విలక్షణ పాత్రికేయుడు గో.రా.శాస్త్రి



విలక్షణ పాత్రికేయుడు గో.రా.శాస్త్రి

ఆ డబ్బుకు పిండి రుబ్బమంటే రుబ్బేస్తానని సంపాదకుడుగా వ్యాఖ్యానించిన గోరాశాస్త్రి కఠోరంగా మాట్లాడినట్లనిపించవచ్చు. కాని ఆయన అద్యంతాలూ జర్నలిస్ట్ గానే గడిపారు.
గోరాశాస్త్రి గోరాకు మధ్య ఎలాంటి సంబంధం లేకున్నా కొందరు గందరగోళంతో యిరువురూ ఒకటే అనుకోపోలేదు. ఒకరికి రావలసిన ప్రశంసలు, తిట్లు మరొకరికి రావడమూ జరిగింది. విజయవాడలో నాస్తికోద్యమ నిర్మాతగా గోపరాజు రామచంద్రారావు తన పేరును గోరా అని క్లుప్తీకరించారు. గోరాశాస్త్రి అసలు పేరు గోవిందుని రామశాస్త్రి.
గోరాశాస్త్రి ఒరిస్సా సరిహద్దుల నుండి విశాఖపట్టణం వరకూ అనేక చిన్న బతుకుదెరువు ఉద్యోగాలు చేసి, చివరకు ఆనాటి రాజధాని మద్రాసు చేరారు.
ఖాసా సుబ్బారావు ఇంగ్లీషు స్వతంత్రను, గోరాశాస్త్రి తెలుగు స్వతంత్రను మద్రాసు నుండి నడిపారు. "మద్రాసు మెయిల్ మాకు ప్రియబాంధవి" అంటుండేవారు గోరాశాస్త్రి. అప్పట్లో కలకత్తా నుండి మద్రాసుకు నడిచే మెయిల్ ద్వారా ఉత్తరాలు, వ్యాసాలూ అందుకునే వారు. తెలుగు స్వతంత్ర చిన్న పెద్ద రచయితలకు ప్రోత్సాహకారిగా,భిన్నాభిప్రాయాల వేదికగా నిలిచింది. మద్రాసు సంస్కృతి, సంగీతం, మోర్ మార్కెట్ లో చౌకగా లభించే విదేశి సాహిత్య పత్రికలు, గోష్ఠులు,రచయితల ప్రవాసం అన్నీ గోరాశాస్త్రిని ఆకట్టుకున్నాయి. ఆయన సికింద్రాబాద్ లో స్థిరపడినా చివరి దాకా మద్రాసు అంటేనే అభిమానంగా వుండేవారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మిగిలిన పత్రికల వలె తెలుగు స్వతంత్రకూగడ్డుకాలం వచ్చింది. అప్పుడు హైదరాబాద్ మకాం మార్చి శ్రీదేవి (రచయిత్రి, డాక్టరు) సహకారంతో తెలుగు స్వతంత్ర నడిపారు. కాని అట్టేకాలం నడపలేక ఆపేశారు. 'కాలాతీత వ్యక్తులు' నవలరాసిన శ్రీదేవి చనిపోయారు.
గోరాశాస్త్రి ఆంధ్రభూమి ఎడిటర్ అయ్యారు. సికింద్రాబాద్ లోని జీరాలో అద్దె ఇంట్లో నివశిస్తూ, చివరివరకూ గడిపారు. కొందరు జర్నలిస్టుల వలె గోరాశాస్త్రి సంపాదనలో పడలేదు. ఆయనకు నిత్యమూ ఆర్థిక యిబ్బందులు వుండేవి. ముగ్గురు అమ్మాయిలు వుండగా పుత్రసంతానం లేదు. ఖర్చుబాగా వుండేది. అందువలన ఎప్పుడూ సంసార లంపటత్వ కష్టాలలో యీదుతుండేవాడు.
ఆంధ్రభూమి సంపాదకుడుగా గోరాశాస్త్రి వున్నప్పుడు నేను ఎన్.శూలపాణి అఏ పేరుతో వ్యాసాలు రాశాను. చాలా సంవత్సరాలు యిరువురం పరిచయం లేకుండానే సాగింది. తీరా పరిచయం అయినప్పుడు గోరాశాస్త్రిగారు ఆశ్చర్యపోయారు. ఒకటి పేరు గురించి,రెండు వయస్సు గురించి. గోరాశాస్త్రి గారితో పరిచయం సన్నిహిత స్నేహంగా మారిన తరువాత,తరచు వారి యింట్లో భోజనాలు చేస్తూ ఎక్కువసేపు చర్చలతో కాలక్షేపం చేశాం. అప్పుడే సెట్టి ఈశ్వరారవు (మద్రాసు సొవియట్ కౌన్సిల్ లో ఉద్యోగం) కె. నారాయణరావు (శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు), రమాదేవి(ప్రస్తుత కర్నాటక గవర్నర్), శశాంక(కవి),భాట్టం శ్రీరామమూర్తి, ఇచ్ఛాపురపు జగన్నాధరావు(రచయిత,ఆఫీసర్), డా||పి. తిరుమలరావు, ఉపద్రష్ట క్ర్ష్ణమూర్తి,గోపాలశాస్త్రి(గోపాల చక్రవర్తి) పరిచయమయ్యారు.
గోరాశాస్త్రిగారి అభిప్రాయాలు, రాగద్వేషాలు బాగా ఘాటైనవి. కనుక ఒక పట్టాన ఆయనకు దగ్గరగా అందరూ వచ్చేవారు కారు. చర్చలలో నిర్మొహమాటంగా ఎత్తిపొడుపులు, ఖండవ మండనలు వుండేవి. ఆంధ్రభూమి సంపాదకుడుగా వున్నప్పుడు,డక్కన్ క్రానికల్ సంపాదకీయాలు రాయమని గోరాశాస్త్రిని యాజమాన్యం కోరింది. అది అదనపు పని,శ్రమతో కూడినవి అయినా ఆర్థిక యిబ్బందుల కారణంగా గోరాశాస్త్రిగారు అంగికరించి ఇంగ్లీషు సంపాదకీయాలు రాసేవారు. ఒక్కోసారి అతు తెలుగు,ఇటు ఇంగ్లీషు సంపాదకీయం రాయడం సమయభావం వలన కష్టంగనుక,వరదాచారి (ప్రస్తుతం తెలుగు యూనివర్శిటీలో) పొత్తూరి వెంకటేశ్వరరావు (నేడు ప్రెస్ అకాడమీ అధ్యక్షులు)కు ఆ పని అప్పగించేవారు. సంపాదకీయాలు రాస్తున్న రోజులలో యించుమించు ప్రతిరోజూ సీతారాం (యునైటెడ్ న్యూస్ లో జర్నలిస్ట్)తో ఫోనులో సంప్రదిస్తుండేవారు. పదౌచిత్యం,సరైన అర్థంకోసం గోరాశాస్త్రి సరస ఫోను సంభాషణలు అప్పుడప్పుడు తిట్లవరకూ సాగేవి. గోరాశాస్త్రిగారు రానురాను సంపాదకీయాలకే పరిమితమై మిగిలిన ఆఫీసు బాధ్యతలు ఇతరులకు అప్పగించేవారు.
శ్రీశ్రీ, రావిశాస్త్రి అంటే గోరాశాస్త్రికి యిష్టం. శ్రీశ్రీ అభిప్రాయాలతో గోరాశస్త్రి ఎక్కడా అంగీకరించకపోయినా, మద్రాసు రోజులనుండే వారి స్నేహం అలాగే కొనసాగింది. శ్రీశ్రీ సమాచార తృష్ణ ఆయనకు బాగా నచ్చింది. రావిశాస్త్రి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలుస్తుండేవారు. నేనూ ఆయనతోబాటే కలసి వారి సంభాషణలు విని ఆనందించేవాడిని,రావిశాస్త్రి ఉపమానాలు గోరాశస్త్రి ప్రత్యేకాభిమానరీతులు. ఉప్పులూరి కాళిదాసు "ఆనందవాణి" పత్రిక గురించి తొలుత నేను గోరాశాస్త్రిగారి ద్వారానే తెలుసుకున్నాను. చిలవలు పలవలుగా ఆ పత్రిక దాని సంపాదకుడి విషయాలు చెప్పుకునేవారు. అందులో నిజమే ఎక్కువ అని గోరాశాస్త్రిగారన్నారు. అంతేగాక ఉప్పులూరి కాళిదాసును ఆయన ఇంటికి వచ్చినప్పుడు శాస్త్రిగారే చేశారు. అది వేరేకథ.
రాజకీయవాదులు అట్టే గోరాశస్త్రి గారి దగ్గరకు వచ్చేవారు కారు. ఆయన కూడా మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు కాదు. ఎప్పుడైనా ఒకసారి పి.వి.నరసింహారావును విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా చూడకపోలేదు.
గోరాశస్త్రి గారికి నిత్యమూ కరువే అని చెప్పానుగదా. అది దృష్టిలో పెట్టుకుని కర్నూలులో ఆయనకు సత్కారం తలపెట్టాం. మండవ శ్రీరామమూర్తి(ప్రస్తుతం విజయవాడలో రిటైర్ అయిన వ్యవసాయ బాంక్ ఆఫీసర్) సి.ధర్మారావు నేనూ పూనుకున్నాం. ఒక సంచిక ప్రచురించాం. కర్నూలు జిల్లా పరిషత్తు అధ్యక్షుడుగా కోట్ల విజయభాస్కరరెడ్డి,విద్యామంత్రిగా పి.వి.నరసింహారావు సహరించగా ఒక సభ జరిపి, గోరాశాస్త్రిగారికి కొంత ఆర్థిక సహాయం వసూళ్ళ ద్వారా అందించగలిగాం.
హైదరాబాద్ లో రేడియో చర్చలలో గోరాశాస్త్రి పాల్గొనేవారు. మద్రాసు నుండే ఆయన రేడియో నాటికల ప్రత్యేకత సాధించారు. "ఆశ ఖరీదు అణా" అనే కథ నుండి అనేకం పాఠకుల మన్ననలు పొందాయి. దిగంబర కవుల రచనలు గోరాశాస్త్రి విమర్శలకు గురయ్యాయి. అర్థరాత్రి నాంపల్లి స్టేషన్ వద్ద రిస్ఖాకూలితో ఆవిష్కరించిన తొలి పుస్తకాన్ని గోరాశాస్త్రి ఎద్దేవా చేసేవారు. జీరాలో గోరా అంటూ కమ్యూనిస్టు కవులు ఆయన్ను విమర్శించేవారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వాన్ని బాగా మెచ్చుకుంటూ, పోగారితనం ఆయన శిల్పంలో వుందనేవాడు. కాని వ్యక్తిగా కృష్ణశాస్త్రి అబద్ధాన్ని జీవించాడనేవాడు.
రామోజీరావుగారు ఈనాడు పత్రిక పెట్టడానికి సంకల్పించినప్పుడు గోరాశాస్త్రిని సంప్రదించారు. హైదరాబాద్ అబిడ్స్ లో వున్న మార్గదర్శి కార్యాలయంలో చాలా పర్యాయాలు సాయంకాలాలలో యీ సమావేశాలు జరిగాయి. అందులో నేనూ పాల్గొన్నాను. కొత్త పత్రిక ఎదుర్కోబోయే సమస్యలు,దినపత్రికల తీరుతెన్నులు,విదేశాలలో పత్రికల వ్యపహారం మొదలైన అంశాలు చర్చకు వచ్చేవి. గోరాశాస్త్రి తన అనుభవాల దృష్ట్యా రామోజీరావుతో అనేక అంశాలు చెప్పేవారు. ఆయన శ్రద్ధగా వినేవారు. ఆ సమావేశాలలో ఏర్పాటు కొంతకాలం సాగిన తరువాత 'ఈనాడు' వెలువడింది. నేను ఆ చర్చలలో పాల్గొనడం వల్ల గోరాశాస్త్రిగారి మద్రాసు అనుభవాలెన్నో గ్రహించగలిగాను. 1970 ప్రాంతంలో నార్ల వెంకటేశ్వరరావు అన్నా,ఆయన సంపాదకీయాలన్నా గోరాశాస్త్రికి గిట్టేవికావు. మద్రాసు నుండే వారిరువురికీ సఖ్యతలేదు. ఖాసా సుబ్బారావు గొప్పతనం ఎన్నొవిధాల గోరాశాస్త్రి కొనియాడుతుండేవారు. టంగుటూరి ప్రకాశం జర్నలిజం గురించి కడుపుబ్బ నవ్వించే విశేషాలు చెప్పేవారు.
స్టీవెన్ స్పెండర్ ఆంగ్లకవిత్వం పట్ల గోరాశాస్త్రికి ప్రత్యేక మోజు వుండేది. గోరాశాస్త్రి సంపాదకీయాలలో కొన్ని, ఆయన నాటికలు,కథలు ఈతరం వారికి అందవలసివుంది. గోరాశాస్త్రిగారికి అండగా నిలచి చివరివరకూ సహాయపడిన ఖ్యాతి మిత్రులు సి.ధర్మారావుదే. దూరతీరాలు,ఆనందనిలయం,పరువుకోసం పోతే వంటి రచనలు పునర్ముద్రణ అయితే బాగుంటుంది. 1982 మేలో ఆయన మరణించిన అనంతరం గోరాశస్త్రిని యిప్పుడిప్పుడే మళ్ళీ తలుస్తున్నారు. డా||పి. తిరుమలరావు తన స్వీయ చరిత్ర కట్టలుగా రాసి, గోరాశాస్త్రి దగ్గర పడేసేవారు. ఆయన చిత్రికపట్టి, శైలిపెట్టి, నానాతిప్పలుపడి ఒక క్రమం సమకూర్చేవారు. ఆవిధంగా అనేకమంది గోరాశాస్త్రి సాహిత్యసేవ చేశారు.
by Innaiah Narisetti


No comments:

Post a Comment