గుట్టు విప్పిన గురూజి - 1



గుట్టు విప్పిన గురూజి

పేరు మార్చి, వూరు మార్చి, వేషం మార్చి భారతదేశంలో కొత్తదారులు తొక్కిన సన్యాసి వినూత్న అనుభవాల పుట్ట ఇది. ఆస్ట్రియాలో పుట్టి జర్మనీ నుండి ఇండియా వచ్చి సన్యాసిగా వివిధ జీవితానుభవాలు పొందిన విశిష్ట బ్రహ్మచారి అగేహానందభారతి. అసలు పేరు లెపాల్డ్ ఫిషర్. ప్రపంచమే తన యిల్లుగా చివరకు అమెరికాలో సిరక్యూస్ యూనివర్సిటీలో అస్తమించాడు. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం వుంది. కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలతో పరిమితం గాక, పిలిపించి ప్రసంగాలు చేయించాను. అవన్నీ రికార్డు చేసి భద్రపరిచాము. అగేహానంద భారతిని కలసిన వారు ఆయన్ను మరువలేరు.
ఆయన రచన ‘దిగ్రేట్ ట్రెడిషన్ - లిటిల్ ట్రెడిషన్స్’ నేను తెలుగులోకి అనువదించగా తెలుగు అకాడమీ ప్రచురించింది. ఇండియాలో రినైజాన్స్ ప్రచురణలు వారు ఆయన మోనోగ్రాఫ్ లను వెలువరించారు.
జవహర్లాల్, సుభాస్ చంద్రబోస్ ను జర్మనీలో కలిసి, అజాద్ హింద్ ఫౌజ్ లో చేరి ఖైదీగా వున్నాడు.
ఎం.ఎన్. రాయ్ తో ఒక్కసారి డెహ్రడూన్ లో 1952లో కలసిన భారతి పూర్తిగా మారి పోయినట్లు పేర్కొన్నాడు. మానవ వాదిగా రూపొంది కల్చరల్ యాంత్రొపాలజీ బోధిస్తూ సిరక్యుస్ యూనివర్శిటీలో స్థిరపడ్డాడు.
1987లో భారతిని హైదరాబాద్ కు పిలిపించి, ఉస్మానియా, ఓపెన్ యూనివర్సిటీలో ఎం.ఎన్. రాయ్ శతజయంతి సంస్మరణ ఉపన్యాసాలు యిప్పించాను. అది రికార్డు చేశాము.
ప్రస్తుతం తెనిగించిన ‘ఆకర్ రోబ్’ అనే రచన 1967లో వెలువడినప్పుడు భారత ప్రభుత్వం నిషేధించింది. రామకృష్ణ, వివేకానందల గురించి నిజం చెప్పినందుకు, ఆ ఆశ్రమ వత్తిడి కారణంగా అలా చేశారని తెలిసింది. కుష్వంత్ సింగ్ వంటి వారు నిషేధానికి నిరసన తెలిపారు. అయితే భారతి అమెరికా నుండి మరో అధ్యాయం చేర్చి, ‘ఆకర్ రోబ్’ వెలువరించారు. దాని అనువాదమే యిది.
నిశిత పరిశీలకులకు యిది నచ్చుతుంది. వెర్రి ఆవేశంలో గుడ్డి ఆరాధన చేసేవారికి యిది కనువిప్పు చేస్తుంది. అందుకే దీని అవసరం వుందని, అందిస్తున్నాం.  1991లో భారతి చనిపోయారు.
ఇక చదవండి అగేహానంద స్వీయగాథ.
గుట్టు విప్పిన గురూజి - 1

ఏభై ఏళ్ళ ప్రాయంలో స్వీయచరిత్ర వ్రాసుకోవాలనుకునే చాలామంది పెద్దవాళ్ళన్నారు. నేను 37 సంవత్సరాలకే స్వీయచరిత్ర వ్రాశాను. ఇందుకు తగినంత సమాచార సేకరణ జరిగినందున పెద్దవారి సలహా పెడచెవిన పెట్టాను. శంకరాచార్య 33 ఏళ్ళకే చనిపోయాడు. అప్పటికే ఆయన కాలినడకన దేశం నలుమూలలా తిరిగి, నాలుగు పీఠాలు స్థాపించారు. 80 పుస్తకాలు వ్రాసి బౌద్ధాన్ని విస్మరించేటట్లుగా హిందూ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాడు. మధ్యయుగాల్లో మతజ్ఞానిగా శంకరాచార్య ఖ్యాతి స్థాపితమైంది. 8 సంవత్సరాలకే ఆయన (720 క్రీ.శ.) సన్యాసి అయ్యాడు.
నేను 80 రచనలు చేసి, మా గురువు కంటె ఎక్కువగా కాలినడకన ఒక్కసారే దేశం తిరిగాను. మఠాలు స్థాపించలేదు గాని, కొత్త పద్ధతులతో హిందూ సంప్రదాయం అట్టి పెట్టాలనుకున్నాను.
ప్రస్తుత రచన ప్రత్యక్షంగానూ, నిర్మాణాత్మకంగానూ, పరోక్షంగానూ నా అనుభవాల ఆధారంగా జీవన విధానం వుండాలని చూపే తీరు వివరించాలనుకున్నాను. జీవన తత్వం కూడా పేర్కొనాలనుకున్నాను.
విశ్వంలో పొందికను, ప్రేమను చూడాలని చాలా మంది అనుకొంటున్నారు. తాము జీవించిన సంప్రదాయం వారికి తృప్తినివ్వడం లేదు. చుట్టూ వున్న శక్తుల్ని గమనిస్తే, వారికి భయమేస్తుంది. పరిసరాలలో చూచే దానికంటె ఎక్కువ తెలుసుకోవాలని ఉంది. విసుగెత్తే జీవనం నుండి విముక్తిపొందాలనుకొంటున్నారు. ప్రాపంచిక అనుభవ వాదిగా, ప్రయత్నించి సాఫల్యం పాక్షికంగా సాధించినవాడిగా నేను చెప్పదలచాను.
మానవవాదాన్ని కొత్త తరహాలో పెంపొందించదలచాను. ఇందులో మానవాళి ముఖ్యం. మానవులకు విలువ యివ్వాలి. మానవాళి అనే పదం గ్రంథాలలో వుంటుంది. కాని వాస్తవంగా మానవులు వున్నారు. తత్వంలో మానవాళి అంటారే గాని, మనుషుల్ని విస్మరిస్తారు. ప్లేటో ఇలాంటి తత్వవేత్త. ఆయన  ప్రభావం మధ్యకాలాల వారి పైనా, హెగెల్, మార్క్స్, హిట్లరు పైనా, ఆ తరువాత కూడా కనిపించింది. అమానుషత్వాన్ని గురించి కార్ల్ పాపర్ వంటివారు హెచ్చరించారు.
మానవవాదం విశ్వవ్యాప్తంగా వుండాలి. మానవవాది మనుషుల్ని ప్రేమిస్తాడు. ఇతరులు తనను ప్రేమించాలనుకొంటాడు. ప్రజలకు సహాయం చేస్తూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో పరస్పరం విషయాలు తెలుసుకోవాలి.
మూకగా వుండేవారి మధ్య నేను ఒంటరిగా వుండడానికి యిష్ట పడతాను. నా మానవ వాదం విశ్వవ్యాప్తమైనది. ఇందులో పరస్పర సంబంధం వుంటుంది. ఇలా ఒకరితో ఒకరు విషయాల్ని తెలియపరచు కోవడం నా మానవవాదంలో నిత్యమూ వుంటుంది. సన్యాసిగా మానవ వాదాన్ని అనుసరించిన నేను ఇలాంటి తృప్తికరమైన పద్ధతుల్ని అవలంబిస్తాను. పాశ్చాత్య లోకంలోని మానవవాద సంప్రదాయాల నుండి భారతదేశం నేర్చుకోవచ్చు. రస్సెల్, విట్టిగెన్ స్ట్రైన్, జి.ఇ.మూర్, టి.యస్ ఇలియట్ నుండి చాలా నేర్చుకోవచ్చు. పిడివాదంతో కూడిన మతం కంటె, మానవవాదం మంచిది. మానవవాద మార్మికవాదం ఇంకా శైశవ దశలోనే వుంది. మనకు మానవవాదం విశ్వజనీన జీవన విధానం కావాలి.
చాలామతాలు మానవవాదాన్ని కాదంటున్నాయి మానవుడికి ప్రథమ స్థానం యివ్వని విలువల్ని నేను అంగీకరించను. మానవవాదిగా, మార్మికుడుగా ఒకేసారి వుండడానికి యోగం, తాంత్రికం, వేదాంతం అవకాశాన్నిస్తున్నవి. విజ్ఞానాన్ని మార్మికవాదాన్ని సమాంతరంగా చూస్తున్నారు. హృదయం, మేధస్సు పరస్పరం చేతులు కలపాలంటారు. తత్వం ముగిసినచోట మతం ఆరంభమౌతుందంటారు. ప్రపంచ వ్యాప్తంగా యీ వాదనలున్నాయి. ప్రపంచ మతాలన్నీ ఒకే తీరులో ప్రవచించవు. హిందూ, బౌద్ధ మతాలు మౌలికంగా ఒకటికాదు. కాని చాలా మంది యిలాంటి వాదన చేస్తూ ఊబిలోకి దిగారు.
అధికార భేదాన్ని అంగీకరించిన భారతీయ చింతనాపరులు భిన్న మార్గాల్ని అనుసరించడాన్ని ఒప్పకున్నారు. మానవవాదం ఒక ఆలోచనా ధోరణి. మార్మికవాదం భౌతికపరమైన ధ్యాన సంబంధమైన విషయం. మానవవాదం ఆలోచిస్తుంది. మార్మిక వాదం ధ్యానంలో నిమగ్నమౌతుంది.
మాడం బ్లావట్ స్కీ పేర్కొన్న రహస్య సిద్ధాంతాల ప్రవక్తలు టిబెట్ లో ఎక్కడా కనిపించరు. ఇది నేను స్వానుభవంతో గ్రహించాను. మూల గ్రంథాలలో కూడా యీ ప్రస్తావన లేదు. లోబ్ సాంగ్  రాంపా చెప్పింది కూడా ఇప్పుడు బట్టబయలై తప్పని తేలింది. ఆయన పేర్కొన్న మూడో కన్నులేదని అర్థమైంది. పాశ్చాత్యులు కష్టపడకుండా, ఆలోచించకుండా యిలాంటి ఆకర్షణీయ రచనల వెంటబడ్డారు.
సంస్కృతం పాశ్చాత్యలోకంలో వ్యాప్తి చెందాలి. భారతీయ మూల గ్రంథాలు వారు తెలుసుకోవాలి. వేదాంతం, బౌద్ధ, జైనాలు కూడా బాగా వారు చదవాలి. ఇలా వ్యాప్తి చెందకపోవడానికి అడ్డంకి ఏమిటి? లోబ్ సాంగ్, రాంపా వంటి వారే పెద్ద అవరోధంగా నిలిచారు. కొంచెం శ్రమిస్తే సంస్కృతం, భారతీయ తత్వం తెలుసుకోవడం కష్టం కాదు. ఇండియా గురించి వెలువడుతున్న మౌలిక గ్రంథాలు పాశ్చాత్య లోకంలో కొద్దిగానే వున్నా, సంతృప్తికరంగానే అవి వెల్లడవుతున్నాయి. కాని, ఇండియాను గురించి చౌకబారు ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా వచ్చి పాడుచేస్తున్నాయి. ఇండియా మార్మికమనీ అభూతకల్పనలతో వెలువడుతున్న పుస్తకాలు పాశ్చాత్య లోకాన్ని వక్రమార్గాన్ని పట్టిస్తున్నాయి. ఈ పుస్తకంలో నిజం చెప్పి, అలాంటి వక్రీకరణలను దూరం చేయదలిచాను. ఇండియాను గురించి ప్రత్యేక విషయాలు ఆచార్యుడిగా చెప్పదలచాను. భారతీయులకు విదేశీయులకు ఉపకరించేరీతుల్లో విషయాలు చెప్పడం ఈ రచన లక్ష్యం. ఇది అందరినీ తృప్తిపరచ లేదు. మత అంధకారంలో పడి హేతువాద పద్ధతికి దూరంగా జరిగానని పాశ్చాత్య మానవవాదులు అనుకోవచ్చు. కాని నా దృష్టి అంతా మానవ వాదంపైనే. అది సన్యాసి జీవనానికి విరుద్ధం కాదు. ఆలోచనల అణచివేతకు దూరంగా పిడివాదాలకు భిన్నంగా మానవవాద సన్యసత్వం కావాలని నేను కోరుకున్నాను. భారతీయ సన్యసత్వంలో సహనం లేదు. జీవితానంతరం పునర్జన్మ. అవతారాలున్నాయని నమ్మడం ఆయా వ్యక్తుల అభిరుచికి సంబంధించిన విషయం. సంపూర్ణ మానవుడుగా మారడానికి ఎలాంటి ధ్యానం అవసరమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
జర్మనీలో బాల్యం
హిట్లర్ ది నాదీ పుట్టినరోజు ఒక్కటే. అయితే హిట్లర్ బారి నుండి నేను తప్పించుకోడానికి కారణం. మా తల్లిదండ్రులు చెక్ పౌరులట. అందువలన రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో నిర్భంద సైనిక శిక్షణకు జర్మనీలో అందరినీ చేర్చుకుంటున్నప్పుడు నన్ను వదిలేశారు. హిట్లర్ పుట్టిన నాడు (ఏప్రిల్ 20) జర్మనీలో ప్రతి పాఠశాలకు సెలవు ఇచ్చేవారు. 1939లో హిట్లర్ జన్మదినం నాడు నేను ఇండియా స్వాతంత్ర్యానికై పోరాడుతానని శపథం చేశాను. అప్పటికి నాకు 16 సంవత్సరాలు. నాకు ఇలాంటి కోరిక కలగడానికి, ఇండియాపై ప్రత్యేక ఆసక్తి వుండడానికి చాలా కారణాలున్నాయి.
ఇండియాను గురించి పుస్తకాలలో కథలుగా చదువుకున్నాను. ఒంటరిగా నగలు ధరించి పూసలు కోట్లు వేసుకొనే మహారాజాలు, అద్భుత సంఘటనలు, ముసుగులతో స్ర్తీలు, ఇట్లాంటివెన్నో రహస్యంగా చదివాం. ఇదంతా పది సంవత్సరాలప్పుడు ప్రారంభమైంది. నా 11వ యేట, నా తల్లి గ్రంథాలలో రవీంద్రనాథ్ టాగూర్ నవల ఒకటి దొరికింది. అది నాకు సరిగా అర్థం కాలేదు.
నా 13వ యేట వియన్నాలో ఇండియన్ క్లబ్ లో చేరాను. అప్పటికే నాకు ఇండియా అంటే బాగా ఆసక్తి పెరిగింది. భారతీయ విద్యార్థులు అక్కడ చాలా మంది వైద్యం చదువుతుండే వారు. సంస్కృతం, హిందీ నేర్చుకొనే ప్రయత్నంలో నేను ఇండియాను గురించి కొన్ని విషయాలు చెపుతుంటే భారతీయ విద్యార్థులు ఆశ్చర్యపోయి నన్ను గౌరవంగా చూసేవారు.
సుప్రసిద్ధ నృత్యకారుడు ఉదయశంకర్ ఒకసారి తనట్రూప్ తో వియన్నా వచ్చి శివపార్వతి, రాధాకృష్ణ నృత్య ప్రదర్శనలు చేశారు. అవి నన్ను ముగ్ధుడిని చేశాయి. నేను ఇండియాకి రావడానికి కాషాయ వస్త్రాలు వేసుకోడానికి బీజం నాటింది, ఉదయశంకరేనని ఆయనతో ఒకసారి చెప్పాను. కాని, ఆయన నేను చెప్పినదానిని ఏమంత విశేషంగా భావించలేదు.
(Telugu translation)- ఎన్. ఇన్నయ్య
His speech at Open University in Hyderabad can be heard at utube:http://www.youtube.com/watch?v=231Dbe59bPw

No comments:

Post a Comment