రాజకీయ వేత్త కృష్ణుడు-Truth about Gita part 9




బంకిమ్ చంద్రచటర్జీ దేశభక్తుడు. బ్రిటిషు వారి హయాంలో ఉద్యోగిగా ఉన్నప్పటికీ జాతీయవాదిగా హిందూ అనుకూల ధోరణులు కనబరచాడు. మానవవాదిగా ప్రారంభించి మతవాదిగా మారాడు. దేశంలో నవలా ప్రక్రియకు ఆద్యుడు. మహాభారతంలో, కృష్ణుడిలో ప్రేరేపణలు అన్వేషించాడు. కృష్ణుడి దైవత్వంలో నమ్మకం చూపాడు. రాజ నీతిజ్ఞుడుగా కృష్ణుడిని గురించి రాశాడు.
ఫ్రెంచి జిజ్ఞాసి కామ్టే ప్రభావంతో బంకించంద్ర కొనసాగాడు. దేశభవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పునరుజ్జీవనం కోసం కృష్ణుడిని ఆదర్శంగా స్వీకరించాడు.
ఆధునిక భారత సాహిత్యాన్నికి ఆధ్యుడైన బంకించంద్ర కృష్ణుడిని స్వీకరించటంలో పొరపాటు పడ్డాడు. పురాణాలూ, గాధల నుండి కృష్ణుడిని వేరు చేసి చూడటం సంభవంకాదు. మహాభారతంలో కృష్ణుడిని కూడా రాజనీతిజ్ఞుడుగా స్వీకరించటంలో చాలా లోపాలున్నాయి. అదీగాక, దేశాన్ని ముందుకు నడపాలంటే గతంలోనే దృష్టి పెడితే చాలు. కృష్ణుడు గతానికి మాత్రమే చిహ్నం. అతడి కాలం, ఆనాటి చారిత్రక శక్తులూ భిన్నమైనవి. రాముడి విషయమూ అంతే. బంకించంద్ర కృష్ణుడిని, గాంధీ రాముడినీ స్వీకరించారు. గాంధీ రామరాజ్యం అంటూ నిత్యం రామధున్ తో ప్రారంభించి ముగించేవాడు. తన రాముడు దశరధుని కుమారుడు కాడనీ, దైవం అనీ అనేవాడు. రామనామం అన్నిరోగాలనూ నయం చేస్తుందనేవాడు. గాంధీ, బంకించంద్ర స్వీకరించిన సంకేతాలు భారతదేశాన్ని బాధిస్తున్నాయి.
బంకించంద్ర తన కృష్ణ చరిత్రలో లోకాతీత విషయాలను పక్కకు బెట్టాడు. పురాణాల్లో కృష్ణుడికి సంబంధించినవన్నీ కొట్టిపారేశాడు. జయదేవుడూ, విద్యాపతి స్వీకరించిన కృష్ణుడిని అతను ఆమోదించలేదు. మహాభారతంలో కృష్ణుడిని సహితం బంకించంద్ర వాస్తవమని అంగీకరించలేదు. నరకుడితో యుద్ధం, తదనంతరం స్వీకరించిన అనేకమంది కన్యల విషయం మిధ్యఅన్నాడు. కృష్ణుడి భార్యలు 22 మంది మాత్రమేనని అన్నాడు. కృష్ణుడి భార్యలు 10 మందినే ప్రస్తావించాడు. సత్యభామను సత్యగానూ, జాంబవతిని రోహిణిగానూ చూపాడు. అష్టమహిషీలలో 5 గురిని గురించి తెలియదు గనుక అవి తొలగించాలన్నారు. ఎలుగుబంటి కుమార్తె జాంబవతిని, కృష్ణుడు పెళ్ళాడాడని అనటం అర్థంలేని దన్నాడు. ఇక మిగిలింది ఇద్దరే భార్యలు. సత్యభామను కాదనలేకపోయినా ఆమెను కూడా విస్మరించి కేవలం రుక్మిణి మాత్రమే అసలు భార్యగా పేర్కొనాలన్నాడు. మొత్తం మీద కృష్ణుడిని ఏకపత్నీ వ్రతునిగా చేశాడు.
బంకించంద్రుడు కృష్ణుడిలో రాజకీయవేత్తను చూచాడు. దేశ ఐక్యత సాధించేవాడిగా పేర్కొన్నాడు. మజుందార్ కృష్ణచరిత్రపై నిశిత పరిశీలన చేశాడు. అందులో కృష్ణుడు నాయకుడు కాదనీ, బంకించంద్ర హేతుపద్దతి మాత్రమే కనిపిస్తుందనీ అన్నాడు (Majundar : Krishna in History and Legend)
బంకించంద్రను మించిపోయి కృష్ణుడిని గొప్పరాజనీతిజ్ఞుడుగా చూపటానికి కె.యం. మున్షీ ప్రయత్నించాడు. దేశాన్ని ఐక్య పరచటానికి యుధిష్టిరుని ఆధిపత్యాన్నీ గొప్పజాతి రూపొందించటానికి కృష్ణుడు ప్రయత్నించాడన్నాడు. ఆనాడు భారతదేశంలో బీహారు ప్రాంతంలో వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రాంతం అపవిత్రంగా భావించాడు. అలాంటి దేశాన్ని ఐక్య పరచటానికి కృష్ణుడు ప్రయత్నించాడనటం అర్థం లేదు. బుద్ధుని జీవిత కాలంలో 16 మహాజన పదాలుండేవి. క్రీ.పూ. 320 నాటికి మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. ఆటవిక పాలకుల స్థానే రాజరికం వచ్చింది. (Niharranjan Ray : Mahabharatha, K.M. Munshi, Krishna Vatara, the Magic Flute).
మౌర్య సామ్రాజ్యనికి పూర్వం పురాణాలలో చిత్రించిన దిగ్విజయాలన్నీ చరిత్ర కాదు. అవి గాధలూ, కట్టుకథలు మాత్రమే. (D.C. Sirkar : Mahabharatha, Myth and Reality)
దేశంలో ఐక్యత మాట అలా ఉంచి కృష్ణుడు తన యాదవులనే ఐక్యపరచలేకపోయారు. ద్వారకలో యాదవులెందరు. మజుందార్ రాస్తూ ద్వారకలో యాదవులు 3 కోట్ల నిమత్స్య, అగ్ని పురాణాలు చెప్పాయన్నాడు. స్కంధ పురాణాంలో వీరి సంఖ్య 56 కోట్లుగా ఉన్నది. కృష్ణుడికి 9 లక్షల స్వర్ణ మందిరాలున్నాయి. భాగవతం ప్రకారం యాదవుల సంఖ్య లెక్కింపరానిది. యాదవకుమారులలో ఉపాధ్యాయులే 3 కోట్లపైగా ఉన్నారు. బహుశ స్వర్గం నుండి వీరికి ఆహారం అంది ఉండవచ్చునని మజుందార్ వ్యాఖ్యానించాడు.
యాదవులు మధుర, విదర్భ, అవంతి, మహిష్మతిలలో కూడా ఉన్నారు. కృష్ణుడి నాయకత్వాన్ని వారంగీరించలేదు. కురుక్షేత్ర యుద్ధంలో అత్యధిక యాదవులు కౌరవుల పక్షాన ఉన్నట్లు పుసల్కర్ రాశాడు. (A.D. Pusalkar, The History and Culture of Indian People, London 1957)
భోజులూ, అంధకులూ, వృషిణులు, యాదవులకు భిన్నమైన జాతి, ద్వారకలోని యాదవులలో పాండవులకు సంబంధించింది కృష్ణుడు మాత్రమే. మిగిలిన వారు కౌరవులతో ఉన్నారు. కృష్ణుడి కేంద్రం సంఘముఖ్యం.
శాంతిపర్వంలో ఈ ప్రస్తావన ఉన్నది. తనను అర్థ భోక్తగానూ, కృష్ణుడు చెప్పుకున్నాడు. రెండవ సంఘముఖ్యుడు బలరాముడు కావచ్చు. అతడు తటస్తుడు. కృష్ణుడి కుమారులు ప్రద్యుమ్మ, సాంబు కూడా తటస్తులే. యాదవులను ఐక్యపరచలేని కృష్ణుడు దేశమంతటినీ ఐక్యపరుస్తారనుకోవటం అర్థం లేనిది. కృష్ణుడిని దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడిగా భావించటం ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి చెప్పటమే
By Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

1 comment:

Goutami News said...

మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

www.poodanda.blogspot.in

Post a Comment