గీతా రహస్యం---తేదీల ఒడిదుడుకులు





అధ్యాయం మూడు

కలియుగం అనేది చాలా మోటుభావన. పురావస్తుశాఖ పరిశోధనలకు విరుద్ధమైనది. ఆటవిక, బర్బర, నాగరిక యుగాలు చరిత్రలో సుప్రసిద్ధమైనవి. వీటిలో వివిధ దశలున్నాయి. ఒక దశ కొత్త దశకు స్థానం కల్పిస్తూ మిళితమౌతూ పోతుంది. పక్క పక్కనే వివిధ దశలూ వుండవచ్చు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో క్రమేణ ధర్మం క్షీణిస్తూ, శాంతి సంపదలు కోల్పోతూ ఉంటాయనే భావన ఛాందసమైనది. అయినప్పటికీ కలియుగం ఎప్పుడు ప్రారంభమయిందా అనే చర్చ చేస్తూ ఉంటారు.
కలియుగం నిర్ధారితమైతే కురుక్షేత్ర యుద్ధం తేదీలు చెప్పవచ్చునని సనాతనుల ఉద్దేశం. వీరి అభిప్రాయంలో 3101 క్రీ.పూ. కలియుగం ప్రారంభమైనప్పటి నుండి 5 వేల సం.రాలు గడిచేసరికి క్రీ.త. 1899 వచ్చిందని అన్నారు. దీనితో అంగీకరిస్తున్నట్లు వైద్య చెప్పాడు. (Mahabharatha-A Criticism, 1929 : Page 55, 56) సనాతనులు ఎంత ఎలుగెత్తి చాటితే అంత ఖచ్చితంగా నమ్మినట్లు భావిస్తారు. భారతదేశానికి అదొక విషాద పరిణామం. మూఢ నమ్మకాలకూ, వివేచనా రాహిత్యానికీ భారత దేశం చాలా సారవంతమయింది.
కృత, కలియుగాలనేవి హిందువుల నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన దైవ నిర్ణయమని నమ్మారు. ఇవి మిగిలిన ప్రపంచానికి చెందవు. ఇతర ప్రజలకూ, లోకానికీ ఎలాంటి పెత్తూలేదు. విదేశాలకు పోకుండా హిందువులను వేలాది సంవత్సరాలు ఆపారు అది నత్త జీవితం వంటిది.
కలియుగారంభంలో ఆర్యులు సంచారజాతులు. 1500 సం.రాలు పాటు తిరిగి సింధులోయకు చేరారు. మరో 500 ఏళ్ళకు గంగా యమున ప్రాంతాలకు చేరారు. అలా స్థిరపడిన ఆర్య తెగల మధ్య నేటి ఢిల్లీగా పేర్కొంటున్న ప్రాంతంలో క్రీస్తు పూర్వం 3102-3101 ప్రాంతాలలో పోరాటాలు జరగటం సంభవమా? సప్త సింధు ప్రాంతం ఆర్యుల అసలు ప్రాంతమని అభినాష్ చంద్రదాస్ పేర్కొన్నాడు. అక్కడి నుండి నలువైపులా వెళ్ళి తమ దివ్య సంస్కృతిని ఆర్యులు వెదజల్లారన్నారు. ఈ సిద్ధాంతాలను వివరించటానికి దాస్ రెండు పెద్ద గ్రంధాలు రాశారు. వీటిని నవ్వులాటకైనా చదవాలనిపించదు. (Rigvedic India, Rigvedic Culture).
కలియుగం క్రీ.పూ. 3102లో ఆరంభమైందనటానికి శాసనాలు ఆధారం ఉండదన్నారు. అయిహోలా శాసనం రెండవ పులకేసికి చెందినది. పశ్చిమ చాళుక్య రాజ్యంలోని ఈ శాసనం చాలా ప్రాచీనమైనది. (A.D. Pusalker, History and Culture of the Indian People Vol. I. The Vedic Age) అయితే యిది క్రీ.త. 634కు చెందినది. అలాంటప్పుడు 3736 సం.రాల తరువాత వచ్చిన శాసనాన్ని కలియుగానికి సాక్ష్యంగా సనాతనులు మాత్రమే స్వీకరించగలరు ఆర్యభట్ట అంచనాల ప్రకారం కలియుగం క్రీ.పూ. 3102లో ప్రారంభమైంది. కాని, ఆర్యభట్ట క్రీస్తు తరువాతవాడు. 3600 సం.రాల తరువాత ఉన్న ఆర్యభట్టు ఖగోళ అంచనాల ఆధారంగా చెపుతున్నాననటం సనాతనులకు నచ్చవచ్చు.
కలియుగారంభాన్ని, రాజరికాల తేదీలను భవిష్యపురాణం అందించగా మత్స్య, వాయు, బ్రహ్మాండ పురాణాలు అనుకరించాయి. ఈ భవిష్య పురాణం నటనకు మారుపేరు. భవిష్యత్తులోకి తొంగిచూచి రాజ్యాలు రావటం, పోవటాన్ని చెప్పగలమన్నారు. వాటి ఆధారంగా కలియుగం ఎప్పుడు మొదలయిందో అంచనాలు వేస్తామన్నారు.
పురాణాలలో రాజ్యాలూ, రాజులు పట్టీల తేడా ఉన్నది. ప్రతి పురాణంలోనూ వివిధ రాజ్యాల కాలాలు అనేక విరుద్ధాలతో కూడి ఉన్నది. 14 నుండి 25 సం.రాల వరకూ ఈ తేడాలు కనిపిస్తున్నవి. పర్గీటర్ అంచనాలలో 18 సం.రాల కాలపరిమితి ఒక్కొక్క రాజ్య పాలనకు ఉన్నది. వైద్య ఈ పరిమితిని 20 సం.రాలన్నారు.
బాషమ్ 19 సం.రాలకు కుదించాడు. టి.టి. శ్రీనివాసయ్యంగార్ 25 సం.రాల వరకూ పెంచాడు. విన్ సెంట్ స్మిత్ 25. 2 సం. రాలన్నారు. ఎ.డి.పుసాల్ కర్ 18 సం.రాలకు తగ్గించాడు. పి.ఎల్. భార్గవ, 20 సం.రాలన్నాడు. పురాణంలోని రాజ్యాల కాలపరిమితిని ఫ్లిట్, హార్నెల్ అనేవారు 15 సం.రాలకు పరిమితం చేశారు. ఎ.ఎస్. ఐటేకర్ 16.5 సం.రాలన్నారు. బి.బి.లాల్ 14.5 సం.రాలన్నాడు. ఎస్.యస్. ప్రధాన్ 14 సం.రాలన్నాడు. విసుగు పుట్టించే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం.
ఏ ఇరువురు చరిత్రకారులూ రాజ్యాల పరిమితిని గురించి ఏకాభిప్రాయానికి రాలేక పోయారంటే వారు స్వీకరించిన ఆధారాలు తప్పుడివి కావటమే కారణం. ఈ సామ్రాజ్యాల పట్టిక చాలా పెద్దదయినప్పుడు సగటు సంఖ్య 5కు మించి లెక్కల్లో పెద్ద తేడా వస్తుంది. ఏ రాజు తరువాత ఎవరు వచ్చారనేది తేలకుండా పోతుంది.
చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 332లో తన రాజ్యాన్ని ప్రారంభించాడు. అదే నందులరాజ్యానికి చివరి దశ. అప్పటి నుండి, అంటే మహాపద్మనంద కాలం నుండీ కురుక్షేత్ర యుద్ధం వరకూ వెనక్కు వెళ్ళాలంటే 24 యిక్ష్వాకులూ, 27 పాంచాలులూ, 24 కాశీలూ, 28 హైహయులూ, 32 కళింగులూ, 25 అశ్మకులూ, 26 కురులూ, 28 మైధిలులూ, 23 సూరసేనులూ, 20 వీత హోత్రులూ స్వీకరించాలి.
257 సమకాలీన రాజులను పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కొక్కరికీ సగటున వంశానికి 26 రాజులను చూపవచ్చు. ఒక్కొక్క రాజుపాలన 18 సం.రాలుగా అంచనా వేస్తే 468 సం.రాలవుతుంది. నంద సామ్రాజ్యం క్రీ.పూ. 850 వరకూ వెనక్కు వెళ్ళ వలసి ఉంటుంది. కురుక్షేత్రయుద్ధానికీ, 10 సామ్రాజ్యాలకూ మధ్య మరికొందరు రాజులున్నారు. వారికొక 100 సం.రాలు కలిపితే కలియుగం క్రీ.పూ. 1132లో కలియుగం మొదలైనట్లు చెప్పాలి. ఈ అంచనాలలో విపరీతమైన ఊహలున్నాయి. రాజులపాలన కాలపరిమితికి నిర్ధారణ లేదు. పురాణాల ప్రకారం నందసామ్రాజ్యం 100 ఏళ్ళున్నది. జైన లెక్కల ప్రకారం 150 సం.రాలు. సిలోన్ అంచనాల ప్రకారం ఇది 22 ఏళ్ళు. మహాపద్మ పాలన 88 ఏళ్ళున్నదని కొందరు, 12 సం.రాలు మాత్రమేనని మరి కొందరు అన్నారు.
వృద్ధగార్గ, వరాహమిహిర అనేవారు క్రీ.త. సుప్రసిద్ధ ఖగోళ శాస్ర్తజ్ఞులు. కలియుగ ప్రారంభమైన తరువాత 653 సం.రాలకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందని వీరన్నారు. అంటే క్రీ.పూ. 2449-48లో అన్నమాట. దీనికి కాశ్మీరు చరిత్రకారుడు బి.సి. కల్హణ పూర్తి మద్దుత్తునిచ్చారు. కె.పి. జైస్వాల్ అనే చరిత్రకారుడు క్రీ.పూ. 1424లో జరిగిందన్నారు.
ఇలాంటి ఆధారాలను పురస్కరించుకొని కురుక్షేత్ర యుద్ధాన్ని నిర్ణయించటం గీతా పారాణం చేయటం అర్థం లేనిది. అయినా 1500 సం.రాల పాటు యుద్ధ కాల నిర్ణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని తేదీలు ఉదహరిస్తాను. ఆర్యభట్ట, భాస్కరాచార్య క్రీ.పూ. 3102 అన్నారు. సి.వి. వైద్య క్రీ.పూ. 3101, వృద్ధ గార్గ, వరాహమిహిర, కల్హణ, బి.సి. సేన్ క్రీ.పూ. 2444-48, జె.ఎస్. కరండికర్ క్రీ.పూ. 1922, బంకిమ్ చంద్ర చటర్జీ, ధీరేంద్రనాధ్ పాల్ క్రీ.పూ. 15వ శతాబ్దం, ఎం. రంగారావు క్రీ.పూ. 1468, పి.టి. శ్రీనివాసయ్యంగార్ క్రీ.పూ. 1450, హెచ్.టి. కోల్ బ్రూక్, లార్డ్ ఎల్ఫిన్సన్, హెచ్.హెచ్. విల్సన్, బాలగంగాధరతిలక్, శీతానాధ్ తత్వభూషణ్, ఆర్.సి. మజుందార్, హెచ్.సి. రాయ్ చౌదరి, పాల్ రేణు, ఎ. భాషమ్ క్రీ.పూ. 14వ శతాబ్దం, ఎ. జి. శంకర్ క్రీ.పూ. 1198, విన్ సెంట్ స్మిత్ క్రీ.పూ. 1000.
ఇంకా ఎక్కువ చర్చ సాగిస్తే తేదీలతో పాటు గందరగోళం కూడా పెరుగుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వారిలో వివేచనాపరులు కలియుగం కట్టుకథ అన్నారు. జె.ఎఫ్. ప్లీట్ ఈ విషయంలో ఆర్యభట్లపై నెపం వేశారు. క్రీ.త. 498లో ఆంధ్రరాజ్యం అంతమైనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని కె.పి. జైస్వాల్ అన్నాడు. కలియుగ ఆరంభాన్ని గురించిన అంచనాలు భారతీయ ఖగోళ శాస్ర్తజ్ఞుల కృత్రిమ లెక్కలపై ఆధారపడ్డాయన్నారు. దీని కౌరవ, పాండవ సంఘర్షణలు జోడించారు. మొత్తం మీద కలియుగ భావన నమ్మకంతో అల్లిన కథ మాత్రమే.

V.R Narla Telugu version: Innaiah Narisetti

No comments:

Post a Comment