నిషేధాలుః తాగుడు, పందులు, పురుషాయితం, విస్కీ, వైన్-15th part-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?


ఇబన్ వారక్
15వ అధ్యాయం

కుష్ వంత్ సింగ్ తన పాకిస్తాన్ సందర్శన గురించి ఇలా రాశాడు.
   మొరార్జీదేశాయి పాలనలో ఇండియాలో ఎలాగో పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ లో కూడా మద్య నిషేధం ఆలాగే  అమలులో  ఉంది.  తాగేవాడికి సహారా ఎడారి ఎండమావుల్లో సహితం సారా దొరుకుతుంది.  పాకిస్తాన్ లో రాబీనది పొంగినట్లు సారా దొరక్కపోయినా సంపన్నుల ఇంట్లో గ్లాసులకొద్దీ సారా లభిస్తుంది. విస్కీని రాగి గ్లాసులో చైనా కప్పులలో ఇస్తారు. ఇండియాకంటే రెట్టింపు ధర పలుకుతుంది. ఇదంతా పాపం అంటారు. గనుక రుచి కూడా బాగానే ఉంటుంది. (కుష్ వంత్ సింగ్, సెక్స్, స్కాచ్ అండ్ స్కాలర్ షిప్, ఢిల్లీ, 1992, పుట 122)
   ముల్లాలు ముగ్గురూ పాకిస్తాన్ సమాచార మంత్రితో టెలివిజన్ లో చర్చించటాన్ని సింగ్ తిలకించాడు. మరునాడు ఒక విందులో ఆ మంత్రి పక్కనే సింగ్ కూర్చున్నాడు. ఇండియా ప్రతినిధి వర్గాన్నీ, సింగ్ నూ ఆహ్వానిస్తూ మంత్రి స్వాగతోపన్యాసం చేశాడు. సింగ్ సమాధానమిస్తూ ఈసారి ముల్లాలను కలసినప్పుడు పలకవలసిన గేయ చరణాలను చదివాడు. జనం చప్పట్లు కొట్టారు. మంత్రికూడా చేతులు కలిపాడు.  ముల్లాలకు పెత్తనం ఉంటే బురఖాలలో అమ్మాయిలను హాకీ ఆడిస్తారని మంత్రి సింగ్ చెవిలో చెప్పాడు.
   పాకిస్తాన్ లో పుట్టిన బ్రిటిష్ రచయిత హనిఫ్ ఖురేషీ కరాచీలో అనేక విందులకు  వెళ్ళాడు. ఒక విందులో భూస్వాములూ, వ్యాపారులూ, రాజకీయవాదులూ డిప్లమాట్లూ కలిశారు.  
   వారంతా తాగుతున్నారు. పాకిస్తాన్ లో తాగితే తప్పని ఇంగ్లండులో ఉదారవాదులకు తెలుసు. కాని ఇంగ్లీషు మాట్లాడే అంతర్జతీయ బూర్జువాలకు ఇలాంటి పరిస్థితి రాదు. వారికి రహస్యంగా సారా చేరవేసేవారున్నారు. ఒకసారి అతిథిగా ఒకరింట్లో స్నానాలగదిలోకి వెళితే విస్కీ సీసాలను నీళ్ళలో పెట్టి పైనున్న కాయితాలను ఒకతను తొలగిస్తున్నాడు. (ఖురేష్, పుట 16).
   టైమ్స్ లిటరరీ సప్లిమెంట్ లో ఛార్లెస్ గ్లాస్ సౌదీ అరేబియా అనుభవాలను  రాశాడు (1994, ఏప్రిల్ 22)
   సారా ఉంచుకోవటం  చట్ట విరుద్ధం. నాకు వైన్ అందించారు. రాజకుటుంబాలలో మంత్రులూ, రాయబారుల ఇళ్ళలో విస్కీ ఇచ్చారు. జానీవాకర్ బ్లాక్ లేబుల్ వారికి ప్రీతిపాత్రమైనది. నాకు ఒకనాడు విస్కీ ఇచ్చిని రాజకుమారుడు మరునాడు ప్రొద్దున్నే తాగినందుకు ఒకతనికి శిక్ష వేశాడు.
  ఇస్లాం లోకంలో సారా దొరకని చోటు లేదు. ఇస్లాం నిషేధాన్ని అధిగమించి సారా తాగే ముస్లింలు తటస్థపడుతూనే ఉంటారు. సంపన్నులు దొంగచాటుగా మంచి విస్కీలు తెప్పించుకోగా, పేదవారు చెరుకు, ఖర్జూర, తాటిచెట్లనుండి దేశీయంగా సారా తయారుచేసుకుంటుంటారు. 1990లో రంజాన్ మాస సందర్భంగా అర్జీరియాలో సారా దురాణాలు, వ్యభిచార గృహాలు తెరిచి ఉండటం గమనించాము.
   ప్రవక్త, మహమ్మద్ సారాను దైవానుగ్రహ చిహ్నంగా పొగిడాడు. (కొరాన్, సుర 6.69) ప్రవక్త, తొలి అనుచరులు తరచూ తప్పతాగి ఉండటంతో మహమ్మద్ నిరసన తెలియచేశాడు. (సుర 2.216, 4.46) చివరకు నిషేధించాడు. (5.92) ఇస్లాం చట్ట ప్రకారం తాగితే 80 కొరడా దెబ్బల శిక్ష ఉంటుంది. ఐనా తాగుతూ పోతే మరణశిక్ష విధించవచ్చు.
   మహమ్మద్ తొలిరోజుల్లో అరబ్బులు ఇస్లాంను స్వీకరించటానికి సారా, సంభోగ నిషేధాలు అడ్డుకున్నాయి. అరబ్బులకు అవి రెండూ ప్రీతిపాత్రాలు, ఇస్లాంకు ముందున్న కవితలలో సారా దుకాణాల్లో తాగటం, ఆనందించటాన్ని గురించి ప్రస్తావనలున్నాయి. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, నూతన ప్రచురణ ఖుమ్రియాపై వ్యాసం) ఇస్లాం వచ్చిన తరువాత కూడా శతాబ్దాలపాటు అరబ్బు కవితలు సారాయి పొగడ్తలూ, ఖుమ్రియా పేరిట కవితలు విస్తారంగా ఉన్నాయి. ఇస్లాం విజ్ఞానం, తత్వం పెంపొందగా ఇస్లాం సాహిత్యం కూడా విలసిల్లింది.
   ఖలీఫా కొలువులలో సారాయి యధేచ్ఛగా ప్రవహించింది. రాజపోషణలో 80 కొరడా దెబ్బల శిక్ష లేదు. జైలు శిక్ష ఉన్నప్పటికీ అరబ్బులు తాగటం మానుకోలేదు. అబూ మిహిజాన్ జైలులో పడి తరువాత ఖలీఫా ఉమర్ వలన ప్రవాసానికి పంపబడ్డాడు. సారాయిని పొగిడినందుకే అతడికి ఆ స్థితి వచ్చింది.
   చనిపోయిన తరువాత కూడా సారా లేకుండా ఉండలేనని అబూ మిజాన్ రాశాడు.
ఉమాయద్దుల ఆధ్వర్యాన సారా స్తుతి సంప్రదాయంగా కవితలలో దొర్లింది. గోల్డ్ జిహర్ ఈ విషయమై వ్యాఖ్యానించాడు. (గోల్డ్ జిహర్, పుట. 35, ముస్లిం స్టడీస్)
   ఉమాయద్దుల పాలకులు సారా కవితల్ని నిరోధించలేకపోయారు. మదీనా పవిత్రతకు వ్యతిరేకమైనప్పటికీ పూర్వపు అరబ్బు జీవితానికి అది అనుకూలమే. దాన్ననుభవించటం అరబ్బు కవితలలో అనూహ్యంగా ప్రస్తావించారు. ప్రజా కవితలో సారాకనుకూలంగా, దానిని వ్యతిరేకించిన మతానికి నిరసనగా కవితలు సాగాయి.
  సారా కవితలు తిరుగుబాటుకూ, నిరసనకూ నిదద్శనాలుగనా నిలిచాయి. కవుల స్వతంత్ర విధానాన్ని అదుపు పెట్టే ధోరణికి కూడా అభ్యంతరం తెలిపారు. సన్యసత్వాన్ని నిరసించాయి.
   ముస్లిం తొలి శతాబ్దంలో ఇబన్ సాహ్యన్  అల్ ఉకాషిర్, ఇబన్ ఖరీద్దా ప్రేమనూ, సంగీతాన్నీ, సారాయినీ శ్లాఘిస్తూ కవితలల్లారు. అల్ హవాస్ మతాన్ని ప్రతిఘటించి రాజకీయ పాలనను ధిక్కరించి కవితలల్లినందుకు  ఉరికంబం ఎక్కాడు.
   రెండవ శతాబ్దంలో వాలిద్, యాజిద్ సారాను స్తుతిస్తూ ఆనంద జీవితాన్ని గడపగా, చాలామంది కవులు అతనిచుట్టూ చేరారు. బెంచిక్ దృష్టిలో  కూఫ స్వేచ్ఛావాదులుగా పేరొందిన కవులు ఇలా ఉన్నారు. (ఎన్ సైక్లోపేడియా ఆఫ్ ఇస్లాం, ఖుమ్రియా వ్యాసం)
   తిరుగుబాటుకు సూచనగా బాకీ వాదం వ్యక్తం అయింది. మత నిషేధాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగింది. అలాంటి కవులను జందకలన్నారు. నాటి సాంఘిక సాంస్కృతిక చట్రంలో వారు ప్రాణాలు కోల్పోయారు కూడా.
  బాకర్ ఖరిద్దా ఎక్కువ సమయం పానశాలల్లో గడపగా జియాద్ అల్ హరితి, అతని స్నేహితుడూ మోతి ఇయాస్ తాగి పరవశించారు.
   అబ్బాసిద్దుల కొలువులో విదూషకుడు అబూదలామ నల్లబానిసగా ఉండేవాడు. నీచ కవితలలో అనందపరవశుల్ని చేస్తూ అతడు కవితలల్లేవాడు. ఒకవిధంగా అరబిక్ ఎడ్డీమర్ఫీలాంటివాడు. (ఎన్ సైక్లోపేడియా ఆఫ్ ఇస్లాం, అబూబులామాపై వ్యాసం) ఇస్లాంనూ, ఇస్లాం చట్టాన్నీ అతడు దుయ్యబట్టేవాడు.
   సారా కవులు నిరంతరం  తాగుతూ, బాకీ కవితలు రాస్తూ జీవితాన్ని గడిపారు. పారవశ్యానికి చిహ్నంగా సారాయి తాగుతూ మార్మిక రచయితలు కూడా కాలం గడిపారు.
   అబూనువాస్ అరబ్బు భాష్లలో గొప్పకవి. సారాకవి.
   థౌజండ్ అండ్ వన్ నైట్స్ గాథల్లో లెక్కకు మిక్కుటంగా అతను కనిపిస్తాడు. హరున్ అల్ రషీద్ సహవాసి. 747లో అహవాజ్ లో పుట్టాడు. అతని తల్లిదండ్రుల గురించి అంతగా తెలియదు. తనను పర్ష్యన్ గా భావించుకున్నాడు. యవ్వనదశలో బస్రా కూఫాలలో భాషాశాస్త్రం, కవిత అధ్యయనం చేశాడు. బాగ్దాద్ లో హరున్ అల్ రషీద్ కొలువులో తేలాడు. నికల్ సన్ ఇలా రాశాడు. (లిటరరీ హిస్టరీ ఆఫ్ ది అరబ్స్, కేంబ్రిడ్జి, 1930, పుటః293)
   అబూనువాస్ తన తాగుడు, అవినీతి, శీలాన్ని గురించి దాచుకోలేదు. ఖలీఫా ఆగ్రహానికి గురయ్యేవాడు. చాలా సందర్భాలలో జైలుపాలయ్యాడు.
   అబూనువాన్ విభిన్న శైలిలో ఉత్తేజకరమైన కవితల్ని రాస్తూ మధుపానం, శృంగారం చిత్రించాడు. అందమైన అబ్బాయిలను పొగుడుతూ పాడినప్పుడు మధుపాన గేయాలు అనితర సాధ్యంగా అల్లేవాడు. సాధారణంగా ఇవి 14 చరణాలలో ఉండేవి. (నికల్ సన్, 295 పుట)
   అబూనువాన్ రాస్తూ దైవం దయామయుడు గనుక చివరకు క్షమిస్తాడనేవాడు.
   నువాన్ అనంతరం ఇబన్ అల్ ముతాజ్ గొప్పకవి.  908లో ఇతన్ని ఉరితీశాడు. తాగే సంప్రదాయాలను చిత్రిస్తూ మధుపానీయాలను శ్లాఘిస్తూ రాశాడు.
   ఫైయాజ్ అహమద్ ఫైయాజ్ (1911-1984)
   పాకిస్తాన్ జాతీయకవిగా చెప్పుకుంటారు. ఇస్లాం సాహిత్యంలో సారాయి కవితల సంప్రదాయాన్ని కొనసాగించాడు. కుష్ వంత్ సింగ్ తాను ఫైయాజ్ వద్దకు వెళ్ళినప్పుడు ఉదయం అతడు తాగుతూ ఉన్నాడనీ (స్కాచ్, విస్కీ) అల్పాహారం ఆరగించి వచ్చేస్తాననీ అన్నాడు. మధ్యాహ్నం వెళ్ళేసరికి తాగుతూనే ఉన్నాడన్నాడు. భోజనం చేసి విశ్రమించటానికి వెళ్ళానని సింగ్ చెప్పాడు. రాత్రి విందులో సింగ్ అతనితోపాటు తాగి, భోజనం చేశాడు. ఫైయాజ్ తెల్లవార్లూ తాగుతూనే ఉన్నాడు.
   ఫైయాజ్ కమ్యూనిస్టు. కనీసం ఒకప్పుడు కమ్యూనిస్టు. అతడు తాగే స్కాచ్, పీల్చే విదేశీ సిగరెట్లు ఒకనాటి ఖర్చు ఒక కార్మిక కుటుంబానికి నెలరోజులు సరిపోతాయని కుష్ వంత్ సింగ్ రాశాడు. (మోర్ మెలీషియస్ గాసిప్, ఢిల్లీ, 1991, పుటః 76-77)
   ఫైయాజ్ కవితలు చూడండి (ఎ ట్రూ సబ్ జక్ట్, అనువాదం నఓమీ లజార్డ్, లాహోర్, 1988)
పందులూ-పందిమాంసం
   సాల్ మన్ రష్డీ 1968లో కరాచీలో ఉండగా ఎడ్వర్డ్ అల్బీ రాసిన ది జూ స్టోరీని టెలివిజన్ లో ప్రదర్శించటానికి ప్రయత్నించాడు.
   నేను నటించిన పాత్రలో సుదీర్ఘ సంభాషణ ఉన్నది. అందులో గృహయజమానురాలి కుక్క తరచు నామీద పడుతుంది. కుక్కను మచ్చిక చేసుకోటానికి కొన్ని హాంబర్గర్లు తెచ్చాను. కాని కుక్క వాటిని ముట్టుకోకుండా మీద పడుతూ వచ్చింది. నాకు కోపం వస్తున్నది అని నేను అనాలి. హాంబర్గర్లలో తగినంత పందిమాంసం లేదేమో అంటుండగా టి.వి. అధికారి ఒకతను  పందిమాంసం అనేది బూతుమాటగా పరిగణిస్తానన్నాడు. కామం, పురుషాయితం అనే మాటలు వచ్చినప్పుడు కూడా అతనలాగే అన్నాడు. నేను అతడి మాటల్ని తిప్పికొడుతూ  పందిమాంసాన్ని గురించి మూలంలో ఉన్నది సరిగానే చెపుతున్నానన్నాను. అల్బీ దృష్టిలో పందిమాంసంతో చేసి హాంబర్గర్లు కుక్కలు కూడా ముట్టుకోవని అర్ధం. అది పందిమాంసానికి వ్యతిరేక ప్రచారం. అందువలన అది ఉండాల్సిందేనన్నారు. పాకిస్తాన్ టెలివిజన్ లో పందిమాంసం అనేమాట రావటానికి వీలులేదన్నాడు. (సాల్ మన్ రష్డీ, ఇమాజినరీ హోం లాండ్స్, పుటః 38)
   జార్జీ ఆర్వేల్ రాసిన ఏనిమల్ ఫాంను ఇస్లాం దేశాలు నిషేధించాయి. అందులో ప్రధాన పాత్రలు పందులే. అవి నిరంకుశమైనవి. అపరిశుభ్రమైనవి చూపాడు.
   ముస్లిం దేశాలలో పోలీసులు ఆటబొమ్మల దుకాణాలపై దాడి చేసి పందుల బొమ్మలను దొరికితే పగలగొట్టేవారు.
   మిస్ పిగ్గీ అనే పాత్ర పాపానికి మారురూపం అని ఆ దేశాలలో అలా భావిస్తారని పాల్ థొరాక్స్ అన్నాడు.
   పి.జి. ఓడ్ హవుస్ కథలో మిగతా ఇంగ్లీషు సాహిత్యంలో ఆహ్లాదకర సన్నివేశాలలో పందుల ప్రస్తావన ఇస్లాం నిరసన కారణంగా ముస్లింలు ఆనందించలేకపోతున్నారు. అలాగే విన్నీ దీపూ దాని స్నేహితుడు పిగ్ లెట్ విషయమూ అంతే.
   అసహ్యకరమైన పందిని తినటం ముస్లిందృష్టిలో జూగుప్స కలిగిస్తుంది. ఈ విషయంలో వారి ధోరణి మనోవిశ్లేషణ చేయవలసి ఉన్నది. జాన్ స్టూవర్ట్ మిల్ ఈ ద్వేషాన్ని గురించి ఇలా రాశాడు.  (మిల్ యుటిలిటేరియనిజం, లండన్, 1960, పుటః141)
   ఖురాన్ పందిమాంసాన్ని నిషేధిస్తున్నది. సుర 5.3, సుర 6.145). ఇలా నిషేధించటానికి అపరిశుభ్రత ఒక కారణమని దావూద్, రోడ్ వెల్ చేసిన అనువాదాన్ని బట్టి అర్థం అవుతున్నది. కాని యూసఫ్ అలీ, అర్బరీ, సేల్ అరబ్బీలో ఉన్న రిజాస్ అనే పదాన్ని అసహ్యకరమైనదని అనువదించారు.
   ముస్లింలు ఆహార నిషేధాజ్ఞలు అనుసరించటంలో ఖురాన్ను పాటించటంలో సొంత నిర్వచనాలు చేసుకున్నారు. ఖురాన్ నియమాలు ఆనాటి మత సమాజదృష్ట్యా వచ్చాయి. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం ఘిదాపై వ్యాసం) సుర 2.168, 5.87, 7.32 ప్రకారం నిరంకుశంగా ఆహార నియమాలు విధించటాన్ని ఖురాన్ విమర్శిస్తుంది. క్రైస్తవ సన్యాసులూ, యూదుల్లోకి మారినవారి నుద్దేశించి ఈ మాటలు అన్నారు. యూదుమతానికి వ్యతిరేకంగా ఇస్లాంను నిర్వచించటం ప్రధానాంశంగా మారింది.
   మహమ్మద్ క్రమబద్ధమైన ఆలోచనాపరుడు కాదు. ఖురాన్ లో పొందిక అయిన సూత్రాలను వెతకటం వృధా. ఆనాడుతలెత్తిన  సమస్యల్ని మహమ్మద్ ఎదుర్కొన్నాడు. ఖురాన్ నియమాలన్నీ చారిత్రకంగా చూడవలసిందే. ఆహార విషయంలో ఖురాన్ ధోరణి, పరస్పర విరుద్ధాలతో ఉంటుంది. (కుల్, ఎర్లీ ఇస్లామిక్ డయిటరీ లా. జర్నల్ ఆఫ్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ. పుటః 242)
   యూదులకు వ్యతిరేకంగా క్రైస్తవుల నుండి రాబట్టిన ఉదారధోరణులు గమనించవచ్చు. యూదులు పాటించే నిషేధాలు మహమ్మద్ విమర్శకు గురిఅయ్యాయి. ఆహారాన్ని గురించి  నిరుపయోగమైన నిషేధాజ్ఞలు భక్తులపై విధించరాదన్నారు. (సుర. 2.286.) యూదుల నిషేధాలన్నీ వారి పాపాలకు దైవం విధించిన శిక్షగా చెప్పారు. (సుర 4.158, 16.119) సమరిటన్లు, యూదు-క్రైస్తవ ఆచారాలకు వ్యతిరేకంగా చేపలు తినటం చట్టబద్ధమని చెపుతూ వచ్చారు.
   యూదుల నుండి ఇలాంటి అదుపు పెట్టే ధోరణి స్వీకరించి ఉండవచ్చు. ఖురాన్, ముస్లిం పీఠాలన్నీ పందిని నిషేధిస్తున్నాయి. రాడిసన్ ప్రకారం ఇలాంటి నిషేధం యూదులుగా మారిన పేగన్లలో, యూదు-క్రైస్తవ ఆహారనియమాలలో ఉన్నాయి. వీటి ఆధారంగానే అరేబియాలో నిషేధాలు వచ్చి ఉంటాయి.
   పందిమాంసం ఎందుకు తినవూ అంటే కొరాన్ నిషేధించిందని ముస్లిం సమాధానమిస్తాడు. అతనికి మరే వివరణ అవసరం లేదు. మధ్యతరగతి చదువుకున్న ముస్లింలకు పంది మురికి జంతువు. వేడి దేశాలలో జబ్బులు తెస్తుంది అంటారు. పందుల్లో ఉన్న జబ్బులు, ట్రైకినోసిస్ వంటిని మనుషులకు రావచ్చని వారిలో నాజూకు మనుషులంటారు.
   పందిమాంసం నిషేధించటానికి చెప్పే పరిశుభ్ర కారణాలు తప్పుడివే. మైమోనైట్స్ (1135-1204) ఇలా అన్నాడు. తోర నిషేధించిన ఆహారం శరీరానికి హానికలిగించేదే. అలాగే పందిమాంసాన్ని నిషేధించటం అసహ్యకరమైన జంతువును బట్టే వచ్చింది. (ఎన్ సైక్లోపీడియా జుడైకా, నూతన ప్రచురణ. 6వ సంపుటి, పుట. 43)
   ఇస్లాంకు ముందున్న అరబ్బులకు పందులు తెలియదు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం ఘిదాపై వ్యాసం) ప్లయినీ తన నేచురల్ హిస్టరీలో, అరేబియాలో పందిమాంసం లేదన్నాడు. క్రీస్తు తరువాత 5వ శతాబ్దంలో సోజోమినస్ ప్రకారం పేగన్ అరబ్బులు పందిమాంసం తినకుండా కొన్ని యూదు ఉత్సవాలు పాటించారు. ఐనప్పుడు మహమ్మద్ అరేబియాలో ఈ జంతువునెందుకు నిషేధించారు.
   అరబ్బులు సమరిటన్లలతో పాలస్తీనా యూదులతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు తమ మత గుర్తింపుకోసం ఇలాంటి పనులు చేశారు. పందిమాంసాన్ని అపరిశుభ్రం అనికాక, అసహ్యమని ఖురాన్ అంటుంది.  యూదులు సమరిటన్లు దీనిని ఎందుకు నిషేధించినట్లు.  నమ్మకం, ప్రవర్తన ప్రధాన కారణాలుగా కొందరు మానవ శాస్త్రజ్ఞులు చెపుతుండగా ఆరోగ్య కారణాలుగా దీనిని నిషేధించినట్లు ఆధునిక మానవ శాస్త్రజ్ఞులు ఒప్పుకోవటం లేదు.
   సరిగా వండని పందిమాంసం నుండి టైకినోసిస్ అనే జబ్బు ఒకవిధమైన  పురుగు ద్వారా సంక్రమిస్తుందని పేర్కొన్నారు. (సైమూన్స్ పరిశీలన) దీనిఫలితంగా జ్వరం, ఒంటినొప్పులు, కళ్ళవాపు వస్తాయి. బైబిల్ కాలం నాటి మధ్య ప్రాచ్యంలో పందులకూ, మనుషులకూ, క్రిముల వలన వచ్చే జబ్బుసంబంధం తెలియదు. 1835లో మనుషుల కండరాలలో ఇది కనుగొన్నారు.  1859లో గాని ఇది జబ్బుకు దారితీస్తుందనీ, పందిమాంసం వల్ల సంక్రమిస్తుందని కనుగొనలేదు.  అమెరికాలో సంవత్సరానికి 3 లక్షల 50 వేల కొత్త ఇన్ ఫెక్షన్స్ ఉన్నా అందులో 4.5 శాతమే లభణాలను కనబరుస్తున్నది. మధ్యప్రాచ్యంలో వేడి కారణంగా పందిమాంసం ద్వార్ క్రిములు వ్యాపిస్తాయంటున్నారు.
   ట్రైకినోసిస్ అనేది చలి దేశాల్లో, సమ శీతోష్ణ దేశాలలో ఉండే జబ్బు. కనుక యూరోప్ అమెరికాలలో ఇది కనిపిస్తుంది. కాని మధ్యప్రాచ్యంలో కాదు.
   పశువులూ, గొర్రెలూ, మేకలూ కూడా మనుషులకు కొన్ని జబ్బులు తెచ్చిపెడతాయి. జబ్బు చేసిన పశువుల పాలన వలన కూడా రోగాలొస్తాయి. మేకల నుండి మాల్టా జ్వరం వస్తుంది. గొర్రెల నుండి తీవ్రమైన తాంట్రాక్స్ జబ్బు వస్తుంది. పశువుల మూలంగా జ్వరాలు రావటం, చీముపట్టడం కూడా జరుగుతుంది. పెంట తినటంలో కోళ్ళూ, మేకలూ కూడా పందులకు తీసిపోవు. గేదెలు మురికి నీటిలో ఈదుతాయి. పందులకంటే కుక్కలింకా మురికిగా ఉంటాయని మాలినో విస్కీ పేర్కొన్నాడు. (ది సెక్సువల్ లైఫ్ ఆఫ్ సేవేజెస్ ఇన్ నార్త్ వెస్టరన్ మెలనీసియా, లండన్ 1982, పుటః 400)
   ఏమైనా ఈ జంతువుల అలవాట్లు అసహ్యతను కలిగిస్తే వాటినెందుకు మచ్చిక చేసుకున్నట్లు.... ఆసియాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో క్రీస్తుపూర్వం తొమ్మిదివేలు, ఆరువేలు మధ్య వీటిని గృహ జంతువులుగా స్వీకరించి సుమేరియన్లు ప్రధాన ఆహారంగా అలవాటు చేసుకున్నారు. ఈజిప్టులో పందులు పెంచటం ఒక ప్రత్యేకవర్గం చేపట్టినట్లు ఎరోడోటన్ చెప్పాడు. పందిమాంసానికి గిరాకీ ఉంటేనే వాటిని పెంచి ఉంటారు. సరిగా వండని పందిమాంసం జబ్బులు చేస్తుందని యూదులకు తెలిస్తే అది ఇతరులకు ఎందుకు తెలుపలేదు... పందిమాంసం తింటే బలం వస్తుందని హిపోక్రిటస్ అన్నాడు.
   క్రైస్తవులు పందిమాంసాన్ని వ్యాపింపజేశారు. ఐతే తొలుత క్రైస్తవులుగా మారినవారు యూదులే. ఆరోగ్య విషయాలు నిషేధానికి ప్రధాన కారణం ఐతే క్రైస్తవులు దీనిని అనుసరించి ఉండేవారే.
   సాధారణ యూరోప్ వాసికి జూగుప్స కలిగించే కొన్ని జంతువుల ఆహారాన్ని కొందరు ముస్లింలు అనుమతించారు. ఉదాహరణకు సున్నీ వర్గాలు, న్యాయమూర్తి ఇబన్ హజమ్ బల్లులను తినటాన్ని అంగీకరించారు. (కుక్, ఎర్లా ఇస్లామిక్ డయిటరీలా, పుట 242) దుమ్ముల గొడి (హయనా) చచ్చిన జంతువుల మాంసాన్నీ, కుళ్ళు కంపు గొర్రె కళేబరాల్నీ, దుర్గంధ శరీరాల్నీ తింటుంది.  ఐనా షఫియైట్లూ, హన్ బాలీస్ లూ, ఇబన్ హజమ్ దీనిని తినడానికి అనుమతినిచ్చారు. పందిని తినటానికి మాలికీలు, షఫియైట్లు అనుమతించారు. ముస్లింలు సర్వసాధారణంగా ఒంటెను తింటారు.
   పంది మాంసం నిషేధించటానికి అసలు కారణం ఏమిటి.... రాబర్ట్ సన్ స్మిత్ ప్రకారం ప్రాచీన సెమైట్లు పంది మాంసాన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప దైనందిన ఆహారంలో తినేవారు కాదు. (రాబర్ట్ సన్ స్మిత్, ది రెలిజియస్ ఆఫ్ ది సెమైట్స్, పుట 153)
   సిరియన్లు పంది మాంసం తినేవారు కాదు. పందిని పవిత్రంగా చూసినందువలన తినలేదా.... లేక మురికి జంతువని దూరంగా అట్టిపెట్టారో తెలియదు. పందిపట్ల యూదులకు అస్పష్ట వైఖరి ఉన్నదనీ, వారు పూజించారో లేక ద్వేషించారో నిర్దుష్టంగా చెప్పలేమని ఫ్రేజర్ అన్నాడు. (ది గోల్జెన్ బౌ, పుట 472) యూదులు పందిని గౌరవించేవారని సూచన ప్రాయంగా ఫ్రేజర్ చెప్పాడు. ఈజిప్టులోనూ అలాంటి స్థితి ఉండేది.
   పాత నిబంధనలో ఆహార నియమాల వివరాలనుబట్టి పందికి సంబంధించిన వివరణ ఇవ్వటం కష్టం. కొన్ని జంతువులకు దివ్యత్వం ఎలా ఆపాదించారో ఫ్రేజర్ గానీ, రాబర్ట్ సన్ స్మిత్ గానీ చెప్పలేదు.
   మేరీ డగ్లస్ రాసిన పుస్తకాలలో పాత నిబంధనలోని ఆహార నియమాల వివరణకు నాంది పలికాయి. (ప్యూరిటీ అండ్ డేంజర్, 1966, ఇంప్లిసిట్ మీనింగ్స్, 1975)
   ఆహార నియమాలు, నిషిద్ధాలు కొన్ని వర్గీకరించిన సంబంధాలను బట్టి వచ్చాయని డగ్లస్ వివరణలో ఉన్నది. (మేరీ డగ్లస్, పుట 54-55) పశువులు నాలుగు కాళ్ళపై నడవటం పక్షులు ఎగరటం, చేపలు ఈదటం ఇలాంటి వర్గీకరణలోకి వస్తాయి. ఎలుకలు ఎటు చెందుతాయో చెప్పలేం కనుక వాటిని నిషేధించారన్నారు. పవిత్రత ఉండాలంటే ఒక వర్గానికి చెందాలనీ, అలా లేనప్పుడు బైబుల్ వర్గీకరించలేదనీ అన్నారు. పాత నిబంధనలో పంది మురికి అలవాట్లను గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. ఇజ్రాయేలీలు పందిని పోషించనందున దాని అలవాట్లు వారికి తెలియవు.
   డగ్లస్ వివరించిన విషయాలను ఎడ్విన్ ఫర్ మేజ్ ప్రశ్నించారు. (ది బిబ్లికల్ డయిటరీ లాస్ అండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ హోలీనెస్, స్టడీస్ ఇన్ ది ఫెంటకాన్, 1990 పుటః 177-208)
   నార్విన్ హేరిస్ సైమూన్స్ కొన్ని పరిష్కార ప్రతిపాదనలు చేశారు. (ఫర్మేజ్, పై పుస్తకం, పుటః 194) పందిని అసహ్యించుకోటానికి కాలుష్య వివరణను హేరిస్ చూపాడు. పందులు కేవలం మాంసం కోసమే ఉపయోగపడ్డాయన్నాడు. అడవిలో పందులు, దుంపలూ, పండ్లపై ఆధారపడ్డాయన్నారు.  కనుక పంది చాలా వ్యయంతో కూడినది. పందిని పెంచితే రైతులకు ధాన్యం తరిగిపోయే అవకాశం ఉంది కనుక  వాటిని ఇష్టపడలేదన్నారు. ఈ సిద్ధాంతం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అడవి ప్రాంతం తగ్గిపోవటం, సహజ వనరులు పందులకు పంచటం కష్టమైపోవటం కారణాలుగా చూపుతున్నారు. ఇస్లాం పై అధికారికంగా రాసిన ప్లాన్ హోల్ ప్రకారం పందిమాంసాన్ని నిషేధించటంలో అడవులను కొట్టి వేశారన్నారు. (ది జాగ్రాఫికల్ సెట్టింగ్, కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇస్లాం) ఈ నిషేధం వలన గొర్రెలూ, మేకలూ పర్వతాల్లోని అడవి ప్రాంతాలను మేసి ఎడారిగా మారటానికి దారితీశాయన్నారు. ఇందుకు అల్ బేనియాను ఉదాహరణగా చూపారు.
   అడవులు కొట్టివేసిన తరువాత కూడా పందులు ఉపయోగపడతాయి. పందులూ, పందిమాంసానికి వ్యతిరేకంగా గ్రామీణ జనం ఉండేవారని సైమూన్స్ అన్నాడు. (ఎఫ్.జే. సైమూన్స్, ఈట్ నాట్ దిస్ ఫ్లెష్, మేడిసన్, 1961)
   చాలామంది పండితుల ప్రకారం కేవలం విధేయతలు కట్టుబాట్ల వలన నిషేధాలు వచ్చాయన్నారు. ఎడ్మండ్ లీచ్ నాకు రాసిన ప్రకారం ఇలా ఉన్నది.
   అన్ని సమాజాలలో ఆహారాన్ని బట్టి సాంఘిక వర్గాల తేడా కనిపిస్తుంది. మనం తినేది మంచిదీ, శుభ్రమైనదీ, ప్రతిష్ఠాకరమైనదీ. వారు తినేది చెడ్డదీ, మురికిదీ, అసహ్యకరమైనదీ అంటాం. ఒకేచోట భిన్న మతాలవారు ఉంటున్నప్పుడు ఆహారాలకు సంబంధించి వివిధ నియమాలూ, నిషేధాలూ హద్దులను నిర్ణయిస్తాయి. ఇండియాలో కులాలలో ఇది స్పష్టంగా గమనించవచ్చు.
  మహమ్మద్ ఎందుకు నిషేధాలు విధించాడో ఇతర మతాలకూ, ముస్లింలకూ తేడా చూపదలిచాడు. దీనినిబట్టి గ్రహించవచ్చు. అరబ్బులకు పందులూ, వాటి అలవాట్లూ తెలియవు. అయినా, పంది మాంసాన్ని నిషేధించారు.
  ఇస్లాం పంది మాంసాన్ని సర్వత్రా అసహ్యించుకుంటున్నది. ఇందుకు మినహాయింపులేమిటో చెపుతాను. (సైమూన్స్ చూడండి) అవిసెన్నా, హెలీ అబ్బాస్ (అల్ మజూసి) వైద్య కారణాలుగా పందిమాంసం తినవచ్చన్నారు. ది ప్లాన్ హోల్ ప్రకారం మధ్య కాలాల్లో ఘోమారరిఫియన్లు ఆడ పంది మాంసం తినేవారన్నారు. మొరాకోలో బర్బర్లు యుకునెన్లు ఇటీవలి వరకూ పందుల్ని పెంచారు. మొరాకోలో జనం పందుల విషయమై రహస్యంగా ఉన్నా బలం కోసం అడవిపంది కాలేయం తినేవారని వెస్టర్ మార్క్ రాశాడు. చైనాలో ముస్లింలు పందిమాంసం తింటూ దానిని కేవలం మాంసం అని అంటారు.
పందిస్తుతి
  చైనాలో కొత్త రాతియుగం కాలం నుండి పందుల్ని పెంచుతూ వచ్చారు. ఇవి వెంట్రుకలు లేనివి 18వ శతాబ్దం నాటికి వాటిని యూరోప్ లో ప్రవేశపెట్టారు. 19వ శతాబ్దంలో పందిని పొగుడుతూ ఛార్లెస్ లాంబ్ రాశాడు. పంది లక్షణాలను  శ్లాఘిస్తూ ఆర్ స్ట్రూటన్ చిత్రీకరించాడు. (ది హైయర్ మీనింగ్ ఆఫ్ ఫుడ్, టైమ్స్ లిటరరీ సప్లిమెంట్, 1994, సెప్టెంబరు, 30)
లైంగిక పురుషాయతం
   పురుషుల మధ్య ఇస్లాం లోకంలో లైంగిక సంబంధాన్ని గుర్తించి సహిస్తున్నారు. పాశ్చాత్యులు ఉత్తర ఆఫ్రికాలోని ముస్లింల మధ్య ఉన్న పురుష లైంగిక సాహసాలను గమనించటానికి వెళుతుంటారు.
   కాంప్టన్ మెకంజీ థిస్ఐస్ అనే పురుష లైంగిక సంబంధాల పుస్తకాన్ని 1956లో ప్రచురించాడు. అందులో కథకుడూ, అతని స్నేహితుడూ హెన్రీ ఫోర్టెస్క్ మొరాకో వెళతారు. అక్కడ సరుకులు మోసే ఆలీ పట్ల హెన్రీ ఆకర్షితుడవుతాడు. హెన్రీ అప్పుడు ఆలీ వెంటపడతాడు. ఇందులో ప్రమాదం లేదని బ్రిటిష్ వైస్ కాన్సల్ హామీ ఇస్తాడు. ముస్లిం ప్రపంచంలో టాంజీర్ నుండి కైబర్ కనుమ వరకూ పురుషుల మధ్య లైంగిక సంబంధాన్ని ఎవరూ విమర్శించరన్నారు. (కాప్టన్ మెకంజీ, పుట 38)
   బాబర్ చక్రవర్తి (1483-1530) కైబర్ కనుమగుండా ఇండియాకు వస్తాడు.  (బాబర్ మెమోయిర్స్, అనువాదం ఎ. బెవరిడ్జ్, ఢిల్లీ, 1979, పుట 120) అందులో ఒక అబ్బాయి పట్ల తానెలా మోహ పరవశుడైందీ బాబర్ వివరిస్తాడు.
   సర్ రిచర్ట్ బట్టన్ ఇస్లాంలో పురుషుల మధ్య లైంగిక సంభోగాన్ని ముఖ్యంగా కైబర్ కనుమలలో ఆచారాన్నీ ప్రస్తావించాడు.  అఫ్ఘనిస్తాన్, సింధు ప్రాంతాలలో ఈ పర్ష్యన్ పురుషాయత దురాచారం ఎక్కువగా ఉందన్నాడు. ఆఫ్ఘనులు వ్యాపార నిమిత్తం ఒంటెలపై ప్ర.యాణం చేస్తున్నప్పుడు అమ్మాయిల దుస్తులలో అనేకమంది అబ్బాయిలను వెంటబెట్టుకొని, భార్యల బదులు లైంగికంగా వాడుకుంటారన్నాడు.
   (రిచర్డ్ బర్టన్, పదవ సంపుటి, పుట 236 ది బుక్ ఆఫ్ ది థౌజండ్ నైట్స్ అండ్ ఎ నైట్)
   పర్ష్యా నుండి మొరాకో వరకు పురుషుల మధ్య సంభోగాన్ని ఉదహరిస్తూ బర్టన్ రాశాడు. 1936లో పశ్చిమ ఈజిప్టులో శివ వయాసిస్ లో పనిచేసిన క్లెన్ కూడా ఈ విషయం రాశాడు. శివాన్ పురుషులు అబ్బాయిలతో సంభోగించడం ఆనవాయితీ. ఇందుకు వారు సిగ్గుపడరు. స్త్రీలతో ప్రేమవలే ఇదికూడా వారు పరిగణిస్తారు. పైగా అబ్బాయిల కోసం పోటీపడతారు. (బీచ్, సోషల్ యాంధ్రోపోలజీ, పుట 210) పురుషులూ, అబ్బాయిల మధ్య పటాటోపంగా పెళ్ళిళ్ళు జరగటం, అబ్బాయిలకు అమ్మాయిలకంటే 15 రెట్లు ఎక్కువ కట్నం ఇవ్వటం కూడా ఆచారంగా ఉన్నది.
   ఈ విషయమై ఖురాన్ ధోరణి చూద్దాం సుర 4.16 ఇరువురు పురుషులు అసహ్యంగా ప్రవర్తిస్తే ఇద్దరినీ  శిక్షించు
   సుర 7.80, 81 ప్రజలతో లోత్ ఇలా అన్నాడు. ఏ జాతీ చేయని అసహ్యకరమైన పనులు మీరు చేస్తారా... స్త్రీలకంటె పురుషులే తగినవారని వెంటబడతారా  ? మీరు దిగజారిపోయారు.
   సుర 26. 165 భార్యలను వదిలేసి పురుషులతో సంభోగిస్తారా ? మీరు హద్దులు అతిక్రమిస్తున్నారు.
సుర 27.55 లోత్ ప్రజలతో ఇలా అన్నాడు. అవమానకరమైనదని తెలిసినా, అసహ్యంగా ప్రవర్తించి స్త్రీల బదులు పురుషుల కామాన్ని కాంక్షిస్తారా ?
సుర 26.166 లోత్ ప్రజల్ని శిక్షించి నశింపజేశాడు. పురుషుల మధ్య సంభోగాన్ని సహించరాదన్నాడు. స్వర్గంలో ఆనందాలను గురించి ఖురాన్ ప్రస్తావనలు ఉన్నాయి.
సుర 52.24, ముస్లిం భక్తుల నిమిత్తం, కన్నెలవలె యువకులు ఎదురుచూస్తుంటారు.
సుర 56.17 అమర యువకులు పాత్రలు చేతితో పట్టుకుని మంచి సారా అందించటానికి ఎదురుచూస్తుంటారు.
  ఈ యువకులు సేవ చేస్తారా లేక లైంగిక అవసరాలు తీరుస్తారా ?
   ఖురాన్ అస్పష్టంగా ఉండగా పురుషుల మధ్య సంభోగానికి వ్యతిరేకంగా సంప్రదాయాలు పేర్కొంటున్నాయి. పురుషులమధ్య సంభోగాన్ని చేసేవారిని, చేయించుకున్న వారినీ చంపేయమని ప్రవక్త అన్నాడు.
   ఇబన్ హల్ బల్ పురుషుల మధ్య సంభోగం చేసేవారిని రాళ్ళు కొట్టి చంపాలనగా మిగిలిన పీఠాలవారు వంద కొరడా దెబ్బలు కొట్టాలన్నారు. ఐతే ఈ విషయంలో తొలుత నుండి సహనం అమలు పరచలేదు. ఇస్లాం ముందు నుండి అరేబియాలో పురుషాయితం ఉన్నట్లు ఆధారాలున్నాయి. (లివాక్ ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం) 7వ శతాబ్దంలో ఈ సాక్ష్యాలు బాగా ఉన్నాయు. తొలి ఖలీఫాలు పురుషాయతం చేసినవారిని రాళ్ళతో కొట్టడం, తగలబెట్టటం మీనార్ నుండి కిందకు తోయటం వంటి శిక్షలు  విధించారు. అబ్బాసిద్ధులలో చాలామంది ఖలీఫాలే పురుష సంభోగులుగా ఉన్నారు. అల్ అమీన్, అల్ ముతాసిమ్, అగ్లాబిద్ ఇబ్రహీం, అద్ అల్ రహమాన్, సలాదిన్ ఇందుకు ఉదాహరణలు. సలాదిన్ మత యుద్ధాలు కూడా చేశాడు. ముస్లిం స్పెయిన్ లో 11వ శతాబ్దంలో పురుషాయతం గురించి హెన్రీ పెరిజ్ రాశాడు. ముల్కు అల్ తావిఫ్ కొలువులో పురుషాయతం పాటించారు. అల్ ముతామిద్ తన ప్రేమను ఇబస్ అమర్, అతని సేవకుడు సయీఫ్ ల పై చూపాడు. అలాగే అల్ ముతావక్కిల్, రఫీ అల్ దావలా కూడా సాడోమీ చేసినవారే.
   పురుషాయతం టర్కీ సవనాలలో సర్వసాధారణంగా ఉన్నది. లైంగిక ప్రేరేపణ కలిగించే విధంగా చిత్రాలూ, విగ్రహాలూ, హమానుల వద్ద ఉన్నాయి. పురుషుల మధ్య వ్యభిచారం పెద్ద నగరాలలో ఉన్నది. వసతి గృహాలలో ప్రయాణీకులకు లైంగికావసరాలు అబ్బాయిలు తీరుస్తుంటారు.
   కవులు పురుషాయతం ఆచారాన్ని గురించి ప్రస్తావించటమే కాక, పొగిడారు కూడా. అబూనువాన్ తన పెర్ ఫ్యూమ్డ్ గార్డెన్ లో అలాంటి కవితలల్లాడు. పురుషాయతాన్ని గురించి అతడి ప్రస్తావనలు కథలుగా చెప్పుకుంటారు.
   పురుషుల మధ్య సంభోగం ఉన్నట్లే స్త్రీలు, స్త్రీలతోనే లైంగిక సంబంధాలు ఆచరించటం కూడా ఉన్నది. దీనిని కూడా తెగ పొగుడుతూ ది పెర్ ఫ్యూమ్డ్ గార్డోన్ లో ఒక అధ్యాయం ఉన్నది. (షేక్ నెఫ్జావీ, లండన్, 1978, పుట 37-39)
   ముస్లిం సమాజంలో పురుషాయతం ఉండటానికి సామాజిక, శారీరక, మానసిక కారణాలేవైనా, పాశ్చాత్య క్రైస్తవులకు అనూహ్యమైన మేరకు ముస్లింలు ఈ ఆచారాన్ని సహిస్తున్నారు.
     
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment