ebook of Innaiah Narisetti -Misimi Vyasalu

http://paradarsi.wordpress.com/2013/01/31/misimi-vyasalu/

Posted by Mr Bhaskararao Chimakurthi
పిల్లి చెప్పిన కథ - 4

రామాయణం ఆటవికులదే

ఆధ్యాత్మిక ఇతిహాసాలు విమర్శించదగినవైనప్పటికీ నాకా శక్తి లేదు. సందర్భాన్ని బట్టి ఇక్కడ ఒక విషయం సూచిస్తాను. హనుమంతుణ్ణి ఆరాధించటం మాత్రం మూల పురుషుడికి కొలువులు కొలిచే ఆదిమవాసుల పద్ధతి అనిపిస్తుంది నాకు. నా సూచన ప్రకారం విషయాన్ని పరిశీలిస్తే పరిశీలకుల ధోరణి బట్టి రెండు విధాలైన నిర్ణయాలకు రావడం జరుగుతుంది. ఆధునిక విజ్ఞానం సాధించిన విజయాలు భారతీయులకు వేల సంవత్సరాలనాడే తెలుసునని రుజువు చేయదలచేవారు రామాయణ కావ్యం రాసినవారికి డార్విన్ సిద్ధాంతం ఆనాడే తెలుసునని ఢంకా బజాయించి చెబుతారు. కాని విమర్శనా దృష్టితో చూస్తే దానికి విరుద్ధమైన నిర్ణయం చేయవలసి ఉంటుంది. రామాయణ కాలపు ప్రజలు మూలపురుషుణ్ణి ఆరాధించే ఆటవికులూ రెండూ ఎలా కాగలరనే ప్రశ్నకు దారి తీస్తుంది. ఈ సమస్యకు సమాధానం ఊహాపరంగా లభించదు. పురాణాలకు గల చారిత్రక విలువను శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి నిర్ధారించాలి.
మాట్లాడగల శక్తి వలన మనిషి మిగతా జీవులలో ప్రత్యేకత సంపాదించాడు. అది అతనికొక వరమనాలి. ఈ శక్తి వల్లనే మానవులంతా ఒక ప్రత్యేక జాతిగా రూపొందటానికి వీలయింది. ఇందు మూలముగా మనిషి మిగతా జంతు ప్రపంచానికి దూరమై ఇతర ప్రాణులను అర్థం చేసుకునే శక్తిని కోల్పోయాడు. మానవుడు జంతువులతో వేరైనంత మాత్రాన గొప్పవాడని అర్థం కాదు. జంతు దశను దాటానంటాడు మానవుడు. అది నిజమేనా.. అని ఆశ్చర్యపోతాను. నిజం కాదంటుంది జీవ పరిణామ శాస్త్రం. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం మానవాధిక్యతకు విలువలేదు. మనిషి మంచి నడతకైనా, చెడు నడతకైనా అతనిలోని జంతు స్వభావమే కారణమని మనో విశ్లేషణ నిర్ణయిస్తుంది.

                                                        మూలం    తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

పిల్లి చెప్పిన కథ - 3 పిల్లుల దేవుడు




మనిషి తన చుట్టూ వైజ్ఞానికంగా ఒక గిరిగీసుకున్నాడు. ఏదైనా తన భాషలో చెపితేగాని అర్థం చేసుకోలేడు. తన జ్ఞానం, భావ ప్రకటన శక్తి పరిమితమైందని తెలుసుకుని గూడా సిగ్గుపడకపోగా గర్విస్తాడు. తను మాట్లాడగలడు కనుక తన దేవుని సృష్టిలో తానే మిన్న అనుకుంటాడు. అతని దేవుడు మానవ దేవుడు. ఆ దేవునికి మానవులు కానివారిని అర్థం చేసుకోవటం చేతగాదు. అలాంటి దేవుడు మాకు పనికి రాడు. మా దేవుడు మాలాగానే వుండాలి. నాలాంటి అందగత్తె పూజలందుకోవాలంటే మా దేవుడు ఠీవైన చక్కని గండుపిల్లిలా వుండాలి. (అన్నట్లు, నేను ఆడో మగో చెప్పానా?) భారత దేశానికి చెందిన ఆడ పిల్లిని అవటం చేత పురాణ స్త్రీల సాంప్రదాయాలు నాకూ అంటుకున్నాయి. స్త్రీకి భర్తే దైవం. ఇది ప్రత్యేకించి ఒక్క భారత స్త్రీల ఆదర్శమే కాదు. అది అందరి స్త్రీల ఆదర్శం – పురుషుని ఆరాధించే ఈ స్త్రీ ఆచారాన్ని నేనూ పాటిస్తున్నాను. ఇది జీవపరిణామ సహజ లక్షణం. ఇది కాదనలేను.

ఈ మూర్ఖ లక్షణాన్ని గురించి ముందు సందర్భం వచ్చినప్పుడు విపులంగా చెపుతాను.
మనిషి మాట్లాడగలగటం గురించి చర్చిద్దాం. కొన్ని జీవులు నాలుగు కాళ్ళున్నా రెండు కాళ్ళమీదే నడవాలనుకున్నాయి. ఉన్నత స్థాయి జీవులన్నిటికీ సృష్టికర్త నాలుగు కాళ్ళిచ్చి చనిపోయేదాకా   ఈ శరీరాన్ని మోయమన్నాడు. కాని కొందరు విధి నిర్ణయానికి ఎదురీతగా రెండు కాళ్ళమీద నడవదలిచారు. ఇలా అనుకోవటంలో కొంత స్వార్థం లేకపోలేదు. చెట్లు చేమలు పాకి రసభరితమైన పండ్లన్నీ తామే తినాలని వీరి కోరిక. దేవుని నిర్ణయాన్ని ధిక్కరించిన ఆది మానవుడు తన సాహసానికి తానే బెదిరిపోయాడు. దేవుని తృప్తిపరచే ఉద్దేశ్యంతో మనిషి తనలాగే రెండు కాళ్ళతో చేశాడు.

                                                          

  
మూ
లం:
  
ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ 
కోమల

తెలుగు సేత

అత్తదనం !!-----పిల్లి చెప్పిన కథ - 2




పాతుకుపోయిన నియమాల్ని  పాటించకపోతే భారత సమాజ చట్రం బద్దలౌతుంది. ప్రపంచాన్ని మళ్ళీ నిర్మించడానికి ఏ ఆదర్శమూ మిగలదు. భారత ఆధ్యాత్మిక సంస్కృతి చాలామట్టుకు మూఢ నమ్మకాలతో నిండిపోయింది. దీనికి మతం ముద్రవేసింది. వాస్తవాలకు గౌరవం లేదు. బొత్తిగా అర్థం పర్థం లేని భ్రమలు ఆచరణలో వున్నాయి. మన పూర్వీకుల వివేచనను కొలవడానికి పాశ్చాత్యుల భౌతిక ప్రమాణాన్ని తీసుకోకూడదు. పూర్వీకులు, పెద్దలు, వివేచనాపరులు. ఇందుకు వయస్సు ముఖ్యం కాదు. ప్రమాణాలను కొలవడానికి కోడిగుడ్డుపై వెంట్రుకలు లెక్కించే తర్కం పనికిరాదు. శరీరాన్ని బట్టి చూస్తే వయస్సుకు ప్రాధాన్యత వుండొచ్చు. ఆత్మ నిత్యం. దానికి వయస్సు లేదు. శారీరకంగా అత్త చిన్నదే కావచ్చు. కాని ఆత్మ దృష్టితో అత్తదనం అనుభవించే అవకాశం అత్తకు వుండాలి. మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు కంటే అత్త వివేచన ఆధిక్యతలో వున్నది. అత్తదనంలో వున్న యీ హక్కు విడదీయరానిది. తిరుగులేనిది.

అత్తదనం!! ఈ మాట కనిపెట్టడంలో నేను సైతం తత్వశాస్త్రానికి మూలభావాన్ని అందించగలుగుతున్నాను. పిల్లిగా నేనెరిగినంతలో, ప్లేటో యిలాంటి భావానికి మూలపురుషుడు. గుర్రపుదనం, ఏపిల్ దనం, చెట్టుదనం చెప్పిన ప్లేటో అత్తదనం వూహించలేదు.
నా పెదతండ్రి పులి గంభీర  జంతువు. మనుషులు దాని ముందు  తీసికట్టు. మనుషులకు చెప్పగల  హక్కు మాకువున్నా, నేను భారతీయ సందేశాన్ని అందించడానికి, సాధారణ మార్గాన్ని ఎంచుకున్నాను. నేను మనుషుల మధ్య బ్రతికాను. కనుక రోజువారీ విషయాలలో జరుగుతున్న విషయాలను సరిగా ఆలోచించే చెప్పదలచాను. నేను చెప్పేదంతా సూటిగా సాహసంగా వుంటుంది. నాకు తెలిసినంత వరకు నేను కనుగొన్నంత మేరకు మానవుల కథ వెల్లడిస్తాను. రాగ ద్వేషాలు లేకుండా చెబుతాను. నన్ను గురించి చెప్పబోవడంలేదు. నా జీవిత సంఘటనలు చూపుతాను.

రాగద్వేషాలు జీవిత లక్షణాలు. అవి లేకుంటే జీవితం లేదు. నేను లేకుంటే నా కథ వుండదు. రాగ ద్వేషాతీతంగా సొంత కథలు చెబుతానంటే జాలిపడాలి. అది ఆత్మవంచన. తనకు తాను అబద్ధాలాడటమే జీవితం అంటే ఆకలి, ప్రేమ, ద్వేషం, కోపం, దయ మొదలయిన వాటి కలయికే. ఇందులో కొన్నిటి కారణంగా నాకు మానవులతో సంబంధం ఏర్పడింది. నాకు ఆకలేసినప్పుడు నిర్దాక్షిణ్యంగా చూచిన మనిషిపట్ల నాకు ఆగ్రహం లేకపోతే నాలో మానవత్వం లేనట్లే. అలాంటప్పుడు మనిషి నిజ స్వభావం బయటపడుతుంది. జైలులో మానవుడి నిజస్వరూపం బయట పడిన సందర్భాలలో నేను అతడిని చూచాను. కనుక నా నిర్ణయాలు నిష్పాక్షికంగా వుంటాయి. నిష్పాక్షికం అంటే రాగద్వేషాలు లేవనుకోరాదు. నిష్పాక్షికత అంటే వాస్తవం అన్నమాట. రాగద్వేషం జీవితంలో మౌలిక సత్యం.
బెర్నాడ్ షా గొప్ప రచయిత. అతడి ఆధారంగా నా కృషి ప్రారంభిస్తాను. షా వినయంగా ఆరంభించినట్లే  నేనూ సమతతో మొదలెట్టి ఫలవంతం చేస్తాను. ఒక కళాకారునిగా నేను సఫలం కాదలచలేదు. సాంఘిక విమర్శకునిగా జయం పొందదలచాను. యవ్వనంలో బెర్నాడ్ షా చూపిన సాహిత్య ప్రతిభ అంతా విఫలమైపోయింది. నాకు అలాంటి లోపంలేదు. కనుక విజయం పొందగలను. నేను ఎలా చెబుతున్నాను అనే కంటే, ఏమి చెబుతున్నాను అనేది ముఖ్యం.

బెర్నాడ్ షా ‘ప్లేస్ అన్ ప్లజంట్’ అనే తన నాటకాలకు యిలా ముందుమాట రాశాడు. కళాఖండాల కోవలో నా నాటకాలకు స్థానం లభించాలంటే, నేను విచారంతో వేచి వుండాలి.  విషయాన్ని బట్టి నా మిత్ర పాఠకులొకరిద్దరు నాటకాలపట్ల ఆసక్తి చూపొచ్చు. అభినందించవచ్చు, ఆనందించవచ్చు. కాని నా రచన రమణీయంగా, హార్థంగా వున్నదనలేరు. ఇతి వృత్తంలో చేదు జీవిత సత్యాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇందులో పాత్రలు ఉన్నతంగా మాట్లాడరు, నాజూకుగా నివశించరు. తమ జీవిత స్థితిగతులను చిత్తశుద్ధితో ఎదుర్కోరు. సుఖప్రదమైన జీవితంలోని ఆనందాలకు, సౌందర్యాలకు ఈ రచనలో తావులేదు. కలుషిత విషయాలను పైకి తెచ్చి బట్టబయలుచేసి, పాఠకులను నవ్విస్తారు. ఇది నా దోషం కాదు. రామణీయకత కంటే నా తెలివితేటల వికారాలు, నైతిక దృష్టి నారచనలలో కనిపించడం నా తప్పు కాదు.

పిల్లి కథ మనుషులకు ఎందుకు ఆసక్తిగా వుండదు? పిల్లి తన సొంత గాథను ఎందుకు చెప్పకూడదని లోగడ అన్నానుగదా నా జాతివారు తమ తమ కథల్ని వినిపించనూవచ్చు. అవి మనుషులకు ఉపయోగపడనూవచ్చు.  ఈ మాటలంటే తగాదా వస్తుంది కూడా. మనుషులకు ఆడంబరం జాస్తిగదా! మనిషిస్థానం ఈ విశ్వంలో అనల్పం అని గ్రహిస్తే యింత గర్వం వుండదేమో. ఈ విశ్వధూళిలో మానవుడు సంచరించే ఒక బొగ్గుకణం అని తెలుసుకుంటే తన ఆండంబరానికి తానే సిగ్గుపడతాడు కూడా.

మనుషుల గర్వాన్ని దెబ్బకొడుతూ  కోపర్నికస్ శాస్త్రజ్ఞుడు  ఖగోళ శాస్త్రాన్ని తిరగదోడాడు. అనుకోని సంఘటనగా సూర్యమండలం ఏర్పడినట్లు ఆయన చూపాడు. వేదాంతులు పేర్కొన్నట్లు  అనంతసృష్టికి మానవుడు పరిమిత ప్రతిబింబమైతే  ప్రత్యేక దైవదృష్టికి మనిషికి యింత అవమానకరమైన స్థానం యెందుకున్నట్లు? భౌతిక విశ్వంలో అనంతంగా నక్షత్రాలున్నాయి. అందులో సూర్యుడు ఒకటి, లక్షలాది నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ మానవుడు కొరకు అమర్చిన వేదిక కాదుకదా. విశ్వం అంతా మానవుడి కొరకు, అతడి జీవితం కోసం ఏర్పడింది కాదు. మహోన్నత సమన్వయంలో మానవ జీవితం ఒక బుడగవంటిది. అందులో భాగంగా రవీంద్రనాథ్ ఠాగూర్, ఎడ్గార్ వాలేస్ వున్నారు. నేనూ వున్నాను. సంచరించే ప్రతి ప్రాణి కూడా ఈ అపఖ్యాతిలో భాగస్వాములే.

మనిషి, కోతి, గుర్రం, కుక్క, పిల్లి, గబ్బిలం అట్లాంటి ఉన్నత ప్రాణులన్నీ ఒకేరీతిగా  కనిపించే అండం నుండి పుట్టినవే. గొప్పరచయితలకూ నాకూ ఈ పుట్టుకలో తేడా లేదు. ఈ పోలికను జీవపరిణామంలో అంతటా చూడొచ్చు. నేను ఆ తల్లి కడుపులో వున్నప్పుడు 2 మాసాలప్పుడు చూస్తే, ఇతరులకూ నాకూ తేడా వుండదు. ఇందులో తండ్రిపాత్ర రేతస్సు కణాన్ని అందించడమే. అది తల్లి కడుపులోని అండంతో కలసి పిండం ఏర్పడుతుంది. ఈ పుట్టుక తలవనితలంపుగా జరుగుతుంది. ఇందులో కూడా గొప్ప వ్యక్తికీ నాకూ తేడా వుండదూ. తల్లి గర్భాన్ని ఆశ్రయించి పిండం పెరుగుతుంది. తల్లికి లభించే క్లోరోఫిల్ సూర్యుని నుండి వస్తుంది. మనం బ్రతకడానికి అవసరమైనదంతా సూర్య కిరణాలనుండి అందుతుంది. తల్లి అందం, తండ్రి రేతస్సు అనుకోకుండా కలిసినప్పుడు, వీటికి సూర్యరశ్మి శక్తి తోడైనప్పుడు పుట్టుక జరుగుతుంది. ఇందులో గొప్ప మెదడు వున్నదనుకున్న మనిషికి, ఇతర జీవులకూ తేడా లేదు. నేనూ అలాగే పుట్టాను. ఇవన్నీ తిరుగులేని జీవిత సత్యాలు. కనుక మానవుడి గర్వానికి ఆధారం లేదు. నా శరీరానికి, మానవ శరీరానికీ, ఆకారానికీ, గుణంలోనూ యెలాంటి తేడా కనిపించదు. మానవుడు తనలో దైవ గుణాలూ, అద్భుత శక్తులూ ఉన్నాయి గనుక గొప్పవాణ్ణి అనుకుంటాడు. రెండుకాళ్ళమీద నడిచే వాళ్లకూ, నాలుగు కాళ్ళమీద నడిచే మాకూ తేడా లేదు.  ఈ విషయంలో నేనింకా యెక్కువ చెప్పినా నాకు పోయేది ఏమీ లేదు. పిల్లికి కూడా మెదడుంటుందా అని యెగతాళి చేయకుండా నా మెదడును పరిశీలించండి. జీవపరిణామంలో మెదడు పరాకాష్ఠ. అంటే భౌతికంగా ఇది అతి ఉన్నతమైన దశ. అంతేగాని పరిణామం వలన ఇది జనించింది అని కాదు. ఆధ్యాత్మిక చింతనగల మానవుడి మెదడుతో నా మెదడు వుంచి శరీర శాస్త్రవేత్తను పరిశీలించమనండి. సైజు తేడా తప్ప మిగతా తేడా ఏమీ ఉండదు. శరీర శాస్త్రవేత్తకు ఏ మెదడు యెవరిది అని తెలుసుకోవటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. చూడండి! పిల్లులలో కూడా ప్రతిభ గలవి ఉంటాయి. నేను ప్రతిభగలదాన్ని కాదని మీరెట్లా అనగలరు? ‘పిల్లి పుస్తకం రాయటమేమిటి’ అని మీరంటే ‘యెందుకు వ్రాయకూడదూ’ అని యెదురు ప్రశ్న వేయగలిగానంటే నా సత్తా మీకీసరికి తెలిసే వుంటుంది.

ఇప్పటిదాకా మానవులకే పరిమితమైన  సరస్వతీ దేవిని నేనూ ప్రసన్నం చేసుకున్నానంటే మళ్ళీ యెన్నో ప్రశ్నలను నేను యెదుర్కోవలసి ఉంటుంది. నాలుగు కాళ్ల జంతువులకు కూడా మేధస్సు, ప్రతిభ వుంటే అవి యెక్కడా బయట పడలేదేమని ప్రశ్నలేయవొచ్చు. ఇలాంటి అనుమానాలు కలుగుతాయని నాకు ముందే తెలుసు. ప్రశ్న అసంబద్ధమైనా సమాధానం చెప్పటం తేలికే సాపేక్షతా సిద్ధాంతం పదార్థ విజ్ఞానశాస్త్ర పరిధిలు దాటి మానవుల ఆదర్శాలను విప్లవాత్మకం చేస్తున్నది. అప్పుడు మీ సందేహానికి తావుండదు. (వేదాంతులారా! బహుపరాక్!) మానవుల ప్రమాణాలు పిల్లలు మీదా రుద్దకండి. మహాత్ములకున్న అవలక్షణాలు, చరిత్రహీనత పిల్లులకూ, కుక్కలకూ, కోతులకూ ఉండవూ. మానవేతర జంతువులలోని ప్రతిభ వెల్లడి కావటం అనేది వాటి చరిత్రలో యెక్కడా జరగలేదని ఒక నిర్ణయానికి అంత తొందరగా రాకండి!

మూలం;                తెలుగుసేత
ఎమ్.ఎన్.రాయ్       వెనిగళ్ళ కోమల

పిల్లి చెప్పబోయేకథ--1



ఒక పిల్లి. అదీ దొంగ పిల్లి – అలగా జాతి పిల్లి తన కథను లోకానికి చెబుతోంది. ఇది అపూర్వం. సాహిత్య చరిత్రలో ఇంతవరకూ ఇలా జరగలేదు.
నవ్వొస్తుంది కదూ మీకు? సంఘపరంగా చెప్పబోయే నా కథను క్రమేణా వింటారు.
చిక్కు సమస్యగా తోస్తున్నదా!
కాని నా కథ వినడానికి ఆసక్తిగానే వుంటుంది. అంతా చదివిన తరువాత నిరుత్సాహపడరు.  ఎంత ఆసక్తిగా వుంటుందో చెప్పలేను గానీ, విజ్ఞాన పూరితంగా వుంటుందనడంలో సందేహం లేదు.  సాహిత్యంలో సఫలం కావాలంటే వినయం అవసరం. రచయితలకు వినయం లోపిస్తే, సాహిత్య ప్రపంచంలో గొప్పవారుగా కనిపించేవారే కాదు. అయితే, ఇదేమంత దురదృష్టం కాదని చతురాడే నిరాశావాదులున్నారు. నేను నిరాశావాదిని కాదు. అయినా ఈ విషయంలో వారితో ఏకీభవిస్తాను.
అచ్చువేసేవారు. అమ్ముకునేవారు  లాభాలు గడించవచ్చు. వారి సంగతి  అలా వుంచండి. కొందరు హఠాత్తుగా  పెద్ద రచయితలైపోతారు. వారి రచనలు విపరీతంగా అమ్ముడు  పోతాయి. ఎంతమంది రచయితలు  పెరిగారో దానినిబట్టి సాహిత్య  వికాసాన్ని కొలవరాదు. ఎంతమంది  పాఠకులున్నారనేది ముఖ్యం. ఇదికూడా పిల్లి మనస్తత్వం  కావచ్చు. నేను పిల్లిగా నా నీడ నుంచి తప్పుకోలేను కదా!
ఇదంతా విడ్డూరంగా అనిపిస్తున్నది గదా! ఒకవైపు రచయితల్ని వెక్కిరిస్తూనే మరోప్రక్క నేను రచయితల జాబితాలో చేరబోతున్నాను. ప్రపంచంలో పనికిరాని పుస్తకాలకు నేను సైతం మరొకటి జోడించి, పనికిరాని పుస్తకాలను పెంచబోతున్నాను. చదువురాని పిల్లి తార్కికంగా వుండాలనుకోవద్దు. చదువుకున్న పిల్లి చెడ్డదనుకుంటే, తర్కం వచ్చిన పిల్లిని భరించడం కష్టం. మొదట్లోనే పాఠకుల సహనాన్ని పరీక్షకు పెట్టదలచుకోలేదు.
అచ్చం పిల్లిలాగా ఎటో వెళ్ళిపోయాను. నా కథతో ఎందుకు మొదలుపెట్టలేదో మనవి చేస్తాను. కొద్దిగా జంకాను. చేయబోయే సాహసమే యిందుకు కారణం. పిల్లి కథ మనుషులకు ఎలా ఆసక్తి కలిగిస్తుంది? ఎందుకు కల్పించకూడదు అనిపించింది. ఏమైనా, సందేహిస్తూనే నా కథ ఆరంభిస్తున్నాను.
మనుషుల్ని దగ్గరగా చూచాను. జైల్లో కొంతకాలం గడిపాను. నేను ఆడపిల్లిని. కాని స్త్రీలతో  నాకు పరిచయం ఏర్పడలేదు. వాళ్ళూ నా వలె ప్రవర్తిస్తారనుకుంటున్నాను. నా వ్యక్తిగత అనుభవానికి తోడు, నా జాతి అనుభవం అంతా నా ముందున్నది.
పిల్లులు గృహ జంతువులు అనడానికి వీల్లేదు. అంటే పిల్లులు మనుషులకు చేరువగా మసలినా, వాళ్ళ స్వార్థానికి పూర్తిగా లొంగకుండా బానిసలుగా మారకుండా వుండగలుగు తున్నాయి.
ఇళ్లల్లో పొయ్యి మాకు వెచ్చని  స్థావరం. అక్కడ వుంటూ మానవ స్వభావాన్ని బాగా చూస్తుంటాము. నేను యిళ్లల్లో గడపలేదు. జైలులో వున్నాను. అదీ గమ్మత్తుగా వుంది. మనిషిలోని పశుత్వం యిక్కడ కూడా తొంగి చూస్తుంది. అనేక మనస్తత్వాలను పరిశీలించడానికి జైలులో నాకు అవకాశం కలిగింది. మా పిల్లి జాతికి తెలిసింది ఎక్కువ కనుక ప్రపంచంపట్ల నిరాశ పెరిగింది. ఉదాశీనంగా పరిశీలించ గలుగుతున్నాం. మనుషుల్లో వున్న అజ్ఞానం చూసి ఆశ్చర్యపడ్డాం. నెలల తరబడి ఆలోచించి, నాకు తెలిసిందంతా చెప్పకపోవడం స్వార్థం అనిపించుకుంటుందనుకున్నాను. ఇలాంటి నిస్వార్థ నిర్ణయంలో, సాహిత్య ఆసక్తితో రంగ ప్రవేశం చేస్తున్నాను.
ఇదంతా ఆనందదాయకం అనుకోవద్దు. ఎక్కడో ఒకచోట మానవుడి గుట్టు బయటపెట్టాల్సి వస్తుంది.
“సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్
మా బ్రూయాత్ సత్యం అప్రియం”
అన్నారు. మన ఋషులు, ఎంతో తెలివితో చెప్పారు. (నిజం చెప్పు కాని ఇష్టమైన నిజం చెప్పు. ఇంపుగా లేని సత్యం చెప్పవద్దని  అర్థం) చిరకాలంగా వస్తున్న ఈ మాటల్ని పాటిస్తే నా సాహిత్య సాహసయాత్ర జయప్రదమవుతుంది. ఒక పిల్లి తొలి జీవిత చరిత్రను స్వీకరిస్తారు. బాగా అమ్ముడు  పోవచ్చు కూడా. ఇంపుగా లేని వాస్తవాలను వదిలేసి అవాస్తవాలను  చక్కగా చెబితే సరిపోతుంది. పైగా అదంతా దైవం చెప్పినవని కూడా పేర్కొనవచ్చు. వ్యక్తిగతంగా నాకు మేలు జరిగినా, ప్రజలకు  హాని జరుగుతుంది. కాని నిస్వార్థంగా నేనీ సాహసయాత్రకు పూనుకున్నాను. కనుక నిష్కామకర్మ చేయదలచాను. మా జాతి స్వార్థానికి పెట్టింది  పేరు. కానీ నేనందుకు భిన్నంగా పోదలచాను. అయితే పిల్లి జాతి సంపద అంతా నాకు సంక్రమించింది. సొంతంగా నిర్ణయించుకోగలను. ఎవరినీ నమ్మను. ఎవరినీ పట్టించుకోను. నాని నా చాదస్తం నాది. నిస్వార్థంగా నిజం చెప్పదలచాను గనుక. నా నిర్ణయానికి తిరుగులేదు.
నా సందేశాన్ని ఎలా అందజేస్తే  బాగా నాటుకు పోతుందో చూడాలి. సందేశం ఇవ్వడంలో వెనకా ముందూ  లేదు. ప్రపంచాన్ని కాపాడటానికే  ఇండియా వున్నదనేమాట ఎన్నోసార్లు  నేను విన్నాను. ఇండియాలో నేనూ భాగస్వామిని కనుక ఆ కార్యక్రమంలో రవ్వంత నేనూ భాగం పంచుకుంటాను. అయితే ఆ సందేశం ఏమిటో  నాకే తెలియదు. తీరిగ్గా ఆలోచించటానికి  కావలసినంత విరామం ఉండటంతో, ఈ చిక్కు సమస్యను విప్పగలిగాను. సందేశం ఏదైనా సరే. ముందు  భారతీయులుగా నెరవేర్చడానికి సిద్ధంగా వుండాలి. “నిన్ను నీవు తెలుసుకో” అనేది భారతీయ మూలసూత్రం గదా! ఇందులో కొద్దిగా గ్రీక్ వాసనలున్నాయనుకోండి. అయితే ఇది కూడా ఇండియా నుండే పూర్వం గ్రీకులు కొట్టేశారనడం కూడా నేను విన్నాను. ఏమైనా ఆత్మజ్ఞానం అత్యున్నతమైందనే హిందూ తత్వ సూత్రం ఆచరించాలంటే “నిన్ను నీవు తెలుసుకో” అన్నదే అమలులో పెట్టాలి.
శారీరకంగా చూస్తే నా కంటే అధికులైన మనుషులకు యిలా ఒక చదువురాని పిల్లి బోధించటం ఏమిటి అనుకుంటున్నారా? జీవపరిణామం గురించి బెర్గ్ సన్ ఏమన్నాడో, తెలుసా? జీవపరిణామంలో మనిషి ఎదగకపోగా పతనమయ్యాడట. ఏనుగుతోనో కోతితోనో, పోల్చి చూస్తే మానవుడి శరీరం అతడికి అనుకూలం కాదని బెర్గ్ సన్ చెప్పాడు.
మానవుడికంటే శారీరకంగా  ఆధిక్యతలో వున్న జంతువుల  జాబితాలో పులి, సింహాన్ని  కూడా చేర్చవచ్చు. పులికి అత్తఐన పిల్లి కూడా ఆ పట్టికలోనే చేరుతుంది మరి! కనుక మనిషికి చెప్పే అర్హత నాకున్నది. పెద్దల వివేచనను భారతీయ సంప్రదాయం నొక్కి చెబుతుంది. అది గృహంలోనూ సంఘంలోనూ వున్నది. నేను ఒక ఏడాది ప్రాయంలోనే వున్నా మా జాతి వివేచనా సంపద నాకు సంక్రమించిందని గుర్తుంచుకోండి.
వయస్సు ఎంత వుంటే ఏముంది? అత్త అత్తే. బ్రాహ్మడు బ్రాహ్మణుడే. సంప్రదాయకంగా బ్రాహ్మణుడికి సమాజ అవకాశాలు సంక్రమించాయి. చదువురాని వాడైనా, దుర్మార్గుడైనా సరే బ్రాహ్మణుడికి దండం పెట్టాల్సిందే. గీత చెప్పినట్లు దైవదత్తంగా సంక్రమించిన బ్రాహ్మణాధిక్యత వలన అతడికి గౌరవం యివ్వాల్సిందే. సమాజంలో హెచ్చు తగ్గుల వలె, ఇంట్లో కూడా సంబంధాలన్నీ దైవ నిర్ణయాల్ని పాటించకపోతే భారతదేశం ఏమయ్యేట్లు? జాతి విధ్వసమౌతుంది. అజ్ఞానం, అసూయ, మూఢనమ్మకాలు తలక్రిందులౌతాయి. అవి మన ఉన్నత సంపద గదా!
Memoirs of a cat by M N Roy;   Telugu : Komala Venigalla

పిల్లి మాట్త్లాడగలిగితె----!!

పిల్లి మాట్త్లాడగలిగితె ఏమి చెబుతుంది? జైలులొ పిల్లి స్నెహం చేసిన ఎం.ఎన్.రాయ్ ఆసక్తికరంగా రాసిన సాంఘిక -మానసిక విస్లెషణ సీరియల్ గా అందిస్తాము .వెనిగళ్ళ కోమల తెనిగించిన ఈ రచన బాగా ఆదరణ పొందినది. బ్లాగ్ లొ తొలిసారి ప్రచురిస్తున్నాము . 
Serial starts soon

సన్యాసి సత్యం పలికితే--అగేహానంద భారతి తుదిమాట


బౌద్ధం
నేను నలందాలో ఉండగా, ఇండియా ఎగుమతి చేసే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఏర్పడింది. క్రైస్తవ మతం వలె బౌద్దం కూడా పుట్టిన దేశంలో బ్రతకలేక ఎగుమతి అయింది. మధ్య యుగాలలో 400 సంవత్సరాలపాటు సుప్రసిద్ధ బౌద్ధ అకాడమీగా నలందా పేరు మోసింది. టిబెట్, చైనా, మంగోలియా, మధ్య ఆసియాల నుండి సాధువులు, పండితులు నలందాకు వచ్చి సంస్కృతం, పాళిభాషలు నేర్చారు. బౌద్ధ సంప్రదాయం, తత్వం అధ్యయనం చేశారు. పవిత్ర సాహిత్యాన్ని తమ దేశానికి తీసుకెళ్ళారు. అప్పుడే టిబెట్, చైనా, కుచాన్, సోగ్ డియెన్ మొదలైన భాషల్లోకి పవిత్ర గ్రంథాలు అనువదించారు. నలందా నుండి ఆసియా అంటికి విజ్ఞాన ప్రసాదం జరిగింది. టిబెట్లో లామాలను, ఢిల్లీ, కలకత్తా, లండన్, న్యూయార్క్ గురించి వన్నావా అని అడిగితే తలియదంటారు. కాని నలందాను గురించి వారు విన్నారు. పాండిత్యానికి, పవిత్రతకు నలంతా వారికి పెట్టింది పేరు. నలందాలో తాంత్రిక విద్యను పాటించి ఉంటారు. 5 వేల మంది సన్యాసులను చంపేసిన ఖిల్జీ చాలా పుస్తకాలను తగులబెట్టించాడు. అంతకు ముందే నాలుగు శతాబ్దాల పాటు వందలాది గ్రంథాలు టిబెట్, చైనాలకు వెళ్ళాయి. అక్కడ ఆ భాషల్లోకి అనువాదం అయ్యాయి. టిబెట్ మఠాలలో సంస్కృత గ్రంథాలు కొన్నిటిని భద్రపరిచారు.
నన్ను నలందాకు ఆహ్వానించారు. నలందాను బీహార్  ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొత్తగా నిర్మించింది. అక్కడ కొన్ని మాసాల పాటు నేను బోధించాను. టిబెటన్ అధ్యయనం ప్రారంభించాను. ప్రొఫెసర్ కాజియామా జపాన్ నుండి వచ్చిన పండితుడు. ఆయన జపాన్లో నాకు ఆతిథ్యం ఇచ్చాడు. బౌద్ధ భిక్కు కాశ్యప మహాతేర నన్ను నలందాకు ఆహ్వానించారు. అక్కడ నేను పాళీ సాహిత్యం చదివి బౌద్ధం అధ్యయనం చేశాను.
ఇండియాలో ఒక మతంగా బౌద్ధం ఎందుకు నిలువలేదనే దానికి అనేక కారణాలు చెబుతారు. కులాన్ని తృణీకరించడం ఒక కారణం కాగా, ఆకర్షణ లేని కఠిన నియమాలు అవలంభంచడం మరో కారణమంటారు. బుద్ధుడు చనిపోయిన అనంతరం 300 ఏళ్ళ పాటు బౌద్ధ మఠాలు బాగా వెలిశాయి. 200  సంవత్సరాల పాటు సంపన్నులు, పేదలు, రాజులు, వ్యాపారులు, పండితులు, పామరులు బౌద్ధ భిక్షులు కావడానికి ప్రయత్నించారు. అయితే బౌద్ధం ఏనాడూ హిందూ మతం నుండి పూర్తిగా విడిపోలేదు. హిందూ  సంప్రదాయంలో విభిన్న దృక్పథలు వెల్లడి అవుతూనే వచ్చాయి. అందులో బౌద్ధం కూడా ఒకటయింది. బుద్ధుడిని హిందూ దేవుళ్ళలో కలిపేశారు. బుద్ధుడిని అవతారం చేశారు. బుద్ధుడు వేరే ఏదో బోధించాడని పునరుజ్జీవ హిందువు అంగీకరించడు.
బౌద్ధ బోధనలో మతేతర స్వభావం ఉన్నది బౌద్ధం క్షీణించడానికి అదొక కారణంగా వచ్చు. తరువాత వచ్చిన బౌద్ధం అద్వైత వేదాంతానికి సన్నిహితంగా ఉండే తత్వాన్ని చెప్పింది.
నేను నలందాలో చేరిన రెండు రోజులకే సయామ్ సాధువులు పరిచయమయ్యారు. వారిలో ప్రమహ మానస్ చిత్తదాసు పుంగ్ల మాచియాక్ అనే బౌద్ధ భిక్కు థాయ్ లాండ్ లో బౌద్ధ మఠాథిపతి అయ్యాడు. ఆయన ఎమ్.ఎ. చదివాడు. ఇంగ్లీషు బాగా మాట్లాడతాడు. సయామ్ యువ భిక్కులందరూ చాలా సరదాగా ఉండేవారు. స్ర్తీలను గురించి మాట్లాడినప్పుడు మీరు కలవరపడ్డారు. థాయ్ లాండ్లో స్ర్తీల అందాల పోటీలను గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. థాయ్ లాండ్ స్త్రీలు పాశ్చాత్య దుస్తులు ధరించడం మొదలుపెట్టారు.
కలకత్తా నుండి థాయ్ ఏర్ వేస్ ద్వారా ప్రయాణం సాగించాను. నన్ను చూడగానే నయామీస్ ఏర్ హో స్టెస్ పక్కకు తప్పుకున్నది. సన్యాసులకు దూరంగా ఉండటం వారి ఆచారం. స్ర్తీలకు, సన్యాసుల మధ్య మర్యాదలు కఠినంగా పాటిస్తారు. సన్యాసులకు టీ ఇవ్వదలచినప్పుడు వంగిగాని ఇవ్వరు.
బాంకాక్ చేరే సరికి పొద్దు గూకింది. నవ్వుతూ స్నేహ పాత్రులుగా ఉన్న ప్రజలు కనిపించారు. థాయ్-భారత్ సాంస్కృతిక వసతి గృహ డైరెక్టర్ పండిత రఘునాథ వర్మ నన్ను ఆహ్వానించారు. నేను వారి కేంద్రంలోనే బోధించవలసి ఉంది. అక్కడ పురుష సేవకులంతా హిందువులే. నాకు మాత్రం ఒక 40 ఏళ్ళ సయామీ స్ర్తీని వంటకు గాను అమర్చారు. నా కోసం ఆమె భారతీయ పదార్థాలు చేసినా కుదిరేవి కావు.
సయామ్ ప్రజలు మంచి బౌద్ధులు. బుద్ధుడిని మహోన్నతుని గానూ, అతని బోధనలు అత్యున్నతంగానూ భావిస్తారు. వారిలో సందేహవాదులు లేరు. బౌద్ధమే సందేహవాద మతం, సయామ్ తేరవాదదేశం. మహాయాన దేశాలలో వలె బుద్ధుణ్ని విగ్రహారాదన చేయరు. క్షణికవాదాన్ని వీరు గుర్తిస్తారు. బుద్ధుడి కరుణను మూలసూత్రంగా భావిస్తారు. ఒకసారి ఇద్దరు సయామీ భిక్కులు న్యూఢిల్లీలోని బిర్లామందిర్ లో లక్ష్మీనారాయణ విగ్రహాన్ని చూసి కాషాయ వస్త్రంతో నవ్వు ఆపుకున్నారు. దంపతులు చేరొక ఆనలుగు చేతులతో ఉండగా, గుంపులు గుంపులుగా జనం ఆ విగ్రహాన్ని పూజించడం వారికి వింతగా ఉంది. సయామ్ బౌద్ధంలో వ్యక్తిగత దేవుడుండదు. బుద్ధుడు మానవుడు. మానవుడిలోని ఉన్నత లక్షణాలన్నీ నెలకొన్న బుద్ధుడిని థాయ్ లాండ్ లో ఇళ్లల్లోనూ, గుళ్ళలోనూ పూజిస్తారు.  ఈ విషయంలో హిందువులకంటే వీరు చక్కని సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
బాంకాక్ లో రెండు బౌద్ధ మఠాల విశ్వవిద్యాలయాలున్నవి. నలందాలో నేర్చిన వారు మహాచులలాంగ్ కార్స్ అకాడమీ వారు. మరొకటి మహా మాంగ్ కుట్ అనే రాజు స్థాపించిన అకాడమీ. ఇందులో మతాల పోలిక గురించి బోధించాను. నేను ఇంగ్లీషులో చెప్పేవాడిని. మౌలిక విషయాలు సయాం బౌద్ధ భిక్కులకు చెప్పేటప్పుడు ఒక చిక్కు ఎదురైంది. తాత్వికరీత్యా దైవం, ఉనికి, జడపూరిత విశ్వ గురించి వారికి అర్థమయ్యేటట్లు చెప్పటం కష్టమయ్యింది.
బౌద్ధ భిక్కులకు ఉనికి, దైవం గురించి అర్థమయ్యేటట్లు చెప్పగలిగాను. ఇదేదో రుగ్మతతో కూడిన భావన అని తొలిదశలో వారు అనుకునేవారు. బుద్ధుడు చెప్పినట్లుగానే క్షణికానికి వ్యతిరేకమైన విషయాలు సూచించి అంతవరకు వారిని లేని భావాలను విడమర్చి చెప్పాను. బుద్ధుడు తృణీకరించిన దానిని సూచన ప్రాయంగా కూడా అంగీకరించడానికి భౌద్ధ భిక్కులు ఒప్పుకోక పోవడం వలన నేర్చుకోవడంతో వారికి చిక్కులేర్పడినాయి. వారిని మార్చటానికి అలాంటి పద్ధతి తనకు నచ్చదని పదే పదే చెప్పవలసి వచ్చింది. క్రమేణా కొందరు బౌద్ధ భిక్కులు బుద్ధుడు దేవిని వ్యతిరేకిస్తున్నాడో గ్రహించారు.  తేరవాద బౌద్ధానికి ఆనాత్మవాదం కీలకం, హిందువు దృష్టిలో అనాత్మ కంటే తాదాత్మ్యం చెందిన బ్రహ్మ అని అర్థం ఇది సయామీ దృష్టిలో వినని విషయం. అనాత్మవాదం అంటే ఆత్మ కానిదనే వారి దృష్టిలో ఇది చాలా సాధారణ విషయం. ఒకే పదజాలాన్ని హిందువులు, సయామీలు ఎలా అర్థం చేసుకుంటారో గ్రహించవచ్చు.
బాంకాక్ లో సింధీ వ్యాపారి వారానికోసారి సత్పంగ సమావేశం జరుపుతాడు. అక్కడ సహజధారి సిక్కులు చేరుతారు. వారు గురునానక్ ను అనుసరించి గురుగ్రంథ సాహెబ్ ను పాటిస్తారు. గడ్డాలు, తలపాగాలు ఉండవు. ఈ గృహాలు, కార్లు, పిల్లలు, సంపద, అంతా వృథా అని ప్రతిసారీ ఆ సంపన్న వ్యపారి చెబుతుంటే సమావేశమైన సంపన్నులు తలలూపుతుంటారు. దైవాన్ని స్మరించడం రాత్రింబగళ్లు ధ్యానం చేయడం, దైవ నామ స్మరణలో లీనంగావటం ఒక్కటే కాలాన్ని వృథా చేయకపోవటమని ఆ వ్యాపారి అన్నాడు.
సయాం ప్రజలు ఇందుకు భిన్నంగా ఉంటారు. వీరు మతాన్ని, నిత్య జీవితాన్ని వేరు చేసి చూస్తారు. పండగల్లోనూ, వారంతంలోనూ, దేవాలయానికి వెళ్తారు. బోధనలు వింటారు. బౌద్ధ ప్రతిమ ముందు సాష్టాంగపడతారు. క్షణికం గురించి తెలుసుకొని నిర్వాణాన్ని గ్రహిస్తారు. కాని దేవాలయం నుండి బయటికి వస్తే వారు హాయిగా కూలాసాగా గడుపుతారు. మతాన్ని వారు తీవ్ర విషయంగా స్వీకరించరు. థాయ్ ప్రజలు ప్రేమను, దయను, చూపుతారు. జీవితంలో ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలను థాయ్ ప్రజలు స్వీకరించారు.

కొత్త ప్రపంచంలోకి
వివేకానందుడు గత శతాబ్దాంతంలో అమెరికా, యూరప్ లలో పర్యటించారు. ఆయన వలన భారతదేశం పట్ల అక్కడివారికి అసక్తి పెరిగింది. మేధావులు ఉద్వేగం పొందారు. దురదృష్టవశాత్తు కుహనా స్వాములు కొందరు వివేకానందుకు తోడయ్యారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించలేక పోలేదు. కాని అలాంటి వారిని వివేకానంద నిరుత్సాహ పరచలేదు. అందు వలన ఈ స్వాములచుట్టూ మరికొందరు స్వాములు పోగయ్యారు. అందులో కొందరు పూర్వ జన్మలో భారతీయులమన్నారు. అలాంటి వారంతా వివేకానందుడు నాటిన విత్తనాలు బాగా పెంచి, పోషించి రెండు ఖండాలలో పర్యటించి అనుచరులను పోగుచేసి బాగా డబ్బు వసూలు చేశారు.  అయితే రామకృష్ణ, వివేకానంద వేదాంత కేంద్రాలు ఆ మిషన్ వారు నడిపినంత కాలం బాగానే సాగాయి. హాలివుడ్ లోని దక్షిణ కాలిఫోర్నియా కేంద్రం స్వామి ప్రభవానంద ఆధ్వర్యాన నడిచింది. ఆయన గీతానువాదం 10 లక్షల ప్రతులు అమ్ముడుపోయింది. అల్డస్ హక్సలి, క్రిస్టఫర్ ఈషర్ వుడ్, గెరాల్డ్ హెర్డ్, గ్రేటా గార్బో మొదలైనవారు ఈ కేంద్రాన్ని సందర్శించారు. దీక్షపొందిన ముగ్గురు అమెరికా యువతులు కుంభమేళాలో వేలాది ప్రజలతో పాటు నదిలో స్నానం చేశారు. స్వామి అశోకానంద శాన్ ప్రాన్సిస్ కోలో ఆశ్రమాలను కఠిన నియమాలతో నిర్వహించారు. రామకృష్ణ సూక్తులు, వేదాంత సాహిత్యం పైన వ్యాఖ్యానం వలన ఆయనకు పేరు వచ్చింది. ఒకవైపున ఇలాంటి ఉత్తమ కేంద్రాలు నడుస్తుండగా మరో వైపు ఇంచుమించు పిచ్చి వారనదగిన సాధువులు సైతం ఈ ఆశ్రమాల పేరుతోనే చలామణి అయినారు.
నేను వాషింగ్ టన్ యూనివర్శిటీలో ఇన్నర్ ఏషియా ప్రాజెక్టులో చేరాను. ఇందులో ఫీడర్ సర్వీసని ఒకటి పెట్టాము. ఇక్కడ పరిశోధనా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి.  నేను భారతీయ అధ్యయన్నాన్ని ప్రవేశ పెట్టగలిగాను. భఆరతీయ తాంత్రిక విద్య, టిబెట్ బుద్ధిజంతో సంబంధం అనే పుస్తకం రాయటానికి ఈ సంస్థవారు ఎలాంటి షరతులు లేకుండా ఖర్చు పెట్టారు. అమెరికాలోనే ఈ పద్ధతి సాధ్యం. చాలా సంస్కృత, హిందీ గ్రంథాలను నేను తెచ్చాను. కోర్స్ ప్రారంభించినపుడు హిందీకి 98  మంది ఉండగా, సంస్కృతం చదవటానికి 28 మంది వచ్చారు. క్రమంగా వీరి శాతం తగ్గి పోయింది. ఇలాంటి కోర్చులు తక్షణమే పనికిరావని అమెరికాలో అభిప్రాయం ఉన్నది. నా పరిశోధనకు తగినంత సాధన సంపత్తి అత్యంత అధునాతన పరికరాలు ఉండేవి. ఇతర గ్రంథాలయాల నుండి కావలసిన పుస్తకాలను తెప్పించుకోవచ్చు. అనుకూల వాతావరణం, మైక్రోఫిల్మ్ లాంటివి పుష్కలంగా ఉన్నాయి. అమెరికాలో సమాకాలీన దృష్టి ఎక్కువ, స్వామి అంటే ఆకర్ముడిని వారి దృష్టి అందువలన నా వంటి వారు ఆమెరికా ఆధునిక రీతుల్లో ముఖ్యంగా క్రైస్తవ విలువలు పాటించే చోట ఒక పట్టాన ఇమడరు. ఇదిగాక ప్రాచీన భారతదేశాన్ని గురించి విదేశీయులు చూపించే ఆసక్తి పట్ల ఇండియాలో చాలా అనుమానాలున్నాయి. ప్రాచీన భారతదేశంలోని మార్మిక అలవాట్లు కృతువులు, అస్సాం, బెంగాల్ లోని అవినీతికర మతాచారాలు, తర్కంలోని లోపాలు, వాటి వలన ఇండియాపట్ల విదేశాలలో అపఖ్యాతి వచ్చిందని, కనుక ఆ విషయాల జోలికి పోకపోవడం మంచిదని ఇండియాలో ఒక భావన ఉన్నది.
నేను అమెరికా వచ్చినప్పటి నుంచి ఆథ్యాత్మికంగా ఊరటకై చాలా మంది నన్ను సమీపించారు. అలాంటి వారిని యోగ, బుద్దిజం, పునర్జన్మను గురించి మాట్లాడదలిస్తే సంస్కృతం, పాళీ నేర్చుకు రమ్మన్నాను. జెన్ బుద్ధిజం గురించి మాట్లాడదలిస్తే చైనా భాష నేర్చుకోమన్నాను. కాని వారికది నచ్చదు. చాలా మంది యోగులు, స్వాములు అమెరికాకు వచ్చి వెళ్ళారు. అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు కూడా నా ప్రయోజనం ఏమంటే సాంస్కృతిక విమర్శకు పరిమితం కావాలని మాత్రమే.
ఇండియాలో అధికార అవినీతి, అపరిశుభ్రత, రోడ్ల దుస్థితి గురించి మాట్లాడితే కోపం వచ్చినా సహిస్తారు. అపన్నీ నిజమేనని ఒప్పుకుంటారు. విదేశాల నుండి వచ్చినవారు అమెరికాలో యంత్రాలను ఆహారాన్ని విమర్శిస్తే, అలాగే సహిస్తారు. కాని ఇది సాంస్కృతి విమర్శకాదు. గాంధీని మతంపై కలగావులగపు భావాలు వెల్లడించినందుకు విమర్శిస్తే, బుద్ధుడు దేవుడిని నమ్మాడని గాంధీజీ అన్నందుకు విమర్శిస్తే అది సాంస్కృతిక విమర్శ అవుతుంది. హైందవ పునర్వికాసం కోరేవారు దీన్ని ఒప్పుకోరు. అలాగే ఆమెరికా అధ్యక్షుడు ఇండియాలో చర్చికి పోవడాన్ని విమర్శిస్తే, అది సహించరు.  ఇది కూడా సాంస్కృతిక విమర్శే, బుద్దుడు దేవుడని నమ్మాడని గాంధీ ఎన్నడూ ఎక్కడా అనలేదని రుజువు చేస్తే ఫరవాలేదు. కాని అలా చేయరు. మదన్ మోహన్ మాలవ్య, ఒకసారి విద్యార్థులకు సలహా ఇస్తూ పాలు తాగండి, వ్యాయాం చేయండి, దైవాన్ని స్మరించండి అన్నారు. దీనికి నేను విమర్శిస్తే నాకు హిందూతత్వం అర్థం కాలేదని, ప్రాచీన ఋషులు అనుభవం ఆధారంగా మాలవ్య చెప్పాడని అన్నారు. కాని మాటల సందర్భంగా మాలవ్య అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఋషిగా వుండటానికి, యూనివర్శిటీలో ఋషిగా అభివృద్ధి చేయడానికి ఒకే పద్ధతిని వినియోగించడం సరియైన ధోరణికాదు.
రష్యా పండితుడు ప్రొఫెసర్ స్టెచర్ బాట్ స్కీ లెనిన్ గ్రాడ్ ను నాజీలు పట్టుకున్నప్పుడు ఆకలితో మరణించాడు. మహాయాన బౌద్ధంలోనూ, బౌద్ధ తర్కంలోనూ అతడు గొప్ప ప్రామాణికుడు. ఈ విషయాన్ని ఇండియాలో ఒక ఉన్నత సంస్కృత పండితుడితో చెప్పినప్పుడు ఆ రష్యన్ అసలు పండితుడే కాదనట్లు మాట్లాడారు. అతడు చేసిన కృషిని ప్రస్తావించి వాటి సంగతేమిటని అడిగితే పారిస్ తాగి రాత్రిళ్ళు విలాస క్లబ్బులకు వెళ్ళేవాడని చెప్పాడు. సాంస్కృతిక విమర్శలో పాండిత్యానికి, జీవిత విధానానికి మానసిక తాత్విక రీతుల దృష్ట్యా ఎలాంటి సంబంధం లేదని గ్రహించాలి.
నాస్తికత్వానికి, విధేయత లోపానికి సంబంధాలు లేవు. రస్సెల్ వంటి నాస్తికులు పరిపాలిస్తే నియంతృత్వం గాని, నీతి మయం లేకపోవడం గాని ఉండదు.
సాంస్కృతిక విమర్శ అనేది సమగ్ర దృక్పథం గలది. గాంధీ బోధనలను నేను పొగిడితే, నా మాటలలో తాత్వికత, విషయజ్ఞానం లేకపోయినా, ఇండియాలో నన్నెవరూ వ్యతిరేకించరు. పైగా నాకు చాలామంది స్నేహితులవుతారు. కాని నేను విమర్శకు పూనుకోవాలంటే పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి. అసత్యమని తెలిసి కూడా ప్రీతి కరంగా మాట్లాడుతుంటే, నాగరికులు కూడా ఆనందిస్తారు.
సిద్ధాంత రీత్యా నైతిక దృష్ట్యా తేడాలున్నప్పుడు వాటిని చూపాలి తప్ప, నవ్వుతూ ఊరుకోకూడదు. ప్రపంచంలో ప్రజల మధ్య సాధారణ విషయాలెన్నో ఉన్నాయి గనుక అందరూ కలిసి రావాలని అంటుంటారు. ఒకే సిద్ధాంతాన్ని నమ్మినవారు పోరాడుకోరాదనటం అర్థం లేని మాట. బర్మాలోని తేరవాద బౌద్ధులు సయాం తేరవాద బౌద్ధులపై దాడి చేసి లోగడవారి రాజధాని ఆయూధియాను తగులుబెట్టారు. బౌద్ధ విగ్రహాలను తగుల బెట్టి అందులో బంగారం ఉందేమోనని వెదికారు. యూరోప్ లో క్రైస్తవ దేశాలు సామరస్యంగా ఉండటం లేదు. అన్ని మతాలలో సారాంశం ఒకటేనని చెప్పటం భ్రమ. అన్ని మంచి సిద్ధాంతాలలో ఐక్యత ఉన్నదనటం కూడా మిథ్యే. పరస్పరం కాల్చుకోకుండా బ్రతకటం మంచిదని నమ్మటం ఒకటే సరైన తీరు.
సంస్కృతులకు పరస్పర అధ్యయనం చేయాలి. మనకున్న పాండిత్యాన్ని విచక్షణను ఉపయోగించి ఈ విమర్శను సాగించాలి. ఒకరి సంస్కృతిని మరొక సంస్కృతికి అనుకూలంగా మార్చే దృష్టితో సాంస్కృతిక విమర్శ జరుగరాదు. దోషాలు తెలుసుకుని, కొత్త పంథాలు చూడటానికే విమర్శ జరగాలి. భారతీయులు పాశ్చాత్యులను, అలాగే  పాశ్చాత్యులను భారతీయులను పరస్పరం మార్చుకోవడానికి విమర్శించుకోరాదు. వారి దృష్టిలో ముఖ్యమైన విషయాలను ఏ దృష్టితో చూస్తున్నారనేదే గ్రహించాలి. సాంస్కృతిక విమర్శ వివిధ సంస్కృతులకు చాలా ఉపయోగకారి. ఇండియాలో ఎమ్.యన్. రాయ్ ఇలాంటి సాంస్కృతిక విమర్శ చేశారు. నేను జర్మన్, యూరోప్ ఆలోచనలను, భావాలను విమర్శించాను. ఇందులో బయట వారు, లోని వారు అనే తేడా ఉండదు. విమర్శ దృష్టా ఆయా వ్యక్తులు అంతరంగికులైతారు. ఇలాంటి విమర్శలలో తన, మన అనే భేదభావాలు అర్థరహితమౌతాయి.


రచయిత తుది మాట
పాశ్చాత్యులలో హిందూ సన్యాసిగా వృత్తిరీత్యా మారిన ప్రథముణ్ణి నేను. ఇలాంటి ప్రయత్నం అనేక మంది చేశారు.
అలాంటి వారందరినీ కర్మకోలా గ్రంథంలో గీతామోహతా ఆశ్రమ మూర్ఖులన్నారు. ఇది చాలా మంది విషయాంలో నిజమే. పాశ్చాత్యులు పూర్తిగా ప్రాచ్య విధ్యాధికులైతేనే మార్పు సాధ్యం. అలాంటి మార్పును నా పుస్తకమంతా వివరించాను. కష్టపడి భారతీయ మత విధానంలో స్థానం సంపాదించాను. ఇతరులకూ నాకూ సన్యాసిగా అదే తేడా.
అనుకున్నది పొందలేక పాశ్చాత్య లోకానికి తిరిగెళ్ళి నిరుత్సాహంగా గడిపిన వారున్నారు. నేను ఇండియా నుండి వెళ్ళినా భారతదేశం అంటే ఇష్టపడుతూ నిశిత పరిశీలన చేస్తూ గడిపాను.
భారతీయ చింతనాపరులు, తాత్వికులతో తరచూ చర్చించాను. విమర్శ అంటే తృణీకరించడానికి కాదని చెప్పగలిగాను. అమెరికాలో అడుగు పెట్టిన తరువాత భారతీయ విషయాలు చెబుదామనుకున్నాను. అలా కుదరదని మానవ శాస్త్రంలో అదొక భాగంగా యిమిడ్చి చెప్పాలని సలహా చెప్పారు. సాంస్కృతిక మానవ శాస్త్రంలో ప్రావీణ్యత పొందాను. సిరాక్యుస్ యూనివర్శిటీలో స్థిరపడి అక్కడే బోధన చేశాను. సంస్కృత సంప్రదాయేతర భారతీయ నిపుణులు, అంటరాని వారు, దేవల గురించి ఎంతో తెలుసుకున్నాను. ఇండియాను గురించి తెలుసుకొనే కొలది ఆసక్తి పెరిగింది.
భారతీయతను నాలో జీర్ణం చేసుకున్నాను. పరమార్థం గురించి రోజూ ధ్యానం చేసే వాడిని.
ఏ కాంతంలోనే దృష్టిని సాధించగలమని గ్రహించాను.
Telugu version from Ochre Robe by Innaiah Narisetti 

తాంత్రిక అనుభవాలు-సన్యాసి దినచర్య


Agehananda Bharati
సన్యాసి దినచర్య
సన్యాసి దేవాలయంలో, ధర్మశాలలో, బ్రాహ్మణ గృహంలో, చెట్టుకింద రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. సూర్యాస్తమయం కాకముందే నిద్రలేవాలి. నదిలోనో, చెరువులోనో లేక సమీపాన ఉన్న జలాశయంలో స్నానం చేయాలి. తరువాత వాటి తీరాన లేదా దేవాలయంలో కూర్చుని ధ్యానం చేయాలి. గ్రామస్తులు లేచి దినకృత్యాలు ప్రారంభించకముందే సాధువు తన మూట ముల్లె సర్దుకుని బయలుదేరాలి. నా అనుభవం రోజుకు పది మైళ్ళకు మించి సాధువు ప్రయాణం చేయడు. ఉదయాన వాతావరణం చల్లగా హాయిగా వుంటుంది. యేకాంతంగా ప్రకృతి సౌందర్యం అనుభవిస్తూ నడవడానికి బాగుంటుంది. గ్రామాలలో ఉదయం 8 గంటల ప్రాంతంలో వంట పూర్తవుతుంది. అప్పటికి సాధువు బయలుదేరిన ప్రాంతం నుండి కొత్త గ్రామానికి చేరుకోవాలి. వండిన పదార్ధాలు సాధువు స్వీకరించకూడదు. భిక్ష స్వీకరించటంలో యేదైనా ఒక ఇంటిని నిర్ణయించుకోవచ్చు లేదా ఇచ్చేవారి నుండి ఒక్కొక్క రొట్టెను, ఒక ముద్ద అన్నం మాత్రమే స్వీకరించాలి. సన్యాసి గ్రామ శివార్లలోకి రాగానే బిగ్గరగా ఓం నమో నారాయణ అని ఉచ్ఛరించాలి. ఆ పిలుపు వింటారు. సర్వ సాధారణంగా స్త్రీలు లేదా పురుషులు తొంగి చూచి ఆహారం స్వీకరిస్తారా అని అడుగుతారు.
కాషాయవస్త్రం ధరించేవారి ప్రవృత్తి ఎలాంటిదో తెలుసుకోకుండానే భక్తి వల్లనో, భయం వల్లనో ఆహారం ఇస్తారని ఒక విమర్శ ఉంది. సాధువులు తినడానికే వస్తారని భావిస్తారు. సన్యాసికి భిక్ష యివ్వకపోతే శపిస్తాడని గ్రామస్తులు భయపడతారు. కాని అది నిజం కాదు. భయం కంటే భక్తితోనే భిక్ష ఇస్తారు. పేదవారు సైతం తమ కుటుంబ సభ్యులకు తినడానికి ఉందోలేదో గమనించకుండానే సాధువుకు పెడతారు. సాధువు మాత్రమే భారతదేశ గ్రామాలలో మానవత గల వ్యక్తి విలువలను చాటి చెప్పగలడు.
గ్రామస్తులు ఏది వండుకుంటే అదే సాధువుకు పెడతారు. కాలాన్ని బట్టి రుతువులను బట్టి ఇది మారుతుంటుంది. ఉత్తరప్రదేశ్ నుండి మైసూర్ వరకు విభిన్న వంటకాలను తిని ఆరగించుకోవాలంటే సాధువులకు చాలా శక్తి కావాలి. ఉత్తరాదిలో సాధారణంగా సాధువుకు రొట్ట, పప్పు ఇస్తారు. దక్షిణాదిలో అన్నం, పప్పు పెడతారు. మాంసాహారాన్ని సాధువుకు పెట్టరు. దక్షిణాదిలో ఉల్లిపాయలను కూడా మసాల దినుసుగా భావిస్తారు. ఉల్లిపాయలకు బదులు సనాతనులు కొందరు ఇంగువ వాడతారు. దీని వాసన దుర్భరం. సాధువు తనతో పాటు ఒక పళ్ళాన్నీ, నీటి పాత్రను తీసుకు వెళ్ళాలి. ఇత్తడితో గాని, కొబ్బరి చిప్పలతో గాని ఈ పాత్రలు తయారు చేస్తారు. రొట్టెలను ఆహారాన్ని బట్టలో భుజించే వరకు వేడిగా ఉండేటట్లు చూచుకుంటారు. సన్యాసి ఆహారం స్వీకరించి కృతజ్ఞతలు చెప్పడు. తమకు ఆహారం పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు సన్యాసికే కృతజ్ఞతలు చెప్పడు. తమకు ఆహారం పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు సన్యాసికే కృతజ్ఞతలు తెలుపుతారు ప్రజలు. ఒక రోజు ఆ గ్రామంలో వుండి వేదాంత బోధ చేస్తానని సన్యాసి సూచిస్తాడు. సన్యాసి గ్రామం వచ్చినట్లు అరగంటలో గ్రామమంతా ప్రాకిపోతుంది.
సన్యాసి ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగానే భుజించాలి. తరువాత ఒక గంట సేపు పవిత్ర గ్రంథ పఠనం చేయాలి. అప్పటికి గ్రామస్తులు చేరి ప్రణామం చేసి వింటూ కూర్చుంటారు. ఆ తరువాత సన్యాసి సంభాషణ ప్రారంభించి సందేహాలు అడగమంటాడు. మధ్యలో ఒక గంట విశ్రమించి తరువాత ప్రశ్నల సమావేశం కొనసాగిస్తాడు. సాధువు విశ్రమించడానికి రహస్య ప్రదేశం ఉండదు.
కేరళ, ఆంధ్ర, పంజాబు రాష్ర్టాలలో సన్యాసులకు ఆదరణ తక్కువ. బీహార్, రాజస్తాన్, అంత వ్యతిరేకత లేదు. కేరళలో ఆంధ్రలో సెక్యులర్ విద్య ఎక్కువగా ఉండటం వలన ఈ వ్యతిరేక ధోరణి ప్రబలింది. గ్రామాలలో మధ్యాహ్నం రెండు నుండి నాలుగు వరకూ పొలాల నుండి పురుషులు తిరిగి వస్తుంటారు. వారికంటే ముందుగానే స్త్రీలు, సాధువు దగ్గరికి చేరుకుంటారు. ఒకవైపు పురుషులు, మరొకవైపు స్త్రీలు కూర్చుని వింటారు. పిల్లలు మాత్రం ఇష్టంవచ్చినట్లు తిరుగుతుంటారు.
సర్వ సాధారణంగా గ్రామ పెద్ద లేదా బ్రాహ్మణుడు ఏదో ఒక ప్రశ్న వేస్తాడు. ఈ ప్రపంచంలో బ్రతుకుతూ మతవిధులను నిర్వర్తించడం ఎట్లా? గృహస్తు భగవంతుడిని పూజించడంలో ఏ మార్గాన్ని అనుసరించాలి? పుట్టుక పునర్జన్మ బాధలు అనే బంధాల నుండి తప్పించుకొనే మార్గం యేమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. సమాధానాలు కూడా ఇంచుమించు ఒకే రీతిగ ఉంటాయి. దైవం మీద మనస్సును లగ్నం చేసి, ధ్యానం చేయండి. ఎవరికి తగినట్లుగా వారు చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థించుకోవచ్చు. ఎవరి విధులు వారు చేస్తూనే సమయం ఆసన్నమయ్యే వరకు యోగాభ్యాసాన్ని చేస్తూ, ఆథ్యాత్మిక జీవితానికి దారి తీయవచ్చు. ఇలాంటి సమాధానాలు చెప్పడంలో సాధువులు తమ ప్రతిభను, చమత్కారాన్ని ఉపయోగించి కథలుగా చెపుతుంటారు. అంతవరకు ఫరవాలేదు కాని, కొందరు వ్యక్తిగతమైన ప్రశ్నలు వేస్తారు. అప్పుడే చిక్కు యేర్పడుతుంది. గ్రామస్థులు సమస్యలను సాధువు ముందు పెట్టి పరిష్కరించమంటారు. తరువాత ప్రపంచ సమస్యలు కూడా అడుగుతారు. జర్మనులు వేదాలను తస్కరించి, అందులో పేర్కొన్న ఆయుధాలు తయారు చేసిన  మాట నిజమేనా? లంక నుండి సీతను తీసుకు రావడానికి రాముడు ఉపయోగించిన పుష్పక విమానం రష్యాలో ఉన్నదా?.
తమ పిల్లలు మాట వినడం లేదని, లేదా పిల్లలు పుట్టడం లేదని ఇలాంటి సమస్యలెన్నో పెడతారు. సాధువు దైవజ్ఞుడు కనుక, భూమి తగాదాలతో సహా దేనినైనా పరిష్కరించగలడని అనుకుంటారు. కొందరు సాధువులు ఇలాంటి వాటిని పెడచెవిని పెడతారు.
సాధువుకు కొద్దో, గొప్పో వైద్యం వచ్చి ఉండాలి. కొందరు సాధువులు ఆయుర్వేధంలో సిద్ధహస్తులు, అనుభవరీత్యా ఈ సాధువులు చిన్న చిన్న రోగాలను నయం చేస్తుంటారు.

ఢిల్లీలో ప్రపంచ సాధు సమావేశం
కాశీ నుండి ఢిల్లీ వెళ్ళాను. బిర్లా దేవాలయం ప్రాంగణంలో అందమైన అతిథి గృహం ఉన్నది. అందులో పక్షం రోజులకు మించి ఉండనివ్వరు. నేను ఒక నెల రోజుల పాటు ఉన్నాను. నీవు ఆధ్యాపకుడిగా యెందుకు పనిచేయవని కొందరు అడిగారు. ఒకరోజు బస్సెక్కి న్యూఢిల్లీ విశ్వ విద్యాలయానికి వెళ్ళాను. డీన్ డాక్టర్ రామ్ బిహారి దగ్గరకు వెళ్ళాను. పది నిమిషాలు మాట్లాడిన తరువాత విషయాలన్నీ తేల్చాను. నా ఇష్టం వచ్చిన విషయాన్ని బోధించమన్నారు. సన్యాసిగా నాకు జీతం ఉండదు కాని, భోజనం వసతులు ఉచితం.
1981 ఏప్రిల్లో ఢిల్లీలో ప్రపంచ సాధు సమావేశం జరిగింది. సాధువులను దర్శించి, పూజించడానికి, వారి పాదాలు స్పృశించడానికి తండోపతండాలుగా భక్తులు వచ్చారు. ఢిల్లీ ఇసుకవేస్తే రాలనట్లు జనంతో నిండిపోయింది.
నర్సింగ బాబా అనే నాగా నాయకుడు దిగంబరంగా వచ్చాడు. సన్యాసులలో నాగాలు వీరత్వం కలవారు. సాధువులను రక్షించడం వీరి ధర్మం. ఈ నాగా సాధువులు అద్వైతులు. వీరు తమ మఠాలలో నగ్నంగా వుంటారు. బయట తిరిగేటప్పుడు కౌపీనం ఒక్కటే ధరిస్తారు. దేహమంతా బూడిద పూసుకుంటారు. త్రిశూలం ధరిస్తారు. నేను ప్రప్రథమంగా నాగాను కలుసుకున్నాను. నాగా సాధువులు హిమాలయ మంచులోనూ, ఎడారుల్లోనూ ఒకే రకంగా ఉండగలరు.
నర్సింగబాబా కొందరు నగ్న సాధువులతో సమావేశానికి వచ్చారు.
ఆయనకు నన్ను పరిచయం చేసినప్పుడు నమఃశివాయ అని ప్రణామం చేశాను.
సాధువులు కలిసినప్పుడు ఎలా ప్రణామం చేసుకుంటారో తెలియదా? అన్నారు.
ఓం నమో నారాయణ అంటారు. కాని నారాయణ పదం ఒక శాఖకు చెందినదిగా మీకభ్యంతరం కాదా అన్నారు.
నర్సింగ బాబా సమాధానం ఇస్తూ, సాధువుల ప్రయోగంలో నారాయణ వైష్ణవులకు చెందినది కాదని, కాబట్టి నారాయణ పదప్రయోగంలో తప్పులేదని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను.
నర్సింగ బాబా యూనివర్సిటి లో సైకాలజీ చదివారు.
సాధువుల సమావేశం చివరి రోజున గాంధీ మైదానం నుండి చాందినీ చౌక్, ఎర్రకోట, కాశ్మీర్ గేటు మీదుగా సాధువులంతా ఊరేగింపుగా నడిచారు. మధ్యాహ్నం 2 గంటలకు నేను ముందు నడుస్తుండగా 20,000 మంది సాధువుల ఊరేగింపు ప్రారంభమైంది. రెండు లక్షల ప్రజలు వచ్చి చేరారు. ఇళ్ళకప్పు లెక్కి చెట్ల మీద నుండి మమ్మల్ని చూశారు. నాలుగు గంటల సేపు రెండు మైళ్ళ ఊరేగింపు సాగడానికి పట్టింది. త్రోవలో చాలా చోట్ల సాధువుల పాదాలను ప్రజలు స్పృశించారు. ఊరేగింపు పూర్తయ్యే సరికి చీకటి పడింది. వేద మంత్రాలు పఠిస్తుండగా ప్రసాదాలు పంచిపెట్టారు. లక్ష్యమంది ప్రజలకు ప్రసాదాల పంపిణి జరిగింది.

హరిద్వార్ లో
విద్యా సంవత్సరం ముగిసింది. ఢిల్లీలో ఎండలు దుర్భరంగా ఉన్నాయి. రైలులో హరిద్వార్ కు బయలుదేరాం. అది కూడా చాలా వేడి ప్రదేశం. హిందువులకు కాశీ ఎలాగో పంజాబ్ వారికి హరిద్వార్ అలాగ. ఇక్కడ గంగలో బ్రహ్మకుండం ఉన్నది. నిత్యం అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తుంటారు. వెయ్యికి పైగా ఆశ్రమాలున్న హరిద్వార్ అంతా సన్యాసుల ప్రభావంతో ఉంటుంది. హరిద్వార్ వాసులు సన్యాసులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. నేను రైలుదిగి గీతాభవనంలో నా సామాను పెట్టాను. ఒక ఫర్లాంగు దూరంలో భోలగిరి మఠం ఉన్నది. భోలగిరి మఠంలోని సన్యాసులు ఒక్కొక్క శాఖలో నైపుణ్యం సంపాదిస్తారు. భిన్న విషయాలను అధ్యయనం చేస్తారు. పాశ్చాత్య సమకాలీన తర్కంతో సరితూగగల నవ్య న్యాయ సిద్ధాంతాలపై భాష్యం రాసిన ఒక పండితుని ఇక్కడ కలిశాను. భాస్కరుడి లీలావతిపై విస్తృత భాష్యాన్ని రాసిన మరొక పండితుని కలిశాను. మరో పండితులిద్దరు భారతీయ సంగీతంపై 20 సంవత్సరాలుగా అధ్యనం చేస్తున్నారు. నేను భోలగిరి మఠానికి వెళ్ళినప్పుడు శంకరాచార్యుడికి హారతిగీతం పాడుతున్నారు. నేను వారితో కలిశాను. సంస్కృత చందస్సు గురించి కొందరు నాతో చర్చకు దిగారు. అంతేగాని నా పేరు, ఎక్కడ నుంచి వచ్చానని అడగలేదు. ఇదీ ఆశ్రమాలలో మర్యాద. హరిద్వారాలో అన్ని వర్ణాల సాధువులున్నారు.
హార్కి పహాడి దగ్గర ఒక బోర్డు మీద ఇంగ్లీషులో-హిందువులు కాని వారు ప్రవేశించరాదని ఉన్నది. ఇండియాలో బహిరంగ ప్రదేశాలలో ఇలా ఉండటం నేనెక్కడా చూడలేదు. నేనొక అమెరికా మిత్రుడిని వెంటబెట్టుకెళ్ళినప్పుడు కొందరు ఆశ్చర్యంగా చూసినా ఎవరు అభ్యంతరం పెట్టలేదు. కాశీవిశ్వనాథ ఆలయంలోనూ దక్షిణ భారతదేశంలోనూ అపవిత్రం చేస్తారనే దృష్ట్యా ఇలాంటి నిబంధనలు విధించారు. హార్ కిపహాడి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి బ్రహ్మకుండిలో మునిగి చుట్టూ వినిపించే శ్లోకాలను విని ఆనందిస్తూ ప్రతిరోజూ సాయంత్రం గడిపేవాడిని. అనేక మఠాలను, సంస్థలను సందర్శించాను.

ఎమ్.ఎన్. రాయ్ తో పరిచయం
ఒకరోజు ప్రొద్దున్నే అమెరికా పండితుడొకడు ఢిల్లీ నుండి గీతాభవనానికి వచ్చాడు. తనతో పాటు మస్సోరీ రమ్మని అడిగాడు. నేను వెంటనే అంగీకరించాను. త్రోవలో డెహ్రాడూన్లో 14 మోహిని రోడ్లో ఉంటున్న ఎమ్.ఎన్. రాయ్ దగ్గర ఒక అర్థగంట సేపు ఆగాల్సి వుంటుందన్నాడు. ఎమ్.ఎన్. రాయ్ పుట్టుకతో సనాతన బ్రాహ్మణుడు. ఒకప్పుడు కమ్యూనిస్టు కొమిన్ ఫామ్ లో ఇండియా పక్షాన ఏకైక సభ్యుడు. చైనాలో పనిచేశాడు. రాయ్ సిద్ధాంతకర్త. ఆచరణవాది కాదు. ఇండియాకు తప్పించుకొని వచ్చిన రాయ్ ని పట్టుకొని, ఫిలిప్ స్పాట్ర్ తో పాటు విచారణ జరిపారు. రాయకు 12 సంవత్సరాలు శిక్షవేసి, తర్వాత ఆరేళ్ళకు తగ్గించారు. ఆ సమయంలో మనిషి మారగలిగినంతగా మారాడు. కమ్యూనిస్టు కాస్తా హ్యుమనిస్టు అయినాడు.
మోహిని రోడ్ వరకు తీసుకు వెళ్ళి నన్ను కారులోనే కూర్చుండమని 15 నిముషాలలో రాయ్ తో మాట్లాడి వస్తానని అతడు ఇంట్లోకి వెళ్ళాడు. 10 నిముషాల తరువాత కారులో వున్న నా దగ్గరికి రాయ్ వచ్చి ఆప్యాయంగా, స్వామీజీ కనీసం కాఫీ తాగి వెళ్లకూడదా? అన్నాడు. ఆనందించాను. అయిదు కప్పుల కాఫీతో అయిదు గంటల చర్చ జరిగింది. అమెరికాలో మానస అధ్యయన శాస్త్రజ్ఞుడు ఫిల్ సింగర్, ఎలెన్ రాయ్, ఎమ్ ఎన్ రాయ్ నేను చర్చల్లో మునిగిపోయాం. పొద్దుబోయింది. నేను ఆవ్యక్తంగా కోరుకుంటున్న పదార్థాలతో ఎలెన్ భోజనాలు వడ్డించింది. క్రీమ్ కాఫీ, బేకన్, ఛీజ్ అన్ని ఉన్నవి. మత్తు పానీయాలు సేవిస్తూ చాలా సేపు గడిపాము. జీవితంలో మొదటిసారి నేను మత్తు పానీయాలను ఆనందించిన రోజు అది.
రాయ్ భారత జాతీయవాదిగా జాతీయతను నిరసించాడు. హిందువుగా హిందూ మతంలోని సాంఘిక బంధాలను తృణీకరించాడు. కమ్యూనిష్టులు అతడిని బ్లాక్ లిస్టు చేశారు. దశనామి శాఖ స్థాపకుడు శంకరాచార్యుడితో సహా భారతీయ మతతాత్వికుల పట్ల రాయ్ కు ప్రేమాదరాలు ఉన్నవి. శంకరాచార్యుడి పారమార్థిక దృష్టి మానవతా వాదులకు ముఖ్యం కాదు. వ్యక్తిని కాదనే శంకర సిద్ధాంతం రాయ్ కు అంగీకారం కాదు. మానవతావాదికి వ్యక్తే ముఖ్యం.
ఇండియాలో శాఖాహారిగా వుండటం సులభం. సన్యాసం స్వీకరించే శాకాహారం అమెరికా ప్రోటీన్ ఆహారం కంటే చాలా బాగుంటుంది. ఆహారం లైంగికం తదితర వ్యక్తిగత విషయాలకు నైతిక విలువలు అంటగట్టడం మంచిది కాదు. ఎమ్.ఎన్. రాయ్ తో కలిసి బోజనం చేసిన తరువాత శాఖాహారానికి గొప్పలు కట్టిపెట్టడం తప్పదనుకున్నాను. నాపై రాయ్ ప్రభావం కొంతకారణం కావచ్చు.
మరునాడు పగలూ రాత్రీ రాయ్ తోనే గడిపాను. ముస్సోరీకి పోనే లేదు. నా అమెరికా స్నేహితుడు ఢిల్లీ వెడుతూ నన్ను హరిద్వార్ లో దింపి వెళ్ళాడు. నన్ను ఉత్తర కాశీ వెళ్ళి రమ్మని జె.కొ. బిర్లా సూచించారు. యాత్రికులకు అది తుది శిబిరం. త్రోవలో ఉన్నది బిర్లా అక్కడ ఒక విశ్రాంతి మందిరం నిర్మించాడు. మా సామాను అక్కడ పెట్టాము. ఉత్తర కాశీలో వేదాంత పండితులు ఉన్నారు. శంకరాచార్య తత్వాన్ని విడమర్చి చెప్పిన ముఖ్యులలో ప్రముఖుడైన స్వామి విష్ణుదేవానంద కూడా ఉన్నారు. సాయం కాలం వాహ్యాళిలో తనతో పాటు రావడానికి ఆయన నన్ను అనుమతించారు. వారితో పాటు మరికొందరు స్వాములు కూడా అనుసరిస్తుంటారు.
ఒకనాటి రాత్రి మేము అలా పొతుండగా స్వామి ఇలా అడిగారు. మన గ్రహణ గ్రంథాలు పేర్కొంటున్నట్లుగా ఇదంతా వాస్తవం కాదని అప్పుడప్పుడు నీకనిపించదా? ప్రమాణ గ్రంథాలు పేర్కొన్నట్లుగా అనే పదాలు చేర్చటం నాకు ఆశ్చర్యం వేసింది. ప్రమాణ గ్రంథాలను, వాటిపై ఉత్తమ భాష్యాలను స్వీకరించాలి. అంతగా పాండిత్యం లేనివారి మీద వీటిని రుద్దకూడదు. పాశ్చాత్య ఆలోచనారీతుల ప్రభావం నాపై వున్నదని నీవనుకోవచ్చు. నాకు అవేవీ తెలియవు. మన సంప్రదాయంలోనూ మూల గ్రంథాలను నిశితంగా పరిశీలించిన వారున్నారు. అంత మాత్రాన ఆ గ్రంథాల పట్ల విశ్వాసం తగ్గలేదు. మన ఆదిగురువు ఈ కోవకు చెందినవాడు కాడు, శ్రీహర్షుని గ్రంథాలు చదువు, అప్పుడు బౌద్ధుల వద్దకు పోనక్కరలేదు వారి పునాదులను వారే తృణీకరించారు.
స్వామి విష్ణుదేవానంద అద్వైత వేదాంతంలో అత్యున్నత పాండిత్య ప్రకర్ష సాధించిన ఉత్తరకాశీ గంగోత్రి పండిత వర్గానికి చెందిన వాడాయన. స్వామి వివేకానంద 8 సంపుటాలలో ప్రవచించిన వేదాంతానికి, ఉత్తర కాశీ రుషులు చెప్పే వేదాంతానికీ చాలా తేడా ఉన్నది. రామకృష్ణ మిషన్ వారు వేదాంతాన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి చాలా బలపరిచారు.
నేను ఢిల్లీ వచ్చేసరికి యూనివర్శిటీలో నాకు స్వస్తి పలికారు. కారణాలు చెప్పలేదు. యువతీ యువకులను నేరుగా కూర్చోబెట్టకపోవడం ఒక కారణం కాగా, సాధువుల మహాసభలో పాల్గొనడం మరొక కారణమని తెలిసింది. కొన్నాళ్ళు ఢిల్లీలో ఏకాంతంగా ఒక వ్రాతప్రతిని అనువదిస్తూ ధ్యానం చేసుకుంటూ గడిపాను. బిర్లా నిర్మించిన పిలాని సంస్థకు వెళ్ళి జబ్బుబడ్డాను. డాక్టర్ అవలేగోంకర్ నన్ను కాపాడాడు. చాలా బలహీన స్థితిలో తిరిగి వచ్చాను. పండిత గోవింద మాలవ్య కలిశారు. ఆయన అక్కడ పార్లమెంటు సభ్యులు. కాశీ హిందూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కూడా కాశీకి వచ్చి బోధిస్తూ విద్యార్థులు అధ్యాత్మిక అవసరాలు చూస్తూ మీరెందుకు గడపకూడదు? అని అడిగారు.

కాశీ విద్యాలయంలో
1951 నవంబరు 17న కాశీ విశ్వవిద్యాలయంలో నేను ఉద్యోగం ప్రారంభించే నాటికి అక్కడ ఉండి చదువుకునే విద్యార్థులు పది వేలమంది ఉన్నారు. జియాలజి వంటి కొన్ని శాఖలలో సహా విద్యను అనుమతించడం లేదు. ఫిలాసఫీ శాఖాధిపతి నన్ను పరిచయం చేస్తూ స్వామి అగేహానంద భారతి మన గౌరవ తత్వశాస్ర్తాచార్యుడిగా ఉంటాడని చెప్పాడు. ఇంగ్లండ్లో విశ్లేషణ తత్వం, ఫ్రాన్సులో సత్తావాదం, జర్మనీలో నూతన మార్మిక వాదం అనేక సమకాలిక శాఖలను చెప్పాను. ఇంగ్లీషులో ప్రసంగిస్తూ మధ్య మధ్య హిందీలో చెప్పేవాడిని, ముందు వరసలో కూర్చున్న వారంతా రాగద్వేషాతీతంగా ముఖాలు పెట్టారు. మొదటిరోజు ఉపన్యాసమైన తరువాత ప్రశ్నలు అడగమంటే ఎవరూ ముందుకు రాలేదు. కాస్సేపటికి ఒక సన్నని వ్యక్తి లేచి విశ్లేషణాత్మక మార్మిక తత్వాన్ని వివరించమని, జర్మన్ మాట్లాడే దేశాలపై విశ్లేషణాత్మక ఆలోచన ప్రభావం ఏమిటని అడిగారు. విట్ గైస్ స్టెన్, వియన్నా సర్కిల్ వారిని స్వస్థలంలో విడ్పించి పంపించివేశారని చెప్పాను. నన్ను ప్రశ్న అడిగిన వ్యక్తి ప్రొఫెసర్ జె.యల్. మెహతా, అప్పటికాయన తప్ప, విట్ గైన్ స్టెన్,  న్యూరప్, మాహ్ పేర్లు విన్నవారే లేరు. ఆ తరువాత జె.యల్. మెహతా నేను వారి పేర్లు వినిపించినా వారు ఆసక్తి చూపలేదు.
ఈ దేశంలోని యూనివర్శిటీలలో పాఠ్యపుస్తకాల చుట్టూబోధన గిరిగీసి ఉంటుంది. తరచు వీటిని మార్చటం కూడా ఇష్టం ఉండదు. సైన్స్ లో కూడా ఇలాగే ఉందని విన్నాను. నేను ఫిలాసఫీ శాఖలో చేరేనాటికి, ఇండియాలో ఇతర చోట్ల ఉన్న పరిస్థితే ఉన్నది. కొందరు ప్రొఫెసర్లు సింబాలిక్ లాజిక్ పుస్తకాలు తెప్పించాము. తత్వశాఖ వారు వాటిజోలికి పోలేదు కాని, గణితశాఖ వారు మాత్రం వాటిపట్ల ఉత్సాహం చూపారు. అద్వైత వేదాంతానికి చేరువగా ఉన్న పాశ్చాత్య ధోరణులను ఫిలాసఫీ ఆహ్వానించేది వివేకానంద రచనల ప్రభావం వలన ఈ ధోరణి ప్రబలింది. కనుకనే ఇండియాలో ఫిలాసపీ శాఖలలో బర్కిలీ, బొసాంకే బ్రాడ్లే తత్వవేత్తలు బహుళ ప్రచారం పొందారు. రస్సెల్ ను అప్పటి కెవరూ చదవడం లేదు, నేనూ, మెహతా కలిసి సిలబస్ లో ఆధునిక తత్వవేత్తలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాం. ప్రొఫెసర్ యస్.కె.మెత్రా మా పథకాన్ని వ్యతిరేకించారు. ఇండియాలో సమకాలీనం అంటే రెండు వేల ఏళ్ళ నాటిదన్నమాట. ఎలాగైతేనేమి ఏ.జె. అయ్యర్, సుపాన్ స్టెబ్బింగ్ రచనలను పెట్టించగలిగాము. విశ్లేషణాత్మక తత్వాన్ని ప్రవేశపెట్టగలిగాం. సత్తా వాదాన్ని తత్వశాఖలలో ప్రవేశపెట్టలేదు. కేవలం ప్రాచీనమైన ఆలోచనపట్ల భక్తి భావంతో ఉండటం కంటె మానసిక అవరోధాలను తెంచుకోవాలని కొంతమంది విద్యార్థులు నచ్చచెప్పగలిగాను. శంకరా చార్యుడి కంటే రస్సెల్ తెలివైన తార్కికుడని, పంతజలికంటే సి.జి.యూంగ్కు మానవ మేధస్సును గురించి బాగా తెలుసని, ఒక పట్టాన హిందువులు ఒప్పుకోరు. ఏమైనా బోధన రచ్చలు ప్రతిరోజు అసలటనే తెచ్చాయి. మధ్య మధ్యలో సేవించే తేనీరు మాత్రమే హాయిని సమకూర్చేది. హిందూ మతంలోని విశిష్టతను, రామణీయకతను కొందరు విద్యార్థులకు నచ్చచెప్పగలిగాను. ఇదే మంత సులభమైన పనికాదు. హిందుమతం రామణీయకతను అనుమానాస్పదంగానే చూస్తుంది. ఈ విషంయలో నలుగురు విద్యార్థులకు, ఒక విద్యార్థికి నచ్చజెప్పటంలో సఫలీకృతు డనయ్యాను.
కాశీలో సంస్కృత విద్యాపీఠంలో చదివే విద్యార్థులు సనాతన శాస్ర్తాలను అధ్యయనం చేస్తున్నప్పటికీ వారి దీక్ష అనన్య సామాన్యమైంది. వారితో పోలిస్తే ఇతర విశ్వ విద్యాలయాల వారి దీక్ష తక్కువే, సనాతన విద్యార్థి దైవం దిన చర్యలోనూ, వేషంలోనూ సనాతనంగా వుంటాడు చాలా కష్టపడి అధ్యయనం చేస్తాడు, కంఠస్తం చేస్తాడు. కాని మామూలు విశ్వవిద్యాలయాలలో బోధించే అర్హత అతనికి లభించదు. సంప్రదాయ విద్యను అభ్యసించిన వారిలో పండిత రామచంగ్దర దీక్షితార్, తర్కతీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి మొదలైన వారున్నారు. నేను ఒకసారి రస్సెల్ తార్కిక భావాలను గురించి ఇరువురు పండితులకు చెప్పగా చాలా సూక్ష్మదృషి అని వారు ్భినందించారు. వివాహం, ఈతి గురించి రస్సెల్ భావాలు వారితో చెప్పినప్పుడు మౌనం వహించారు. కాసేపటికి ఇరువురిలో ఒకరు, ఇంగ్లీషు పండితులు చెప్పేది మనం అంగీకరించం. కాని రాముడు సీతకు చేసినది కూడా ఇంగ్లీషువారు అంగీకరించక పోవచ్చు అన్నారు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజకీయం ఎక్కువ, పండిత్ మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన విశ్వ విద్యాలయంలో హైందవ జాతీయ వాదాన్ని అర్థం చేసుకోవచ్చు. కలకత్తా, మద్రాసు నుండి వచ్చిన యువకులు మతాన్ని మత్తుమందుగా భావించి, హిందూ మతాన్ని ఆమోదించేవారిని విమర్శిస్తుండేవారు, నేను ఒకసారి ఐక్యరాజ్య సమితి దినోత్సవ సభలో మాట్లాడాను. మానవతావాద వ్యక్తిత్వాన్ని వివరించాను. జాతి, ప్రజ, మానవాళి అనేవి అవకాశం కొద్దీ వాడే మాటలే తప్ప అవి వ్యక్తికి పనికొచ్చేవి కాదన్నాను వ్యక్తి మాత్రమే వాస్తవమని, మిగిలినవి కేవలం పదజాలమని, వాటికోసం వ్యక్తిని ఆహుతి చేయరాదని అన్నాను. వ్యక్తిని పరిగణించే వాదం మాత్రమే వ్యక్తివాదం అవుతుందని, అంతే తప్ప ఒక వర్గంలో భాగంగా, మానవాళి, జాతిప్రజ, దేవుని బిడ్డలు అనే వాటిలో వ్యక్తికి విలువలేదని చెప్పాను. హేతువాదం, విశ్వజనీన వాదం, వ్యక్తివాదం కలిపితే మానవతా వాదం అవుతాయన్నాను. ఉపన్యాసం అయిన తరువాత నా వెంట ఇరువురు యువకులు వచ్చి, చీకట్లో నన్ను ఆపి, కోపంగా ఇలా అన్నారు. మీరు ప్రజావ్యతిరేక, భారత వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతున్నారని, ప్రజల అవసరాలను ప్రక్క దారులు పట్టించి మూఢ నమ్మకాలను అట్టి పెడుతున్నానని, కాషాయ వస్త్రం ముసుగులో మేధస్సును మత్తులో పెడుతున్నానని, రష్యనులు, చైనీయుల పట్ల చిన్న చూపు చూస్తూ ఆ దేశాల ప్రజలు చూపే కాంతి పథాన్ని గ్రహించటం లేదని, బ్రిటీష్ వారిని పొగడుతువన్నావు అని అన్నారు. ఇదంతా పది నిముషాల సేపు సాగించి వారిని చెప్పనిచ్చి, నా స్వంతంగా కలిపించి ఏమి చెప్పనన్నాను. మీరు గొప్ప మేధావులు. ఆ సంగతి అందరికి తెలుసు అన్నారు. అదేమిటో బయటి పెట్టడండి అన్నాను. దాంతో వారిలో అన్నారు. నీవు అమెరికా ఏజంటువు కాషాయ వస్త్రంలో అమెరికా పద్ధతులను వ్యాపింపచేయాలను కుంటున్నావు. మిత్రదేశాలైన రష్యాను, చైనాను అవమానిస్తున్నావు. నీవు స్త్రీలోలుడవు. సామ్రాజ్యవాదివి, పెద్దవాడిగా నటించే పెట్టుబడిదారుడవు, మమ్మల్ని మళ్ళీ బానిసలు చేయాలను కుంటున్నావు. నీవు తాగుతావు, వ్యభిచరిస్తావు, నిన్ను చంపేస్తాము అన్నారు.
నన్ను ఏదో ఒకరోజూ చంపితే చంపండి. ఇప్పుడు మాత్రం యిక్కడి నుండి వెళ్ళకపోతే మీ సంగతి చూస్తాను అన్నాను. వాళ్ళిద్దరూ గుసగుసలాడుకున్నారు. బలమైనవాడు, బాగా తింటాడు, యోగాభ్యాసాలు, పహిల్వాన్ అనే మాటలు వినిపించాయి. ఏదో బూతుమాట అనుకుంటూ వెళ్ళిపోయారు. యూనివర్శిటీలో ఈ సంఘటన చాలా ఉపన్యాసాలలో చెప్పాను. మన యువకులు గుండాలుగా తయారవుతున్నారని వ్యాఖ్యానించాను. అసలు కారణాలు వేరే వున్నవి.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు వివాహితులే ఒకశాతం భార్యా విహీనులుంటారు. హిందూ ప్రమాణ గ్రంథాలలో స్త్రీకి గౌరవం ఉన్నది. వేదాలలో ఆమెను సహధర్మచారిణి అన్నారు. కాలానుగుణంగా ఆమె స్థానం తగ్గిపోయింది. హిందువులు సూత్రప్రాయంగా అర్థాంగిని పొగుడుతారు. కాని ఒక ప్రత్యేక వ్యక్తిగా గురించి కాదు. భార్యకు ప్రేమాదరాలు చూపిన వ్యక్తిని చీదరించుకుంటారు. నేను పాదయాత్ర చేసినప్పుడు ముగ్గురు పిల్లలున్న తల్లిని సైతం ఆమె భర్త ప్రేమించడం చూశాను. ఇరువురూ సమానం అన్నట్లు ప్రవర్తించారు. బీహార్ లోని సంతాలులలో దంపతులు చేతులు కలుపుకుని తిరగటం గమనించాను.
హిందువులు, ముఖ్యంగా భార్యపట్ల గౌరవం చూపినప్పుడు ఏ మాత్రం అలాంటి వ్యక్తిని ఆదరించటం లేదు. కాశీ యూనివర్శిటీ ఆవరణలో భార్య జబ్బుగా ఉంటే పరామర్శించడానికి వెళ్ళిన ఒక దక్షిణాది బ్రాహ్మణ తత్వా చార్యుడిని ఆయన తండ్రి తిట్టేశాడు. ఒక పంజాబి స్ర్తీని పెళ్ళయిన మూడేళ్ళకు కూడా పిల్లలను కననందుకు భర్త పుట్టింటికి పంపేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయ ఆవరణలో యువకులు స్వేచ్ఛగా తిరుగుతూ పరస్పరం కౌగిలించుకుంటుంటారు. ఆ పంజాబు స్త్రీ ఒకసారి అలాంటి యువజంటను నాకు చూపి వారలా ఎందుకు చేస్తారో తెలుసా అనడిగింది. చెప్పమన్నాను. నేను చాలా అందమైనదానిని, కాని వారు నా దగ్గరకు వచ్చి నా అందాన్ని గురించి చెప్పలేదు. దీనికి బదులుగా పరపీడనత్వాన్ని చూపే రీతిలో వారు పరస్పరం కౌగిలించుకుంటారు. మీ గురించి నాతో ఏమైన అంటే చెప్పుతీసుకొని కొడతాను అన్నదామె.
ఒకనాడు సంగీత లలిత కళాశాల ప్రిన్సిపాల్ పండిత్ ఓంకార్ నాథ్ వద్దకు వెళ్ళి గానసంగీత తరగతులలో కూర్చోవడానికి అనుమతి ఇవ్వమన్నాను. ఆయన ఒప్పుకోగా మూడేళ్ళు రూయా హాస్టల్ కప్పుపై విద్యార్థుల మధ్య కూర్చున్నాను. అందులో నా విద్యార్థి ఒకరు ఉన్నాడు అతడు కూర్చుని బల్లపై తలబెట్టి గురక పెట్టేవాడు. ఓంకార్ నాథ్ ను అన్ని విధాల అనుకరించే వాడు. నన్ను కూడా అనుకరించేవాడు. భారతీయ సంగీతానికి అలవాటు పడటానికి నాకు చాలా కాలం పట్టింది. మొదటి నాలుగు మాసాలు నేను సంగీతం ప్రారంభించగానే అందరూ నవ్వేవారు. ఆరు మాసాలలోగా సంగీతంలో నిమగ్నుడినయ్యాను. పాశ్చాత్యుల దృష్టిలో భారతీయ సంగీతం సంగీతమే కాదని, అదొక విధమైన శబ్దమనే భావన ఉన్నది. పాశ్చాత్య సంగీతంలో మంచి చెడ్డలున్నట్లే ఇండియాలోనే ఉన్నవి.
నా సనాతన సహచరులు నేను ఈ విధంగా అతిథులకు నగరంలో విశేషాలు చూపెట్టడం ఇష్టం లేక ఆగ్రహించేవారు. నేను విదేశీ వ్యక్తిగా మళ్ళీ వెనక్కు వెళ్ళదల్చుకోలేదు. నేను హిందువును, భారతీయుడిని కాదు, తాత్వికుడను, అయితే ఒక దేశానికి చెందిన తత్వవేత్తను కాదు, మానవతావాదిని పరిమితంగా సుఖాలు కోరేవాడిని, అలాంటప్పుడు నేనేదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలవారిని కలిసినప్పుడు ప్రపంచం ఎలా ఉందో తెలుస్తుంటుంది. పక్కా బనారసీ బయ్యాగా మారటం నాకిష్టం లేదు. నెత్తి మీద జుట్టు లేకుండా కాషాయ వస్త్రంతో నోటిలో పాన్ నములుతూ, బనారసీని అవుతున్నానేమోనని ఆలోచనా నాకు జుగుస్సను కలిగింది.


సత్సంగ మండలిలో
సత్సంగ మండలి వారు నన్నూ, ఒక అమెరికన్ స్నేహితుడిని అంబాలాకు ఆహ్వానించారు. కంటోన్మెట్ ఉన్న ఒక సంపన్న నగరం అది. భాష సంస్కృతి అంతా పంజాబీయం. హిందీ మాట్లాడే ఉత్తర ప్రదేశ్ వారున్నారు. దేశవిభజన అనంతరం ఉత్తరాదిలోని పశ్చిమ ప్రాంత నగరాలన్నీ సిక్కులమయం అయిపోయినాయి. పంజాబీలు డబ్బు సంపాదిస్తారు. ఖర్చు పెడతారు. సుష్టుగా భోంచేస్తారు. పళ్ళరసం త్రాగుతారు. పంజాబీలోని ఆంబోతులు, ఆవులు చాలా పెద్దవి, పంజాబీ స్ర్తీలు చురుకుగా ఉంటారు. మంచి దుస్తులు వేసుకుని, విందంటే ఇష్టపడుతుంటారు. పంజాబీలకు ఆలోచన తక్కువ. సత్సంగ మండలిని ఒక సి.ఐ.డి. పోలీస్ స్థాపించాడు. విశాలమైన అతడి గృహాన్ని మందిరంగా మార్చివేశాడు. ప్రతిరోజూ ఉదయం జరిగే సమావేశాలకు జనం వస్తుంటారు. సంపన్న వర్తకులు ఎందరో చేరారు. సుప్రసిద్ధ సన్యాసులను, తదితరులను ఆహ్వానిస్తుంటారు.
స్టేషన్ లో మేళతాళాలతో స్వాగతం చెప్పారు. పూలదండలతో ముంచెత్తారు. పాదాలుతాకి అభివాదం చేశారు. టాపులేని గుర్రపు బగ్గీని ఎక్కించారు. ఊరేగింపుగా వీధులఅలో తీసుకెళ్ళారు.
సమావేశం ఏడు గంటలకు, ఈ లోగా మమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు. స్థానిక పండితులు, సన్యాసులు, ఉపన్యాసాలు ఇచ్చారు. తరువాత మేము వేదిక మీదికి వెళ్ళాము. మా గౌరవార్థం బాలికలు పంజాబీ పాటలను ఆలపించారు. తరువాత నన్ను పరిచయం చేశారు.
నేను మామూలు మాటలు చెపుదామనుకుని ఏకత్వాన్ని గురించి సాంకేతికంగా ఒక గంటసేపు ప్రసంగించాను. బ్రాహ్మణతత్వం విలువ తగ్గించకుండా జనంలోకి తీసుకెళ్లవచ్చని నా ఉద్దేశం.
వేదాంతంలోని తార్కిక లోపాలు నాకు తెలుసు. విశ్లేషణాత్మకంగా మత ప్రతిపాదనలను పరిశీలించడం కూడా అభినందనీయమే.

స్వామి హరిగిరితో
స్వామి హరిగిరి పంజాబి హిందూ సాధువు. కాంగ్రెసు పార్టీ సభ్యుడు. పంజాబులోని హిమాలయ పర్వత ప్రాంతంలో మఠాధిపతిగా ఉంటున్నాడు. స్వంతంగా తయారు చేసుకున్న కాషాయ టోపీని పెట్టుకుంటాడు.
ఉన్న సంస్కృతికి దక్షిణాది ప్రతీక. దక్షిణాది భాషలను నేను నేర్చుకోలేదు. ఉత్తరాది సంగీతాన్ని అధ్యయనం చేసినప్పటికి, నాకు దక్షిణాది సంగీతం ఇష్టం. దక్షిణాదిలో కొందరు భక్తి కవులు సంప్రదాయ మార్మికవాదంలో ఇంద్రియ ప్రేరణతో కూడిన భాషను వాడారు. దక్షిణాది సంగీతం విన్నప్పుడు, నా చికాకులన్నీ ప్రక్కకు పెట్టేవాడిని.
త్రివేండ్రంలో తిరువాన్ పూర్ మహారాజాను కలిశాను. దక్షిణ మలబార్లో పాల్ ఘాట్ వద్ద గాంధీ ఆశ్రమంలో కొన్ని వారాలపాటు గడిపాను.
కన్యాకుమారి వెళ్ళాను. నా వెంట అచ్చుతన్, అతని భార్య లక్ష్మి కుట్టియమ్మ వచ్చారు. కన్యాకుమారి విగ్రహం చాల అందంగా కనిపిస్తుంది. విగ్రహానికి సమీపంలో రాత్రింబవళ్ళు కూర్చుని క్రతువులన్నీ తిలకించాను. నంబూద్రి పురోహితుడొక్కడే ఆ దేవత దగ్గరకు రావచ్చు. మిగిలిన సన్యాసులు, బ్రాహ్మణులు బయటకూర్చుని చిన్నగేటు ద్వారా విగ్రహాన్ని తిలకిస్తారు. పురోహితుడు పాలు, రోజూనీరు, నెయ్యి, మరి కొన్ని విలువేన పదార్థాలతొ విగ్రహాన్ని నిమురుతూ స్నానం చేయిస్తారు. దీని వెనుకనున్న మనస్తత్వాన్ని అధ్యయనం చేయాలంటే ఫ్రాయిడ్ గాక, యాంగ్ పనికొస్తాడు. ప్రతి సంవత్సరం ఒక వారం పాటు నేను ఇక్కడికి వచ్చి గడిపేవాడిని.

కాలడి ఆశ్రమంలో
కాలడి ఒక చిన్న గ్రామం. శంకరాచార్యుడు అక్కడే పుట్టాడు. హిందూమతంలో అతను అత్యున్నత పండితుడు. కాలడికి వరుసగా రెండేళ్ళు వచ్చాను. ఈసారి రామకృష్ణ మిషన్ కేంద్రంలో స్వామీ ఆగమానంద అతిథిగా ఉన్నాను. స్వామి ఆగమానంద తాత్విక సంస్కృతంలో గట్టి పండితుడు. చక్కని ఇంగ్లీషు మాట్లాడుతాడు. ఆయనంటే చుట్టుపట్ల ఉన్న క్రైస్తవులకు భయం.
అతని దృష్టిలో రామకృష్ణ శంకరాచార్య ఒకే సంప్రదాయంలో ద్రష్టలు. శంకరాచార్య చెప్పినదాన్ని రామకృష్ణుడు అవతారంగా పరిపూర్తి చేశాడు. 1200 సంవత్సరాల ఎడంలో పుట్టినప్పటికి, శంకరాచార్య, రామకృష్ణ ఒకేరోజున పుట్టారు. వీరిద్దరి మధ్య మౌలికంగా తేడా లేదంటారు. ఆగమానంద దృష్టిలోని మౌలిక బోధనలన్నీ ఒకటే. శంకరాచార్యుడు కేవలం నిరీశ్వరవాది. అత్యున్నత గతితార్కి బోధకుడు. రామకృష్ణుడు భక్తిని ప్రచారం చేశాడు. మేధస్సుకు వ్యతిరేకి. బహు ప్రాచుర్యం సంపాదించినవాడు. ఇద్దరికీ చాలా తేడా వున్నది.
రామకృష్ణ శంకరాచార్యుల జన్మదినోత్సవ సందర్భంగా నేను బ్రహ్మచారిగా రామకృష్ణ ఆశ్రమంలో చేరినప్పటి స్వాములను కలుసుకొని ఆనందించాను. నేను బొంబాయికి తొలుత వచ్చినప్పుడు నాకు ఆతిధ్యం ఇచ్చిన స్వామి శంభూనంద కాలడి గౌరవ అతిథిగా వచ్చారు. అక్కడ తొలుత నేను ప్రసంగించాను. ఆగమానంద అడిగినట్లుగా శంకరాచార్య-రామకృష్ణను పోల్చాను. ఇరువురూ ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నులైనారని, శక్తివంతమైన వ్యక్తిగతం గలవారని, హందూ సంప్రదాయానికి విధేయులని అన్నాను.

మతం మార్పిడి వివాదం
దక్షిణాదిలో పర్యటిస్తుండగా మతం మార్చే క్రైస్తవుల సమస్య ఎదురయింది. సిరియన్ క్రైస్తవులు, పురాతన క్రైస్తవులతో సమస్యలేదు. కాని క్రైస్తవ ఫాదరీలు, పాశ్చాత్య మిషనరీలు మతం మార్పిడిలో క్రైస్తవ గొప్పతనం ఉందని అంటారు. ఇదే చికాకు కలిగిస్తుంది. హిందూ మతం ఇతరుల మతం మార్చదు. అది ప్రపంచ మతం కాదు. బౌద్ద, ముస్లిం, క్రైస్తవ మతాలకు మారినట్లు హిందువుగా మారడానికి వీల్లేదు. హిందూ, కులాల్లో పుట్టినవారే హిందువులు. ఇతర జాతులకంటే తమ మతం గొప్పని హిందువులు చెప్పారు.
నాగర్ కోయిల్ కు సమీపంలో ఒక పెద్ద చర్చి ఉన్నది. వాడకాంగూలం అనే చోట ప్రజలు ఫాదరీలతో పడక, మళీళ హిందూ మతంలోకి మారాలను కున్నారు.  ఒకప్పుడైతే ఇది అసాధ్యమేమో గాని, రాను రాను దక్షిణాదిలో ఇలాంటి మార్పులకు అవకాశం ఏర్పడింది. మేము వాడకాంగూలం వెళ్ళేసరికి తమిళంలో భజనచేస్తూ, సుమారు 5 వేల మంది కనిపించారు. ఆర్ముగన్ నన్ను చొక్కా విప్పేయమని, నాకు గంధం పూసి, నొసటిపై త్రిపూండ్రం పెట్టాడు. నా వంటి నిండా శివభక్తుడి నన్నట్లుగా విబూధి పూశాడు. ఇలాంటి వాటిని వివేకానందుడు పులిమచ్చలుగా వర్ణించాడు.
వేలాయిన్ నన్ను నాగర్ కోయిల్ కు తీసుకెళ్ళాడు. నాడా జాతివారు హిందువులుగా మారారని తరువాత తెలుసుకున్నాను. 5 వేల మందిలో హఠాత్తుగా మార్పు రావడానికి నా ఉపన్యాసం కారణం కాదు. కాని నేను వాడకాంగూలం పోవడం వలన స్థానిక హిందూ నాయకలుకు కొంత చేయూత లభించింది. హిందూ ధర్మానికి గౌరవాన్ని ఇవ్వాలని వారు తలపెట్టారు. అలాంటి సమావేశాలకు నేను వెళ్ళటం ఆ ఒక్కసారే జరిగింది.

కుంభమేళా అనుభవాలు
13 ఏళ్ళకోసారి అలహాబాదులో కుంభమేళా జరుగుతుంది. ఆరు రోజుల పాటు రాత్రింబగళ్ళు పండితులు, సన్యాసులు చర్చల్లో పాల్గొంటారు. గొప్ప ఊరేగింపు జరుగుతుంది. కాశీ విశ్వవిద్యాలయంలో నను ఆఖరి సంవత్సరం చదువు చెబుతుండగా 1954లో కుంభమేళా జరిగింది. జర్మన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన స్నేహితులు నన్ను తీసుకెళ్ళారు. అక్కడ జనాలను చూసి నాకు భయం వేసింది. బొంబాయి నుంచి వచ్చిన దళసామి శాఖకు చెందిన ఒక సన్యాసి కుటీరంలో నాకు బస యేర్పాటు చేశారు. కన్యాకుమారిలో అంతకు ముందు ఆయనను కలుసుకొన్నాను. స్వామి బ్రహ్మానందజీతో పాటు మనం కారులో వెళదామన్నారాయన ఉదయం నాలుగున్నరకు ఊరేగింపు ప్రారంభమైంది. ముందుగా నాగారుషులు బయలుదేరారు. వారి వెనుక మేమున్నాము. తరువాత క్రమంగా ఉదాసీనులు, నిర్మలులు, వైష్ణవులు మొత్తం 20 వేల మందికి పైగా సన్యాసులు ఉన్నారు. లక్షా యాభై వేల మంది పట్టే తోట ఐదు లక్షల మంది జనం కూడారు. మేము కారులో ముందుగా వెళ్ళాము. పూరీ గోవర్థన మఠాధిపతి ప్రప్రథమంగా నదిలోకి దిగారు. తరువాత మేము ఆ తరువాత మిగిలినవారు తొక్కిసలాట మొదలైంది. కాసేపట్లో 300 మంది చనిపోగా 900 పైగా గాయపడ్డారు. అప్పటికే కారులో చుట్టూ తిరిగి వెళ్ళిపోయాం.
ఒకచోట ఉపన్యాసంలో, విముక్తికి సన్యాసత్వం ఒక్కటే మార్గం కాదని హిందూ ధర్మం చెబుతున్నదని, ఇంద్రియాలను చంపుకోవడం ఒక మార్గం కాగా, మాటిని సద్వినియోగం చేసిన మోక్ష సాధనకు మళ్ళించడం మరొక మార్గమని చెప్పాను.

శంకరాచార్య సందర్శనం
గోవర్థనపీఠ జగద్గురువు శఁకరాచార్యులు భారతి కృష్ణ తీర్థ నన్ను చూడదల్చినట్లు యువ సాధువు వచ్చి చెప్పాడు. నేను పీఠాధిపతి దగ్గరకు వెళ్ళేసరికి కొందరు పెద్దలు ఆసీసులై ఉన్నారు. వారు సాదరంగా నన్ను ఆహ్వానించి పాండిత్య విషయాన్ని ప్రస్తావించారు. అంతలో శంకరాచార్యులు ప్రవేశించగా నేను సాష్టాంగ ప్రమాణం చేశాను. శంకరాచార్యులవారు ఆసీనులై సంభాషణలో పాల్గొన్నారు. ముక్తికి జ్ఞానానికి సన్యాసత్వం అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మూడు గంటలసైపు చర్చసాగింది. సన్యాసిగా ఉండమంటే పైకి కనిపించే రూపం కాదని చెప్పాను.
నిజమే, నీవు చెప్పినదానికి అనుకూలంగా ప్రమాణ గ్రంథాలలో పేర్కొన్న సందర్భాలున్నవి. ఋషులు ఉన్మాదులుగానూ, సాధారణ వ్యక్తులుగానూ, మంత్రులుగానూ వ్యవహరించిన సందర్భాలు లేకపోలేదని శంకరాచార్యులు అన్నారు. అత్యున్నత దైవాన్ని నమ్మడం ముఖ్యం కాదా? అని అడిగారు శంకరాచార్యులు.
నాకు ప్రమాణ గ్రంథాలు అర్థమైనంతవరకు దైవాన్ని తనలోనే చూసుకోవచ్చని లేదా నిరాకరించవచ్చని చెప్పాను. బహ్మ లేదా దైవరూపాలు అవతారాలు ఎన్నో విధాలుగా ఉంటాయని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.
దైవానికి జైమిని ప్రాధాన్యత ఇవ్వలేదు. కపిలుడి సాంఖ్య దర్శనంలో నిరీశ్వర వాదం ఉన్నది. అయితే అధికార భేద నియమం ఉంది అని శంకరాచార్యులు అన్నారు.
ప్రపంచాన్ని గురించి నీ భావాలు, ధోరణులు యేమిటని శంకరాచార్యులు అడిగారు.
ఈ విషయాలను గురించిన నా భావాలను అనేక వేదికలపైన చెబుతూనే ఉన్నాను.
ఒక వ్యక్తి యోగిగా కాషాయ వస్ర్లాలో ఉంటూనే మానవతావాదిగా అరమరికలు లేని రామణీయక జీవితాన్ని గడపవచ్చు. మన ఋషులు, సాధువులు, మానవతా వాదులు కాదు. మానవుడిని ఏదో ఒక మూలశక్తికి కొలమానంగా వాడుకోవడాన్ని మానవతా వాదం అంగీకరించదు. యోగి, మానవతా వాది సంఘర్షణకు దిగినవసరం లేదు. యోగిగా ఉండటం వ్యక్తిగత విషయం అతడి మార్మిక జీవితం సున్నితమైనది. ఇతరులకు చెప్పవలసింది కాదు. మానవతావాదిగా ఉండటం కూడా సున్నితమైన విషయమే. ఒకానొక ధోరణిలో మానవతా వాది ఆలోచిస్తాడు. ఆలోచన, ఆచరణ ఒకటేనని ఎవరెంతగా నొక్కిచెప్పగా, ఇవి రెండూ భిన్న స్థాయిలకు చెందినవి. ఒక వ్యక్తి అద్వైతిగా ఉంటూనే ఇంద్రియాలపట్ల జుగుప్స పెంచుకోనక్కరలేదు. అద్వైత సాధువు ఆశ్రమ ధర్మాలను బట్టి ఇంద్రియ సుఖాలను అదుపులో పెట్టుకుంటాడు. అతడు ఇంద్రియాలోలుడు కాకపోయినా, ఇంద్రియాలను గురించి, అందమైన వస్తువును గురించి ఈసడించుకోడు. ఆశ్రమ జీవితం మామూలు జీవితం కంటే ఎక్కువవగా తనకేదో అందిస్తుందని భావించిన వ్యక్తి ఇంద్రియాలను ఆగ్రహంతోగాక ఆశ్రమ ధర్మాల రీత్యా దూరంగా అట్టిపెడతాడు.
ఇండియాలో వేదాంత సంప్రదాయాన్ని పాటించేవారు అరుదయ్యారు. టిబెట్ లో హీనయాన బౌద్ధమతం ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నది. పాశ్చాత్యులు కూడా దీనిని అభ్యసిస్తున్నారు.

తాంత్రిక అనుభవాలు
ఇంద్రియాలను అణచివేయటం కాక, జీవితంలో ఉన్నత దశకు వాటిని మలచుకోవడం, తాంత్రిక విద్యలో సంప్రదాయం, తంత్రాలను గురించి హిందూ, బౌద్ధ సాహిత్యం చాల ఉన్నది.
ఇదొక ప్రత్యేకమైన యోగవిద్య, తాంత్రిక గ్రంథాలు వేదాలతో సమానమని చెప్పినందు వలన బ్రాహ్మణ పండితులు వాటిని అనుమానాస్పదంగా చూస్తారు.
ఇండియాలో గత వైభవాన్ని, సౌందర్యాన్ని దేవాలయాలలో, శిల్పాలలో చూడవచ్చు. క్రైస్తవ పాక్షిక దృష్టి లేకుండా వచ్చే విదేశీ యాత్రికులు, భారత కళా ప్రియుల ఈ సంప్రదాయాలను అభినందిస్తారు. ఇండియాలో దేవాలయాలపై కామ శిల్పాలు పుష్కలంగా ఉన్నవి.
1910 తరువాత నిర్మించిన దేవాలయాలలో కామరూపం కనిపించదు. న్యూఢిల్లీలో బిర్లా మందిరంలో శివలింగస్థానే శివుని విగ్రహాన్ని పెట్టారు. మత సంప్రదాయరీత్యా లింగరూపేణా తప్ప, అన్యథా శివుడిని పూజించడం నిషిద్ధం. లింగం అంటేనే శివుడు.
ఒక సమావేశంలో 35 ఏళ్ళ ప్రాయంగల కాషాయవస్ర్త ధారిణిని కలుసుకున్నాను. ఆవిడ పులిచర్మం కప్పుకున్నది. మెడలో రుద్రాక్షమాల ఉన్నది. శక్తి చిహ్నం ధరించింది. తొలుత ఎవరామె? అని అడిగాను. సిద్ధిమాత తెలియదా అని నా పక్కనున్నాయన ఆశ్చర్యపోతూ చూశాడు. సన్యాసినులలో ఆథ్యాత్మికంగా బాగా పేరు మోసిన విదుషీమణి సిద్ధిమాత.  ఉత్తరాదిలో ఆమె సుపరిచితురాలు. మురాదాబాద్ కు ఉత్తరాన 60 మైళ్ళ దూరంలో జన్మించిన రాజేశ్వరి 7 సంవత్సరాలకే మార్మిక ధోరణి చేపట్టింది. ఉత్తర ప్రదేశ్ లో ఆమె తండ్రి రాజా కూతురిని చూచి గర్వించాడు. చింతించాడు 12 ఏళ్ళ వయస్సులోనే తండ్రి కొలువులో పండితులతో వివాదాలను ఆమె చర్చించిందంటారు. ఏమీ చదువకుండానే తాత్విక సిద్ధాంత సుక్ష్మాలను విడమరుస్తూ పూర్వజన్మను గుర్తు పెట్టుకోగల ఇలాంటి వారిని జాతిస్మరులు అంటారు. ఈమెను 13వ ఏట ఒక యువరాజును ఎంపిక చేశారు. పెళ్ళికుమారుడు దేహమంతా ఆభరణాలు ధరించి, పెళ్ళినాడు గుర్రంపై రాగా పెళ్ళి కుమార్తె అదృశ్యమైంది. పోలీసులతో సహా ఎవరెంత వెదికినా కనిపించలేదు.
12 సంవత్సరాల తరువాత నేపాల్ సరిహద్దులలో ఆల్మోరాలో ఒక అందమైన సన్యాసిని కనిపించింది. ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు. పదేళ్ళ పాటు మౌనంగా ఉంటానని ప్రతిన పూనింది. అడవిలో పులులను ధిక్కరిస్తూ, కంద మూలాదులపై ఆధారపడి, చెట్లకింద నిద్రిస్తూ, చెట్టు బొరడును దుస్తులుగా ధరించి సంచరించినట్లు చూచినవారు చెబుతారు. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ లో ఆమె మౌనాన్ని వదిలి బయటికి వచ్చింది. ఆమె పాండిత్యానికి ఆధ్యాత్మిక శక్తులకూ, అందానికి పేరు మోసినది.
సమావేశంలో నా తరువాత సిద్ధిమాత ప్రసంగించారు. ఆమె మృధువుగా మాట్లాడారు. సమావేశం చాలా నిశ్శబ్దంగా ఉంది.
సిద్ధిమాత ఉత్తరకాశీ, గంగోత్రి ప్రాంతాలలో ఏటా కొన్ని వారాలపాటు గడుపుతారు. పండిత సాధువులు, సన్యాసులు గౌరవిస్తారు. ఆమె వచ్చే వరకు వేచి వుంటారు. తరువాత ఆమెతోపాటు అందరూ భోజనం చేస్తారు. ఈ విధంగా వేదాంత సాధువులు తమ సంప్రదాయం కాని రీతులను గౌరవిస్తూన్నారు. ఆది శంకరాచార్యులు సహితం శక్తిని పూజించారు. ఆమెను శ్లాఘిస్తూ గానం చేశారు.
 Telugu version  Innaiah Narisetti                                             coninued------