దేవుని దోషాలు-పిల్లి చెప్పిన కథ - 9




నాకు ఆకలి వేసినప్పుడు నా ఆకలిని సందేహించే పనేలేదు. ప్రకృతే దీన్ని నిరూపిస్తుంది. నేను పాలగిన్నెను చూస్తే ఎవరి అనుమతి కోరకుండానే పాలను తాగేస్తాను. అనుమతి కోరినా దొరకదని తెలుసు. నైతికంగా ఉన్నతులమనుకునే ఈ మానవులెవ్వరూ, తమకు ఉపయోగపడితే తప్ప ఒక జంతువు ఆకలి తీర్చటానికి త్యాగం చేయలేరనే సత్యం యిక్కడ బయటపడుతుంది. అనుమతి లేకుండానే నేను పాలు తాగిన విషయాన్ని మీరెలా అన్వయిస్తారో మరి! ఇది దొంగతనం! మా జాతిలోని నైతిక పతనానికి అంటగట్టిన లక్షణం. రెండు సత్యాల సమ్మేళనం వలన యిలా  జరుగుతున్నదని మీరెవరైనా ఆలోచించారా?
ఇలాంటి ఇబ్బందులు రాకుండా అర్థంలేని మాటలతో మరికొన్ని నీతి సూత్రాలు ప్రవేశపెట్టారు. ఆత్మనిగ్రహము, త్యాగము బోధిస్తారు. నేను నా ఐహిక వాంఛలను అదుపులో వుంచుకోవాలి. ఆకలితోవున్నా దొంగలిద్దామనే కాంక్షకు కళ్లెం వేయాలి.  ఈ నీతి బోధ వెనుక దాగిన అసలు ఉద్దేశం, నేను నైతిక పతనానికి లోనుకాకుండా కాపాడటం కాదు. వారి పాలగిన్నెను వారు దక్కించుకోవటం. రక్షణ అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం తయారు చేసిన బ్రిటిష్ పెద్దల సృష్టి కాదనుకోండి. అల్ప సంఖ్యాకులు, అధిక సంఖ్యాకుల నోళ్లు కొట్టి తమ అధిక్యత సాగించుకునే సమాజ వ్యవస్థ ఏనాడు పుట్టిందో, ఆనాటి నుండి మానవుని ప్రాతిపదిక అది.
మీరు మీ హక్కుల్ని కాపాడుకొనే తొందరలో కళ్ళు మూసుకొని, అసలు అన్ని నీతులకు మూలమైన మీ మతానికి ఎసరు పెట్టే నీతి సూత్రాలను నిర్మించుకున్నారు. ఆకలయినప్పుడు తినటం  పాపం అయితే, భగవంతుడు జంతువులకు పొట్టను సృష్టించేవాడు కాదు. ఆకలి దేవుడిచ్చినది. ఆకలి తీర్చుకోవటం దైవ నిర్ణయాన్ని పాటించటమే. కనుక దేవుడిచ్చిన ఆకలి తీర్చుకోవటానికి దొంగిలించటంకంటే కడుపు మాడ్చుకోవటం మంచిదని భావిస్తే అది నీతి కాదు. ఆత్మనిగ్రహమూ కాదు. భగవంతుని సృష్టిని మరమత్తు చేయబోవటం, అది దైవదూషణ అవుతుంది, అంటే దేవుడు లేడనటమే. మీరు నిజంగా భగవంతుడున్నాడనుకుంటే భిన్నంగానూ, ఉన్నతంగానూ ఉండాలనుకోటం పొరపాటు. మానవజాతి నింతవరకు దాస్యబంధనాలలో బిగించి ఉంచిన మూఢ విశ్వాలకు అది గొడ్డలిపెట్టు. సత్యము, న్యాయము మొదలైన మాటలకు శాశ్వత నిర్వచనం చెయ్యాలంటే, అతిలోక ప్రమాణం ఏదో ఒకటి వుండాల్సి వస్తుంది.
‘త్యాగం’ అనేది నైతిక ధర్మం. ఈ సుగుణాన్ని అలవరచుకోమని పాలగిన్నె యజమాని బోధించటం సబబుగా వుంటుందని తోచటంలా మీకు? అలా కాక త్యాగశీలత గురించి నాకు బోధ చేయటం అంటే దూడ నోరు గొట్టి సంగ్రహించిన ఆ ఆసామీ పాలగిన్నెకు రక్షణ కల్పించబోవటమే అవుతుంది. మీకు సంబంధించిన మరో ఉదాహరణ తీసుకుందాం. ఈ సందర్భంలో మీకు విషయం క్షుణ్ణంగా బోధపడుతుందనుకొంటాను. ఎప్పుడూ నిజం పలకాలి అబద్ధమాడటం పాపం. ఒకరి కుమారుడు శిక్షార్హమైన నేరమేదో చేశాడనుకోండి. తండ్రి అబద్ధమాడితే శిక్ష తప్పించుకోగలడు. అలాంటి సందిగ్ధావస్థలో తండ్రి ఏం చేయాలి? నిజం చెప్పాలా? లేక తండ్రిగా అబద్ధమాడి కొడుకును రక్షించి తన కర్తవ్యాన్ని నెరవేర్చాలా? ఇక్కడ వాత్సల్యమనే స్వాభావికమైన కోరికకు సత్యం అడ్డుతగులుతుంది. ఈ భావనే మానవుని జంతువుకంటే మిన్నగా చూపుతుంది.
సత్యానికి, ఇతర నైతిక విధులకు ఆదరణలో వైరుధ్యం ఏర్పడే సందర్భాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇలాటి సందిగ్ధావస్థలో మనిషి మాటల నిరంకుశత్వానికి లోనై మానవుడు సహజంగా, తన ఇష్టానుసారం ప్రవర్తించలేకపోతున్నాడు.
కిందటి జన్మలో నేను చేసిన పాపం వల్లనైతేనేమి, నా తల్లిదండ్రుల ఉద్రేకం వల్లనే కానీయండి నేను ఆ పాడు ప్రపంచంలో పుట్టాను. ఎప్పుడైనా పాలగిన్నె నా కంట పడటం జరిగితే నాలో మొదట కలిగే ప్రేరణ ఏమిటంటే  సూటిగా వెళ్ళి పాలు తాగేద్దామని. అలా చేయటం దేహధర్మం గనుక ఆ ప్రేరణ కలిగినందుకు నేను సిగ్గుపడను. మానవుల భాషలో చెప్పాలంటే నేను పిల్లిగా పుట్టటం దైవ నిర్ణయమే. నాలో ఈ ప్రేరణ గలగటం వల్ల సృష్టి సామరస్యం భగ్నమవుతుందనుకుంటే అలాంటివి నాలో కలగకుండానే దేవుడు నన్ను పుట్టించి వుండేవాడు. ఇంతెందుకు, దొంగిలించాలనే నాలో ప్రేరణను అనుసరిస్తున్నానంటే దైవ సంకల్పాన్ని అనుసరిస్తున్నానన్నమాట. మానవుడు  కూడా ఇలాంటి స్థితిలో వుంటే అతనిలోని ప్రేరణలు గూడా యిలానే ఉంటాయని నా నమ్మకం. ఎవరైనా ఈ ప్రేరణలకు లొంగక ఆత్మనిగ్రహం చూప ప్రయత్నిస్తున్నారంటే వారు నీతివర్తనులని అర్థంగాదు, అది వారిలోని పిరికి తనమే, ‘వీడు దొంగ’  అని లోకం తనని వేలెత్తి చూపుతుందనో, శిక్షిస్తుందనో భయమన్నా కావాలి లేక ఇది తనకే సిగ్గుచేటుగా వుండొచ్చు. ఈ భావన మరీ ఏహ్యమైంది.
మనుషుల సంగతి ఎలా వున్నా నేను మాత్రం పాలగిన్నె కంటపడితే ఏమాత్రం సందేహించను. పైగా అది దేవుడు నాకోసం పంపించాడని తాగేస్తాను. దొరికిపోతే తన్నులు తినాలనే భయం ఓ వంక వుందనుకోండి. నీతులు మాత్రం నాకడ్డురావు. అంతకంటే నేను చేయగలిగిందేముంది? సత్యం, న్యాయం, శాంతి మార్గాలతో అంటే యజమానిని బ్రతిమాలుకోవటం వల్ల ఆ పాలు నాకు లభించే అవకాశం పదింట ఒకటి గూడా వుండదు. న్యాయం శాంతి అని వూగిసలాడకుండా దైవదత్తమైన ప్రేరణ ననుసరించి నడిస్తేనే మంచి అవకాశం లభిస్తుంది. అడిగితే పాలు పొయ్యరు గనుక అడగకుండానే తాగేస్తాను. నాగరిక మానవ సమాజం అనబడే ఆ నాగరిక వ్యవస్థలో నేను గూడా దురదృష్టవశాత్తు ఒకదాన్నైతే  ఈ నేరానికి నాకు శిక్షపడేది. అయితే తెలివిగా దొంగిలించేవారు పట్టుపడరు. అనుమతి పొంది పాలు త్రాగాలంటే నాకవి ఎంతవరకు దొరుకుతాయో ఆలోచించరు. వాళ్ళు నా బాధ్యతను తమ కొలత బద్ధతో కొలుస్తారు. వారి వాదన ఏమంటే పాలు నాకు చెందినవి కావు. నేను ఆకలితో మాడుతున్నా, ఆ పాలలో మూతి పెట్టే హక్కులేదు. నేను ఆకలితో చచ్చినా వారికేం పట్టదు.
                         మూలం                                  తెలుగు సేత
            ఎమ్.ఎన్.రాయ్                           వెనిగళ్ళ కోమల


ఎమ్ ఎన్ రాయ్ ను కలిసిన రావిశాస్త్రి


సుప్రసిద్ధ విప్లవ రచయిత  రాచకొండ విశ్వనాథ శాస్త్రి విశాఖ పట్టణంలో ఎమ్.ఎన్.రాయ్ ను కలిసి చేరువైన ఉదంతం  వెలికి వచ్చింది. ఈ విషయాలు  రావిశాస్త్రి స్వయంగా రాసుకున్న  ఆయన డైరీలలో లభించాయి.
కాలేజీ చదువుల్లో ప్రవేశించిన  తొలిరోజులలో (1937, ఆగస్టు 19, గురువారం) రావిశాస్త్రి విశాఖపట్టణంలో మానవేంద్రనాథ్ రాయ్ ను కలుసుకున్నారు. కళాశాలలో యూత్ లీగ్ సభ్యుడుగా చురుకుగా పనిచేస్తున్న రావిశాస్త్రిని ఆనాడు అబ్బూరి వరదరాజేశ్వరరావు  వెంటబెట్టుకుని ఎమ్.ఎన్.రాయ్ వద్దకు తీసుకువెళ్ళారు. తన డైరీలో తొలి పరిచయాన్ని రాసుకుంటూ ‘రాయ్ ఆజానుబాహుడని, భాషోచ్ఛారణలో జర్మన్ భాష ప్రభావం కనిపించిందని, ఆయన వెంట అమెరికన్ భార్య కూడా ఉన్నదని’ రాసుకున్నారు.
1937లో ఎమ్.ఎన్.రాయ్ విశాఖకు  రావటానికి ఎమ్.వి.శాస్త్రి (మునుకుట్ల వెంకటశాస్త్రి,  కాకినాడ), అబ్బూరి రామకృష్ణారావు  కారకులు. అంతకుముందే జరిగిన  ఫైజ్ పూర్, మహరాష్ట్రలో  కాంగ్రెస్ మహాసభలలో తొలుత  ఎమ్.ఎన్.రాయ్ ప్రసంగం విని  ప్రభావితుడైన ఎమ్.వి.శాస్త్రి  ఆయనను ఆంధ్రకు ఆహ్వానించాడు. ఆ విధంగా రాయ్ వచ్చాడు.  ఆంధ్రాయూనివర్సిటీలో లైబ్రేరియన్  గా పనిచేస్తున్న అబ్బూరి  రామకృష్ణారావు నాటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డికి రాయ్.ను పరిచయం చేశారు. విశాఖలో పి.హెచ్ గుప్త ఇంట్లో రాయ్ దంపతులు వుండేవారు.
1937 ఆగస్టు 22న విశాఖ బీచ్  లో రాయ్ ఉపన్యాసాన్ని  రావిశాస్త్రి విని ప్రభావితుడయ్యాడు. ఆ విషయం డైరీలో రాసుకుంటూ  భారతదేశానికి షోషలిజం  అంతగా ఉపకరించదని ఆయన  ఉపన్యాసంలో ధ్వనించినట్లు  రావిశాస్త్రి అభిప్రాయపడ్డారు.  తరువాత 1937 ఆగస్టు 27న, రాయ్  చరిత్రపై జరిగిన సెమినార్ కు అధ్యక్షత వహిస్తూ ముఖ్యోపన్యాసం చేశారు. రావిశాస్త్రి అందులో పాల్గొన్నారు. సమావేశానంతరం ఆయనతో తేనీటి విందులో పాల్గొని ఫోటో తీయించుకున్నారు. రావిశాస్త్రి తాను ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి, రాయ్ ని కలవబోతున్నట్లు చెప్పగా, అతడు వ్యాఖ్యానిస్తూ ‘బాంబులు తయారు చేయటం ఎలాగో రాయ్ దగ్గర నేర్చుకుంటారా’ అన్నాడని చెప్పారు. ఆ సంగతి రాయ్ తో చెప్పాము. ఆ తర్వాత తన ఉపన్యాసంలో రాయ్ ప్రిన్సిపాల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ మాట్లాడారు. మరునాడు రావిశాస్త్రి రాయ్ ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అంతకు ముందు తీసుకున్న ఫోటో కాపీని ఇచ్చారు. అది బాగా వచ్చిందని రావిశాస్త్రి సంతోషించారు.  మరు సంవత్సరంలో రాయ్ మరోసారి విశాఖకు వచ్చినప్పుడు రావిశాస్త్రిని కలుసుకున్నారు (అది 1938 జులై 19). అప్పటికే రాయ్ రచనలు చదవటం మొదలెట్టిన రావిశాస్త్రి అవి తార్కికంగా క్రమపద్ధతిలో ఉన్నాయని భావించారు. కాంగ్రెసు సోషలిస్టు పార్టీకి రాయ్ రాసిన బహిరంగ లేఖలను రావిశాస్త్రి చదివారు.  ఆ తరువాత వారం రోజుల్లోనే రాయ్ నడుపుతున్న ‘ఇండిపెండెంట్ ఇండియా’ అనే వారపత్రికను తెప్పించుకోవడం మొదలుపెట్టారు. అందులో హక్కులు బాధ్యతలు, ప్రజలతో సంబంధాలు అనే అంశాలు రావిశాస్త్రిని ఆకట్టుకున్నాయి. 1938లోనే ‘ఇండియన్ రివ్వ్యూ’ పత్రికలో ఫిలిప్స్ స్ప్రాట్  రాస్తూ ఎమ్.ఎన్.రాయ్.ను ఠాగోర్.ను నిశిత పరిశీలన గావించి గాంధీ ధోరణికి సుముఖత వ్యక్తం చేస్తూ అభిప్రాయం వెల్లడించాడు. అది గ్రహించినట్లు రావిశాస్త్రి పేర్కొన్నాడు.
ఎమ్.ఎన్.రాయ్ విశాఖకు వస్తూ  పోతూ వుండటం, యువతలో చర్చనీయాంశమయింది. ఆయనకు అనుకూలంగా రాజేశ్వరరావు, ప్రతికూలంగా ఎన్.వి. రామారావు వాదోపవాదాలు చేశారు. అబ్బూరి వరదరాజేశ్వరరావు చాలా గట్టిగా రాయ్.ని వెనకేసుకొచ్చేవారు. ఆ విధంగా రాయ్ సాహిత్యాన్ని రావిశాస్త్రి రెండుమూడేండ్లపాటు చదువుతూ పోయారు. 1941లో వచ్చిన ‘గాంధీయిజం, నేషనలిజం, సోషలిజం’ అనే రాయ్ రచనలు రావిశాస్త్రి చదివారు. ఆ పుస్తకం చదివిన తరువాత తనకు స్పష్టత లభించినట్లు రావిశాస్త్రి రాసుకున్నాడు.
రావిశాస్త్రి రాయ్.ని కలుసుకోవటం అంతటితో ఆగిపోయినట్లున్నది. ఆ తరువాత ఆయన చదువును సాగిస్తూ, కమ్యూనిస్టులకు దగ్గరైనట్లు తెలుస్తుంది.
ఎమ్.ఎన్.రాయ్.తో రావిశాస్త్రి తీయించుకున్న ఫోటో సేకరించే ప్రయత్నంలో ఉన్నాము. విశాఖలో వుంటున్న రావిశాస్త్రి సోదరులు రాచకొండ నరసింహ శర్మగారు ఈ డైరీ ప్రతిని నాకు అందజేశారు. వారికి ధన్యవాదాలు. ఆయన లోగడ అమెరికాలో సైక్రియాట్రిస్ట్ డాక్టరుగా చేసి రిటైర్ అయి విశాఖలో స్థిరపడ్డారు. ఆయన ఇంగ్లీషు, తెలుగు భాషలలో కవి, రచయిత కూడా. రాచకొండ గేయాలను, కథలను కొన్ని ఇంగ్లీషులోకి అనువదించారు కూడా.
మొట్టమొదటిసారిగా నా దృష్టికి వచ్చిన  ఈ విషయాలను వాటి ప్రాధాన్యత దృష్ట్యా అందిస్తున్నాను. అబ్బూరి రామకృష్ణారావు  రాష్ట్రంలో రాయ్ ప్రతినిధిగా  రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఆర్గనైజర్ గా కృషిచేశారు.
నాకు 1968 నుండి రాచకొండతో  సన్నిహిత సంబంధాలుండేవి. గోరాశాస్త్రి, సి.ధర్మారావు, నేను అయతో కలిసి ముచ్చటించుకున్నాము. అప్పట్లో నాకీవిషయం తెలియదు. తెలిసుంటే ఇంకా లోతుపాతులు చర్చించేవాణ్ణి.
Written by Innaiah Narisetti 
Taken from Andhra Jyothi daily published on 25th feb 2013

          

‘ఓం’ కూ ‘మ్యావ్’ కూ తేడా ఏమిటి ?--పిల్లి చెప్పిన కథ - 8




‘ధర్మం’ అంటే చెప్పబడే నిర్వచనాలన్నీ నాకు తెలుసు. ధర్మం అంటే ప్రపంచాన్ని నిలబెట్టగలదనీ, సమాజానికి ఆధారభూతమైనదనీ హిందూ మేధావులు చెపుతారు. ఐతే సమాజానికి ఏది ఆధారభూతం అని నిర్ణయించేదెవరు? మత వాదులకు ఈ ప్రశ్న చాలా అసందర్భంగా తోస్తుంది. వారు చెప్పేది లోగడే నిర్ణయం ఐపోయింది. పవిత్ర గ్రంథాలలో అది రాసి వున్నది. దానిని అనుసరిస్తే అంతా సక్రమంగా నడుస్తుంది. ఇలా మళ్ళీ మాటలలోకి వచ్చేస్తున్నాం. హిందూమతం ఆదిలో శబ్దం వున్నదంటుంది. (క్రైస్తవ మతం కూడా ఇలాగే అంటుంది) ‘ఓం’ శబ్దం భాష కంతకూమూలం అంటారు. చిత్రమేమిటంటే ఈ ‘ఓం’ శబ్దం మాట్లాడే భాషలో భాగంగా లెక్కించరాదని, మానవులకంటే ఈ ధ్వనిని జంతువులే బాగా చేయగలవు. నా మేనల్లుడున్నాడొకడు. వాడీ శబ్దాన్ని మనుషుల్ని భయకంపితుల్ని చేసేట్లుగా చేస్తాడు. అయితే హేతుబద్ధం చేయదలిచేవారు (హేతువాదులు కాదు). పిల్లులు ‘ఓం’ శబ్దాన్ని అపవిత్రం చేయటం సహించరు ‘ఓం’ అంటే ‘అ’ ‘ఉ’ ‘అం’ కలసిన సంయుక్త శబ్దం. ఈ విషయం ఒప్పుకున్నంత మాత్రాన ఇక్కడ సమస్య పరిష్కారం కాదు. దీనిని బట్టి తేలుతుందేమంటే రెండు అచ్చులూ, ఒక హల్లుగల మాటలను మాత్రమే ఆదిమ మానవులు మాట్లాడ గలిగారని. అలాంటి శబ్దాలు చేసే మానవులకూ ఆట్టే జంతువులకూ తేడా ఉండకూడదు. నిజం చెప్పాలంటే ‘ఓం’ ఒక మాటకూడా గాదు. సగం పలికే శబ్దం మాత్రమే. ఐనా ఆధ్యాత్మిక జీవితాలమీద అది గొప్పగా పెత్తనం చేస్తుంది.

ఈ ‘ఓం’ శబ్దాన్ని పదేపదే  వల్లిస్తే ఆధ్యాత్మికంగా మనిషి ఉన్నతుడెలా అవుతాడు? నేను చేసే ‘మ్యావ్, మ్యావ్’ శబ్దం కూడా ఆ పని చేయలేదా? అర్థం లేని సంకేతం, ఆకారంలేని దేవుడికి చిహ్నం ఎలా అవుతుంది? కడుపు నిండా తిని బ్రేవ్ మని తేనుస్తూ ‘ఓం’ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రాన ఆధ్యాత్మిక అనుభూతి ఎట్లా కలుగుతుంది? నా మాదిరిగా ఇలా ప్రశ్నలు వేయకుండా మాటల గారడీతో నోళ్ళు మూయిస్తుంటారు. మానవుడి అభివృద్ధి తొలిదశలో ‘నమ్ము, ఆలోచించకు’ అనే మాటలు ప్రచారం చేశారు. నేటికి ఈ మాటల మాయలోనే అనేకమంది కొట్టుకు పోతూ వున్నారు. ‘శబ్దబ్రహ్మ’ కోరల్లో నుండి భారతదేశం ఇప్పట్లో బయటపడే లక్షణాలేమీ కనిపించటం లేదు.
జాతీయోద్యమం రోజుల్లో స్వరాజ్యం, సహాయనిరాకరణ, అహింస, త్యాగం, బాధలు వంటి మాటలు వినబడ్డాయి. వీటికి కొన్ని కేవలం ఆధ్యాత్మిక పదాలు గూడా జోడించారు. అందులో ముఖ్యమైంది. ‘సత్యం’ ప్రతి జాతీయవాదీ ఆలోచనలో, ఆచరణలో, మాటల్లో సత్యం, అహింసా పాటిస్తానని వాగ్దానం చేస్తాడు. నీతి పదాలూ ఆధ్యాత్మిక భావాలూ జాతీయ భావానికి విలువనిస్తాయని నమ్మకం.  ఈ మాటలు ప్రతివాళ్ళూ వల్లించారు. కాని అర్థం తెలుసుకుందామని ఎవరూ ప్రయత్నించలేదు. ఫలితంగా ఆలోచన ఆగిపోయి ఉద్యమ సామాజిక ఆర్థిక లక్ష్యాల విషయం అయోమయంగా తయారయ్యింది.
‘సత్యం’ అనే మాట నిర్వచనానికి అందకుండా రూపుదాల్చింది. అయినా జాతీయవాదులకు అది ఒక అందమైన నినాదంగా మిగిలింది. సత్యానికి కట్టుబడి వుంటామని వారు వాగ్దానం చేసేటప్పుడు నైతికంగా ఎంతో ఎత్తు పెరిగినట్లు భావించుకున్నారు. యెలాంటి దేవతకు తాము బద్ధులమై ఉంటామని వాగ్దానం చేస్తున్నారో వారు గుర్తించలేదు. ‘సత్యం’ అంటే ఏమిటి? ఇంత చిన్న మాటను ఏ భక్తుడూ వివరించలేడంటాను నేను.

మూలం తెలుగు సేత
ఎమ్.ఎన్.రాయ్   వెనిగళ్ళ కోమల

భాషాసంకెళ్ళు--పిల్లి చెప్పిన కథ - 7




భాష మానవుడిని ఇతర జంతువుల  నుండి వేరు చేసింది. అది  వారి బుద్ధివికాసానికి తోడ్పడింది.  ఈ మాట్లాడే శక్తి వల్లనే మానవుడు ఈర్ష్య, అసూయలు, గొప్పలు  చెప్పుకోటం వంటి చెడు విషయాలకు గురి అయ్యాడు. ఇవి అతని బుద్ధి వికాసానికి అవరోధాలే.

మొదట్లో మానవుడు తన ఉద్రేకాన్ని  వెలిబుచ్చటానికి భాష తోడ్పడింది. నెమ్మదిగా తన భావాలను వ్యక్తం  చేయసాగాడు. భావాలను స్వేచ్ఛగా  వెల్లడించటానికి భాష అడ్డుపడసాగింది. మాటల ఆధిపత్యానికి ఆలోచన  పరిమితమైంది.  మాటల నిరంకుశత్వంలో  మానసిక వికాసం వెనుకబడింది. ఉదాహరణకు పవిత్ర గ్రంథాలను  చూడండి. (ఏ మతానికైనా సరే) వాటిలోని పదజాలానికి మానవుడి  భావాలు కట్టుబడి ఉండవలసి  వచ్చింది. ఉద్రేకాలను, భావాలనూ  దాచుకునే ప్రయత్నంలో జీవితమంతా  అబద్ధాల పుట్ట అవుతుంది. భావ స్వాతంత్ర్యానికి నీళ్లు వదలాల్సి వస్తుంది. స్వతంత్రమైన  ఆలోచనలూ, మతపరమైన నమ్మకాలూ కలసి ఉండలేవు. దైవ నామమే  దైవమయింది. రామ రామ, శివ  శివ, హరి హరి అంటూ దేవుని పేరు జపం చేస్తే పుణ్యం కలుగుతుందని  చాలామంది హిందువుల నమ్మకం, ధర్మం, జీవిత పరమావధి అంటూ పెద్దలు చెపుతుంటే విన్నాను. ధర్మం అంటే ఏమిటో వారినడగండి. అతిగా ఈమాట వాడేవారిలో వెయ్యిలో ఒకరు కూడా దీని అర్థం సరిగా చెప్పలేరు. ‘ధర్మం’ అనేది ఒక మాట. ఈ మాటల గారడిలో కోటానుకోట్ల ప్రజలు తమ ఆలోచనా శక్తిని కోల్పోయారు. ‘ధర్మం’ అనే పదానికి ఏదైనా అర్థం ఉన్నదనుకున్నా, అది కొన్ని మూఢ నమ్మకాలనూ, ఆచారాలనూ, దారి తెన్నులేని జీవిత విధానాన్ని సూచిస్తుంది. ఇవి కూడా ప్రాంతాలవారిగా, తెగలవారీగా మారుతుంటాయి. ఈ ఆచారాలను యెందుకు పాటిస్తున్నారనిగానీ, కొన్ని కర్మకాండలు ఎందుకు జరుపుతున్నారనిగానీ ప్రశ్నిస్తే ధర్మం అలా చేయమంటుంది అంటారు. ధర్మం అంటే ఏమిటి? మళ్ళీ మొదటికే వచ్చాం. మనుషుల జీవితమంతా ఈ అర్థం లేని పదం, పెత్తనంతో గడుస్తుంది.
ఆచారాలకు గుడ్డి నమ్మకాలకూ అతీతమైందని చెప్ప జూచేవారు ‘ధర్మం’ ద్వారా విశ్వాత్మను చూడగలమంటారు. వాస్తవాన్నితెలుసుకోటానికి తోడ్పడుతుందంటారు. ఒక హిందూ మతానికే కాకుండా అన్ని మతాల సారమని భావింపబడే గాంధీ ఈ నిర్వచనం చేశారు. ఇది పరమాత్మ ఇలా ఉంటుందని యెవరూ చెప్పలేరు. అది మాటలకూ ఆలోచనకూ అందనిది. ఐతే తాను తెలుసుకున్నది పరమాత్మ స్వరూపమేనని నిర్ణయించటం యెలా? ఇదంతా భాషకు దాసోహమవటమే అంటాను నేను.

మూలం తెలుగు సేత

పిల్లి చెప్పిన కథ - 6 శాకాహారం గొప్పదా ?





ఏ మతమైనా మాంసం తినవచ్చునని అంగీకరించినప్పుడు ఒక జంతు మాంసాన్ని ప్రత్యేకంగా నిషేధించటానికి కారణమేమీ కనపడదు. మేక మాంసం, గోమాంసం, అని తేడాలు చూపడం దేనికి? మాంసంవల్ల శరీరానికి ఆత్మకూ హాని కలుగుతుందంటే అన్ని మాంసాలు నిషేధించాలి. హిందువులలో కొన్ని తెగలవారు శాకాహారమే మంచిదనటం హేతుబద్ధం కాదు. వైజ్ఞానికంగా చెప్పేది అర్థం లేనిది. రసాయనికంగా మాంసానికి, కూరగాయలకు తేడా లేదు. ఆహారం ప్రభావం శరీరం మీదగాని, మనసు మీదగాని (ఆత్మ ఉందనుకుంటే దాని మీదగాని) ఉందనుకుంటే దానిలోని రసాయన పదార్థాల ప్రభావంగానే భావించాలి. శరీర పోషణలో కొన్ని రసాయనిక పదార్థాలు అవసరమే. గోమాంసం తిన్నా, అరటికాయ కూరతిన్నా, నెయ్యి తిన్నా ఆహారంలో రసాయనిక పదార్థాలుండడం అవసరం. శాకాహారి అయినా, మాంసాహారి అయినా వారి శరీరాలు ఆరోగ్యంగా వుంటే వారు తినే ఆహారం నుండి ఒకేరకమైన  రసాయనిక పదార్థాలను ఒకే పరిమాణంలో తీసుకుంటాయి. జీర్ణం చేసుకోవటం వారి అలవాట్లను బట్టి ఉంటుంది. మతం ఆచారాలు అడ్డు రావటంతో అచ్చంగా శాకాహారం తింటున్న సామాన్య ప్రజలను పరీక్షిస్తే వారు  అవయవ పుష్టిలోను తెలివితేటల్లోనూ కూడా తీసికట్టుగా కనిపించవచ్చు. తగిన మోతాదులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు శరీరానికి చాలా అవసరం. వాటిని పొందాలంటే జీర్ణకోశపు శక్తికి మించిన పని కలిగించేట్లుగా ఎక్కువ అన్నం, పప్పులూ తినవలసి వుంటుంది. దాని ఫలితంగా బుద్ధి మందగిస్తుంది. పాలు, వెన్న, పప్పులు, కూరలు, పళ్ళు మొదలైనవి జీర్ణాశయానికి ఎక్కువ పని కల్పించకుండానే శరీరానికి కావలసిన పోషకపదార్థాలను అందించగలవు. కాని, ఈ విధమైన ఆహారం సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు. అందువల్ల వాళ్ళు బలహీనంగా ఉంటారు. జీర్ణకోశానికి ఎక్కువ పని కలిగించే సారంలేని పదార్థాలు తిని మానసికంగా మందకొడిగా తయారవుతున్నారు. భారతీయులు మానసికంగా శారీరకంగా వికాసం పొందాలంటే శాకాహార చాదస్తాన్ని విడనాడాలి. మాంసాహారి అయిన ఈ చిన్న ప్రాణి మాట వినండి. మాంసం ఎక్కువగా తినండి. అది మీ ఆత్మ విముక్తికి రాచబాట. నా జీవిత చరిత్ర నుండి మీరు నేర్చుకోవలసింది ఏమిటంటే మాంసాహార జంతువులెప్పుడూ పెంపుడుకావు. గడ్డితినే పశువుల బానిస బ్రతుకంటే మాకు రోత అని. ఐతే మరి కుక్క యెందుకు ఈ సూత్రానికి కట్టుబడదు అంటే అది తనజాతికే ద్రోహి. కుక్క స్వామి భక్తిని గురించి వేరే చెపుతాను.

మూలం తెలుగు సేత
ఎమ్.ఎన్.రాయ్   వెనిగళ్ళ కోమల

గోమాంసం తిన్న ఋషులు-పిల్లి చెప్పిన కథ - 5




మనిషి తన స్వార్థం కోసమే జంతువులు మచ్చిక చేసుకుంటాడని నేనంటాను. హిందువులు చేసే గోపూజలో గూడా ఏమీ ఉన్నతమైన ఆదర్శం లేదని నా అభిప్రాయం. ఇలా మాట్లాడి నేను కష్టాలు కొని తెచ్చుకున్నాను. ఎలానూ మాటజారాను గనుక ఈ విషయం గురించి విపులంగానే చెపుతాను.
ఆవును పూజించటం ఒక విచిత్రమైన ఆచారం. చదువుకున్న హిందువులు దీనిని సరైనదని సమర్థిస్తుంటారు. విమర్శనా దృష్టి కలిగిన వారుకూడా దీనిని మెచ్చుకోటం చూచాం. ఈ ఆచారం వలన మనిషి మానసికంగా ఉన్నతి చెందుతాడని వీరి భావం. ఈ విషయంలో వివాదం పెంచటం నా పని కాదు. అసలు సమస్య ఏమిటి, దానిని ఎలా పరిశీలించి చూడాలి. అనేది నా కోరిక. ప్రగతిని కోరే హిందువులంతా భారతజాతి సమగ్రాభివృద్ధికి హిందూ ముస్లిములు ఐక్యంగా ఉండటం అవసరమంటారు. ఈ సమైక్యత సాధించడానికి వీరిలో ఎంతమంది కృషి చేస్తున్నారు?
పై చెప్పిన ఐక్యత కుదరక పోవటానికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి. అవి జన సామాన్యం మీద సూటిగా పనిచేయటం లేదు. హిందూ ముస్లిముల మధ్య ఉద్రేకాలు రెచ్చగొట్టటంలో ఈ గోపూజ కూడా ఒక కారణంగా నిలుస్తున్నది. హిందువులకు కావలసింది గోపూజా లేక దేశ విమోచనా? ఈ రెండింటిలో ఒకదానినే హిందువులు ఎంచుకోవాలని నేనంటే నేను అతిగా మాట్లాడుతున్నానని నన్ను తిట్టకండి. ఈ దృష్టితో చూస్తే భారతజాతి బానిస సంకెళ్ళలో  ఈ గోపూజ ఒక కొక్కెమే తప్ప భారతీయుల ఆదర్శంగా మాత్రం కనిపించటం లేదు.
బూజుపట్టిన సమాజ వ్యవస్థలూ కరడు కట్టిన మత ద్వేషాలు చెడు ఫలితాలనే కలిగిస్తున్నాయి. గోపూజ ఒక మూఢ నమ్మకం – భారత యువకులు తమ తెలివి తేటలను గోపూజ సమర్ధన వంటివి చేపట్టటంలోగాక ఇతర విషయాలలో ఉపయోగించి తమ విమర్శనా శక్తిని పెంపొందించుకోవాలి.
ఆవులోనే ప్రత్యేకమైన దైవత్వం ఉందని విచక్షణా జ్ఞానం కలవారెవరూ వాదించరు. పరమాత్మ ప్రతి జీవిలోనూ ఉన్నాడని భావించటమే దీని ఉద్దేశం ఐతే ఋషులు ఆవునే పూజకు తగినదని యెలా నిర్ణయిస్తారు? జంతువులపట్ల సనాతన హిందువుల ప్రవర్తనను పరిశీలిస్తే వారు చెప్పే బ్రహ్మస్వరూప వాదం యెక్కడా కనిపించదు. ఇది నేను అనుభవం ద్వారా తెలుసుకున్న విషయం. పూర్వాచారాలుగల హిందువులు మా పిల్లిజాతిని ద్వేషిస్తారు. నా జీవితం చాలా భాగం పూర్వాచారాలుగల హిందువుల మధ్య గడిచిపోయింది. కొన్ని సులువైన మార్గాలు నేను వెతుక్కోకపోతే నా జీవితం నరకం అయ్యి ఉండేదే. ఈ హిందువులు ప్రవర్తించిన తీరు మీకు చెపితే మీరు ఆశ్చర్యపోతారు. మనుషులంటే ద్వేషించీ, వితండవాదానికి దిగే నేను ఇతరులెవరన్నా వీరి ప్రవర్తన గురించి చెబితే నమ్మి ఉండేదాన్ని కాదు. పిల్లులు పూజకు నోచుకోని జంతువులే కాక మామూలు ఆదరణకు కూడా తగవని వీరి భావం అవి దుష్టజాతివట! ‘వాటివల్ల మనకేం లాభం’ అంటుంటారు వాళ్ళు. చాలా జంతువులు అపవిత్రమైనవని సనాతనుల ఉద్దేశం. ఇవన్నీ తెలిసిన నేను గోపూజ సరైనదని అంటే ఎలా నమ్మగలను?
పరమాత్మను ప్రతి జీవిలోనూ చూడదలచిన హిందువుల ప్రవర్తన దీనికి భిన్నంగా ఉండకూడదు. గోపూజ జరపటంలో పరమాత్మ సిద్ధాంతం ఏమీ కనిపించదు. అసలు విషయం ఆవు వారికి ఉపయోగపడటమే. అవసరానికి ఉపయోగించుకోవటం తప్ప ఇందులో ఆధ్యాత్మిక చింతనకు తావులేదు. ఇందులోనే భారతీయుల ఆధ్యాత్మిక అనాగరికతా లక్షణాలు బయటపడుతున్నాయి.
అసలు హిందువుల పూజలందుకునే స్థాయికి ఆవు ఎలా వచ్చిందా అన్నదే ప్రశ్న. మత చరిత్రను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా పిల్లి బుర్రకు అంతు చిక్కని విషయమిది. ఇప్పుడది ప్రస్తావించవలసిన అవసరమూ లేదు. ఐనా కొంతవరకు ఈ విషయం కదిలించాను గనుక నా అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండలేను.
అసలు గోపూజ అనేది ఒక సామాజిక అవసరాన్ని బట్టి ఒక ఆచారంగా పుట్టిందనిపిస్తుంది. ఒకానొకప్పుడు భారతదేశంలో పశు సంపద కొరతపడి ఉండాలి. నిజంగా   ఈ దేశం, ఇక్కడి వాతావరణం కూడా పశువులు ఆరోగ్యంగా పెరగటానికి అనువైనవి కావు. ఇప్పటికి  ఈ దేశంలో పశువులు సంఖ్యకు చాలా ఉన్నా ఈసురోమని నాసిరకంగా వుంటాయి. వీటి పరిస్థితి ఇంకా దిగజారే లక్షణాలన్నాయి. కేవలం గడ్డి గాదంతోనే పశువులు వృద్ధి చెందవు. మెట్ట భూములూ, అక్కడ వీచే చల్లని పొడిగాలి పశువుల పెంపకంలో చాలా అవసరం. మధ్య ఆసియా పశువుల పెంపకానికి అనువైనది. అందువల్ల అక్కడివారు ఎక్కువగా పశువులను పెంచేవారు. వారిలో కొంత జనాభా హిందూకుష్ పర్వతాల మీదుగా ఉత్తర హిందూ దేశానికి వలస వచ్చినప్పుడు వారితో ఎక్కువ సంఖ్యలో పశువులు రాలేదు. వారు ప్రయాణం చేసిన దారి సరిగా సరిగా ఉండక పోవడం, దారి పొడవునా భరించలేని చలి మూలంగా పశువులు రాలేకపోయాయి. మధ్య ఆసియా నుండి వచ్చిన ఈ సంచార జాతులవారు పశువులంటే చాలా విలువనిచ్చేవారు. వారు వచ్చిన కొత్త దేశంలో పశుసంపద కొరవడింది. ఉన్న కొద్ది పశువులను కాపాడుకోవాలనే తాపత్రయం. పైగా ఆర్యులు మాంసాహారులు. ఉన్న కొద్ది పశువులూ త్వరలోనే ఆహారం కోసం ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. మొట్టమొదటి హిందూ మత గ్రంథాలలో (బౌద్ధం విస్తరించిన తరువాత, హేతుబద్ధంగా వ్రాయబడినవికావు) గోమాంసం ఆహారంలో ప్రధాన భాగమని వ్రాయబడింది. భారత విజ్ఞానం అనబడేదంతా గోమాంసం తిని, సోమపానం చేసిన ఋషుల నుండి సంక్రమించినదే. కొత్తదేశం వచ్చిన సంచార జాతివారు క్రమేణ నాగరికులయ్యారు.  దేశ దిమ్మరితనం మానేసి ఒకచోట వ్యవసాయ వృత్తిలో ఉండసాగారు. తాము ఓడించిన వారిచేత బానిసల మాదిరి చాకిరి చేయించుకుంటున్నా, వ్యవసాయానికి పశువులు గూడా బాగా ఉపయోగిస్తాయని తెలుసుకున్నారు. ఎద్దులను ఆహారంగా వాడేకన్నా ఉత్పత్తి సాధనంగా వ్యవసాయ పనుల్లో వాడితేనే సమాజానికి ఎక్కువ ఉపయోగమనుకున్నారు.
ఈ ఉపయోగానికి దైవత్వం అంటగట్టారు. ఆలోచనాపరంగా వెనుకబడినవారు మత దృష్టితోనే ఆలోచించగలరు. ఎప్పటికీ పాడి పశువులను తమ చాకిరీకి వాడుకోవాలనే స్వార్థంతోనే గోవధ చాలించారు. గోవును సంరక్షించి గోమాత అన్నారు. గోమాత తన సంతానాన్ని మనుషుల విలాసానికి  బానిసలుగా చేయవలసి వచ్చింది. ఒక్కవేటుతో బలి కోరుకుంటుందో లేక జన్మంతా బానిసగా బ్రతుకుతుందో అని ఎద్దునడిగితే ఏమి చెపుతుందో అనేది చాలా ఆసక్తి కలిగించే విషయం. ఎద్దులేమి కోరుకుంటాయో తేలికగా ఊహించవచ్చు. నేనే ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఏమాత్రం పొరపాటు చేయను. నా పశు సోదరులు కూడా తెలివిగానే నిర్ణయం చేసుకోగలవనుకుంటాను. ఎల్లప్పుడు బండ చాకిరీ చేసే బదులు కొద్దికాలమైనా సుఖంగా జీవించటం ఎంతోహాయి.
ఇంతకీ తప్పు రెండువైపులా ఉన్నది. పశువులు మనిషి మచ్చికకు లోనుకావటం పొరపాటు. అందుచేతనే అవి బాధకు గురి అయ్యాయి. అవి మానవుడికి పనికొచ్చేవిగా కనిపించాయి. మానవులు అతి తెలివిగా వాటిని ఉపయోగించుకోసాగారు. మేం పిల్లులం మాత్రం మనిషి జాతికి ఉపయోగపడకుండా జాగ్రత్తపడ్డాం. అందుకే పురాతన హిందువులు మమ్మల్ని ఏవగించుకొంటారు. అన్ని ప్రాణుల్లో చూడగలిగిన పరమాత్మను మాలో చూడలేరు.  అయితే మాత్రం ఏముంది? మేము స్వేచ్ఛా జీవులం. స్వేచ్ఛకంటే మించిన దైవం ఏముంది? సనాతన హిందువులారా? మీరీ సత్యాన్ని తెలుసుకోండి, మీ ఆత్మ వికాసానికి ఎంతో తోడవుతుంది.
గోమాత తన సంతానాన్ని శాశ్వతంగా మానవ దాస్యానికి అంకింతం చేసింది. గనుక హిందువులు గోవధ మానివేశారు. అందుకు వారిని నేను తప్పు పట్టటం లేదు. ఇందులో సామాజిక అవసరమే తప్ప నీతి ప్రమేయం ఏమీ లేదు. ప్రాచీన నాగరికతంతా మనుషుల, పశువుల బానిసత్వం మీద ఆధారపడినదే. బానిస విధానం లేకపోతే గ్రీకు నాగరికతే లేదు. శూద్రులు లేకపోతే బ్రాహ్మణుల ఆధిక్యం ఉండేది కాదు. నేటి విద్యావంతులు కూడా గోపూజను హేతుబద్ధం చేయబూనటమే అభ్యంతరకరంగా ఉంటుంది.
ఇప్పటి కాలంలోనే గోపూజలో నమ్మకం ఉన్నవారు జీవకారుణ్యమే గోపూజకు మూలమని చెపుతున్నారు. ఇది అర్థంకాని వాదన అని తెలుస్తున్నది. అనేక రకాల జంతువులపట్లే కరుణ చూపటమెందుకు? ఈ విషయం సరిగా పరిశీలిస్తే జీవకారుణ్యమే మోసంతో కూడినదనిపిస్తుంది. అవును ఆహారంగా వాడటం కంటే దాని  సంతానంతో చాకిరీ చేయించుకోటమే లాభసాటిగా ఉన్నది. జీవకారుణ్యం పేరుతో ఆవును మరొకరకంగా వాడుకుంటున్నారు. సమాజశ్రేయస్సు దృష్టితో గోవధ మానవలసి వచ్చినా, ఆధ్యాత్మిక విజ్ఞానానికి మూలపురుషులైన ఆర్యుల చేత గోమాంసం తినటం మాన్పించటం అంత తేలికైన పనికాదు. ఇతర జంతుబలిని సమర్థిస్తూ వేదాలలో ఎక్కడా రాసి లేదని మీరు వాదించవచ్చు. దానికి సమాధానం నేను చెబుతాను. గోపూజ చేయాలని వేదాలలో ఎక్కడా లేదు. వేదకాలం పురుషులు దిట్టమైన మాంసాహారులే. ఒకే నాగరికతలో మెలుగుతున్న ఇతర మనుషులకంటే హిందువులు యెక్కువ దయామయులని చెప్పలేం. నన్ను వాళ్లు అమానుషంగా చూస్తారు. మరివారు దయామయులెలా అవుతారు?
ఈ సందర్భంలో శాకాహారుల విషయం ముచ్చటిస్తాం. నేను మాంసాహారిని గనుక ఈ విషయంలో నాకు పట్టుదల ఎక్కువ. మేము మాంసాహారులం గనుక హిందువులు మమ్మల్ని ద్వేషిస్తారు. నేను యే ఎలుకనో పట్టి చంపినప్పుడు నన్ను పాపిగా చూస్తారు. ఈ భూమిని అపవిత్రం చేస్తున్నానంటారు. గోవధ నిషేధం హేతుబద్ధం కాదని చెప్పటానికి శాకాహారం గురించి కొన్ని సంగతులు చెపుతాను.
                               
                మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

Telugu friends in Dallas, Tx, USA organised a meeting to observed the centenary of Late Puccalapalli Sundaraiah, the communist leader. I participated in it through skype : link:
http://www.youtube.com/watch?v=FLJKg4aGUHw&feature=youtu.be

గుర్రపు పందాల ఫాసిజం-పిల్లి చెప్పిన కథ - 4





సరే! ఇవన్నీ మనిషికి సంబంధించిన విషయాలు. నా జీవితం కష్టాలతో కూడినదనటానికి మనిషి గూడా తోడ్పడ్డాడు గనుక మానవుల గురించి సందర్భానుసారంగా క్లుప్తంగానూ, వివరంగానూ రాస్తాను. తనకు దగ్గర బంధువులైన జంతువులను సైతం మనిషి అర్థం చేసుకోలేని స్థితికి వచ్చాడని చెబుతున్నాను. మనిషి ఇష్టపడి, అర్థం చేసుకొని బాగా చూస్తాడనుకునే జంతువు గుర్రాన్నే ఉదాహరణగా చెప్పుకుందాం. గుర్రాన్ని అడిగి చూడండి. దాని అనుభవం అదేమి చెపుతుందో, గుర్రం స్వామి భక్తిగలదని పొగిడి పద్యం వ్రాసేవారెవరైన, ముందుగా మనిషి గురించి దాని అభిప్రాయమేమిటో అడిగి కనుక్కున్నారా? తమ పురాణాల ప్రకారమే ప్రపంచాన్నంతా కొలువ చూస్తాడు. గుర్రాన్ని మనిషి ప్రేమిస్తున్నాడంటే తనకు తాను ప్రేమించుకున్నట్లే, మనిషికి గుర్రం అంటే నిజంగా ప్రేమ ఉంటే దాని వీపు ఎక్కి అది నురగలు కక్కే దాకా పరుగులు తీయిస్తాడా? దాని ప్రాణానికి హాని కలిగించే పరుగు పందాలు పెట్టి గెలిచి బహుమతులు పొందగోరతాడా? తమ యజమాని ఇంత బాధపెడుతున్నా, ఇంత నీచంగా చూస్తున్నా గుర్రాలు సంతోషంగా ఉన్నట్లు ఎందుకు  కనపడతాయని మీరడగవచ్చు. ఈ విషయం జర్మనీ ప్రజలనడిగితే మీకు సమాధానం దొరుకుతుంది. నాగరిక జర్మనీని మధ్య యుగపు కిరాతకానికి దిగజార్చ పూనుకున్న హిట్లర్ ను గెలిపించటానికి వారంతా ఎందుకు ముందుకు వచ్చారో తెలుసుకోండి. ఆ జర్మన్ ప్రజలు ఈ పెంపుడు గుర్రాలవలె ‘మేమెలా  చేసామా?’ అని నోళ్ళు తెరచి ఆశ్చర్యపడవచ్చు. మిలటరీ బ్యాండ్ వినగానే సైనిక శ్రేణుల్లో నిలబడి ‘హేల్ హిట్లర్’ అని సైనిక వందనం చేయటానికి ప్రేమతో కూడిన క్రౌర్యానికి ఉత్సాహంగా లోబడతాయి.  ఈ రెండు ఉదాహరణలలో ప్రవర్తన నిర్బంధంతో ప్రారంభమై క్రమంగా బానిస మనస్తత్వంగా రూపొందినా లోలోపల వున్న అసహ్యం పూర్తిగా మరుగైపోదు.


మూలం     తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల