విజ్ఞాన సిద్ధాంతం - ఇతర సిద్ధాంతాలతో సఖ్యత --



10-Scientific Methood
ఇతర సిద్ధాంతాలతోొందికగా ఉండటమనేది విజ్ఞాన సిద్ధాంతం సంతృప్తిపరచవలసిన లక్షణాలలో ఒకటి. భూమి, చంద్రుడు కూడా సూర్యునితో బాటే ఒకే కక్షలో ఉన్నప్పుడు గ్రహణం వస్తుందని గ్రహచలన సిద్ధాంతం పేర్కొంటున్నది. కనక రాహువు, కేతువుల దుష్టపథకం వల్ల గ్రహణం ఏర్పడుతుందని అంగీకరించ వీల్లేదు. విజ్ఞానం, వైద్యం చెబుతున్న రీతిగా కలరా, స్పోటకం అనే వ్యాధులకు కారణాలు, చికిత్స అంగీకరిస్తే, క్షుద్రదేవతల ఆగ్రహం వల్ల ఆ వ్యాధులు వస్తాయని ఒప్పుకోరాదు ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. తాత్కాలిక ప్రతిపాదనలు విజ్ఞాన సిద్ధాంతంలో ఉండవు. కొత్తగా కనుక్కొన్న వాటిని వివరించడానికి గాను ఒకదాని తరవాత మరొక ప్రతిపాదన చేస్తూ పోరాదు. ఇలా చేస్తే మౌలిక ప్రాతిపదనపై నమ్మకం సడలుతుంది.

ఒక పర్యాయం ప్రతిపాదన సంతృప్తికరంగా ఉందంటే, అందులో ఇంకే మార్పులూ చేయరాదని అర్థం కాదు. పాతవాటిని బలిపెట్టకుండా, కొత్త వాస్తవాలను వివరిస్తూ, సమర్థనీయమైన మార్పులు ఉంటే ఆహ్వానించవచ్చు. సాక్ష్యాధారాలు లభిస్తుంటే, సాధారణీకం గావిస్తుంటాం. అది వాంఛనీయం. కాని ప్రతిపాదనకు ఉప ప్రతిపాదనలు చేస్తుంటే, మౌలిక సిద్ధాంతంలో దోషం ఉన్నట్లే. కొత్త వాస్తవాలను సహజమైన సాధారణీకరణ ద్వారా గనక సిద్ధాంతం వివరించలేకపోతే, తొలి పదాలు, ప్రతిపాదనలు సమూలంగా మార్చాలన్నమాటే.
పదార్థ విజ్ఞానంలో ఇదే జరిగింది. సంప్రదాయ పదార్థ విజ్ఞానం అనేక ప్రతిపాదనలపై ఆధారపడింది. అందులో కొన్ని పేర్కొందాం.

1. పరిశీలకుని వేగంతో నిమిత్తం లేకుండా కాలం, దూరం ఉంటాయి. ఇవి మారవు.
2.    యూక్లిడ్ చెప్పిన తీరులో ప్రదేశం ఉన్నది. దూరాన్ని కొలవాలంటే కాలంతో నిమిత్తం లేదు.
3.  ప్రదేశం యావత్తు ఈథర్ ఆవరించి ఉంది. పదార్థ రేణువుల మధ్య విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారమయ్యేచోట సైతం ఈధర్ ఉంది.
4.    శక్తిని అనంతంగా విభజిస్తూ పోవచ్చు.
5. ద్రవ్యరాశి ఎప్పుడూ పదార్థాన్ని అంటి పెట్టుకొని మారకుండా ఉంటుంది. శక్తితో దీనికి సంబంధం లేదు. ఎంత వేగంగా ఏ వైపుకు వెడుతున్నప్పటికీ ద్రవ్యరాశి అలానే ఉంటుంది.
6.  పదార్థ విశ్వంలో కార్యకారణ నియమం కచ్చితంగా ఉంది. సూత్రప్రాయంగా ప్రతి సంఘటననూ అవసరమైనదిగా, తిరుగలేనిదిగా దానికారణాలను బట్టి వివరించవచ్చు.
మైకల్ సన్-మోర్లే పరిశోధనల ఫలితంగా వచ్చిన పరోక్ష ఫలితాలు, ఇంకా అనేకానేక పరిశోధనలు 19వ శతాబ్దం చివరి వరకూ జరిగినవాటిని గమనిస్తే పైన పేర్కొన్న వాటి ఆధారంగా ఉన్న పదార్థ విజ్ఞానం సమూలంగా మార్చాలని తేలింది. ప్రతిపాదనల జోలికి పోకుండా సిద్ధాంతాన్ని మార్చాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోగా, పరస్పర విరుద్ధ విషయాలకు దారితీసింది. ఐన్ స్టీన్, ప్లాంక్ లు తుదకు ఈ సన్నివేశంలో వచ్చిన సమస్యను పరిష్కరించారు. వారి సాపేక్షతా, క్వాంటం (తేజఃకణ) సిద్ధాంతాలు సంప్రదాయ పదార్థ విజ్ఞాన ప్రాతిపదికలకు పూర్తిగా భిన్నమైంది.

అసలు పరీక్ష

విజ్ఞాన సిద్ధాంతానికి మరొక ప్రమాణం ఉంది. తెలిసిన వాస్తవాలన్నిటినీ వివరించడం, లోగడ ఆమోదించిన సిద్ధాంతాలతో సరిపోవడమే చాలదు. విజ్ఞానంగా భావించడానికి అసలైన పరీక్షకు నిలబడగలగాలి. అసలు పరీక్ష అంటే, దానితో సిద్ధాంతగతి నిర్ధారణ అవుతుందన్నమాట. ప్రతిపాదన అలా ఉంచి, పరిశోధన జరిగినప్పుడు వచ్చే ఫలితాలు ప్రతిపాదనలో సరిపడకపో వచ్చు. అటువంటప్పుడు ప్రతిపాదన సరికాదని రుజువు అవుతుంది. అంటే ప్రతిపాదన నిలవాలంటే ఇటువంటి కీలక పరీక్షకు గురికావలన్నమాట.

కాంతి ప్రసారాన్ని గురించి న్యూటన్, హ్యూజిన్ లు ప్రతిపాదించిన వివాదాలను పరిశీలిద్దాం. కాంతి కిరణాలను ఫోటాన్లు అంటారని, అవి సూటిగా పయనిస్తాయనీ పెర్కొన్నాడు న్యూటన్. అయితే కాంతి అండాకార తరంగాలుగా ఈథర్ లో ప్రసారమవుతుందని హ్యూజిన్స్ అన్నాడు. తరంగంలో ప్రతి బిందు కేంద్రం కూడా కాంతి ద్వితీయ మూలంగా ఉంటుంది. ఈ రెండు ప్రతిపాదనలు ప్రతిబింబం, వక్రీభవనం ఆశక్తి తెలిసిన విషయాలను వివర్తిస్తున్నాయి. దృష్టికి సంబంధించిన శాస్త్రంలోని ఈ అంశాలకు సంతృప్తికర సమాధానం లభిస్తుంది. ఆమోదించిన సిద్ధాంతాలకు విభిన్నంగా లేవు. విజ్ఞాన దృష్య్టా ఏదో ఒక సిద్ధాంతాన్నే సమర్ధించాల నేదేమి లేదు. పదార్థ విజ్ఞాన శాస్ర్తజ్ఞులు తమ తమ మనో ప్రవృత్తిని బట్టి ఏదో ఒక సిద్ధాంతాన్ని సమర్ధించారు. రెండు సిద్ధాంతాల మధ్య స్పర్థకూడా ఒక కీలక పరీక్షకు గురయ్యే వరకూ అసలు విషయం తేలలేదు. చివరకు పెట్టిన పరీక్ష చాలా సాధారణమైనది. సాంకేతిక పదజాలంతో నిమిత్తం లేకుండా ఈ పరీక్షను వివరించవచ్చు.

ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో రాయి వేశామనుకోండి. రాయిబడిన చోట నుంచి తరంగాలు గుండ్రంగా అన్ని దిక్కులలో వ్యాపించడాన్ని గమనిస్తాం. దీనిని కేంద్రంగా స్వీకరించి గమనిస్తే ఈ తరంగాలతో నీరు పైకీ కిందకూ అన్ని దిక్కులలో కదలడాన్ని పరిశీలిస్తాం. మొదట వేసిన చోటే మరొక రాయి వేశామనుకోండి. మరొక తరంగ ప్రవాహం మొదలై వ్యాపిస్తుంది. అప్పుడు మొదటి తరంగం రెండో తరంగం ఉబ్బెత్తుగా లేచి తారసిల్లిన చోట నీటికణాలు పరిశీలించవచ్చు. అని తొలుత ఉన్న దూరంకంటె రెట్టింపుగా అటూ ఇటూ ఊగుతాయి. అలాగే రెండ కెరటాల మధ్య ఉన్న పల్లపు ప్రాంతపు పరిస్థితి కూడా ఉంటుంది. కాని ఒక కెరటం లేచినచోట మరొ కెరటపు పల్లపు ప్రాంతం ఉంటే గందరగోళం ఏమీ ఉండదు. నీటి కణాలు ప్రశాంతంగా ఉంటాయి.

కాంతి గనుక తరంగ స్వరూపంతో ఉండేటట్లయితే కొన్ని అనుకూల పరిస్థితులలో రెండు తరంగాలు కలిసినప్పుడు జోక్యం గమనించవచ్చు. ఇలాంటి జోక్యమే ఉంటే రెండు తరంగాలవల్ల ఏర్పడిన గందరగోళం లేకుండా పోవాలి. ఈథర్ కణాల గందరగోళం ఉండరాదు. అంటే అలాంటిచోట్ల కాంతి ఉండరాదు. ఒకదానికి బదులు రెండు కాంతి తరంగాలు ఉన్నప్పటికీ ఇలా జరగాల్సి ఉంటుంది. న్యూటన్ కణ సిద్ధాంతం సరైనదైతే వెలుగు ఫొటాన్లరూపంలో కణ ప్రవాహంగా ప్రసరిస్తే, రెండు ఫొటాన్లు పరస్పరం తారసిల్లినచోట, కాంతి తీవ్రత ఉండాలి. అలా కలసిన చోట వెలుగు అసలే కనిపించకుండా పోరాదు. చీకటి దృశ్యాలు ఉంటే, న్యూటన్ ప్రతిపాదన తప్పని, హ్యూజిన్ ప్రతిపాదన సరైనదని తేలిపోతుందన్నమాట.

పరిశోధనల వల్ల తేలిందేమంటే వెలుగుచీకట్లు రెండూ హ్యూజన్ అంచనా వేసిన రీతిలో కనిపించాయి. న్యూటన్ ప్రతిపాదనను తృణీకరించారు.
సాపేక్షతా సిద్ధాంతం కూడా ఇలాంటి పరీక్షకు గురికావలసి వచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం ద్రవ్యరాశి, శక్తి- ఒకదాని నుంచి మరొకదానికి మార్చడానికి, వీలున్నది, కనక శక్తితో కూడిన కాంతి కిరణాలు గురత్వాకర్షణ క్షేత్రానికి ఆకర్షితం కావడం జరుగుతుంది
.
సూర్యుడికి సమీపంగా పయనించే నక్షత్ర కాంతి కిరణాలు, సూర్యుని బలమైన ద్రవ్యరాశి ఆకర్షణ మూలంగా, సూర్యునివైపుకు కొంత మేరకు వంగుతాయి. సూర్యుని తీవ్రవెలుగు ప్రసారం వల్ల మామూలుగా నక్షత్ర కిరణాలు ఇలా వంగడాన్ని గమనించలేం. కాని సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా సూర్యుడి కిరణాలు భూమి మీద సూటిగా పడవు. అప్పుడు ఏర్పడిన అంధకారం మూలంగా దూరాన ఉన్న నక్షత్రాల నుంచి వచ్చే కాంతి మార్గాన్ని గమనించవచ్చు. అంచనా వేసినట్లు ఈ కాంతి కిరణాలు గనక సూర్యుడి వద్ద వంగకపోతే, ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతం రుజువయ్యేదికాదు. 1919లో వచ్చిన గ్రహణం ఆధారంగా పరిశోధనలు జరిపి, తారల నుంచి వచ్చే కాంతి కిరణాలు సూర్యునివద్ద వంపుగా ఉండడాన్ని గమనించారు.

సారాంశం ఏమంటే, విజ్ఞాన సిద్ధాంతం కొన్ని కీలక పరీక్షలకు నిలబడాలి. అక్కడ విఫలమైతే ప్రతిపాదించిన సిద్ధాంతం సరైనదికాదన్న మాట. దీనికే అసలు పరీక్ష అంటారు. ఏ ప్రతిపాదనకైనా ఇది అన్వయించక తప్పదు. ఇటువంటి పరీక్షకు నిలబడని సిద్ధాంతం నిజం కాకపోవచ్చు. సత్యం అంటే ఏమిటో ఆయా వ్యక్తులు భావించే దానిని బట్టి నిజం ఉంటుంది. కాని విజ్ఞాన దృష్టిలో మాత్రం, అటువంటి ప్రతిపాదన నిజమూ కాదూ, అబద్ధమూ కాదు. అది విజ్ఞాన పరిధికి చెందదు, అది భౌతిక, రమణీయక సిద్ధాంతాలు ఎంత సునిశితమైనా, హేతుబద్ధంగా ఉన్నప్పటికీ, అవి మేధస్సు అవగాహనతో చేసిన భావనలైనప్పటికీ, వాటికి విజ్ఞాన స్థాయి మాత్రం చేకూరదు. మేధస్సుకు అవగాహన అయ్యే భావనలలో దేవుడు, ఆత్మ, ఎలక్ర్టాన్ ఉన్నాయి. ఇందులో ఎలక్ర్టాన్ ఒక్కటే విజ్ఞాన భావన. దీనికి చెందిన సిద్ధాంతం విజ్ఞాన పరమైనది. ఇది పరీక్షకు నిలబడుతుంది. దేవుడు, ఆత్మ భావనలు విజ్ఢానేతరాలు, వీటికి పరీక్షకు నిలబడే సత్తా లేదు. ఇతర సిద్ధాంతాలతో పొందికగా ఉండాలనే ప్రమాణం కూడా చేర్చి చూస్తే, ఈ భావనలు అశాస్త్రీయాలే.

రచన తెలుగుసేత
       ఎ.బి.షా                       నరిసెట్టి ఇన్నయ్య


No comments:

Post a Comment