కోట్ల విజయభాస్కర రెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 11




1920-2001

1968లో మొదటిసారి కర్నూలులో  కోట్ల విజయభాస్కరరెడ్డిని కలిశాను. అప్పుడు తెలుగు స్వతంత్ర, ఆంధ్రభూమి సంపాదకుడు, రేడియో నాటికల రచయిత గోరాశాస్త్రి (గోవిందు రామశాస్త్రి)కి 50వ జన్మదినోత్సవం జరపటానికి సభ ఏర్పాటు చేసిన సందర్భం అది. కర్నూలు జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉన్న విజయభాస్కరరెడ్డి బాగా సహకరించి సభ జయప్రదం కావటానికి తోడ్పడ్డారు. ఆయన ఆనాడు చక్కటి ప్రసంగం చేశారు. అప్పటి పరిచయంతో ఆ తరువాత హైదరాబాద్ లో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. మిగిలిన రాజకీయ వాదులతో పోల్చితే విజయభాస్కరరెడ్డి చాలా కాలం స్థానిక విషయాలు పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని 1982 ఎన్నికలలో విజయావకాశాలు క్షీణించాయని భయపడి విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకువచ్చారు. అప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులని రాష్ట్రంలో మార్చేసిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేసింది. విజయభాస్కరరెడ్డి వలన పరువు దక్కుతుందని పదవిలోకి తీసుకువచ్చారు. అయితే ఆనాటి రాజకీయ ప్రభంజనంలో రంగప్రవేశం చేసిన ఎన్.టి.రామారావు సుడిగాలి పర్యటనకు, ప్రజాదరణకు, విజయభాస్కరరెడ్డి సరితూగలేకపోయారు. రామారావు ఇస్తున్న హామీలకు మారుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ.1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు.
విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భవనం వెంకట్రాం, ఆవుల మదన్ మోహన్, నేను ఎదురుగా కూర్చున్నాం. రాష్ట్రంలో 11 మెడికల్ సీట్లు కర్ణాటకకు, అక్కడి స్థానాలు 11 ఆంధ్రకు ఇచ్చి పుచ్చకునే పద్ధతిలో ఏర్పాటు చేశారు. దిగిపోబోయే ముందు భవనం వెంకట్రామ్ ఆ ఫైలు సంతకం చేసి వెళ్ళారు. కానీ రానున్న ముఖ్యమంత్రి వాటిని ఆమోదించవలసి ఉంది. ఒకవైపు భవనం వెంకట్రామ్ మరోవైపున మదన్ మోహన్ (నాటి ఆరోగ్య శాఖామంత్రి) నన్ను వెళ్లి విజయభాస్కరరెడ్డితో ఆ ఫైలుపై సంతకం చేయమని చెప్పమన్నారు. ఆ మాట చెప్పటానికి వారికి మొఖం చెల్లక నన్ను కోరారు. నేను ఎదురుగా ఉన్న విజయభాస్కరరెడ్డి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెబితే ఆయన అప్పటికప్పుడే ఛీఫ్ సెక్రటరీకి చెప్పి ఫైలు తెప్పించి సంతకం చేయటం నన్ను ఆశ్చర్యపరచింది. కర్నూలులో ఏర్పడిన మా మిత్రత్వం ఆ విధంగా తోడ్పడింది.
నేను ఆ తరువాత విజయభాస్కరరెడ్డిని అంత తరచుగా కలవలేదు. ఎప్పుడైనా కలిస్తే ఆప్యాయంగా మాట్లాడేవారు. ముఖ్యమంత్రిగా నాలుగు నెలలకే దిగిపోయిన విజయభాస్కర రెడ్డి తరువాత ఢిల్లీ వెళ్ళిపోయి మరోసారి ముఖ్యమంత్రిగా పదేళ్ళ తర్వాత వచ్చారు. రెండవసారి కూడా ఆయన విఫలమయ్యారు. రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెసును వోడించి ఎన్.టి.రామారావుకు అధికారం కట్టబెట్టిన ఘనత విజయభాస్కరరెడ్డికే దక్కింది. రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నా మిత్రుడు అబ్బూరి వరద రాజేశ్వరరావుకు అధికారా భాషా సంఘాధ్యక్ష పదవి ఇచ్చారు. వారిరువురికి ఢిల్లీలో పరిచయం ఉండేది. కానీ పదవి స్వీకరించక ముందే అబ్బూరి జబ్బుతో ఆసుపత్రిలో చనిపోయారు.

విజయ భాస్కరరెడ్డి చివరిదశలో అపోలోలో చికిత్సకై చేరి చనిపోతున్న రోజులలో ఆయనను పట్టించుకున్నవారు లేదు. పదవులు లేకపోతే మనుషులకు ఉండే ఆదరణ అలాంటిదని కాంగ్రెస్ సంస్కృతి చెబుతున్నది.
Innaiah Narisetti

No comments:

Post a Comment