గీతాబోధన---Truth about Gita-2

పరిచయం

ఈ పుస్తకాన్ని గీతామిధ్య అంటే సరిగ్గా ఉంటుంది. గీతను గురించి చెప్పేదంతా సందేహాస్పదమే. కురుక్షేత్రంలో నిజంగా పోరాటం సాగిందా. ఒకవేళ అది జరిగి ఉంటే దేశవిదేశాలలోని తెగలన్నీ ఏదొక వైపు కోపు వేసుకున్నాయా? యుద్ధం ఎప్పుడు జరిగింది? అర్జునుడు, రథసారధిగా కృష్ణుడు ఉన్నాడా. అనేక యుద్ధాలు గెలిచిన అర్జునుడు దుర్యోధనుడి అపార బలగాన్ని జూచి కలవరపడ్డాడా? బంధు మిత్రులనందరినీ చంపాలనే ఆలోచనతో చలించి పోయిన అర్జునుడు కృష్ణుడి ప్రోత్సాహం వలన భీభత్సకాండ జరిపాడా? కృష్ణార్జునుల సంవాదం సాగుతుండగా ఇరువైపులా సైన్యాలు చూస్తూ నిలబడి పోయాయా?
కురు క్షేత్రంలో కృష్ణుడు చెప్పిన భగవద్గీత మనకెలా వచ్చింది? మహాభారతం ప్రకారం హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ణుడికి ఏ రోజు కారోజు సంజయుడు నివేదించటంతో గీతకూడా వచ్చింది. కృష్ణుడి నోటి నుండి ఊడిపడిన ప్రతిమాటనూ పొల్లు పోకుండా సంజయుడు వృధ్ధుడైన, గుడ్డి అయిన ధృతరాష్ర్టుడికి అందించాడు. యుద్ధరంగంలో ఎవరికీ కనిపించకుండా, ఆయుధాల తాకిడికి దెబ్బతినకుండా యధేచ్ఛగా సంజయుడు సంచరించాడు. అతనికి పగటికి-రాత్రికి తేడా లేదు. అలసట లేదు. నిర్విరామ కృషి చేశాడు. అందరి మనస్సుల్లోని ఆలోచనలు గూడా చెప్పగలిగేవాడు.
సంజయుడు ఇదంతా ఎలా చేశాడు? నేటి శాస్ర్తీయ సాంకేతిక పరమైన రెడియో, టెలివిజన్, వీడియోలు సహితం తలవంచుకునేటట్లు సంజయుడు ఎలా చేశాడు? అది చొప్పదంటు ప్రశ్న అని సాంప్రదాయ వాదులు అంటారు. పూర్వం రుషులకు దివ్యశక్తులుండేవట. వరాలివ్వటంలో వ్యాసుడు అత్యున్నత స్థాయిలో ఉండేవాడు. కురురాజు ధృతరాష్ర్టుడు యుద్ధ విశేషాలను సంజయుడి ద్వారానే తెలుసుకోటానికి వీలుగా అన్నిటినీ వివరించేవరాన్ని యివ్వమని కోరగా వ్యాసుడు ప్రసాదించాడు. అది కేవలం యుద్ధం చివరి రోజున సంజయుని పట్టుకొని చంపబోతున్న సాత్యకికి వ్యాసుడు అడ్డుపడ్డాడు. (Sorensens : An Index to the names in the Mehabharata, 1963 : Delhi, Page 6-9).
ధృతరాష్ర్టుడు వ్యాసుని ధర్మసంతానంలో ఒకడు, వ్యాసుడు సహితం సత్యవతి-పరాశరులకు పెళ్ళికి ముందే పుట్టినవాడు. వ్యాసుడికి అక్రమ సంతానం నలుగురు పుత్రులున్నారు.
మహాభారత కాలంలో తాగుడు, జూదం, పశువులను అపహరించటం, కన్యలను ఎత్తుకుపోవటం సాధారణంగా ఉండేవి. మూకుమ్మడి హత్యలు సాగేవి. సింహాసనాధి పత్యం కోసం, నరక ప్రాప్తి తప్పించుకోటానికి వేరేవారితో నైనా కొడుకుల్ని కనటం ఆమోదించారు. ఆవిధంగానే తల్లిమాటల్ని పాటించి అంబికా, అంబాలికలను వ్యాసుడు గర్భవతుల్ని చేశాడు. వారి భర్త చనిపోయినందున భరత వంశం కొనసాగే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి విధానాలు ఆనాడు చాలా జరిగాయి.
వ్యాసుడు దైవ సమానుడు. అలా భావించిన సంప్రదాయవాదులు అతన్ని పైకెత్తారు. అంబికకు పుట్టిన ధృతరాష్ర్టుడు వ్యాసుని గుడ్డి సంతానం. అంబాలికకు వ్యాసునిద్వారా పుట్టిన పాండు రాజు రోగిష్ఠి, మరొక కుమారుడు విదురుడు వివేకి, ఆరోగ్య వంతుడు కాని, అతడి తల్లి శూద్ర యువతి కావటం వలన విదురుడికి సింహాసన హక్కు దక్కలేదు. వ్యాసుణ్ణి ఈసడించుకున్న అంబిక తన సేవకురాలిని అతనికి అప్పగించింది. వ్యాసుడి నాల్గవ సంతానం శుకుడు. వ్యాసుడి రేతస్సు నుండి క్షణికంగా శుకుడు పుట్టాడు. ఇంద్రుని కొలువులో ఒక అప్సరను చూచి రేతస్సు చిందించగా శుకుడి జన్మ జరిగింది.
పాండవులందరూ అక్రమ సంతానమే. కుంతికి పుట్టిన ముగ్గురికీ తండ్రులు ముగ్గురు. మాద్రికి పుట్టిన కవలలకూ అంతే. పెళ్ళికాక ముందు కుంతి కర్ణుడిని కన్నది. సత్యవతి వలెకాక, కనగానే కుంతి కర్ణుడిని వదిలేసింది. ఇలాంటి చర్యలన్నింటికీ అతిలోక ముసుగు కప్పి మహాభారతం నింపారు.
భరత వంశానికే కాక ఇతర రాచరికాలలోనూ లైంగిక స్వేచ్ఛ బాగా ఉండేది. కంసుడు మధుర రాజు ఉగ్రసేనుడి కొడుకు, కృష్ణుడి మేనమామ. దానవుడు రాణిని చెరచగా కంసుడు పుట్టాడు. పాంచాల రాజు దృపదుడి పుట్టుక అంతే. అతడి సంతానం ద్రౌపది, దృష్టద్యుమ్నుడు. రాజు యజ్ఞం చేస్తూ రాణిని తనతో సంభోగించమంటాడు. ఆమె రుతువులో ఉన్నందున ఆగమంటుంది. కాని, యజ్ఞ సమయం ఆగకూడదు. గనుక, యజ్ఞ గుండంలో నుంచి ద్రౌపది, దృష్టద్యుమ్నుడు పెద్దవారు గానే పుడతారు. ద్రౌపది కారు నలుపు. అందువలన ఆమెను కృష్ణ అని పిలిచేవారు. కాని, ఆమె అందగత్తె, పాండవులు ఐదుగురికీ భార్య అయింది.
సంప్రదాయవాదుల ప్రకారం ఇదంతా యజ్ఞ ఫలం కావచ్చుగాని, ఆనాడు రుషులు యధేచ్ఛగా సెక్స్ ఆచరించిన ఫలితమని చెప్పవచ్చు. అక్రమ సంతానం నాడు విచ్చలవిడిగా ఉండేదో, అందుకు ద్రోణకృపాచార్యుల ఉదాహరణ చూపవచ్చు. వైదిక కర్మకాండలో అదొక భాగం. (Maxmuller : A History of Ancient Sanskrit Literature 1968, Varanasi, Page : 40).
మహాభారతాన్ని పంచమ వేదంగా సంప్రదాయవాదులు స్తుతిస్తారు. అది విజ్ఞాన సర్వస్వం అంటారు. అందులో లేనిది ఎందులోనూ లేదంటారు. మహాభారతం వ్యాసుడి విషమ పుత్రిక.
కృష్ణుడు గీత పేరిట అర్జునుడికి ఉపదేశించిన దేమిటో చూద్దాం. సంజయుడు యుద్ధ విలేఖరి. ధృతరాష్ర్టుడికి సాయంత్రానికల్లా పూర్తి చిత్రణ యిచ్చేవాడు. వ్యాసుడు అలాంటి అద్భుతాన్ని ప్రసాదించాడు. నాలుగు వేదాలను పరిష్కరించిన వ్యాసుడు మహాభారతాన్నీ, అష్టా దశ పురాణాలను, బ్రహ్మ సూత్రాల్ని, మరెన్నింటినో రాశాడు. ఈ ఉద్ర్గంధాలలో గీత వంటిది అతనికి మంచి నీళ్ల ప్రాయం. కురుక్షేత్రయుద్ధా నంతరం ఎన్నో సంవత్సరాలకు గాని అది రాయలేదు. మహాభారతంతో పాటు గీతను తన కుమారుడికీ, నలుగురు శిష్యులకూ చెప్పాడు. అందులో ఒకరు వైశం పాయనుడు. గురువువలె అతడిదీ బహుముఖ మేధస్సు. అర్జునుడి ముదిమనుమడు జనమేజయుడు నాగవంశాన్ని మట్టుపెట్టడానికి యజ్ఞం తలపెట్టాడు. (ప్రతి యజ్ఞానికీ పురోహితులకు బంగారం, ఆవులూ, ఆడపిల్లలూ దక్కేవారు) యజ్ఞ సమయంలో గీతతో కూడిన మహాభారతాన్ని వైశంపాయనుడు పారాయణం చేశాడు. అది విన్న సౌతి, ఉగ్రశ్రవుడు మహాభారత గీతను శౌనకాదిమునుల నిమిత్తం నైమిశారణ్యంలో పన్నెండు సంవత్సరాల యజ్ఞకాలంలో చెప్పాడు. ఆ తరువాత ఎవరు పారాయణ చేశారో తెలియదు.
గీత చెప్పిన కృష్ణుడికీ, అది పారాయణం చేసిన సౌతుడికీ వందేళ్ళ తేడా ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం యుధిష్టిరుడు 36 ఏళ్ళు పరిపాలించాడు. జనమేజయుడు నాగవంశాన్ని మట్టుపెట్టాలని తలపెట్టటానికి కారణం తన తండ్రి పరీక్షిత్తును వారు చంపటమే. నైమిశారణ్యంలో శౌనకుడు నాగయజ్ఞం ఎప్పుడు తలపెట్టాడో కచ్చితంగా తెలియదు. (Sitanath Pradhan : Chronology of Ancient India, Calcutta, 1972, Page : 71) కృష్ణుడి గీతాబోధనకూ, సౌతుడి పారాయణానికి, ఒక శతాబ్దం తేడా ఉంటే, ఆ తరువాత గీత వ్రాత పూర్వకంగా రావటానికి కొన్ని శతాబ్దాలు గడిచింది. సంప్రదాయవాదుల ప్రకారం అయితే ఇది వేలలో ఉంటుంది. అన్నాళ్ళు కృష్ణుడు చెప్పిన గీత యధాతథంగా ఉందనటానికి వీలులేదు.
గీత కంటె ఇంకా ఎక్కువ కాలానికి గాని వేదాలు రాతకు నోచుకోలేదనీ, అయినా, ఉచ్చారణతో సహా యధాతథంగా దిగుబడి అయ్యాయనీ సంప్రదాయ వాదులంటారు. గీత వేదంకాదు. దీని ప్రమాణాన్ని అందరూ అంగీకరించటం లేదు. 8వ శతాబ్దంలో ఉన్న ఆదిశంకరాచార్యుడు గూడా. గీతను ఎవరూ పట్టించుకోలేదు. బౌద్ధాన్ని ధ్వంసం చేయటానికి సాధనంగా గీతపై శంకరుడు వ్యాఖ్యానం రాశాడు. ఆర్య సమాజవాదులూ, బ్రహ్మ సమాజ వాదులూ, గీతకు అట్టే విలువ యివ్వరు. కనుక వేదాలకూ, గీతకూ సామ్యం చూపటం సబబు కాదు.
గీత రూపొందిన తీరూ, అది అందించిన వక్రమార్గం గమనిస్తే అదొక మిధ్యగా పేర్కొనవచ్చు. అలెగ్జాండర్ పోప్ వదంతులను గురించి చెప్పిన మాటల్ని గీతకు అన్వయించవచ్చు.
నేను కాలేజి రోజుల్లో తొలుత గీతను చదివాను. ఆ తరువాత దానిపై భాష్యాలెన్నో చూచాను. గీతరచనల, కాలం, ప్రదేశం తరతరాలుగా అందించిన తీరు అన్ని కాలాలకు, అందరికీ సరిపడే తత్త్వం అని ప్రచారం చేయటం అంతా బూటకమే. ఆ మాట పుస్తక శీర్షికకు పెట్టవలసింది. గీతభక్తులు చదవకుండానే పుస్తకం మూసివేస్తారని ఆ పని చేయలేదు. వారిని నా వైపు తిప్పుకోవాలనే భ్రమ నాకు లేదు. కొద్ది మందైనా గీత అల్పత్వాన్ని గ్రహిస్తే నా కృషి వృధా కాబోదు.
రచన తెలుగుసేత
నార్ల వెంకటేశ్వరరావు నరిసెట్టి ఇన్నయ్య



No comments:

Post a Comment