http://www.saarangabooks.com/magazine/?p=1188

See the above link for my article on late Mr C. Dharmarao
Dharmarao speaking at felicitation meeting of Mr Gora Sastri, editor Telugu Swatantra, Andhra Bhoomi on his 50th birthday celebrated at Kurnoon in 1957. Mr P V Narasimharao, education minister in Andhra Pradesh cabinet is on the stage

జ్యోతిష్యం మూఢనమ్మకం


పిల్లి చెప్పిన కథ – 17
ముగింపు



జ్యోతిష్యాన్ని గురించి నేనేమన్నా విమర్శిస్తే పాఠకులు అభ్యంతరం పెట్టరనుకుంటున్నాను. భారతీయులు చాలామంది, చదువుకున్నవారు గూడా,  యింకా ఈ పురాతన మూఢ నమ్మకాన్ని ఒక శాస్త్రంగా పరిగణిస్తున్నారు. అలాంటప్పుడు దాన్ని గురించి విమర్శించటం ఏమీ చేయకూడని పని కాదు. మూఢనమ్మకాలంటే నాకు గిట్టవు. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఖండించకుండా వుండలేను. ఈ మూఢనమ్మకాల మబ్బులు భారతీయాకాశం నుండి చెదిరిపోతే తప్ప జ్ఞానసూర్యుని ప్రకాశవంతమైన కిరణాలు ప్రసరించవు. ఈ అజ్ఞానాంధకారం ప్రారద్రోలాలంటే మంచి విమర్శ అవసరమవుతుంది.
విశ్వనిర్మాణ విధానంలో తానే కేంద్రం అనుకొని మానవుడు మిడిసి పడుతుంటాడు. అందునుండి జ్యోతిష్యం పుట్టింది. కోపర్నికస్ సూర్యకేంద్ర ఖగోళశాస్త్రం కనుగొనటంతో మానవుల అహంకారానికి చావుదెబ్బ తగిలింది. జగత్తుకు కేంద్రం భూమి కాదని తేలగానే మానవుని ప్రాధాన్యత సన్నగిల్లింది. దేవుడు గ్రహాలను మానవుల సంరక్షణార్థం సృష్టించాడనేది  శాస్త్రరీత్యా రుజువుచేయలేకపోయారు. జగత్తుకి భూమి కేంద్రం కాదన్న తరువాత ఈ జగన్నాటకంలో అతి ముఖ్యమైన పాత్రవహిస్తున్నామని మానవులు విర్రవీగటానికి వీలు లేకపొయింది.
ఈ దేశం నమ్ముతున్న జ్యోతిష్యం మరీ కాలదోషం పట్టింది. అది విజ్ఞానస్థాయి నెప్పుడూ చేరుకోలేదు. పైగా కేవలం గుడ్డి నమ్మకం. అందులో జంతుతత్వం స్ఫురిస్తుంది. అనాగరికుల మతమది. పాశ్చాత్య జ్యోతిష్యులు తమది విజ్ఞానసమ్మతమైన జ్యోతిష్యం అంటారు. నక్షత్రాలు, మానవులలో ఒక విధమైన భౌతిక-రసాయనిక పరివర్తనలు కలిగిస్తాయని వారంటారు. ఈ అభిప్రాయం అర్థరహితమైంది. ఇంతకంటే హాస్యాస్పదమైంది హిందూ జ్యోతిష్యం.
హిందువుల ప్రకారం నవగ్రహాలు భౌతికమైనవికావు. అవి దేవతలు. అందులో రాహుకేతులనేవి సగం దేవతలు, సగం రాక్షసులూను. ఈ జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా సమర్థించలేం. ఆధునిక ఖగోళశాస్త్రంలో దీనికి స్థానంలేదు.
సాంకేతికంగా నవగ్రహాల్ని దేవతలన్న, అవి భౌతికమైనవేనని, భౌతిక రసాయనిక             ( ఆధునికంగా చెప్పాలంటే- విద్యుత్ సంబంధమైన) మార్పులు మానవులలో కలిగిస్తాయని వాదించటానికిగుడా వీలు లేదు. ఖగోళశాస్త్రంలో ఏపాటి ప్రవేశమున్నా నవగ్రహ సిద్దాంతాన్ని త్రోసిపుచ్చాలి కనుక హిందూ ఖగోళశాస్త్రాన్ని ఏ విధంగాను సమర్థించలేం. అలా సాంప్రదాయంగా వస్తున్నా ఈ సిద్దాంతం లేనినాడు హిందూ జ్యొతిష్యమేలేదు.
గ్రహకూటమి, గ్రహసంచారంవల్ల మానవ జీవితం ప్రభావితం అవుతుందనే ప్రాతిపదిక ఆధారంగా లెక్కలు కట్టి జ్యోతిష్యము చెపుతారు. నవగ్రహాలు నక్షత్రాలు అంటారు. అవన్నీ కలగాపులగం. సూర్యనక్షత్రం ఆరుగ్రహాలు, రాహుకేతువులు ఊహాకల్పితాలు. ఆరు గ్రహాలూ గూడా సూర్యకుటుంబానికి చెందినవీ లేనిదీ తేల్చలేము. చంద్రుని గ్రహమంటారు. కాని భూమిననుసరించుకొని తిరిగే ఉపగ్రహం. మిగిలిన ఐదుగుడా గ్రహాలా లేక ఊహాకల్పితాలా అని నిర్ణయించడానికి వీలు లేదు. ఎలా చూచినా నవగ్రహాలలో ఐదు మాత్రమే హిందూ జ్యోతిష్యంలో లెక్కకు తేలుతాయి. గ్రహబలం మానవుల జీవితాల మీద వుందనుకుందామన్నా,  తొమ్మిదిలో నాలుగుపోతే మిగిలేది ఐదు గ్రహాలే కనుక వాటి ప్రకారం జ్యోతిష్యం లెక్క తప్పవుతుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లెక్కలు సరిగ్గానే వున్నాయని చెప్పటం నమ్మకాలను బలపరచినట్లే అవుతుంది. జ్యోస్యాలు నిజం అయ్యాయి అనటానికి కారణం అవి తప్పవవచ్చు అనే అనుమానం ఎవరికీ లేకపోవటమే. విశ్వాసంతో కొండను గూడా కదిలించొచ్చంటారు ఇలాంటి నమ్మకాలు గలవారు. నవగ్రహాలలో నాలుగు వట్టిదే అని తేలినా యింకా జ్యోతిష్యం, గణితం తప్పంటే వొప్పుకోరు. విశ్వాసాలను ఒక  దరికి నెట్టి విమర్శనాత్మకంగా ఆలోచిస్తే జ్యోతిష్యం తప్పో ఒప్పో బోధపడుతుంది.
జ్యోతిష్యపు లెక్కలు గణితం లెక్కల్లా ఖచ్చితమంటారు. ఆధునిక ఖగోళ శాస్త్రానుసారం చూస్తే జ్యోతిష్య లెక్కలు గణితానికి సరిపోవంటారు. అయితేయేం! వాటిని బట్టి చెప్పే జ్యోస్యాలు నిజమవుతున్నాయి! ఇది అద్భుతాల్లో ఒకటి. అలా అవకపోతే దీనికి సంజాయిషీ లేదు. విశ్వాసాన్ని వీడండి. ఈ లెక్కలు, వాటి నిజాయితీ అంతా బూటకంగా తోస్తుంది. మీ ఆరాధ్య దేవతలు మట్టిబొమ్మలన్నా, మీ జ్యోతిష్యాలు తప్పన్నా మీకు కోపం వస్తుంది. నేను మీ జ్యోతిష్యాన్ని నిరసించినట్లే మీ ఆధ్యాత్మికవాదులు శాస్త్ర విజ్ఞానాన్ని నిరసిస్తారు. మీరు యిలాంటివారే అయితే నేను చేయగలిగిందేమీ లేదు. "మానవుల శక్తులన్నిటిలో అత్యున్నతమైన విజ్ఞానాన్ని, విచక్షణనూ నిరసించే వారు నావాత పడక తప్పదు" అని                  (జర్మను మహాకవి గోధే) "పాస్ట్"లో ఒక భూతం చేత చెప్పించిన మాటలు మాత్రం గుర్తు చేస్తాను.
ఆధునిక ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యానికి స్థానం లేదు. పదార్థ విజ్ఞాన శాస్త్ర ప్రకారం విశ్వ నిర్మాణ విధానంలో మానవునికి విలువేమీ కనిపించదు. ఆధునిక ఖగోళ శాస్త్ర మూల సూత్రాలను పరిశీలిస్తే మానవునిది లజ్జాకరమైన స్థానమని తేలుతుంది. మానవ నివాసమైన  ఈ భూమి సూర్యకుటుంబంలోని చిన్న గ్రహాలలో ఒకటి. ఈ కుటుంబ కేంద్రమైన సూర్యుడు పదివేల కోట్ల నక్షత్ర సమూహాల్లో సామాన్యమైన పరిమాణం గలది అందులో కొన్ని సూర్యుని కంటే ఎన్నోకోట్ల రెట్లు పెద్దవి. అలాంటి పదివేల కోట్ల నక్షత్ర సముదాయాలతో కూడినదే ఈ విశ్వం అని పరిశీలనకు తేలిన విషయం.
ఈ విషయాన్నే మరో కోణంలో చూస్తే విభ్రాంతి కలుగుతుంది. అన్ని సముద్ర తీరాలలో కలిసి ఎన్ని యిసుక రేణువులుంటాయో విశ్వమంతటిలో నక్షత్రాలు అన్ని అంటాడు, సర్ జె.హెచ్ జీన్సు అనే ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త. అసంఖ్యాకమైన ఈ నక్షత్రాల్లో సూర్యుడి పరిమాణం చాలా చిన్నది. అయితే భూమికంటే సూర్యుడు పది లక్షల రెట్లు పెద్ద పరిమాణం కలది. ఒక నక్షత్రానికీ మరో నక్షత్రానికి మధ్యగల దూరం చాలా ఎక్కువ. ఆ దూరాన్ని ‘కాంతి సంవత్సరాలు’ అంటారు. ఒక కాంతి సంవత్సరం అంటే 1,86,000 x 60 x 60 x 24 x 365 మైళ్ళ దూరము, ఇది వెలుతురు సెకండుకు 1,86,000 మైళ్ళ చొప్పున సంవత్సరంలో ప్రయాణం చేసే దూరమన్నమాట. సూర్యుణ్ణి మినహాయిస్తే మిగతా నక్షత్రాల్లో భూమికి దగ్గరలో వున్న దాని నుండి వెలుగు భూమికి చేరటానికి 4.3 కాంతి సంవత్సరాలు పడుతుంది. సూర్యుని కాంతి భూమికి చేరటానికి పట్టేది 8 నిమిషాలు మాత్రమే.
అణు సమానమైన ఈ భూమి మీద మానవులను కనిపెట్టి, కాపాడటానికి యీ ఖగోళ నిర్మాణం జరిగిందని తలచటం మానవుల అహంకారం వల్లనే. ఇది ఎంత అసంబద్ధమో వూహించనవసరం లేదు.
ఖగోళంలో ఒక గోళానికి, మరో గోళానికి వున్న సంబంధం వెలుతురు ద్వారానే, మానవ జీవితాలమీద నక్షత్రాల ప్రభావం అంటూ వుంటే అది వెలుగుద్వారా జరగవల్సిందే. సూర్యుడు కాక భూమి మీదకు వంద ఏళ్ళ కాలంలో వెలుగు పంపగలవి మూడే మూడు నక్షత్రాలు. అంటే చాలా ఎక్కువ కాలం బ్రతికిన ఒక వ్యక్తి జీవిత కాలం పడుతుందన్నమాట. ఆ వెలుగు భూమికి చేరే సరికి. అంటే భూమి మీద నివశించే మానవుల జీవితాల మీద యించుమించు ఏ నక్షత్ర ప్రభావం వుండదన్నమాట. ఇలాంటి నక్షత్రప్రభావం వీలుకాదు అన్నప్పుడు ఫలానివాడి జన్మ నక్షత్రం ఫలానా అని అనటంలో అర్థంలేదు. ఒక వ్యక్తి పుట్టినప్పుడు అతి దగ్గరలో వున్నదనుకున్న నక్షత్రం నుంచి ప్రయాణమైన కాంతి కిరణాలు ఆ వ్యక్తి పుట్టిన 4.3 కాంతి సంవత్సరాలకు గాని భూమికి చేరవు. ఇక మిగతా నక్షత్రాల విషయం చెప్పనక్కరలేదు. ఒక మనిషి పుట్టినప్పుడు బయలుదేరే కాంతికిరణం ఆ మనిషి చనిపోయిన చాలా ఏళ్ళ తరువాత గాని భూమిమీద పడలేదు.
మానవ జీవితాలను ప్రభావితం చేసేవి నక్షత్రాలు కావు. సూర్యకుటుంబంలోని గ్రహాలు  అని వాదిస్తే జ్యోతిష్యమంతా అబద్ధమే అవుతుంది. ఆ వాదన వల్ల ఒరిగేదేమీ వుండదు. నక్షత్ర దూరాల వాదననుండి తప్పించుకున్నా ఈ వాదన మరో చిక్కుకు దారితీస్తుంది. గ్రహాల మధ్య సంబంధం గూడా వెలుతురు వల్లే జరగాలి. గ్రహాలకు వెలుగు లేదు. అవి కాంతి కిరణాలను ప్రసంరింపచేయవు కనుక ఎంతో దూరానవున్న మానవులమీద వాటి ప్రభావం వుండటానికి వీలులేదు.
విశ్వనిర్మాణంలో మానవుని పాత్ర ఎంత అల్పమైందో మరో కోణం నుంచి తెలుసుకుందాం. కోపర్.నీకస్ భూమిని విశ్వానికి కేంద్రం కాదన్నాడు. మానవుడు ప్రత్యేక సృష్టి కాదన్నాడు డార్విన్. భూమివరకైనా మనిషికి ప్రాముఖ్యం లేకుండా పోయింది. సూర్యునిలోని ఒక చిన్న గోళం వూడిపడి, చల్లనై గట్టిపడి భూమి అయింది. ఈ పని జరగటానికి ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది. తరువాత పరిణామం 40.50 కోట్ల సంవత్సరాలవుతుంది. అంటే 40 కోట్ల సంవత్సరాలు భూమిమీద ప్రాణులు లేవన్నమాట, భూమి పుట్టుక నాటినుండి జీవపదార్థం పుట్టేంతవరకు పట్టిన కాలంతో పోలిస్తే జీవపదార్థం మానవుడుగా పరిణితి చెందిన విషయం నిన్న మొన్నదిగా ఎంచాల్సి వుంటుంది. మనిషి పూర్వీకులు తమ నివాసాలైన చెట్లను వదిలి నేలమీద వెనుక రెండు కాళ్ళతో నడవడం ప్రారంభించి సుమారు పది లక్షల సంవత్సరాలయింది. భూమే కాదు సూర్యకుటుంబము ఏర్పడక పూర్వం కోటానుకోట్ల సంవత్సరాలుగా లెక్కలేనన్ని నక్షత్రాలు, నక్షత్రాలుగా ఏర్పడుతున్న పదార్థాలు ఈ విశ్వమంతా నిండివున్నాయి.
ఇన్ని కోట్ల సంవత్సరాలుగా సాగిన నక్షత్ర, భూమి, జీవనపరిణామం అంతా మానవ సృష్టికి పూర్వరంగంగా నమ్మి సృష్టిక్రమాన్ని గురించి వారికున్న ఆధ్యాత్మిక దృక్పథానికి మానవులు గర్విస్తుండవచ్చు. మూఢనమ్మకాలు సబబేనని చెప్పచూసే ప్రయత్నంలో మతవాదులు తమ దేవుణ్ణి ఎలా అగౌరవ పరుస్తున్నారో పరిశీలిస్తే వింతగా వుంటుంది. ఇన్నికోట్ల ఏండ్లు కష్టపడి  ఈ ప్రపంచాన్ని నిర్మించి తన స్వరూపాలను ఈ భూమి మీద నిలిపాడు దేవుడు అంటే ఆ దేవుడు సర్వశక్తివంతుడు కాదని తృణీకరించటమే అవుతుంది. నిష్కపటమైన మతానికీ, నమ్మకాలకీ, కావలసింది బైబిలులోని దేవుడు లేక పురాణాలలో దేవుడు. అలాంటి దేవుడు సొంత ప్రతిభతో భక్తులలో నమ్మిక కలుగజేస్తాడు. తన వునికిని లీలను సబబు అని నిరూపించి సమర్థించటానికి కపట తత్వవేత్తల సహాయం అవసరం లేదు. విమర్శ, విశ్వాసం పరస్పరం వ్యతిరేకమైనవి. అవి రెంటికీ ఎలాగో బలవంతాన పొంతన కుదిరిస్తే ఒక విచిత్రమైన అటు మతమూకాని ఇటు తత్వమూ కాని సంకరరూపు దాలుస్తుంది. విజ్ఞానశాస్త్రమూ, మూఢ నమ్మకమూ ఒక వరలో యిమడలేవు. వాటి సంయోగం వల్ల పుట్టినదే జ్యోతిష్యం. ఈ స్థితిలో విజ్ఞానం అడుగంటి విశ్వాసం బలపడింది.
విశ్వపరిణామం దైవస్వరూపులైన మానవుల సృష్టి నుద్దేశించి జరిగినదనే వాదన నిస్సారమైంది. భౌతిక జగత్పరిణామంలో వుద్దేశానికి ఎక్కడా తావులేదనే విషయం తెలియకపోవటమే యిందుకు కారణం. భౌతిక పరిణామంలో సర్వత్రా జీవపదార్థం ఆవిర్భావించాలనేదేమీలేదనీ ఖగోళ విజ్ఞాన శాస్త్రం చెపుతోంది. ఒకవేళ జగత్పరిణామం వెనుక ఏదైనా ఉద్దేశ్యం అంటూ ఉంటే అది జీవోత్పత్తి కాదు. మానవుడు దేవుని ఉత్తమ సృష్టికాదు. ప్రాణి అద్భుతమైన విశ్వసామరస్యాన్ని మలినపరిచే ఒక మొలక. జగత్ నిర్మాణంలో  ప్రాథమిక ఖగోళాలన్నీ కళంకరహితం, వాటి పవిత్రతను ఎవరూ పాడుచేయలేరు.
కణకణమండే గ్రహాలనబడే అగ్ని గోళాల నుండి రాలిన మసినలుసుల  మీదనే జీవోత్పత్తి సాధ్యమని తేలింది.  మసినలుసుల్లో గూడా అతి చిన్నదైన భూమి జీవోత్పత్తికి లోనయింది. సూర్య కుటుంబంలోని అంగారక, శుక్రగ్రహాలు తప్ప మిగతా ఆరు గ్రహాల మీద జీవోత్పత్తికి అనువైన పదార్థ – రసాయనిక పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడవని సిద్ధాంతీకరించబడినది అంగారక గ్రహంలో సరిపడ్డంత కాకపోయినా, కొంతవరకు నీరున్నది. అక్కడి వాయువులలో జీవోత్పత్తికి వీలైన లక్షణాలున్నాయి. శీతోష్ణస్థితి గూడా యించుమించు సరిపోతుంది.  కాని ఇంతవరకు అంగారక వాసులను గురించి ఉన్న వూహలు నిజమైనట్లు ఖగోళశాస్త్ర సంబంధమైన యిటీవలి పరిశీలనలు రుజువు చేయటం లేదు. ఒకవేళ అక్కడ జీవచిహ్నాలేమైనా ఉంటే, చిన్న చిన్న మొక్కల వరకే పరిమితమైనాయేమోగాని, ఆపై స్థాయిని అందుకోలేదు. ఈ పరిస్థితులు అంగారక గ్రహంలో ఏర్పడి చాలా కాలమైంది. భూమితోపాటే జీవరాసులు అక్కడా పుట్టాయి. జీవపరిణామ విధానానికి  ఒక ప్రయోజనానికి తావువుండి ఉంటే, ఆది మానవులను దైవాకారంలో సృష్టించటమే అయితే, ఈపాటికి అంగారక గ్రహం మానవ నివాసస్థలమయే ఉండేది. అలా జరగలేదు. కాబట్టి విశ్వ నిర్మాణంలో ఏదో ఉద్దేశ్యం ఉందనే సిద్ధాంతంతోపాటు బెర్గోనసం, లాయడ్ మార్గన్ ల తాత్విక ప్రయత్నాలన్నీ నేలగరిచాయి.
శుక్రగ్రహం ఇంకా మర్మంతో కూడి వుంది. అట్లాగే అక్కడి నివాస యోగ్య పరిస్థితి కూడా, ఈ గ్రీకు సౌందర్య దేవత తన అందాన్ని రహస్యంగా దాచుకుంది. ఈ రహస్యాన్ని కనుగొందామనే కుతూహలంతో ఖగోళశాస్త్రవేత్తలు ప్రయత్నించి విభ్రాంతులయ్యారు. అయినా కొంత విషయ సేకరణ చేయగలిగారు. సూర్యకుటుంబంలోని యీ విచిత్ర గ్రహం యిప్పుడిప్పుడే జీవ పదార్థ ఉత్పత్తికి  అనువైన స్థాయి చేరుకుంటున్నది. కాని అక్కడ జీవ పరిణామం మానవుని దాక సాగుతుందో లేదో ఇంకా తెలిసికోవలసి ఉంది. ఇంతవరకు తేలిన విషయమేమంటే జీవ పరిణామం మానవ సృష్టి దాకాపోవాలి అనే సిద్ధాంతం ఏమీ లేదని, అగ్ని గోళాల నుండి విడివడి చల్లారిన బూడిద మీద కూడా ఇది జరగాలనేమీ లేదు.
మానవ అహంకారాన్ని దెబ్బతీసే మరో విషయం ఆధునిక ఖగోళ శాస్త్రాన్ని బట్టి తేలిందేమిటంటే అసలీ గ్రహాలే విశ్వ నిర్మాణంలో అరుదు అని. భౌతిక పరిణామ విధానంలో అవి పుట్టి తీరాలి అనేదేమీ లేదు. బహుశ సూర్యకుటుంబం ఒక్కటే గ్రహకూటమిగా కానవస్తున్నది. నక్షత్ర సహజ పరిణామంలో సూర్యకుటుంబం మామూలుగా రాలేదు. అది ఒక విపరీత సంఘటన ఆ సంఘటన ఫలితమే మానవుడు జగత్తు గనుక దైవసృష్టి అయితే సృష్టికర్త మానవుని సృష్టించాలని ఉద్దేశించలేదు. మానవులు సృష్టి విధానంలలో దొంగతనంగా జొరబడ్డారు. గనుక మానవుని పుట్టుక దైవం సంకల్పించింది. పైగా విధివిధానానికి ఎదురు తిరిగి జరిగింది.
అలాంటప్పుడు దైవకార్యం ఏదో నిర్వహించటమే మానవుని బాధ్యత అనీ, అది జరగటానికే  విశ్వం యావత్తు సృష్టించబడిందనీ మానవులు అనుకోవటం హాస్యాస్పదం కదూ... భౌతిక జగత్తు దేవుని ప్రతినిధులో, ప్రతి  రూపాలో, పుత్రులో అయిన మానవులు సంచరించటం కోసం ఏర్పడ్డ రంగస్థలం కాదు. కనుక నక్షత్ర  చలనానికీ కేవలం యాదృచ్ఛికంగా భూమి మీద సంచరించే  ఈ రెండు కాళ్ల మానవుల జీవితాలకూ, ఏమీ సంబంధం ఉండదు. నేను చెప్పేది జ్యోతిష్యంలో లెక్కల ప్రకారం చెప్పబడే ఆధ్యాత్మిక సంబంధం సంగతి భౌతిక రసాయనిక పదార్థం నుంచి జీవం పుట్టింది కనుక భౌతిక సంబంధం వుంటుంది.
జీవోత్పత్తి కేవలం దైవాధీన సంఘటన కాదు. మనిషి నివాసమైన భూమి సూర్యకుటుంబంలోని చిన్న భాగం. ఆ సూర్యకుటుంబం కూడా తలవని తలంపుగా పుట్టింది కాదు. సర్, జెమ్స్, హెచ్. జీన్సు సూర్యకుటుంబపు పుట్టుక ఒక వైపరీత్య మన్నాడు. దీనిని గురించి ఆయన ఒక ప్రామాణిక  సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఇంచుమించు శాస్త్రజ్ఞులంతా దీన్ని అంగీకరించారు. ఆయన సిద్ధాంతం క్లుప్లంగా ఇలా వుంది.
అనేక కోట్ల సంవత్సరాల క్రితం - చాలా పెద్ద నక్షత్రం ఒకటి సూర్యుని సమీపంగా దూసుకుపోయింది. విసురుకు మండుతున్న వాయుపదార్థం కొంత ఆ నక్షత్రం వెంట కొంత దూరం జాలుగా వెళ్ళింది. ఆ వాయుపదార్థపు జాలు తరువాత తునకలైంది. సూర్యుని నుంచి విడిపోయినవి అవటం వల్ల వాటికి భ్రమణం  సంక్రమించింది.  వర్తులంగా తిరిగినందువల్ల అవి గుండ్రంగా అయినయ్ మండుతున్న వాయుగోళాలు క్రమంగా చల్లబడి గట్టిపడినాయ్ వాటినే సూర్య కుటుంబంలో గ్రహాలంటున్నాము. నియమ బద్ధమైన భౌతిక జగత్పరిణామంలో సంఘటన కేవలం యాదృచ్ఛికం కాదు. కనుక ఎప్పుడైనా, ఎక్కడైనా సూర్య కుటుంబం లాంటివి పుట్టటం పూర్తిగా సంభవం కాదు. కాని తరువాత సంభవించటానికి ఆస్కారం లేదు. గణిత శాస్త్రానుసారం సరిగ్గా లెక్కకట్టి డెబ్భయి లక్షల సంవత్సరాలలో ఒకసారి సుమారు లక్ష నక్షత్రాలలో ఒకటి మరో నక్షత్రం పక్కగా, సూర్యకుటుంబం లాంటి దాన్ని పుట్టించడానికి అనువుగా పోవచ్చునని జీన్స్ నిర్ణయించాడు. అయినా అలాంటి గ్రహాలు పుట్టడానికి గల అవకాశం సుమారు పదింట ఒకటి ఉంటుందనీ, పుట్టకపోవటమే అధికంగా జరుగుతుందనీ అన్నాడు. భౌతిక జగత్తంతటిలోనూ కోటికోట్ల వంతులో మాత్రమే జోవోత్పత్తికి వీలున్నట్లు ఆయనే లెక్కచెప్పాడు. వీలున్నంతమేరలో కూడా అతి స్వల్ప భాగంలోనే జీవం ఉంటూ వచ్చిందన్నాడు.
ఆధునిక ఖగోళ శాస్త్రంలో ప్రయోగాత్మకమైన పరిశోధనలలో ఇంత వరకు తేలిన సత్యాలను బట్టి జ్యోతిష్యాన్ని నమ్మటం కేవలం మూఢత్వం వల్లనే అని స్పష్టమౌతుంది. స్వర్గంలో దేవతలు మానవ కర్మలను చూస్తూ ఉండరు. దేవతలు, గ్రహాలు ఆడించినట్లు మానవుడు కీలుబొమ్మలాగా తైతక్కలాడటం లేదు. ఆత్మగౌరవం గల ఏ వ్యక్తి తనను  ఈ దుస్థితిలో వూహించడు. స్వర్గంలో దేవత మీద నమ్మకం ఉంటే వారు స్వార్థపరులనీ మనిషి విధిని వారు పట్టించుకోరని గ్రహించాలి. సోమపానాలతోనూ, అప్సరసలతోనూ వారికి తీరికి ఉండదు. వారు సందు చిక్కినప్పుడంతా, గురువుగారి భార్యతోసహా సరససల్లాపాలు గావిస్తుంటారు. వారిలో వారికి ఎన్నో కుట్రలు, అసూయలు, పోరాటాలు సాగుతుంటాయి. వారిని రాక్షసుల భయం వెన్నాడుతూ వుంటుంది. ఒక వేళ ఇలాంటి దేవతలు వున్నారనుకున్నా వారి స్వంతగోడే వారికి సరిపోతుంది. ఇంక యితర సంగతేం పట్టించుకుంటారు? ఎక్కడో స్వర్గం అని ఉండే ఈ నీతి నియమాలు లేని, తాగుబోతులు, పిరికివారైన దేవతలకు జీవితాలను అర్పించటం ఆత్మగౌరవంగల మానవుల లక్షణం కాదు.
నిజంగా గ్రహచలనాలమీద జ్యోతిష్యం ఆధారపడితే, మానవులు లెక్కిస్తున్నామన్న చాలా గ్రహాలు నిజంగాలేవనీ, జ్యోతిష్యుని వూహకందని గ్రహాలబలం భూమి మీద చరించే మానవుల మీద ఏమాత్రం లేదనీ తెలిస్తే మానవులు నిరాశ చెందుతారు.
ఒక్క ప్రశ్నతో ఈ విషయాన్ని వదిలేస్తాను. జ్యోతిష్యాన్ని ప్రాపంచిక పరిజ్ఞానంతో పరీశించారా? వైజ్ఞానిక పుష్టిగల శాస్త్రం అయితే అది పరిశీలనకు కొంతవరకైనా నిలబడగలగాలి. అలాంటి పరీక్షనొకదానిని సూచిస్తాను. ప్రయత్నించిచూడండి.
భూమిమీద సగటున ప్రతి అరనిముషానికి ఒకరు పుడుతున్నారు. ఒక్కొక్క గ్రహకూటమి కొద్ది నిముషాలే వుందనుకొన్నా -  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలాకాలం వుంటుంది. ప్రపంచంలో ఆ సమయంలో పుట్టిన చాలామంది ఒకే సంఘటనల అనుభవం పొందివుంటారు. ఒకే గ్రహకూటమిలో పుట్టినవారు కనుక వాళ్ళ జీవితాలు ఒకే తీరున నడవాలి. అలా నిజంగా నడుస్తున్నాయా అని తెలిసికోటం ఏమంత కష్టం కాదు. ఒకే గ్రహకూటమిలొ పుట్టినవారి జీవితాలన్నీ ఒకే తీరుగా వున్నట్లు రుజువయితే జ్యోతిష్యానికి మంచి బలం చేకూరుతుంది. చారిత్రకంగా గూడ ఈ పరిశోధన జరుపవచ్చు. జ్యోతిష్యం ప్రకారం గ్రహకూటాలు పునరావృత్తమౌతాయి. జ్యోతిషుల లెక్కలు నిజమనుకుంటే చరిత్ర గూడా చాలా మార్లు మళ్ళీ మళ్ళీ జరిగిందే జరగాలి. బుద్దుళ్ళూ, క్రీస్తులూ, మహమ్మదులూ, అలెగ్జాండర్లూ, హానీబాలులు, నెపోలియన్లు మొదలగువారు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూండాలి. గ్రహకూటాల సంఖ్యా కొన్ని సంవత్సరాలలో పరిమితమయివుంటుంది. వాటి ననుసరించి మానవ చరిత్ర కూడా అన్ని సంవత్సరాల పరిమితిలోనే పునరావృత్తం కావాలి. గ్రహాలననుసరించి మానవుల జీవితాలు కొన్ని రకాలుగానే విభజింపబడాలి. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే చాలు జ్యోతిష్య శాస్త్రం పరీక్షకు నిలువగలదో, లేదో తెలుస్తుంది. ఊహామాత్రాలైనా గ్రహకూటాలమీద మానవ జీవితాలు ఆధారపడి లేవని చెప్పటానికి చరిత్ర పునరావృత్తం కాక పోవటంలోనే తెలుస్తుంది.
గుడ్డినమ్మకాలు తాత్వికాభివృద్దికి పెద్ద అవరోధాలు. జ్యోతిష్యం, మూఢనమ్మకం, భారతీయులు అనుభవిస్తున్న దుర్దశ, అవమానం, నైతిక పతనంలాంటి వాటిని తుదముట్టించాలంటే ఈ మూఢవిశ్వాసాల పట్లగల ఉన్నతభావాలు నశించాలి. భారతదేశ పునరుజ్జీవనానికి అంధవిశ్వాసాలు పోయి శాస్త్రవిజ్ఞానంతో కూడిన విచక్షణాదృష్టి ఎంతైనా అవసరం. పూర్వీకులు ఎంత గొప్ప వారైనా గతంలో కలిసిపోయినవారే. రవీంద్రకవి వ్రాసిన గేయం నుండి జీవితాదర్శాన్ని తెలుసుకుందాం. అందరి ప్రవక్తలవలె మర్మవాదం బోధించక ముందు, రవీంద్రుడు కవిగా వ్రాసిన గేయం ఇది. ప్రవక్తను చూచి నవ్వుకున్న కవినుంచి నేర్చుకోవలసింది.
సోదరులారా! ముందుకు పోదాం!
వెనుకబడితే బ్రతుకు వృధా
జీవచ్ఛవాలుగా బ్రతకటమెందుకు?
                         మూలం                                  తెలుగు సేత
            ఎమ్.ఎన్.రాయ్                           వెనిగళ్ళ కోమల

పిల్లి చెప్పిన కథ - 16-స్త్రీ విమోచ





జంతువులలో సంతానానికి వస్తురూపమైన విలువ వుండదు. ఆధిపత్య భావంలో పవిత్రమైన పితృవాత్సల్యాన్ని మలినపరచవు. తమపట్ల తల్లిదండ్రులు చూపిన శ్రద్ధకు సంతానం రుణపడి వుండదు. సంతానం ద్వారా లాభాన్ని పొందుదామనే ఆశ లేనందున తల్లిదండ్రులు మా భవిష్యత్తు యెలా వుంటుందో తెలుసుకుందాం అనుకోరు. మా తండ్రి బాధ్యత మా తల్లి గర్భవతి అయ్యేవరకే.  ఇది స్వల్పమే అయినా ముఖ్యమైన విధి. మానవులలో గూడా తండ్రులు చేస్తున్నది మాత్రం యింతకు మించి యేముంది? ఆ కాస్త పని ముగిశాక మా తల్లుల గర్భస్త శిశువుతో తండ్రులకేం నిమిత్తం వుండదు. మనుష్యులలో వలె ఇలాంటి నిమిత్తం పెట్టుకోవటం జంతువులలో లేదు. పొలంలో విత్తు నాటిన నుండి యజమాని పంటపొలాన్ని యెలా శ్రద్ధగా కాపాడుతాడో మానవులలో గర్భవతులైన స్త్రీలను అలాగే కాపాడుతారు. ఆధిపత్య భావమే శ్రద్ధకు కారణం. వ్యవసాయ కూలీకి పొలం మీద గాని, ఆ పొలంలో పండే పంట మీద గానీ శ్రద్ధ వుండదు. భూమికి యెలా అయితే పంట ఆశతో విలువనిస్తారో అలాగే స్త్రీ కూడా బిడ్డలను కంటుంది. కనుక విలువ పొందుతుంది. హిందూ సామాజిక న్యాయం, భార్యకు సంతానం కలుగకపోతే మరొక భార్యను చేసుకునే అధికారం పురుషునికివ్వటంలోనే తెలుస్తున్నది. స్త్రీ-పురుష సంబంధం ఎలాటిదో, ఒక చేను పండకపోతే మరో చేను సాగుచేస్తారు. అలాగే భార్య విషయంలోనూ స్త్రీ ఉత్పత్తి సాధనమే.
జంతువులలో స్త్రీ-పురుష సంబంధం యాజమాన్యాన్నిబట్టి వుండదు. మగ జంతువు శారీరకంగా తన తండ్రి పాత్ర నిర్వహిస్తుంది. కూలీకి పంట మీద హక్కు లేనట్లే సంతానం మీద యాజమాన్య ధోరణి లేకుండానే తండ్రి పాత్ర నిర్వహిస్తుంది. సంతానానికి తాను యిచ్చే ఆస్తిపాస్తులు లేవు. కనుక తండ్రి అనే భావనలో అది చిక్కుకోదు.
జీవోత్పత్తి విధానంలో స్త్రీ పాత్ర యెక్కువ గనుక మగదాని కంటే ఆడ జంతువు తన సంతానం విషయంలో ఎక్కువ కాలం శ్రద్ధ తీసుకుంటుంది. సంతానం తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిననాడే తల్లి పోషణ ఆగిపోతుంది. గీత ఉపదేశించిన నిష్కామకర్మను ఆచరణలో చూడదలచుకొంటే ఆధ్యాత్మిక శక్తి సంపన్నులమనుకునే మానవులవైపు గాక, జీవపరిణామానుసారంగా జంతువుల్లో జరిగే జీవనోత్పత్తి విధానం వైపు దృష్టి మరల్చండి. పురుషులలో గీత మీద ప్రమాణం చేయనివారూ, నిష్కామకర్మ ఆడంబరత్వమనీ ఖండించేవారూ, ఫలితాన్ని ఆశించకుండా నీ పని నీవు చేయమనే శాస్త్రాన్ని వెక్కిరించే వారూ యీ ఆదర్శాన్నే పాటించటం గమనించవచ్చు.
సంతానోత్పత్తిలో తండ్రి భాగం చిన్నదే అయినా మానవ సమాజం నాగరికం అయిందనుకుంటున్న నాటినుండి తండ్రికి తన సంతానం మీద మితిమీరిన అధికారం సంక్రమించింది. ‘పాశ్చాత్యం’ అని సమాతన హిందూ జాతీయవాదులు పైకి నిరసించి, లోలోపల కోరే ఆధునిక నాగరికత సంతానం మీద తండ్రులకు గల ఆధిపత్యాన్ని చాలా వరకు తగ్గించి వేసింది.  అయినా పిల్లలు తండ్రుల అధికారానికి లోబడాలని న్యాయశాస్త్రం చెబుతున్నది. ఇండియా వంటి వెనుకబడిన దేశాల్లో తండ్రుల నిరంకుశాధికారం పిల్లలను మరీ కృంగదీస్తున్నది. అత్యంత గౌరవింపబడే ఉమ్మడి కుటుంబ విధానం  వ్యక్తిత్వానికి సంకెళ్ళు వేస్తుంది. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం బాగా వికసించటానికి ఈ విధానం ఒక సామాజిక తత్వంగా వుపయోగపడుతున్నది. దీన్ని జాతీయవాదులంతా కోరుకుంటున్నారు. ఫ్యూడల్ – పితృస్వామిక విధానం కాలదోషం పట్టినా ఆదర్శంగా చూచేవారు కూడా పితృస్వామ్యాన్నే కోరుతున్నారు. బిడ్డలు పుట్టడానికి కారకుడైన తండ్రికే బిడ్డలమీద అధికారాన్ని సంక్రమింపచేశారు. స్వంత ఆస్తి పద్ధతి రాకముందు, సహజ జంతు జీవిత స్వేచ్ఛను మానవులు కోల్పోక ముందు, అహంకారం – అవిద్య ప్రబలకముందు, క్రైస్తవ మతపరంగా చెప్పాలంటే తల్లులే యాజమాన్యం వహిస్తున్న సమాజ వ్యవస్థ వుండేది. అప్పుడు  స్త్రీ పురుషుని ఆస్తి కాదు. సంతానోత్పత్తి కార్యం ఆమె ఆధిక్యత వహిస్తుంది కనుక ఆమె స్వేచ్ఛాయుత జీవిగా పరిగణింపబడేది. తల్లి ప్రాముఖ్యంగల వ్యవస్థలో స్త్రీకి చాలా ఉన్నత స్థానం వుండేది. ఆమె సంతానోత్పత్తికి సాధనంగా వుండనంగీకరించింది. అందువలన తన సంతానానికి ఆమె అధిపతి. ఆ పరిస్థితిలో పురుషుడు సంతానోత్పత్తికి ఉపయోగపడే ఒక చిన్న కొరముట్టు మాత్రమే. స్త్రీ ఉన్నత స్థానాన్ని పురుషుడు ఆక్రమించి, ఆమెను చరాస్తిగా భావించిన నాటినుండే సమాజంలో ఆదిమ స్వేచ్ఛ, అమాయకపు సహజత్వమూ లోపించాయి. సహజ స్వేచ్ఛాయుతమైన స్వర్ణయుగం నుండి మానవులు బయటపడి, మతాధిపతుల, జమీందారుల ఏలుబడి ఇష్టానుసారంగా సాగుతున్న మధ్యయుగాల అంధకారంలో ఐచ్ఛికంగానే మునిగారు.
మధ్యయుగాల మతమౌఢ్యం, పితృస్వామ్యం నుంచి యూరోప్ ప్రజలు యెలాగో బయట పడ్డారు. భారతదేశం మాత్రం యింకా మృత ప్రాయమైన పాతకాలపు సాంప్రదాయాలను పాతేయక జాగ్రత్తగా భద్రపరుస్తుంది.
భారతీయ సమాజ వ్యవస్థల్లో నాడూ, నేడూ గూడా పురుషుని ఆస్తిగానే స్త్రీ చూడబడుతోంది అని అంటుంటే చాలా మందికి కోపం రావచ్చు. కొందరు నా అజ్ఞానానికి నవ్వుకోవచ్చు. పిల్లి నుండి మీరింకేం జ్ఞానం ఆశించగలరు?. హిందువులు చేసే శక్తి పూజ అంటే స్త్రీకి దైవత్వం ఆపాదించటమేనని పాపం  ఈ పిల్లికి తెలియదనుకుంటారు. నాకీ కట్టుకథలన్నీ తెలియవనుకోకండి?. స్త్రీని పూజిస్తున్నామంటూ, సమాజంలో  వారి స్థానమేమిటో తెలియకుండా స్త్రీలను అజ్ఞానంలో వుంచుతున్నారు. ఓ నా మోసపోయే సోదరీమణులారా! ఒకసారి గోమాత స్థితిని పరికించిన,  మీ స్థితేమిటో మీకు అర్థమవుతుంది. గోవుగూడా దేవతగానే పూజింప బడుతోంది. ఎందుకు?  అది ఉపయోగపడే జంతువు గనుక. మిమ్మల్ని బానిసలుగా  ఉపయోగించుకొంటూ దైవత్వం అనే అందమైన ముసుగు వేస్తున్నారు. పురుషుడి అహంకారానికి లొంగివుండటంలోనే గౌరవం వుంది, అని నమ్మించడానికి మిమ్మల్ని పొగుడుతూ  వుంటాయి. మతమూ, సమాజమూ కూడా మిమ్మల్ని మాతృత్వం అనే ఉన్నత స్థాయి నుండి దిగజార్చి, మీ యిష్టాయిష్టాలతో పని లేకుండా పురుషులు మీకు భర్తలయ్యారు. దీనికి ఆధ్యాత్మిక నంటగట్టారు. మిమ్మల్ని దేవతలన్నారు. నిజంగా మీరు దేవతలా? మీ యిష్ట ప్రమేయం లేకుండా పురుషుని కామం తీర్చి, వారికి బిడ్డల్ని కనాలని మనుధర్మశాస్త్రం శాసిస్తోందని మీరెరుగుదురా?  అదే ధర్మశాస్త్రం, పాతివ్రత్యం అంటూ మిమ్మల్ని దాసుల్ని చేస్తున్నది. కానీ, భర్తలు మాత్రం తమ కామ తృప్తికి ఎంతమందినో వాడుకోవచ్చు. అనేకమందితో సపంర్కం జరిపి ఎంతోమందికి బిడ్డలు పుట్టడానికి కారణమవచ్చు. కాని నిస్సహాయులైన భార్యలు మాత్రం తమ కడుపుపంటను పురుషుల అధీనం చేయాలి. సారవంతమైన భూములను కంచెవేసి కాపాడునట్లు పురుషులు మిమ్మల్ని జాగ్రత్తగా పరదాల వెనుక దాస్తారు. స్త్రీలు పరాయిపురుషులను అభిలషించకూడదు. మీకు మనస్సులో యిష్టమున్నా ఆ తలపులు రాకూడదు. వచ్చినా మీకు వచ్చినట్లు మనసులో నైనా ఒప్పుకోకూడదు. మరొక పురుషునితో తృప్తిపడకూడదు. బలవంతంగా మీకు ముడిపడిన వాడితోనే గడపాలి.
జంతువుగా పుట్టినందుకు నా మట్టుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా తల్లి బానిస కాదు. సహజసిద్ధమైన శరీర నియమం పాటించటానికి నన్ను కన్నది గాని పురుషుని అహంకారానికి, ఆధిక్యతకి దాసురాలై కాదు. నా తల్లిని చూసి నేనెంతో గర్వపడతాను. స్త్రీ జాతిని ఆమె చైతన్యవంతం చేయగలదని ఆశిస్తాను. ఆమె పిల్లల్ని కన్నది  ఏ గృహస్థ ధర్మాన్నో, మత విశ్వాసాన్నో, సామాజిక విధిని పురస్కరించుకునో కాదు. ప్రేమకలాపాలెన్ని చేసినా తానే అధికుడననే పురుషునికి లొంగికాదు. ధర్మపన్నాల ప్రకారం ఆస్తికి వారసులను సృష్టించాలనీ, మధ్యయుగాల, మహారాజులో, యీ కాలపు హిట్లరు, ముసోలినీలో తమ గొప్పను, తమ రాజ్యపు గొప్పను ప్రదర్శించాలని చేసే యుద్ధాలకు బలికావటానికి  బిడ్డలను కనమన్నందుకు కాదు. నా తల్లి ఆనందంలోంచి నేను పుట్టాను. అందులో నా తండ్రి పాత్ర గూడా వున్నదనుకోండి. నా పట్ల నా తల్లిదండ్రులు చూపిన శ్రద్ధ సహజంగా జనించింది. దానిలో  ఏ బంధం లేదు. నేనీ ప్రపంచానికి ఒక పెట్టుబడిగా రాలేదు. పితృభక్తిని చూపాలనే బాధ్యత నాకు లేదు, అలాంటి భక్తిభావం జమీందారీల సమిష్టి కుటుంబాలలోని సంతానం మనసులో కంటగించుకొంటూ పైకి ఆదర్శంగా నటించేది. ప్రేమ-విధి కలసి మనలేవు. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామూ అంటే అది బాధ్యతలకు దూరంగా సహజంగా ఆనందదాయకంగా జరగాలి.
నా తల్లిదండ్రులకు నన్ను కనాలనే తలంపు ముందునుండి లేదు. వారి సంపూర్ణ జీవితానందంలో నేను పుట్టాను. నా జీవితం మీద వారెట్టి అధికారం చూపరు. నా కాళ్ళమీద నేను నిలబడగలగ్గానే నా బ్రతుకు నేను చూసుకోసాగాను. ఈ కారణంగా మానవుడిలా జ్యోతిష్యంలో నమ్మకంకలిగి, ఏ పండితుడికో యింత ముట్టచెప్పి నా భవిష్యత్తు తెలిసికోవాలని నా తల్లిదండ్రులు అనుకోలేదు. నా జీవితచరిత్ర అంతా పండితుడు గీసిన ఏవో గీతలమీద, తద్వారా దేవతల కరుణకు పాత్రమైందని తృప్తిపడనవసరం లేకుండా పోయింది. నా జీవిత చరిత్రముందే ఏదో కాయితం మీద ఏవో గీతల రూపంలో వ్రాసి లేనందుకు పండితులవారికి మధ్యమధ్య ఇంత దక్షిణ యిచ్చి నా జీవితంలో జరిగేఘట్టాల, కనుగుణంగా ఆయన వ్రాసిన జ్యోతిష్యాన్ని విప్పి చెప్పించుకోలేను. అయినా జీవితంలో జరిగేవి పండితులవారి తెలివితేటలమీద గాని, గ్రహాలమీద గాని ఆధారపడిలేవు.
                        మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                         వెనిగళ్ళ కోమల

భారతీయుల బలహీనత-పిల్లి చెప్పిన కథ - 14






బ్రిటీషువారు భారతదేశాన్ని జయించటం చారిత్రకంగా దిగ్భ్రమ కలిగించే విషయం. ఎంతో దూరదేశం నుండి వ్యాపారం పేరుతో ఇక్కడకు వచ్చిన కొద్దిమంది సాహసవంతులు సులువుగా  దేశానికి యజమానులై కోటానుకోట్ల ప్రజలను దోచుకోగల స్థితికి ఎలా వచ్చారు ? భారతీయులు సాధారణంగా చెప్పే సమాధానం బొత్తిగా నమ్మదగింది కాదు. భారతీయుల ఆధ్యాత్మిక వాదం, సమాజ వ్యవస్థ, జాతీయంగా దాని ఫలితాలు ఇవన్నీ పట్టి పరిశీలిస్తేగాని సరైన సమాధానం దొరకదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థత, చారిత్రక సత్యాన్ని ఎదుర్కోగల ధీరత్వం భారతీయులకు కలిగినప్పుడే వారు తమ చరిత్రలోని ఈ అవమానకరమైన ఘట్టాన్ని రూపుమాపగలరు.
భారతజాతీయోద్యమం ఆధ్యాత్మిక తత్వంతో ముడిపడి వుండటం దానిలోని బలహినతను వ్యక్తపరుస్తుంది. నాయకులు ఆధ్యాత్మికతత్వంలో మునిగి తాము నడిపే వుద్యమాన్ని ముందుకు సాగనీయకుండా కళ్లాలు బిగలాగారు. వారీ తత్వాన్ని అంటిపెట్టుకుని వున్నంతకాలం ప్రజానీకాన్ని తాము గడిపే దుర్భరమైన జీవితంపట్ల విప్లవానికి పురికొల్పలేరు. వారింకా స్తబ్ధులుగా వుండిపోవటానికే ఆధ్యాత్మికత దారి తీస్తుంది. అంతా విధివిలాసం అని వారింకా పనికిమాలినవారైపోతారు. పరమాత్ముని లీలలకు అడ్డుతగలడం అపచారమనుకుంటారు. కర్మ సిద్ధాంతాన్ని తు.చ.తప్పకుండా నమ్మేవాళ్ళు గనుక నికృష్ట జీవితానికి తల ఒగ్గుతారు. సాంప్రదాయాలకు దాసులు గనుక వారిలో విప్లవం వచ్చే సూచనలే వుండవు. బ్రాహ్మణులు చేసే ముక్తి మార్గ బోధలు వారికి బాగా ఒంటబట్టాయి. అందుచేత వారి బానిస బ్రతుకులే వారికి నచ్చాయి. దేవుని చిత్తాన్ని బ్రాహ్మణులు సమర్థవంతంగా బోధించారు. దాని ఫలితంగా ఏర్పడ్డ సామాజిక పరిస్థితులు భారతదేశం పరాధీనం కావటానికి దోహదం చేశాయి. పాశ్చాత్య తెల్లవ్యాపారులు  ఈ దేశాన్ని నాగరికం చేసే  భారాన్ని తమ నెత్తిన వేసుకోవలసి వచ్చింది.
హిందుమతం సామాజిక బానిసాదర్శమే, ప్రతిమతము ప్రజలను మరింత అజ్ఞానానికి  గురిచేసే సాధనంగా వుండిపోయింది. ప్రజలు వున్నత వర్గాల పరిపాలనకు లొంగిపోవాలి. సిరిసంపదల హెచ్చుతగ్గులను దైవ నిర్ణయాలుగా భావించాలి. వారు పూర్వజన్మలో చేసిన పాపపరిహారంగా యీ జీవితాన్ని దుర్భరంగా గడపాలి. మూఢవిశ్వాసాలతో జ్ఞానశూన్యులుగా భావస్వాతంత్ర్యం ఎరక్కుండా బ్రతకాలి. మతమే ప్రజల్ని ఈ దుస్థితిపాలు చేసింది.
మానవసమాజ పరిణామ తొలిదశలో మతం అవసరమై వుండొచ్చు. శైశవావస్థలో ఆలోచన అంతా మత దృష్టితోనే జరిగేది ప్రకృతి అంతా ఏవో అతిలోక శక్తుల ద్వారా ఏర్పడిందని భావించేవారు. మానవ పరిణామ చరిత్రలో మతం కొంత స్థాయివరకూ అవసరమైనట్లే ఆ దృష్టిని విడిచి మరో దృక్పథంతో ఆలోచించవలసిన అవసరం అవుతుంది. అలా జరగనినాడు ఆ సమాజాభివృద్ధి ఆగిపోయి యెన్నో యిక్కట్లకు గురి అవుతుంది. మళ్ళీ కూకటి వేళ్ళతో సహా కదిలించగల విప్లవ పరిణామం జరిగితేనేగాని ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు సాగనీయలేం.
శారీరకంగా బాల్యావస్థదాటి పెద్ద వాళ్ళవుతారు. అటు తరువాతే మానసిక పరిణితి ఏర్పడుతుంది. ప్రాయంతో పాటే ముందు పిల్లల వూహలు మానసికంగా నిలకడలేని స్థితి, అటు తరువాత భావాల కుదిరిక కలుగుతుంది. అలాగే సమాజ జీవితంలో గూడా  తొలుత మత దృష్టి తదుపరి వివేచన, ఆ మీదట వైజ్ఞానిక దృక్పథం వరుసగ కనిపిస్తే యౌవనంలో వున్న వ్యక్తి పసివాడిలా ప్రవర్తిస్తే వాడి బుద్ధి మందగించిందంటాం. దీన్ని మానసిక శారీరక వ్యాధిగా భావించి చికిత్స ద్వారా బాగుచేయించవచ్చు. పెద్దవాడు పసివాడులా మాట్లాడితే అది అతనిలో మానసిక పతనావస్థగా భావిస్తాం.
భారతీయులకున్నంత చరిత్రగల ఏ జాతైనా వివేచనాత్మకంగా ఆలోచించలేక పోయినా, ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మినా, ఎదురు తిరగకుండా సాంప్రదాయాలకు కట్టుబడివున్నా, గుడ్డిగా నమ్మటమే గాని తెలుసుకుందామనే తాపత్రయం లేకపోయినా, విమర్శ దృష్టితో కాక ద్వేషించినా,  లక్షణాలు ఏ జాతిలో వున్నా అవి వారిలో జబ్బు లక్షణాలు. సమాజం స్తంభించిపోవటంవల్ల మరీ వ్యాపించాయి. పిల్ల తరహా మత విశ్వాసాలు రాజ్యం చేసినా, బూజుపట్టిన పురాణ భావాలు పేరుకుపోయినా, అవి ఆ సమాజపు పురోభివృద్ధిని కృంగదీసే లక్షణాలే,  ఈ వ్యాధి ముదిరిపోయి భారతీయ మానసిక, శారీరక శక్తులను తుదముట్టిస్తుంది. దీన్ని నయం చేయాలంటే చాలా తీవ్రమైన శస్త్ర చికిత్స జరగాలి. కుళ్ళిపోయిన గ్రంథులను నిర్దాక్షిణ్యంగా కోసివేసి, వాటి బదులు ఆరోగ్యకరమైనవి అమర్చాలి. ఇతరులు దేహాల నుండి తీసిన బలమైన రక్తాన్ని ఎక్కించాలి. మరీ తేట తెల్లంగా చెప్పాలంటే భారతదేశం వినాశకరమైన ఆధ్యాత్మిక తత్వాన్ని విడనాడాలి. పెడ మార్గం పట్టించే నాయకుల ‘పాశ్చాత్యనాగరికత’ అని తెగడే ఆధునిక మానవ వారసత్వాన్ని అందుకొని అభివృద్ధి మార్గంలో నడవాలి. లేదా ఆధ్యాత్మిక ఉన్నతి పేరుతో పతనానికి సిద్ధమైనా కావాలి.  
పురాణాల్లో చెప్పబడిన స్వర్ణయుగాన్ని తీసుకురావటానికి యిప్పటికే చాలా జాప్యం జరిగింది. మానసిక దాస్యం సర్వోత్తమమైనదనే విపరీత భావం ప్రజలలో ఉన్నంతకాలం భారతీయులు దానినుండి బయటపడలేరు. నిరాడంబర జీవితం ఆదర్శవంతమైనదని బోధించే కపటప్రవక్తలు, తప్పుడు తత్వవేత్తలు దేశాన్ని నడిపించినంతకాలం ఈ పతనం తప్పదు. నిరాడంబరమే జీవితాదర్శమైతే  ఎంత నిరాడంబరంగా వుంటే అంతమంచిది.  ఈ బోధనను పాటిస్తే భారతీయులు వెనుకకు నడవాల్సుంటుంది. ఈ కృత్రిమ ఆదర్శాన్ని చేరాలంటే మనుషులు నాగరిక జీవితాన్నుంచి తిరోగమనం చేసి చేసి చివరికి వారి పూర్వీకులు బ్రతికినట్లు ఏ చెట్లమీదనో పుట్లమీదో నిరాడంబరంగా బ్రతకాలి.
జాతిని భౌతికంగానూ, నైతికంగానూ, వైజ్ఞానికంగాను పునరుజ్జీవింప చేయాలంటే వినాశకారి అయిన  ఈ నిరాడంబర ఆదర్శాన్ని విడనాడాలి. కొద్దిమంది సంపన్నుల, కులపతుల, మతాచార్యుల రక్షణకోసం ఈ సిద్ధాంతం బోధించారు. పాతకాలపు ఉత్పత్తి విధానంలో, సామాన్యుల శ్రమ ఫలితాన్ని  బోధించారు. పాతకాలపు ఉత్పత్పి విధానంలో, సామాన్యుల శ్రమఫలితాన్ని పై వర్గాలవారు పూర్తిగా  దోచుకుంటూ సోమరులుగా సుఖాలను అనుభవిస్తుంటే ఉత్పత్తి కారకులైన ప్రజలు అతి సామాన్యమైన నిత్యావసరాలు గూడా తీర్చుకోలేకపోతున్నారు. పై వర్గాల వారు (భూస్వాములు, భాగ్యవంతులు, మత గురువుల ఉత్పత్తిలో అధిక భాగాన్ని అనుభవించడమేగాక, పండించేవారికి దక్కవలసిన దానిలో గూడా ఇంకా, ఇంకా కోత పెడుతుంటారు. ఆర్థిక అసమానతలు సమాజంలో సాదా జీవనం గురించి బోధించటం అవసరమే. మరి అల్పసంఖ్యాకులు భోగం అనుభవిస్తుంటే అధిక సంఖ్యాకులు అతి దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు.
రోమన్ సామ్రాజ్యం, మధ్యయుగాల నాటి యూరోప్, భారతీయ వైభవం కూడా సామాన్య ప్రజల పేదరికంపై  ఆధారపడిందే. క్రైస్తవ మతం కూడా నిరాడంబర జీవితాన్ని కావాలంటుంది. మధ్యయుగాలలో మతాధికారులు ఈ సిద్ధాంతాన్ని బోధించగా సామాన్య ప్రజ తప్పనిసరై దానిని అనుసరించారు. గొప్పగా నిర్మించిన దేవాలయాలు దుబారా ఖర్చుతో కూడిన మత ఉత్సవాల పవిత్రప్రభావాన్ని సూచించవు. అవి పాలకుల ప్రతిభను, ప్రజానీకపు దుస్థితిని వెల్లడిస్తాయి. జాతి సంపదను అలా పనికిరాని పనులకు వ్యయం చేస్తే సమాజంలో ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలు శ్రమతో సాధించిన సొత్తు అధికోత్పత్తికి వినియోగించకుండా, పెద్ద పెద్ద రాతి కట్టడాలకు, బంగారునగలకు వాడారు. ఇదే ప్రజల శ్రమ ఫలితాన్ని దోచుకోటమంటే ప్రజలను బానిసలుగా చేసి వారిచేత వెట్టి చాకిరీ చేయించుకోటానికి అనువుగా కులతత్వాన్ని ప్రవేశపెట్టారు.
నిరాడంబర జీవితం. ఈలోక విషయాలను తుచ్ఛంగా భావించమని  బోధించే మత సిద్ధాంతాలు, నీతి బోధలూ ప్రజల దారిద్ర్యం అండగా పెట్టుకొని మధ్య యుగాల సమాజం నిలవగలిగింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానం పారద్రోలి విజ్ఞానం పొందాలన్నా ఈ విపరీత ధోరణులకు స్వస్తి చెప్పాలి. ఈ సిద్ధాంతాలను బోధించేవారు మహాత్ములైనా, వేదాంతులైనా మధ్య యుగాల్లోని వెనుకబడినతనాన్ని సమర్థించినవారే. ప్రజలు తామున్న దుస్థితిలోనే సరిపెట్టుకున్నంత కాలం పారిశ్రామికంగా, వ్యాపార రీత్యా బాగుపడలేదు. ఐహిక సుఖాలు తుచ్ఛమని భావించకుండా తమ జీవితావసరాలను  సుఖం కోసం తీర్చుకుందామని ప్రజలకు కోరిక కలిగితేనేగాని పరిశ్రమలూ వాణిజ్యం వృద్ధి చెందవు. మధ్యయుగపు వెనుకబడినతనం నుండి  ప్రజలు బయటపడాలంటే సామాన్య ప్రజల జీవిత  ప్రమాణాలు పెరగాలి. నిరాడంబర సూత్రం జాతి పునరుజ్జీవనాన్ని ఆపివేస్తుంది. భారతీయులు ఆధునికం కావటం కాని, రాజకీయంగా స్వేచ్ఛాపరులవటం గాని, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందకుండా త్రొక్కివేస్తున్నది. వారి ఆధ్యాత్మికత, ఐహిక వాంఛలు తుచ్ఛమనే భావమే.
ప్రజానీకం జీవితం అంటే తుచ్ఛమనే భావాన్ని విడనాడకపోతే వారికి బాగుపడే అవకాశమేలేదు. ఆధ్యాత్మికత్వం ఎంత బోధించినా భారత ప్రజలు అందరిలాగే జీవితాన్ని ప్రేమిస్తారు. అయితే మత సిద్ధాంతాలు, సాంప్రదాయాలు వారిని సహజంగా బ్రతకనీయటంలేదు. ఐహిక సుఖాలను విడనాడటం  వారు ఇష్టపూర్వకంగా  కాక గతిలేని విధిగా చేస్తున్నారు. అతి భారంగా జీవితాలు గడవటం వల్ల వారు యీ వినాశకారి సూత్రాలను వీడి జీవితం నుండి పారిపోవాలనుకుంటున్నారు. జీవిత సుఖాలకు  ఎడం కావటం మంచి లక్షణమేమీకాదు. కోరి వరించిన ఆత్మ వంచనే. ఇలాంటి సభ్యత నీతి దూరమైంది. వంచన మానవుని మనసును మలినపరుస్తుంది. దురభిప్రాయాలు జ్ఞానాన్ని సంకుచిత పరుస్తాయి. మూఢవిశ్వాసాలు నైతికంగా అభివృద్ధి చెందనీయవు. తాను నమ్మిన జీవితాన్ని గడపాలంటే ఇవన్నీ అవరోధాలే.
రాజకీయ స్వేచ్ఛ పొందాలన్నా, ఆర్థికంగా ముందుకు పోవాలన్నా, నాగకరికత పెరగాలన్నా, నైతికంగా ఉన్నతం కావాలన్నా భారత ప్రజలు బ్రతుకును ప్రేమించగలగాలి. యధాలాపంగా కొందరు ఏ గంగా తీరానో, లేక అలాంటి మరో మురికి నీటొడ్డునో పుట్టినంత మాత్రాన వారు ప్రకృతి జయించలేరు. మానవాతీత శక్తులను పొందనూలేరు. జీవితాన్ని ప్రేమించటం అనేది అసలు జీవితంలోనే ఇమిడివున్నది. ప్రేమతోనే జీవితం ప్రారంభమవుతుంది. జీవితాన్ని ప్రేమించటమే నేరం అయితే దేవుడు ఈ ప్రపంచాన్ని మరోరకంగా ఏర్పాటు చేసివుండేవాడు. అసలు అతను ఒక పాపసముద్రాన్ని ఎందుకు సృష్టిస్తాడు... దాన్ని తరించాల్సిన బరువును మానవులమీద ఎందుకు పెడతాడు? జీవితాన్ని ప్రేమిస్తారు. కాని అదేదో నేరమన్నట్లు దాపరికంగా చేస్తారు. ఈ జీవితానికి అతీతంగా మరో మహత్తర జీవితం ఉందనుకోటమే జీవితంపట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తుంది. ఆ జీవితాన్ని పొందాలనే ఆశతో యీ జీవితాన్ని విడనాడాలనుకోటం జరుగుతున్నది. దీన్ని సర్వసంగ పరిత్యాగమని విమర్శనాత్మకమైన  దృష్టి లేనివారే భావిస్తారు. జీవితాన్ని నేరంగాను, దొంగతనంగాను భావించకుండా బాహాటంగా, ధైర్యంగా ప్రేమించగలగాలి. నిజమైన అత్మోన్నతి సహజమైన సమాజాభివృద్ధిలోనే ఉన్నది. జీవించటమెలాగో తెలియనప్పుడు జీవితాన్నుండి పొందగలిగేదేముంది? ఆత్మహత్య తరుణోపాయం కాదు.
జీవితంలోని తీపి యేమిటో తెలుసుకున్ననాడు భారతీయులు మత విశ్వాసాలకు, కృత్రిమ తాత్విక సిద్ధాంతాలకు లొంగని జీవితవైపు దృష్టి సారించి బ్రతకగోరుకుంటారు. అది వారి ఆత్మవికాసానికి దారితీస్తుంది. జీవిత సుఖాలంటే ఏమిటో చవిచూసిన వారు దాన్నుండి పారిపోవటానికి ప్రయత్నించరు సరికదా దాన్ని ఒక వరంగా భావిస్తారు. అప్పుడు పాశ్చాత్యపద్ధతి అనబడే జన్మదినోత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడ నా పుట్టినరోజు ఏదో తెలియకుండానే నా కథ ప్రారంభించాల్సి వచ్చింది. పరిస్థితులకు నేను లొంగిపోయానంతే.
                         మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

ఎందుకు పుడతారు ?పిల్లి చెప్పిన కథ - 13-




ఇండియాలో జన్మదినోత్సవాలు జరుపుకునే ఆచారం పెద్దగాలేదు. అందుకని సామాన్య మానవులు బాధామయమైన  ఈ ప్రపంచంలోకి అడుగిడిన సమయాన్ని గుర్తుగా వ్రాసుకోరు. అలాంటప్పుడు నాలాటి అలగా జాతి పిల్లి ఎప్పుడు పుట్టింది కచ్చితంగా తెలిసే ప్రశ్నేలేదు.
భారతీయులు జన్మదినాన్ని ఎందుకు జరుపుకోరో ఆలోచిస్తే ఆసక్తిదాయకంగా ఉంటుంది. జీవితానికి నాంది అయిన ఈ పుట్టుక పట్ల మనుషులెందుకింత విముఖంగా వుంటారో? జీవితంలో పుట్టుక అతి ప్రధానఘట్టం. పుట్టుక లేకపోతే జీవితమే లేదు. బ్రతుకుతున్నామంటే పుట్టటం వల్లనే ఇలాటి ముఖ్య విషయాన్ని ఒక జాతి యావత్తూ నిర్లక్ష్యం చేయటం ఆశ్చర్యకరంగా వుండదూ? లౌకిక జీవితమంతా ఒక భ్రమ అని, బంధం అని హిందూ వేదాంతం బోధిస్తుంది. ఆచరణలో యిది చూపకపోయినా యీ సూత్రాన్ని హిందువులు నమ్ముతారు.  కనుక  భ్రాంతిలాంటి ఈ జీవితం పట్ల ఆసక్తి చూపెట్టరు. భ్రాంతిని నిజమని ఎవరు భావిస్తారు? జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో అనేది అంత పట్టించుకోవలసిన సంగతి కాదు. కలలో చూచినది దేవలోకం అయినా పాతాళలోకమైనా అది భ్రమ అని మేల్కోగానే తెలుస్తుంది.  స్వప్నం తాలూకు జ్ఞాపకాలు మిగిలినా అది సరిగ్గా ఎప్పుడు ప్రారంభమయిందో గుర్తు పెట్టుకోరు. కల ఎంత నిజమో జీవితమూ అంతే నిజం అంటాయి. హిందూ మతమూ, వేదాంతమూ గూడా జీవితం వారివారి ఖర్మననుసరించి సుఖస్వప్నమో, పీడకలో అవుతుంది. పుట్టుక అంటే కల ప్రారంభమన్నమాట. ఆ ప్రత్యేక సమయాన్ని గుర్తుపెట్టుకోవలసిన అవసరమేముంది? పైగా జీవితాన్ని ఒక బంధంగానూ, దురదృష్టంగానూ భావించేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన పనేలేదు. ఖైదీ తాను నిర్బంధింపబడిన రోజు గుర్తు పెట్టుకొని పండుగ జరుపుకోడు. దురదృష్టం ఆవరిస్తే అలాటి రోజును జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పనేముంది?   
ఇలాంటి మతపరమైన తత్వసిద్ధాంతం, దాని కనుకూలమైన సామాజిక పరిస్థితుల్లోనే పెరగగలదు. భారతీయుల్లో ఎక్కువమంది జీవితాన్ని దురదృష్టమని తలచటానికి కారణం వారి జీవితం దుఃఖంతో, కష్టాలతో గడపటమే. జీవితంలో సుఖం అంటూ ఎరుగరు వాళ్ళు. రెక్కాడినా డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి ఇంక సుఖాలు, చదువు, నాగరికత వారికందని విషయాలు. ఈ పరిస్థితులు యిప్పుడు కొత్తగా వచ్చినవేమీ కాదు. జీవితం దుఃఖమయం అనుకున్న నాటినుండి, దాన్ని పైగా ఒక ఆధ్యాత్మిక దృక్పథంలో చూడటం మొదలైననాటినుండీ పరిస్థితులిలానే వున్నాయి. నిరాశ, నిస్పృహలతో నిండిన ప్రజానీకపు జీవిత విధానం ఈ దృక్పథాన్ని బలపరుస్తుందీ అంటే ఈ దృక్పథం ఇలాంటి సామాజిక పరిస్థితులవల్లే పుట్టిందన్నమాట. ఇన్ని శతాబ్దాలుగా దృక్పథం వదల్లేదంటే దాని పునాది చాలా గట్టిదై వుండాలి. ‘రామరాజ్యం’ అనేది ఒక కల్పిత కథే. ఈ గాథలో ఏ మాత్రమైనా చారిత్రక సత్యం వుండి వుంటే ప్రజల జీవిత దృక్పథం మరోలా వుండేది. ఒకవేళ పౌరాణికమైన ‘స్వర్ణయుగం’ ఎప్పుడైనా ప్రజలు చూచారా? అంటే అది వారు ఆధ్యాత్మిక తత్వానికి బలికాక ముందే వుండాలి. రామరాజ్యంలో ప్రజలెలా వున్నారో రామాయణమే చెప్పదు. అయోధ్యానగరం శోభతప్ప. ఇంత సిరి రాచనగరానికి ఎలా దక్కిందో ఎక్కడా రాయలేదు. తిని కూర్చొని ఎప్పుడూ అస్త్రవిద్య అభ్యసించే రాచ కుటుంబీకులు సంపాయించింది కాదు. పురోహితులైన బ్రాహ్మణుల మంత్రాలవల్ల వచ్చిందీకాదు. చివరకు జనక మహారాజు తన బంగారు నాగలితో చిన్న చెక్కను మించి దున్నలేదు. ఆ సంపదనంతా చేర్చింది అతిహీనంగా బ్రతికిన సామాన్య ప్రజలు. అలా కాకపోతే వారికి అప్పటి సమాజ చరిత్రలో స్థానం వుండేదే. చరిత్రకారుడు వారిని మనుషుల్లో లెక్కగట్టి వుండడు. కనుక రామరాజ్యం సామాన్యజనానికి స్వర్ణయుగం కాదన్నమాట.
అత్యవసరమైన భారతీయ సమాజ చరిత్రను నేను రాయడంలేదు. విమర్శనా దృష్టితో వ్రాయబడిన అలాంటి చరిత్ర సహాయంతోనే మత సాంప్రదాయాలను, తాత్విక సిద్ధాంతాలను అర్థం చేసుకోగలం.
నా అల్ప జీవితం ప్రస్తుతం వున్న సామాజిక పరిస్థితులను చూపగలదు. వర్తమాన పరిస్థితులను వాస్తవిక దృష్టితో చూడటం వల్ల గత చరిత్రను తరచి చూడాలనిపిస్తుంది. అదే విధంగా పూర్వ చరిత్రను తిన్నగా అర్థం చేసుకుంటే ప్రస్తుత పరిస్థితిని బాగా అవగాహన చేసుకోవచ్చు. ఒక సామాన్యమైన పిల్లి పుట్టుక విషయం చాలా అప్రధానమైనది. అలాంటి పిల్లి పుట్టుకదినం గుర్తున్నా లేకున్నా పోయేదేంలేదు. ఈ కథ మొదట్లో భారతీయులు జన్మదినం జరుపుకోరనే విషయం నా దృష్టికి వచ్చింది. యెందువల్ల అని యెవరూ దీని గురించి ఆలోచించకపోయినా దీనికి సామాజిక ప్రాధాన్యత చాలా వుంది.  విషయాన్ని తరచి చూడటం మొదలెడితే భారతీయ సామాజిక చరిత్ర ఆది నుండి విపులంగా కనులముందు కనిపిస్తుంది.
నీకు దేవునిలో నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ దైవ నిర్మితం అని అనుకుంటే జీవితం పట్ల హిందూమతం బోధించే అసహ్యభావం నీకుండటానికి వీలులేదు.  ఈ జీవితంకంటే అతీతమైన జీవితం ఏదో ఉందనుకున్నా  వైరుధ్యాన్ని దాటలేము.  ఈ జీవితం హీనమైనదని తలంచినా మీ విశ్వాసాల దృష్ట్యా భగవంతుని సృష్టిలో భాగమే అవుతుంది. మనం ఎక్కడో వున్నదనుకొనే మహత్తర జీవితం ఎంతకోరదగిందో ఈ జీవితం గూడా అంతవాస్తవమని గ్రహించాలి.  ఈ నిజానికి జీవితమే వాస్తవం. ఎందుకంటే అతీతజీవితం వూహల్లో తప్ప మరెక్కడా లేదు. అది ఉన్నదని నమ్మేవారే అది ఎలా వుంటుందో చెప్పలేరు. ఈ జీవితానికి అతీతమైన స్థితిని స్వయంగా అనుభవించామనేవారు గూడా  ఈ జీవితస్వభావమేమిటో వర్ణించలేరు. అయినా ఆ స్థితినందుకోటమే జీవితాదర్శం అనుకుంటారు. నిజాన్ని భ్రమ అనుకొని దాని స్థానంలో భ్రమనే నిజమని ప్రతిష్టించుకొంటున్నారు. ఇది ఎలా జరిగింది? ఈ మార్పుకు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు భారతీయ సామాజిక చరిత్రకారులు సమాధానాలు  చెప్పవలసి వుంటుంది.   ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు అన్వేషించాలనే తలంపుతో చరిత్ర చదవటంగానీ, రాయటంగానీ చేయాలి. మిధ్యను జీవితంగాను, జీవితాన్ని మిధ్యగాను తారుమారు చేయటం భారతీయుల ప్రత్యేకత అని సరిపెట్టుకోలేం. ఇలాంటి ప్రతిభ భారతీయులకెలా సంక్రమించింది? ఈ ప్రతిభ భారతీయుల్లో ఉంది అంటే వారి జాతి అహంకారాన్ని ప్రదర్శించటమే కాక దేవుని ప్రతిభను శంకించటమవుతుంది. తమ ఆధ్యాత్మిక ఘనతను చాటటానికి దేవుని చిన్న చూపు చూడటం అవుతుంది. దేవునిలో నమ్మకం సడలటం అవుతుంది. భారతీయ సమాజ జీవితాన్ని విమర్శ దృష్టితో పరిశీలిస్తే హిందూ సిద్ధాంతాలలోనూ, ఆదర్శాలలోనూ యిలాంటి విరుద్ధ భావాలు అనేకం కనిపిస్తాయి.
మూఢ విశ్వాసాలు అభివృద్ధి నిరోధకాలు, ప్రతి విషయం విమర్శనాత్మకంగా చూడాలి. విశ్వాసాలను విమర్శకు గురికానివ్వాలి. ప్రతి సిద్ధాంతం విచక్షణతో విడమరచి చూసి సత్యం గుర్తించాలి. హిందువులు జన్మదినాలు జరుపుకోరు. అంటే వారిలో అధిక సంఖ్యాకుల జీవితాలు నికృష్టంగా వుండబట్టే సంతోషకరమైన విషయాలే గుర్తుంచుకొంటారు. వారి అనుభవమే వారికి జీవితం ఒక బంధం అని నేర్పుతుంది. అలాంటి అనుభవాన్ని వారు తిరిగి పొందాలని కోరుకోరు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన అనుభవం. సామాన్య ప్రజలు భరింపరాని జీవిత బంధాల నుండి పారిపోయే ప్రయత్నం చేయకుండా అసలు  ఈ జీవితమే భ్రమ అనే సిద్ధాంతం వ్యాపింప చేసారు. ఈ జీవితానికి అతీతమైనదేదో వున్నదని ప్రజలను మోసగించారు. ఆకాశకుసుమంలాంటి ఆ జీవితం ఆశతో ఈ దుర్భర జీవితాన్ని జనం నెట్టుకొస్తున్నారు. ఈ జీవితం ఒక బంధం. బంధం కూడా భ్రమే కనుక దాన్ని పట్టించుకోబోకు. బానిస బ్రతుకే బాగుందనుకో. బానిసత్వం తప్పదనుకో.
ఈ రకమైన జీవితానికి ఆధ్యాత్మికత్వం అంటగట్టి పొగడటం కేవలం వక్రీకరించటమే. ఇదంతా పచ్చి మోసం ఈ వేదాంతమే దేశానికి అనర్థం తెచ్చిపెట్టింది. మానవులు తమ జీవితాదర్శాలను అందుకోవాలంటే పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అలాంటి పరిస్థితులను ఉపేక్షాభావంతో చూస్తే అభివృద్ధికి కావలసిన ప్రేరణ సమాజంలో లోపిస్తుంది. తమ జీవిత విధానాల కెదురు తిరిగి మార్పు తెచ్చే ప్రయత్నాలే సమాజ క్రమ వికాసానికి తోడ్పడతాయి. ఇలాంటి చైతన్యం లేని సమాజం స్తంభించిపోయి, హీనస్థితి పొంది అవినీతికి, వినాశనానికి గురి అవుతుంది. ఆధ్యాత్మిక వాదం పుణ్యమా అంటూ శతాబ్దాల తరబడి భారతీయ సమాజం స్తంభించిపోయింది. పర్యవసానంగా వేయి సంవత్సరాలుగా పరాధీనమై, ఆర్థికంగా చితికిపోయి, బుద్ధి మాంద్యంగా నాగరికతకు దూరమయింది.     
                         మూలం                                  తెలుగు సేత
            ఎమ్.ఎన్.రాయ్                           వెనిగళ్ళ కోమల

మానవవాది హీరో ముసిని నారాయణ




నైజాం పాలనలో తలెత్తుకొని తిరిగి ‘నేను మానవవాదిని’, ‘నేను సోషలిస్టుని’ అని చెప్పటం ఒక పట్టాన సాధ్యమయినది కాదు. దేశంలో ఇతర చోట్ల ముఖ్యంగా, నిజాం రాష్ట్ర చుట్టుపట్ల మానవవాదులు విపరీతంగా ఉద్యమించి పనిచేశారు. అందులో మహరాష్ట్ర, కన్నడ, ఆంధ్ర పేర్కొనదగినవి. అలాంటి రోజులలో తెలంగాణాప్రాంతం మహబూబ్ నగర్ నుండి ముసిని నారాయణ తలెత్తుకొని గ్రామాలలో తిరిగి మానవవాదిగా చెప్పుకుంటూ సిద్ధాంతాలను ప్రచారం చేయగలిగాడు. ఆయన ధైర్యసాహసాలకు హాట్స్ ఆఫ్!
ముసిని నారాయణ 1929లో మహబూబ్ నగర్ జిల్లా జానాం పేటలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో పుట్టారు. తండ్రి శివయ్య ఆయుర్వేద వైద్యుడు. తల్లి వెంకమ్మ గృహిణిగా సంసారం చక్కపెట్టేది. నారాయణ హైస్కూలు విద్య ముగించి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ రెవెన్యూ సర్వీసులో చేరాడు. తహసీల్దారుగా ఉద్యోగం ప్రారంభించి, ఖమ్మం జిల్లా కల్లూరులో బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా అనుభవం పొందారు. ఆనాడు స్థానిక నాయకుడుగా జలగం వెంగళరావు ప్రజాదరణ పొందిన వ్యక్తి. అతని సోదరుడు కొండలరావు కూడా స్థానిక రాజకీయాలలో ప్రాబల్యంగలవాడు. వారు సిఫారసు చేసినపుడు అది సరైన మార్గంలో లేనపుడు నారాయణ ధృవీకరించి తన మార్గాన ముక్కుసూటిగా వెళ్ళేవాడు. సహజంగా రాజకీయనాయకులకు ఆగ్రహం రావడం నారాయణను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయించటం జరిగింది. అయినా తన సక్రమ పద్ధతులను నారాయణ మార్చుకోలేదు.
అప్పటికే  ఎమ్.ఎన్.రాయ్ మానవవాద సిద్ధాంతాలు  చదివి ఆకర్షితుడై వాటిని తన స్థాయిలో ప్రచారం చేయటం  మొదలు పెట్టాడు. ప్రజలు సార్వభౌములని వారు నిలదొక్కుకుంటే పాలన చక్కబడుతుందని రాయ్ చెప్పింది  ఆయనకు నచ్చింది. అంతేగాక  వికేంద్రీకరణ జరిగితే అధికారం  కేంద్రీకృతం కాకుండా వుంటుందని  అవినీతికి అవకాశం తగ్గుతుందని  రాయ్ చెప్పాడు. అదికూడా నారాయణకి బాగా నచ్చింది. రాయ్ రచనల తెలుగు అనువాదాలను వెంటబెట్టుకుని రోజూ పొద్దున్నే బయల్దేరి గ్రామాలలో ఉన్న ఉపాధ్యాయుల దగ్గరకి, పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్ళి పుస్తకాలు పంచేవాడు. సిద్ధాంతాలు చెప్పేవాడు. పిల్లలకు అవి చెప్పమని ఉపాధ్యాయలను ప్రోత్సహించావాడు. ప్రజలలోకి రాయ్ సిద్ధాంతాలు తీసుకెళ్ళమని స్థానిక నాయకులను ప్రోత్సహించేవాడు. తాను ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అదనంగా ఈ పనులు చేసేవాడు. అది చాలామందిని ఆకట్టుకుంది. తరువాత ఉద్యోగాలలో బదిలీలు జరుగుతుండగా మానవవాద కార్యక్రమాన్ని మాత్రం వదలకుండా వ్యాపింపచేశారు.
ఆరోజులలో  మానవవాద ఉద్యమకారుడు ఎమ్.ఎన్.రాయ్ సిద్ధాంతాలను యువతకు, గ్రామస్తులకు  ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాడు. ముఖ్యంగా శలవులలో ఈ కార్యక్రమాలు నిర్వహించేవాడు. నారాయణ ఇందులో పాల్గన్నాడు.  సంక్షిప్తంగా ఉపన్యాసాలు చేసేవాడు. ఇతరుల ఉపన్యాసాలు విని ఆసక్తికరమైన ప్రశ్నలు వేసేవాడు. ఆ విధంగా మానవవాద ప్రముఖులైన ఆవుల గోపాలకృష్ణమూర్తి, మల్లాది రామమూర్తి, రావిపూడి వెంకటాద్రి, కోగంటి సుబ్రహ్మణ్యం,  ఆలం ఖుంద్ మిరి, మొదలైనవారితో సన్నిహిత పరిచయాలు జరిగాయి. నేను 1960 నుండి నారాయణతో సన్నిహిత పరియస్తుణ్ణయ్యాను. ఆయన ఆసక్తికరంగా చర్చలు చేసేవాడు.
నూకల రామచంద్రారెడ్డి  రెవిన్యూమంత్రిగా వుండగా భూ ఆక్రమణలు, అన్యాక్రాంతాలపై  విచారించడానికి నారాయణను ఏకసభ్యసంఘంగా నియమించారు. అప్పట్లో ప్రధానకార్యదర్శి ఎం.టి. రాజు వుండేవాడు. నారాయణ విచారణ జరుపుతుండగా సాక్షాత్తు ప్రధాన కార్యదర్శి ద్వారా ఈ అవినీతి కార్యక్రమములో భూ ఆక్రమణ జరిగినట్లు తెలుసుకొని నోటీసిచ్చాడు. ఒక చిన్న ఉద్యోగి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీచేయటమనేది మానవవాద సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న వ్యక్తే చేయగలడు. అదే నారాయణ ఉద్దేశం. ఫలితంగా ఆయన్ను బదిలీ చేశారు. అంతేగాక ఆయన నోటీసిచ్చిన విషయంపై విచారణ జరపలేకపోయారు. అలాగే నారాయణ హయాంలో మంత్రులూ అధికారులూ దారితప్పి సౌకర్యాలు ప్రభుత్వపరంగా పొందాలనుకుంటే ఆయన పడనిచ్చేవాడు కాదు. ఆవిధంగా జీవితమంతా రాజీపడని మానవవాదిగా కొనసాగాడు. ఇంగ్లీషు తెలుగు రాడికల్ హ్యూమనిస్టు పత్రికలను తెప్పించి చదివి ఇతరులకు చెపుతుండేవాడు. 1956 నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నారాయణ స్వేచ్ఛగా సిద్ధాంత ప్రచారాలు చేశారు.
న్యూట్రిషన్ ల్యాబ్స్ లో సైంటిస్టుగా  పనిచేసి రిటైర్ అయిన రఘురాములు  నారాయణ ప్రేరణతో హేతువాద, మానవవాద సభలలో పాల్గొని ప్రచారంచేసేవారు.
కేవలం మాటలు  చెప్పటమే కాక ఆచరణలో కూడా నారాయణ తన జీవితంలో అన్వయించి  చూపారు. తన కుమార్తె వివాహాన్ని మానవవాద పద్ధతిలో జరిపించారు. ఆమె వివాహాన్ని సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుతో సెక్యులర్ గా జరిపించగా  వేదికపై ప్రత్యేక అతిథిగా  ఎన్. ఇన్నయ్యను ప్రసంగింప  చేశారు. తన కుమారునికి ‘మానవేంద్ర’ అని పేరు పెట్టారు. అది ఎమ్.ఎన్.రాయ్ పూర్తిపేరు. అతను ప్రస్తుతం కెనడాలోని రాన్ కోవర్ లో వుంటున్నారు. మరొక కుమారుడు రవిప్రకాష్ నారాయణ సిద్ధాంతాలను జీవితంలో పాటించిన ఉపాధ్యాయ సంఘ నాయకుడు. ఆయన కూడా రిటైర్ అయి ప్రస్తుతం అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నారు. ఆనాడు తెలంగాణాలో రేగుచుక్కగా మార్గదర్శిగా కష్టాలను ఎదుర్కొని మానవవాదాన్ని సాధ్యమైనంతవరకు పరిచయం చేసిన వ్యక్తి నారాయణ. 2003లో నారాయణ చనిపోయాడు. ఆయన చూపిన మార్గం గొప్పది సాహసోపేతమైనది. అలాంటి వ్యక్తితో పరిచయం వుండటం నేను గొప్ప లక్షణంగా భావిస్తున్నాను.


 Contributed by Innaiah Narisetti

పిల్లి చెప్పిన కథ - 12ఆధ్యాత్మికతకు మూలం - 2




ఇక వుద్రేకాల విషయానికొద్దాం, శరీరంలో కొన్ని గ్రంథుల నుండి స్రవించే రసాయనిక పదార్థాలు వుద్రేకాలను కలిగిస్తాయని ఆధునిక శారీరక శాస్త్రం స్పష్టం చేస్తున్నది. మానవునితో సహా ఉచ్ఛ ప్రాణులన్నింటిలలో ఈ గ్రంథులు ఒకే రకంగా వుంటాయి. అవి ఒకరివి మరొకరికి అమర్చవచ్చు. థైరాయిడ్ గ్రంథిలో వుత్పన్నమయ్యే రసాయనిక పదార్థం బుద్ధి కుశలతకు ఉద్రేకాలకు కారణం. ఇవి సరిగ్గా పనిచేయకపోతే, మానవతత్వానికి దగ్గరగా వుండే జంతువుల థైరాయిడ్ గ్రంథుల నుండి తీసిన ద్రవాన్ని మానవులకెక్కించి వారి గ్రంథుల లోపాన్ని దిద్దవచ్చు. ఆధునిక శస్త్ర వైద్యం చాలా అభివృద్ధి చెందింది. కొన్ని జంతువుల థైరాయిడ్ గ్రంథులను మానవులకు శస్త్ర చికిత్స ద్వారా అమర్చటం వలన వారి మానసిక ఉద్వేగ అలసటలను దూరం చేయగలుగుతున్నారు. పిట్యుటరీ గ్రంథులు గూడా ఒక మాదిరి ఉద్వేగాలను కలిగిస్తాయి. జంతువుల నుండి తీసిన పిట్యూటరీ ద్రవం మానవులకు ఎక్కిస్తే వారిలో భయోత్పాతాన్ని కలిగిస్తుంది.
ఇవీ, ఇంకా యిలాంటి ప్రయోగాలవల్ల నిర్థారణగా తేలేదేమంటే ఆధ్యాత్మిక లక్షణాలని చెప్పుకోబడేవన్నీ మెదడుకు, కేంద్రనాడీమండలానికి సంబంధించినవి. క్రింది జీవాల నుండి మనషి వరకూ అన్నింటిలో మెదడు వుంది. నాడీ మండలం వుంది కనుక వీటి నుండి పుట్టే మానసిక లక్షణాలు జంతువులలో లేవనటానికి వీలులేదు. ఆధునిక జీవశాస్త్రజ్ఞులు, విద్యాధికులైన వైద్య నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
జంతుమనస్తత్వ శాస్త్రం ఇంకా చిరుప్రాయంలోనే వుంది. ప్రాణుల అవయవ పరిణామంలో ఎంతో దిగువ నుండి మానసిక లక్షణాల్లా కనిపిస్తున్నట్లు రుజువు చేయటానికి తగినంత  విషయసేకరణ ఇప్పటికే జరిగింది.  వృక్షజాతిలో గూడా ఈ లక్షణాలు  వున్నట్లు నిదర్శన్నాయి. అయినా చెట్లు బాధ, సంతోషం మొదలైన వాటిని అనుభవిస్తాయని యింకా రూఢిగా చెప్పలేం. కాని బాహ్య ప్రపంచపు కదలికలను బట్టి చెట్లలో చలనం కలుగుతుందని, అలాంటి చలనాన్ని పొందే అవయవాలు వాటికున్నాయని ప్రయోగాల ద్వారా నిరూపింపబడినది. ఏమయినా జంతువులలో చాలా దిగువశ్రేణి వరకూ మానసిక లక్షణాలున్నాయని ఆధునిక మనస్తత్వ శాస్త్రం చెప్పుతుంది. ఈనాడు మనో విజ్ఞానం అంటే ఆత్మ సంబంధమైనదని అనుకోవలసిన పనిలేదు. అది జీవ పరిణామ శాస్త్రంలో ఒక భాగం అంటే శరీరశాస్త్ర సంబంధమైనదని తెలిసింది. జంతుమనస్తత్వ శాస్త్రం చిరుప్రాయంలో వున్న జంతు జీవిత సత్యాలను తెలుసుకోవటంలో జంతు శాస్త్ర పరిశోధనలు చాలా ముందుకు వెళ్ళాయి. ఆత్మగలవి, లేనివి, అనే తేడా  శాస్త్రం ఎక్కడా చూపదు. మిగతా జంతు ప్రపంచం నుండి మనిషిని వేరుగా చూపగల ఆధారాలు లేవు. అంగ నిర్మాణం, వాటిపని, ఆలోచన, అన్నీ ఒకలా వుండటం వలన ఈ తేడా చూపలేం. జీవపరిణామంలో నాడీ మండలంగల జంతువులను వేరు చేద్దామనే ప్రయత్నం కూడా ఫలించలేదు. శాస్త్ర ప్రకారం చూస్తే అమీబా గూడా మానసికానుభవాలు పొందుతున్నట్లు తేలుతోంది. బాహ్యప్రపంచపు వత్తిడివల్ల గూడా ఎమీబాలో కదలికలు ఏర్పడతాయి. దానిని బట్టి అలాంటి కదలిక అంతరంగికంగా కూడా పనిచేస్తుండాలి.
ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, కోతులు మొదలైన జంతువుల (పిల్లులు కూడా  ఈ సంపన్న జంతుకోటిలోనివే) తెలివితేటలను సందేహించటానికి ఆస్కారం లేదు. వీటికి ఉద్రేకాలు, అనుభవాలు కలుగుతాయంటే వింత పడనవసరం లేదు. నేను తెలివిగల దాన్నంటున్నాను గదా అని డిఫరెన్షియల్ కాలుక్యులస్ కు సంబంధించిన లెక్కలు చేయగలనని గాని, రస్సెల్స్, వైట్ హెడ్, విటెగెన స్టైన్ వంటి వారి గణిత శాస్త్రతర్కాన్ని గాని, భౌతిక శాస్త్రసంబంధమైన గణితాన్ని గాని, మానవులకంటే బాగా అర్థం చేసుకోగలనని అనటంలేదు. మానవులు నాపట్ల చూపే ప్రవర్తనకు నేను ఎదురు తిరగగల నా తెలివి వారి నమ్మకాలను, భావాలను, ఆచారాలను దుయ్యబట్టగలదంటున్నాను. నాలో తెలివి వుందని ఒప్పుకోకపోతే నా పరిశీలనా శక్తికి విలువ వుండదు. దానినంతగా పట్టించుకోరు. నన్ను మరోలా అర్థం చేసుకోకుండా వుండటానికి వీలుగా నాకూ మానవునికి మధ్యగల భాషాపరమైన తేడా (అంగీకరించటానికి నా మనసు ఒప్పుకోకపోయినా)ను మరొకసారి నొక్కి చెపుతున్నాను. మనుష్యులు కూడా జంతు జాతివారే అయినా వారికి భాష వున్నది గనుక ఆధ్యాత్మికాభివృద్ధి అవకాశాలు వారికే ఎక్కువగా వున్నాయి. తరతరాలుగా మానవునిలో జంతు స్వభావం వున్నతి చెంది, పురాణదేవుళ్ళ మహిమకంటె మించిన మహిమను అతనికి సంతరించి పెడుతున్నది. దురదృష్టవశాత్తూ మానవులు చాలామంది తమ విలువలను గుర్తించి సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు.
ఇంతకీ నేను చెప్పదలచింది  ఏమంటే మానవుడు జంతువులను మించిన వాడుకాడు. జంతువులలో పై మెట్టున వున్నవాడు. శరీరనిర్మాణంలో వున్నత శ్రేణికి చెందినవాడు. జంతువు చరమదశే మానవత్వం. మానవుని మానసిక అభివృద్ధి వూహానిర్మితమైన దైవత్వం మీద ఆధారపడలేదు. జీవపరిణామ పద్ధతిలో పరిణితి చెందటం, అతని అవ్యక్త మెదడు లెక్కలేనన్ని అనుభవాలకి నిలయమవటం వీటన్నిటిమీద అతని ఆధిక్యత ఆధారపడి వుంది.
తమ గొప్పను నేను సందేహించినందువల్లనైనా మానవుడు తనను తాను విమర్శనా దృష్టితో చూచుకోగలడేమో అనుకున్నాను. నాకు తెలిసిన మనుషుల్లో (వీరు భారతీయులందరికి ప్రతినిధులు) నిజమైన మానసిక వికాసం జరిగినట్లు కనిపించదు. మాటల నిరంకుశత్వం వారిని అధముల్ని చేసింది. జంతువులకంటే హీనంగా, అజ్ఞానులుగా, అసహజంగా, వాస్తవానికి దూరంగా కపట జీవితం గడుపుతున్నారు. వారు అధికులమనుకోవటం గాలిలో మేడలు కట్టటంలాంటిదే. దేహంలో పూర్తిగా భిన్నమైన, స్వతంత్రమైన ప్రత్యేక ఆధ్యాత్మిక స్థితి  ఉన్నదని భ్రమలోపడి మనిషి ఒక కపట జీవితానికి అలవాటు పడ్డాడు. పరమాత్మ స్వరూపులమనే అహంభావంతో వాస్తవాన్ని చూడలేకపోతున్నాడు. మానవులు నాలా స్వేచ్ఛగాను, నిష్కపటంగానూ వాస్తవ జీవితాన్ని గడపలేరు. గనుక, నిజాయితీగా ఆలోచించి సహజంగా ప్రవర్తించలేరు గనుక వారిని నాకంటే అధికులమనుకోవటం నా వల్లకాదు.
సామాన్య మానవుల నిత్య జీవితాలను పరిశీలించి వ్యక్త పరచటమే నా వుద్దేశ్యం. నాకున్న తెలివితేటలతోనే నాపనిని సక్రమంగా చేయగలననుకుంటున్నాను. మనిషి సహాయంతో మనిషి భాషలో నేను చెప్పాలనుకున్న విషయాలు, జంతు మనస్తత్వ శాస్త్ర పరిశోధనలు విమర్శనా సాహిత్యానికి కొంతవరకు తోడ్పడగలవనుకుంటున్నాను. ఈ కథలో కొంత వూహాకల్పితాలున్నాజంతు ద్వేషంతో కూడినవి మాత్రం కాదు. నేనున్న పరిస్థితులలో, నేను మాట్లాడగలిగి వుంటే నా అభిప్రాయాలను ఎలా చెప్పగలిగేదాన్నో సరిగ్గా అలాగే నా సహాయకుడు వూహించాడు. మానవభాష నాకు ఏ కొద్దోతప్ప అర్థం కాదు. గనుక తను వ్రాసింది ఎంతవరకు సరిగ్గా వుందో నేను చెప్పలేను. నా భావాలను, నా వుద్రేకాలను, నా ప్రవర్తనను నిశితంగా పరిశీలించటానికి చాలా శ్రమపడ్డాడు. అందుకని తను రాసినదానికి నేను అనుకున్నదానికి ఆట్టే తేడా వుంటుదనుకోను. రాసినకథ చాలా నిర్దుష్టమైందని, చాలా నమ్మకంగా నా మనోగత భావాలను చక్కగా చిత్రించాడని చెప్పగలను. విమర్శనాత్మకంగా వున్న భాగాలు చాలా వరకు నా సహాయకుని వూహలనవచ్చు. కాని వాటిని నా మనోభావాల విశదీకరణగా తీసుకోవచ్చు. మానవుల స్వభావం, ప్రవర్తనలపట్ల నాలో కలిగే భావాలను బట్టి అతను ఒక నిర్దుష్టమైన విమర్శనా పద్ధతిని అనుసరించి వుండవచ్చు. కొద్దిలో చెప్పాలంటే మా ఇద్దరి సహకారం చాలా బాగా సాగింది. దీనికి కారణం అతను మనిషిలోని జంతుతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటమే.
సమాజంలోని లోపాలు గమనించగలిగినవారికి నా ఈ సాహిత్యరచన సమంజసంగానే వుంటుంది. ప్రఖ్యాత రచనలన్నీ సామాజిక వ్యవస్థల మీద, వాటిని బలపరచే పాత భావాల మీద తిరుగుబాటు చేయటానికి సాగినవే. ఇలాంటి రచనలింకా ఆధునిక భారతీయ సాహిత్యంలో కనిపించటంలేదు. భారతీయ పునర్వికాసోద్యమం కొనసాగాలంటే, దానికి సాహిత్యం సహాయపడాలంటే, నేటి సమాజంలోని కుళ్ళను, ప్రచారంలో వున్న తప్పుడు భావాలను, పనికిమాలిన సమాజవ్యవస్థల స్వరూపాలను, గుట్టులేకుండా విమర్శించే రచనలు సాగాలి. సమాజ వ్యవస్థలో మార్పు రావాలి అని కోరే రచయితలకూ యిలాంటివి రాయాలని తోచకపోవటం వింతగా వుంది. చదువుకున్న యువకులు కూడా జాతీయతత్వంలోపడి, సమాజ సమస్యలను విమర్శనాత్మకంగా చూడలేకపోతున్నారు. జాతీయత అచ్చంగా మానవగుణమో, దుర్గుణమో?. నాకీ బాధలేదు. జంతువులకు, సుఖంలేని మానవులకు (భారతదేశంలో అధిక సంఖ్యాకులు ఇలాంటివారే) ఈ జాతీయత అంటలేదు. నా రచన ముఖ్యమైన ఉద్దేశం భారతీయ ఆధునిక సాహిత్యంలో విమర్శనా దృష్టిని ప్రవేశపెట్టి ప్రజలకు జీవిత సత్యాలు తెలిపే మార్గం చూపటమే. నా రచనలో పాత భావాలకు, ఉద్వేగాలకు, నీతి బోధలకు తావుండదు. నేను భారతీయ యువతను కోరేది నాపట్ల క్రూరంగా ప్రవర్తించినవారి పట్ల ఎదురుతిరగమని కాదు. ప్రగతిపథంలో అడ్డగోలుగా వున్న భారతీయ సామాజిక జీవితంలోని కుళ్ళును, అసత్యాన్ని, కపటాన్ని ఎదుర్కోమని, మానవులు చేసే పనులు నేను సమర్థించలేను. కనుక నాతో పరిచయమున్న మానవుల అసహ్యమైన, హాస్యాస్పదమైన, లక్షణాలను బాహాటంగా వ్యక్తపరుస్తున్నాను. ఇలాంటి భావాలను స్పష్టం చేసిన నా కథ చదువరుల దృష్టిని వీటి మీదకు మరల్చి వాటి వెనుకగల సామాజిక కారణాలను వారు తెలుసుకునేలా చేస్తుందని ఆశిస్తున్నాను. నేనొక అమోఘమైన రచనను చేస్తున్నట్లు నటించను. కానీ ఉత్తమ కోవకు చెందిన విప్లవ రచనల్ని సమర్థులైనవారు సృష్టించటానికి నా  రచన మొదటి మెట్టుగా వుంటుందనుకొంటున్నాను.
                         మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

పిల్లి చెప్పిన కథ - 12--ఆధ్యాత్మికతకు మూలం -1



మనిషి ఆధ్యాత్మిక లక్షణాలనబడే మతము, నీతి, కళలు అన్నీ కూడా జంతు ప్రేరణలకు నిలయమైన అవ్యక్తపు అదుపులోనివే. కనుక నా  సాహిత్య సాహసం ఏమంత
సహజమైంది కాదు.



మీకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోవటమొక్కటే నా రచనలోని లోపం. అది పూర్తిగా మంచిని చేకూర్చకపోయినా నా రచనను నేను యిష్టమొచ్చినట్లుగా చేసే స్వేచ్ఛనిస్తుంది. భావాలు భాషకు బలికానక్కరలేదు. గునపాన్ని గునపమనే చెప్పనక్కరలేదు. ఇనుముతో ఫలానా ఆకారంతో తయారు చేయబడిన  పనిముట్టు అనొచ్చు. అయినా భాషకు సంబంధించిన అవరోధం ఏర్పడుతుంది. సాంకేతికంగా దీనిని దాటాలి. నేను చెప్పదలచుకొన్నది మీ భాషలో చెబితేగాని మీకు అర్థం కాదాయె. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనిషి సహకారం అవసరమవుతోంది. అదీ దైవంలో నమ్మకంలేని వాడు దొరకాలి. తనలోని జంతుతత్వాన్ని పూర్తిగా ఎరిగినవాడు కావాలి. అలాంటివాడే నా భావాలను సరిగా తెలుసుకొని వాటిని మనుషుల భాషలో చెప్పగలడు. 

అలాంటి వాడొకడు నే పుట్టిన జైల్లోనే దొరికాడు. నాకు ఒక నెల వయసులోనే అతన్ని కలిశాను. లోకం దృష్టిలో నేనతనికి పెంపుడు జంతువుని. అతను నాకు యజమాని. యదార్థానికి మా సంబంధం మరొక రకమైనది. లేక పోతే అతను నాతో సహకరించి నా మనసులోని భావాలను మనిషి భాషలో వ్రాయటం జరిగేది కాదు. అయితే జంతువుల ఉద్రేకాలు గ్రంథ రూపంలో వెలువడడం యిదే మొదలు కాదు. (వైజ్ఞానిక పుస్తకాలు మినహాయిస్తే) మిగిలిన సాహిత్యమంతా ఇలాంటి ఉద్రేకాల చిత్రణే. తేడా ఎక్కడంటే సహజమైన జంతుం ప్రేరణలను మానవత్వపు మిషతో అవినీతిగానూ, నీచంగానూ, అసత్యంగానూ, మారురూపాలతో చిత్రించటం జరుగుతోంది. ఈ తేడా చాలా పెద్దది. నా  ఈ రచన నా వుద్రేకాలను మాత్రమే వెలిబుచ్చేదికాదు. మానవ ప్రవర్తనను పరిశీలించి ఆ ప్రవర్తనకు కారణమైన భావాలను విమర్శనా దృష్టితో వ్యక్తపరచదలిచాను.

మానవుల గుత్తాధిపత్యమైన సాహిత్య రంగంలోకి నేనెందుకు ప్రవేశించదలిచానో సరిగానే చెప్పాననుకుంటాను. సాహిత్యం వారి సొంతమనుకోటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి వారి భాష, రెండోది బుద్ధిలోను, భావాలలోను అధికులమనుకోటం. మొదటిది వారికి అనుకూలమైంది కాని మీరు దీన్ని ఇంతవరకు దుర్వినియోగం చేస్తూవచ్చారు. అయినా నాకు దాని వల్ల ప్రయోజనం లేదు. మా భావాలేమిటో మనిషికి తెలియపరుద్దామంటే వీలుకాకుండా వుంది. భాషాపరమైన యిబ్బందిని ఎదుర్కోగలిగాను. బుద్ధిలోనూ, భావాలలోనూ మనిషి అధికుడు అనుకోవటం కేవలం భ్రమ.

నేనెంత తెలివైనదాన్నో, నా భావాలెంత సున్నితమైనవో మానవునకు తెలియదు. ఇప్పుడు ఇవి తెలుసుకోవాలంటే కేవలం వూహమీదే ఆధారపడనవసరంలేదు. పరిసరాలను గుర్తించటం, వాటి ద్వారా కొన్ని అభిప్రాయాలు ఏర్పడటం జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతున్నది. జ్ఞానేంద్రియాలో ఏవో కొన్నయినా మానవులలోకంటే జంతువులలోనే ఎక్కువ శక్తివంతంగా వున్నాయనేది నిర్వివాదాంశం. నా చూపు మనుషుల చూపుకంటే చురుకైనది. మనిషి చూడలేని  అనేక వస్తువులను నేను చూడగలను. అంతవరకు నా తెలివితేటలు మేలేనన్నమాట. పరిశీలించి చూస్తే మేమెంత సున్నితంగానూ, సునిశితంగానూ వుంటామో అర్థమవుతుంది. జంతువుల జీవితాలను గురించి ఆధునిక శాస్త్రం ఎన్నో విషయాలను తెలుపుతున్నది.

బుద్ధికి మూలమైన మెదడు సంగతికొద్దాం. నా మెదడుకు, మనిషి మెదడుకు గల తేడా పరిమాణంలోనే గాని గుణంలో కాదు. నా మెదడు చిన్నదైనా నా తలపరిమాణాన్ని బట్టి సరిగా వున్నట్లే, నా తల గూడా మనిషి తలంత ఉన్నట్లయితే నా మెదడు మనిషిని మెదడును మించి వుండేది. పరిమాణంలో గల తేడా సాపేక్షమైనది.  నిర్మాణంలోనూ, పనిచేయటంలోనూ ఏమీ తేడాలేదు. పరిసరాలు మెదడులో కలిగించే చిత్రణల సాముదాయక రూపాన్ని ‘జ్ఞానం’ అంటారు. ఈ చిత్రణలు జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడుతాయి. నేను ఒక్క దృష్టి విషయంలోనే గాక అన్ని విధాల మానవునికంటే సునిశితంగా వుంటాను. మనిషి మెదడులో చిత్రణలకు నా మెదడులోని చిత్రణలు ఏ మాత్రం తీసిపోవు. అలాంటప్పుడు మానవులకంటే నేను తెలివితక్కువ దానినని ఎందుకనుకోవాలి.

మానవుల కంటే దిగువ శ్రేణిలోవున్న జంతువులకు ఆలోచనాశక్తి లేదనుకుంటారు. మానవుల అహంకారం అలా అనుకొనేలా చేస్తుంది. మానవులకర్థమయ్యే భాషలో మా భావాలను వ్యక్తం చేయలేమనీ మాకసలు ఆలోచించే శక్తే లేదనీ, అదంతా వారి సొత్తేననీ తలుస్తారు. ఆలోచన శారీరకమైన క్రియ బాహ్య ప్రపంచం కలిగించే చైతన్యం మూలంగా జరిగేపని. ఈ చైతన్యం మానవులలోను, జంతువులలోను ఒకే విధంగా వుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే, శారీరక, రసాయనిక మార్పులవల్ల ఈ చైతన్యం భావాలుగానూ, వుద్రేకాలుగాను రూపం దాలుస్తుంది. అవయవ నిర్మాణంలో, శారీరక ధర్మాలను బట్టి చూస్తే మానవదేహాలకూ, వారి కంటే ఒక మెట్టు క్రిందవున్న జంతువులకూ తేడా ఒక్క పరిమాణంలోనే అని తెలుస్తున్నది. మానవ నాడీమండలం క్లిష్టమైనదంటారు. ఈ విషయం గూడా శాస్త్రీయంగా సరైనది కాదు. మెదడు పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలంటే శరీర ప్రవర్తనను పరిశీలించటం ద్వారానే తెలుసుకోవచ్చు.  ఒక్క మాట్లాడే భాష విషయంలోనే మనిషికీ జంతువుకీ తేడా ఉన్నది. మాట్లాడటం అంటే బిగ్గరగా ఆలోచించడం అన్నమాట, కానీ తీవ్ర ఆలోచనలు చేయాలంటే నిశ్శబ్దంగా చేయాల్సి వుంటుంది. అతిగా వాగేవారికి బుర్రలు శూన్యంగా వుంటాయి. మౌనమే భూషణం అన్న సామెత అందుకే పుట్టింది. పద్మాసనం వేసి ఇబ్బందిగా కూర్చొని కళ్ళు మూసుకుంటేనో, లేక బొడ్డువైపు చూస్తూ వుంటేనో ఆ మనిషి చాలా గట్టి ధ్యానంలో మునిగి వున్నట్లు లెక్క. నా నాలుగు కాళ్ళు పొట్ట కాళ్ళు పొట్ట కిందకు ముడిచి పడుకుని కళ్ళు మూసుకొని ఉంటే (నిద్రపోవటం కాదు). నేను కూడా ధ్యానంలో ఉన్నానని ఎందుకనుకో గూడదు? మీకు ఓపిక, పరిశీలనా శక్తి వుంటే, ఒక్క క్షణం మీ అహంకారాన్ని  విడవగలిగితే (యిది అన్నిటికన్నా ముఖ్యం) గంజాయి పొగ పీల్చడం వల్ల బుద్ధి మాంద్యం ఏర్పడ్డ సాధువుల లక్షణాలు నా ముఖంలో స్పష్టంగా చూడగలుగుతారు. ఎవరన్నా పోసిన పాలైనా, లేక దొంగిలించినవైనా కడుపు నిండా త్రాగితేనో, లేక మంచి పచ్చిమాంసం తిన్నా నాలోని ఆధ్యాత్మిక చింతన యింకా బాగా కనబడుతుంది. తినటానికి ఎలుకన్నా, ఉడుతన్నా దొరికితే యింకా మజాగా వుంటుంది నా పరిస్థితి.

మానవ జీవితాన్ని సన్నిహితంగా చూడగలగటం వల్ల వారిలా మేము గూడా తాత్విక ధోరణిలో పడుతూవుంటాం. తిండికి తిప్పలు పడనవసరం లేకపోతే మేమెప్పుడూ ధ్యానంలో  ఉండిపోయేవాళ్ళం. ఆధ్యాత్మిక భావాలు పెంపొందాలంటే విశ్రాంతి కావాలి. ఈ సూత్రం మాకూ అన్వయిస్తుంది. మా ఆధ్యాత్మిక ఆధిక్యతను హిందువులు తప్పక గుర్తించాలి. మాటల్లో వ్యయం అయ్యే శక్తిని కూడగట్టుకోటానికి వారప్పుడప్పుడూ మౌనం  వహిస్తుంటారు. మా జీవితం అంతా తపస్సుకే అంకితం అయిపోయింది. భావాలను మాటల్లో వ్యక్తం చేయలేకపోవటం ఒక విధంగా మాకు మంచిదే. దైహికమైన (దైవికమైన కాదు) ఈ లోపం మా మానసిక స్వేచ్ఛకు కారణమైంది. మనిషికాస్వేచ్ఛలేదు. వారి భావాలను ఉద్రేకాలను భాష పరిమితం చేస్తుంది. మాకలాంటి బాధలేదు. మా భావాలు, వుద్రేకాలు మనుష్య పద్ధతిలో రాయబడవు. అవి మరోవిధంగా జాగ్రత్త చేయబడతాయి. అవి మానవుని అవ్యక్తాంశం లోనికి ప్రవేశిస్తాయి. ఈ ఆవ్యక్త భాగమే మానవుని చేష్టలన్నిటికి హేతువు.

ఒక భాషతప్ప మిగతా ప్రవర్తన అంతా మానవులలో జంతువులలో ఒక్కలానే ఉంటుంది. ఒకేవిధమైన శారీరక ప్రవర్తనల కాధారమైన మానసిక ప్రవృత్తులు గూడా ఒకేలా వుంటాయి. కనుక మానవుడిలో ఆత్మ అనేదేదో వుంటుంది. అదే వారి ఆధ్యాత్మికతకు ఆధారం అనే మూఢ నమ్మకంగల మానవులకు, జంతువులకు ఆత్మవుండదు కనుక ఆలోచించలేవు అనిపిస్తుంది. నా కథ వింటుంటే నా తెలివితేటలు మీకే అర్థం అవుతాయి. ముందు ముందు నాకంటే ఎక్కువ అనుభవంగల ఒక గండు పిల్లిని పరిచయం చేస్తాను. మానవ శత్రువు మీద విజయాన్ని సాధించటానికి అతడెంత తెలివిగా, జాగ్రత్తగా ప్రవర్తిస్తాడో మీకు రుజువవుతుంది. నెపోలియన్ ధైర్య సాహసాలు, మెకివల్లీ నేర్పరితనం, రిచ్ లు మాయోపాయం అన్నీ అతనిలో కనిపిస్తాయి.
(ఇంకావుంది)

    మూలం      తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

కామ్రేడ్ ఎం.ఎన్.రాయిగారి జీవిత చరిత్ర-rare article




6 అడుగులు, 2 అంగుళముల పొడుగు, బలిష్ఠమయిన శరీరము, విశాలమయిన వక్షము, కార్మికుల సేవయందు కష్టములకోర్చి దేశాటనము  చేసిన గుర్తులింకను  మాయని ముఖవర్చస్సు రాయిగారు రూపవంతు డనిపింపకున్నను అసామాన్య ప్రజ్ఞాశాలియనియు ఎట్టి కష్టములకైన జంకని ధీరుడనియు చెప్పకయే చెప్పుచుండును. వీరి వయస్సు 44 సంవత్సరములు.
రాయిని నేను మొదట చూచినది ఫయిజ్ పూర్. కాంగ్రెసునందు కార్మికజనానికి సంబంధించి నేనడిగిన ఒకటిరెండు క్లిష్టమయిన ప్రశ్నలకు నేను వెంటనే అతడొసంగిన జవాబులే అతడు ప్రతిభావంతుడని నాకు స్ఫురింపజేసినవి. అందువల్లనే అమెరికా, యూరోపు, ఆసియాఖండములందలి విప్లవోద్యములలో అతనికి అంతట జోక్యం కలిగియుండుటకు కారణము.
మానవేంద్రనాథ్ రాయ్ అనుపేరు అతనికి పుట్టుకతో వచ్చినది కాదు. బెంగాలు రాష్ట్రమందలి మిడ్నపూర్ జిల్లాలోని ఒకానొక పల్లెటూరు అతని జన్మస్థానము. బ్రాహ్మణ కులము. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నప్పటిపేరు నరేంద్రనాథ భట్టాచార్య. 13 సంవత్సరముల వయస్సునందే బెంగాలు విప్లవోద్యమమునందు రగుల్కొన్నందున త్వరలోనే పోలీసువారి డైరీలో కెక్కి చాలాకష్టములననుభవించి కారాగృహ శిక్షకు పాత్రుడయ్యెను. 1914 సంవత్సరములో ఇండియా దేశమునకు స్వరాజ్యం సంపాదించవలెనంటే జర్మనులతో సహాయము అపేక్షించుట అవసరమని తలచి రాయిగారు బటేనియా, జపాను, చీనా దేశములకు రహస్యముగా తప్పించుకొని వెళ్ళి తన ప్రయత్నము సాగనందువల్ల అమెరికాకు పోయి అప్పటికే అచ్చట ప్రవాసము చేయుచున్న దివంగతులయిన లాలాలజపతిరాయిగారితో హిందూ స్వాతంత్ర్యమును గురించి ప్రచారము చేయుచుండెను. అమెరికా అప్పటి ఐరోపా యుద్ధములో మిత్రమండలికి అనగా ఇంగ్లండు ఫ్రాన్సు వగయిరా దేశములకు అనుకూలముగా ప్రవేశించినందువలన రాయిగారిపైనను లజపతిరాయిగారిపైనను అమెరికనుల అభిమానము తగ్గనారంభించెను. కాని అక్కడి పాటకజనులు మాత్రము వీరి ఉపన్యాసము శ్రద్ధతో వినుచుండిరి. ప్రపంచమందలి కార్మికులందరు ఏకమైనగాని కార్మికవర్గమునకు మోక్షము లేదను సూత్రము అమెరికాయందే రాయిగారికి చక్కగా స్ఫురించినది. రాయిగారు అమెరికావదలి అమెరికా సామ్రాజ్య చక్రములక్రింద నలిగిపోవుచుండిన  ఫిలిప్పైన్స్ దీవులకు, మెక్సికో దేశమునకు పోయి అచ్చటి స్వాతంత్రోద్యమమునకు విశేషముగా పాటుపడెను. ఆ దేశములో సామ్రాజ్య వాద సంఘమును స్థాపించుటకు సహాయపడి ప్రథమ విప్లవ ప్రభుత్వమునకు సలహాదారుడుగా నుండెను.
యం.యన్.రాయియొక్క తెలివితేటలు సామర్థ్యమును, మార్క్సు సిద్ధాంతములను జీర్ణించుకొనుటయందు అతని ఉన్న ప్రజ్ఞను కనుగొన్న లెనిన్, రాయిగారిని మాస్కోకు పిలిపించుకొనెను. మార్గమధ్యమందు రాయిగారు స్పెయిను యందు కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించిరి. మాస్కోయందు మూడవ ఇంటర్ నేషనల్ సంఘము స్థాపనకు లెనిన్ గారికి వీరు చాలా సహాయపడిరి. తూర్పు టర్కీస్థాన్ మొదలగు ప్రాచ్యదేశముల పరిస్థితులను గమనించుటకై వీరు ప్రత్యేకముగ నియమింపబడిరి. పోలిట్ బ్యూరోనందు వీరు సభ్యులై రష్యా రాజకీయములందు చాలా ప్రాముఖ్యతను వహించిరి. ఆసియా ఖండము యొక్క ఇతర బానిసదేశములయొక్క వ్యవహారములను పరిశీలించుచు కార్యదర్శిగా రష్యా ప్రభుత్వముచే వీరు నియోజింపబడిరి.
1925వ సంవత్సరము వరకు చీనా కమ్యూనిస్టు పార్టీ ట్రాట్ స్కీ సిద్ధాంతములను అనుసరించుచు చీనా జాతీయ ఉద్యమమునందు పాల్గొనక ఒంటరిగా పనిచేయుచుండిరి. రాయిగారు అచ్చటికి పోయిన పిమ్మట ఈ పద్ధతిని మార్పించి చీనా జాతీయ సంస్థయగు ‘కోమింగ్ టాంగ్’ సంఘమునందు  ఈ పార్టీ సభ్యులందరు చేరునట్లు చేసి కమ్యూనిస్టు పార్టీ బలమును వేలకువేలుగా వృద్ధియగునట్లు చేయగల్గెను. నాటినుండి ‘కోమింగ్ టాంగ్’ సంస్థకు ప్రజాబలము హెచ్చి రష్యాయందలి ప్రజాసంస్థలు అన్నిటికన్న మేటియయ్యెను. మాస్కో నుండి యీ పార్టీకి సలహాదారుడుగా రాయిగారు పంపబడుటచే 8 మాసములు చీనాయందే యుండి ఐరోపా సామ్రాజ్యవాదుల చేతులలోని కీలుబొమ్మలగు చైనా సేనానాయకులను ఓడించగల్గిన పరిస్థితులను కలుగజేసెను. కాని అచ్చటి పార్టీ ఇప్పుడు తూర్పు ప్రాంతపు రెడ్ ఆర్మీకమాండరుగా నున్న మార్షల్ బ్లూచర్ మాటలకు లోబడి రాయిగారి సలహాను త్రోసిపుచ్చి కొన్ని గొప్ప పొరపాట్లను చేయసాగెను. ప్రకారణముల వల్ల చీనా జాతీయ ప్రభుత్వ నాయకుడగు చాంగ్ కేషేక్ (ఇప్పటి చీనా నియంత)  పొరపాట్లను ఆధారము చేసికొని వేలకొలది కమ్యూనిస్టులను రైతులను చంపించెను. రాయిగార్కి విసుగు పుట్టి తిరిగి మాస్కో వెళ్ళిపోయిరి.
జర్మనీలో 1928 సంవత్సరము ఆఖరులో రాయిగారు జబ్బుపడిరి. అదేసమయమున మూడవ ఇంటర్ నేషనల్ సంఘము తరఫున 4వ ప్రపంచ కార్మిక సభ జరిగెను. ఆ సభయందు లెనిన్ సిద్ధాంతముల నుండి ఇప్పటి రష్యా నాయకులు వీడిపోవు సూచనలు కనిపించెను, రాయిగారు దీనికి సమ్మతించక తన భేదాభిప్రాయమును పై సభకు తెల్పుచు బానిస దేశముల స్వాతంత్రోద్యముల యందు చూపవలసిన వైఖరిని విశదీకరించిరి. మరియు హిందూదేశ స్వాతంత్ర్యపోరాటము కాంగ్రెసుతో లీనమైనడుపబడవలసిందే కాని పెడత్రోవల ద్రొక్కకూడదని హెచ్చరించిరి. పై మహాసభ రాయిగారి వాదమును అంగీకరించక హిందూదేశములో కాంగ్రెసుకు విరోధముగా పనిచేయు సామ్రాజ్య నిరోధక సంస్థను స్థాపించవలెనని తీర్మానించిరి. ఈ పద్ధతి యొక్క విషఫలములే ఇండియాయందును, జర్మనీయందును, కానవచ్చుచున్నవి. నానాటికి రాయిగారికిని రష్యానియంత స్టాలిన్ కును భేదాభిప్రాయములు హెచ్చిపోవుటవల్ల రష్యాను వదలివేసి హిందూదేశమునకు వచ్చిన వెనువెంటనే జైలుబాధలనుభవించవలయునని తెలసికూడా తనకు ఉగ్గుపాలతో పుట్టిన ధైర్యముతో హిందూదేశ స్వాతంత్ర్య పోరాటమునందు పాల్గొనుటకై ఇండియాకు వచ్చిరి.
అప్పుడు హిందూదేశమునందు నిరాకరణోద్యమము విజృంభించుచుండెను. కొన్ని నెలలపాటు సంయుక్తరాష్ట్రములలో కర్షకుల సంఘస్థాపనకై పనిచేసెను. 1931 సంవత్సరము ఇండియా ప్రభుత్వము వీరిని బొంబాయిలో అరెస్టు చేసి 1924 సంవత్సరములో వారిపై మోపబడిన రాజద్రోహనేరమునకు విచారించి 13 సంవత్సరములు శిక్షవేసిరి. అప్పీలులో 6 సంవత్సరములు తగ్గించిరి. 1936 సంవత్సరము ఆఖరులో ఆరోగ్యమును కోల్పోయి బలహీనుడై మరల మాతృపాదపద్మములకడ తన శిరము నుంచుటకు సిద్ధపడి రాయిగారు జైలుకమ్ముల నుండి బయటపడిరి. వీరు మార్క్సు సిద్ధాంతములను గురించి హిందూదేశ పోరాటమును గురించి కొన్ని గొప్ప గ్రంథములను వ్రాసియున్నారు.
విడుదలైన వెంటనే వీరు కాంగ్రెసులో చేరి అఖిలభారత కాంగ్రెసు సంఘమునకు ఎన్నుకొనబడి హిందూదేశ స్వాతంత్ర్య పోరాటమునందు ప్రథమ పంక్తిలోని సేనానాయకులలో ఒకరుగా ఏర్పడినారు. కాంగ్రెసుద్వారా హిందూదేశపు సామ్రాజ్య నిరోధక శక్తులను కేంద్రీకరించి స్వతంత్రపోరాటము జరపవలెనని వీరి నిశ్చయము. కాంగ్రెసు యొక్క పలుకుబడి ఆవంతయు తగ్గుటకు వీరు సమ్మతింపరు. ఆ మహాసంస్థపై ఈగనుగూడ వాలనీయరు.  ఈ సందర్భమున వారికిని కొందరు సామ్యవాదులకును భేదాభిప్రాయములు కల్గినవి. కాంగ్రెసు అధ్యక్షులైన జహ్వర్లాల్ గారితో పూర్తిగా ఏకీభవించుచున్నారు.
(20-8-1937 న ఆంధ్రపత్రిక దినపత్రికలో ప్రచురింపబడినది)
-         వెన్నెకంటి రాఘవయ్య
Vennelakanti Raghavaiah was from Nellore, related to V V Giri, the president of India.He is the person who invited and brought M N Roy to Andhra in 1938 to South India agriculture labor conference at Nellore
1938 August