నేదురుమల్లి జనార్దన రెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 14





నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా హైదరాబాద్ లో ఉండగా నేదురుమల్లి జనార్దన రెడ్డితో పరిచయం అయింది. అనేక సందర్భాలలో కలుసుకుంటూ మాట్లాడుకునేవారం. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేబినెట్ మంత్రిగా నేదురుమల్లి ప్రముఖపాత్ర వహించాడు. ఆయనతో రాజకీయాలే కాక సాధారణ విషయాలు కూడా చర్చిస్తుండేవాడిని.
నేను చాలా కాలం నెల్లూరు నుండి వచ్చే జమీన్ రైతు వారపత్రికకు రాజకీయ విలేఖరిగా రాస్తుండేవాడిని. నెల్లూరు శ్రీరామమూర్తిగాకి కోరికపై ఆ పని చేశాను. అలా జరుగుతూండగా ఆ పత్రికపై ప్రభావం ఉన్న జనార్దన రెడ్డి రాజకీయ విలేఖరి ఎవరు అని తెలుసుకోడానికి ప్రయత్నించారు. శ్రీరామమూర్తిగారికి అది ఇబ్బందికరంగా పరిగణించింది. నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా ఉన్నాను గనుక నా పేరుతో జమీన్ రైతులో రాయడానికి వీలులేకపోయింది. అయితే జనార్దన రెడ్డికి నచ్చని విషయాలు, వ్యాఖ్యలు వస్తున్నప్పుడు ఆయన ఎడిటర్ ని వత్తిడి చేస్తుండేవారు. శ్రీరామమూర్తి నా దగ్గరకు వచ్చి ఈ విషయాలు వెల్లడిస్తుండేవారు. నన్ను మానేయమనడానికి ఆయనకిష్టంలేదు. పాఠకుల నుండి రాజకీయ విలేఖరి వ్యాఖ్యలకు అనుకూలత ఉండటం వల్ల కొనసాగించమన్నారు. అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత జనార్ధన రెడ్డి వత్తిడి ఎక్కువై, శ్రీరామమూర్తి నా దగ్గరకు వచ్చి తన ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆ దశలో నా అంతట నేనే రాజకీయ విలేఖరిగా రాయటం మానేస్తానని చెప్పాను. కానీ ఆయన ఒప్పుకోక కొనసాగించమన్నారు. ఆ దశలో శ్రీరామమూర్తిగారు చనిపోయారు. డోలేంద్ర ఎడిటర్ గా వచ్చారు. కనుక విరమించటం నాకు సులువు అయింది.
జనార్దన రెడ్డి వ్యక్తిగతంగా నాకు మిత్రుడు. అనేక సందర్భాలలో మేము కలిసి కూర్చుని యధేచ్ఛగా మాట్లాడుకునేవాళ్ళం. ఆయన మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. కొన్నిసార్లు తట్టుకోలేనంతగా మర్యాదలుండేవి. అసెంబ్లీ జరుగుతుండగా ఉదయం సమావేశాలు సాయంత్రానికి వాయిదా పడినప్పుడు మధ్యలో మేమిరువురం ఆయనింటికి వెళ్ళి స్కాచ్ విస్కీ పుచ్చుకుని, నెల్లూరు భోజనం చేసి సాయంత్రం సమావేశానికి వచ్చేవారం. జనార్ధన్ రెడ్డి చాలామందిని అరే ఒరే అని పిలిచేవారు. కొన్నిసార్లు గర్వంగా ప్రవర్తించేవారు.
1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుండి ఆ పదవికి తానూ రావాలని జనార్ధన్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సఫలం కాలేదు. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదవికి జనార్ధన్ రెడ్డి గౌరవం ఇవ్వలేదు. అతని మంత్రివర్గంలో సభ్యుడై వుండి కూడా లెక్కలేనట్లు ప్రవర్తించేవాడు. భవనం మెతక తనాన్ని బాగా వాడుకున్నాడు. ఆ తరువాత కొన్నేళ్ళపాటు రాజకీయ రంగంలో తిప్పలు పడి చివరకు 1990లో ముఖ్యమంత్రిగా తన కోరికను తీర్చుకున్నాడు. రెండవసారి చెన్నారెడ్డి విఫలమయినప్పుడు కేంద్రం మరొక వ్యక్తి కోసం అన్వేషిస్తున్న దశలో జనార్ధన్ రెడ్డి ఆ స్థానానికి రాగలిగాడు. అయితే అధికారంలో ఉండగా చకచక మెడికల్, డెంటల్ కళాశాలలు మంజూరు చేయటం, ఎడాపెడా పనులు జరగడం, రాజకీయ భ్రష్టత్వానికి దారితీసింది. హైకోర్టు కూడా ఆయన చర్యలను నిరసిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. బయట వ్యతిరేకత ఎంత ఉన్నా జనార్ధన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో మాత్రం తన బలాన్ని కాపాడుకోగలిగాడు. 160 మంది శాసన సభ్యులు ఆయనకు మద్దత్తు పలికారు. సంవత్సరం తిరక్కముందే మంత్రివర్గాన్ని పెంచి కొత్తవారిని తీసుకున్నాడు. కానీ కాంగ్రెసు పరిస్థితి దిగజారిపోతుండడం చూసి కేంద్రం ఆయనను తొలగించి విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఆ విధంగా ఒకసారి వచ్చిన అవకాశాన్ని జనార్ధన రెడ్డి జారవిడుచుకున్నాడు. కాంగ్రెసులో కూడా ఆయనకు వ్యతిరేకత పెరుగుతూ పోయింది.
వ్యక్తిగతంగా జనార్ధన రెడ్డి నాతో ఎప్పుడూ బాగా వుండేవాడు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు పెళ్ళిళ్ళకు ఆహ్వానించేవాడు. టీచర్ గా జీవితం ప్రారంభించి రాష్ట్ర కేంద్రస్థాయికి ఎదిగిన వ్యక్తి.
Innaiah Narisetti

1 comment:

Unknown said...

అలనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డిగారు సంయమనం పాటి౦చకుండా ఒకేసారి ఎడాపెడా చకచకా మెడికల్,డెంటల్ కళాశాలలకు అనుమతినివ్వడం పరమ వివాదాస్పదమైనది!అప్పుడు మా నాన్నగారు కిషన్ దాస్ గారు నిజామాబాద్ కాంగ్రెస్ శాసన సభ్యులుగా ఉన్నారు! ఆయనకు ఈ తతంగం ససేమిరా నచ్చలేదు!

Post a Comment