కాలేజీలో మాకు పాఠాలు చెప్పిన"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి



(1912-1992)


“సీ. నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
     రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
     ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
     మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై”
ఇటువంటి చక్కని తెలుగు భావాలతో ఉన్న విన సొంపైన పద్యాలను ఘంటసాల వెంకటేశ్వరరావు మధురస్వరంతో పాటగా తెలుగు జాతిని మురిపించిన ఖ్యాతి జంథ్యాల పాపయ్య శాస్త్రికే దక్కింది.  
‘ఘంటసాల పాపయ్య శాస్త్రి’ అని ఆయన్ను హాస్యం పట్టించిన విద్యార్థులుగా 1954-58 మధ్య గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మేము అందరి నోళ్ళలోనానే వాళ్ళం. మేము అంటే నేనూ, నా స్నేహితుడు సిద్ధాబత్తుని రామకృష్ణ. ఘంటసాల పాడినందున పాపయ్య శాస్త్రికి పేరు వచ్చిందనే వాళ్ళం. నాలుగేళ్ళపాటు కాలేజీలో మాకు పాఠాలు చెప్పిన పాపయ్యశాస్త్రిని అలా ఆట పట్టించిన వారు అరుదే. ఆవుల గోపాలకృష్ణమూర్తి ఆయన్ను` పాపశ్రీ` అనేవారు. కరుణ శ్రీ కి పారడీగా అలా పిలిచారేమో అనుకున్నాం. పాప అంటే పాము అని కూడా అర్థం వుందట. ఇవేవీ చాటున అన్నవిగావు. ఆయనకు తెలిసేటట్లే ఎదుటబడి అన్నప్పుడు, చిన్న బుచ్చుకున్నా మమ్మల్ని ఏమీ అనేవారు కాదు.
కాలేజీలో పాపయ్యశాస్త్రి గద్య, పద్యంతో బాటు, నాటకం, నాన్ డిటైల్డ్ చెప్పేవారు. కాని ఆయన రాయడంలో కనబరిచిన లాలిత్యం మాధుర్యం చెప్పడంలో కనబడేదిగాదు. అందుకే హాస్యం పట్టించగలిగాం.
పాపయ్యశాస్త్రికి అప్పట్లో ఒక స్నేహితురాలు వుండే విషయం తెలిసి, పోల్చుకున్నాములే నిన్ను వైష్ణవ పడతీ అని రాగాలు తీసేవాళ్ళం. పాపయ్యశాస్త్రి రచనలు ముఖ్యంగా బౌద్ధం, పూలు వస్తువుగా స్వేకరించి రాసినవి చదివాం. తెలుగువారికి యిష్టమైన పూలన్నిటిపైనా ఆయన కవితలు అల్లారు. బౌద్ధం ఆయన పై పరిమితంగానే ప్రభావం చూపెట్టినా, కరుణ రస ప్రధానంగా రాసి, ఆకట్టుకున్నారు. బౌద్ధ బోధనలు, తత్వం ఆయన్ను వశ పరచుకోలేదు. పాపయ్య శాస్త్రితో పరిచయం, కాలేజీ రోజుల తరువాత కూడా సాగింది. సాహిత్య అకాడమీ సంబంధాల వలన తరచు హైదరాబాద్ వస్తుండటంతో, కలిసేవాళ్ళం, మృదువుగా, లాలిత్యంతో సంభాషించేవారు. గురు-శిష్య సంబంధం కాస్తా స్నేహంగా మారింది. ఆయన కుటుంబంతో ఎన్నడూ పరిచయం కాలేదు.
భువన విజయంలోనూ ఉగాది వేడుకల కవిసమ్మేళనాలలో పాపయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఆయన కవితల రచనలు అందంగా ఆకర్షణీయంగా వుండేవి. క్రమేణా ఒకదశలో జంధ్యాల వారు సత్య సాయిబాబా పాదాక్రాంతు లయ్యారు. అంతటితో ఆగక, విశ్వంజీ అనే అర్థాంతపు స్వామి భక్తులయ్యారు. ఇంకా ఇతర స్వాములును కూడా ఆరాధించారేమో తెలియదు. ఏ దశలో ఆయనకు భక్తి ముదిరిందో కూడా గమనించలేదు. పూల నుండి పూజల్లోకి దిగజారారనుకున్నాం. పాపయ్యశాస్త్రి గురువు జమ్మల మడక మాధవ రాయశర్మ ఎ.సి. కాలేజీలోనే మాకు తెలుగు పాఠాలు చెప్పారు. ఆయన సంస్కృత పండితుడైనా, తెలుగు నాటకం చక్కగా, హృద్యంగా చెప్పేవారు. ఆయన పాపయ్య శాస్త్రికి పాఠాలు చెప్పారని తరువాత తెలుసుకున్నాం.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసం ఎ.సి. కాలేజీలో ఏర్పాటు చేస్తే, పాపయ్య శాస్త్రి కూడా వచ్చి, మెచ్చుకున్నారు. అది విశేషం. చెట్లకు ప్రాణం వుంది, అవి స్పందిస్తాయనే జగదీష్ చంద్ర, సైంటిస్టు ఎంత వరకు పాపయ్య శాస్త్రిని ప్రభావితం చేశాడో తెలియదు. కాని ఆయన కవితల్లో పూలపట్ల కదలించే తీరు గొప్పది.
బౌద్ధ ప్రభావం పాక్షికంగానే యీయన స్వీకరించి, కరుణతో ఆపేసినట్లున్నది. పాపయ్యశాస్త్రి రచనలుఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు, కరుణామయి, కరుణశ్రీ, వీరభారతి, ఉదయభారతి, చారుమిత్ర, తెనుగుసేతు, కళ్యాణకాదంబరి, ప్రేమ మూర్తి (బుద్ధుని గురించి) స్వప్న వాస్తవ దత్తం, మహతి, కళ్యాణ కల్పవల్లి, మందిరము, బాల భారతి (కథలు), గురు దక్షిణ, బంగారు పద్మం (పిల్లల నాటకం), ఇంద్రధనుస్సు (పిల్లల కథలు), కళ్యాణ దంపతులు (పిల్లల కథలు), చందమామలో కుందేలు (పిల్లల కథలు), తెలుగు బాల (నీతి శతకం), శ్రీనివాస వాచకం (పిల్లల పాఠ్య గ్రంథం), నలుగురు మిత్రులు (నవల), సింహం మెచ్చిన బట్టి ఒక (పిల్లల కథలు), వసంత సేన (నవల), ఆది కవి వాల్మికి (పిల్లల కథలు), త్యాగమూర్తి (ఏసు జీవితం), దమయంతి (నవల), మహావీరుడు (నవల), భగీరథుడు (నవల), విశ్వ దశలహరి (కథలు), పద్మావతి శ్రీనివాసం (కథలు), ముద్దు బాలశిక్ష (పిల్లలకు), సాయి సుధా లహరి (కావ్యం), ఉమర్ ఖయాం (కావ్యం), ఆకాశవాణి గేయ నాటికలు (20).
ఆ రోజులలో పిల్లల సాహిత్యం యింత రాశారని నేటితరాల వారు గమనించాలి.

- నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment