రాజకీయ జీవిగా కాసుబ్రహ్మానంద రెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 5





ఆద్యంతాలూ రాజకీయవాదిగా జీవితం గడిపిన కాసుబ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోను, కేంద్రంలోనూ తనదైన ముద్ర వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుదామని విఫయ ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ లో సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలిసారి అమాత్యులుగా జీవితాన్ని ఆరంభించారు. అప్పటి నుండి చివరివరకూ రాష్ట్ర, కేంద్ర పదవులు ఎన్నో చేపట్టి కొనసాగారు.
1950 ప్రాంతాలలో ఆయన ప్లీడరుగా గుంటూరులో ఉన్న రోజులలో కలుసుకున్నాను. నేను ఎ.సి. కాలేజీలో విద్యార్థిగా ఉన్నపుడు నా సోదరుడు విజయరాజకుమార్ పెళ్ళి ఆహ్వానం కార్డు ఇవ్వడానికి వెళ్లాను. గుంటూరులో అమరావతి రోడ్డులో ఉంటున్న బ్రహ్మానందరెడ్డి, కాఫీ ఇచ్చి సాదరంగా కార్డు స్వీకరించినా పెళ్ళికి మాత్రం రాలేదు. అంతకుముందు ఎ.సి.కాలేజీకి ఎదురుగా ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్బులో రోజూ బ్రహ్మానందరెడ్డి వచ్చి పేకాడటం చూసేవాడిని. అదే ప్రాంగణంలో మా అన్న ఒక పుస్తకాల షాపు పెట్టారు. నేను తీరిక వేళల్లో కూర్చుని అమ్ముతుండేవాడిని. ప్రక్కనే బ్రహ్మానందరెడ్డి, సలాం, ఇంకా కొందరు గుంటూరు ప్రముఖలు పేకాడుతుంటే మధ్య మధ్యలో నేను కాసేపు నిలబడి వారి మాటలు వింటూండేవాడిని. ఒకసారి గమ్మత్తయిన సంభాషణ చెవిన పడింది. మదరాసు శాసనసభ కౌన్సిల్ సభ్యుడుగానూ, గుంటూరు మున్సిపల్ కౌన్సిలం సభ్యుడుగానూ ఉన్న ప్లీడరు సలాం మంచి హాస్యప్రియుడు. సంభాషణా చతురుడు. ఆయనను ఉద్దేశించి, ‘ఏం సలాం.. మరీ పాతిక్కీ - పరక్కీ కూడా కక్కుర్తి పడుతున్నావటగా’ అని బ్రహ్మానంద రెడ్డి ఒక విసురు విసిరాడు. వెంటనే సలాం - ‘ఏం చేస్తాం, వందా, రెండు వందలూ అయితే నీతో పనేంటయ్యా, బ్రహ్మానందరెడ్డి ఉన్నాడుగా అంటున్నారు మరి’ అనేసరికి అందరూ గొల్లున నవ్వారు. అలా సాగుతుండేవి వారి సరసాలు.
బ్రహ్మానందరెడ్డి క్రమంగా జిల్లా నుండి రాష్ట్రానికి ఎదిగారు. మొదటి నుండి ముఠా రాజకీయాల్లో మునిగితేలారు. తొలుత సంజీవరెడ్డి కుడి భుజంగా రాజకీయాలలో చక్రం తిప్పి కీలక స్థానంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయనకు ఎదురు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో అత్యంత ప్రముఖ నాయకుడుగా కాంగ్రెసు పార్టీని చీలదీసి రెడ్డి కాంగ్రెసు అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆర్థిక వ్యవహారాల నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు.
బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను వివిధ సందర్భాలలో కలిశాను. ‘తెలుగు విద్యార్థి’ (కొల్లూరి కోటేశ్వరరావు - సంపాదకుడు) మాసపత్రికకు ఇంటర్వూ చేసి ప్రచురించాము. పాత హైదరాబాదులో మత కల్లోలాలు జరిగినప్పుడు (1968) వివిధ సంఘాలను పిలిచి జూబిలీ హాలులో సంప్రదింపులు జరిపారు. అప్పుడు మానవవాద సంఘం తరఫున నన్ను పిలవగా నేను తోచిన సూచనలు ఇచ్చాను.
1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని బాగా దెబ్బ కొట్టింది. ఆయన, ఆయన మంత్రులూ ఒక దశలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భాలలో తేళ్ళ లక్ష్మీకాంతమ్మ (లోక్ సభ సభ్యురాలు). నేను కలసి బ్రహ్మానంద రెడ్డి దగ్గరకు వెళ్ళి మాకు తోచిన విషయం చెపుతుండేవాళ్లం. ఆయన బంగళా నిర్మానుష్యంగా ఉండేది. కొంతకాలం ఆయన కుంగి పోయినట్లు కనిపించేవాడు. అలాంటప్పుడు కలుస్తుంటే ఎంతో సహాయపడినట్లుగా భావించేవాడు. అదే సందర్భంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమకారులు కొందరు హైదరాబాదులో గోడలపై బ్రహ్మానందరెడ్డి భార్య రాఘవమ్మను ఉద్దేశించి చాలా అసహ్యకరమైన, అశ్లీల, శృంగార నినాదాలు రాశారు. మేము నిరసన తెలిపాము. తెలంగాణాలో ప్రముఖ స్త్రీ నాయకురాళ్ళు జె.ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి, సరోజినీ పుల్లారెడ్డి మొదలైనవారు అటువంటి నినాదాలను ఖండించి వారే స్వయంగా చెరిపివేయడానికి పూనుకున్నారు. అటువంటి క్లిష్ట దశలో మేము కలుస్తుండడం బ్రహ్మానందరెడ్డికి ఊరటనిచ్చింది.
రాజకీయవాదిగా బ్రహ్మానందరెడ్డి చాలా ముఠా కక్షలతో సంకుచిత ధోరణిలో ప్రవర్తించాడు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికపై, దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుపై ప్రభుత్వపరంగా దాడి చేసి అదుపు పెట్టాలని చూశాడు. వారికి ప్రకటనలు ఆపివేయాలనుకున్నాడు. ప్రెస్ బిల్లు పెట్టే చర్యకు ఉపక్రమించగా మేము హేతువాద సంఘం పక్షాన తీవ్ర ప్రతిఘటన చేశాము. మామిడిపూడి వెంకటరంగయ్యని పిలిచి సభ జరిపి ప్రెస్ బిల్లును సుల్తాన్ బజారు వై.యం.ఐ.యస్. హాలులో ఎండగట్టాము. దీనిపై అఖిల భారత స్థాయిలో పత్రికలు ప్రతిధ్వనించాయి. బ్రహ్మానందరెడ్డి ఆ బిల్లును సెక్ట్ కమిటీకి పంపి తప్పుకున్నారు.
బ్రహ్మానంద రెడ్డి జీవిత చరిత్రను కపిల కాశీపతి ‘బ్రహ్మానందయాత్ర’ పేరిట పెద్ద గ్రంథంగా వెలువరించారు. అందులో చాలా వివరాలు, నిశిత పరిశీలనలు చేశారు. అయినప్పటికీ దానిని బ్రహ్మానందరెడ్డి స్నేహపూర్వకంగానే స్వీకరించటం విశేషం. నేతి చలపతి అధ్యక్షతన బ్రహ్మానందరెడ్డిపై ఒక విచారణ సంఘాన్ని కాంగ్రెసు కమిటీ నియమించింది. ఆయన జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉండగా అరాచక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉండగా అవి చాలావరకూ వాస్తవాలని నేతి చలపతి  కమిటీ నిర్ధారించిందట. ఆ విషయం నిజమేనా అని నేను బ్రహ్మానందరెడ్డిని అడిగితే టోపీ వెనక నుంచి ముందుకు తిప్పి నవ్వి సమాధానం దాటేశారు. అసెంబ్లీలోనూ బయటా బ్రహ్మానందరెడ్డి నుండి సమాధానం రాబట్టటం చాలా కష్టమయ్యేది. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో సహచరులకు, పార్టీ వారికీ అంతుపట్టేది కాదు. ఏదైనా అడిగితే గాంధీ టోపీని వెనక నుంచి ముందుకు తిప్పుకుని పెట్టుకునేవారు.
రాజకీయాలలో తనకు బద్ధ విరోధిగా ప్రారంభమైన జలగం వెంగళరావును మంత్రివర్గంలోకి ఆహ్వానించి, హోం మంత్రి శాఖ కేటాయించి బ్రహ్మానందరెడ్డి తన రాజకీయ చతురతను చూపారు. ఆవిధంగా ప్రత్యర్థులను ఆకర్షించటం, మరో పక్క దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ జీవితంలో మామూలే. సంజీవరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటూ, తరువాత తీవ్రవ్యతిరేకిగా మారిపోయాడు. సంజీవరెడ్డి కేంద్రమంత్రిగా ఉక్కు కర్మాగారాలశాఖ నిర్వహిస్తున్నప్పుడు ఆంధ్రులకు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పరచటం అవసరమని ఆందోళన జరిగింది. అందుకు గాను తమనంపల్లి అమృతరావు అనే కాంగ్రెస్ వాదిని నిరాహారదీక్షకు పురిగొలిపి ఆందోళన పెంచటానికి బ్రహ్మానందరెడ్డి హస్తం ఉందనేవారు. ఆ సందర్భంగా జరిగిన అలజడులలో విజయవాడలోని సంజీవరెడ్డి విగ్రహాన్ని పగులగొట్టారు. దీనికి బ్రహ్మానందరెడ్డి పరోక్ష కారణం అంటారు. ఆయన మంత్రివర్గంలో ఉంటూ వచ్చిన చెన్నారెడ్డి కేంద్రానికి వెళ్ళి కోర్టు తీర్పు ద్వారా పదవి పోగొట్టుకుని తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించి బ్రహ్మానందరెడ్డి వ్యతిరేకిగా ఆందోళన చేశారు. అయితే ఒక పట్టాన బ్రహ్మానందరెడ్డి లొంగలేదు. శాసనసభలో ఆయన మెజారిటీకి తిరుగు లేకుండా ఉండేది. అయినప్పటికీ ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా ఆయనను తొలగించి పి.వి.నరసింహారావును ముఖ్యమంత్రిగా తీసుకువచ్చింది.
రాష్ట్ర గవర్నరుగా, కేంద్రమంత్రిగా ఆయన చిరకాలం వివిధ పదవులు అనుభవించిన రాజకీయవాది. సంతానం లేదు. రాజకీయాలలో తన పాత్రను ఏమేరకు నిలబెట్టుకున్నాడనేది చరిత్ర చెపుతుంది. ఆయనకు పదవి లేనప్పుడు కూడా నేను తరచు కలిసి మాట్లాడుతుండేవాడిని.

by Innaiah Narisetti

1 comment:

Unknown said...

ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డిగారు పాలన తక్కువ,రాజకీయ గ్రూపులు కట్టడం ఎక్కువ చేశారు!తమ గురువు నీలం సంజీవ రెడ్డి గారికే పంగనామాలు పెట్టారు!ఏది వ్రాసినా ఇన్నయ్య గారు చాలా నిష్కర్షగా వ్రాస్తారు!

Post a Comment