువవగా తనకేదో అందిస్తుందని భావించిన వ్యక్తి ఇంద్రియాలను  ఆగ్రహంతోగాక ఆశ్రమ ధర్మాల రీత్యా దూరంగా అట్టిపెడతాడు.
ఇండియాలో  వేదాంత సంప్రదాయాన్ని పాటించేవారు  అరుదయ్యారు. టిబెట్ లో హీనయాన బౌద్ధమతం ఈ సంప్రదాయాన్ని  పాటిస్తున్నది. పాశ్చాత్యులు కూడా దీనిని అభ్యసిస్తున్నారు.

తాంత్రిక అనుభవాలు
ఇంద్రియాలను అణచివేయటం కాక, జీవితంలో ఉన్నత దశకు వాటిని మలచుకోవడం, తాంత్రిక విద్యలో సంప్రదాయం, తంత్రాలను గురించి హిందూ, బౌద్ధ సాహిత్యం చాల ఉన్నది.
ఇదొక ప్రత్యేకమైన  యోగవిద్య, తాంత్రిక గ్రంథాలు వేదాలతో సమానమని చెప్పినందు వలన బ్రాహ్మణ పండితులు వాటిని అనుమానాస్పదంగా చూస్తారు.
ఇండియాలో  గత వైభవాన్ని, సౌందర్యాన్ని దేవాలయాలలో, శిల్పాలలో చూడవచ్చు. క్రైస్తవ పాక్షిక దృష్టి లేకుండా వచ్చే విదేశీ యాత్రికులు, భారత కళా ప్రియుల ఈ సంప్రదాయాలను అభినందిస్తారు. ఇండియాలో దేవాలయాలపై కామ శిల్పాలు పుష్కలంగా  ఉన్నవి.
1910 తరువాత  నిర్మించిన దేవాలయాలలో  కామరూపం కనిపించదు. న్యూఢిల్లీలో  బిర్లా మందిరంలో శివలింగస్థానే  శివుని విగ్రహాన్ని పెట్టారు. మత సంప్రదాయరీత్యా లింగరూపేణా  తప్ప, అన్యథా శివుడిని  పూజించడం నిషిద్ధం. లింగం  అంటేనే శివుడు.
ఒక సమావేశంలో 35 ఏళ్ళ ప్రాయంగల కాషాయవస్ర్త  ధారిణిని కలుసుకున్నాను. ఆవిడ పులిచర్మం కప్పుకున్నది. మెడలో రుద్రాక్షమాల ఉన్నది. శక్తి చిహ్నం ధరించింది. తొలుత ఎవరామె? అని అడిగాను. సిద్ధిమాత తెలియదా అని నా పక్కనున్నాయన ఆశ్చర్యపోతూ చూశాడు. సన్యాసినులలో ఆథ్యాత్మికంగా బాగా పేరు మోసిన విదుషీమణి సిద్ధిమాత.  ఉత్తరాదిలో ఆమె సుపరిచితురాలు. మురాదాబాద్ కు ఉత్తరాన 60 మైళ్ళ దూరంలో జన్మించిన రాజేశ్వరి 7 సంవత్సరాలకే మార్మిక ధోరణి చేపట్టింది. ఉత్తర ప్రదేశ్ లో ఆమె తండ్రి రాజా కూతురిని చూచి గర్వించాడు. చింతించాడు 12 ఏళ్ళ వయస్సులోనే తండ్రి కొలువులో పండితులతో వివాదాలను ఆమె చర్చించిందంటారు. ఏమీ చదువకుండానే తాత్విక సిద్ధాంత సుక్ష్మాలను విడమరుస్తూ పూర్వజన్మను గుర్తు పెట్టుకోగల ఇలాంటి వారిని జాతిస్మరులు అంటారు. ఈమెను 13వ ఏట ఒక యువరాజును ఎంపిక చేశారు. పెళ్ళికుమారుడు దేహమంతా ఆభరణాలు ధరించి, పెళ్ళినాడు గుర్రంపై రాగా పెళ్ళి కుమార్తె అదృశ్యమైంది. పోలీసులతో సహా ఎవరెంత వెదికినా కనిపించలేదు.
12 సంవత్సరాల  తరువాత నేపాల్ సరిహద్దులలో  ఆల్మోరాలో ఒక అందమైన  సన్యాసిని కనిపించింది.  ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు.  పదేళ్ళ పాటు మౌనంగా ఉంటానని  ప్రతిన పూనింది. అడవిలో  పులులను ధిక్కరిస్తూ, కంద  మూలాదులపై ఆధారపడి, చెట్లకింద  నిద్రిస్తూ, చెట్టు బొరడును  దుస్తులుగా ధరించి సంచరించినట్లు  చూచినవారు చెబుతారు. కుంభమేళా  సందర్భంగా హరిద్వార్ లో  ఆమె మౌనాన్ని వదిలి బయటికి  వచ్చింది. ఆమె పాండిత్యానికి  ఆధ్యాత్మిక శక్తులకూ, అందానికి  పేరు మోసినది.
సమావేశంలో నా తరువాత సిద్ధిమాత ప్రసంగించారు. ఆమె మృధువుగా మాట్లాడారు. సమావేశం చాలా నిశ్శబ్దంగా  ఉంది.
సిద్ధిమాత ఉత్తరకాశీ, గంగోత్రి ప్రాంతాలలో ఏటా కొన్ని వారాలపాటు గడుపుతారు. పండిత సాధువులు, సన్యాసులు  గౌరవిస్తారు. ఆమె వచ్చే  వరకు వేచి వుంటారు. తరువాత ఆమెతోపాటు అందరూ భోజనం  చేస్తారు. ఈ విధంగా వేదాంత సాధువులు తమ సంప్రదాయం కాని రీతులను గౌరవిస్తూన్నారు. ఆది శంకరాచార్యులు సహితం  శక్తిని పూజించారు. ఆమెను  శ్లాఘిస్తూ గానం చేశారు.

బౌద్ధం
నేను నలందాలో  ఉండగా, ఇండియా ఎగుమతి చేసే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఏర్పడింది. క్రైస్తవ మతం  వలె బౌద్దం కూడా పుట్టిన  దేశంలో బ్రతకలేక ఎగుమతి అయింది. మధ్య యుగాలలో 400 సంవత్సరాలపాటు  సుప్రసిద్ధ బౌద్ధ అకాడమీగా నలందా పేరు మోసింది. టిబెట్, చైనా, మంగోలియా, మధ్య ఆసియాల నుండి సాధువులు, పండితులు నలందాకు వచ్చి సంస్కృతం, పాళిభాషలు నేర్చారు. బౌద్ధ  సంప్రదాయం, తత్వం అధ్యయనం  చేశారు. పవిత్ర సాహిత్యాన్ని తమ దేశానికి తీసుకెళ్ళారు. అప్పుడే టిబెట్, చైనా, కుచాన్, సోగ్ డియెన్ మొదలైన భాషల్లోకి  పవిత్ర గ్రంథాలు అనువదించారు. నలందా నుండి ఆసియా అంటికి విజ్ఞాన ప్రసాదం జరిగింది. టిబెట్లో లామాలను, ఢిల్లీ, కలకత్తా, లండన్, న్యూయార్క్ గురించి వన్నావా అని  అడిగితే తలియదంటారు. కాని నలందాను గురించి వారు విన్నారు. పాండిత్యానికి, పవిత్రతకు  నలంతా వారికి పెట్టింది  పేరు. నలందాలో తాంత్రిక విద్యను  పాటించి ఉంటారు. 5 వేల మంది సన్యాసులను చంపేసిన ఖిల్జీ చాలా పుస్తకాలను తగులబెట్టించాడు. అంతకు ముందే నాలుగు శతాబ్దాల పాటు వందలాది గ్రంథాలు టిబెట్, చైనాలకు వెళ్ళాయి. అక్కడ  ఆ భాషల్లోకి అనువాదం  అయ్యాయి. టిబెట్ మఠాలలో సంస్కృత  గ్రంథాలు కొన్నిటిని భద్రపరిచారు.
నన్ను నలందాకు  ఆహ్వానించారు. నలందాను బీహార్  ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొత్తగా నిర్మించింది. అక్కడ కొన్ని మాసాల పాటు నేను బోధించాను. టిబెటన్  అధ్యయనం ప్రారంభించాను. ప్రొఫెసర్ కాజియామా జపాన్  నుండి వచ్చిన పండితుడు. ఆయన  జపాన్లో నాకు ఆతిథ్యం ఇచ్చాడు. బౌద్ధ భిక్కు కాశ్యప మహాతేర నన్ను నలందాకు ఆహ్వానించారు. అక్కడ నేను పాళీ సాహిత్యం చదివి బౌద్ధం అధ్యయనం చేశాను.
ఇండియాలో  ఒక మతంగా బౌద్ధం ఎందుకు నిలువలేదనే దానికి అనేక కారణాలు చెబుతారు. కులాన్ని తృణీకరించడం ఒక కారణం కాగా, ఆకర్షణ లేని కఠిన నియమాలు అవలంభంచడం మరో  కారణమంటారు. బుద్ధుడు చనిపోయిన అనంతరం 300 ఏళ్ళ పాటు బౌద్ధ  మఠాలు బాగా వెలిశాయి. 200  సంవత్సరాల పాటు సంపన్నులు, పేదలు, రాజులు, వ్యాపారులు, పండితులు, పామరులు బౌద్ధ  భిక్షులు కావడానికి ప్రయత్నించారు. అయితే బౌద్ధం ఏనాడూ హిందూ  మతం నుండి పూర్తిగా విడిపోలేదు. హిందూ  సంప్రదాయంలో విభిన్న  దృక్పథలు వెల్లడి అవుతూనే  వచ్చాయి. అందులో బౌద్ధం కూడా ఒకటయింది. బుద్ధుడిని హిందూ  దేవుళ్ళలో కలిపేశారు. బుద్ధుడిని అవతారం చేశారు. బుద్ధుడు వేరే ఏదో బోధించాడని పునరుజ్జీవ హిందువు అంగీకరించడు.
బౌద్ధ బోధనలో మతేతర స్వభావం ఉన్నది బౌద్ధం క్షీణించడానికి అదొక కారణంగా  వచ్చు. తరువాత వచ్చిన బౌద్ధం అద్వైత వేదాంతానికి సన్నిహితంగా  ఉండే తత్వాన్ని చెప్పింది.
నేను నలందాలో  చేరిన రెండు రోజులకే  సయామ్ సాధువులు పరిచయమయ్యారు. వారిలో ప్రమహ మానస్ చిత్తదాసు  పుంగ్ల మాచియాక్ అనే బౌద్ధ  భిక్కు థాయ్ లాండ్ లో బౌద్ధ  మఠాథిపతి అయ్యాడు. ఆయన ఎమ్.ఎ. చదివాడు. ఇంగ్లీషు బాగా మాట్లాడతాడు. సయామ్ యువ భిక్కులందరూ  చాలా సరదాగా ఉండేవారు. స్ర్తీలను  గురించి మాట్లాడినప్పుడు  మీరు కలవరపడ్డారు. థాయ్ లాండ్లో  స్ర్తీల అందాల పోటీలను  గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. థాయ్ లాండ్ స్త్రీలు పాశ్చాత్య దుస్తులు ధరించడం  మొదలుపెట్టారు.
కలకత్తా నుండి థాయ్ ఏర్ వేస్ ద్వారా ప్రయాణం సాగించాను. నన్ను  చూడగానే నయామీస్ ఏర్  హో స్టెస్ పక్కకు తప్పుకున్నది. సన్యాసులకు దూరంగా ఉండటం  వారి ఆచారం. స్ర్తీలకు, సన్యాసుల మధ్య మర్యాదలు కఠినంగా పాటిస్తారు. సన్యాసులకు టీ ఇవ్వదలచినప్పుడు  వంగిగాని ఇవ్వరు.
బాంకాక్ చేరే సరికి పొద్దు గూకింది. నవ్వుతూ స్నేహ పాత్రులుగా ఉన్న ప్రజలు కనిపించారు. థాయ్-భారత్  సాంస్కృతిక వసతి గృహ డైరెక్టర్  పండిత రఘునాథ వర్మ నన్ను  ఆహ్వానించారు. నేను వారి కేంద్రంలోనే  బోధించవలసి ఉంది. అక్కడ పురుష  సేవకులంతా హిందువులే. నాకు మాత్రం ఒక 40 ఏళ్ళ సయామీ స్ర్తీని వంటకు గాను అమర్చారు. నా కోసం ఆమె భారతీయ పదార్థాలు చేసినా కుదిరేవి కావు.
సయామ్ ప్రజలు మంచి బౌద్ధులు. బుద్ధుడిని మహోన్నతుని గానూ, అతని బోధనలు అత్యున్నతంగానూ భావిస్తారు. వారిలో సందేహవాదులు లేరు. బౌద్ధమే సందేహవాద మతం, సయామ్  తేరవాదదేశం. మహాయాన దేశాలలో  వలె బుద్ధుణ్ని విగ్రహారాదన  చేయరు. క్షణికవాదాన్ని వీరు గుర్తిస్తారు. బుద్ధుడి కరుణను మూలసూత్రంగా భావిస్తారు. ఒకసారి ఇద్దరు సయామీ భిక్కులు న్యూఢిల్లీలోని బిర్లామందిర్ లో లక్ష్మీనారాయణ విగ్రహాన్ని  చూసి కాషాయ వస్త్రంతో నవ్వు  ఆపుకున్నారు. దంపతులు చేరొక  ఆనలుగు చేతులతో ఉండగా, గుంపులు  గుంపులుగా జనం ఆ విగ్రహాన్ని  పూజించడం వారికి వింతగా ఉంది. సయామ్ బౌద్ధంలో వ్యక్తిగత  దేవుడుండదు. బుద్ధుడు మానవుడు. మానవుడిలోని ఉన్నత లక్షణాలన్నీ  నెలకొన్న బుద్ధుడిని థాయ్ లాండ్ లో ఇళ్లల్లోనూ, గుళ్ళలోనూ పూజిస్తారు.  ఈ విషయంలో హిందువులకంటే వీరు చక్కని సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
బాంకాక్ లో రెండు బౌద్ధ మఠాల విశ్వవిద్యాలయాలున్నవి. నలందాలో నేర్చిన వారు మహాచులలాంగ్  కార్స్ అకాడమీ వారు. మరొకటి మహా మాంగ్ కుట్ అనే రాజు స్థాపించిన అకాడమీ. ఇందులో మతాల పోలిక గురించి బోధించాను. నేను ఇంగ్లీషులో చెప్పేవాడిని. మౌలిక విషయాలు సయాం బౌద్ధ  భిక్కులకు చెప్పేటప్పుడు  ఒక చిక్కు ఎదురైంది. తాత్వికరీత్యా  దైవం, ఉనికి, జడపూరిత విశ్వ  గురించి వారికి అర్థమయ్యేటట్లు చెప్పటం కష్టమయ్యింది.
బౌద్ధ భిక్కులకు  ఉనికి, దైవం గురించి అర్థమయ్యేటట్లు చెప్పగలిగాను. ఇదేదో రుగ్మతతో కూడిన భావన అని తొలిదశలో వారు అనుకునేవారు. బుద్ధుడు చెప్పినట్లుగానే క్షణికానికి  వ్యతిరేకమైన విషయాలు సూచించి  అంతవరకు వారిని లేని భావాలను  విడమర్చి చెప్పాను. బుద్ధుడు తృణీకరించిన దానిని సూచన ప్రాయంగా కూడా అంగీకరించడానికి  భౌద్ధ భిక్కులు ఒప్పుకోక పోవడం వలన నేర్చుకోవడంతో  వారికి చిక్కులేర్పడినాయి. వారిని మార్చటానికి అలాంటి పద్ధతి తనకు నచ్చదని పదే  పదే చెప్పవలసి వచ్చింది. క్రమేణా కొందరు బౌద్ధ భిక్కులు బుద్ధుడు దేవిని వ్యతిరేకిస్తున్నాడో  గ్రహించారు.  తేరవాద బౌద్ధానికి ఆనాత్మవాదం కీలకం, హిందువు  దృష్టిలో అనాత్మ కంటే తాదాత్మ్యం చెందిన బ్రహ్మ అని అర్థం  ఇది సయామీ దృష్టిలో వినని  విషయం. అనాత్మవాదం అంటే ఆత్మ కానిదనే వారి దృష్టిలో ఇది  చాలా సాధారణ విషయం. ఒకే పదజాలాన్ని హిందువులు, సయామీలు ఎలా  అర్థం చేసుకుంటారో గ్రహించవచ్చు.
బాంకాక్ లో సింధీ వ్యాపారి వారానికోసారి సత్పంగ సమావేశం జరుపుతాడు. అక్కడ సహజధారి సిక్కులు చేరుతారు. వారు గురునానక్  ను అనుసరించి గురుగ్రంథ  సాహెబ్ ను పాటిస్తారు. గడ్డాలు, తలపాగాలు ఉండవు. ఈ గృహాలు, కార్లు, పిల్లలు, సంపద, అంతా వృథా అని ప్రతిసారీ ఆ  సంపన్న వ్యపారి చెబుతుంటే  సమావేశమైన సంపన్నులు తలలూపుతుంటారు. దైవాన్ని స్మరించడం రాత్రింబగళ్లు  ధ్యానం చేయడం, దైవ నామ స్మరణలో  లీనంగావటం ఒక్కటే కాలాన్ని వృథా చేయకపోవటమని ఆ వ్యాపారి అన్నాడు.
సయాం ప్రజలు ఇందుకు భిన్నంగా ఉంటారు. వీరు మతాన్ని, నిత్య జీవితాన్ని వేరు చేసి చూస్తారు. పండగల్లోనూ, వారంతంలోనూ, దేవాలయానికి  వెళ్తారు. బోధనలు వింటారు. బౌద్ధ ప్రతిమ ముందు సాష్టాంగపడతారు. క్షణికం గురించి తెలుసుకొని నిర్వాణాన్ని గ్రహిస్తారు. కాని దేవాలయం నుండి బయటికి వస్తే వారు హాయిగా కూలాసాగా గడుపుతారు. మతాన్ని వారు తీవ్ర విషయంగా స్వీకరించరు. థాయ్ ప్రజలు ప్రేమను, దయను, చూపుతారు. జీవితంలో ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలను థాయ్ ప్రజలు స్వీకరించారు.

కొత్త ప్రపంచంలోకి
వివేకానందుడు  గత శతాబ్దాంతంలో అమెరికా, యూరప్  లలో పర్యటించారు. ఆయన వలన  భారతదేశం పట్ల అక్కడివారికి అసక్తి పెరిగింది. మేధావులు ఉద్వేగం పొందారు. దురదృష్టవశాత్తు  కుహనా స్వాములు కొందరు వివేకానందుకు తోడయ్యారు. ఈ విషయాన్ని  ఆయన గ్రహించలేక పోలేదు. కాని అలాంటి వారిని వివేకానంద  నిరుత్సాహ పరచలేదు. అందు వలన ఈ స్వాములచుట్టూ  మరికొందరు స్వాములు పోగయ్యారు. అందులో కొందరు పూర్వ జన్మలో భారతీయులమన్నారు. అలాంటి వారంతా వివేకానందుడు నాటిన విత్తనాలు  బాగా పెంచి, పోషించి రెండు  ఖండాలలో పర్యటించి అనుచరులను  పోగుచేసి బాగా డబ్బు వసూలు  చేశారు.  అయితే రామకృష్ణ, వివేకానంద వేదాంత కేంద్రాలు  ఆ మిషన్ వారు నడిపినంత కాలం బాగానే సాగాయి. హాలివుడ్ లోని దక్షిణ కాలిఫోర్నియా కేంద్రం స్వామి ప్రభవానంద  ఆధ్వర్యాన నడిచింది. ఆయన  గీతానువాదం 10 లక్షల ప్రతులు  అమ్ముడుపోయింది. అల్డస్ హక్సలి, క్రిస్టఫర్ ఈషర్ వుడ్, గెరాల్డ్ హెర్డ్, గ్రేటా గార్బో మొదలైనవారు ఈ కేంద్రాన్ని సందర్శించారు. దీక్షపొందిన ముగ్గురు అమెరికా  యువతులు కుంభమేళాలో వేలాది ప్రజలతో పాటు నదిలో స్నానం చేశారు. స్వామి అశోకానంద శాన్ ప్రాన్సిస్ కోలో ఆశ్రమాలను  కఠిన నియమాలతో నిర్వహించారు. రామకృష్ణ సూక్తులు, వేదాంత సాహిత్యం పైన వ్యాఖ్యానం వలన ఆయనకు పేరు వచ్చింది. ఒకవైపున ఇలాంటి ఉత్తమ కేంద్రాలు  నడుస్తుండగా మరో వైపు ఇంచుమించు  పిచ్చి వారనదగిన సాధువులు సైతం ఈ ఆశ్రమాల పేరుతోనే చలామణి అయినారు.
నేను వాషింగ్  టన్ యూనివర్శిటీలో ఇన్నర్ ఏషియా ప్రాజెక్టులో చేరాను. ఇందులో ఫీడర్ సర్వీసని ఒకటి పెట్టాము. ఇక్కడ పరిశోధనా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి.  నేను భారతీయ అధ్యయన్నాన్ని  ప్రవేశ పెట్టగలిగాను. భఆరతీయ తాంత్రిక విద్య, టిబెట్ బుద్ధిజంతో సంబంధం అనే పుస్తకం రాయటానికి  ఈ సంస్థవారు ఎలాంటి షరతులు లేకుండా ఖర్చు పెట్టారు. అమెరికాలోనే ఈ పద్ధతి సాధ్యం. చాలా సంస్కృత, హిందీ గ్రంథాలను  నేను తెచ్చాను. కోర్స్ ప్రారంభించినపుడు హిందీకి 98  మంది ఉండగా, సంస్కృతం చదవటానికి 28 మంది వచ్చారు. క్రమంగా  వీరి శాతం తగ్గి పోయింది. ఇలాంటి కోర్చులు తక్షణమే  పనికిరావని అమెరికాలో అభిప్రాయం  ఉన్నది. నా పరిశోధనకు తగినంత సాధన సంపత్తి అత్యంత అధునాతన  పరికరాలు ఉండేవి. ఇతర గ్రంథాలయాల నుండి కావలసిన పుస్తకాలను తెప్పించుకోవచ్చు. అనుకూల వాతావరణం, మైక్రోఫిల్మ్ లాంటివి పుష్కలంగా ఉన్నాయి. అమెరికాలో సమాకాలీన దృష్టి ఎక్కువ, స్వామి అంటే ఆకర్ముడిని వారి దృష్టి అందువలన నా వంటి వారు ఆమెరికా ఆధునిక రీతుల్లో ముఖ్యంగా క్రైస్తవ విలువలు పాటించే చోట ఒక పట్టాన ఇమడరు. ఇదిగాక ప్రాచీన భారతదేశాన్ని గురించి విదేశీయులు చూపించే ఆసక్తి పట్ల ఇండియాలో చాలా అనుమానాలున్నాయి. ప్రాచీన భారతదేశంలోని మార్మిక అలవాట్లు కృతువులు, అస్సాం, బెంగాల్ లోని అవినీతికర మతాచారాలు, తర్కంలోని లోపాలు, వాటి వలన ఇండియాపట్ల విదేశాలలో అపఖ్యాతి వచ్చిందని, కనుక ఆ విషయాల జోలికి పోకపోవడం మంచిదని ఇండియాలో ఒక భావన ఉన్నది.
నేను అమెరికా  వచ్చినప్పటి నుంచి ఆథ్యాత్మికంగా  ఊరటకై చాలా మంది నన్ను  సమీపించారు. అలాంటి వారిని యోగ, బుద్దిజం, పునర్జన్మను  గురించి మాట్లాడదలిస్తే సంస్కృతం, పాళీ నేర్చుకు రమ్మన్నాను. జెన్ బుద్ధిజం గురించి మాట్లాడదలిస్తే చైనా భాష నేర్చుకోమన్నాను. కాని వారికది నచ్చదు. చాలా మంది యోగులు, స్వాములు అమెరికాకు  వచ్చి వెళ్ళారు. అలాగే  డాక్టర్లు, ఇంజనీర్లు కూడా నా ప్రయోజనం ఏమంటే సాంస్కృతిక విమర్శకు పరిమితం కావాలని  మాత్రమే.
ఇండియాలో  అధికార అవినీతి, అపరిశుభ్రత, రోడ్ల దుస్థితి గురించి  మాట్లాడితే కోపం వచ్చినా  సహిస్తారు. అపన్నీ నిజమేనని ఒప్పుకుంటారు. విదేశాల నుండి  వచ్చినవారు అమెరికాలో యంత్రాలను  ఆహారాన్ని విమర్శిస్తే, అలాగే సహిస్తారు. కాని ఇది  సాంస్కృతి విమర్శకాదు. గాంధీని  మతంపై కలగావులగపు భావాలు వెల్లడించినందుకు విమర్శిస్తే, బుద్ధుడు దేవుడిని నమ్మాడని గాంధీజీ అన్నందుకు విమర్శిస్తే  అది సాంస్కృతిక విమర్శ అవుతుంది. హైందవ పునర్వికాసం కోరేవారు దీన్ని ఒప్పుకోరు. అలాగే  ఆమెరికా అధ్యక్షుడు ఇండియాలో చర్చికి పోవడాన్ని విమర్శిస్తే, అది సహించరు.  ఇది కూడా సాంస్కృతిక విమర్శే, బుద్దుడు దేవుడని నమ్మాడని గాంధీ  ఎన్నడూ ఎక్కడా అనలేదని రుజువు చేస్తే ఫరవాలేదు. కాని అలా  చేయరు. మదన్ మోహన్ మాలవ్య, ఒకసారి విద్యార్థులకు సలహా ఇస్తూ పాలు తాగండి, వ్యాయాం  చేయండి, దైవాన్ని స్మరించండి అన్నారు. దీనికి నేను విమర్శిస్తే  నాకు హిందూతత్వం అర్థం కాలేదని, ప్రాచీన ఋషులు అనుభవం ఆధారంగా  మాలవ్య చెప్పాడని అన్నారు. కాని మాటల సందర్భంగా మాలవ్య అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఋషిగా వుండటానికి, యూనివర్శిటీలో  ఋషిగా అభివృద్ధి చేయడానికి  ఒకే పద్ధతిని వినియోగించడం సరియైన ధోరణికాదు.
రష్యా పండితుడు ప్రొఫెసర్ స్టెచర్ బాట్ స్కీ లెనిన్ గ్రాడ్ ను నాజీలు పట్టుకున్నప్పుడు ఆకలితో మరణించాడు. మహాయాన బౌద్ధంలోనూ, బౌద్ధ తర్కంలోనూ అతడు గొప్ప  ప్రామాణికుడు. ఈ విషయాన్ని  ఇండియాలో ఒక ఉన్నత సంస్కృత  పండితుడితో చెప్పినప్పుడు  ఆ రష్యన్ అసలు పండితుడే కాదనట్లు మాట్లాడారు. అతడు చేసిన కృషిని ప్రస్తావించి వాటి సంగతేమిటని అడిగితే పారిస్ తాగి రాత్రిళ్ళు విలాస క్లబ్బులకు వెళ్ళేవాడని  చెప్పాడు. సాంస్కృతిక విమర్శలో పాండిత్యానికి, జీవిత విధానానికి మానసిక తాత్విక రీతుల దృష్ట్యా ఎలాంటి సంబంధం లేదని గ్రహించాలి.
నాస్తికత్వానికి, విధేయత లోపానికి సంబంధాలు లేవు. రస్సెల్ వంటి నాస్తికులు పరిపాలిస్తే నియంతృత్వం గాని, నీతి మయం లేకపోవడం గాని ఉండదు.
సాంస్కృతిక  విమర్శ అనేది సమగ్ర దృక్పథం  గలది. గాంధీ బోధనలను నేను పొగిడితే, నా మాటలలో తాత్వికత, విషయజ్ఞానం లేకపోయినా, ఇండియాలో నన్నెవరూ వ్యతిరేకించరు. పైగా నాకు చాలామంది స్నేహితులవుతారు. కాని నేను విమర్శకు పూనుకోవాలంటే పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి. అసత్యమని తెలిసి కూడా ప్రీతి కరంగా మాట్లాడుతుంటే, నాగరికులు కూడా ఆనందిస్తారు.
సిద్ధాంత  రీత్యా నైతిక దృష్ట్యా తేడాలున్నప్పుడు  వాటిని చూపాలి తప్ప, నవ్వుతూ  ఊరుకోకూడదు. ప్రపంచంలో ప్రజల  మధ్య సాధారణ విషయాలెన్నో  ఉన్నాయి గనుక అందరూ కలిసి  రావాలని అంటుంటారు. ఒకే  సిద్ధాంతాన్ని నమ్మినవారు పోరాడుకోరాదనటం అర్థం లేని మాట. బర్మాలోని తేరవాద బౌద్ధులు సయాం తేరవాద బౌద్ధులపై దాడి చేసి లోగడవారి రాజధాని ఆయూధియాను  తగులుబెట్టారు. బౌద్ధ విగ్రహాలను తగుల బెట్టి అందులో బంగారం ఉందేమోనని వెదికారు. యూరోప్ లో క్రైస్తవ దేశాలు సామరస్యంగా ఉండటం లేదు. అన్ని మతాలలో సారాంశం ఒకటేనని చెప్పటం  భ్రమ. అన్ని మంచి సిద్ధాంతాలలో ఐక్యత ఉన్నదనటం కూడా మిథ్యే. పరస్పరం కాల్చుకోకుండా  బ్రతకటం మంచిదని నమ్మటం ఒకటే సరైన తీరు.
సంస్కృతులకు పరస్పర అధ్యయనం చేయాలి. మనకున్న  పాండిత్యాన్ని విచక్షణను  ఉపయోగించి ఈ విమర్శను సాగించాలి. ఒకరి సంస్కృతిని మరొక సంస్కృతికి అనుకూలంగా మార్చే దృష్టితో సాంస్కృతిక విమర్శ జరుగరాదు. దోషాలు తెలుసుకుని, కొత్త  పంథాలు చూడటానికే విమర్శ జరగాలి. భారతీయులు పాశ్చాత్యులను, అలాగే  పాశ్చాత్యులను భారతీయులను పరస్పరం మార్చుకోవడానికి  విమర్శించుకోరాదు. వారి దృష్టిలో ముఖ్యమైన విషయాలను ఏ దృష్టితో చూస్తున్నారనేదే గ్రహించాలి. సాంస్కృతిక విమర్శ వివిధ  సంస్కృతులకు చాలా ఉపయోగకారి. ఇండియాలో ఎమ్.యన్. రాయ్ ఇలాంటి సాంస్కృతిక విమర్శ చేశారు. నేను జర్మన్, యూరోప్ ఆలోచనలను, భావాలను విమర్శించాను. ఇందులో బయట వారు, లోని వారు అనే తేడా ఉండదు. విమర్శ దృష్టా ఆయా వ్యక్తులు అంతరంగికులైతారు. ఇలాంటి విమర్శలలో తన, మన అనే భేదభావాలు అర్థరహితమౌతాయి.


రచయిత తుది మాట
పాశ్చాత్యులలో హిందూ సన్యాసిగా వృత్తిరీత్యా మారిన ప్రథముణ్ణి నేను. ఇలాంటి ప్రయత్నం అనేక మంది చేశారు.
అలాంటి  వారందరినీ కర్మకోలా గ్రంథంలో గీతామోహతా ఆశ్రమ మూర్ఖులన్నారు. ఇది చాలా మంది విషయాంలో నిజమే. పాశ్చాత్యులు పూర్తిగా ప్రాచ్య  విధ్యాధికులైతేనే మార్పు సాధ్యం. అలాంటి మార్పును నా పుస్తకమంతా వివరించాను. కష్టపడి  భారతీయ మత విధానంలో స్థానం సంపాదించాను. ఇతరులకూ నాకూ సన్యాసిగా అదే తేడా.
అనుకున్నది  పొందలేక పాశ్చాత్య లోకానికి తిరిగెళ్ళి నిరుత్సాహంగా గడిపిన వారున్నారు. నేను ఇండియా నుండి వెళ్ళినా భారతదేశం అంటే ఇష్టపడుతూ నిశిత పరిశీలన  చేస్తూ గడిపాను.
భారతీయ  చింతనాపరులు, తాత్వికులతో  తరచూ చర్చించాను. విమర్శ అంటే తృణీకరించడానికి కాదని  చెప్పగలిగాను. అమెరికాలో  అడుగు పెట్టిన తరువాత భారతీయ విషయాలు చెబుదామనుకున్నాను. అలా కుదరదని మానవ శాస్త్రంలో అదొక భాగంగా యిమిడ్చి చెప్పాలని  సలహా చెప్పారు. సాంస్కృతిక మానవ శాస్త్రంలో ప్రావీణ్యత పొందాను. సిరాక్యుస్ యూనివర్శిటీలో  స్థిరపడి అక్కడే బోధన చేశాను. సంస్కృత సంప్రదాయేతర భారతీయ నిపుణులు, అంటరాని వారు, దేవల గురించి ఎంతో తెలుసుకున్నాను. ఇండియాను గురించి తెలుసుకొనే కొలది ఆసక్తి పెరిగింది.
భారతీయతను నాలో జీర్ణం చేసుకున్నాను. పరమార్థం గురించి రోజూ ధ్యానం చేసే వాడిని.
ఏ కాంతంలోనే  దృష్టిని సాధించగలమని గ్రహించాను.