గీతా రహస్యం--3 Truth about Gita







అధ్యాయం ఒకటి
సందేహాస్పద సమరం
మహాభారతం అనే పదాన్ని పాణిని వాడాడు. ఏదైనా భరతుడికి సంబంధించిన గొప్పతనానికి విశేషంగా ఈ ప్రయోగం జరిగింది అని హాప్ కిన్స్ రాశాడు. (Edward Washburn Hopkins : A Cambridge History of India, Vol. I. Ancient India, ed. by E.J. Rapson, 1935, Page : 252, 253) భరతునికి సంబంధించిన గొప్ప కావ్యంగా మహాభారతాన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇలియడ్, ఒడెస్సెలకు ఎనిమిదిరెట్లు నేడు భారతం ఉన్నది. (V.S. Suktankar, on the Meaning of Mahabharata, Bombay, 1957, Page.8) భరతుల మధ్య, అంటే కౌరవ-పాండవుల మధ్య కురుక్షేత్రంలో జరిపిన గొప్ప యుద్ధం కూడా ఇందులో ఉందా? అలాంటి యుద్ధం జరిగిందనటానికి ఆధారాలు లేవు.
1. వేద సాహిత్యంలో కౌరవుల ప్రస్తావన ఉన్నది. పాండవుల ప్రసక్తి లేదు. మహాభారతాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన హాప్ కిన్స్ ప్రకారం బ్రాహ్మణాలు, సూత్రాలు కూడా పాండవుల ప్రస్తావన తేలేదు. మాక్స్ ముల్లర్ ప్రకారం కౌరవులు, భరతులూ వేద సాహిత్యంలో వున్నారు. పాండవులు లేరు. పాణిని వ్యాకరణంలోనూ, కౌరవ, భరతుల ప్రస్తావన ఉన్నది గాని, పాండవుల పేరు ఎత్తలేదు. (Maxmuller : A History of Ancient Sanskrit Literature, 1968 Varanasi Page 40)
క్రీ.పూ. 5వ శతాబ్దం మధ్యలో పాణిని జీవితకాలంలో పాండవులెవరో తెలియదు. (V.S. Agravala : India As known to Panini, Luknow, 1953, Page : 455-475).
2. రుగ్వేదంలో భరతరాజు సూదుడికీ, ఇతర తెగలకూ జరిగిన పోరాటాన్ని నేటి రావి నదీ తీరాన (నాటి పరుషణి ఒడ్డున) జరిగినట్లు ప్రస్తావన ఉన్నది. మహాభారత యుద్ధం జరిగి ఉంటే వేద సాహిత్యంలో తప్పని సరిగా పేర్కొనే వారే. వేదాలలో కౌరవ పాండవ యుద్ధం లేదని మాక్స్ ముల్లర్ స్పష్టీకరించాడు.
3. వేద సాహిత్యంలో కురుక్షేత్రాన్ని పవిత్రస్థలంగా పేర్కొన్నారే తప్ప యుద్ధభూమిగా కాదు. (D.C. Sirkar : Mahabharata Myth And Reality, ed. by S.P. Gupta and K.G. Rama Chandra, Delhi, Page.5)
4. వ్యాస, వైశంపాయనులు తైత్తీరీయ, ఆరణ్యకాలలో ప్రస్తావించిన మహాభారత కర్తలు మాత్రం కాదు.
5. కధక సంహితలో కురురాజు ధృతరాఘ్ర్టడి ప్రస్తావన ఉన్నది. అతడికీ, పురోహితుడికీ మధ్య ఒక క్రతువుకు సంబంధించిన వివాదానికి సంబంధించిన విషయం గానే వచ్చింది గాని, కురుక్షేత్ర యుద్ధ ప్రస్తావన లేదు. (A.B. Keith : Cambridge History of India, Vol. I. Page. 119).
6. అధర్వణ వేదంలో సంపన్నరాజుగా పరీక్షిత్ పొగడ్త ఉన్నది. శతపధ బ్రాహ్మణాలలో జనమేజయుడు గొప్ప యాగకర్తగానూ, పురోహితులకు దానం చేసిన వాడు గానూ పేర్కొన్నారు. అర్జునుడి వంశంలోని వాడుగా చెప్పలేదు.
7. మహాభారతంలో అర్జునుడు ఇంద్రుని కొడుకు. శతఫత బ్రాహ్మణంలో అర్జునుడే ఇంద్రుడు. (H.C. Ray Chandhury : An Advanced History of India, London, 1953, Page. 94).
8. ఆక్షౌహిణిలో 21, 870 రధాలు, 21870 ఏనుగులూ, 65, 610 గుర్రాలు, 109, 350 కాల్బలం ఉన్నది. (Dikshintar, V.R. Ramachandra : Wat in Ancient India, Madras, 1944, Page. 198). కురుక్షేత్రంలో కౌరవులకు 11, పాండవులకు 7 అక్షౌహిణులు ఉన్నాయన్నారు. నేడు అంతమంది ఒక చోట కూడటం సులభం కాదు. ప్రాచీన కాలంలో అది అసంభవం. యుద్ధ రంగంలో అంతమందిని ఒక చోట చేర్చటం సాధ్యమయ్యే పని కాదు.
9. కురుక్షేత్రంలో 11,80,980 గుర్రాలున్నాయన్నారు. పదాతిదళం 20 లక్షలన్నారు. కాని యుద్ధ ప్రస్తావనలో ముఖాముఖి పోరాటాలే ఆనాటి సంప్రదాయంగా ఉదహరించారు. (H.D. Sankalia : Mahabharata, Myth and Reality, Delhi, 1976, Page. 145).
10. ఎంత ఉదారంగా లెక్క వేసినా 40 లక్షలకు మించి యుద్ధంలో పాల్గొన్నట్లులేదు. కాని మృతుల సంఖ్య 1660 మిలియన్లని చూపారు. అంటే ఒక్కొక్కరూ 4 వందల సార్లు చనిపోయారన్న మాట. (Pratapchandra Roy : The Mahabharatha Calcutta, Vol 7, Streepartha, Page. 42-43).
11. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలు నాటికాలాన్ని బట్టి మోటైనవి. అంతకంటే ఉన్నత నాగరికతలో పెంపొందిన హరప్పా వాసులు రాతి, ఇత్తడి, రాగి పనిముట్లే వాడారు.
12. భారీ యుద్ధానికి కావలసిన ఇనుప ఆయుధాలు కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానపాత్ర వహించలేదు. క్రీ.పూ. 6వ శతాబ్దంలో గాని ఇండియాలో ఇనుము వాడకంలోకి రాలేదు.
13. మగధ ఆర్యేతర రాజ్యంగా పేర్కొన్నారు. వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రాంతమూ అంతే. కురుక్షేత్రంలో వీరెవరూ పాల్గొనిఉండరు.
14. రవాణా రాకపోకలు ఆదిమ దశలో ఉన్నప్పుడు దూర ప్రాంతాలలో ఉన్న భారీ సైన్యాన్ని రప్పించటం చాలా కష్టంతో కూడిన పని.
15. మహాభారతంలో ప్రాగ్ జ్యోతిష (నేటి అస్సాం) రాజు భగదత్తుడు ప్రధానపాత్ర వహించినట్లున్నది. వేద సాహిత్యంలో ఎక్కడా అతడి పేరు లేదు. పాణినికి కూడా అతడు తెలియదు.
16. యవనులు, శకులు, పల్లవులు యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడారని చెప్పటం అసందర్భం. భారత చరిత్రలో క్రీ.పూ. 5వ శతాబ్దం ముందు వీరి పాత్ర లేదు.
కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్ష్కహిణులున్నాయన్నారు. సమరం 18 రోజులు సాగిందన్నారు. పాండవులలో మిగిలిన వారు ఆరుగురు, కౌరవులలో ముగ్గురు. యుధిష్టిరుడు రెండు 18 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ యుద్ధానంతరం 36 ఏళ్ళకు కృష్ణుడు చనిపోయాడు. 18 పర్వాలలో మహాభారతం చెప్పారు. గీత కూడా 18 అధ్యాయాలలో ఉన్నది. ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు. సంఖ్యాశాస్రంలో నమ్మకం ఉన్నవారు అల్లిన పన్నాగ మే ఇది.
ఆధునిక భారత చరిత్ర కారులలో గౌరవించదగిన ఆర్.జి. భండార్కర్ నిస్సందేహంగా భారత, రామాయణ పురాణాలు చారిత్రకాలు కావన్నాడు. (Collected works, Poona, Vol. I, Page : 365) ఆధునిక విద్య వివేచనతో, ప్రశ్నించే తత్త్వంతో మనకు ఎందుకు రావటం లేదని అతను బాధపడ్డాడు.
ఆర్.సి. దత్. మరొక అడుగు ముందుగు వేసి మహాభారత యుద్ధం కట్టుకథ అన్నాడు. పంచ పాండవులు, ద్రౌపది గూడా అల్లినగాధే అన్నాడు. అతడు రుగ్వేదాన్ని బెంగాలీలోకి అనువదించాడు. శూద్రుడు వేదాల జోలికి ఎలా పోతాడని అతడి పట్ల సనాతనులు గొడవ చేశారు. మహాభారతం, రామాయణాన్ని కూడా ఇంగ్లీషులో సంక్లిప్తంగా అనువదించి అందించాడు. (R.C. Dutt : Civilization of Ancient India, Vol. I, London, 1893, Page : 122).
రామ్ మోహన్ రాయ్ మహాభారతంలో వ్యాసుడు ఆగాధంతా ఊహాజనితంగా పేర్కొన్న విషయం చూపారు. ప్రపంచంలోని ప్రధాన మతాల పవిత్ర గ్రంథాలను పరిశీలించిన రామమోహన్ రాయ్ గీతకు విలువ ఇవ్వలేదు. మతాలపై అతని రచనలలో గీతను పట్టించుకోనేలేదు.
గీత తనకు తల్లివంటిదని, 1889లో తొలుత గీతా పరిచయం ఐనప్పటి నుండీ అలాగే భావించానని గాంధీ అన్నాడు. (M.K. Gandhi, Geetha My Mother) ఐనప్పటికీ మహాభారత చారిత్రకత పట్ల అతనికి సందేహాలున్నాయి. గీత ప్రస్తావించిన సంఘర్షణ మంచి చెడుల మధ్య ప్రతి వ్యక్తిలో జరిగే పోరాటంగా పేర్కొన్నాడు.
వివేకానందుడు చారిత్రకత విషయమై అర్జునుడు, తదితరుల సంగతి సందేహాస్పదమే అన్నాడు. శతపధ బ్రాహ్మణంలో అశ్వమేధ యజ్ఞం సందర్భంగా అందరి పేర్లూ ప్రస్తావించినా, అర్జునుడు తదితరుల పేర్లు లేవన్నాడు. ఐనా, మహాభారతంలో యుధిష్టిరుడూ, అర్జునుడూ, ఇతరులూ అశ్వమేధ యజ్జం చేసినట్లున్నది. (Swami Vivekananda : Thoughts on the Geetha) ఐనప్పటికీ మహాభారతం ఇతి హాసంగా విలువను కాపాడుకుంటున్నదనీ, అందులో గీతకు ప్రాధాన్యత ఉన్నదనీ అన్నాడు. అర్జునుడు కల్పితమైతే, కృష్ణుడు చారిత్రక పురుషుడు కావటానికి వీలులేదు. ఇరువురూ కల్పితమైతే పరస్పరం సంభాషించుకున్నారనటంలో అర్ధంలేదు. గీతను ఎవరో అల్లి మహాభారతంలో చొప్పిస్తే, అది దివ్యవాణి ఎలా అవుతుంది?
మన సంప్రదాయవాదులు భండార్కర్ నూ, దత్ నూ పాత కాలపు చరిత్ర కారులుగా తీసి పుచ్చవచ్చు. రామమోహన్ రాయ్, వివేకానంద, గాంధీలను చరిత్ర కారులు కాదనవచ్చు. కాని డి.డి. కోశాంబిని కాదనగలరా? శాస్ర్తీయ పద్ధతిలో భారతీయ నాణాలను అతడు పరిశీలించాడు. భారత చరిత్రకు మార్క్సిస్ట్ దృక్పధాన్ని అన్వయించాడు. అతడిని ఎంత తోసిపుచ్చినా, చివరకు మార్గగామిగా గుర్తించక తప్పలేదు. అతడి చిత్తశుద్ధిని కాదనలేకపోయారు. రామాయణ, భారతాలలో పేర్కొన్న యుద్ధాలు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో మనకున్న చారిత్రకాధారాల ప్రకారం చెప్పటం అసంభవం అన్నాడు. (D.D. Kosambi : An Introduction to the Study of Indian History)
కురుక్షేత్ర యుద్ధం గొప్ప కల్పితగాధ అని నిస్సందేహంగా పేర్కొన్నారు.
డి.సి. సర్కార్, హెచ్.డి. సంకాలియా కూడా కురుక్షేత్ర యుద్ధం జరగలేదని, కేవలం కుటుంబాల మధ్య, తెగల మధ్య కలహాలు మాత్రమేనని రాశారు.
ఈ అధ్యయనం వలన నాకు మనస్తాపం కలిగింది. హిందువులపై సంప్రదాయ బరువు ఎంత భారంగా పరిణమించిందో అర్థం అవుతున్నది. 41 మంది అధ్యయనం చేసిన వారిలో కనీసం ధైర్యంగా, వివేచనాత్మకంగా, సొంతంగా ఆలోచించిన వారు 6 గురన్నా లేరు. కోట్లాది ప్రజలు వేలాది సంవత్సరాలుగా నమ్ముతున్నదంతా గాధ ఎలా అవుతుందని భావించారు. ఇదే వాదనతో సూర్యచంద్రులకు, రాహుకేతువుల గ్రహణాలు పడుతున్నాయని వీరు నమ్మారు.
మనజాతీయ మనస్తత్వంలో మౌలికంగా దోషం ఉన్నదా. గ్రహణంలో ఉపవాసం ఉండి, తరువాత స్నానం చేసి, తద్వారా సూర్య చంద్రులను కాపాడా మనేవారే వీరంతా. వారు నమ్మకంలో పుట్టారు, నమ్మకాలతోనే పెరిగారు, అలాగే చనిపోతారు. సందేహించే శక్తి వారికి లేదు. ప్రశ్నించే స్వభావం లేదు. వివేచనా పరిశీలనకు దేనినీ గురి చేయలేదు. పాత నమ్మకాన్ని కాదనటం పాపం. ప్రశ్నిస్తే పాతకం, పరిశీలనకు పెడితే నరక ప్రాప్తే అలాంటి వారే మన విశ్వవిద్యాలయాలలో, జాతీయ పరిశోధనాలయాలలో, సాంకేతిక సంస్థలలో వివిధ ప్రభుత్వస్థాయిలలో ఉన్నారు. మన జాతీయ జీవనంలో కనిపిస్తున్న ఉన్మాద ప్రవృత్తిని బట్టి ఘాటైన విమర్శలు చేయక తప్పటం లేదు.

Narla Venkateswararao ( V R Narla) Telugu by: Innaiah Narisetti

No comments:

Post a Comment