దేశ ఆర్థిక భవిష్యత్తును మార్చిన పి.వి.నరసింహారావు-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 6




1921-2004
‘ఈ పాముల తేళ్ళ బాధ పడలేకుండా ఉన్నాము’ అని జి.సి.కొండయ్య (ప్రముఖ జనతా నాయకుడు) ఆ రోజులలో వ్యాఖ్యానించేవారు. మొదట్లో ఆ మాటలకు అర్థం తెలిసేది కాదు. తరువాత పాములపర్తి వెంకట నరసింహారావు, తేళ్ళ లక్ష్మీ కాంతమ్మ సన్నిహిత సహచర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడని గ్రహించి నవ్వుకున్నాము.
పి.వి. నరసింహారావు విద్యామంత్రిగా, బ్రహ్మానందరెడ్డి కేబినెట్ లో నాకు పరిచయం అయ్యారు. ‘తెలుగు విద్యార్థి’ మాసపత్రిక (ఎడిటర్ కొల్లూరి కోటేశ్వరరావు, మచిలీపట్నం) ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలూ ఆయన చాలా చక్కగా చెప్పేవాడు. అలా మొదలైన మా పరిచయం క్రమేణా సాన్నిహిత్యానికి దారితీసింది. 1968లో నాటి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడు (లోగడ తెలుగు స్వతంత్ర సంపాదకుడు) గోరాశాస్త్రికి కర్నూలులో 50వ జన్మదినం జరిపినప్పుడు ముఖ్యఅతిథిగా పి.వి.నరసింహారావును తీసుకెళ్లాము. అప్పుడు కోట్ల విజయభాస్కరరెడ్డి జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉండేవారు. వ్యవసాయ బ్యాంక్ శాఖాధికారి మండవ శ్రీరామమూర్తి, తెలుగుభాషా సంఘాధికారి సి.ధర్మారావు, నేనూ పూనుకొని సన్మానం చేసి గోరాశాస్త్రికి కొంత ఆర్థిక సహాయం చేయగలిగాము. ఒక సంచిక కూడా వెలువరించాము. ఆ సభలో పి.వి.నరసింహారావు గొప్ప ఉపన్యాసం చేశారు. ఆయనతో చాలా సేపు కాలక్షేపం చేసి అనేక విషయాలు అడిగాను.
హైదరాబాదులో ఆయన మంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు వివిధ సందర్భాలలో గోరాశాస్త్రి, తేళ్ళ లక్ష్మీకాంతమ్మలతో కలిసి పి.వి.దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ అయింది. తేళ్ళ లక్ష్మీకాంతమ్మ మా కుటుంబానికి సన్నిహిత స్నేహితురాలు. ఆమె చిరకాలంగా రాజకీయాలలో ఉంటూ పి.వి.కి దగ్గరైంది. చాలా చనువుగా కొన్ని పర్యాయాలు చులకనగా పి.వి.నుద్దేశించి మాట్లాడేది. అది చాటున కాదు. ఎదుటే. నేను ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి. ఉత్తరోత్తరా పి.వి. ఇంగ్లీషులో ‘ది ఇన్ సైడర్’ అనే నవల రాసి లక్ష్మీకాంతమ్మను ఒక పాత్రగా చేసి అన్యాపదేశంగా ఎత్తి పొడిచారు. అది గ్రహించిన లక్ష్మీకాంతమ్మ బాహాటంగానే ఆయనను ఖండించింది.
నన్ను రాడికల్ హ్యూమనిస్టుగానే పి.వి. పరిగణిస్తూ పోయారు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా నేను స్నేహపూర్వకంగానే కలుస్తూ ఉండేవాడిని. చనువుగా ప్రశ్నలడిగేవాడిని. కానీ ఆయన దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఉదాహరణకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించబోయేముందు కొన్నాళ్ళు పి.వి.ని దూరంగా పెట్టింది. అప్పడు హైదరాబాదు ఆదర్శనగర్ లో పి.వి. వుండేవారు. ఆమెపై వ్యంగ్య విమర్శనాత్మక రచన ఒకటి తలపెట్టారు. నేను కలసినప్పుడు ఒకటి రెండు పేరాలు వినిపించారు. అయితే అది ఇందిరాగాంధీని ఉద్దేశించిందా అని అడిగితే చెప్పలేదు. ఈలోగా ఇందిరాగాంధీ పిలుపు రావడం, ఢిల్లీ రాజకీయరంగంలో పి.వి.ప్రవేశించడం, కీలకపాత్ర వహించడంతో ఆమెపై ఆగ్రహాన్ని దాచేశారు.
విశ్వనాథ సత్యనారాయణ సుప్రసిద్ధ నవల వేయిపడగలు హిందీలో ‘సహస్రఫణి’ శీర్షికన పి.వి.నరసింహారావు అనువదించారు. నేను ఒకటి రెండుసార్లు ఈ విషయమై నిరసనను ఆయనకు సూచన ప్రాయంగా తెలియజేశాను. ఆయనేమీ అభ్యంతర పెట్టలేదు. అయితే హైదరాబాదు ఆకాశవాణిలో హిందీ విభాగంలో నా మిత్రుడు దండమూడి మహీధర్ ఉన్నందున నేను వెళ్ళి రామమూర్తిగారిని కూడా పలకరిస్తూ ఉండేవాడిని. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే సహస్రఫణి ఆయన రాస్తున్నాడని, కొన్నాళ్ళ తరువాత అది పి.వి.నరసింహా రావు పేరుతో ప్రచురితమైంది. ఇరువురిలో ఎవరు ఏమేరకు అనువదించారో వివరాలు తెలియవు. రామమూర్తి గారిని ఒకసారి విషయం ప్రస్తావించి మీరు అనువదిస్తున్న సహస్రఫణి పి.వి.గారి పేరుతో వచ్చిందేమిటి? అంటే  ఆయన మౌనమే సమాధానంగా ఇచ్చారు.
శాసనసభలో, లోక్ సభలో పి.వి. చాలా బాగా రాణించిన రాజకీయవాది. ఆయన బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో సమైక్యవాదిగా నిలబడ్డారు. తరువాత ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పుడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవిచూశారు.
ఆయన కేంద్రానికి వెళ్ళిన తరువాత నేను కలుసుకోవటం తగ్గింది. హైదరాబాదు వచ్చినప్పుడు రాజ్ భవన్ లో కొన్నిసార్లు కలిసి మాట్లాడుకున్నాం.
పి.వి. ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ కు వచ్చి అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. (దానిని హౌస్ అంటారు) నేను ప్రెస్ లాబీలో ఉండి ఆయన ప్రసంగం విన్నాను. బాగా మాట్లాడారనిపించింది. ఆ రోజులలో నేను ‘వార్త’ దినపత్రిక విదేశీ ప్రతినిధిగా వాషింగ్టన్ లో ఉన్నాను. అటువంటి అక్రెడిషన్ రావడానికి మిత్రులు, వార్త ఎడిటర్ కె.రామచంద్ర మూర్తిగారు తోడ్పడ్డారు. అక్కడ నుండి తరచు వార్త వ్యాసాలు, ఇతర విశేషాలు పంపగా ప్రచురించేవారు. ఆశ్చర్యమేమంటే దేశ ప్రధానిగా పి.వి.మాట్లాడితే మర్నాడు అమెరికా దినపత్రికలలో ఒక మాట రాలేదు. నేను ఆశ్చర్యపోయాను. అంత క్రితం చిన్న దేశాలైన కొరియా వంటి దేశాల ప్రధానులు మాట్లాడితే ప్రముఖంగా ప్రచురించడం చూశాను. ప్రెస్ క్లబ్ లో కొందరిని కదిలించి చూస్తే పి.వి.బాగా మాట్లాడటం ప్రధానం కాదు. అందులో కొత్త అంశం కానీ, అగ్రరాజ్యాన్ని ఆకర్షించే ప్రతిపాదనలు లేనందువల్ల అశ్రద్ధకు గురైందని చెప్పారు. అదే సందర్భంగా ఆయన ఒక మ్యూజియం సందర్శిస్తే అది ముఖ్యమైన వార్తగా వేశారు. అప్పుడు పి.వి.ని కలిశాను. ఆయన వెంట కొందరు జర్నలిస్టులు వచ్చారు. అలా వచ్చిన వారిలో కల్యాణీ శంకర్ ఉన్నది. ఆమె హైదరాబాదులో జర్నలిస్టుగా యు.ఎన్.ఐ.లో సీతారాం దగ్గర పనిచేసింది. తరచు ప్రెస్ కాన్ఫరెన్సుల తరువాత నా దగ్గరకు వచ్చి వివరాలు వివరణలు అడిగి రాసుకునేది.  ఆ తరువాత ఆమె ఢిల్లీలో జర్నలిస్టుగా ఉంటూ చాలా ప్రముఖ స్థానాలు ఆక్రమించింది. పి.వి.కి బాగా దగ్గరైంది. ఒక సందర్భంలో ఆమెను పక్కన కూర్చుండబెట్టుకుని తిరుపతిలో కల్యాణ మహోత్సవంలో కూడా పాల్గొన్నారు.
పి.వి.ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. ఆ ఖ్యాతి పి.వి.కి దక్కాలి. మరొకవైపు బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది.
పి.వి. వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని వాడటం విశేషం. ఆయన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
పి.వి. పెయ్య నాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. కొన్నిటిలో ఇది నిజమే. అలా ఉన్నప్పుడు సమస్యలు వాటంతటవే సద్దుకు పోతుండేవి. పి.వి.లో మరొక కోణం ఏమంటే కళలు, సాహిత్యం, రసజ్ఞత పట్ల అభిరుచి ఉండటం.
పి.వి.కి చాలామంది సన్నిహితులుగా ఉండేవారు. కొంతమందికి పరోక్షంగా మరికొంతమందికి ప్రత్యక్షంగా సహాయపడ్డారు. తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుకు పద్మభూషణ్ ఇప్పించినప్పుడు ఇబ్బందికర సన్నివేశం ఏర్పడింది. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పి.వి. పట్టుబట్టి ఒప్పించారు.
పి.వి.ని గ్రామంలో దొర అనేవారు. ఆయన దేశ్ ముఖ్. ఎన్నో రకాల ఆస్తి సాగులేకుండా వృధాగా పడుండేది. దేశంలో పరోక్షంగా బి.జె.పి. మతతత్వాన్ని వెనకేసుకొచ్చినట్లు బాబ్రీ మసీదు సంఘటనతో విమర్శకులు ఆరోపణలు చేయక పోలేదు. తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటు ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై పోటీ పెట్టకపోవడం గమనార్హం. by Innaiah Narisetti


1 comment:

Unknown said...

పివిగారికి ప్రధానిగా రావలసినంత పేరు రాలేదు!వారి మరణానంతరం దేశ రాజధానిలో వారికి తగు స్మారక చిహ్నం ఏర్పడలేదు!వారు ప్రధానిగా ఉండికూడా హైదరాబాద్ కు మెట్రో రైల్ ఏర్పడలేదు!చాలా విషయాలలో నిర్లిప్తంగా,ఏమీ పట్టనట్లు ముభావంగా వ్యవహరించేవారనిపిస్తుంది!మేధావి,ఆలోచనాపరుడు.పుస్తకప్రియుడు!అవసరమైనప్పుడు కూడా దూకుడు ప్రదర్శించడు!మౌనముని!సుతిమెత్తగా ప్రవర్తించే మెత్తని కత్తి!మూగపులి!

Post a Comment