దక్షిణ భారత్ నుండి ఉత్తర అమెరికా వరకు

http://kinige.com/…/South+India+to+North+America+Journey+of
దక్షిణ భారత్ నుండి ఉత్తర అమెరికా వరకు
స్వీయ చరిత్ర -ఇన్నయ్య నరిసెట్టి జీవితానుభవాలు -కినిగిలో చదవండి

ప్రజాస్వామ్య భవిష్యత్తు--ఎమ్.ఎన్.రాయ్

రాజకీయాలు -అధికారం- పార్టీలు



(ఎమ్.ఎన్.రాయ్  ఇచ్చిన ఉపన్యాసాలను, వారు మరణించిన తరువాత వారి భార్య ఎలెన్ రాయ్ సంకలనం చేసి Parties,Power and Politics పుస్తకంగా ముద్రించారు.)
(1950, ఫిబ్రవరి 5న కలకత్తా యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ హాలులో చేసిన ప్రసంగం)
మానవ మేధస్సు ఇంతవరకు భావించిన దానిలో ప్రజాస్వామ్యం ఉత్తమమైన ప్రభుత్వమని నమ్మేవారు. ప్రజాస్వామ్య భవిష్యత్తులో ఆసక్తి చూపుతారు. ఇందుకు భిన్నంగా ఆలోచించేవారున్నారు. ప్రజాస్వామ్యం వాంఛనీయం కాదని అంటారు లేదా సాధ్యా సాధ్యం గురించి సంశయం వెల్లడిస్తారు. వారితో వాదించను. ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రభుత్వ విధానమని భావించి ప్రారంభిస్తాను. దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తును గురించి   ప్రస్తావిస్తాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి బెదిరింపు ఉన్నది. ఇది విశ్వజనీనమైన అనుభవం. ప్రజాస్వామ్యానికి కొత్త దృష్టి కావాలనే ఆలోచన ప్రతి చోట ఉన్నది. ఇతరుల అనుభవం నుంచి మనం నేర్చుకోవచ్చు. కాని మనమే పరిష్కార మార్గాన్ని కనుగొంటే, ఇతరులకు ఉపయోగంగా ఉంటుంది.
రాజకీయ స్వేచ్ఛ కోసం చిరకాలం పోరాటం జరిగిన అనంతరం, ఇండియాలో సర్వతంత్ర స్వతంత్ర రాజ్యం స్థాపించడం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మౌలికమైన చట్టం, మంచి రాజ్యాంగాన్ని వ్రాయడం సులభమే. అవసరమైన ఆదర్శవాదం, రాజకీయ సాంఘిక విషయ జ్ఞానం గల చట్టం తెలిసిన పండితులు, రాజ్య యంత్రాంగాన్ని గురించి చక్కని సమగ్ర పథకం రూపొందించగలరు. మంచి రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టడం దుర్లభం. దానికి ఇతర లక్షణాలుండాలి. ఇప్పటి వరకూ సులభమైన భాగాన్ని పూర్తి గావించారు. మంచి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది అమలు జరపడం కష్టంగా ఉన్నది. దీనికి కనీస ఆటంకం ఉండే రీతులు కూడా, ఇప్పటి వరకు పై చేయిగానే ఉంటూ వచ్చింది.
రాజ్యాంగాన్నిఅమలు పరచడానికి సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం, కొన్ని పద్ధతులు, విధానాలు పరిశీలించడం అవసరమని ప్రజాస్వామిక రాజ్యాలలో సంప్రదాయంగా నమ్ముతూ వచ్చారు. భారత రిపబ్లిక్ కు చెందిన రాజ్యాంగంలో ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వివరాలపట్ల చాలా శ్రద్ధ వహించారు. రాజ్యాంగం సిద్ధాంతరీత్యా అది లోపమే. దేశానికి మౌలిక చట్టం రాజ్యాంగమే. రాజ్యపరమైన శాసన విభాగానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్దేశించడం, పాలనా శక్తిపై అదుపు విధించడం రాజ్యాంగం చేసే పని, భారత రాజ్యాంగంలో కొన్ని మౌలిక సూత్రాలు విధించడం జరిగినా, అవి సంధిగ్ధావస్థకు మించి లేవు. కొన్ని అభ్యంతరకర లక్షణాలు, ముఖ్యంగా పౌర స్వేచ్ఛ గురించినవి, లేకపోలేదు. ప్రాథమిక హక్కుల గురించిన భాగం చాలా చిన్నదే. రాజ్యాంగం చూస్తే ప్రపంచంలోనే పెద్దది. సాధారణ పౌరుడికి సులభంగా అర్థంగాని చట్ట పూరిత భాషలో, అనుసరించవలసిన విధానాలను విపులీకరించారు. ఈ భాషా భేషజంలో, ప్రాథమిక హక్కులు ఇతర మౌలిక భావాలు ప్రాధాన్యత లేకుండా మరుగున బడ్డాయి.
అదుపాజ్ఞలు విధించడం రాజ్యాంగం న్యాయవాదుల కర్తవ్యం, ఇచ్చిన హక్కులను దుర్వినియోగ పరచకుండా అదుపాజ్ఞలను ఉద్దేశించారు. అదుపాజ్ఞలకు ఇచ్చిన ప్రాధాన్యత మానసికంగా ముఖ్యమైనది. అధికార దుర్వినియోగాన్ని రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారని దీని భావం. బహుశ అనుకోకుండానే, దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తును గురించి రానున్న ప్రమాదం వ్యక్తపరచారు.
దేశానికి తగిన ప్రభుత్వం లభిస్తుందనే నానుడిలో చాలా సత్యం ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాల కింద రాజ్యాంగం అమలులో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు అదుపు చేసిన చోట, ప్రజాస్వామిక రాజ్యాంగం పనిచేస్తుంది. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటున్న పార్టీని దేశ జనాభా బొత్తిగా అదుపులో పెట్టలేకపోతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల యొక్క ప్రజల చేత ప్రభుత్వం అయినట్లయితే, సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాస్వామ్య సూత్రాలపై ప్రమాణం చేసే పార్టీ కూడా ప్రజాస్వామ్య రాజ్యానికి హామీగా నిలవవు.
ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం, పనిచేయడం అనేది స్వేచ్ఛా సమాజంలో ప్రజల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. అందుకు ఆయా దేశాలలోని సాంస్కృతిక సంప్రదాయాలపై ఇదంతా ఆధారపడుతుంది. విశ్లేషించి చూస్తే ఈ విషయం గమనించవచ్చు. ప్రజాస్వామ్యానికి చెందిన రాజకీయ సాంఘిక సిద్ధాంతాలు తొలుత తాత్విక మానవతావాదం నుంచి ఉత్తేజాన్ని పొందాయి. మానవుడి వ్యవహారాలన్నీ సృష్టికర్త చూస్తున్నాడనే నమ్మకాన్ని ఈ తత్వం పటాపంచలు చేసింది. మానవుడే తన ప్రపంచాన్ని సృష్టించుకొన్నాడన్నది మానవుడి జీవితమే లక్ష్యంగా ఉంటుదనీ, అన్నిటికీ కొలమానం మానవుడేనని, ఈ కొలమానాన్ని బట్టే నిలవలను నిర్థారించాలని మానవతావాదం పేర్కొన్నది.
మానవతా తత్వం నుంచి రాబట్టినవి ప్రజాస్వామిక ఆచరణ, కాలానుగుణంగా తనకు ఉత్తేజం కల్పించిన మూల తత్వానికి దూరంగా జరిగింది. చివరకు పార్లమెంటరీ వ్యవస్థలో సార్వభౌముడు కాస్తా నిస్సహాయుడుగా మారాడు. ప్రభుత్వం కొద్ది మంది వ్యక్తులు నడిపిస్తుండగా, పరిపాలనపై వారికే అదుపు ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిశితంగా పరిశీలించే విమర్శకుల దృష్టిలో వైఫల్యాలన్నీ వ్యక్తిగత కారణాలుగానూ, అధికార తృష్ణ, రాజకీయవాదుల ఆశలు, సాంఘిక వర్గాల స్వార్థాల వల్ల జరుగుతున్నాయంటారు. మానవుల ఉద్దేశాలను బట్టే చాలావరకు సాంఘిక సంఘటనలు ఉంటాయి. రాజకీయ వాదుల, పార్టీల ఉద్దేశాలతో నిమిత్తం లేని చారిత్రక కారణాలు కూడా లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలం గావడానికి, తగిన గుణపాఠం నేర్చుకోవడానికి ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తుకు రాగల ప్రమాదాల నుంచి తట్టుకోవాలంటే, వీటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అదే మనకు హామీ.
ప్రజాస్వామ్య పుట్టుకను దృష్టిలో పెట్టుకుని, ఐరోపాలో ప్రజాస్వామ్యం ఎందుకు అపఖ్యాతిపాలైందో కారణాలు చూడవచ్చు. ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి పట్టించుకునేవారు, దీనికి ఉత్తేజాన్నిచ్చిన మూలాన్ని గమనించాలి. రాజకీయ సిద్ధాంతాలు, సాంఘిక సిద్ధాంతాలు కూడా తత్వం నుంచి, సమగ్ర జీవిత దృక్పథం నుంచి ఎంచుకొంటారు. అలౌకిక శక్తి మానవ జీవితంగా వ్యక్తమైందని నమ్మారు. దైవేచ్ఛ ప్రతి దానికీ ముందే నిర్ధారిచినదన్నారు. ఆయా కాల పరిస్థితుల ననుసరించి ఈ మనస్తత్వం నిర్ధారితమైంది. చాలా కాలం మానవ చరిత్రను ఈ భావనే ప్రభావితం గావించింది. మానవుడు స్వతంత్రించి పని చేయడంపై అదుపులు పెట్టడం, తన విధికి తానే యజమాని అని మానవుడు భావించక పోవడానికి ఈ నమ్మకం అడ్డొచ్చింది. మానవుడి వివేచనకు అవగాహన కాని అలౌకిక శక్తి ప్రపంచంలో ప్రతిదీ నిర్థారిస్తుందనడంతో మానవ జీవితాన్ని శాశ్వతంగా బానిసత్వంలో ఉంచినట్లయింది. జీవితానంతరం మోక్షం కోసం ఇటువంటి సేవను దివ్యమైనదిగా శ్లాఘించవచ్చు. ఆధ్యాత్మిక బానిసత్వానికి తిరుగుబాటుగా ప్రజాస్వామిక జీవన దృక్పథం ఆవిర్భవించింది. మానవ జీవితమే అత్యున్నత విలువ అనడంతో ఈ దృక్పథం ఆరంభిస్తుంది. కనుక అలౌకికత్వానికి, మరేదో లక్ష్యానికి మానవుడు మార్గంగా దిగజారి పోరాదంటుంది.
దోషాలను గుణాలుగా భావించే ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మానవుడు, స్వేచ్ఛకు విలువ ఇచ్చే రాజకీయ సాంఘిక సిద్ధాంతాలను రూపొందించాడు. మానవ ప్రగతికి మానవ మేథస్సు ఆధారం అని, మానవ ప్రపంచంలో ఉన్నదంతా మానవ సృష్టి అని భావించాడు. దీని ఫలితమేమంటే, రాజకీయ సాంఘిక సంస్థలు మానవ ప్రయోజనానికి తోడ్పడకపోతే, వాటిని మలచడానికి మానవుడికి హక్కు, శక్తి ఉన్నాయన్నమాట. కేవలం కొద్దిమంది రాజకీయవాదులు గాక, ప్రజా బాహుళ్యం అధికార మనస్తత్వం నుంచి దూరంగా జరిగి, మానవతా జీవిత దృక్పథాన్ని ఆమోదిస్తే, ఆ మేరకు ప్రజాస్వామ్యం వికసించడానికి ఆ దేశంలో అనుకూల వాతావరణం ఉన్నదన్నమాట.
ఈ ప్రమాణాన్ని బట్టి నిర్ణయిస్తే, భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. ప్రజల మనస్తత్వం ఇంకా పెత్తందారీ విధానంలో ఉన్నది. తిరోగమన సాంస్కృతిక సంప్రదాయాన్ని ఆధ్యాత్మిక ప్రతిభగా రాజకీయవాదులు, రాజకీయపార్టీలు శ్లాఘిస్తుండడం గమనించవచ్చు. పెత్తందారీ మనస్తత్వం గల ప్రజలతో ప్రజాస్వామ్యం స్థాపించడం సాధ్యపడదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం విఫలమైతే, రాజకీయ పార్టీల నాయకుల కుట్ర వల్ల మాత్రం కాదు. బాహ్య పరిస్థితులు, ప్రజల మనస్తత్వం, మానవ స్వేచ్ఛ, మానవ సృజన శక్తిని గమనించకపోవడం వంటి కారణాలే ప్రజాస్వామ్య వైఫల్యానికి దోహదం చేస్తాయి. ప్రజాస్వామిక జీవిత దృక్పథానికి ఇవి మౌలిక విలువలు.
సిద్ధాంతపరంగా ఈ విలువలను ఆమోదించినంత మాత్రాన ప్రజాస్వామ్యానికే భద్రత చేకూరదని పాశ్చాత్య ప్రపంచానుభవం చెబుతున్నది. ఏమైనా మౌలిక కృషి తొలుత చేయాలి. అప్పుడు ఇతరుల దోషాలను తొలగించవచ్చు. ప్రజాస్వామ్యాన్ని లాంఛనప్రాయం చేయడం మూలదోషం. ప్రతి వ్యక్తి సార్వభౌముడనేది ప్రజాస్వామ్యంలో మౌలిక తాత్విక సూత్రం. క్రమేణా రాజ్యాంగపరమైన సిద్ధాంతాలలో కూడా ఈ సూత్రాన్ని కేవలం చట్టబద్ధమైన కట్టుకథగా మార్చేశారు. సార్వభౌముడైన వ్యక్తి నిస్సహాయుడైన సాంఘిక జీవిగా మారాడు. ప్రజాస్వామిక సమాజానికి తగిన భావపునాదులు ఏర్పడినా, వ్యక్తులకు తగిన ప్రాధాన్యతను ప్రజాస్వామ్యం ఇవ్వలేదు. వ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్లించలేదు. ఫలితంగా, ప్రజాస్వామిక ఆచరణ తన లక్ష్యాన్ని తానే ఓడించుకున్నది.
పార్లమెంటరీ విధానం ప్రజాస్వామ్యాన్ని లాంఛనప్రాయం చేయడమే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజాస్వామిక ప్రభుత్వం స్థానే ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ప్రాతినిధ్య ప్రభుత్వమూ, ప్రజాస్వామిక ప్రభుత్వమూ ఒకటి కాదు. ప్రజాస్వామ్యాన్ని లాంఛనప్రాయం చేయడం, ప్రాతినిధ్య ప్రభుత్వంతో తాదాత్మ్యం గావించడం అనేది ఆధునిక రాజ్యాలలో అధిక జనాభా వల్ల, విశాల దేశాల వల్ల సంభవించింది. ప్రాచీన కాలంలోని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఆచరణయుక్తం కాకుండా పోయింది. ఈ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందడంతో ప్రజాస్వామ్యం అపఖ్యాతిపాలైంది. ఈ వైఫల్యం తప్పనిసరికాదు. రాజకీయ  పరిపాలన సమస్యలతో సతమతమైన రాజకీయ ఆధునిక ప్రజాస్వామ్యవాదులు వ్యక్తి స్వేచ్ఛ, సార్వభౌమత్వం అనే భావాలకు దూరమయ్యారు. వ్యక్తిని సమష్టిత్వానికి లొంగేటట్లు చేశారు.
వ్యక్తిని చేతగానివాడుగా చేసిన అనంతరం, పార్టీల పేరిట అధికారం కోసం కొందరు కలహించడం మొదలైంది. ప్రజాస్వామ్యానికి పార్టీ విధానం మూలం అని నమ్మినా, ఇంతకంటే ప్రజాస్వామ్యానికి హాని చేసిందేదీ లేదు. ప్రజాస్వామ్యాన్ని మూకస్వామ్యం కిందకు పార్టీలు మార్చేశాయి. సిద్ధహస్తుడైన మూకస్వామ్యవాది జయప్రదమైన ప్రజాస్వామ్యవాదిగా మారాడు. పెద్ద హామీలిచ్చేవారు బహుశ నిజంగానే మంచి చేద్దామనుకోవచ్చు. కాని అధికార క్రీడలో నిమగ్నులైన తరవాత, ఆట నియమాలు పాలించాలిగదా. వెనుకబడినతనం  గల వాతావరణంలో అధికార కలహాల వల్ల బాగా చదువుకున్నవారున్న దేశాలకంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కిందకు ఈడ్చేస్తుంది. ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటు హక్కు అనేది అత్యున్నత దశగా పేర్కొంటున్నారు. కేవలం తలలు లెక్కించే పద్ధతికి దిగజారిన తరువాత తలల్లో ఏముందో ప్రజాస్వామ్యం పట్టించుకోదు. బాధ్యత లేని తలలైతే, ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి అజ్ఞానమే ఆధారం అన్నమాటే.
లోగడ ఎన్నికల అనుభవం మనకున్నది. మహాత్ముడికి ఓటు వేస్తున్నాం కనక, దేవాలయానికి పోతున్నట్లుగానే పోలింగ్ కు వెళ్ళారు ఓటర్లు. ఓట్ల పెట్టెలలో ఓటుతోపాటు బియ్యం వేశారు. ఓటంటే వారి దృష్టిలో విలువలేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే మహాత్ముడికి ఓట్లిచ్చినట్లేనన్నారు. అన్ని ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. కనక ఆ పార్టీ అదుపులో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామికం అనొచ్చు. ఇదంతా అందరికీ ఓట్లు లేనప్పుడు జరిగింది. ఇక అందరికీ ఓట్లు అంటే ఇంకా అధ్వాన్న పరిస్థితి అన్నమాటే. అందరికీ ఓటు ఉండరాదని చెప్పడం లేదు. ఓటంటే ఏమిటో చెప్పకుండా ఓటు హక్కు ఇస్తే ప్రయోజనం లేదు.
అందరికీ ఓటుహక్కుంటే, దేవాలయానికి పోయినట్లే పోలింగ్ కు వెడతారు. ప్రజల రాగద్వేషాలకు విజ్ఞప్తి చేసిన మూకస్వామ్యవాదులకు విజయావకాశాలు బాగా ఉంటాయి. ఒకటికి మించి పార్టీలున్నందువల్ల మూకస్వామ్యానికి ఇంకా గిరాకీ పెరుగుతుంది. ప్రజలను ఆకర్షించడానికి మూకస్వామ్యవాదులు పోటీ పడతారు. ఎన్నికలలో గెలవాలంటే అజ్ఞానాన్నీ, ప్రజల మూఢనమ్మకాన్ని ఆధారం చేసుకోవడంలో కాంగ్రెస్ తో పోటీ పడాలన్నమాట.
అందుకే భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. రాజకీయవాదుల దురుద్దేశ్యం ఇందుకు కారణం కాదు. పార్టీ రాజకీయ విధానం, ప్రజాస్వామ్యాన్ని లాంఛనంగా చూసే పద్ధతే కారణం. కనక ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి పట్టించుకొనేవారు ఇతరులను ఆరోపించడం మానాలి. ప్రజాస్వామ్యం సాధ్యం కావడానికి పరిస్థితులను సృష్టించే కృషి చేయాలి. ఈ లోగా బహుశా ఒక దశాబ్దం అనుకోండి, మూకస్వామ్యం ఉంటుంది. అధికార కలహం కొనసాగుతుంది. అవినీతి, అసమర్థత పెరుగుతుంది. ప్రజాస్వామ్యానికి పునాది వేసేవరకు ఇది తప్పదు. ప్రజలు తమ విధికి తామే బాధ్యులమని గుర్తించేటట్లు చేయాలి. ప్రజాస్వామ్యం అత్యుత్తమ ప్రభుత్వమని నమ్మేవారు ప్రజల మనస్తత్వంలో విప్లవం తీసుకొచ్చే ప్రధాన కర్తవ్యాన్ని నిర్వహించాలి.
చరిత్ర అంతటా రాజకీయ, సాంఘిక మార్పులకు ముందు తాత్విక విప్లవం వచ్చింది. కనీసం ప్రజలలో పేర్కోదగినంత మందిలో అయినా ఈ మార్పు జరిగింది. అవసరమైన ఇటువంటి అనుభవం భారతదేశంలో రాలేదు. ప్రజలందరి మనస్తత్వంలో మార్పు ఒక్కసారి రారు. కాని మొదలుపెట్టటం జరగాలి. గుడ్డివాళ్లు, గుడ్డివాళ్ళకే దారిచూపే స్థితినుంచి బయటపడాలి. దేశంలో ఎక్కువమంది ప్రజలు మూఢ నమ్మకాలతోనూ, రాగద్వేషాలతోనూ ఉన్నారు. ఆధునిక విద్యా విధానం సహాయంతో ఈ దోషాలన్నిటినీ ధర్మాలుగా హేతుబద్ధం చేసి చూపుతున్నారు. ఇటువంటి సాంస్కృతిక వాతావరణంలో ప్రజా జీవనం అవినీతికి గురి అవుతుంది. ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. అధిక సంఖ్యాకులు గుడ్డి నమ్మకాల సంప్రదాయాల నుంచి, వీరారాధన నుంచి బయటపడాలి. అన్వేషణా ధోరణి, స్వశక్తిపై ఆధారపడటం, స్వేచ్ఛను కోరటం జరగాలి. మానవుడికి తనలో విశ్వాసం ఏర్పడటం నిజమైన ప్రజాస్వామిక సమాజానికి అవసరం.
ఐరోపాలో అభివృద్ధి చెందిన దేశాలు తాత్విక విప్లవాన్ని చవిచూచిన తరవాత కూడా, పాక్షికంగానైనా ప్రజాస్వామ్యం విఫలమైంది. సంస్థలు మనిషికంటే పై స్థానంలో ఉండటం వల్ల ఇలా జరిగింది. సంస్థలను మనుషుల సృష్టించారని మరచిపోయారు. మనుషుల్లో మంచితనం లేనిచోట మంచి సంస్థలు జయప్రదం కావు. లేదా మంచితనం ఉన్నందుకు వారు బాధపడాలి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఎక్కువమంది ప్రజల స్వేచ్ఛా పిపాసను కలిగి తాము స్వేచ్ఛకోసం పుట్టామని గ్రహించాలి. స్వేచ్ఛగా పుట్టకపోయినాసరే ఇది అవసరం. ప్రజాస్వామ్యం వివేచనాయుత, సామాజిక వాతావరణంలోనే పనిచేస్తుంది. సామాజిక సమస్యలకూ, జీవితానికీ హేతు దృక్పథం ఉండాలంటే, ప్రకృతికి బయట దేనినో నమ్మే ధోరణిని నిరాకరించాలి. మానవుడికి మించి ఎవరిపైనో విశ్వాసం ఉంచటాన్ని తృణీకరించాలి. ప్రపంచంలో స్వేచ్ఛగా ఉండాలని పట్టుదల లేకపోతే ప్రపంచాన్ని మార్చే శక్తి మానవునికున్నదని నమ్మకపోతే ప్రజాస్వామ్యం సాధ్యం కాదు.
దేశంలో పరిస్థితులను వాస్తవ దృక్పథంతో చూడాలి. ఈ పరిస్థితులు సాంస్కృతిక సంప్రదాయంలో ప్రగాఢంగా నాటుకుపోయి ఉన్నాయి. ప్రజాస్వామ్య భవిష్యత్తును గురించి అంతగా ఆశావాదానికి ఉత్తేజం కలిగించటం లేదు. ప్రజాస్వామికి స్వేచ్ఛను గురించి చిత్తశుద్ధి లేకుండా మాట్లాడేవారూ, ఒకే పార్టీ పరిపాలన నియంతృత్వ ప్రమాణంతో ఉన్నదని భావించేవారూ తమ బాధ్యతను గుర్తించటం లేదు. ఒకే పార్టీ పాలన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైతే, ప్రతిపక్షం తలెత్తినంతమాత్రాన ప్రజాస్వామ్యానికి భద్రత ఉన్నట్లు కాదు. పై నుంచి పెత్తనాన్ని అంగీకరించే ప్రజలు మానసికంగా, గుడ్డిగా ఆచరించేవారు అధిక సంఖ్యాకులు ఉన్నప్పుడు పరిస్థితి మెరుగుపడదు.
ప్రజాస్వామ్యానికి ఎవరి దురుద్దేశం వల్ల ప్రమాదం వాటిల్లదు. దేశంలోని సాంస్కృతికమైన వెనుకబడినతనం వంటి పరిస్థితుల ప్రభావం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఉన్నందువల్ల మనం భూతాలతో పోరాడనవసరం లేదు. ఇతరుల ఉద్దేశాలతో కలహించనవసరం లేదు. నియంతృత్వం అసాధ్యమయ్యే పరిస్థితులను కల్పించాలి. పెత్తనాన్ని అంగీకరించే మనస్తత్వం వల్ల నియంతృత్వానికి లాంఛనప్రాయమైన ప్రజాస్వామ్యం ఆధారాన్ని కల్పిస్తుంది. తెలివిగల, చదువుకున్న జర్మన్ ప్రజలు సహితం ఈ వలలో పడ్డారు. అయితే ఇంగ్లాండులో నియంతృత్వానికి ఆకర్షితులు కాలేదు. పశ్చిమ ఐరోపాలోని దేశాలలో కూడా దుర్భేద్యమైన  హిట్లర్ సైనిక శక్తి నియంతృత్వాన్ని రుద్దలేక పోయింది. ఇదొక పేర్కొనదగిన సంఘటన, ఉన్నత విద్యాస్థాయి, తెలివితేటలు ఉన్నప్పటికి జర్మనులు పెత్తనాన్ని అంగీకరించే స్థితి నుంచి ఎప్పుడూ బయటపడలేదు. చారిత్రకంగా వీరికి ఆ స్థితి వచ్చింది. రాజ్యాన్ని పవిత్రంగా చూసే మనస్తత్వం వారికున్నది. ఇందుకు భిన్నంగా ఐరోపాలో, పశ్చిమ ఉత్తర దేశాలలో తాత్విక విప్లవాన్ని చవిచూచారు. అందువల్ల మధ్యయుగాల మనస్తత్వం నశించింది. వ్యక్తి స్వేచ్ఛా పిపాసకు, ప్రజాస్వామిక జీవితానికీ ప్రోత్సాహం కలిగింది. సాధారణ జర్మన్ పౌరుడి అత్యున్నతమైన కోర్కె సైనికుడు కావాలనీ లేదా రాజ్యాధికారి కావాలనీ, యూనిఫారం వేసుకోవాలనీ, ప్రజలలో బలశాలి ననిపించుకోవాలనీ, ఇదంతా రాజ్య ఛాయలో జరగాలని అనుకుంటాడు. పాశ్చాత్య దేశాలలో రాజ్యాధికారం చొచ్చుకుపోకుండా, ఉదారవాదం జాగరూకతను నేర్పింది. కనీస పరిపాలన చేసే ప్రభుత్వం ఉత్తమమైనదనీ ప్రజలు భావించారు. పెత్తందారీ విధానానికి ప్రజలు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడూ, కరుణామయుడైన పరిపాలకుడూ లేదా శక్తిమంతమైన నియంతా తమకోసం అంతా చేసిపెడతాడని భావించినపుడు వారికి తగిన ప్రభుత్వమే లభిస్తుంది. నియంతృత్వం తలెత్తడానికి తగిన సాంస్కృతిక, మానసిక పరిస్థితులను తొలగిస్తే తప్ప, ఎంత హెచ్చరిక చేసినా ప్రయోజనం లేదు. ఈ హెచ్చరిక చేసేవారే అవకాశం వస్తే నియంతృత్వాన్ని స్థాపిస్తారు. వారు కూడా అదే పరిస్థితులలో పనిచేయాలి కనక ఈ స్థితి తప్పదు.
పార్టీ, అధికార రాజకీయాలలో నిమగ్నులైనవారు ఎక్కువ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోరు. పునాదులు వేయడమంటే వారి దృష్టిలో చాలా జాప్యంతో కూడిన పని మాత్రమే. వారికి దగ్గరదారులు కావాలి అధికారానికి దగ్గర దారి ఇతరుల కంటే ఎక్కువ హామీలివ్వటమే. ఇచ్చిన హామీలు చేయగలమనే ఉద్దేశ్యం కానీ, నమ్మకం కానీ వారికుండదు. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు అనేది రాజకీయాలకు బయట ఉన్నవారిపైన లేదా అధికార కలహం నుంచి బయటపడగలిగిన వారిపైన ఆధారపడి ఉన్నది. ‘ఆచరణాత్మక రాజకీయవాదు’ను ఆకర్షించే తీరులో కాక వేరే విధంగా వీరు పనిచేయవలసి వుంటుంది. కొంతకాలం వీరు ఏకాకులుగా ఉండవలసి ఉంటుంది. ఇది నేటి అవసరం  కనక ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే అవకాశం ఉన్నది. జాతీయ స్వేచ్ఛ అనేది కట్టుకథ. జాతి విమోచన మోసం. వ్యక్తి స్వేచ్ఛమీద ఇష్టం ఉండటం ఒక ముఖ్య లక్షణంగా చాలామంది ప్రజలలో వ్యాపిస్తే తప్ప ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు అంధకారమే.
ఈ కృషి కష్టంగా కనిపించవచ్చు. వాస్తవంగా అంత కష్టం కాదు. అధికారం లేకుండా తామేమీ చేయలేమని, తమ వైఫల్యాలను రాజకీయవాదులు హేతుబద్ధం చేయాలని ప్రయత్నిస్తారు. ఒక మనిషి వాస్తవంగా స్వేచ్ఛను కోరినప్పుడు, ప్రజాస్వామిక సమాజంలో నివసించదలచినప్పుడు అతడు ప్రపంచాన్నంతటినీ విముక్తి గావించలేడు. దేశంలో ఉన్న ప్రజలందరినీ, ఒక మహత్తర విప్లవంతో స్వేచ్ఛాపరులను చేయడు. కాని తాను హేతువాదిగా, నీతిమంతుడుగా  ప్రవర్తించి, తనను చాలావరకు విముక్తుణ్ణి కావించుకోవచ్చు. అతడలా చేస్తే అతడిచుట్టూ ఉన్నవారు అలానే చేయగలరు. ఈ చర్య స్వేచ్ఛను వ్యాపింపచేస్తుంది. రాజకీయవాదులు కేంద్రంలో అధికారం కోసం పోరాడుకుంటుంటే అలాంటివారిని వదిలేసి ఒక వందమంది స్వేచ్ఛాపరులుగా నివసిస్తూ పని చేస్తుంటే వారి సంఖ్య అతి త్వరలోనే వేలల్లోకి పోతుంది. ఈ ఉద్యమం వ్యాపించి, ప్రజాస్వామ్యానికి వేసిన పునాది స్థిరపడుతుంది.

     రచయిత అనువాదం
ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య




రాజకీయాలు -అధికారం- పార్టీలు
ప్రజాస్వామ్యం - పార్టీ రాజకీయాలు
ఎమ్.ఎన్.రాయ్
(ఎమ్.ఎన్.రాయ్ వివిధ ప్రదేశాలలో ఇచ్చిన ఉపన్యాసాలను, వారు మరణించిన తరువాత వారి భార్య ఎలెన్ రాయ్ సంకలనం చేసి పుస్తకంగా ముద్రించారు.)
ప్రజల సార్వభౌమత్వాన్ని రాజకీయ పార్టీలు నాశనం చేస్తాయని సిద్ధాంతపరంగా చెపుతున్నాం. పశ్చిమ ఐరోపాలో దీనికి సాక్ష్యాధారాలు ఉన్నవి. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామనే పేరిట విపరీతంగా సైనిక ఖర్చులు పెడుతున్నారు. ప్రజలకు ఇది చాలా భారంగా పరిణమించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామంటూనే చంపేస్తున్నారన్న మాట. పార్టీలు ఎన్ని ఉన్నా, పార్టీ ఎంత చిన్నదైనప్పటికీ ఆడుతున్న ఆటమాత్రం ఒకటే. ఐరోపా దేశాలలో పార్టీ విధానం ఎప్పుడూ అస్థిరంగానే ఉంటుంది. నిష్పత్తి ప్రాతినిధ్యం ఇక్కడ ప్రోత్సహిస్తున్నందువల్ల, చిన్న పార్టీలు అనేకం తలెత్తాయి. పార్లమెంటులలో వీటి ప్రభావం వివిధ రకాలుగా ఉంటున్నది. పార్టీ విధానం అర్థం పర్థం లేనిదైపోయింది. ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అనే పార్టీ విధానం క్రమంగా అస్థిరత్వాన్ని తెచ్చిపెడుతున్నది.
అల్ప సంఖ్యాకులకు అవకాశాలు ఇచ్చే నెపంతో నిష్పత్తి ప్రాతినిధ్యం ప్రవేశపెట్టడంతో పార్టీ విధానంలో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా మారుతున్నది. ఓటర్లకు వారి ప్రతినిధులకు వ్యక్తిగత సంబంధం అదృశ్యం అవుతున్నది. వ్యక్తిగతంగా అభ్యర్థులకు గాక, పార్టీలకు ఓట్లు వేయటం వల్ల పార్లమెంటు సభ్యులు, ఓటర్లకు బాధ్యులు కాకుండా పోతున్నారు. ఓటర్లకూ, పార్లమెంటులోని పార్టీలకు వ్యక్తిగత సంబంధం లేనందువల్ల, ప్రభుత్వ ప్రాతినిధ్యం, లేదా బాధ్యత అనేది కావాలని మోసంగా మారకపోయినా, లాంఛనంగా మాత్రం వుంటున్నది. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని, పార్టీ విధానం భ్రష్టపరుస్తున్నది.
గ్రేట్ బ్రిటన్ లో పార్టీ విధానం కొంత మెరుగుగా పనిచేసింది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి ప్రాతిపదిక ఇక్కడ పూర్తిగా నాశనం కాలేదు. పార్లమెంటరీ సభ్యులు, ప్రాంతాల వారీగా ఓటర్లవల్ల ఎన్నుకోబడుతున్నప్పటికీ, నియోజక వర్గాలకు బాధ్యులుగా, సిద్ధాంతరీత్యా అయినా సభ్యులు ప్రవర్తిస్తున్నారు. బ్రిటన్ లో కూడా, పార్టీ విధానంలో స్థిరత్వం పోయింది. రెండు పార్టీలలో చీలికలు వచ్చాయి. వాటి కార్యక్రమాలు పలచబడినాయి. వాటి విభేదాలు ఎక్కువైనాయి. ఫలితంగా, వెస్ట్ మినిస్టర్ కేంద్రం రాజకీయ క్రీడారంగంగా లేదు. ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం, పార్లమెంటులో తరచు రాజకీయ ఆటలో నియమాలను పాటించటంలో, నియమాలను పాటించటం లేదని పరస్పరం నిందించుకుంటారు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఎన్నికలు జరిగిన తరవాత, లేబర్ పార్టీ ఆధిక్యత సన్నగిల్లటం వల్ల, పార్లమెంటరీ పద్ధతులను సరిగ్గా పాటిస్తే అధికారంలో వుండే అవకాశమే ఆ పార్టీకి లేకుండా పోయింది. రెండు మాసాలలోనే కొత్త ఎన్నికలు జరగవచ్చునని అనుభవజ్ఞులైన శాస్త్రజ్ఞులు జోస్యం చెప్పారు. సంప్రదాయబద్ధమైన పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తే అలా జరిగి ఉండవలసింది. భద్రత లేకుండా పార్లమెంటులో ఉన్న ప్రభుత్వం ఏదైనా దీర్ఘకాలిక శాసనాలను చేబట్టలేదు. పార్లమెంటులో పార్టీకి అంత స్వల్పాధిక్యత ఉన్నప్పుడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని రద్దు గావించటమే జరుగుతుంది. పార్టీ సభ్యులకు స్వతంత్ర నిర్ణయం చేసే హక్కు గాని, ఆచరించే స్వాతంత్ర్యం గానీ ఏమీ లేదు. విపరీతమైన పరిస్థితులలో కూడా ఇది సంభవించదు. పార్టీ ఆదేశాన్ని ప్రతి సభ్యుడూ ఏ పరిస్థితులలో నైనా పాటించేటట్లు చూస్తారు. లేకుంటే కొంతమంది సభ్యులు ప్రతిపక్షం వైపుకు పోవచ్చు. లేదా ఏదైనా సమస్య మీద ఓటు వేయకపోవచ్చు. అస్థిరమైన పార్లమెంటరీ విధానంలో ఎన్నికైన ప్రతినిధులు తమ నియోజకవర్గ ప్రజల వాంఛలు ఎలా ఉన్నాసరే పార్టీకి లొంగి ఉండవలసిందే. ప్రజల సార్వభౌమత్వాన్ని పార్టీ ఎలా కాజేస్తుందో గమనించవచ్చు. ప్రజాస్వామ్య సంప్రదాయం చిరకాలంగా పాతుకుపోయిందనుకున్న బ్రిటన్ లోనే ఇలా జరుగుతున్నది.
పార్లమెంటులో ఆరేడు ఓట్లు అధికంగా ఉన్నంత మాత్రాన ఎక్కువమంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే హక్కు చట్టరీత్యా గానీ, నైతికంగా గాని ప్రభుత్వానికి లేదు. అంతేగాక పార్లమెంటులో అల్పసంఖ్యాధిక్యతలో ఉన్నంత మాత్రాన, 55 లేక 60 శాతం ప్రాతినిధ్యం గలవారు, మిగిలిన వారిని అల్పసంఖ్యాకులు అంటూ, స్వారీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నదా అని పరిశీలించాలి. లాంఛన ప్రజాస్వామ్యంలో ఇదొక మౌలిక దోషం.
లోగడ పెద్దమనుషుల్లా రాజకీయ క్రీడారంగంలో పాల్గొన్న పార్టీ నాయకులు ఉన్నప్పుడు, 1950లో ఎన్నిక సృష్టించిన పార్లమెంటరీ స్థితి బ్రిటన్ లో కొనసాగేదే కాదు. ప్రజల నుంచి స్పష్టమైన అభిప్రాయ సేకరణ కోసం ఉభయ పార్టీలు ఎన్నిక జరపాలని అంగీకరించేవే.
కాలానుగుణంగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటించక, లోపాయికారీగా ప్రతిపక్షం కూడా ఆమోదించగా, లేబర్ పార్టీ అధికారంలో కొనసాగింది. కొత్త ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో ఎవరికీ హామీ లేదు కనక ఇటువంటి అంగీకారానికి వచ్చారు. రెండు పార్టీల మధ్య సార్వభౌములైన ప్రజలకు కొత్త పార్లమెంటును ఎన్నుకునే హక్కు లేకుండా పోయింది. ఎన్నిక జరిగితే దేశానికి స్థిరమైన, స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడి ఉండవచ్చు. పార్లమెంటరీ అవకాశవాద ఆటలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర ప్రభుత్వం ఉండేదే.
ఇనుమూ, ఉక్కు పరిశ్రమను జాతీయం చేయాలనేది, ఓటర్ల నుంచి స్పష్టమైన అభిప్రాయం రానిదే, వత్తిడి చేయబోమని లేబర్ ప్రభుత్వం ఒక విధమైన అభిప్రాయాన్ని సృష్టించింది. దీనివలన ప్రతిపక్షం ప్రభుత్వం విదేశీ విధానానికి మద్దత్తు నిచ్చింది. మితవాదులు, ఉదారవాదులు కూడా లేబర్ ప్రభుత్వ విదేశీ విధానానికి చిత్తశుద్ధితో బలాన్ని చేకూర్చాయి. అంతర్జాతీయ సోషలిజాన్ని పెంపొందించే దృష్టి లేబర్ పార్టీ విదేశాంగ విధానంలో లేక పోవటమే ఇందుకు కారణం.
కానీ సంవత్సరాంతంలోగా ఉక్కూ, ఇనుమూ పరిశ్రమ జాతీయీకరణ బిల్లు విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షాలతో కలిసి పయనించలేకపోయింది. పార్లమెంటులో వచ్చిన ఒప్పందం నిరవధికంగా నిలవలేదు. లేబర్ పార్టీలోని శక్తివంతమైన వామపక్షం ఈ బిల్లుకోసం వత్తిడి చేసింది. ఆ తరవాత వచ్చే ఎన్నికలలో, సంపూర్ణ సోషలిస్టు కార్యక్రమాలతో రంగంలోనికి దిగితే, పార్టీకి అత్యధిక బలం చేకూరుతుందని వారు వాదించారు. పార్టీలో అతి నిర్దాక్షిణ్యంగా, క్రమశిక్షణ కొరడాను ఉపయోగించి అతి ముఖ్యమైన శాసనాలను పార్లమెంటు ఆమోదం పొందేటట్లు చేసారు. అంతంత మాత్రంగా సాగిన ప్రతిపక్షాల అంగీకారం అంతటితో అంతమయింది. (1215లో జాన్ ప్రభువు హక్కుల పత్రంపై సంతకం చేసినప్పటి నుంచీ, పార్లమెంటుకు పునాదులు ఏర్పడినవి.) పార్లమెంటుల మాతృస్థానమైన ఇంగ్లండ్లో అప్పటి నుంచీ పార్టీ విధానంలోని అసలు రంగు బయటపడింది. విచక్షణారహితంగా అధికార పోరాటం జరిగింది.
అధిక సంఖ్యాకులు, అల్ప సంఖ్యాకులు అనే విషయంలో వచ్చిన కలహాల దృష్ట్యా, బలాబలాలు తేల్చుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబడడంలో అర్థం లేకపోలేదు. పార్లమెంటులో గాకపోయినా, దేశంలో స్పష్టమైన బలం ఉన్నదని నిరూపించుకోవాలంటే ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉన్నది. కానీ పార్టీ క్రమశిక్షణను ప్రయోగించి, అధికారంలో కొనసాగటానికి లేబర్ పార్టీ నిర్ణయించుకొన్నది. వెంటనే ఎన్నిక జరిగితే ఓడిపోతామనే భయం ఉండటంవల్ల, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానానికి అవకాశం వచ్చినట్లు  భాష్యం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి, రాజ్యాంగబద్ధంగా అవసరమైన జన వాక్యాన్ని ప్రభుత్వం కోల్పోయిందని అంగీకరించినట్లే, అయినప్పటికీ ప్రాతినిధ్యపు ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు కల్పించలేదు.
దేశంలో తన స్థితి గురించి ఏ మాత్రం హామీ ఉన్నా లేబర్ పార్టీ, ప్రజాస్వామికంగా సందేహాస్పదమైన నైతికంగా తగని, విధానానికి దిగవలసింది కాదు. ఎన్నికలు జరిగితే, తాను జయించగలననే, స్థితి వచ్చేవరకూ అధికారంలో కొనసాగాలను కోవటం వల్లనే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, నిర్దాక్షిణ్యంగా అణచివేసింది.
పార్లమెంటులో అధిక సంఖ్యలేనిదే, ఏ ప్రభుత్వం కూడా సరైన ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదు. ఇది కూడా ఐచ్ఛికంగా జరగాలి. లేబర్ పార్టీ, తన సభ్యుల నిర్ణయానికి వదిలివేస్తే, అనేక సమస్యలపై - అవి ప్రతిపక్షం వారు చేపట్టని వైనప్పటికీ - ఓడిపోయి ఉండేది. పార్టీ అదుపులో ఉన్న ప్రభుత్వం, పార్టీ సభ్యులు ప్రజాస్వామికంగా ప్రవర్తించనివ్వకుండా అధికారంలో కొనసాగుతున్నప్పుడు, అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు.
పార్లమెంటు రాత్రంతా సమావేశం జరిపేటట్లుచేసి, ప్రభుత్వ బలం సన్నగిల్లడానికి దోహదం చేసే ప్రతిపక్ష ఎత్తుగడలు సందేహాస్పదమైనవి. లోగడ విదేశీ విధానంలో అనేక ప్రధాన సమస్యలపై ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చిన ప్రతిపక్షం, ఏదో సాధారణమైన సమస్యను ఆధారంగా అతి స్వల్ప తేడాతో ప్రభుత్వాన్ని ఓడించాలని చూస్తున్నాయి. ప్రతిపక్షాలిచ్చే ఇబ్బందికర పరిస్థితిని పార్లమెంటరీ విధానంలో అంతం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. అయినా ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వానికి సందేహంగానే ఉన్నది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టడానికి, ప్రభుత్వం ఏదన్నా చేయకముందే ఎన్నిక పెడితే గెలుస్తామని ప్రతిపక్షం భావిస్తున్నది. ఓటర్లలో అత్యధిక సంఖ్యాకులను ఆకర్షించటానికి, ఉద్రేక పూరితంగా నినాదాలివ్వటానికి ఏదైనా సమస్యను వారు వెతుక్కుంటున్నారు. అధికారం కోసం పెనుగులాడుతున్న పార్టీలు ఇంచుమించు సమ ఉజ్జీలైనప్పుడు అసలు సమస్యలేమిటో తెలుసుకోవటం ఓటర్లకు కష్టమైపోతున్నది. నిష్పాక్షికంగా, వివేచనతో నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కన్పించటం లేదు. ప్రజాస్వామ్యాన్ని చెడగొట్టటంలో, నాశనం గావించటంలో పార్టీవిధానం అలా పనిచేస్తున్నది.
అధికారాన్ని పట్టుకోవటం, నిలబెట్టుకోవడం పార్టీల ఉద్దేశ్యం. పార్లమెంటరీ విధానం లాంఛన ప్రాయమైన పద్ధతులతో ఇటువంటి అవకాశాలను కల్పిస్తున్నది. ఓటర్లలో, వివేచనా పరులు అత్యధిక సంఖ్యలో బలపరచవలసిన అవసరం లేకుండా పోతున్నది. లాంఛనప్రాయమైన పార్లమెంటరీ విధానంలో ఎన్నికల మోసాలు, పార్టీ విధానంలో అంతర్గతంగా ఉండటం వల్ల విధిగా వీటిని చేస్తుంటారు. ఒక పార్టీగాని, లేదా పార్టీల సంకీర్ణ ప్రభుత్వంగానీ ఓటర్ల మద్దత్తు విషయమై సందేహించనప్పుడు, ఎన్నిక తప్పదన్నప్పుడు అధికారంలో ఉండగానే ఎన్నిక చట్టాన్ని సవరించి, ప్రతిపక్షానికి అవకాశాలు తగ్గిపోయేటట్లు చేస్తారు. ఫ్రాన్సులో ప్రజాస్వామ్యాన్ని ఇలాగే దిగజార్చారు. ప్రజాస్వామ్య రక్షణ పేరిట జరిగిన తొక్కిసలాట ఫలితమిది.
రాజ్యాంగరీత్యా ఫ్రాన్సులో పార్లమెంటు పరిమితి పూర్తయినందువల్ల సాధారణ ఎన్నిక జరగవలసి ఉన్నది. (1951లో). ప్రస్తుత పార్లమెంటులో కమ్యూనిస్టులు చాలా సంఖ్యలో ఉన్నారు. కనక ఎన్నికల అనంతరం అయినప్పటికీ ప్రస్తుత పార్లమెంటులోని సంకీర్ణ ప్రభుత్వంలో వారిని చేర్చవలసివచ్చింది. కాని రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకొనే దానికి తగిన సంక్షోభాన్ని సృష్టించగలమనే ఆశతో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని వదలి వెళ్ళారు. ఆ సాహసకార్యంలో విఫలమై, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నిష్పత్తి ప్రాతినిధ్యం పద్ధతివల్ల వచ్చే పార్లమెంటులో సోషలిస్టులను దెబ్బకొట్టి, ఇంకా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కమ్యూనిస్టులకున్నది. ఈలోగా రంగం మీద డిగాల్ పార్టీ ప్రత్యక్షమైనది. ప్రస్తుత పార్లమెంటులో ద్వితీయ స్థానంలో ఉన్న, రిపబ్లికన్ పార్టీ నుంచి ఎక్కువ స్థానాలు చేజిక్కించుకొనే ధోరణి డిగాల్ పార్టీ కనబరిచింది. ప్రస్తుతం ఉన్న కేంద్ర పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కొత్త పార్లమెంటులో అధికారంలో కొనసాగే అధికారం లేదు. లోగడ రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ప్రాతినిధ్య నిష్పత్తి విధానాన్ని, కమ్యూనిస్టులకు, డిగాల్ పార్టీకి లేకుండా చేయడం తప్ప, మరో అవకాశం కన్పించలేదు. ఎన్నికల చట్టం సవరిస్తే కమ్యూనిస్టులు, (ఛార్లెస్ డిగాల్ 1870-1970. మొట్టమొదట డిగాల్ తాత్కాలిక ప్రభుత్వాధిపతిగా రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉన్నాడు. 1958లో అల్జీరియా సంక్షోభ సమయంలో ప్రధానిగా కొత్త రాజ్యాంగానికి ప్రజాభిప్రాయం పొందాడు. 1969 ఏప్రిల్ లో జనవాక్య సేకరణ జరిగినప్పుడు పదవికి రాజీనామా ఇచ్చాడు) డిగాల్ పార్టీ కలిసి కొత్త పార్లమెంటులో 60 శాతం వరకూ సీట్లు, హస్తగతం చేసుకోవచ్చునని అంచనా వేశారు. ఫ్రాన్సులో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంతటితో స్వస్తి పలికినట్లే.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంటుందా, ఊడుతుందా అనే స్థితి వచ్చినప్పుడు కూడా, సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్ధించే, ఎన్నికల చట్టానికి చేయవలసిన చట్టాన్ని గురించి అంగీకారానికి రాలేకపోయారు. అధికారంలో ఉండగా, అందుబాటులో ఉన్న అవకాశాలకోసం, తాపత్రయ పడటం వల్ల సంకీర్ణ ప్రభుత్వం ప్రధాన సమస్యలు పట్టించుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితి ఇంకా అధ్వాన్నం అయింది. తుదకు ఒక అంగీకారం కుదిరింది. వచ్చే పార్లమెంటులో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు బలం చేకూరే పద్ధతులలో ఎన్నికల చట్టం సవరించారు. ఎన్నికలలో దుర్వినియోగ పద్ధతులు అవలంబించటానికి అవకాశాన్ని తీసుకున్నారు. ఏ విధంగానైనా సరే, నియంతృత్వ పక్షాలను అధికారంలోకి రానివ్వరాదనే నెపంతో, ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులను సమర్ధించుకొన్నారు. వాస్తవానికి ప్రతిపక్షాల అధికారాన్నే ఉంచదలచి ఇదంతా చేశారు. ప్రజాస్వామ్యాన్ని, నాశనం చేయకుండానే, ఇదంతా చేయకపోతే ఏమయ్యేది… అధికారంలో ఉన్న పార్టీలు అలాగే కొనసాగటానికి కొత్త ఎన్నికల చట్టాన్ని ఉద్దేశించారు. ఓటర్ల అభిప్రాయంలో నిమిత్తంలేదు. పాత చట్టాన్ని అనుసరించి, ప్రజాభిప్రాయాన్ని సరిగా ప్రతిబింబింప చేయటం లేదనుకుంటే, కొత్త చట్టంలో పరిస్థితి మెరుగుకాలేదు. అధికార పెనుగులాటకోసం, పార్టీ రాజకీయాలు సాధనగా ఉపయోగించుకోవటానికే రెండు చట్టాలు తోడ్పడ్డాయి. పోనీ ఎన్నిక స్వేచ్ఛగా జరిగే హామీ ఉన్నదా అంటే, పార్టీల ఎత్తుగడవల్ల ప్రజాభిప్రాయం తప్పుగా చూపిస్తున్నారు.
ఐరోపాలో ఉన్న భద్రతా రాహిత్యత అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఇంకా చేరలేదు. కాని అక్కడ కూడా ప్రజల వివేచనాయుత అభిప్రాయం పార్టీ విధానంలో ప్రతిబింబించటం లేదు. కిందటి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. అయినప్పటికీ డెమోక్రటిక్ పార్టీ అభిప్రాయాలమీద, విధానాలమీద ఓడిపోయిన పార్టీ ప్రభావం ఉంది అంటే డెమోక్రటిక్ పార్టీ ప్రజలిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నదన్నమాట. వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పించుకోవటం కోసం ఇలా చేస్తున్నది. ఇదొక నియమాలు లేని ఆచరణ విధానం. ఆమెరికాలలో రెండు పార్టీల విధానమనేది (ప్రస్తుతం డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ ప్రధాన పక్షాలుగా ఉన్నప్పటికీ మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. సోషలిస్టు, కమ్యూనిస్టు, లిబర్టేరియనం, పీపుల్స్, లేబర్ మొదలయిన రాజకీయ పక్షాలు కూడా ఉన్నవి. ఇవి ఇంతవరకూ ఎన్నడూ అధికారంలోకి రాలేదు.) కేవలం నమ్మించటం కోసమే. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం తప్ప ఈ విధానం వల్ల మరే ప్రయోజనం లేదు. అక్కడ ప్రజాస్వామ్యం రెండు పక్షాల గుత్తాధిపత్య పాలనగా దిగజారిపోయింది.
మన దేశంలో పార్టీ విధానం ఇంకా బాల్యావస్థలో ఉన్నది. ప్రస్తుతం ఒకే పార్టీ పరిపాలన ఉన్నది. (కాంగ్రెసు పార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్య చేశారు. 1976లో వచ్చిన జనతా ప్రభుత్వం రెండేళ్ళపాటు కేంద్రాన్ని పరిశీలించింది) అది కొనసాగించాలనే కోరికలో రహస్యం ఏదీలేదు. పార్లమెంటరీ విధానం ఉన్నప్పటికీ ఒకే పార్టీపాలన ప్రజాస్వమ్యానికి వ్యతిరేకమే. రాజ్యాంగంలో ఏమి వ్రాసినప్పటికీ అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రజాస్వామ్యం, కాంక్షిస్తూ మాట్లాడినప్పటికీ, అధికారంలో ఉన్న పక్షం నియంతృత్వ పోకడలు గలదే. జాతి అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పార్టీ పేర్కొంటున్నది. జాతి అంతా ఒకటే కనక, అవిభాజ్యం కూడా, అధికార పక్ష సభ్యులతో కూడిన వారు పార్లమెంటులో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగం కేవలం పెత్తనం చేయదని హామీ ఏదీలేదు. (రాజ్యాంగ సభ అనేది సరైన మాటకాదు) సర్వ సత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్ అయిన భారతదేశంలో చాలా పవిత్రంగా పేర్కొన్న ప్రాథమిక చట్టంలో కొన్ని ‘ప్రాథమిక హక్కులు’ ఇచ్చారు. అయితే నిర్మాణ వ్యవస్థను మార్చాలంటే కూలద్రోయవలసిందే. కాని అధికారంలో ఉన్న పార్టీకి తర్కబద్ధమైన ఆలోచన ఉండదు. ‘ప్రాథమికహక్కులు’ కొన్ని సవరించి స్వేచ్ఛకు అదుపులు పెడతారు. ఏకపక్ష పాలన ఆధిక్యతను ప్రశ్నించే అవకాశం ప్రస్తుతం ఉన్నది. న్యాయస్థానాల స్వాతంత్రాన్ని గూడా తగ్గించే ఆలోచనలు చేస్తున్నారు.
అర్హతలేని సభవారు రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ సభ ఎన్నికలో వచ్చినదికాదు. అందరికీ ఓటుహక్కు ఉన్న దృష్ట్యా, పార్లమెంటు ఎన్నికవల్ల ఏర్పడుతుంది. కనుక అప్పటివరకూ రాజ్యాంగ సవరణకోసం ఆగవలసి వచ్చింది. ఈలోగా, సర్వధికారాలుగల ప్రభుత్వం పడిపోయే పరిస్థితేమీ లేదు. అయినప్పుడెందుకీ తొందర? దేశంలో అభిప్రాయం ఏదైనా కానీ, కాలదోషం పట్టిన పార్లమెంటుపై పూర్తి అధికారంగల పార్లమెంటరీ పార్టీ ఏదైనా ఆమోదింపజేసుకోవచ్చు. ప్రజల సార్వభౌమత్వాన్ని పార్టీ కాజేసిందనటానికి యింతకంటె మచ్చుతునక మరొకటిలేదు.
పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం గూడా నాశనమవుతుంది. అసలు అది వున్నదనే అంతంతమాత్రం కాంగ్రెసు హైకమాండ్ ఆదేశాన్ననుసరించి పార్లమెంటులో పార్టీ సభ్యులు స్వేచ్ఛగా మాట్లాడటానికి వీలులేదు. సభ్యులు పార్టీకి బాధ్యులు. పార్టీ రహస్య సమావేశాలలోనే విమర్శను అనుమతిస్తారు. నిందితుడే న్యాయమూర్తి అన్నమాట.. పార్లమెంటు ఉన్న స్థితినిబట్టి ప్రజలు శాసనాలపైన గానీ, పరిపాలనా శాఖపైన గానీ అదుపు పెట్టడానికి అధికార పక్షాన్ని సాధనగా వాడుకోవాలి. ప్రజలలో పెరుగుతున్న నిస్పృహను కొందరు అధికారపార్టీ సభ్యులు ప్రతిధ్వనిస్తున్నారు. ఎన్నికైన సభ్యులుగా అది వారికి నిరాకరించటానికి వీలులేని హక్కుమాత్రమేగాక వారి విధి కూడా ...కాంగ్రెసుపార్టీ గౌరవ సంప్రదాయాలు… కోసం ఎన్నికైన సభ్యులను ప్రజాస్వామికంగా ప్రయత్నించనివ్వడంలేదు. అవధులులేని ప్రజావాణి కపటంతో కూడిన జాతీయ ఐక్యత అనే మేళవింపును గందరగోళ పరచవచ్చు. కనక అటువంటిది అణచివేయాలి. పార్టీ క్రమశిక్షణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని చెరుస్తున్నారు. ప్రజా స్వామ్యానికీ, పార్టీ విధానానికీ గల వైవిధ్యానికి ఇంతకు మించి మరే ఉదాహరణ అక్కరలేదు.
రాజకీయ పార్టీలు అధికారం హస్తగతం చేసుకోటానికే తప్ప, ప్రజాస్వామ్యాన్ని ఆచరించటానికి ఏర్పడటంలేదు. లక్ష్యం కోసం ఏ సాధనైనా సమర్థనీయమేనని వారంటున్నారు. గతంలోనూ, ప్రస్తుతం కూడా అనేక దేశాల అనుభవాన్ని బట్టి పార్టీలు అనుసరించే పద్ధతులు అవినీతికి దారితీస్తాయని ప్రజాస్వామ్యాన్ని నాశనం గావిస్తాయని రుజువయింది.  

     రచయిత అనువాదం
ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య