రెండుసార్లు ముఖ్యమంత్రిచెన్నారెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 8




Devhas Baba blessed Channareddi with his feet
1919-1996


‘దేవర్ బాబా’ కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తరప్రదేశ్ లో ఒక చెట్టుకొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా.చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో ‘సెక్యులరిస్ట్’ ఇంగ్లీషు మాసపత్రిక ముఖచిత్రంగా వేశారు. అప్పట్లో దానికి ఎడిటర్ ప్రొ. ఎ.బి.షా. అది చెన్నారెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన ఆగ్రహంతో ఊగిపోయి, ‘పిలవండి! ఆ ఇన్నయ్య ఎక్కడ ఉన్నాడో, సంగతేంటో తేల్చుకుందాం’ అన్నాడు. నాకు కబురు చేశారు. వెళ్ళాను. ఆ పత్రికను చూపి విసిరికొట్టి, ‘నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా?’ అన్నాడు.
నేను ప్రశాంతంగా ఆయన షష్ఠిపూర్తి సంచిక తీసి, అందులో రంగుల చిత్రంగా పూర్తి పేజీలో వేసిన దేవర్ బాబా కాలు పెట్టి దీవించిన చిత్రం ఆయన ముందు పెట్టాను. అది చెన్నారెడ్డి ఆమోదంతో ఆయన అభిమాని పరమహంస తయారు చేసిన సావనీర్. చెన్నారెడ్డి అవాక్కయిపోయాడు. ఆగ్రహంలో వివేచన మరచిపోవడం సహజం.
1958 నుంచే నాకూ, చెన్నారెడ్డికి సన్నిహిత పరిచయం ఉంది. ఆది నుండి అది లవ్-హేట్ సంబంధంగానే కొనసాగింది. స్వతంత్ర పార్టీ ఆవిర్భవించిన తొలి రోజులలో విజయవాడలో ఆచార్యరంగా మొదలైనవారి సమక్షంలో జరిగిన సభలో చెన్నారెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఉండేబదులు, కృష్ణలో దూకి చావటం మేలని చప్పట్ల మధ్య ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ లో చేరిపోయాడు. ఆయన మాట్లాడిన సభలో నేను, ఎస్.వి.పంతులు మొదలైనవారంతా ఉన్నాము. అప్పుడే చెన్నారెడ్డితో నా తొలి పరిచయం. ఆ తరువాత ఆయన చనిపోయేవరకూ అన్ని పరిస్థితులలోనూ కలుస్తూనే ఉన్నాము.
మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రాసినప్పుడు కూడా చెన్నారెడ్డి పదవిలో ఉండగా అవినీతి విషయాలను ప్రస్తావించిన సంగతులు కొందరు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. నా పుస్తకాన్ని విసిరికొట్టినట్లు అక్కడ ఉన్నవారు చెప్పారు. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి రాకముందు, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సారధిగా ఆయన వుర్రూతలూగించినప్పుడు ఎన్నిసార్లు కలిశానో చెప్పలేను. నా మీద ఎంత కోపమున్నా, మరొక ప్రక్క ఆదరంగానే చూపేవాడు. తెలంగాణా ఉద్యమం తారాస్థాయిలో ఉండగా కొందరు ఆంధ్ర ప్రాంత మిత్రులు ఆయన్ను కలవాలనే కోరిక వెళ్ళబుచ్చారు. అడ్వకేట్ ఎన్.కె.ఆచార్య, మానవవాది కొసరాజు సాంబశివరావు, జర్నలిస్ట్ ఎ.ఎల్.నరసింహారావు వారిలో ఉన్నారు. ఆనాడు చెన్నారెడ్డి ఒక టెర్రర్. ఆంధ్రులు ఆయన్ని కలిసేవారు కారు. నేను వీరిని వెంటబెట్టుకుని తార్నాకలో ఆయన గృహానికి వెళ్ళినప్పుడు, ‘మీరంతా తెలంగాణా వారితో కలిసి ఉద్యమంలో పాల్గొంటే మీ జోలికి ఎవరూ రారు’ అని సలహా చెప్పారు. వెళ్ళినవారు మౌనంగా వచ్చేశారు. నేను తరువాత ఆయనతో, ‘అయితే తెలంగాణా వారితో ఉద్యమంలో కలవకపోతే ఏమైనా చేయవచ్చు అని సందేశం ఇస్తున్నారా!’ అని అడిగాను. ఆయన కాసేపు కూర్చోబెట్టి ఆచార్య రంగా, లచ్చన్న మొదలైన వారి విషయాలు అడిగారు. మా ఇరువురికి అవి కామన్ టాపిక్స్.
ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నిసార్లు చెన్నారెడ్డితో తారసిల్లానో చెప్పలేను. ఒకసారి జర్నలిస్ట్ కాలనీకి వచ్చినప్పుడు, ఆయన ఉపన్యాసం చెబుతూ, కొత్త జర్నలిస్ట్ కాలనీలు ఏర్పాటు చేద్దామని ఉందనీ, అయితే జర్నలిస్టుల పేర్లు పెట్టాలంటే సుప్రసిద్ధ తెలుగు వారి పేర్లు కనిపించటం లేదని అన్నారు. ఎం. చలపతిరావు కాలనీకి ప్రారంభోత్సవం చేస్తూ అన్నమాటలవి. కొండా లక్ష్మారెడ్డి నన్ను ధన్యవాదాల ప్రసంగం చేయమన్నాడు. అప్పుడు నేను మాట్లాడుతూ కొత్త జర్నలిస్టుల కాలనీలు ఇస్తామని అన్నందుకు చెన్నారెడ్డిగారికి ధన్యవాదాలని అంటూ ఎన్ని కాలనీలు పెడితే అంతమంది సుప్రసిద్ధ తెలుగు జర్నలిస్టుల పేర్లు చెబుతామని, ఉదాహరణగా - నార్ల వెంకటేశ్వరరావు, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, సి.వై.చింతామణి, ఖాసా సుబ్బారావు అలా పేర్లు వల్లించాను. జనం చప్పట్లు కొట్టారు. చెన్నారెడ్డికి మళ్ళీ కోపం వచ్చింది. కానీ ఏమీ అనలేదు.
చెన్నారెడ్డి మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు అతి సన్నిహితుడనని చెప్పుకుంటున్న నాదెండ్ల భాస్కరరావుకు తొలుత ప్రాధాన్యత ఇవ్వలేదు. కొన్నాళ్ళకు అలిగి కూర్చున్నప్పుడు తరువాత ఆర్థిక ప్రణాళిక శాఖ ఇచ్చాడు. మళ్ళీ కొన్నాళ్ళకు ఆయనను బాగా తగ్గించారు. భాస్కరరావు ఎన్ని ఫిర్యాదులు చేసినా చెన్నారెడ్డి ఏమీ చేయలేకపోయాడు.
అనేక ప్రెస్ మీటింగులలో ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసేవాణ్ణి. కొన్నిసార్లు ఆయన సమాధానం చెప్పటానికి కుదరక నీవే దానికి జవాబు చెప్పు అనేవాడు. మరోసారి ఢిల్లీ నుండి తిరిగి బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు చెన్నారెడ్డిని తొలగించి వేరే వారిని పెట్టబోతున్నారని వార్త ప్రబలింది. విపరీతంగా వారు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ పత్రికల వారిని కలిసినప్పుడు వారంతా ఆయనకు పదవి పోయినట్లు సానుభూతిగా ప్రశ్నలు వేస్తూండగా నేను, కంగ్రాట్యులేషన్స్ చెన్నారెడ్డిగారు, మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారుగా అన్నాను. ఆయన నవ్వుతూ ఏమో నీకే తెలియాలి అని దాటేసి వెళ్ళిపోయారు. ప్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ వున్న ఉమా వెంకట్రామరెడ్డి సంతోషంగా, ఆశ్చర్యంగా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీరు చెప్పేది నిజమేనా అని ఆత్రుతగా అడిగారు. ఆ తరువాత కొన్నాళ్ళకు చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను పెట్టారు.
చెన్నారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దానికి ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు గాంధీ భవన్ లో కలిసేవాడిని. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరికొన్నిసార్లు కలుసుకొన్నాను.
చెన్నారెడ్డి రాగద్వేషాలు విపరీతంగా ఉన్న వ్యక్తి. ఆగ్రహావేశాలను దాచుకోకుండా వ్యక్తం చేసేవాడు. ఆయన్ను ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసినప్పుడు జస్టిస్ పింగళి జగన్మోహన రెడ్డిని గురించి, కొందరు కాంగ్రెస్  నాయకుల గురించి చాలా ఘాటుగానే స్పందించేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి రోజులలో డాక్టర్ గా ప్రాక్టీసు పెట్టడం, పత్రిక నడపటం మొదలైన ఎన్నో విశేషాలు వివరంగా చెప్పేవాడు. ప్రత్యేక తెలంగాణాలో ఆయన పాత్ర వేరు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గవర్నర్ గా ఆయన ధోరణి వేరు. రాజకీయాలలో అవినీతి అనే అంశం చెన్నారెడ్డి కాలంలో ఒక ప్రత్యేకమైన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తులాభారాలు జరిపించిన తీరు జనాకర్షణ అయింది. చెన్నారెడ్డి నిర్భీతిగా వ్యవహరించేవారు. సభలలో తనకు ఇష్టమైన వారిని స్టేజి మీదకు పిలిచి కూచోబెట్టేవారు. అలాంటి అదృష్టం శ్రీమతి దుర్గాభక్త వత్సలం వంటివారికి దక్కింది. చెన్నారెడ్డి పదవిలో వుంటే క్షేమం అని వి.బి.రాజు అనేవాడు. శత్రువులను సైతం లోబరచుకొన్న రాజకీయ చతురత ఆయనకున్నది. తనపై పోటీ చేసి ఓడించిన వందేమాతరం రామచంద్రరావును పిలిచి అధికార భాషా సంఘాధ్యక్షుణ్ని చేసిన చెన్నారెడ్డి, అరమరికలు లేకుండా తన మామ పేరిట కె.వి.రంగారెడ్డి జిల్లా అని రూపొందించారు. మార్క్సిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజి బోర్డు ఛైర్మన్ గా ఒప్పించడం చెన్నారెడ్డికే తగింది. ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆలిండియా మెడికల్ ఇన్ స్టిట్యూట్ లో చేరి పరీక్షలు చేయించుకున్నారు. ఆ పక్క గదిలోనే మేనకా గాంధీ కూతురుని ప్రసవించింది. అందరికంటే ముందు వెళ్ళి అభినందనలు చెప్పబోగా అక్కడే ఉన్న సంజయ్ గాంధీ ‘రాజీనామాకు సిద్ధంగా ఉండండి’ అనేసరికి బిత్తరపోయాడు. హైదరాబాదు వచ్చేసరికి అలాంటి సన్నివేశమే జరిగింది.
Narisetti Innaiah

1 comment:

Unknown said...

1969లో జరిగిన తెలంగాణా ఉద్యమాన్నిమర్రి చెన్నారెడ్డి గారు తమ పదవీవ్యామోహంతో వెన్నుపోటు పొడవకపోతే అప్పుడే తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ఇంత రచ్చ జరిగేది కాదు! సీమాంధ్రులు ఇప్పటిలా బాధపడేవారు కాదు! రెండు రాష్ట్రాలూ చెయ్యి చెయ్యి పెనవేసుకొని పరస్పరం ఎంచక్కా అభివృద్ధి చెంది ఉండేవి!

Post a Comment