సంజీవయ్యను సాగనివ్వలేదు

దళితుల ప్రథమ ముఖ్యమంత్రి
దామోదరం సంజీవయ్య (1921-1972)

నాకు బాగా ఇష్టమయిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. కానీ, ఆయనతో నాకున్న పరిచయం చాలా స్వల్పమనే చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రెండుమూడు పర్యాయాలు సన్నిహితంగా కలసి మాట్లాడ గలిగాను. ఆ రెండుసార్లూ కూడా తెనాలిలోనే కలియడం అనుకోకుండా జరిగిన విషయమే. తెనాలిలో శాసన సభ్యులు, సోషలిస్టు ప్రముఖులూ నన్నపనేని వెంకట్రావు ద్వారా 1970లో కలిసినపుడు సుదీర్ఘ చర్చలు చేశారు. సంజీవయ్య ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెనాలిలో మూడురోజులపాటు బడుగు వర్గాల సమస్యలపై చర్చాగోష్ఠి వి.ఎస్.ఆర్. కాలేజీలో ఏర్పాటు చేశారు. దానికి వెంకట్రావుగారు నా సహాయం అడిగారు. చర్చకు కావలసిన హంగులు, పిలవాల్సిన వ్యక్తులు, చర్చించాల్సిన అంశాలు, అందుకు భూమికగా తోడ్పడే సాహిత్యం సమకూర్చడానికి నేను యధాశక్తి తోడ్పడ్డాను. ఇది 1970 నాటి మాట. సంజీవయ్య వచ్చిన తరవాత గోష్ఠిలో చర్చలు, ఉపన్యాసాలు చాలా లోతుపాతులతో హుందాగా జరిగాయి. డా.ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు, డా. రాఘవేంద్రరావు, రావెల సోమయ్య, సూర్యదేవర హనుమంతరావు మరెందరో పాల్గొని చర్చల స్థాయిని పెంచారు.
సంజీవయ్యకు దళితుల, బడుగు వర్గాల అభివృద్ధిపట్ల అపారమైన శ్రద్ధ ఆసక్తి ఉండేవి. కానీ అందుకు తగ్గట్టు ఆయన చేయలేకపోవటానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే కారణం. ఒకవైపు కులం, మరొకవైపు ముఠాలు ఇంకోపక్క అగ్రకులాల వ్యతిరేకతలు ఇత్యాది సమస్యలతో సంజీవయ్య సతమతమయ్యారు.
సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు. అందునా తనకిష్టమయిన బడుగు వర్గాల అభివృద్ధి అంశం గనుక, చాలా ఆవేదనతో, ఉద్విగ్నంగా ప్రసంగించేవారు. విడిగా ఆయనతో వివిధ కోణాల నుంచి బడుగు వర్గాల సమస్యను చర్చించాము. కాంగ్రెసు పార్టీలో సంజీవయ్య ఉన్నందున అనుకున్నవన్నీ అమలుపరచటానికి వీలులేని పరిమితులు ఉన్నాయి. అంబేద్కర్ భావాలు, లోహియా ఆలోచనలూ, ఎం.ఎన్.రాయ్ ధోరణి బడుగు వర్గాల ఉన్నతికి తోడ్పడేదిగా అగుపించినా, పార్టీ ఓట్ల రాజకీయం వలన చాలా అంశాలలో ముందుకు పోలేని స్థితి కాంగ్రెసు పార్టీలో ఉన్నది. చర్చలలో అటువంటి విషయాలను సంజీవయ్య ప్రస్తావించినా, వేదికపై అలా మాట్లాడడానికి వీలుకాలేదు. కానీ బడుగు వర్గాల సమస్యలపట్ల ఆయన వెలిబుచ్చిన ఆవేదన మాత్రం ఆకర్షణీయమైనది. నా అభిప్రాయాలు ఆయన చెప్పినప్పుడు సంతోషించి నన్ను గురించి వివరాలు అడిగారు. నన్నపనేని వెంకటరావుగారు రాడికల్ హ్యూమనిస్టుగా నాకు సంబంధించిన అంశాలు చెప్పారు. ఏదైనా ఆ అనుభవాలు చాలా హత్తుకుపోయిన అంశాలు.
మరొకసారి తెనాలిలోనే ఆవుల గోపాలకృష్ణమూర్తిగారి వద్ద సంజీవయ్యగారిని కలుసుకోగలిగాను. ఆ సన్నివేశం భిన్నమయినది. ముఖ్యమంత్రిగా పర్యటన చేస్తున్న సంజీవయ్య విజయవాడ వెళ్ళి, పాత బస్తీలో ఒక అనాథ బాలికల ఆశ్రమాన్ని సందర్శించవలసి ఉన్నది. సంజీవయ్య అక్కడివరకు వెళ్ళారు. ఒక కొండ గుట్టపై ఆ అనాథబాలికల బడి ఉన్నదని తెలిసి, ‘’అంతపైకి నేను ఎక్కలేను’’ అని తిరిగి వెళ్ళిపోయారు. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అనాథ బాలికలు, యాజమాన్యం కుంగిపోయారు. ఈ విషయాల్ని ఆంధ్ర పత్రికలో వార్తగా ప్రచురించారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి అది చూచి ‘’ముఖ్యమంత్రి పదవికి దేకగలిగినవాడు ఆమాత్రం గుట్ట ఎక్కలేకపోయాడా’’ అని వ్యాఖ్యానించాడు. అదే మాటలని యధాతథంగా ఆంధ్రపత్రిక తెనాలి విలేఖరి వెంకటప్పయ్య శాస్త్రి పంపగా ప్రముఖంగా ప్రచురితమయింది. అది చూచుకున్న ముఖ్యమంత్రి సంజీవయ్య వెంటనే చెపుతూ, ఆ వ్యాఖ్య బావున్నది, నాకు తగిలింది, నచ్చింది. నేను తక్షణమే కార్యక్రమం వేసుకొని అనాథ బాలికల ఆశ్రమానికి వెళుతున్నానని చెప్పి వెళ్ళారు. అక్కడ నుండి తెనాలికి వచ్చి గోపాల కృష్ణమూర్తిని కలిసి అభినందించారు. అప్పుడు నేనక్కడే ఉన్నాను. చాలా సేపు అనేక విషయాలు మాట్లాడుకున్నాము. గోపాలకృష్ణమూర్తిగారిపట్ల ఆయన ఎంతో ప్రేమ ఆసక్తి కనబరిచారు.
దామోదరం సంజీవయ్య రాజకీయాలలోకి వచ్చిన కొత్తలోనే మదరాసులో రాజగోపాలాచారిని ఆకర్షించారు. ఆ తరువాత ఆంధ్రలో వివిధ దశలలో హుందాగా ప్రవర్తించి పేరు తెచ్చుకున్నారు. కర్నూలు నుంచి వచ్చిన సంజీవయ్య ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ ఆకర్షించటం విశేషం.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి హఠాత్తుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలవలన రాజీనామా చేసి పోవలసి వచ్చింది. బస్సుల జాతీయీకరణను చేయడంలో పక్షపాతం వహించి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లా బస్సురూట్లు జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి.సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఆ విధంగా సంజీవయ్య ముఖ్యమంత్రిత్వం స్వల్ప కాలానికే పరిమిత కావడంతో దళితులకు
ఏమంతగా చేయలేకపోయారు. ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవ చేసాడు. ముఖ్యమంత్రిగా 1962లో దిగిపోయిన సంజీవయ్య, గవర్నర్ కు రాజీనామా సమర్పించిన మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడిచి వెళ్ళారు. త్రోవలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు. ఈనాటి ముఖ్యమంత్రులలో అలాంటి ప్రవర్తన వూహించటం కష్టం.
కేంద్రానికి వెళ్ళిపోయిన దామోదరం సంజీవయ్య మంత్రిగా కొనసాగారు. చక్కని పేరు తెచ్చుకున్నారు. కార్మిక సమస్యలు బాగా పట్టించుకున్నారు. పారిశ్రామిక రంగంలో ఎదుర్కొంటున్న విషయాలు అధ్యయనం చేశారు. ఆయన రాసిన పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు – లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్.
సంజీవయ్య 1972లో చనిపోవటం దళితులకు, బడుగు వర్గాలకు పెద్ద లోపం. ఆయనతో నాకున్న పరిచయం పరిమితమయినా అపరిమిత అనుభవాన్నిచ్చింది.

మిత్ర శత్రువుగా నీలం సంజీవరెడ్డి (1913-1996)


ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్, దేశ రాజకీయాలలో ఒక ఊపు ఊపిన రాజకీయ దిట్ట నీలం సంజీవరెడ్డి. ఆయన చదివింది ఇంటర్మీడియట్ అయినా రాష్ట్రపతి వరకూ ఎదిగి కీలకపాత్ర వహించిన వ్యక్తి, మొట్టమొదటిగా ఆయనను కర్నూలు రాజధానిలో కలుసుకున్నారు. అది సన్నిహిత పరిచయం కాదు. ఆయన అప్పటికే చాలా వివాదాస్పదమైన వ్యక్తి. ఆచార్య రంగా వ్యతిరేకిగా ఉన్నందున ఆయనపట్ల నేను సుముఖత కనబరచలేదు. కానీ అశ్రద్ద చేయడానికి వీలులేని రాజకీయ వ్యక్తిగా సంజీవరెడ్డిని పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తూ పోయాను.


తెనాలిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి 1954-55లో మునిసిపల్ ఛైర్మన్ గా ఉన్న రోజులలో, సంజీవరెడ్డి మంత్రి హోదాలో వచ్చారు. అప్పుడు మున్సిపల్ ఛైర్మన్ గోపాలకృష్ణమూర్తి, సభాముఖంగా సంజీవరెడ్డిని రెండు రోడ్లు తెనాలికి మంజూరు చేయవలసిందిగా కోరారు. అందుకు సంజీవరెడ్డి స్పందిస్తూ అడిగిన రెండింటిలో ఒకటి మంజూరు చేస్తున్నట్లు, అంటే 50 శాతం ఇచ్చినట్లు అని ప్రకటించి, ఇలా ఇవ్వడం అపూర్వమని మిగిలిన చోట్ల ఇవ్వనివిధంగా ఇస్తున్నానని చెప్పారు. గోపాలకృష్ణమూర్తి ధన్యవాదాలు చెపుతూ రెండులో ఒకటి సగం కాదని, అడిగిన రెండింటిలో ఒక రోడ్డు లక్షన్నర విలువ కాగా రెండవది 50 వేలు మాత్రమేనని కనుక లక్షన్నర విలువ చేసే రోడ్డు నిర్మాణం అంగీకరిస్తే సంతోషిస్తామని చెప్పగా సభలో పెద్ద పెట్టున చప్పట్లు కొట్టారు. తరువాత ట్రావెలర్స్ బంగళాలో సంజీవరెడ్డి తనను తెనాలి ఆహ్వానించి తీసుకువచ్చిన ఆలపాటి వెంకట్రామయ్య పై ఆగ్రహం కనబరిచి నన్ను సభాముఖంగా ఇలా అవమానం చేయిస్తాడా అని అన్నారు. అప్పుడు నేను సభలో ప్రేక్షకుణ్ణి మాత్రమే. గోపాలకృష్ణమూర్తి అభిమానిని కూడా.

సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు తిరుపతిలో ఆయనకు గౌ.డాక్టరేట్ ఇచ్చారు. నాటి వైస్ ఛాన్సలర్ గోవిందరాజులు నాయుడు ఏకపక్షంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా సెనేట్ కు చెప్పకుండానే నిర్ణయం తీసుకోవటం అప్రజాస్వామికమని మా అన్న విజయరాజకుమార్ సెనేటు సభ్యులుగా కోర్టులో కేసు వేశారు. అది తేలేవరకూ డాక్టర్ అని తన పేరు ముందు వాడవద్దని సంజీవరెడ్డి పక్షాన ఛీఫ్ సెక్రటరీ భగవాన్ దాస్ ఉత్తరువులిచ్చారు. నెల్లూరు కోర్టులో ఆ కేసును ఆవుల గోపాలకృష్ణమూర్తి చేపట్టారు. కొంతకాలం విచారణ జరిగిన తరువాత తమ పరిధిలో ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. ఉత్తరోత్తర నేను కలిసినపుడు నీ మీద కోర్టులో గౌరవ డిగ్రీ విషయమై కేసు పెట్టిన వ్యక్తి మా అన్న అని చెప్పినప్పుడు ఆయన సీరియస్.గా తీసుకోలేదు. తరువాత మేము మిత్రులమయ్యాము.

1955 ఉప ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార ఉద్యమం ముమ్మరంగా ఆంధ్రలో సాగినప్పుడు సంజీవరెడ్డి, రంగా కలిసి పర్యటించారు. నా అన్న విజయరాజకుమార్ రంగా పక్షాన ఆ పర్యటనలో చాలా సభలలో పాల్గొన్నాడు. రంగాగారి సన్నిహితులుగా నేను కొన్ని సందర్భాలలో సంజీవరెడ్డిని కలియడం తటస్థించింది. ఆ తరువాత ముఖ్యమంత్రిగాను, కేంద్రమంత్రిగాను ఉన్న సంజీవరెడ్డితో నేను కలిసింది తక్కువే. హైదరాబాదులో ఒకేసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొలిరోజులలో గోరాగారు అనుచరులతో సత్యాగ్రహం తలపెట్టారు. నిరాడంబరంగా ఉండాలని, పూలమొక్కల బదులు కూరగాయలు వాడాలని ఆ ఉద్యమంలో ప్రధానాంశాలుగా ఉన్నవి. సంజీవరెడ్డి గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రిగా బస చేసినప్పుడు (1963) దాని ఎదురుగా గోరా, ఆయన భార్య సరస్వతి, పత్తి శేషయ్య, వెంపో, కానా మరికొందరితో పాటూ నేనూ రోడ్డు మీద కూర్చున్నాను. సంజీవరెడ్డి కబురుపెట్టి గోరాని పిలిపించుకుని భోజనం పెట్టి చర్చలు జరిపి పంపించారు. ఆ సందర్భంగానే మిగిలినవారిని కూడా లోనికి పిలిచి నిర్ణయాలు చెప్పమని గోరా కోరినప్పుడు, ఆయన మమ్మల్ని లోపలికి పిలిచినప్పుడు కలియటం జరిగింది. అక్కడ నన్ను గుర్తుపట్టి లోగడ కర్నూలులో, తెనాలిలో కలిశావు కదా అన్నారు. మీకు చాలా గుర్తున్నదే అన్నాను.

చాలాకాలం తరువాత రాజకీయ సుడిగుండంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన తరువాత సంజీవరెడ్డి జనతా పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు నేను కలియటం తటస్థపడింది. ఎమ్.వి.ఎస్. సుబ్బరాజు అప్పుడు సంజీవరెడ్డికి ప్రియశిష్యుడుగా ఉండేవాడు. ఆయన నాకు కుటుంబ మిత్రులు ఆ విధంగా కొన్ని పర్యాయాలు సంజీవరెడ్డిని దగ్గరగా కలుసుకున్నాను. కమెండో పత్రిక ఎడిటర్ వినుకొండ నాగరాజు ఎలాగో సంజీవరెడ్డికి చాలా సన్నిహితుడయ్యారు. ఆయన నాకు మిత్రుడు కనుక మేము సరోవర్ హోటల్ హైదరాబాదులో కొన్ని సందర్భాలలో కలిసి మాట్లాడటం వలన దగ్గరగా వచ్చాము. వినుకొండ నాగరాజు (కమెండో పత్రిక ఎడిటర్) జనతాపార్టీ పక్షాన పోటీచేసి ఓడిపోవడం ఆ తరువాత రాష్ట్రపతిగా ఉన్న సంజీవరెడ్డి దగ్గరకు అప్పుడప్పుడూ ఢిల్లీ వెళ్ళటం కూడా జరిగేది. నేను ఢిల్లీలో కలవలేదు. కాని హైదరాబాదులోనే అనేక సందర్భాలలో సంజీవరెడ్డితో కలిసే అవకాశం లభించింది. మిసిమి ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ చిరకాలంగా సంజీవరెడ్డికి సన్నిహితులు. అలా కూడా మేము విడిది గృహాలలో సంజీవరెడ్డిని కలిశాము.

చివరి రోజులలో నా మిత్రుడు, బుక్ లింక్స్ పుస్తక ప్రచురణ సంస్థ యజమాని కె.బి.సత్యనారాయణ ద్వారా సంజీవరెడ్డి తన జీవిత గాథను ప్రచురించాడు. అప్పుడు నేను వ్రాతప్రతిని చూడటం కొన్ని సలహాలు చెప్పటం వలన మరికొంత సన్నిహితులమయ్యాము. తొలి ప్రతిలో నిష్కర్షగా చాలా విషయాలు బయటపెట్టిన సంజీవరెడ్డి తీరా ప్రచురణ సమయానికి ఎందుకోగాని వాటన్నిటినీ ఉపసంహరించాడు. వివాదాలు అనవరసరమని భావించారు. నేను కొంతమేరకు ఆశ్చర్యపోయాను. పుస్తకం పేరు ఫ్రం ఫామ్ హౌస్ టు రాష్ట్రపతి భవన్. ఆయన రాసిన మరొక స్వీయగాథను వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనే శీర్షికన అలైడ్ పబ్లిషర్స్ వెలికి తెచ్చారు. స్పీకర్ గా రాష్ట్రపతిగా సంజీవరెడ్డి చాలా అధునాతన సాహిత్యం చదివారు. ఒకసారి ఎం.సి. చాగ్లా అది చూచి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. సంజీవరెడ్డి మిగిలినవారితో పోల్చితే నిరాడంబరంగా జీవితం గడిపారు. హైదరాబాదు వచ్చేముందు ఎస్.వి. పంతులుగారికి కబురు చేసి సరోవర్ లో బస ఏర్పాటు చేయమనేవారు. ఆవిధంగా కూడా కొన్ని సందర్భాలు మేము కలిసి మాట్లాడటానికి అవకాశాన్నిచ్చాయి. సంజీవరెడ్డి రాజకీయంగానే కాక రానురాను అధునాతన అంశాలతో సంబంధం పెట్టుకుని మానసికంగా ఎదిగాడు. సంజీవరెడ్డి చివరి రోజులలో అలా సన్నిహితంగా వ్యవహరించటం నాకు సంతోషదాయకమైన విషయం. ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీని అప్రజాస్వామికమైనదిగా సంజీవరెడ్డి వ్యతిరేకించటం గొప్ప హైలైట్. మొదటి సారి తన బావమరిది తరిమెల నాగిరెడ్డి (కమ్యూనిస్టు) చేతిలో అనంతపురంలో ఒడిపోయిన తరువాత మళ్ళీ జిల్లాలో ఎప్పుడూ పోటీ చేయలేదు. బయటనుండే గెలిచాడు. సంకుచిత కాంగ్రెస్ రాజకీయాల నుండి ఆయన ఎదిగి జనతా రాజకీయాలలో ప్రజాస్వామిక వాదిగా పరిణమించటం విశేషం.

రాజకీయాలలో పెద్ద మనిషి - బెజవాడ గోపాలరెడ్డి

ఆంధ్రకు మలి ముఖ్యమంత్రి - బెజవాడ గోపాలరెడ్డి (1907-1987)



1950లో బెజవాడను విజయవాడగా మార్చారు. బెజవాడ గోపాలరెడ్డిని అప్పటి నుండి విజయవాడ గోపాలరెడ్డి అంటారా అని జోక్ వాడుకలోకి వచ్చింది.

నేను హైస్కూలు చదువుతున్నప్పుడే బెజవాడ గోపాలరెడ్డి గురించి తెలుసుకుంటుండేవాడిని. పత్రికలు అందుకు ఆధారం. ఆయన 1937 నాటికే మంత్రి పదవి చేపట్టిన సీనియర్ నాయకుడు. కర్నూలు ఆంధ్ర రాజధానిగా ఉన్నప్పుడు నేను కొన్ని కారణాలుగా తరచు అక్కడికి వెళ్ళడం తటస్థించింది. అప్పుడే తొలిసారి గోపాలరెడ్డి గారిని ఆయన బంగళాలో కలియగలిగాను. గౌతు లచ్చన్న, గోవాడ పరంధామయ్యలతో కలిసి ఆయన బంగళాకు వెళ్లినప్పుడు నేను కాలేజీ విద్యార్థిని మాత్రమే. నమస్కరించి, పెద్దలు మాట్లాడుకుంటుంటే వింటూ కూర్చున్నాను. మధ్యలో నన్ను పరిచయం చేసి, లచ్చన్న గారు మిమ్మల్ని చూడాలి అని అంటే వెంటబెట్టుకొచ్చాను అని చెప్పారు. సంతోషం అంటూ గోపాలరెడ్డి గారు ఏవో కుశల ప్రశ్నలు వేశారు. ఆ తరువాత చాలా కాలం నేను గోపాలరెడ్డిగారిని కలియలేదు. కాని ఆయన రాజకీయ జీవితాన్ని గమనిస్తూ పోయాను. నేను కర్నూలులో రెండవసారి గోపాలరెడ్డి గారి బంగళాకు వెళ్ళినప్పుడు సినీనటి భానుమతి అక్కడ ఉన్నది. గోపాల రెడ్డిగారి ఇంటికి కళాకారులు, కవులు రావడం ఆనవాయితీ, సంస్కృతి, భాష, కళల పట్ల అభిమానం గల గోపాల రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అలాంటి వారిని పిలిపించుకునేవారు.

1955 ఉప ఎన్నికలలో గోపాలరెడ్డిగారి ఉపన్యాసాలు విన్నాను. మిగిలిన వారికీ ఆయనకూ విమర్శలలో స్థాయీభేదం ఉన్నది. నెల్లూరు యాసతో చక్కగా, హుందాగా మాట్లాడేవారు. ఎన్నికల అనంతరం గోపాలరెడ్డి గారి ప్రాధాన్యత రాష్ట్రంలో తగ్గిపోయింది. ఆ తరువాత ఆయన గవర్నరుగా కేంద్రమంత్రిగా వెళ్ళారు. చాలాకాలం నేను ఆయన్ను కలుసుకోలేదు. చివరి దశాబ్దంలో మళ్ళీ సన్నిహితంగా ఉండగలిగాం. హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఆయన కబురు చేసేవారు. జూబ్లీహిల్స్ లో మాగుంట సుబ్బరామిరెడ్డి గెస్ట్ హౌస్ లో బస చేసేవాడు. అక్కడ కలుసుకొని విందు ఆరగించి, కవితలు విని, కబుర్లు చెప్పుకోవడం రివాజు అయింది. నగరంలో ఏవైనా కార్యక్రమాలుంటే నన్ను తోడు తీసుకెళ్ళేవారు. మిసిమి పత్రిక సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ సన్నిహిత మిత్రులుగా గోపాలరెడ్డిని కలుస్తుండేవారు. కొన్ని పర్యాయాలు మేము ముగ్గురం కలసి కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళం. గోపాల రెడ్డి గారు ఉత్తర ప్రత్యుత్తరాలకు పెట్టింది పేరు. మేము ఇరువురం ఆవిధంగా చాలా ఉత్తరాలు రాసుకున్నాము. అందులో కొన్నిటిని నేను హైదరాబాదులోని స్టేట్ ఆర్కివ్స్ కు ఇచ్చాను. ఎప్పుడైనా నెల్లూరు వెడితే ఇంటికి వెళ్ళి కాసేపు కాలక్షేపం చేసేవాడిని. ఒకసారి అలా వెళ్ళినప్పుడు పెద్ద ఇంట్లో ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నారు. ఆయన శ్రీమతి లోపల ఎక్కడో ఉన్నారు. నాకు కనీసం ఒక కప్పు కాఫీ ఇద్దామని సహాయకుడి కోసం కేక వేస్తే ఎవరూ పలకలేదు. నేను అందుకొని మీతో కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకోవడానికి వచ్చాను. కాఫీలు అక్కరలేదు. మీరు ఆ విషయం పట్టించుకోనక్కరలేదు అని చెప్పాను. కానీ ఏమీ ఇవ్వలేకపోయాననే ఫీలింగు ఆయన ముఖంలో కనిపించింది. ఎన్నో పదవులు నిర్వహించిన గోపాలరెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత అంత సాధారణ జీవితం గడిపారు. నేటి రాజకీయ నాకులతో పోల్చుకుంటే తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

గోపాలరెడ్డి గారు తరచు మదరాసు వెళ్ళినప్పుడు మిత్రులను తన వద్దకు రప్పించుకొనడం, తానే వారి దగ్గరకు వెళ్ళటం ఆనవాయితీగా ఉండేది. అలా కలిసేవరిలో చందూర్, డి. ఆంజనేయులు మొదలైనవారుండేవారు. నేను ఆంజనేయులుగారింట్లో కొన్నిసార్లు గోపాల రెడ్డిగారిని కలిశాను. అనేక సందర్భాలలో గత రాజకీయ జీవిత ఘట్టాలలో వివిధ అంశాల గురించి అరమరికలు లేకుండా అడిగేవాడిని. కొన్నిటికి దాటవేసేవారు. మరికొన్నిటిని పరిమితంగా చెప్పేవారు. ఆయనకు ఠాగోర్ కవితలు ఇష్టం. కొన్నిటిని తెలుగులోకి అనువదించారు. ఆ ప్రభావంలో కొన్ని రచనలు చేసారు. బెంగాల్ ప్రభావం ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అది నాకంత ఆకర్షణీయంగా అనిపించలేదు. కానీ, ఆయన మాత్రం తన రచనలు ప్రచురించినప్పుడు నాకు ఒక ప్రతి ఇచ్చేవారు. ఆమె అనే శీర్షికన రాసిన కవితలు వినిపించినప్పుడు, ఈ ఆమె అనే పాత్ర నిజ జీవితంలో ఎవరినైనా పోలి ఉన్నదా? అని ప్రశ్నిస్తే ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. గోపాలరెడ్డి గారితో పరిచయం సంభాషణలు కాలక్షేపాలు ఎక్కువగా రాజకీయేతరంగానే గడిచిపోయాయి.

విశ్వనాధ సత్యనారాయణకు జ్ఞానపీఠ్ అవార్డు విషయమై ఉన్న సందేహాలు తెర వెనుక జరిగిన కథనం, అవార్డు ఇప్పించిన తీరు గురించి ఎన్ని సార్లు గుచ్చి గుచ్చి అడిగినా గోపాల రెడ్డి గారు, అవన్నీ ఇప్పుడు ఎందుకులే అయిపోయిందేదో అయిపోయింది అని చెప్పేరే తప్ప అసలు విషయాలు బయట పెట్టలేదు. నేను కూడా తెగిందాకా లాగకూడదని అంతటితో వదిలేశాను.

గోపాలరెడ్డి గారికి కళలు, చెస్, హిందీ భాషాభి వృద్ధి బాగా ఇష్టమైన విషయాలు. ఆయన చుట్టూ ఎప్పుడూ కవులూ, గాయకులు, కళాకారులు కొలువు తీరుస్తూ ఉండేవారు.

నేను కలిసిన ముఖ్యమంత్రులు - టంగుటూరి ప్రకాశం పంతులు

ఇటీవల మిత్రులు కొందరు ముఖ్యమంత్రులతో నాకు ఉన్న పరిచయాలు, అనుభవాలు దష్ట్యా ఆ విషయాలు కొన్ని రాయమని కోరారు. అంత వరకూ అటువంటి ఆలోచన రాగపోయినా వారి ప్రోత్సాహం వలన యధాశక్తి జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పాలని ప్రయత్నం మొదలు పెట్టాను.

వెనక్కు తిరిగి చూచుకుంటే 17 మంది ముఖ్యమంత్రులతో నాకు పరిచయముందా అని నేనే ఆశ్చర్యపడ్డాను. ఈ రచనలో ఎన్నో స్పురణకు రాకపోవచ్చు. కచ్చితంగా తేదీలు కూడా చెప్పలేక పోవచ్చు. కానీ అనుభవాలను మాత్రం చెప్పి అవి చరిత్రలో భాగంగా కాక, వ్యక్తిగత జీవితంలో మధురాను భూతులుగానే చూడాలని కోరుకున్నాను.

1. టంగుటూరి ప్రకాశం పంతులు (1872-1957)



రాజకీయాల్లో ధైర్యంగా పోరాడి, సంపాదన దేశ సేవలో ఖర్చు పెట్టి, తనది అని చూచుకోకుండా ప్రజల మధ్య పర్యటించి ఉద్యమాలు నిర్విరామంగా సాగించిన ధీశాలి. కనుక ఆయన తప్పులు చేసినా, అప్పులు చేసినా జనం అభ్యంతర పెట్టలేదు. పార్టీలు మార్చినా అది ఒక పెద్ద తప్పుగా పరిగణించలేదు. రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ స్థాయిలో నాయకుడుగా మోతీలాల్ నెహ్రూ సరసన స్వరాజ్య పార్టీ స్థాయిలో రాజకీయ దురంధరుడిగా కేంద్ర శాసనసభలో తన వాణిని వినిపించిన నాయకుడు ఆయన. మదన్ మోహన్ మాలవ్య పెట్టిన నేషనల్ పార్టీలో చేరి పనిచేశారు. మద్రాసు నుండి స్వరాజ్య దిన పత్రిక పెట్టి ఇంగ్లీషులోను, తెలుగులోనూ నానా తిప్పలు పడి నడిపించిన టంగుటూరి ప్రకాశం సమయానికి జీతాలు ఇవ్వలేకపోయినా సిబ్బంది గొణగలేదు. స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నుడైనందున తీరిక లేక తాను రాసిన విషయాన్ని ఉప సంపాదకులకు ఇచ్చి స్టైల్ (శైలి) పెట్టమనేవారట. ఆయన సేవల కృషి ఫలితం అదంతా. ముఠా రాజకీయాలలో మునిగి తేలినా, పదవులు వచ్చినప్పుడు సంపాయించుకోకుండా ప్రజల కోసం సంస్కరణలు తలపెట్టి నిజమైన ప్రజా సేవకుడిగా మార్గ దర్శకత్వం చూపాడు. రాజగోపాలాచారి వంటి వ్యక్తులతో తారసిల్లి అటు శాసన సభలోనూ, ఇటు బయటా పోరాడారు. ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఫిర్కా స్థాయిలో సంస్కరణలు తలపెట్టడం, ఖాదీ ఉద్యమానికి అనుకూలంగా నూలు మిల్లులను రద్దు చేయటం వంటివి ఆనాడు ప్రకాశం మాత్రమే చేయగలిగాడు. కమ్యూనిస్టులపై తీవ్ర చర్యలు తీసుకోవడం, వారిపై మలబారు పోలీసులను పిలిపించి దమనకాండ జరిపించడం కూడా ప్రకాశం రాజకీయ జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. రాజగోపాలాచారి ఆయనకు వ్యతిరేకి.

మద్రాసును ఆంధ్రలో భాగం చేయాలని ఎంతో తిప్పలు పడి టంగుటూరి ప్రకాశం విఫలమయ్యారు. ఆంధ్రులకు చెందాల్సిన నగరం అని నిరూపించదలచి తొలి ఎన్నికలలో మద్రాసులో బీచ్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినా ఎన్నికల జైత్రయాత్ర జరిపి ఆంధ్రలో పర్యటించి వరుసగా కొమ్ములు తిరిగిన ఆంధ్ర కాంగ్రెస్ మంత్రులను – కల్లూరి చంద్రమౌళి మొదలు, కళా వెంకట్రావు వరకు మట్టి కరిపించారు. అటువంటి చరిత్రగల ప్రకాశం కమ్యూనిస్టులతో కలిసి తొలి ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నించి కుదరక, కాంగ్రెస్ తో చేతులు కలిపి సఫలమయ్యారు. ఆయనకు సన్నిహితులుగా తెన్నేటి విశ్వనాథం చివరి వరకు నిలిచారు.

నేనెలా తొలుత కలిశాను?

నేను కర్నూలులో తొలుత ప్రకాశం పంతులుగారిని విద్యార్థి దశలో కలిసినప్పుడు చాలా సంతోషించాను. నేను గుంటూరు ఏ.సి. కాలేజీలో చదువుతుండగా రెండు మూడు పర్యాయాలు కర్నూలు రాజధానికి వెళ్ళటం. మరి కొన్ని సార్లు గుంటూరులోనే ప్రకాశం పంతులుగారిని కలిసే అవకాశం ఏర్పడింది. అదొక గమ్మత్తయిన సందర్భం. గుంటూరులో లచ్చన్న అనుచరులు, వడ్డెంగుంట వెంకటేశ్వర్లు, మాదాల పెద్ద తిమ్మయ్య, రిక్షా యూనియన్ నాయకులుగా ఉన్నారు. అప్పుడు తొక్కుడు రిక్షాలు ఉండేవి. రిక్షాలో ఒక్కరే ఎక్కాలని నియమం ఉండేది. విజయనగరంలో ఇద్దరిని ఎక్కనిస్తున్నట్లు తెలిసి అలాగే తమను కూడా అనుమతించాలని రాష్ట్ర ఐ.జి.పి. నంబియార్ ను కోరాలనుకున్నారు. ఆయనకు తెలుగు రాదని, ఇంగ్లీషులో మాట్లాడే వారు కావాలని నన్ను వెంట పెట్టుకుని కర్నూలు వెళ్ళారు. అయితే నాకు వచ్చిన ఇంగ్లీషు కూడా అప్పట్లో అంతంత మాత్రమే. కర్నూలు పోలీసు డేరాలలో ఉంటున్న నంబియార్ దగ్గరకు వెళ్ళాము. నేను వచ్చీ రాని ఇంగ్లీషులో తడబడుతూ విషయం చెబుతుంటే, నంబియార్ గ్రహించి, ఆయనే స్వయంగా తెలుగులో మాట్లాడారు. హమ్మయ్య అనుకుని, పిటిషన్ ఇచ్చి వచ్చిన పని చెప్పాము. ఆయన ఇద్దరిని రిక్షాలో ఎక్కడానికి అనుమతించారు. వచ్చిన పని సఫలమైంది గనక నాయకులను చూచి వెళదాం అనుకున్నాం. ఆ విధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం గారి బంగళాకు వెళ్ళాము. ఆనాడు సెక్యూరిటీ ఆర్భాటం అంతగా లేదు. ఎవరినైనా త్వరగా కలుసుకోవడానికి వీలుండేది. ప్రకాశం గారిని కలిసి నమస్కరించి, కూర్చున్నాము. అప్పటికే ఆయన కురువృద్ధుడైపోయాడు. కదలిక సన్నగిల్లింది. చూపు తగ్గింది. జ్ఞాపకశక్తి కూడా మందగించింది. చేతులలో కొద్దిగా వణుకు వచ్చింది. మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు. ఆయన పట్ల గౌరవంతో, వీరారాధనతో వెళ్ళాం గనక, పలకరించిందే చాలని తృప్తి పడ్డాము. ఆయన కొంచెం సేపు అదీ ఇదీ మాట్లాడి గుంటూరు సంగతులు కూడా అడిగారు. తొలి కలయిక పరిచయం ఆ విధంగా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మరో రెండు సార్లు కర్నూలులో లచ్చన్న గారి వెంట ప్రకాశం గారిని కలియగలిగాను.

నేను చిన్నవాడినని భావించకుండా ఆప్యాయంగా పలకరించి కూర్చో బెట్టిన ప్రకాశం గారి సన్నిధి మరపురానిది. అయితే నేను గౌతులచ్చన్న వెంట మరోసారి వెళ్లటం వలన అటువంటి ఆదరణ లభించింది. గౌతు లచ్చన్నగారు మా కుటుంబానికి సన్నిహితులు. రంగాగారి అనుచరులుగా మా తండ్రి రాజయ్య, మా అన్న విజయరాజకుమార్ ఉండటం వలన లచ్చన్న గారు తరచు మా యింటికి వచ్చేవారు. ఆ విధంగా నేను దగ్గరయ్యాను. అలాగే ఓబుల రెడ్డి, నీరుకొండ రామారావు గార్లతోనూ దగ్గర అయ్యాను. అయితే నాకు రంగా గారి పార్టీ రాజకీయాలతో సంబంధం లేదు. నాకున్న దల్లా వ్యక్తిగత అభిమానం మాత్రమే. నేను పార్టీ రాజకీయాలలో ఎన్నడూ లేను. ఉత్తరోత్తర రంగాగారికి కొన్నేళ్ళు పి.ఎ.గా ఉన్నప్పుడు కూడా పార్టీ రాజకీయాలకి దూరంగానే పనిచేయగలిగాను. అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరుగా “ఏరా అబ్బాయ్, ఎప్పుడొచ్చావ్” అని పలకరించిన తీరులో ఆప్యాయత కలబరిచింది. ఆ తరువాత గుంటూరులో ఆయన మునిసిపల్ ట్రావెలర్స్ బంగళాలో విడిది చేసినప్పుడు యధేచ్చగా కలవ గలిగాను. అప్పటికి ఆయనకు ముఖ్యమంత్రి పదవి పోయింది. మరోసారి గౌతులచ్చన్న గారితో కలసి బంగళాకు వెళ్లి కలిశాను. నేను కేవలం వెంట వెళ్లిన విద్యార్థిని మాత్రమే. అయినా కర్నూలులో కలిసిన జ్ఞాపకాలు ఆయనకు ఉండటం నన్ను ఆశ్చర్య పరిచింది. “ఏరా! బాగున్నావా...?” అని అంటే, నన్ను జీవితంలో ఏరా అని పిలిచిన వ్యక్తులు అరుదు. అయినా ప్రకాశం గారు అలా పిలిస్తే ఆప్యాయతే కనిపించింది. ఆయన లచ్చన్నతో మాట్లాడుతూ “లచ్చన్నా, ముఖ్యమంత్రి పదవికి నా పేరు చెప్పు” అన్నారు. లచ్చన్న నమస్కారం పెట్టి బయటపడ్డారు. ప్రకాశం గారి దగ్గర జనం లేరు. అయితే అప్పటికే ఆయనలో తోంగిచూస్తున్న వార్థక్యం రాజకీయాలకు ఇక పనికిరాడనిపించింది. బయటకు వచ్చిన లచ్చన్న తన వారితో, పంతులుగారికి ఈ వయస్సులోనూ ఇంకా ముఖ్యమంత్రి కావాలని ఉంది అన్నారు.

మరొకసారి గుంటూరులోనే ట్రావెలర్స్ బంగళాలో ప్రకాశం గారిని చూచాను. ఏనుగుల వెంకటరామయ్య, ఎస్.వి. పంతులు, నేను వెళ్ళాము. గది బయట ఒక బుట్టెడు బత్తాయి కాయలు పెట్టి ఉన్నాయి. కుర్చీలో నేతి చెలపతి కూర్చోని బత్తాయి కాయలు వలుచుకుని తింటున్నాడు. లోనకు వెళ్ళిన తరువాత వెంకటరామయ్య నమస్కారం పెట్టి, పంతులుగారూ, మీ అభిమానులు మీ కోసం బత్తాయి కాయలు ఇచ్చి వెళ్ళితే బయట నేతి చలపతి ఎద్దుతిన్నట్లు తింటున్నాడు అని ఎద్దేవగా చెప్పారు. ప్రకాశం గారు “ఓరే చలపతీ బత్తాయి కాయలన్నీ నువ్వే తినేస్తున్నావురా?” అన్నారు. లేదండీ, వచ్చిన వారికి పంచుతూనే ఉన్నాను అని చెప్పాడు. మేము నవ్వుకుని బయటకు వచ్చాము. వెంకటరామయ్యతో నేను అదేమిటయ్యా అంత మోటుగా మాట్లాడావు అని అడిగితే నేతి చలపతి విషయంలో అదేమీ మోటు కాదులే అన్నారు. అప్పట్లో వెంకటరామయ్య గుంటూరులో భారత సేవక్ సమాజ్ ఆఫీసులో పనిచేస్తుండేవారు. పరుచూరి వీరయ్య ఆయనకు బాస్. వెంకటరామయ్య హాస్య ప్రియుడు. చతురోక్తులకు పెట్టింది పేరు. ప్రకాశం గారంటే వీరాభిమానం ఉండేది. ఆ విధంగానే కలిసి వెళ్ళాము.

గుండె చూపింది గాంధీగారికి – సిపాయి తుపాకీకి గాదు

ప్రకాశం గారు ఆ తరువాత కొద్ది రోజులకే చనిపోయారు. చివరి వరకూ కారులో ప్రయాణాలు చేస్తూ వచ్చారు. నేను ఆ తరువాత ప్రకాశం గారి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఆయన రచనలు, వ్యాసాలు చదివాను. రాజకీయాలలో పదవులలో ఆయన చేసిన పనులను నిశితంగా పరిశీలించాను. ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర రాసుకున్నారు. అందులో 1927లో సైమన్ కమీషన్ మద్రాసు వచ్చినప్పుడు కాల్పులు జరగటం, ప్రకాశం గారు పోలీసులకు గుండె చూపెట్టి కాల్చుకోమన్నాడని చాలా మంది చెప్పుకునేవారు. అది ఆయన ధైర్యానికి గీటురాయిగా పేర్కొన్నారు. ప్రకాశం గారు ఆ విషయాన్ని విపులంగా స్వీయచరిత్రలో రాశారు. కాల్పులలో చనిపోయిన వ్యక్తిని చూడటానికి వెళ్ళినప్పుడు ఒక పోలీసు ఆపటం, పక్కనున్న వారు ఆయన ప్రకాశం పంతులు అని చెప్పటం అప్పుడు పోలీసులు అనుమతివ్వటం జరిగింది. ఇది ప్రకాశం గారు స్వయంగా రాసిన విషయం. కానీ ప్రజలలో ఆ విషయం ఆ విధంగా కాక ఒక వదంతిగా, కట్టుకథగా అల్లుకుపోయింది. ఆయన చెప్పిన విషయాన్నే యధావిధిగా ఉదహరించి 1982లో ఈనాడు దిన పత్రికలో నేను ఒక వ్యాసం రాస్తే ప్రకాశం వీరాభిమానులు నాపై విరుచుకుపడ్డారు. అప్పట్లో ఎడిటర్ గా ఉన్న గజ్జల మల్లారెడ్డి ఆ విషయం చెప్పి వేలాది ఉత్తరాలు తమ కార్యాలయానికి వచ్చినట్లు తెలియజేశారు.

రాజకీయాలలో ప్రకాశం గారు ఆచార్య రంగాతో కలియటం, విభేదించటం, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మలుపులు తిప్పింది. అలాగే పట్టాభి సీతారామయ్యతో పడక రాజకీయాన్ని నడిపిన ప్రకాశం కాంగ్రెస్ కు విభిన్న నాయకత్వం చూపారు. ఏమైనా టంగుటూరి ప్రకాశం గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానూ, ఆ తరువాత చిరుపరిచయం నా అనుభవాలలో చిరస్మరణీయమైనది. ఆనాడు ప్రకాశం గారంటే ఒక రాజకీయ హీరోగా, ధైర్యానికి మారు పేరుగా ఉండేది. చివరి రోజులలో ఆయన కుమారుడు హనుమంతరావు వలన కొంత చెడు పేరు వచ్చిందని వినికిడి. ప్రకాశం గారికి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చినా రాజకీయాలలో రిటైర్ కాకుండా చనిపోయిన నాయకుడాయన.

మహాత్మా గాంధీ తిరుగులేని నాయకుడుగా ఉన్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అనంతరం జైలు నుండి బయటకు వచ్చిన ప్రకాశం జనం దగ్గర డబ్బు వసూలు చేసి లెక్కలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకున్నాడని అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి తగడని అన్నారు. ప్రకాశం ధీరోదాత్తంగా గాంధీని ఎదిరించి, ప్రజా నాయకుడుగా కామరాజు నాడార్ తో సహకరించి మదరాసు ముఖ్యమంత్రి అయ్యాడు. రాజగోపాలాచారి కూడా గాంధీజీతో చేతులు కలిపి ప్రకాశాన్ని ఎదిరించాడు. వాటన్నిటినీ తట్టుకుని తిరుగులేని ప్రజానాయకుడుగా మదరాసు ముఖ్యమంత్రిగా ప్రకాశాం తన సత్తా చూపాడు. ఆ విధంగా గాంధీజీకి గుండె చూపిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం.

ముఖ్యమంత్రులతో నేను కలిసిన పరిచయం చేసుకున్న తొలి వ్యక్తి టంగుటూరి ప్రకాశం కాగా అది జీవితంలో మంచి అనుభూతి. అతి కొద్ది పర్యాయాలు అతి స్వల్ప పరిచయంతోనే నేను సరిపెట్టుకోవలసి వచ్చింది. నేను తొలిసారి కలిసేటప్పటికే ప్రకాశం గారు 80వ పడిలోకి రావడం ఆ తరాత కొద్ది సంవత్సరాలకే ఆయన చనిపోవటం ఇందుకు కారణం.