శిబ్ నారాయణ రే


Innaiah with Sib Narayan Ray


ఎక్స్.ప్లోరేషన్స్ అనే శీర్షికన శిబ్ నారాయణ రాసిన వ్యాసాలు 1958 ప్రాంతాలలో చూచాను. అనువాదం చేయబోతే అంత బాగా నడవలేదు. వదిలేశాను. అప్పట్లో శిబ్ రే ఆస్ట్రేలియాలో ఇండియన్ స్టడీస్ శాఖాధిపతిగా మెల్బోర్న్ .లో పనిచేశారు. ఆయన తిరిగి ఇండియా వచ్చిన తరువాత రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక సంపాదక వర్గంలో వున్నారు. నేను ఎప్పుడైనా అడపదడపా వ్యాసాలు రాసేవాడిని. ఒకసారి ఆవుల గోపాల కృష్ణ మూర్తి ప్రసంగ పాఠం పంపాను. చీరాలలో 1958లో రావిపూడి వెంకటాద్రి మాట్లాడిన సందర్భంగా కొంత చర్చ జరిగింది. అది రవీంద్రనాథ్ ఠాగోర్ పై నిశిత పరిశీలన సారాంశం. అది వేయడానికి శిబ్.రే అభ్యంతర పెట్టారు. నేను పట్టుబట్టాను. రాడికల్ హ్యూమనిస్ట్.లో విమర్శను ఆహ్వానించక పోవడం ఆశ్చర్యం అన్నాను. తరువాత వి.బి.కార్నిక్ నుండి ఉత్తరం వచ్చింది. ఈసారికి వదిలేయమని. అయినా పట్టు సడలించక పోవడంతో వాళ్ళు ఆవుల గోపాలకృష్ణమూర్తికి విషయం రాశారు. ఆయన చెప్పగా అంతటితో విరమించాను. తాను చెప్పింది, నేను రిపోర్టు చేసింది సరైనదే అయినా, శిబ్ రే కోరికపై వూరుకుంటున్నామన్నాం.తరువాత ఎప్పుడో శిబ్.రేను కలసి అడిగితే, ఏదో కుంటిసాకు చెప్పారు. బెంగాల్ సెంటిమెంట్, ఠాగోర్ పై ప్రేమ కనిపించింది.ఠాగోర్ కవితలలో, రచనలలో కనిపించిన ఆధ్యాత్మిక పులుముడ వాదాన్ని ఎజికె తీవ్రంగా విమర్శించారు. ఠాగోర్ కంటె శరత్ రాసిన శేషప్రశ్న, అందులో కమల పాత్ర గొప్పదని ఎజికె అన్నారు. లోగడ ఎం.ఎన్. రాయ్ అదే విషయాన్ని రాశారు. శిబ్ రేకు ఆ విషయం మింగుడుపడక, మా రిపోర్టును ప్రచురించలేదు.


ఆ తరువాత బొంబాయి కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ లలో శిబ్.ేతో అనేక పర్యాయాలు కలసి వున్నాం. హైదరాబాద్ లో ఆయన్ను ఆలపాటి రవీంద్రనాథ్.కు, వి.ఆర్.నార్లకు పరిచయం చేశాను. సాలార్ జంగ్ మ్యూజియంకు తీసుకెళ్ళగా ఒక రోజంతా చూస్తూ, సుదీర్ఘ నోట్స్ రాసుకున్నారు. మరోపర్యాయం తెలుగు యూనివర్సిటీలో, ఇంకోసారి ఆలయన్స్ ఫ్రాన్సిస్ హాలులో రాడికల్ హ్యూమనిస్ట్ సమావేశాలకు శిబ్ రేను పిలిపించాం.


ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్ర శిబ్.రే రాడికల్ హ్యూమనిస్టులో వరుసగా ప్రచురించారు. అది ఇంగ్లీషులో పుస్తకంగా రాకముందే నేను తెలుగు చేయగా తెలుగు యూనివర్సిటీ పచురించింది. శిబ్ రే ఆనందంతో ఎందరికో యీ విషయం చెప్పారు. అప్పుడు పుస్తక ఆవిష్కరణ సభకు రాగా తార్కుండే, ఇందుమతి కూడా వచ్చారు.బొంబాయి కళాశాలలో శిబ్.రే పనిచేస్తున్నప్పుడు, ఎ.బి.షా.తో కలసి హ్యూమనిస్ట్, సెక్యులరిస్ట్ వుద్యమాలకై బాగా కృషి చేశారు. ఎ.బి.షా నిర్వహించిన సెమినార్ల ఫలితంగా, గాంధీ, నెహ్రూలపై మంచి రచనలు వచ్చాయి. శిబ్.రే గాంధీపై రచనల్ని పరిష్కరించి ప్రచురించారు. నచికేత ప్రచురణవారు వాటిని వెలువరించారు. క్వెస్ట్ పత్రికకు ప్రామాణిక వ్యాసాలు రాశారు.జిజ్ఞాస అనే త్రైమాసిక బెంగాలీ పత్రిక కలకత్తా నుండి జీవితమంతా నడిపారు శిబ్.రే. ఉబ్బస వ్యాధితో సతమతమౌతూనే రోజూ కలకత్తా ట్రాంలలో, బస్సులలో రినైజాన్స్ ఆఫీసుకు వచ్చేవారు. శాంతినికేతన్.లో వారికి ఇల్లు ఉండేది. 2008లో అక్కడే చనిపోయారు.


ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్రను పరిశోధనాత్మకంగా రాశారు. రాయ్ తిరిగిన దేశాలలో కొన్నింటికి వెళ్ళి మరికొన్ని చోట్లనుండి విషయ సేకరణ చేసి, సమగ్రంగా రచన చేశారు.ఎం.ఎన్.రాయ్ రచనలన్నీ క్రోడీకరించారు. అందులో 4 సంపుటాలు ఆక్స్.ఫర్డ్ వారు ప్రచురించగా ప్రపంచ వ్యాప్తి చెందాయి. ఇంకా రెండు సంపుటాలు రావలసి వుంది.రాయ్ పై డాక్యుమెంటరీలకు ప్రయత్నించారు.రాడికల్ డెమోక్రటిక్ సిద్ధాంతాలుగా 22 సూత్రాలు రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. 1948లో ఆయన ఉపన్యాసాలు విన్నట్లు ఆవుల గోపాల కృష్ణమూర్తి చెప్పారు. ఎమ్.ఎన్. రాయ్, శిబ్.రేలు కలసి ఇన్.మేన్స్ ఓన్ ఇమేజ్ అనే సిద్ధాంత గ్రంథంలో 22 సూత్రాల విపులీకరణ చేశారు. ఉత్తరోత్తరా వాటిలో చాలా మార్పులు అవసరమని ఎబిషా అనగా శిబ్.రే అంగీకరించారు.


ఎం.ఎన్.రాయ్ చరిత్రను శాస్త్రీయంగా పరిశోధనాత్మకంగా రాయాలన్నాడు. కాని తన జీవిత చరిత్రలో కీలక వహించిన మొదటి భార్య ఎవిలిన్ ప్రస్తావనే తేలేదు.ఆ విషయం నేను రాశాను. అయితే దానికి ఏవో కారణాలున్నాయంటూ శిబ్ రే సమర్థించబోయారు. మేం ఆవిషయంలో విభేదించాం.ఎం.ఎన్.రాయ్ పై కొంత పరిశోధన చేసి రాసిన సమరేన్ రాయ్ అంటే శిబ్.రేకి పడేది కాదు. శిబ్.రేకు రాగద్వేషాలు గట్టిగానే వుండేవి.


తస్లీమా నస్రీన్ రచనల్ని బాగా ప్రోత్సహించి ఆమెకు అండగా కలకత్తాలో శిబ్ రే నిలిచాడు. శిబ్ రే అంటే తస్లీమా చాలా యిష్టపడేది. పెద్ద దిక్కుగా భావించాం. హ్యూమనిస్టు ఉద్యమాన్ని శిబ్.రే ప్రోత్సహించినా తానుగా ఎలాంటి బాధ్యతలు చేబట్టలేదు. తార్కుండే ఉద్యమ కృషికి ప్రోత్సాహం పలికేవాడు. ఆయన చివరి రోజులలో శాంతినికేతన్ సభలలో మేము కలసి వుండగలిగాం. రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమ చరిత్రను రాయ్ జీవితంతో మిళితం చేసి రాసే ప్రయత్నంలో, శిబ్.రే చాలా విషయ సేకరణ చేశారు. ఆంధ్రకు సంబంధించి కొంతమేరకు నేను విషయాన్ని అందించగలిగాను.  జర్మనీలో, రష్యాలో, మెక్సికోలో, చైనాలో, ఇతరులకు అందుబాటులో లేని అనేక అంశాలను వెలికి తెచ్చారు. జీవితమంతా రాయిస్ట్ చరిత్రకారుడిగా నిలిచారు. సాహిత్య రంగంలో ఆయన అనేక ప్రామాణిక వ్యాసాలను క్వస్ట్, న్యూ క్వస్ట్, రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికల్లో రాశారు. సెమినార్ లలో మంచి వక్త కూడా.

హ్యూమనిస్ట్, స్టంట్ పిక్చర్స్ నిర్మాత - జె.బి.హెచ్ వాడియా (1908 – 1986)



వాడియా వారి నాడియా (1908-1986) వాల్ పోస్టర్లు నేను ఇంటర్ చదివే రోజులలో (1954) గుంటూరులో ప్రచారంలోకి వచ్చాయి. అదో పెద్ద ఆకర్షణ 1935లో హంటర్ వాలీ సినిమా, 1936లో మిస్ ఫ్రాంటియర్ మెయిల్ వచ్చినా ఇరవై ఏళ్ళ తరువాత గాని ఆంధ్ర నగరాలలో అవి తెరపైకి వచ్చాయి. వాల్ పోస్టర్లలో నాడియా బొమ్మ ప్రధానంగా ప్రదర్శించారు. నల్ల కళ్ళజోడు పెట్టుకొని, టైట్ పాంట్.తో, హంటర్ పట్టుకున్న పోస్టర్లు యువకుల్ని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ నాడియా గుర్రంపై స్వారీచేస్తూ, రైలు పక్కనే పోతూ, హఠాత్తుగా గుర్రంపైనుండి రైలు మీదకు దూకి, రైల్లోని విలన్.ను కొట్టి మళ్ళీ గుర్రంపై దూకి స్వారీ చేస్తుంది. అదంతా ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోనివ్వకుండా వున్న థ్రిల్ దృశ్యాలే. అంతా సక్సెస్. డబ్బు బాగా వచ్చింది.

విఠలాచార్య స్టంట్ సినిమాలు రాక ముందు 30 ఏళ్ళకే హిందీ స్టంట్.లు వచ్చాయి. ఆనాడు నాడియా సినిమాలు విద్యార్థుల్ని, యువతను గంగ వెర్రులెత్తించాయి.




1943 నాటికి నాడియా మౌజ్ సినిమాలో ఉద్విగ్న పూరిత హీరోయిన్.గానూ నటించింది. హీరోయిన్ విదేశస్తురాలు. ఆమె తొలి భారత హీరోయిన్.గా స్టంట్ సినిమాలలో నటించింది. ఆ తరువాత ఇండియాలో స్థిరపడి, పెళ్ళి చేసుకున్నది.


దీనంతటికీ జె.బి.హెచ్. వాడియా (జెంషెడ్ బొమర్జీ హోమి) పాత్ర కీలమైనది. ఆయన స్టూడియోస్ బొంబాయిలో మూవీటోన్స్ పేరిట ఉన్నవి. ఆస్ట్రేలియా నుండి 5 ఏళ్ల ప్రాయంలో తండ్రితోబాటు ఇండియాకు వచ్చిన నాడియా ప్రతిభను గుర్తించి, సినిమాలలో ప్రవేశపెట్టిన ఖ్యాతి వాడియాదే. నాడియాకు 20 ఏళ్ళు వచ్చినప్పుడు వాడియా ఆమెను చూచి సినిమాలకు తగిన పాత్ర అని స్వీకరించాడు.
ఆమె అసలు పేరు మేరీ ఆన్ ఎవాన్. తల్లి గ్రీస్, తండ్రి వెల్ష్. నాడియా క్రమేణా వాడియా కుటుంబానికి చేరువై, అతని సోదరుడిని పెళ్ళి చేసుకోవాలనుకున్నది. కానీ అతని తల్లి సనాతన పార్సీగా అందుకు అంగీకరించలేదు. 1960 వరకు, వేచి వుండి, ఆమె మరణానంతరం వాడియాను నాడియా పెళ్ళి చేసుకున్నది. నేను 1970 ప్రాంతాలలో ఆమెను వాడియా ద్వారా కలిసాను. అప్పటికి ఆమె సినిమాలు మానేసింది.
ఎం.ఎన్.రాయ్.ను అనుచరుడుగా సన్నిహితుడుగా రాడికల్ హ్యూమనిస్ట్ వుద్యమంలో కీలక పాత్ర వహించిన వాడియా, తనను ‘రాయిస్టు’ అని పిలుచుకునేవాడు. రాయ్.తో తన అనుబంధాన్ని గురించి, రాయ్, ది మాన్ అనే శీర్షికన చక్కని చిన్న గ్రంథం రాశాడు (M.N. Roy, the man, an incomplete Royana 1983) ఈ పుస్తకాన్ని హిదయ తుల్లా, భారత ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
ఎం.ఎన్.రాయ్ అభిమానిగా వాడియాతో నేను సంబంధాలు పెట్టుకొని, హైదరాబాద్ ఆహ్వానించాను. ఆయన రాగా సమావేశాలు పెట్టాం. తన అనుభవాలను ఆసక్తికరంగా చెప్పారు. అబిడ్స్ సెంటర్.లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫీసు ఉండేది. అక్కడే మీటింగు జరిగింది. అబ్బూరి రామకృష్ణారావు, ఎ.ఎల్.నరసింహారావు, ఆవుల సాంబశివరావు, జాస్తి జవహర్ లాల్, ఎన్.కె. ఆచార్య, ఎ.ఎస్. వడ్వాల్కర్ మొదలైన వారంతా ఆసక్తిగా పాల్గొన్నారు. అదొక మంచి అనుభూతి.
రాయ్.పై డాక్యుమెంటరీ తీయనున్నట్లు వాడియా చెప్పారు. కాని అది వెలుగు చూడలేదు. మొత్తం నేను ఇంటర్.లో నాడియా సినిమాలు చూస్తూ ఆనాడు ఊహించని వాడియాను కలుసుకోగలిగాను. సన్నిహితుడనయ్యాను.
కాసా డా వించి ఆయన బొంబాయి నివాసం పేరు. రాయ్ దంపతులు ఎప్పడు బొంబాయి వచ్చినా అక్కడే వుంటూ, వాడియా ఆతిథ్యం పొందేవారు. ఆయనతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపటం బొంబాయి వెళ్లినప్పుడల్లా కలవడం మంచి అనుభవం. సినిమాలలో మతపరమైన మూఢ నమ్మకాలు ప్రవేశపెట్టకుండా జాగ్రత్తపడిన సినీ నిర్మాత అతను. ఎమ్.ఎన్.రాయ్.కి సంబంధించిన అరుదైన ఫోటోలు సేకరించాడు. ఆయన కుమారుడు రాయ్.పై డాక్యుమెంటరీ తీయాలనుకునే సంకల్పం ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు.
1970 ప్రాంతాల్లో జె.బి.హోమి వాడియాతో పరిచయమైంది. ఆయన ఎం.ఎన్.రాయ్ శిష్యుడు. అదే మా యిరువురినీ దగ్గరకు చేర్చింది. బొంబాయిలో ఆయన ఎం.ఎన్.రాయ్.కు మంచి ఆతిథ్యం యిస్తుండేవాడు. మా ఆహ్వానంపై వాడియా హైదరాబాద్ వచ్చారు. అప్పట్లో ఆబిడ్స్ సెంటర్ లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫీసు వుండేది. అక్కడ మీటింగు పెట్టాం. వాడియా మాట్లాడారు. తరువాత తన సినిమాల గురించి, ముఖ్యంగా నాడియా గురించి అడిగాం. ఎన్నో సంగతులు ఓపికగా చెప్పారు. ఆ సమావేశానికి ఆవుల సాంబశివరావు, ఎ.ఎల్.నరసింహారావు, అబ్బూరి రామకృష్ణారావు, ఎ.ఎస్.వడ్వాల్కర్, ఆలపాటి రవీంద్రనాథ్, ఆలంఖుంద్ మీరి ప్రభృతులు పాల్గొన్నారు.
వాడియా హ్యూమనిస్ట్ కావడంతో సినిమాలలో స్టంట్.లు, థ్రిల్ తప్ప మూఢనమ్మకాలు రానివ్వలేదు.
బొంబాయి స్టూడియోలో ఎం.ఎన్.రాయ్.పై డాక్యుమెంటరీ తీశారు. ఆయన కుమారుడు స్టూడియో కృషికొనసాగిస్తున్నారు. వాడియో తన అనుభవాలతో ఎం.ఎన్.రాయ్ పై మంచి పుస్తకం రాశారు. వి.బి.కర్నిక్, వి.ఎం.తార్కుండే, జి.డి.పరేఖ్, ఇందుమతి, జి.ఆర్.దల్వి, ఎ.బి.షాలతో వాడియా సన్నిహితంగా వుండేవారు.
1970 ప్రాంతాలలో బొంబాయిలో జె.బి.హెచ్. వాడియా ద్వారా నాడియాను చూచాను. అప్పటికే ఆమె సినిమాలలో నటించడం ఆపేసింది. కాని చదువుకునే రోజులనుండీ ఆమెను చూడాలని, వీలైతే మాట్లాడాలనే ముచ్చట తీరింది.
నాడియా అసలు పేరు మేరీ ఆన్ ఎవాన్స్. ఇండియాలో పెట్టుకున్న పేరు నాడియా. ఆస్ట్రేలియన్.కు పుట్టిన మేరీ ఆన్ ఎవాన్స్ 5 ఏళ్ళ ప్రాయంలో ఇండియా వచ్చింది. తండ్రితోబాటు నేటి పాకిస్తాన్ సరిహద్దులలో గుర్రపుస్వారీ నేర్చి, బ్యాలే డాన్స్.లో తర్ఫీదు అయి, జర్కో సర్కస్.లలో పనిచేసింది. 1930 ప్రాంతాలలో వాడియా దృష్టిలో పడగా, ఆమెను ఆహ్వానించి, హీరోయిన్.గా రూపొందించాడు.
ఏక్ నన్ని మున్నిలడికి అనే సినిమాతో 1970 నుండీ సినీరంగానికి స్వస్తి పలికింది. 1996లో చనిపోయింది. పార్సీ కుటుంబంలో స్థిరపడింది. సౌమ్యంగా మాట్లాడేది.
జె.బి.హెచ్. వాడియా అసాధారణ సినీ నిర్మాత, దర్శకుడు, మానవవాది.
ఆయన ఎం.ఎన్. రాయ్ శిష్యుడు. రాయిస్టునని సగర్వంగా చెప్పుకునేవాడు. రాయ్ స్థాపించిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో పనిచేశాడు. బొంబాయి వస్తే రాయ్ ఆయన ఇంట్లో వుండేవాడు. వాడియా మంచి అతిథి సత్కారం చేసేవాడు. సంస్కారంగల సినీనిర్మాత. సినీరంగాన్ని రాజకీయాల్ని వేరు చేసి నడిపాడు. వాడియా 1986లో చనిపోయారు.

సెక్యులరిస్ట్ మానవవాది – ఎ.బి.షా.



Photo L to R Mandava Srirama Murthy, Koneru Kutumba Rao, Amruthlal Bhikkhubai Shah (A.B.Shah), N.Innaiah at radical Humanist study camp 1965, Avanigadda, Krishna Dist., A.P.



Hamid Dalwai (Writer of 'Muslim Politics'), A.B.Shw addressing Secular Society Forum in Hyderabad.


భారత మానవవాద, సెక్యులర్ ఉద్యమంలో ఎం.ఎన్.రాయ్ అనుచరుడుగా కీలక పాత్ర వహించాడు. 1964లో ఆయనతో నాకు పరిచయంకాగా, అత్యంత సన్నిహితులమై మా మిత్రత్వాన్ని కొనసాగించాం. 1982లో ఆయన చనిపోవడం వుద్యమానికి చాలా దెబ్బ తగిలింది.

1966లో అవనిగడ్డ గ్రామంలో (కృష్ణాజిల్లా), 5 రోజుల మావన వాద శిక్షణ శిబిరం సాగింది.
కోనేరు కుటుంబరావు నిర్వహించిన ఆ శిబిరం ఎంతో ఉపయోగకారిగా ఉన్నది. ఎ.బి.షా అన్ని రోజులు వుండి, శ్రద్ధగా పాల్గొని, చర్చలు బాగా నడిపించి, తెలుగు ప్రసంగాల సారాంశాన్ని ఇంగ్లీషులో చెప్పించుకొని, అందరికీ ప్రోత్సాహకారిగా వున్నారు. అది మంచి అనుభవం.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి, అధ్యయన తరగతుల, ప్రిన్సిపాల్. ఆయన తెలుగులో మట్లాడి అవసరమైన మేరకు ఎ.బి.షా.కు ఇంగ్లీషులో చెప్పేవారు. శిబిరంలో పాల్గొన్న వారిలో రావిపూడి వెంకటాద్రి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎన్.వి.బ్రహ్మం ప్రసంగాలు సారాంశం ఇంగ్లీషులో విని, అందులో పలుకు వున్నదని ఎ.బి.షా వారిని ప్రోత్సహించారు.
మల్లాది రామమూర్తి, జి.వి.కృష్ణారావు, కల్లూరి బసవేశ్వరరావు, మేకా చక్రపాణి సి.హెచ్.రాజారెడ్డి, ఎం.వి. రమణయ్య, త్రిపురనేని గోకుల్.చంద్, బచ్చు వెంకటేశ్వర్లు, గవిని వెంకటస్వామి వచ్చి పాల్గొన్నారు.  
నేను ఎబిషాకు తోడుగా వుండేవాడిని. కాంప్.లో పాల్గొన్నవారిలో చాలా మంది షాకు కంపెనీ ఇవ్వగలవారు కాదు. అంటే సమావేశానంతరం యిష్ఠాగోష్ఠి కబుర్లు, కొద్దిగా ఔపోశన పట్టడం, (2 పెగ్గులే అనుకోండి) వుండేవి. ఎ.బి.షా. పైప్ తాగేవారు. రావిపూడి వెంకటాద్రి చుట్ట తాగేవారు.
మండవ శ్రీరామమూర్తి మాకు చేదోడుగా కాంప్ విజయానికి ఎంతో కృషి చేశారు. కుటుంబరావు ఏర్పాట్లు, అతిథ్యం చాలా మెచ్చుకోదగినవి. అదొక సఫలమైన స్టడీకాంప్.
ఎ.బి.షా. అనేక పర్యాయాలు నా ఆహ్వానంపై ఆంధ్ర పర్యటన చేశారు. ఎ.బి.కె.తో సన్నిహితులయ్యారు. ఆయన గుండె పోటుతో మంచంలో వుండగా (1967), మేమిరువురం వెళ్ళి, చేతిలో చేయ వేయించుకొని, మద్రాసు వెళ్ళి చికిత్స చేయించుకోమన్నాం. కాని అది జరగక ముందే మరోసారి గుండెపోటుతో అయన చనిపోవడం దారుణంగా జరిగింది.
ఎ.బి.షాను గుంటూరు విజయవాడ హైదరాబాద్ తీసుకు వెళ్ళి వివిధ సభలు పెట్టించాను. కోర్టు న్యాయవాదుల సభలో ప్రసంగాలు చేశారు. ఎ.సి.కె. కాలేజీలో పెద్ద సమావేశంలో ఆయన ప్రసంగం గొప్పగా అభినందించారు. ఎలవర్తి రోశయ్య తెగ మెచ్చుకున్నారు. ఆయనకు ఒక పట్టాన ఎవరి ప్రసంగం నచ్చేదికాదు. ఎ.బి.షా ప్రసంగం ఆద్భుతం అన్నారు. హైదరాబాద్.లో ముస్లిం, హిందూ సంఘాలతో సెక్యులరిజంపై కీలక సమావేశాలు జరిపించాం. ఆలంఖుంద్ మిరి బాగా సహకరించారు.
ఎ.బి.షాతో కలసి నాటి వైస్ ఛాన్సలర్ డి.ఎస్.రెడ్డిని కలసి విందు ఆరగించాం.  ఆ తరువాత వైస్ ఛాన్సలర్ నరోత్తమ రెడ్డితో వియ్యమందడానికి ముందు, వివరాలకోసం నా ద్వారా ఆరా తీసాడు. పెళ్ళి అయిన తరువాత, ఎ.బి.షా కుమార్తె, నరోత్తమ రెడ్డి కుమారుడు పెళ్ళి ఉత్తరోత్తరా విఫలమైంది.
ఆలపాటి రవీంద్రనాథ్, వి.ఆర్.నార్లతో షాను పరియం చేశాను.
అప్పట్లో ఎ.బి.షా నచికేత ప్రచురణలు పేరిట కొన్ని మంచి పుస్తకాలు వెలుగులోకి తెచ్చారు. ప్రతి సెమినార్ నుండి ఒక పుస్తకం వచ్చేది. వాటిని అమ్మితే సగం అట్టి పెట్టుకొని, మిగిలింది తనకు పంపమనేవాడు. అలా మానవవాద సాహిత్యం అమ్మాం. తెనాలిలో గురిజాల సీతారామయ్య, విజయవాడలో కోనేరు కుటుంబరావు సహకరించారు. ఎ.బి.షా వ్యాసాలు, సైంటిఫిక్ మెథడ్ పుస్తకం తెలుగులోకి అనువదించాను. విజయవాడలో అనుపమ ప్రచురణల వారు వ్యాసాల పుస్తకం ఆవిష్కరించారు. కొత్త సచ్చిదానందమూర్తి మాట్లాడారు.
రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక సంపాదక వర్గంలో ఎ.బి.షా వుండేవారు. తరువాత క్వెస్ట్ పత్రికను న్యూ క్వెస్ట్.గా మార్చి, అది కూడా బాగా నిర్వహించారు. సెక్యులర్ సొసైటీ స్థాపించి ది సెక్యులరిస్ట్ పత్రిక నడిపారు. పూరి శంకరాచార్యను వేదాలలో హిందువులు గోమాంస భక్షణ చేశారనే విషయమై ఛాలెంజ్ చేశారు. తర్కతీర్థ లక్ష్మణ శాస్త్రి బాగా సహకరించారు. ఎం.పి.రేగే సహకారంతో న్యూక్వెస్ట్ పత్రిక నడిపారు. దిలీప్ చిత్రే కొన్నాళ్ళు సంపాదకులుగా ఉన్నారు.
ఎం.ఎన్.రాయ్ మానవ వాద సూత్రాలను పరిష్కరించి ఆధునిక శాస్త్రం ప్రకారం మార్గాంతరాలు ప్రవేశ పెట్టారు. వేద ప్రమాణంగా రాయ్ సూత్రాలను స్వీకరించడం సరికాదన్నాడు. శిబ్.రే ఆయనతో ఒప్పుకోగా, వి.ఎం. తార్కుండే పేలవంగా రాయ్.ను కోపు వేసుకున్నారు.
ఫిలసాఫికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మోడరన్ సైన్స్ ప్రతిని ఆయన ద్వారా నేను చదివాను. అది ఎడిట్ చేసి ప్రచురించక ముందే ఎ.బి.షా చనిపోయారు.
షా రచనలు చాలా పద్ధతిగా శాస్త్రీయంగా వుంటాయి.
1978లో ఆమెరికాలో గార్డన్ స్టయిన్ నుండి నాకో ఉత్తరం వచ్చింది. భారత దేశంలో మానవవాద, హేతువాద సెక్యులర్ ఉద్యమాల గురించి రాయమని సారాంశం. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ అన్ బిలీఫ్ అనే గ్రంథానికి రాయమన్నారు. ఎ.బి.షా నా పేరు సూచించాడన్నారు. ఒప్పుకొని రాశాను. ఉత్తరోత్తరా గార్డన్ స్టెయిన్.ను కలిశాను. అతడు ప్రచురణ అనంతరం కేన్సర్.తో చనిపోయాడు.
ఎ.బి.షా ద్వారా కొందరు విద్యావేత్తలు పరిచయమయ్యారు. వారిలో వి.వి. జాన్, జె.బి.నాయక్, అమృక్ సింగ్ ప్రముఖులు.  
ఎ.బి.షా. గుజరాత్.లో దిగంబర జైన కుటుంబంలో పుట్టి, ఎం.ఎన్.రాయ్ ప్రభావంతో మానవాదిగా మారాడు. మహరాష్ట్రకు వచ్చి పూనా, బొంబాయిలో స్థిర పడ్డారు. ఎమర్జెన్సీలో జయప్రకాశ్ నారాయణ్ పక్షాన నిలిచారు.
వి.కె.సిన్హా నేడు సెక్యులరిస్ట్ పత్రిక నడుపుతున్నారు. ఆయన ఎ.బి.షా శిష్యుడు. బి.ఎ.వి. శర్మ కూడా షా అనుచరుడుగా వుంటూ, బొంబాయి నుండి హైదరాబాద్ వచ్చి, చాలాకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ చనిపోయారు. ఆయన కూడా సెక్యులర్ వుద్యమంలో మేథావిగా పనిచేశారు. అలాంటి వారిలో శ్రీనివాసన్, ప్రభాకర్ పాఢీ ఉన్నారు.
మహారాష్ట్రలో సత్య శోధక్ మండలి పెట్టి, హమీద్ దల్వాయ్.ను పైకి తెచ్చిన వారు ఎబిషా. దిలీప్ చిత్రే అనువాదాల వలన హమీద్ రచనలు ఇంగ్లీషులో రాగా, ముస్లిం పాలిటిక్స్ అనేది నేను తెలుగు చేసి ప్రసారితలో ప్రచురించాను.
భవనం వెంకట్రాం ముఖ్యమంత్రిగా, విద్యామంత్రిగా వుండగా ఎ.బి.షాను పరిచయం చేశాను. ఇరువురూ భావసారూప్యతతో మిత్రులయ్యారు. ఎడ్వర్డ్ షిల్స్, షికాగో నుండి మినర్వా పత్రిక నడిపారు. అది నమూనాగా ఎబిషా హ్యూమనిస్ట్ వే అనే పత్రికను కొద్దికాలం నడిపారు. జి.డి. పరేఖ్.తో సన్నిహిత మిత్రత్వంగల ఎబిషా, ఆయన రచనలు కొన్ని ప్రచురించారు. క్రిటిక్ ఆఫ్ హిందూయిజం, తిలక్.పై వ్యాసాలు, హ్యూమనిస్ట్ వేలో వచ్చాయి. 8 సంచికలతోనే అది ఆగింది.
హైదరాబాద్ లో వై.ఎం.సి.ఎ.లో ఒక సెమినార్ కోసం ఎ.బి.షా వచ్చారు. నారాయణ గూడా తాజ్.మహల్ హోటల్.లో వున్నారు. సెమినార్ సమయానికి టాక్సీ పిలిపించమన్నారు. వై.ఎం.సి.ఎ. ఫర్లాంగ్ దూరాన వున్నది. అయినా ఎందుకు టాక్సీ కావాలన్నారో తెలియలేదు. ఆ తరువాత గాని నాకు జ్ఞానోదయం కాలేదు. సాయంత్రం పక్కనే షాకు తెలిసిన డాక్టర్లు వుండగా అక్కడకు తీసుకెళ్ళాం. గుండెకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. పూనా రైలులో వెళ్ళి పరీక్షలు చేయించుకుని చికిత్స పొందారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రషీదుద్దీన్.ఖాన్, వై. రాఘవయ్య, జి.రాంరెడ్డి, కె.శేషాద్రి పి.వి.రాజగోపాల్  మొదలైన వారిని షాకు పరిచయం చేశాను. ఆయన మేథస్సును గుర్తించారు.
గాంధీ నెహ్రూలపై షా ప్రచురించిన పుస్తకాలు సెమినార్ల ఫలితమే. ఆయన రచనల్లో సైంటిఫిక్ మెథడ్, ట్రెడిషన్ అండ్ మోడర్.నిటి, ఛాలెంజెస్ టు సెక్యులరిజం. పోర్కొనదగినవి. అశ్లీలం అంటే ఏమిటనే చర్చ జరిపి ఒక గ్రంథం తెచ్చారు.