భగవద్ గీత నిజానిజాలు- నార్ల వెంకటేశ్వర రావు

The Truth about the Gita

పీఠిక
దేశ విదేశాలలో కొందరు గొప్పవారు భగవద్గీతను గొప్పమత గ్రంథంగానూ, తత్వం, నీతి రంగాలలో తిరుగులేని మార్గ దర్శిగానూ, సామాజిక విజ్ఞాన రంగాలకు సైతం ఆదర్శవంతమైనది గానూ భావించారు. వారిపై నేను తీవ్ర విమర్శచేశాను. అందుకు క్షమాపణ కోరడం లేదు. వారెంత గొప్ప వారైనా ఒక్క విషయంలో లోపభూయిష్టులే. వారికి ఆధునిక మనస్తత్వం లేదు.
ఆధునిక మనస్సు అంటే ఏమిటి? అంధ విశ్వాసాన్ని యీసడించడం, మూఢ నమ్మకాన్ని త్రోసిపుచ్చడం, పిడివాదాన్ని గర్హించడం, మాయ మాటల్ని కాదనడమే ఆధునిక మనస్సు. వివేచనాత్మకంగా, విజ్ఞాన పూరితంగా ఆలోచించడమే ఆధునిక మనస్సు పని. హేతుబద్ద కొలతకు నిలవలేని దానిని నిరాకరించడమే ఆధునిక మనస్సు. స్వేచ్ఛగా, సాహసోపేతంగా, కొత్త పరికల్పనలతో, తెలియనిది తెలుసుకుంటూ పోవడమే. భూమి విశ్వంలో ఒక అణువు మాత్రమే. దానిని గురించి, జీవితాన్ని గురించి, విశాల విశ్వం గురించి తెలుసుకుంటూ పోవడమే ఆధునిక మనస్సు.
ఆధునిక మనస్సుకు కేంద్రం దేవుడుకాదు, మానవుడు. ఆ మనస్సుకు జాతి, మతం, దేశం, వర్గం, కులం అడ్డం రావు. సంకుచితం, తలబిరుసుతనం, అల్పత్వం, స్వార్థం ఆధునిక మనస్సుకు దూరం. ఆధునికుడు యీ ప్రపంచాన్ని పట్టించుకుంటాడు, మరో లోకాన్ని కాదు.` నేను నీ సృష్టికర్తను` అని ఎవరైనా అంటే,` పోవోయ్, నాకునేనే సృష్టికర్తను. నేను పరిణితి చెందుతున్నాను. నా బాల్యదశలో భయం, అజ్ఞానం వలన ఎందరో దేవుళ్ళను దేవతలను సృష్టించాను. అలాగే స్వర్గాలను నరకాలను పుట్టించాను. వాటన్నిటినీ కూలగొడుతున్నాను` అంటాడు.
అలాంటి ఆధునిక మనిషికి గీత చాలా మొరటుగానూ, ఆదిమ దశగానూ, అర్థ సత్యంగానూ, పరస్పర విరుద్ధాలుగానూ, ఆధారాలు లేని మాటలతోనూ, ఘోరమైన విషయాలతోనూ, కనిపించడం సహజం. డి.డి. కోశాంచి దృష్టిలో గీత- పరస్పర విరుద్ధాలను సమన్వయించే సంస్కృత రచన మాత్రమే., వ్యతిరేక విరుద్దాలను దిగమింగే ప్రయత్నం జరిగింది.
నా రచనలన్నింటిలో యీ రచన నాకు సంతృప్తినిచ్చింది. స్వాతంత్ర్యం రావడంతో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తామని ఒకప్పుడు అనుకునేవాడిని. కాని తిరోగమన వాదం ఉప్పెన వలె వచ్చిపడడం చూస్తుంటే విచారంగా వుంది. 1947కు ముందు కంటె, నేడు మనం మూఢనమ్మకాలతో, ఛాందసంతో, మాయ మాటల గారడీలతో వున్నాం. మన స్వాతంత్ర్యం భ్రమగా తయారైంది. మనస్సుకు బంధాలుంటే, స్వేచ్ఛ ఎలా వస్తుంది? ప్రజాస్వామిక సంస్థలున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛా వ్యవస్తలు కనిపిస్తున్నా, సరైన అర్ధంలో మనకు స్వేచ్ఛ లేదు.
ఈ స్థితిని వివరించడం ఎలా? జాతీయోద్యమం తిరోగమనంలో ప్రారంభించి కొనసాగిందని, వెనక్కు తిరిగి పరిశీలిస్తే అవగాహన అవుతుంది. బంకించంద్ర ఛటర్జీ, వివేకానంద, బిపిన్ చంద్రపాల్, లజపతిరాయ్, అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్, గాంధీ వంటి విభిన్న జాతీయ నాయకులకు ఉత్తేజాన్ని కలిగించింది భగవద్గీత. గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సెకు సైతం అదే పవిత్ర గ్రంథం! మన స్వాతంత్ర్యానంతరం అందకారంలోకి ఎలా ప్రవేశించామో దీన్ని బట్టి ఆశ్చర్య పడనక్కరలేదు. జ్యోతిష్యం ప్రకారం స్వాతంత్ర్య మూహూర్తం నిర్ణయించారు. అదంతా చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఈ తిరోగమన ఉపద్రవాన్ని 76 ఏళ్ళ వయస్సులో తిప్పి గొట్టగలనా? చేయగలననే నా విశ్వాసానికి యీ పుస్తకమే నిదర్శనం. అదే నాకు సంతృప్తినిస్తున్నది.
ఈ పుస్తకరచనకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి. డా. వై. వెంకటేశ్వరరావు, డా. డి. ఆంజనేయులు, డా. పి.ఎస్.ఎన్. మూర్తి యీ రచన చదివి అనేక సూచనలు చేశారు. అయితే యీ రచనలోని అభిప్రాయాలకు వారెవరూ బాధ్యులుకారు. అవి కేవలం నావే.
యువతరానికి ఒక విజ్ఞప్తి. ప్రపంచం అత్యంత వేగంగా మారుతున్నది. ప్రతి పదేళ్ళకు యీ వేగం చాలా ఎక్కువగా వుంటున్నది. గత 80 ఏళ్ళలో చాలా మార్పువచ్చింది. చాలా మంచి జరిగింది. ఇంచుమించు అంతే చెడుకూడా వుంది. ప్రపంచ ప్రళయం జరగకుండా ఆపే ప్రయత్నాలు జరిగాయి. మార్పుకు అనుగుణంగా, ఉపద్రవాలను అడ్డుకొంటూ, మనం సాగిపోవాలి. ఇందులో యువత బాధ్యత చాలా వుంది. గీత తెచ్చిపెట్టిన పాత అలవాట్లనుండి బయటపడాలి. అలాగే ప్రపంచంలో పవిత్రగ్రంథాల పాత బంధాలు కూడా తెంచాలి. కొత్త భావనలు, కొత్త విలువలు రాకుంటే ప్రపంచంలో జీవన రంగం అదృశ్యమౌతుంది. మన ఆశలు, భవిష్యత్తు అన్నీ పోతాయి.
- నార్ల వెంకటేశ్వర రావు


పరిచయం
ఈ పుస్తకాన్ని గీతామిధ్య అంటే సరిగ్గా ఉంటుంది. గీతను గురించి చెప్పేదంతా సందేహాస్పదమే. కురుక్షేత్రంలో నిజంగా పోరాటం సాగిందా. ఒకవేళ అది జరిగి ఉంటే దేశవిదేశాలలోని తెగలన్నీ ఏదొక వైపు కోపు వేసుకున్నాయా? యుద్ధం ఎప్పుడు జరిగింది? అర్జునుడు, రథసారధిగా కృష్ణుడు ఉన్నాడా. అనేక యుద్ధాలు గెలిచిన అర్జునుడు దుర్యోధనుడి అపార బలగాన్ని జూచి కలవరపడ్డాడా? బంధు మిత్రులనందరినీ చంపాలనే ఆలోచనతో చలించి పోయిన అర్జునుడు కృష్ణుడి ప్రోత్సాహం వలన భీభత్సకాండ జరిపాడా? కృష్ణార్జునుల సంవాదం సాగుతుండగా ఇరువైపులా సైన్యాలు చూస్తూ నిలబడి పోయాయా?
కురు క్షేత్రంలో కృష్ణుడు చెప్పిన భగవద్గీత మనకెలా వచ్చింది? మహాభారతం ప్రకారం హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ణుడికి ఏ రోజు కారోజు సంజయుడు నివేదించటంతో గీతకూడా వచ్చింది. కృష్ణుడి నోటి నుండి ఊడిపడిన ప్రతిమాటనూ పొల్లు పోకుండా సంజయుడు వృధ్ధుడైన, గుడ్డి అయిన ధృతరాష్ర్టుడికి అందించాడు. యుద్ధరంగంలో ఎవరికీ కనిపించకుండా, ఆయుధాల తాకిడికి దెబ్బతినకుండా యధేచ్ఛగా సంజయుడు సంచరించాడు. అతనికి పగటికి-రాత్రికి తేడా లేదు. అలసట లేదు. నిర్విరామ కృషి చేశాడు. అందరి మనస్సుల్లోని ఆలోచనలు గూడా చెప్పగలిగేవాడు.
సంజయుడు ఇదంతా ఎలా చేశాడు? నేటి శాస్ర్తీయ సాంకేతిక పరమైన రెడియో, టెలివిజన్, వీడియోలు సహితం తలవంచుకునేటట్లు సంజయుడు ఎలా చేశాడు? అది చొప్పదంటు ప్రశ్న అని సాంప్రదాయ వాదులు అంటారు. పూర్వం రుషులకు దివ్యశక్తులుండేవట. వరాలివ్వటంలో వ్యాసుడు అత్యున్నత స్థాయిలో ఉండేవాడు. కురురాజు ధృతరాష్ర్టుడు యుద్ధ విశేషాలను సంజయుడి ద్వారానే తెలుసుకోటానికి వీలుగా అన్నిటినీ వివరించేవరాన్ని యివ్వమని కోరగా వ్యాసుడు ప్రసాదించాడు. అది కేవలం యుద్ధం చివరి రోజున సంజయుని పట్టుకొని చంపబోతున్న సాత్యకికి వ్యాసుడు అడ్డుపడ్డాడు. (Sorensens : An Index to the names in the Mehabharata, 1963 : Delhi, Page 6-9).
ధృతరాష్ర్టుడు వ్యాసుని ధర్మసంతానంలో ఒకడు, వ్యాసుడు సహితం సత్యవతి-పరాశరులకు పెళ్ళికి ముందే పుట్టినవాడు. వ్యాసుడికి అక్రమ సంతానం నలుగురు పుత్రులున్నారు.
మహాభారత కాలంలో తాగుడు, జూదం, పశువులను అపహరించటం, కన్యలను ఎత్తుకుపోవటం సాధారణంగా ఉండేవి. మూకుమ్మడి హత్యలు సాగేవి. సింహాసనాధి పత్యం కోసం, నరక ప్రాప్తి తప్పించుకోటానికి వేరేవారితో నైనా కొడుకుల్ని కనటం ఆమోదించారు. ఆవిధంగానే తల్లిమాటల్ని పాటించి అంబికా, అంబాలికలను వ్యాసుడు గర్భవతుల్ని చేశాడు. వారి భర్త చనిపోయినందున భరత వంశం కొనసాగే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి విధానాలు ఆనాడు చాలా జరిగాయి.
వ్యాసుడు దైవ సమానుడు. అలా భావించిన సంప్రదాయవాదులు అతన్ని పైకెత్తారు. అంబికకు పుట్టిన ధృతరాష్ర్టుడు వ్యాసుని గుడ్డి సంతానం. అంబాలికకు వ్యాసునిద్వారా పుట్టిన పాండు రాజు రోగిష్ఠి, మరొక కుమారుడు విదురుడు వివేకి, ఆరోగ్య వంతుడు కాని, అతడి తల్లి శూద్ర యువతి కావటం వలన విదురుడికి సింహాసన హక్కు దక్కలేదు. వ్యాసుణ్ణి ఈసడించుకున్న అంబిక తన సేవకురాలిని అతనికి అప్పగించింది. వ్యాసుడి నాల్గవ సంతానం శుకుడు. వ్యాసుడి రేతస్సు నుండి క్షణికంగా శుకుడు పుట్టాడు. ఇంద్రుని కొలువులో ఒక అప్సరను చూచి రేతస్సు చిందించగా శుకుడి జన్మ జరిగింది.
పాండవులందరూ అక్రమ సంతానమే. కుంతికి పుట్టిన ముగ్గురికీ తండ్రులు ముగ్గురు. మాద్రికి పుట్టిన కవలలకూ అంతే. పెళ్ళికాక ముందు కుంతి కర్ణుడిని కన్నది. సత్యవతి వలెకాక, కనగానే కుంతి కర్ణుడిని వదిలేసింది. ఇలాంటి చర్యలన్నింటికీ అతిలోక ముసుగు కప్పి మహాభారతం నింపారు.
భరత వంశానికే కాక ఇతర రాచరికాలలోనూ లైంగిక స్వేచ్ఛ బాగా ఉండేది. కంసుడు మధుర రాజు ఉగ్రసేనుడి కొడుకు, కృష్ణుడి మేనమామ. దానవుడు రాణిని చెరచగా కంసుడు పుట్టాడు. పాంచాల రాజు దృపదుడి పుట్టుక అంతే. అతడి సంతానం ద్రౌపది, దృష్టద్యుమ్నుడు. రాజు యజ్ఞం చేస్తూ రాణిని తనతో సంభోగించమంటాడు. ఆమె రుతువులో ఉన్నందున ఆగమంటుంది. కాని, యజ్ఞ సమయం ఆగకూడదు. గనుక, యజ్ఞ గుండంలో నుంచి ద్రౌపది, దృష్టద్యుమ్నుడు పెద్దవారు గానే పుడతారు. ద్రౌపది కారు నలుపు. అందువలన ఆమెను కృష్ణ అని పిలిచేవారు. కాని, ఆమె అందగత్తె, పాండవులు ఐదుగురికీ భార్య అయింది.
సంప్రదాయవాదుల ప్రకారం ఇదంతా యజ్ఞ ఫలం కావచ్చుగాని, ఆనాడు రుషులు యధేచ్ఛగా సెక్స్ ఆచరించిన ఫలితమని చెప్పవచ్చు. అక్రమ సంతానం నాడు విచ్చలవిడిగా ఉండేదో, అందుకు ద్రోణకృపాచార్యుల ఉదాహరణ చూపవచ్చు. వైదిక కర్మకాండలో అదొక భాగం. (Maxmuller : A History of Ancient Sanskrit Literature 1968, Varanasi, Page : 40).
మహాభారతాన్ని పంచమ వేదంగా సంప్రదాయవాదులు స్తుతిస్తారు. అది విజ్ఞాన సర్వస్వం అంటారు. అందులో లేనిది ఎందులోనూ లేదంటారు. మహాభారతం వ్యాసుడి విషమ పుత్రిక.
కృష్ణుడు గీత పేరిట అర్జునుడికి ఉపదేశించిన దేమిటో చూద్దాం. సంజయుడు యుద్ధ విలేఖరి. ధృతరాష్ర్టుడికి సాయంత్రానికల్లా పూర్తి చిత్రణ యిచ్చేవాడు. వ్యాసుడు అలాంటి అద్భుతాన్ని ప్రసాదించాడు. నాలుగు వేదాలను పరిష్కరించిన వ్యాసుడు మహాభారతాన్నీ, అష్టా దశ పురాణాలను, బ్రహ్మ సూత్రాల్ని, మరెన్నింటినో రాశాడు. ఈ ఉద్ర్గంధాలలో గీత వంటిది అతనికి మంచి నీళ్ల ప్రాయం. కురుక్షేత్రయుద్ధా నంతరం ఎన్నో సంవత్సరాలకు గాని అది రాయలేదు. మహాభారతంతో పాటు గీతను తన కుమారుడికీ, నలుగురు శిష్యులకూ చెప్పాడు. అందులో ఒకరు వైశం పాయనుడు. గురువువలె అతడిదీ బహుముఖ మేధస్సు. అర్జునుడి ముదిమనుమడు జనమేజయుడు నాగవంశాన్ని మట్టుపెట్టడానికి యజ్ఞం తలపెట్టాడు. (ప్రతి యజ్ఞానికీ పురోహితులకు బంగారం, ఆవులూ, ఆడపిల్లలూ దక్కేవారు) యజ్ఞ సమయంలో గీతతో కూడిన మహాభారతాన్ని వైశంపాయనుడు పారాయణం చేశాడు. అది విన్న సౌతి, ఉగ్రశ్రవుడు మహాభారత గీతను శౌనకాదిమునుల నిమిత్తం నైమిశారణ్యంలో పన్నెండు సంవత్సరాల యజ్ఞకాలంలో చెప్పాడు. ఆ తరువాత ఎవరు పారాయణ చేశారో తెలియదు.
గీత చెప్పిన కృష్ణుడికీ, అది పారాయణం చేసిన సౌతుడికీ వందేళ్ళ తేడా ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం యుధిష్టిరుడు 36 ఏళ్ళు పరిపాలించాడు. జనమేజయుడు నాగవంశాన్ని మట్టుపెట్టాలని తలపెట్టటానికి కారణం తన తండ్రి పరీక్షిత్తును వారు చంపటమే. నైమిశారణ్యంలో శౌనకుడు నాగయజ్ఞం ఎప్పుడు తలపెట్టాడో కచ్చితంగా తెలియదు. (Sitanath Pradhan : Chronology of Ancient India, Calcutta, 1972, Page : 71) కృష్ణుడి గీతాబోధనకూ, సౌతుడి పారాయణానికి, ఒక శతాబ్దం తేడా ఉంటే, ఆ తరువాత గీత వ్రాత పూర్వకంగా రావటానికి కొన్ని శతాబ్దాలు గడిచింది. సంప్రదాయవాదుల ప్రకారం అయితే ఇది వేలలో ఉంటుంది. అన్నాళ్ళు కృష్ణుడు చెప్పిన గీత యధాతథంగా ఉందనటానికి వీలులేదు.
గీత కంటె ఇంకా ఎక్కువ కాలానికి గాని వేదాలు రాతకు నోచుకోలేదనీ, అయినా, ఉచ్చారణతో సహా యధాతథంగా దిగుబడి అయ్యాయనీ సంప్రదాయ వాదులంటారు. గీత వేదంకాదు. దీని ప్రమాణాన్ని అందరూ అంగీకరించటం లేదు. 8వ శతాబ్దంలో ఉన్న ఆదిశంకరాచార్యుడు గూడా. గీతను ఎవరూ పట్టించుకోలేదు. బౌద్ధాన్ని ధ్వంసం చేయటానికి సాధనంగా గీతపై శంకరుడు వ్యాఖ్యానం రాశాడు. ఆర్య సమాజవాదులూ, బ్రహ్మ సమాజ వాదులూ, గీతకు అట్టే విలువ యివ్వరు. కనుక వేదాలకూ, గీతకూ సామ్యం చూపటం సబబు కాదు.
గీత రూపొందిన తీరూ, అది అందించిన వక్రమార్గం గమనిస్తే అదొక మిధ్యగా పేర్కొనవచ్చు. అలెగ్జాండర్ పోప్ వదంతులను గురించి చెప్పిన మాటల్ని గీతకు అన్వయించవచ్చు.
నేను కాలేజి రోజుల్లో తొలుత గీతను చదివాను. ఆ తరువాత దానిపై భాష్యాలెన్నో చూచాను. గీతరచనల, కాలం, ప్రదేశం తరతరాలుగా అందించిన తీరు అన్ని కాలాలకు, అందరికీ సరిపడే తత్త్వం అని ప్రచారం చేయటం అంతా బూటకమే. ఆ మాట పుస్తక శీర్షికకు పెట్టవలసింది. గీతభక్తులు చదవకుండానే పుస్తకం మూసివేస్తారని ఆ పని చేయలేదు. వారిని నా వైపు తిప్పుకోవాలనే భ్రమ నాకు లేదు. కొద్ది మందైనా గీత అల్పత్వాన్ని గ్రహిస్తే నా కృషి వృధా కాబోదు.




అధ్యాయం ఒకటి
సందేహాస్పద సమరం
మహాభారతం అనే పదాన్ని పాణిని వాడాడు. ఏదైనా భరతుడికి సంబంధించిన గొప్పతనానికి విశేషంగా ఈ ప్రయోగం జరిగింది అని హాప్ కిన్స్ రాశాడు. (Edward Washburn Hopkins : A Cambridge History of India, Vol. I. Ancient India, ed. by E.J. Rapson, 1935, Page : 252, 253) భరతునికి సంబంధించిన గొప్ప కావ్యంగా మహాభారతాన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇలియడ్, ఒడెస్సెలకు ఎనిమిదిరెట్లు నేడు భారతం ఉన్నది. (V.S. Suktankar, on the Meaning of Mahabharata, Bombay, 1957, Page.8) భరతుల మధ్య, అంటే కౌరవ-పాండవుల మధ్య కురుక్షేత్రంలో జరిపిన గొప్ప యుద్ధం కూడా ఇందులో ఉందా? అలాంటి యుద్ధం జరిగిందనటానికి ఆధారాలు లేవు.
1. వేద సాహిత్యంలో కౌరవుల ప్రస్తావన ఉన్నది. పాండవుల ప్రసక్తి లేదు. మహాభారతాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన హాప్ కిన్స్ ప్రకారం బ్రాహ్మణాలు, సూత్రాలు కూడా పాండవుల ప్రస్తావన తేలేదు. మాక్స్ ముల్లర్ ప్రకారం కౌరవులు, భరతులూ వేద సాహిత్యంలో వున్నారు. పాండవులు లేరు. పాణిని వ్యాకరణంలోనూ, కౌరవ, భరతుల ప్రస్తావన ఉన్నది గాని, పాండవుల పేరు ఎత్తలేదు. (Maxmuller : A History of Ancient Sanskrit Literature, 1968 Varanasi Page 40)
క్రీ.పూ. 5వ శతాబ్దం మధ్యలో పాణిని జీవితకాలంలో పాండవులెవరో తెలియదు. (V.S. Agravala : India As known to Panini, Luknow, 1953, Page : 455-475).
2. రుగ్వేదంలో భరతరాజు సూదుడికీ, ఇతర తెగలకూ జరిగిన పోరాటాన్ని నేటి రావి నదీ తీరాన (నాటి పరుషణి ఒడ్డున) జరిగినట్లు ప్రస్తావన ఉన్నది. మహాభారత యుద్ధం జరిగి ఉంటే వేద సాహిత్యంలో తప్పని సరిగా పేర్కొనే వారే. వేదాలలో కౌరవ పాండవ యుద్ధం లేదని మాక్స్ ముల్లర్ స్పష్టీకరించాడు.
3. వేద సాహిత్యంలో కురుక్షేత్రాన్ని పవిత్రస్థలంగా పేర్కొన్నారే తప్ప యుద్ధభూమిగా కాదు. (D.C. Sirkar : Mahabharata Myth And Reality, ed. by S.P. Gupta and K.G. Rama Chandra, Delhi, Page.5)
4. వ్యాస, వైశంపాయనులు తైత్తీరీయ, ఆరణ్యకాలలో ప్రస్తావించిన మహాభారత కర్తలు మాత్రం కాదు.
5. కధక సంహితలో కురురాజు ధృతరాఘ్ర్టడి ప్రస్తావన ఉన్నది. అతడికీ, పురోహితుడికీ మధ్య ఒక క్రతువుకు సంబంధించిన వివాదానికి సంబంధించిన విషయం గానే వచ్చింది గాని, కురుక్షేత్ర యుద్ధ ప్రస్తావన లేదు. (A.B. Keith : Cambridge History of India, Vol. I. Page. 119).
6. అధర్వణ వేదంలో సంపన్నరాజుగా పరీక్షిత్ పొగడ్త ఉన్నది. శతపధ బ్రాహ్మణాలలో జనమేజయుడు గొప్ప యాగకర్తగానూ, పురోహితులకు దానం చేసిన వాడు గానూ పేర్కొన్నారు. అర్జునుడి వంశంలోని వాడుగా చెప్పలేదు.
7. మహాభారతంలో అర్జునుడు ఇంద్రుని కొడుకు. శతఫత బ్రాహ్మణంలో అర్జునుడే ఇంద్రుడు. (H.C. Ray Chandhury : An Advanced History of India, London, 1953, Page. 94).
8. ఆక్షౌహిణిలో 21, 870 రధాలు, 21870 ఏనుగులూ, 65, 610 గుర్రాలు, 109, 350 కాల్బలం ఉన్నది. (Dikshintar, V.R. Ramachandra : Wat in Ancient India, Madras, 1944, Page. 198). కురుక్షేత్రంలో కౌరవులకు 11, పాండవులకు 7 అక్షౌహిణులు ఉన్నాయన్నారు. నేడు అంతమంది ఒక చోట కూడటం సులభం కాదు. ప్రాచీన కాలంలో అది అసంభవం. యుద్ధ రంగంలో అంతమందిని ఒక చోట చేర్చటం సాధ్యమయ్యే పని కాదు.
9. కురుక్షేత్రంలో 11,80,980 గుర్రాలున్నాయన్నారు. పదాతిదళం 20 లక్షలన్నారు. కాని యుద్ధ ప్రస్తావనలో ముఖాముఖి పోరాటాలే ఆనాటి సంప్రదాయంగా ఉదహరించారు. (H.D. Sankalia : Mahabharata, Myth and Reality, Delhi, 1976, Page. 145).
10. ఎంత ఉదారంగా లెక్క వేసినా 40 లక్షలకు మించి యుద్ధంలో పాల్గొన్నట్లులేదు. కాని మృతుల సంఖ్య 1660 మిలియన్లని చూపారు. అంటే ఒక్కొక్కరూ 4 వందల సార్లు చనిపోయారన్న మాట. (Pratapchandra Roy : The Mahabharatha Calcutta, Vol 7, Streepartha, Page. 42-43).
11. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలు నాటికాలాన్ని బట్టి మోటైనవి. అంతకంటే ఉన్నత నాగరికతలో పెంపొందిన హరప్పా వాసులు రాతి, ఇత్తడి, రాగి పనిముట్లే వాడారు.
12. భారీ యుద్ధానికి కావలసిన ఇనుప ఆయుధాలు కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానపాత్ర వహించలేదు. క్రీ.పూ. 6వ శతాబ్దంలో గాని ఇండియాలో ఇనుము వాడకంలోకి రాలేదు.
13. మగధ ఆర్యేతర రాజ్యంగా పేర్కొన్నారు. వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రాంతమూ అంతే. కురుక్షేత్రంలో వీరెవరూ పాల్గొనిఉండరు.
14. రవాణా రాకపోకలు ఆదిమ దశలో ఉన్నప్పుడు దూర ప్రాంతాలలో ఉన్న భారీ సైన్యాన్ని రప్పించటం చాలా కష్టంతో కూడిన పని.
15. మహాభారతంలో ప్రాగ్ జ్యోతిష (నేటి అస్సాం) రాజు భగదత్తుడు ప్రధానపాత్ర వహించినట్లున్నది. వేద సాహిత్యంలో ఎక్కడా అతడి పేరు లేదు. పాణినికి కూడా అతడు తెలియదు.
16. యవనులు, శకులు, పల్లవులు యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడారని చెప్పటం అసందర్భం. భారత చరిత్రలో క్రీ.పూ. 5వ శతాబ్దం ముందు వీరి పాత్ర లేదు.
కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్ష్కహిణులున్నాయన్నారు. సమరం 18 రోజులు సాగిందన్నారు. పాండవులలో మిగిలిన వారు ఆరుగురు, కౌరవులలో ముగ్గురు. యుధిష్టిరుడు రెండు 18 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ యుద్ధానంతరం 36 ఏళ్ళకు కృష్ణుడు చనిపోయాడు. 18 పర్వాలలో మహాభారతం చెప్పారు. గీత కూడా 18 అధ్యాయాలలో ఉన్నది. ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు. సంఖ్యాశాస్రంలో నమ్మకం ఉన్నవారు అల్లిన పన్నాగ మే ఇది.
ఆధునిక భారత చరిత్ర కారులలో గౌరవించదగిన ఆర్.జి. భండార్కర్ నిస్సందేహంగా భారత, రామాయణ పురాణాలు చారిత్రకాలు కావన్నాడు. (Collected works, Poona, Vol. I, Page : 365) ఆధునిక విద్య వివేచనతో, ప్రశ్నించే తత్త్వంతో మనకు ఎందుకు రావటం లేదని అతను బాధపడ్డాడు.
ఆర్.సి. దత్. మరొక అడుగు ముందుగు వేసి మహాభారత యుద్ధం కట్టుకథ అన్నాడు. పంచ పాండవులు, ద్రౌపది గూడా అల్లినగాధే అన్నాడు. అతడు రుగ్వేదాన్ని బెంగాలీలోకి అనువదించాడు. శూద్రుడు వేదాల జోలికి ఎలా పోతాడని అతడి పట్ల సనాతనులు గొడవ చేశారు. మహాభారతం, రామాయణాన్ని కూడా ఇంగ్లీషులో సంక్లిప్తంగా అనువదించి అందించాడు. (R.C. Dutt : Civilization of Ancient India, Vol. I, London, 1893, Page : 122).
రామ్ మోహన్ రాయ్ మహాభారతంలో వ్యాసుడు ఆగాధంతా ఊహాజనితంగా పేర్కొన్న విషయం చూపారు. ప్రపంచంలోని ప్రధాన మతాల పవిత్ర గ్రంథాలను పరిశీలించిన రామమోహన్ రాయ్ గీతకు విలువ ఇవ్వలేదు. మతాలపై అతని రచనలలో గీతను పట్టించుకోనేలేదు.
గీత తనకు తల్లివంటిదని, 1889లో తొలుత గీతా పరిచయం ఐనప్పటి నుండీ అలాగే భావించానని గాంధీ అన్నాడు. (M.K. Gandhi, Geetha My Mother) ఐనప్పటికీ మహాభారత చారిత్రకత పట్ల అతనికి సందేహాలున్నాయి. గీత ప్రస్తావించిన సంఘర్షణ మంచి చెడుల మధ్య ప్రతి వ్యక్తిలో జరిగే పోరాటంగా పేర్కొన్నాడు.
వివేకానందుడు చారిత్రకత విషయమై అర్జునుడు, తదితరుల సంగతి సందేహాస్పదమే అన్నాడు. శతపధ బ్రాహ్మణంలో అశ్వమేధ యజ్ఞం సందర్భంగా అందరి పేర్లూ ప్రస్తావించినా, అర్జునుడు తదితరుల పేర్లు లేవన్నాడు. ఐనా, మహాభారతంలో యుధిష్టిరుడూ, అర్జునుడూ, ఇతరులూ అశ్వమేధ యజ్జం చేసినట్లున్నది. (Swami Vivekananda : Thoughts on the Geetha) ఐనప్పటికీ మహాభారతం ఇతి హాసంగా విలువను కాపాడుకుంటున్నదనీ, అందులో గీతకు ప్రాధాన్యత ఉన్నదనీ అన్నాడు. అర్జునుడు కల్పితమైతే, కృష్ణుడు చారిత్రక పురుషుడు కావటానికి వీలులేదు. ఇరువురూ కల్పితమైతే పరస్పరం సంభాషించుకున్నారనటంలో అర్ధంలేదు. గీతను ఎవరో అల్లి మహాభారతంలో చొప్పిస్తే, అది దివ్యవాణి ఎలా అవుతుంది?
మన సంప్రదాయవాదులు భండార్కర్ నూ, దత్ నూ పాత కాలపు చరిత్ర కారులుగా తీసి పుచ్చవచ్చు. రామమోహన్ రాయ్, వివేకానంద, గాంధీలను చరిత్ర కారులు కాదనవచ్చు. కాని డి.డి. కోశాంబిని కాదనగలరా? శాస్ర్తీయ పద్ధతిలో భారతీయ నాణాలను అతడు పరిశీలించాడు. భారత చరిత్రకు మార్క్సిస్ట్ దృక్పధాన్ని అన్వయించాడు. అతడిని ఎంత తోసిపుచ్చినా, చివరకు మార్గగామిగా గుర్తించక తప్పలేదు. అతడి చిత్తశుద్ధిని కాదనలేకపోయారు. రామాయణ, భారతాలలో పేర్కొన్న యుద్ధాలు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో మనకున్న చారిత్రకాధారాల ప్రకారం చెప్పటం అసంభవం అన్నాడు. (D.D. Kosambi : An Introduction to the Study of Indian History)
కురుక్షేత్ర యుద్ధం గొప్ప కల్పితగాధ అని నిస్సందేహంగా పేర్కొన్నారు.
డి.సి. సర్కార్, హెచ్.డి. సంకాలియా కూడా కురుక్షేత్ర యుద్ధం జరగలేదని, కేవలం కుటుంబాల మధ్య, తెగల మధ్య కలహాలు మాత్రమేనని రాశారు.
ఈ అధ్యయనం వలన నాకు మనస్తాపం కలిగింది. హిందువులపై సంప్రదాయ బరువు ఎంత భారంగా పరిణమించిందో అర్థం అవుతున్నది. 41 మంది అధ్యయనం చేసిన వారిలో కనీసం ధైర్యంగా, వివేచనాత్మకంగా, సొంతంగా ఆలోచించిన వారు 6 గురన్నా లేరు. కోట్లాది ప్రజలు వేలాది సంవత్సరాలుగా నమ్ముతున్నదంతా గాధ ఎలా అవుతుందని భావించారు. ఇదే వాదనతో సూర్యచంద్రులకు, రాహుకేతువుల గ్రహణాలు పడుతున్నాయని వీరు నమ్మారు.
మనజాతీయ మనస్తత్వంలో మౌలికంగా దోషం ఉన్నదా. గ్రహణంలో ఉపవాసం ఉండి, తరువాత స్నానం చేసి, తద్వారా సూర్య చంద్రులను కాపాడా మనేవారే వీరంతా. వారు నమ్మకంలో పుట్టారు, నమ్మకాలతోనే పెరిగారు, అలాగే చనిపోతారు. సందేహించే శక్తి వారికి లేదు. ప్రశ్నించే స్వభావం లేదు. వివేచనా పరిశీలనకు దేనినీ గురి చేయలేదు. పాత నమ్మకాన్ని కాదనటం పాపం. ప్రశ్నిస్తే పాతకం, పరిశీలనకు పెడితే నరక ప్రాప్తే అలాంటి వారే మన విశ్వవిద్యాలయాలలో, జాతీయ పరిశోధనాలయాలలో, సాంకేతిక సంస్థలలో వివిధ ప్రభుత్వస్థాయిలలో ఉన్నారు. మన జాతీయ జీవనంలో కనిపిస్తున్న ఉన్మాద ప్రవృత్తిని బట్టి ఘాటైన విమర్శలు చేయక తప్పటం లేదు.


అధ్యాయం రెండు
తప్పుడు సంకేతాలు
భారతదేశ ప్రాచీన చరిత్రలో ఒకే ఒక తేదీ నిర్దుష్టంగా చెప్పవచ్చు. క్రీ.పూ. 327-326లో అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. మిగిలిన తేదీలు ఖచ్చితంగా చెప్పలేక పోటానికి మనకాలచక్రమే కారణం. ప్రభవ, విభవ అంటూ 60 సంవత్సరాల కొకసారి తిరిగి వచ్చే కాలాన్ని ఏర్పాటు చేసుకోటంలో నిర్దిష్టత పోయింది.
విక్రమయుగం, శాలివాహన లేదా శాకయుగాలు ఉన్నాయి. వాటికి కూడా ప్రారంభం ఎప్పుడో తెలియదు. క్రీ.పూ. 58-58 మధ్య విక్రమ యుగం మొదలయిం దంటారు. ఎవరీ విక్రముడు? ఏ చారిత్రక సంఘటన, గొప్ప చర్య ఆధారంగా ఈ యుగం ఆరంభమయింది, స్పష్టమైన సమాధానం లేదు. క్రీ.త. 5వ శతాబ్దంలో హూణులపై జయం సాధించిన విక్రమాదిత్యుడు కావటానికి వీలు లేదు. అంతకు ముందు 600 ఏళ్ళ క్రితమే ఈ యుగం ఆరంభమయింది. చివరి మౌర్య చక్రవర్తిని చంపి సుంగరాజ్యాన్ని స్థాపించిన పుష్యమిత్రుడూ కాదు. క్రీ.పూ. రెండవ శతాబ్దం అనంతరం గాని కుషాణ సామ్రాజ్యం స్థాపన కాలేదు. శాతవాహన సామ్రాజ్యానికి చెందిన గౌతమీపుత్ర శాతకర్ణి కాదు. క్రీ.త. 124-125 ప్రాంతాలలో అతడు శకులను అణచి వేశాడు. విక్రమాదిత్య అనేది బిరుదుగానూ పేర్కొనడం లేదు. విక్రమయుగం ఎలా ప్రారంభం అయిందీ చరిత్రకారులకే ఏకాభిప్రాయం లేదు. క్రీ.పూ. 60లో పంజాబ్-సింధు సామ్రాజ్యాలను స్థాపించిన అజస్ తన పేరే ఆ యుగానికి పెట్టుకున్నాడు. ప్రాకృతంలో యుగం అంటే ఆయం అనిపిలుస్తున్నారు. విక్రమ యుగం ఎక్కడా ప్రస్తావనలో లేదు.
విక్రమ యుగానికి చెందిన చిక్కును తొలగించటానికి చరిత్రకారులు కొందరు కృతయుగం అనీ, మాళవ యుగమనీ తొలుత ఉండేదంటున్నారు. విక్రమ యుగం పూర్తి అయిన సందర్భంగా ప్రచురించిన సంపుటిలో డి.డి. కోశాంబి యిలా రాశాడు. 1943లో విక్రమయుగం 2 వేల ఏళ్ళు గడిచిన సందర్భంగా, దీనికి సంబంధించిన చిక్కును విడదీయలేకపోయారు. పరస్పర విరుద్ధ వ్యాసాలు కేవలం నమ్మకాన్ని సూచించాయి. (An Introduction to the Study of Indian History, Bombay, 1975, Page : 293)
శాలివాహన లేదా శాకయుగం క్రీ.త. 78లో మొదలయింది. ఇందులోనూ విడదీయరాని చిక్కులున్నాయి. ప్రాచీన భారత తేదీలన్నీ అస్పష్టం అయినప్పుడు రామాయణ, మహాభారతాలలో, పురాణాలలో తేదీలు నిర్ధారించటం వృధా రామాయణ, మహాభారతాలు కూడా ఒక విధంగా పురాణాలే. వాటికి తేదీలు నిర్ణయించటం అవివేకమే.
కలకత్తా హైకోర్టులో జడ్జీగా పనిచేసిన బ్రిటీష్ ఐ.సి.యస్. ఆఫీసర్ ఎఫ్.ఇ. పర్గీటర్ ఈ తేదీల నిర్ధారణలో తిప్పలు పడ్డాడు. సంస్కృతం చదువుకొని మార్కండేయ పురాణాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. పురాణాలలో ప్రస్తావించిన రాజ్యాల జాబితా సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి పెద్ద పీఠిక రాశాడు. (F.E. Pargiter : The Purana Text of the Dynasties of the Kaliage : 1962, Varanasi) వీటినే తరువాత మరో పుస్తకంలో పేర్కొన్నారు. (Ancient Indian Historical Tradition) పురాణాల నుండి అతను సేకరించిన చరిత్ర అనేది ఊహ మాత్రమే. చరిత్రకు భిన్నంగా పురాణాలన్నీ గాధలతోనూ, కట్టుకధలతోనూ నిండాయి. విశ్వసృష్టి, ప్రళయం, మళ్ళీ పుట్టటం, మనువు, అతని భార్యలు, సంతతి యిత్యాదుల ప్రస్తావనలున్నాయి. వివిధ రాజుల కాలాలు పేర్కొన్నారు. మధ్యలో మానవుల అసమానతల గొప్పతనాన్నీ, కులాన్నీ సంస్థాగతం చేయడాన్ని యీ గ్రంథాలలో రాశారు. పురోహితులను రాజు కాపాడకపోతే ప్రపంచం నాశనమవుతుందన్నారు. పుట్టుకనుండి చనిపోయే వరకూ, ఆ తరువాత కూడా ఎలా ఉండాలో నియమాలు రాశారు. స్వర్గానికి ఎలా వెళ్ళాలి, అక్కడకు చేరిన తరువాత రంభ, ఊర్వశి, తిలోత్తమ, వరూధినులలో ఎలా అనుభవించాలి అనేవి చిత్రించారు.
అలాంటివాటి నుండి చరిత్రను ఏమేరకు రాబట్టవచ్చు. ఇంచుమించు ఏమీలేదు. పైగా మన నైతిక ప్రవర్తనపై ఆ రచనలు దెబ్బతీశాయి. అదంతా బాధ్యతా రహితమని భావించినా, ఇప్పటికే 2,500 సం.రాలు ఆలశ్యమయింది. మనకు వాల్మీకి, వ్యాసుడు ఎలాగో గ్రీకులకు హూమర్, హీసియాడ్ అలాగ, సోక్రటీస్ నోటితో వారిపై ప్లేటో ధ్వజమెత్తాడు. దేవుళ్ళూ, నాయకులూ తాగుబోతులైతే, జూదరులైతే అబద్ధాలాడితే, భట్రాజులైతే, శృంగారకేళిలో తేలిపోతే, ద్వేషం, అసూయలతో నిండిపోతే, అలాంటి వారిని ఆదర్శంగా చూపి జనం కూడా తమ బలహీనతల్ని కప్పి పుచ్చుకోరా, అని ప్లేటో అడిగాడు. హోమర్, హీసియాడ్లను చదివితే, ప్లేటో ఖండించిందంతా అభినందిస్తాం. ఫ్లేటో రిపబ్లిక్ మూడవ సంపుటిలో యిది చూడవచ్చు. (Translation by Benfaminjo-Wette, 1946) హోమర్, హీసియాడ్ లను ఖండించటంలో ప్లేటో కంటే జెనోఫేన్స్ మరొక అడుగు ముందుకు వేశాడు. నాటక రచయిత యూరిపిడస్ కూడా పుక్కిటి పురాణాలను ఖండించాడు. మన దేశంలో కవులూ, నాటక కర్తలూ, తాత్వికులూ, రామాయణ, మహాభారత పురాణాలపట్ల పరవశం చెందుతున్నారు. వీటి వెనుక ఒక పథకం ఉన్నది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం అనే శక్తులను అడ్డుకోవాలనీ, కులతత్వాన్ని కొనసాగించాలనీ ప్రయత్నిస్తున్నారు. సి. రాజగోపాలచారి, కె. ఎం. మున్షీ మొదలైన రాజకీయ వాదులు స్వతంత్ర భారతదేశంలో హిందూ పురాణాల కోపు వేసుకున్నారు.
నైతిక రంగంలో పురాణాలూ, ఇతిహాసాలు నికృష్టమైనవి. చరిత్రకోసం వాటిపై ఆధారపడకూడదు. ఎ.ఎల్. భాషం యీలా అంటాడు. మహాభారత నాయకులు సమకాలీన ముఠా ప్రభువులు కావచ్చు. కాని చరిత్రకారుడి కవి పనికిరావు. క్రీ.పూ. 10వ శతాబ్దంలో చరిత్రను మహాభారతం ఆధారంగా నిర్మించటానికి పూనుకోవటం వృధా (A.L. Bashgam : The Wonder That was India).
పురాణాలలో చరిత్రకారులకు ఎలాంటి చిక్కులు వస్తాయో శీతానాధ్ ప్రధాన్ గుర్తించాడు. పురాణాలలో ప్రాచీన ఆర్య చరిత్ర లభిస్తుందనుకొంటారు. కాని యిందులో చాలా విరుద్ధ విషయాలున్నాయి. అనేక చోట్ల పురాణాలు భిన్న రీతులుగా చూపుతున్నాయి. విరుద్ధ విషయాలున్నాయి. అనేక చోట్ల పురాణాలు భిన్న రీతులుగా చూపుతున్నాయి. ఒక సామ్రాజ్యాన్ని మరొక దానిలో కలిపేశారు. రాజుల జాబితా పెరిగిపోయింది. రాజ్యాల సంక్రమణ మారిపోయింది. సామ్రాజ్యాలకు కాలం పొడిగించేశారు. ఒకొకసారి ఒకే పేరు వలన అనేక చిక్కులు చోటు చేసుకున్నాయి. (Chronology of Ancient India) అయినప్పటికీ ఈ పురాణాల ఆధారంగానే ప్రాచీన భారత చరిత్ర తేదీలను ప్రధాన్ ప్రస్తావించాడు.
పర్గీటర్ కూడా చరిత్రకారుడుగా పురాణాల్లో అనేక చిక్కులను ఎదుర్కొన్నారు. 80 మంది జనమేజయులూ, 100 మంది నాగులూ, హైహయులూ, ధృతరాష్ర్టులూ, బ్రహ్మదత్తులూ, 200 పైగా భీములూ, భీష్ములూ, 1000కి పైగా శశబిందువులూ అతనికి ఎదురయ్యారు. ఈ జాబితా పూర్తి కాలేదు. వాటితో పర్గీటర్ వంటి వారు విసుగుచెంది పురాణాలు రాసిన బ్రాహ్మణులకు చరిత్రకు, కట్టుకధకు తేడా తెలియాదన్నాడు. చరిత్రకు పురాణాన్నీ, ఇతిహాసాలకు చారిత్రక ముసుగుల్నీ వేశారన్నాడు. బ్రాహ్మణ సాహిత్యంలో చారిత్రక దృక్పధం లేదన్నాడు.
పురాణాలు ప్రాచీన భారత చరిత్రకు తప్పుడు సంకేతాలు. వాటి ఆధారంగా కురుక్షేత్ర యుద్ధ తేదీలను నిర్ణియించ బూనారు.


అధ్యాయం మూడు
తేదీల ఒడిదుడుకులు
కలియుగం అనేది చాలా మోటుభావన. పురావస్తుశాఖ పరిశోధనలకు విరుద్ధమైనది. ఆటవిక, బర్బర, నాగరిక యుగాలు చరిత్రలో సుప్రసిద్ధమైనవి. వీటిలో వివిధ దశలున్నాయి. ఒక దశ కొత్త దశకు స్థానం కల్పిస్తూ మిళితమౌతూ పోతుంది. పక్క పక్కనే వివిధ దశలూ వుండవచ్చు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో క్రమేణ ధర్మం క్షీణిస్తూ, శాంతి సంపదలు కోల్పోతూ ఉంటాయనే భావన ఛాందసమైనది. అయినప్పటికీ కలియుగం ఎప్పుడు ప్రారంభమయిందా అనే చర్చ చేస్తూ ఉంటారు.
కలియుగం నిర్ధారితమైతే కురుక్షేత్ర యుద్ధం తేదీలు చెప్పవచ్చునని సనాతనుల ఉద్దేశం. వీరి అభిప్రాయంలో 3101 క్రీ.పూ. కలియుగం ప్రారంభమైనప్పటి నుండి 5 వేల సం.రాలు గడిచేసరికి క్రీ.త. 1899 వచ్చిందని అన్నారు. దీనితో అంగీకరిస్తున్నట్లు వైద్య చెప్పాడు. (Mahabharatha-A Criticism, 1929 : Page 55, 56) సనాతనులు ఎంత ఎలుగెత్తి చాటితే అంత ఖచ్చితంగా నమ్మినట్లు భావిస్తారు. భారతదేశానికి అదొక విషాద పరిణామం. మూఢ నమ్మకాలకూ, వివేచనా రాహిత్యానికీ భారత దేశం చాలా సారవంతమయింది.
కృత, కలియుగాలనేవి హిందువుల నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన దైవ నిర్ణయమని నమ్మారు. ఇవి మిగిలిన ప్రపంచానికి చెందవు. ఇతర ప్రజలకూ, లోకానికీ ఎలాంటి పెత్తూలేదు. విదేశాలకు పోకుండా హిందువులను వేలాది సంవత్సరాలు ఆపారు అది నత్త జీవితం వంటిది.
కలియుగారంభంలో ఆర్యులు సంచారజాతులు. 1500 సం.రాలు పాటు తిరిగి సింధులోయకు చేరారు. మరో 500 ఏళ్ళకు గంగా యమున ప్రాంతాలకు చేరారు. అలా స్థిరపడిన ఆర్య తెగల మధ్య నేటి ఢిల్లీగా పేర్కొంటున్న ప్రాంతంలో క్రీస్తు పూర్వం 3102-3101 ప్రాంతాలలో పోరాటాలు జరగటం సంభవమా? సప్త సింధు ప్రాంతం ఆర్యుల అసలు ప్రాంతమని అభినాష్ చంద్రదాస్ పేర్కొన్నాడు. అక్కడి నుండి నలువైపులా వెళ్ళి తమ దివ్య సంస్కృతిని ఆర్యులు వెదజల్లారన్నారు. ఈ సిద్ధాంతాలను వివరించటానికి దాస్ రెండు పెద్ద గ్రంధాలు రాశారు. వీటిని నవ్వులాటకైనా చదవాలనిపించదు. (Rigvedic India, Rigvedic Culture).
కలియుగం క్రీ.పూ. 3102లో ఆరంభమైందనటానికి శాసనాలు ఆధారం ఉండదన్నారు. అయిహోలా శాసనం రెండవ పులకేసికి చెందినది. పశ్చిమ చాళుక్య రాజ్యంలోని ఈ శాసనం చాలా ప్రాచీనమైనది. (A.D. Pusalker, History and Culture of the Indian People Vol. I. The Vedic Age) అయితే యిది క్రీ.త. 634కు చెందినది. అలాంటప్పుడు 3736 సం.రాల తరువాత వచ్చిన శాసనాన్ని కలియుగానికి సాక్ష్యంగా సనాతనులు మాత్రమే స్వీకరించగలరు ఆర్యభట్ట అంచనాల ప్రకారం కలియుగం క్రీ.పూ. 3102లో ప్రారంభమైంది. కాని, ఆర్యభట్ట క్రీస్తు తరువాతవాడు. 3600 సం.రాల తరువాత ఉన్న ఆర్యభట్టు ఖగోళ అంచనాల ఆధారంగా చెపుతున్నాననటం సనాతనులకు నచ్చవచ్చు.
కలియుగారంభాన్ని, రాజరికాల తేదీలను భవిష్యపురాణం అందించగా మత్స్య, వాయు, బ్రహ్మాండ పురాణాలు అనుకరించాయి. ఈ భవిష్య పురాణం నటనకు మారుపేరు. భవిష్యత్తులోకి తొంగిచూచి రాజ్యాలు రావటం, పోవటాన్ని చెప్పగలమన్నారు. వాటి ఆధారంగా కలియుగం ఎప్పుడు మొదలయిందో అంచనాలు వేస్తామన్నారు.
పురాణాలలో రాజ్యాలూ, రాజులు పట్టీల తేడా ఉన్నది. ప్రతి పురాణంలోనూ వివిధ రాజ్యాల కాలాలు అనేక విరుద్ధాలతో కూడి ఉన్నది. 14 నుండి 25 సం.రాల వరకూ ఈ తేడాలు కనిపిస్తున్నవి. పర్గీటర్ అంచనాలలో 18 సం.రాల కాలపరిమితి ఒక్కొక్క రాజ్య పాలనకు ఉన్నది. వైద్య ఈ పరిమితిని 20 సం.రాలన్నారు.
బాషమ్ 19 సం.రాలకు కుదించాడు. టి.టి. శ్రీనివాసయ్యంగార్ 25 సం.రాల వరకూ పెంచాడు. విన్ సెంట్ స్మిత్ 25. 2 సం. రాలన్నారు. ఎ.డి.పుసాల్ కర్ 18 సం.రాలకు తగ్గించాడు. పి.ఎల్. భార్గవ, 20 సం.రాలన్నాడు. పురాణంలోని రాజ్యాల కాలపరిమితిని ఫ్లిట్, హార్నెల్ అనేవారు 15 సం.రాలకు పరిమితం చేశారు. ఎ.ఎస్. ఐటేకర్ 16.5 సం.రాలన్నారు. బి.బి.లాల్ 14.5 సం.రాలన్నాడు. ఎస్.యస్. ప్రధాన్ 14 సం.రాలన్నాడు. విసుగు పుట్టించే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం.
ఏ ఇరువురు చరిత్రకారులూ రాజ్యాల పరిమితిని గురించి ఏకాభిప్రాయానికి రాలేక పోయారంటే వారు స్వీకరించిన ఆధారాలు తప్పుడివి కావటమే కారణం. ఈ సామ్రాజ్యాల పట్టిక చాలా పెద్దదయినప్పుడు సగటు సంఖ్య 5కు మించి లెక్కల్లో పెద్ద తేడా వస్తుంది. ఏ రాజు తరువాత ఎవరు వచ్చారనేది తేలకుండా పోతుంది.
చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 332లో తన రాజ్యాన్ని ప్రారంభించాడు. అదే నందులరాజ్యానికి చివరి దశ. అప్పటి నుండి, అంటే మహాపద్మనంద కాలం నుండీ కురుక్షేత్ర యుద్ధం వరకూ వెనక్కు వెళ్ళాలంటే 24 యిక్ష్వాకులూ, 27 పాంచాలులూ, 24 కాశీలూ, 28 హైహయులూ, 32 కళింగులూ, 25 అశ్మకులూ, 26 కురులూ, 28 మైధిలులూ, 23 సూరసేనులూ, 20 వీత హోత్రులూ స్వీకరించాలి.
257 సమకాలీన రాజులను పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కొక్కరికీ సగటున వంశానికి 26 రాజులను చూపవచ్చు. ఒక్కొక్క రాజుపాలన 18 సం.రాలుగా అంచనా వేస్తే 468 సం.రాలవుతుంది. నంద సామ్రాజ్యం క్రీ.పూ. 850 వరకూ వెనక్కు వెళ్ళ వలసి ఉంటుంది. కురుక్షేత్రయుద్ధానికీ, 10 సామ్రాజ్యాలకూ మధ్య మరికొందరు రాజులున్నారు. వారికొక 100 సం.రాలు కలిపితే కలియుగం క్రీ.పూ. 1132లో కలియుగం మొదలైనట్లు చెప్పాలి. ఈ అంచనాలలో విపరీతమైన ఊహలున్నాయి. రాజులపాలన కాలపరిమితికి నిర్ధారణ లేదు. పురాణాల ప్రకారం నందసామ్రాజ్యం 100 ఏళ్ళున్నది. జైన లెక్కల ప్రకారం 150 సం.రాలు. సిలోన్ అంచనాల ప్రకారం ఇది 22 ఏళ్ళు. మహాపద్మ పాలన 88 ఏళ్ళున్నదని కొందరు, 12 సం.రాలు మాత్రమేనని మరి కొందరు అన్నారు.
వృద్ధగార్గ, వరాహమిహిర అనేవారు క్రీ.త. సుప్రసిద్ధ ఖగోళ శాస్ర్తజ్ఞులు. కలియుగ ప్రారంభమైన తరువాత 653 సం.రాలకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందని వీరన్నారు. అంటే క్రీ.పూ. 2449-48లో అన్నమాట. దీనికి కాశ్మీరు చరిత్రకారుడు బి.సి. కల్హణ పూర్తి మద్దుత్తునిచ్చారు. కె.పి. జైస్వాల్ అనే చరిత్రకారుడు క్రీ.పూ. 1424లో జరిగిందన్నారు.
ఇలాంటి ఆధారాలను పురస్కరించుకొని కురుక్షేత్ర యుద్ధాన్ని నిర్ణయించటం గీతా పారాణం చేయటం అర్థం లేనిది. అయినా 1500 సం.రాల పాటు యుద్ధ కాల నిర్ణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని తేదీలు ఉదహరిస్తాను. ఆర్యభట్ట, భాస్కరాచార్య క్రీ.పూ. 3102 అన్నారు. సి.వి. వైద్య క్రీ.పూ. 3101, వృద్ధ గార్గ, వరాహమిహిర, కల్హణ, బి.సి. సేన్ క్రీ.పూ. 2444-48, జె.ఎస్. కరండికర్ క్రీ.పూ. 1922, బంకిమ్ చంద్ర చటర్జీ, ధీరేంద్రనాధ్ పాల్ క్రీ.పూ. 15వ శతాబ్దం, ఎం. రంగారావు క్రీ.పూ. 1468, పి.టి. శ్రీనివాసయ్యంగార్ క్రీ.పూ. 1450, హెచ్.టి. కోల్ బ్రూక్, లార్డ్ ఎల్ఫిన్సన్, హెచ్.హెచ్. విల్సన్, బాలగంగాధరతిలక్, శీతానాధ్ తత్వభూషణ్, ఆర్.సి. మజుందార్, హెచ్.సి. రాయ్ చౌదరి, పాల్ రేణు, ఎ. భాషమ్ క్రీ.పూ. 14వ శతాబ్దం, ఎ. జి. శంకర్ క్రీ.పూ. 1198, విన్ సెంట్ స్మిత్ క్రీ.పూ. 1000.
ఇంకా ఎక్కువ చర్చ సాగిస్తే తేదీలతో పాటు గందరగోళం కూడా పెరుగుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వారిలో వివేచనాపరులు కలియుగం కట్టుకథ అన్నారు. జె.ఎఫ్. ప్లీట్ ఈ విషయంలో ఆర్యభట్లపై నెపం వేశారు. క్రీ.త. 498లో ఆంధ్రరాజ్యం అంతమైనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని కె.పి. జైస్వాల్ అన్నాడు. కలియుగ ఆరంభాన్ని గురించిన అంచనాలు భారతీయ ఖగోళ శాస్ర్తజ్ఞుల కృత్రిమ లెక్కలపై ఆధారపడ్డాయన్నారు. దీని కౌరవ, పాండవ సంఘర్షణలు జోడించారు. మొత్తం మీద కలియుగ భావన నమ్మకంతో అల్లిన కథ మాత్రమే.



అధ్యాయం నాలుగు
భ్రమల భయం
పురావస్తు శాస్రం మాట్లాడదు. కాని సత్యాన్ని బయట పెడుతుంది. సాహిత్యానికి అలంకరణలు చేసే స్వభావం ఉన్నది. అందులో గాధలూ, ఇతిహాసాలలో ఉపమానాలూ, అలంకారాలూ, గజి బిజిగా అల్లుకొని ఉంటాయి. కనుక ప్రాచీన చరిత్రల గురించి రాసేటప్పుడు సాహిత్యంలో సాక్ష్యాధారాలను అతి జాగ్రత్తగా స్వీకరించాలి. ఇతర ఆధారాలతో ముఖ్యంగా పురావస్తు శాస్రంతో సరితూగుతున్నదో లేదో గమనించి చేపట్టాలి.
సుమేరియా చరిత్రకారులు ఇలాంటి జాగ్రత్త వహించారు. అలాగే ప్రాచీన దేశాలైన బాబిలోనియా, అస్సీరియా, ఈజిప్ట్, ఫినీషియా, క్రీట్, మీడియా, ఫైరియా, లిడియా, కార్తేజ్, గ్రీస్, రోమ్, పర్ష్యా, చైనాకు సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త వహించారు. కాని, ప్రాచీన భారతావనికి సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త తీసుకోలేదు. భ్రమలంటే వారు భయపడ్డారా? రెండువేల సంవత్సరాల పాటు పుక్కిటి పురాణాల మధ్య మనం నివశించాం. అదే మనకు ఔషధంగా మారింది. మోతాదు ఎక్కువై భ్రాంతిలో పడ్డాం. ప్రస్తుతాన్ని పక్కకు నెట్టి, గతాన్ని భజన చేస్తున్నాం. అయోధ్య గొప్పతనాన్నీ హస్తినాపురం వెలుగుల్నీ చెప్పుకొంటున్నాం. ఇంద్రప్రస్తలో, మయసభను గురించి పొగుడుకుంటున్నాం.
గతాన్ని తవ్వితీసి ఆర్యులను గురించి తెలుసుకుంటే, వాస్తవాలెన్నో బయటపడతాయి. రాముడూ, కృష్ణుడూ పాలించిన స్వర్గయుగాల భ్రమలు చెదిరిపోతాయి. రామాయణ మహాభారతాలకు చెందిన స్థలాలను తవ్వినప్పుడు అలాంటి సత్యాలు బయటకొస్తున్నాయి. భారతదేశానికి దండయాత్రీకులుగా వచ్చిన ఆర్యుల నాగరికత గురించి పుక్కిటి గాధలు బట్ట బయలు అవుతున్నాయి. దేశంలో ఉన్న ప్రజలు నాగరికులుగా, దాడి చేసిన వారు ఆటవికులుగా చరిత్ర చూపుతున్నది. హరప్పా ఉన్నత నాగరికతను ఆర్యులు ధ్వంసం చేశారు.
ఆ తరువాత వెయ్యేళ్ళకు గాని మగధ సామ్రాజ్యం తలెత్తలేదు. హరప్పా, మోహంజోదారో వంటి నగరాలు, కాళీబంగాన్, రంగవూరు వంటి పట్టణాలు, లోతల్ వంటి రేవులు మళ్ళీ రాలేదు. ఆర్యులు మట్టి ఇళ్ళలో ఉంటూ, కుండల్లో వండుకుని, తాగటానికీ, తినటానికీ మట్టి పాత్రలు వాడారు. నగర జీవితానికీ, సౌకర్యాలకూ వారుదూరం. వారి సంస్కృతి పేదది. గ్రామాలలో నివశిస్తూ, ఆవుల్ని పెంచుకున్నారు. ఆవులే వారికి సంపద, ప్రతిష్ఠాకరమైన విలువిచ్చాయి. సోమరసం ఆరగించేవారు. ఆర్యుల సంస్కృతి అల్పస్థాయిలోనే వుండేది. మెసపొటోమియాలో అమురుల వలె ఆర్యులకు కూడా నగరం అంటే తెలియదని, స్టూవర్డ్ పిగాట్ రాశాడు. (Pre Historic India, by Piggort Stauart 1962, Page : 265) సర్ మార్టిమర్ వీలర్ గొప్ప పురావస్తు శాస్ర్తజ్ఞుడు. ఆర్య సంస్కృతి గుర్తించదగినంత గొప్ప సంఘటనగా విడదీసి చూపటానికి ఆధారాలేవీ కనిపించటం లేదని రాశాడు. (Mortimer Wheeler : Civilization of the Indus Vallery, London 1966, Page : 97).
రామ, కృష్ణ భక్తులు ఈ విదేశీ శాస్త్రజ్ఞుల రచనలను పరిశీలించి వారు తప్పు అని రుజువు చేయగలిగితే బాగుండును. రామాయణ, మహాభారతాలకు సంబంధించిన స్థలాలను తవ్వి అలా చేస్తే సంతోషించవచ్చు. కాని, చెదురుమదురుగా లభించిన పూసలూ, రంగులు వేసిన కుండలూ, 12 గదులతో కూడిన మట్టియిళ్ళూ చూపి అదే గొప్ప సంస్కృతిగా ఆకాశానికి ఏత్తే ప్రయత్నాలు చేస్తున్నారు. మగధ సామ్రాజ్యం తలెత్తే వరకూ ఆర్యుల సంస్కృతి నిస్సందేహంగా అల్పస్థాయిలో కొనసాగింది.
క్రీ.పూ. 8వ శతాబ్దంలో గంగానది వరదల వలన నాగరికతంతా కొట్టుకుపోయినట్లు పురాణాల్లో రాసిఉందని చెపుతున్నారు. అప్పుడు కౌరవుల రాజధాని కొశాంబీకి మారిందట. హస్తినాపురం వద్ద తవ్వకాలలో యిది బయటపడిందటున్నారు. హస్తినాపురాన్ని పురాణాల ప్రకారం అస్తినుడు స్థాపించాడు. దుష్యంతుడికీ, అతడి కుమారుడు భరతుడికీ హస్తినాపురం రాజధాని అన్నారు. పురాణాల వంశ పారంపర్య జాబితాలో దుష్యంతుడి తరువాత 5వ వారసుడుగా హస్తినుడు వచ్చాడు. అతడు స్థాపించిన రాజధాని ముత్తాతల రాజధాని ఎలా అవుతుంది. పురాణాలన్నీ యిలాంటి అసంగతాలతోనే ఉన్నాయి. (Amar Chand : Hastinapura, 1952, Banares, Page : 7, 8).
భారీ కట్టడాల అవశేషాలు భౌతిక సంస్కృతికి చిహ్నాలు. అలాంటివి హస్తినాపురంలో లేవు. ఎ. ఘోష్ ఇలా హెచ్చరించాడు. మహాభారతగాధల గురించి పురావస్తు శాఖ త్రవ్వకాల ద్వారా సాక్ష్యాధారాలు అందించినట్లు చెపుతారు. అలాంటి నిర్ణయాలకు రావటం తొందరపాటవుతుంది. కౌరవుల రాజధాని హస్తినాపురం భారీ వరదల వలన కొట్టుకుపోయిందని కధలు అల్లారు. ఇతిహాసాల సంప్రదాయాలను సమర్ధించుకోటానికి పురావస్తుశాఖ పరిశోనలను అడ్డంపెట్టుకోవాలి. (A. Ghosh : Ancient India, No.11.12 New Delhi, 1954-55, Page:3).
మన ప్రాచీన గ్రంధాలు ఎంత పెద్దగా ఉంటే వాటి భాష్యాలు, వాటి చరిత్ర కాలక్రమం, భూగోళం అంత చిలవలు పలవలుగా ఉంటుంది. మన సనాతనులు గుడ్డిగా వాటిని అనుసరిస్తారు.
ప్రాచీన భారత చరిత్రలో మహాభారత యుద్ధం ప్రథమ అధికారిక సంఘటనగా సి.వి. వైద్య పేర్కొన్నారు. దీనిని ఎవరూ సందేహించటం లేదన్నారు. (C.V. Vaidya : The Mahabharata War, Bombay, 1929, Page:55). ఆ సంఘటన మాత్రమే కాదు, అది జరిగిన తేదీలు సహితం ప్రశ్నార్ధకంగానే మిగిలాయి. చరిత్రకారుడు విన్ సెంట్ స్మిత్ రాస్తూ మౌర్య సామ్రాజ్యం తలెత్తటంతో చరిత్రకారుడు ఆంధకారంలోంచి వెలుగులోకి వచ్చినట్లయింది. తేదీలు నిర్దుష్టంగా తెలిసాయి. (Vincent Smith : The oxford History of India, 1958, Page:95).
సనాతనులకు అలాంటివి మింగుడు పడవు. సూర్యవంశం నుండి దిగివచ్చిన క్షత్రియులు కేవలం ఆర్యవంశంలో ప్రాచీన భారత దేశంతో పాటు యావత్తు ప్రపంచాన్నీ పరిపాలించారన్న వారే షట్ చక్రవర్తులు. చంద్రగుప్త మౌర్యులతో ప్రారంభించటం విన్ సెంట్ స్మిత్ వంటి యూరోపియన్ల కుట్రమాత్రమే అన్నారు. అలెగ్జాంటర్ తో సమకాలీనులైన చంద్రగుప్తుడు మౌర్యవంశానికి చెందడనీ, అతడు గుప్తవంశంవాడనీ అన్నారు. క్రీ.పూ. 4 వేల సంవత్సరాల క్రితం గుప్త సామ్రాజ్యం ఉన్నదన్నారు. దీనికి పంచాంగాలూ, పురాణాలూ ఆధారాలన్నారు. ద్వాపర, కలియుగాల మధ్య క్రీ.పూ. 3102లో మహాభారత యుద్ధం జరిగిందన్నారు. దీనివలన ఒక వెయ్యి సంవత్సరాలు అశోకుడిని వెనుక్కు నెట్టినట్లయిందని ఎ.ఎ. మెగ్డానెల్ అన్నాడు. (A.A. Macdonell : India’s Part, 1956, Varanasi).
1966లో విలర్డ్ ఎఫ్. లిబి అనే రసాయన శాస్రజ్ఞుడికి కార్బన్-14 డేటింగ్ కనుగొన్నందుకు నోబుల్ బహుమానం వచ్చింది. గతాన్ని తెలుసుకోడానికి ఇతని ప్రక్రియ చాలా వరకు ఉపయోగపడుతున్నది. 40 వేల సం.రాల వరకు కనుగొనే అవకాశం లభించింది. (Libbi Willard F.H. : The Frontiers of Knownedge, Newyork 1975). ఈ విధానంలో దోషాలు కూడా అనల్పంగానే ఉన్నాయి. అది అంగీకరిస్తే ప్రాచీన భారత చరిత్ర తెలుసుకోటానికి పంచాంగాలూ, పురాణాలూ పక్కన పెట్టాల్సిందే. చరిత్ర కారుల ముసుగులో వైద్య వంటి వారెందరో పక్కిటి గాధల్ని చరిత్ర తొడుగుతో చూపారు. అలాంటి వారిని గమనంలోకి తీసుకోరాదు. వారికి ప్రాధాన్యత యిస్తే, చెత్తాచెదారానికి ప్రాముఖ్యత యిచ్చినట్లే.
కార్బన్-14 డేటింగ్ విధానంలో సర్ విలియం జోన్స్ భారత చరిత్ర కాలాన్ని సరిగ్గా చూపాడు. చంద్రగుప్త, అలెగ్జాండర్ సమకాలీనతను నిర్ధారించాడు. అశోకుని శాసనాలు తెలుసుకోటానికి బ్రహ్మీ, ఖరోస్తి లిపి జేమ్స్ ప్రిన్ సెస్ వెలుగులోకి తెచ్చాడు. ప్రాచీన భారత భౌగోళిక విషయాలను ఏర్చికూర్చిన ఖ్యాతి అలెగ్జాండర్ కానింగ్ హాంకు దక్కింది. ప్రిషాల అంటే శూద్ర అనీ, పాపపంకిలుడనీ నిఘంటువులు పేర్కొన్నట్లు ఎందరికి తెలుసు. దేవానాం ప్రియ అనే అశోకుని బిరుదు శాసనాలపై ఉన్నది. దానికి ఉన్మత్తుడు అనే అర్ధాన్ని మన ఇతిహాసాలూ, పురాణాలూ అంటగట్టాయని ఎందరికి తెలుసు.
కురుక్షేత్ర యుద్ధం బహుశ పుక్కిటి పురాణమే కావచ్చు. క్రీ.పూ. వెయ్యి సంవత్సరాలలో ఒకవేళ ఇది జరిగే ఉంటే, కేవలం ఆర్య తెగల మధ్య కలహమే తప్ప యుద్ధం మాత్రం కాదు. వేదసాహిత్యంలో దీని ప్రస్తావన లేదు. ఈ కలహం కూడా కూరు-పాండవుల మధ్య అయి ఉండదు. మహాభారత అధ్యయన పరులు ఇలాంటి భావాలను వెల్లడించారు.
విన్ సెంట్ స్మిత్ మహాభారత యుద్ధాన్ని చారిత్రకేతర కధగా భావించాడు. ఆల్ బ్రెట్ వెబర్ ఆర్య తెగల కలహంగానే భావించాడు. (Albreckt Weber : The History of Indian Literature, London, 1914, Page : 187). రోమిలాధాపర్ దీన్ని కేవలం స్థానిక ముఠాతగాదాకా చెప్పింది. (A History of India, 1968) భాషమ్ దీన్ని యుద్ధంగా పేర్కొన్నప్పటికీ అతిశయోక్తులే చాలా జోడించారు అన్నాడు. కురుక్షేత్ర యుద్ధం కౌరవులకూ, పాంచాలురకూ మధ్య జరిగిందనీ, దీనికి పాండవులను జోడించడంలో బ్రాహ్మణాసక్తి ఉన్నదనీ క్రిస్టియన్ లాసన్ రాశాడు. (Pre Musalman India, Vol.II, Vedic India, Part I, Madras, 1937). మహాభారతాన్ని సొంతంగా పరిశీలించిన పెండ్యాల శాస్త్రి (పిఠాపురం) కూడా అలాంటి అభిప్రాయానికే వచ్చారు.
దీని అంతటినీ బట్టి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన చరిత్ర, తేదీలు, పాల్గోన్నవారూ అన్నీ సందేహాస్పదాలే. అలాగే కృష్ణుడు, గీత కూడా, మన ప్రాచీన భారత చారిత్రక తేదీలను నిర్ధారించే ప్రయత్నం కొందరు సనాతనులు చేస్తూనే అన్నారు. ఎ.డి. పుసల్కర్ పాషండుడూ కాదు. సందేహవాదీ కాదు. అతడు ఇలా అన్నాడు. మహాభారతానికి సంబంధించి గ్రహ నక్షత్రాలను ఆధారంగా తేదీలు నిర్ణయిస్తున్నారు. దీనివలన భిన్న ఫలితాలు వచ్చాయి. పరస్పర విరుద్ధ వాస్తవాలు బయట పడ్డాయి. కనుక అలాంటి వాటిని ఉత్తరోత్తరా ప్రవేశపెట్టినట్లు భావించి నిరాకరించాలి. (A.D Pusalkar : History and Culutre of the Indian People Vol.I. Vedic Age Page : 269).
పుసల్కర్ చేసిన విమర్శల వంటివి భారతదేశానికే పరిమితం కాలేదు. క్రీ.పూ. 4004 మార్చి 23న బైబుల్ ప్రకారం భగవంతుడు ఆడంను సృష్టించినట్లు బిషప్ ఆషర్ ప్రకటించారు. అతని ప్రేరేపణతో గాబోలు, వెలంది గోపాలయ్యర్ కురుక్షేత్ర యుద్ధం క్రీ.పూ. 1194 అక్టోబరు 14న మొదలయిందన్నాడు. కలియుగం క్రీ.పూ. 312 ఫిబ్రవరిలో ఆరంభమయిందనీ, ఆ తరువాత 36 ఏళ్ళకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందనీ, మరొక పండితుడు ప్రకటించాడు. (S.B. Roy : Ancient India, 1975). అతడి ప్రకారం క్రీ.పూ. 3227 వరకూ కృష్ణుడు 125 ఏళ్ళు బ్రతికాడన్నాడు. కృష్ణుడు చనిపోయిననాడే కలియుగం మొదలయిందన్నారు. ఆదాయపు పన్ను అధికారిగా రిటైరయి అతడు ఇలాంటి తేదీల నిర్ణయానికి పూనుకున్నారు. ఇండియా అనే భారత దేశం అలాంటివారితో నిండి ఉన్నది. వారికి నమోవాకాలు.


అధ్యాయం ఐదు
పెనుభూతం
కైరోవద్ద పిరమిడ్లను పెనుభూతం వంటిదిగా కిప్లింగ్ అభివర్ణించాడు. మహాభారతానికి అదే వర్తించవచ్చు. పిరమిడ్ ఏడు అద్భుతాలలో ఒకటైతే, మహాభారతం 7 అభూత కల్పనలలో ఒకటిని చెప్పవచ్చు. పిరమిడ్ ఎత్తు 451 అడుగులు. మహాభారతం 18 పర్వాలలో, లక్ష శ్లోకాలలో ఉన్నది. ఒకప్పటి పిరమిడ్ పవిత్రత కోల్పోయి యాత్రికుల ఆకర్షణ స్థలంగా మారింది. మహాభారతానికి ఇంకా కొనసాగుతున్న పవిత్రత భారతదేశానికి పెద్ద ఉపద్రవం వంటింది. భారతీయుల జీవితాన్నీ, ఆలోచననూ అణచివేసే భారంగా అది తయారయింది.
మహాభారతం శతాబ్దాలుగా నేటి పెనుభూతస్థాయికి ఎలా చేరుకున్నదో గమనించాలి. వ్యాసుడు 8800 శ్లోకాలు చెప్పి జయ అని నామకరణం చేశాడు. వైశంపాయనుడు 24 వేల శ్లోకాలకు పెంచి భారతం అని పేరు పెట్టాడు. సౌతుడు లక్ష శ్లోకాలు పూర్తి చేసి మహాభారతంగా రూపొందించాడు. మధ్యలో మరెందరో జ్యోకం చేసుకొని యధాశక్తితో కలిపారు.
ఒక రచయిత కృషిలో జోక్యం చేసుకొని, రూపురేఖలో మార్చేసి, ముఖ్య సందేశాన్ని తారుమారు చేయటం హీనమైన నేరం. ప్రాచీన కాలం నుండి ఈ ఆధ్యాత్మిక దేశంలో అది సాగి పోతూనే వున్నది.
మత గ్రంధాలూ, ధర్మసూత్రాలూ రాజకీయ, ఆర్థిక రచనలూ, ఇతిహాసం, పురాణం అన్నీ యిలా మార్చేసారు. ఆ విధంగా చేయటంలో ప్రజాశక్తిని పెంపొందించినట్టూ, స్వర్గంలో స్థానం ఏర్పరచుకొన్నట్టూ భావించారు. అచ్చుయంత్రాలు వచ్చినా ఈ విధానాం ఆగలేదు.
మహాగ్రంధాలూ, ధర్మసూత్రాలూ రాజకీయ, ఆర్థిక రచనలూ, ఇతిహాసం, పురాణం అన్నీ యిలా మార్చేసారు. ఆ విధంగా చేయటంలో ప్రజాశక్తిని పెంపొందించినట్టూ, స్వర్గంలో స్థానం ఏర్పరచుకొన్నట్టూ భావించారు. అచ్చుయంత్రాలు వచ్చినా ఈ విధానం ఆగలేదు.
మహాభారతం, ఒక పెద్ద గేయం, సినిమా, రేడియో, టెలివిజన్, డ్రామాలు లేని రోజుల్లో గేయాలు పాడుకుంటూ కాలక్షేపం చేసేవారు. నాయకులూ, దేవుళ్ళూ కధా వస్తువులుగా ఉండేవి. రాజుల కొలువుల్లో సూతులు ఈ రచనలు చేస్తూ పోయారు. యజ్ఞయాగాదులలో వీరి అవసరం ఉండేవి. సంవత్సరాల తరబడి యజ్ఞాలు సాగుతుండగా విసుగు పుట్టకుండా గేయాలు పాడేవారు. రాజుల తృప్తి కోసం ఆ గేయాలను మారుస్తుండేవారు. మహాభారతం, రామాయణం పురాణాల కథాకాలక్షేపం అలా సాగేది.
తొలుత ప్రాకృతంలో ఉన్నదంతా తరువాత సంస్కృతంలోకి మార్చారు. సూత్రధారుల స్థానంలో బ్రాహ్మణులు వచ్చారు. స్తోత్రపాఠాలలో అర్థాన్నీ, సందేశాన్నీ మార్చివేశారు. భూసురులుగా తమ స్థానాన్ని భద్రపరచుకున్నారు. దేవుళ్ళకు మించి తమకు ఉన్నత స్థాయి ఉన్నట్టు భృగులు తిరగరాసుకున్నారు. (Irawati Karve : Yuganta, Poona, 1966, Page 5). అందులో ఒకరు విష్టువు వక్షస్థలాన్ని తన్నినట్లు, బ్రహ్మ-శివులను అణచి పెట్టినట్లు పేర్కొన్నారు. (Vemuri Sreenivasa Rao, Purvagathalahari, Madras, 1952, Page. 327-328).
జర్మనీలో హెర్మన్ వోల్డెన్ బర్గ్ బుద్ధునిపై నిశిత పరిశీలనా చరిత్ర ప్రచురించారు. మహాభారతం చిన్న ఇతిహాసంగా ప్రారంభమై, భయానకంగా, గందరగోళంగా మారిందని అన్నాడు. వి.ఎస్. సుక్తాంకర్ ఇతడి ప్రస్తావన చేశాడు.
మహాభారతాన్ని క్రమబద్ధంగా విశ్లేషించిన వాడు హాప్ కిన్స్. ఇతడు ఇలా అన్నాడు. ఈ ఇతిహాసం మనకెలా చేరింది. ప్రతి అధ్యాయమూ మార్పులకు గురై విస్తరించిన ప్రక్షిప్తాలు చోటు చేసుకొని, హద్దూ పద్దూ లేకుండా ప్రతి లేఖ కూడా సొంత రచనలను ప్రవేశపెట్టి కలగా పులగం చేశాడు. (V.W. Hopkins : The Great Epic of India, 1969, Calcutta, Page: 400). విన్ సెంట్ స్మిత్ ప్రకారం నేటి లక్ష శ్లోకాలలో 20 వేలు మాత్రమే కురుపాండుల సంఘర్షణకు సంబంధించినవి. మిగిలినదంతా కలిపారు. (Vincent Smith, Oxford History of India).
మహాభారతంలోని మూల అంశం ఎప్పుడు రచించారు. విస్తరణ ఎప్పుడు, ఎలా జరిగింది. ఎప్పుడు ఆగింది. ఈ మార్పులన్నింటికీ కారణం ఏమిటి.?
భిన్న పండితులు విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు. పాణిని కాలంలో మహాభారతం సంస్కృత ఇతిహాసంగా లేదు. మహాభారతం అనే పదాన్ని పాణిని తన వ్యాకరణంలో విశేషంగా వాడాడు. వాసుదేవుడిని, అర్జునుడిని దేవుళ్ళుగా ప్రస్తావించారు. యుధిష్టిరుని మాట గూడా ఉన్నది. (Max muller, A History of Sanskrit Literature) అంటే కృష్ణుడితో పాటు అర్జునుడిని గూడా దేవుడుగా కొలిచారు.
పాణిని వ్యాకరణంలో కుంతి, మాద్రీ ప్రస్తావన పాండురాజు భార్యలుగా కాదు. కుంతుల ప్రాంతం నుండి కుంతి, మద్ర ప్రాంతం నుండి మాద్రి వచ్చినట్లున్నది. (Radhakummud Mukherjee, Hindu Civilization, 1950 Bombay, Page : 141) భారతం మహాభారతం అనే ప్రస్తావన తొలుత అశ్వలాయన గృహ్యసూత్రాలలో ఉన్నది. ఇది కూడా మధ్యలో ప్రవేశపెట్టిందేనని వెబర్ అన్నాడు. (Albrecht Weber : The History of Indian Literature, 1914, Page : 189) ఏమైనా యీ సూత్రం ఎప్పుడు వచ్చిందన్నది కూడా నిర్ధారణ కాలేదు.
పాణినికి ముందు సంస్కృత ఇతిహాసంగా మహాభారతం లేదు. ఈ వ్యాకరణ శాస్ర్తజ్ఞుడు ఎప్పటి వాడో సరైన కాలనిర్ణయం లేదు. (V. Rangacharya, Video India 1937, Madras Page : 69, 70) క్రీ.పూ. ఐదవ శతాబ్దంలో ఉండవచ్చునని భావిస్తున్నారు. మహాభారతం పాణిని అనంతరం క్రీ.పూ. 4-3 శతాబ్దాల మధ్య వచ్చి ఉండవచ్చునని రాప్ సన్, బార్నెట్, హాప్ కిన్స్, మెగ్డోనెల్, వింటర్నిజ్డ్ పండితులు భావిస్తున్నారు. వెబర్, వైద్యా అభిప్రాయం ద్వారా చెప్పించారన్నారు. అశ్వమేధపర్వంలో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందగా, రాధాకుముద్ ముఖర్జీ క్రీ.పూ. 2వ శతాబ్దానికి తెచ్చారు.
మహాభారతం నేటి అవతారం దాల్చింది క్రీ.త. 4,5 శతాబ్దాలలోనే మార్పులూ, చేర్పులూ అన్నీ 4వ శతాబ్దం వరకూ జరుగుతూ వచ్చాయి. కలియుగంలో మనిషి పతనం ఆరంభం అయిందన్నారు. మహాభారతాన్ని అతి గౌరవంగా చూచే వి.యస్. సుక్తాంకర్ క్రీ.త. వెయ్యివరకూ అనేక చేర్పులు చేశారంటూ ఒప్పేసుకున్నారు. బండార్కర్ ప్రాచీన పరిశోధనా సంస్థవారు ప్రచురించిన మహాభారతంలో చాలా చేర్పులు జరిగాయన్నారు. విష్ణు అవతారవర్ణన, భీష్ముడి వైష్ణవ ధర్మాల్ని తెచ్చి పెట్టారన్నారు. ఇవి 2500 శ్లోకాల వరకూ ఉన్నాయి. ఇటీవలే యిలా జరిగినప్పుడు పూర్వకాలం యింకా ఎన్ని జరిగి ఉంటాయో ఊహించాల్సిందే. (V.S. Suktankar : On the Meaning of Mahabharata, Bombay 1957, Page : 22).
అంధ విశ్వాసంతో సనాతనులు ఈ విధంగా యిష్టం వచ్చినట్లు మలుచుకుంటూ పోయారు. వ్యాస మహాభారతంలో లక్ష శ్లోకాలున్నట్లు 5వ శతాబ్దంలో ఒక శాసనం పుట్టించారు.
మార్పులేమీ జరగలేదని వాదించారు. ఈ సంఖ్యను అట్టి పెట్టటానికి పాత వాటిని కొన్నిటిని తొలగించటం, కొత్తవాటిని చేర్చటం సునాయసంగా జరిపారు.
వ్యక్తిగత దేవుడనే భావనను పెంపొందించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. గౌతమబుద్ధుడు దేవుడున్నాడనీ, లేడనీ చెప్పలేదు. అతని శిష్యులు బుద్ధుడు చనిపోగానే అతడిని దేవుణ్ణి చేశారు. అతని జీవితాన్ని గురించి కథలు అల్లారు. వేద, బ్రాహ్మణవాదాన్ని దెబ్బ తీసేటంతగా బౌద్ధం పెరిగిపోయింది. ఇందుకు మారుగా క్రీస్తుపూర్వం 3,4 శతాబ్దాలకు మధుర ప్రాంతంలో గోవుల్ని కాచుకునే తెగల నాయకుడిని అడ్డం పెట్టి దేవుణ్ణి చేశారు. ద్రౌపదీ స్వయం వరంలో హఠాత్తుగా మహాభారత కథలోనికి కృష్ణుడు వచ్చేశాడు. అప్పటి నుండీ కృష్ణుడు పెరిగిపోయి దేవుడయ్యాడు. అంతవరకూ కురురాజులకు అనుకూలంగా ఉన్న కథను పాండురాజుల వైపు తిప్పారు. జనమేజయుడి యజ్ఞంలో ఈ మార్పు జరిగినట్లు పిఠాపురానికి చెందిన పెండ్యాల శాస్ర్తి, ప్రాచీన భారతాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు భావించారు. జనమేజయుడు పాండు సంతతి వారు. ఉదారంగా దానాలు చేశారు. అతడికి తృప్తి నిచ్చేటట్లు కథను మార్చారు. ఐనా దోషాలు కనిపిస్తూనే ఉన్నాయి.
సామాజిక అంతస్తులలో పురోహిత వర్గాన్నీ, ఉన్నత స్థాయిలో పెట్టటానికి ప్రయత్నించారు. మహాభారతం బ్రాహ్మణుల విజ్ఞాన సర్వస్వమని రాప్ సన్ పండితుడు సృష్టీకరించాడు. బౌద్ధ కాలాన్ని గురించి రాసిన రైస్ డేవిస్ మహాభారతం పురోహితుల చేతుల్లో మార్పుచెందిందన్నారు. బౌద్దుల వలన దెబ్బతిన్న ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి బ్రాహ్మణులు యిలాంటి పనిచేశారు. ప్రజా బాహుళ్యంలో ఉన్న కధల్ని బ్రాహ్మణులు సానుభూతితో స్వీకరిస్తున్నారని చూపడానికి కూడా యిలా చేశారు. వేదసాహిత్యంలో లేనివన్నీ ఇందులో సజీవంగా ప్రవేశపెట్టారు. ఆర్యులకు సంబంధించిన ఈ అంశాలు మహాభారతంలో చోటు చేసుకున్నాయి. (Rhys Davis : Buddhist India) ఏమైనా అమానుషంగా ప్రక్షిప్తాలు జరిపారు. గుప్తులకు ముందు మాహాభారతాన్ని తిరగరాయటం గమనిస్తే ఆటవిక ఆచారమైన సతీ సహగమనం కూడా తిరగదోడారని కోశాంబి అన్నారు. (An Introduction to the study of Indian History), బ్రిటిష్ వారు శాసన బద్ధంగా నిషేధించిన సతి 150 సం.రాల తరువాత తిరిగి ప్రవేశించింది. అలాగే భారతీయుల జీవితాన్ని ప్రభావితం చేయటంలో మహాభారతం పుస్తకాలను మించిపోయిందని సర్ పెర్సివల్ గ్రీవిత్స్ అన్నారు. పాండురాజు భార్యల మధ్య ఎవరు సతీసహగమనం చేయాలనే అంశంపై వివాదాన్ని మహాభారతంలో ప్రవేశపెట్టారు. దీన్ని తిరగరాసినప్పుడు తిరోగమన ప్రభావం ఘోరంగా పరిణమించింది. కులధర్మంగా చంపేయమని భగవద్గీత బోధించింది కూడా మహాభారతంలో తెచ్చిపెట్టారు.


అధ్యాయం ఆరు
లోగుట్టు
కోటలోకి ప్రవేశించాలంటే ప్రహారీగోడలు పగులగోట్టాలి. మహాభారతంపై దాడి చేసి, అది అబద్దాల పుట్టఅనీ, మోసపూరితమనీ చూపితేగాని గీతను ఎదుర్కోలేము. చుట్టూ అల్లిన నాటకాన్ని పొరలు విప్పుకుంటూ పోతే, గీత బండారం బయట పడుతుంది.
మహాభారతం ఎన్ని వంకలు తిరిగినా చివరకు కురుక్షేత్రాన్ని చేరుకుంటుంది. అది యుద్ధరంగమే గాక, ధర్మక్షేత్రంగా పేర్కొన్నారు. ఉభయ సైన్యాలు ఢీకొన్నాయి. గుర్రాలు కదం తొక్కుతున్నాయి. ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. రధాలపై పతాకాలు రెపరెపలాడుతున్నాయి. కాల్బలం పోరాటానికి సిద్ధంగా ఉన్నది. చెవులు గింగురు మనే ధ్వనులు వినిపిస్తున్నాయి. అలాంటి భూమికలో తాను ఎదుర్కొనవసిన వారిని పరిశీలించటానికి గాను రథాన్ని పక్కకు తిప్పమని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరాడు. ఎదుట తండ్రులనూ, తాతలనూ, గురువులనూ, బంధుమిత్రులను తిలకించాడు. అతడికి నోటమాట రాలేదు. నాకు విజయం సాధించాలని లేదు. రధాన్ని వెనక్కుతిప్పమని కోరాడు. కృష్ణుడు నవ్వి గీతాబోధన ప్రారంభించాడు. కురుక్షేత్రం మౌనం దాల్చింది. అందరూ గీతను విన్నారు.
ఈ నాటక రంగాన్ని తొలగిస్తే, గీతలో ఏమి మిగిలింది? నేను దేవుణ్ణి, సత్యాన్నీ, జీవితాన్నీ, మార్గాన్నీ అంటూ కృష్ణుడు చెప్పాడు. మహాభారతంలోకి గీతను ఎవరు తొలుత చొప్పించారో గాని అతడు గొప్ప మానసికవేత్త. పి.డి. మెహతా వ్యాఖ్యానిస్తూ తాత్త్విక గీతాలాపనకు ఎంపిక చేసుకున్న దృశ్యం చాలా ఆకర్షణీయమైందన్నాడు. (P.D. Mehta : Early India Religious Thought, London, 1956, Page : 246).
మహాభారతాన్ని రాజగోపాలాచారి, మున్షీ సుక్తాంకర్ అభినందించినట్లు నేను చేయలేను. గీత వారి దృష్టిలో గొప్పది కాగా, మహాభారతం నీతి కూడలి. కాని, ప్రపంచంలోని ఇతిహాసాలో అంత గందరగోళమయింది మరొకటి లేదు. అది కలగాపులగం అని హాప్ కిన్స్ అన్నాడు. పురోహితులతో సహా ఎందరో జోక్యం చేసుకున్నారు. సూతులు దీని తొలిరచయితలు. వారు కవులు. సామాన్య ప్రజలను ఆకట్టుకున్నారు. వారి దృష్టిలో ఒక యుధిష్టిరుడు, ఒక భీముడూ, ఒక దుర్యోధనుడూ, సంజయుడూ, శకుని ఉన్నారు. వారి సృష్టిలో ద్రౌపది చాలా గొప్పది. మహాభారతానికి తొలి ఆకర్షణ ఆ పాత్రలే.
మహాభారతాన్ని ఉన్నత నీతి గ్రంధంగా పేర్కొనటం ఘోరమైన విషయం. సుక్తాంకర్ వంటి వారు అందులో స్వర్ణ సంపదను చూచారు. బాణుని కాలంలో ఇది విద్యాగంధంగా ఉపకరించిందన్నారు. (V.S. Suktankar : The Meaning of Mahabharata) బాణుడు ఏడవ శతాబ్దంలోనివాడు. రాజరికంలో నివసించాడు. ప్యూడల్ సాంఘిక ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఐనా, మహాభారతాన్ని నేడు మన పాఠ్యగ్రంధంగా ఉంచాలని సుక్తాంకర్ కోరుకుంటున్నారు. బహుళ ప్రచారం నిమిత్తం రాజగోపాలాచారి వీటిని అనువదించాడు. మున్షీ తన చివరి దశలో కృష్ణావతారం పేరట ఏడు సంపుటాలు ప్రచురించాడు. ఇలాంటి వారు మన మధ్య లక్షలాదిగా వున్నారు. వారిది ఫ్యూడల్ మనస్తత్వం. ప్రాచీన సమాజాన్ని అట్టే పెట్టాలన్న స్వార్ధచింతన ఉన్నది. మహాభారతాన్ని పాఠ్యగ్రంధంగా, గీతను పవిత్ర గ్రంథంగా కోరుకుంటున్నారు. ప్రపంచ చరిత్రను చదివి పాఠాలు నేర్వటం వారికిష్టం లేదు. జర్మనీ రసాయనిక శాస్ర్తజ్ఞుడూ, వైద్యుడూ పరసిలస్ 15వ శతాబ్దంలో ప్రాగ్ లో వైద్యం పై తన ఉపన్యాసాలు ప్రారంభించే ముందు హిపోక్రిటస్, గాలెన్ పుస్తకాలను తగ్గుల బెట్టాడు. ఆధునిక వైద్యానికి నాందిపలికిన ధోరణి అది. మృత ప్రాయమైన మన గతాన్ని అలా వదిలేస్తే గాని, ఆధునిక భారతదేశం ఆవిర్భవించదు. మానవ నాగరికతో ప్రాచీన గాధలకు స్థానం ఉన్నదనీ, నమ్మకాలను క్రోడీకరిస్తుందనీ చెప్పాడు. ఆనాటి మానవుడికి మార్గగామి అయినగాధలు చాలా ముఖ్యదశను చూపుతున్నాయి. అతడు ఆదిమ సమాజాన్ని గురించి ఈ మాటలన్నారు. మన సమాజం నేడు ఆదిమస్థితిలో లేదు. అలాంటప్పుడు ప్రాచీన గాధల్ని నేడు యథాతధంగా స్వీకరిస్తే ఎవరో కొందరు ఉన్నతస్థాయిలో కొనసాగటానికి ప్రయత్నించటమే అవుతుంది. (Bronislew Malinowski : Magic, Science and Religion and other Essays, New York, 1954) గాధలు సామాజిక వడిదుడుకులలో, హెచ్చుతగ్గులలో పనిచేస్తాయని కూడా అన్నారు. అలాంటి స్థితి నేడు మన సమాజంలో ఉన్నది. వాటిని తొలగించి సమసమాజాన్ని ఏర్పరచాలంటే పాతవ్యవస్థను పోగొట్టాలి.

అధ్యాయం ఏడు
కృష్ణుడెవరు?
కృష్ణుడెవరు అని ప్రశ్నించటం అసందర్భం కాదు. హిందూ మత కృతుల్లో, కవితలు, పాటలు, నృత్యాలు, నాటకాలు, శిల్పం, చిత్రాలు రూపకంగా హిందూ జీవన రంగంలో కృష్ణుడి ఆధిపత్యం వ్యాపించింది. హెర్మన్ ఓల్డెన్ బర్గ్ కృష్ణుడు ఎవరు అని ప్రశ్న వేశాడు. కృష్ణుడికి పోటీగా రాముడున్నా, హైందవేతరులలో రాముడికి భక్తులు ఆట్టేలేరు. క్రీ.పూ. రెండవ శతాబ్దంలోనే వాసుదేవుని పేరిట గ్రీకులు పూజలు చేశారు. (Cambridge History of India, Vol.I) క్రైస్తవులలో సహితం కృష్ణుడి ప్రభావం ఉన్నది. కమ్యూనిస్టు లోకంలోనూ ఇది వ్యాపించింది. భారతదేశం నుండి ఎగుమతి అవుతున్న వాటిల్లో యిది ముఖ్యమైనది. అమెరికాలో కృష్ణ చైతన్యపేరిట మాదకద్రవ్య సంస్కృతిలోకి ప్రవేశించింది. సర్వరోగ నివారిణిగా ప్రచారంలోకి వచ్చింది. కృష్ణచైతన్యను ప్రచారం చేయటానికి అమెరికాలోని ఫోర్డ్ కుటుంబంవారు కోట్లాది రూపాలిచ్చారు.
కృష్ణుడెవరు అని అడగటం సులభమే గాని, సమాధానం అంత సులువు కాదు. బిపిన్ చంద్రపాల్ ప్రయత్నించి ఇంకా ఉచ్చులో బిగుసుకుపోయాడు. (Vipin Chanra Pal : Sri Krishna, 1963) కృష్ణుడు చాలా మంది ఉన్నారు. సిసలైన వాడెవరో తేల్చటం కష్టం. వేద కాలంలో ఒక కృష్ణుడు ఆర్యరుషికాగా, మరొకరు ఆర్యేతరులు. రుషిగా ఉన్న కృష్ణుడికి విశ్వకుడు అనే కుమారుడు, విష్ణవుడు అనే మనుమడు ఉన్నారు. ఈ మనవడిని అశ్వనీ దేవతలు పునరుద్ధరించారు. (H.H. Wilson, Rigveda, Vol – I 1946, Bangalore, Page : 190) ఇందులో అశ్వనీ దేవతలకు ప్రార్థన చేయటమే కృష్ణుడి పని. పౌరాణిక కృష్ణుడు తన గురువు సందీపుని సంతోషంతో సముద్రం అడుగుకు వెళ్ళి అతడి కుమారుడిని కాపాడతాడు. (Vemuri Sreenivasa Rao, Purvagadhalahari, 1952, Vijayawada, Page 270).
ఆర్యేతర కృష్ణుడిని రుగ్వేదంలో రాక్షసుడిగా చిత్రించాడు. 10 వేల సైన్యం అతనికి ఉండేదట. ఆర్యుల దేవుడు ఇంద్రుడితో అంశుమతి తీరాన పోరాటం జరిపినప్పుడు కృష్ణుడు ఓడిపోయాడు. అది ఆర్యేతర కృష్ణుడికి చాలా అపఖ్యాతి. పురాణాలలో దీన్ని తిరగదోడి విష్ణుపురాణం పేరిట కృష్ణుడు గెలిచినట్లు, ఇంద్రుడు ఓడినట్లు రాశారు. బృందావన గోపికలు ఇంద్రస్తుతి చేయడాన్ని కృష్ణుడు వ్యతిరేకించారు. కుంభవృష్టిని కురిపించిన ఇంద్రుడి దాడినుండి తన వారిని సంరక్షించటానికి కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికిన వేలుపై 7 రోజుల పాటు గొడుగుపట్టాడు. ఇంద్రుడు మేఘాలను పంపించి వేశాడు. ఇలాంటి కట్టుకథలకు పురాణాలు పెట్టింది పేరు.
ఉపనిషత్తుల్లో కృష్ణుడు దేవకీపుత్రుడుగా చాందోగ్యోపనిషత్తులో కనిపిస్తారు. అంగీరస శిష్యుడేనా ఈ కృష్ణుడు? అవునని ఆదిశంకరా చార్యుడంటాడు. (B. Majundar : Krishna in History and Legend, 1969, Calcutta Page : 3) సనాతనుల దృష్టిలో శంకరాచార్యుడు చెప్పింది తిరుగులేనిది. అంగీరసుని వద్ద కృష్ణుడు ఉపనిషత్తులు నేర్చాడు. పురాణాలను బట్టి కృష్ణుడి గురువు సందీప్. ఉపనిషత్తులను ఔపోసనం పట్టిన ఖ్యాతి కృష్ణుడికి దక్కితే, అంగీరసుడితో ముడిపెట్టక తప్పదు. శంకరాచార్యుడు మెదలు హేమచంద్రరాయ్ చౌదరివరకూ ఆపనే చేశారు. (Hema Chandra Roy Chaudhury, Materials for the History of the Vaishnava sect, New Delhi, 1975) చాందోగ్యంలో, గీతలో కొన్ని పోలికలు ఉన్నాయి. గనుక రాయ్ చౌదర అలా అభిప్రాయపడ్డాడు. ఆ విధంగా చూస్తే మర కొందరు ఉపనిషత్ రుషులకు కూడా కృష్ణుడు శిష్యుడేనని భావించాలి. ఎ.ఎస్.పి. అయ్యర్ ఇలా అంటాడు. అంగీరసుడికి గుణపాఠం చెప్పాలని భావించిన కృష్ణుడు శిష్యుడిగా వెళ్ళాడు. అతడి గ్రహణ శక్తిని గురించి ఆశ్చర్యపడిన అంగీరసుడు నేను చెప్పదగినదంతా నేర్చుకున్నావు. ఇక వెళ్ళవచ్చును అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు పెద్ద ఉపన్యాసమే యిచ్చాడు. యాజ్ఞవల్క్యులు గారితో చెప్పిన విషయాన్ని ప్రస్తావించాడు. నిగూఢ సత్యాలను అచ్చుతుడు గ్రహించినట్లు అంగీరసుడు స్తుతించాడు. (A.S.P. Ayyar, Srikrishna, The Darling of Humanity, Madras, 1952) చాందోగ్య ఉపనిషత్తులో ఎంత వెదికినా అయ్యర్ అల్లిన కథ కనిపించవచ్చు. బ్రహ్మసమాజం వారిగా ఉన్న విపిన్ చంద్రపాల్ వైష్ణవుడిగా మారి కృష్ణుడిని అంగీరసుడికి శిష్యుడిగా చేశాడు.
మూడవ కృష్ణుడు మహాభారతంలో, హరివంశంలో కనిపిస్తాడు. ద్వంద్వ వ్యక్తిత్వం గల ఈ కృష్ణుడికి, గీతలోని కృష్ణుడికి పోలికలేదు. మహాభారతంలో దివ్యపురుషుడిగా ఒకవైపున, కురుపాండవుల మధ్య ఎత్తుగడలు, కుట్రలుపన్నిన వ్యక్తిగా మరోవైపునా కనిపిస్తాడు. విష్ణు పురాణంలో కృష్ణుడు గోపికలతో సంచరిస్తాడు. ఇది క్రీ.త. 5వ శతాబ్దంలో రాసింది. కృష్ణుడు నర్మదానదీ తీరాన రాక్షసులను బౌద్ధ జైనులుగా మార్చినట్లు చూపారు. మహామోహ వేషంలో ఆ పని చేశారన్నాడు. (The Cultural Heritage of India, 1969, Calcutta) ఇలాంటి చిత్రణలో ఇతిహాసాలూ, పురాణాలలో మసురుకొని ఉన్నాయి. బుద్ధుడికంటె కొన్ని శతాబ్దాలు ముందే రాముడు ఉండగా, రామాయణంలో బుద్ధుణ్ణి చోరుడుగా రాముడు పేర్కొంటాడు (M.N. Dutt : Ramayana).
భాగవత పురాణంలో కృష్ణావతారం కనిపిస్తుంది. విష్ణుపురాణంలో గోపికలలో సరసాలు ఉండగా, భాగవతంలో వాటి రూపం మారింది. రాధ అప్పటికి రాలేదు. క్రీ.త. 9, 10 శతాబ్దులలో భాగవత కృష్ణుడు వచ్చాడు. కొందరు క్రీ.త. 13వ శతాబ్దానికి కూడా ఈ కృష్ణుడిని నెట్టివేశారు. (Maurice Winter nitz. A History of Indian Literature, Vol-I, Part-II).
క్రీ.త. 14, 15 శతాబ్దాలకు చెందిన బ్రహ్మవైదత్త పురాణంలో కృష్ణుడు కనిపిస్తాడు (Seethanath Tatwabhushan : Krishna And Puranas, Calcutta, 1926). రాధ శృంగార నాయకిగా కనిపిస్తుంది. వైష్ణవ వాదంలో కృష్ణుడి తరువాత ఆమెదే పైచేయి. రాధాకృష్ణుల శృంగార లీలను సమర్ధించటానికి దివ్యాత్మలూ, వ్యక్తి పరమాత్మ లోలీనం కావటం అలాంటివన్నీ తెచ్చిపెట్టారు. కాని, అసలు విషయాన్ని దాచలేకపోయారు.
నారాయణ ఉవాచలో ఇలా ఉంది.
కృష్ణుడు రాధను వివస్ర్తను చేసి ఆమె స్తనాలను పట్టుకుంటాడు. నాలుగు రీతులుగా చుంబిస్తాడు. సంభోగంలో రాధ గజ్జలు తెగిపోతాయి. ముద్దులతో ఆవిడ పెదాలు ఎరుపెక్కుతాయి. స్తనాలపై గంధం చెరిగిపోతుంది. కొప్పువూడి పోతుంది. బొట్టు చెరిగిపోతుంది.
నీరద్ సి. చౌదరి బ్రహ్మ వైవర్తంలోని ఈ భాగాన్ని అనువదించాడు. ఇందులో జీవి అనంతంలో కలిసిపోయే దేమిటో పిచ్చివాడికి కనిపించవలసిందే.
తరువాత కృష్ణుడి పైకి వచ్చిన రాధ సంభోగిస్తుండగా ఆవిడ కాళ్ళ పారాణి చెరిగిపోతుంది. ఆ ప్రక్రియలో ఆమెకు పారవశ్యం కలుగగా రాత్రింబగళ్ళకు తేడా లేకుండా పోయింది. నఖక్షతాలు, దంతక్షతాలతో కృష్ణుడు 8 భంగిమలలో ఆమెతో సంభోగిస్తాడు. గాజుల, మట్టెల చప్పుళ్ళ మధ్య రాధ ఇక భరించలేక సంభోగం నుండి వైదొలగుతుంది. (C. Nirad Chawdhary, Hinduism, New Delhi, 1979) నీరద్ చౌదరి పురాణాలలోని ఘోర విషయాలను ప్రస్తావించాడు.
రాధతో నిమగ్నుడైన కృష్ణుడు గోపికలకు అన్యాయం చేస్తున్నట్లు భావించి ఉద్యానవనంలోకి వెళతాడు. 9 లక్షల మంది ఉండగా అంతమంది పురుషులుగానూ కృష్ణుడు మారి సంభోగించగా ఉద్యానవనం ప్రతిధ్వనిస్తుంది. సామూహిక సంభోగ ప్రక్రియ కొనసాగుతుంది.
సంస్కృతం, ఇంగ్లీషు బాగా తెలిసిన నీరద్ చౌదరి ఈ ప్రక్రియను అనువదించి చూపాడు. యోగులందరికీ గురువైన నారాయణుడు అనేక రూపాలు ధరించి సంభోగించాడు. అప్పుడు గాజుల, మెట్టెల, పట్టెల చప్పుడు ఆనందంగా వినిపించింది. వారంతా పారవశ్యంగా స్పృహ తప్పారు. తెలివి వచ్చిన తరువాత గిచ్చుళ్ళతో, కొరుకుళ్ళతో కృష్ణుడు వారి పిరుదలపై ముద్ర వేశాడు. నగ్నంగా వారెంతో సుందర రూపాలతో ఉన్నారు.
అలాంటి కృష్ణుడిని చూచి వల్లభాచార్యుడూ, చైతన్య, ఇతర వైష్ణవ భక్తులు పారవశ్యం చెందారు. ఆ కృష్ణుడిని చూసే అండాళ్ చండీదాస్, జయదేవుడు, మీరాబాబు, సూరదాస్, విద్యావతి, పోతన, నర్సిమెహతా వంటి కవులూ, కవయిత్రులూ ఆలపించారు. ఆ కృష్ణుడిని గురించే మాధవుడూ, దైవం లీనమైనట్లు ఆధునిక జీవిత చరిత్రల్లో రాశారు.
ధీరేంద్రనాధ్పాల్ ఇలా అన్నారు. ప్రేమరాజ్యం హిమాలయాల నుండి దక్షిణాది వరకూ, ద్వారక నుండి తూర్పు తీరాల వరకూ వ్యాపించింది. (Dhirendranath Pal : Sri Krishna, His Life and Teachings, Calcutta 1904).
కృష్ణుడిని ఎవరూ అర్థం చేసుకోలేదనీ, అతని మార్మికవాదం గొప్పదనీ పాల్ పొగిడాడు. ఐనా, అతన్ని గురించి మనకు తెలియజెప్పడానికి పుస్తకం రాశారు. మోహన్ లాల్ సేన్ 3 సంపుటాలలో కృష్ణుడిని గురించి రాస్తూ బృందావన లీల పేరిట మొదటి సంపుటంలో గోపికలతో కృష్ణుడి క్రీడలను రాశాడు. పారవశ్యం చెందినట్లు కృష్ణుని చిత్రించాడు. బృందావన లీల అంతా ప్రేమమయం అన్నాడు. హిందువులకే గాక అందరికీ శ్రీ కృష్ణుడు దేవుడన్నాడు. (Mohanlal Sen : Lord Sri Krishna, His Life and Teaching, Calcutta 1954).
ప్రతాప్ ఆర్. పరేఖ్ కృష్ణుడి జీవితాన్ని రాస్తూ కృష్ణుడు వాస్తవం అన్నాడు. అతని వంశపారం పర్యతనూ, గ్రహరాసి ఫలితాలను గూడా యిచ్చాడు. బృందావనంలో గోపికలతో, రాధలతో శృంగార లీలను వర్ణించాడు. వీటిని విమర్శించే వారిని గర్హించాడు. గొప్ప వారు ధర్మాన్ని మించిపోయి, నియమాలను పాటిస్తారన్నారు. వారికి దోషాలంటవన్నాడు. చట్టాలు బలహీనులకే అన్నారు. (P. Pratap Parekh : Krishna, Myth or Reality).
హనుమాన్ ప్రసాద్ ప్రోద్దార్ కృష్ణుడి గోపికా లీలను 100 పేజీలలో చిత్రించాడు. దివ్యలక్షణాలున్న వారిలో ప్రేమ స్వభావాన్ని బూతుగా చూడరాదన్నాడు. విశ్వాసంలేని భార్యకు 3 కారణాలుగా గౌరవాన్ని ఆపాదించాలన్నాడు. 1. ప్రేమికుడిపై నిరంతర ధ్యాస, 2. ప్రేమికుడిని కలవాలనే తీరని వ్యామోహం, 3. ప్రేమికుడి దోషాలను పూర్తిగా విస్మరించటం. అలాంటివి మామూలుగా పెళ్ళి చేసుకున్న భార్యలో ఉండదన్నారు. గోపికలు కృష్ణుడితో ఎడబాటు క్షణం కూడా సహించలేకపోయారన్న మాట. ఎ.ఎన్.పి. అయ్యర్ మరొక అడుగు ముందుకి వేసి శ్రీకృష్ణుడు పురుషులందరికీ తండ్రి అనీ, స్ర్తీలందరికీ భర్త అనీ రాశాడు.
కృష్ణభక్తులు బలహీనులకు ఒక నియమం, బలవంతులకు మరో నియమం చూపుతున్నారు. రెండు విధాలైన నీతి శాస్ర్తాలు పేర్కొని ఒకటి దేవుళ్ళకూ, మరొకటి మానవులకూ చెందిందంటున్నారు. భారతీయ జీవనంలో యిదే రెండు నాలుకల విధానం. కృష్ణుడికి చెందిన జీవిత గాధలలో ఇది కన్పిస్తుంది. బాబా పరమానంద్ భారతి, మోనికా వర్మ అలానే రాశారు. (Monika Varma : Lord Krishna, Love Incarnate, New Delhi. 1978 : Baba Paramananda Bhrath, Sri Krishna. The Lord of Love, New York 1904).
భారతీయ బాబాలూ, భగవాన్లూ అమెరికా వెళ్ళి డబ్బు గడిస్తున్నారు. కామం ద్వారా ముక్తి సాధించాలనే భగవానుడొకరు అమెరికాలో ప్రచురణలు చేశారు. అతడి పేరు డొనాల్డ్ ఆర్. కిన్ స్లే. కృష్ణుడిని గురించి రాస్తూ రాధాకృష్ణుల ప్రేమ, గోపికలతో కృష్ణుడి శృంగార లీలలు దివ్యానుభూతిని సూచిస్తాయన్నాడు. ఆ దశలో మామూలు బంధాలు తెగిపోతాయన్నాడు. ఆ శృంగారం నీచమయింది కాదనీ, క్షణికమైంది కాదనీ, అరమరికలు లేనిదనీ, ఆనందభరితమనీ చెప్పాడు. గోపికలు మానవ మాత్రులు. వారు సాధారణ విషయాలను విస్మరించిన దైవమత్తులో స్వేచ్ఛగా శృంగార లీల జరుపుతారన్నాడు. (Donald. Kinsley : The Sword And the Flute, Kali and Krishna, New Delhi)
ఇలాంటి మాటలు కృష్ణ భక్తులకు ప్రోత్సాహాన్నిస్తాయి. అమెరికా ఆధ్యాత్మిక వాది పాదాల వద్ద కూర్చొని బృందావన సందేశాన్ని వినమంటారు. అది అలా ఉంచి ఇందరి కృష్ణులలో అసలు వాడెవరు. అంటే, సంప్రదాయ వాదులు మహాభారతంలో, గీతలో కృష్ణుడుని చూపిస్తారు. అదేమిటో చూద్దాం.


అధ్యాయం ఎనిమిది
మానవుడుగా కృష్ణుడు
పురాణాల్లోని కృష్ణుడిని మనం ఇష్టపడవచ్చు, పడకపోవచ్చు. అది మన అభిరుచిని బట్టి ఉంటుంది. మహాభారతలో కృష్ణుడిని గమనిస్తే అయిష్టత యేర్పడుతుంది. కృష్ణ భక్తులవలె గాక, హేతుదృక్పథంతో చూస్తే అలా అనిపిస్తుంది. భక్తులకు వారి దేవుడే సర్వస్వం. భక్తికి అలాంటి ప్రభావం ఉన్నది. రాముడికీ, కృష్ణుడికీ సమానంగా భక్తిని చూపడాన్ని ఏమనుకోవాలి? ఇరువురూ విష్ణువు అవతారాలే అంటారు. ఐనా, ఎంత తేడా ఉన్నది. రాముడు సత్యం వైపుకు మొగ్గుతాడనీ, కృష్ణుడలా కాదనీ అంటారు. రాముడు ఏకప్రత్నీ వ్రతుడు. కృష్ణుడు కాదు. రెండ మూడు సందర్భాలు మినహాయించితే, రాముడు ధర్మయుద్ధం చేశాడు. కృష్ణుడు చేయలేదు. ఐనా, భక్తులకు తేడా కనిపించటం లేదంటే భక్తి ప్రభావమే కారణం.
భక్తుల సంగతి అలా వుంచి, మహాభారతంలో కృష్ణుడిని విదేశీ పండితుల దృష్టిలో చూద్దాం. ఇందులో బ్రిటిషువారిని స్వీకరించటం లేదు. దేశాన్ని పరిపాలించిన సామ్రాజ్యవాదులుగా వారికి భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఉండవచ్చు.
ఇ.డబ్ల్యు. హాప్ కిన్స్ భారతీయ శాస్ర్తాలను పరిశీలించిన అమెరికన్ పండితుడు. (1857-1932). అతడు సంస్కృతం, పహ్లవి, గ్రీస్, లాటిన్ భాషలను అధ్యయనం చేశాడు. హిందువుల కులం, నీతిపై రాశాడు. భాష, కవిత, నీతి దృష్ట్యా మహాభారతాన్ని విశ్లేషించారు. ఏల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా చాలా ఖ్యాతి పొందారు. కృష్ణుడు పవిత్రమైన మోసకారి అని స్పష్టంగా రాశాడు. (The Great Epic of India) గీత చివరలో ధృతరాఘ్ర్టనితో సంజయుడు చెప్పిన మాటలను బట్టి, కృష్ణుడి విశ్వరూపాన్ని చూచి ముగ్ధుడైనట్లు పేర్కొన్నారు. కురుక్షేత్ర యుద్ధం చివరిలో ఆ కృష్ణుడు మోసగాడని సంజయుడంటారు. 18 రోజుల్లో సంజయుడి అభిప్రాయం మారటానికి తగిన కారణం ఉండి ఉండాలి. సంజయుడి అభిప్రాయాన్నే హాప్ కిన్స్ గూడా సమర్ధించాడు. అర్జునుడికి రధసారధిగా ఉన్న కృష్ణుడు తాను పోరాటం లోకి దిగనని చెపుతూనే కురుపాండుల మధ్య వైరం పెంచాడు. కుయుక్తులనూ, విచక్షణ లేని ధోరణినీ కృష్ణుడు ప్రదర్శించాడు.
ఆస్ర్టేలియా పండితుడు మోరిస్ వింటర్నిట్ట్ భాష, తత్త్వాలను, భారత శాస్ర్తాలనూ అధ్యయనం చేశారు. ఆక్స్ ఫర్డ్ లోఉన్నప్పుడు రుగ్వేదం ముద్రణకు మాక్స్ ముల్లర్కు సహాయపడ్డాడు. మాక్స్ ముల్ల ర్ తయారు చేసిన 49 ప్రాచ్యపవిత్ర గ్రంధాలకు పద సూచికలో తోడ్పడ్డారు. ప్రాగ్ లో భారతీయ శాస్ర్తాలను బోధించాడు. భారతీయ సాహిత్యం పై 16 వంద పేజీలు రాశాడు. 1937లో అతను చనిపోయినప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ అతడి సత్యాన్వేషణకు జోహారులర్పిం చాడు. కృష్ణుడిపై వింటర్నిట్జ్ రాస్తూ కుట్రలన్నీ అతడి నుంచే వచ్చాయనీ, మోసాలకు ప్రోత్సాహకారి అనీ, పాండవుల ప్రవర్తనను సమర్ధిస్తూ పోయాడనీ అన్నారు. పాండవులకు కృష్ణుడు జిత్తులమారి స్నేహితుడుగా రాశాడు. (Mauric Winternitz : A History of Indian Literature, Vol-I, Part-II, Calcutta).
మాక్స్ వెబర్ (1864-1920) జర్మనీ సామాజిక శాస్ర్తజ్ఞుడు. ప్రపంచమతాలను సామాజిక శాస్ర్త దృష్టితో పరిశీలించటం అతని ప్రత్యేకత. భారతదేశంలో శాస్త్రీయ దృక్పధాన్ని సాగనివ్వకుండా మతం అడ్డుపడుతుందని రాశాడు. కృష్ణుడు మహాభారతంలో అతి ఘోరమైన నేరాలను తనవారితో చేయించాడనీ అన్నాడు. (Max Weber : The Religion of India, New York, 1967, Page : 189).
సుక్తాంతర్ కృష్ణుడిని బాగా అధ్యయనం చేసి రాశాడు. విరుద్ధాల పుట్ట. యుద్ధరంగంలో తాత్త్వికుడు. తన సైన్యాన్ని శత్రువులకు అప్పజెప్పాడు. సర్వశక్తివంతుడైన తాను యుద్ధారంభంలో ఆయుధాలు చేబట్టనని ప్రతినపూనాడు. నిష్పక్షపాతంగా ఉండవలసిన ఈ దేవుడు కౌరవ సంహారానికీ, పాండవ విజయానికీ, నీతిరీతి లేని రాజకీయవాదిగా రహస్యకుట్రలు పన్నాడు. యుద్ధరంగంలో నిలబడి ఈ అవతరా పురుషుడు కింది స్థాయి నీతిని భోదించాడు. జిత్తులమారిగా ప్రవర్తించాడు. (V.S. Suktankar : On the Meaning of Mahabharata, 1957, Bombay)
పరస్పరం విరుద్ధాలు అన్నపుడు అందులో వివేచనలూ, వాదనకూ చోటు లేదు. కృష్ణుడు ఈ విరుద్ధాల పుట్ట అనీ, చిక్కు సమస్యవంటి వాడనీ సుక్తాంకర్ అన్నాడు. జీవితం గూడా అలాంటిదేకదా అన్నాడు. మనిషి దేవుడుగానూ, దేవుడు మనిషిగానూ కృష్ణుడిలో చూచిన సుక్తాంకర్ రెండు దృక్పధాలనూ సమర్థించే ప్రయత్నం చేశారు.
కృష్ణుడు చెప్పిందాన్ని బట్టి శత్రుగృహంలోకి తప్పుడు త్రోవలో, స్నేహిడింటిలోనికి సరైన మార్గంలో ప్రవేశించాలన్నాడు. (సభాపర్వం). జరాసంధుడి కోటలోకి అలాగే కృష్ణుడు ప్రవేశించాడు. భీమార్జునులను వెంట బెట్టుకొని బ్రాహ్మణ వేషంలో లోనికి వెళ్ళాడు. బ్రాహ్మణులను సత్కరించటానికి వచ్చిన జరాసంధుడిని భీముడితో చంపించాడు. భీమ-జరాసంధుల 14 రోజుల మల్లయుద్ధం అబద్ధమని పిఠాపురం పెండ్యాల శాస్త్రి రాశాడు. (Mahabharata Charitramu, 1933 Page 166). కంసుని, శిశుపాలుని చంపించటంలో కూడా కృష్ణుడు అలాంటి ఎత్తుగడనే అవలంబించాడు.
భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనులను చంపించటంలో మోసపూరిత ఎత్తుగడలను సుక్తాంకర్ సహితం కాదనలేక పోయాడు. ఐతే, అందుకేవో కుంటిసాకులు చెప్పాడు.
కౌరవులు కూడా అక్రమ మార్గావలంబన చేశారనీ, కాగా వారు తెలివిగా, లోపాయకారీగా చేశారనీ అన్నాడు. పాండవులు కొన్ని దోషాలు చేశారంటూనే సుక్తాంకర్ మాట తప్పించాడు. పాండవులతో పాటు కౌరవులు గూడా తప్పుచేశారని చెప్పిన సుక్తాంకర్ రెండు దోషాల వలన ఒక మంచి జరిగినట్లయింది. ఐతే ఉభయ పక్షాల మీద నెపం వేసిన సుక్తాంకర్ దోషులలో కృష్ణుని చేర్చకపోవటం గమనార్హం.
మనోరమ జవహరి మహాభారతంలో అక్రమ చావుల్ని గురించి రాసింది. కృష్ణుడి సలహాతో పాండవులు పోరాట నియమాలను ఉల్లఘించారన్నారు. కృష్ణుడు తరచూ పరోక్ష సలహాలిస్తుండేవాడు. భీముడితొడలు విరగ్గొట్టమని అర్జునుడి ద్వారా చెప్పించాడు. కృష్ణుడి సోదరుడు బలరాముడు ఈ అక్రమ పోరాటం పట్ల ఆగ్రహించి భీముడిని చంపటానికి ఉద్యమిస్తాడు. బలరాముడు గ్రహించకుండా ఉండేటందుకే అర్జునుడి ద్వారా తన దుస్సలహాలు కృష్ణుడు అందచేస్తాడు. పైగా బలరాముడిని శాంతించమంటాడు. అక్రమ పోరాటాన్ని సమర్ధించి అలా అయితేనే దుర్యోధనుణ్ణి చంపగలుగుతామని యుధిష్టిరునితో చెపుతాడు.
యుధిష్టిరుడు ఈ అక్రమ పోరాటం పట్ల మొసలి కన్నీరు కారుస్తూ భీముడు కింద పడిన దుర్యోధనుడి తల తన్నినందుకు ఆక్షేపిస్తాడు. ఐతే, కృష్ణుడి సలహాను పాటించి భూమిని జయించామంటాడు. ధర్మరాజు తనపట్ల సంతృప్తి వహించినా దేవతలు మాత్రం చనిపోతున్నధుర్యుధనుని పైన పూలవర్షం కురిపిస్తారు. (Salya Parva) మహాభారతాన్ని పరిష్కరించిన సుక్తాంకర్ ఈ సంఘటనలను ఎవరో చేర్చారంటూ వదిలేసాడు.


అధ్యాయం తొమ్మిది
రాజకీయ వేత్త కృష్ణుడు
బంకిమ్ చంద్రచటర్జీ దేశభక్తుడు. బ్రిటిషు వారి హయాంలో ఉద్యోగిగా ఉన్నప్పటికీ జాతీయవాదిగా హిందూ అనుకూల ధోరణులు కనబరచాడు. మానవవాదిగా ప్రారంభించి మతవాదిగా మారాడు. దేశంలో నవలా ప్రక్రియకు ఆద్యుడు. మహాభారతంలో, కృష్ణుడిలో ప్రేరేపణలు అన్వేషించాడు. కృష్ణుడి దైవత్వంలో నమ్మకం చూపాడు. రాజ నీతిజ్ఞుడుగా కృష్ణుడిని గురించి రాశాడు.
ఫ్రెంచి జిజ్ఞాసి కామ్టే ప్రభావంతో బంకించంద్ర కొనసాగాడు. దేశభవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పునరుజ్జీవనం కోసం కృష్ణుడిని ఆదర్శంగా స్వీకరించాడు.
ఆధునిక భారత సాహిత్యాన్నికి ఆధ్యుడైన బంకించంద్ర కృష్ణుడిని స్వీకరించటంలో పొరపాటు పడ్డాడు. పురాణాలూ, గాధల నుండి కృష్ణుడిని వేరు చేసి చూడటం సంభవంకాదు. మహాభారతంలో కృష్ణుడిని కూడా రాజనీతిజ్ఞుడుగా స్వీకరించటంలో చాలా లోపాలున్నాయి. అదీగాక, దేశాన్ని ముందుకు నడపాలంటే గతంలోనే దృష్టి పెడితే చాలు. కృష్ణుడు గతానికి మాత్రమే చిహ్నం. అతడి కాలం, ఆనాటి చారిత్రక శక్తులూ భిన్నమైనవి. రాముడి విషయమూ అంతే. బంకించంద్ర కృష్ణుడిని, గాంధీ రాముడినీ స్వీకరించారు. గాంధీ రామరాజ్యం అంటూ నిత్యం రామధున్ తో ప్రారంభించి ముగించేవాడు. తన రాముడు దశరధుని కుమారుడు కాడనీ, దైవం అనీ అనేవాడు. రామనామం అన్నిరోగాలనూ నయం చేస్తుందనేవాడు. గాంధీ, బంకించంద్ర స్వీకరించిన సంకేతాలు భారతదేశాన్ని బాధిస్తున్నాయి.
బంకించంద్ర తన కృష్ణ చరిత్రలో లోకాతీత విషయాలను పక్కకు బెట్టాడు. పురాణాల్లో కృష్ణుడికి సంబంధించినవన్నీ కొట్టిపారేశాడు. జయదేవుడూ, విద్యాపతి స్వీకరించిన కృష్ణుడిని అతను ఆమోదించలేదు. మహాభారతంలో కృష్ణుడిని సహితం బంకించంద్ర వాస్తవమని అంగీకరించలేదు. నరకుడితో యుద్ధం, తదనంతరం స్వీకరించిన అనేకమంది కన్యల విషయం మిధ్యఅన్నాడు. కృష్ణుడి భార్యలు 22 మంది మాత్రమేనని అన్నాడు. కృష్ణుడి భార్యలు 10 మందినే ప్రస్తావించాడు. సత్యభామను సత్యగానూ, జాంబవతిని రోహిణిగానూ చూపాడు. అష్టమహిషీలలో 5 గురిని గురించి తెలియదు గనుక అవి తొలగించాలన్నారు. ఎలుగుబంటి కుమార్తె జాంబవతిని, కృష్ణుడు పెళ్ళాడాడని అనటం అర్థంలేని దన్నాడు. ఇక మిగిలింది ఇద్దరే భార్యలు. సత్యభామను కాదనలేకపోయినా ఆమెను కూడా విస్మరించి కేవలం రుక్మిణి మాత్రమే అసలు భార్యగా పేర్కొనాలన్నాడు. మొత్తం మీద కృష్ణుడిని ఏకపత్నీ వ్రతునిగా చేశాడు.
బంకించంద్రుడు కృష్ణుడిలో రాజకీయవేత్తను చూచాడు. దేశ ఐక్యత సాధించేవాడిగా పేర్కొన్నాడు. మజుందార్ కృష్ణచరిత్రపై నిశిత పరిశీలన చేశాడు. అందులో కృష్ణుడు నాయకుడు కాదనీ, బంకించంద్ర హేతుపద్దతి మాత్రమే కనిపిస్తుందనీ అన్నాడు (Majundar : Krishna in History and Legend)
బంకించంద్రను మించిపోయి కృష్ణుడిని గొప్పరాజనీతిజ్ఞుడుగా చూపటానికి కె.యం. మున్షీ ప్రయత్నించాడు. దేశాన్ని ఐక్య పరచటానికి యుధిష్టిరుని ఆధిపత్యాన్నీ గొప్పజాతి రూపొందించటానికి కృష్ణుడు ప్రయత్నించాడన్నాడు. ఆనాడు భారతదేశంలో బీహారు ప్రాంతంలో వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రాంతం అపవిత్రంగా భావించాడు. అలాంటి దేశాన్ని ఐక్య పరచటానికి కృష్ణుడు ప్రయత్నించాడనటం అర్థం లేదు. బుద్ధుని జీవిత కాలంలో 16 మహాజన పదాలుండేవి. క్రీ.పూ. 320 నాటికి మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. ఆటవిక పాలకుల స్థానే రాజరికం వచ్చింది. (Niharranjan Ray : Mahabharatha, K.M. Munshi, Krishna Vatara, the Magic Flute).
మౌర్య సామ్రాజ్యనికి పూర్వం పురాణాలలో చిత్రించిన దిగ్విజయాలన్నీ చరిత్ర కాదు. అవి గాధలూ, కట్టుకథలు మాత్రమే. (D.C. Sirkar : Mahabharatha, Myth and Reality)
దేశంలో ఐక్యత మాట అలా ఉంచి కృష్ణుడు తన యాదవులనే ఐక్యపరచలేకపోయారు. ద్వారకలో యాదవులెందరు. మజుందార్ రాస్తూ ద్వారకలో యాదవులు 3 కోట్ల నిమత్స్య, అగ్ని పురాణాలు చెప్పాయన్నాడు. స్కంధ పురాణాంలో వీరి సంఖ్య 56 కోట్లుగా ఉన్నది. కృష్ణుడికి 9 లక్షల స్వర్ణ మందిరాలున్నాయి. భాగవతం ప్రకారం యాదవుల సంఖ్య లెక్కింపరానిది. యాదవకుమారులలో ఉపాధ్యాయులే 3 కోట్లపైగా ఉన్నారు. బహుశ స్వర్గం నుండి వీరికి ఆహారం అంది ఉండవచ్చునని మజుందార్ వ్యాఖ్యానించాడు.
యాదవులు మధుర, విదర్భ, అవంతి, మహిష్మతిలలో కూడా ఉన్నారు. కృష్ణుడి నాయకత్వాన్ని వారంగీరించలేదు. కురుక్షేత్ర యుద్ధంలో అత్యధిక యాదవులు కౌరవుల పక్షాన ఉన్నట్లు పుసల్కర్ రాశాడు. (A.D. Pusalkar, The History and Culture of Indian People, London 1957)
భోజులూ, అంధకులూ, వృషిణులు, యాదవులకు భిన్నమైన జాతి, ద్వారకలోని యాదవులలో పాండవులకు సంబంధించింది కృష్ణుడు మాత్రమే. మిగిలిన వారు కౌరవులతో ఉన్నారు. కృష్ణుడి కేంద్రం సంఘముఖ్యం.
శాంతిపర్వంలో ఈ ప్రస్తావన ఉన్నది. తనను అర్థ భోక్తగానూ, కృష్ణుడు చెప్పుకున్నాడు. రెండవ సంఘముఖ్యుడు బలరాముడు కావచ్చు. అతడు తటస్తుడు. కృష్ణుడి కుమారులు ప్రద్యుమ్మ, సాంబు కూడా తటస్తులే. యాదవులను ఐక్యపరచలేని కృష్ణుడు దేశమంతటినీ ఐక్యపరుస్తారనుకోవటం అర్థం లేనిది. కృష్ణుడిని దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడిగా భావించటం ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి చెప్పటమే
అధ్యాయం పది
దేవుడుగా కృష్ణుడు
మానవుడుగా కృష్ణుడికంటె, రాజనీతిజ్ఞుడుగా కృష్ణుడికంటె, దేవుడుగా కృష్ణుడికి అంత ఖ్యాతి లేదు. మహాభారతంలో మనిషిగా ప్రవేశించి దేవుడుగా నిష్ర్కమిస్తాడు. పురాణాలలో అద్యంతాలూ దేవుడుగానే ఉంటాడు. కనుక ఇతిహాసాలూ, పురాణాలు కలిపి చూస్తే కాని, దేవుడి విషయం బయటపడదు.
కృష్ణుడి బాల్యదశలో చేష్టలూ, అద్భుతాలూ అంతగా బంకించంద్ర చటర్జీ పట్టించుకోలేదు. కృష్ణుడి దైవత్వంలో మాత్రం నమ్మకం ఉంచాడు. బాల్యదశలో చెప్పినవన్నీ అలంకార ప్రాయాలన్నాడు. పిఠాపురం పెండ్యాల శాస్ర్తి ఈ అద్భుతాల గురించి నిర్మొహమాటంగా చెప్పారు. పూతన చిన్న పిల్లలరోగమనీ, రాక్షసి కాదనీ అన్నాడు. భారతీయ వైద్య గ్రంధాలలో ఆ రోగ ప్రస్తావన ఉన్నది. ఇప్పటికీ గ్రామాలలో పిల్లల జబ్బుల్ని పోగొట్టటానికి కొన్ని క్రతువులు చేస్తుంటారు. కేసి, సాదేరధ, ఉల్లూక అనే దయ్యాలను కంసుడు కృష్ణుడిపైకి పంపిస్తాడు. రెండు చెట్లమధ్య కృష్ణుడిని కట్టేసినట్లు చెప్పిన కథలో ఉల్లూక అనేది దోషపూరిత దయ్యం పేరే. మిగిలిన కృష్ణలీలలు కూడా ఊహించిన మూఢనమ్మకాలే అని పెండ్యాల శాస్ర్తి పేర్కొన్నాడు.
కౌరవసభలో ద్రౌపది వస్ర్తాపహరణం జరుగుతుండగా ఆమె కృష్ణుడిని ప్రార్థించటం, అతడు దివ్యశక్తులలో ఆమెను కాపాడటం కథగా చెపుతారు. శాస్త్రి ఈ విషయమై రాస్తూ మహాభారతంలో 13 సందర్భాలలో ఈ అవమాన ప్రస్తావన ఉన్నదనీ, 3 సార్లు వివస్ర్తను చేయటనికి ప్రయత్నించారనీ, మిగిలినప్పుడు కథలో ఆమెను జుట్టుపట్టుకొని ఈడ్చారనీ ఉన్నది. రెండు సందర్భాలలో మాత్రం తన అవమానాన్ని గురించి కృష్ణుడికి నివేదించుకున్నది. అందులో తనను వివస్త్ర గావించటానికి చేసిన ప్రయత్నం గురించి గానీ, తనను కాపాడినందున కృతజ్ఞతగానీ తెలిపినట్టు లేదు. ఈ ఉదంతం జరిగినప్పుడు కృష్ణుడు ద్వారకలో లేడు. సాళ్వుడితో పోరాటం అంటూ ఏమీ లేదు. తిరిగివచ్చిన తరువాత యుధిష్టిరుడి జూదం, దాని తీవ్ర పరిణామాలూ విన్నాడు. కనుక ద్రౌపది మొరబెట్టుకోటం, కృష్ణుడు కాపాడటం ఆధారాలు లేవు. భాసుడూ, భారవీ, క్షేమేంద్రుడూ మహాభారతాన్ని గురించి రాసినప్పుడు ద్రౌపదీ వస్త్రాపహరణం ప్రస్తావన లేదు.
రాజసూయ యాగంలో ముందుగా ఎవరిని గౌరవించాలనే విషయమై పేచీరాగా కృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్న శిశుపాలుడు పోరాటానికి సన్నద్ధుడై వెళ్ళిపోతాడు. యుధిష్టిరుడతణ్ణి శాంతింపజేసి తీసుకువస్తాడు. అయినప్పటికీ శిశుపాలుడు తన అభ్యంతరాన్ని కొనసాగిస్తుండగా కృష్ణుడు చక్రంతో అతణ్ణి హతమారుస్తాడు. కృష్ణుని ప్రేరేపణతో భీముడు జరాసంధుడిని చంపుతాడు. జరాసంధుడు అప్రమత్తుడుగా లేనప్పుడు అది జరిగిందని శాస్త్రి రాశాడు.
శీతానాధ్ తత్వభూషణ్ కృష్ణుడి దైవలీలను గురించి తీవ్ర ఆరోపణలు చేశాడు. కంసుణ్ణి చంపిన తీరు ప్రస్తావిస్తూ కంసుడు పురికొల్పినప్పుడు పోరాటంతో కృష్ణుడతణ్ణి చంపలేదనీ, మల్లయుద్ధం పోటీలు తిలకిస్తున్న కంసుణ్ణి హఠాత్తుగా జుట్టుపట్టుకొని వేదిక నుండి కిందికి విసిరేసి చంపాడని అంటాడు. శిశుపాలుడూ, సాల్యుడు, శతధన్వుడు కృష్ణుడి చేతిలో చనిపోయిన తీరుగూడా అతడు ప్రస్తావించాడు. పురాణాల రచయితలకు చంపడం దివ్యచర్యగా ఉన్నది. కృష్ణుడు తన దివ్యత్వాన్ని ప్రశ్నించిన పౌండ్రుని చంపాడు. పౌంద్రుడు ద్వారకపై దండెత్తినట్లు కూడా రాశాడు. కృష్ణుడు ధరించిన విష్ణు చిహ్నాలను, శంకుచక్రాలను, పద్మం, పౌండ్రుడు ప్రశ్నించాడు. అందుకే కృష్ణునికి ఆగ్రహం వచ్చింది. (Seetanath Tatwabhushan : Krishna And the Geetha, Calcutta).
కృష్ణుడు అపహరణల్లోనూ ప్రసిద్ధి చెందాడు. శిశుపాలుడితో పెళ్ళాడాల్సిన రుక్మిణిని ఒకరోజు ముందు అపహరించాడు. మిత్రవిందను స్వయంవర సభ నుండి అపహరించాడు. మద్రరాజు కుమార్తె లక్షణాలను బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకున్నాడు. నరకుడి కొలువులోని 16 వేల మంది స్ర్తీలను భార్యలుగా స్వీకరించాడు. భార్యల సంఖ్య 16,008 కాగా, పురాణాల ప్రకారం 16,022 అని బంకించంద్ర చూపాడు. హరివంశం ప్రకారం కృష్ణుడికి ఆడపిల్లలు లేరు. మగ సంతానం లక్ష 80 వేలు మాత్రమే. భాగవతాన్ని బట్టి కృష్ణుడు 125 ఏళ్ళు బతికాడు. దీని ఆధారంగా బంకించంద్ర లెక్కలు వేసి రోజుకు 4 గురు చెప్పున కృష్ణుడు పిల్లలను కన్నాడని చెప్పాడు. కృష్ణుడు 14 ఏళ్ళ వరకూ పిల్లలను కనజాలడనీ, 80వ ఏడు తరువాత పిల్లల లేరనీ మజుందార్ చూపాడు. మిగిలిన 66 ఏళ్ళలో రోజుకు 7.5 కుమారులు చొప్పున పుట్టారన్న మాట.
కృష్ణుడు ఒక పథకం ప్రకారం ద్వారకా నగరాన్ని రూపొందించాడని పురాణాలు చెపుతున్నాయి. హరివంశం ప్రకారం ద్వారకలో వేలాది మంది స్త్రీలను వ్యభిచారంలో ఉన్నవారిని స్థిరపరిచారు. హరివంశం ప్రకారం ఆ స్త్రీలకు తగ్గట్లే పురుషుల్నీ, వసతి గృహాల్నీ తెరిపించాడు. ఆనాడు కృష్ణుడి సోదరుడు బలరాముడే పెద్ద తాగుబోతు. కల్లుముంత లేకుండా అతడు కనిపించేవాడు కాదు. అందుకే హరిప్రియ అని కల్లుకు మారుపేరు వచ్చింది. అక్కడ అన్ని రకాలైన మాంసభక్ష్యాలూ లభించేవి. కృష్ణుడు కూడా వాటిననుభవించే వాడు. మజుందార్ ద్వారకను గురించి రాస్తూ హరివంశం ప్రకారం యాదవులు ఈ స్త్రీలను తమ కుటుంబాలతో పాటు సముద్ర తీరాలకు తీసుకువెళ్ళి జలకాలాడుతూ, తాగుతూ తింటూ అనుభవించేరన్నాడు. కృష్ణుడి సంతానం, ఇతర కుటుంబీకులూ, బట్టలూ, నగలూ ఒడ్డున పెట్టి జలక్రీడలలో నిమగ్నులయ్యేవారు. యాదవ స్ర్తీ పురుషులంతా తాగుడుకు అలవాటు పడ్డవారే.
ద్వారకానగరం పవిత్రమో కాదో గాని, కృష్ణుడి ఆధ్వర్యంలో విలాసవంతంగా మాత్రం ఉన్నది. హరివంశం ప్రకారం అలా ఉన్నదన్నా సనాతనులకాగ్రహం వస్తుంది. సుక్తాంకర్ అదంతా మూర్ఖత్వంగా కొట్టిపారవేయదలిచాడు. కృష్ణుడు తన దైవలీలల్ని అనేక సందర్భాలలో చూపినా, చదువుకున్నవారు సహితం వాటి లోతుపాతుల్ని చూడలేక పోతున్నారన్నాడు.
కృష్ణుడి విషయంలో ఉత్తమ నిర్ణేతలు యాదవులే. వారి దృష్టిలో అతడు దేవుడు కాదు. వారెప్పుడూ అతణ్ణి పూజించలేదు. మజుందార్ ఈ విషయాలను స్పష్టంగా రాశాడు. అక్రూరుడూ, కృతవర్మ కృష్ణుడి పట్ల శమంతకమణి విషయంలో చూపిన ధోరణి, శిశుపాలుడూ, దంతవక్ర్తుడు, దైవాతకుడూ, ప్రభాసుడూ కృష్ణుడిపట్ల గౌరవం చూపలేదు. అతడిని దేవుడుగా చూడకపోవటం యాదవుల దురదృష్టమని భాగవతంలో అన్నారు.
కృష్ణుడి కొడుకులు ప్రద్యుమ్నుడూ, సాంబుడు సహితం తండ్రిని గౌరవించలేదు. పెంపుడు తల్లి మాయాదేవిని ప్రద్యుమ్ముడు పెళ్ళాడాడు. హరివంశం వజ్రనాభుడి కుమార్తె ప్రభావతిని ప్రద్నుమ్నుడు ఆకట్టుకుంటాడు. కృష్ణుడి 16 వేల మంది భార్యల్నీ అతని కుమారుడు సాంబువాడుకున్నట్లు, వరాహపురాణం చెపుతున్నది. అందుకు సాంబుడిని కుష్టురోగిగా సాంబువాడుకున్నట్లు శపిస్తాడు. ద్వారకా నగరంలో పురుష జనాభా హరించి పోతుండగా వారిని కాపాడాలని అర్జునుడు ప్రయత్నించి కూడా విఫలుడౌతాడు. హస్తినా పురానికి తీసుకువెళుతున్న ద్వారక జనాన్ని అర్జునుడు కాపాడలేక పోయాడు. ఆఖరులో వారిపై దండెత్తి చాలామంది స్త్రీలనెత్తుకపోయారు. అందులో ముగ్గురు తప్ప, కృష్ణుడి భార్యలు కూడా ఉన్నారు.
కృష్ణుడి దివ్యత్వాన్ని చాలామంది నమ్మలేదు. హాప్ కిప్స్ ఈ విషయం రాస్తూ గీత ప్రకారం కృష్ణుడిని దేవుడుగా గుర్తించి పూజించిన వారు కొద్దిమందే అన్నాడు. (గీత 9వ అధ్యాం, 11వ శ్లోకం) పతంజలి మహాభాష్యం కూడా కృష్ణుడిని నాయకుడిగా తప్ప దేవుడుగా గుర్తించలేదు. (E.W. Hopkins : The Great Epic of indian Literature)
శీతానాధ్ తత్వభూషణుడి ప్రకారం కృష్ణుడి కథ అంతా అద్భుత కల్పనలే. మహాభారతం, పురాణాలూ ప్రస్తావించినదాన్ని బట్టి చూస్తే కృష్ణుడు దైవావతారం కానేరదు.
డి.డి. కోశాంబి ధైర్యంగా, నిర్మొహమాటంగా కృష్ణుడు గురించి రాశాడు. అవకాశవాదానికి ఆయువు పట్టుగా ఉన్న గీతావాదనలు నాటి సమాజంలోని ఆదిమ ఉత్పత్తి దశకూ, మతానికీ ప్రతిబింబంగా ఉన్నవన్నారు. (D.D. Kosambi) కోశాంబి లాంటివారే అలా మాడుపగుల కొట్టగలిగేట్లు చెప్పగలరు.
అధ్యాయం పదకొండు
గీత ఎవరు రాశారు?
మనకు తేదీలు లేని చరిత్ర ఉన్నట్లే, పేరు లేని రచయితలున్నారు. అలాంటి వారే గీతను రచించారు. గీత మాట్లాడిందీ కాదు, ఆలాపించిందీ కాదు. కేవలం రాశిందే. అందుకు గీతలోనే ఆధారాలున్నాయి. ఈ పవిత్ర సంబాషణను ఎవరు చదివినా-అంటూ కృష్ణుడు చెప్పటమే అందుకు ఆధారం. (18వ అధ్యాయం, 70వ శ్లోకం) తాము చెపుతున్న తాత్త్వికవచనాల్ని సంజయుడు వింటున్నాడని కృష్ణుడికి తెలియదు. వ్యాసుడు తన ఇంద్రియాతీత శక్తులతో సంభాషణంతా పొందుపరుస్తూన్నాడని తెలుసా. దేవుడు గనుక వాటన్నిటినీ గ్రహించాడా. కురుక్షేత్రంలో అర్జునుడు కుప్పగూలిపోతాడనీ, అతన్ని ప్రోత్సహించి పోరాడమని చెప్పవలసి వస్తుందనీ కృష్ణుడికి ముందే తెలుసా. ఇది కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకటం వంటిది కాదు. రాసిన దాన్నే చదవగలరు. అనూహ్యపరిణామంపై అప్పటికప్పుడు మాట్లాడిన దానిని చదవలేదు. అర్జునుడితో తన సంభాషణను పవిత్రం అనటం సరైనాదేనా. సుక్తాంకర్ దృష్టిలో మన ప్రమాణాలను దేవుళ్ళకు అంటగట్టకూడదు. గీతను భిన్న సమయాలలో విభిన్న వ్యక్తులు రాశారు. కృష్ణుడి జీవితాన్నీ, కాలాన్నీ మహాభారతం, పురాణాల దృష్య్టా చూచినప్పుడు అతడు గీతా రచయితకాదని తేలిపోతుంది. భాగవతంలో బాల్యచేష్టల పిల్లవాడు తాత్త్వికుడు కాలేడు. మహాభారతంలోని జిత్తులమారి తాత్త్వికుడు కాలేడు. నేను కృష్ణభక్తుడిగా కాక ఆలోచనా జీవిగా చూస్తున్నాను. భక్తుడైతే పారవశ్యంతో మనసు కుంచింప చేసుకుంటాడు. పూనకం ఎక్కువైన కొలదీ దేవుడికి సన్నిహితుడుగా భావిస్తాడు. కృష్ణుడు మెకవెల్లి అవుతాడేమొగాని సోక్రటీస్ కాలేదు. తాత్వికుడి స్వభావం అతడికి లేదు.
కృష్ణుడు గీత రచయిత కాదనడానికి కొన్ని కారణాలున్నాయి. అంగీరసుడు శిష్యుడని ఆదిశంకరాచార్యుడు చేసిన ప్రచారం కృష్ణుణ్ణి గురించి కేవలం కల్పితగాధే. పురాణాలను బట్టి వారణాసి వద్ద అవంతిపూర్లో సందీపుని వద్ద కొద్దికాలం కృష్ణుడు ఉన్నాడు. ఉత్తరోత్తరా అతడికి చదివే అవకాశమే లేదు. అమ్మాయిల మీదున్న ఆసక్తి అధ్యయనంపై లేదు. వేదవేదాంగాల జిజ్ఞాసి అని భీష్ముడు చెప్పిన మాటలను అంతగా పట్టించుకోనక్కరలేదు. యుధిష్టిరుడు రాజసూయ యాగంలో ప్రథమ తాంబూలం భీష్ముడికి యివ్వవలసింది. అందుకు మారుగా ఆ గౌరవం ఎవరికి దక్కాలో చెప్పమని భీష్ముడినే అడిగాడు. రాజుపేరు చెపితే చిక్కువస్తుందని అతడు కృష్ణుడి పేరు చెప్పాడు. భీష్ముడి అనౌచిత్యాన్ని శిశుపాలుడు ప్రశ్నించాడు. కృష్ణుడిని అజ్ఞాని అన్నాడు. కృష్ణుణ్ణి సమర్ధించటం విజ్ఞాననిధిగా, భీష్ముణ్ణి పొగిడాడు. అంతమాత్రన అతడే గీతా కారుడంటానికి వీలులేదు. కృష్ణుడు మిధ్యకాదనీ, కురుక్షేత్ర యుద్ధం జరిగిందనీ అనుకొందాం.
యుద్ధ సమయంలో కృష్ణుడి వయసెంత? ద్రౌపదీ స్వయంవరంలో అతడి వయసు 64. అర్జునుడు సుభద్రను పెళ్ళాడినప్పుడు కృష్ణుని వయసు 80. కురుక్షేత్ర యుద్ధం నాటికి 94 ఏళ్ళు అన్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం 36 ఏళ్ళకు కృష్ణుడు చనిపోయాడు. సి.వి. వైద్య అంచనా ప్రకారం క్రీ.పూ. 3185లో కృష్ణుడు పుడితే మహాభారత యుద్ధం నాటికి 84 ఏళ్ళుండాలన్నాడు. యుద్ధంలో పాల్గొనటానికి అది సరైన వయసు కాదు. ఐతే దక్షిణాఫ్రికాలో బ్రిటిషు సైన్యాల అధిపతిగా లార్డ్ రాబర్ట్స్ ఉన్నట్లు ఫీల్డ్ మార్షల్ చెప్పారు. కనుక 84 ఏళ్ళపుడు కృష్ణుడు రథసారధి కావటంలో తప్పులేదన్నాడు. ఆధునిక యుద్ధాలకూ, ప్రాచీన యుద్ధాలకూ తేడా అతను గమనించినట్లు లేదు. మహాభారత యుద్ధంలో కృష్ణుడు తప్ప రథసారధులందరూ చనిపోయారు. కాని కృష్ణుడికి యుద్ధ నియమాలేవీ సోకినట్టు లేదు అని హాప్ కిన్స్ రాశాడు. (E.W. Hopkins, The Social And Military Position of the Ruling Caste in Ancient India, 1972, Varanasi)
కృష్ణుడు రథసారధిగా వృధ్యాప్యంలో పనిచేయటం, అప్పుడే గీతాలాపన చేయటం అసంబద్ధమైన విషయాలు. శీతానాధ్ తత్త్వభూషణ్ అదే విషయాన్ని చెపుతూ క్రీ.పూ. 12వ శతాబ్దంలో ఉన్న వ్యక్తి గీతను చెప్పి ఉండడని అభిప్రాయ పడ్డాడు. (Krishna Ad the Geetha) గీతను బయట నుంచి ప్రవేశ పెట్టినట్లు 1863లో వెబర్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక అది కలగా పులగమైన రచన అన్నాడు. (Quest for the Original Geetha, Quoted by G.S. Khair, 1969 Bombay) 1877లో మోనియర్ విలియమ్స్ రాస్తూ గీత ఒక ఆణిముత్యమనీ, ఐతే అది మహాభారతంలో చొప్పించారనీ అన్నాడు. బహుశ బ్రాహ్మణుడో, వైష్ణవుడో, తాత్త్వికుడో ఈ పని చేసి ఉండవచ్చునని అన్నాడు. ఆ తాత్త్వికుడు కృష్ణుడు మాత్రం కాదు. గీతను ఒకవైపున పొగుడుతూనే అందులో అసంబద్ధాలున్నా యన్నాడు. (E.W. Hopkins, Religions of India)
రిచర్డ్ గార్బ్ జర్మనీలో గీతను గురించి రాశాడు. దీనిని కె.ఎస్. ఉపాధ్యాయ ఉదహరించాడు. తొలుత గీత సాంఖ్య సారాంశమనీ, ఉత్తరోత్తరా ఓ వేదాంతి దీనిని విస్తరించి ఉండవచ్చుననీ అన్నాడు. గార్బ్ ఉద్దేశంలో తొలిగీతలో 528 శ్లోకాలున్నాయి. (K.N. Upadhaya : Early Buddhisnm And Bhagavat Geetha)
రుడాల్ఫ్ ఓటో గీతపై తన సిద్ధాంతాలను ప్రకటించాడు. తొలిగీతలో 28 శ్లోకాలే ఉన్నాయంటాడు. తరువాత నెమ్మదిగా చేర్చుకుంటూ వచ్చారంటాడు. (Rudolf Otto : The Original Geetha, London 1936)
గీతాకారుడెవరో మనకెంత తెలుసో ఓటోకి అంతే తెలుసు. అది రాసింది మతకర్త కాదనీ, గొప్ప కవిమాత్రమే అలా సృష్టించగలడనీ అన్నారు.
మహాభారతం కంటే గీత ముందు రాశారనీ, తరువాత 80 శ్లోకాలలో మహాభారతం ప్రస్తావన తెచ్చారనీ ఎస్.సి. రాయ్ అన్నారు. బౌద్ధం కంటె ముందే గీత ఉన్నదని అన్నారు. (The Bhagavat Geetha And Modern Scholarship, Quoted by B. Majundar Krishna in History)
సురేంద్రనాథ్ దాస్ గుప్త బౌద్ధానికి ముందే స్వతంత్ర గ్రంథంగా గీత ఉన్నదనీ, దాన్ని మహాభారతంలోకి తెచ్చారనీ, గీతకున్న పవిత్రత దృష్ట్యా అలా చేశారన్నాడు.
గీతపై పరిశోధించిన ఫ్రాంక్లిన్ ఎడ్గర్ టన్ గీతను సమైక్య రచనగా పేర్కొన్నాడు. భారతంలో ఇది భాగం కాదనీ, తరువాతనే దీన్ని ప్రవేశపెట్టారన్నాడు. గీతను ప్రార్థనా గ్రంథంగా వాడిన గజానన్ శ్రీపతిఖేర్ 26 శతాబ్దాల క్రితం జరిగిన గీతారచన ఇంకా భారతీయుల్లో ప్రతిధ్వనిస్తుందన్నారు. భౌతికవాదానికి దూరంగా, ఆధ్యాత్మిక వాదానికి చేరువగా ఉంచుతుందన్నారు. భగవాన్ కృష్ణుడు గీతను రాయలేదనీ, యుద్ధరంగంలో గద్యంలో జరిగిన సంభాషణంతా తరువాత గీతగా శ్లోకాలలో మలచి జొప్పించారనీ అన్నాడు. మొత్తం ముగ్గురు రచయితలు గీతను పూర్తి చేశారన్నాడు. (G.S. Krishna : Quest for the Original Geetha, Bombay 1969)
ఈ విధంగా చూస్తే గీత రచనల గురించి అనంతంగా చర్చ సాగుతుంది. అందులో ఆలోచనా సమైక్యతే ఉంటే, క్రమబద్ధమైన తత్త్వమే ఉంటే, ఇంత గందరగోళం వచ్చేది కాదు. మహాభారతం ఎంతకలగా పులగమే, గీత కూడా అంతే అని వింటర్ నిజ అన్నాడు.

అధ్యాయం పన్నెండు
ఎప్పుడు రాశారు?
గీత ఎప్పుడు రాసిందీ సరిగా తెలియకపోవటంలో ఆశ్చర్యంలేదు. మనవారికి చారిత్రక జ్ఞానం లేదు. కాలజ్ఞానం లేకపోవటమే అందుకు కారణం. సంవత్సరం అంటే మన వారికి బొత్తిగా అర్థం లేని విషయమే. దేవుళ్ళ దృష్టిలో అది ఒక రోజు మాత్రమే. ఒక జీవిత కాలానికీ మనవారు ప్రాధాన్యత యివ్వలేదు. అనంత గతజన్మలలో, భవిష్యత్తు జన్మలలో యిది ఒక బిందువు మాత్రమే. ఆత్మ, పరమాత్మలో లీనం కావటం అసలు లక్ష్యం. అది జరిగినప్పుడు కాలం ఆగిపోతుంది. కనుక కపిలుడు ఎప్పుడు అన్నాడు. కణాదుడు ఎప్పుడు బోధించాడు, కనిష్కుడు ఎప్పుడు పాలించాడు. కాళిదాసు ఎప్పుడు రచించాడు. అనేవి పట్టించుకోగూడదు. వారంతా క్షణకాలం వెలిగి కాలగర్భంలో కలిసిపోతారు. మనం కాలాతీతంగా సమయానికి మించిపోయి వాస్తవాన్ని చూడాలి. బ్రహ్మ, విష్ణు, శివుడు, రాముడు, కృష్ణుడు, మత్స్య, కూర్మావతారాలు మొదలగు వాటి నుండి బయటపడటం ఎలా? కాలాన్నీ, చరిత్రనూ పట్టించుకునేదెప్పుడు? ప్రాచీన భారత చరిత్రను నిర్దుష్టంగా రాసేదెలా? గీతను ఎవరు, ఎప్పుడు రాశారో నిర్ణయించేదెవరు?
మత గ్రంధాలూ, ఇతిహాసాలూ, ఆధారం లేని చరిత్రలూ నమ్ముకోవలసి వస్తున్నది. బుద్ధుడికి ముందే గీత ఉన్నదని ఊహిస్తున్నారు.
అలా చెప్పే ఎస్.బి.రాయ్, సురేంద్రనాధ్ దాస్ గుప్తాకు ఆధారాలేమిటి? గీతలో బౌద్ధ ప్రస్తావనలేదు. రామాయణం కర్తలకంటే మహాభారతంలో ప్రవేశపెట్టిన వారు తెలివైన వారు. బుద్ధుడు చోరుడని రాముడి నోట పలికించారు. బుద్ధుడికి ముందే రాముడున్న విషయం వారు విస్మరించారు. గీతలో బౌద్ధం ప్రస్తావన లేనప్పటికీ, గీతాశ్లోకాలపై బౌద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఆనాడున్న బ్రాహ్మణ వాదాన్ని దెబ్బకొడుతున్నా, బౌద్ధాన్ని తిప్పి కొట్టాలనే ప్రయత్నంతో గీతారచన సాగింది.
బుద్ధ, ప్రతిబుద్ధ అనే మాటలు ఇతిహాసంలో తరచుదొర్లాయి. సంస్కృతంలో స్ధూప అనే అర్థం గల పదం ఎక్కువసార్లు కనిపించింది. దేశమంతా స్థూపాలతో నిండినట్లు గమనిస్తే బౌద్ధం తరువాతనే మహాభారత రచన సాగినట్లు తెలుస్తుంది.
గీతను ప్రాచీనతకు నెట్టి వేయాలని చూచేవారు గీతలో బ్రహ్మసూత్ర ప్రస్తావనను తెస్తారు. బాదరాయణుడి బ్రహ్మ సూత్రమే గీతలో ఉంటే, బౌద్ధం అనంతరమే భగవద్గీత వచ్చి ఉండాలి. బౌద్ధంలోని క్షణిక వాదాన్నీ, శూన్యవాదాన్నీ బ్రహ్మసూత్రం కాదంటుంది. (సూత్రాలు 18-32 Majundar : Krishna in History and Legend)
బ్రహ్మ సూత్ర ప్రస్తావన అలా ఉంచి గీతలో వేదాంత ప్రస్తావన కూడా ఉన్నది. బౌద్ధం అనంతరం, బ్రహ్మసూత్రం అనంతరం గీత వచ్చిందనటానికి యిదొక ఆధారం.
కె.యల్. ఉపాధ్యాయ గీతకు సంబంధించిన తేదీలూ, వివిధ పండితుల పరస్పర విరుద్ధ అభిప్రాయాలూ ప్రస్తావించి, అవన్నీ సమస్యా పరిష్కారానికి అవరోధాలే తప్ప సహాయకారి కాదన్నాడు. రాధాకృష్ణన్, బాలగంగాధర తిలక్, ఆర్.జి. భండార్కర్ ప్రభృతుల భిన్నాభిప్రాయాలు చూపాడు. (K.L. Upadhya : Early Buddhism and the Bhagavadgeetha, Delhi, 1971)
డి.డి. కోశాంబి రాస్తూ గీతలోని సంస్కృతం క్రీ.త 3వ శతాబ్దానికి చెందినదనీ, కనుక అంతకుముందు ఉన్నదనటానికి వీలులేదన్నాడు. ఇదంతా పరిశీలిస్తే పతంజలి అనంతరం అనేక మంది రచనగా గీత ఆవిర్భవించి ఉంటుంది.
ఈ అభిప్రాయాలను చూచి వైద్య వంటి వారు మండిపడటం సహజం. 84వ ఏట కృష్ణుడు సుదీర్ఘ తాత్విక విషయాన్ని కురుక్షేత్రంలో చెప్పటంలో ఆశ్చర్యం లేదన్నాడు. మొదటి ప్రపంచయుద్ధంలో హైండ్ బర్గ్ 70వ ఏట యుద్ధరంగం నుండి చాలా పెద్ద సమాచారాన్ని పంపించలేదా అన్నాడు.
ఎస్.కె. బెల్వాల్కర్ మహాభారతాన్ని ఆధారంగా చర్చిస్తూ, గీత అందులో భాగం కాదని నిదర్శనాలున్నాయన్నాడు. చాలా తెలివిగల వారెవరో గీతను భారతంలో చేర్చి ఉండాలి. (S.K. Belwalkar : The Cultural Heritage of India Vol. II. Calcutta 1961 Page 136, 137).

అధ్యాయం పదమూడు
పవిత్ర గ్రంధంగా గీత
గీత వేదమూకాదు, వేదాంగమూ కాదు. దీనికి పవిత్రత తరువాత ఎప్పుడో గాని రాలేదు. ఆది శంకరాచార్యుడికి ముందు గీతను ఎవరూ తీవ్రంగా పట్టించుకోలేదు. గ్రంధంలో అంతర్గత ప్రతిభను బట్టిగాక శంకరాచార్యుడు తన కుల, శాఖ ఆసక్తుల దృష్ట్యా శ్రద్ధ వహించారు. వాదంలో అతడు దిట్ట. ఇబ్బందికరమైన మాటలను తనకనుకూలంగా మార్చేశాడు. ఎదుటివారి వాదనలను వారికిబ్బందికరంగా పరిణమించేటట్లు చేసేవాడు. జుగుప్సాకరమైన స్థితిని సానుకూలం చేసుకునేవాడు. నిస్సందేహంగా అతడు ప్రతిభావంతుడు. పాతేయటానికి వీలుగా సమాజాన్ని నిర్మించటంలో అందె వేసినచేయి. శంకరుడు ఆలోచనారంగంలో నాయకత్వం చేపట్టిన తరువాత భారతదేశం వాడిపోయింది. క్రీస్తు తరువాత ఎనిమిదివ శతాబ్దం నుండి శంకరుడి అనంతరం జాతిపతనమయింది. అతడి తరువాత సాహిత్య సృష్టి, విజ్ఞానం వట్టిబోయాయి. శంకరాచార్యుడు గీతను తవ్వితీశాడు. మెరుగుపెట్టాడు. శంకరాచార్యుడి అనంతరం గీతకు అధిపత్యం లభించిందని ఎస్.కె. బెల్వాల్కర్ అన్నాడు. (The Cultural Heritage of India, 1969).
కాలాది ఆచార్యుడు మార్గం చూపిన తరువాత రామానుజుడు, మధ్వుడు, వల్లభుడు గీతను తమ ప్రయోగాలకు వాడుకున్నారు. పతంజలి కాలంలో హిందూమతాన్ని మొదటిసారి తిరగదోడగా దక్షిణాది నుండి వచ్చిన 4 గురు ఆచార్యులూ రెండవసారి తిరగదోడారు. శంకరుడు కేరళనుండీ, రామానుజుడు తమిళనాడు నుండీ, మధ్వుడు కర్నాటక నుండి వల్లభుడు ఆంధ్రనుండి వచ్చారు. ఈ నలుగురూ దేశంలో అంధకారయుగానికి నిర్మాతలయ్యారు. 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకూ ఆదశ కొనసాగింది. స్వాతంత్ర్యానంతరం వారి ప్రభావం పూర్తిగా పోలేదు.
ఆచార్యులు 4గురూ గీతను తమకనుకూలంగా వాడుకున్నారు. అద్వైత గ్రంథంగా శంకరుడూ, విశిష్టాద్వైత రచనగా రామానుజుడూ, ద్వైతంగా మాధ్వుడు, శుద్ధ అద్వైతంగా వల్లభుడూ వాడుకున్నారు. ఈ ఆచార్యుల బాణీలో గీతకు భాష్యాలొచ్చాయి. భాష్యాలపై భాష్యాలొచ్చాయి. చెప్పిందే చెప్పటం హిందూ మతరచనల్లో అనుచానంగా వస్తున్నది. ఆలోచనారాహిత్యానికి అది నిదర్శనం. ఈ భాష్యాలను గురించి తెలుసుకోవాలంటే సురేంద్రనాధ్ దాస్ గుప్త రాసిన భారత తత్త్వ చరిత్ర చూడవచ్చు. అతడి జాబితాలో కూడా ప్రాంతీయ భాషలలో వచ్చిన పుస్తకాలు లేవు. మరాఠీలో జ్ఞానేశ్వరి ప్రస్తావన లేదు. తెలుగులో తిక్కన గీతపై ఉన్నతాభిప్రాయాన్ని వెల్లడించలేదు. భీష్మపర్వంలో కేవలం 35 పద్యాలతో సరిపెట్టి, 700 గీతాశ్లోకాలను కుదించివేశాడు.
అందరూ తిక్కనలు కారు. గీతానువాదాలు నిరంతరంగా వెలువడ్డాయి. వివిధ భాషలలో వచ్చాయి. 1785లో గీత ఇంగ్లీషు అనువాదం వెలువడింది. ఛార్లెస్ విల్ కిన్స్ ఇంగ్లీషు అనువాదాన్ని బాగా ప్రచారంలో పెట్టాడు. కంపెనీ పాలకులు దీనికి రాజపోషణ చేశారు.
గీత ఫ్రెంచి అనువాదం 1787లో వెలువడింది. ఎం.పరాద్ అనువదించాడు. ఐనా, జనంలో గీతాప్రభావం కనిపించలేదు. ఎడ్విన్ ఆర్నాల్డ్ చేసిన స్వేచ్ఛానువాదం గీతకు చాలా ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. దీనికి (The Song Celestial) పేరు పెట్టాడు.
హెన్రీ డేవిడ్ ధోరో గీత అనువాదాలలో ఏది చదివాడో తెలియదుగాని, గీతాస్నానం రోజూ చేస్తానని అన్నాడు. దాని ముందు ప్రపంచ సాహిత్యం అంతా మరుగుజ్జు వంటిదన్నాడు. రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్ గూడా భగవద్గీతను ఆకాశానికెత్తాడు. ఆవిధంగా గీత విదేశాల్లో కూడా ప్రభావాన్ని కనబరిచింది. అనువాదాలూ, భాష్యాలూ, సిద్ధాంతాలూ, స్తుతి పాఠాలూ వస్తూనే వున్నాయి.
గీతను రబ్బరువలె సాగదీసి చెప్పటానికి వీలుగా సంస్కృత భాషవాడారు. గాంధీకి, గాడ్సేకి గూడా గీత పవిత్రగ్రంధమే. ఎటుబడితే అటు వ్యాఖ్యానించటానికి వీలుగా గీత ఉన్నది. సంస్కృతంలో పదాలకు నానా ఆర్ధాలూ, భిన్న అర్ధాలూ ఉండటమే అందుకు కారణం. శ్రీ అనే పదానికి సంపద మొదలు విషం వరకు 20 అర్థాలున్నవి. అలాగే ధర్మం అనే పదానికి మతం మొదలు విల్లంబువరకు 23 అర్థాలున్నాయి. దీని సంయుక్త పదాలు 150 వరకూ ఉన్నవి. వాటిలో మళ్ళీ అనేక ఛాయాబేధాలున్నాయి. గీతలో వచ్చే ధర్మం, ఖర్మం, యోగం ఎన్నో విధాల చిత్రించే అవకాశం ఉన్నది. పురోహిత భాషలన్నింటికీ యీ లక్షణాలున్నాయి. అందులో సంస్కృతానికి ఇంకా ఆధిక్యాలున్నవి. ఈ విషయాన్ని డి.డి. కోశాంబి బాగా వివరించాడు.
గీత ఇంగ్లీషు తెలుగు అనువాదాలు, భాష్యాలతో నాకలాంటి అనుభవం ఉన్నది. దాదాపు 40 ఇంగ్లీషు అనువాదాలూ, 6 తెలుగు అనువాదాలూ నా సేకరణలో ఉన్నాయి. వీటిలో శంకరుడూ, రామానుజుడూ, మధ్వుడు, శ్రీధరుడూ, విల్ కిన్స్, డేవిస్, ఆర్నాల్డ్, తెలాంగ్, బిసెంట్, రాధాకృష్ణన్, ప్రభుపాద, మహేష్ యోగి, చిన్మయానంద, అరవిందో జహనీర్ వంటి వారున్నారు. చదువుతూ పోతే గందరగోళం కూడా పెరుగుతూ పోతుంది.
గీత పేరిట జరిగిన గ్రంధచౌర్యాలను ఉపాధ్యాయ వివరించాడు. ప్రధాన భావాలనేగాక, అనేక భాగాలను ఉపనిషత్తులనుండి గీత స్వీకరించింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయ చాలా మర్యాదగా పేర్కొన్నాడు. (Early Buddhism and the Bhagavad Geetha) ఉపనిషత్తులనుండి యథాతధంగా స్వీకరించినవి 22 చూపారు. ఇతర చోట్ల నుండి అరువు తెచ్చుకున్న భావాలు 13 వరకు చూపాడు. గీతభక్తులు శ్లాఘించే విషయాలలో ఉపనిషత్తుల నుండి కాపీ కొట్టేసినవి 7 చూపాడు. అందుకే కాబోలు గీతను ఉపనిషత్తుల సారాంశం అంటారు. అన్ని మతగ్రంధాలూ, యిలాంటి పనులు చేశాయి. గ్రంధ చౌర్యంలో గీతకు ప్రధమ బహుమతి లభించాలి.

అధ్యాయం పధ్నాలుగు
గీతకు తత్త్వం ఉందా?
పైథాగరస్ మొట్టమొదట తత్త్వం పద ప్రయోగం చేశాడు. ప్లేటో దీనికొక ప్రత్యేక శాఖగా పెంపొందించాడు. వారికి ముందు తత్త్వం లేదని అర్థం కాదు. అప్పుడూ ఉండేది. మానవుడు ఆశ్చర్యంతో, భయంతో, జిజ్ఞాసతో సూర్యోదయం, అస్తమయం ఎందుకు జరుగుతాయనీ, మేఘాలెలా ఏర్పడతాయనీ, వర్షాలెలా కురుస్తాయనీ, వరదలూ, తుపానులు, పిడుగులూ, మెరుపులూ దైవాగ్రహానికి సూచనలూ అనీ, చావుబ్రతుకులు అన్వేషణ, ప్రశ్నించటం మొదలు పెట్టినప్పటి నుండీ తత్వం పుట్టింది.
తొలుత తత్త్వంలో అన్ని శాఖలూ ఉండేవి. 18వ శతాబ్దం వరకూ ఈ ధోరణి అమలులో ఉన్నది. ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వంలో అందరినీ తాత్వ్తికులని పిలిచారు. తత్త్వంగా ఒక ప్రత్యేక క్రమశిక్షణను తరువాత రూపొందించారు. జ్ఞానం అంతటినీ స్వీకరించి, అర్థాన్ని సమకూర్చి జీవితానికొక గమ్యం, ప్రయోజనం చేకూర్చడాన్ని తత్త్వం ఉద్దేశించింది. జ్ఞానంగాని, అనుభవంగానీ జడప్రాయంకాదు. అవి పెరుగుతూ విస్తరిస్తూ ఉంటాయి. తత్త్వం కూడా అలాగే పెంపొందుతుంది. కాలక్రమేణా మార్పుల కనుగుణంగా తత్త్వం సాగిపోతుంది. తత్త్వం కేవలం ప్రపంచాన్ని విడమరచి చెప్పటమేగాక, మార్చుకుంటూ పోవాలని మార్క్స్ అన్నాడు.
భారతదేశంలో తత్త్వాన్ని దర్శనం అంటున్నారు. ప్రత్యక్షంగా చూడటమని దీని అర్థం. దేనిని చూడటం అంటే, ఆత్మ రూపాన్ని వ్యక్తిగా, పరమాత్మగా చూడటమన్నారు. ఆవిధంగా తత్త్వం దేశంలో గాడి తప్పింది. బాహ్యప్రపంచాన్ని పరిశీలించకుండా, హేతు బద్ధంగా ఆలోచించకుండా, శాస్ర్తీయ పరిశోధనలను గమనించకుండా, మానవుడికీ మానవుడికీ సంబంధాలు చెప్పటం కష్టం. ప్రపంచమంతా తత్త్వానికి చెందినదని విల్ డ్యూ రాంట్ అన్నాడు. (Willdurant : The Pleasures of Philosophy, Page 11). విశ్వమంతా భ్రాంతి అనుకుంటే తత్త్వం విజ్ఞానం లేని తత్త్వం శక్తిహీనమైనదని విల్ డ్యూ రాంట్ అన్నాడు. భారతీయ త్తత్వం విజ్ఞానాన్ని దూరంగా పెడుతుంది. ఆత్మ ఒకటే, ప్రపంచం అంతా మాయ అంటుంది. కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, ఊపిరి బిగబట్టి ఇంద్రియాలను పనిచేయనివ్వకుండా, మనసును స్థంభింపచేస్తే, ఆత్మ పరమాత్మలను ప్రత్యక్షంగా చూడవచ్చునంటుంది. వివిధ వేదాంత దర్శనాలు చెప్పేది ఇదే. ఇది నైతిక పతనానికీ, మానసిక రుగ్మతలకూ దారితీస్తుంది.
భగవద్గీతను తత్త్వం అనే కంటే మత ప్రమాణంగా భావించాలని రాధాకృష్ణన్ రాశాడు. (The Bhagavadgeetha, London 1956) గీతలో ఉన్నతత్త్వం ద్వితీయ స్థానానికి చెందినట్లు అతడు సూచించాడు. వాస్తవానికి అలాంటిదేమీ లేదు.
సందేహించడం తత్త్వం కావచ్చు కాని, పిడివాదం కాదు. గీత ఏవిధంగా చూచినా తాత్త్వికం కాదు. అందులో పిడివాదాలూ నిండిపోయి ఉన్నాయి. అది మొండివాదాల నిఘంటువు, ఆధ్యాత్మిక విద్య, మాయ, మంత్రం, యుగధర్మం వంటి పిడివాదనలు అందులో కనిపిస్తాయి. గీత నమ్మకాల పుట్ట అని హాప్ కిన్స్ అన్నాడు. నిర్ధారణ లేని ధోరణి, దాటవేసే పద్ధతి గీతలో హాప్ కిన్స్ చూసాడు. (E.W. Hopkins, Madras, 1953).
అరుణ్ శౌరి ఈ విషయంలో హాప్ కిన్స్ అభిప్రాయాలతో ఏకీభవించాడు. (Arun Showrie : Hinduism, Essence and Consequence : 1979).
గీతా సంప్రదాయంలో మునిగితేలిన రాధాకృష్ణన్ అయోమయం మధ్య అర్ధాన్నీ క్రమత్వాన్నీ చూచాడు. మానవ స్వభావం అంతా సమన్వయీకరణగా గీతలో కనిపిస్తుందన్నారు. రుషికీ, ఆటవికుడికీ మధ్య తాత్త్వికుడు ఎక్కడ యి ముడుతాడో ఇంకా రాధాకృష్ణ చెప్పాలి. గీతలో భిన్న రీతుల్ని సమన్వయించిన తీరు మనకు చూపటానికి రాధాకృష్ణ ప్రయత్నించాడు.
డి.ఎస్.శర్మ గీతలో ఎలాంటి సమైక్యతా లేదన్నాడు. క్రమత్వం చూడలేమన్నాడు. కాని, గీతను దివ్య కవిత్వమయంగా చూచాడు. పర్వతాలూ, సముద్రాలూ, అడవులూ ఎలా క్రమం లేనివో, గీత కూడా అంతే అన్నాడు. అది మతం, తత్త్వం కాదనీ, కవితా గానం అనీ పేర్కొన్నాడు. వీరిరువురిలో మనం ఎవరిని స్వీకరించాలి.
గీత అనంత ప్రశ్నలకూ దారి తీస్తుంది. అందులో పిడివాదం అలాంటిది. ఈ విషయాలనే అరవిందశర్మ అనేక ప్రశ్నల రూపంగా చూపాడు. నిజమైన గీత ఏదో చూపగలరా. లేదు. ప్రధాన ప్రశ్నలను దాటవేసే తీరులో గీత పయనిస్తుంది. దేవుడు ఒకప్పుడు వ్యక్తిగతమనీ, మరొకప్పుడు కాదనీ అంటుంది. (అధ్యాయం 9-17, 18) దేవుడు బ్రహ్మపదార్థం అంటుంది. (14వ అధ్యాయం, 27) మానవుడిలో దేవుడికి ఆసక్తి ఉందా. లేక పట్టించుకోడా. అవును, కాదు అంటుంది. (అధ్యాయం 9-22, అధ్యాయం 11-32,33,34) ఒక క్షణంలో ప్రేమ, దయ, క్షమాభిక్ష చూపిన దేవుడు, మరుక్షణంలో పగసాధిస్తాడు. ప్రపంచం వాస్తవమా. అవును. (అధ్యాయం 7-4) కాదు. అదంతా భ్రమ. (అధ్యాయం 7-14) నీవేమి చేయాలో, చేయగూడదో వేదాలు నిర్ణయిస్తాయి. (అధ్యాయం 16-24) కాదు. నీవు వేదాధికారం నుండి స్వేచ్ఛగా పయనించాలి. (అధ్యాయం 2-45, 46) యజ్ఞాలు కావాలి. అవును. మరోచోట అవసరం లేదు. పూజలు చాలు అంటుంది. ఇలా అనంతంగా పరస్పర వైరుధ్యాలు సాగుతాయి.
గీతాభిమానులు ఈ వైరుధ్యాలను కేవలం పైకి కనిపించేవిగా భావించి వాస్తవం కాదని కొట్టిపారేస్తారు. వారంతా కావాలని కళ్ళు మూసుకుంటున్నారు. ఒకవైపు అహింసను పేర్కొంటూ మరొకవైపు యుద్ధాన్ని పురికొల్పారని డి.డి. కొశాంబి రాశాడు. (Myth and Reality, Bombay, 1962). ఇది కూడా పైకి కన్పించే విరుద్ధత్వమైనా. కె.టి. తెలాంగ్ గీతక్రమం లేని రచన అనీ, ఈ విషయంలో ఇది ప్రాచీన ఉపనిషత్తులకు పోలిందనీ అన్నారు. (K.T. Telang, The Bhagavad Geetha with the Sanastugatiya and Anugita Oxford, 1908).
అప్పుడప్పుడూ వేదాలూ, వేదక్రతువులపై గీతలో అన్న విసురులు చూపి మతంపై తిరుగుబాటుగా కొందరు చూపుతున్నారు. అసలు విషయమేమంటే ఎవరికేది కావాలో అది చెప్పి అందరినీ వలలో వేసుకోటమే గీత చేసిన పని. ఫ్రాంక్లిన్ ఎడ్గర్టన్ అదే రాశాడు.
కలగా పులగం అనేది గీతకు ప్రత్యేక లక్షణం. భిన్న ఆలోచనా స్రవంతులను సరిదిద్ది సమన్వయ పరుస్తున్నదని రాధాకృష్ణ అన్నాడు. అది అడ్డగోలుగా పయనించటమే. గతంలోనూ, నేడూ దేశంలో ఇదే జరుగుతున్నది. కలగా పులగంలో సమన్వయం లేదు. భిన్న ఆధారాలనుండి విభిన్న భావాలు స్వీకరించి ఒకే తీరులో సమన్వయీకరంచాలనటం కుదిరే పని కాదు. అది ద్వంద్వ మనస్తత్వానికీ, దోషపూరిత జీవితానికీ దారితీస్తుంది. భారతీయ చింతనాపరులు అలాంటి ఊబిలోనే పడ్డారు. గీతలోనూ ఆలక్షణాలున్నాయి. గీతకు నిర్దష్టత లేదు. తత్త్వం, మతం, నీతి సమాజశాస్త్రాలలో గీతస్థానం ఎక్కడా కచ్చితంగా నిలబడదు.
ఒక్క విషయం మాత్రం గీతలో నిర్ధిష్టంగా చెప్పవచ్చు. అదే లొంగుబాటు. మనసునూ, ఇచ్ఛనూ, స్వేచ్ఛనూ, అన్నిటినీ పూర్తిగా తనకు లొంగుబాటు చేయమని చెప్పటమే గీత సారాంశం. నేను పోరాడను అని చెప్పిన అర్జునుడు నీవు చెప్పినట్లే చేస్తానని ముగిస్తాడు. అందులోనే గీత సారాంశమున్నది. తిరుగుబాటు నుండి లొంగుబాటుకూ, స్వేచ్ఛ నుండి బానిసత్వానికి గీత దారిచూపింది.
మనిషి ఎందుకు లొంగుతాడు, లొంగకుండా ఉండటం ఎంత కష్టం అనే విషయాన్ని ఎరిక్ ఫ్రాం చక్కగా వివరించాడు. రాజ్యానికీ, మతానికీ, ప్రజాభిప్రా యానికీ లొంగి ఉంటే క్షేమం. ఎవరికి లొంగి ఉన్నామనేది ప్రధానం కాదు. ఒత్తిడిని ప్రయోగించే సంస్థ ఏదైనా సర్వశక్తి వంతంగా రూపొందుతుంది. అందులో భాగంగా లొంగిపోయిన వ్యక్తి తానూ శక్తివంతుడినే అనుకుంటాడు. తన కోసం నిర్ణయాలు చేసే సంస్థ బలీయమైనది. కనుక తానేమీ దోషం చేయలేదనుకొంటాడు. (Eric Fromm : See A Matter of Life, ed. By Clara Urquhart, Boston, 1963).
కృష్ణుడు తనను సర్వాంతర్యామిగా, సర్వశక్తివంతుడుగా చెప్పుకొని అర్జునుడితో పాటు అందరినీ తనకు లొంగిపొమ్మన్నాడు. ప్రపంచ మత సాహిత్యంలో అంత ఆడంబరంగా గొప్పలు చెప్పుకున్న ధోరణి మరి ఎక్కడా కనిపించదు. తన శక్తిని శంకించిన వారినందరినీ ఖండించాడు. అలాంటి తత్త్వం అత్యున్నతమైందని మన నాయకులు పొగిడారు. మనదేశం శతాబ్దాలుగా లొంగిపోయిందంటే ఆశ్చర్యమేమున్నది. ఇరానియాన్లూ, గ్రీకులూ, బాక్టీరియన్లూ, కుషాణులూ, హుణులూ, శాక్యులూ, అరబ్బులూ, తురుష్కులూ, మొగలులూ, ఆఫ్ఘన్లూ, పోర్చుగీస్, ఫ్రెంచి, బ్రిటిషువారికి భారత జాతి లొంగిపోయింది. 1962లో చైనావారి తన్నులకు గురయింది. ఇదంతా లొంగుబాటు తత్త్వ సారాంశమే.
భారతదేశం ఏనాడైనా నిశిత పరిశీలనకు పూనుకుంటుందా. వివేచనతో ఆలోచిస్తుందా. మూఢనమ్మకాలూ, సంప్రదాయాలూ, పెత్తందారీ తనాన్ని ప్రశ్నిస్తుందా. గీతభజన చేస్తూ కృష్ణుడిని స్తుతించినంత కాలం ఇది జరగదు.


అధ్యాయం పదిహేను
గీత నీతి
నీతి శాస్ర్తం విశాలమైనది. లోతుపాతులతో కూడినది. విశ్వవ్యాప్తమైనది. ప్రవర్తన నియామావళి కంటె నీతి శాస్త్ర పరిధి పెద్దది గ్రీస్ లో పెంపొందినట్లుగా భారతదేశంలో నీతిశాస్ర్తం పెంపొందలేదు. గౌతమ బుద్ధుడు మతానికి నీతిప్రాతిపదిక అందించాడు. కాని, మహాయాన, తదితర శాఖలు నీతి ప్రాతిపదికను తగ్గించివేశాయి. నీతి శాస్ర్తం ప్రధానంగా సమాజపరమైనదని బెర్ర్డాండ్ రసెల్ అన్నారు. (Bertrand Russell : An Outline of Philosophy, London, 1948). సామాజికంగా పొందిన ఉన్నచోట నీతి విధానం పెంపొందుతుంది. కులాలూ, ఉపకులాల వలన మనకది లేకుండా పోయింది. సామాజిక ప్రవృత్తి కూడా మనకు లోపించింది. ఎప్పుడైనా ఉంటే అది కాస్త కర్మ, పునర్జన్మ వలన బలహీన పడింది. వేదాంతం యింకా కుంటుపరచింది. ముక్తి, మోక్షం, నిర్వాణం అంతిమ లక్ష్యాలుగా నీతిని చంపేశాయి. జన్మల బంధం నుండి విముక్తి చెందాలంటే కుమారుడూ, భార్య, కుటుంబం బంధాలు వదలుకోవాలని కృష్ణుడు బోధించాడు. (Sankaracharya, Bhagavadgeetha with commentary, transleted by Alladi Mahadevasastry, Madras, 1979). ఈ విషయంలో ఎలాంటి సందేహం మిగల్చకుండా శంకరాచార్య భాష్యం చెప్పాడు. భగవంతుని పట్ల లీనం కావలసిన దశ పొందాలంటే సమాజంలో మనుషులకు దూరంగా ఉండాలన్నాడు. ఈ దారుణ పంథాను గురించి రంగనాధనంద యిలా చెప్పాడు. రెండు వేల సంవత్సరాలనుండీ గీతలో కృష్ణుడు బోధించినట్లు హేతుబద్ధమైన విశ్వజనీన ఆధ్యాత్మిక పంథాను అనుసరిస్తే నేటి గందరగోళ పరిస్థితులకు మార్గాంతరంగా ఉంటుంది. గీతాబోధన ప్రపంచమానవాళికి చిరకాల ప్రయోజనాన్ని అందించాలని కోరుకుందాం. (Swami Ranganadhananada : Studies in the Geetaed M.D. Paradkar Bombay, 1970).
అయిష్టంగా ఉన్న అర్జునుడిని ఆయుధాలు చేపట్టి చంపమని పురికొల్పిన గీత ప్రపంచశాంతికేమి దోహదం చేస్తుంది? అర్జునుడికి స్వేచ్ఛ లేదనీ, అతడు గురువుతో సహా అందరినీ చంపివేయాలనీ, కృష్ణుడు వారినిముందే చంపేశాడని బోధించిన గీత స్వేచ్ఛను ఎలా పెంపొందజేస్తుంది? అందులోని సత్యాన్ని రంగనాధానంద మాత్రమే గ్రహించగలడు. శుశ్రువ రాసిన గీతావ్యాఖ్యానం నాకు బొత్తిగా అర్ధం కాలేదు. (Susruva : The Esoteric Gospel of Geetha, Madras, 1978).
గీతలోని నీతిని గురించి జి. డబ్ల్యు కావీశ్వర్ రాశాడు. మానవాళి ముందు ఆచరణకు వుపక్రమించివలసిన లక్ష్యాన్ని గీత చూపినట్లు పేర్కొన్నారు. బహుశ కర్మ యోగాన్నిదృష్టిలో పెట్టుకొని ఆయన ఈమాటలని ఉంటాడు. భాషకూ, మనసుకూ అందని విషయాలను రాయటం మూర్ఖత్వమని కావీశ్వర్ గ్రహించి ఉండవలసింది. శంకరుడు, రామానుజుడు, మధ్వుడు, ఇతర వేదాంతులను పాశ్చాత్య తాత్విక ఆచార్యులతో పోలుస్తుంటారు. ఎ.ఎస్. శర్మ బట్లర్ నీతిశాస్త్రం భగవద్గీతలో కార్యాచరణతో పోల్చిరాశాడు. మరొక ఆచార్యుడు బి.యస్.గస్ఖ్ వాల్ కాంట్ నూ, గీతనూ పోల్చిరాశాడు. బహుళ గీతను చూచి జర్మనీ తత్త్వ వేత్త తమ ఆలోచనను రూపొందించుకొని ఉంటాడన్నాడు. (B.S. Ganchkwal : The concept of Perfection in the Teachings of Kant and Geetha, Delhi 1967) కాంట్ 1804లో చనిపోయాడు. జర్మనీలో 1908లో ఫ్రెడరిక్ ష్రీగల్ గీతలోని కొన్ని భాగాలను అనువదించి ప్రస్తావించాడు. అలాంటి గీతాప్రభావం కాంట్ పై ఉన్నదనటం అర్థం లేనిది. అలాగే ఎస్.ఎస్. రాఘవాచార్య గీతను విశిష్ఠాద్వైత గ్రంధంగా పేర్కొన్నాడు. ప్రతి మానవుడినీ లక్ష్యంగా పరిగణించాలని కాంట్ చెప్పిన తత్త్వం గీతకే మాత్రం పొసగడు. గీతపై ఇలా వివిధ రచనలు వెలువడుతూనే వచ్చాయి. పి.ఎన్. శ్రీనివాసాచారి, హెచ్.వి. దివాతియా గ్రంధాలు రాశారు. బ్రిటిష్ కాలంలోనూ, స్వతంత్ర భారతంలోనూ అనుభవం గల దివాతియా గీతలోని నీతి అవగాహన చేసుకోటానికి వీలులేనిదని రాశాడు. గీతపై ఎవరు ఎలా వ్యాఖ్యానం చేసినా నీతికి సంబంధించిన గీత చాలా దూరమనేది స్పష్టం.
అశోకుడి నుండి మార్క్స్, ఏంగెల్స్ వరకూ అనేక నీతివిధానాలు వచ్చాయి. విల్డ్యురాంట్ వీటన్నిటినీ మూడు రీతులుగా వర్గీకరించాడు. 1. బుద్దుడూ, జోస్ ఫ్ చెప్పినది, 2. మెకవల్లీ, నీషే ప్రవచించినది,. 3. సోక్రటీస్, ప్లేటో, ఆరిస్టోటిల్ చెప్పిన తీరు ఇందులో గీతాకారుడు అనుకొంటున్న కృష్ణుడు నీతిలో మెకవిల్లీ, నీషేలను పుణికిపుచ్చుకొన్నాడు. మెకవెల్లీ నిరంకుశ పాలనను కోరాడు. గట్టి రాజ్యపాలన అభిలషించాడు. నీషే సూపర్ మాన్ కావాలన్నాడు. లక్ష్యాన్ని సాధించటానికి మార్గం ఎలాంటిదైనా వారు పట్టించుకోలేదు. బలం గల వారిదే రాజ్యం అనే ధోరణిలో చెప్పారు. కృష్ణుడి ధోరణికూడా అదే, మహాభారతం, పురాణాలూ చూపుతున్న కృష్ణుడిలో ఆధోరణి ఉండవచ్చుకాని, గీతలోని కృష్ణుడిలో అలాంటి లక్షణాలు లేవని కొందరంటారు. నా దృష్టిలో ఆలక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. యదుకుల నాయకుడైన కృష్ణుడు నిరంకుశపాలనలోనే ఉన్నాడు. ప్రజాస్వామ్య శక్తులకు అతడు మద్దత్తు ఎందుకు యివ్వలేకపోయాడు? సామ్రాజ్యవాదానికి తొలిమెట్టుగా రాజరికాన్నే పురికొల్పాడు. నేనేరాజునని ప్రకటించుకున్నాడు. అతడికున్న పలుకుబడితో పాండవ కౌరవుల మధ్య సామరస్యం సాధించవచ్చు. హస్తినా పురానికి సంధి రాయబారిగా వెళ్ళి అనంగీకార కోర్కెలను ముందుపెట్టాడు. ఐదు ఊళ్ళిస్తే పాండవులు సంధికి ఒప్పుకుంటారని చాలా మంది భావించారు. కౌరవులు పరువు గలవారిగా పాండవులతో సంధి నిమిత్తం తన పాలును వదులుకోమని ద్రోణుణ్ణి అడగలేకపోయారు. కృష్ణుడికా విషయం తెలుసు. ఐనా కౌరవులు గర్విష్టులని చిత్రించారు.
కృష్ణుడు యుద్ధంలో తటస్థవైఖరి నటించాడు. వాస్తవానికి పోరాటానికి మించిన పాత్ర వహించాడు. అర్జునుడు ఉపసంహరించుకోటానికి అంగీకరిస్తే, యుద్ధం సాగేదికాదు. అర్జునుడి పై అన్ని విధాలైన ఎత్తుగడలూ ప్రయోగించాడు. గెలిస్తే రాజ్యం వస్తుందనీ, విఫలమైతే స్వర్గం లభిస్తుందనీ చెప్పాడు. అర్జునుడిని అతడి మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించమనటం నీతివంతుడి లక్షణం కాదు. పైగా అందరినీ తాను ముందే చంపేసాననీ, నీవు చంపబోతున్నానుకోటం అజ్ఞానం అనీ చెప్పి విశ్వరూపం చూపాడు. అర్జునుడిని మోహనిద్రలో పడవేశాడు. అందుకే ప్రేమనాధ్ బజాజ్ గీతను గురించి అదొక హత్యాకాండగా పేర్కొన్నాడు. (Premnath Bajaj : the Role of the Bhagavadgeetha in Indian History, Delhi 1975).
డి.డి. కొశాంబి గీతలోని నీతిని గురించి రాస్తూ, నాలో విశ్వసం ఉంటే పాపాలన్నీ క్షమించబడతాయనీ, నీ విధి ప్రకారం సోదరులనైనా చంపేయాలని గీత బోధించిందన్నాడు.
గీతాభిమానులకు యివ న్నీ పట్టవు. ఉపనిషత్తుల సారాంశమేగాక వాటిని ప్రపంచంలోకి తెచ్చింది గీతమాత్రమే నంటారు. పోరాడమని గీత భోదించటంలోనూ అందిక పొందక లేదని అరుణ్ శౌరి రాశాడు. ఈ పోరాటాలు ప్రపంచాన్ని మెరుగు పరచటానికి కాదు. ఆత్మను పరమాత్మలో లీనం చేయటానికి మాత్రమే.
నా దృష్టిలో ఆత్మ పరమాత్మలో లీనం అనేది సంకుచితం, స్వార్ధపూరితం, నీచం, లీనం కావల్సింది బ్రతుకుతోనూ, మానవాళితోనూ మాత్రమే. నేడు మనమున్న స్థితికి రావటానికి ఎన్నో తరాలవారు పుట్టిగిట్టారు. గతతరాలకు మనం రుణపడిఉన్నాం. ఈ గత తరాల సంపదను భావి తరాలకు అందించటం మన కర్తవ్యం. ఇందులో చేతనైనంత కృషి చేయాలి.
గీతను గమనిస్తే స్వార్ధం లేకుండా చర్యకుపూనుకోవాలనటం ఔన్నత్యమే కావచ్చు కాని, ఫలితాలు ఎలా ఉంటాయో పట్టించుకోకుండా పనులు చేయటం చాలా తప్పు. చేసిన పని ఫలితంగా దోషాలు రాబోతున్నాయని తెలిస్తే ఆ పని చేపట్టకూడదు. కులవృత్తిగా, ప్రవృత్తిగా పనిచేయటం మందలో ఆలోచనా రహితుడి ధోరణి మాత్రమే. అరమరికలు లేకుండా చంపేయమనీ, అది కుల వృత్తి ధర్మమనీ చెప్పటం కంటే ఘోరం మరొకటి లేదు.
గీత నీతి మెకవెల్లీ, నీషేలను పోలినది. మెకవెల్లీ చివరిదశలో పదవికి దూరంగా కారాగారంలో బతికాడు. నీషే పిచ్చాసుపత్రిలో మరణించాడు. కృష్ణుడు ఒక ఆదివాసి విలుగాని చేతిలో హతమాయ్యాడు. వీటికి ప్రాధాన్యత లేకపోలేదు.


16వ అధ్యాయం
గీతలో సామాజిక రీతి
సామాజిక శాస్ర్తం సమాజాన్ని అధ్యయనం చేసే విధానం. అది ఆత్మజ్ఞానం కాదు. భగవద్గీత-హిందూ సమాజ శాస్త్రం అనే పుస్తకాన్ని ఎమ్.కె. శ్రావణ్ రాశాడు. అందులో అట్టమీద తప్ప సమాజ విజ్ఞాన ప్రస్తావన లోపల ఎక్కడా లేదు. సుప్రసిద్ధ సమాజశాస్త్రజ్ఞుల పేర్లు తెలిసినట్లే లేవు. డర్క్ హైమ్, లాల్, బెంధామ్, కామ్టే, మిల్, స్పెన్స్ ర్, మార్క్స్, ఏంగెల్స్ గురించి విన్నట్లే లేదు. సమాజం, సమాజశాస్త్రం అతని పరిధిలోనే లేవు. కుల ప్రస్తావన మినహాయిస్తే, సమాజ విజ్ఞానాన్ని పట్టించుకున్నట్లే లేదు. ఆత్మ, బ్రహ్మ, ధర్మ, కుర్మ, మాయ, యోగ, వేదాంత-ఎంతసేపూ, అదే గొడవ. గీత భక్తి సారాంశమని రాశాడు. (M.K. Sravan : Bhagavadgeetha And The Hindu Sociology, Delhi, 1977) అలాంటప్పుడు గీతలో సమాజశాస్ర్తం వుంది అని ఎందుకు పేర్కొన్నట్లు?
ఒక పేజిలో చెప్పింది పక్క పేజీలో శ్రావణ్ మర్చిపోతున్నాడు. బీష్ముడూ, కృష్ణుడూ క్షత్రియులైనప్పటికి, బ్రాహణులు వారిని తమవర్గంగా, ఉపాధ్యాయలుగా భావించారు. మరోచోట యుధిష్టిరుడు బ్రాహ్మణుల పాదాలు కడిగినట్లు చెప్పాడు. కృష్ణుడు శాంతి సమయంలో వలె యుద్ధంలో కూడా నెమ్మదిగానే ఉండేవాడన్నాడు. రెండు పర్యాయాలు కురుక్షేత్రయుద్ధంలో కృష్ణుడు రధం దిగి భీష్ముణ్ణి ఎదుర్కోబోగా అర్జునుడు వారించిన విషయం మరిచిపోయినట్లున్నాడు. శ్రావణ్కు తెలియకపోయినా గీతకు సొంత సమాజశాస్త్రం ఉన్నది. గుణాన్నీ, పనిని బట్టి నాలుగు వర్ణాలూ నేనే సృష్టించానని చెప్పటంలోనే సారాంశం ఉన్నది. నాలుగు వర్ణాల బదులు నాలుగు కులాలని అల్లాడి మహాదేవశాస్త్రి తన అనువాద గ్రంధంలో రాశాడు. (Shankaracharya, The Bhagavadgeetha with the commentary, tr. by Alladi Mahadeva Sastry, 1979) జాన్ డేవిడ్ అనువాదం కూడా నాలుగు కులాల్నే సూచిస్తున్నది. కృష్ణుడు పేర్కొన్న నాల్గు విధాలైన సృష్టి నాలుగు కులాలకు చెందినది. హిందువు కులంలో పుడతాడు, అందులో నివశిస్తాడు, గతిస్తాడు. బ్రతికుండగా పాటించిన కులధర్మాన్ని బట్టే జన్మాంతరం కూడా ఆధారపడి ఉంటుంది. కులవిధానంలో పైకి పోయే అవకాశం లేదు. అదే, వర్గ సమాజంలో కూలివాడి కుమారుడు ఎంత పెద్ద స్థానానికైనా ఎదగవచ్చు.
కృష్ణుడు కులసమాజసృష్టికి తానే బాధ్యుడనని ఒప్పుకున్నాడు. గతజన్మల పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో కులనిర్ధారణ అవుతుంది. ఇలా చెప్పటంలో కృష్ణుడు మాటల గారడీ చూపాడు.
గీతా భాష్యకారులు కులం దైవసృష్టి, కనుక పవిత్రమయింది అంటున్నారు. దేవుడు స్థాపించిన సాంఘిక వ్యవస్థను కూలద్రోయటమే కులవిమర్శకుల పని అంటున్నారు. ఈ వ్యవస్థ హెచ్చుతగ్గులతో కూడినది. దేవుడు నామమాత్రంగానే ఈ విధానాన్ని సృష్టించినా, పూర్వజన్మల కర్మ ఫలితమే యిందుకు కారణం, మనిషి స్వాభావిక అభిరుచుల్నీ బట్టి కులాన్ని నిర్ధారించటం దేవుడి పని. పుట్టకముందే ఈ స్వభావం ఎలా తెలుస్తున్నదీ అంటే దేవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి గనుక, తల్లి గర్భంలోకి రాకముందే మానవుడి స్వభావాన్ని నిర్ణయిస్తాడు. కృష్ణుడు అర్జునుడిలో నీ గత జన్మలన్నీ నీకు తెలియవు గాని, నాకు తెలుసు అంటాడు.
కులవిధానంలో ఎలాంటి దోషాలున్నా క్షమించే గుణం, ప్రేమ, దయ భగవంతునికున్నాయి. ఈ విషయం శంకరాచార్యుడు చాలా తెలివిగా చెప్పాడు.
నాలో శరణుపొందే వారందరూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటారు. స్త్రీలూ, వైశ్యూలూ, శూద్రులూ పాపయోనికి పుట్టినప్పటికీ, నావలన విముక్తులవుతారు. భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ఒకపట్టాన విస్మరించటానికి వీలులేదు. శంకరా చార్యుడు అతి తెలివిగా దీనిని దాటవేశాడు. హిందూసమాజంలో 90 శాతానికి వర్తించే శ్లోకమిది. అందులో 50శాతం స్త్రీలకు చెందినది. వైశ్రులూ, శూద్రులూ కలిపి 40 శాతం ఉన్నారు. అంటరానివారి ప్రస్తావన గీతలో లేదు. వీరంతా పాపజన్ములేనా. పాపయోనికి పుట్టారనేమాటను శంకరాచార్యుడు కావాలని దాటేశాడు. పవిత్రబ్రాహ్మణులంతా, రాజర్షులంతా తనను ఆరాధిస్తారని కృష్ణుడు అన్నాడు. ఆయన దృష్టిలో ఆ కొద్దిమందే పవిత్రులు. తెల్లవారు కానివారంతా తక్కువవారని కిప్లింగ్ అన్నట్లే గీతకూడా చులకన భావం చూపిస్తున్నది.
జీవనరంగంలో ఉన్నతస్థాయికి చేరుకున్న రాజులూ, పురోహితులూ సంపదను అదుపులో పెడుతూ సుఖాలనుభవిస్తున్నారు. ఆత్మ, పరమాత్మల సమ్మేళనానికి ప్రయత్నిస్తూ లోకంలో గడుపుతున్నారు. అణగారిపోయిన ప్రజల ఆగ్రహానికి రాజులూ, బ్రాహ్మణులూ గురికాకుండా ఉండాలని యిలాంటి మాటలు చెప్పారు.
పాపయోని నుండి పుట్టినవారిలో స్త్రీలూ, వర్తకులూ, శ్రామికులూ ఉండటం, వీరు అత్యధిక సంఖ్యాకులు కావటం గమనిస్తే, గీతాప్రవచనం క్షమించరానిది అని చిన్మయానంద అన్నారు. దేవుడు చెప్పినా సరే అంగీకరించరాదన్నాడు. (Swami Chinmayananda Bhagavadgeetha, 1979, Madras Chapters : 7, 8, 9, Page : 158) ఐనా ఏమో కుంటిసాకులతో చిన్మయానంద తప్పుకుపోయాడు. రాధాకృష్ణ కూడా ఈ మాటలపై వ్యాఖ్యానిస్తూ నాటి కాల పరిస్థితులను బట్టి చూడాలేగాని, స్త్రీలనూ శూద్రులనూ వేదాలకు దూరం చేయాలనే ఉద్దేశ్యం లేదన్నాడు. గీత ప్రేమ సందేశం అందరికీ వర్తిస్తుందన్నారు. జాన్ డేవిడ్ కూడా ఇలాగే వ్యాఖ్యానించటం చూస్తే ఆశ్చర్యం వేసింది. జవహార్ లాల్ నెహ్రూకు చిన్నతనంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఎఫ్.టి. బ్రూక్స్ కూడా గీతను ఈ విషయంలో ఏదో విధంగా సమర్ధించాడు. కీన్ బోల్, ఎ,జె,బాన్, శకుంతలారావు, శాస్త్రి, అనిబిసెంట్, భగవాన్ దాస్, పరమానంద, వీరేశ్వరానంద, శివానంద, ఆర్ధర్ ఆస్ బోర్నో, జి.వి. కులకర్ణి, నిహాల్ చంద్ వైశ్, పి.లాల్ తమ గీతాభాష్యాలలో ఇంచుమించు శంకరాచార్యుని అనువాదాన్నే పాటించారు. మిగిలిన వారు చాలామంది పాపయోనికి పుట్టినవారిని గురించి అనువాదాన్ని తప్పించటమో, ఏదో ఒక విధంగా పక్కదారులలో పోవటమో చేశారు. శీతానాధ్ తత్త్వ భూషణ్ గూడా అలా చేయటం ఆశ్చర్యకరం. ఈ శ్లోకాన్ని చూచి కలవరపడిన దిలీప్ కుమార్ రాయ్ అసలే వదిలేసాడు. ఎడ్విన్ ఆర్నాల్డ్ సూక్ష్మంగా ఏదో చెప్పబోయాడు. ఎ.ఎస్.పి. అయ్యర్ బాధ్యతా రహితంగా ఈ శ్లోకాన్ని అనువదించి భాష్యం చెప్పాడు. పాపయోని అనటానికి బదులు పాపాత్ములైన స్త్రీలకు పుట్టినవారు అన్నాడు.
నీ కులధర్మం నుండి ఎన్నడూ తప్పుకోరాదని గీత బోధిస్తున్నది. కులవృత్తిలో అభిరుచి లేకపోయినా అంటిపెట్టుకోవాలంటున్నది. నీస్వభావాన్ని నిర్ణయించటంలో కృష్ణుడి కంటే నీకు ఎక్కువ తెలుసా అంటున్నది. స్వభావాన్ని బట్టి కులం వస్తున్నది గనుక, గత జన్మల చర్యలను బట్టి కులనిర్ధారణ జరుగుతున్నట్లు తెలుసుకోమంటున్నది. ఆకలితో అలమటిస్తుంటే అదీ గత జన్మల పాపఫలితమే అంటున్నది. కులవృత్తిని వదిలేసి సమాజానికి బాగా సేవ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది ఉపద్రవానికే దారితీస్తుందంటున్నారు. ఎలాంటి ఉపద్రవం రానున్నదో తెలుసుకునే శక్తి నీకులేదంటున్నది. కనుక మూర్ఖమార్గాలను అవలంబించవద్దంటున్నది. శంకరాచార్యుడు చిన్నరకం భగవంతుడు గనుక, ఈ ఉపద్రవం నరకానికి పోవటమేనని చెప్పాడు.
పాండిచేరీ ఆశ్రమంలో సంపన్నుల ఆదరణ పొందిన అరవిందుడు గీతపై మరొక విధంగా వ్యాఖ్యానం చేశాడు. గీత ప్రకారం ఎత్తులు, తమశక్తియుక్తులు గమనించకుండా వృత్తిని పాటించాలని అనటం లేదన్నాడు. (Sri Aurobindo : Essays on the Geetha) భారతదేశ స్వేచ్ఛా పురోగతిని అడ్డుకున్న వాళ్ళలో ఈ పాండిచేరి ఆశ్రమవాసి కూడా ఒకడు.
గీత కులాన్ని ఎలుగెత్తి చాటుతున్నది. అర్జునుడు వాపోవటంలో కుల కారణాలున్నాయి. యుద్ధ విపత్తు వలన అక్రమం పెరిగి, స్త్రీలు అవినీతిపరులై, కుల విధానంలో గందరగోళం వస్తుందన్నాడు. కులనియమాలు, కుటుంబం నాశనమవు తుందన్నాడు. తమవారిని చంపటం కంటే కులం ధ్వంసం కావటం విచారకరంగా అర్జునుడు భావించాడు. గీత బోధించే సమాజశాస్త్రమంతా కులపరమైనదే.


అధ్యాయం పదిహేడు
గీత-విజ్ఞానం
అనేక శాస్త్రాలతో పాటు గీత ఆధునిక విజ్ఞానాన్ని కూడా బోధించింది. అణుభౌతిక శాస్త్రంలోని పరిశోధనలు సహితం ఊహించింది.
అలాంటి మాటలు వింటే ఆశ్చర్యం వేస్తున్నదా? ఇంకేమైనా అంటే హరీష్ దబాయి విజూభాయి దివాతియా మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తాడు జాగ్రత్త. గీత-ఆధునిక విజ్ఞానం అంటూ ఒక అధ్యాయం కూడా తన గ్రంధంలో చేర్చాడు. అన్ని పరిశోధనలూ గీతలో చూడాలనుకోవటం విపరీతమే అవుతుందని కూడా అనుకున్నాడు. (H.V. Divatia : The Art of life in Bhagavatgeeta 1970, Bombay) డార్విన్, హక్సలే, స్పేన్సర్ మొదలైన శాస్త్రజ్ఞులు చూపిన వాదనలను తప్పనిచూపే ప్రయత్నం చేశాడు.
కిందిస్థాయి నుండి ఉన్నదశకు జీవితం పరిణమిస్తుందని డార్విన్, హక్సలే చెప్పారు. జీవితం కోసం పోరాటం, అర్హులైనవాడు మనుగడ సాగించటం అనే రెండు భావాలూ వెల్లడించారు. కోతుల నుండి క్రమేణా మానవులుగా పరిణమించారు.
ఈ వాదనలన్నీ తప్పని దివాతియా చూపటానికి ప్రయత్నించారు. అందుకు గాను సర్ ఆలివర్ లాడ్జీ, సర్ రిచర్డ్ గ్రిగరీ, సర్.జె. ఎ.వి. బట్లర్ను సాక్ష్యంగా చూపాడు. ఆధునిక విజ్ఞానంలో వారిదే చివరిమాటగా స్వీకరించ మంటాడు. విశ్వమంతా విశాల జీవరాసి అనీ, ప్రతి జీవి అందులో ఒక భాగమనీ అంటాడు. శక్తి, లేదా ఆత్మ అనే సూత్రం ఈ విశ్వంలో వ్యాపించి ప్రకంపన చెందుతుంటుంది. ఈ భావాలు వేదాంతంలోని మాయనూ, విశ్వంలోని ఒకే భావం, లేదా శక్తి ఉన్నదనే విషయాన్ని సమర్ధిస్తున్నది. విశ్వమంతా బ్రహ్మస్వరూపం. మన ఇంద్రియ పరిమితి వలన భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది దివాతియా చెప్పిన విషయం.
ఆధునిక విజ్ఞానం మనలను మాయ, బ్రహ్మల దగ్గరకు తీసుకెళుతుందన్న మాట భారతీయ రుషులు ఆధునిక శాస్త్రీయ పదజాలాన్ని వాడకుండా కవితలో, అలంకారాలలో శాశ్వత సత్యాలు చెప్పారని దివాతియా రాశాడు. గీతను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధునిక విజ్ఞానం అందులో ఉన్నట్లు కనుగొనవచ్చునన్నాడు. హెగెల్ వంటి వారు గీత చదివి ఉంటే ఇంకా గొప్ప తాత్వికులయ్యేవారని అన్నాడు.
సి. రాజగోపాలాచారి గీతను ప్రచారంలో పెట్టటమే గాక, తన అధికారంలో అందలి సూత్రాలను అమరపరచటానికి కూడా ప్రయత్నించారు. మద్రాసు ముఖ్యమంత్రిగా గీతలోని స్వధర్మ సూత్రాన్ని ప్రతి విద్యార్థి పాటించాలన్నారు. తండ్రుల వృత్తిని అనుసరించి రోజులో సగభాగం వినియోగిస్తే, నిరుద్యోగ సమస్యకు పరిష్కారమన్నాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని దొడ్డిదారిన తెచ్చే ఈ ప్రయత్నాన్ని తమిళనాడు ప్రజలు ప్రతిఘటించటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఎస్.జి. సర్దేశాయి. వెల్లడించిన ప్రకారం శంకరాచార్యులలో ఒకరు పూనాలో ప్రకటిస్తూ పాపయోని నుండి పుట్టిన శూద్రులూ, స్త్రీలూ ఈసడించబడాలి. ఇందులో వైశ్యులనొదిలి వేయటానికి కారణం మఠాలకు దానాలివ్వటమే కావచ్చు.
రాజగోపాలాచారి శాస్త్రజ్ఞుడి పాత్ర వహించి ఇలా అన్నాడు. తండ్రుల భౌతిక లక్షణాలు, మానసిక ధోరణులూ పిల్లలకు సంక్రమిస్తున్నాయి. ఈ వంశ పార్యం పర్యత కర్మ సూత్రాన్ని వివరించరు. వంశపారంపర్యంలో దేహాలే గాని ఆత్మలు లేవు. ఆత్మకు తల్లిదండ్రులు లేరు. అది స్వయంభువు. ఏ ఆత్మ అయినా తనకు అర్హమైన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పౌరుల అవసరాలను బట్టి ఇంజనీర్లు వివిధ భవనాలు నిర్మించినట్లే యిది కూడా. కాని, అతడెప్పుడైనా డి.ఎస్.ఎ., ఆర్.ఎన్.ఎ., అనే మాటలు విన్నాడా. వంశపారం పర్యలక్షణాలు నిర్ణయించేది అవే, అనీ, కర్మకాదనీ ఎవరూ చెప్పలేదా. అవి కనుగొన్న తరువాత జన్యు శాస్త్రం విప్లవాత్మకంగా మారిందని తెలియదా.
గీతలో విజ్ఞానాన్ని గురించి మాట్లేడే గీతా ప్రచారకులు విజ్ఞానశాస్త్రజ్ఞులలోనూ లోపాలుంటాయని విస్మరిస్తున్నారు. న్యూటన్ లో చాలా మూఢనమ్మకాలున్నాయి. సర్. ఆలివర్ లాడ్జ్, సర్ విలయిం క్రూక్స్, ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ శాస్ర్తజ్ఞులైనా-మరొకవైపున చనిపోయిన అలెగ్జాండర్, షేక్స్ పియర్, నెపోలియన్లతో మాట్లాడుతున్నామంటూ, దయ్యాలశాస్త్రాన్ని ప్రచారంలో పెట్టారు. (F.E. Planer : Superstition, London 1980) చాలా మంది శాస్త్రజ్డులు తమ పరిధి దాటిన తరువాత సంకుచిత మనస్తత్వంతో మూర్ఖంగా ఉన్నారని వాట్ సన్ శాస్త్రజ్ఞుడు రాశాడు. (James D Watson : The Double Helek, London, 1969) మన వద్ధ భగవంతం, స్వామి నాధన్ ఇలాంటి వారే. గీతాకారులు తమ ఆత్మ, పరమాత్మ, కర్మ, పునర్జన్మ వంటి వేదాంతమాటలను సమర్ధించుకునే ముందు, ఐన్ స్టీన్, ఫ్రాన్సిస్ క్రిక్, కార్ సేగన్ వంటి వారి వాదనలు ఎందుకు వినలేదు అనిపిస్తుంది. ఆధునిక విజ్ఞానంలో వేదాంతంలో లేనిదేమీ లేదని అనేవారున్నారు. అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండబోదు. డార్విన్, హక్సలే, ఏమి చెప్పినా, యజ్ఞాల ద్వారానే బ్రహ్మసృష్టి జరిపాడనీ, ఆ తరువాత యజ్ఞాలద్వారానే పెంపొందుతారనీ, సకాలంలో వర్షాలొస్తాయనీ నమ్మారు. దేవుళ్ళకు సంతర్పణలర్పిస్తుంటే వారు బదులందిస్తుంటారు. చంద్రుడిని గొప్ప నక్షత్రంగా భావించారు. మొసలిని మత్స్యంగా స్వీకరించారు. అత్యంత వేగం గలదిగా వాయువును సమ్మారు. హిమాలయాలు అచలాలు అంటే కదలనివి అన్నారు. కొలనులను సముద్రాలుగా భావించారు. మనసును జ్ఞానేంద్రియం అన్నారు. గీత చెప్పిన గొప్ప శాస్త్రీయ సత్యాలు యివే. కృష్ణుడి కాలంలో విద్యుత్ ఉన్నదని కూడా చెప్పారు. కృష్ణుడికి విద్యుత్తు, సూర్య-చంద్రుల అవసరం లేదనీ, కావాలనుకుంటే తన మందిరాన్ని విద్యుత్ తో వెలిగించేవాడనీ ప్రభుపాదరాశాడు. (Sw. Prabhupada, Bhagavadgeetha, Los Angeles, 1972)
గీతలో సైన్స్ అలాంటిది. వేద ఉపనిషత్తుల సారాంశమది. విజ్ఞాన సర్వస్వమది. అలా భావించినంత కాలం భారతదేశంలో సైన్స్ కుంటుతూనే ఉంటుంది.
భారతదేశంలో నోబెల్ ప్రైజు వచ్చిన ముగ్గురిలో ఇరువురు అమెరికాలో కృషి చేసి కనుగొన్నారు. పైగా భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. వేదభూమికి తిరిగి రాలేదు. వేదాంత భూమికలో సరైన శాస్త్రజ్ఞుడు ఆలోచించి పనిచేయటం కష్టం.

18వ అధ్యాయం
గీత ఎందుకు రాశారు?
గౌతమ బుద్ధుడు విప్లవవాది కాడు. బౌద్ధవాదం విప్లవమూ కాదు. ఆక్స్ ఫర్డ్ నిఘంటువు నిర్వచించినదానికి దరిదాపుల్లోకి బౌద్ధం రాదు. బౌద్ధం తలపెట్టిన మార్పులు సంపూర్ణం కాదు, మౌలికమూ కాదు. ఉన్నతవ్యవస్థను తిరగవేసి పూర్తి మార్పునూ తేలేదు. బలవంతంగా ఏ రాజునూ, ప్రభుత్వాన్ని తొలగించలేదు. బౌద్ధం సమూల సంస్కరణవాదం. అది ఎంత సమూలమైనా, విప్లవం కాజాలడు. పాతనంతా పడద్రోసి మళ్ళీ నిర్మిస్తే విప్లవం అవుతుంది. సంస్కరణ కేవలం మార్పులతో సరిపెట్టుకుంటుంది.
బుద్ధుడికి పూర్వమే వైదిక యజ్ఞయాగాదుల పట్ల, పశువుల్ని భారీ ఎత్తున చంపటం పట్ల నిరసన ఉన్నది. బుద్ధుడూ, మహావీరుడూ, గోశాల, అజిత మొదలైనవారు వేదాల దైవాధికారాన్ని ప్రశ్నించారు. భూ దేవుల పేరిట నటిస్తున్న పురోహితులపట్ల నిరసన వ్యక్తం అయింది.
బుద్ధుడూ, తదితరులూ ఈ సాంఘిక మత ధోరణులను బలపరిచారు. బిందుసారుడూ, మరి ఇతరుల మద్ధతు లభించినందున సాఫల్యత పొందాడు. ఆ తరువాత అశోకుడూ, అతడి వారసులు కూడా బౌద్ధాన్ని సమర్ధించారు. వేదాల అధికారాన్ని, ప్రశ్నించటం వలన పురోహిత వర్గం బాధపడలేదు. బుద్ధుడికి ముందే ఉపనిషత్తులాపని చేశాయి. బుద్ధుడు కులవ్యవస్థను వ్యతిరేకించినందు వలన కూడా అంతగా నొచ్చుకోలేదు. బౌద్ధ సంఘంలో కులానికి గుర్తింపులేదు. బయట కులాన్ని అతడు పట్టించుకోలేదు. పుట్టుక వలన బ్రాహ్మణుడు కాడనీ, క్షత్రియుడు బ్రాహ్మణుని కంటె అధిక్యతలో ఉన్నాడని బుద్ధుడు చూపాడు. బౌద్ధాన్ని బాగా అధ్యయనం చేసిన హెర్మన్ ఓల్డెన్ బర్గ్ సాంఘిక సంస్కర్త గానూ బుద్ధుడిని ఒప్పుకోలేదు. బుద్ధుడు కులబంధాలు ఛేదించాడని గాని, పేదవారికి బౌద్ధంలో ఆధ్యాత్మిక స్థానాన్ని సంపాదించి పెట్టాడని గానీ అంటే అది చారిత్రకం కాబోదని కూడా అన్నాడు. (Herman Oldenburg : Buddha, His Life, His Doctreni, His order, Calcutta 1927).
తమ ఆర్థిక స్థితి గతులు క్షీణించటంతో పురోహితవర్గం బాధపడింది. వేదయజ్ఞాలు ఆగిపోవటంతో పురోహితులకు బత్వాలు లేకుండా పోయాయి. రాజులు అనుగ్రహం అంతా బౌద్ధ ఆరామాలకు దక్కటంతో పురోహితులకు ఆదాయం పోయింది. నగరీకరణం వలన బాగా సంపాదించిన వైశ్యులు బౌద్ధం వైపుకు మొగ్గారు. పురోహిత వర్గం తమ సామాజిక పునాదులు కదలిపోవటం గ్రహించారు. వర్ణాశ్రమ ధర్మం కూలిపోవటం చూచారు. మనిషి కులంలో పుట్టటం, కులవృత్తిలో మార్పులేకుండా కొనసాగటం వర్ణాశ్రమ ధర్మ లక్షణం.
అత్యధిక సంఖ్యాక ప్రజానీకం బానిసలుగా బ్రతకటం, వారిపట్ల బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలు ఏమాత్రం బాధ్యత వహించక పోవటం ఆనాటి పరిస్థితి. కుల బానిసత్వం అమానుషం, బాధ్యతా రహితం. పుట్టిన కులంలోనే అట్టి పెట్టటం, అదే వృత్తిలో చేరేటట్లు చూడటం ఆచారమైపోయింది. బుద్ధుడు కులంపైనా, కులవృత్తిపైనా తీవ్రంగా దాడి చేయలేదు గాని, ఏ కులంలోని వారైనా సంఘంలో సభ్యుడైతే మిగిలిన వారితో సమానుడౌతాడని చూపాడు. కింది కులాల నుండి బౌద్ధ భిక్కువులుగా వచ్చారనేది వేరే అంశం. వారు చాలా కొద్ది మందేనని ఓల్డెన్ బర్గ్ రాశాడు.
ఈ విధానం తమ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లు పురోహిత వర్గం పసికట్టింది. శూద్రుడు యజమాని కాబోతున్నాడని వారు భయపడినట్లే జరిగింది. శూద్రవంశం నుండి ప్రప్రధమంగా నందులు అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత మౌర్యులు శూద్రులుగా రాజ్యపాలన చేశారు. (Bhupedndranath Dutt ; Studies inIndian Social Polity, Calcutta, Page 189 స్వామి వివేకానంద సోదరుడే ఈ రచయిత) విస్తారమైన మౌర్య సామ్రాజ్యం దేశమంతా పాలించింది. బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు దండ సమత ప్రవేశ పెట్టాడు. (Romila Thopar : Ashoka and the Decline of Mauryas, Oxford, 163) అంటే శిక్షలో అందరికీ సమానత్వం, వ్యవహార సమత కూడా అశోకుడు ప్రవేశపెట్టాడు. భూసురులనూ, శూద్రులనూ ఒకేస్థాయిలోకి తెచ్చాడు. ఛండాలురను కూడా వారి స్థాయిలోనే అట్టి పెట్టాడు. భూసురులు తప్పుడు దేవుళ్లని శాసనంపై చెక్కించాడు. (భూపేంద్రనాధ్ దత్తా పేజి 189).
వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడటానికి శూద్రపాలన అంతం చేయాలి. దీనికి గాను చంద్రగుప్తుడు అశోకుడికి వారసుడైన బృహద్రధులని చంపించారు. అతని వద్ద పుష్యమిత్తుడు అనే బ్రాహ్మణ సైన్యాధిపతి ఉండేవాడు. రాజు సైన్యాలను పరీక్షిస్తూ ఉండగా ఈ హత్య జరిగింది. పుష్యమిత్రుణ్ణి ద్రోహిగా బాణకవి పేర్కొన్నాడు. (Jagannadham : A comprehensive History India, Bombay 1957, Vol. II. Page-94) నిహరంజన్ రే మరొక విధంగా భావించాడు. ఇతిహాసాలూ, పురాణాలూ మౌర్యులను అసురులుగా భావించడాన్ని తేలికగా కొట్టి పారవేయరాదన్నాడు. రచయితలు బ్రాహ్మలుగానటం, మౌర్యులు బౌద్ధులుగావటం ఇందుకు కారణం కాదన్నాడు. (Niharanjan Ray : Maurya and the Post Maurya Art, New Delhi, 1975) నిహరంజన్ రే భారతదేశంలో అత్మవసర పరిస్థితిని సమర్ధించాడు. అలాంటివాడు పుష్యమిత్రుడిని గొప్ప విమోచనకారుడిగా, మౌర్యులు పాలించినప్పుడు సామాన్యులు బాధలకు గురైనట్లుగా చిత్రించాడు.
పుష్యమిత్రుడు, తొలి బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బౌద్ధాన్ని విధ్వంసం చేయాలనీ, బ్రాహ్మణీకాన్ని తిరగదోయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బౌద్ధ భిక్కులను చంపేసి, బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేయతలపెట్టాడు. (K.P. Jayaswal : In Imperial History of India) బౌధ్ధ భిక్కువులను చంపి, వారి తలలను తనకు బహూకరిస్తే నూరు దీనార్లు చొప్పున ప్రతి తలకూ ఇస్తానని ప్రకటించినట్లు దివ్యవదనుడు తెలిపాడు. (B.C. Sinha : History of Sranga Dynasty, Delhi : 1977) ఐతే, అప్పటికే కాలం మారింది. పాతమూసలో బ్రాహ్మణ విధానాన్ని పోయటానికి వీలులేదు. కొత్త తొడుగులు అవసరమయ్యాయి. కనుక రెండు అశ్వమేధ యాగాలు చేశాడు. పతంజలి రాజపురోహితుడుగా ఉన్నాడు. (P Banerjee : Early Indian Religions New Delhi, 1973) అగ్నిస్తోమ, రాజసూయ, వాజ్ పేయ యజ్ఞాలను తిరగదోడారు. పుష్యమిత్ర, పతంజలి అంచలువారిగా సనాతన ప్రతి విప్లవాన్ని తీసుకురావటానికి ప్రయత్నించారు. దీనినే కొత్త బ్రాహ్మణ వాదంగా పి. బెనర్జీ పేర్కొన్నాడు. మౌర్యుల అనంతరం అది కొనసాగింది. విశ్వామిత్రుడు కత్తి పట్టగా, పతంజలి తన తెలివితేటలను వినియోగించాడు. తీరిక ఉన్నప్పుడు వ్యాకరణం రాసినా, పురోహిత వర్గాలను అట్టిపెట్టటమే అతని ప్రధాన లక్ష్యం. 2 వేల సం.రాల క్రితం పతంజలి ఈ విషయంలో ఘన విజయం సాధించాడు.
పాణిని వ్యాకరణంపై భాష్యం రాసిన పతంజలి కృష్ణుడు కంసుని సంహరించటం ప్రస్తావించాడు. వాసుదేవుని పూజించే వాసుదేవకులను కూడా ప్రస్తావించాడు. అంతకుముందు పాణిని వాసుదేవ-అర్జునులు పూజలందుకున్న తీరు చెప్పారు. పతంజలి కాలం నాటికి కృష్ణుణ్ణి దేవుడుగా కొన్ని చోట్ల కొందరు పూజించారు. ఆ విషయాన్ని పతంజలి చాకచక్యంతో వాడుకున్నాడు. బుద్ధుడిని అతని అనుచరులు తదనంతరం దేవుణ్ణిగా చేసి కొలిచారు. (Folyd H. Ross : Meening of Life inHinduism and Buddhism, London 1952) అలా దేవుళ్ళను సృష్టించటం ఆనాటి ధోరణిగా ఉనఅనది. వేదాలలో వ్యక్తిపరమైన దేవుళ్ళు లేరు. ఉపనిషత్తులలోనూ లేరు. వేదాల దేవుళ్ళను సంతృప్తిపరచాలంటే అతి వ్యయంతో కూడిన యజ్ఞాలు చేయాలి. ఉపనిషత్తుల దేవుడు తటస్థ బ్రహ్మం కనుక, సంతృప్తిపరిచే ప్రశ్నలేదు. అలాంటప్పుడు బుద్ధుని దేవుడిగా చేసేటప్పటికి జనం బౌద్ధానికి ఎగబడ్డారు. పతంజలి ఇందుకు బదులుగా, వాసుదేవ, కృష్ణదేవుళ్ళను ఎరగా చూపాడు. విష్ణువు-వాసుదేవ దేవుళ్ళ పరిణామం అట్లా జరిగింది. కృష్ణదేవుళ్ళను ఎరగా చూపాడు. విష్ణువు-వాసుదేవ దేవుళ్ళ పరిణామం అట్లా జరిగింది. కృష్ణుడిని దేవుడుగా చేసి కొత్త బ్రాహ్మణ వాదాన్ని స్థాపించటంలో పతంజలి తన శిష్యుడు పుష్యమిత్రుడి సహకారంతో దండసమత, వ్యవహార సమతను రద్ధు చేశాడు. శిక్షలలో హెచ్చుతగ్గులూ, తరతమ భేధాలు ప్రవేశపెట్టాడు. ఉన్నత కులాలకు స్వల్ప శిక్షలూ, తక్కువ కులాలకు కఠిన శిక్షలూ తిరగదోడాడు. శూద్రులు తలెత్తకుండా కొన్ని పాత సూత్రాలూ, మరి కొన్ని కొత్త సూత్రాలూ కలిపి స్మృతులుగా రూపొందించారు. బెనర్జీ ఈ విషయాలు వివరించారు.
ఏ దేవుణ్ణి కొలిచినా, ఏ యోగాన్ని పాటించినా, ఒక విషయం మాత్రం విస్మరించరాదు. అదే కులంధర్మం, కులవృత్తిని వీడకుండా ఉండాలి. నీవెంత అసమర్ధుడివైనా ఎంత నీచవృత్తిని అనుసరించవలసి వచ్చినా, కులధర్మాన్ని పాటించాల్సిందే. లేకుంటే నరక ప్రాప్తి తప్పదు. ఆ హెచ్చరిక చేయటానికే గీతారచన సాగింది.

అధ్యాయం పంధొమ్మిది
కొండ దేవర నుండి జాతీయ దేవుడి వరకు
ఏ దేశమైనా ఆదిమ తెగల స్థాయి నుండి ఎదుగుతూపోతుంది. అలాగే దేవుళ్లు కూడా. కృష్ణుడి విషయంలో అంతే జరిగింది. కృష్ణుడు రాజపూత్ తెగల కులదేవతగా తొలుత ఉండేవాడని భారతీయ శాస్త్రాలను అధ్యయనం చేసిన ఫ్రెంచి పండితుడు బర్త్ భావించాడు. (A Barth : Religions of India, New Delhi, 1969) యాదవులు ఏనాడూ ఏకంగా లేనందునవారు సమైక్య పడలేకపోయారు. యాదవులు రాజపూత్లయితే సంప్రదాయం ప్రకారం క్షత్రియకులంలో కింది స్థాయికి చెందినవారే ఉండాలి. కృష్ణుడి సామాజిక అంతస్తును మహాభారతంలో ప్రశ్నించిక పోలేదు. ద్వారకలో గడిపినపుడు కృష్ణుడికి తన వారి నుండి గౌరవం లభించలేదు. పైగా ఖండన మండలకు గురి అయ్యాడు. మహాభారతంలో కృష్ణుడు ఒకసారి నారదుడితో ఫిర్యాదు చేస్తూ తానెవరికొసం అయితే శ్రమిస్తున్నాడో వారే పరుష వాక్యాలు పలుకుతున్నారని వాపోయాడు. అందువలన అక్కడ కులదేవతగానో, రాజపూత్ ల సమైక్య జాతులకు దేవుడుగానో ఉండే అవకాశం లేదు.
మధుర, బృందావన్ ప్రజలకు, సూరసేనులకూ కులదేవత అయి ఉండవచ్చు. పశ్చిమ తీరాన ఉన్న ద్వారకకు వెళ్ళిన కృష్ణుడి చర్యలు విని వారి నుండి గౌరవం లభించి ఉండవచ్చు. కృష్ణుడి బాల్య చేష్టలూ, యువకుడిగా శృంగార చేష్టలూ, కథలుగా, వ్యాపించటం కూడా యిందుకు తోడ్పడి ఉండవచ్చు. ద్వారకలో యాదవ కులం తాగితందనాలాడుతూ, అగ్ని మంటలకు ఆహుతి కావటంతో వారి పట్ల సానుభూతి వచ్చింది. మధుర, బృందావన్ ప్రాంతంలో కృష్ణుడు కులదేవత కావటానికి యిది తోడ్పడి ఉండవచ్చు.
క్రీ.పూ. 4వ శతాబ్దంలో చంద్రగుప్త కొలువులో సెల్యూకస్ కు రాయబారిగా మెగస్ధనీస్ వచ్చాడు. క్రీ.పూ. 304-299 మధ్య ఇతడు భారతదేశాన్ని గురించి తాను చూసింది రాశాడు. చరిత్ర క్రమపద్ధతిలో లేని మనకు అతడు రాసిందెంతో ఉపయోగంగా ఉన్నది. ఈ దృష్ట్యా మనం చారిత్రక దృష్టినీ, అవగాహనూ పెంపొందించుకోవాలి.
మెగస్ధనీస్ తన రాయబారిగా, నివేదికలో హెరాక్లస్ అనే హిందూ దేవుని గురించి ప్రస్తావించాడు. అతడే కృష్ణుడు, మధురను మెధర్ అన్నాడు. కృష్ణపురాణాన్ని క్లేసొబొరా అన్నాడు. యమునానదిని అయోబారే అన్నాడు. కనుక మెగస్థనీస్ రాసిన దాన్ని బట్టి కృష్ణుడు ఆదిమవాసి దేవుడుగా క్రీ.పూ. భక్తుల్ని ఆకర్షించాడు. దీనిని బట్టి క్రైస్తవ ప్రభావం కృష్ణుడిపై ఉన్నదని వాదించిన వెబరోలాసెన్, లోరిన్ సర్ రాతలకు ఆధారాలు లేవని అర్ధం అవుతున్నది.
కృష్ణుణ్ణి దేవుడుగా ఉన్నత స్థాయికి తీసుకురావటానికి చాలా కాలం పట్టింది. పాణిని కాలంలో అర్జునుడితో పాటే కృష్ణుడు పూజలందుకున్నాడు. తరువాత అర్జునుడిని తొలగించి ఆ స్థానం బలరాముడికి (సంకర్షణకు) యిచ్చారు. హిందువుల దేవుళ్ళలో ప్రతిమ స్వరూపంగల దేవుడు తొలుత బలరాముడే ఆ తరువాత తండ్రి మాయలతో పాటు ప్రద్యుమ్నుడు కూడా చేరాడు. ఉత్తరోత్తరా కృష్ణ - జాంబవతి కుమారుడు సాంబ, ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు దేవుళ్ళ జాబితాలో చేరారు. వీరందరినీ స్థాన భ్రష్టుల్ని చేయటానికి కృష్ణుడికెంత కాలం పట్టిందో తెలియదు.
కుటుంబ సభ్యులను అధికారంలో, కీర్తిలో భాగం పంచుకోకుండా ఆపటం కష్టం అని కృష్ణుడికి బాగా తెలుసు. అందుకే వ్యూహాలలో వారిని చేర్చారు. పురాణాలు దశావతారాలు గురించి అనేక రకాలుగా చెప్పాయి. ఒక జాబితా ప్రకారం 22 అవతారాలున్నాయి. భాగవత పురాణాలను బట్టి ఈ జాబితా అనంతం (T.S. Rukmani : A Critical Study of Bhagavatha Purana, Varanasi 1970)
వేద సాహిత్యంలో అవతారాలు లేవు. ఎ.పి. కర్మార్కర్ దశావతారాలు ఇతిహాసకాలంలో రాలేదని అన్నారు. మహాభారతంలో ఈ అవతారాలను చేర్చారన్నాడు. (A.K. Karmarkar : Religion And Philosophy of Ethics in the Cultural History of India, Vol. II) బ్రహ్మసూత్రాలలో అవతారాల ప్రసక్తి లేదు. సుంగుల కాలంలో అవతారాల గురించి ప్రచారం జరిగినట్లు చెప్పవచ్చు. క్రీ.పూ. 2వ శతాబ్దంలో తిరోగమనవాదం వచ్చింది. చంద్రగుప్తుడి వంశీకులైన బృహద్రధుణ్ణి హత్య చేసిన తరువాత ఈ ధోరణి ప్రబలింది. హిందువులలోనే అవతారాల సిధ్ధాంతాన్ని గురించి చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఉపనిషత్తులలో తొలుత నిర్గుణ బ్రహ్మను ప్రతిపాదించగా, తరువాత సగుణబ్రహ్మ వచ్చింది. ఈ రెండింటికీ రాజీకుదిర్చిన తరువాత అది గీత రూపం దాల్చింది. గీతలో వైవిధ్యాలను ఆవిధంగా అర్థం చేసుకోవచ్చు (J.N. Farquhar : The Crown of Hindusim, New Delhi, 1971).
గీతలో తానే అవతారాన్ననీ, గతంలో భూమిపైకి అనేకమార్లు అవతరించాననీ భవిష్యత్తులో కూడా వస్తాననీ చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపడి ఒక ప్రశ్న వేస్తాడు. వివస్వతుకు (సూర్యుడికి) యోగజ్ఞానాన్ని బోధించానన్నావు. వివస్వతుడు నీకంటే ఎన్నో యుగాల ముందు లేడా. అన్నాడు. (అధ్యాయం 4, శ్లోకం 4).
కృష్ణుడు చిక్కుముడులతో, కథలతో, అర్జునుడిని ఊరుకోబెడతాడు. ఈ పద్ధతిలో దైవాన్ని విడమరచి చెప్పవచ్చునని శంకరాచార్యుడు కూడా అంటాడు. గీతపై భాష్యం రాస్తూ కృష్ణుడు పుట్టాడనీ, పుట్టలేదనీ అంటాడు. ఇదెలా సాధ్యమంటే మాయ ద్వారా అంటాడు. మాయను అడ్డం పెట్టుకుంటే ఇక చర్చ, వివాదం ఉండదు. (Shankarchargya : The Bhagavadgeetha with Commentary) మాయావాదులు తింటారు, తాగుతారు, ప్రేమిస్తారు, పిల్లలను గంటారు. డబ్బు సంపాదిస్తారు. రాజకీయాధికారం స్వీకరిస్తారు. అధికారంలో ఉన్న వారిని గుప్పిట్లో పెట్టుకుంటారు. విలాస జీవితం గడుపుతారు. అదంతా మాయే. కృష్ణుడు గీతాబోధనలో తనను అవతారంగా చెప్పుకున్నప్పుడు అదంతా మాయగా చూడలేక పోతే, అందుకు గత జన్మలోని పాపపుణ్యాలు అడ్డువస్తున్నాయన్నాడు.
కృష్ణుడు కులదేవతనుండి విష్ణు అవతారంగా ఎదగటానికి శతాబ్దాలు పట్టింది. గీతలో విష్ణువు పేరు 3 సార్లూ, హరి పేరు 2 సార్లూ కనిపిస్తుంది. కృష్ణుడు తనను, విష్ణువుగా, ఆదిత్యుడిగా ఒకసారి చెప్పుకుంటాడు. అర్జునుడు రెండుసార్లు కృష్ణుడిని విష్ణువుగా సంబోధిస్తాడు. ఐతే, సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకొని అలా పిలిచాడు. సంజయడు రెండుసార్లు కృష్ణుడిని హరి అంటారు, (W. Hill, P. Douglas : The Bhagavadgeetha, Madras, 1959) కృష్ణుడు విష్ణువుగా, హరిగా రూపొందటం గీత తరువాత ఎంతో కాలానికిగాని జరగలేదు.
గీతలో కృష్ణుడు తాను భూమి మీదికి అవతరించటానికి ధర్మం పోయి, అధర్మం ప్రకోపించినప్పుడు అవతరిస్తాన్నాడు. అదే గనుక కృష్ణుడి (విష్ణువు) ఉద్దేశం అయితే, స్వర్గంలో యోగనిద్రను అనుభవిస్తూనే ఉండవచ్చు గదా అని అరవిందుడన్నాడు. అరవిందుడు తానే అవతారం అన్నట్లు కొన్ని సందర్భాలలో ప్రవర్తించాడు. అతని రచనల్లోని పులుముడు వాదాన్ని ఆయన భక్తులే వివరించాలి. (Sri Aurobindu : Essays on the Geetha, New York, 1950).
గాంధీ ఈ అవతారాలను గురించి పట్టించుకోకపోలేదు. అన్ని మతాలు అవతారాలను సమ్ముతున్నాయన్నాడు. గాంధీ వివరణ ప్రకారం రజనీష్, సాయిబాబాలు తమను అవతారాలుగా చెప్పుకోవచ్చు. కృష్ణుడన్నట్లు అవతారానికి ప్రధాన లక్షణం మాయే. అవతార పురుషులు ఈ మాయనే ప్రదర్శిస్తున్నారు. మానవరూపంలో దేవుళ్ళమనే భ్రమ అమాయక జనాలకు కల్పిస్తున్నారు.
భగవాన్ దాస్ తన సొంత వివరణతో కృష్ణుడి విష్ణు అవతారాన్ని గురించి చెప్పాడు. అతడు అనిబిసెంట్ సహచరుడు. భారతరత్న, మూఢనమ్మకాలకు హేతుబద్ధత కల్పించదలిచాడు. అతని రచనల శీర్షికలు అలాగే ఉంటాయి. విష్ణువు ఎందుకు అవతరించిందీ వివరిస్తూ సుందోపసుందులు నాశనమైనట్లే, కురుపాండవుల తీవ్రవాదాన్ని అణచటానికి అవతరించాడన్నాడు. (Bhagavandas : Krishna, Madras 1959)
ఆర్.కె. పాండె కృష్ణుడి గోపికాలీలల్ని వివరిస్తూ రుషులు కృష్ణుణ్ణి ప్రార్థించారనీ, తమను సన్నిహితంగా ఉండనియ్యమని కోరారనీ కనుక వారందరినీ గోపికలుగా అవతారం ఎత్తమని కృష్ణుడు వారి కోరికను తీర్చాడనీ రాశాడు. గోపికల వస్త్రాలను అపహరించుకుపోవటం పాండె వివరిస్తూ దోషం రూపంలో ఉన్న వివస్త్ర స్నానాన్ని రూపుమాపాలని అలా చేశాడన్నారు. ఈ వివరణ యిచ్చిన పాండె తరువాతి జన్మలో గోపికగా జన్మించి కృష్ణుడికి సన్నిహితంగా ఉండవచ్చు. (R.K. Pandey : The Concept of Awataras).
కృష్ణుడిపై ఎన్నో గ్రంధాలు వెలువడ్డాయి. వాటన్నిటినీ చదవటం సాధ్యపడే విషయం కాదు. భారతీయ విద్యాభవన్ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలను బట్టి భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి అడుగు పెట్టకుండా ఉండే ప్రయత్నం కనిపిస్తున్నది.
డార్విన్ సిద్ధాంతం లోతుపాతులు తెలియకుండానే కొందరు అందులో అవతారాలకు సమర్ధన ఉన్నదంటున్నారు. ఆత్మ, దాని ప్రయాణం అనే భ్రమల్ని డార్విన్ సిద్ధాంతం కొట్టిపారేసింది. సృష్టివాదాన్ని పటాపంచలు చేసింది. దేవుడు దిగివచ్చాడనే నమ్మకాన్ని తృణీకరించింది.
జీవితానికి భౌతిక ఆధారాలు చూపింది. జ్ఞానార్జనకు ఇంద్రియాల ప్రాధాన్యతను పేర్కొంది. అర్హత లేని జీవులు నశించినట్లు చూపింది. మానవుడు దిగజారిన దేవతకాదనీ, పైకి ఎదుగుతున్న జంతువనీ రుజువు పరచింది. క్రైస్తవుల మత సిద్ధాంతాన్ని దెబ్బతీసిన డార్విన్ సిద్ధాంతం హిందూ మతానికి తోడ్పడుతుందను కోటం భ్రమ.
ఇటీవల జీవశాస్త్రాలలో పరిశోధనల వలన డార్విన్ ప్రతిపాదనలు దేవుడికింకా దూరమై మానవుడి కింకా దగ్గరయ్యాయి. జీవరాశులున్ను మేఘాల నుండి మానవుడు ఆవిర్భవించినట్లు ఫ్రెడ్ హోయల్, విక్రమ్ సింఘే సిద్ధాంత ప్రతిపాదన చేశారు. అది మత ప్రాతిపదిక కాదు. మన సంప్రదాయవాదులు పురాణాలలో అది కూడా చెప్పారని చూపగల సమర్ధులే. మన ఉపనిషత్తు దార్శనికులు ఈ విషయాలను ఆనాడే తెలుసుకున్నారని కూడా అనగలరు. బ్రహ్మపదార్థం అంటే హోయల్ చెప్పే జీవకణానికి కూడా చెప్పగలరు. (Holye, Wickramasinghe : Life cloud, the origin of life in the universe, New Year, 1978)
దశావతారాలలో మనవాళ్ళు పదవ అవతారం ఇంకా రావాలంటున్నారు. శూద్రులను శిక్షంచటానికి అది ఉద్దేశించారట. కల్కి అవతారం క్షత్రియుడంటున్నారు. అవసరమైనప్పుడు విష్ణువు పంది అవతారమైనా ఎత్తుతాడుగాని, వైశ్యుడుగానూ, శూద్రుడుగానూ రాడు. వారు పాపయోనికి పుట్టినవారు గదా! (Pandey, Delhi 1979).
20వ అధ్యాయం
ఇద్దరు భగవాన్లు
ఒక ఆటవిక హీరోని జాతీయదేవుడుగా పైకెత్తాలంటే ఒక పవిత్ర గ్రంధాన్ని అతని పేరిట సమకూర్చాలి. కృష్ణుడి విషయంలో వెయ్యేళ్ళు పట్టింది. అయినప్పటికీ ఆ గ్రంధాన్నీ, దాని సందేశాన్ని గురించీ ఏకాభిప్రాయం లేదు. కృష్ణుడి అనంతరం గీత వచ్చిందని నిశిత పరిశీలన చేసే పండితులంతా అంగీకరిస్తున్నారు. అది కూడా దశల వారీగా వచ్చింది. ఆర్.జి. భండార్కర్ యీ విషయమై రాస్తూ భగవద్గీత రచించినప్పుడు వాసుదేవుడు లేడనీ, అలాగే బుద్ధుడి ప్రవచనాలు గ్రంధస్తం చేసేటప్పుడు బుద్ధుడు లేడనీ అన్నాడు. అయినా, ఇరువురినీ భగవంతుడని అన్నారు.
సన్యసత్వం అనేది ఆర్యేతర భావన. భారతదేశంలో ఆ భావనకు ఆర్యులు విముఖులు. జీవితాన్ని అనుభవించాలనే సుఖజీవితం గడిపారు. యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలుండేవారు. క్రమేణ హరప్పా ద్రావిడులనుండి ఆర్యేతర భావంగా సన్యాసాన్ని తెచ్చుకున్నారు. మూడు అగ్ర కులాలు మాత్రేమే సన్యసత్వాన్ని పుచ్చుకోవచ్చన్నారు. జీవితం చివరి దశలో ఇది చేపట్టాలన్నారు. శూద్రులూ, ఛండాలరు కూడా సన్యాసులు కావచ్చని బుద్ధుడన్నాడు. తల్లిదండ్రుల అనుమతితో పిల్లలు కూడా చేరవచ్చునన్నారు. బుద్ధుడు ఇదంతా చాలాల పరిమితంగానే చేశాడు. కుష్టురోగుల్నీ, రుణగ్రస్తుల్నీ, బానిసల్నీ, సన్యాసులు కావటానికి అంగీకరించలేదు. బుద్ధుడు చేసినదంతా వర్ణాశ్రమ ధర్మాలను దెబ్బతీసేదిగా ఉన్నది. కింది కులాలకు చెందిన మంగలి, మత్స్యకారులూ, పాకీవారూ బుద్ధుని శిష్యులలో ఉన్నారు. కొందరు స్ర్తీలను కూడా సన్యాసులు కావటానికి బుద్దుడు అంగీకరించాడు. వైశాలికి చెందిన ఆమ్రపాలిని సంఘంలో చేర్చుకున్నాడు. ప్రసేనజిత్తురాజు అభ్యంతరం పెడుతున్నా ఒక ఛండాల స్త్రీని, శ్రావస్తికి చెందిన బ్రాహ్మణులనూ బుద్ధుడు సంఘంలో చేర్చుకున్నాడు. ఆ విధంగా అరమరికలు లేకుండా చేర్చుకోవటం వలన మితం తప్పింది. లోగడ బానిసగా ఉన్న గోపాలుడు గొప్ప తాత్త్వికుడిగా చెప్పుకున్నాడు.
సన్యాస భావనలు కాదంటే వర్ణాశ్రమ ధర్మాన్ని కాదనడమే అవుతుంది. కనుక రెండవ భగవాన్ గా కృష్ణుడు వచ్చి అర్జునుడికి నిష్కామకర్మ అంటూ బోధచేశాడు. కులధర్మాన్ని పాటించమన్నాడు. అది గీత సారాంశం. రాధాకృష్ణన్ ప్రకారం ఆధునిక మనస్తత్వ శాస్ర్తంలో గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. వాస్తవం ఏమంటే కింది కులాలవారిని వారి వృత్తులలో అట్టి పెట్టి, విద్య, వికాసాలకు దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. చెప్పులు కుట్టేవారు జన్మాంతర విషయాలను దృష్టిలో పెట్టుకొని తన వృత్తిని మార్చకుండా కొనసాగించాలన్నాడు. శంబుకుడు ధైర్యంగా తపసు చేసినందుకు రాముడు అతడిని తలసరికేసాడు. ఈ చర్యను కాళిదాసు అభినందించాడు.
మొదటి భగవానుడు సంఘం వెలుపల కులపద్ధతిని ఆమోదించాడు. ఐతే పుట్టకను బట్టిగాక, అభిరుచి, గుణగణాలను బట్టి కులం ఉంటుందన్నాడు. మానవుడి వృత్తిని అతడి కులం నిర్ణయిస్తుందనీ, తల్లిదండ్రులను బట్టి కాదనీ అన్నాడు. (Lord Chalmers ; Twither Dialogue of the Buddha, London 1926 : c. Kunhan Raja : Dhamrapada, Madras, 1956)
రెండవ భగవానుడు కులాన్ని ఆవిధంగా చూస్తే ప్రమాదమని, తానే సృష్టించినట్లు చెప్పుకున్నాడు. లోగడ జన్మలను బట్టి ఈ కులనిర్ధారణ జరుగుతుందన్నారు. ఇది మొండివాదన గనుక ఒప్పుకోవాలి, లేక నిరాకరించాలే తప్ప, వాదించేదేమీ లేదు.
మొదటి భగవంతుడు నీతిని అనుసరించమన్నాడు. క్రూరత్వాన్ని ద్వేషించమన్నాడు. జనన, మరణాల బంధనుండి తప్పించుకోవచ్చున్నాడు. రెండవ భగవంతుడు కులధర్మం ప్రధానం అన్నాడు. ఎటువంటిదైనా సరే కులవృత్తిని పాటిస్తే వచ్చే జన్మలో సుఖం ఉంటుందన్నారు. కల్పిత బ్యాంక్ పేరిట పోస్టు డేటు వేసిన చెక్కులాంటిదే కృష్ణుడి హామీ. వీటిని అనుసరించటం కష్టమని కృష్టుడికి తెలుసు. అందుకనే సహృదయంతో, భక్తితో తనకేది సమర్పించినా అంగీకరిస్తానన్నాడు. మరణించేముందు తనను తల్పుకుంటే తన వద్దకు చేరుకుంటారన్నాడు. ఎంత అవినీతి పరులైనా కృష్ణుడి నామం జపిస్తే మోక్షం పొందుతారు. అమరత్వానికి అది హామీ పత్రం వంటిది.
బుద్ధుడు నిర్మాణం ఉత్తమ మార్గమన్నాడు. అందుకు అష్టాంగ మార్గాలూ సూచించాడు. సారనాధ్ లో తొలిబోధనగా ఈ విషయాలు చెప్పారు. రెండవ భగవానుడు ఇంకా ఉదారంగా భక్తులు ఏమార్గాన్ని అనుసరించినా తనవద్దకే చేరుకుంటారన్నారు. ఐతే తనను కొలిచే వారికి స్వర్గంలో ఉత్తమ స్థానం లభిస్తుందన్నాడు.
ఇరువురు భగవాన్లూ శాఖాహారులు కాదు. ఆహారం కోసం జంతుబలిని బుద్ధుడు ప్రోత్సహించకపోయినా, భక్తులు మంసాహారాన్నిచ్చిపన్పుడు నిరాకరించ లేదు. అడుక్కునే వారికి ఎంపిక చేసే హక్కులేదన్నాడు. చుండ అనే భక్తుడు ఇచ్చిన పంది మాంసం తిన్న తరువాతనే బుద్ధుడు చనిపోయాడు. ఎవరూ మద్యపానం చేయకూడదన్నాడు.
కృష్ణుడు మాంసాహారి, మద్యం సేవించడు. మత్తుపానీయాలకు అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు గీత వెల్లడించలేదు. క్షత్రియులకు చంపడం కులధర్మం అన్నారు. యుద్ధరంగంలో బంధుప్రీతి లేకుండా క్షత్రియుడు హతమార్చాలి. అతనికి అప్పుడే ఇహపరలోకముక్తి లభిస్తుంది.
బుద్ధుడు చేపలు తప్ప మరే జీవులకూ హాని చేయరాదన్నాడు. (E.H. Brewster : The Life of the Gothama, The Budha) రాజ్యాల మధ్య యుద్ధాన్ని బుద్ధుడు ఖండించలేదు. వ్యక్తులపై హింసను మాత్రమే బుద్ధుడు ఖండించాడు. రాజ్యాల మధ్యపోరాటాలు తప్పవేమొ అన్నాడు. వినయ పిటక జాతక కధలలో యుద్ధాలకూ, వ్యూహాలకూ ఆయుధాలకూ సంబంధించిన ప్రస్తావన ఉన్నది. వాటిని ఖండించలేదు కూడా. (G.S.P. Mishra : The Age of Vinaya, 1972, New Delhi)
గీత అహింసను చెప్పలేదు. ఒక చోట మాత్రం యీ ప్రస్తావన ఉన్నది. (5వ అధ్యాం, 5వ శ్లోకం) అహింస, సమానత్వం గీత ప్రయోజనానికే విరుద్ధం. అంచలవారీ అసమానత్వాలకు దారి తీసిన కులవిధానంలో సమానత్వం కుదరదు. ఎవరో కావాలని అహింస, సమానత్వపదాలను ఒక చోట గీతలో చేర్చారు. బుద్ధిజం వ్యాప్తిని అరికట్టడానికి గీతను అల్లారు. మహాభారతం యావత్తునూ బ్రాహ్మణ విజ్ఞాన సర్వస్వం అనవచ్చునని ఎన్.జె. షిండే అన్నాడు. అంగీరసుడు, భృగుడు మహాభారతానికి ప్రస్తుత రూపాన్నిచ్చారన్నాడు. దాన్ని ధర్మశాస్త్రంగా, నీతి శాస్త్రంగా చూపారన్నాడు. (N.J. Shende, The Authorship of Mahabharatha, Vol. 24, Annals of the Bhandarkar Rosearch Institute, Poona, 1943). నా దృష్టిలో గీత-బంధాల బైబిల్ మాత్రమే.


ధ్యాయం యిరుఅవైఒకటి
ఎవరికి కావలసింది వారికి!
రోమన్ దేవుడు జేనస్ కు రొండు ముఖాలుంటే, హిందువుల దేవుడు హరికి వెయ్యి ముఖాలున్నాయి. కృష్ణావతారంలో హరి వెయ్యినాల్కలతో మాట్లాడతాడు. గీత యిచ్చే వెయ్యి సందేశాలలో ఏది స్వీకరించాలో అది నీ యిష్టం. నీకు నచ్చే సందేశాలను కలిపి చూచుకోవచ్చు. అలా కలిపినప్పుడు ఎన్నో తత్వ్తాల గురించి ఎప్పటి కప్పుడు పుష్కలంగా పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. ఇక అనువాదాలూ, భాష్యాలూ లెక్కకు మించాయి. క్రీ.త. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు దీనికి శ్రీకారం చుట్టాడు. అది నిర్విఘ్నంగా సాగిపోతూ యజ్ఞాలూ, ప్రసంగాలూ, ప్రవచనాలరూపం దాల్చాయి.
గీత ఆకర్షించటానికి అందులోని గందరగోళమే కారణం. భిన్నత్వం, మరొక అంశంగా చెప్పవచ్చు. ఎవరికేది కావాలో అది గీతలో ఉన్నది. కేవల అద్వైతం నుండి ద్వైతం వరకు శంకరుడూ, రామానుజుడూ, మధ్వుడూ, వల్లభుడూ గీతనుండి స్వీకరించారు. ముక్తికి భిన్న మార్గాలున్నాయన్నారు. అన్ని మార్గాలూ తన వద్దకే చేరుస్తాయని కృష్ణుడన్నాడు. శంకరుడు జ్ఞానయోగాన్ని కోరాడు. సన్యాసం కావాలన్నాడు. మిగిలిన ముగ్గురాచార్యులూ భక్తియోగం ఎంపిక చేసుకున్నారు. శంకరుణ్ణి వ్యతిరేకించిన ఈ ముగ్గురూ వారిలో వారు విభేదించారు.
ఈ ఆచార్యుల చుట్టూ అనేక భాష్యకారులు బయలుదేరారు. ఇందులో శంకరుడిది చాలా విస్తారమైనది. ధనపతి, హనుమత్, మధుసూధన, శ్రీధర, నీలకంఠ, వెంకటనాధ, శంకరానంద, భాష్యకారులుగా పేర్కొనదగినవారు. శంకరుడిని అనుసరించిన వీరు మధ్యలో సొంతదారులు నిర్మించారు. ఎదుటి పక్షం వారితో చేరిన సందర్భాలూ లేకపోలేదు. రామానుజుడూ, మధ్వుడూ, వల్లభుడూ తమ అనుచరులతో వేర్వేరుగా కొనసాగారు. యమునాచార్యుడూ, వెంకటనాధ చాలా సమర్ధులైన రామానుజాచార్యుల ముఠాకు చెందినవారు. పురుషోత్తం వంటి వారు వల్లభుడిని సమర్ధించారు. జయతీర్ధ, రాఘవేంద్ర వంటివారు మధ్వుడి కోపు వేసుకొన్నారు. వీరందరిలో వ్యక్తిగత తేడాలున్నాయి.
కేసవ, నింబార్కుడు ఏ ముఠాలకూ చెందకుండా గీతకు సొంత వ్యాఖ్యానాలు చేశారు. భాస్కర, అభినవగుప్త, ఆనందవర్ధన, రమాకాంతులు కాష్మీరు పండితులుగా గీతకు భాష్యం చెప్పారు. బొంగాలలో చైతన్య, మహారాష్ర్టలో రామ్ దాస్, ఏకనాధ్, ఇంకా తుకారాం వారి భాష్యాలు వెల్లడించారు.
మహారాష్ర్టలో గీతపై చెప్పే వ్యాఖ్యానానికి బ్రాహ్మణులు జ్ఞానదేవుడిని 13వ శతాబ్దంలో హింసించారు. అతనిని కాపాడిన కొందరు బ్రాహ్మణులు గీతపై వేరే అనువాదం, భాష్యం వెల్లడింపచేశారు. మహారాష్ర్టలో అన్ని కులాల వారికీ అది ప్రేరణ కల్పించింది. (D.D. Kosambi : The Culutre And Civilization of Ancient India) అతడి భాష్యంలో మానవవాదం ఉన్నది. జ్ఞానదేవుని ఆదర్శపురుషుడు ప్రపంచంలోని ఏ వస్తువును చూచినా దివ్యమైన ప్రేమతో పొందిపోతారు. జీవితాదర్శం మోక్షం కాదు. భక్తి మాత్రమే. కర్మకాండలూ, యోగాభ్యాసాలూ నిరుపయోగం. జీవితం పాపపంకిలం కాదు. దైవ ప్రేమానుభూతిని చూపేదే జీవితం. అది గ్రహించటమే జీవిత లక్ష్యం. ఇందుకు కులాలూ, కాల, ప్రదేశాలు అడ్డురాకూడదు. ఇది జ్ఞాన దేవుడి సందేశం. (B.P. Birat : A Philosophy of Gnanadeva Pandharipur, 1956). 13వ శతాబ్దంలో మోక్షం ఆదర్శం కాదని, కులాలను ఖండించటం అసాధారణం. 22వ ఏట చనిపోయిన జ్ఞానదేవుడు మురాఠీ భాషపై, ఆలోచన పై తన ప్రభావాన్ని చూపెట్టాడు.
శంకరుని చాలా మంది ప్రమాణంగా స్వీకరించినా మైంకర్కు అతని పట్ల చాలా స్వల్పమైన అభిప్రాయం ఉన్నది. గీతకు భక్తియోగం కేంద్రమనీ, శంకరుడు వక్రభాష్యం చేసి తన జ్ఞానయోగాన్ని సమర్ధించుకున్నాడనీ అన్నాడు. భగవద్గీత భాష్య కారుడుగా శంకరుడిపై ఆధారపడటానికి వీలులేదన్నాడు. (T.G. Mainkar : A Comparative Study on the commentary of Bhagavadgeetha, Delhi 1969). గీతపై సంప్రదాయ భాష్యకారులందరికీ ఈ మాటలు వర్తించవచ్చు.
ఆర్.డి. రణడే పండితుడుగా గీతపై భాష్యం చెప్పాడు. ఎస్.హెచ్. జాబ్వాలా హీనమైన భాష్యం చెప్పాడు. ఐతే, వారు ఆధునిక కాలాన్ని కూడా తమ భాష్యంలో చెప్పారు.
గీతను ఎలా చదివాల్సిందీ వివరిస్తూ త్రిదండి స్వామి బి.హెచ్. బాన్ రాయగా, పేరు లేకుండా మరొకరు గైడు రాశారు. చైతన్య ధోరణిలో గీతను త్రిదండిస్వామి అనువదించాడు. పేరు లేని వ్యక్తి రాధాకృష్ణను ఉదహరిస్తూ కాలాతీతంగా, విశ్వవ్యాప్తంగా గీత పనికి వస్తుందని బోధించాడు.
ఢిల్లీలోని సుందర్ లాల్ అనే హిందువు గీతను ముస్లింలు ఎలా చదవాల్సిందీ రాయగా హైదరాబాద్ లోని సయ్యద్ అసదుల్లా దానిని అనుసరించాడు. గీతను క్రైస్తవులు చదవ వలసిన తీరుపై కొన్ని పుస్తకాలున్నాయి. బౌద్ధ, జైన, యూదు, జోరాస్ట్రియన్, షింటొ, కన్ఫ్యూసియన్ గైడ్లు కూడా వస్తుండవచ్చు. (Anon : Githadarshan as Bhaktiyoga, Madras 1968 : Tridandaswamy, B.H. Bon : The Gita as a Chaitanyait Reads it, Bombay 1938).
బాల్ గంగాధర్ తిలక్ గీతను ఆచరణకు పురికొల్పుతున్నట్లు, నిష్కామకర్మగా, ప్రపంచం కోసం ఈ ఆచరణ జరపాల్సినట్లు అభిప్రాయపడ్డాడు. మరాఠీలో రాసిన ఈ పుస్తకాన్ని బర్మాలోని మాండలే జైలులో ఉండగా తిలక్ ఉద్ర్గంధంగా రూపొందించాడు. దీనిని బాలచంద్ర శీతారాం సుక్తాంకర్ ఇంగ్లీషులోకి అనువదించాడు. గీత భాష్యాన్ని అరవిందుడు కొట్టిపారేశాడు. గాంధీ కూడా విభేదించాడు.
అరవిందుడు చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటూ, హఠాత్తుగా పాండిచేరి పారిపోయి అది భయపడి తీసుకున్న చర్య కాదనీ, దైవపిలుపును బట్టి తీసుకున్న నిర్ణయం అనీ మనల్ని నమ్మమంటున్నాడు. సంపన్న శిష్యులతో, వారి ఆదరణతో సొంద జీవితాన్ని గడిపాడు.
తిలక్, గాంధీల మధ్య గీతాభాష్యంపై వచ్చిన అభిప్రాయభేదాలను డి.కె. గోసావీ విడమర్చి చెప్పాడు. (Tilak,Gandhi and Geetha, Bombay, 1983)
గాంధీ కేవలం సత్యం, సంపూర్ణ బ్రహ్మచర్యం, పూర్తి ఆహింస, తిరుగులేని త్యాగం, కేవల నైతిక విలువలూ కావాలన్నాడు. అలా అంటే చివరకు వ్యక్తిలో కపట ప్రవర్తనకు దారితీసే లక్షణాలు వస్తాయి. నైతికవాది మానవస్వభావాన్ని విస్మరించే అవకాశం వున్నది. అలాంటప్పుడు నైతికవాదిని మానవస్వభావం కూడా పక్కనబెడు తుంది. బెట్రాండ్ రసెల్ ఇలాంటి హెచ్చరికచేశాడు. ఐనా గాంధీ పట్టించుకో లేదు. దాని ఫలితం అనుభవిస్తున్నాం. ప్రజా జీవితం, వ్యక్తిగత జీవితంలో కూడా నైతిక విలువల్ని పాటించకుండా నటనతో కప్పిపుచ్చుతున్నాం. దీనంతటికీ గీతా ప్రభావం చూపవచ్చు. అన్ని అభిప్రాయాలకూ నమ్మకాలకూ అసమానతలకూ ఆర్థిక పరమైన అన్యాయాలకూ గీతను అడ్డం పెట్టుకోవచ్చు చంపేవాడూ, చంపబడేదీ అనేది లేదని గీత చెపుతుండగా ఇక హత్యలకూ, మూకుమ్మడి హింసలకూ, వ్యతిరేకత ఎలా వస్తుంది. చంపుతున్నారనుకోటం అజ్ఞానం. దేవుడు వారిని ముందే చంపేశాడు అంటుంది గీత. గీతాకారులకు ఆచరణలో స్వేచ్ఛ లేదు. అతడు దేవుని చేతిలో కీలుబొమ్మ. వేదాంతులు దీనివే ఈశ్వరలీల అంటున్నారు.
ఆల్బర్ట్ షూజర్ భగవద్గీతకు స్పింన్క్స్ వంటి స్వభావం ఉన్నదన్నాడు. అది కేవలం గూఢార్ధంతో నవ్వుతుంది. కాని, గీత గూఢార్ధంలో మాట్లాడుతుంది, వాదిస్తుంది, బెదిరిస్తుంది, ప్రేరేపిస్తుంది, ఇంకెన్నో చేస్తుంది. నైతిక విలువల్ని పాటించదు. గీత నీతికి దూరమైనది. మనం దానిని చదివి గౌరవిస్తున్నాం. గీతను రాసిన అనామకులకు అది గొప్ప విజయం. భారతదేశానికీ, ప్రపంచానికీ అదొక విషాదం.
22వ అధ్యాయం
తుదిమాట
1200 సం.రాల క్రితం శంకరాచార్యుడు దుమ్ముదులిపి గీతను పైకి తీసి తన మేధస్సుతో భాష్యంగా రాసి విమోచన గ్రంధంగా ప్రజలు ముందుంచాడు. అప్పటి నుండీ దీని ప్రభావం సర్వత్ర దారుణంగా పరిణమించింది. మానవ అసమానతలకు, బాధలకూ బాధపడకుండా, ఉదాసీనత చూపటానికి గీతే కారణం. మనల్ని కపటవర్తనలోకి గీత నెట్టేవేసింది. ఆ విషయాన్ని ప్రేమనాధ్ బజాజ్ రాశాడు.
గీత జాతీయ పవిత్రగ్రంధంగా ఆవిర్భవించటం, మన మనస్తత్వాన్ని ఆవరించటం పరస్పర సంబంధం గలవి. ఆ మాట అంటే గీతాభిమానులు దూషిస్తారు. ఈ విషయంలో చర్చ జరగాలి. ఆలోచనల సంఘర్షణ సాగాలి. అప్పుడు కొత్త జీవితానికి నాంది పలుకుతుంది.
గీత పేర్కొన్నట్లు కృష్ణుడు మళ్ళీ ఈ భూమి మీదికి ధర్మస్థాపన నిమిత్తం రాకూడదు. లోగడ వచ్చినందుకే తీరని నష్టం జరిగింది. ధర్మం పేరిట మారణకాండ జరిగింది. మహాభారతం ప్రకారం అప్పుడు మిగిలిన వారు 9 మందే. ద్వాపరయుగం అంతమై కలియుగ మారంభమైందన్నారు. కృష్ణుడు తనను వజ్రాయుధంగా వర్ణించుకున్నారు. అలాంటి కృష్ణుడు ఇప్పుడు వస్తే అణ్వాయుధాల కృష్ణుడవుతాడు. భూమిపై మనుషులుండరు.
అర్జునుడు విస్మరించినట్లే మనం గీతను విస్మరించాలి. కృష్ణుడు బోధించిన ఒక ఏడాది లోనే గీత తన మనసు నుండి తొలిగిపోయిందని అర్జునుడన్నాడు. మనజాతి మనసునుండి కూడా అలాగే తొలిగిపోవాలి. అంతటితో మన నిద్రావస్తపోయి, భ్రమలు తొలగి సొంత ఆలోచన పెరుగుతుంది. అప్పుడే స్వార్ధాన్ని పక్కన బెట్టి మానవజాతి భవిష్యత్తుకు బాటలు వేయగలం. కార్ల్ సేగన్ ఊహించినట్లు మనభూమి వంటివి ఈ విశ్వంలో యింకెన్నో ఉండి ఉండవచ్చు. అవి వివిధ సంస్కృతులలో మనల్ని మించిపోయి ఉండవచ్చు. అర్జునుడు గీతను మరచిపోయినట్లే మనం గీత వైరుధ్యాలనూ, గందరగోళాలనూ ఎత్తుగడలనూ మరచిపోయే రోజు వస్తుందని ఆశిస్తున్నాను. భారతీయులు ఆనందంగా అర్థవంతంగా మనుగడ సాగిస్తారని కోరుకుంటున్నాను. ఆలోచన స్థభింపజేసే ధోరణి మార్చుకోవాలి. అనంతాకాశంలోకి చూస్తూ, ఆత్మ పరమాత్మతో లీనమయ్యే ఎండమావుల కోసం వెతక్కుండా ఉండాలి. విశ్వంలోని మర్మాల పొరలను విప్పుకుంటూ మానవుడు పురోగమించాలి. అందుకు తొలిమెట్టుగా కృష్ణుడిని, గీతనూ విసర్జించాలి.

No comments:

Post a Comment