హైటెక్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

హైటెక్ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు
(1950- )
ఎన్టీ రామారావుకు అల్లుడు కాకముందు చంద్రబాబు నాయుడు నాకు పరిచయమయ్యాడు. 1977లో హైదరాబాదులో పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్సులో బండారు రత్న సభాపతి వద్ద కూర్చుని ఉన్నాము. సాయంత్రం నేను, ఎస్.వి. పంతులు, రత్నసభాపతి కబుర్లు చెప్పుకుంటూ మొదటి పెగ్గులో ఉండగా హఠాత్తుగా నారా చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం వచ్చారు. ఎక్కడో కోట్లాడుకుని, హడావుడిగా వచ్చినట్లు ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడుతో నాకు పరిచయం లేదు. తిరుపతి నుండి సరాసరి వచ్చామని, అక్కడ విద్యార్థుల మధ్య కోట్లాటలు జరిగాయని, ముఖ్యంగా కమ్మ, రెడ్డి కులాల మధ్య పోట్లాటలు విపరీతంగా ఉన్నాయని వారి మాటలను బట్టి మాకు తెలిసింది. వారు చెప్పిందంతా విని, రత్న సభాపతి ఫోన్ తీసుకుని నేదురుమల్లి జనార్ధన రెడ్డితో మాట్లాడాడు. ఈ కోట్లాటల వ్యవహారం మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని గట్టిగా చెప్పారు. అట్లా తొలిసారి చంద్రబాబు నాయుడ్ని చూడటం జరిగింది. మరుసటి సంవత్సరం ఎం.ఎల్.ఎ.గా ఎన్నికై చంద్రబాబు నాయుడు వచ్చి న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో ఉన్నారు. ఆయనతో పాటు లక్ష్మీనారాయణ ఉండేవారు. అప్పుడు నేను అక్కడ కొల్లూరి కోటేశ్వరరావు క్వార్టర్ లో ఉంటూండేవాడిని. రెగ్యులర్ గా మేము కలుసుకోవటం, నేను అసెంబ్లీకి సంబంధించిన ప్రశ్నలు, కాల్ అటెన్షన్ మొదలైనవి రాసిస్తుండేవాడిని. ఆ విధంగా మా పరిచయం బాగా పెరిగింది. తరువాత చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని దూరంగా పెట్టారు. వారిరువురూ చాలా స్నేహంగా కలిసి ఉండేవారు. వారితో పాటు కె.ఇ, కృష్ణమూర్తి, కరణం బలరాం ఉండేవారు. మేము చాలా తరచుగా కలుసుకునేవాళ్ళం. అచిర కాలంలోనే చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్.లో ఇల్లు తీసుకుని మారారు. ఆయనతో పాటు ఎన్నోసార్లు భోజనాలు చేస్తూ విషయాలు చెప్పుకునేవాళ్ళం. రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళం. అప్పట్లో పి. రాజగోపాల నాయుడు వస్తుండేవారు. ఆయన చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు గురువు. వారంతా ఆచార్య రంగా శిష్యులు. అలా జరుగుతుండగా చెన్నారెడ్డి మారిపోవటం, అంజయ్య ముఖ్యమంత్రి కావటంతో అటు రాజశేఖర రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత వహించారు. అదే సమయంలో ఎన్.టి. రామారావు కుమార్తెను చంద్రబాబు నాయుడు పెళ్ళి చేసుకునే విషయం వచ్చింది. స్ట్రేట్ మంత్రిగా చంద్రబాబు నాయుడు పశుసంవర్థక శాఖను, వైఎస్. రాజశేఖర రెడ్డి మెడికల్ సర్వీసెస్ ను నిర్వహించారు. ఆ తరువాత అంజయ్య తన జంబో జెట్ మంత్రి వర్గాన్ని కుదించగా అందులో చంద్రబాబుకు గ్రంథాలయాలు, రాజశేఖర రెడ్డికి గ్రామీణాభివృద్ధి ఇచ్చారు. ఎన్.టి. రామారావును రాజ్యసభకు తీసుకు రావాలనే ప్రతిపాదన కూడా అప్పుడే కొంత మేరకు సాగేది. తరువాత భవనం వెంకటరామ్ ముఖ్యమంత్రి కావటం. అందులో రాజశేఖర రెడ్డి ఎక్సైజ్ మంత్రిగా ప్రాధాన్యతలోకి రావటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడుకి మైనర్ ఇరిగేషన్ స్టేట్ మంత్రిగా ఇచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఎలాగైనా చంద్రబాబు నాయుడుకు క్యాబినెట్ ర్యాంకు ఇప్పించాలని ప్రయత్నం చేశారు. నన్ను కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు భవనానికి చెప్పమన్నారు. అయితే అలాంటి నిర్ణయాలు కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం చేస్తుంది కనుక ఒక పట్టాన చంద్రబాబుకు క్యాబినెట్ రాలేదు. నేను మాత్రం చాలా తరచుగా చంద్రబాబును ఆయన ఛాంబర్ లో కలసి సలహాలు చెబుతుండేవాడిని. ఆ తరువాత విజయభాస్కర రెడ్డి మంత్రి వర్గం రావటం, అందులో రాజశేఖర రెడ్డికి విద్యాశాఖ, చంద్రబాబుకు సాంకేతిక విద్య వచ్చాయి.
చంద్రబాబు నాయుడు మరోవైపున ఎన్.టి. రామారావు అల్లుడు కావటంతో రాజకీయాల్లో కొన్ని మార్పులు అనిపించాయి. కాంగ్రెస్ లోనే కొనసాగిన చంద్రబాబు 1982 ఎన్నికలలో పోటీ చేసి తెలుగుదేశం చేతిలో ఓడిపోయారు. ఒకటి రెండు ప్రకటనలలో తన మామ ఎన్.టి. రామారావుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. కానీ తెలుగుదేశం ప్రభంజనంతో అత్యధిక సంఖ్యా బలంతో గెలిచినప్పుడు ఎన్.టి. రామారావు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హైదరాబాద్.లో లాల్ బహదూర్ స్టేడియంకు వచ్చి హాజరయ్యారు. క్రమంగా కాంగ్రెస్ కు దూరమై, తెలుగుదేశంలో చేరి, ప్రాధాన్యత వహిస్తూ పోయారు. తొలుత పదవులు లేకపోయినా రాను రాను పార్టీలో రామారావు అల్లుడిగా ఆయనకు చాలా ప్రాముఖ్యత లభించింది. రాజకీయ అనుభవం వల్లన చంద్రబాబు ఆ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాడు.
నేను హైదరాబాద్ ఆదర్శ్నగర్ లో ఉంటుండగా చంద్రబాబు మా ఇంటికి అనేక పర్యాయాలు వచ్చారు. అలాగే నేనూ ఆయన ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ముఖ్యంగా భవనం వెంకటరాం ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు కూడా వచ్చేవారు. ప్రతిసారీ తిరుపతి లడ్డూ తెచ్చేవారు. కానీ మా ఇంట్లో ఆయన మాత్రం ఏమీ పుచ్చుకునే వారు కాదు.
చంద్రబాబు ఏదైనా విషయం చెబితే అసెంబ్లీ పరంగా గానీ, బయటగానీ బాగా గ్రహించేవారు. తనకు నచ్చితే అమలు పరచేవారు. ఆయనకు నేను సన్నిహితంగా ఉండటం గమనించి చాలా మంది రికమండేషన్స్ కు వచ్చేవారు. అది నాకు గిట్టదు కనుక చెప్పేవాణ్ని కాదు. ఆ కోపం చాలా మందికి ఉండేది. నంద్యాలలో రేణుకా చౌదరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల ఖర్చులకు డబ్బు ఇప్పించమని చంద్రబాబుకి చెప్పి త్వరగా పని జరిగేటట్లు చూడమని నన్ను కోరింది. అయితే ఆమె సంపన్నురాలనీ, ఆమెకు పార్టీ నిధి అక్కర లేదని చంద్రబాబు అంటుండేవారు. ఎన్.టి. రామారావుపై తిరుగుబాటు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను లాంఛనంగా కలిసినా అభినందనలు చెప్పలేకపోయాను. ఆ తర్వాత కలియటమే మానేశాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన న్యూయార్క్ వచ్చారు. నా కుమారుడు అప్పుడు వాల్ట్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేస్తున్నాడు. అక్కడకు వచ్చిన చంద్రబాబు నా కుమారుడిని కలిసి ఇండియాకు రమ్మని ఆహ్వానించారు కూడా. ఆయన ఉన్నాడని తెలిసినా నేను కలవలేకపోయాను. ఏమైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కలయిక తగ్గిపోవటమే కాక అరుదు అయింది.
ప్రజాస్వామ్యం కోసం ఎన్.టి.రామారావు పక్షాన తీవ్రంగా పోరాడి సంక్షోభాన్ని ఎదుర్కొన్న చంద్రబాబునాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. శాసన సభ్యులను కాపాడుకుని హైదరాబాదు నుండి ఢిల్లీకి, మైసూరుకు, బెంగుళూరుకు తరవాత హైదరాబాదుకు తెచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటంలో కీలక పాత్ర వహించారు. అలా చేస్తున్నప్పుడు నేను బెంగుళూరులో విద్యామంత్రి రఘుపతి ఇంటికి వెళ్ళి ఉదయం తేనీటి విందులో చంద్రబాబునాయుడును అభినందించాను. హైదరాబాదుకు బయల్దేరుతూ ఆ కాన్వాయిలో నన్ను కూడా రమ్మన్నాడు. వెంకయ్య నాయుడు, జయపాల్ రెడ్డి, పర్వతనేని ఉపేంద్ర మొదలైనవారు అప్పుడు ఉన్నారు. నేను బెంగుళూరు వెళ్ళి కాట్రగడ్డ ప్రసూన మొదలైన శాసన సభ్యులు కలిసి నాదెండ్ల భాస్కరరావు ఉచ్చులో పడవద్దని చెప్పాను. అదే చంద్రబాబునాయుడు కొన్నేళ్ళ తరవాత భాస్కరరావు అడుగుజాడలలో అప్రజాస్వామికంగా ఎమ్.ఎల్.ఎ.లను వైస్రాస్ హోటలులో అట్టిపెట్టి విద్రోహ చర్యకు పూనుకొనటం బాధాకరమనిపించింది. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన గెలిచి రావడం రాష్ట్రాన్ని అంతర్జాతీయ రంగంలో పరిచయం చేయటం అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ను తీసుకురావటం సాంకేతిక హైటెక్ రంగాన్ని బాగా పోషించటం అభినందనీయమైంది.

3 comments:

Anonymous said...

చంద్ర బాబు నాయుడు 1) ఎం ఎల్ యే లను వైస్రాయి హోటల్లో అక్రమం గా నిర్బంధించాడా?
2) లేక డబ్బు కీ పదవి కీ ఆశ పడి వారే స్వఛ్ఛందం గా చంద్ర బాబు కి సపోర్ట్ చేశారా?
3) ఇదీ కాక ఎన్ టీ ఆర్ మరియూ లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి తో విసిగి పోయి వాళ్ళు చంద్ర బాబు ని సమర్ధించారా?
ఈ విషయాలు మీకు తెలిస్తే చెప్పవలసింది. ఎందుకంటే, 1 విషయం లో ఖఛ్ఛితం గా చంద్ర బాబు ని తప్పు పట్టవలసినదే. 2 విషయం లో ఎం ఎల్ యే లనీ చంద్ర బాబునీ తప్పుపట్ట వలసినది. 3 విషయం లో ఎన్ టీ ఆర్ ని తప్పు పట్టాలి.
ఆ రోజు ఏది జరిగింది అనే విషయం తెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం లోని నిజం ఎంతో తెలుస్తుంది.

Unknown said...

manchi vishalu cheypparu. inkastha vipulamgaa vuntey marinni vishayaalu maaku theyliseyvi.

mahesh

Unknown said...

BABU GARU MUKHYAMANTRIGA UNNAPPUDU ETUVANTI VIMARSALAKU THAVIVVAKA MANCHI PARIPALANA CHESARU. AA SAMAYAMALO AAYANA AA PANI CHEYAKUNDAUNDIUNTE RASHTRAM INKA ADHOGATHI PALAYYEDI

Post a Comment