డా.కనుపర్తి విజయ రచనలు-Review

చదవండి; చదివించండి :


రచయిత్రి : డా. కనుపర్తి విజయబక్ష్

రచనలు :

1. ఆమె చెప్పిన కథ – (69 కథలు)

2. ఆకాశంలో సగం మాది, అవకాశాల్లో చోటేది? (వ్యాసాలు)

3. సుకన్య (నవల)

4. సాహిత్య సౌరభం (వ్యాసాలు)



------



1. ఆమె చెప్పిన కథ



డా. కనుపర్తి విజయబక్ష్ రచనలన్నీ సామాజిక స్పృహతో చేసినవే. ముఖ్యంగా స్త్రీల సమస్యలు, వారెదుర్కొంటున్న అసమానతలు అవస్థలు ఆమె రచనల నిండా చోటు చేసుకున్నాయి. ఆమె చెప్పిన డా.ఆలూరి విజయలక్ష్మిగారి పీఠికతో ప్రారంభమైంది. ఇందులో స్త్రీల అజ్ఞానం, మూఢవిశ్వాసాలు, అమాయకత్వం, వారు సహిస్తున్న అవమానాలు, వేధింపులు, హింస, అత్యాచారాలు, వారనుభవిస్తున్న బానిస బ్రతుకు హృదయాన్ని తట్టి కుదిపే విధంగా స్త్రీల గురించిన 69 గాథలు రచయిత్రి మన ముందుంచారు.



ఇందులో :



అనుమాన పిశాచి భర్త పెట్టే హింసలు భరించలేక, బాల్య వివాహాలే నయమేమో అని ఒక క్షణం పాతకాలపు ఆలోచనలో పడిన అమల; డాక్టరుగా తనంతగా రాణించక, ఆత్మన్యూనతకు గురి అవుతున్న డాక్టరు భర్త అహాన్ని సంతృప్తి పరచాలని తన పేషెంట్లను అతని దగ్గరకే పంపించే డా.ధరణి; ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగాలు మృగ్యమై డబ్బు సంబంధమే రాజ్యమేలుతున్నదని బాధపడి విపరీత నిర్ణయం తీసుకున్న జ్యోతి; భార్యలు భర్తల అవసరాలు, కోర్కె తీర్చే మిషనని, వారికంటూ సొంత అభిప్రాయాలు, జీవితం ఉండగూడదని శాసించే భర్తతో నరక జీవితం అనుభవించే స్త్రీలు, తమ ఆధిక్యతను చాటుకునే తాపత్రయంతో భార్యలను “పల్లెటూరి మొద్దు, ఏమీ తెలియదు” అంటూ అందరి ముందూ అవమానించే భర్తలు, భార్య భర్త సహజీవనంలో ప్రేమ, అనురాగం, నమ్మకం బలంగా వేళ్ళూనాలనే స్వతంత్రలక్ష్మి; ఆడపిల్లలలను అందమైన బొమ్మలుగా కాకుండా విజ్ఞానవంతులుగా, జీవితంలోని ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ధీశాలురుగా తీర్చి దిద్దటం తల్లి-దండ్రులు, గురువులు, మీడియావారి బాధ్యత అని చెప్పే అజంత సజీవంగా మనముందు నిలిచేలా రాసారు విజయబక్ష్. సంస్కారవంతుడైన భర్త సాహచర్యంలో స్త్రీ చక్కని శిల్పంగా మారుతుంది. సంస్కార హీనుల హింసతో శిలగానే మిగిలిపోతుందనే అచల; 13 ఏట పెళ్ళయి, 70 ఏళ్ళ వయసులో కూడా భర్త పెత్తనం, అదుపు, జులుం నుండి బయటపడలేని తులశమ్మ; భార్యగా యింటి యిల్లాలుగా తనకేమీ హక్కులు లేనపుడు ఆ యింటి బరువు బాధ్యతల్ని నెత్తికెత్తుకుని జీవితాంతం మోయమంటే ఎలా సాధ్యం అని నిలదీసే శ్రీలక్ష్మి, విరివిగా పుస్తకాలు చదివి, తన జ్ఞానాన్ని భర్తతో పంచుకోవాలని, పలు చారిత్రక స్థలాలు కలిసి చూడాలని, ప్రకృతి అందాలను తిలకించాలనే మానస డబ్బు, వ్యాపారం తప్ప మిగతాదంతా పరమవేస్ట్ అనే భర్తతో నిరుత్సాహంగా, నిర్వికారంగా జీవితం గడపడం; ఆడవారికి ఆడవాళ్ళే శతృవులనే నానుడి ఉటంకిస్తూ, కోడళ్ళు కట్నాలు బాగా తేలేదని, వాళ్ళ పుట్టింటివాళ్ళు లాంఛనాలు బాగా జరపలేదని, కోడళ్ళు పిల్లల్ని కనలేదని చిన్న చూపు చూస్తే అత్తలూ, అత్తగారి కడుపు నిండా తిండి పెడితే ఖర్చయిపోతుందనుకునే కోడళ్ళు, వారి క్షేమం కోసమేనంటూ ఆడపిల్లల ప్రతి కదలికనూ అనుమానించే తల్లులూ; డబ్బుకోసం బిడ్డను తార్చే తండ్రులూ – అందరూ ఈ కథల్లో ప్రత్యక్షం అయ్యారు. అలాంటి తండ్రులకేమి శిక్ష వేయాలి అని అర్థోక్తిలో ఆగిపోయిన రచయిత్రి ఏ శిక్ష వేసినా తక్కువే అని చెప్పకనే చెప్పారు.



పై సమస్యలకన్నిటికీ పరిష్కార మార్గాలు సూచించారు రచయిత్రి :



స్త్రీలు చదువుకోవాలి. ప్రశ్నించటం అలవరచుకోవాలి, స్వయం శక్తితో ఎదిగి, నిలబడాలి. వారి ఎదుగుదల కుటుంబ సభ్యుల ముఖ్యంగా పురుషులు, సమాజం – పరిస్థితులు, చట్టాలు, వాటినమలుపరిచే ప్రభుత్వం – అందరూ సహకరించినప్పుడే సాధ్యమవుతుంది. స్త్రీ శక్తివంతురాలయితే కుటుంబం, సమాజం దేశం బాగుపడుతుంది. స్త్రీలు మూఢ విశ్వాసాల నుండి, శుష్క ఆచారాల నుండి బయటపడగలిగిననాడే పురాణాలు, మనుస్మృతులు ఘోషించి, శాసించి స్త్రీ స్వేచ్ఛను అరికట్టే కథలను కథలుగానే చదవాలని ఆచరించనవసరం అసలే లేదని నిరూపించగలరు.



2. ఆకాశంలో సగం మాది అవకాశాల్లో చోటేది ?



రచయిత్రి స్త్రీల సమస్యలను – సమాజపరంగా, కుటుంబ పరంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా, ఆర్థికపరంగా – క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాసిన వ్యాస సంపుటి యిది. డా. చిరంజీవినీ కుమారి తన ముందు మాటలో సవివరంగా పుస్తకాన్ని పరిచయం చేశారు.



అనాదిగా స్త్రీలను విద్యకు దూరం చేసి మూఢవిశ్వాసాలను నమ్ముకునేలా చేసి ఇంటి చాకిరీకే పరిమతం చేయడం జరిగింది. పురాణాలూ స్మృతులూ స్త్రీ స్వేచ్ఛకు అర్హురాలు కాదని ఘోషించాయి. వెనుకబాటుతనం అనే ముళ్ళ కిరీటాన్ని ఆమె నెత్తిన బెట్టి ఆమె ఎదగకుండా అన్ని అవరోధాలు కల్పించాయి. అలా చేస్తున్న సమాజానిది మొదట తప్పంటారు బక్ష్.



జనాభాలో సగంమంది స్త్రీలు. ప్రస్తుతకాలంలో స్త్రీలు చదువుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా హుందాగా జీవించే హక్కు, ఆర్థికంగా సమానత్వం, రాజకీయంగా తగిన అవకాశాలూ ఇంకా పొందలేకపోతున్నారు. కారణం ఎన్నో తరాలుగా వాళ్ళు బానిసత్వపు కోరల్లో చిక్కుకుని ప్రశ్నించవచ్చు అనే విషయాన్నే మరచారు. హేతుబద్ధమైన ఆలోచన శాస్త్రీయ పరిజ్ఞానం లేకుంటే చదువుకున్నా అదంత ప్రయోజనకారి కాదు.



ఆడపిల్లలను పుట్టకుండా అడ్డుపడుతున్న ఈ సమాజం సిగ్గుతో ఎందుకు తలవంచుకోదోనని రచయిత్రి ఆక్రోశించారు. ‘ప్లీజ్ మమ్మల్ని పుట్టనివ్వండి’లో – ‘మహిళా సాధికారత సాధ్యమేనా?’లో స్త్రీని పరిపాలనా సీటులో అలంకార ప్రాయంగా కూర్చోబెట్టి పరిపాలనా యంత్రాంగం అంతా పురుషుని పెత్తనంతో నడుస్తుంటే ఆమె తన సామర్థ్యాన్ని చాటుకునేదెప్పుడు మరి అన్నారు రచయిత్రి - అడుగడుగునా పురుషుడు శక్తివంతుడు, స్త్రీ అబల అని నిరూపణే ధ్యేయంగా ఉంటున్నది ఈ సమాజంలో.



అదర్శ మహిళ అంటే యిలా వుండాలి అని పురుషులు నిర్ణయించినంత వరకూ స్త్రీ జనాభివృధ్ధి కుంటుపడుతూనే వుంటుంది. స్త్రీలకు ఎంతసేపూ సీతా, సావిత్రి, చంద్రమతి కథలు చెపుతూ అలా వుండాలని నూరిపోస్తారు.



పెండ్లి పేరుతో ఆమె మీద సర్వహక్కులూ భర్తకూ, అత్తింటివారికీ ధారాదత్తం చేస్తారు. అత్తింట నానా కష్టాలు పడుతుంటే సర్దుకుపోవాలి అని స్త్రీకి చెప్పటం రోజూ చూస్తున్నాం. భర్త కొట్టినా, హింసించినా, అతని పాదాల దగ్గర బానిసగా పడి ఉండాలని నేర్పుతాం. కాదని బయటపడితే జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుంది అని ఆమెను భయపెడతాం. ఈ నరకం ఈ వివక్ష ఇంకా ఎంతకాలం అని రచయిత్రి ప్రశ్నిస్తున్నారు. ఈ పైశాచికాలకు అంతమెప్పుడు? పాతివ్రత్యం పేరిట పురుషునికి స్త్రీమీద అసాధారణ పెత్తనం ఇవ్వటమేమిటి? శీలం అనేది ఇద్దరికీ వర్తించాలి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమార్గాలు సూచించారు విజయ బక్ష్.



తల్లిదండ్రులు ఆడపిల్లలను, మొగ పిల్లలలనూ సమానమని పెంచాలి. ఆడపిల్లలను చదివించాలి. వారికి సొంత ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలు, అభిరుచులు ఉంటాయని తెలుసుకోవాలి. వారు అన్ని రంగాలలో రాణించగలరు. సమర్థత చూపగలరు. అవకాశాలివ్వకుండా అడ్డుపడరాదు. భార్య అంటే జీతం బత్తెం లేకుండా 24 గంటలూ బానిస చాకిరి చేసే వ్యక్తి కాదని, పిల్లల్ని కనే యంత్రం కాదని పురుషులు గుర్తించాలి. పెండ్లి భార్య, భర్తల మధ్య ప్రేమ, అప్యాయత, నమ్మకం అనే పునాదుల మీద నిర్మింపబడే ఒక సామాజిక క్రతువు. అనివార్యమైన విధి అని ఈ సమాజం గుర్తించి ఆచరించాలి. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే ప్రసక్తి రాకూడదు. స్త్రీకి ఎన్నో హక్కులున్నాయి. చట్టపరంగా, కాని అవి కాగితాలకే పరిమితం. అవన్నీ స్త్రీలకి తెలియజెప్పి అమలుపరిచే బాధ్యత ప్రభుత్వానిది.



ఈరోజుల్లో విద్య, వైద్య వ్యవసాయ సామాజిక రంగాలలో స్త్రీలు పురుషులతో దీటుగా పనిచేస్తున్నారు. ప్రగతి పథంలో ముందుకు పోతున్నారు. ఇది పురుషులకు మింగుడు పడాలి. స్త్రీల శక్తి మీద వారికి ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అని నిలదీస్తున్నారు రచయిత్రి. స్త్రీకి పరిధులు గీసి, అవి దాటితే పురుషుడు సహించడు. ఆ పరిస్థితి మారాలి. అవధులు చెరిపి స్త్రీ పురుషులిద్దరూ సమానంగా నడిచినప్పుడే కుటుంబంలో సమాజంలో, దేశంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. స్త్రీ పురుషుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మంచి అవగాహన, ఆచరణ పునాదుల మీదే వారి జీవితాలు నడవాలి. స్త్రీ రచయితలు, కళాకారుల మీద ఛాందసవాదుల దాడులు ప్రస్తావిస్తూ తస్లీమా మీద దాడి జరిగిన రోజును ‘సిగ్గే సిగ్గుపడిన రోజు’ అంటూ రచయిత్రి ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఆ టైటిలే ఒక మణిపూస అని గర్వంగా చెప్పగలం.



అమెరికాలో పెళ్ళిళ్ళు విడాకుల ప్రస్తావన చేస్తూ భార్యా భర్తలు కలిసి ప్రశాంతంగా జీవించని పరిస్థితి దాపురిస్తే విడిపోవడం ఉత్తమమన్నాడు విజయబక్ష్.



స్త్రీ తెలివితేటలనూ, శ్రమశక్తినీ గౌరవించిననాడే సమానత్వం వెల్లివిరుస్తుంది. అసాధ్యాన్ని సాధ్యం చేయగల చేవ, సత్తువ, నిగ్రహం అన్నీ స్త్రీలలో నిబిడీకృతమై ఉన్నాయి. వెలికి వచ్చే అవకాశాలు పుష్కలంగా అందాలి, అంతే!



3. సుకన్య



చక్కని యితివృత్తంతో, దీప్తి గోరా ప్రశఁసతో ముచ్చటగా రూపు దిద్దుకుంది సుకన్య.



సుకన్య, చంద్రధర్ బాల్యం నుండి కలిసి చదువుకున్నారు. యూనివర్సిటీలో చదివే రోజుల్లో వారి స్నేహం ప్రేమగా పరిఢవిల్లింది. వివాహం చేసుకుని చక్కని ఇల్లాలుగా, మంచి తల్లిగా, జీవితం తరింప చేసుకోవాలన్న సుకన్య కలలన్నీ తండ్రి కులం పట్టుదలతో నీళ్లుగారిపోయాయి. చంద్రధర్ స్ఫురద్రూపి. విజ్ఞాన పండితుడు. సంస్కారి. అవేవీ సుకన్య తండ్రి కులం, ధనం, దర్పం అనే గొప్పల ముందు నిలవలేకపోగా, అతను చంద్రధర్ ని ‘కుమ్మరాడి కొడుకు’ అని హీనంగా అవమానపరుస్తాడు. అతన్ని వివాహమాడి కుటుంబం పేరు ప్రతిష్ఠలు మంటగలిపేకన్నా, ఆశ్రమంలో సేవ చేస్తూ సన్యాసిగా ఉండిపొమ్మని తండ్రి సుకన్య జీవితాన్ని మోడు చేశాడు. సుకన్య వృద్ధుల, అనాథల సేవకే అంకితం అయిపోయింది కాని తండ్రిని ఎదిరించి పోలేకపోయింది. అదే తండ్రి తన కొడుకు ‘తెల్ల దొరసాన్ని’ పెండ్లాడితే ఘనంగా స్వాగతించి, పార్టీ యిచ్చాడు. ఆడపిల్ల, మగపిల్లవాడి మధ్య చూపే వివక్ష మనం ఎరగనిదేముంది! అవివాహితుడుగా చంద్రధర్, అతని తల్లిదండ్రులు సుకన్య కార్యకలాపాలలో అండగా నిలిచారు.



‘సుకన్య’లో నీల సురేష్ వల్ల ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంది.



ప్రేమ పెళ్ళిళ్ళను నిరసించే వనజకు ఆర్భాటంగా తల్లిదండ్రులు పెళ్ళి చేయగా భర్త దురాగతాలకు తట్టుకోలేని వనజకు పెళ్ళి పెటాకులయింది మూడు నెలలకే.



కులం ఎలా వేళ్ళూని జీవితాలని బాధా భరితం చేస్తుందో రచయిత్రి సవివరంగా చూపారు. స్వార్థపరులైన దొంగ బాబాల ఆశ్రమ కార్యకలాపాలను తీవ్రంగా విమర్శించారు. చదువుకున్న అమ్మాయిలు అవసరమైనప్పుడు తల్లిదండ్రులను వ్యతిరేకించితేనే మంచిదని సుకన్య జీవితం చూచిన వారికి అనిపించక మానదు. కులం, మతం అంటూ యింకా ఎంతకాలం ఈ సమాజం గిరిగీసుకుంటుందో తెలియదు. కులాంతర, మతాంతర వివాహాలు నిర్భయంగా జరగటానికి యింకెన్ని దశాబ్దాలు పడుతుందో మరి! కొందరైనా వాటిని ప్రోత్సహించి ముందుకు రావాలని రచయిత్రి కోరుతున్నారు.



4. సాహిత్య సౌరభం



సాహిత్య సౌరభం అదృష్టదీపక్ విమర్శనాత్మక పీఠికతో, చక్కని టైటిల్ తో, చక్కని భాషతో మనముందు నిలిచింది.



సాహిత్య విద్యార్థిగా అధ్యాపకురాలిగా తాను పొందిన అనుభూతిని పుస్తక రూపంలో మనతో పంచుకుంటున్నారు రచయిత్రి.



తిక్కన, కందుకూరి, గురజాడ, చలం, కృష్ణశాస్త్రి మొదలగు గొప్ప రచయితలు, పండితుల గురించి ఆధునిక కోణంలో హేతుబద్ధమైన వివరణతో హృద్యమంగా రచన చేశారు విజయబక్ష్.



ఆమె మనకందించిన సౌరభాలు :



తిక్కన ఆనాడే సామాజిక స్పృహతో రచనలు చేశాడు. అప్పుడు శివభక్తి ప్రబలంగా వ్యాపించి ఉన్నది. శివకవులు – మల్లికార్జున పండితారాధ్యులు, పాల్కురికి సోమన, నన్నెచోడుడు ఆ భక్తిని వ్యాపింపచేశారు. తిక్కన కవిగా ఎంత ప్రసిద్ధుడో మత సమన్వయ కర్తగా, సామాజిక స్పృహ గల వ్యక్తిగా అంతే ప్రసిద్ధుడు అన్నారు రచయిత్రి.



వీరేశలింగం విశ్వమానవ సమానత్వం గుర్తించిన మహానుభావుడు. ఉదారహృదయుడు. ఆయన స్త్రీ విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశాడు. వితంతువుల దుస్తితి నెరిగి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించటానికి ఆయన ఎన్నో పాట్లు పడవలసి వచ్చింది. ఆయన రచనలలోని స్త్రీ పాత్రలన్నీ అభ్యుదయాన్ని కాంక్షించేవే. వివేకవంతులు, విద్యావంతులైన స్త్రీ మూర్తులను ఆయన రచనల ద్వారా మన ముందుంచాడు.



నవలా సాహిత్యం గురించి వివరిస్తూ రచయిత్రి ఇటీవలి కాలంలో ప్రబలిన క్షుద్రసాహిత్యం పాఠకుల మీద భయంకర ప్రభావాన్ని చూపుతున్నదన్నారు. చేతబడులు, బానామతులు అంటూ సమాజాన్ని తిరోగమింపచేస్తూన్నదన్నారు.



కృష్ణశాస్త్రి ఆంధ్ర దేశం గర్వించదగిన మహాకవి. మానవతా మూర్తి, భావకతా యుగపు రాజు. ఆయన రచనల్లో విశ్వమానవ ప్రేమ, స్వేచ్ఛానురక్తి వెల్లడయినాయి. కులం, మతం అనే అడ్డుగోడలు లేని సమభాగ్యం, సంస్కృతి కొత్త కాంతిని, వినూత్నశాంతిని భారతావనికి యివ్వాలని మనసారా కోరినవాడు. జాతి కుల మతాలను నిరశించాడు. ఆయన కవిత్వం ఎల్లలు లేని మానవ ప్రపంచాన్ని కల్లలెరుగని ప్రేమ వెల్లువని ప్రవహింపచేసింది.



కొప్పరపు సుబ్బారావు ‘శాస్త్రదాస్యం’లో సంఘ క్షేమానికీ, సర్వమానవ కళ్యాణానికి పనికిరాని శాస్త్రాన్ని త్యజించాలన్నారు.



సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర ఎనలేనిది. ప్రభుత్వం తమకోసం ఏమి చేస్తున్నదో ప్రజలు తెలుసుకొనేది పత్రికల వల్లనే. పత్రికలు సరైన త్రోవ చూపాలి. నిజాయితీగా, నిర్భీతిగా వార్తలందించాలి.



అన్ని రంగాలలో స్త్రీని కించపరచే ధోరణులున్నట్లే, భాష వాడకంలోనూ అదే ధోరణి విరాజిల్లుతున్నది. స్త్రీని హీనంగా చూపే పదాలను వాడటం – ముఖ్యంగా ఆడవారినైనా మగవారినైనా తిట్టాలంటే అన్ని తిట్లూ ‘లం’, ‘ముం’తోనూ ప్రారంభించటం నిత్యం చూస్తున్నదే. మగవాడి మీద కక్ష తీర్చుకోవాలంటే ‘మగ’ తిట్లతోనే తీర్చుకోవాలిగాని అందులో స్త్రీ ప్రసక్తి ఎందుకంటున్నారు రచయిత్రి. ‘అమ్మ’ అనే, పవిత్ర పదాన్ని అతి నీచంగా వాడుతున్నదీ సమాజం. చదువుకున్నవారు, సంస్కారవంతుల మనుకునేవారు గూడా స్త్రీని ‘ఏమేవ్’, ‘ఒసేవ్’, ‘అది’, ‘ఇది’ అని అనునిత్యం కించపరుస్తూనే ఉన్నారు. సంస్కారహీనమైన పదాలను స్త్రీ పట్ల వాడకుండా, తమ భాషా పరిజ్ఞానాన్నీ, సంస్కారాన్ని చాటుకోమని జనాన్ని రచయిత్రి కోరుతున్నారు.



చలం రచనల్లో హేతుదృష్టిని వివరించారు. రచయిత్రి, చలం స్త్రీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను నూతన దృష్టితో చూచి తన రచనల్లో విశ్లేషించటంలో కొత్త పంథాను అనుసరించాడు. స్త్రీలను రెవల్యూషనరీ పాత్రలుగా మలచటం, స్వేచ్ఛాయుత ప్రణయ జీవనం కోసం దేన్ననయినా త్యజించగలరనటం వంటి విపరీత ధోరణులను అనుసరించటం వల్ల ఆయన అపఖ్యాతి పాలయినాడు. ఆయన ‘అపఖ్యాతిపాలైన ప్రఖ్యాత రచయిత’ అన్నారు విజయ బక్ష్. చలం గురించి రాచమల్లు రామచంద్రారెడ్డి మాటలను యిక్కడ ప్రస్తావించారు; చలం లేకపోతే మన సాహిత్యంలో వాస్తవికవాదం యింత బలంగా ఉండేదికాదు.



ప్రాచీన ఛాందసవాద ధోరణిని వ్యతిరేకించి, మానవతా దృక్పథంలో, హేతు దృష్టితో ప్రశ్నించటం నేర్పి భారతీయుల్లో పునరుజ్జీవనానికి నాంది పలికిన ఆధునిక మానవుడు రాజా రామమోహన్ రాయ్.



సాహిత్యంలో మనకింకా స్వేచ్ఛ ఉందన్నారు రచయిత్రి. స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించిన రచనలే పదికాలాలపాటు నిలబడతాయి. ప్రజల సమస్యలతో మమేకమై చేసే రచనలే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. నేటిదాకా సాహిత్యంలో స్వేచ్ఛా ధోరణులను వెలార్చిన రచయితలెందరో ఉన్నారు. సాహిత్యంలో స్వేచ్ఛను నియంత్రించటం మనదేశంలో యింకా జరగలేదు.



కన్యాశుల్కానికి చలించిపోయి గురజాడ ఒక అపూర్వమైన నాటకాన్ని సృష్టిస్తే, వరకట్న దురాచారానికి చలించిపోయి కాళ్ళకూరి నారాయణరావు ‘వరవిక్రయం’ అనే ఒక అద్భుతమైన నాటకాన్ని రచించాడు. ఆ రచనలు వచ్చి 80, 90 ఏళ్ళయినా వరకట్న పిశాచం సమాజంలో బలంగా వేళ్ళూని, తిష్ఠవేసి ఆడపిల్లల పట్ల శాపమై కూర్చుంది. ఈ దురాచారాన్ని రూపు మాపటానికి యువత నడుం కట్టాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపాలి.



పుస్తకాల విలువను ఇలా చూపారు రచయిత్రి. పిల్లలకు చిన్ననాటినుండే పుస్తకాలు (రంగు రంగుల బొమ్మలు, కథలు ఉన్నవి) చదవటం అలవాటు చేయాలి. బొమ్మలతో పాటు మంచి పుస్తకాలు వారికి బహుమతులుగా యివ్వాలి. మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. పుస్తకాలు విజ్ఞానం పంచి, తెలియని ప్రపంచాన్ని తెలియజెప్పే అద్భుత సాధనాలు. ఈ సందర్భంగా గోర్కీ మాటలను మనకి గుర్తు చేశారు. “పుస్తకాలు నా మనస్సుకు, హృదయానికి రెక్కలిచ్చాయి. నేను బురద నుండి బయట పడటానికి తోడ్పడ్డాయి. అవి చదవకపోతే నా చుట్టూ ఉన్న మౌఢ్యంలోనూ, నీచంలోనూ మునిగిపోయి ఉండేవాడిని. విశాల ప్రపంచ దృశ్యాలను పుస్తకాలు నా ముందు పరిచాయి”



కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు సమాజంలోని చీకటి కోణాలను వెలుగు రేఖలతో నింపారు. వీరేశలింగం ‘వివేకవర్థిని’ పత్రిక స్థాపించి ఉద్యమానికి సాధనగా వాడాడు. పత్రికా ప్రచురణను చేపట్టి ఆయన భావితరాలకు మంచి బాటను చూపాడు. ఈనాటి పత్రికలు ఆయన బాటలో నడిచి నైతిక విలువలను కాపాడుకోవాలి.



వీరేశలింగంతోపాటు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి అన్ని కార్యక్రమాలలో ఆయనకు చేదోడుగా ఉండి ఆంధ్రదేశ సాంఘిక చరిత్రలో తన పేరును కూడా చిరస్థాయిగా నిలుపుకున్నారు.



మహీధర రామమోహనరావు రచన – ‘ఇక ఆ కథ ఇంతే’లో స్త్రీల చదువులు, ఉద్యోగాలు వారి వైవాహిక జీవితంలో సృష్టించే కల్లోలాలను అతి సహజంగా, కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. ఇందులో రాజ్యలక్ష్మి, ప్రభాకరం భార్యా భర్తలు. ప్రభాకరం తన దుందుడుకు ప్రవర్తనతో ఉద్యోగం పోగొట్టుకొని భార్య, కొడుకుతో సహా కష్టాలపాలయ్యాడు. రాజ్యలక్ష్మి గ్రామసేవికగా ఉద్యోగం చేపట్టి కుటుంబాన్ని నడుపుతుంది. మొదట్లో బాగా ఉన్నా రాను రాను భార్యను అనుమానించి మాటల తూటాలతో హింసిస్తూ పోతారు. చివరికి భరించలేక అతన్ని వదిలి వెళ్ళాలని అనుకున్నా వదిలి వెళ్ళరు. కారణాలనేకం. అలోచనలలో ముందడుగు ఆచరణలో వెనకడుగు వేసే రాజ్యలక్ష్ములు కోకొల్లలు మన సమాజంలో. ఈ వెనుకబాటువల్ల ప్రభాకరం లాంటి మగవారి దృష్టిలో స్త్రీలు పలుచనైపోయారు. కాని రచయిత్రి నిరాశచెందలేదు. ఆడవారి ఈ పరిస్థితికి చదువుకొని, ఉద్యోగాలు చేస్తూన్న స్త్రీలలో మార్పు వస్తుందని, కొంతకాలం పడుతుందనీ అంటారు ఆమె. ‘ఇక ఈ కథ ఇంతేలే’ అని నిస్పృహ చెందనవసరం లేదంటారు.



ఇలా స్త్రీల అభ్యున్నతి కోరి, సమాజ హితం దృష్ట్యా చక్కని రచనలు మనకందించిన డా.కనుపర్తి విజయ బక్ష్ కి ధన్యవాదాలు. మరెన్నో రచనలు ఆమె నుండి ఆశిద్దాం.



పూజలు, పునస్కారాలు, అనాదిగా వస్తున్న ఆచారాలతో ఎక్కువ కాలం గడుపుతున్న స్త్రీలు గూడా ఇలాంటి పుస్తకాలు చదవగలిగితే వారి విజ్ఞాన పరిధిని పెంచుకోవటం సాధ్యం. మగవారు చదివి వారి ఆలోచనా విధానాన్ని, ఆచరణను మార్చుకునే అవకాశం చాలా ఉన్నది. భార్యను భరించేవాడు భర్త అని ఈనాటికీ నమ్ముతున్న ఈ సమాజంలో స్త్రీ జనాభ్యుదయం ............ తేరుకుని ఆశించిన మార్పు భవిష్యత్తులో చూడగలమనే ధీమా మనకుండటం, సహజం. అలా జరుగుతుంది తప్పకుండా. భార్యాబాధితులుగా కొందరు భర్తలుండి ఉండవచ్చు. అలాంటి వారికి మా సానుభూతి ఎప్పుడూ వుంటుంది.



- వెనిగళ్ళ కోమల



అమెరికాలో నివాసం

No comments:

Post a Comment