భిన్న అభిప్రాయాలను ఇస్లాం సహిస్తుందా ?-part 12-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?


ఇబన్ వారక్
12వ అధ్యాయం
సూఫీవాదం లేదా ఇస్లాం మార్మిక వాదం
సూఫీవాద పండితులలో ప్రముఖుడైన ఆర్.ఎ. నికల్ సన్ ప్రకారం తొలి సూఫీలు మార్మిక వాదులనేకంటే సన్యాసులనటం సరిగా ఉంటుందన్నాడు. ప్రాపంచిక సుఖాలను వదిలేసి ముక్తిని సాధించాలని వీరు క్రైస్తవ ఆదర్శాలతో ఉత్తేజితులయ్యారన్నారు. క్రమంగా సన్యసత్వం అనేది దైవ జ్ఞానార్జనలో తొలిమెట్టుగా పరిగణించారు. కాంతి, జ్ఞానం, ప్రేమ అనేవి కొత్త సూఫీ వాదంలో ప్రధానాంశాలు. బహుదేవతారాధనపై  ఆధారపడి ఇస్లాం చెప్పే ఒకే పారమార్థిక దైవం వైపుకు పయనించటం అది అన్నిచోట్లా పని చేస్తుందని మానవుడి హృదయంలో చోటు చేసుకుంటుందని భావించటం ప్రధానాంశంగా ఉన్నది  (నికల్ సన్, ది మిస్టిక్స్ ఆఫ్ ఇస్లాం, పుటః8)
      ఇరాన్ లో కొన్ని భాగాల ప్రభావం సూఫీలపై ఉన్నది. క్రైస్తవం, నియోప్లేటో వాదం, మార్మికవాదం, బౌద్ధుల ప్రభావం కూడా సూఫీ వాదం పై కనిపిస్తుంది. (బౌద్ధ భిక్షుల నుండి జపమాలను సూఫీలు అనుకరించారు).
      ఇస్లాం చట్టం నుండి సూఫీలు పూర్తిగా వేరుపడి జ్ఞానార్జన చేసినవారికి చట్టాలు కట్టుబాట్లు కారాదన్నారు. వ్యక్తులూ, డెర్విన్ మఠాలు ఈ సూత్రాన్ని పాటించాయి. చాలామంది ముస్లింలు మంచి సూఫీలుగా ఉన్నారు. మరికొందరు సూఫీలు లాంఛన ప్రాయమైన ముస్లింలుగా ఉన్నారు. కొందరు కేవలం ముస్లింలుగా ఒక ఫ్యాషన్ తీరులో ఉన్నారు. సూఫీ చరిత్రలో అబూ సయ్యద్ ఒక ప్రధాన వ్యక్తి. 1049లో చనిపోయిన బయాజిద్ కూడా షరియా సూత్రాలను విలువలేనివిగా పరిగణించారు.
      16వ శతాబ్దారంభంలో బెక్తాషీ మఠాలు తలెత్తాయి. వీరిపై క్రైస్తవ, మార్మిక వాద ప్రభావాలున్నాయి.  ఇస్లాం క్రతువులన్నీ, ఇతర మతాల అచారాలన్నీ ఏ మాత్రం విలువ లేనివిగా వీరు నిరాకరించారు.
      మలమతీయ అనే సమిష్టి ముఠాలు జనం తమపట్ల చూపే జుగుప్సకు విరుగుడుగా జనం పాటించే వాటిని ఏ మాత్రం లెక్క చేయకుండా విరుద్ధంగా ప్రవర్తించారు.
      నిజమైన మతానికి సనాతన సిద్ధాంతం, చట్టం అడ్డురాకూడదనీ అవి మతపరంగా మనిషిని అదుపులో పెడుతున్నాయనీ సూఫీలు చూపడం గొప్ప విశేషం, మార్మికుల దృష్టిలో స్వర్గ-నరకాలు లేవు. దైవ సాన్నిత్యంలో ప్రత్యక్షంగా దైవ వాక్యాన్ని చూస్తారు. భయంతో బ్రతకటం కంటె మార్మికవాది  నిష్కామంగా ప్రేమ దైవ జ్ఞానాలతో హృదయాలను ఆకట్టుకొనే దైవ సేవలో నిమగ్నమవుతాయి.
      సూఫీ వాదం ప్రకృతి ఆరాధనను పాటించింది.
      ఇబన్ అల్ ఫరీద్ కవిత (1161-1235), ఇబన్ అరబీ గ్రంథం (1155-1240) సుప్రసిద్ధ రచనలుగా పేర్కొనవచ్చు. ఈ రచనలు వారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. కలహాలకు  దారితీశాయి. (ఈజిప్టు చరిత్రలో ఇబన్ ఇయాస్ రాస్తూ యూదు, క్రైస్తవ కాఫిర్ కంటే ఘోరంగా ఇబన్ అరబీ రచన ఉందన్నాడు.) కొరాన్ పై వ్యాఖ్యానాలు చేస్తూ ఇబన్ అరబీ మోజెస్ తన సోదరుని తప్పు పట్టిన ఉదంతం పేర్కొన్నాడు. దేవుని తప్ప మరెవ్వరినీ పూజించరాదన్నప్పుడు అరన్ ఒక బంగారు దూడని ఎలా పూజిస్తాడని మోజెస్ అడిగాడు. (మార్గోలియత్, మహమ్మదన్ యుథీయిజం, ఎన్ సైక్లోపేడియా ఆఫ్ రెలిజియన్ అండ్ ఎథిక్స్)
      వివిధ మతాచారాల మధ్య భక్తులను తొలగించటం సూఫీ తత్వంలో ఉన్నది. ఖురాన్ బహుదేవతారాధన చేస్తున్నదని ఇబన్ అరబీ అన్నాడు. యాత్రికుల నిమిత్తం కాబా, ఖురాన్ లో తోరాలో పేర్కొన్న ఫలకాలు, మతపరంగా ప్రేమ ఇలాంటి వాటన్నింటికీ తన హృదయంలో చోటున్నదని  ఇబన్ అరబీ రాశాడు.
      నేను క్రైస్తవుణ్ణి, యూదునూ, ముస్లింనూ కాదు. అని ఒక మార్మికుడు ఆలాపన చేశాడు. భిన్నాచారాలను సూఫీలు పట్టించుకోలా, అబూనయూద్ ప్రకారం మసీదు, మదర్సా, నమ్మకం అపనమ్మకం పాటించకుండా ఉన్నవాడే నిజమైన ముస్లిం అన్నాడు.
      అఫిజ్ మార్మికుడుగా కంటె స్వేచ్ఛాపరుడుగా ఆలాపించిందే ఎక్కువగా కనిపిస్తుంది. (నికల్ సన్ ది మిస్టిక్స్ ఆఫ్ ఇస్లాం, పుటః 88)
      చాలామంది సూఫీలను క్రూరంగా హింసించినట్లు గోల్డ్ జిహర్ రాశాడు. సూఫీ చరిత్రలో తొలి సూఫీలంతా అధికారుల సనాతనుల దృష్టిలో  అనుమానాస్పదులుగానే ఉన్నారు. (ధూమన్ 860 మరణం, సూఫీ చరిత్ర రాశాడు) ఇతడికి చాలామంది శిష్యులుండేవారు. అసూయాపరులు అతనిని జిందిక్ అని ఖండించారు. ఖలీఫా ముతావక్కిల్ తన్ని జైల్లో పెట్టి, తరువాత అతని నైతిక ప్రవర్తన చూచి విడుదల చేశారు.
అల్ హలాల్ (922లో ఉరితీత)
    సుప్రసిద్ధ మార్మికవాది. అతని పలుకులు సహించలేక వ్యక్తిగత పవిత్రత కోరినందున భరించలేక రాళ్ళుకొట్టి వివిధ అంగాలూ ఖండించి తగులబెట్టారు. మార్మిక అనుభవాల ఆధారంగా క్రీక్ తత్వంలో సమన్వయీకరణ జరగాలని అతడు కోరాడు. (అల్ హలాజ్ పై వ్యాసం. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం)
      అల్ షల్మాఘనీ అనే సూఫీ 12 ఏళ్ళ తరువాత అలాగే చంపేశారు.
      అల్ సువ్రావర్దీ (1191లో ఉరితీత)ని తొలుత అలెప్పొవైస్రాయి ఆదరించినా ఇతడి మార్మికవాదాన్ని సనాతనులు అనుమానించి ఉరితీయమన్నారు. వారిని వ్యతిరేకించలేక వైస్రాయి ఉరితీశాడు.
      ప్రముఖ న్యాయమూర్తి బదర్ అల్ దిన్ ఒక సూఫీ షేక్ హుసేన్ అక్తాలీని కలిసి సూఫీగా మారాడు. అతన్ని ద్రోహిగా చిత్రించి బంధించి 1416లో చంపేశారు. ఇబన్ అల్ అరలీ మార్మిక దృష్టి ఆధారంగా అతడు తన భావాలను పెంపొందించాడు.
భిన్న అభిప్రాయాలను ఇస్లాం సహిస్తుందా ?
    ఇస్లాం తొలి రోజులలో కొత్త భావాలను కనుగొనటం బిడా అని పిలిచారు. హదిత్ ప్రకారం ఈ కొత్తగా కనుగొన్నవి దోషాలే. అవి నరకానికి దారితీస్తాయి. సున్నకు వ్యతిరేకం కనుగొనడమంటె దీనికి కొందరు మరణశిక్ష విధించాలన్నారు. కాని అది ఆచరణలోకి రాలేదు. మంచి, చెడ్డ బిడాలు అనే తేడా వ్యతిరేకించే కొత్త భావాలు బిడా కిందికి వస్తాయి. కాని కొత్తది ఏదైనా అధికారిక కొరాన్, సున్నలకు వ్యతిరేకం కాకుంటే ఫరవాలేదు. ముస్లింలు ఈ నెపంతో ఇస్లాం విరుద్ధమైనవాటిని కూడా మంచి అని ముద్రవేసి స్వీకరించారు. గోల్డ్ జిహర్ ఈ విషయాన్ని ఇలా రాశాడు.
      ఇస్లాంలో పిడివాదానికీ క్రైస్తవంలో పిడివాదానికీ సమాంతర పోలికలు లేవు. ఇస్లాంలో చర్చించి సూత్రీకరించి, అనుసరించే సలహా సంఘాలు లేవు. మతపరమైన ప్రామాణిక సనాతన పీఠం లేదు. పవిత్ర గ్రంథాలు ఆధారంగా మత సిద్ధాంతాలను ఆచరించటానికి ప్రమాణాలు లేవు. అంగీకారాభిప్రాయం అనేది అస్పష్టమైన పెత్తందారీ విధానంగా కొనసాగుతున్నది. దీనిని భిన్న రీతులుగా నిర్వచించారు. మత ప్రశ్నలతో ఏకాభిప్రాయం కష్టం. ఒకరు అంగీకరిస్తే మరొకరు విభేదించటం సహజం. (గోల్డ్ జిహర్, ఇన్ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియాలజీ అండ్ లా, పుటః 162-63)
      గోల్డ్ జిహర్ రాసిన దానిని బట్టి ఇస్లాంను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. ఎవరిష్టం వచ్చినట్లు వారు ఆలోచించి నమ్మవచ్చుననే భ్రమకలుగుతుంది. అలాంటప్పుడు ఇస్లాం అనటంలో అర్థం లేదు. ఇస్లాం చట్టం మూసలో పోసినట్లు మార్పులేకుండా ఉన్నదని షాట్ రాశాడు. సిద్ధాంతానికీ, ఆచరణకూ తేడా ఉన్నప్పటికీ ఇస్లాం చట్టం ఆచరణలో ముఖ్యంగా కటుంబచట్టంలో చాలా నిర్దేశిస్తున్నది.
      ఇస్లాంలో ఒకే పీఠం లేకపోవచ్చు. కాని ఇస్లాం చరిత్రలో కొన్ని సిద్ధాంతాలు కొన్ని ప్రాంతాలలో నిర్దుష్టంగా అమలు జరుగుతున్నాయి. 1048-1049లో మాలిక్ పీఠం బయలుదేరి మాగ్రిబ్ అనే సిద్ధాంతాన్ని అమలులోకి తెచ్చింది. ఖురాన్ చరణాలకు ఉపమాలంకార భాషలను చెప్పటానికి వీలులేదన్నారు. మాలిక్ ఆనస్ ప్రకారం అల్లా సింహాసనారూఢుడై ఉన్నాడు. ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలనేది కాక విధిగా నమ్మి పాటించాలి. ప్రశ్నిస్తే పాపమవుతుంది. ఉదారవాదానికీ, స్వేచ్ఛకూ ఇస్లాంలో తావు లేదు.
      1130లో ఉత్తరాఫ్రికా, స్పెయిన్ ల్లో ఇబన్ తుమారత్ బోధనల ఆధారంగా అల్ మోహద్ రాజ్యస్థాపన జరిగింది. సిద్ధాంత స్థాపనకు మత పీఠం అవసరం లేదనీ, రాజ్యపాలకులు ఆ పని చేయగలరని చూపారు.
      ఇస్లాం సహనంతో భేదాభిప్రాయాన్నీ, నిరసనలూ ఆమోదిస్తుందనటానికి ఇబన్ తామియా, అల్ గజాలీ రచనలు చూపుతుంటారు. ముస్లిం అనడానికి దేవుడు ఒక్కడే అనీ, మహమ్మద్ ప్రవక్త అనీ నమ్మడం కనీసధర్మం. ఈ విషయంలోనూ అనుకున్నంత ఉదారత్వం లేదు. ద్వంద్వ వాదులు (జిందకీలు), సూఫీలు ప్రవక్తలపట్ల ఆదరణలేనివారు స్వేచ్ఛగా ఆలోచించేవారు. (రజీ ఇబన్ రవాండీ) ప్రవక్తలను వాగాడంబరులుగా పరిగణించేవారు. అల్ గజాలీ సహనం చూపలేదు సరికదా, ప్రపంచ శాశ్వతత్వాన్ని నమ్మివారిని, శరీరం తిరిగి లేచివస్తుందని నమ్మినవారిని చంపేయమన్నాడు. ఇతని ప్రకారం ఇస్లాంలోనే చాలామంది తాత్వికులూ, కవులూ ఉరికంబాలకెక్కాలి. ఇస్లాం సహనం చర్చించేటప్పుడు నమ్మకంలేనివారిని పరిగణనలోకి తీసుకోలేదు. అల్ గజాలీ, ఇబన్ తామియాల రచనలు ఆచరణకు ఉపకరించాయనటానికి ఆధారంలేదు. ఆచరణకూ, సిద్ధాంతానికీ తేడాలు చూపే ఇస్లాం వాదులు అచరణలో ఈ ఉభయుల రచనలు అమలుకొచ్చాయా అని చూడరు. అల్ గజాలీ రచనలు ప్రమాదకరమైవిగా పాశ్చాత్య ఇస్లాం లోకంలోకడుగుపెట్టారు.
      ఏమైనప్పటికీ ఒక్కమాటలో ఇస్లాం ఆచరణలో సహనం లేనిది.
      భేదాభిప్రాయాలు కలవారిని ఇస్లాం బాధించలేదని గోల్డ్ జిహర్ రచనను బట్టి భ్రమపడే అవకాశం ఉంది. కాని సహనం తొలిరోజులకే పరిమితమయిందని గోల్డ్ జిహర్ సహితం ఆంగీకరించాడు. సిద్ధాంతపరంగా పిడివాదాన్ని అమలు పరచటంతో అసహనం ఉభయకుశలోపరిగా రాణించిందన్నారు.
      రాజకీయాలకూ, మతానికీ అబ్బాసిద్దుల హయాంలో తేడాలేకుండా పోవటంతో ప్రతి సిద్ధాంతం ప్రమాదకారి అయింది. రాజకీయ పెత్తందారులు కొందరిని శిక్షించటానికి పౌరులలో ఆస్తికత్వం వ్యాపింపజేస్తున్నారనే నెపం వేసేవారు.
      అబ్బాసిద్దులు షియాలను హింసించీ, బంధించీ, విషంపెట్టి, ఉరితీశారు. ఉమాయద్దులు 737లో బియానల్ తమీమీ, అల్ ముఘీరాసాద్, మరి కొందరిని తగలబెట్టారు. ఉమాయద్ తొలిపాలనలో ఇరాక్ గవర్నర్ అల్ హజాజ్ క్రూరంగా ఖరీజైట్లను ఏరిపారేశాడు.
      అబ్బాసిద్దులు ఖఆ  ముతాఫక్కిల్ రావడంతో ముతాజిలైట్లను పాపాత్ములుగా ప్రకటించి సంప్రదాయం విశ్వాసంలోకి వెళ్ళిపోయారు. అప్పటినుండీ ఇస్లాంలో స్వతంత్ర ఆలోచన లేదని  నికల్ సన్ రాశాడు. తత్వం ప్రకృతి శాస్త్రాలూ, పాపాత్ముల ప్రక్రియగా చూపారు. ఖురాన్ తో అనుకూలిస్తున్నట్లు ముసుగు కప్పితే అప్పటి రచయితల అభిప్రాయాలు వారికి ప్రమాదకారిగా పరిణమించాలి. (నికల్ సన్, పై పుస్తకం, పుటః 284)
      ఈ పరిస్థితి దేశానికీ, పాలకులకూ, ప్రాంతాలకూ భిన్న రీతులు మారుతూ వచ్చింది. ఉమాయద్దులను సహనశీలురుగా పేర్కొన్నారు. వారు ముస్లింలుగా చెప్పుకోకపోవటమే కారణం. ఇస్లాం వ్యతిరేక ధోరణి ఉమాయద్దులలో స్పష్టంగా కనిపించింది. వారు ఎంపిక చేసిన అస్థానకవి పేగన్ కవుల వారసుడు. (నికల్ సన్, పుటః 241, పై పుస్తకం) ఉమాయద్ కాలంలో అల్ అక్తల్ క్రైస్తవుడు. ప్రకటించకుండానే ఖలీఫా కొలువులోకి తాగుడూ, శిలువ ధరించి వచ్చిన కవి. ఇస్లాంకు వ్యతిరేకంగా కవితలు రాశాడు. దీనినిబట్టి ఉమాయద్దులను ముస్లింలనటం కంటే అరబ్బులుగా పరిగణించాలని హెన్రీ లామెన్స్ రాశాడు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాంలో వ్యాసం)
      రాజాదరణ ఉంటే ఏదైనా సాగిపోతుందని పై ఉదాహరణకర్థం. బార్మకిద్దు పర్ష్యన్ కుటుంబం ఇస్లాం వ్యతిరేక ధోరణి కనబరచినా అబ్బాసిద్ ఖలీఫాలకు సలహాదారులుగా ఉన్నారు. రాజాదరణ కోల్పోయిన తరువాత ఆ కుటుంబ గౌరవం పోయింది.
      ప్రత్యర్థి కాఫిర్ గా చిత్రించి తొలగించటం ఇస్లాంలో అనాచారంగా వస్తున్నది. అబ్బాసిద్ కొలువులో అబూ ఉబేద్ పేరు తెచ్చుకొని పైకివచ్చాడు. అతని కుమారుడు కాఫిర్ అని అధికారులు అసూయతో చెప్పారు. ఖలీఫా సమక్షానికి పిలిచి అతన్ని కొరాన్ చదవమన్నాడు. చదువురాని అతడు తడబడగా అది సాకుగా చెప్పి చంపేయమన్నారు. కాఫిర్ గా ముద్రవేయటం సర్వత్రా ఉన్నది. అవరోస్ తొలిసారి అబూ యాకుబ్ యూసఫ్ పాలకుని ముందుకువచ్చాడు. తాత్వికులదృష్టిలో స్వర్గం అంటే ఏమిటనేదానికి ప్రారంభం ఉంటుందా లేక శాశ్వతమా అని అడిగాడు.
      ఈ ప్రశ్నకు భయపడి అవరోస్ మాట్లాడలేదు. యూసఫ్ అతన్ని ఓదార్చి నిర్భయంగా చెప్పమనగా అవరోస్ తన పాండిత్యాన్ని వెల్లడించాడు. ఇస్మాయిలీస్ ను తరచు చిత్రహింసలు పెట్టారు. లక్షమంది ఇస్మాయీలను  అల్ రాయ్ నగరాధిపతి అబ్బాస్ అంతం చేశాడు. కుబ్ మెసిహిస్ అనే తెగవారు మహమ్మద్ కంటే జీసస్ ఆధిక్యుడని చెప్పారు. 11వ  శతాబ్దంలో వీరు ఇస్తాంబుల్ దగ్గర ఉండేవారు. ఈ తెగను అనుసరించిన వారిని జెయిల్లో పెట్టి చంపారు ఈ తెగను ప్రేరణ ఇచ్చిన కాబిద్ ను 1527లో చంపేశారు.
      ఈ విధంగా గమనిస్తే ఖరీజైట్, షియైట్, ఇస్మాయీలను సిద్ధాంతరీత్యా అనుమానించారు. తాత్వికులూ, కవులూ, మత సిద్ధాంత కర్తలూ, శాస్త్రవేత్తలూ, హేతువాదులూ, ద్వంద్వ వాదులూ, స్వేచ్ఛా ఆలోచనాపరులు మార్మికవాదులను వ్యక్తులుగా బంధించి, చిత్రహింస చేసి చంపేశారు. వారి రచనలు తగులబెట్టారు. ఇబన్ రవాండీ, ఇబన్ వారఖ్, ఇబన్ అల్ ముఖాఫా, అల్ రజీ రచనలు లభించకుండా పోయాయి. మరికొందరు అల్ అమిదీ వంటి సాహస పాలకుల దగ్గరకు పారిపోవలసి వచ్చింది. అవరోస్ వంటివారు ప్రవాసం పోయారు. ఎందరో తమ భావాలను ముసుగుకప్పి చెప్పుకోవలసివచ్చింది. భేదాభిప్రాయాలు కలవారు కొన్ని చోట్ల పలుకుబడిగల శక్తివంతమైన వారి వలన రక్షణ పొందారు.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment