తెలంగాణా ఊసెత్తని చెన్నారెడ్డి
(1919 – 1996)
దేవర్స్ బాబా కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా. చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో సెక్యులరిస్ట్ ఇంగ్లీషు మాస పత్రికలో ముఖచిత్రంగా వేశారు. అప్పట్లో దానికి ఎడిటర్ ప్రొ. ఎ.బి. షా. అది చెన్నారెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన ఆగ్రహంతో ఊగిపోయి, ‘పిలవండి.. ఆ ఇన్నయ్య ఎక్కడ ఉన్నాడో, సంగతేంటో తేల్చుకుందాం’ అన్నాడు. నాకు కబురు చేశారు. వెళ్ళాను. ఆ పత్రికను చూపి విసిరికొట్టి, నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అన్నాడు.
నేను ప్రశాంతంగా ఆయన షష్ఠి పూర్తి సంచిక తీసి, అందులో రంగుల చిత్రంగా పూర్తి పేజీలో వేసిన దేవర్స్ బాబా కాలు పెట్టి దీవించిన చిత్రం ఆయన ముందు పెట్టాను. అది చెన్నారెడ్డి ఆమోదంతో ఆయన అభిమాని పరమహం తయారు చేసిన సవనీర్. చెన్నారెడ్డి అవాక్కయిపోయాడు. ఆగ్రహంలో వివేచన మరచిపోవటం సహజం.
చెన్నారెడ్డికి నాకు సన్నిహిత పరిచయం 1958 నుండి మొదలైంది. ఆది నుండి అది లవ్ – హెట్ సంబంధంగానే కొనసాగింది. స్వతంత్ర పార్టీ ఆవిర్భవించిన తొలి రోజులలో విజయవాడలో ఆచార్య రంగా మొదలైన వారి సమక్షంలో జరిగిన సభలో చెన్నారెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఉండేబదులు, కృష్ణలో దూకి చావటం మేలని చప్పట్ల మధ్య ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన మాట్లాడిన సభలో నేను, ఎస్.వి. పంతులు మొదలైన వారంతా ఉన్నాము. అప్పుడే చెన్నారెడ్డితో నా తొలి పరిచయం. ఆ తరువాత ఆయన చనిపోయే వరకూ అన్ని పరిస్థితులలోనూ కలుస్తూనే ఉన్నాము.
మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రాసినప్పుడు కూడా చెన్నారెడ్డి పదవిలో ఉండగా అవినీతి విషయాలను ప్రస్తావించిన సంగతులు కొందరు ఆయన దృష్టికి తీసుకు వెళ్ళారు. నా పుస్తకాన్ని విసిరి గొట్టినట్లు అక్కడ ఉన్నవారు చెప్పారు. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి రాకముందు, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సారధిగా ఆయన వుర్రూత లూగించినప్పుడు ఎన్నిసార్లు కలిశానో చెప్పలేను. నా మీద ఎంత కోపమున్నా, మరొక పక్క ఆదరంగానే చూడేవాడు. తెలంగాణా ఉద్యమం తారా స్థాయిలో ఉండగా కొందరు ఆంధ్రా మిత్రులు ఆయన్ను కలవాలని కోరిక వెల్లబుచ్చారు. అడ్వకెట్ ఎన్.కె. ఆచార్య, మానవ వాది కొసరాజు సాంబశివరావు, జర్నలిస్ట్ ఎ.ఎల్. నరసింహారావు వారిలో ఉన్నారు. ఆ నాడు చెన్నారెడ్డి ఒక టెర్రర్. ఆంధ్రులు ఆయన్ని కలిసేవారు కారు. నేను వీరిని వెంట బెట్టుకుని లాలాపేటలో ఆయన గృహాలకు వెళ్ళినప్పుడు, ‘మీరంతా తెలంగాణా వారితో కలిసి ఉద్యమంలో పాల్గొంటే మీ జోలికి ఎవరూ రారు’ అని సలహా చెప్పారు. వెళ్ళినవారు మౌనంగా వచ్చేశారు. నేను తరువాత ఆయనతో, అయితే తెలంగాణా వారితో ఉద్యమంలో కలియకపోతే ఏమైనా చేయవచ్చు అని సందేశం ఇస్తున్నారా అని అడిగాను. ఆయన కాసేపు కూర్చోబేట్టి ఆచార్య రంగా, లచ్చన్న మొదలైన వారి విషయాలు అడిగారు. మా ఇరువురికీ అవి కామన్ టాపిక్స్.
ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నిసార్లు చెన్నారెడ్డితో తారసిల్లానో చెప్పలేను. ఒకసారి జర్నలిస్ట్ కాలనీకి వచ్చినప్పుడు, ఆయన ఉపన్యాసం చెబుతూ, కొత్త జర్నలిస్ట్ కాలనీలు ఏర్పాటు చేద్దామని ఉందనీ, అయితే జర్నలిస్టుల పేర్లు పెట్టాలంటే సుప్రసిద్ధ తెలుగు వారి పేర్లు కనిపించటం లేదని అన్నారు. ఎం. చలపతిరావు కాలనీకి ప్రారంభోత్సవం చేస్తూ అన్న మాటలవి. కొండా లక్ష్మారెడ్డి నన్ను ధన్యవాదాల ప్రసంగం చేయమన్నాడు. అప్పుడు నేను మాట్లాడుతూ కొత్త జర్నలిస్టుల కాలనీలు ఇస్తామని అన్నందుకు చెన్నారెడ్డి గారికి ధన్యవాదాలని అంటూ ఎన్ని కాలనీలు పెడితే అంత మంది సుప్రసిద్ధ తెలుగు జర్నలిస్టుల పేర్లు చెబుతామని, ఉదాహరణగా నార్ల వెంకటేశ్వరావు, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, సి.వై. చింతామణి, ఖాసా సుబ్బారావు, అలా పేర్లు వల్లించారు. జనం చప్పట్లు కొట్టారు. చెన్నారెడ్డికి మళ్ళీ కొపం వచ్చింది. కానీ ఏమీ అనలేదు.
అనేక ప్రెస్ మీటింగులలో ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసేవాణ్ని. కొన్ని సార్లు ఆయన సమాధానం చెప్పటానికి కుదరక నీవే దానికి జవాబు చెప్పు అనేవాడు. మరోసారి ఢిల్లీ నుంచి తిరిగి బేగం పేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు చెన్నారెడ్డిని తొలగించి వేరే వారిని పెట్టబోతున్నారని వార్త ప్రబలింది. విపరీతంగా ప్రెస్ వారు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ పత్రికల వారిని కలిసినప్పుడు వారంతా ఆయనకు పదవి పోయినట్లు, సానుభూతిగా ప్రశ్నలు వేస్తుండగా నేను, కంగ్రాచ్యూలేషన్స్ చెన్నారెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారుగా అన్నాను. ఆయన నవ్వుతూ ఏమో నీకే తెలియాలి అని దాటేసి వెళ్ళిపోయారు. ప్రెస్ వాళ్ళు ఆశ్చర్య పోయారు. అక్కడ ఉన్న ఉమా వెంకట్రమ రెడ్డి సంతోషంగా, ఆశ్చర్యంగా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీరు చెప్పేది నిజమేనా అని ఆత్రుతగా అడిగారు. ఆ తరువాత కొన్నాళ్ళకు గాను చెన్నారెడ్డిని తొలిగించి అంజయ్యను పెట్టలేదు.
చెన్నారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దానికి ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు గాంధీ భవన్ లో కలిసేవాడిని. ఆ తరువాత ముఖ్యమంత్రిగా మరి కొన్ని సార్లు కలుసుకొన్నాం.
చెన్నారెడ్డి రాగ ద్వేషాలు విపరీతంగా ఉన్న వ్యక్తి. ఆగ్రహావేశాలని దాచుకోకుండా వ్యక్తం చేసేవాడు. ఆయన్ను ప్రత్యేక ఇంట్రవ్యూలు చేసినప్పుడు జస్టిస్ట్ పింగళి జగన్ మోహన్ రెడ్డిని గురించి, కొందరు కాంగ్రెస్ నాయకుల గురించి చాలా ఘాటుగానే స్పందించేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి రోజులలో డాక్టర్ గా ప్రాక్టీసు పెట్టడం, పత్రిక నడపటం మొదలైన ఎన్నో విశేషాలు వివరంగా చెప్పేవాడు. ప్రత్యేక తెలంగాణాలో ఆయన పాత్ర వేరు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గవర్నర్ గా ఆయన దోరణి వేరు. రాజకీయాలలో అవినీతి అనే అంశం చెన్నారెడ్డి కాలంలో ఒక ప్రత్యేకమైన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తులాభారాలు, జరిపించిన తీరు జనాకర్షణ అయింది. చెన్నారెడ్డి నిర్భీతిగా వ్యవహరించేవారు. సభలలో తనకు ఇష్టమైనవారిని స్టేజిమీదకు పిలిచి కూచోబెట్టేవారు. అలాంటి అదృష్టం శ్రీమతి దుర్గా భక్తవత్సలం వంటివారికి దక్కింది. చెన్నారెడ్డి పదవిలో వుంటే క్షేమం అని వి.బి. రాజు అనేవాడు. శత్రువులను సైతం లోబరచుకున్న రాజకీయ చతురత ఆయనకున్నది. తనపై పోటీ చేసిన వందేమాతరం రామచంద్రరావును పిలిచి అధికార భాషాసంఘాధ్యక్షుణ్ణి చేసిన చెన్నారెడ్డి, అరమరికలు లేకుండా తన మామ పేరిట కె.వి.రంగారెడ్డి జిల్లా అని రూపొందించారు. మార్క్సిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజి బోర్డు ఛైర్మన్.గా ఒప్పించటం చెన్నారెడ్డికే తగింది.
దేశ ఆర్థిక భవిష్యత్తును మార్చిన పి. వి. నరసింహారావు
Posted by
innaiah
on Saturday, April 10, 2010
పి. వి. (1921-2004)
“ఈ పాములు, తేళ్ళ బాధ పడలేకుండా ఉన్నాము” అని జి.సి.కొండయ్య (ప్రముఖ జనతా నాయకుడు) ఆరోజులలో వ్యాఖ్యానించేవారు. మొదట్లో ఆమాటలకు అర్థం తెలిసేది కాదు. తరువాత పాములపర్తి వెంకట నరసింహారావు, తేళ్ళ లక్ష్మీకాంతమ్మ సన్నిహిత సహచర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడని గ్రహించాము. నవ్వుకున్నాము.
పి.వి. నరసింహారావు విద్యామంత్రిగా బ్రహ్మానందరెడ్డి కేబినెట్.లో నాకు పరిచయం అయింది. తెలుగు విద్యార్థి మాసపత్రిక (ఎడిటర్ కొల్లూరి కోటేశ్వరరావు, మచిలీపట్నం) ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలూ ఆయన చాలా చక్కగా చెప్పేవాడు. అలా మొదలై క్రమేణా సన్నిహితులమయ్యాము. 1968లో నాటి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడు (లోగడ తెలుగు స్వతంత్ర సంపాదకుడు) గోరాశాస్త్రికి కర్నూలులో 50వ జన్మదినం జరిపినప్పుడు ముఖ్య అతిథిగా పి.వి. నరసింహారావును తీసుకెళ్ళాము. నాడు కోట్ల విజయభాస్కర రెడ్డి జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉండేవాడు. వ్యవసాయ శాఖాధికారి మండవ శ్రీరామమూర్తి, తెలుగు భాషా సంఘాధికారి సి. ధర్మారావు, నేనూ పూనుకొని సన్మానం చేసి గోరా శాస్త్రికి కొంత ఆర్థిక సహాయం చేయగలిగాము. ఒక సంచిక కూడా వెలువరించాము. ఆ సభలో పి.వి. నరసింహారావు గొప్ప ఉపన్యాసం చేశారు. ఆయనతో చాలా సేపు నేను కాలక్షేపం చేసి అనేక విషయాలు అడిగాను.
హైదరాబాదులో ఆయన మంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు వివిధ సందర్భాలలో గోరాశాస్త్రి, తేళ్ళ లక్ష్మీకాంతమ్మలతో కలసి పి.వి. దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ అయింది. తేళ్ల లక్ష్మీకాంతమ్మ మా కుటుంబానికి సన్నిహిత స్నేహితురాలు. ఆమె చిరకాలంగా రాజకీయాలలో ఉంటూ పి.వి. దగ్గరైంది. చాలా చనువుగా కొన్ని పర్యాయాలు చులకనగా పి.వి. నుద్దేశించి మాట్లాడేది. అది చాటున కాదు. ఎదటే. నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తరోత్తరా పి.వి. ఇంగ్లీషులో ది ఇన్ సైడర్ అనే నవల రాసి లక్ష్మీకాంతమ్మను ఒక పాత్రగా చేసి అన్యాపదేశంగా ఎత్తిపొడిచారు. అది గ్రహించిన లక్ష్మీకాంతమ్మ బాహాటంగానే ఆయనను ఖండించింది.
నన్ను రాడికల్ హ్యూమనిస్టుగానే పి.వి. పరిగణిస్తూ పోయారు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా నేను స్నేహపూర్వకంగా కలుస్తూ ఉండేవాడిని. చనువుగా ప్రశ్నలడిగేవాడిని. కానీ ఆయన దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఉదాహరణకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించబోయేముందు కొన్నాళ్ళు పి.వి.ని దూరంగా పెట్టింది. అప్పుడు హైదరాబాదు ఆదర్శనగర్.లో పి.వి. ఉండేవారు. ఆమెపై వ్యంగ్య విమర్శనాత్మక రచన ఒకటి తలపెట్టారు. నేను కలసినప్పుడు ఒకటి రెండు పేరాలు వినిపించారు. అయితే అది ఇందిరాగాంధీని ఉద్దేశించిందా అని అడిగితే చెప్పలేదు. ఈలోగా ఇందిరా గాంధీ పిలుపు రావడం, ఢిల్లీ రాజకీయరంగంలో పి.వి. ప్రవేశించడం కీలకపాత్ర వహించడంతో ఆమెపై ఆగ్రహాన్ని దాచేశారు.
విశ్వనాథ సత్యనారాయణ సుప్రసిద్ధ నవల వేయిపడగలు హిందీలో సహస్రఫణి శీర్షికన పి.వి.నరసింహారావు అనువదించారు. నేను ఒకటి రెండుసార్లు ఈ విషయమై నిరసనను ఆయనకు సూచన ప్రాయంగా తెలియజేసాను. ఆయనేమీ అభ్యంతర పెట్టలేదు. అయితే హైదరాబాదు ఆకాశవాణిలో హిందీ విభాగంలో రామమూర్తి రేణూ పనిచేస్తుండేవారు. అదే విభాగంలో నా మిత్రుడు దండమూడి మహీధర్ ఉన్నందున నేను వెళ్ళి, రామమూర్తిగారిని కూడా పలకరిస్తుండేవాడిని. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే సహస్ర ఫణి ఆయన రాస్తున్నాడని. కొన్నాళ్ళ తరువాత అది పి.వి.నరసింహారావు పేరుతో ప్రచురితమైంది. ఇరువురిలో ఎవరు ఏమేరకు అనువదించారో వివరాలు తెలియవు. రామమూర్తిగారిని ఒకసారి ఆ విషయం ప్రస్తావించి మీరు అనువదిస్తున్న సహస్ర ఫణి పి.వి.గారి పేరుతో వచ్చిందేమిటి? అంటే ఆయన మౌనమే సమాధానంగా ఇచ్చారు.
శాసనసభలో, లోక్ సభలో పి.వి. చాలా బాగా రాణించిన రాజకీయవాది. ఆయన బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. పత్యేక తెలంగాణా ఉద్యమంలో సమైక్యవాదిగా నిలబడ్డారు. తరువాత ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవి చూచారు.
ఆయన కేంద్రానికి వెళ్ళిన తరువాత నేను కలుసుకోవటం తగ్గింది. హైదరాబాదు వచ్చినప్పుడు రాజభవన్.లో కొన్నిసార్లు కలిసి మాట్లాడాము.
పి.వి.ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి అమెరికా రాజధాని వాషింగ్టన్.కు వచ్చి అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు (దానిని హౌస్ అంటారు.) నేను ప్రెస్ లాబీలో ఉండి ఆయన ప్రసంగం విన్నాను. బాగా మాట్లాడారనిపించింది. ఆరోజులలో నేను వార్త దినపత్రిక విదేశీ ప్రతినిధిగా వాషింగ్టన్.లో ఉన్నాను. అటువంటి అక్రెడిషన్ రావడానికి మిత్రులు, వార్త ఎడిటర్ కె.రామచంద్రమూర్తిగారు తోడ్పడ్డారు. అక్కడనుండి తరచు వార్త వ్యాసాలు, ఇతర విశేషాలు పంపగా ప్రచురించేవారు. ఆశ్చర్యమేమంటే దేశప్రధానిగా పి.వి.మాట్లాడితే మర్నాడు అమెరికా దినపత్రికలలో ఒకమాట రాలేదు. నేను అశ్చర్యపోయాను. అంత క్రితం చిన్న దేశాలైన దక్షిణ కొరియా వంటి దేశాల ప్రధానులు మాట్లాడితే ప్రముఖంగా ప్రచురించడం చూశాను. ప్రెస్ క్లబ్.లో కొందరిని కదిలించి చూస్తే పి.వి.బాగా మాట్లాడటం ప్రధానం కాదు. అందులో కొత్త అంశం కానీ, అగ్రరాజ్యాన్ని ఆకర్షించే ప్రతిపాదనలు కానీ లేనందువలన అశ్రద్ధకు గురైంది అని చెప్పారు. అదే సందర్భంగా ఆయన ఒక మ్యూజియం సందర్శిస్తే అది ముఖ్యమైన వార్తగా వేశారు. అప్పుడు పి.వి.ని కలిశాను. ఆయన వెంట కొందరు జర్నలిస్టులు వచ్చారు. అలా వచ్చిన వారిలో కల్యాణీ శంకర్ ఉన్నది. ఆమె హైదరాబాదులో జర్నలిస్టుగా యు.ఎన్.ఐ.లో సీతారాం దగ్గర పనిచేసింది. తరచు ప్రెస్ కాన్ఫరెన్సుల తరువాత నా దగ్గరకు వచ్చి వివరాలు వివరణలు అడిగి రాసుకునేది. ఆతరువాత ఆమె ఢిల్లీలో జర్నలిస్టుగా ఉంటూ చాలా ప్రముఖ స్థానాలు ఆక్రమించింది. పి.వి.కి బాగా దగ్గరైంది. ఒక సందర్భంలో ఆమెను పక్కన కూర్చుండపెట్టుకుని తిరుపతిలో కల్యాణమహోత్సవంలో కూడా పాల్గొన్నారు.
పి.వి. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్.ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. ఆ ఖ్యాతి పి.వి.కి దక్కాలి. మరొకవైపు బబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది.
పి.వి. వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని వాడటం విశేషం. ఆయన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. కొన్నిటిలో ఇది నిజమే. అలా ఉన్నప్పుడు సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి. పి.వి.లో మరొక కోణం ఏమంటే కళలు, సాహిత్యం, రసజ్ఞత పట్ల అభిరుచి ఉండటం.
పి.వి.కి చాలామంది సన్నిహితులుగా ఉండేవారు. కొంతమందికి పరోక్షంగా మరికొంతమందికి ప్రత్యక్షంగా సహాయపడ్డారు. తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుకు పద్మభూషణ్ ఇప్పించినప్పుడు ఇబ్బందికర సన్నివేశం ఏర్పడింది. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పి.వి. పట్టుబట్టి ఒప్పించారు.
పి.వి. ని గ్రామాలలో దొర అనేవారు. ఆయన దేశ్ ముఖ్. ఎన్నో ఎకరాల ఆస్తి సాగులేకుండా వృధాగా పడుండేది. దేశంలో పరోక్షంగా బి.జె.పి. మతతత్వాన్ని వెనకేసుకొచ్చినట్లు బబ్రీమసీదు సంఘటనతో విమర్శకులు ఆరోపణలు చేయకపోలేదు. తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని ఆయనపై నంద్యాల పార్లమెంట్ సీటు ఎన్నికలలో ఎన్.టి.రామారావు పోటీ పెట్టక పోవడం గమనార్హం.
రాజకీయ జీవిగా కాసు బ్రహ్మానంద రెడ్డి
Posted by
innaiah
on Saturday, April 3, 2010
ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి (1909-1994)
ఆద్యంతాలూ రాజకీయవాదిగా జీవతం గడిపిన కాసుబ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తనదైన ముద్రవేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుదామని విఫల ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ లో సంజీవరెడ్డి మంత్రి వర్గంలో తొలిసారి అమాత్యులుగా జీవితాన్ని ఆరంభించారు. అప్పటి నుండి చివరి వరకూ రాష్ట్ర కేంద్ర పదవులు ఎన్నో చేపట్టి కొనసాగారు.
1950 ప్రాంతాలలో ఆయన ప్లీడరుగా గుంటూరులో ఉన్న రోజులలో కలుసుకున్నాను. నేను ఎ.సి. కాలేజీలో విద్యార్థిగా ఉన్న సందర్భంగా నా సోదరుడు విజయరాజకుమార్ పెళ్ళి ఆహ్వనం కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉంటున్న బ్రహ్మానందరెడ్డి కాఫీ ఇచ్చి సాదరంగా కార్డు స్వీకరించినా పెళ్లికి మాత్రం రాలేదు. అంతకు ముందు ఎ.సి. కాలేజీకి ఎదురుగా ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్బులో రోజూ బ్రహ్మానందరెడ్డి వచ్చి పేకాడటం చూసేవాడిని. అదే ప్రాంగణంలో మా అన్న ఒక పుస్తకాల షాపు పెట్టారు. నేను తీరిక వేళల్లో కూర్చుని అమ్ముతుండేవాడిని. ప్రక్కనే బ్రహ్మానందరెడ్డి, సలాం, ఇంకా కొందరు గుంటూరు ప్రముఖులు పేకాడుతుంటే మధ్యమధ్యలో నేను కాసేపు నిలబడి వారి మాటలు వింటూండేవాడిని. ఒకసారి గమ్మత్తయిన సంభాషణ చెవిన పడింది. మదరాసు శాసన సభలో కౌన్సిల్ సభ్యుడుగానూ గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడుగానూ ఉన్న ప్లీడరు సలాం మంచి హాస్య ప్రియుడు. సంభాషణా చతురుడు. ఆయనను ఉద్దేశించి, ఏం సలాం, మరీ పాతిక్కీ – పరక్కీ కక్కుర్తి పడుతున్నావటగా అని బ్రహ్మానంద రెడ్డి ఒక విసురు విసిరాడు. వెంటనే సలాం – ఏం చేస్తాం, వందా, రెండువందలూ అయితే నీతో పనేంటయ్యా, బ్రహ్మానందరెడ్డి ఉన్నాడుగా అంటున్నారు మరి అనేసరికి అందరూ గొల్లున నవ్వారు. అలా సాగుతుండేవి వారి సరసాలు.
బ్రహ్మానందరెడ్డి క్రమంగా జిల్లా నుండి రాష్ట్రానికి ఎదిగారు. మొదటి నుండి ముఠా రాజకీయాల్లో మునిగి తేలారు. తొలుత సంజీవరెడ్డి కుడి భుజంగా రాజకీయాలలో చక్రం తిప్పి కీలక స్థానంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయనకు ఎదురు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో అత్యంత ప్రముఖ నాయకుడుగా కాంగ్రెసు పార్టీని చీలదీసి రెడ్డి కాంగ్రెసు అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆర్థిక వ్యవహారాల నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు.
బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను వివిధ సందర్భాలలో కలిశాను. తెలుగు విద్యార్థి (కొల్లూరి కోటేశ్వర రావు సంపాదకుడు) మాసపత్రికకు ఇంటర్వ్యూ చేసి ప్రచురించాము. పాత హైదరాబాదులో మత కల్లోలాలు జరిగినప్పుడు (1968) వివిధ సంఘాలను పిలిచి జూబిలీ హాలులో సంప్రదింపులు జరిపారు. అప్పుడు మానవ వాద సంఘం తరఫున నన్ను పిలవగా నాకు తోచిన సూచనలు ఇచ్చాను.
1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని బాగా దెబ్బ కొట్టింది. ఆయన, ఆయన మంత్రులూ ఒకదశలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భాలలో తేళ్ళ లక్ష్మీకాంతమ్మ (లోక్ సభ సభ్యురాలు), నేను కలసి బ్రహ్మానంద రెడ్డి దగ్గరకు వెళ్ళి మాకు తోచిన విషయం చెపుతుండేవాళ్ళం. ఆయన బంగళా నిర్మానుష్యంగా ఉండేది. కొంత కాలం ఆయన కుంగి పోయినట్లు కనిపించేవాడు. అలాంటప్పుడు కలుస్తుంటే ఎంతో సహాయపడినట్లుగా భావించేవాడు. అదే సందర్భంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కారులు కొందరు హైదరాబాదులో గోడలపై బ్రహ్మానంద రెడ్డి భార్య రాఘవమ్మను ఉద్దేశించి చాలా అసహ్యకరమైన, అశ్లీల, శృంగార నినాదాలు రాశారు. మేము నిరసన తెలిపాము. తెలంగాణాలో ప్రముఖ స్త్రీ నాయకురాళ్లు జె. ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి, సరోజినీ పుల్లారెడ్డి మొదలైనవారు అటువంటి నినాదాలను ఖండించి వారే స్వయంగా చెరిపివేయడానికి పూనుకున్నారు. అటువంటి క్లిష్ట దశలో మేము కలుస్తుండడం బ్రహ్మానందరెడ్డికి ఊరటనిచ్చింది.
రాజకీయవాదిగా బ్రహ్మానందరెడ్డి చాలా ముఠా కక్షలతో సంకుచిత ధోరణిలో ప్రవర్తించాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికపై, దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుపై ప్రభుత్వపరంగా దాడి చేసి అదుపు పెట్టాలని చూశాడు. వారికి ప్రకటనలు ఆపి వేయాలనుకున్నాడు. ప్రెస్ బిల్లు పెట్టి చర్యకు ఉపక్రమించగా మేము హేతువాద సంఘం పక్షాన తీవ్ర ప్రతిఘటన చేశాము. మామిడి పూడి వెంకట రంగయ్యని పిలిచి సభ జరిపి ప్రెస్ బిల్లును వై.యం.ఐ.యస్. హాలు సుల్తాన్ బజారులో ఎండగట్టాము. దీనిపై అఖిల భారత స్థాయిలో పత్రికలు ప్రతిధ్వనించాయి. బ్రహ్మానంద రెడ్డి ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి తప్పుకున్నారు.
బ్రహ్మానంద రెడ్డి జీవిత చరిత్రను కపిల కాశీపతి బ్రహ్మానంద యాత్ర పేరిట పెద్ద గ్రంథంగా వెలువరించారు. అందులో చాలా వివరాలు, నిశిత పరిశీలనలు చేశారు. అయినప్పటికీ దానిని బ్రహ్మానంద రెడ్డి స్నేహపూర్వకంగానే స్వీకరించటం విశేషం. జూబిలీ హాలులో సభ పెట్టి అందరికీ కాపీలు ఉచితంగా ఇచ్చి, ప్రసంగాలు విన్నారు. నేతి చలపతి అధ్యక్షతన బ్రహ్మానందరెడ్డిపై ఒక విచారణ సంఘాన్ని కాంగ్రెసు కమిటీ నియమించింది. ఆయన జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉండగా అరాచక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉండగా అవి చాలా వరకూ వాస్తవాలని నేతి చలపతి కమిటీ నిర్ధారించిందట. ఆ విషయం నిజమేనా అని నేను బ్రహ్మానందరెడ్డిని అడిగితే టోపీ వెనక నుంచి ముందుకు తిప్పి నవ్వి సమాధానం దాటేసేవారు. అసెంబ్లీలోనూ బయట బ్రహ్మానంద రెడ్డి నుండి సమాధానం రాబట్టటం చాలా కష్టమయ్యేది. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో సహచరులకు, పార్టీ వారికీ అంతుపట్టేది కాదు. ఏదైనా అడిగితే గాంధీ టోపీని వెనక నుంచి ముందుకు తిప్పుకుని పెట్టుకునేవారు.!
రాజకీయాలలో తనకు బద్ద విరోధిగా ప్రారంభమైన జలగం వెంగళరావును మంత్రి వర్గంలోకి ఆహ్వానించి, హోం మంత్రి శాఖ నుంచి బ్రహ్మానంద రెడ్డి తన రాజకీయ చతురతను చూపారు. ఆ విధంగా ప్రత్యర్థులను ఆకర్షించటం, మరో పక్క దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ జీవితంలో మామూలే. సంజీవరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటూ, తరువాత తీవ్ర వ్యతిరేకిగా మారిపోయాడు. సంజీవ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉక్కు కర్మాగారాల శాఖ నిర్వహిస్తున్నప్పుడు ఆంధ్రులకు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పరచటం అవసరమైని ఆందోళన జరిగింది. అందుకు గాను తమనం పల్లి అమృతరావు అనే కాంగ్రెస్ వాదిని నిరాహార దీక్షకు పురిగొలిపి ఆందోళన పెంచటానికి బ్రహ్మానంద రెడ్డి హస్తం ఉందనేవారు. ఆ సందర్భంగా జరిగిన అలజడులలో విజయవాడలోని సంజీవ రెడ్డి విగ్రహాన్ని పగలుగొట్టారు. దీనికి బ్రహ్మానంద రెడ్డి పరోక్ష కారణం అంటారు. ఆయన మంత్రి వర్గంలో ఉంటూ వచ్చిన చెన్నారెడ్డి కేంద్రానికి వెళ్ళి కోర్టు తీర్పు ద్వారా పదవి పోగొట్టుకుని తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించి బ్రహ్మానంద రెడ్డి వ్యతిరేకిగా ఆందోళన చేశారు. అయితే ఒక పట్టాన బ్రహ్మానంద రెడ్డి లొంగలేదు. శాసన సభలో ఆయన మెజారిటీకి తిరుగులేకుండా ఉండేది. అయినప్పటికీ ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రయోజనం దృష్టా ఆయనను తొలగించి పీ.వీ. నరసింహారావును ముఖ్యమంత్రిగా తీసుకువచ్చారు.
మహరాష్ట్ర గవర్నరుగా, కేంద్రమంత్రిగా ఆయన చిరకాలం వివిధ పదవులు అనుభవించిన రాజకీయవాది. సంతానం లేదు. రాజకీయాలలో తన పాత్రను ఏమేరకు నిలబెట్టుకున్నాడనేది చరిత్ర చెపుతుంది. ఆయనకు పదవిలేప్పుడు కూడా నేను తరచు కలసి మాట్లాడుతుండేవాడిని.
ఆద్యంతాలూ రాజకీయవాదిగా జీవతం గడిపిన కాసుబ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తనదైన ముద్రవేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుదామని విఫల ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ లో సంజీవరెడ్డి మంత్రి వర్గంలో తొలిసారి అమాత్యులుగా జీవితాన్ని ఆరంభించారు. అప్పటి నుండి చివరి వరకూ రాష్ట్ర కేంద్ర పదవులు ఎన్నో చేపట్టి కొనసాగారు.
1950 ప్రాంతాలలో ఆయన ప్లీడరుగా గుంటూరులో ఉన్న రోజులలో కలుసుకున్నాను. నేను ఎ.సి. కాలేజీలో విద్యార్థిగా ఉన్న సందర్భంగా నా సోదరుడు విజయరాజకుమార్ పెళ్ళి ఆహ్వనం కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉంటున్న బ్రహ్మానందరెడ్డి కాఫీ ఇచ్చి సాదరంగా కార్డు స్వీకరించినా పెళ్లికి మాత్రం రాలేదు. అంతకు ముందు ఎ.సి. కాలేజీకి ఎదురుగా ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్బులో రోజూ బ్రహ్మానందరెడ్డి వచ్చి పేకాడటం చూసేవాడిని. అదే ప్రాంగణంలో మా అన్న ఒక పుస్తకాల షాపు పెట్టారు. నేను తీరిక వేళల్లో కూర్చుని అమ్ముతుండేవాడిని. ప్రక్కనే బ్రహ్మానందరెడ్డి, సలాం, ఇంకా కొందరు గుంటూరు ప్రముఖులు పేకాడుతుంటే మధ్యమధ్యలో నేను కాసేపు నిలబడి వారి మాటలు వింటూండేవాడిని. ఒకసారి గమ్మత్తయిన సంభాషణ చెవిన పడింది. మదరాసు శాసన సభలో కౌన్సిల్ సభ్యుడుగానూ గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడుగానూ ఉన్న ప్లీడరు సలాం మంచి హాస్య ప్రియుడు. సంభాషణా చతురుడు. ఆయనను ఉద్దేశించి, ఏం సలాం, మరీ పాతిక్కీ – పరక్కీ కక్కుర్తి పడుతున్నావటగా అని బ్రహ్మానంద రెడ్డి ఒక విసురు విసిరాడు. వెంటనే సలాం – ఏం చేస్తాం, వందా, రెండువందలూ అయితే నీతో పనేంటయ్యా, బ్రహ్మానందరెడ్డి ఉన్నాడుగా అంటున్నారు మరి అనేసరికి అందరూ గొల్లున నవ్వారు. అలా సాగుతుండేవి వారి సరసాలు.
బ్రహ్మానందరెడ్డి క్రమంగా జిల్లా నుండి రాష్ట్రానికి ఎదిగారు. మొదటి నుండి ముఠా రాజకీయాల్లో మునిగి తేలారు. తొలుత సంజీవరెడ్డి కుడి భుజంగా రాజకీయాలలో చక్రం తిప్పి కీలక స్థానంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయనకు ఎదురు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో అత్యంత ప్రముఖ నాయకుడుగా కాంగ్రెసు పార్టీని చీలదీసి రెడ్డి కాంగ్రెసు అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆర్థిక వ్యవహారాల నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు.
బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను వివిధ సందర్భాలలో కలిశాను. తెలుగు విద్యార్థి (కొల్లూరి కోటేశ్వర రావు సంపాదకుడు) మాసపత్రికకు ఇంటర్వ్యూ చేసి ప్రచురించాము. పాత హైదరాబాదులో మత కల్లోలాలు జరిగినప్పుడు (1968) వివిధ సంఘాలను పిలిచి జూబిలీ హాలులో సంప్రదింపులు జరిపారు. అప్పుడు మానవ వాద సంఘం తరఫున నన్ను పిలవగా నాకు తోచిన సూచనలు ఇచ్చాను.
1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని బాగా దెబ్బ కొట్టింది. ఆయన, ఆయన మంత్రులూ ఒకదశలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భాలలో తేళ్ళ లక్ష్మీకాంతమ్మ (లోక్ సభ సభ్యురాలు), నేను కలసి బ్రహ్మానంద రెడ్డి దగ్గరకు వెళ్ళి మాకు తోచిన విషయం చెపుతుండేవాళ్ళం. ఆయన బంగళా నిర్మానుష్యంగా ఉండేది. కొంత కాలం ఆయన కుంగి పోయినట్లు కనిపించేవాడు. అలాంటప్పుడు కలుస్తుంటే ఎంతో సహాయపడినట్లుగా భావించేవాడు. అదే సందర్భంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కారులు కొందరు హైదరాబాదులో గోడలపై బ్రహ్మానంద రెడ్డి భార్య రాఘవమ్మను ఉద్దేశించి చాలా అసహ్యకరమైన, అశ్లీల, శృంగార నినాదాలు రాశారు. మేము నిరసన తెలిపాము. తెలంగాణాలో ప్రముఖ స్త్రీ నాయకురాళ్లు జె. ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి, సరోజినీ పుల్లారెడ్డి మొదలైనవారు అటువంటి నినాదాలను ఖండించి వారే స్వయంగా చెరిపివేయడానికి పూనుకున్నారు. అటువంటి క్లిష్ట దశలో మేము కలుస్తుండడం బ్రహ్మానందరెడ్డికి ఊరటనిచ్చింది.
రాజకీయవాదిగా బ్రహ్మానందరెడ్డి చాలా ముఠా కక్షలతో సంకుచిత ధోరణిలో ప్రవర్తించాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికపై, దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుపై ప్రభుత్వపరంగా దాడి చేసి అదుపు పెట్టాలని చూశాడు. వారికి ప్రకటనలు ఆపి వేయాలనుకున్నాడు. ప్రెస్ బిల్లు పెట్టి చర్యకు ఉపక్రమించగా మేము హేతువాద సంఘం పక్షాన తీవ్ర ప్రతిఘటన చేశాము. మామిడి పూడి వెంకట రంగయ్యని పిలిచి సభ జరిపి ప్రెస్ బిల్లును వై.యం.ఐ.యస్. హాలు సుల్తాన్ బజారులో ఎండగట్టాము. దీనిపై అఖిల భారత స్థాయిలో పత్రికలు ప్రతిధ్వనించాయి. బ్రహ్మానంద రెడ్డి ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి తప్పుకున్నారు.
బ్రహ్మానంద రెడ్డి జీవిత చరిత్రను కపిల కాశీపతి బ్రహ్మానంద యాత్ర పేరిట పెద్ద గ్రంథంగా వెలువరించారు. అందులో చాలా వివరాలు, నిశిత పరిశీలనలు చేశారు. అయినప్పటికీ దానిని బ్రహ్మానంద రెడ్డి స్నేహపూర్వకంగానే స్వీకరించటం విశేషం. జూబిలీ హాలులో సభ పెట్టి అందరికీ కాపీలు ఉచితంగా ఇచ్చి, ప్రసంగాలు విన్నారు. నేతి చలపతి అధ్యక్షతన బ్రహ్మానందరెడ్డిపై ఒక విచారణ సంఘాన్ని కాంగ్రెసు కమిటీ నియమించింది. ఆయన జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉండగా అరాచక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉండగా అవి చాలా వరకూ వాస్తవాలని నేతి చలపతి కమిటీ నిర్ధారించిందట. ఆ విషయం నిజమేనా అని నేను బ్రహ్మానందరెడ్డిని అడిగితే టోపీ వెనక నుంచి ముందుకు తిప్పి నవ్వి సమాధానం దాటేసేవారు. అసెంబ్లీలోనూ బయట బ్రహ్మానంద రెడ్డి నుండి సమాధానం రాబట్టటం చాలా కష్టమయ్యేది. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో సహచరులకు, పార్టీ వారికీ అంతుపట్టేది కాదు. ఏదైనా అడిగితే గాంధీ టోపీని వెనక నుంచి ముందుకు తిప్పుకుని పెట్టుకునేవారు.!
రాజకీయాలలో తనకు బద్ద విరోధిగా ప్రారంభమైన జలగం వెంగళరావును మంత్రి వర్గంలోకి ఆహ్వానించి, హోం మంత్రి శాఖ నుంచి బ్రహ్మానంద రెడ్డి తన రాజకీయ చతురతను చూపారు. ఆ విధంగా ప్రత్యర్థులను ఆకర్షించటం, మరో పక్క దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ జీవితంలో మామూలే. సంజీవరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటూ, తరువాత తీవ్ర వ్యతిరేకిగా మారిపోయాడు. సంజీవ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉక్కు కర్మాగారాల శాఖ నిర్వహిస్తున్నప్పుడు ఆంధ్రులకు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పరచటం అవసరమైని ఆందోళన జరిగింది. అందుకు గాను తమనం పల్లి అమృతరావు అనే కాంగ్రెస్ వాదిని నిరాహార దీక్షకు పురిగొలిపి ఆందోళన పెంచటానికి బ్రహ్మానంద రెడ్డి హస్తం ఉందనేవారు. ఆ సందర్భంగా జరిగిన అలజడులలో విజయవాడలోని సంజీవ రెడ్డి విగ్రహాన్ని పగలుగొట్టారు. దీనికి బ్రహ్మానంద రెడ్డి పరోక్ష కారణం అంటారు. ఆయన మంత్రి వర్గంలో ఉంటూ వచ్చిన చెన్నారెడ్డి కేంద్రానికి వెళ్ళి కోర్టు తీర్పు ద్వారా పదవి పోగొట్టుకుని తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించి బ్రహ్మానంద రెడ్డి వ్యతిరేకిగా ఆందోళన చేశారు. అయితే ఒక పట్టాన బ్రహ్మానంద రెడ్డి లొంగలేదు. శాసన సభలో ఆయన మెజారిటీకి తిరుగులేకుండా ఉండేది. అయినప్పటికీ ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రయోజనం దృష్టా ఆయనను తొలగించి పీ.వీ. నరసింహారావును ముఖ్యమంత్రిగా తీసుకువచ్చారు.
మహరాష్ట్ర గవర్నరుగా, కేంద్రమంత్రిగా ఆయన చిరకాలం వివిధ పదవులు అనుభవించిన రాజకీయవాది. సంతానం లేదు. రాజకీయాలలో తన పాత్రను ఏమేరకు నిలబెట్టుకున్నాడనేది చరిత్ర చెపుతుంది. ఆయనకు పదవిలేప్పుడు కూడా నేను తరచు కలసి మాట్లాడుతుండేవాడిని.

