ఇంతవరకూ తెలియని సినారె

ఏభై సంవత్సరాల పరిచయంతో సి. నారాయణరెడ్డిని గురించి కొన్ని విశేషాలు వెల్లడించటమే ఈ వ్యాసోద్దేశం. జ్యోతిష్య బోధన వ్యతిరేకించిన సినారె తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా చేసిన నారాయణ రెడ్డి అందరివలె పబ్బం గడుపుకుని పోలేదు. మానవవాద సంఘాల పక్షాన మేము కొంతమందిమి జ్యోతిష్యం బోధనాంశంగా ఉండడాన్ని అభ్యంతర పెడుతూ శాస్త్రీయ పరిశీలనలు జరపాలని కోరాము. దానికి సినారె స్పందించి వైజ్ఞానికంగా జ్యోతిష్యం నిలబడుతుందా? అనేది పరిశీలించాలని, ఖగోళ శాస్త్రంతో పోల్చి చూడాలని కోరారు. ఈ విషయం తెలిసి గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యులుగా వున్న ప్రసిద్ధ జ్యోతిష్యుడు రామన్ (బెంగుళూరు) సినారె పై కత్తులు నూరి నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు తీవ్రస్థాయిలో లేఖలు రాశారు. సినారెను తొలగించాలని డిమాండు చేశారు. ఈలోగా సినారె యూనివర్సిటీలో విషయాన్ని విచారణ జరిపించారు. నన్ను, ప్రొఫెసర్ కొత్తపల్లి వీరభద్రరావులను ఛాంబర్ లో వాదోపవాదాలు వినటానికి సమావేశం జరిపారు. అందరి సమక్షంలో వాదనలు విన్న తరవాత నా వాదన శాస్త్రీయంగా వున్నదని ఖగోళ శాస్త్రంతో పోల్చి జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయటంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. జ్యోతిష్యులు బిత్తరపోయారు. దీనిపై చర్య తీసుకోకముందే సినారె ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా వెళ్ళిపోయారు. ఉస్మానియా యూనివర్సిటీలో సినారె తెలుగు శాఖలోను, నేను ఫిలాసఫీ శాఖలోను ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు 1967 నుండి ఇంచుమించు రోజూ కలిసేవాళ్ళం. నేను అప్పట్లో ఎం.ఎన్.రాసిన అరుదైన పుస్తకం మారుతున్న భారతదేశం తెలుగులోకి అనువదించాను. ఇది భారత చారిత్రక సంఘం వారి పథకం కింద జరిగిన కార్యక్రమం. తెలుగు అకాడమీ ప్రచురించటానికి స్వీకరించింది. ఎడిటర్ గా ఉన్న సినారె ‘జనానికి అర్థమయ్యేటట్లు అనువదించ’మని నా వ్రాతప్రతి చూసి చెప్పారు. అలా నిష్కర్షగా చెప్పడానికి మా స్నేహం అడ్డు రాలేదు. అది ఆయనలోని లక్షణం. తెలుగు అకాడమీ నేను చేసిన ఎమ్.ఎన్. రాయ్ రచనల అనువాదాలన్నీ ప్రచురించింది. వాటిని హైదరాబాదులోని జర్నలిస్ట్ అసోసియేషన్ లో ఆవిష్కరిస్తూ ముఖ్యంగా వివేచన, ఉద్వేగం, విప్లవం అనే గ్రంథాన్ని సినారె చాలా విపులంగా సమీక్షించారు. ఆనాడు ఆయన ఉపన్యాసం విని నాలుగు పెగ్గులు సేవించినట్లున్నదని జర్నలిస్ట్ వి. సతీష్ వ్యాఖ్యానించారు. సినారె ఇంట్లో ఆచార్య రంగా కొంతకాలం అద్దెకుండేవారు. ఇది హైదరాబాదులోని అశోక్ నగర్ లో వుండేది. అక్కడ తరచు సినారెతో నేను కలుస్తుండేవాడిని. 1948 నుండి రవీంద్రనాథ్ ఆలపాటి సంపాదకత్వాన వెలువడిన జ్యోతి పత్రికలో సినారె రచనలు చేశారు. ఆ తరువాత హైదరాబాదులో సినారె రవీంద్రనాథ్ నేను కలసి ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చెయ్యటం ఆనవాయితీగా మారింది. ఎన్నో సంగతులు సినారె ఆసక్తికరంగా చెబుతుంటే అందుకు దీటుగా రవీంద్రనాథ్ తనకు తెలిసిన అంశాలు ఎంతో బాగా చెప్పేవారు. ఇవన్నీ నాకు మధురానుభవాలు. సినారె వాదోపవాదాలలో పాల్గొన్నప్పటికీ నేను ఆ రంగంలో ప్రవేశించేవాడిని కాదు. నా మిత్రులు డి.ఆంజనేయులు (రచయిత జర్నలిస్ట్) తెలుగు కవులు, రచయితలను ఇతర రాష్ట్రాల వారికి, బయట ప్రపంచానికి తెలియపరుస్తూ అనేక సాహిత్య వ్యాసాలు రాసేవారు. అది గ్రంథస్థం అయినప్పుడు అందులో నారాయణ రెడ్డిపై ఒక చక్కని వ్యాసం వున్నది. కానీ, అక్కడక్కడ వున్న నిశిత పరిశీలనలు మాత్రం సినారెకు నచ్చలేదు. డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు భాష ప్రచారం కోసం కరీంనగర్ నుండి కథానిలయం వరకు సాహిత్య యాత్ర తలపెట్టారు. అందులో సినారె నేను పాల్గొన్నాము. ఇద్దరం విశాఖపట్టణంలో బహిరంగ సమావేశంలో మాట్లాడాము. నేను సాహిత్యపరంగా మానవవాద దృష్ట్యా కొన్ని సమావేశాలు హైదరాబాదులో జరిపాము. ముఖ్యమైన వాటికి సినారె నా ఆహ్వానంపై వచ్చి మాట్లాడేవారు. సంజీవదేవ్ హైదరాబాదు వచ్చినప్పుడు జరిపిన సమావేశాలలో సినారె పిలవగానే వచ్చి ప్రసంగించేవారు. మొత్తం మీద సినారెతో ఇలాంటి అనుభవాలు ఎన్నో వున్నాయి. ఆయనకు ఇప్పుడు 87 సంవత్సరాల వయస్సు వచ్చింది. జ్ఞాపక శక్తి బాగా వున్నది. అమెరికా నుండి ఫోను చేసి పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడతారు. సినారెతో మధురానుభూతులు చిరస్మరణీయాలు. •నరిసెట్టి ఇన్నయ్య

మన మరో రాచకొండ

> > రాచకొండ అనగానే మనకు సుప్రసిద్ధ విప్లవ రచయిత, కథకుడు, నాటక కర్త రాచకొండ విశ్వనాథ శాస్త్రి గుర్తుకు వస్తారు. ఆయన రాసిన ‘నిజం’ నాటకం నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అది సహజం. ఆయన ప్రభావం, విమర్శ, హాస్యం అలా కొందరు పాఠకులను ఆకట్టుకున్నది. ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది మరో రాచకొండను గురించి. ఆయన ఎవరో కాదు విశ్వనాథ శాస్త్రి సోదరుడే. పూర్తి పేరు నరసింహ శర్మ. > > ప్రస్తుతం 93 ఏళ్ళ వయసులో కొందరు తెలుగు రచయితలను విస్తృత ప్రపంచానికి తెలియపరచాలని విశేష కృషి చేస్తున్నారు. తనకు నచ్చిన కొందరు రచయిత్రులను, రచయితలను ఎంపిక చేసుకున్నారు. అందులో ముఖ్యంగా కవితలను ఇంగ్లీషులో అనువదించి అందిస్తున్నారు. ఎన.గోపి, ఎలనాగ కవితలు ఇంగ్లీషులోకి తెచ్చారు. ఇప్పుడు సుంకర వెంకమాంబ కవితలను కొన్నిటిని ఎంపిక చేసి ఇంగ్లీషులోకి అనువదించి ‘సంధ్యా రాగం’ పేరిట ప్రచురించారు. ‘అనురాగాలు - ఆత్మీయతలు’, ‘పడమటి సంధ్యారాగం’ పుస్తకాలను రచించారు. వృత్తి రీత్యా రాచకొండ విశ్వనాథ శాస్త్రి అడ్వకేట్‌ అయితే వారి సోదరులు నరసింహ శర్మ మనోచికిత్సా వైద్యులు. ఇండియాలో అమెరికాలో చాలాకాలం ఆ వృత్తిలో పేరు తెచ్చుకుని నేడు విశాఖలో స్థిరపడి రచనల, అనువాదాల రంగంలో ఆదర్శప్రాయమైన శ్రమ చేస్తున్నారు. > > రాచకొండ విశ్వనాథ శాస్త్రికంటే సాంఘిక రంగంలో ముందంజ వేసిన శర్మగారి జీవితంలో మరొక విశేషం ఉన్నది. 1949లోనే అన్నపూర్ణను కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి పెండ్లి మంత్ర తంత్రాలు లేకుండా ఆధునిక పద్ధతిలో జరిగింది. పురోహితుడు కుమ్మమూరు వాస్తవ్యుడు రామకోటిరెడ్డి లౌకిక పురోహితుడు. వుయ్యూరులో జరిగిన వీరి పెళ్ళిలో దంపతులకు సుప్రసిద్ధకవి జాషువా తన కవితలతో ఆశీస్సులు అందజేశారు. శర్మగారు చేసుకున్న అన్నపూర్ణ కూడా డాక్టరే. వృద్ధాప్యంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. హైస్కూలు, కాలేజీ చదువుల తర్వాత శర్మగారు విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర వైద్య కళాశాలలో 1948లో మెడిసిన్‌ చదివారు. 1959లో ఎం.డి. పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖలో 1950 నుంచి 1967 వరకు పనిచేశారు. > > 1967లో అమెరికా వెళ్ళి 18 ఏళ్ళు మెసాచుసేట్స్‌ వి.ఏ. హాస్పిటల్‌ (పెన్సిల్వేనియా)లో వివిధ వైద్యాలయాలలో, వివిధ రంగాలలో వైద్యసేవలందించారు. 1945లో అనాటమీలో ఒకసారి, 1947లో మెడిసిన్‌లో రెండవసారి స్వర్ణపతకాలను పొందారు. పదికి పైగా విలువైన రీసెర్చి పేపర్లు తయారు చేసి విదేశీ జర్నల్స్‌తో సహా అనేక జర్నల్స్‌కి రాశారు. వీటిని పరిశీలించిన అమెరికా యూనివర్సిటీ, ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సురావిజ్‌ ఆహ్వానం మేరకు శర్మగారు అమెరికా వెళ్ళి సేవలందించారు. శర్మగారిది వైద్యవృత్తే అయినప్పటికీ గ్రంథ పఠనం, గ్రంథ సేకరణ, తెలుగు, ఇంగ్లీషు భాషలలో కవితారచన, కవితలను ఇంగ్లీషు నుండి తెలుగుకు అనువదించడం వీరి అభిరుచులు. కుప్పం ద్రవిడియన్‌ విశ్వవిద్యాలయం ప్రచురించిన రావిశాసి్త్ర కథల ఆంగ్లానువాదానికి సమన్వయ కర్తగా, అనువాదకులుగా ఉన్నారు. వారి ఆంగ్ల కవితా సంపుటి ‘హ్యూమన్‌ టచ్‌ అండ్‌ అదర్‌ పొయెమ్స్‌’, వెలువరించారు. సృజనాత్మక రచనలు చేయడంలో దిట్ట. గ్రంథ సేకరణ ఆయన అలవాటు. శర్మగారు ప్రకృతి ప్రేమికులు, ఆరాధకులు. మిత్రులు వీరిని ఎన్‌.ఎ్‌స.రాచకొండగా ఆప్యాయంగా పిలుచుకుంటారు. విశాఖ సాగరానికి, యారాడ కొండ - జనసాగరానికి ఈ రాచకొండ శిఖరాయమానాలు అంటారు. > > ‘అన్నపూర్ణాక్షరం’ పేర శర్మగారు రాసిన ఆంగ్ల కవితకి ప్రముఖ రచయితా విమర్శకుడూ రామతీర్థ తెలుగు అనువాదంతో ద్విభాషా కవితా సంపుటిగా వెలువడింది. షేక్స్‌పియర్‌ సానెట్‌లకు రాచకొండ నరసింహశర్మ అనువాదం చేశారు. > అత్తవారింటికి ఉయ్యూరు వచ్చినప్పుడు సెంటర్‌లో దిగి, ఒక కూలీని మాట్లాడుకుని అతి తేలికైనవి కూలీ చేతికిచ్చి బరువైన సామాను తాను మోస్తూ అత్తవారింటికి నడిచి చేరేవారు. ఇల్లు చేరగానే స్టెతస్కోపుతో ఆ కూలీని పరీక్షించి అధిక బరువులు మోయవద్దని సలహా ఇస్తూ, మామూలుగా అందరూ ఇచ్చే కూలీకి పదిరెట్లు అతని జేబులో పెట్టి, ఆరోగ్యమైన భోజనం చేయమని చెప్పి, అతనికి ఆప్యాయంగా అత్తగారు భార్యలతో విస్తరిలో వడ్డింపజేసి కమ్మని భోజనం పెట్టి పంపించేవారు. హైదరాబాద్‌ ఉస్మానియా హాస్పిటల్‌లో పనిచేస్తున్నప్పుడు తెలిసిన ముసలి రిక్షా డ్రైవర్ని కుదుర్చుకుని గోల్కొండకి అందులో కూర్చుని వెళ్ళేవారు. ఎత్తు పల్లాలొచ్చినప్పుడు దిగి, రిక్షావాడు అలసి నట్లు కనిపిస్తే అతన్ని రిక్షాలో కూర్చోపెట్టుకుని తానే రిక్షా తొక్కిన మానవమూర్తి రిక్షా దిగగానే అందరూ ఇచ్చే మామూలు కూలీకంటే కనీసం మూడురెట్లు డబ్బు ఇచ్చి పంపేవారు. పేషంట్లను ఆప్యాయంగా పలకరిస్తూ వ్యాధి లక్షణాలను పూర్తిగా వివరంగా తెలుసుకుంటూ సరైన మందులను ఇచ్చేవారు. మందులను రాయటానికి డాక్టర్‌ శర్మ గారికి అభ్యంతరం లేదు కాని అది చిట్టచివరి అంశం అనేవారు. మాటలతో, ఓదార్పుతో రోగులకి ఉపశమనం కల్గించాలే తప్ప మందులతో కాదు అని నమ్మి అలానే ప్రవర్తించేవారు. శర్మగారు పెద్దలతో, పిన్నలతో కలిసిపోయి సందడిగా వుంటారు. > నరిసెట్టి ఇన్నయ్య >